Welfare programs
-
మార్చిలోగా అర్హులందరికీ పథకాలు అమలు: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలను అందజేస్తాం. అప్పటివరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున జనవరి 26 అర్ధరాత్రి నుంచే టకీటకీమని రైతుల ఖాతాల్లో పడతాయి..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ‘భూమికి విత్తనానికి మధ్య ఎలాంటి బంధముందో, రైతుకు కాంగ్రెస్కు మధ్య అలాంటి బలమైన అనుబంధముంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ప్రకటించారు. రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిలను ఒక్క కలం పోటుతో రద్దుచేశారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్..సోనియాగాంధీ నేతృత్వంలో రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపారు. ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ గత ఆగస్టు 15 నుంచి 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం..’అని సీఎం పేర్కొన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డుల పథకాలను ఆయన ప్రారంభించారు. లబి్ధదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మా కొడంగల్ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా? ‘కాంగ్రెస్ పాలనలో 2004–2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాం. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే వైఎస్సార్ గుర్తొస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 36 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే కేసీఆర్కు కడుపుమండి సీబీ సీఐడీ విచారణ చేయించారు. కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ ఊరిలోనైనా వచ్చాయా? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఊరికో కోడి, ఇంటికో ఈక కూడా ఇవ్వలేదు. మేం రానున్న నాలుగేళ్లలో ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 15 నుంచి 20 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తాం. కొడంగల్లో పరిశ్రమలు పెడతామంటే కేసీఆర్ మనుషులు అడ్డుపడుతున్నారు. అధికారులపై దాడులు చేయించి చంపాలని చూస్తారా? మా కొడంగల్ బిడ్డలు ఎప్పటికీ బస్టాండుల్లో లుంగీలు కట్టుకుని ఖాళీగా ఉండాలా? డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా?..’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజాపాలనలో ఎవరైనా ప్రజల వద్దకే వస్తారు ‘ప్రతి ఆరునెలలకు ఒకసారి గ్రామాలకు అధికారులు రావడం ఎప్పుడైనా చూశారా? కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో ఎప్పుడైనా గ్రామాలకు వచ్చారా? కానీ మా హయాంలో ఇప్పటివరకు మూడుసార్లు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చారు. గతంలో ఫాంహౌస్, గడీలకే పరిమితమైన పాలనను మేం ప్రజల మధ్యకు తెచ్చాం. ప్రజాపాలనలో ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అయినా సరే..ప్రజల వద్దకే వస్తారు..’అని రేవంత్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యత లేకపోతే పదవి ఎందుకు? ‘గత 13 నెలల్లో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఒక్కసారైనా శాసనసభకు వచ్చాడా? సర్పంచ్ కొన్నిరోజులు లేకపోతేనే ఊరు విడవమని అంటరు. అలాంటిది ఆయన్ను ఏమనాలి? ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదా? అలాంటప్పుడు ఆ పదవి ఎందుకు? అధికారం ఉంటే కొల్లగొడతారు కానీ ప్రతిపక్ష బాధ్యత వద్దు. కేసీఆర్ మేధావినని, 80 వేల పుస్తకాలు చదివానని చెప్తడు. కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటడు. కానీ ప్రజలకు రేషన్కార్డులివ్వాలన్న జ్ఙానం లేదు. పదేళ్లలో ఒక్కరికీ రేషన్కార్డు ఇవ్వలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు..’అని సీఎం విమర్శించారు. 12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలు: సీఎస్ బడుగు, బలహీన వర్గాల కోసం ఒకే రోజున నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషకరమని సీఎస్ శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో 12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్యరాజ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు ఫరి్ణకారెడ్డి, రామ్మోహన్రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీలా దోచుకోవడంలో పోటీపడం ‘కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు తిరుపతిరెడ్డి అన్న ఎప్పుడూ అండగా ఉంటడు. పదవి ఉన్నా లేకపోయినా ఏ ఇంట్లో ఇబ్బంది ఉన్నా చూసుకుంటడు. ఆయనకు ఏ పదవి ఉన్నదని కేటీఆర్ అంటున్నడు. మీ ఇంట్లో అందరూ పదవులు తీసుకున్నరు. మేం ఏ పదవీ తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే తప్పు పడుతున్నరు. పదవులు తీసుకొని కుటుంబమంతా దోచుకోవడం తప్పా?.. ఏ పదవులూ తీసుకోకుండా సేవ చేయడం తప్పా?. మీలా దోచుకోవడంలో పోటీపడం. మీకు మాకు తేడా ఉంది. మాది దోచుకునే కుటుంబం కాదు..’ అని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
మాకూ ఓ జగన్ కావాలి!
పంపాన వరప్రసాదరావు, వడ్డే బాలశేఖర్ – ఏపీ, తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధులు: పక్క పక్కనే ఉన్న సరిహద్దు గ్రామాల్లో ఎంత తేడా! కూత వేటు దూరంలోని పల్లెలో ప్రతి గడపనూ సంక్షేమం పలకరిస్తుండగా ఆ అదృష్టం తమకు దక్కలేదని ‘తంబి’ నిట్టూరుస్తున్నాడు!! మిట్టపాళెం (ఆంధ్రప్రదేశ్), పున్నియం (తమిళనాడు) గ్రామాలు కలిసే ఉంటాయి కానీ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నందున ప్రజల జీవన ప్రమాణాలు, పొందుతున్న పౌరసేవల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. రైతులను ఆదుకోవడం నుంచి ఆరోగ్య సేవల వరకు..పింఛన్ల నుంచి మహిళా సాధికారత వరకు.. చదువుల నుంచి పౌరసేవల దాకా ప్రతి విషయంలోనూ మన సరిహద్దు గ్రామం మిట్టపాళెంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు వరుసలో నిలబెట్టింది. చెంతనే ఉన్న పల్లెలు కావడంతో ఆ తేడా కళ్లకు కట్టినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. తమ పొరుగు గ్రామంలోని ప్రజలకు అందుతున్న సంక్షేమం, పౌరసేవలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్న తమిళనాడు వాసులు తమకూ జగన్ లాంటి నాయకుడు ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. ఏపీ – తమిళనాడు సరిహద్దు గ్రామాలను సందర్శించిన ‘సాక్షి’ ప్రతినిధుల బృందం మిట్టపాళెం, పున్నియం వాసులను పలుకరించి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించింది. అక్కడ తాళం కప్ప.. ఇక్కడ అడిగిందే తడవు తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియం పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉంది. కార్యదర్శి కాదు కదా కనీసం అటెండర్ కూడా అక్కడే లేరు. ఎందుకిలా? అని గ్రామస్తులను ఆరా తీయగా కార్యాలయానికి అధికారులు రోజూ రారని సమాధానమిచ్చారు. నెలలో కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటారని, ఏ పని కావాలన్నా 13 కి.మీ. దూరంలో ఉన్న పళ్లిపట్టులోని బ్లాక్ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని చెప్పారు. ఒకటికి పది సార్లు తిరిగితే కానీ చిన్న పని కూడా జరగదని పున్నియం గ్రామస్తుడు ఆర్.కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న మిట్టపాళెంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటైన గ్రామ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. అయితే నాలుగేళ్ల క్రితం వరకు వీరు కూడా ఏ పని కావాలన్నా 15 కి.మీ. దూరంలో ఉన్న మండల కేంద్రం నగరి వెళ్లేవారు. నాడు చెప్పులరిగేలా తిరిగినా పనులు జరగని దుస్థితి. ఇప్పుడు గ్రామంలోనే సచివాలయం, ఆర్బీకేల రాకతో వలంటీర్ల ద్వారా గడప వద్దే సేవలన్నీ పొందగలుగుతున్నారు. ఇటీవలే జగనన్న సురక్ష క్యాంపైన్ ద్వారా పైసా ఖర్చు లేకుండా ఏకంగా 456 సేవలు పొందగలిగారు. కుల, ఆదాయ, జనన, మరణ ద్రువీకరణ పత్రాలే కాకుండా వన్ బీ, అడంగల్, మ్యుటేషన్ లాంటి అన్ని రకాల పౌరసేవలను ఎలాంటి వ్యయ ప్రయాసలకు గురికాకుండా పొందగలుగుతున్నారు. ఆరోగ్యం ఆమడ దూరం.. ఇక్కడ ఇంటికే డాక్టర్ ప్రజారోగ్య పరిరక్షణ విషయానికి వస్తే 6 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున పున్నియం గ్రామంలో ఒక సబ్సెంటర్ ఉంది. ఒక ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) అందుబాటులో ఉంటూ బీపీ, షుగర్ లాంటి సాధారణ పరీక్షలు చేసి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు బిళ్లలు ఇస్తున్నారు. డెంగీ, మలేరియా, వివిధ వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో లేవు. టెలీ మెడిసిన్ సౌకర్యం లేదు. వైద్యుడి సేవలు పొందాలంటే 13 కి.మీ పైగా దూరంలో ఉండే స్వర్గపేట ప్రభుత్వాస్పతికి వెళ్లాల్సిందే. అదే ఏపీలో 2 వేలకు పైగా జనాభా ఉన్న మిట్టపాళెం పంచాయతీలో ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ను ఏర్పాటు చేసింది. క్లినిక్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన ఎంఎల్హెచ్పీ, ఒక ఏఎన్ఎంతో పాటు ఆశావర్కర్ ఉన్నారు. ఈ క్లినిక్లో 105 రకాల మందులు, 14 వైద్య పరీక్షలు, టెలీమెడిసిన్ సౌకర్యం ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా బుగ్గ అగ్రహారం పీహెచ్సీ వైద్యుడు నెలకు రెండు సార్లు మిట్టపాళెం గ్రామాన్ని సందర్శిస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉంటున్నారు. బీపీ, షుగర్ బాధితులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాలపై ఆరా తీసి అవసరమైన వైద్య సేవలందిస్తున్నారు. మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సేవలు సైతం ఇక్కడ అందుబాటులోకి ఉన్నాయి. మిట్టపాళెం ప్రజలు నాణ్యమైన మెరుగైన వైద్యం కోసం వ్యయ ప్రయాసలకోర్చే పరిస్థితులు లేవు. ► తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియం పంచాయతీ పరిధిలో సామాజిక పింఛన్లతో పాటు ఇటీవలే ప్రారంభించిన కుటుంబానికి ఓ మహిళకు రూ.వెయ్యి ఆర్ధిక సాయం మినహా మరే పథకం ద్వారా సాయం అందడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ► ఏపీలోని మిట్టపాళెం పంచాయతీ పరిధిలో మిట్టపాళెంతో పాటు మిట్టపాళెం ఏఏడబ్ల్యూ (ఆది ఆంధ్రా వాడ), చిన్నతంగల్, మేలపట్టు, మేలపట్టు హెచ్డబ్ల్యూ (హరిజనవాడ) గ్రామాలుండగా 2,452 జనాభా నివసిస్తోంది. 930 కుటుంబాలున్నాయి. తమిళనాడులోని పున్నియం పంచాయతీ పరిధిలో పున్నియంతో పాటు నల్లవన్నెంపేట, పున్నియం కాలనీ గ్రామాల్లో 1,850 జనాభా, 450 కుటుంబాలున్నాయి. వాళ్ల మాదిరిగా పేదలమే అయినా.. మేకల పెంపకంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగేళ్లు నోటికెళ్లవు. రేషన్ సరుకులు మినహా ప్రభుత్వ పరంగా మాకెలాంటి సాయం అందడం లేదు. ఈ మధ్యే కుటుంబంలో మహిళకు రూ.1,000 ఇస్తున్నారు. అదీ కూడా అందరికి అందడం లేదు. అదే మిట్టపాళెం వాసులకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోంది. కుటుంబంలో ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. వాళ్ల మాదిరిగానే మేము పేదవాళ్లమే. అలాంటి సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం కూడా ప్రవేశపెడితే బాగుంటుంది. –మణియమ్మ,, నల్లవెన్నంపేట, పున్నియం పంచాయతీ ప్రతి గడపకూ సాయం నాకు 3 ఎకరాల పొలం ఉంది. వరి, పూల తోటను సాగు చేస్తా. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందుతోంది. నాకు రూ.2,750 చొప్పున ప్రతి నెలా పింఛన్ వస్తోంది. నా భార్య జగదాకు చేయూత కింద ఏటా రూ.18,750 ఇస్తున్నారు. ఆసరా రూపంలో ఏటా రూ.10 వేలు జమ చేశారు. నా పెద్ద కుమారుడు మురుగన్కు ఇంటి రుణం ఇచ్చారు. కోడలికి అమ్మఒడి, ఆసరా వస్తోంది. గతంలో పథకాలు అందడం అటుంచి ఎలా దరఖాస్తు చేయాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు వలంటీర్లు ఇంటికొచ్చి వివరించి దగ్గరుండి మరీ దరఖాస్తు చేయిస్తున్నారు. ప్రతి గడపకూ సాయం అందుతోంది’. –బాలం రాజలింగం, చిన్నతంగల్, మిట్టపాళెం పంచాయతీ గౌరవంగా చూస్తున్నారు ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తారో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నాం. సొంత బిడ్డలా ఆదరిస్తున్నారు. అమ్మ ఒడి, ఆసరా పథకాల ద్వారా నేను కూడా లబ్ధి పొందా. ఆటో నడిపే నా భర్తకు వాహన మిత్ర వస్తోంది. మా అత్తకు చేయూత, ఆసరా, ఇళ్ల స్థలం వచ్చింది’ –జి.విజయలక్ష్మి, వలంటీర్, చిన్నతంగలి గ్రామం, మిట్టపాళెం పంచాయతీ మారుమూల పల్లెలకు వరం గతంలో పంచాయతీ కార్యదర్శి వారానికో పది రోజులకో ఒకసారి గ్రామానికి వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్లిపోయేవారు. ఎప్పుడొచ్చేది కూడా ప్రజలకు తెలిసేది కాదు. ఏ పని కావాలన్నా నగరి వెళ్లాల్సిందే. రాజకీయ నేతల సిఫారసులు, చేతులు తడపనిదే పనులయ్యేవి కావు. ఇప్పుడు సచివాలయం వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ పొలిమేర కూడా దాటడం లేదు. ఎలాంటి సిఫార్సులు, పైసా ఖర్చు లేకుండా పౌరసేవలు అందుతున్నాయి. వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకుని సంక్షేమ ఫలాలను పొందుతున్నారు. సచివాలయాలు వలంటీర్ వ్యవస్థలు మారుమూల పల్లెలకు నిజంగా ఓ వరం. –గురువా వినోద్కుమార్, మిట్టపాళెం సచివాలయ కన్వీనర్ ఏపీ స్థానికత పొందాలనిపిస్తోంది.. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఎన్.మురుగన్ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు బ్లాక్ పరిధిలోని పున్నియం దళితవాడ నివాసి. మన రాష్ట్ర సరిహద్దులోని చిత్తూరు జిల్లా నగరి మండలం మిట్టపాళెం పక్కనే ఆ ఊరు ఉంటుంది. రైతు కూలీ, దివ్యాంగుడైన మురుగన్ రూ.1,200 పింఛన్ అందుకుంటుండగా ఇటీవలే రూ.1,500కి పెరిగింది. బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే పెన్షన్ డబ్బుల కోసం రోజూ ఎదురు చూడాల్సిందే. నెలలో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మురుగన్ కుటుంబానికి సొంతంగా ఇల్లు కానీ ఇంటి స్థలంగానీ లేదు. గ్రామంలో ఎంతో మందిది ఇదే పరిస్థితి.పక్క గ్రామంలో తమలాంటి నిరుపేద కుటుంబాలకు సీఎం జగన్ అండగా నిలుస్తుండటాన్ని చూసినప్పుడు తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో సంక్షేమ పథకాలను అమలు చేస్తే బాగుంటుందని మురుగన్ కోరుకుంటున్నాడు. ‘వికలాంగులకు ఏపీలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. మాకు రూ.1,500 మాత్రమే వస్తోంది. ఆ పెన్షన్ సొమ్ము తీసుకోవడానికి కూడా పడిగాపులు కాయాలి. ఇవన్నీ చూసినప్పుడు పక్కనే ఉన్న సరిహద్దు గ్రామంలోకి వెళ్లి ఏపీ స్థానికత పొందాలనిపిస్తోందని చెబుతున్నాడు. చిత్తూరు జిల్లా మిట్టపాళెంలో నిర్మించిన సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాలు సుబ్రహ్మణ్యం సంబరం..! చిత్తూరు జిల్లా నగరి మండలం మిట్టపాళెం వాసి డి.సుబ్రహ్మణ్యం నిరుపేద వర్గానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ.2,750 వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నాడు. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉండడంతో ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం వస్తోంది. ఆయన భార్య హంసకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున జమ అవుతోంది. ఆయన ఇద్దరు పిల్లలకు పక్కా గృహ యోగాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. పెద్ద కుమారుడికి భార్య పేరుతో వీకేఆర్ పురం లేఅవుట్లో రూ.3 లక్షల ఖరీదైన స్థలం, ఇంటి నిర్మాణానికి సాయం అందింది. రెండో కుమారుడికి సొంత స్థలంలో ఇంటి నిర్మాణ బిల్లును ప్రభుత్వం మంజూరు చేసింది. ‘నాకు వైఎస్సార్ హయాంలో మంజూరైన పింఛన్ను టీడీపీ ప్రభుత్వంలో తీసేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచడమే కాకుండా గతంలో ఎప్పుడూ మా కుటుంబం ఇంత లబ్ధి పొందలేదు’ అని సుబ్రహ్మణ్యం సంతోషంగా చెబుతున్నాడు. కూతవేటు దూరంలో ఎంత తేడా! తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియంలో నివసించే మల్లీశ్వరి చిన్నకారు మహిళా రైతు. ఎరువులు, విత్తనాలు కొనాలంటే ఎన్నో అగచాట్లు పడాలి. ఏది కావాలన్నా 13 కి.మీ.దూరంలోని పళ్లిపట్టుకు వెళ్లాల్సిందే. పీఎం కిసాన్ కింద కేంద్రం ఏటా మూడు విడతల్లో ఇచ్చే రూ.6 వేల సాయం మినహా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆమెకు ఎలాంటి పెట్టుబడి సాయం అందదు. ఆ పక్కనే కూతవేటు దూరంలోని మిట్టపాళెం వాసులకు మాత్రం ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు ముంగిటికే అందుతున్నాయి. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందుతోంది. రైతులు గిట్టుబాటు ధరలకు పంటలను విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడుగా నిలుస్తోంది. ఉచిత బీమా, విపత్తులతో నష్టపోతే నష్ట పరిహారాన్ని అందిస్తోంది. ఇవేకాకుండా మహిళలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ‘మిట్టపాళెంలో ఉన్న మా బంధువులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వింటుంటే సంతోషమనిపిస్తుంది. జగన్ పాలన చూస్తుంటే ఒక్కోసారి ఆంధ్రాలో పుట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కాసింత అసూయగానే ఉన్నా పొలం పుట్రా, పిల్లా పాపలను వదిలి వెళ్లలేం కదా’ అని మల్లీశ్వరి అంటోంది. అమ్మ తరపు బంధువుల్లో ఆశ్చర్యం.. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన టీకే తమిళసెల్వి మన రాష్ట్రంలోని సరిహద్దు గ్రామం మిట్టపాళెం నివాసి. నలుగురు సంతానం. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 తమిళసెల్వి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. డిగ్రీ చదువుతున్న ఆమె కుమారుడికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుతున్నాయి. ఆమె భర్త వెంకటేష్కు రెండేళ్ల క్రితం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ౖబైపాస్ సర్జరీ జరిగింది. ఏడాది పాటు మందులు ఉచితంగా ఇచ్చారు. ఆమె కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రభుత్వం ఏటా రూ.13,500 ఇస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేలోనే తీసుకుంటున్నారు. ‘మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి సీఎం జగన్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది. మా అమ్మ తరపు బంధువులంతా తమిళనాడులోనే ఉన్నారు. మాకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి గురించి చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారు. తమ పిల్లలకు ఆంధ్రాలో పెళ్లి సంబంధాలు చూడాలని కోరుతున్నారు’ అని తమిళ సెల్వి చెబుతోంది. -
అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జి వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అనుబంధ విభాగాలైన మహిళ, యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో పార్టీ అనుబంధ విభాగాల జోనల్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అనుబంధ విభాగాల జిల్లా, మండల, రాష్ట్రస్థాయి కమిటీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా వివరించాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అనుబంధ విభాగాలకు భాగస్వామ్యం కల్పించే విధంగా చూస్తామన్నారు. సీఎం జగన్ విద్య, వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ విద్యార్థి విభాగం సమావేశంలో విజయసాయిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. గతంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను అందరికీ వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని, 2019కి ముందు విద్యార్థి విభాగంలో పనిచేసిన నాయకులకు సీఎం జగన్ మంచి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా 15 రోజుల్లో కమిటీలను నియమిస్తామని చెప్పారు. మహిళల సాధికారతకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వరుదు కళ్యాణి తెలిపారు. అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా మహిళలకు ఎంతో తోడ్పాటును అందజేస్తున్నారన్నారు. అంతకు ముందు యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నేతృత్వంలో యువజన విభాగం సమావేశం జరిగింది. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలను విజయసాయిరెడ్డి తెలుసుకున్నారు. -
1,650 జనాభా ఉన్న గ్రామంలోనే 270 మందికి పింఛన్లా!
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 1,650 మంది (448 ఇళ్లు) జనాభా ఉన్న గుంటూరు జిల్లా చింతలపూడిలో 252 మందికి నెలనెలా పింఛన్లు ఇస్తోందని అధికారులు తెలపడంతో కేంద్ర పంచాయతీరాజ్శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. తాడేపల్లిలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలును స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వే, స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల పరిధిలోని ఉండే ఇళ్లకు సంబంధించి యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చే ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన 15వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై ఆరా తీశారు. పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టిన అనంతరం ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఇంకా రూ.3.89 లక్షలు ఆర్థికసంఘ నిధులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులను కేవలం సీసీ రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు పెట్టాలని చంద్రశేఖర్కుమార్ సూచించారు. పంచాయతీపై భారం లేకుండా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి తెలిపిందని చెప్పారు. డిజిటల్ ల్రైబరీల ఏర్పాటు ద్వారా గ్రామంలోని పేద విద్యార్థులు, నిరుద్యోగులు సైతం ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర పోటీపరీక్షలకు సమర్థంగా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో పర్యటించి అక్కడ అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి, అదనపు కమిషనర్ సుధాకర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, గుంటూరు జెడ్పీ సీఈవో మోహనరావు, డీపీవో కేశవరెడ్డి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లానాయక్, దుగ్గిరాల తహశీల్దార్ మల్లేశ్వరి, చింతలపూడి సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు. -
‘జగనన్నే మా భవిష్యత్తు’.. అడిగి మరీ తీసుకుని ఇళ్లకు, ఫోన్లకు స్టిక్కర్లు..
సాక్షి, అమరావతి: గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావారణంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 15,004 సచివాలయాల పరిధిలో 1.65 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మందిని నేరుగా కలవడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహసారథులకు ప్రతి ఇంటా ఆ కుటుంబ సభ్యులు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా కార్పొరేట్ బడులకు దీటుగా అభివృద్ధి చేసి.. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి.. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా తమ పిల్లల భవితకు బంగారు బాటలు వేసిన జగనన్నే మా భవిష్యత్తు అంటూ ముక్తకంఠంతో అక్కాచెల్లెమ్మలు నినదిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కలమల్ల గ్రామంలో ప్రజలతో మాట్లాడి బుక్లెట్లోని ప్రశ్నలకు జవాబులు నమోదు చేస్తున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే.. వాటిని వడ్డీతో సహా నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా ద్వారా చెల్లిస్తానని ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకుంటూ ఇప్పటికే మూడు విడతలు డబ్బులను ఖాతాల్లో వేశారని అక్కచెల్లెమ్మలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్కు పోటీలు పడి మిస్డ్ కాల్ ఇచ్చిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు.. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలంటూ ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నాలుగు రోజుల్లో 39 లక్షల కుటుంబాలను కలిస్తే.. అందులో 28 లక్షల మంది ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్తోనే ఉన్నారని స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా సర్వేకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం నాలుగో రోజు అంటే సోమవారం ముగిసేసరికి 39 లక్షల కుటుంబాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహసారథులు కలిశారు. ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పుల్లోని ఐదు ప్రశ్నలను చదివి.. టీడీపీ సర్కార్కూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరించారు. చంద్రబాబు సర్కార్ హయాంలో ఇంటి స్థలం కావాలన్నా.. పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలకు లంచాలు ఇచ్చుకున్నామని.. అయినా సరే పథకాలను తమకు మంజూరు చేయలేదని అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వకుండా పథకాలు అందుతున్నాయని కొనియాడారు. చదవండి: టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ ప్రకటన.. మచిలీపట్నం టూర్కు బాబు వెనుకడుగు సోమవారం నాటికి 28 లక్షల మంది ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చారు. మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రాగానే సంతోషంతో కేరింతలు కొట్టారు. సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్లర్లను గృహసార«థుల వద్ద అడిగి మరీ తీసుకుని.. ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని సంబరపడిపోయారు. -
పెంచితే అభాండాలా?
ప్రతి కలెక్టర్కు చెబుతున్నా. మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం. పేదవాడికి దగ్గరగా ఉండే మనసులు మనవి. అర్హత ఉన్నప్పటికీ ఇవ్వని పరిస్థితి, పథకాలు రాని పరిస్థితి, కటింగ్ అయిన పరిస్థితి అసలు ఉండకూడదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ లబ్ధిదారుడికే ఇవ్వండి. నాకు అర్హత ఉండి కూడా ఈ ప్రభుత్వంలో మంచి జరగలేదనే మాటను ఏ ఒక్క పేదవాడి నుంచి కూడా, ఏ ఒక్క కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనిపించుకునే పరిస్థితి రానివ్వద్దు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి పింఛన్ మొత్తాన్ని పెంచుతుండటాన్ని జీర్ణించుకోలేక పెన్షన్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మానవతా దృక్పథంతో పని చేస్తుంటే మంచిని సహించలేక ఆశ్చర్యకరమైన వార్తలు రాస్తున్నారని, అభాండాలు వేయాలన్న తపనతో కట్టుకథలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు, కట్టుకథలు, విష రాతలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాస్తవాలను గట్టిగా వెల్లడించాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు దూరం కారాదనే సంకల్పంతో ఏ కారణంతోనైనా పొరపాటున పథకాలు అందని అర్హులకు కూడా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.590.91 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వారినుద్దేశించి సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ.. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు తప్పుడు ప్రచారాలు.. అర్హత ఉన్నవారికి ఏ పథకం కూడా మిస్ కాకూడదు. ఇది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అలాగే అర్హత లేని వారికి రాకూడదు. ఏ పథకమైనా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఆడిట్ జరగాలి. ఇందులో తప్పేముంది? పెన్షన్లకు సంబంధించి కొంతమందికి నోటీసులు వెళ్లాయి. ఎక్కడెక్కడ సందేహాలున్నాయో వాటిని ప్రస్తావిస్తూ నోటీసులు ఇస్తారు. దానికి సమాధానాలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత రీ వెరిఫై చేసి అనంతరం ఏదైనా చర్య తీసుకుంటారు. అంతేకానీ రీ వెరిఫై చేయకుండా ఏ చర్యలూ తీసుకోరు. కేవలం నోటీసులిస్తేనే పెన్షన్లు తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా, ఎక్కడైనా నష్టం జరుగుతుందా? అని అంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాలి. విష వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం మనం ఇవాళ ఒక పార్టీతో యుద్ధం చేయడం లేదు. ఒక విష వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. మనం ఎలాంటి మంచి చేసినా నెగిటివ్గా చూపించాలని తపనపడే ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 విష వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. అయినా కూడా మంచి చేసేవాళ్లకి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి విష వక్రీకరణలు చేసే వారికి దేవుడే సమాధానం చెబుతాడు. విష రాతలు రాసేవారికి దేవుడే మొట్టికాయ వేస్తాడు. వాళ్లు చేసే ఏ ఆరోపణ అయినా మనం పాజిటివ్గా తీసుకుందాం. అందులో నిజం ఉంటే సరిదిద్దుకుందాం. నిజం లేకపోతే వారి తప్పును కచ్చితంగా తెలియజేసే కార్యక్రమం చేయాలి. లేదంటే తప్పుడు సమాచారం పోతుంది. వాళ్లు చెప్పేదే నిజమనుకునే ప్రమాదం ఉంది. మన తప్పు లేకపోతే మీడియా సమావేశం పెట్టి గట్టిగా చెప్పండి. అప్పుడే వాళ్లు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపినట్లు అవుతుంది. మనం ప్రజా పాలకులం. అంటే ప్రజలకు సేవకులం అని అర్థం. పాలన అంటే సేవ అనే అర్థం. ప్రతి అధికారి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అధికారం ప్రజా సేవకే... దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ మనం వేసే అడుగు మన పాలనకు అద్దం పట్టే విధంగా జరుగుతోంది. అధికారం చలాయించడానికి కాదు.. ప్రజల కోసమే మనం ఉన్నాం. ప్రజలకు సేవ చేయటానికే మనం ఉన్నామని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. డీబీటీ, నాన్ డీబీటీతో రూ.3.30 లక్షల కోట్ల లబ్ధి ఇవాళ లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు ఇవ్వకుండా ఎంత పారదర్శకంగా పాలన జరుగుతుందో చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఈ 36 నెలల వ్యవధిలో బటన్ నొక్కి డీబీటీ ద్వారా రూ.1.85 లక్షల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు జమ చేశాం. దీనికి నాన్ డీబీటీ అంటే ఇళ్లు, ఇళ్ల పట్టాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ట్యాబ్లు, విద్యా కానుక తదితరాలతో డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.3.30 లక్షల కోట్ల మేర అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చగలిగాం. కళ్లూ, చెవులు మీరే.. కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటి వారు. వారి పాత్ర చాలా కీలకం. వారు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది. కలెక్టర్లకు ఈ విషయంలో అభినందనలు. పారదర్శకంగా, అవినీతికి చోటు లేకుండా చేయగలిగారు కాబట్టే ఒక గొప్ప వ్యవస్థను తేగలిగాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ.తిరుపాల్రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్(ఎఫ్ఏసీ) వై.మధుసూదన్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, బీసీ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, హేండ్లూమ్స్, టెక్స్టైల్స్ ముఖ్య కార్యదర్శి కె.సునీత, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, హేండ్లూమ్స్ అండ్ టెక్టŠస్టైల్స్ కమిషనర్ ఎంఎం నాయక్, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, కాపు వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి. రేఖారాణి, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక కార్యదర్శి బీఎం దివాన్, సచివాలయాల శాఖ కమిషనర్ షన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మీ కష్టం తెలిసిన ప్రభుత్వం.. మనది మనసున్న ప్రభుత్వం.. పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం.. రైతన్నల కష్టం తెలిసిన ఎరిగిన ప్రభుత్వం. అందుకే ఏ ఒక్కరికైనా, ఏ కారణం చేతనైనా, ఏ ఒక్క పథకమైనా అర్హత ఉన్నప్పటికీ పొరపాటున అందకపోతే కంగారు పడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నాం. పథకం నెల రోజులలోగా దరఖాస్తు చేసుకోమని చెప్పాం. దాన్ని రీ వెరిఫై చేస్తాం. జనవరి నుంచి మే వరకు అమలైన పథకాలకు సంబంధించి మిగిలిపోయిన అర్హులకు జూన్లోనూ, జూన్ నుంచి నవంబరు వరకు అమలైన వాటికి డిసెంబరులోనూ మిగిలిపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అర్హులు ఎవరూ మిస్ కాకూడదని తపన పడి ఇచ్చే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో కూడా జరిగి ఉండదు. అది కూడా అర్హుల జాబితాను సామాజిక తనిఖీల కోసం గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తూ మరీ పారదర్శకంగా అందించడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అందులో భాగంగా ఈ రోజు 11 పథకాలకు సంబంధించి మిగిలిపోయిన (జూన్ నుంచి నవంబరు వరకు) 2,79,065 మంది అర్హులకు మంచి చేస్తూ రూ.591 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. నాడు – నేడు.. ఎంత తేడా? ‘జన్మభూమి’ ఆగడాలు.. మరుగుదొడ్లకూ లంచాలు గత ప్రభుత్వ హయాంలో ప్రతి అడుగులో, ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం. నాడు ఏ పథకం రావాలన్నా అడిగే మొట్టమొదట ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందిన వారు? ఇచ్చే అరకొర కూడా లంచాలు చెల్లిస్తేనే కానీ అందని దుస్థితి. గత ప్రభుత్వ హయాంలో గమనిస్తే అరకొరగా ఇచ్చిన పింఛన్ కేవలం రూ.1,000. అది కూడా మూడు నెలల పెన్షన్ సొమ్ము జన్మభూమి కమిటీల చేతిలో పెడితే కానీ వచ్చేది కాదు. జన్మభూమి కమిటీలకు రూ.20 వేలు లంచం చేతిలో పెడితే కానీ ఇళ్లు వచ్చేవి కాదు. రూ.50 వేల సబ్సిడీ లోన్ ఇవ్వాలంటే రూ.20 వేలు జన్మభూమి కమిటీలకు ముట్టచెప్పాల్సిందే. మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచమే. మరుగుదొడ్లకు కూడా లంచాలు తీసుకున్న అధ్వాన్న పరిస్థితిని మనం గతంలో చూశాం. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే ఆరాటంతో... ఆ పరిస్థితులన్నీ ఇవాళ మార్చగలిగాం. వ్యవస్థలో పూర్తి మార్పులు తెచ్చాం. గ్రామస్థాయిలో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ కనిపిస్తోంది. సోషల్ ఆడిట్తో అర్హుల జాబితాలను ప్రదర్శించి పారదర్శకంగా ఇస్తున్నాం. అర్హత ఉండి కూడా ఏ ఒక్కరికైనా ప్రయోజనం దక్కకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాం. రీ వెరిఫై చేసి మంజూరు చేసే గొప్ప మనసు ఇవాళ కనిపిస్తోంది. అర్హులను వెతికి మరీ ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న ఆరాటంతో మంచి చేస్తున్నాం. ఇవాళ పార్టీలు, కులాలు, ప్రాంతాలు చూడటం లేదు. మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే ఇచ్చే గొప్ప ఆలోచన జరుగుతోంది. పెన్షన్ మొత్తంలో 175 శాతం పెరుగుదల గత ప్రభుత్వ హయాంలో 39 లక్షల పెన్షన్లు ఇవ్వగా ఈరోజు 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. గతంలో పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే ఇస్తే ఇవాళ రూ.2,750కి పెంచుతున్నాం. అందుకునే పెన్షన్ మొత్తంలో 175 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక పెన్షన్ల సంఖ్య 39 లక్షల నుంచి 62.70 లక్షలకు పెరిగిందంటే 60 శాతానికిపైగా పెరుగుదల ఉందని అర్థం. అలాగే నెలవారీ పింఛన్ల వ్యయంలో మూడున్నర రెట్లకుపైగా పెరుగుదల కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల బిల్లు వ్యయం రూ.400 కోట్లు కాగా నేడు నెలకు రూ.1,770 కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్నాం. ఇంత భారీగా పెరిగిన పరిస్థితుల్లోనూ ఇంకా ఎవరైనా అర్హులు పొరపాటున కూడా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో వారితో దరఖాస్తు చేయించి రీ వెరిఫై చేసి మరీ ఇస్తున్నాం. లబ్ధిదారుల కళ్లల్లో ‘సంతృప్తి’ అర్హులైన లబ్ధిదారులు పథకాలు అందుకోవడం ఒక ఎత్తయితే వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన అర్హులకు కూడా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తుండటంతో వారి కళ్లల్లో ఎంతో సంతోషం కనిపిస్తోంది. లంచాలు ఏమైనా ఇస్తున్నారా? అంటే మా జగనన్న వచ్చినప్పటి నుంచి ఆ మాటే లేదంటున్నారు. అన్ని పల్లెలు, పట్టణాల్లో అదే మాట వినిపిస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ మా అన్న వచ్చిన తర్వాత జల్జీవన్ మిషన్ ద్వారా ఇంటి దగ్గరే నీళ్లు తీసుకుంటున్నాం అని చెబుతుంటే ఆనందంగా ఉంది. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి) అన్నలా, తమ్ముడిలా, కుమారుడిలా అమ్మ ఒడి మూడో విడత డబ్బులు రాకపోవడంతో వలంటీర్ను కలిశా. బ్యాంక్ ఖాతా లింక్ కాకపోవడంతో పడలేదని చెప్పారు. మా వలంటీర్ సచివాలయానికి తీసుకెళ్లి లింక్ చేయించింది. మీరు మాట ఇచ్చారంటే తప్పరని తెలుసు. మళ్లీ లిస్ట్లో నాపేరు రావడంతో సంతోషంగా ఉంది, నవరత్నాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సచివాలయ వ్యవస్థతో పనులన్నీ జరుగుతున్నాయి. అన్నీ ఇంటి ముందుకే వస్తున్నాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా అభివృద్ధి జరుగుతోంది. మాలాంటి పేదల సొంతింటి కలను కూడా మీరు నెరవేర్చారు. ప్రతి ఇంట్లో మిమ్మల్ని అన్నలా, తమ్ముడిలా, కుమారుడిలా భావిస్తున్నారు. మీరు సీఎంగా రావడం మాకు వరం. – వెలమల నాగమణి, లబ్ధిదారు, పెద్ద తాడివాడ, విజయనగరం జిల్లా కాపులను గుర్తించింది మీరే.. మాకు గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మీరు మాకు కాపునేస్తం ఇచ్చారు. అయితే రెండోసారి రాలేదు. వలంటీర్ నిన్న కాల్ చేసి మీకు కాపు నేస్తం వచ్చిందని చెప్పడంతో చాలా సంతోషం వేసింది. రూపాయి అడగాలంటే మనసు ఒప్పుకోక ఇంట్లోనే ఉండే మా కాపు మహిళలకు మీరు అండగా నిలుస్తున్నారు. కాపులను మీరు గుర్తించారు. ఇవాళ గర్వంగా చెబుతున్నాం జగనన్న మాకు డబ్బులు ఇస్తున్నారని. ప్రతి ఇంటికి మీరు ఎంతో సాయం చేస్తున్నారు. మా నాన్నకు పింఛన్ వస్తోంది. నా పెద్ద కుమారుడు జగన్ ప్రతి నెలా తెల్లవారగానే డబ్బులు పంపుతున్నాడని సంతోషంగా చెబుతున్నారు. మాకు ఆసరా కూడా వచ్చింది. – దేవిశెట్టి శారదాదేవి, లబ్ధిదారు, కొవ్వూరు, కాకినాడ రూరల్ మండలం -
Rythu Bharosa Kendralu: ఆర్బీకే ఓ అద్భుతం!
సాక్షి, అమరావతి, గన్నవరం/కంకిపాడు/ పెనమలూరు: వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా వ్యవహరిస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం అభినందించింది. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయతగ్గవని, వాటిపై అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తామని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఖ్యాతి సాధించిన ఆర్బీకేల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులందరికీ ఆ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. నిపుణుల బృందం బుధవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం, కంకిపాడు మార్కెట్ యార్డులోని వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, వణుకూరులోని ఆర్బీకేని పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసింది. రైతులను స్వయంగా పలుకరించి అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై వ్యవసాయం, రైతు సంక్షేమంపై చర్చించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)తో భాగస్వామి అయ్యేందుకు అభ్యంతరం లేదన్నారు. నష్టపోతున్న రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్ పొందుపర్చాలని సూచించారు. మోడల్ ఖరారు కాగానే కేంద్రంతో కలసి పాలు పంచుకుంటామన్నారు. కృష్ణాజిల్లా వణుకూరు ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను తెలుసుకుంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ ఇలాంటివి ఎక్కడా చూడలేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అద్భుతమని, ఇలాంటి వ్యవస్థను ఇంతవరకు ఎక్కడా చూడలేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా ప్రశంసించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన అగ్రిల్యాబ్స్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. అగ్రిల్యాబ్స్లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా విత్తనాలు, ఎరువుల్లో ఎక్కడైనా కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా తెలియజేయాలని కోరారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులను హెచ్చరించి కల్తీల బారినుంచి కాపాడుకోవచ్చన్నారు. పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు చాలా బాగున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ వినియోగించుకుంటున్న తీరు అమోఘమన్నారు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుందని అహూజా ప్రశంసించారు. ఈ–క్రాపింగ్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని, టెక్నాలజీని మిళితం చేసి రైతులకు చక్కటి ప్రయోజనాలు అందిస్తున్నారని చెప్పారు. రైతు క్షేత్రం (ఫామ్గేట్) వద్దే కొనుగోళ్లు, ఆర్బీకేల స్థాయిలోనే పంటల విక్రయం లాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేయడాన్ని స్వాగతించారు. ఆర్బీకేల స్థాయిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ఏర్పాటు ఎంతో మంచి ఆలోచనన్నారు. సామాజిక తనిఖీల కోసం అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్న విధానం పారదర్శకంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు విద్యా రంగంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులను సైతం తమతో పంచుకున్నారని పేర్కొంటూ విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృషిని అభినందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ మనోజ్ అహుజాకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాల్ సెంటర్, ఆర్బీకే, అగ్రిల్యాబ్ను సందర్శించిన బృందం నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటైన ఆర్బీకేలు నిజంగా గొప్ప ఆలోచన అని మనోజ్ అహూజా పేర్కొన్నారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను సందర్శించిన అనంతరం రైతు భరోసా కేంద్రం లైవ్ స్టూడియోను ఆయన పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా శాస్త్రవేత్తలు వెంటనే సలహాలు, సూచనలు అందిస్తుండటాన్ని ప్రశంసించారు. రైతులు ఫోన్ చేసినపుడు ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటిæ సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలను నిశితంగా గమనించారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరులో ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించారు. పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ధాన్యం కొనుగోలు తదితర సేవలు అందుతున్నాయన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సీఎం జగన్ ఆర్బీకేలను ఏర్పాటు చేసిన తరువాత రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. కియోస్క్ ద్వారా రైతులే స్వయంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించడాన్ని బృందం పరిశీలించింది. ఆర్బీకేలకు ఐఎస్ఓ నాణ్యత ప్రమాణ పత్రం లభించడం ఉత్తమ పనితీరుకు నిదర్శనమని బృందం సభ్యులు పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతు భరోసా రథం. వెటర్నరీ మొబైల్ వాహనాన్ని సైతం పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. అక్కడ నుంచి కంకిపాడు చేరుకుని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను పరిశీలించారు. పైసా ఖర్చు లేకుండా ఇన్పుట్స్ను ముందుగానే పరీక్షించుకుని కల్తీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. మట్టి నమూనాల పరీక్షలు, విత్తన సేకరణ, నాణ్యత పరిశీలనపై ల్యాబ్ సిబ్బందిని బృందం అడిగి తెలుసుకుంది. కేంద్ర బృందం సభ్యులైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్కరన్లతో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఆర్బీకేల జేడీ శ్రీధర్ కార్యక్రమంలో పొల్గొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం రైతులకు గరిష్ట ప్రయోజనం అందాలి: సీఎం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో పాటు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర దక్కని సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ఎంతో బాగుందని, ఈ పథకం పీఎంఎఫ్బీవైతో భాగస్వామిగా మారితే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అహూజా సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే రైతులకు గరిష్ట ప్రయోజనాలతో మంచి మోడల్ రూపొందించాలని సూచించారు. -
గడపగడపలో వేడుక
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. ఇంటింటా ఆశీర్వచనాలు.. ఎదురేగి స్వాగతాలు.. అందరి నోటా ప్రశంసల మధ్య పండగ వాతావరణంలో బుధవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభమైంది. మూడేళ్లలో సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరించి.. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రజాప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అసని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు నూతనోత్సాహంతో ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, అధికారుల బృందానికి ఊరువాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకూ వెళ్లిన ప్రజాప్రతినిధులకు.. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ.2,500 చొప్పున పెన్షన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటున్నారని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత అన్నలా, తమ్ముడిలా సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తుండటం వల్ల పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నామని అక్కచెల్లెమ్మలు ప్రజాప్రతినిధులకు వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం వల్లే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఉన్నత చదువులు చదివించుకోగలిగామని.. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కూడా వస్తున్నాయని సంతోషంతో వివరించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా కట్టిస్తూ సొంతింటి కలను నెరవేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన రోజునే అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో.. ‘ప్రజలకు ఇంత మంచి చేశాం అని సగర్వంగా కాలరెగరేసి చెప్పే పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ మాకు కల్పించారు’ అని ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అడుగడుగునా ఆదరణ ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన హామీలు.. ఇంటి యజమానురాలైన అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి ప్రజాప్రతినిధులు అందజేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ, ఎక్కడా లేని రీతిలో మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మూడేళ్లలోనే 95 శాతం అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలాల పంపిణీ మొదలు.. పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెప్పించే వరకు.. జిల్లాల పునర్ వ్యవస్థీరణ నుంచి పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటు వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. వీటన్నింటిపై న్యాయస్థానాల్లో కేసులు వేసి మారీచుల్లా అడ్డుకుంటున్న టీడీపీ.. దుష్ఫ్రచారం చేస్తున్న ఎల్లో మీడియా వ్యవహార శైలినీ ప్రజలకు వివరించారు. మూడేళ్లలో దేవుడి దయ, మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని.. ఇక ముందు కూడా ఇంకా మంచి చేస్తామని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మనందరి ప్రభుత్వానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు తెగేసి చెప్పారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడిగి మరీ.. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇంటింటా ఘన స్వాగతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ తిరిగారు. చిరు జల్లుల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో చిరుజల్లుల మధ్య కార్యక్రమం కొనసాగింది. ప్రజాప్రతినిధులు ఒకవైపు ప్రజలతో మమేకమవుతూనే, మరోవైపు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పండుగ వాతావరణంలో కొనసాగింది. డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, పింఛన్ పథకాల ద్వారా తన కుటుంబానికి రూ.1.50 లక్షకు పైగా లబ్ధి కలిగినట్లు సురేంద్రనగరానికి చెందిన శ్యామల అనే మహిళ చెప్పారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. మూడేళ్ల పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. పలు చోట్ల వర్షం పడుతున్నప్పటికీ ప్రజలు ప్రజా ప్రతినిధుల కోసం వేచి చూసి.. ఘనంగా స్వాగతం పలికారు. -
ప్రజా సంక్షేమం ఆగదు: సీఎం వైఎస్ జగన్
కొంత మంది అడ్డంకులు, కోర్టు కేసుల వల్ల విశాఖలో ఇళ్ల స్థలాల పంపిణీ 489 రోజులు ఆలస్యమైంది. కోర్టు వ్యవహారాలు ఎప్పుడు క్లియర్ అవుతాయి.. ఎప్పుడు నా అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇళ్ల పట్టాలిస్తామా అని వారానికోసారి అడ్వకేట్ జనరల్తో చర్చిస్తూ వచ్చాను. దేవుడి దయతో ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఒక్క విశాఖలోనే అక్కచెల్లెమ్మల చేతిలో రూ.10 వేల కోట్ల విలువైన ఆస్తిని పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎవరు అడ్డుపడినా సంక్షేమం ఆగదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలకు జరిగే మంచి పనులను అడ్డుకునేందుకు దుష్ట చతుష్టయం (చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5) ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జగన్కు ప్రజల మద్దతు పెరిగిపోతోందనే కడుపు మంట వారికి ఎక్కువైందని అన్నారు. గురువారం ఆయన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 1,24,581 మంది పేద మహిళలకు ఇంటి పట్టాలు, రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ కింద 3,03,581 మందికి గృహ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభించారు. అంతకు ముందు ఆయన మొత్తం లే అవుట్ను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్సార్ పార్కును ప్రారంభించారు. అనంతరం లే అవుట్లో అభివృద్ధి చేసిన మోడల్ ఇంటిని పరిశీలించారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం విశాఖపట్నం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 2 జగనన్న స్మార్ట్టౌన్షిప్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్బవరం మండలం పైడివాడ సభలో ఇళ్ల లబ్ధిదారులనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ అక్క చెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ► అడ్డంకులన్నింటినీ అధిగమించి ఇవాళ పైడివాడ అగ్రహారంలోని ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఈ కాలనీలో విలేజ్ క్లినిక్స్, సబ్సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీలు, హైస్కూల్స్, సచివాలయం, మార్కెట్ యార్డు, మూడు పార్కులు రాబోతున్నాయి. ► ఇక్కడ గజం స్థలం విలువ రూ.12 వేల చొప్పున మొత్తంగా ప్లాట్ రూ.6 లక్షలవుతుంది. దీనికి తోడు రూ.2 లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. రోడ్లు, డ్రైనేజ్, కరెంట్.. ఇలా మౌలిక వసతులతో కలిపి మొత్తం రూ.10 లక్షల ఇంటిని ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతుల్లో పెడుతున్నాం. తద్వారా ప్రతి అక్క చెల్లెమ్మకు శాశ్వత చిరునామా, సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది. పాదయాత్ర సమయంలో 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాను. దానికి మించి 30.70 లక్షల మందికి అందిస్తున్నాను. 2 – 3 లక్షల కోట్ల ఆస్తి ► గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో ఒకటి నుంచి ఒకటిన్నర సెంట్ల స్థలం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. రాష్ట్రంలో 13 వేల పంచాయతీలుంటే 17 వేల జగనన్న కాలనీలే రాబోతున్నాయి. ► విశాఖలో 1.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలతో పాటు రెండో దశ కింద ఇళ్లు కట్టేందుకు మంజూరు పత్రాలు కూడా అందజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మరో 1.79 లక్షల ఇళ్లకు శ్రీకారం చుడుతున్నాం. మొత్తం ఈ ప్రాంగణంలో 3.03 లక్షల మందికి ఇళ్లు కట్టుకునే మంజూరు పత్రాలు అందిస్తున్నాం. ► మొత్తంగా 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు మరో 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. వీటితో పాటు 2.60 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అంటే రాష్ట్రం మొత్తంమీద 21.27 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ► రాష్ట్రం మొత్తంలో నిర్మిస్తున్న ఇళ్ల కోసం 71,811 ఎకరాల్ని (పూలింగ్తో కలిపి) కేటాయించాం. రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.35 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు అందిస్తున్నాం. కనీస సౌకర్యాల కల్పనకు మరో రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. విశాఖలో అందిస్తున్న 1.25 లక్షల ఇళ్ల విలువ దాదాపు 10 వేల కోట్లు ఉంటుంది. మొత్తం 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందిస్తే.. వారి చేతిలో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని చేతిలో పెట్టినట్టు అవుతుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టా లేదనే బెంగొద్దు.. ► అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తాం. ఎవరికైనా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే 2.12 లక్షల ఇళ్లకు దరఖాస్తులు రాగా.. 1.12 లక్షల మందికి మంజూరు చేశాం. మిగిలిన వారికి రాబోయే రోజుల్లో మంజూరు చేస్తాం. గతంలో 225 అడుగుల ఇళ్ల బదులు ఇప్పుడు 340 అడుగుల ఇంటిని నిర్మిస్తున్నాం. ► ఇళ్ల కోసం 3 ఆప్షన్లు ఇస్తున్నాం. ఆప్షన్–1 కింద అక్క చెల్లెమ్మలు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే పనుల పురోగతి మేరకు రూ.1.20 లక్షలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తాం. ఆప్షన్–2 కింద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణ పనులు వాళ్లే చేసుకుంటామంటే.. వారికి కావాల్సిన ఇంటి నిర్మాణ సామగ్రి సబ్సీడీపై తక్కువ ధరకే ఇస్తున్నాం. కూలి మొత్తాన్ని అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తాం. ఆప్షన్–3 కింద ఎవరైనా అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేమని అనుకుంటే.. ప్రభుత్వమే నిర్మించనుంది. ► ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు రూ.1.80 లక్షలతో పాటు మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించనున్నాం. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులతో మాట్లాడాం. వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర జనాభా పరంగా రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇల్లు కట్టించి ఇస్తున్న మహా యజ్ఞం సాగుతోంది. పైడివాడలోని లేఅవుట్ లో మోడల్ హౌస్ లబ్ధిదారు రమణమ్మకి పట్టా అందిస్తున్న సీఎం రెండు ఫ్యాన్లు... 4 బల్బులూ ఉచితం ► ప్రతి ఇంట్లో ఒక బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉండేలా ప్లాన్ చేసి కడుతున్నాం. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, 4 ఎల్ఈడీ బల్బులు ఉచితంగా అందిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవుతుంది. జిల్లాల జీడీపీ కూడా పెరుగుతుంది. ► ఒక్కో ఇంటికి కనీసం 25 టన్నుల ఇసుక ఉచితంగా, సిమెంట్, స్టీల్ మొదలైనవి సబ్సీడీ కింద అందిస్తున్నాం. 500 కంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో నిర్మాణ సామగ్రి ఉంచేందుకు తాత్కాలిక గోడౌన్స్ నిర్మిస్తున్నాం. ► తొలి దశలో ఈ నెల 26 నాటికి 28,072 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. తొలిదశ ఇళ్ల నిర్మాణంలో ఇప్పటి వరకు 83.84 లక్షల టన్నుల సిమెంట్, 8.94 లక్షల టన్నుల స్టీల్, 3.72 కోట్ల టన్నుల ఇసుక, 294 కోట్ల ఇటుకలు, 269 లక్షల టన్నుల మెటల్ వినియోగం జరిగింది. ► కార్మికులకు 25.92 కోట్ల పని దినాలు కల్పిస్తున్నాం. దాదాపు 30 రకాల వృత్తి పని వారికి ఉపాధి దొరుకుతోంది. అప్పుడు, ఇప్పుడు తేడా మీరే గమనించండి ► 2014 – 2019 మధ్యా ప్రభుత్వం ఉంది.. అప్పుడూ ముఖ్యమంత్రి ఉన్నారు. స్థలాలివ్వలేదు. ఇళ్ల నిర్మాణం జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఉన్నారు. మార్పు ఏమిటంటే 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల ముఖంలో ఇవాళ చిరునవ్వు కనిపిస్తోంది. ► గత ప్రభుత్వంలో ఊడ్చి.. ఊడ్చి.. 5 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. తాను మాత్రం హైదరాబాద్లో ప్యాలెస్ కట్టుకొని సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను. తేడా మీరే గమనించాలి. ► ఇవాళ ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. కులం మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అనేది చూడకుండా.. అర్హత ప్రాతిపదికగా ఈ సోదరుడు అడుగులు ముందుకు వేశాడు. అన్నింటా దుష్టచతుష్టయం అడ్డంకులు ► దుష్ట చతుష్టయం.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మంచి పనులకు ప్రతి రోజూ ఎలా అడ్డుపడుతోందో మీరంతా చూస్తున్నారు. ► ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు మూడు రాజధానుల్లో విశాఖని ఒకటి చెయ్యాలనుకుంటే అడ్డుకున్నారు. అమరావతిలో అక్కచెల్లెమ్మలు 54 వేల మందికి ఇళ్ల పట్టాలిస్తామనుకుంటే.. కులాల మధ్య సమతుల్యం (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్) దెబ్బతింటుందనీ, పేదలు వారి మధ్య ఉండకూడదని దౌర్భాగ్యంగా కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. ఆ 54 వేల మంది పేదలకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తాం. ► రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి.. ఒకప్పటి రాజధానిగా ఉన్న కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తే.. దాన్ని కూడా అడ్డుకున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలకు నాణ్యమైన విద్య కోసం నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చేశాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ ప్రవేశపెడుతున్నాం. దానినీ అడ్డుకోజూస్తున్నారు. ► బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా, ఎక్కడ నుంచి ఎలాంటి సహాయం రాష్ట్రానికి అందకూడదని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం డబ్బులు ఇచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగినా.. ఓర్చుకోలేకపోతున్నారు. పేదలకు ఏ మంచి జరిగినా ఈ దుష్ట చతుష్టయానికి కడుపుమంట. కళ్లల్లో పచ్చకామెర్లు, బీపీ, ఒళ్లంతా పైత్యంతో బాధ పడుతున్నారు. ► అడ్డంకులను అధిగమించి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెబుతూ వలంటీర్లు సంక్షేమ పథకాలందిస్తున్నారు. రూ.లక్షా 37 వేల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించాం. శ్రీకాకుళం జిల్లాకు పోలవరం నీళ్లు తెస్తాం. నాన్న స్వప్నం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చరిత్రపుటల్లో నిలిచిపోయే రోజిది విశాఖ నగరంలో 1.24 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించడం చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జీవనం కోసం విశాఖ వచ్చిన అనేక మంది అద్దె ఇళ్లల్లో ఇబ్బందులు పడుతున్నారు. వారందరి సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్కు లబ్ధిదారులందరి తరఫున ధన్యవాదాలు. ఇక్కడ నిర్మాణమవుతున్నది జగనన్న కాలనీ కాదు.. జగనన్న పట్టణం. పేదలకు లబ్ధి చేకూరకుండా కుట్రలతో చంద్రబాబు కోర్టులకు వెళ్లినా..న్యాయమే గెలిచింది. బీసీ, బడుగు, బలహీన, దళిత వర్గాలకు సీఎం వైఎస్ జగన్ ద్వారానే న్యాయం జరుగుతుంది. – జోగి రమేష్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మీరు మహిళా పక్షపాతి అన్నా.. మాది పేద కుటుంబం. మీరు మా సొంతింటి కలను నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు. నాలాంటి పేద వారికి ఇల్లు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. మేం అద్దెలు కట్టలేక కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నాకు మీరు భరోసానిచ్చారు. నా ఇంట్లో నేను ధైర్యంగా బతికే ఆధారం కల్పించారు. నేనున్నానంటూ తోడుగా నిలిచారన్నా. నాకు వివిధ పథకాల ద్వారా సాయం అందుతోంది. మీ అన్న మహిళా పక్షపాతి అంటారు. అవును నేను ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాను. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. – నవమణి, లబ్ధిదారు, గాజువాక -
కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: మోదీ
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కావడంతో ‘‘సామాజిక న్యాయ పఖ్వాడా’’లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అణగారిన వర్గాల కోసం కేంద్రం చేపట్టిన గృహనిర్మాణం, పౌష్టికాహారం, ఉచిత రేషన్ వంటి పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రధానమంత్రులు చేసిన సేవల్ని గుర్తించింది కేవలం బీజేపీయేనని పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న మన దేశ మాజీ ప్రధానుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయ మ్యూజియం ప్రారంభం కానుంది. స్త్రీల పేరిట ఇళ్లతో మహిళా సాధికారత ఇంటిపై యాజమాన్య హక్కులు మహిళలకు ఉంటే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ఇంట్లో ఆర్థిక వ్యవహారాలపై వారి పట్టు పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం కింద 5.21 లక్షల పక్కా ఇళ్లను లబ్ధిదారులకు అందించే గృహప్రవేశం కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. (చదవండి: భూమి పుట్టుకపై కొత్త ఆధారం) -
Andhra Pradesh: సేవలకు సత్కారం
సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటవ తేదీ తెల్లవారుజామున అవ్వాతాతలకు గుడ్మార్నింగ్ చెప్పి పింఛన్ డబ్బులతో సహా 35 రకాల సేవలను లబ్ధిదారుల ఇంటి ముంగిటకు చేరవేస్తున్న వలంటీర్లను వరుసగా రెండో ఏడాది కూడా సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పని చేస్తున్న 2,33,333 మంది వలంటీర్లను సత్కరించనుంది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన వలంటీర్లను నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 875 మందిని ‘సేవా వజ్ర’ అవార్డుతో పాటు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్.. బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్తో సత్కరించనున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున, నగర కార్పొరేషన్కు పది మంది చొప్పున 4,136 మందికి ‘‘సేవా రత్న’’ అవార్డుతో పాటు రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్లను అందచేస్తారు. కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేని 2,28,322 మంది ‘‘సేవా మిత్ర’’ అవార్డుతో పాటు రూ.10 వేల నగదు బహుమతి అందుకోనున్నారు. నెలంతా పండుగలా.. రాష్ట్రమంతటా నెల రోజుల పాటు పండుగలా ఎక్కడికక్కడ సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నూతన సంవత్సరాది ఉగాది నేపథ్యంలో ఏప్రిల్ నాలుగో తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేటలో వరుసగా రెండో ఏడాది వలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన కొద్ది మంది వలంటీర్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. అనంతరం సేవా వజ్ర, సేవా రత్న అవార్డు గ్రహీతలకు జిల్లా ఇన్చార్జి మంత్రి, స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఒక రోజు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో లేదంటే రెండు మూడు సచివాలయాలవారీగా సేవా మిత్ర అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తారు. 3 అంశాల ఆధారంగా ఎంపిక.. కేవలం ప్రతిభ ఆధారంగానే పూర్తి పారదర్శక విధానంలో సేవా వజ్ర, సేవా రత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేశారు. సచివాలయంలో వలంటీర్ల బయోమెట్రిక్ హాజరు, పింఛన్ల పంపిణీ తీరు, కరోనా థర్డ్వేవ్లో ఇంటింటి ఫీవర్ సర్వే సందర్భంగా పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించారు. ప్రతి నెలా నిబంధనల ప్రకారం సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు నమోదుకు 35 మార్కులు కేటాయించారు. పింఛన్ల పంపిణీకి మరో 35 మార్కులు నిర్దేశించారు. వలంటీరు తన పరిధిలో పింఛనుదారులందరికీ తొలిరోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తే 35 మార్కులు కేటాయిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే పంపిణీలో ఏ రోజు ఎన్ని పింఛన్లు పంపిణీ చేశారన్న అంశం ఆధారంగా ఆ 35 మార్కులను వర్గీకరిస్తారు. ఫీవర్ సర్వేకు మరో 30 మార్కులు కేటాయించి డిసెంబరు, జనవరిలో తమ పరిధిలోని మొత్తం ఇళ్లలో సర్వే పూర్తి చేసిన వారికి మార్కులు కేటాయించారు. దాదాపుగా అందరికీ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కలిపి 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 2,59,106 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 2,33,333 మంది అవార్డులు అందుకోనున్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా కనీసం ఏడాది పాటు విధులు నిర్వహించిన వారు అవార్డులు అందుకోనున్నారు. -
పేదవాడి జీవితానికి అండగా నిలిచినా బడ్జెట్ ఇది
-
పేదలకు అండగా నిలిచిన బడ్జెట్ ఇది: మంత్రి వేణుగోపాల కృష్ణ
సాక్షి, అమరావతి: పేదవాడికి అండగా నిలిచిన బడ్జెట్ ఇదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. విద్య కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ అన్నారు. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కూడా మేలు చేసే బడ్జెట్ అని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు రూ.29 వేల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలిపారు. బీసీ వర్గాలకు గొప్ప మేలు చేసే బడ్జెట్ ఇదని చెప్పారు. చదవండి: ఏపీ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత: శ్రీకాంత్రెడ్డి ఆర్థిక రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులకు మేం వడ్డీ కడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ఎక్కడా కేటాయింపులు తగ్గలేదన్నారు. నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని సైతం అడ్డుకునేందుకు యత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం టీడీపీ అని దుయ్యబట్టారు. ప్రజలకు మంచి బడ్జెట్ ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు శ్రీకాంత్రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రోన్ల వినియోగం.. దేశంలోనే వినూత్న ప్రయత్నం: ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రవేశపెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిందని.. 10 వేల డ్రోన్లు వాడుకలోకి వస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పెస్టిసైడ్లు, ఎరువులు, విత్తనాలు డ్రోన్లతో చల్లడం వల్ల సేద్యం ఖర్చు తగ్గుతుందన్నారు. 20 వేల మంది డ్రోన్ పైలట్లుగా ఉపాధి పొందుతారన్నారు. దేశంలోనే వినూత్న ప్రయత్నం అని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. సబ్ప్లాన్లకు భారీగా కేటాయింపులు: సామినేని బడ్జెట్లో వాస్తవ కేటాయింపులు, ఖర్చులు ఉంటాయని.. వివిధ సబ్ ప్లాన్లకు భారీగా కేటాయింపులు చేశారని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. చంద్రబాబు వ్యవసాయ బీమా బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లించిదన్నారు. -
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ: మాజీమంత్రి గుడ్ బై
మంగళగిరి: వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలు భేషుగ్గా ఉన్నాయని, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి, ఆప్కో మాజీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు ప్రశంసించారు. టీడీపీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసి, మాజీ సీఎం చంద్రబాబుకు లేఖ పంపిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. టీడీపీలో తనకు గుర్తింపు లేదని, 2019 ఎన్నికల్లో తన కుటుంబానికి టికెట్ ఇస్తానని చెప్పి చివరకు లోకేశ్ను రంగంలోకి దింపి పార్టీ అధిష్టానం తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు, మాజీ ఇన్చార్జ్ పెత్తనంతో ఇతర కులాలన్నింటినీ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం పార్టీలో చంద్రబాబు సామాజికవర్గానికి తప్ప మిగతా ఏ కులానికీ ప్రాధాన్యం లేదన్న విషయాన్ని తాను గుర్తించానని, ఆ సామాజికవర్గం వారు తప్ప ఇతర ఏ కులాలూ ఇమడలేవని ఓ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా తాను స్పష్టంగా చెబుతున్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే.. అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ తనకు రాజకీయ జీవితాన్నిచ్చారని, ఆయన కుటుంబంపై తనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మురుగుడు స్పష్టం చేశారు. -
గిరిజన సంక్షేమంలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా గిరిజనులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నావల్జిత్ కపూర్ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సోమవారం కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు, ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన–శిక్షణ మిషన్, సెంటర్ రీజనల్ స్టడీస్ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్న నావల్జిత్ కపూర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీలో గిరిజన ఉప ప్రణాళిక అమలుకు సహకారం అందిస్తామన్నారు. ఉప ప్రణాళిక అమలులో ముందున్నాం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజన ఉప ప్రణాళిక అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. నవరత్నాలతో పాటు పలు సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, హక్కుల రక్షణలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులకు 2వ దఫా పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్బాషా, గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు రవీంద్రబాబు, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. థింసా నృత్యం చేసిన మంత్రి పుష్పశ్రీవాణి సీతానగరం(పార్వతీపురం)/కురుపాం/ పాడేరు: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. స్థానిక గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా: విశాఖ ఏజెన్సీలోని పాడేరులో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కలెక్టర్ మల్లికార్జున, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నర్సింగరావు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరయ్యారు. -
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరిఢవిల్లుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శిద్ధా రాఘవరావు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. తాడేపల్లివైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎప్పుడు ఏ కొత్త పథకం ప్రవేశపెడతారా.. అని దేశంలోని మిగితా ముఖ్యమంత్రులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారన్నారు. ఏపీ సీఎంను అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునే వాళ్లమన్నారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నిర్వాకంతో నవంబర్ ఒకటో తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. ఇలా చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్ సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని తెలిపారు. అలాగే, వాసవీ దేవాలయాలకు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చినట్లుగానే, ఇప్పుడు సీఎం జగన్ మినహాయింపులు ఇస్తున్నారని తెలిపారు. -
ఖాళీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల అమలులో అన్యాయం.. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం.. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే కమిషన్లు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగియడం.. వాటిని తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో బడుగు, బలహీన వర్గాల్లో అన్యాయానికి గురైన బాధితుల గోడు వినేవారు కరువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ–ఎస్టీ కమిషన్తోసహా బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. చైర్మన్, సభ్యుల పదవీ కాలంముగిసి నెలలు గడుస్తోంది. వాస్తవానికి పదవీ కాలం ముగిసిన వెంటనే నూ తన కమిషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉం డగా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ కమిషన్ ఏం చేస్తుంది? జాతీయ స్థాయిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లు చట్టబద్దత కలిగిన సంస్థలు. వీటికి సమాంతరంగా రాష్ట్రాల్లో ఏర్పాటైన కమిషన్లకు విశిష్ట అధికారాలుంటాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, అట్రాసిటీ చట్టం అమలు, సంబంధిత సామాజిక వర్గాల స్థితిగతుల అధ్యయనం, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం, సంక్షేమ పథకాల రూపకల్పనకు సూచనలు తదితర అంశాల్లో రాష్ట్ర కమిషన్లు కీలక భూమిక పోషిస్తాయి. ఇక కులాల విభజన, కేటగిరీల్లో మార్పులు చేర్పులు, రిజర్వేష్లనలో మార్పులపై ప్రతిపాదనలు చేయడం లాంటి అంశాల్లో చురుకుగా ఉంటాయి. కమిషన్ను ఆశ్రయించిన వారికి సత్వర సాయం అందించడం, క్షేత్రస్థాయి అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం, వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తే తక్షణ చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్కు ఉంటాయి. ఏడాదిన్నరకు పైగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ను 2016 అక్టోబర్లో ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు సాగిన ఈ కమిషన్ గడువు 2019 అక్టోబర్తో పూర్తయింది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఇక మైనార్టీ కమిషన్ను గడువు సైతం ఈ ఏడాది జనవరితో ముగిసింది. ఎస్టీ, ఎస్టీ కమిషన్కు ఎక్కువగా అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యా దులు వస్తుంటాయి. ఇది వరకున్న కమిషన్కు మూడేళ్ల కాలంలో పదివేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రోజు కు సగటున పది ఫిర్యా దులు వచ్చినట్లు చెప్పొచ్చు. ఈ ఫిర్యాదులను యుద్దప్రాతిపదికన పరిశీలించి వేగంగా పరిష్కరం చూపింది. ప్రస్తుతం ఐదు నెలలుగా కమిషన్ ఖాళీ కావడంతో ఫిర్యాదులపై గందరగోళంనెలకొంది. తక్షణమే కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి. ఆశ్రిత కులాలకు గుర్తింపు దక్కింది బీసీ సమాజంలో దాదాపు 30 రకాల కులాలకు గుర్తింపు లేదు. అలాంటి కులాలకు మా హయాంలో గుర్తింపు దక్కింది. 30 కులాల నుంచి వినతులు, అభ్యంతరాల స్వీకరణకు ఉపక్రమించాం. కానీ 18 కులాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. పరిశీలన చేసి 17 కులాలకు గుర్తింపు ఇచ్చాం. ఇందులో 14 కులాలను బీసీ–ఏ కేటగిరీలో, 3 కులాలను బీసీ–డీ కేటగిరీలో చేర్చాం. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై సుధీర్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కోర్టు పరిధిలో ఈ అంశం పెండింగ్లో ఉంది. – బీఎస్ రాములు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ విప్లవాత్మక మార్పులు తెచ్చాం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విప్లవాత్మక మార్పు లు తెచ్చింది. దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సూచించగా, సీఎం కేసీఆర్ తక్షణమే స్పందిం చి నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. ఈఎండీ మినహాయింపుతో రూ.కోటి వరకు పనులు కేటాయిస్తోంది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో క్రియాశీలంగా పనిచేసింది. మూడేళ్ల కాలంలో అట్రాసిటీతోపాటు అన్ని కేటగిరీల్లో 13,905 వినతులు స్వీకరించి పరిష్కరించాం. రూ.78.30కోట్లు బాధితులకు పరిహారం అందజేశాం. – ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ -
ఏపీ: రేపు రైతు దినోత్సవం.. కార్యక్రమాలివే..
సాక్షి, అమరావతి: రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున చేపట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులిచ్చారు. రైతు దినోత్సవ కార్యక్రమాలివే.. ►రూ.413.76 కోట్లతో నిర్మించిన 1,898 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, రూ.79.50 కోట్లతో నిర్మించిన 65 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లు, 8 ఆక్వా ల్యాబ్లు, 25 సీఏడీడీఎల్లను ప్రారంభిస్తారు. ►సన్న, చిన్నకారు రైతులకు సాగు యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆర్బీకేలకు అనుబంధంగా రూ.96.64 కోట్లతో 611 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్సీల)తో పాటు పాడి రైతుల కోసం ప్రత్యేకంగా 34 సీహెచ్సీలను ప్రారంభిస్తారు. ►రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ హాస్పిటల్స్, డిస్పెన్సరీలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లతో పాటు విశాఖపట్నంలోని స్మైల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, రూ.7.53 కోట్లతో విజయవాడలో పాడి రైతుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ప్రారంభిస్తారు. ►ఆర్బీకేల ద్వారా పాడి రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, 60 శాతం సబ్సిడీతో టీఎంఆర్ బ్లాక్స్, 50 శాతం సబ్సిడీపై మినరల్ మిక్చర్, చాప్ కట్టర్స్ పంపిణీకి శ్రీకారం. ►రూ.400.30 కోట్లతో ఆర్బీకేల స్థాయిలో నిర్మించతలపెట్టిన 1,262 గోడౌన్లకు, రూ.200.17 కోట్లతో కోత అనంతర మౌలిక సదుపాయాల కల్పనకు, మార్కెట్ యార్డుల్లో రూ.212.31 కోట్లతో ఆధునికీకరణ, అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, రూ.45 కోట్లతో 45 కొత్త రైతు బజార్లకు శంకుస్థాపనలు చేస్తారు. రూ.3 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 6 రైతు బజార్లను ప్రారంభిస్తారు. ►రూ.15 కోట్లతో నాబార్డు సీబీఎస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన ఆప్కాబ్ 13, డీసీసీబీ 24 బ్రాంచ్లకు శ్రీకారం చుడతారు. ►రాష్ట్ర స్థాయిలో 13 మందిని రూ.2.5 లక్షలు, జిల్లా స్థాయిలో నలుగుర్ని రూ.25 వేలు, మండల స్థాయిలో నలుగుర్ని రూ.5 వేల నగదు ప్రోత్సాహకాలతో సత్కరిస్తారు. -
నేటి నుంచి వలంటీర్లకు సత్కారం
సాక్షి, అమరావతి: సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనుంది. ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున అన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి ఆ నియోజకవర్గ పరిధిలో వలంటీర్లను సత్కరించనున్నారు. సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. విజయవాడ సమీపంలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పోరంకిలోని మురళీ రిస్టార్స్లో ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్య జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల శాఖ డైరెక్టర్ భరత్గుప్తా ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. రెండు జిల్లాల్లో మినహా... వలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో మూడు కేటగిరీల్లో సత్కరించనున్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను వలంటీర్లకు అందజేస్తారు. తొలిరోజు 11 జిల్లాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. తిరుపతి లోక్సభ స్థానానికి ఉపఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని మే 4వతేదీ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 13 అసెంబ్లీ నియోజక వర్గాలలో వివిధ అవార్డులకు ఎంపికైన వలంటీర్లకు నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ పోరంకిలో జరిగే సమావేశం నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు తెలిపారు. 28 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు.. ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకర్గం చొప్పున ఏప్రిల్ 28వతేదీ వరకు వలంటీర్లకు సత్కార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు. సంబంధిత నియోజకవర్గ పరిధిలో సమావేశాలు నిర్వహించిన రోజే వలంటీర్ల ఖాతాల్లో ప్రోత్సాహక బహుమతి సొమ్మును జమ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 2,66,092 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ ఏర్పాటు సమయంలో తీవ్రంగా విమర్శించిన వారి నోళ్లు మూతపడేలా ఏడాదిన్నరగా వలంటీర్లు ప్రజలతో మమేకమై అత్యుత్తమ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ ఫలాలను రాష్ట్రంలో ప్రతి గడపకూ చేరువ చేసిన వలంటీర్ల వ్యవస్థ పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మొదటి కేటగిరీ.. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన వలంటీర్లను ‘సేవామిత్ర’ అవార్డుతో సత్కరించి రూ.10 వేల చొప్పున నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ బహుకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,17,650 మంది వలంటీర్లను ఈ అవార్డుకు అర్హులుగా అధికారులు గుర్తించారు. రెండో కేటగిరీ.. ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఐదు మంది చొప్పున, ప్రతి నగర పాలక సంస్థ పరిధిలోని పదేసి మంది చొప్పున వలంటీర్లను ‘సేవారత్న’ అవార్డుతో సత్కరిస్తారు. రూ.20 వేల చొప్పున నగదు బహుమతితోపాటు సిల్వర్ మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ బహుకరిస్తారు. ఈ అవార్డుకు రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది వలంటీర్లను అర్హులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మూడో కేటగిరీ.. తమకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలోని ప్రజలకు సేవల ద్వారా పూర్తి స్థాయిలో చేరువై అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వలంటీర్లను అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసి ‘సేవావజ్ర’ అవార్డుతో సత్కరిస్తారు. రూ.30 వేల చొప్పున నగదు బహుమతితోపాటు గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీతో సత్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 875 మందిని ఇందుకు ఎంపిక చేశారు. కాగా పైన పేర్కొన్న మూడు కేటగిరీలకు ఎంపిక కాని వలంటీర్లకు కూడా బ్యాడ్జ్ అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం చేతులమీదుగా అవార్డులు వీరికే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా 9 మందికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఎంపీడీఓ విమాదేవి తెలిపారు. సేవావజ్ర అవార్డుకు యనమలకుదురు నుంచి ఎన్.రాజేష్, పి.ప్రత్యూష, కానూరు నుంచి షేక్ నూర్జహాన్, వి.భవాని, సాజిదాబేగం ఎంపిక కాగా సేవారత్న అవార్డును పొద్దుటూరుకు చెందిన కొడాలి నవీన్, జి.వలి, సేవామిత్ర అవార్డును ఆకునూరుకు చెందిన బిందుప్రియ, చోడవరానికి చెందిన గోపిబాబుకు అందించనున్నుట్లు చెప్పారు. -
ప్రగతి బాటలో ‘పల్లె’విస్తున్నాయ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏడాదిన్నర వైఎస్సార్ సీపీ పాలన పల్లెల ప్రగతికి బాటలు వేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పల్లెలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రీతిలో బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచిన పల్లెల ముంగిటకే పాలన చేరడంతో గ్రామస్తుల గుండెల నిండా సంతోషం కనిపిస్తోంది. ఒకప్పుడు ఏదైనా చిన్న సమస్య పరిష్కారం కావాలంటే కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుంతో కూడా తెలియని దుస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏదైనా సమస్యపై దరఖాస్తు ఇస్తే నిర్దేశించిన గడువులోపే.. అది కూడా పల్లె పొలిమేర దాటకుండానే పరిష్కారం లభిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను నూరు శాతం పూర్తి చేస్తుండటంతో పల్లె ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఓ వైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి రాష్ట్ర విభజనకు పూర్వం.. విభజన తరువాత కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరిలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిస్థాయిలో గ్రామాల చెంత చేరుతున్నాయి. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు కావడంతో సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుండటం శుభపరిణామమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అన్నిరకాల సేవలూ ప్రతి గుమ్మం ముంగిటకే చేరుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు, నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల స్వరూపమే మారిపోయింది. ఏ గ్రామంలో చూసినా సంక్షేమం వాయువేగంతో పరుగులు పెడుతోంది. మొత్తంగా జిల్లాలోని గ్రామాల్లో రూ.1,739.64 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైతు ముంగిటకే సేవలు రైతులకు గ్రామాల్లోనే అన్ని సేవలూ అందించాలనే లక్ష్యంతో రూ.264.33 కోట్లతో జిల్లాలో 1,129 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి పక్కా భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కావాలంటే రైతులు మండల కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీటివల్ల 7.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. జిల్లాలో 1,054 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో భవనానికి రూ.17.50 లక్షల చొప్పున రూ.184.45 కోట్లు వెచ్చిస్తున్నారు. దీంతో ప్రజలకు ఇంటి ముంగిటకే మంచి వైద్యం అందుబాటులోకి వస్తోంది. జిల్లాలో 914 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయింది. ఒక్కో భవనానికి రూ.7 లక్షల చొప్పున రూ.63.98 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి సచివాలయ, రైతుభరోసా, హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేశాం. ఈ పనులపై జిల్లా అధికారులు ఎప్పటికప్పడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి కావస్తుండగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. – ఎం.నాగరాజు, ఎస్ఈ, పంచాయతీరాజ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీల్లేవు.. కుల, మతాలూ లేవు గ్రామ సచివాలయ వ్యవస్థ జిల్లాకు మణిహారంలా నిలిచింది. ప్రతి పల్లెలో ఏర్పాటైన సచివాలయం ద్వారా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ 576కు పైగా సేవలు అందుతుండటం విశేషం. ప్రజలకు సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు దగ్గరవడంతో సేవలు కూడా సంతృప్తికర స్థాయిలో నూరు శాతం అందుతున్నాయి. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఆవిష్కృతమైన సచివాలయ వ్యవస్థకు సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కరప నుంచి శ్రీకారం చుట్టడం విశేషం. ఒక్కో సచివాలయ భవనానికి గరిష్టంగా రూ.40 లక్షలు వెచ్చిస్తున్నారు. జిల్లాలో 1,248 గ్రామ సచివాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.468.12 కోట్లు వెచ్చిస్తుండగా.. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాజానగరం మండలం చక్రద్వారబంధంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం పక్కా రోడ్డు.. సీసీ డ్రైన్లు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ చేపడుతోంది. 1,700 రహదారులను రూ.661 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 700 రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే 1,246 రహదారులను రూ.12.96 కోట్లతో చేపడుతున్నారు. 7,241 పక్కా రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణాలను రూ.84.80 లక్షలతో చేపట్టారు. -
2020పై సంక్షేమ సంతకం
ప్రజలు 2020ని కరోనా నామ సంవత్సరమని పిలుచుకున్నారు. ఈ ఏడాది ఆద్యంతం ‘కరోనా’ పేరు వినిపించని రోజంటూ లేదనడం అతిశయోక్తి కాదు. అందరి నోటా అదే మాట. అయితే ఇంతటి మహమ్మారి కోరలు చాచి, తన ప్రతాపాన్ని చూపినా.. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా కుంటుబడక పోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. కరోనా తొలి రోజుల్లో పలు దఫాలుగా ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ మొదలు ప్రస్తుతం కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ వరకు సంక్షేమం కొత్తపుంతలు తొక్కింది. హైకోర్టు తీర్పులు, ఎల్జీ ప్రమాదం, వరదలు, నివర్ తుపాన్, ఏలూరు ఘటనలు ఆందోళన కలిగించాయి. ఉద్యోగుల కల సాకారం ► ప్రభుత్వంలో విలీనం కావడమనేది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఎన్నో ఏళ్ల కల. ఈ కలను సాకారం చేస్తామని చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. అన్ని విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసిన ఆ కమిటీ.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ, ఇచ్చిన మాట నిలుపుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు జనవరి 1వ తేదీన 51 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ► వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. ► చిన్నారులను బడికి పంపించిన ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు జమ చేసే విప్లవాత్మక పథకం ‘అమ్మ ఒడి’కి శ్రీకారం చుట్టారు. పేద పిల్లల చదువుకు ఊతమిచ్చే పథకమిది. ► అన్నదాతలకు అండగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. ► అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు అసెంబ్లీ ఆమోదం. సీఆర్డీఏ రద్దుకు గ్రీన్సిగ్నల్. హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించిన కేబినెట్. శాసనమండలిలో నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి మూడు రాజధానుల బిల్లు. శాసనమండలి రద్దుకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 536 సేవలు. ► కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేసే ‘కాపునేస్తం’ పథకం అమలు. ప్రతి జిల్లాలో కోవిడ్ ఆస్పత్రులు ► ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మన రాష్ట్రానికీ పాకింది. నెల్లూరులో తొలి కేసు నమోదైంది. అంతకు ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి జిల్లాలో ఒక కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్.. అంటూ భారీ స్థాయిలో పరీక్షలకు శ్రీకారం చుట్టింది. ఖర్చుకు వెరవక పెద్ద ఎత్తున టెస్ట్ కిట్లకు ఆర్డర్ చేసింది. కరోనా సోకిన వారిని గుర్తించి ఐసోలేట్ చేయడం, లేదా ఆస్పత్రికి తరలించడాన్ని వేగవంతం చేసింది. కోవిడ్ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంది. కరోనా మరణాల శాతం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి బలవర్థక ఆహారం అందించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనాను ఎదుర్కొనే విషయంలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రధాని మోదీ ప్రశంసలు పొందింది. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించరాదని హైకోర్టు తీర్పు. కరోనా వైరస్ వల్ల ఎన్నికలను వాయిదా వేసిన స్టేట్ ఎన్నికల కమిషన్. ► రాష్ట్రంలో లాక్డౌన్ అమలు.. ఓటాన్ అకౌంట్ పద్దు ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం. రూ. కోటి పరిహారం ► విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్లో స్టైరీన్ గ్యాస్ లీకేజి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగితే.. నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో అంబులెన్స్లు ఘటన స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటనలో 12 మంది మృతుల కుటుంబాలకు, బాధితులకు ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్పై ఉన్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరి ప్రాథమిక వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన వారికి రూ.25 వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ రూ.10 వేల చొప్పున సాయం అందజేశారు. ► మద్యపాన నియంత్రణ చర్యలలో భాగంగా మద్యం ధరలు 75 శాతం పెంపు. మద్యం, ఇసుక అక్రమాల కట్టడికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటుకు సీఎం ఆదేశం. ► వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం ప్రారంభం. ► ఆర్టీసీ సర్వీసులు పాక్షికంగా పునః ప్రారంభం. చిన్న తరహా పరిశ్రమలకు రూ.1,100 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీ అమలు. ► ఎన్నికల కమిషనర్గా కనగరాజ్ నియామకానికి సంబంధించిన ఆర్డినెన్స్ రద్దు.. నిమ్మగడ్డ రమేష్కుమార్ కొనసాగింపు. ► రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్. నిమ్మగడ్డ రహస్య మంతనాలు ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్లతో రహస్య మంతనాలు సాగించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించాయి. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న ఓ ఉన్నతాధికారి టీడీపీ పెద్దల ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని అప్పటికే ఆరోపణలున్నాయి. కరోనా కేసులు పదుల సంఖ్యలో కూడా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేయడం, టీడీపీ పెద్దల సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ► సీ ఓటర్, ఐఏఎన్ఎస్ సర్వేలో.. దేశంలో టాప్–5 సీఎంల జాబితాలో వైఎస్ జగన్కు చోటు. ► వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, కాపు నేస్తం పథకాలు ప్రారంభం. ► నిర్ణీత వ్యవధిలో పథకాల మంజూరు. ► గత ప్రభుత్వ అవకతవకలను నిర్ధారించిన మంత్రివర్గ ఉప సంఘం. సీబీఐతో విచారణకు సిఫార్సు. ► ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్టు. ► పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు. విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించిన ప్రభుత్వం. ప్రజారోగ్య రథయాత్ర 2020 జూలై ► ప్రాణాపాయంలో ఉన్న వారి పాలిట సంజీవని అయిన 108, 104 అంబులెన్స్లు మళ్లీ కుయ్ కుయ్ అంటూ కొత్తగా రోడ్డెక్కాయి. ఏకంగా 1,088 అంబులెన్స్లను సీఎం వైఎస్ జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మండలానికి ఒక 108, ఒక 104 అంబులెన్స్లను కేటాయించారు. చిన్నారుల కోసం 26 నియోనేటల్ అంబులెన్స్లు కూడా ప్రారంభించారు. ► ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ప్రారంభం. 50,449 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం. ► హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు. ► 57 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ సొమ్ము బకాయిలు రూ.1,150 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ► నేతన్న నేస్తం పథకం కింద మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ.24 వేల వంతున ఆర్థిక సాయం చేసింది. ► వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తించేలా పశ్చిమగోదావరి జిల్లాలో మోడల్గా అమలు చేసిన పథకాన్ని మరో ఆరు జిల్లాలకు ప్రభుత్వం విస్తరించింది. ► అమూల్తో ప్రభుత్వం ఒప్పందం. ► మంత్రివర్గంలో మార్పులు. కొత్తగా వేణుగోపాలకృష్ణ, అప్పలరాజుకు చోటు. ► రాజమండ్రిలో దళితుడికి శిరోముండనం కేసులో పోలీసులపై వేటు. ► మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. రమేష్ కోవిడ్ సెంటర్లో మృత్యు కీలలు 2020 ఆగస్టు ► విజయవాడలోని ప్రైవేటు కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహించిన కోవిడ్ సెంటర్లో ఈ ప్రమాదం కారణంగా 10 మంది మృతి చెందారు. 18 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఆస్పత్రి యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అనంతరం ఈ కేసు దర్యాప్తునకు మార్గం సుగమమైంది. ► విశాఖ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ► ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) మృతి చెందారు. ► ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సొంత రాష్ట్రంలో ప్రజాదరణలో తొలి స్థానం దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నేత పెనుమత్స సాంబశివరాజు (88) మృతి చెందారు. ► వైఎస్సార్ చేయూత కింద 23 లక్షల మంది మహిళలకు తొలి విడతగా రూ.18,750 చొప్పున జమ చేశారు.ఈ పథకం కింద నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు అందజేస్తారు. ► రిలయన్స్ రిటైల్ – జియో, అల్లానలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. అర్హులందరికీ పింఛన్లు 2020 ఫిబ్రవరి ► ఒకప్పుడు వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ పొందాలంటే అదో పెద్ద ప్రహసనం. అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలదే పెత్తనం. లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఇంకా దారుణం ఏమిటంటే ఎవరైనా పింఛన్దారు మరణిస్తే వారి స్థానంలో కొత్త వారికి ఇచ్చేవారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ, కులం, మతం, ప్రాంతం.. చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేశారు. వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ► మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాజమహేంద్రవరంలో సీఎం వైఎస్ జగన్ ‘దిశ’ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ► 1.42 కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్తో కూడిన హెల్త్ కార్డుల జారీకి శ్రీకారం. మూడవ దశ కంటి వెలుగులో భాగంగా అవ్వా తాతలకు కంటి పరీక్షలు. ► రాజధాని భూ అక్రమాలపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేస్తూ నిర్ణయం. ► ఐటీఐ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన అమలు. ఆపదలో అండగా.. 2020 ఏప్రిల్ ► కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై మూడో విడత సర్వేకు సీఎం జగన్ ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ సహకారంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించింది. లాక్డౌన్ వల్ల పేదలు ఇబ్బంది పడకుండా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేసింది. ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులను ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్ కిట్లు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో తయారీకి శ్రీకారం చుట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఫోన్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందజేసే సరికొత్త ‘టెలీ మెడిసిన్’ వ్యవస్థ ప్రారంభమైంది. కరోనా శాంపిల్స్ సేకరణకు మొబైల్ కియోస్కులు ఏర్పాటయ్యాయి. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ నియామకం. ► ధాన్యం కొనుగోళ్లకు కొత్తగా 810 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ► మెకానిక్ షాపు, పరిశ్రమలు, ఈ కామర్స్ కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు. కరోనా టెస్టులలో ఏపీకి ఫస్ట్ ప్లేస్. ► సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేసిన సీఎం. ► అదనంగా జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున జాయింట్ కలెక్టర్ల నియామకం. ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి. గ్యాగ్ ఆర్డర్పై దేశ వ్యాప్తంగా నిరసనలు 2020 సెప్టెంబర్ ► అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తును ఆపాలని, భూ కుంభకోణంపై ఎలాంటి వార్తలు రాయొద్దని, ప్రసారం చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులివ్వడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై ఏసీబీ దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ విషయమై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ప్రముఖ జర్నలిస్టులు, న్యాయ కోవిదులు హైకోర్టు తీర్పును తప్పు పట్టారు. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ఈ విషయమై సీఎం జగన్ ఏకంగా సీజేఐకి లేఖ రాశారు. ► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీకి ప్రథమ స్థానం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలను సీఎం ప్రారంభించారు. ► గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి వైఎస్సార్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు, విలక్షణ నటుడు జయప్రకాష్రెడ్డి మృతి. ► అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయం. ► ఏపీ పోలీస్ సేవా యాప్, వైఎస్సార్ జలకళ ప్రారంభం. జగనన్న విద్యాకానుక 2020 అక్టోబర్ ► రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం కింద టెక్ట్స్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్, మూడు జతల యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్టు అందించారు. ఈ పథకం వల్ల తల్లిదండ్రులకు సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లబ్ధి కలిగింది. ► 24 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 1.53 లక్షల మంది గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ కింద 3.12 లక్షల ఎకరాల భూమిని సీఎం పంపిణీ చేశారు. ► పోలీసుల దర్యాప్తులను అడ్డుకుంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ప్రాథమిక దశలోనే దర్యాప్తులను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్టే. ► 1.41 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ ఉచిత బీమా పథకం ప్రారంభం. రైతు భరోసా పథకం కింద 50.47 లక్షల మంది రైతులకు రూ.6,797 కోట్లు సాయం. వైఎస్సార్ బడుగు వికాసం ప్రారంభం. చిరు వ్యాపారులకు భరోసా 2020 నవంబర్ ► రోడ్డు పక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, తలపై బరువు మోస్తూ వీధుల్లో తిరిగి అమ్ముకునే వారు, చేతి వృత్తుల వారు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతుంటారు. వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకుని వచ్చిన ఆదాయంలో అత్యధికంగా తిరిగి వారికే చెల్లిస్తుంటారు. తన పాదయాత్రలో ఈ కష్టాలను దగ్గరుండి చూసిన వైఎస్ జగన్.. వారికి అండగా ఉండేందుకు రూ.10 వేలు వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. వలంటీర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుని వారికి బ్యాంకుల నుంచి రుణం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. రూ.1,000 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ► కరోనా కారణంగా ఆగిపోయిన స్కూళ్లు ప్రారంభం. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ సహా 2,434 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేసేందుకు శ్రీకారం. ► వైఎస్సార్ చేయూత రెండో దశలో రూ.510.01 కోట్ల సాయం. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 14.58 లక్షల మంది రైతులకు రూ. 510 కోట్లు జమ. ► రూ.3 వేల కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్లు, పోర్టులకు శంకుస్థాపన చేసిన సీఎం. ► అమరావతి భూ కుంభకోణాలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను నిలిపి వేస్తూ రాష్ట్ర హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే. ► నివర్ తుపాన్ వల్ల పంటలకు నష్టం. వేగవంతంగా నష్టం అంచనా. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఏలూరులో కలకలం 2020 డిసెంబర్ ► పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కారణం తెలియకుండా పలువురు ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వందలాది మంది ఉన్నట్టుండి మూర్ఛతో పడిపోతూ ఆస్పత్రుల పాలయ్యారు. బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. కేంద్ర వైద్య బృందం, రాష్ట్ర వైద్యులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. అందరికీ మంచి వైద్యం అందించడంతో వెనువెంటనే కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ► ఏపీ అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం. ‘జగనన్న జీవ క్రాంతి’ పథకం కింద 4.69 లక్షల మంది మహిళలకు ఆవులు, గేదెల యూనిట్లు. ► హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే గోస్వామి. ► 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ► సమగ్ర భూ రీ సర్వే, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం. వైఎస్సార్ రైతు భరోసా తుది విడతగా రూ.1,120 కోట్లు జమ. నివర్ తుపాన్ నష్ట పరిహారం కింద రూ.646 కోట్లు చెల్లింపు. -
రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం
సాక్షి, అమరావతి: కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు, ఇవేవీ చూడకుండా ఎక్కడా వివక్షకు, అవినీతికి తావులేకుండా తమ 17 నెలల పాలన సాగిందని, ఇకముందు కూడా అదేవిధంగా కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని సగర్వంగా చెబుతున్నానన్నారు. తెలుగు వారందరికీ మంచి జరగాలని, గ్రామాల రూపురేఖలు మార్చాలన్న ఒక కలతో ముందుకు పరుగెత్తామని సీఎం పేర్కొన్నారు. మన తెలుగు రాష్ట్రంలో ఒక మహా యజ్ఞం జరుగుతోందని, దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటాయా? అని జగన్ ప్రశ్నించారు. తెలుగు నేల మీద పుట్టిన కులాల కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టలను బజారుకీడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. గట్టిగా ఆలోచించాల్సిన అంశాలివి.. – నా వారు, కాని వారు అన్న ధోరణులు ఈ రోజుకీ బాహాటంగా రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. ఇలాంటి ధోరణులను సమర్థించవచ్చా? – ప్రజల తీర్పును, ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దామా? – తన వాడు గెలవలేదు, తమ వాడు పదవిలో, అధికారంలో లేడన్న కడుపు మంటతో నిత్యం అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్ల వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా? వీటన్నిటిపైనా మనం గట్టిగా ఆలోచన చేయాలి. మహనీయుల త్యాగఫలం ఆంధ్రప్రదేశ్ – అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్యాగాన్ని స్మరించుకుంటూ, ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకుంటూ మరిన్ని అడుగులు ముందుకు వేసేందుకు ఈరోజు అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. – తెలుగువారికి రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించడం, 58 రోజుల పాటు ఆ దీక్ష కొనసాగడం, 1952 డిసెంబర్ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించడం, ఆ తర్వాత తెలుగు వారందరి ఉమ్మడి రాష్ట్రంగా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం మనందరికీ తెలిసిన గొప్ప చరిత్ర. మన బంగారు భవిష్యత్తు కోసం ఎందరో త్యాగమూర్తులు చేసిన త్యాగ ఫలితం ఇది. నెరవేర్చాల్సిన పనులు కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి – 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం పడనంతగా, ఇన్ని త్యాగాల నడుమ కూడా ఇంతగా దగా పడిన రాష్ట్రం మనదే అని గుర్తుంచుకోవాలి. బయటివారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లు వీటన్నింటితో తల్లడిల్లిన రాçష్ట్రం మనది. – నేటికీ రాష్ట్రంలో 33 శాతం మంది చదువు రానివారు ఉన్నారు. దాదాపుగా 85 శాతం ప్రజలు తెల్ల రేషన్కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారు. – స్వయం సహాయక బృందాలలో చేరి దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు నేటికీ సమరం చేస్తున్నారు. ఒక పంటకు కూడా కనీçస నీటి సదుపాయం లేని కోటి ఎకరాల భూములు ఇవాళ్టికీ మన రాష్ట్రంలో ఉన్నాయి. – ఆవాసం కోసం నేటికీ 32 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే పిల్లల చదువులు, కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం ఎన్నో కుటుంబాలు ఆస్తులు అమ్ముకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవల కోసం కూడా దేబిరించాల్సిన పరిస్థితి ఉంది. – ఇలాంటి అనేక అంశాలు నెరవేర్చాల్పిన మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. కాబట్టే గ్రామ, గ్రామాన ప్రజల ఆకాంక్షలు, అవసరాలను వారిలో ఒకరిగా ఉండి, వారితో మమేకమై, వేల కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణం చేసి సమస్యలు గుర్తించాం. ప్రతి అంశంపైనా దృష్టి పెట్టాం – మన గ్రామం, మన వ్యవసాయం, మన కుటుంబం, మన బడి, మన ఆస్పత్రి, మన వైద్య ఆరోగ్య రంగం, మన నీటి పారుదల రంగం వంటి ప్రతి ఒక్క అంశంపైనా.. అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టాల్సిన దానికన్నా మరింత వాస్తవిక ధృక్పథంతో దృష్టి పెడుతున్నాం. – గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని సుపరిపాలన దిశగా కనీవినీ ఎరుగని విధంగా అడుగులు వేస్తున్నాం. చరిత్రలో లేని విధంగా మొత్తం వ్యవస్థలోనే మార్పులకు శ్రీకారం చుట్టాం. అందుకే ఈ ఫలితాలు – ఇప్పుడు ఒక గ్రామంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే, 2 వేల జనాభా కలిగిన ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తోంది. – ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఏర్పాటుతో ప్రతి ప్రభుత్వ సేవ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతోంది. – నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో నాడు–నేడు కార్యక్రమంతో ఒక ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్ రూపురేఖలు కనిపిస్తున్నాయి. –మరో నాలుగు అడుగులు ఇటువేస్తే.. ఏకంగా 51 రకాల మందులతో, ఏఎన్ఎం నర్సు, ఆశా వర్కర్లతో ఆరోగ్యశ్రీకి రెఫరల్గా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ 24/7 సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. –అటువైపు చూస్తే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ రైతును చేయిపట్టి నడిపిస్తున్న ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మరో నాలుగు అడుగులు వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యాచరణ జరుగుతోంది. ప్రజాబలం, దేవుడి ఆశీస్సులతో ముందుకుసాగుతాం.. – సమస్యలు ఉన్నాయి. సవాళ్లు కూడా ఉన్నాయి. అయినా మన ముందున్న కర్తవ్యం పవిత్రమైనది. లక్ష్యం ఉన్నతమైనది కాబట్టి ప్రజాబలంతో అందుకు మార్గం వేయగలమని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలమనే నమ్మకం ఉంది. – ఇక మీదట మనందరి ప్రభుత్వం మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి ఆత్మగౌరవం నిలబెట్టేలా వెరుపన్నది లేకుండా ముందుకు సాగుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు విగ్రహానికి సీఎం నివాళులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కోవిడ్–19 నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్సవాంగ్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
ఆరేళ్లు.. రూ.55,743 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అప్పులు తేవడం.. వాటికి వడ్డీలు, అసలు దఫాల వారీగా చెల్లించడం వ్యక్తులకే కాదు.. ప్రభుత్వానికి తప్పనిసరి. పాలకుల ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు నిరాటంకంగా కొనసాగేందుకు ఏటా ఎంత అప్పులు చేయాలి. వాటికి వడ్డీల కింద ఎంత చెల్లించాలన్నది బడ్జెట్లోనే ప్రతి పాదించి చట్టసభల అనుమతి తీసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా పాటిస్తున్నదే. ఇప్పుడీ వడ్డీలు.. చెల్లింపుల గురించి ఎందుకు అంటే?.. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేసే విషయంలో కట్టుదాటకుండా కట్టడి చేయాల్సిన కేంద్రమే ఇప్పుడు అందుకు సహకారం అందిస్తామంటోంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర సర్కారు తాను ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా అప్పులు ఇప్పిస్తాం.. వడ్డీలు కట్టుకోండని ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే అప్పులకు వడ్డీల కింద ఏటా రూ. 13 వేల కోట్లు కడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెబుతున్నట్టు అప్పులు తెచ్చుకుంటే వాటి వడ్డీలే తడిచి మోపెడవు తాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రాష్ట్ర అభివృద్ధి పయనానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొంటున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో వడ్డీలకే 7–8 శాతం నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నాయి. రెట్టింపు కన్నా ఎక్కువే: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఆరేళ్లలో ప్రభుత్వం రూ. 55,743 కోట్లు వడ్డీల కింద చెల్లించిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు, ఈ ఆరేళ్లలో కలిపి చెల్లించాల్సిన వడ్డీలు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది (2014–15) వడ్డీల కింద రూ.5,195 కోట్లు చెల్లించగా, అది ఏటా పెరుగుతూ గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో రూ.13,642 కోట్లకు చేరింది. ఇక, ఈ ఏడాది (2020–21)లో తొలి 3 నెలల్లో కలిపి రూ.3,490 కోట్లు చెల్లించింది. ఇవన్నీ కలిపితే రూ.59,234.30 కోట్లు ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించినట్టు కాగ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంటే ఏటా సగటున రూ.9,290 కోట్ల చొప్పున రోజుకు రూ.25 కోట్లకు పైగా వడ్డీ కింద చెల్లించాల్సి వస్తోం దన్న మాట. ఇక, 2020–21లో మరో 33,197 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. కరోనా వైరస్ రూపంలో వచ్చి పడిన ఆర్థిక అగచాట్ల నేపథ్యంలో మూడు నెలల్లోనే రూ.17,670 కోట్లు అప్పు తెచ్చి నడిపించింది. బడ్జెట్ లెక్కల ప్రకారమే.. ఇంకో రూ.16 వేల కోట్ల వరకు రుణాలు తీసుకోవాల్సి ఉండగా, కరోనా గండిని పూడ్చుకునేందుకు ఆర్థిక పరిమితులకు లోబడే మరో రూ.12 వేల కోట్లు అప్పులు తేవాలి. ఇప్పుడు కేంద్రం తాను ఇవ్వాల్సిన రూ.8 వేల కోట్లు కూడా అప్పు తీసుకోవాలని రాష్ట్రానికి ప్రతిపాదిస్తుండటం గమనార్హం. ఇదే జరిగితే ఏటా రూ.15 వేల కోట్లు వడ్డీలు చెల్లించడానికే సరిపోతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. -
సున్నా వడ్డీకి సున్నంపై ప్రశ్నించాల్సింది బాబునే
► టీడీపీ సర్కారు హయాంలో సున్నా వడ్డీ బకాయిలు ఎందుకు చెల్లించలేదు? చంద్రబాబు నిర్వాకంవల్లే గతంలో సున్నా వడ్డీ అమలు కాలేదు. సున్నా వడ్డీ పథకానికి ఏది అండా..? అని ‘ఈనాడు’ ప్రశ్నించాల్సింది చంద్రబాబునే. ► చంద్రబాబు నిర్వాకంవల్లే సహకార బ్యాంక్లు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. గత ఐదేళ్లలో రైతులకు జరిగిన నష్టంపై ఆయన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని కప్పిపెట్టేసి కేవలం బ్యాంకుల వల్లే రైతులు నష్టపోయారని ‘ఈనాడు’ ఎలా రాస్తుంది? ► చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో వడ్డీ రాయితీ కోసం బడ్జెట్లో రూ.1,799.12 కోట్లు కేటాయించి విడుదల చేసింది మాత్రం కేవలం రూ.685 కోట్లే. చంద్రబాబు హయాం నుంచి ఉన్న పాతబకాయిలను సైతం మా ప్రభుత్వం చెల్లిస్తోంది. ► సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలతో రైతు లకు మేలు చేస్తున్న విషయం ‘ఈనాడు’కు కనిపించడం లేదా? సీఎం రైతులకు మంచి చేస్తున్నా ఎందుకు బురద చల్లుతున్నారు? సాక్షి, కాకినాడ: సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలినాటి నుంచి రైతు పక్షపాతినని, తమది రైతు ప్రభుత్వమని ప్రతి అంశంలోనూ నిరూపించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 13 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రైతులకు మేలు చేసే పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు అమలుచేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో రైతుభరోసా, వడ్డీలేని రుణాలు, ఉచిత పంటల బీమా లాంటి పథకాలను చిత్తశుద్ధితో రైతులకు చేరువ చేశారని గుర్తుచేశారు. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు తలెత్తినా రైతులకు అందించే పథకాల్లో ఎక్కడా జాప్యం చేయకుండా అమలుచేసిన ఘనత ముఖ్య మంత్రికే దక్కుతుందన్నారు. దివంగత వైఎస్సార్ జయంతి నాడు రైతు దినోత్సవం సందర్భంగా సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించాలని నిర్ణయం తీసుకుని రూ.1,150 కోట్లను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. బాబువల్లే నష్టాల్లో సహకార బ్యాంకులు... ‘సున్నావడ్డీకి ఏదీ అండా..?’ అంటూ బ్యాంకు లను తప్పుపడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం, దానివల్ల సహకార రంగం బ్యాంకులు నష్టపోయిన వాస్తవాన్ని మరుగున పరుస్తూ ఈనాడులో కథనాలను ప్రచురించారని ధ్వజమెత్తారు. అసలు సున్నావడ్డీ పథకాన్ని ఎందుకు నీరుగార్చారని ప్రశ్నించాల్సిన అప్పటి సీఎం చంద్రబాబును, టీడీపీ సర్కారును ఎక్కడా నిలదీయలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సున్నావడ్డీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన 4 శాతం వడ్డీ రాయితీని ఇవ్వకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు ప్రభుత్వం వడ్డీరాయితీ ఇస్తుందనే ఉద్దేశంతో ముందుగానే రైతులకు వడ్డీ రాయితీ కల్పించిన డీసీసీబీలు, పీఏసీఎస్లు ఆర్థిక ఇబ్బందులతో నష్టాల్లో కూరుకుపోయాయన్నారు.కొన్ని వాణిజ్య బ్యాంకులు సున్నావడ్డీ రాయితీని గత సర్కారు ఇవ్వడం లేదని గ్రహించి రైతులకు వడ్డీమాఫీ చేయలేదని, వారి నుంచి వడ్డీ సొమ్మును కూడా కట్టించుకున్నాయన్నారు. ఇందులో బ్యాంకులదే తప్పు అని ‘ఈనాడు’ తన కథనంలో పేర్కొన డంపై మంత్రి కన్నబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. వడ్డీ రాయితీకి నిధులివ్వని చంద్రబాబు సర్కార్కు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. రైతులకు రూ.4 వేల కోట్ల నష్టం.. చంద్రబాబు సర్కారు ఐదేళ్ల హయాంలో మొత్తంగా రూ.4 వేల కోట్ల మేరకు రైతులు వడ్డీ రాయితీ కింద నష్టపోయారని కన్నబాబు పేర్కొన్నారు. దీనికి కారణం చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. అరకొర రుణమాఫీ వడ్డీకి చాలలేదు.. రైతు రుణమాఫీని రూ.87 వేల కోట్లనుంచి రూ. 24వేల కోట్లకు కుదించి తీరా అది కూడా చెల్లిం చకుండానే అరకొరతో చంద్రబాబు రైతులను దగా చేశారన్నారు. అరకొర రుణమాఫీ రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీలకు కూడా చాలలేదన్నారు. 1,799కోట్లకు చెల్లించింది రూ.685కోట్లే చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో పంట రుణాల పై 4 శాతం వడ్డీరాయితీ కోసం బడ్జెట్లో రూ. 1,799.12 కోట్లు కేటాయించి చివరకు చెల్లిం చింది కేవలం రూ.685 కోట్లు మాత్రమేనన్నారు. సీఎంగా మీకు బాధ్యత గుర్తులేదా? పాత బకాయిలు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత అంటున్న చంద్రబాబు 2008–09 నుంచి ఉన్న బకాయిలును ఆయన సీఎంగా వున్నప్పుడు ఎందుకు చెల్లించలేదని కన్నబాబు ప్రశ్నించారు. 2014–19 వరకు ఐదేళ్లలో ఆప్కాబ్ ద్వారా డీసీసీబి, సహకార సంఘాలకు రూ.689.56 కోట్లు వడ్డీరాయితీ కింద చెల్లించాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.201.76 కోట్లేనన్నారు. రూ. లక్ష లోపు వ్యవసాయ రుణం తీసుకున్నవారికి చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ. 487.79 కోట్లు వరకు ఉందని తెలిపారు. నేటి నుంచి ‘ఈ–క్రాప్’ ప్రారంభం రాష్ట్రంలో సోమవారం నుంచి ఈ–క్రాప్ ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో ఈ–క్రాప్ సర్వే జరుగుతుందని, పంటల ప్రణాళిక, మార్కెటింగ్కు అవసరమైన బేస్ రూపొందించేందుకు నివేదిక సిద్ధం చేస్తామన్నారు. భూ యాజమాన్య హక్కులకు నష్టం లేకుండా సీసీఆర్సి కార్డులు ఇచ్చేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ఖరీఫ్, రబీతోపాటు మార్చి నుంచి ఏప్రిల్ వరకు మూడో పంట సీజన్లకు సంబంధించి మూడు దశల్లో జరుగుతుందని తెలిపారు. ఇక నేరుగా రైతుల ఖాతాలకే వడ్డీ రాయితీ... సున్నా వడ్డీ కింద రూ.1,150 కోట్లు బడ్జెట్లో కేటాయించడంతో పాటు అవసరమైతే ఇంకా నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారని కన్నబాబు పేర్కొన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలను పన్నెండు నెలల్లో చెల్లించాలని, దీనిపై ప్రభుత్వం వడ్డీ రాయితీని వారికి చెల్లిస్తుందన్నారు. రెండు వ్యవసాయ సీజన్లు అయిపోయిన వెంటనే వడ్డీ రాయితీని జాప్యం లేకుండా ఇచ్చేలా సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారన్నారు. బ్యాంకులకు ఈ సొమ్మును జమ చేయడం, సర్దుబాటు చేసే విధానానికి స్వస్తి పలుకుతూ ఇకౖపై రైతుల ఖాతాలకే నేరుగా సున్నా వడ్డీ రాయితీని ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈ మార్గ దర్శకాలను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తా మన్నారు. సున్నావడ్డీ రాని వారు ఎక్కడైనా పొరపాటు జరిగితే నేరుగా ప్రభుత్వానికి టోల్ఫ్రీ నంబర్ 155251 ద్వారా తెలియచేసే అవకాశం ఉందని వివరించారు. వడ్డీ రాయితీని ఎగ్గొట్టిన టీడీపీ సర్కారు.. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంటరుణాలను సకాలంలో చెల్లిస్తే కేంద్రం 5 శాతం, రాష్ట్రం 4 శాతం చొప్పున మొత్తం 9 శాతం వడ్డీరాయితీ సొమ్మును భరిస్తాయన్నారు. అయితే 2014 నుంచి టీడీపీ సర్కారు ఈ వడ్డీరాయితీని బ్యాం కులకు ఇవ్వలేదని, దీనివల్ల గత ఐదేళ్లలో ఆప్కాబ్, డీసీసీబీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఈ భారాన్ని మోశాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం బ్యాంకులతో నిర్వహించే ఎస్ఎల్బీసీ సమావేశంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతు లకు ఇవ్వాల్సిన వడ్డీరాయితీపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. -
ఆరువారాల కుట్ర!
ప్రాదేశికాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పురపోరుకు నామినేషన్ వేసినవారు ఉపసంహరణ కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అదికారులు సమాయత్తమయ్యారు. ఇంతలో ఆరువారాల పాటు ఎన్నికల వ్యవహారాలు వాయిదా వేస్తున్నట్టు వార్త. అది విన్న అభ్యర్థులంతా అవాక్కయ్యారు. కాసేపు నిశ్చేషు్టలయ్యారు. ఆనక అసలు విషయం తెలుసుకుని ఆగ్రహోదగ్రులయ్యారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వందంగా ఖండించారు. రాగధ్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఓ అధికారి ప్రతిపక్షాల ఓటమిని చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం... తాను అనుకు న్నది ఎలాగైనా చేయించుకోవడంలో సిద్ధహస్తుడైన ఓ నాయకుడి దుర్బుద్ధి వల్ల ఇప్పు డు జిల్లా అభివృద్ధి నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో పూర్తిగా నిమగ్నమైన రాజకీయ పారీ్టలకు ఎన్నికల కమిషన్ ఆదివారం పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ను సాకుగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ వార్త విని అవాక్కయిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కరోనా కాదు కదా దాని ‘బాబు’ కూడా అడుగుపెట్టలేరని, అలాంటి వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉన్నా... ఎన్నికలు వాయిదా పడటం ఏమిటని ఆయా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కరోనాపై సర్కారు అప్రమత్తం కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇరవై హాస్పిటళ్లను అందుకోసం సిద్ధం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 27 మందిని అబ్జర్వేషన్లో ఉంచాలని గుర్తించారు. 15 మందిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. 12 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ కూడా పూర్తయి వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తేల్చారు. ఇంత వరకూ విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. నిజానికి ఈ వైరస్ సోకిన వంద మందిలో 85 మంది వైద్యం పొంది వైరస్ నుంచి విముక్తి పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే మృత్యువాత పడుతున్నారు. వారిలో కూడా వయసుమీద పడిన వారు, హైపర్ టెన్షన్ ఉన్నవారే. ఈ వైరస్ చిన్నపిల్లల జోలికి పెద్దగా వచ్చింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ వాయిదా వేయడం విమర్శలకు తావిస్తోంది. సంక్షేమానికి అవరోధం ఎన్నికల వాయిదాతో జిల్లాలో సంక్షేమానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజు స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పేదలందరికీ ఇళ్లు అనే పథకంలో భాగంగా జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని 61,781 కుటుంబాలను జిల్లా అధికారులు వలంటీర్ల సాయంతో గుర్తించారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లో 30,108 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 31,681 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల తర్వాతైనా వస్తాయని పేద ప్రజలు ఆశతో ఉండగా ఎన్నికలు వాయిదా వల్ల కోడ్ ఇంకా కొన్నాళ్లు కొనసాగి, స్థలాలు రావడం ఇంకా ఆలస్యం అవుతోంది. జగనన్న చేదోడు పథకం ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏటా రూ.10 వేలు చొప్పున ఐదేళ్లు ఇవ్వాలనుకున్నారు. కోడ్ వల్ల ఈ పథకం ఆగిపోయింది. జగనన్న కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు కాపు సామాజిక వర్గంలోని 45 ఏళ్లు నిండిన మహిళలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనికీ బ్రేక్ పడింది. కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం అందించే రుణాలకు ఇటీవలే ఇంటర్వ్యూలు జరిగాయి. వాటిని మంజూరు చేసేందుకు కోడ్ అడ్డంకిగా మారింది. ఉపాధిహామీ కన్వర్జన్సీ నిధులు రూ.350 కోట్లు జిల్లాలో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకూ కేవలం రూ.50 కోట్లు వరకూ మాత్రమే వినియోగించారు. ఈ నెలాఖరులోగా పనులు మొదలు పెట్టకపోతే మిగిలిన నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. త్వరగా ఎన్నికలు పూర్తయితే ప్రజలకు ఈ పథకాలన్నిటినీ చేరువ చేయాలని, ఉన్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ‘కరోనా కుట్ర’ వల్ల అది సాధ్యమయ్యేలా లేదు. అధికారుల దిగ్భ్రాంతి జిల్లా అధికారులు సైతం ఎన్నికల కమిషన్ నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా షెడ్యూల్ నిర్ణయించిన అధికారులతో సమీక్షలను జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ రద్దు చేసుకున్నారు. కరోనా వైరస్పై మాత్రం సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నా రు. కరోనా వైరస్ను అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లాలో మూడు జెడ్పీటీసీ, 55 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో తమ పారీ్టకి ఇదే ప్రజాదరణ రావడాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు కుట్ర పన్నారని వారు విమర్శిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్ ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వాయిదా ఏకపక్ష నిర్ణయం ఎన్నికలు వాయిదా విషయం టీవీల్లో చూసి ఆశ్చర్యపోయా. వెంటనే పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్స్పాల్ సెక్రటరీ, డీజీపీలతో మాట్లాడితే ఎవరికీ తెలియదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు. చంద్రబాబుకు గురుదక్షిణగా రమే‹Ùకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ఉంటే అధికారులతో ఎందుకు సమీక్షించలేదు. రాజకీయపారీ్టలతో ముందుగా ఎందుకు సమావేశం ఏర్పా టు చేయలేదు. ప్రజాస్వామ్య వాదులంతా ఆలోచించాలి. ఎన్నికల వాయిదాపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆ నిర్ణయం అప్రజాస్వామ్యం ఎన్నికల వాయిదా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రమేయంతోనే జరిగింది. అన్ని రాజకీయ పారీ్టల సమావేశంలో కరోనా వైరస్ ఉంది ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ, సీపీఐ కోరాయి. ఎన్నికల కమిషనర్ చంద్రబాబు కులానికి చెందిన వారు. ఆయన టైంలో నియమించిన రమే‹Ùకుమార్ కావడంతో వారి ఆలోచన ప్రకారం వాయిదా వేశారు. ఎన్నికల వాయిదా అప్రజాస్వామ్యం. రాష్ట్రానికి రావాల్సిన రూ.5వేల కోట్లు రాకుండా చేయాలన్న రాజకీయ దురుద్దేశంతో వాయిదా వేశారు. రాష్ట్రాన్ని బాగు చేసే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. – బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు, విజయనగరం -
జీఎస్టీ పరిహారం..ఎన్నాళ్లీ జాప్యం?
సాక్షి, అమరావతి: జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్) పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. ఇప్పటికే ఆర్థిక మందగమనం వల్ల ఆదాయాలు తగ్గి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చర్య ఆందోళన కలిగిస్తోంది. జీఎస్టీ పరిహారంగా ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్యకాలంలో రాష్ట్రానికి రూ.1,966.33 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 529 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.1,437.33 కోట్ల పరిహారం కేంద్రం నుంచి రావాలి. జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోవడంతో పరిహారం సకాలంలో చెల్లించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాల్సిందే జీఎస్టీ అమలు చేసినప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గితే దాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందుకు 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని ఆధారంగా తీసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయం కంటే 14 శాతం వృద్ధి లేకపోతే.. ఎంత మేర తగ్గితే ఆ మొత్తాన్ని పరిహారంగా కేంద్రం చెల్లిస్తుంది. జీఎస్టీ అమలు సంవత్సరంలో మన రాష్ట్రానికి 2017–18 సంవత్సరానికి కనీస ఆదాయం లక్ష్యాన్ని నెలకు రూ.1,502.48 కోట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు 2019–20 సంవత్సరానికి కనీస ఆదాయ మొత్తం నెలకు రూ.1,952.62 కోట్లకు చేరింది. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి ఏడు నెలల కాలానికి రాష్ట్రానికి రూ.13,668.35 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.11,702.02 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ ఏడు నెలలకు కేంద్రం రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా రూ.1,966.33 కోట్లు చెల్లించాలి. జాప్యంపై వివిధ రాష్ట్రాల ఆందోళన జీఎస్టీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యంపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఆర్థిక మందగమనంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వాపోయారు. జీఎస్టీ పరిహారంగా రాజస్థాన్కు రూ.4,400 కోట్లు, ఢిల్లీకి రూ.2,355 కోట్లు, పంజాబ్కు రూ.2,100 కోట్లు, కేరళకు రూ.1,600 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు ఈ ఏడు నెలల కాలానికిగాను రూ.1,437.33 కోట్ల పరిహారం చెల్లింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్రం నుంచి హామీ వచ్చింది. ఇది కాకుండా డిసెంబర్ నాటికి మరో రూ.500 కోట్లు పరిహారం కోరాల్సి ఉంటుంది. - పీయూష్ కుమార్, రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ చీఫ్ కమిషనర్ -
ఇక సెన్సెస్–2021
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించేందుకు నిర్ధేశించిన జన గణనకు అధికార యంత్రాంగం మరోసారి సమాయత్తం అవుతోంది. పదేళ్లకోసారి జరిపే జనగణన 2011లో ముగిసింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. 2021 జన గణన కోసం ఇప్పటి నుంచే సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి నుంచి 2020 చివరి వరకు జనాభా లెక్కల ప్రక్రియ సాగుతుంది. 2021 నుంచి కొత్త లెక్కల ప్రకారం కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది. కాగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతోపాటు మండలాలు, గ్రామ పంచా యతీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సెన్సెస్ –2021 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం జిల్లాకు చెందిన మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. 021 జనగణన కోసం పునర్విభజన అనంతరం ఏర్పాటైన మండలాలు, గ్రామాలు, మునిసిపాలిటీల హద్దులతో కూడిన మ్యాపులను, పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిం చారు. మ్యాపులను బుధవారంలోగా సమర్పిం చాలని అన్నారు. అన్ని గ్రామాల్లో విలేజీ రిజిస్టర్, పట్టణాల్లో టౌన్ రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ గ్రామాలను ప్రామాణికంగా వివరాలు సేకరించాలన్నారు. మునిసిపాలిటీలలో ఎన్నికల వార్డులను ప్రామాణికంగా తీసుకొని కాలనీలు, వార్డుల మ్యాపులతోపాటు మునిసిపాలిటీ, కార్పొరేషన్ మ్యాపులు పంపిం చాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పంపిన మ్యాపుల ఆధారంతగా జియో ట్యాగింగ్తో నిర్ధిష్టమైన మ్యాపులను హైదరాబాద్లో రూపొందించనున్నట్లు చెప్పా రు. డిసెంబర్ 31లోపు మ్యాపులన్నీ సిద్ధంగా ఉంటాయని చెప్పారు. జనగణన కోసం ప్రత్యేకంగా ఎన్యుమరేటర్లను నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. మునిసిపాలిటీలు, మండలాల నుం చి వివరాలు డూప్లికేట్ కాకుండా కమిషనర్లు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ప్రత్యేక అధికారి ప్రావీణ్య, డీఆర్ఓ బిక్షానాయక్, ప్రణాళిక శాఖ ఉప సంచాలకులు శక్తికుమార్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్కుమార్, చెన్నయ్య, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ముగిసిన ఎన్నికల కోడ్
సాక్షి, హైదరాబాద్: లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలుకు తెరపడటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేందుకు అడ్డంకి తొలగింది. మార్చి 10న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఆదివారం వరకు 79 రోజుల పాటు కోడ్ అమల్లోకి ఉండటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కుంటుపడింది. -
ముగిసిన ఎన్నికల ప్రచారం..
సాక్షి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంలో నిమగ్నమయ్యాయి. పక్షం రోజుల పాటు అవిశ్రాంతంగా తమ తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో చుట్టివచ్చిన అభ్యర్థుల శ్రమ ఏ మేరకు ఫలితమిస్తుందో అనే చర్చ మొదలైంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారు..? ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎవరికి జై కొడతారో? 2014 ఎన్నికల్లో అప్పటి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్కు జై కొట్టి టీఆర్ఎస్ అభ్యర్ధికి పట్టం కట్టిన పాలమూరు ఓటర్లు మళ్లీ అదే పార్టీ వైపు మొగ్గుచూపుతారా..? జాతీయ రాజకీయాలకు ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకే జై కొడతారా..? లేక కాంగ్రెస్ను విశ్వసిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలన్నీ ఉమ్మడి పాలమూరు అభివృద్ధే ప్రధాన ఎజెండాగా విస్తృత ప్రచారం నిర్వహించిన ఈ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే దానిపై ఇప్పట్నుంచే చర్చ మొదలైంది. దీనికి తోడు ప్రజలను ఆకట్టుకునే విధంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరించిన సంక్షేమ పథకాలను ప్రజలు ఏ మేరకు నమ్మారో ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలతోనే స్పష్టం కానున్నాయి. తరలివచ్చిన అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీల అతిరథ నేతలు పోటాపోటీగా బహిరంగ సభల్లో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్నగర్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంటు పరిధిలోని వనపర్తిలో జరిగిన సభల్లో సీఎం కేసీఆర్, రాహుల్గాంధీ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ తరుఫున కేంద్ర మంత్రులు, టీఆర్ఎస్ తరపున రాష్ట్ర మంత్రులు రెండు లోక్సభ స్థానాల్లోనూ పర్యటించారు. ఆయా పార్టీలకు మద్దతుగా ప్రచారాలు నిర్వహించారు. ముఖ్యుల పర్యటన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ప్రచారమంతా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు, జాతీయ హోదా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, జాతీయ రహదారుల మంజూరు, విస్తరణ, జిల్లాలో వలసల నివారణకు చర్యలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపైనే కొనసాగింది. ఇదిలా ఉండగా ప్రచారం చివరి రోజూ బీజేపీ అభ్యర్థులు డి.కె.అరుణ, బంగారు శ్రుతి, టీఆర్ఎస్ అభ్యర్థులు శ్రీనివాస్రెడ్డి, పి.రాములు, కాంగ్రెస్ అభ్యర్థులు వంశీచంద్, మల్లురవి తమతమ పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఆయా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పాలమూరుపై పాగా ఎవరిదో? కరువు జిల్లాగా పేరొందిన ఉమ్మడి జిల్లాలోని పాలమూరు, నాగర్కర్నూల్ ఎన్నికల ఫలితాలెలా ఉంటాయనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పాలమూరులో ఏ పార్టీ అభ్యర్ధి గెలుస్తారో అనే దానిపై బెట్టింగ్లు సైతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పాలమూరు సీటు ప్రధాన పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ జితేందర్రెడ్డి ఇటీవల టీఆర్ఎస్ను వీడి కమల దళంలో చేరడం.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డి.కె.అరుణ సైతం టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తున్నారు. రాజకీయాలకు కొత్త అయిన టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తరుపున పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలందరూ విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరిలో గెలుపెవరిదో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదీలావుంటే ఉమ్మడి జిల్లాలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీలో గెలుపు ధీమా అంతంత మాత్రంగానే ఉంది. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న వంశీచంద్రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు దీటుగా గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. ఇటు నాగర్కర్నూల్ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా పోటీ చేస్తుండడంతో అక్కడ గెలుపు గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యలోనే పొటీ ఉంది. అందరిలోనూ గెలుపు ధీమా..! పక్షం రోజుల ప్రచారం అగ్రనేతల పర్యటనలపై ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. ఎవరికివారుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించారు. సకుటుంబ సపరివారంగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. సాధ్యమైనంత వరకు ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేశారు. కుల, మత, ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. దీంతో పాటు తమ అతిరథ నేతల సభలకు జనం భారీగా తరలిరావటం, పల్లెపల్లెనా ప్రచారానికి వచ్చిన స్పందన అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలు నింపింది. ఇటు ప్రచారంతో పాటే ఎన్నికల ఖర్చులోనూ అభ్యర్థులు పోటీ పడ్డారు. అనేక చోట్లా ప్రచారం ముగిసిన వెంటనే మొదలైన ప్రలోభాల పర్వం రేపు పోలింగ్ పూర్తయ్యే వరకు కొనసాగనుంది. -
కరువు నేలపై..హరిత సంతకం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘ఎన్నికల ముందు నేను చేసిన వాగ్దానం ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్ను అందించే కార్యక్రమానికి చెందిన ఫైలుపై తొలి సంతకం చేస్తున్నాను’’ అంటూ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు వైఎస్. ఒకే ఒక్క నిమిషంలో..ఒక్క మాట ద్వారా..ఒక్క సంతకం ద్వారా...తానేమిటో, తన విశ్వసనీయత ఏమిటో చేసిన వాగ్దానాల పట్ల నిబద్ధత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏంటో చెప్పకనే చెప్పారు వైఎస్. తెలుగుదేశం హయాంలో 2004కు ముందు రాష్ట్రంలో కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. తాగునీరు అందని దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి వైఎస్ సీఎం అయ్యారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ ప్రజారంజక పాలనను సాగించారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరా క్రాంతి పథకం, రూ.2 కిలో బియ్యం, ఇందిర ప్రభ, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ యువశక్తి, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలను ప్రవేశపెట్టారు. రూ.75 మాత్రమే ఉన్న పింఛన్ను రూ.200 పెంచారు. రూ.45,600 కోట్లతో జలయజ్ఞం ద్వారా 26 నీటి ప్రాజెక్టులు ప్రారంభించి వాటిలో కొన్నింటిని పూర్తి చేసి లక్షలాది ఎకరాలు సాగు, తాగు నీటిని అందించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కింది. మొత్తంగా వైఎస్ ఐదేళ్ల పాలన జనరంజకంగా సాగింది. 2009 శాసనసభ ఎన్నికల్లో 156 స్థానాలు గెలుచుకొని రెండో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. వైఎస్ ఐదేళ్ల పాలనా కాలంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలో వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులకు పెద్ద నిధులిచ్చి పనులు చేయించిన ఘనత వైఎస్కే దక్కింది. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు కేటాయించి 70 శాతం పనులను పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధుల్లో 80 శాతం నిధులు వైఎస్ హయాంలో కేటాయించినవే. గుండ్లకమ్మ ప్రాజెక్టు దాదాపు రూ.592.18 కోట్ల నిధులిచ్చి 95 శాతం పనులను పూర్తి చేశారు. వందల కోట్లు వెచ్చించి అన్ని నియోజకవర్గాల్లో తారు, సిమెంటు రోడ్లను నిర్మించారు. ప్రధానంగా రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని నిర్మించారు. ఒంగోలు ప్రజలకు తాగునీటిని అందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి పేదల ప్రాణాలను నిలబెట్టారు. వేలాది మంది రైతులకు రుణవిముక్తి కలిగించారు. మహిళలను ఆదుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారు. వృద్ధులకు పింఛన్ల ద్వారా భరోసా ఇచ్చారు. ప్రతి పేదవాడికి పక్కా గృహం నిర్మించి ఇచ్చాడు. వైఎస్ హయాంలో నియోజకవర్గాల వారీ అభివృద్ధి పనులు: ఒంగోలు నియోజకవర్గంలో రూ.250 కోట్లతో వెయ్యి పడకల రిమ్స్ ఆస్పత్రిని వైఎస్ హయాంలోనే నిర్మించారు. ఒంగోలు నగరానికి తాగునీటిని అందించేందుకు రామతీర్థం నుంచి పైప్లైన్ను నిర్మించారు. నగరంలో ఏడు ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించి ప్రజలకు నీటిని అందించారు. మినీస్టేడియం మంజూరు చేశారు. కొత్తపట్నం–ఒంగోలు ఫ్లైఓవర్ను మంజూరు చేశారు. పోతురాజు కాలువ ఆధునికీకరణకు నిధులిచ్చారు. వేలాది మందికి ఇంటి స్థలాలిచ్చి పక్కా గృహాలు నిర్మించారు. జిల్లా జైలును నిర్మించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లకుపైగా నిధులిచ్చి పనులను ప్రారంభించటమే గాక వేగవంతం చేశారు. యర్రగొండపాలెంలో మోడల్ డిగ్రీ కాలేజీని నిర్మించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి మండలంలో రామతీర్థం జలాశయాన్ని నిర్మించారు. దీని ద్వారా 70 వేల ఎకరాలకు సాగు నీటితో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు, 84 గ్రామాలకు తాగునీరు అందించారు. గుండ్లాపల్లిలో పరిశ్రమల కేంద్రాన్ని నెలకొల్పారు. పర్చూరు నియోజకవర్గంలో రూ.400 కోట్లతో నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి ఆయకట్టుకు నీరందించిన ఘనత వైఎస్కే దక్కింది. మార్కాపురం నియోజకవర్గంలో రూ.35 కోట్లతో సాగర్ జలాలను తీసుకువచ్చారు. మార్కాపురంలో రైల్వేబ్రిడ్జిని నిర్మించారు. ఈ నియోజకవర్గ పరిధిలో వెలిగొండ ప్రాజెక్టులు పనులను వేగవంతం చేశారు. కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద రూ.50 కోట్లతో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల పరిధిలో 9,500 ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పలు గ్రామాలకు తాగునీటిని సైతం వైఎస్ అందించారు. దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. మరో రూ.120 కోట్లతో సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో మార్కెట్ కమిటీ భవనాలను నిర్మించారు. 133 కె.వి. విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మించారు. కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో కనిగిరికి సాగర్ జలాలతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని వైఎస్ 2008 ఆగస్టులో ప్రారంభించారు. కందుకూరు నియోజకవర్గంలో పట్టణ వాసులకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించి తాగునీటిని అందించారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువను వైఎస్ ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గంలో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గిద్దలూరు నగర పరిధిలోని 6 గ్రామాలకు పరిసరాల్లోని 14 గ్రామాలకు దీని ద్వారా తాగునీటిని అందించారు. రాచర్ల మండలంలో రూ.22 కోట్లు వెచ్చించి రామన్నకతువ ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా 20 గ్రామాలకు తాగునీటిని అందించారు. గుండ్లమోటు ప్రాజెక్టుకు వైఎస్ రూ.11 కోట్లు నిధులిచ్చారు. చీరాల నియోజకవర్గంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 సంవత్సరాల వయస్సుకే పింఛన్ను ఇప్పించారు. చిలపనూలుపై ఉన్న 22 శాతం ఎక్సైజ్ సుంకాన్ని వైఎస్ రద్దు చేశారు. రంగు, రసాయనాలు, నూలుపు 10 శాతం సబ్సిడీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నార్కెట్పల్లి, అద్దంకి, మేదరమెట్ల రాష్ట్రీయ రహదారిని నిర్మించారు. జలయజ్ఞంలో భాగంగా బల్లికురవ మండలంలో భవనాశి రిజర్వాయర్ను నీరిచ్చి 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కొరిశపాడులో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత వైఎస్కే దక్కింది. -
