గుండాల : ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాలంటూ ఓ రైతు అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. గుండాల మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుండాలకు చెందిన గోపాల్దాస్ అయిలయ్య ఎకరంన్నర వరి సాగు చేశాడు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి తన వ్యవసాయ మోటార్కు కనెక్షన్ తీసుకున్నాడు. కాగా ట్రాన్స్ఫార్మర్పై కనెక్షన్లు ఎక్కువగా ఉండడంతో లో ఓల్టేజీ సమస్య ఏర్పడుతోంది. మోటారు ఆగిపోయడం, ట్రిప్ అవుతుండడంతో పొలానికి సరిగా నీరందడం లేదు. కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని పలుమార్లు ఆ శాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ కాళ్లపై పడి ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాలని వేడుకున్నాడు. స్పందించిన అదనపు కలెక్టర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రైతుకు హామీ ఇచ్చారు.
ధరణి దరఖాస్తుల పరిశీలన
అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి దరఖాస్తులను పరిశీలించారు. దేవాదుల కాల్వకోసం రెండుసార్లు భూములు కోల్పోయిన రైతుల సమస్యను వారంలోగా పరిష్కరిస్తానని చెప్పారు. మీ సేవలో వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 45 రోజుల్లోపు అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ను ఆదేశించారు. ఎన్డీసీసీబీలో చార్జ్ క్రియేషన్స్ పేరిట రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఫిర్యాదు చేయగా బ్యాంకు సిబ్బందితో మాట్లాడుతామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ అమరేందర్, తహసీల్దార్ జలకుమారి, డిప్యూటీ తహసీల్దార్ నీలిమ ఉన్నారు.
ఫ ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాలంటూ వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment