railway ministry
-
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఆ టికెట్ చార్జీల తగ్గింపు
రైల్వే శాఖ ప్రయాణికులు భారీ ఊరట కల్పించింది. ఏసీ చెయిర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రైల్వే టికెట్లను తగ్గించింది. ఈ తగింపు పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. అనుభూతి , విస్టాడోమ్ కోచ్లతో సహా ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లలో w తగ్గింపు వర్తించనుంది. వందేభారత్తో సహా అన్ని రైళ్లలోని ఏసీ చైర్కార్లు, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు, అనుభూత్, విస్టాడోమ్ కోచ్లు ఉన్నవాటిపై ఆక్యుపెన్సీని బట్టి 25 శాతం వరకు తగ్గిస్తామని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయంలో గత 30 రోజులలో 50శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ (ఎండ్-టు-ఎండ్ లేదా కొన్ని నిర్దేశిత కాళ్లు/సెక్షన్లలో) ఉన్న రైలును పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే తెలిపింది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తగ్గించిన ఛార్జీల వాపసు లభించదు. -
సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40% టికెట్ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు. -
వందేభారత్ రైళ్లు: గంటకు 180 కి.మీ. గరిష్ట వేగం.. యావరేజి స్పీడ్ 83 కి.మీ.
న్యూఢిల్లీ: దేశంలో వందేభారత్ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్– తుగ్లకాబాద్ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది. -
Vande Metro: గుడ్న్యూస్.. ఇక వందే మెట్రో రైళ్లు
ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికుల కోసం గుడ్ న్యూస్ చెప్పారు. వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రధాన నగరాలను కనెక్ట్ చేసేలా మెట్రో రైల్ వ్యవస్థ ‘వందే మెట్రో’ను ఈ ఏడాది చివర్లోనే పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించారాయన. సుదూర ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ తీసుకొచ్చిన సెమీ హై స్పీడ్ రైళ్లు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు తక్కువ దూరంలోని ప్రధాన నగరాలను అనుసంధానించేలా వందే మెట్రో రైళ్లను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారాయన. ఈ ఏడాది చివర్లోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వందే భారత్తో పోలిస్తే వందే మెట్రో డిఫరెంట్గా ఉంటుంది. డిసెంబర్ కల్లా ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారాయాన. అంతేకాదు.. వందే భారత్కు వస్తున్న స్పందనకు అనుగుణంగానే వందే మెట్రోలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్-లక్నో(90 కిలోమీటర్ల దూరం) నడుమ తొలి రైలు పట్టాలెక్కించాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. వేగంగా, రూట్లో ఫ్రీక్వెంట్గా సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. తద్వారా ఉద్యోగులకు, విద్యార్థుల ప్రయాణాలకు వందే మెట్రో ఉపకరించొచ్చని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అభిప్రాయపడుతున్నారు. ఎనిమిది కోచ్లతో వందే మెట్రో రైళ్లను నడపాలని భావిస్తోంది. ఇప్పటికే చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి, లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్కు రైల్వే శాఖ ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
ఆదాయంలో అదరగొట్టిన రైల్వేస్: కారణాలివే!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఏడాది ఆగస్ట్ చివరికి రూ.95,487 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే రూ.26,271 కోట్లు (38 శాతం) అధికంగా నమోదైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రూపంలో వచ్చిన ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.13,574 కోట్లు రాగా, 116 శాతం వృద్ధితో ఈ ఏడాది రూ.25,277 కోట్లకు చేరింది. రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. బొగ్గు రవాణాతో పాటు ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్, మినరల్ ఆయిల్, కంటైనర్ ట్రాఫిక్ మరియు బ్యాలెన్స్ ఇతర వస్తువుల విభాగాలు ఈ వృద్ధికి ముఖ్యమైన దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరుకు రవాణా రూపంలో ఆదాయం 20 శాతం వృద్ధితో (రూ.10,780 కోట్లు) రూ.65,505 కోట్లకు చేరింది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఆదాయం రూ.1,91,278 కోట్లుగా ఉండడం గమనార్హం. -
మాట నిలుపుకున్న కేంద్రమంత్రి.. చెప్పినట్లే ఢిల్లీ వెళ్లగానే..
కొరాపుట్(భువనేశ్వర్): తాను కొరాపుట్ నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రతిపాదిత స్టేషన్లలో రైళ్లు ఆగుతాయన్న కేంద్ర రైల్వే, టెలికాం మంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, బస్తర్ జిల్లా బచేలిలో రైళ్లు ఆగాయి. ఉదయం ఆదేశాలు రావడంతో సాయంత్రం నుంచి ఆయా స్టేషన్లకు హాల్టులు కల్పించారు. మెదటి విడత కోవిడ్ సమయం నుంచి ఈ స్టేషన్లలో రైళ్లు ఆపడం నిలిపివేశారు. అనంతరం కోవిడ్ తగ్గుముఖం పట్టినా రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో ఇటీవల రైల్వే మంత్రి కొరాపుట్ వచ్చినప్పుడు ఈ సమస్యను నాయకులు ప్రస్తావించారు. దీంతో ఆయా స్టేషన్లలో హాల్టులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు నెరవేర్చారు. దీంతో లక్ష్మీపూర్లో జగధల్పూర్–భువనేశ్వర్, జగధల్పూర్–హౌరా, జగధల్పూర్–రౌర్కెలా రైళ్లు ఆగనున్నాయి. అలాగే బచేలిలో విశాఖపట్నం–కిరండోల్ ఎక్స్ప్రెస్ రైలు (రాత్రిపూట రైలు) ఆగనుంది. ఈ ప్రకటనతో లక్ష్మీపూర్, నారాయణ పట్న, బందుగాం సమితులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వాల్తేర్ డీఆర్ఎం అనుఫ్ కమార్ సత్పతి లక్ష్మీపూర్ రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం -
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన లేదు
చెన్నై: జాతీయ రవాణా సాధనమైన రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్ఘాటించారు. భద్రత, సౌకర్యం విషయంలో ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే రంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినదే కావాలన్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), వందేభారత్ ఎక్స్ప్రెస్ వంటి ప్రాజెక్టులను అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు. తమిళనాడులోని పెరంబుదూర్లో శనివారం నిర్వహించిన భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్(బీఆర్ఎంఎస్) 20వ అఖిలభారత సదస్సులో ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అతిపెద్ద సంస్థ అయిన రైల్వేలను ప్రైవేట్కు అప్పగించే ఆలోచన, ప్రణాళిక ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వందేభారత్ ఎక్స్ప్రెస్ రూపకల్పనలో ఐసీఎఫ్ కృషిని మంత్రి ప్రశంసించారు. రైల్వేశాఖలో నియామకాల్లో గత యూపీఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖలో 3.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో 1.40 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
భారతీయ రైల్వేకు కనక వర్షం కురిపిస్తున్న తత్కాల్ టికెట్లు..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న 2020-21 ఏడాదిలోనూ.. రైల్వేకు వెయ్యికోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి మొత్తం 1033కోట్లు రైల్వే వసూలు చేసింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా 403 కోట్లు రాగా, ప్రీమియం తత్కాల్ కింద 119 కోట్లు, డైనమిక్ ఛార్జీలకు 511 కోట్లు వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరంలో చాలా వరకు రైళ్లను నిలిపివేశారు. అయిన, ఈ మేరకు ఆదాయం రావడం గమనార్హం. రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే తత్కాల్ టికెట్ల ద్వారా 353 కోట్లు, ప్రీమియం తత్కాల్ కింద 89 కోట్లు, డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.240 కోట్లు వచ్చినట్లు రైల్వే వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు భారతీయ రైల్వే సంస్థ డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.1,313 కోట్లు, తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.1,669, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.603 కోట్లు సంపాదించింది. ఈ తత్కాల్ టిక్కెట్లపై విధించే ఛార్జీలు "కొంచెం అన్యాయమైనవి" అని రైల్వేలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యానించిన ఒక నెల తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి డేటా బయటకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా ప్రజలు భాదపడుతున్న సమయంలో ప్రయాణీకులపై భారాన్ని మోపడం తగదు అని కమిటీ పేర్కొంది. (చదవండి: వాహనదారులకు భారీషాక్ , 43 లక్షల వాహనాల లైసెన్స్ రద్దు!) -
లాటరీలో డబ్బులు గెలిస్తే? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. వచ్చే నెల ఇండియా వస్తాను. నాతో బాటు 10,000 డాలర్లు తెచ్చుకోవచ్చా. ఇంకేదైనా మార్గం ఉందా? - కోనేరు రంగారావు, వర్జీనియా (ఈమెయిల్ ద్వారా) గతంలో ఎన్నోసార్లు మనం ఈ విషయం ప్రస్తావించాం. మీరు ఇండియా వస్తున్నప్పుడు అంత పెద్ద మొత్తం డాలర్ల కరెన్సీ నోట్లను మీతో పాటు తేకూడదు. తెస్తే రిస్క్. చట్టరీత్యా నేరం. నిషేధం. ఇంత పెద్ద వ్యవహారాన్ని ‘హవాలా’గా పరిగణించే అవకాశం ఉంది. అలా తేకండి. రాచమార్గం ఉండగా వేరే మార్గం ఎందుకు? మీరు వచ్చే ముందు, లేకపోతే వచ్చిన తర్వాత .. అక్కడున్న మీ అబ్బాయి/అమ్మాయి అకౌంటు నుండి ఇండియాలోని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకోండి. ఇలా పంపబడిన మొత్తం.. అమెరికాలో పన్నుభారానికి గురి అయినదై ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు. ఇక్కడ మీ అకౌంటులోకి జమ అవుతుంది. పంపే వ్యక్తి వివరాలన్నీ మీ ఇన్కం ట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. పేరు, చిరునామా, పాస్పోర్ట్ కాపీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొత్తం, బదిలీ వివరాలు వీటితో పాటు ఒక ఈమెయిల్ తెప్పించుకోండి. మీరు ఇటునుంచి ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. ఇక మీ విషయానికొస్తే ఇంత మొత్తం జమ అవ్వడమనేది, బ్యాంకు అధికారుల దృష్టిలో పడుతుంది. ఏ అధికారి దృష్టిలో పడినా మీ దగ్గర పూర్తి వివరణ ఉండాలి. ఈ వ్యవహారం వల్ల గానీ, జమ వల్ల గానీ ఎటువంటి పన్నుభారం ఉండదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ సందర్భంలో మీరు అక్కడ సంపాదించిన మొత్తం గానీ, మీ పిల్లలు సంపాదించిన మొత్తం గానీ ఇండియా వస్తోందని అనుకుంటున్నాం. కుటుంబ సభ్యులు ఇచ్చిన గిఫ్ట్కి ఎటువంటి పన్నుభారం ఉండదు. కుటుంబ సభ్యులు కాకపోతే ఈ వ్యవహారాన్ని అప్పుగా పరిగణించాలి. అలా కాకపోతే ఆదాయం అవుతుంది. ఏ వ్యవహారానికయినా సరైన డాక్యుమెంట్లు ఉండాలి. నేను ఈ మధ్యే రైల్వే శాఖలో నుంచి రిటైర్ అయ్యాను. ఆ సందర్భంలో సుమారు రూ.50,00,000 వచ్చింది. దీని మీద పన్ను భారం ఉంటుందా? - నండూరి సత్యవతి, హైదరాబాదు సాధారణంగా ప్రభుత్వ సర్వీసు నుండి రిటైర్ అయిన వారికి పదవీ విరమణ సందర్భంలో వచ్చిన పెన్షన్ ప్రయోజనాల మీద ఎటువంటి పన్నుభారం ఉండదు. సెక్షన్ 10 ప్రకారం వీటన్నింటి మీద మినహాయింపు ఉంది. అయితే, రిటర్ను వేసేటప్పుడు, రిటర్నులో ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ వివరాలు రాయండి. ఇలా రాయడం వల్ల మున్ముందు ‘సోర్స్’ వివరణలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. లాటరీల మీద ఆదాయాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? - ఎం. ఉపేంద్ర, నిజామాబాద్ ముందుగా లాటరీల మీద ఆదాయాన్ని/ప్రైజ్ మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఇతర ఆదాయం కింద వర్గీకరిస్తారు. ఈ ఆదాయం మీద విధిగా టీడీఎస్ చేస్తారు. దీనిపై 30 శాతం మేర భారం పడుతుంది. విద్యా సుంకం అదనం. పైగా ఎటువంటి బేసిక్ లిమిట్ మినహాయింపు ఉండదు. మొత్తం లాటరీని ఆదాయంగా భావించి, 30 శాతం ప్రకారం పన్ను వేస్తారు. ఈ భారంలో నుంచి టీడీఎస్ను తగ్గించి, పన్ను చెల్లించాలి. కె.సీహెచ్.ఎ.వీ.ఎస్. ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య - ట్యాక్సేషన్ నిపుణులు -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!
Bullet Train Project Made In India: ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్మెంట్ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు రెడీ అవుతోంది. వయడక్టు నిర్మాణంలో ముంబై-అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ టట్రైన్ పప్రాజెక్టును ఇండియన్ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన వయడక్టు నిర్మాణంలో భారీ క్రేన్లు, స్ట్రడల్ క్యారియర్లు, గర్డర్ ట్రాన్స్పోర్టర్లు వంటి భారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో కీలకమైన భారీ ఎక్వీప్మెంట్ని పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు. తమిళనాడులోని కంచిపురంలో ఉన్న ఎల్ అంట్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. బుల్లెట్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా 1100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ యంత్రాల తయారీ పనులు ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఇక్కడ తయారైన యంత్రాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. వాటి తర్వాత ఇండియానే బుల్లెట్ ట్రైన్ ట్రాక్కి సంబంధించి వయడక్టు నిర్మాణ టెక్నాలజీ ఇప్పటి వరకు టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సౌత్ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైలు నిర్మాణం జరిగినా ఈ భారీ యంత్రాలు ఈ దేశాల నుంచి సరఫరా కావాల్సిందే. అయితే ఇండియా ఆ దేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ యంత్రాలను రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో నిర్మాణం జరుపుకునే బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో కీలక భూమిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. Flagged off Made in India engineering marvel, a reflection of the 21st Century Mindset. #HighSpeedRailonFastTrack pic.twitter.com/7EzkdPaWFI — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 9, 2021 చదవండి: Infosys: ఈ కామర్స్ స్పెషల్.. ఈక్వినాక్స్ సొల్యూషన్స్ -
తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వేల నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి - కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ ట్రైన్స్కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. వీటితో పాటు.. సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. చదవండి : ఏపీ: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే.. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకుల రైళ్లు నిలిచిపోయాయి. ఆపై అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వే శాఖ ఈనెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, మరో 39 రైళ్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎప్పటినుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించనుంది. -
కోవిడ్-19 : రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో రైల్వే కోచ్ల్లో ప్రత్యేక ఏర్పాట్లకు రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. వైరస్ను నిర్వీర్యం చేసేందుకు రైల్వే కోచ్ల్లో టైటానియం డయాక్సైడ్ కోటింగ్, ప్లాస్మా ఎయిర్ ప్యూరిఫికేషన్, శానిటైజేషన్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వంటి ప్రణాళికలపై రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాచరణకు పూనుకుంది. ప్రయాణీకుల రైళ్లు పట్టాలెక్కేలోగా ఈ చర్యలను చేపట్టాలని భావిస్తోంది. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్లో ఈ తరహా తొలి నమూనా రైలును రూపొందించారు. రైల్వే కోచ్లన్నింటిలో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేలు యోచిస్తున్నాయి. ఎక్కడా చేతులు ఉపయోగించకుండా కాళ్లతోనే అన్నింటినీ ఆపరేట్ చేసేలా చర్యలు చేపడతామని రైల్వేలు తెలిపారు. కోచ్ల్లో కాపర్తో చేసిన హాండ్రెయిల్స్ను అందుబాటులోకి తీసుకువస్తారు. కాపర్పై వైరస్ చేరిన కొద్దిసేపటికే వైరస్లోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను ధ్వంసం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్లాస్మా ఎయిర్ పరికరాలు ఏసీ కోచ్లో గాలిని, ఉపరితలాలను స్టెరిలైజ్ చేస్తాయని తెలిపాయి. నూతన కోచ్లను ఈ తరహాలోనే తయారు చేసేందుకు రైల్వేలు సంసిద్ధమయ్యాయి. భవిష్యత్లో కోచ్ల తయారీలో వీటిని పొందుపరుస్తామని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణీకుల రైళ్లను ఆగస్ట్ 12 వరకూ నిలిపివేసిన సంగతి తెలిసిందే. చదవండి : నిమ్స్లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ -
లాక్డౌన్ : మూడు గంటల్లో రూ.10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లకు అనుమతినిచ్చిన నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైళ్ల కోసం ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేయడం ప్రారంభించిన తరువాత సోమవారం (మే 11) మొదటి మూడు గంటల్లో 54 వేల మంది ప్రయాణికులు 30 వేల టికెట్లు కొనుగోలు చేశారు. తద్వారా సుమారు రూ .10 కోట్లు ఆదాయం రైల్వే శాఖకు సమకూరింది. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!) ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) రైళ్ల టికెట్ల అమ్మకాల ద్వారా సోమవారం రాత్రి 9 గంటలకు రూ .9.9 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ముంబై- న్యూఢిల్లీ మార్గంలో టికెట్లు మే 12-17 వరకు పూర్తిగా అమ్ముడుబోయాయని తెలిపారు. హౌరా-న్యూ ఢిల్లీ రైలుకు సంబంధించిన అన్ని టికెట్లను మొదటి 10 నిమిషాల్లోనే బుక్ చేశారన్నారు. అయితే టికెట్ల కోసం భారీ రద్దీ కారణంగా ఐఆర్సీటీపీ సైట్ క్రాష్ అయింది. దీంతో బుకింగ్స్ షెడ్యూల్ రెండు గంటలు ఆలస్యమైంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో ఐఆర్సీటీసీ షేరు ట్రేడర్ల కొనుగోళ్లతో లాభాల్లో దూసుకుపోతోంది. (400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్) కోవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని సేవలను ప్రభుత్వం పరిమితం చేసిన దాదాపు 50 రోజుల తరువాత భారత రైల్వే ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్లను మంగళవారం నుండి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 25వ తేదీ నుంచి మే 17వరకు దేశంలో మూడు దశల్లో లాక్డౌన్ అమలవుతోంది. ఇప్పటివరకూ దాదాపు అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. -
ప్రత్యేక రైళ్లు : వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన రైళ్లు ఈ రోజు (మంగళవారం) నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. 15 రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో రాయితీలకు సంబంధించి రైల్వే శాఖ స్పష్టత నిచ్చింది. మొదట ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ప్రకటించిన రైల్వే శాఖ తాజాగా విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటనిచ్చింది. కొంతమంది రోగులకు, దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే రాయితీ ధరల్లో టికెట్లు అందుబాటులో వుంటాయని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువ చేయకుండా మూడు కేటగిరీలకు తప్ప ఇతరులకు రైల్వే టికెట్లలో రాయితీలు ఇవ్వకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ) అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యుటీఎస్), ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విద్యార్థులు, 4 వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులకు మాత్రమే రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని రైల్వే శాఖ ప్రజలకు సూచించింది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) -
వదంతులకు చెక్ పెట్టిన రైల్వే శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దేశంలో మొత్తం రైలు సర్వీసులను కూడా నిలిపి వేశారు. గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 15 నుంచి రైల్వే రిజర్వేషన్ సంస్థ ఐఆర్ సీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిందని పలు నివేదికలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. అసలు తాము ఏప్రిల్ 15 (అంటే లాక్ డౌన్ తరువాతి సమయానికి సంబంధించి) నుంచి బుకింగ్లను నిలిపి వేసిందని లేదనీ అది పాత ప్రకటన అనే గమనించాలని ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నందున తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. లాక్ డౌన్ ఆదేశాలకు మేరకు తాము లాక్ డౌన్ సమయం వరకే టికెట్ రిజర్వేషన్లను ఆపేశామని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 14 వరకు ఇది అమలులో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజానికి రైల్వే టికెట్లు 120 రోజుల ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, దాన్ని చూసి కొంతమంది అపోహ పడుతున్నారని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ సమయం తర్వాతి ప్రయాణాల కోసం తాము ఎప్పుడూ టికెట్ రిజర్వేషన్లు ఆపలేదని స్పష్టం చేసింది. ఒకవైపు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు రైల్వే టికెట్ల రిజర్వేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి తిరిగి ప్రారంభించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చదవండి: కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్ Certain media reports have claimed that Railways has started reservation for post-lockdown period. It is to clarify that reservation for journeys post 14th April was never stopped and is not related to any new announcement. pic.twitter.com/oJ7ZqxIx3q — Ministry of Railways (@RailMinIndia) April 2, 2020 -
రైళ్లలో కరోనా రోగులతో జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమవుతోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. అంతేకాదు రైల్వే ప్రయాణాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇటీవలి కాలంలో రైళ్లలో కరోనా పాజిటివ్ రోగులు, అనుమానితులను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్ళలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిన కొన్ని కేసులను గుర్తించామని, ఇది రైలు ప్రయాణాన్ని ప్రమాదకరంగా చేస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. మీ సహ ప్రయాణీకుడికి కరోనావైరస్ ఉంటే మీరు కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నందున రైలు ప్రయాణానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అన్ని ప్రయాణాలను వాయిదా వేయండి..తద్వారా మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుకోండని సూచిస్తూ రైల్వేమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. Railways has found some cases of Coronavirus infected passengers in trains which makes train travel risky. Avoid train travel as you may also get infected if your co-passenger has Coronavirus. Postpone all journeys and keep yourself and your loved ones safe. #NoRailTravel — Ministry of Railways (@RailMinIndia) March 21, 2020 -
రైల్వే ప్రయాణికులకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఏడాది తొలిరోజు నుంచే రైల్వే ప్రయాణికులకు షాక్ తగలనుంది. రైలు చార్జీలను మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని తరగతుల ప్రయాణీకుల చార్జీలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్డినరీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటర్కు పైసా చొప్పున, ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు రెండు పైసలు చొప్పున చార్జీలను పెంచారు. ఏసీ క్లాస్కు కిలోమీటర్కు 4 పైసల చొప్పున చార్జీలను పెంచినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్ల నుంచి రైల్వే చార్జీలను పెంచని దృష్ట్యా రైలు చార్జీలను హేతుబద్ధీకరించామని వెల్లడించింది. చివరిసారిగా 2014-15లో రైలు చార్జీలను పెంచారు. చార్జీల పెంపుతో పాటు రైళ్లలో ప్రయాణీకుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
రైల్లో రిస్కీ స్టంట్, క్షణాల్లో..
సాక్షి, ముంబై : క్షణాల్లో ప్రాణాలు పోతున్నా కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. తాజాగా ప్రమాదమని తెలిసి కూడా డేంజరస్ ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు డోర్ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ ఫీట్ చేశాడో యువకుడు. ఈ ఫీట్ వికటించి అదుపు తప్పి ప్లాట్ఫాం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. దీన్ని అతని స్నేహితులు వీడియో తీసారు. స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. డిసెంబర్ 26న ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఈ ప్రమాదంలో దిల్షాన్ అనే యువకుడు మరణించాడని పేర్కొంది. రైలులో ఇలాంటి స్టంట్స్ చేయవద్దు, ఇది చట్టవిరుద్ధం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని ప్రయాణికులను వారించింది.భద్రతను పట్టించుకోకుండా, కదిలే రైలు ఎక్కడం, కదిలే రైలులోఅనాలోచిత ప్రయోగాలు లాంటివి చేయొద్దని సూచించింది ट्रेन में स्टंट ना करें ये गैरकानूनी है एवं जानलेवा भी सिद्ध हो सकता है। मुंबई में 26 दिसंबर को दिलशान नाम का युवक ट्रेन के बाहर लटक कर स्टंट करते हुए अपनी जान गंवा चुका है। अपनी सुरक्षा की अवहेलना करके ट्रेन के बाहर लटकना,चलती ट्रेन में चढ़ना, हादसे का बुलावा हो सकता है। pic.twitter.com/oGEsqjoka6 — Ministry of Railways (@RailMinIndia) December 30, 2019 -
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ తరహా రైళ్లను మరికొన్నింటిని ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో కొత్తగా 40 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం ఇటీవల చేపట్టిన టెండర్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు రావడంతో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకుని సమస్యను చక్కదిద్దారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ల తయారీకి నూతన టెండర్ ప్రక్రియను రైల్వే బోర్డు చేపట్టడంతో ఈ రైళ్లు త్వరలో పట్టాలెక్కేందుకు కార్యాచరణ ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ, వారణాసి మధ్య రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. మేకిన్ ఇండియాలో భాగంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. -
షాకింగ్ : మూడు లక్షల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు భారీ లేఆఫ్స్కు రంగం సిద్ధం చేశాయి. మూడు లక్షల మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీవిరమణ చేయాలని రైల్వేలు కోరనున్నాయి. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులను తమ స్ధానాల నుంచి వైదొలగాలని కోరవచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా అన్ని జోనల్ చీఫ్స్కు రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డులు ఉద్యోగుల సామర్ధ్యంపై నివేదికను కోరుతూ లేఖ రాశాయి. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరితో పాటు 2020 తొలి క్వార్టర్లో 30 ఏళ్ల సర్వీస్ను పూర్తిచేసుకున్న వారి జాబితాను సమర్పించాలని కోరాయి. ఉద్యోగుల సామర్ధ్యంపై సమీక్ష నిర్వహించి దాని ఆధారంగా సర్వీస్ రికార్డును తయారుచేయాలని జోనల్ మేనేజర్లకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉద్యోగుల శారీరక, మానసిక ఫిట్నెస్, రోజూ విధులకు హాజరయ్యే రికార్డు, క్రమశిక్షణ ఆధారంగా సామర్ధ్య సమీక్షను చేపడతారు. ఆగస్ట్ 9 నాటికి ఉద్యోగులకు సంబంధించిన నివేదికలను తమకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కళంకిత అధికారులను సాగనంపే ప్రక్రియను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టడంతో ఆ కోణంలోనూ రైల్వే ఉద్యోగుల్లో వడపోతలు ఉంటాయని భావిస్తున్నారు. -
రైళ్లలో ఇక ఆ ఇబ్బంది ఉండదు..!
న్యూఢిల్లీ : సరదాగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో ఒక రకమైన బెరుకు, ఇలా చేస్తున్నారేంటి..? అనే భావనను కలిగించే ట్రాన్స్జెండర్లపై రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై కొరడా ఝళిపించింది. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 73 వేల మందిని అరెస్టు చేసింది. రైళ్లలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై రైల్వే శాఖ చేపట్టిన చర్యలేంటో తెలపాలని దాఖలైన ఆర్టీఐ పిటిషన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కాలంలోనే 20 వేల మంది ట్రాన్స్జెండర్లు అరెస్టు కాగా, ఈ జనవరిలోనే 1399 మందిని అరెస్టు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. 2015 జనవరి నుంచి హిజ్రాల డబ్బు వసూళ్ల పై చర్యలు ముమ్మరం చేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే భద్రతా దళం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపింది. ఇదిలాఉండగా.. రైల్వే శాఖ చర్యలతో నకిలీ ట్రాన్స్జెండర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిచేసుకుని బతికే బదులు తమకు ప్రత్యేక హక్కులున్నట్టుగా వ్యవహరించే వారికి తగిన బుద్ధి చెప్పినట్టయిందని అంటున్నారు. యాచించడం బదులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఎదురు తిరిగితే అసభ్యంగా ప్రవర్తించడం నకిలీ హిజ్రాలకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రైళ్లలోనూ బ్లాక్బాక్స్లు!
సాక్షి, న్యూఢిల్లీ : విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. విమానాల్లో మాదిరిగా రైళ్లలో లోకో కాబ్ ఆడియో వీడియా రికార్డింగ్ సిస్టమ్, క్రూ వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్లను నెలకొల్పుతామని పార్లమెంట్లో రైల్వే సహాయ మంత్రి శ్రీ రాజెన్ గోహెన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఊహించని ఘటనలు జరిగిన సందర్భాల్లో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిర్వహణ అంశాలు, మానవ తప్పిదాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులకు ఈ వ్యవస్థ కీలక సమాచారం చేరవేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సిస్టమ్ను ఇప్పటికే 26 రైళ్లలో అమర్చినట్టు తెలిపింది. ఈ వ్యవస్థను పలు రైళ్లలో అమర్చేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు 2018-19 బడ్జెట్లో రూ 100 కోట్లు కేటాయించినట్టు ప్రకటన తెలిపింది. -
‘సఫాయివాలా’లు ఇకపై ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’
న్యూఢిల్లీ: తమ శాఖలో పనిచేసే ‘సఫాయి వాలా’ల పేరును ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సంఘాలతో చర్చించిన మీదట రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. వైద్య, పర్యవేక్షక, తదితర విభాగాల్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే గ్రూప్–డీ ఉద్యోగులే సఫాయి వాలాలు. ఇకపై వీరిని ప్రతి విభాగం, శాఖతో కలిపి హౌస్ కీపింగ్ అసిస్టెంట్లుగా సంబోధిం చాల్సి ఉంటుందని తెలిపింది. వీరి ఎంపిక, నియామక విధానం, అర్హతలు, సీనియారిటీ, పదోన్నతి ప్రక్రియ, వేతనంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని జోనల్ విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
కొత్త రైలు.. కూ చుక్ చుక్!
సాక్షి, హైదరాబాద్ : రైల్వే స్టేషన్ల్లో ప్రయాణికుల సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్ పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన కరీంనగర్–లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై (11206/11205) వీక్లీ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు నిజామాబాద్–ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్–లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వరకు రాకపోకలు సాగించనుంది. మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ఎలక్ట్రానిక్ గైడెన్స్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థ వల్ల ప్లాట్ఫారాలపై ఏ కోచ్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు, కాజీపేట, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర చోట్ల సుమారు రూ.2వేల కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేశారు. రూ.125 కోట్లతో పూర్తి చేసిన పలు సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చా రు. కాజీపేట్–కొండపల్లి మధ్య 3వ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన 3వ లైన్ను ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 6/7 ప్లాట్ఫాంపై ఒక లిఫ్టు నిర్మాణానికి, బేగంపేటలో రూ.1.5 కోట్లతో 3 లిఫ్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్లో 238 మీటర్ల నుంచి 330 మీటర్లకు పొడిగించిన 2 ప్లాట్ఫారాలను ప్రారంభించారు. లింగంపల్లి, కాజీపేట స్టేషన్లలో రూ.3 కోట్లతో చేపట్టనున్న 3 ఎస్కలేటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బొల్లారం, వరంగల్ రైల్వే స్టేషన్ల పాదచారుల వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బండారు దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యత.. ఈ సందర్భంగా మంత్రి రాజెన్ మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను ఈ నాలుగేళ్లలో పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్త లైన్ల విస్తరణ, సదుపాయాలకు రూ.వేల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు 50 కిలోమీటర్లకు పైగా కొత్తలైన్లు వేయడంతోపాటు, 76 కిలోమీటర్ల రైల్వే లైన్లను డబ్లింగ్ చేసినట్లు వివరించారు. మరో 345 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరించినట్లు పేర్కొన్నారు. రూ.106 కోట్లతో మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన మూడో రైలు మార్గాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీనివల్ల సరుకు రవాణాకు ఈ మార్గంలో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాజీపేట–కొండపల్లి మధ్య రూ.1693.45 కోట్ల అంచనాలతో ప్రస్తుతం చేపట్టిన మూడో రైలు మార్గం వల్ల ప్రయాణికులకు అదనపు సదుపాయం అందుబాటులోకి రావడమే కాకుండా సరుకు రవాణాలో ఇతోధికమైన అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. మల్కాజిగిరి స్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మంత్రిని కోరారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఇంకా విస్తరించాల్సి ఉందని అన్నారు. లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశను సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడంతోనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వేలో కాపలా లేని రైల్వే గేట్లను పూర్తిగా తొలగించనున్నట్లు జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ తెలిపారు. -
మరికొద్ది సేపట్లో ప్లాట్ఫాం నం..
దేశంలో రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా, సుఖవంతంగా మార్చే చర్యలు ఊపందుకున్నాయి. ఈ దిశలో చేపడుతున్న కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. గతంలోని ఇమేజీకి భిన్నంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నవీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అందివస్తున్న సాంకేతిక ఫలాల రూపంలో ప్రయాణికులు సౌకర్యాలు, ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రతి లోకో మోటివ్ ఇంజన్లో జీపీఎస్ పరికరాలు అమర్చడం మొదలు డేటా లాగర్స్ రైలు ప్రయాణ సమయ పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఆర్ఐ) ను ఉపయోగించి మెయింటెనెన్స్, అందుబాటులోని రైల్వే ఆస్తుల వినియోగం, పర్యవేక్షణ, సెన్సర్ ఆధారిత వ్యవస్థలతో కూడిన స్మార్ట్ కోచ్ల వినియోగం ఇలా అనేక అంశాల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటోంది. ఇలాంటి నూతన ప్రణాళికల అమల్లో భాగంగా పలు ప్రా జెక్టులు చేపడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అవేమిటంటే.. నిర్దేశిత సమయానికి రైళ్లు రాకపోకలు సాగించేలా గతంలో స్టేషన్ మాస్టార్లు రైళ్ల సమయాన్ని రికార్డు చేసే విధానానికి బదులుగా ఇంటర్ చేంజ్ పాయింట్లలోనే ఈ సమయం నమోదు చేసేందుకు డేటా లాగర్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా కంప్యూటర్లో రైళ్ల సమాచారం కనిపిస్తుంది. డేటా లాగర్స్ వల్ల గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 73–74 శాతం సమయపాలన పెరిగినట్లు రైల్వే మంత్రి చెబుతున్నారు. ప్రతి లోకోమోటివ్ ఇంజన్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ప్రతి రైలు ఎక్కడుందో తెలుసుకునే వీలుంటుంది. దీంతో ఎప్పటికప్పుడు రైలు గమనం.. ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైల్వేల విద్యుదీకరణ వల్ల ఏటా 200 కోట్ల డాలర్ల మేర ఆదా చేయొచ్చని రైల్వే శాఖ అంచనా. డీజిల్ ఇంజన్లకు మరమ్మతులు చేస్తారు. విద్యుత్ ఇంజన్లలను ఉపయోగించడం వల్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. సమర్థతను పెంచుకునేందుకు వీలుగా ‘స్మార్ట్ టైం టేబుళ్లు’ అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే కృషి జరుగుతోంది. ప్రస్తుత రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచే చర్యలతో పాటు లక్షన్నర వరకున్న బ్రిడ్జీల స్థితిగతులను పరిశీలించి, వాటిని మరింత మెరుగ్గా చేస్తారు. -
మంత్రికి వీడియో ట్యాగ్.. నటి క్షమాపణలు
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కారణంగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ రైల్వే మంత్రిత్వ శాఖకు క్షమాపణలు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు.. మురికి నీటిలో భోజనం తినే ప్లేట్లను కడుగుతున్న 30 సెకన్ల వీడియోను చూసిన షబానా.. వారిని రైల్వే సిబ్బందిగా భావించారు. దాంతో వెంటనే ఆ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ, మంత్రి పీయూష్ గోయల్కు ట్యాగ్ చేసి.. ‘ఈ వీడియోను మీరొకసారి వీక్షించాల్సిందే’ అంటూ ట్వీట్ చేశారు. షబానా ట్వీట్కు స్పందించిన రైల్వే శాఖ.. ‘మేడమ్ ఈ వీడియో ఒక మలేషియన్ రెస్టారెంట్లో.. మురికి నీళ్లలో ప్లేట్లను కడుగుతున్న వర్కర్లకు సంబంధించినదంటూ’.. అందుకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన షబానా.. ‘నా క్షమాపణలు స్వీకరించండి. పొరపాటును సరిదిద్దుకున్నానంటూ’ క్షమాణలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కొందరు నెటిజన్లు... రైల్వే శాఖ షబానాపై పరువు నష్టం దావా వేయాలంటూ ట్రోల్ చేశారు. దీంతో మరోసారి ఆమె.. ‘మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానంటూ’ ట్వీట్ చేశారు. Mam, video is of Malaysian eatery which faces closure after video shows workers washing dishes in puddle of murky water: Link News is https://t.co/n6U2f9fMP0 — Ministry of Railways (@RailMinIndia) June 5, 2018 -
అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్లు ఇవే
ముంబై : దేశంలోని అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్ల జాబితాను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. శుభ్రత, పారిశుద్ధ్యతా ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లర్షా స్టేషన్లు ప్రథమ స్థానాన్ని పొందాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ ముంగటివార్ గురువారం తెలిపారు. తమ రాష్ట్రంలోని రెండు స్టేషన్లు సుందరమైన స్టేషన్లుగా ఎంపికైనందుకు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తనను అభినందించారని సుధీర్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రాపూర్ జిల్లాకు గార్డియన్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న సుధీర్ మాట్లాడుతూ.. ఏడాది క్రితమే చంద్రాపూర్, బల్లర్షా స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాగ్పూర్ ప్రభుత్వ చిత్రకళా మహావిద్యాలయ నుంచి కళాకారులను పిలిపించామన్నారు. వీరి ప్రతిభతో.. బల్లర్షా ఫుటోవర్ బ్రిడ్జిపై చిత్రించిన పులి బొమ్మ ప్రస్తుతం సెల్ఫీ పాయింట్గా మారిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సుందరమైన రైల్వేస్టేషన్ల జాబితాలో కొన్ని.. 1. చంద్రాపూర్, బల్లార్షా(మహారాష్ట్ర) 2. మధుబని(బిహార్), మధురై(తమిళనాడు) మధుబని, బిహార్ మధురై, తమిళనాడు 3. గాంధీధామ్(గుజరాత్), సికింద్రాబాద్(తెలంగాణ), కోట(రాజస్థాన్) గాంధీధామ్(గుజరాత్) సికింద్రాబాద్(తెలంగాణ) కోట(రాజస్థాన్) -
స్తంభించిన ఐఆర్సీటీసీ సేవలు
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్సీటీసీ) సేవలు స్తంభించిపోయాయి. నేటి ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ఐఆర్సీటీసీ వెబ్సైట్ irctc.co.in, మొబైల్ ఫోన్ యాప్ ఆగిపోయాయి. ‘నిర్వహణ చర్య వల్ల ఈ-టిక్కెటింగ్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేదు. కొద్దిసేపు అయ్యాక ప్రయత్నించండి. క్యాన్సిలేషన్/టీడీఆర్ ఫైల్ కోసం కస్టమర్ కేర్ నెంబర్. 011-39340000,011-23340000 కు కాల్ చేయండి లేదా etickets@irctc.co.in కు మెయిల్ పెట్టండి’ అనే మెసేజ్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో, యాప్లో దర్శనమిచ్చింది. అయితే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఏమైనా హ్యాకింగ్కు గురైందా? అనే సందేహాలు సోషల్ మీడియా వ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో, యూజర్లు సోషల్ మీడియాలో మండిపడ్డారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, దేశీయ రైల్వేను కోట్ చేస్తూ.. యూజర్లు ట్వీట్లు చేశారు. ఎందుకు వెబ్సైట్, యాప్ పనిచేయడం లేదని ప్రశ్నించారు. యూజర్లు ఇంతలా ప్రశ్నించినప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గానీ, రైల్వే అధికారుల నుంచి గానీ ఇసుమంతైన సమాధానం రాకపోవడం గమనార్హం. అసలేమైందో కూడా వారు తెలుప లేదు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ యథాతథ స్థితికి వచ్చాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ల్లో నిర్వహణ కార్యకలాపాలను చేపడతామని దేశీయ రైల్వే నుంచి ముందస్తుగా ఎలాంటి ప్రకటన కూడా వెలువడ కాలేదు. ఎలాంటి ప్రకటనలు లేకుండా... ఇలా ఐఆర్సీటీసీ సేవలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 11 గంటల నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ క్రాష్ అయ్యాయి. గంటల కొద్దీ ఐఆర్సీటీసీ సైట్ డౌన్ అయినట్టే చూపించింది. సైట్ లేదా యాప్లో టిక్కెట్ క్యాన్సిలేషన్ కూడా అవ్వలేదు. కాగ, మే 2న కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయడం కోసం దేశీయ రైల్వేకి చెందిన ఆన్లైన్ పోర్టల్స్ను, ఐఆర్సీటీసీ వెబ్సైట్ను రాత్రి 10.45 నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేశారు. కానీ ప్రస్తుతం ఎందుకు ఈ సైట్ క్లోజ్ అయిందో తెలియక యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇంజిన్ లేకుండా రైలు10 కి.మీ...
-
స్కిల్ ఇండియానా, నిల్ ఇండియానా!
సాక్షి, ముంబై : భారతీయ రైల్వేలో అప్రెంటీస్గా శిక్షణ పొందిన దాదాపు మూడు వేల మంది నిరుద్యోగ యువకులు మంగళవారం నాడు దాదాపు నాలుగు గంటలపాటు ముంబై నగరంలో రైలురోకో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఫలితంగా దాదార్, మాతుంగ రైల్వే స్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగడంతో వేలాది మంది స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆందోళన చేసిన వారంతా ‘ఆల్ ఇండియా యాక్ట్ అప్రెంటీస్ అసొసియేషన్’ సభ్యులు. భారతీయ రైల్వేలో తమకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వారు మహారాష్ట్ర, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. 2014 సంవత్సరానికి ముందు భారతీయ రైల్వేలో అప్రెంటీస్ చేసిన వారందరికి టెక్నికల్ జాబ్స్ వచ్చేవని, 2014 నుంచి తమకు ఉద్యోగాలు రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తాము శిక్షణ పూర్తి చేసి నాలుగైదు సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యోగాలు ఇవ్వడానికి రైల్వే అధికారలు నిరాకరిస్తున్నారని, సిఫార్సులపై అతి కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని బీహార్ నుంచి వచ్చిన నిరుద్యోగ యువకుడు సంతోష్ కుమార్ ఆరోపించారు. ‘సెంట్రల్ అప్రెంటీస్ యాక్ట్, 1961’ కింద రైల్వే శాఖ రెగ్యులర్గా అప్రెంటీస్లకు శిక్షణ ఇచ్చి పాసైన వారికి ఉద్యోగాలిస్తూ వస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానికి ‘స్కిల్ ఇండియా’ అంటూ ఆ నియామకాలకు పేరు పెట్టారు. కానీ నియామకాలు మాత్రం జరుగలేదు. గత నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేకపోవడంతో ఇప్పుడు వీరు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లోనే తగిన సమాధానం చెబుతామని రైల్వే శాఖ హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు తమ రైల్రోకో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. అయితే వారు తమకు సంతప్తికరమైన సమాధానం వస్తుందన్న విశ్వాసం లేదని వారు మీడియాకు తెలియజేశారు. ‘గత ఆగస్టు నుంచి మేము ఢిల్లీ, గోరఖ్పూర్లలో భారీ ప్రదర్శనలు నిర్వహించాం. 30 మందికిపైగా ఎంపీలకు లేఖలు రాశాం. చివరకు రైల్వే శాఖ మంత్రిని కూడా కలుసుకున్నాం. అందరూ హామీలు ఇచ్చిన వారే. ఎవరి మాట నెరవేరలేదు’ అని ఫిట్టర్గా 2015లో శిక్షణ పొందిన 23 ఏళ్ల యువకుడు సంతోష్ కుమార్ వివరించారు. ‘నైపుణ్య భారత్’ నినాదం కింద హామీ ఇచ్చిన ఉద్యోగాలెక్కడా ? అని ఆయన ప్రశ్నించారు. ‘స్కిల్ ఇండియానా నిల్ ఇండియానా’ అని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. అప్రెంటీస్ యాక్ట్ అంటే ఏమిటీ? వివిధ రకాల టెక్నికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇంజీనీరింగ్ డిప్లమో హోల్డర్లు, ఐఐటీ గ్రాడ్యువేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1961లో అప్రెంటీస్ యాక్ట్ను తీసుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనా సంస్థ అవడం వల్ల భారతీయ రైల్వేలు ఇదే చట్టంలోని నిబంధనల కింద సొంత అప్రెంటీస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకొంది. సొంత ఇంజనీరింగ్ విభాగాలు, ఎలక్ట్రిఫికేషన్, ప్రొడక్షన్ యూనిట్స్, లోకోమోటివ్, క్యారేజ్, వేగన్ షెడ్స్ విద్యార్థులకు అప్రెంటీస్ శిక్షణ ఇస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశంలోని 16 రైల్వే జోన్లలో 30 వేల అప్రెంటీస్లకు శిక్షణ ఇస్తామని ఇటీవలనే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణంగా రైల్వే విభాగాల్లో అప్రెంటీస్ శిక్షణ పూర్తి చేసిన వారికి రైల్వేలో లేదా ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసేందుకు వీలుగా ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రేనింగ్’ సర్టిఫికేట్ను జారీ చేస్తాయి. ఈ సర్టిఫికేట్ సాధించిన వారందరిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ చట్టంలో నిబంధనేమీ లేదు. అయితే గత ప్రభుత్వాల హయాంలో సర్టిఫికేట్ సాధించిన వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం రైల్వేలో శిక్షణ పొందిన వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు నియామకాలు జరుగలేదు. అందుకే అప్రెంటీస్లు రైలు పట్టాలెక్కారు. -
89వేల పోస్టులకు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ : భారత రైల్వేలో ఖాళీగా ఉన్న 89,000 పైగా పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. గత నెలలో వచ్చిన ఈ ఉద్యోగ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. 89వేల ఆర్ఆర్బీ ఉద్యోగాలకు దాదాపు కోటిన్నర మంది రిజిస్ట్రర్ చేసుకున్నట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రైమరీ రిజిస్ట్రేషన్లోనే దాదాపు కోటిన్నర మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారని పేర్కొన్నారు. గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగ ప్రకటనను జారీచేసింది. వీటిలో గ్రూప్ సీకి చెందిన 26,502 పోస్టులుండగా.. గ్రూప్ డీకి చెందినవి 62,907 పోస్టులున్నాయి. మార్చి 31 ఈ దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రైమరీ రిజిస్ట్రేషన్లో అభ్యర్థులు తమ పేరు, అడ్రస్ను నమోదుచేయాల్సి ఉంటుంది. తర్వాత దశలో దరఖాస్తులో ఇతర వివరాలను నింపి, ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు చెప్పారు. ఆర్ఆర్బీ అప్లికేషన్ ఫాం ప్రిలిమరీ రిజిస్ట్రేషన్లో అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు, తమ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్నెంబర్ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటోంది. ఈ పోస్టులకు ఎగ్జామ్ను రైల్వే రిక్రూట్మెంట్ 2018 ఏప్రిల్లో కానీ, మేలో కానీ నిర్వహించనుంది. -
రూ.10 లక్షల కోట్ల మెగా గిఫ్ట్
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే త్వరలోనే రూ.10 లక్షల కోట్ల మెగా గిఫ్ట్ను ప్రకటించబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ నగరాలను కలుపుతూ.. 10వేల కిలోమీటర్లలో రూ.10 లక్షల కోట్ల హై-స్పీడ్ ట్రైన్ కారిడార్స్ను రైల్వే నిర్మించబోతుంది. దీంతో పాటు భారతమాలా హైవేస్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ కూడా ప్రభుత్వం చేపట్టబోతుంది. దేశీయ రైల్వే ఈ ప్లాన్ను ఏప్రిల్లో ప్రకటించబోతుందని రైల్వే మంత్రిత్వ శాఖ టాప్ అధికారి ఒకరు చెప్పారు. ఫండింగ్ మెకానిజంతో కనెక్ట్ అయ్యే రూట్లను ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించబోతున్న రైల్వే లైన్లలో ట్రైన్లు గంటకు 200 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్టు తెలిపారు. పెద్ద పెద్ద టెండర్లతోనే రైల్వే ముందుకు రాబోతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దిగ్గజాలను ఆహ్వానించనుందని తెలుస్తోంది. నిర్మాణ ఖర్చును కిలోమీటరుకు రూ.200 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించేందుకు సింగిల్ పిల్లర్స్పై డబుల్ లైన్స్ను నిర్మించేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా ప్రత్యేకంగా తక్కువ బరువున్న అల్యూమినియం కోచ్లను కూడా డిజైన్ చేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్యలో 534 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ కారిడార్ను నిర్మిస్తోంది. దీని ఖర్చు లక్ష కోట్లకు పైననే. ఈ ప్రాజెక్ట్ 2022 వరకు ముగియనుంది. ఢిల్లీ-ఛండీగర్, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్కత్తా, బెంగళూరు-చెన్నై కారిడార్లను ఇప్పటికే పూర్తి చేసేసింది. -
వీఐపీ సంస్కృతిని విడనాడుదాం..!
న్యూఢిల్లీ: వీఐపీ సంస్కృతిని విడనాడే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. 36 ఏళ్ల నాటి ప్రొటోకాల్ను పక్కనబెట్టాలని తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యుల పర్యటన సమయంలో జోన్ జనరల్ మేనేజర్లు వారికి స్వాగతం పలకడం, వీడ్కోలు చెప్పడం ఇప్పటి వరకూ ప్రొటోకాల్గా కొనసాగుతోంది. ఈ ప్రొటోకాల్ నిబంధనను తక్షణం ఉపసంహరించుకుంటున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యుల పర్యటనల సమయంలో జోన్ జీఎం హాజరయ్యే అధికారులు పూల బొకేలు, బహుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహని స్పష్టంచేశారు. సీనియర్ అధికారులు తమ ఇళ్లల్లో పని చేయించుకుంటున్న రైల్వే శాఖ కింది స్థాయి ఉద్యోగులను తక్షణం రిలీవ్ చేయాలని ఆదేశించింది . ప్రస్తుతం రైల్వే శాఖలో సుమారు 30 వేల మంది ట్రాక్మెన్లు సీనియర్ అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. వెంటనే వారిని విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు. సీనియర్ అధికారులు ఎగ్జిక్యూటివ్ క్లాస్ల్లో ప్రయాణాలు మానుకోవాలని, తోటి ప్రయాణికులతో కలసి స్లీపర్, ఏసీ 3 టైర్లో ప్రయాణించాలి. బోర్డు సభ్యులు, జోన్లమేనేజర్లు, డివిజనల్ మేనేజర్లకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. -
రైళ్లలో ఐడీ ప్రూఫ్గా ఎం ఆధార్
సాక్షి,న్యూఢిల్లీః రైళ్లలో ఏ రిజర్వ్డ్ క్లాస్లో ప్రయాణించే వారికైనా ఆధార్ కార్డ్ డిజిటల్ వెర్షన్ ఎం ఆధార్ను గుర్తింపు కార్డుగా అనుమతించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది. యూఐఏఐ ప్రారంభించిన ఎం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఎవరైనా తమ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కే కార్డును డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. రైళ్లలో అధికారులకు ఆధార్ చూపించాల్సి వస్తే సదరు యాప్ను ఓపెన్ చేసి తమ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఎం ఆధార్ కనిపిస్తుంది. ఐడీ ఫ్రూప్గా దీన్ని చూపిస్తే రైల్వే అధికారులు ప్రయాణీకులను జర్నీకి అనుమతిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియాగా ప్రకటించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి కేంద్రం తరఫున 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 41 మందికి పైగా మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిలో ఒడిశా, ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
కేంద్రమంత్రికి మహా కక్కుర్తి విజ్ఞప్తి!
ప్రభుత్వ మంత్రిత్వశాఖలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాంగ శాఖ, రైల్వేశాఖలు నెటిజన్ల విజ్ఞప్తులపై చురుగ్గా స్పందిస్తూ.. వారికి వేగంగా సేవలు అందిస్తున్నాయి. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విదేశాల్లోని భారతీయులకు ఏ కష్టం వచ్చినా.. ట్విట్టర్లో ఒక చిన్న మాట చెప్తే చాలు.. వారి సమస్యలను తీరుస్తూ.. సూపర్ మామ్ గా పేరుతెచ్చుకుంటున్నారు. అటు సురేశ్ ప్రభు కూడా రైల్వేశాఖలోని సమస్యలను ట్విట్టర్ వేదికగా పరిష్కరిస్తున్నారు. కానీ రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ఓ ఇటీవల ఓ ప్రయాణికుడు ఓ వింత మెసేజ్ పెట్టాడు. ‘నేను చిన్నపాపతో ప్రయాణిస్తున్నా. ఒక డైపర్ కావాలి. దయచేసి సాయం చేయండి’ అంటూ ప్రభాకర్ ఎస్ ఝా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. రైల్వేశాఖకు, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లకు మంట పుట్టించింది. ట్విట్టర్లో అందుతున్న రైల్వేసేవలను జోక్గా మార్చడం సరికాదని, ఇలాంటి విజ్ఞప్తులు చేసి మూర్ఖుడిగా మిగలొద్దని ఓ నెటిజన్ సూచించగా.. ఇలాంటి మూర్ఖులకు టికెట్ ధర కంటే రెట్టింపు రేటుకు డైపర్ అందించి కుక్క కాటుకు చెప్పుదెబ్బ తరహాలో జవాబు చెప్పాలని మనో నెటిజన్ సూచించాడు. -
ఫోన్ కొట్టు.. టికెట్ రద్దు చేయ్!
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల నుంచి ముందస్తుగా బుక్ చేసుకున్న రైల్వే టికెట్లను రద్దు చేయడం చాలా సులభం కానుంది. కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా టికెట్లను రద్దు చేసుకునే సౌలభ్యాన్ని రైల్వే సంస్థ అందుబాటులోకి తెస్తోంది. ముందుగా బుక్ చేసుకున్న టికెట్ను నిర్ణీత గడువులోపు రైల్వే కౌంటర్ల వద్దకు వెళ్లి క్యాన్సిల్ చేసుకొని.. టికెట్ డబ్బు వాపస్ తీసుకోవడమంటే ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో 139 నంబర్కు డయల్ చేసి కన్ఫర్మ్ అయిన టికెట్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా కాన్సిల్ చేసుకోగానే వారికి ఒన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. అదే రోజు ఏ సమయంలోనైనా రైల్వే కౌంటర్ వద్దకు వెళ్లి ఓటీపీ తెలియజేయడం ద్వారా టికెట్ డబ్బుని వాపస్ తీసుకోవచ్చు' అని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. డబ్బు వాపస్ పొందే నిబంధనలను ఇటీవల రైల్వే మార్చింది. దీంతో చాలామంది ప్రయాణికులు నిర్ణీత గడువులోపు కౌంటర్ల వద్దకు వెళ్లి.. రిజర్వు చేయించుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం కష్టంగా మారింది. దీంతో చాలామంది టికెట్ క్యాన్సిల్ చేయించుకున్న డబ్బు వాపస్ పొందడం లేదు. ఈ నేపథ్యంలో ఫోన్ నంబర్ సౌలభ్యాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా నిజంగా అవసరమున్న ప్రయాణికులకే రిజర్వేషన్ టికెట్ లభించేందుకు వీలుగా టికెట్ క్యాన్సిలేషన్ చార్జీని రైల్వే రెట్టింపు చేసింది. దీంతో అనవసరంగా ముందస్తుగా బుక్ చేసేవారికి, బ్లాక్ మార్కెట్లలో రిజర్వేషన్ టికెట్లు అమ్మేవారికి చెక్ పడుతుందని భావిస్తోంది. -
రైళ్లలో ఇక రుచికరమైన భోజనం!
న్యూఢిల్లీ: ఇక రైలు జర్నీ చేసే ప్రయాణికులకు భోజనం, అల్పాహారం సమస్యలు తీరనున్నాయి. కేంద్ర ప్రవేశపెట్టనున్న ఈ-కేటిరింగ్ విధానం ద్వారా 1350 రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసులను కల్పించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇండియన్ రైల్వే, టూరిజంశాఖలు సంయుక్తంగా ప్రయాణికులకు నచ్చే విధంగా రుచికరమైన ఫుడ్ ను అందించనున్నాయి. క్యాంటిన్స్ లేని రైళ్లో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రైల్వే మంత్రిత్వశాఖ ఆ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. నాణ్యత లేకుంటే ఫిర్యాదులు కేఎఫ్సీ, డోమినాస్, బిట్టూ, టిక్కి వాలా, ఫుడ్ పాండా మొదలగు రకాల ఆహార ఉత్పత్తులను ప్రయాణికులు పొందే అవకాశాన్ని కల్పించారు. సెంట్రలైజ్డ్ క్యాటరింగ్ సర్వీస్ మానిటరింగ్ సెల్ (సీఎస్ఎంసీ) టోల్ ఫ్రీ నెంబర్ 1800111321 లో వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-కేటరింగ్ సర్వీసు ద్వారా కొనుగోలు చేసిన ఫుడ్ ప్రాడక్ట్స్ నాణ్యత లేని పక్షంలో, సర్వీసులలో ఏమైనా తలెత్తినా నెంబర్ 138కు కాల్ చేసి ప్రయాణీకులు తమ ఫిర్యాదులు తెలియచేసే అవకాశాన్ని కల్పించారు. ఆ శాఖ సహాయమంత్రి మనోజ్ సింహా ఈ వివరాలను గతవారం పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు. -
రైలు ఎక్కగానే థ్రిల్ అవుతారు!
న్యూఢిల్లీ: రైలు బోగిలోకి ఎక్కగానే మంద్రంగా వినిపించే సంగీతం నేపథ్యంలో నవ్వుతూ చూడచక్కని భామ గులాబీ పువ్వుతో స్వాగతం చెబితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇదంతా త్వరలో నిజం కాబోతోంది. విమానంలో మాదిరిగానే రైళ్లలోనూ సేవికలు(హోస్టెస్) కనిపించనున్నారు. ట్రైన్ హోస్టెస్ లను నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముందుగా ఢిల్లీ-ఆగ్రా గాటిమాన్ ఎక్స్ ప్రెస్ లో సేవికలను నియమించనున్నారు. ఈ నెల 25న ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ లో ఈ అంశాన్ని మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించనున్నారు. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు ఇది. వచ్చే నెలలో ప్రారంభించనున్న ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్ లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విమానాల్లో మాదిరిగానే సేవికలను నియమిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు. -
యువతిని ఆపద నుంచి కాపాడిన ట్వీట్
అసహాయ స్థితిలో స్మార్ట్ ఫోన్ సహాయకారిగా పనిచేస్తుందని మరోసారి రుజువైంది ఈ యువతి విషయంలో. రైలులో ప్రయాణిస్తున్న తనను వేధింపులకు గురిచేసిన ఆకతాయిని ఒకే ఒక ట్వీట్తో కటకటాల్లోకి నెట్టించింది. ఇంతకీ ఆమె ట్వీట్ చేసింది స్నేహితులకో, పోలీసులకు కాదు.. ఏకంగా రైల్వే శాఖకే. ఢిల్లీ- పట్నాల మధ్య చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పట్నాకు చెందిన ఓ యువతి ఢిల్లీలో చదువుకుంటోంది. వారాంతపు సెలవు కావడంతో శనివారం సొంత ఊరికి బయలుదేరిన ఆమెను రైలులో ఓ ఆకతాయి అడ్డగించాడు. దురదృష్టం కొద్దీ ఆమె ఎక్కిన బోగీ ఖాళీగా ఉంది. దీంతో వాడు మరింత రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు వాగాడు. అడ్డు చెప్పినా ఆగలేదు. ఇక ఓపిక పట్టలేక రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ కు ఆమె ఫిర్యాదు పంపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీప స్టేషన్లలోని జీఆర్పీ బలగాలకు సమాచారం చేరవేశారు. అంతే, తర్వాత స్టేషన్ లో రైలు ఆగటం, పోలీసులొచ్చి ఆకతాయికి బేడీలు తగిలించి తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. తనను ఆదుకున్నందుకుగానూ రైల్వే మంత్రిత్వ శాఖకు, మంత్రి సురేశ్ ప్రభుకు ధన్యవాదాలు తెలిపిందా యువతి. -
ఇకపై రైల్వే ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10
న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్లాట్ఫాం టికెట్ల రేట్లను రైల్వేశాఖ పెంచనుంది. ప్రస్తుతం రూ.5గా ఉన్న ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10కి పెంచనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో కూడిన టికెట్లను అన్ని రైల్వే స్టేషన్లకు సకాలంలో సరఫరా చేయాలని జోనల్ రైల్వేలను రైల్వే శాఖ ఆదేశించింది. రేట్ల పెంపునకు సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా ఆధునీకరిస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. ర్యాలీలు, ఉత్సవాల సందర్భంలో ప్లాట్ఫాంలపై రద్దీని నియంత్రించేందుకు టికెట్ రేట్లను పది రూపాయలకంటే ఎక్కువగా పెంచేందుకు డివిజినల్ రైల్వే మేనేజర్లకు రైల్వేశాఖ అధికారం కల్పించింది. -
ఆశలన్నీ ప్రభుపైనే!