‘సంక్షేమం’లో మనమే బెస్ట్
నూజివీడు/చింతలపూడి: మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలైనట్లుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా నూజివీడు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన టీడీపీ ఎన్నికల సన్నాహక సభల్లో ఆయన పాల్గొన్నారు. నూజివీడులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి.. కేవలం 2 శాతం లోపు ఓట్లకు పరిమితం చేశారన్నారు. బీజేపీ ప్రత్యేకహోదా ఇస్తానని తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ధ్వజమెత్తారు. దేశాన్ని కాపాడతానన్న కాపలాదారుడు నరేంద్రమోదీ మోసం చేశాడని విమర్శించారు. పట్టిసీమ కృష్ణాడెల్టాకు వరమని, ఈ ఏడాది జూలై నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. 15లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎంవోయూలు కుదుర్చుకున్నామని, దీని ద్వారా 30 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశా.. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని, సైబరాబాద్ను సృష్టించి ఆదాయాన్ని పెంచానని హైదరాబాద్ అభివృద్ధి తన కష్టార్జితం అని చెప్పుకున్నారు. చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ.. పదే పదే జగన్, మోదీ, కేసీఆర్ను తలుచుకుంటూ వారిపై తన అక్కసునంతా వెళ్ళగక్కారు. మోదీ, కేసీఆర్ తనపై, తన పార్టీ నాయకులపై సీబీఐ, ఐటీ దాడులు చేయించి, ఐటి గ్రిడ్స్పై కేసులు పెట్టించి ఇబ్బందులు కలగచేశారని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భయపెట్టి, బెదిరించి ప్రతిపక్ష పార్టీలోకి చేరేలా కుట్రలు చేశారని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని అన్నారు. కాగా, చింతలపూడిలో జరిగిన సభకు స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత డుమ్మా కొట్టారు. ఆమెకు టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఆద్యంతం సానుభూతి పొందేందుకు యత్నం.. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధిపొందేలా చంద్రబాబు ప్రసంగం సాగింది. ఓటుకు నోటు కేసులో దొరికి హైదరాబాద్ను వదిలేసి వచ్చారన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ.. కష్టాల్లో మనల్ని వెళ్లగొట్టారంటూ సానుభూతిని పొందడానికి బాబు ప్రయత్నించడం సొంత పార్టీ శ్రేణులకే విస్మయం కలిగించింది. కాగా, ‘సాక్షి’ దినపత్రికపై చంద్రబాబు మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. -
టీడీపీ సేవలో సీఎంఓ!
‘మీ విభాగంలో గత ఐదేళ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి పేర్లతో సహా మొత్తం వివరాలు సాఫ్ట్ కాపీలో పెట్టి పంపండి. ఎవరెవరికి ఏమేం లబ్ధిచేశామో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఫలానావి చేస్తామంటూ సీఎం చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతి లబ్ధిదారునికి లేఖలు తయారుచేసి సమాచార పౌరసంబంధాల శాఖ/రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్)కు పంపిం చండి. గత ఐదేళ్లలో మీ శాఖ/ విభాగం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలపై రెండు నుంచి నాలుగు పేజీలతో బుక్లెట్స్/ కరపత్రాలు తక్షణమే రూపొందించి పంపండి’. – సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసే అన్ని శాఖలకు సీఎంఓ మౌఖిక ఆదేశాలు లబ్ధిదారులకు పంపేందుకు అన్ని శాఖల నుంచి వచ్చిన లేఖలు, ప్రచారం కోసం వచ్చిన సమాచారంతో చక్కటి డిజైన్లు, ఫొటోలతో కరప త్రాలు, బుక్లెట్లను రూపొందించండి. వాటిని పెద్దఎత్తున ముద్రించి విస్తృత ప్రచారానికి రూపకల్పన చేయండి. టీడీపీకి అనుకూలంగా విజువల్ మీడియాలో ప్రచారానికి మంచి డిజైన్లతో వీడియోలు, ప్రకటనలు కూడా రూపొందించండి. ఇందుకోసం అనుభవజ్ఞులైన ప్రైవేటు వ్యక్తుల సేవలను వినియోగించుకోండి. సమయం ఎక్కువ లేనందున త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. – సమాచార పౌర సంబంధాల శాఖ, ఆర్టీజీఎస్కు సీఎంఓ మౌఖిక సందేశం సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఈ ఆదేశాలతో అన్ని సంక్షేమ శాఖల కార్యాలయాల్లో రోజువారీ కార్యక్రమాలు ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. వివిధ సమస్యల పరిష్కారం, దరఖాస్తుల సమర్పణ, సందేహ నివృత్తి కోసం వచ్చే లబ్ధిదారులతో కనీసం మాట్లాడకుండానే సిబ్బంది వారిని వెనక్కు పంపుతున్నారు. ‘తన దరఖాస్తులో చిన్న తప్పు ఉందని, దానిని సవరించాలని ప్రసాదరావు అనే ఓ నిరుపేద విద్యార్థి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి ఇటీవల వెళ్లగా.. ‘నెట్ పనిచేయడంలేదు. నాలుగు రోజుల తర్వాత రండి’.. అని తిప్పి పంపారు. ఆయన అక్కడే తనకు తెలిసిన ఉద్యోగి దగ్గరకు వెళ్లి వాకబు చేస్తే.. ‘సీఎంఓ ముఖ్యమైన సమాచారం అడిగింది. అందువల్ల అందరూ ఆ పనిలో ఉన్నారు. ఇతర పనులేవీ చూడరు. నాలుగు రోజుల తర్వాత వస్తే మాట్లాడతా..’ అని చెప్పి పంపించారు. ఇది ఒక్క ప్రసాదరావు పరిస్థితే కాదు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. ముందు నుయ్యి.. వెనక గొయ్యి ఇదే విషయమై ఒక ఐఏఎస్ అధికారి వద్ద ప్రస్తావించగా.. ‘ఏం చేస్తాం. మేం అశక్తులుగా మారాం. కార్యాలయాలకు వచ్చిన వారి సమస్యలు తీర్చాల్సిందిపోయి టీడీపీ సేవలో తరించాల్సి వస్తోంది. ఐదేళ్లలో ఏయే పథకాల కింద ఎంతమంది లబ్ధిపొందారో గణాంకాలు చెప్పమంటే చెప్పగలం కానీ.. ఎవరెవరు ఎంతెంత ప్రయోజనం పొందారో పేర్లతో సహా ఇవ్వాలంటే పాత డేటా అంతా వెతకాలి. కంప్యూటర్లలో ఉన్నా అంతా ఇంగ్లిష్లోనే ఉంటుంది. సీఎంఓ వారు తెలుగులో పంపాలని ఆదేశించారు. దీనిని ట్రాన్స్లేట్ చేయాలి. సిబ్బంది కొరతతో ఇప్పటికే అల్లాడుతుంటే ఇప్పుడు ఈ సంబంధంలేని పని పెట్టారు. మా పరిస్థితి ముందు గొయ్యి.. వెనక నుయ్యి అన్నట్లుగా ఉంది’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి బరితెగింపు ఎన్నడూ చూడలేదు ‘అధికార పార్టీకి సీఎంఓ అధికారులు అనుకూలంగా ఉండటం సహజమే. అయితే, ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకునేంత బరితెగింపు గతంలో ఎన్నడూలేదు. ఆర్టీజీఎస్లో కొంతమంది కన్సల్టెంట్లు కూర్చుని ప్రచార సామగ్రికి డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పట్లా ప్రభుత్వ ఆఫీసులను ప్రైవేటు సంస్థలుగా, అధికార పార్టీ ప్రచార కార్యాలయాలుగా మార్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు’.. అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. సర్కారు సొమ్ముతో టీడీపీ ప్రచారమా!? ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల షెడ్యూలు వచ్చిన వెంటనే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పేరు, ఫొటోతో ప్రభుత్వం లేఖలు పంపించరాదు. ఇలా పంపడం ఎన్నికల నిబంధనావళిని తుంగలో తొక్కడమే. అయితే, సీఎంఓ మౌఖిక ఆదేశాల మేరకు ఈ ఐదేళ్లల్లో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారికి ముఖ్యమంత్రి డిజిటల్ సంతకాలతో కూడిన లేఖలను ఇంటింటికీ పంచుతున్నారు. దీనిని అధికారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
పేదల పక్షపాతి.. టీఆర్ఎస్ ప్రభుత్వం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేట, చిన్నకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేదలు కొంతకాలంగా నివాసముంటున్న గృహాలకు జీఓ నం.58, 59 ద్వారా సీఎం కేసీఆర్ సర్వహక్కులు కల్పించిన విషయం గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద వధూవరులకు వరంగా నిలుస్తున్నాయన్నారు. గొర్రెల పంపిణీ పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. డబుల్ బెడ్రూం పథకం గూడు లేని నిరుపేదలకు ఉపయోగపడుతోందని తెలిపారు. అనంతరం సిద్దిపేటలోని పలువురికి జీఓ 59 కింద పట్టాలు అందించారు. పలు గ్రామాల బీజేపీ నాయకులు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చిన్నకోడూరు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, సతీశ్కుమార్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీకు మీరే.. మాకు మేమే..!
పింఛన్ లబ్ధిదారులకు తన వాటా సొమ్మును నేరుగా ఇవ్వనున్న కేంద్రం ⇒ ఏప్రిల్ 1 నుంచి అమలుకు నిర్ణయం ⇒ లబ్ధిదారుల ఆధార్ వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన సాక్షి, హైదరాబాద్: సంక్షేమ కార్యక్రమాల అమల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి తెర తీసింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు చెల్లింపుల విష యంలో.. ‘మా దారి మాదే..’ అంటోంది. ఈ మేరకు రాష్ట్రానికి సూచనలు ఇచ్చినట్లు తెలు స్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ, ఆసరా పింఛన్లు.. తదితర సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలకు కేంద్రం తన వాటాగా ఇవ్వా ల్సిన నిధులను ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తోంది. ఇకపై ఈ పథకాలకు సంబంధించి తమ వాటాగా లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును నేరుగా అందించాల ని నిర్ణయించింది. గత జనవరి 1 నుంచి ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను కేంద్రం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కేంద్రం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెం ట్ వ్యవస్థ(ఎన్ఈఎఫ్ఎంఎస్)ను ఏర్పాటు చేసుకుంది. ఇదే విధానాన్ని ఆసరా పింఛన్ సొమ్ము పంపిణీకీ వర్తింపచేయాలని తాజాగా నిర్ణయించింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్ఎస్ఏపీ)కింద కేంద్రం రాష్ట్రా నికి 6.32 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి ఏటా రూ.209 కోట్లు రాష్ట్ర ఖాతాకు జమ చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ఖాతా నుంచే లబ్ధిదా రులకు నేరుగా చెల్లింపులు జరపాలని నిర్ణ యించినందున, లబ్ధిదారుల ఆధార్, మొబైల్ నంబర్ల వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పింఛన్ సొమ్ము జమ కాగానే లబ్ధిదారుల మొబైల్ నంబర్కు సంక్షిప్త సమాచారాన్ని పంపుతుంది. పింఛన్ సొమ్ము వేర్వేరుగా జమ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పంపిణీలో కొద్ది పాటి మార్పులు చోటు చేసుకోను న్నాయి. పింఛన్ల సొమ్మును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాల కింద వేర్వేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నాయి. రాష్ట్రంలో ఆసరా పెన్షనర్లు 36 లక్షల మంది ఉండగా.. కేంద్ర ప్రభుత్వం 6.32 లక్షల మందికి ఎన్ఎస్ఏపీ కింద పింఛన్లు మంజూరు చేసింది. కేంద్రం తమ నిబంధనల మేరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మాత్రమే పింఛన్ ఇస్తుండగా... రాష్ట్రం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు కూడా ఆసరా పథకం కింద ఆర్ధిక భృతిని అందిస్తోంది. వికలాంగులకు రూ.1,500, మిగిలిన కేటగిరీ పెన్షనర్లకు రూ.1,000 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తోంది. కేంద్రం మాత్రం 80 ఏళ్లలోపు వృద్ధులకు రూ.200, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500, వికలాంగులు, వితంతువులకు రూ.300 చొప్పున అందజేస్తోంది. కేంద్రం ఇచ్చిన సొమ్ముతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తోంది. అయితే కేంద్రం నుంచి కొంత సొమ్ము వస్తున్న సంగతి లబ్ధిదారులకు తెలియడం లేదు. ఎన్ఎస్ఏపీ కింద పింఛన్లకు కేంద్రం కొంత మేరకు నిధులు ఇస్తున్నా.. ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకే చేరుతోంది. అంతేకాకుండా.. ఆసరా లబ్ధి దారులకు పింఛన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయక పోతుండడం కూడా కేంద్ర తాజా నిర్ణయానికి కారణంగా కనిపిస్తోంది. -
జర్నలిస్టుల నిరసనలపై కేటీఆర్ ఆగ్రహం
* ఉనికి చాటుకునేందుకే ధర్నాలు, నిరసనలు * త్వరలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం * సభ్యత, సంస్కారం మరచి వార్తల ప్రచురణ సరికాదు * ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానోత్సవంలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: మాట్లాడి పరిష్కరించుకునే సమస్యలను ఆందోళనల దాకా తీసుకెళ్లడం ఏమిటని జర్నలిస్టు నేతలపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికి చాటుకునే ఆరాటంతో ధర్నాలు, నిరసనలు చేయటం ఇకనైనా మానుకోవాలని సూచించారు. తాము చేసే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికైనా గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు న్యాయం చేస్తామని, హెల్త్కార్డులు, అక్రిడిటేషన్లు, పెన్షన్లు, ఇళ్ల స్థలాల సమస్యల పరి ష్కారంపై సమాచార శాఖ కమిషనర్తో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యం లో శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఫొటోగ్రాఫర్స్కు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కొన్ని పత్రికలు సభ్యత, సం స్కారం మరిచి పోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్పై కొంత మంది అదేపనిగా చేస్తున్న చౌకబారు విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నా యి. వాటిని స్వీయ సెన్సార్ లేకుండా యథాతథంగా ప్రచురిస్తున్నారు. పత్రికలకు ఇది ఏమాత్రం తగదు’ అని చెప్పారు. సీఎం కేసీఆర్పై ఎవరేం మాట్లాడినా ఎడిటింగ్ లేకుం డా మెయిన్ పేజీలో పెడతారని, అదే పొరుగు రాష్ట్ర పాలకులపై హైకోర్టు మొట్టికాయలు వేసినావాటికి ప్రాధాన్యత ఇవ్వరని ఆక్షేపిం చారు. కేసీఆర్ను ఇతరులు తిడితే యథాతథంగా ప్రచురించే సంస్కృతికి కొన్ని పత్రికలు వచ్చేశాయన్నారు. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇప్పటికీ బాలారిష్టాలు అధిగమించే దశలోనే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తెలంగాణలో కొన్ని సమస్యలుం టాయని, వాటిని అర్థం చేసుకోవాలని జర్నలి స్టులను కోరారు. ఉద్యమం చూడని ఓ పెద్దాయన పదవీ విరమణ తర్వాత పాలకులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ ఎవరు..? ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జస్టిస్ చంద్రకుమార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు చంద్ర కుమార్ ఎవరని ప్రశ్నించారు. ఉద్యమంలో ఆయన పాత్రే లేదని, జర్నలిస్టుల గురించి ఆయనకు ఏం తెలుసన్నారు. జస్టిస్ అన్న విష యం మరచి ఆయన మాట్లాడటం తగదన్నారు. తమ జోలికి రావొద్దని, వస్తే బాగోదని ఆయనకు తెలియజేస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బెస్ట్ న్యూస్ పిక్చర్ కింద మహబూబ్నగర్ జిల్లా సాక్షి ఫొటోగ్రాఫర్ వడ్ల భాస్కర్కు మొదటి బహుమతి దక్కింది. హైదరాబాద్ సాక్షి ఫొటోగ్రాఫర్ ఠాకూర్ సన్నీసింగ్కు మూడో బహుమతి లభించింది. అనంతరం వారిని సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కాంత్రి కిరణ్, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు. -
మా నిధులు..మా ఇష్టం
రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చింది రూ.36 కోట్లు ఎమ్మెల్యేలు వెచ్చించింది రూ.11.87 కోట్లే.. ఎమ్మెల్సీల ఖర్చూ అంతంతమాత్రమే.. శేఖర్రెడ్డి, పద్మావతి, సునీత, ప్రభాకర్రెడ్డి, కిశోర్ కొంత మెరుగు మిగిలిన వారిది నామమాత్రపు ఖర్చే.. ఆ నిధులనే పట్టించుకోని జానా, ఉత్తమ్ మంత్రి జగదీశ్రెడ్డి ఖర్చు పెట్టిందీ తక్కువే.. ఎమ్మెల్సీల్లో పూల రవీందర్ కొంత మెరుగే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎమ్మెల్యే కోటాలో రూ.75 లక్షలు, మంత్రి కోటాలో మరో రూ.75లక్షలు.. ఇలా ఏటా రూ. కోటిన్నర.. ఈ నిధులన్నీ మన ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేసుకునేందుకు ఉద్దేశించినవి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే ప్రాజెక్ట్లు, సంక్షేమ కార్యక్రమాలతో సంబం ధం లేకుండా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి, ఇష్టమైన పనుల కోసం వీటిని ఖర్చు చేయొచ్చు. ఎమ్మెల్యే గారు ఫలానా పని కోసం అని ప్రతిపాదన పంపితే చాలు నిధుల మం జూరుకు గ్రీన్సిగ్నల్ ఇయ్యొచ్చు. ఇది ఆయా ఎమ్మెల్యేల ఇష్టం. కానీ ‘మా నిధులు.. మా ఇష్టం’ అనుకున్నారో ఏమో.. మన జిల్లా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) వెచ్చించడంలో మాత్రం వెనుకబడ్డారు. మూడో వంతు కూడా ఖర్చు చేయలేదు... రెండు ఆర్థిక సంవత్సరాలకు (2014-15, 2015-16) సంబంధించి జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కలిపి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో మూడో వంతు ఖర్చు చేయలేదు. రెండేళ్లలో ఎమ్మెల్యేల నిధుల కింద (ఈ ఏడాది మార్చి 30 నాటికి) ప్రభుత్వం మొత్తం రూ.36 కోట్లు మంజూరు చేసింది. ఇందులో జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు ఖర్చు చేసింది కేవలం రూ.11.87 కోట్లే. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఒక్కరే రెండేళ్లలో కలిపి 60 శాతం నిధులు ఖర్చు చేశారు. ఏడాదికి రూ.కోటిన్నర చొప్పున రెండేళ్లకు ఆయన కోటాలో రూ.3 కోట్లు మంజూరు కాగా, రూ.1.83 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక.. ఆ తర్వాతి స్థానాల్లో మునుగోడు ఎమ్మెల్యే కె.ప్రభాకర్రెడ్డి రూ.1.53 కోట్లు (మొత్తం నిధుల్లో సగం), ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి రూ.1.45 కోట్లు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రూ.1.31 కోట్లు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ రూ.1.23 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఐదుగురు కలిపి రూ.7 కోట్లకు పైగా ఖర్చు చేయగా, మిగిలిన ఏడుగురు ఖర్చు చేసింది రూ. 5 కోట్ల పైచిలుకే. ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి అయితే అసలు నియోజకవర్గ అభివృద్ధి నిధులనే పట్టించుకోలేదని అర్థమవుతోంది. జానారెడ్డి రెండేళ్లలో కలిపి ఖర్చు పెట్టింది కేవలం రూ.49.72 లక్షలే. ఉత్తమ్కుమార్రెడ్డి రెండేళ్లలో కలిపి అందరికన్నా తక్కువగా రూ.44.66 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి కూడా నియోజకవర్గ నిధుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయనకు రెండేళ్లలో రూ.3 కోట్లు మంజూరు కాగా, ఖర్చు పెట్టింది రూ.89.09 లక్షలే . ఎమ్మెల్సీలూ అంతే...! ఎమ్మెల్సీలకు ఏటా వచ్చే రూ.1.5 కోట్లకు గాను కనీసం సగం కూడా ఖర్చు పెట్టలేకపోయారు. 2015-16 సంవత్సరానికి జిల్లాలోని నలుగురు ఎమ్మెల్సీల (పూల రవీందర్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కర్నె ప్రభాకర్, నేతి విద్యాసాగర్)కు కలిపి రూ.6 కోట్లు రావాల్సి ఉండగా, రూ.3.75 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఖర్చు పెట్టింది కేవలం రూ.58లక్షలే. 2014-15లో ముగ్గురు ఎమ్మెల్సీలుండగా (పల్లా రాజేశ్వర్రెడ్డి లేరు), మొత్తం రూ.4.50 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద మంజూరయ్యాయి. ఇందులో రూ.3.26 కోట్లు ఖర్చు పెట్టారు మన ఎమ్మెల్సీలు. కొత్త ఎమ్మెల్యేలే నయం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మం దిలో నలుగురు ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు కాగా, ఎనిమిది మంది కొత్త ఎమ్మెల్యేలే. నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు పెట్టడంలో మాత్రం సీనియర్ల కన్నా కొత్తగా గెల్చిన ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన టాప్ నలుగురూ కొత్త ఎమ్మెల్యేలే కావడం విశేషం. అయితే.. ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచిన నలుగురు ఎమ్మెలు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి, రవీంద్రకుమార్లో ఏ ఒక్కరు కూడా రెండేళ్లలో రూ.కోటికి మించి ఖర్చు చేయలేదు. కొత్తగా గెలిచిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం రూ.42.72లక్షలు, మిర్యాలగూడ ఎమ్మెల్య భాస్కర్రావు రూ.58.64లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి పనుల నుంచి ఖర్చు చేసింది రూ.89.17లక్షలే. ఇక సీపీఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రకుమార్ (దేవరకొండ) కూడా సీడీపీ నిధుల వినియోగంలో వెనుకబడే ఉన్నారు. ఆయన రెండేళ్లలో కలిపి ఖర్చు చేసింది కేవలం రూ.75.14 లక్షలే కావడం గమనార్హం. -
