terrarist attacks
-
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
కశ్మీర్లో ఉగ్రదాడి
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్పాయింట్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్ హజీమ్ భట్ అనే 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ‘వాంగమ్– ఖాజియాబాద్ వద్దనున్న చెక్పాయింట వద్ద సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు’ అని అధికారులు సోమవారం వెల్లడించారు. ఘటనాప్రాంతానికి అదనపు దళాలను తరలించామని, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని వివరించారు. -
కశ్మీర్లోకి ‘కరోనా’ ఉగ్రవాదులు
జమ్మూ: భారత్తో ముఖాముఖి తలపడలేని పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. కోవిడ్–19 బారిన పడిన ఉగ్రవాదులను దొంగచాటుగా దేశంలోకి పంపిస్తోంది. ‘ఇప్పటి వరకు కశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడిన వారిని దేశంలోకి పంపిస్తోంది. వీరి ద్వారా ఇక్కడి ప్రజలకు వైరస్ సోకుతోంది. దీనిపై పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’అని కశ్మీర్ డీఐజీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జమ్మూలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదుల్లో చాలామంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. -
సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడి
రియాధ్: యెమెన్ ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడులతో సౌదీ అరేబియా చమురు క్షేత్రాల్లో మంటలు చెలరేగాయి. సౌదీ తూర్పు ప్రాంతంలో ఆరామ్కోకు చెందిన అబ్కేయిక్, ఖురైస్ క్షేత్రాలపై శనివారం వేకువ జామున రెండు డ్రోన్లు కూలాయి. దీంతో భారీగా చెలరేగిన మంటలను సిబ్బంది దాదాపు రెండు గంటల అనంతరం అదుపులోకి తెచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి కారణం తామేనంటూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్లోని హౌతి ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపిన అంతరంగిక శాఖ మంత్రి.. డ్రోన్లు ఎక్కడివి? ప్రాణాపాయం, పనులపై ప్రభావం వంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, అబ్కేయిక్, ఖురైస్లపై శనివారం వేకువజామున పది వరకు డ్రోన్లతో తాము దాడి చేసినట్లు హౌతీ ఉగ్రవాదుల ప్రతినిధి అల్ మసీరా టీవీకి తెలిపారు. ఇటీవలి కాలంలో హౌతి ఉగ్రవాదులు సౌదీ అరేబియా వైమానిక స్థావరాలపై పలు క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. యెమెన్లో తమ ప్రాంతాలపై సౌదీ అరేబియా దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు అంటున్నారు. ఆరామ్కోకు ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన అబ్కేయిక్పై గతంలో అల్ఖైదా జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఎగుమతి చేసే సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు గల్ఫ్ జలాల్లోని ఆయిల్ ట్యాంకర్లపై జూన్, జూలైల్లో జరిగిన దాడులకు ఇరానే కారణమంటూ సౌదీ ప్రభుత్వం, అమెరికా ఆరోపిస్తుండగా తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. వ్యాపార విస్తరణ కోసం ఆరామ్కో త్వరలోనే ఐపీవోకు వెల్లనుండగా ఈ పరిణామం సంభవించడం గమనార్హం. -
9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు
వాషింగ్టన్: 2001లో అమెరికాలోని వరల్డ్ట్రేడ్ సెంటర్పై జరిగిన దాడి కుట్రదారులపై విచారణ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఈ కేసును 2021లో చేపట్టనున్నట్లు మిలటరీ కోర్టు జడ్జి ఎయిర్ఫోర్స్ కల్నల్ డబ్ల్యూ షేన్ కోహెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు వ్యూహ రచనతోపాటు అమలు చేసినందుకు యుద్ధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ప్రస్తుతం అమెరికా వైమానిక స్థావరం గ్వాంటానమో బే జైలులో ఉన్నారు. వీరిపై 2021 జనవరి 11వ తేదీ నుంచి అక్కడే విచారణ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. వీరిని 2002–2003 సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి పలు రహస్య ప్రాంతాల్లో ఉంచి, విచారణ జరిపింది. చివరికి 2006లో గ్వాంటానమో బే జైలుకు తరలించింది. మిలటరీ చట్టాల ప్రకారం వీరిపై నేరం రుజువైతే మరణశిక్ష పడే అవకాశాలున్నాయి. నిందితుల్లో సెప్టెంబర్ 11 దాడులతోపాటు ఇతర ఉగ్రచర్యలకు కుట్రపన్నిన అల్ ఖైదా సీనియర్ నేత ఖలీద్ షేక్ మొహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచి, ముస్తఫా అల్ హౌసవి ఉన్నారు. అల్ఖైదాకు చెందిన మొత్తం 19 మంది సభ్యులు 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్ చేసి రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్పైన, ఒకటి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్పైన కూల్చడంతోపాటు మరో దానిని పెన్సిల్వేనియాలో నేల కూల్చారు. ఈ ఘటనల్లో మొత్తం 3వేల మంది చనిపోయినట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. -
నిర్లక్ష్యంగా వ్యవహరించారు; పోలీస్బాస్ అరెస్టు..!
కొలంబో : శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహారించారనే కారణంగా పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ పోలీస్ చీఫ్ పుజీత్ జయసుందర, రక్షణశాఖ మాజీ చీఫ్ హేమసిరి ఫెర్నాండోను అరెస్టు చేయించింది. ఈస్టర్ సండే (ఏప్రిల్ 21) రోజు ఓ క్రిస్టియన్ చర్చిలో, మరికొన్ని చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 258కి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారుల అలక్ష్యం వల్లనే ఉగ్రదాడి జరిగిందని శ్రీలంక అటార్నీ జనరల్ డప్పుల డిలివెరా సోమవారం స్పష్టం చేశారు. నిఘావర్గాల హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అటార్నీ జనరల్ సూచనల ప్రకారమే పుజీత్, ఫెర్నాండో అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. కాగా, అరెస్టు సమయంలో ఈ ఇద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం గమనార్హం. (చదవండి : శ్రీలంక పోలీస్ చీఫ్పై వేటు) అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం క్రిమినల్ నెగ్లిజన్స్ తీవ్రమైన హత్యానేరమని డిలివెరా అన్నారు. ఈ ఘటనల్లో మరో తొమ్మిదిమందిపై కూడా అభియోగాలున్నాయని, వారు కూడా విచారణ ఎదుర్కోవచ్చని చెప్పారు. ఇప్పటికే పార్లమెంటరీ విచారణ కమిటీ ముందు హాజరైన జయసుందర, ఫెర్నాండో తమ వాదనలు వినిపించారు. ప్రోటోకాల్స్ను పాటించడంలో విఫలమైన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న హెచ్చరికలను అంచనా వేయలేకపోయారని ఆరోపించారు. -
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత
శ్రీనగర్/జమ్మూ: పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది తొలి బ్యాచ్గా 2,234 మంది భక్తులు ఆదివారం గట్టి భద్రత మధ్య జమ్మూకు చేరుకున్నారు. 2017లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసినందువల్ల ఇప్పుడు బహుళ అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి వచ్చిన 300 అదనపు కంపెనీల భద్రతా దళాలనే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. యాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ యాత్రకు రావడానికి దేశవ్యాప్తంగా ఒకటిన్నర లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 46 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంత్నాగ్ జిల్లాలోని 36 కిలో మీటర్ల పొడవైన పహల్గామ్ మార్గం, గండేర్బల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తాల్ మార్గాల్లో యాత్ర సాగుతుంది. 93 వాహనాలతో కూడిన తొలి వాహన శ్రేణిని గవర్నర్ సలహాదారు కేకే శర్మ ఆదివారం జమ్మూలోని భాగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. -
ఉగ్ర శిబిరంపై దాడికి వాజ్పేయి ఆదేశం!
2001, డిసెంబర్ 13న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పార్లమెంటుపై చేసిన దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయాలని అప్పటి ప్రధాని వాజ్పేయి నిర్ణయించారు. పాక్ తన శిబిరాన్ని వేరే చోటుకు మార్చడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అమెరికాపై అల్ ఖాయిదా దాడి(9/11) నేపథ్యంలో ఆఫ్ఘన్పై యుద్ధానికి దిగిన అమెరికాకు మద్దతివ్వాలని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. దానివల్ల క కలిగే నష్టాలను గుర్తించిన వాజ్పేయి దౌత్యనీతిని ఉపయోగించి నిర్ణయాన్ని దాటవేశారు. ‘ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్: మెమరీస్ ఆఫ్ ఏ మిలటరీ చీఫ్(గుర్తుంచుకోదగిన ప్రధాని:సైన్యాధిపతి జ్ఙాపకాలు) పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్ కుమార్ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. పార్లమెంటుపై దాడి జరగ్గానే త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాలతో సమావేశమయ్యారు. పీవోకేలో ఉన్న ఉగ్ర శిక్షణా శిబిరంపై దాడికి అన్ని నిర్ణయించాం. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, పాకిస్తాన్ ఆ శిబిరాన్ని ఒక స్కూలు, హాస్పటల్ మధ్యకి మార్చినట్టు చివరి నిముషంలో తెలిసింది. శిబిరంపై దాడి చేస్తే జననష్టం జరుగుతుందన్న భావంతో ప్రధాని వాజ్పేయి దాడి చేయవద్దన్నారు. అని సుశీల్ తన 135 పేజీల పుస్తకంలో పేర్కొన్నారు. -
నైజీరియాలో ఆత్మాహుతి దాడి
కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రద్దీ ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 30 మంది మరణించగా.. 40 మందికి గాయాలయ్యాయి. నైజీరియా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 38 కి.మీ దూరంలో ఉన్న కొండుగ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన తీరును బట్టి ఇది బొకో హరామ్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారి పనిగా అనుమానిస్తున్నామని ఆ దేశ అత్యవసర విభాగ అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఫుట్బాల్ అభిమానులందరూ కలిసి ఓ హాల్లో మ్యాచ్ను వీక్షిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీరిలో ఓ వ్యక్తిని సదరు హాల్ యజమాని నిలువరించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయిం దని.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక ఆత్మరక్షణ దళ నేత హాసన్ వెల్లడించారు. అప్పటికే జనాల్లోకి చేరుకున్న ఇద్దరు వ్యక్తులు సహా ఈ వ్యక్తి తమను తాము పేల్చుకున్నారని వెల్లడించారు. తొమ్మిది మంది ఘటనా స్థలిలోనే మరణించగా మిగతా వారు చికిత్స పొందుతూ కన్నుమూశారని చెప్పారు. ఎమర్జెన్సీ దళాలు ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని అత్యవసర విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్ను చికిత్స కోసం శ్రీనగర్కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పాక్లో హోటల్పై దాడి
కరాచీ: పాకిస్తాన్లోని తీరప్రాంత నగరం గ్వదర్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రఘటనలో హోటల్ సెక్యూరిటీ గార్డు, ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. శనివారం సాయంత్రం పెర్ల్ కాంటినెంటల్ ఫైవ్స్టార్ హోటల్ వద్ద ముగ్గురు సాయుధ దుండగులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ హోటల్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డగించిన హోటల్ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపారు. వెంటనే స్పందించిన ప్రత్యేక బలగాలు ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో హోటల్లోని కొందరు సందర్శకులు, సిబ్బంది గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడి ఘటనకు తమదే బాధ్యతంటూ నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో వెంటనే హోటల్లో ఉన్న విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న గ్వదర్..పాక్లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతం. వేలాది కోట్ల రూపాయల చైనా నిధులతో ఇక్కడ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల ఏప్రిల్ 18వ తేదీన ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. -
శ్రీలంక పోలీస్ చీఫ్పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకు పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరను అధ్యక్షుడు సిరిసేన సోమవారం సస్పెండ్ చేశారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్ చేశారు. సీనియర్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్ చీఫ్గా, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇళంగకూన్ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. బాంబు పేలుళ్లకు నేతృత్వం వహించినట్లుగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కుటుంబంలో 18 మంది కనిపించకుడా పోయారనీ, వారంతా చనిపోయుంటారని తనకు భయంగా ఉందని జహ్రాన్ సోదరి మహ్మద్ హషీమ్ మథానియా చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు రాత్రి నుంచి తమ కుటుంబంలో ఐదుగురు కనిపించకుండా పోయారనీ, వారిలో తన తండ్రి, ముగ్గురు తన సోదరులు, మరొకరు తన సోదరి భర్త ఉన్నారని ఆమె తెలిపారు. మళ్లీ శుక్రవారం రాత్రి సైందమరుదు పట్టణంలో పోలీసులు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు సహా 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ముసుగుపై నిషేధం అమల్లోకి ఈస్టర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ముస్లిం మహిళలెవరూ బహిరంగ ప్రదేశాల్లో మొహానికి ముసుగులు ధరించకుండా తీసుకొచ్చిన నిషేధం అమల్లోకి వచ్చింది. ముఖం కనిపించకుండా ఎలాంటి ముసుగులూ ధరించకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
క్షమించండి ఆ విషయంలో తప్పుచేశాం : శ్రీలంక
కొలంబో : ఈస్టర్ పండుగ సందర్భంగా గత ఆదివారం శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 359 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ దాడులతో అప్రమత్తమైన శ్రీలంక ప్రభుత్వం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. నిందితులను పట్టుకునేందుకు సీఐడీని రంగంలోకి దింపింది. ఈనేపథ్యంలో పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇందులో ముగ్గురి మహిళల పాత్ర ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫొటోల విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో ప్రచురించి చేతులు కాల్చుకుంది. తీరా ఈ విషయంపై సదరు వ్యక్తి నిలదీయడంతో తప్పును గుర్తించి క్షమాణలు కోరింది. శ్రీలకం ప్రభుత్వం ప్రకటించిన అనుమానస్పదుల జాబితాలో ఫాతిమా ఖాదీయా ఉగ్రవాదికి బదులు అమెరికా సామాజిక కార్యకర్త అమరా మజీద్ ఫొటోను ప్రచురించింది. ఈ విషయాన్ని గుర్తించిన అమరా మజీద్ ట్విటర్ వేదికగా తనేలాంటి ఉగ్రదాడుల్లో పాలుపంచుకోలేదని, అనవసరంగా నా ఫొటోను ఎందుకు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ ఉదయం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాల్లో నా ఫొటోను గుర్తించాను. ఈస్టర్ పండుగ నాడు శ్రీలంకలో జరిగిన దాడులతో నాకేమి సంబంధం లేదు. ఇప్పటికే మా ముస్లిం వర్గం నిఘా అధికారుల తప్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోసారి ఇలాంటి తప్పుడు నిందారోపణలు చేయవద్దు. ఒక సారి పున:సమీక్ష జరపండి. దయచేసి ఈ మారణహోమంతో నాకు అంటగడుతూ నిందలు మోపడం ఆపండి. ఇలాంటి సమాచారాన్ని అందించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే తప్పుల వల్ల అమయాకుల కుటుంబం, కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది’ అని వరుస ట్వీట్లతో శ్రీలంక ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ట్వీట్లతో మేల్కొన్న శ్రీలంక ప్రభుత్వం సామాజిక కార్యకర్తైనా అమరా మజీద్కు క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘ ఈ రోజు మీడియాకు విడుదల చేసిన ఆరుగురు అనుమానస్పద ఉగ్రవాదుల విషయంలో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. సీఐడీ అందించిన సమాచారం మేరకు మేం ఫాతిమా ఖాదీయా అనే ఉగ్రవాది ఫొటోను ప్రచురించడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఐడీ అందించిన సమాచారం ప్రకారం ఆ ఫొటో ఫాతిమా ఖాదీయాది కాదు. అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్తది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం. ఆమె ఫొటోను వెంటనే తొలగిస్తున్నాం.’ అని పేర్కొంది. ఈ విషయాన్ని అమరా మజీదే ట్విటర్ వేదికగా తెలియజేసింది. తన ఫొటోను ఆ జాబితా నుంచి తొలిగించారని పేర్కొంది. ఏది ఏమైనప్పటికి దాడులకు ఏమాత్రం సంబంధం లేని ముస్లిం మహిళను ఉగ్రవాదుల జాబితాలో ప్రకటించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ముస్లిం పేరు కనిపిస్తే ఉగ్రవాదులేనన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. UPDATE: Sri Lankan police issues apology for wrongly using my photographs in the WANTED list of terror suspects.#EasterSundayAttacksSL #SriLankaAttack #SriLanka #SriLankaBlasts pic.twitter.com/ClejPkh6OF — Amara Majeed (@AmaraMajeed1) 25 April 2019 -
లంకకు ఉగ్ర ముప్పు!
కొలంబో: శ్రీలంకకు ఇంకా ఉగ్రవాద దాడుల ముప్పు ఉండొచ్చని ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు. ప్రస్తుతం తాము స్లీపర్సెల్స్పై దృష్టి సారించామని తెలిపారు. తాజా పేలుళ్ల నిందితులతోపాటు స్లీపర్లుగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇంకా పేలుళ్లు జరగొచ్చనే అనుమానంతో ఇలా చేస్తున్నామని తెలిపారు. అధ్యక్షుడి సూచనమేరకు రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. మరోవైపు ఈస్టర్ పేలుళ్లలో బుధవారం నాటికి 359 మంది మరణించారని శ్రీలంక ప్రకటించడం తెలిసిందే. మృతిచెందిన వారి సంఖ్య 253 మాత్రమేనని గురువారం ప్రకటించింది. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక గురువారం రాత్రి విడుదల చేసింది. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్ అరైవల్ (ఆగమనాంతర వీసా) అవకాశాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం 39 దేశాల ప్రజలకు శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం గతంలో ఉండేది. పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీలంక ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చింది. అయితే గత ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లకు విదేశాలతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో తాజాగా వీసా ఆన్ అరైవల్ను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేసింది. మరో 16 మంది అరెస్టు.. పేలుళ్లకు సంబంధించి తాజాగా మరో 16 మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కి పెరిగింది. శ్రీలంకలో అత్యంత విజయవంతమైన జనరల్గా పేరున్న, ఎల్టీటీఈ ప్రభాకరన్ను అంతమొందించిన సమయంలో ఆర్మీకి నేతృత్వం వహించిన ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా మాట్లాడుతూ ఈ దాడులకు వ్యూహ రచన చేసిన వ్యక్తికి ప్రభాకరన్కు ఉన్నంతటి సమర్థత ఉండి ఉంటుందని అన్నారు. -
అమర జవాన్లకు సెల్యూట్
న్యూఢిల్లీ/లక్నో/జైపూర్: ఉద్వేగం ఉప్పొంగింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. మాతృ దేశ సేవలో నేలకొరిగిన అమర జవాన్లకు తుది వీడ్కోలు పలికేందుకు దేశమంతా కదిలొచ్చింది. మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. పుల్వామా దాడిలో అసువులు బాసిన ధీశాలుల అంత్యక్రియలు శనివారం దేశవ్యాప్తంగా వారివారి స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో జరిగాయి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఓ వైపు, తమలో ఒకరు ఇక లేరని వేదన మరోవైపు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ..ఒక్కో వ్యథ. ఇంతటి విషాద సమయంలో జాతి అంతా ఒక్కటై ముష్కరుల కుట్రకు బలైన భరతమాత ముద్దు బిడ్డల సేవలను శ్లాఘిస్తూ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసేశారు. తమ గ్రామానికి చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాల్ని కడసారి చూసేందుకు ప్రజలు వీధుల్లో రోడ్లకు ఇరు వైపులా నిలబడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి తమ స్వరాష్ట్రాలకు వెళ్లి అక్కడి మంత్రులతో కలసి వీర జవాన్ల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం కప్పిన జవాన్ల భౌతిక కాయాలను ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు సమీపంలోని విమానాశ్రయాలకు తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్లోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి చితికి నిప్పంటించగా, రాజస్తాన్లో రెండు నెలల పసిగుడ్డుతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం కంటతడిపెట్టించింది. రాజస్తాన్లో... రోషితాష్ లాంబా(జైపూర్), నారాయణ్లాల్ గుర్జార్(రాజసమంద్), జీత్రామ్(భరత్పూర్), భగీరథ్సింగ్(ధోల్పూర్), హేమరాజ్ మీనా(కోట)ల అంతిమయాత్రలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’, ‘భారత్ మాతాకీ జై’నినాదాలు మిన్నంటాయి. ఉత్తరాఖండ్లో.. ఉద్ధమ్సింగ్ నగర్ జిల్లాలోని మహ్మద్పూర్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి వీరేంద్రసింగ్ చితికి నిప్పు పెట్టిన దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సహచరుడికి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఇక డెహ్రాడూన్లో జరిగిన మోహన్లాల్ అంత్యక్రియలకు అశేష జనం హాజరయ్యారు. పంజాబ్లో.. మోగా జిల్లాలోని గలౌటీ కుర్ద్ గ్రామంలో అమర జవాను జైమల్ సింగ్ మృతదేహానికి ఐదేళ్ల ఆయన కొడుకు గురుప్రకాశ్ నిప్పు అంటించాడు. గురుదాస్పూర్లో మణిందర్ సింగ్ భౌతికకాయానికి ఆయన తమ్ముడు, సీఆర్పీఎఫ్ జవాన్ అయిన లక్వీర్ సింగ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇక రూప్నగర్లో 26 ఏళ్ల కుల్వీందర్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల్వీందర్ సింగ్ భౌతికకాయాన్ని చూసి ఆయనకు కాబోయే భార్య సొమ్మసిల్లిపడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ఒడిశాలో.. పుల్వామా దాడిలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్ సాహూ, కటక్కు చెందిన మనోజ్కుమార్ల భౌతికకాయాలను స్వీకరించేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి వేలాది మంది తరలివచ్చారు. మహారాష్ట్రలో.. అమర జవాన్లు నితిన్ శివాజీ రాథోడ్(36), సంజయ్ సింగ్ దీక్షిత్(47)ల భౌతికకాయాలను శనివారం ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు పంపించారు. తమిళనాడులో.. అమర జవాన్లు జి.సుబ్రమణ్యం, సి.శివచంద్రన్ భౌతికకాయాలకు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. కర్ణాటకలో.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న అమర జవాన్ 33 ఏళ్ల హెచ్. గురు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్లో.. కానౌజ్ జిల్లాలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన పదేళ్ల కూతురు సుప్రియ సొమ్మసిల్లింది. ఆయన రెండో కూతురు రెండున్నరేళ్ల చిన్నారిది అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని మహరాజ్గంజ్, ఆగ్రా, మేన్పురి, ఉన్నావ్, కాన్పూర్, దెహాట్, చందౌళి జిల్లాల్లోనూ అమర జవాన్ల అంత్యక్రియల్లో ఇలాంటి గంభీర వాతావరణమే కనిపించింది. మాతృదేశ సేవలో నేలకొరిగిన సైనికుల సాహసాలను కీర్తిస్తూ వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు. పుల్వామా దాడికి కారకులను శిక్షించాలని అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, అధికారుల్ని డిమాండ్ చేశారు. దియోరియా జిల్లాలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తేనే తన భర్త విజయ్ మౌర్య అంత్యక్రియలకు అంగీకరిస్తానని ఆయన భార్య విజయ్ లక్ష్మి పట్టుపట్టారు. మంత్రి అనుపమా జైస్వాల్, ఇతర నాయకులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చందౌళిలో అవధేశ్ యాదవ్ అంత్యక్రియలు గంగా నదీ తీరంలో నిర్వహించారు. మహరాజ్గంజ్లోని ఓ పాఠశాలకు అమర జవాను పంకజ్ త్రిపాఠి పేరు పెడతామని కేంద్ర మంత్రి శివప్రతాప్ శుక్లా ప్రకటించారు. తుదిహార్లో మహేశ్ యాదవ్ భౌతికకాయం వద్ద రోదిస్తున్న బంధువు.. కర్ణాటకలోని దొడ్డి గ్రామంలో విలపిస్తున్న హెచ్ గురు కుటుంబసభ్యులు ఆగ్రాలో కుశల్కుమార్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యుల రోదన.. కోల్కతాలో సుదీప్బిశ్వాస్ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు -
పాక్ను దెబ్బకొట్టేదెలా?
పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ వీలున్నన్ని దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చైనా మినహా దాదాపు అన్ని ప్రధాన దేశాలు భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే దౌత్యపరమైన దెబ్బ కొడితే.. దీని ప్రభావం ఉన్మాదపు పాక్పై కనిపించేందుకు సమయం పడుతుంది. కానీ 40 మంది సహచరుల ప్రాణాలను తీసిన పాక్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతాదళాల రక్తం మరుగుతోంది. కశ్మీర్లో జరిగే ప్రతీ దాడి వెనుక పాక్ హస్తం ఉంటోందని.. స్పష్టమైన ఆధారాలు లభించాక కూడా ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అంటూ బలగాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఎన్నేళ్లు ఉన్మాద పొరుగుదేశం ఆగడాలను సహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనిపట్టడానికి సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడంతో మిలటరీ తన ముందున్న మార్గాలను విస్తృతంగా పరిశీలిస్తోంది. యుద్ధ విమానాల మోహరింపు పాక్పై చర్యలకు అన్నిరకాల దౌత్య మార్గాలను పరిశీలిస్తూనే.. అవసరమైతే దాడి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే.. ఇప్పటికే సరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలను మోహరించింది. భారత్ వాయుసేన సత్తా చాటేలా.. వాయుశక్తి విన్యాసాలు చేయాలని కొద్ది నెలల క్రితమే భారత్ భావించింది. ఇందుకోసమే జాగ్వార్ ఫైటర్ విమానాలు, మిరాజ్–2000 విమానాలను, మల్టీ–రోల్ జెట్స్ను మోహరించింది. విన్యాసాల కోసం మోహరించిన ఈ యుద్ధ విమానాలతోనే ఇపుడు పాక్పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. అప్రమత్తమైన పాక్.. టెర్రరిస్టులు వెనక్కి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించకుండా కఠినమైన చర్యల్ని తీసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తూ ఉండటంతో పాక్ అప్రమత్తమైంది. కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల్ని వెనక్కి రప్పిస్తోంది. ఎన్నో ఉగ్రవాద శిబిరాలను మూసివేస్తోంది. ప్రతీకార దాడుల కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఉగ్రవాద స్థావరాలే భారత్ మొదటి టార్గెట్ అని గుర్తించిన పాక్ సరిహద్దులను ఖాళీ చేస్తోంది. మిలటరీ ముందున్న మార్గాలివే! ► పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండానే అత్యాధునిక యుద్ధ విమానాలతో పాక్ దిమ్మ తిరిగేలా దాడులకు దిగడం. సూటిగా పయనించే గైడెడ్ బాంబులు, క్షిపణులు అమర్చిన సుఖోయ్–30 ఎంకేఐ, మిరాజ్–2000, జాగ్వార్ ఫైటర్ విమానాలను ప్రయోగించి ఉగ్రవాదుల కీలక స్థావరాలను ధ్వంసం చేయడం. ఇప్పటికే సైనిక విన్యాసాల కోసం సరిహద్దుల్లో విమానాలు మోహరించి ఉండటంతో ఈ దాడుల్ని చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. ► భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలకు కారణం.. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోజేకే). ఆ ప్రాం తంలో నిర్దేశిత లక్ష్యాలపై వైమానిక దాడులు లేదంటే బ్రహ్మోస్ క్షిపణితో దాడికి పాల్పడటం. ► సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి నెలరోజులకు పైగా నిర్విరామంగా కాల్పులకు దిగడం. వాస్తవాధీన రేఖ వెంట భింబెర్ గలీ వంటి ప్రాంతాల నుం చి ఇలాంటి కాల్పులు జరిపితే భారతీయ సైనికులకు భద్రంగా ఉంటుంది. భారత ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సైన్యాన్ని మోహరించింది. ► 2016లో ఉడీలో సైనిక శిబిరంపై దాడి చేశాక పీవోజేకేలోని ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక బలగాలు మెరుపు దాడులకు పాల్పడినట్లుగా.. మరోసారి సర్జికల్ స్ట్రైక్తో ఉగ్రస్థావరాలపై దాడులకు పాల్పడటం. అయితే.. సర్జికల్ స్ట్రైక్స్పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో చేసిన ఈ తరహా దాడుల వల్ల పాక్కు బుద్ధి రాకపోగా.. వరుసగా దాడులకు పాల్పడుతోంది. అందుకే పాక్ మిలటరీపైనే నేరుగా దాడులు చేసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించకుండా కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ► వాస్తవాధీన రేఖ చొరబాట్ల్లకు క్షేమం కాదని ఉగ్రవాద సంస్థలు గుర్తించేలా విస్తృత స్థాయిలో దాడులు జరపడం. ► పూంచ్, ఉడీ పట్టణాలను కలిపే కీలకమైన హజీపీర్ మార్గం ద్వారా చొరబాట్లు అత్యధికంగా ఉంటున్నాయి. 1965 పాక్ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ తన దళాన్ని అక్కడ్నుంచి ఉపసంహరించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని పాక్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తోంది. ఆ ప్రాంతంలో మళ్లీ సైన్యాన్ని మోహరించి చొరబాట్లను అణచివేయడం. ► పాక్ సైనిక, ఉగ్రవాద శిబిరాలు, ఇతర కీలక స్థావరాలను నాశనం చేయడానికి 90 కిలోమీటర్ల రేంజ్లో సమర్థవంతంగా పనిచేసే స్మెర్చ్ (బీఎం–30) రాకెట్ల వ్యవస్థలు, 290 కిలోమీటర్ల రేంజ్లో పనిచేసే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను యుద్ధవిమానాలతో ప్రయోగించి మెరుపు దాడులకు దిగడం. ► జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను భారత్కు తీసుకువచ్చేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం. ఇస్లామాబాద్లో భారత్ హైకమిషనర్ అజయ్ బిస్రాయ్వెనక్కి పిలిపించడం ద్వారా దౌత్యపరంగా పాక్కు ఒంటరిని చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతోంది. -
కశ్మీరీలకు రక్షణ ఇవ్వండి: కేంద్రం
న్యూఢిల్లీ: దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కశ్మీర్ ప్రజలు, విద్యార్థులపై దాడుల నేపథ్యంలో వారి రక్షణకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది. తమ ఆస్తులపై దాడులు జరుగుతాయన్న భయంలో ఉత్తరాఖండ్లో కశ్మీరీలకు అద్దెకిచ్చిన వారి గృహ యాజమానులు భయపడి, కశ్మీరీలను ఖాళీచేయిస్తున్నట్టు సమాచారం అందినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇళ్లు ఖాళీ చేసిన కశ్మీరీలు అంబాలా: గ్రామంలో అద్దెకుంటున్న కశ్మీరీలను వెనక్కి పంపాలని హరియాణాలోని అంబాలా గ్రామపంచాయతీ తమ గ్రామస్తులను ఆదేశించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఒక వీడియో ప్రకారం, ములానా గ్రామ సర్పంచ్ నరేశ్ ఒక వీడియో ద్వారా సందేశమిచ్చారు. ‘దాడిలో కొందరు కశ్మీరీల ప్రమేయం ఉంది. 24 గంటల్లోగా అద్దెకుంటున్న కశ్మీరీలను పంపించివేయాలి’ అని వీడియోలో ఉంది. వీడియోను చూసిన కొందరు కశ్మీరీలు ఇళ్లు ఖాళీచేసి యూనివర్సిటీ హాస్టల్కు మకాం మార్చినట్లు సమాచారం. అంబాలాలోని వర్సిటీల్లో దాదాపు 1,200 మంది కశ్మీరీలు చదువుతున్నట్టుగా సమాచారం. -
దాడి సూత్రధారి ఉమేర్
దాడికి జైషే మొహమ్మద్(జేఈఎం)కు చెందిన మహ్మద్ ఉమేర్ వ్యూహరచన చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉమేర్ అఫ్గాన్లో శిక్షణ పొందాడని, ఆ అనుభవంతో దాడికి పథక రచన చేశాడన్నారు. జైషే చీఫ్ మసూద్ అజహర్కు ఉమేర్ స్వయానా సోదరుడి కొడుకని చెప్పారు. దాడికి ఉమేర్ సూత్రధారి కాగా, మరో ఇద్దరు ఆర్డీఎక్స్ బాంబును రూపొందించారని ఎన్ఐఏ అధికారులు అన్నారు. బాంబును తయారుచేసిన ఇద్దరు ఇప్పటికే సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోకి వెళ్లిపోగా, ఉమేర్ మాత్రం దాడిని పర్యవేక్షించేందుకు పుల్వామాలోనే ఆగిపోయాడని తెలిపారు. అతని కోసం భద్రతాబలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయన్నారు. మసూద్ అజహర్కు బంధువైన హైదర్ 2018, అక్టోబర్లో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో, అతని స్థానంలో ఉమేర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. సిరియా, అఫ్గాన్ తరహాలో.. సిరియా, అఫ్గానిస్తాన్లోని అమెరికా బలగాలు లక్ష్యంగా తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు కారుతో పుల్వామా తరహాలో ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్లో ఉగ్రవాదుల దగ్గర శిక్షణ పొందిన ఉమేర్ దాన్ని కశ్మీర్లో పక్కాగా అమలు చేశాడు. ఈ ఆత్మాహుతి దాడి కుట్ర రషీద్ ఘజీ, కమ్రాన్ అనే ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ)తో కలిసి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జమ్మూ–కశ్మీర్ జాతీయ రహదారికి సమీపంలో పుల్వామా–పొంపోర్ల మధ్య 20–25 కిలోమీటర్ల ప్రాంతం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామనీ, గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు అధికారులు ఈ ప్రాంతంలో సెల్ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దాడి జరగడానికి 48 గంటల ముందు వరకూ ఇంటర్నెట్ ద్వారా వెళ్లిన కాల్స్, సందేశాలను విశ్లేషిస్తున్నారు. ఐఎస్ఐ మునీర్ ముద్ర! దాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ముద్ర కనిపిస్తోంది. పాక్ ఉత్తర ప్రాంతాల కమాండర్గా పనిచేసిన మునీర్కు కశ్మీర్పై పూర్తి అవగాహన ఉందని ఐఎస్ఐ నిపుణులు వెల్లడించారు. ఐఎస్ఐ చీఫ్గా మునీర్ను గత ఏడాది అక్టోబర్లో పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా నియమించారు. పుల్వామా దాడి జరిపిన జైషే మహ్మద్తోనే గతంలో కశ్మీర్లో ఐఎస్ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చేయించింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్షకు గురైన అఫ్జల్ గురు వర్ధంతి సమయంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇంతటి భారీ దాడి చేయించడానికి ఐఎస్ఐ కుట్ర పన్నిందని పాక్ నిఘా సంస్థ గురించి తెలిసిన వారంటున్నారు. కానీ, తన పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి దాడిని కొద్ది రోజులు వాయిదా వేసింది. ‘ఇది అమలు జరిగిన తీరులో ఐఎస్ఐ చీఫ్ ముద్ర కనిపిస్తోంది’ అని కేబినెట్ సెక్రెటేరియట్లో పనిచేసిన తిలక్ దేవాశర్ తెలిపారు. -
బ్లాక్లిస్ట్లో పాకిస్తాన్!
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఎఫ్ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్కు పాకిస్తాన్ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్ ఎండగట్టనుంది. ఈ పత్రాలను భద్రతా సంస్థలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పారిస్లో జరిగే సమావేశంలో పాకిస్తాన్ను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో చేర్చాల్సిందిగా కోరతామని తెలిపారు. మనీ లాండరింగ్తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయమందించే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు సదరు దేశపు రేటింగ్ను డౌన్గ్రేడింగ్ చేస్తాయి. దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణసాయం, పెట్టుబడులు నిలిచిపోతాయి. అలాగే ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు సైతం పెట్టుబడులపై రిస్క్ రేటింగ్లను తగ్గించేస్తాయి. తద్వారా నిషేధిత దేశానికి అన్నివైపుల నుంచి దారులు మూసుకుపోతాయి. 2018, జూలైలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ పాక్ను ‘గ్రే’ జాబితాలో చేర్చింది. నిర్దేశిత నిబంధనలను పాటించకుంటే నిషేధిత జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. ఎఫ్ఏటీఎఫ్లో 35 దేశాలు, ఈయూ కమిషన్, గల్ఫ్ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేర్చింది. -
ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం
యావత్మల్/ధూలె(మహారాష్ట్ర): పాకిస్తాన్ ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా బలగాలపై నమ్మకం ఉంచి ఓపికగా ఎదురుచూడాలని, ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలోని యావత్మల్, ధూలెలో ప్రధాని శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి బహిరంగ సభల్లో మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రదాడి పట్ల దేశమంతా ఆగ్రహంతో ఉన్న సంగతి స్పష్టంగా తెలుస్తోందని, అందరి కళ్లు చెమర్చాయని అన్నారు. ప్రతి కన్నీటి బొట్టుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. మన సైనికులు లక్ష్యంగా బాంబులు, మారణాయుధాలు సమకూర్చే ఎవరినీ ‘నవ భారతం’ ఉపేక్షించదని అన్నారు. వాళ్ల త్యాగం వృథాగా పోదు.. ‘దేశ విభజన తరువాత ఉనికిలోకి వచ్చిన దేశం ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. దివాలా అంచుకు చేరిన ఆ దేశం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది’ అని యావత్మల్లో జరిగిన బహిరంగ సభలో పాక్ పేరును ప్రస్తావించకుండా మండిపడ్డారు. పుల్వామా దాడి తరువాత దేశం తీవ్ర నొప్పిని అనుభవిస్తోందని, అమర జవాన్ల త్యాగాలను వృథా కానీయమని చెప్పారు. నాగ్పూర్లోని అజ్నీ–పుణే రైలు సేవలను ప్రారంభించి, స్వయం సహాయక బృందాలకు చెక్కులు అందించారు. విషాదంలోనే సంయమనమూ ఉండాలి.. ఉత్తర మహారాష్ట్రలోని ధూలెలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. విషాదం నిండిన ఈ సమయంలోనే సంయమనంతో వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. ‘మనది కొత్త విధానాలు, పద్ధతులతో కూడిన నవ భారతం. ఈ సంగతి ప్రపంచానికి కూడా తెలుస్తుంది’ అని అన్నారు. ‘పుల్వామా’తో మోదీ ప్రచారం: కాంగ్రెస్ పుల్వామా దాడి కేంద్రంగా జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ‘రాజకీయ పార్టీలన్నీ విభేదాలు విడనాడి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చిన మోదీ..తాను మాత్రం సొంత పార్టీకి ప్రచారం చేస్తూ జాతీయభావాలు రెచ్చగొడుతున్నారు. అమర జవాన్ల మృతదేహాలు ఇంకా వారి స్వస్థలాలకు చేరుకోకముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు’ పేర్కొంది. మమ్మల్ని బెదిరించలేరు: పాక్ ఇస్లామాబాద్: ఉగ్రదాడి ఘటనపై తమను ఎవరూ బెదిరించలేరని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ తెలిపారు. ఈ ఘటనలో భారత్ ఆధారాలు సమర్పిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్ భద్రతా సదస్సులో పాల్గొంటున్న ఖురేషీ మాట్లాడుతూ..‘ఉగ్రదాడి జరగ్గానే ఏమాత్రం విచారణ జరపకుండా పాక్ను భారత్ నిందిస్తోంది. సాక్ష్యాలులేని ఆరోపణలను ప్రపంచం అంగీకరించదు. మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. పాకిస్తాన్ శాంతిని మాత్రమే కోరుకుంటోంది. ఘర్షణను కాదు. ప్రపంచదేశాల ముందు మా వాదనల్ని కూడా వినిపిస్తాం’ అని పేర్కొన్నారు. -
దేశమంతా ఒకే గళం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయి. ఉగ్రదాడి అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలిపి, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం తామంతా కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని పార్టీలన్నీ ఆమోదిస్తూ దాడిని, ఉగ్రవాదులకు సరిహద్దుల అవతలి నుంచి అందుతున్న సాయాన్ని ఖండించాయి. అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పిలిచి ప్రధాని మోదీ ఓ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత ఆజాద్ సూచించారు. ఆయన సూచనను తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్, సీపీఐ నాయకుడు డి.రాజ సమర్థించారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన తీర్మానంలో ‘ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటిరకు స్థైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ నిశ్చయంతో ఉందని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. ఉగ్రవాదులతో పోరాడి దేశాన్ని రక్షిస్తున్న భద్రతా దళాలకు మేం అంతా సంఘీభావం తెలుపుతున్నాం’ అని నేతలు పేర్కొన్నారు. పాక్ను పరోక్షంగా పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదం కారణంగా సమస్యలను ఎదుర్కుంటోందని తీర్మానం తెలిపింది. అంతకుముందు రాజ్నాథ్ మాట్లాడుతూ ఉగ్రదాడి గురించి, శుక్రవారం తన కశ్మీర్ పర్యటన వివరాలు అందరికీ తెలియజేశారు. ‘ఉగ్రవాదంపై పోరును అర్థవంతమైన దిశలో చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. బలగాల త్యాగాలు ఊరికేపోవు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు శాంతి కావాలి. వారు మనతోపాటే ఉన్నారు. కానీ కొన్ని సంఘవిద్రోహ శక్తులు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు’ అని రాజ్నాథ్ ఇతర నాయకులకు తెలిపారు. సర్జికల్ దాడి ప్రభావం లేదు: సంజయ్ బీజేపీ మిత్రపక్షం శివసేన నేత సంజయ్ రౌత్ అఖిలపక్ష భేటీలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి స్ఫూర్తిని పొంది (ఇందిర నేతృత్వంలో 1971 యుద్ధంలో పాక్పై భారత గెలుపు) పాకిస్తాన్ను నేరుగా దెబ్బ కొట్టాలని అన్నారు. కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్ స్ట్రైక్స్ పాక్పై ఏమైనా ప్రభావం చూపి ఉంటే ఇప్పుడు ఈ దాడి జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు. లాహోర్, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్ లోపలి భాగాలపై దాడి జరగాలన్నారు. ఉడీ సైనిక శిబిరంపై 2016లో ఉగ్రవాదులు దాడి జరిపిన అనంతరం ప్రతీకారంగా పాక్–భారత్ సరిహద్దుల్లో, నియంత్రణ రేఖకు అవతల, పాక్ వైపున ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, సింధియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్ఎల్ఎస్పీ నుంచి ఉపేంద్ర కూష్వాహ, ఆర్జేడీ నాయకుడు జయ ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తోమర్ చదివి వినిపించారు. దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగొచ్చన్న సమాచారం ఉన్నప్పటికీ ప్రజలంతా సంయమనాన్ని పాటించాలన్న అంశం ఈ తీర్మానంలో లేకపోవడం తనను నిరాశ పరిచిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు ఉగ్రవేటకు చర్యలు భద్రతా సమీక్షలో రాజ్నాథ్ దాడి జరిగిన రెండ్రోజుల అనంతరం శనివారం దేశవ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితులపై హోం మంత్రి రాజ్నాథ్ సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దుతోపాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితిని అధికారులు రాజ్నాథ్కు ఈ సమావేశంలో వివరించినట్లు హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న భద్రతా చర్యలను హోం మంత్రికి అధికారులు వివరించారు. జమ్మూ కశ్మీర్లోని వేర్పాటు వాదులకు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణపై సమీక్ష నిర్వహించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వేర్పాటు వాదులకు భద్రతను ఉపసంహరించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా గుడిగెరె గ్రామంలో అమర జవాన్ హెచ్.గురు అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు భోపాల్లో కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది -
త్యాగాలకు మా బిడ్డలంతా సిద్ధం
భోపాల్: దేశం కోసం తమ బిడ్డలందరినీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు మధ్యప్రదేశ్లోని కుదవాల్ సిహోరా గ్రామస్థులు. పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఈ గ్రామానికి చెందిన 36 ఏళ్ల అశ్విన్ కచ్చి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే దేశం కోసం తమ బిడ్డ ప్రాణాలర్పించినందుకు తామెంతో గర్వపడుతున్నామని.. మిగతా బిడ్డలను కూడా సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అశ్విన్ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుకు అశ్విన్ లాంటి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మా గ్రామానికి చెందిన దాదాపు 30 మంది ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరెంతోమంది యువకులు సైన్యంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు' అన్నారు. -
ముగిసిన అఖిలపక్ష సమావేశం
-
ఉగ్రదాడిపై ముగిసిన అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా చేసిన మూడు తీర్మానాలను అఖిలపక్షం ఆమోదించింది. ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు సైనికులకు దేశమంతా అండగా నిలబడి ఉందని అఖిలపక్షం అభిప్రాయపడింది. -
పాక్కు ఆ స్టేటస్ను కొనసాగించండి.. కానీ
న్యూఢిల్లీ : ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ (ఎమ్ఎఫ్ఎన్)ను భారత ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టేటస్ను కొనసాగించాలని, కానీ ఎమ్ఎఫ్ఎన్లోని ‘ఎఫ్’ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సెటైరిక్గా ట్వీట్ చేశాడు. I have some news for Pakistan. We should continue their ‘MFN’ status. Only thing is, that this time we the civilians will decide what ‘F’ stands for. https://t.co/5SsC6BlDvT — Gautam Gambhir (@GautamGambhir) February 16, 2019 ‘పాకిస్తాన్ గురించి ఓ వార్త విన్నాను. మనం ఆ దేశానికిచ్చిన ఎమ్ఎఫ్ఎన్ స్టేటస్ను కొనసాగిద్దాం. కానీ ఇందులోని ఎఫ్ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్పై భారత నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుండగా పాక్ నెటిజన్లు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత నెటిజన్లు ఎఫ్కు తమ తోచిన అర్థాన్ని ఇస్తూ కామెంట్ చేస్తుండగా.. పాక్ నెటిజన్లు మాత్రం.. ఈ దాడిలో తమ దేశ ప్రమేయమే లేదని సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసిన గంభీర్.. ఇప్పటి వరకు జరిగింది చాలని.. వెంటనే పాకిస్తాన్తో యుద్దం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఉగ్రదాడిని ఖండించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఎమ్ఎఫ్ఎన్ స్టేటస్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకిని చేస్తామని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు. (చదవండి: ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్) -
పాక్ హైకమిషనర్కు భారత్ సమన్లు..!
-
విషాదం..కూతురుని చూడకుండానే..
జైపూర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. రాజస్తాన్లోని జైపూర్ సమీపంలోని అమర్సర్లోని గోవింద్పురా గ్రామానికి చెందిన రోహితేష్ లంబా(27) సీఆర్పీఎఫ్ జవాన్గా సేవలందిస్తున్నారు. రోహితేష్ లంబా 25 ఏళ్లకే సీఆర్పీఎఫ్లో ఉద్యోగం రాగా, మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో రోహితేష్ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరీత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతరును చూడలేకపోయారు. బిడ్డను చూసేందుకు సెలవుపెట్టి గోవింద్పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతరును చూడడానికి వస్తాడనుకున్న భర్త ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది. రోహితేష్ లంబా వీరమరణంతో గోవింద్పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
పాకిస్తాన్కు భారత్ సమన్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలను తీసుకోవల్సిందిగా పాకిస్తాన్ హైకమిషనర్కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడిన పాకిస్తాన్కు చెందిన జేషే ఏ మహ్మద్ ఉగ్రసంస్థపై చర్యలు తీసుకుకోని, వాటిని వెంటనే నిషేధించాలని భారత్ అదేశించింది. ఈమేరకు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం పాకిస్తాన్ హైకమిషనర్కు సమన్లు జారీచేశారు. పుల్వామాలో జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, ఉగ్రవాద మూలాలున్న గ్రూపులను, వ్యక్తులను నిలువరించాలని పాక్ను భారత్ ఆదేశించింది. భారత్ సైనికులపై దాడికి పాల్పడ్డ సంస్థలను నిషేధించకుంటే చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. పుల్వామా దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. -
ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై తీవ్రంగా కలత చెందిన గంభీర్.. ఆవేశంగా ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. (చదవండి: ఉగ్ర మారణహోమం) అయితే ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. భూగోళంపై ఉగ్రవాదానికి చోటు లేదని, ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ప్రపంచ దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’) భారత క్రికెటర్ల ట్వీట్స్.. ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కాకుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి. - గౌతం గంభీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం, వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇదో విచారకరమైన వార్త. ఈ దాడిలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. - వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఉగ్రదాడి వార్త తీవ్రంగా కలచి వేసింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - శిఖర్ ధావన్ జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం.. అనేక మంది జవాన్లు ప్రాణాలుకోల్పోవడం వినడానికి చాలా బాధగా ఉంది. ఈ దాడిచేసిన పిరికి పందలకు త్వరలోనే గుణపాఠం కలగాలని ప్రార్థిస్తున్నాను. - మహ్మద్ కైఫ్ ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు నా ఆలోచన, ప్రార్థన అంతా వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల గురించే. -సురేశ్ రైనా సీఆర్పీఎఫ్ జవాన్లపై పిరికిపందలు జరిపిన దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందడం బాధను కలిగిస్తోంది. ఈ బాధను వర్ణించడానికి పదాలు రావడం లేదు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి. - వీరేంద్ర సెహ్వాగ్ -
వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరుగుతుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సెల్ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో దాడి జరిగిన ప్రాంతంలోని భయానక పరిస్థితులను, నష్టాన్ని కళ్లకు కడుతుంది. వీడియోలో ‘చంపేశాడు, చంపేశాడు.. అక్కడ శవాలు పడి ఉన్నాయనే’ మాటలు వినిపిస్తున్నాయి. బహుశా వీడియో తీసిన వ్యక్తి దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని.. ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. సెల్ఫోన్లో తీసిన ఈ వీడియోలో పేలుడు జరిగిన ప్రాంతం, చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు, తుక్కుతుక్కయిన వాహనాలు దాడి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్కు సంబంధించిన చివరి వీడియోను జైషే మొహమ్మద్ సంస్థ విడుదల చేసింది. వెనుక జైషే జెండాతో పాటు చేతిలో తుపాకీ పట్టుకున్న ఆదిల్ ఆ వీడియోలో మాట్లాడుతూ..‘ఈ వీడియోను మీరు చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను. నేను ఏడాది కాలం పాటు జైషే మొహమ్మద్లో పనిచేశాను. కశ్మీర్ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇదే. దక్షిణ కశ్మీర్ చాలాకాలంగా భారత్కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్తో పాటు జమ్మూ ప్రజలు ఈ పోరాటంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. మా కమాండర్లలో కొందరిని చంపేయడం ద్వారా మమ్మల్ని ఎన్నటికీ బలహీనపర్చలేరు’అని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా 2001లో ఐసీఏ18 విమానం హైజాక్, నగ్రోటా, ఉడీ, పఠాన్కోట్ ఉగ్రదాడుల్ని ప్రస్తుతించాడు. పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. -