రైల్వే మంత్రి సురేశ్ ‘ప్రభు’ కరుణపై జిల్లా గంపెడాశలు పెట్టుకుంది. నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ‘మోడీ కా గాడీ’ జిల్లాలో ఆగుతుందా? వికారాబాద్, శంషాబాద్, మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు అదనంగా నిధులు కేటాయిస్తారో.. లేదో.. మరికొన్ని గంటల్లో తేలనుంది. ⇒ సర్వే పూర్తయినా ‘పట్టా’లెక్కని కృష్ణా- వికారాబాద్ రైల్వే ప్రాజెక్టు ⇒50శాతం వ్యయం భరించేందుకు రాష్ట్ర సర్కారు అంగీకారం ⇒సానుకూలంగా స్పందించని రైల్వే మంత్రిత్వశాఖ ⇒ఆదర్శ స్టేషన్లకు నిధులు విదిల్చేనా.. కొత్త రైళ్లు కూత పెట్టేనా? ⇒నేటి రైల్వే బడ్జెట్పై జిల్లా ప్రజల ఆశలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మూడేళ్లక్రితం సర్వే పూర్తి చేసుకున్న కృష్ణా- వికారాబాద్ బ్రాడ్గేజ్ రైల్వే లైనుపై జిల్లా ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. 121.70 కిలోమీటర్ల పొడవునా ప్రతిపాదించిన ఈ రైలు మార్గానికి రూ.787.80 కోట్లు అవసరమని తేల్చిన రైల్వే శాఖ.. సరుకు రవాణాకు ఈ లైన్ అంతగా ఉపయోగపడదని, ప్రయాణికుల నిష్పత్తి కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని సర్వేలో తేలినందున ప్రాజెక్టు సాధ్యపడదని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేందుకు ముందుకొచ్చినా.. ఇప్పటికీ కేంద్రం వైపు నుంచి స్పందనలేకపోవడం గమనార్హం. ప్రయాణికుల నిష్పత్తి 6.9 శాతమే.. సగటున 14శాతం రేట్ ఆఫ్ రిటర్న్(ఆర్ఓఆర్) ఉన్నవాటికే ప్రాధాన్యమిస్తామని, ఈ మార్గంలో కేవలం 6.9 శాతం మాత్రమే వచ్చే వీలుందని రైల్వే ఇంజినీరింగ్ శాఖ తేల్చిం ది. ప్రాంత సామాజిక అవసరాల దృష్ట్యా నిర్మాణ వ్యయం లో సగం వాటాను రాష్ట్ర సర్కారు భరిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గతప్రభుత్వం భూసేకరణ సహా ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం భరించేందుకు అంగీకరించింది. ఈ మేరకు భూసేకరణకు రూ.36.83 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రక టించింది. అయినప్పటికీ రైల్వేశాఖ నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. ఏడెనిమిదేళ్లలో ఈ ప్రాజెక్టుకు కార్యరూపం ఇస్తామని 2012లో రైల్వేశాఖ స్పష్టం చేయడంతో ఈ ప్రాంత ప్రజలు రైలుబండిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లో కృష్ణా- వికారాబాద్ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతారో లేదో వేచి చూడాల్సిందే! జిల్లాకు రావాల్సిన మరికొన్ని ప్రాజెక్టులు ⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగిస్తామనే ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. 2006లో మొదలైన ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలక్నుమా -ఉందానగర్ -శంషాబాద్ (20కి.మీ) వరకు కొత్త లైన్ వేయడమేకాకుండా.. ప్రస్తుత మార్గాన్ని డబ్లింగ్, విద్యుద్దీకరణ చేయాలని నిర్ణయించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ⇒శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్కార్గో హబ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. ఇప్పటికీ అతీగతీలేకుండా పోయింది. ఎయిర్పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్ నిర్మించాలని గతంలో జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించిన ఫైలు అటకెక్కింది. ⇒సికింద్రాబాద్- బొల్లారం- మేడ్చల్ (28 కి.మీ), మౌలాలి -ఘట్కేసర్ (12.2 కి.మీ.) వరకు పొడిగించాలని ప్రతిపాదించిన ఎంఎంటీఎస్కు ఇంకా అవరోధాలు తొలగలేదు. ⇒వికారాబాద్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రాజ్కోట్, గరీబ్థ్రతదితర ఎక్స్ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపాలనే డిమాండ్ ఉంది. ఘట్కేసర్లో కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్లకు హాల్టింగ్ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ⇒ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం కనిపిస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటివరకు పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్పల్లి, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికీ కొన్నింటికి పునాదిరాయి కూడా పడలేదు. -
ప్రతిపాదనలు
రైల్వేశాఖకు పంపిన ఎంపీలు సాక్షి, హన్మకొండ : 2014-15 రైల్వే బడ్జెట్పై రైల్వేశాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన పనులపై ఎంపీల నుంచి నివేదికలు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందిగా మన ఎంపీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించారు. కాజీపేట కేంద్రంగా కాకతీయ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయూలని.. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ను విభజించాలి.. వ్యాగన్ వర్క్షాప్ పనులు ప్రారంభించాలని.. స్టేషన్లలో మౌలిక సదుపాయలు మెరుగుపర్చాలని.. కొత్త మార్గాలకు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపింనట్లు ఎంపీలు తెలిపారు. వీటిలో ఎన్ని ఆమోదం పొందుతాయో రైల్వే బడ్జెట్ వరకు వేచి చూడాలి. కాకతీయ పేరిట డివిజన్ ఏర్పాటు చేయూలి - రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ రైల్వే డివిజన్ హోదాకు అన్ని హంగులు ఉన్న కాజీపేట కేంద్రంగా కాకతీయ పేరిట కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. ఈ డివిజన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు సానుకూలంగా ఉన్నా.. నిర్ణయం వెలువడటంలో జాప్యం జరుగుతోంది. ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో ప్రకటన చేయాల్సిందిగా రైల్వేమంత్రిని కోరాను. రద్దీ అధికంగా ఉన్న బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైను నిర్మాణ పను లు చేపట్టాలి. అదేవిధంగా స్టేషన్ఘన్పూర్- పాలకుర్తి-సూర్యాపేట-నల్గొండ వరకు కొత్తరైల్వే లైన్ నిర్మించాలి. వీటి కోసం రెండేళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నాను. కాజీపేట జంక్షన్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయూలి. కాజీపేట, వరంగల్ స్టేషన్లలో మూడో నంబరు ఫ్లాట్ఫాంపై అప్రాన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. పెండింగ్లో ఉన్న వ్యాగన్ వర్క్షాపు పనులు ప్రారంభించాలి. విజయవాడలో ఉన్నటువంటి ఉద్యోగుల శిక్షణ కేంద్రం మాదిరిగా కాజీపేటలో కూడా మరొ శిక్షణ కేంద్రం అవసరం ఉంది. సికింద్రాబాద్, విజయవాడ స్థాయిలో డీజిల్, ఎలక్ట్రికల్ లోకోల మెయింటెనెన్స్ను కాజీపేటలో ఏర్పా టు చేయాలి. డోర్నకల్ ప్రాధాన్యత గుర్తించాలి - సీతారాంనాయక్, మానుకోట ఎంపీ భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం)-కొవ్వూరు రైల్వేలైను నిర్మాణం పూర్తయితే డోర్నకల్ జంక్షన్కు పూర్వవైభవం వస్తుంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించేలా రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తా. బొగ్గు నిక్షేపాల ప్రాంతాలు కలుపుతూ మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే మార్గానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. ఈ రైలు మార్గంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. భద్రాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలి. డోర్నకల్-సింగరేణికాలరీస్ (ఇల్లందు) మధ్య రద్దరుున ప్యాసింజర్ రైలును పునఃప్రారంభించాలి. గతంలో సర్వే పూర్తరుున డోర్నకల్-మిర్యాలగూడ మార్గానికి నిధులు కేటాయించాలి. భద్రాచలం రోడ్డు-తిరుపతి మధ్య కొత్తగా ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలి. మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. - ఎంపీ సుధారాణి, ఎంపీ కాజీపేట కేంద్రంగా దేశంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా రైళ్లను ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా ఇక్కడ పిట్లైన్లు, ఫ్లాట్ఫాంల సంఖ్య పెం చాలి. వీటితోపాటు వ్యాగన్ వర్క్షాప్ల భూ కేటాయింపులకు నిధులు మంజూరు అయ్యాయి. కాబట్టి వ్యాగన్ వర్క్షాపు పనులు వేగవంతం చేయాలి. కాజీపేటలో ఉన్న రైల్వే ఆస్పత్రి అప్గ్రేడ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. కాజీపేటలో రెం డో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టు సౌకర్యాలు కల్పించాలి. ఎక్స్ప్రెస్లకు జనగామలో హాల్టింగ్ ఇవ్వాలి - బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎంపీ జిల్లాలో రెండో పెద్ద పట్టణమైన జనగామ నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు హైదరాబాద్, వరంగల్లకు ప్రయాణం చేస్తుంటారు. కానీ ఇక్కడ చాలా ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేదు. పరిమిత సంఖ్యలో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జనగామ స్టేషన్లో కొత్తగా పది ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాల్సిందిగా రైల్వేబోర్డుకు లేఖ రాశాను. వీటిలో శాతవాహన, కోణార్క్, గోదావరి, నాందేడ్, సింహపురి, పాట్నా వంటి రైళ్లు ఉన్నాయి. -
సదానంద గౌడకు డిమోషన్?
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తొలి వంద రోజుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖలను మార్చి, కొంతమందిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడకు శాఖ తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరుపై మోదీ అసంతృప్తిగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సదానంద కుమారుడు కార్తీక్ వివాదం కూడా ఆయన మంత్రి పదవికి ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా నూతన రైల్వేశాఖ మంత్రిగా శివసేనకు చెందిన సురేష్ ప్రభుకు కట్టబెట్టనున్నట్లు సమాచారం. మొత్తం 10 నుంచి 11మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్ర పక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్లో చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున పంజాబ్ నుంచి తొలిసారి నెగ్గిన విజయ్ సాంప్లా, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, హర్యానా నుంచి జాట్ నేత బీరేందర్సింగ్, బీహార్ నుంచి గిరిరాజ్సింగ్ లేదా భోలా సింగ్, రాజ్స్థాన్ నుంచి కల్నల్ సోనారామ్ చౌదరీ, గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ర్ట నుంచి హన్స్రాజ్ అహిర్తో పాటు సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివసేన నుంచి సురేష్ ప్రభు, అనిల్ దేశాయ్కి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే టీడీపీ నుంచి సుజనా చౌదరికి, బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయకు చోటు దక్కింది. కాగా నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్లకు కేబినెట్ హోదా దక్కనున్నట్లు సమాచారం. కొత్తగా కేబినెట్లో చేరనున్న వారికి.. మోదీ ఇచ్చే టీ విందుకు రావాలని పీఎంఓ ఫోన్లు చేసింది. -
కొత్త చట్టం పరిధిలోకి మెట్రో
ఇక చురుగ్గా పనులు నూతన చ ట్టం ప్రకారమే మార్పులు సాక్షి, సిటీబ్యూరో: నగర మెట్రో ప్రాజెక్టుకు రైల్వే శాఖ నుంచి ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ ప్రాజెక్టును ట్రామ్వే యాక్ట్ (రైల్వే శాఖకు సంబంధించిన) నుంచి మినహాయించి సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకు చికాకులు తప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో రైలు ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో వివిధ విభాగాల నుంచి అందాల్సిన భద్రత, నిర్వహణపరమైన అనుమతులకు మార్గం సుగమం కానుంది. పనులు వేగవంతం కానున్నాయి. కొత్త చట్టం ప్రకారమే... మెట్రో ప్రాజెక్టును సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి మార్చడంతో ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్నుమా,నాగోల్-శిల్పారామం మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ మార్గంలో అలైన్మెంట్ (మార్గం)లో మార్పులు చేర్పులు సైతం కొత్త చ ట్టానికి లోబడే చేయాలి. ఒకవేళ మెట్రో మార్గాన్ని(అలైన్మెంట్) మార్చాల్సిన పక్షంలో గెజిట్లో నోటిఫై చేయాలి. అలైన్మెంట్ మార్పు లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఈ చట్టం కింద కేంద్రానికి తాజా అలైన్మెం ట్ ప్రతులను పంపి, అనుమతి పొందాలి. -
పట్టాలపై నెత్తుటి చారిక!