సీఆర్పీఎఫ్ రాకపై సమాచారం లీక్
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్కు వెళ్లడంపై సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండొచ్చని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని విధుల్లో చేరేందుకు వస్తున్నవారేనని వెల్లడించారు. శ్రీనగర్కు వెళ్లే సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను పాటించాయో? లేదో? విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాల కదలికలు జరిగినప్పుడు ఆ విషయం చాలామందికి తెలుస్తుందని పేర్కొన్నారు. వాళ్లలో కొందరు ఉగ్రవాదులకు బలగాల రాకపై సమాచారం అందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ రహదారిపై గత రెండ్రోజులుగా రాకపోకలు లేకపోవడంతో కాన్వాయ్లో సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో శ్రీనగర్కు బయలుదేరారనీ, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. -
12 కి.మీ వరకూ పేలుడు శబ్దం
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో గురువారం జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో స్థానికులు వణికిపోయారు. లెత్పొరా మార్కెట్కు 300 మీటర్ల దూరంలోనే ఈ దాడి చోటుచేసుకోవడంతో దుకాణదారులు షట్టర్లు మూసేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఆత్మాహుతి దాడి సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్దం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఉన్న శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం పేలుడు శబ్దం వినిపించదన్నారు. పేలుడు తీవ్రతకు ఉగ్రవాది ఆదిల్తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయని జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిని గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. ఈ ఘటనలో జవాన్ల బస్సుతో పాటు స్కార్పియో వాహనం నామరూపాలు లేకుండా పోయాయన్నారు. 2001, అక్టోబర్ 1న జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. తాజాగా ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 43 మంది జవాన్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కశ్మీర్లో ఉగ్రదాడులు 1999 నుంచి ఇప్పటివరకు భద్రతా దళాలపై జరిపిన ప్రధాన దాడులు.. ► 2017 ఆగస్ట్ 26: పుల్వామా జిల్లా పోలీస్ లైన్స్పై ఉగ్రదాడి. ఎనిమిది మంది భద్రత సిబ్బంది మృతి. ► 2016 నవంబర్ 29: నాగ్రోటా వద్ద గల సైనిక ఆయుధాగారంపై దాడి. ఏడుగురు సైనికులు మరణించారు. ► 2016 సెప్టెంబర్ 18: బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఆర్మీ శిబిరంపై నలుగురు పాక్ తీవ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడి చేసింది. ► 2016 జూన్ 25: శ్రీనగర్–జమ్మూ హైవేపై పాంపోర్ వద్ద సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రకాల్పులు. ఎనిమిది మంది జవాన్ల మృతి. ► 2016 జూన్ 3: పాంపోర్లో సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి. దాడి తర్వాత ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు. రెండ్రోజులు కొనసాగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు. ► 2014 డిసెంబర్ 5: మొహ్రాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి. పది మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ► 2013 జూన్ 24: హైదర్పోరా వద్ద సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి. ఎనిమిది మంది సైనికుల మృతి. ► 2008 జూలై 19: శ్రీనగర్–బారాముల్లా రహదారిపై నరబల్ వద్ద రోడ్డు పక్కన ఐఈడీ అమర్చి పేల్చడంతో పది మంది సైనికులు చనిపోయారు. ► 2005 నవంబర్ 2: నౌగమ్లో నాటి సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ఇంటి దగ్గర్లో కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల మరణం. ► 2005 జూలై 20: భద్రతా దళాల కాన్వాయ్పై కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరుల దుర్మరణం. ► 2005 జూన్ 24: శ్రీనగర్ శివార్లలో కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు. తొమ్మిది మంది సైనికుల మృతి. ► 2004 ఏప్రిల్ 8: బారాముల్లా జిల్లాలోని ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై గ్రెనేడ్లతో దాడి. 11 మంది చనిపోయారు. ► 2003 జులై 22: అక్నూర్లో సైనిక శిబిరంపై దాడి. బ్రిగేడియర్సహా ఎనిమిది మంది సైనికుల మరణం. ► 2003 జూన్ 28: సన్జాన్ ఆర్మీ క్యాంప్పై ఆత్మాహుతి దాడి. 12 మంది సైనికుల దుర్మరణం. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం. ► 2002 మే 14: కలుచాక్ ఆర్మీ కంటోన్మెంట్పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు. ► 2001 నవంబర్ 17: రాంబన్లోని భద్రతా దళ స్థావరంపై ఉగ్రదాడి. 10 మంది సైనికులు మరణించారు. నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ► 2001 అక్టోబర్ 1: శ్రీనగర్లోని పాత శాసనసభ కాంప్లెక్స్ వెలుపల కారు బాంబు పేలుడు. 38 మంది దుర్మరణం. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ► 2000 ఆగస్ట్ 10: శ్రీనగర్లోని రెసిడెన్సీ రోడ్లో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడి, కారు బాంబు పేలుడు. 11 మంది సైనికులు, ఓ జర్నలిస్టు మరణించారు. ► 2000 ఏప్రిల్ 19: శ్రీనగర్లోని బాదామిబాగ్లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద తొలిసారిగా కారుతో ఆత్మాహుతి దాడి. ఇద్దరు సైనికులు మరణించారు. ► 1999 నవంబర్ 3: బాదామిబాగ్ ఆర్మీ హెడ్క్వార్టర్ వద్ద దాడి చేసి 10 మంది సైనికులను చంపేశారు. -
ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు
న్యూఢిల్లీ: సైనిక బలగాలపై దాడులకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగినవే. పుల్వామాలో జరిగిన దాడిలో ఉగ్రవాది 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి జవాన్ల వాహనశ్రేణి వద్ద పేల్చుకోవడం వారి కొత్త వ్యూహాన్ని సూచిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఇలాంటి తరహా పేలుళ్లు చివరిసారిగా 2001లో సంభవించాయి. అప్పుడు అసెంబ్లీ సమీపంలో కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఉగ్రవాదులు 38 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న నౌషెరా సెక్టార్లో జరిగిన ఐఈడీ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. చాన్నాళ్లు తరువాత కశ్మీర్లో ఐఈడీ దాడులు పెరగడంపై ఆర్మీ ఆందోళన చెందుతోంది. గతేడాది జనవరిలో బారాముల్లాలో చోటుచేసుకున్న ఇలాంటి దాడిలో నలుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు భద్రతా బలగాలకు కొత్తేం కాదు. కానీ కశ్మీర్లో తక్కువ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల వ్యూహాలు వేరుగా ఉంటాయి. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారు. ఇటీవల అగ్రస్థాయి ఉగ్రవాదుల్ని వరసగా మట్టుపెట్టడంతో, మిగిలిన టెర్రరిస్టుల్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ పెరిగిందని, ఇందులో భాగంగానే ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వేర్పాటువాదులకు చేరువకావాలనుకుంటున్న పాకిస్తాన్ ప్రయత్నాలను భారత్ అడ్డుకోవడం కూడా ఉగ్రవాదుల వ్యూహాల మార్పునకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్ను పాక్లో కలపడమే లక్ష్యం భారత్లో పలు ఉగ్రదాడులకు జైషే స్కెచ్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడికి పాల్పడిన జైషే మొహమ్మద్ను మౌలానా మసూద్ అజహర్(50) 2000, మార్చి నెలలో ప్రారంభించాడు. కశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టి పాకిస్తాన్లో కలపాలన్న ఏకైక లక్ష్యంతో ఈ సంస్థ పనిచేసేది. పాక్ ప్రోద్బలంతో జైషే ఉగ్రవాదులు భారత్లోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సైనికులపై దాడులకు పాల్పడ్డారు. సొంత దేశంలోని ముస్లిమేతరులను ఈ ఉగ్రసంస్థ విడిచిపెట్టలేదు. 2001, అక్టోబర్ 1న కశ్మీర్ అసెంబ్లీపై దాడికి పాల్పడి 38 మందిని బలికొనడంతో జైషే మొహమ్మద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని తామే చేశామని తొలుత గర్వంగా ప్రకటించుకున్న జైషే సంస్థ.. ఆ తర్వాత తమకు సంబంధం లేదని బుకాయించింది. అదే ఏడాది భారత పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి దాడిచేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ జైషే మొహమ్మద్ను 2002లో నిషేధించింది. అయినప్పటికీ ఇతర సంస్థల ముసుగులో జైషే మొహమ్మద్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 2016లో పఠాన్కోట్ ఎయిర్బేస్పై జరిగిన ఉగ్రదాడిలోనూ జైషే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మసూద్ అజహర్ మేనల్లుడు, స్నైపర్ ఉస్మాన్ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి మసూద్ తెగబడ్డాడని నిపుణులు భావిస్తున్నారు. -
ఉగ్ర మారణహోమం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్లోని 92 బేస్ బదామీగఢ్ ఆర్మీ కంటోన్మెంట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. విధుల్లో మళ్లీ చేరేందుకు వెళుతుండగా.. మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్కు బయలుదేరారు. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్కు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతాబలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతున్నాయి. రెప్పపాటులో ఉగ్రవాది కారుతో బస్సును ఢీకొట్టాడు. భద్రతాబలగాలు తేరుకునేలోపే తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో కాన్వాయ్లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఎస్జీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని సాక్ష్యాలు, పేలుడు అవశేషాలను సేకరించారు. ఉగ్రదాడి జరగడంతో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బిహార్ పర్యటను రద్దుచేసుకుని వెనుదిరగగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్గౌబా భూటాన్ పర్యటన నుంచి అర్ధంతరంగా తిరుగుప్రయాణమయ్యారు. 2016, సెప్టెంబర్ 18న కశ్మీర్లో ఉడీ ఆర్మీ బేస్పై ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉడీ ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మూసేయడంతో భారీ కాన్వాయ్ ప్రమాద విషయమై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆర్.ఆర్. భట్నాగర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వాతావరణం బాగోలేకపోవడంతో గత రెండ్రోజులగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ఉగ్రవాదుల ఆత్మాహుతిదాడికి గురైన బస్సులో 39 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్కు చెందినవారని పేర్కొన్నారు. దాడి సందర్భంగా జవాన్ల వాహనాలపై కాల్పులు జరిగాయన్నారు. సాధారణంగా సీఆర్పీఎఫ్ కాన్వాయ్లో వెయ్యి మంది జవాన్లు మాత్రమే ఉంటారనీ, కానీ గత రెండ్రోజులుగా రహదారి మూతపడటంతో ఒకేసారి భారీ సంఖ్యలో 2,547 మంది జవాన్లు శ్రీనగర్కు బయలుదేరారని తెలిపారు. ఈ ఘటనపైకశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఉగ్రదాడి తీవ్రత దృష్ట్యా కశ్మీర్ పోలీసులతోపాటు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు ఈ విచారణలో పాలుపంచుకుంటారని భట్నాగర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో శాంతిభద్రతలను సమీక్షించేందుకు శుక్రవారం కేంద్ర భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఖండించిన అంతర్జాతీయ సమాజం పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి, అమెరికా, రష్యాతోపాటు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఖండించాయి. పుల్వామా దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారకులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతోపాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగాలు వృథా కావు జమ్మూకశ్మీర్లో జవాన్లపై జరిగిన దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మన భద్రతా బలగాల త్యాగాలు వృథా కావని ఆయన అన్నారు. హోం మంత్రి రాజ్నాథ్సింగ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిలో వీరమరణం పొందినవారి కుటుంబాలకు జాతి మొత్తం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన అనంతర పరిస్థితిపై హోం మంత్రి రాజ్నాథ్తోపాటు అధికారులతో చర్చించానన్నారు. ‘పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి అత్యంత హేయం. పిరికిపందలు పాల్పడిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సాహసవంతులైన మన భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా కావు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రదాడి తరువాత మంటల్లో చిక్కుకున్న ఆర్మీ వాహనాలు. సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న తోటి సైనికులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది ఎవరేమన్నారంటే.. ప్రతీకారం తీర్చుకుంటాం పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని హోం మంత్రి రాజ్నాథ్ స్పష్టం చేశారు. హింసాత్మక చర్యల ద్వారా శాంతికి భగ్నం కలిగించాలనుకునే శక్తుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఇందుకు తగినవిధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవానుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. - హోం మంత్రి రాజ్నాథ్ ‘కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉగ్ర మూకలపై జరిగే పోరాటంలో జాతి మొత్తం ఐక్యంగా నిలబడుతుంది. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దుష్ట, ఉగ్ర మూకలపై జరిగే పోరులో జాతి మొత్తం ఒక్కటిగా నిలబడుతుంది. – రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ‘బలగాలపై ఉగ్రదాడిపై తీవ్ర వేదనకు గురయ్యా. పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అమర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ ధోరణి అవలంభిస్తోంది. – రాహుల్ గాంధీ ‘కశ్మీర్లో భారత్ బలగాలపై జరిగిన దాడిని అమెరికా దౌత్య కార్యాలయం ఖండిస్తోంది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్ చేసే పోరాటానికి అమెరికా వెన్నంటి ఉంటుంది’ –అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ ‘అవంతిపొరాలో 30 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ తీవ్రమైన ఉగ్రవాద చర్యను ఖండించడానికి ఏ పదాలూ సరిపోవు. ఈ మూర్ఖత్వపు చర్యలు ఆగిపోయేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి?’ –జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ‘కశ్మీర్లో బలగాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం షాక్కు గురి చేసింది. ఇది యావత్ దేశానికే విషాద దుర్ఘటన. జవాన్ల కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం చర్యలు తీసుకోవాలి ‘పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల వేదన తీరనిది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వీరుల కుటుంబాలకు కాంగ్రెస్తోపాటు దేశం యావత్తూ అండగా నిలుస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గురువారం లక్నోలో తన మొట్ట మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె అమర జవాన్ల మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. - ప్రియాంకా గాంధీ -
ఉగ్రవేటకు బ్లాక్ క్యాట్ కమెండోలు
శ్రీనగర్/ న్యూఢిల్లీ/ ముంబై: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమెండోల సేవల్ని వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పుందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 24 మంది ఎస్ఎస్జీ కమెండోల బృందాన్ని కశ్మీర్కు పంపిందని తెలిపారు. వీరు త్వరలోనే భద్రతాబలగాలతో కలసి ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొంటారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి ఎన్ఎస్జీ కమెండోల సంఖ్యను 100కు పెంచే అవకాశముందని వెల్లడించారు. ఉగ్రవాదులు ప్రజల్ని బందీలుగా చేసుకుంటే లేదా విమానాల హైజాకింగ్కు పాల్పడితే వెంటనే ఘటనాస్థలికి చేరుకునేందుకు వీలుగా ప్రస్తుతం కమెండోలను శ్రీనగర్ విమానాశ్రయంలో మోహరించామన్నారు. ఎన్ఎస్జీ కమెండోల వద్ద ఉన్న గోడల్ని స్కానింగ్చేసే రాడార్లు, స్నైపర్ తుపాకులు, ఇంటి మూలల్లో నక్కిన ఉగ్రవాదుల్ని కాల్చగలిగే తుపాకులతో ఉగ్ర ఆపరేషన్లలో బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. అలాగే యాత్రకు వాడే వాహనాల గమనాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ స్టిక్కర్లను అమర్చనున్నట్లు పేర్కొన్నారు. 10–15 డ్రోన్లను వినియోగించడంతో పాటు ఎమర్జెన్సీ నంబర్ 1364ను యాత్రికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వేర్పాటువాదుల అరెస్ట్ జమ్మూకశ్మీర్లో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారితో పాటు ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు కశ్మీరీల మృతికి నిరససగా వేర్పాటువాదులు గురువారం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ను గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన్ను కోఠిబాగ్ పోలీస్స్టేషన్కు తరలించారు. మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాజ్ ఉమర్ ఫారుఖ్ను ఆయన స్వగృహంలో నిర్బంధించారు. అతివాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఇప్పటికే గృహనిర్బంధంలో ఉన్నారు. సీఎం మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి ఇటీవల బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా, వేర్పాటువాదుల పిలుపుతో కశ్మీర్ లోయలో మార్కెట్లు, దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శుక్రవారం అన్ని రాజకీయ పక్షాలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. గవర్నర్ పాలన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, కశ్మీరీలను మరింత అణచేందుకే జమ్మూకశ్మీర్లో గవర్నర్ పాలన విధించారని పాకిస్తాన్ విమర్శించింది. -
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో పాటు ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. పుల్వామాలోని ద్రబ్గమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ స్పెషల్ టాస్క్ఫోర్స్ సంయుక్త బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అనంతరం తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలపై ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన సమీర్ అహ్మద్భట్ అలియాస్ సమీర్ టైగర్, అక్విబ్ ముస్తఖ్లు చనిపోయారు. ఎన్కౌంటర్ జరుగుతుండగానే ఉగ్రవాదుల్ని తప్పించేందుకు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకున్న స్థానిక యువత.. భద్రతాబలగాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బుల్లెట్ తగిలి షాహీద్ అహ్మద్ దార్(25) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్లో హిజ్బుల్కు రిక్రూటర్గా ఉన్న సమీర్ సోషల్మీడియా సాయంతో ఇప్పటివరకూ 80 మంది యువకుల్ని ఈ ఉగ్రసంస్థలో చేర్పించాడు. -
మేఘాలయలో తీవ్రవాదుల దాడి
షిల్లాంగ్: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మేఘాలయలో ఆదివారం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలియమ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి జొనాథన్ సంగ్మాతోపాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు మృతి చెందారు. తూర్పు గరో జిల్లాలో జరిగిన ఈ ఘటనలో తీవ్రవాదులు తొలుత పేలుడు జరిపి అనంతరం సంగ్మా వాహన శ్రేణిపై కాల్పులకు దిగారు. మేఘాలయ శాసనసభలో ఉన్న మొత్తం 60 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుండటం తెలిసిందే. మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా మృతులకు సంతాపం తెలిపారు. -
రష్యా చర్చిలో కాల్పులు
మాస్కో: రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలోని కిజ్లయార్ పట్టణంలో ఆదివారం ఓ చర్చిలో ఇస్లాం ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు మృతిచెందారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ తరువాత పోలీసులు నిందితుడిని హతమార్చారు. ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని, నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ ఆసుపత్రిలో కన్ను మూసినట్లు అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దుండగుడి వయసు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు స్థానికుడేనని ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ‘అల్లాహు అక్బర్’ అని నినదిస్తూ గడ్డంతో ఉన్న వ్యక్తి రైఫిల్, కత్తితో చర్చిలోకి చొచ్చుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫాదర్ పావెల్ చెప్పారు. చెచెన్యాకు సరిహద్దుగా ఉన్న దగెస్తాన్ రష్యాలోని కల్లోలిత ప్రాంతాల్లో ఒకటి. -