ఈమధ్యనే బుల్లెట్ రైలును కలగనడం ప్రారంభించిన రైల్వే శాఖ చరి త్రలో ఇదొక నెత్తుటి పుట. కాపలాదారులేని లెవెల్ క్రాసింగ్లు జనం ప్రాణాలు తీస్తున్నాయని తెలిసికూడా దశాబ్దాల నుంచి పట్టనట్టుగా ఉండిపోయిన రైల్వేశాఖ నిర్లక్ష్యం సాక్షిగా గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 14 పసిమొగ్గలు రైలు పట్టాలపై నెత్తుటి ముద్ద లుగా మిగిలారు. ఇరవైమందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పొద్దుటే హడావుడిగా నిద్రలేచి స్కూలుకు తయారై అమ్మానాన్నలకు టాటా చెప్పిన కొన్ని నిమిషాల్లోనే చోటుచేసుకున్న ఈ విషాదం కన్న వారినే కాదు... యావత్తు దేశ ప్రజలనూ తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం జరిగిందని తెలిశాక రైల్వేశాఖ, సర్కారు స్పందించిన తీరు ఎంత యాంత్రికంగా ఉన్నదో గమనిస్తే...లోక్సభలో ఈ ఉదంతం ప్రస్తావనకొచ్చినప్పుడు రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడిన మాటలు వింటే మళ్లీ మరో ప్రమాదం సంభవించబోదన్న భరోసా ఏమీ కలగదు. మరణించినవారి కుటుంబాలకు, గాయపడినవారికి పరిహారాన్ని ప్రకటించి, ప్రమాదంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఊరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం ప్రకటించారు. సదానందగౌడ కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ, ఇవన్నీ సరిపోవు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రైల్వేమంత్రి హుటాహుటీన ఘటనాస్థలికి రావాలి. వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబాలకు సాంత్వన వాక్యాలు పలకాలి. తమ శాఖనుంచి జరిగిన వైఫల్యమేమిటో గమనించాలి. ఇవి చేసినంతమాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావన్నది నిజమే. తల్లడి ల్లుతున్న ఆ తల్లిదండ్రుల జీవితాల్లో నెలకొన్న విషాదం తొలగిపోద న్నదీ వాస్తవమే. కానీ, అలా చేయడంవల్ల రైల్వే శాఖ ఎంత సున్ని తంగా ఆలోచిస్తున్నదో, జరిగిన ఘటనపై ఆ శాఖ మంత్రిలో ఎంత ఆందోళన నెలకొనివున్నదో దేశానికి తెలుస్తుంది. భవిష్యత్తులో ఇక ఇలాంటివి పునరావృతం కాని విధంగా చర్యలుంటాయన్న విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసాన్ని కలగజేయ డంలో సదానందగౌడ విఫలమయ్యారు. రైల్వే భద్రతపై నియమించిన అనేకానేక కమిటీల్లో ఒకటైన అనిల్ కకోద్కర్ కమిటీ నాలుగేళ్ల క్రితం ఇచ్చిన నివేదిక భద్రత విషయంలో తీసుకోవాల్సిన పలు చర్యలను సూచించింది. లెవెల్ క్రాసింగులను వెనువెంటనే తొలగించి వాటి స్థానంలో ఓవర్ బ్రిడ్జిలు, అండర్బ్రిడ్జిలు, సబ్వేలు నిర్మించాలన్నది అందులో ఒకటి. ఇందుకు రూ. 40,000 కోట్లు ఖర్చవుతాయని అంచనావేసింది. కాపలాదారులేనిచోట సరేగానీ...ఉన్నచోట ఇప్పుడ వుతున్న ఖర్చంతా ఆదా అవుతుందని, పైగా రైళ్లు నిరాఘాటంగా, వేగంగా వెళ్లడానికి వీలవుతుంది గనుక ఆ మేరకు ఇంధనం కలిసొ స్తుందని వివరించింది. వీటన్నిటి పర్యవసానంగా ఏడెనిమిదేళ్లలోనే ఈ వ్యయాన్ని రాబట్టుకోవచ్చునని తెలిపింది. కానీ, ప్రతి రైల్వే బడ్జెట్ లోనూ ఇందుకోసం కేటాయించే మొత్తం చాలా స్వల్పం. గత పదేళ్ల యూపీఏ పాలనలోనే క్షమార్హంకాని నిర్లక్ష్యం కొనసాగిందనుకుంటే... మొన్నటి ఎన్డీయే రైల్వే బడ్జెట్లో కూడా ఇలాంటి లెవెల్ క్రాసింగ్లను ఎత్తేయడానికి కేటాయించిన సొమ్ము రూ. 1,600 కోట్లు. దేశమంతా ఉన్న రైల్వే గేట్లను మార్చడానికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. ఒక్క దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే దాదాపు 1,200 రైల్వే గేట్లున్నాయని అంచనా. ఇందులో దాదాపు 500 గేట్లు గత నాలుగేళ్లలో తీసేయగ లిగారు. లెవెల్ క్రాసింగ్ల వద్ద కాపలాదారును పెట్టడానికి కొన్ని లక్షలు ఖర్చవుతాయి. ఓవర్ బ్రిడ్జి లేదా సబ్వే నిర్మిస్తే రూ. 2 కోట్ల వరకూ వ్యయమవుతుంది. 2016 నాటికల్లా అన్ని లెవెల్ క్రాసింగ్ లనూ కాపలా గేట్లుగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకున్నా బడ్జెట్లో చేసే కేటాయింపులు దానికి దీటుగా ఉండటంలేదు. చిత్రమేమంటే, రైల్వే శాఖ వైపునుంచి ఇంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కిమ్మనడంలేదు. ఇక కాపలాదారులున్న రైల్వే గేట్లవద్ద భద్రతకూడా అంత గొప్పగా ఏమీ లేదు. లెవెల్ క్రాసింగ్ల వద్ద కాపలా బాధ్యతను రైల్వేశాఖ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెబుతోంది. 2001 నుంచి ప్రయాణికుల టిక్కెట్లపై భద్రతా సుంకం వసూలు చేస్తున్నారు. ‘అలా చేయడం ద్వారా మా బాధ్యతను పెంచుకుం టున్నాం’ అని ఆనాటి రైల్వే మంత్రి నితీష్కుమార్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు. కానీ, ఆచరణలో జరిగిందేమిటి? లెవెల్ క్రాసింగ్లు ఎప్పటిలానే ఉన్నాయి. వేల సంఖ్యలో ఉన్న కాలంచెల్లిన వంతెనలూ అలాగే ఉన్నాయి. నాసిరకం పట్టాలూ మారలేదు. వీటన్నిటినీ సరిచేయడానికి అవసరమైన కేటాయింపులు చేయడానికి బదులు తాజా బడ్జెట్లో బుల్లెట్ రైలు ప్రతిపాదనలు మాత్రం దూసుకొచ్చాయి. లోపాలన్నిటినీ యధాతథంగా ఉంచి బుల్లెట్ రైళ్లు నడిపినంత మాత్రాన మనకొచ్చే ఖ్యాతి ఏమీ ఉండదు. తమ పిల్లలు తమలాంటి జీవితం అనుభవించకూడదని, వారికి మంచి భవిష్యత్తు అందించాలన్న తపనతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి వేలకు వేలు ఖర్చుచేస్తున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్వెంట్కు స్కూలు బస్సులో పంపితే పిల్లలు సురక్షితంగా ఉంటారన్న భరోసాతో మరింత సొమ్మును అదనంగా ఖర్చుచేస్తున్నారు. సరైన పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకోలేని యాజ మాన్యం చివరకు తమకు కడుపుకోత మిగులుస్తుందని వారు ఊహిం చివుండరు. ఈ ఘటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మేల్కొని లెవెల్ క్రాసింగ్ల విషయంలో కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేయాలి. ఈ కృషిలో మిగిలిన రాష్ట్రాలను కూడా కలుపుకోవాలి. అలాగే, పాఠశాలలకు ఉదయమూ, సాయంత్రమూ ఆర్టీసీ బస్సులను తిప్పే అంశాన్ని పరిశీలించాలి. -
రైళ్ల జోరు షురూ!
‘సదా’కు రైల్వే శాఖపై కన్నడిగుల హర్షం సాక్షి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడకు కేంద్రంలో రైల్వే శాఖ లభించింది. దీంతో వరుసగా రెండోసారి కర్ణాటకకు చెందిన పార్లమెంటు సభ్యుడికే ‘ప్రత్యేక బడ్జెట్’ హోదా కలిగిన రైల్వే శాఖ లభించినట్లయింది. తాజా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన సదానందగౌడ, అనంతకుమార్, జీ.ఎం సిద్దేశ్వర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరికి అధికారికంగా మంత్రిత్వ శాఖలను మంగళవారం కేటాయించారు. ఇందులో సదానందగౌడకు రైల్వే శాఖ, అనంతకుమార్కు ఎరువులు, రసాయన శాఖ, జీ.ఎం సిద్దేశ్వరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి పదవుల కేటాయించారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయిస్తూ నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారు. యూపీఏ-2 ప్రభుత్వంలో చివరి కొద్దికాలం పాటు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే రైల్వే శాఖను నిర్వహించారు. సదాకు రైల్వే శాఖ లభించడంపై కన్నడనాట హర్షం వ్యక్తం అవుతోంది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో రైల్వే రంగం త్వరిత గతిన విస్తరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త రైల్వే లైన్లు, రైళ్లతో పాటు పలు పరిశ్రమలు కర్ణాటకలో ఏర్పాటయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. -
ఓవల్మైదాన్-చర్చ్గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్లో మార్పులు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ఓవల్మైదాన్-చర్చ్గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వశాఖ ఇటీవల స్వల్పమార్పులు చేసింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విరార్లోనే విరార్ సౌత్, విరార్ నార్త్ రెండు స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ స్టేషన్ల మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విరార్ సౌత్ స్టేషన్ను కొత్తగా నిర్మిస్తున్న కార్షెడ్ వద్ద నిర్మించాలని భావిస్తుండగా, విరార్ నార్త్ స్టేషన్ను ప్రస్తుతమున్న విరార్ స్టేషన్కు కిలోమీటర్ దూరంలో నిర్మించనున్నారు. అంతేగాకుండా మహాలక్ష్మీ, విలేపార్లేలో కూడా స్టేషన్లను నిర్మించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మహాలక్ష్మీ స్టేషన్ పరిసరాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపారసంస్థలు ఉండడంతో వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారి తెలిపారు. అయితే విలేపార్లే ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఈ కారిడార్ నిర్మించడాన్ని నిషేధించారని, దీంతో ఇక్కడ భూగర్భ మార్గం నిర్మించి, స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఫలితంగా ఇయిర్ పోర్టు నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ కారిడార్ సౌకర్యవంతంగా ఉంటుందని, దీంతో ఈ ఎలివేటెడ్ రైలును వీరు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కారిడార్ ఏర్పాటుతో విలేపార్టే ప్రాంతం కూడా గొప్ప వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మీరారోడ్లో ఈ కారిడార్ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇక్కడ చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారుల పరిశీలనలో తేలింది.. దీంతో రైల్వే బోర్డు ఈ డిపోను నాయ్గావ్ స్టేషన్ వద్ద నిర్మించే ఆలోచన చేస్తోంది. ఈ కారిడార్ నిర్మాణం కోసం రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో ప్రణాళిక సంఘం రూ.1,240 కోట్లు భరించనుంది. ఈ మోత్తాన్ని కారిడార్ నిర్మాణానికి అడ్డు వచ్చే కట్టడాలు, భూగర్భంలో ఉన్న వివిధ సంస్థల కేబుళ్లు, పైప్లైన్లు తొలగించడానికి ఉపయోగించనున్నారు. ఈ పనులను బీఎంసీ, టాటా పవర్ రిలయన్స్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, మహానగర్ గ్యాస్, తదితర 12 ఏజెన్సీలు చేపట్టనున్నాయి.