32 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడికి విఫల యత్నం చేసి ఓ ఇంట్లో దాక్కున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 32 గంటలు కొనసాగిన ఎన్కౌంటర్ మంగళవారం ముగిసింది. ఇక్కడి కరణ్నగర్లో నిర్మాణంలో ఉన్న ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ఆపరేషన్ల బృందం(ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు, రెండు ఏకే 47 తుపాకులు, 8 మేగజీన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతులు లష్కరే తోయిబాకు చెందినవారేనని పోలీసులు ధ్రువీకరించారు. సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాదులపై అప్రమత్తంగా ఉన్న గార్డు కాల్పులు జరపడంతో వారు సమీపంలోని ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తరువాత ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోగా, ఒక పోలీస్ గాయపడ్డాడు. సోమవారం రాత్రి విరామం అనంతరం మంగళవారం ఉదయం పునఃప్రారంభమైన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గార్డు అప్రమత్తతతో తప్పిన ముప్పు ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఐజీ ఎస్పీ పాని వెల్లడించారు. వారు దాక్కున్న ఐదంతస్తుల భవనం నివాస, వాణిజ్య సముదాయాల మధ్య ఉండటం వల్లే ఎన్కౌంటర్ పూర్తవడానికి సమయం పట్టిందని తెలిపారు. సమీప ప్రాంతంలో నివసిస్తున్న సీఆర్పీఎఫ్ కుటుంబాలు, ప్రజలను అక్కడి నుంచి తరలించి పక్కా రెక్కీ నిర్వహించిన తరువాతే ముష్కరులపై ముప్పేట దాడిని ప్రారంభించామని సీఆర్పీఎఫ్ ఐజీ రవిదీప్ సాహి చెప్పారు. ఒకవేళ గార్డు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయకుంటే జరిగే నష్టం ఊహించలేమని చెప్పారు. ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కున్నారా? అని ప్రశ్నించగా..గార్డు ఇద్దరినే చూశాడని చెప్పారు. మరో సైనికుడి మృతదేహం లభ్యం సంజువాన్ సైనిక శిబిరంలో జరిగిన ఎన్కౌంటర్ స్థలంలో మరో భారత జవాన్ మృతదేహం లభించింది. దీంతో ఈ ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య ముగ్గురు ఉగ్రవాదులతో కలుపుకుని 10కి చేరింది. ఈ దాడిలో అమరులైన కశ్మీర్ లోయకు చెందిన జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హాజరయ్యారు. సైనిక శిబిరాలకు సమీపంలో ఇళ్లు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అధికారుల అనుమతితోనే వీటిని కడుతున్నందున ఆ తరువాత తొలగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. రాజ్నాథ్ సమీక్ష... కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వరసగా రెండోరోజు జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష జరిపారు. మంగళవారం జరిగిన భేటీకి జాతీయ భద్రతా సలహాదారు దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా హాజరయ్యారు. సరిహద్దుల గుండా చొరబాట్లను నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. మరో కుట్ర భగ్నం జమ్మూలో మరో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి కుట్ర భగ్నమైంది. జమ్మూ–అక్నూర్ రోడ్డులో ఉన్న దోమనా శిబిరం ప్రధాన గేటు సమీపంలోకి బైకుపై వచ్చిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు గార్డుపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ప్రతికాల్పులకు దిగడంతో వారు పారిపోయినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ దేవేందర్ ఆనంద్ వెల్లడించారు. పరారైన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. మేమూ బదులిస్తాం: పాక్ భారత్, పాక్ల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. భారత్ దుస్సాహసానికి పాల్పడితే అదే రీతిలో బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. సంజువాన్ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ఉందన్న రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ మంగళవారం నిర్మలా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భారత్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా తామూ అలాగే బదులిస్తామని అన్నారు. సంజువాన్లో అమరులైన జవాన్లకు మెహబూబా నివాళి -
ఆర్మీస్థావరాలకు 1,487 కోట్లు
న్యూఢిల్లీ: కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ స్థావరాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రక్షణశాఖ రూ.1,487 కోట్లను మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టును 10 నెలల్లోగా పూర్తిచేయాలని రక్షణ మంత్రి సీతారామన్ ఆదేశించినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. కశ్మీర్లో నియంత్రణ రేఖ, కొన్ని చోట్ల ఆర్మీ స్థావరాలపై ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత భద్రతను కట్టుదిట్టం చేయడానికి లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోస్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆడిట్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసేందుకు వీలుగా ప్రామాణిక నిర్వహణ విధానాలను(ఎస్వోపీ) త్రివిధ దళాలకు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్కు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన 600 అత్యంత సున్నితమైన, 3 వేల సున్నితమైన స్థావరాలను గుర్తించినట్లు వెల్లడించాయి. -
ఫ్రాన్స్ ప్రతీకార దాడులు
♦ సిరియాలోని ఐఎస్ స్థావరాలపై దాడులు ♦ ‘పారిస్’ ఉగ్రవాదుల కోసం ఫ్రాన్స్లో, బెల్జియంలో వేట ♦ మృతులకు నివాళిగా మౌనం పాటించిన యూరోప్ పారిస్: పారిస్లో మారణహోమం సృష్టించి, 129 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులపై ఫ్రాన్స్ సహా అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందిస్తోంది. అనుమానిత ఉగ్రవాద స్థావరాలు, వ్యక్తులపై సోమవారం ఫ్రాన్స్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్థావరాల పై ఆదివారం రాత్రి నుంచి బాంబుల వర్షం కురిపించింది. పారిస్ మృతులకు నివాళిగా ఫ్రాన్స్లోనూ, ఇతర యూరప్ దేశాల్లోనూ ప్రజలు సోమవారం మధ్యాహ్నం ఒకే సమయంలో నిమిషం పాటు మౌనం పాటించారు. సార్బాన్ యూనివర్సిటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తన కేబినెట్ సహచరులు, విద్యార్థులతో కలసి పారిస్ మృతులకు నివాళులర్పించారు. పారిస్పై దాడిలో పాల్గొన్న మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిలో గతంలో ఉగ్రవాద కేసును ఎదుర్కొన్న ఫ్రెంచ్ వ్యక్తి ఒకరు కాగా, మరొక ఆత్మాహుతికి పాల్పడిన మరో ఉగ్రవాది వద్ద సిరియా పాస్పోర్ట్ లభించింది. ఫ్రాన్స్లోని లియన్ నగరంలోని ఓ స్థావరంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల నేపథ్యంలో 23 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ దారుణ దాడుల ప్రభావం నుంచి ఫ్రాన్స్ నెమ్మదిగా తేరుకుంటోంది. స్కూళ్లు, హోటళ్లు, దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. సిరియాలోని రఖాలో ఉన్న ఐఎస్ శిక్షణా కేంద్రం, ఆయుధాగారం, కమాండ్ పోస్ట్ మొదలైన వాటిపై ఫ్రాన్స్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. దాడికి రూపకల్పన బెల్జియంలోనే జరిగిందన్న వార్తల నేపథ్యంలో.. బెల్జియం పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో బ్రసెల్స్కు చెందిన ముగ్గురు సోదరులు పాలు పంచుకున్నట్లుగా భావిస్తున్నామని, వారిలో ఒకరు ఆత్మాహుతిదాడిలో చనిపోగా, మరొకరిని అరెస్ట్ చేశామని, మూడోవాడైన సలాహ్ అబ్దెల్లామ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అబ్దెల్లామ్ ఫొటోను విడుదల చేశారు. అబ్దేస్లామ్ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమైనట్లు తెలుస్తోంది. పారిస్లోని బటాక్లాన్ థియేటర్ వద్ద దాడులకు తెగబడి 89 మంది మృతికి కారణమైన ఉగ్రవాదుల్లో ఇద్దరిని పారిస్కు చెందిన ఇస్మాయిల్ మొస్తెఫాయి(29), సామీ అమీమోర్(28) గుర్తించినట్లు తెలిపారు. మొస్తెఫాయి గురించి గతంలో మూడుసార్లు ఫ్రాన్స్ను హెచ్చరించామని టర్కీ తెలిపింది. ఫ్రాన్స్ నేషనల్ స్టేడియం వద్ద ఆత్మాహుతికి పాల్పడినఅహ్మద్ మొహమ్మద్ వద్ద సిరియా పాస్పోర్ట్ లభించింది. మూడు రోజులుగా మూతపడిన ఈఫిల్ టవర్ను మళ్లీ తెరిచారు. ఐఎస్పై మరింత సమన్వయంతో దాడులు పారిస్ దాడుల ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని జీ 20 దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. ఐఎస్పై మరింత మెరుగైన సమన్వయంతో దాడులు చేయాలని ఆ దేశాలు నిర్ణయించాయి. జీ 20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర యూరోప్ దేశాల నాయకులతో సమావేశమై సిరియాపై, ఐఎస్పై చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణను చర్చించారు. భద్రతా చర్యలపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ హోం మంత్రులు శుక్రవారం భేటీ కానున్నారు. కాగా, బ్రిటన్లో గత నెలల్లో ఏడు ఉగ్రవాద దాడుల కుట్రలను భగ్నం చేశామని ఆ దేశ ప్రధాని కామెరాన్ చెప్పారు. సిక్కు సంతతికి చెందిన కెనడా జర్నలిస్టు వీరీందర్ జబ్బాల్ ఫొటోను పారిస్ దాడులకు పాల్పడిన ఉగ్రవాది ఫొటోగా పేర్కొంటూ లా రజాన్ అనే స్పానిష్ పత్రిక అచ్చేసింది. ఈ ఫొటో మార్పులు చేసిన ఫొటో అని తేలింది. దీంతో పత్రిక క్షమాపణ చెప్పింది. పట్టుకుని వదిలేశారు.. పారిస్ దాడుల అనంతరం మరో ఇద్దరితో కలసి కారులో బెల్జియం వైపు పారిపోతున్న దాడుల ముఖ్య సూత్రధారి సలేహ్ అబ్దేస్లామ్ను ఫ్రాన్స్ పోలీసులు పట్టుకుని వదిలేశారు. దాడుల తరువాత ఉగ్రవాదులు దేశం విడిచి పారిపోకుండా సరిహద్దుల వద్ద క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ అప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అయినా, అబ్దేస్లామ్ను వారు అదుపులోకి తీసుకోలేదు. అబ్దేస్లామ్ ప్రయాణిస్తున్న కారును ఆపిన స్థానిక పోలీసులు (వీరిని జెండార్మ్స్ అని పిలుస్తారు), వారిని ప్రశ్నించి, వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి వదిలేశారు. ఆ తరువాత వారు ఫ్రాన్స్ సరిహద్దులు దాటి బెల్జియం పారిపోయారు. అయితే, ఆ పోలీసుల వద్ద అబ్దేస్లామ్ గురించిన సమాచారం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. -
కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురుతున్నా..
హైదరాబాద్: పంజాబ్ పై ఉగ్రవాదుల దాడిన కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. టెర్రరిస్ట్ అంశాలను కూడా బీజేపీ రాజకీయ లబ్థికోసం వాడుకోవాలనుకుంటుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కసబ్ ను ఉరితీసిన తర్వాతే మీడియాకు తెలిసిందని ఆయన గుర్తుచేశారు. యాకుబ్ మెమన్ ఉరి నిర్ణయాన్ని ప్రచారం చేసి దేశవ్యాప్తంగా మతపరమైన అంశాలు రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు. కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురుతున్నా ప్రధాని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే మోదీనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఆయన మండిపడ్డారు. ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్ రైతులను ఎందుకు ఆదుకోవటం లేదన్నారు. ఆలోచన వచ్చిందే తరువు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారన్నారు. నూతనంగా ప్రకటించిన గ్రామజ్యోతి పథకానికి రూ. 25 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.