బీజేపీ వైపు జనం చూపు
సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జనం విసిగిపోయి బీజేపీ వైపు చూస్తున్నారని బళ్లారి లోక్సభ సభ్యుడు బీ.శ్రీరాములు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బళ్లారి నగరంలోని తన స్వగృహంలో సండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కేఎస్.దివాకర్ నేతృత్వంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీజేపీలోకి చేరిన సందర్భంగా మాట్లాడారు. బళ్లారి జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో జనం బీజేపీకి బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. సండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి బీజేపీకి జనం ఓట్లు వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే పురసభ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకే మెజార్టీ సీట్లు వస్తాయని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జనం బీజేపీకి ఓట్లు వేస్తారన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. సండూరు బీజేపీ ఇన్ఛార్జి, బళ్లారి నగర మాజీ కార్పొరేటర్ కేఎస్.దివాకర్ మాట్లాడుతూ... సండూరు నియోజకర్గంలో బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ, టీపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు జనం బుద్ధి చెప్పారని, త్వరలో జరిగే పట్టణ పంచాయతీ, పురసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. సండూరులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పాలకులు అక్కడ వారి స్వార్థం కోసం రాజకీయాలు చేస్తూ సండూరు అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు. అంతకు ముందు సండూరు తాలూకాకు చెందిన కురేకుప్ప, తారానగర, వడ్డు తదితర గ్రాామాల కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివకుమార్, గాళి శంక్రప్ప, హెచ్.తిమ్మారెడ్డి, బసవన గౌడ, ఉప్పార శివలింగప్ప, శేఖర్ గౌడ తదితరులు పాల్గొన్నారు. -
స్వయంగా నేనే వస్తా
♦ ప్రతి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తా ♦ ఆదిలాబాద్ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ♦ ఒక్కో జిల్లాలో వారం రోజులుంటా ♦ వీలైతే ఆదిలాబాద్ నుంచే పర్యటన ప్రారంభిస్తా ♦ మండల కేంద్రం నుంచి జిల్లాకు డబుల్ రోడ్డుండాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడంతోపాటు నేరుగా ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే జిల్లాల పర్యటన చేపడతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. ఒక్కో జిల్లాలో వారం రోజుల పాటు ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. నీటి పారుదల, తాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు తదితర నిర్మాణాలను పరిశీలిస్తానని అన్నారు. స్థానికంగా ఉండే ఇతర సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వీలైతే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా నుంచే జిల్లాల పర్యటన ప్రారంభిస్తానని ఆ జిల్లా ప్రజాప్రతినిధులకు మాటిచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా నేతలు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ఇక వాటిని వేగంగా అమలు చేయడమే మిగిలి ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వరంగల్ ఎన్నికల్లో ఆ విషయం మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. వారి నమ్మకం నిలబెట్టేలా ప్రభుత్వం పని చేయాలని, ప్రజా ప్రతినిధులు ప్రజల అవసరానికి తగ్గట్టు స్పందించాలని సూచించారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, విఠల్రెడ్డి, చిన్నయ్య, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం అదనపు కార్యదర్శి శాంతకుమారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తూర్పు ఆదిలాబాద్పై ప్రత్యేక శ్రద్ధ అత్యంత వెనుకబడిన తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంపై మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎమ్మెల్యేలను అడిగి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో తక్షణం చేయాల్సిన పనులను, దీర్ఘకాలిక ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను గుర్తించారు. నీటి పారుదల ప్రాజెక్టులు, రహదారులు, వంతెనల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు, వైద్య సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతీ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేయాలని ప్రభుత్వం ఓ విధానం పెట్టుకుందని, దాని ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్ని మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు నదులు, కాల్వలు దాటే క్రమంలో పడవలు ఉపయోగించాల్సి వస్తోందని సీఎం అన్నారు. అలాంటి ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వంతెనల నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్ను సీఎం కోరారు. మంచిర్యాల-చంద్రాపూర్ నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావుకు సూచించారు. తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంలో అదనపు సబ్ స్టేషన్ల నిర్మాణం నత్తనడక నడుస్తోందని, ఈ పనులను స్వయంగా పర్యవేక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొమురం భీం వారసులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్లో కొమురం భీం వారసులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్యమంత్రిని కోరారు. కొమురం భీం వారసులకు చెందిన 15 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయని, వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. -
వేగం
ముంచుకొస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు 12లోగా ముందస్తు ప్రక్రియ పూర్తి ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలతో నేతలు బిజీ ఆస్తిపన్ను రాయితీపై త్వరలో ప్రకటన సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. అధికారులు దీనికి సంబంధించిన పనులలో... అధికార పార్టీ నేతలు ప్రారంభోత్సవాలు... శంకుస్థాపనలలో బిజీగా ఉన్నారు. గత నాలుగైదు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి ఊపందుకున్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు వేగం పెరిగింది. ఇటీవ ల ఐడీహెచ్ కాలనీలో రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవం... ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాల పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే. సోమవారం మధురానగర్లో అధికారులు రెండు రంగుల చెత్త డబ్బాల పంపిణీ చేశారు. లాలాపేటలో రూ.3.80 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను ఇటీవల మంత్రి పద్మారావు ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి. ముషీరాబాద్ తదితర నియోజకవర్గాల్లో కాంట్రాక్టులు పూర్తి కాని రహదారులకు సైతం లాంఛనంగా శంకుస్థాపనలు చేసినట్లు తెలుస్తోంది. 15 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ డిసెంబర్ 12లోగా వార్డుల (డివిజన్ల) రిజర్వేషన్లతో సహా పోలింగ్కు సంబంధించిన ముందస్తు ప్రక్రియలు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. వీరి సమాచారం ఆధారంగా 15 తరువాత ఎప్పుడైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభానికి అవకాశం ఉండదు. ఈలోగానే వీటిని పూర్తి చేయాలి. ఇక మిగిలింది కేవలం 15 రోజులే. అందుకే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. త్వరలో ఆస్తిపన్ను రాయితీ నగరంలోని మురికివాడలతో పాటు చిన్న ఇళ్లలో నివసిస్తున్న వారికి ఆస్తిపన్ను రాయితీ అతి త్వరలో అమలులోకి రాానుంది. ఆస్తిపన్ను రూ.1200లోపు ఉన్న వారికి రూ.101 మాత్రమే వసూలు చేయాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ సోమవారం ప్రభుత్వానికి నివేదించింది. ఆమోదం పొందగానే దీనిపై ప్రకటన వెలువడుతుంది. దీని ద్వారా 5,09,187 ఇళ్ల యజమానులకు ప్రయోజనం కలుగనుంది. నీరు, విద్యుత్తు బిల్లులు రెండూ కలిసి నెలకు రూ.300 మించకుండా వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రహదారుల వైపు చూపు మరోవైపు 1000 కి.మీ. బీటీ రోడ్లు, 500 కి.మీ. వైట్టాపింగ్ రోడ్లకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే 912 బీటీ రహదారులకు రూ.337 కోట్లతో టెండర్లు పిలిచారు. నిరుద్యోగ యువతకు చెత్త సేకరణ ఆటోట్రాలీల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఈలైబ్రరీలు, జి మ్లపైనా శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే కూకట్ప ల్లి, సనత్నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో డబుల్బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు జరగ్గా... మరికొన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ఫ్హెల్ప్గ్రూపులకు రు ణాల పంపిణీని వేగవంతం చేశారు. మోడల్ మా ర్కెట్లు, మల్టీపర్పస్ హాళ్లు, చెరువుల సుందరీకర ణ, పబ్లిక్ టాయ్లెట్ల పనులపైనా దృష్టి సారించారు. -
ఏడాదికాలంగా తెలంగాణపై బాబు కుట్ర
మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ రూరల్ : ఏడాది కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అనేక కుట్రలు చేశారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్లగొండలో టీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్లతో కలిసి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణకు చంద్రబాబు విద్యుత్ రాకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా పాలన సక్రమంగా జరుగకుండా, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా చేశారని విమర్శించారు. పక్క రాష్ట్రం వారైన, పక్క జిల్లా వారైన వచ్చి మన ప్రాంతంలో నేరం చేసినా మన ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నేరం చేసినా ఆయా ప్రాంతాలలో ఉన్న చట్టాల ప్రకారమే శిక్షలున్నట్లుగానే బాబు వ్యవహారంలో శిక్ష పడనుందని తెలిపారు. బాబు తవ్వుకున్న గోతిలోనే పడిపోయారని అన్నారు. ఆంధ్రా ప్రజలు బాబుపై పెట్టుకున్న ఆశలన్ని ఆడియాశలు అయ్యాయని అన్నారు. అక్కడ ఇచ్చిన ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. సెక్షన్ 8తో ఎలాంటి సమస్య లేదని అన్నారు. ప్రపంచ దేశాల నుండి హైదరాబాదులో నివాసమున్న ఆంధా ప్రాంత ప్రజలు వున్న ఏ ఒక్క వ్యక్తికి ఎలాంటి సమస్య రాలేదనే సత్యం అందరికి తెలిసిందన్నారు. చేసిన తప్పును బయటపెట్టినందుకే బాబు మొత్తుకుంటున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కుంచమర్తి ఎంపీటీసీ మన్నె రేణుక, సర్పంచ్ లక్ష్మినర్సయ్య, కోడూరు ఎంపీటీసీ గుగులోతు మిర్యాల, తదితరులు ఉన్నారు. -
అంతా స్పెషల్
♦ ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు... మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు ♦ జీహెచ్ఎంసీ యంత్రాంగం కసరత్తు స్పెషల్...స్పెషల్... ఇది శనివారం స్పెషలో.. వేసవి స్పెషలో కాదు. జీహెచ్ఎంసీ స్పెషల్. ఈ వేసవిలో జీహెచ్ఎంసీ వివిధ బృహత్తర కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఓ వైపు పారిశుద్ధ్యం మెరుగుపరచడం... సదుపాయాల పెంపునకు స్పెషల్(నోడల్/క్లస్టర్) ఆఫీసర్ల నియామకం..మరోవైపు స్వయం ఉపాధికి రుణాలు..యువతకు అవసరమైన శిక్షణ... ఇంకోవైపు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పునర్విభజనపై కసరత్తు.... ఇవన్నీ దాదాపు ఏకకాలంలోనే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికార గణం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : త్వరలో వెలువడనున్న హైకోర్టు ఆదేశాలపై జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. దీనికి అనుగుణంగా సర్కారు పావులు కదుపుతోంది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తున్న ప్రస్తుత సమయంలో అధికారులు ఆగమేఘాల మీద వివిధ పనులకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు డివిజన్ల పునర్విభజనకు కసరత్తు ప్రారంభించారు. మరోవైపు సీఎం ప్రకటన మేరకు నగరంలో 330 క్లస్టర్లను ఏర్పాటు చేసి.. పర్యవేక్షణ బాధ్యతలను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ స్థాయి అధికారులకు అప్పగించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు భారీ ఎత్తున సంక్షేమ, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలను స్థానికుల సమన్వయంతో నిర్వహించేందుకు సివిల్ సర్వీస్ అధికారులతో ‘స్పెషల్’గా పనులు చేపట్టనున్నారు. నగరంలో ఉన్న సివిల్ సర్వీస్ అధికారులు ఎందరు? ఏఏ విధుల్లో ఉన్నారనే వివరాలు నమోదు చే సే పనిలో పడ్డారు. అందుబాటులో ఉన్నవారికి 330 క్లస్టర్ల బాధ్యత లు అప్పగించనున్నారు. పాలక మండలి లేకపోవడంతో అధికారుల కనుసన్నల్లో ఈ ‘స్పెషల్’ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పునర్విభజనపై కసరత్తు పునర్విభజనలో భాగంగా 150 డివిజన్లను 200కు పెంచేందుకు డీఎంసీలకే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. సహజ వనరులకు భంగం వాటిల్లకుండా చూడటంతో పాటు ఒక డివిజన్ పూర్తిగా ఒకే సర్కిల్, ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండేలా చూడాలని ఆదేశాలు వెలువడ్డాయి. సంబంధిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలు పక్క డివిజన్లలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఏ డివిజన్లోనూ 37వేలకు మించి జనాభా ఉండరాదని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై డీఎంసీలు కసరత్తు చేస్తున్నారు. టౌన్ప్లానింగ్ విభాగంలోని ఏసీపీల సహకారంతో దీని మ్యాపింగ్ పనులు చేయనున్నారు. డివిజన్ల పూర్తి బాధ్యతలు సంబంధిత డీఎంసీలకే అప్పగించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. సంక్షేమానికి ప్రాధాన్యం ఇంకోవైపు వీలైనంత ఎక్కువమందికి సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. వంద రోజుల్లో మహిళా గ్రూపులకు రూ.వెయ్యి కోట్ల బ్యాంకు రుణాలిప్పించే కసరత్తు ప్రారంభించారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వోద్యోగాలకు ఎదురు చూస్తున్న వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రూప్ వన్, పోలీసు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారికి శిక్షణ ఇప్పించనున్నారు. యువతను ఆకట్టుకునేందుకు భారీ సంఖ్యలో జిమ్లు తెరవనున్నారు. లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నారు. యువతను ఆకట్టుకునేందుకు... స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు పేదల బస్తీలు.. యువతచెడు మార్గం పట్టేందుకు ఎక్కువ అవకాశాలున్న బస్తీలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల వల్ల వారు నేర ప్రవృత్తికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నారు. సంబంధిత బస్తీలను గుర్తించాల్సిందిగా పోలీసు విభాగానికి సూచించినట్లు తెలిసింది. పోలీసు ఉద్యోగార్ధులకు తొలిదశలో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నెల 16న కులీకుతుబ్షా స్టేడియంలో దీనికి శ్రీకారం చుట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నారు. ఉమెన్ ఆన్ వీల్స్ ఉమెన్ ఆన్ వీల్స్ పేరిట బండ్ల ద్వారా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. మొబైల్ టిఫిన్ సెంటర్లు, ఐస్క్రీ ం, డ్రెస్ మెటీరియల్స్, చీరల విక్రయాల వంటి వాటితో పాటు ఇతర వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. తొలిదశలో ఇలా దాదాపు 500 మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. నాలుగు చక్రాల బండ్లను వినియోగించుకొని జీవనోపాధి కల్పించే కార్యక్రమం ఇది. కార్లు, వ్యాన్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఇందులో ఉంటాయి. వీటికి సబ్సిడీపై రుణాలు అందిస్తారు. ప్రస్తుతం విధి విధానాలను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ఉచిత వైఫై.. ఆర్ఓ ప్లాంట్లు వీటితో పాటు 200 ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 బస్తీల్లో నీటి శుద్ధికి ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన జలాన్ని చౌకధరకు విక్రయిస్తారు. మహిళలకు ఈ ప్లాంట్లు అప్పగించడం ద్వారా ఉపాధి కల్పించబోతున్నారు. స్వయం ఉపాధికి..ఓటర్లను ఆకట్టుకునేందుకు.. ప్రీ పోలీస్ శిక్షణ : 1000 మందికి జిమ్లు : 1000 లైబ్రరీలు : 1000 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు : 25 బస్తీల్లో ఎస్హెచ్జీలకు రుణాలు : రూ.1000 కోట్లు డ్రైవర్ కమ్ ఓనర్ ద్వారా వాహనాలు : 5000 మందికి ఉమెన్ ఆన్ వీల్స్ ఉపాధి పొందే మహిళలు : 500 మంది ఆర్ఓ ప్లాంట్లు : 1500 ఉచిత వైఫై ప్రాంతాలు : 200 -
లక్ష్యం...100 రోజులు
సంక్షేమ కార్యక్రమాల అమలుకు డెడ్లైన్ {పత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం జీహెచ్ఎంసీ యంత్రాంగం సమాయత్తం మరోవైపు ఎన్నికలకు కసరత్తు డివిజన్ల సంఖ్య 150 నుంచి 200కు పెంపు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓవైపు పార్టీ బలోపేతం... మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో 100 రోజుల్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వేసవిలో నీటి కొరత రానివ్వకుండా చూసేందుకు మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఆదేశించారో లేదో... కొన్ని గంటల్లోనే జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులతో హరిత ప్లాజాలో శనివారం రోజంతా భారీ స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు ఎన్నికలకు అవసరమైన వార్డులు/డివిజన్ల విభజనకు సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచింది. ఓ వైపు ఈ ప్రక్రియ... మరోవైపు సంక్షేమ పథకాల అమలు సమాంతరంగా సాగాలన్నది అధికారుల యోచనగా తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో ప్రజలను ఆకట్టుకునే పథకాలకు వంద రోజుల ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా మహిళల మనసులు గెలిచేందుకు స్వయం సహాయక బృందాలకు రూ.1000 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ అందజే సేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను స్పెషలాఫీసర్ ఆదేశించారు. పేదల బస్తీల్లో 1500 నీటి శుద్ధి కేంద్రాలు (ఆర్ఓ ప్లాంట్లు) ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని మరింతమందికి వర్తింపజేయనున్నట్టు ప్రకటించారు. ఐదువేల మందికి ఈ పథకం కింద ప్రయోజనం కల్పించాలని ఆదేశించారు. మరో ఐదువేల మంది నిరుద్యోగులను గుర్తించి... వారికి స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ లక్ష్యాల సాధనకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ కమిషనర్ నవీన్మిట్టల్, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవీ లక్ష్యాలు... వివిధ కాలనీలు, బస్తీల్లో 1000 ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తారు. వీటిలో దిన పత్రికలు, మ్యాగజైన్లతో పాటు, రెండేసి కంప్యూటర్లు ఉంటాయి. ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. నగరంలోని 200 మార్కెట్లకు మహర్దశ పట్టనుంది. వీటిని మోడల్ మార్కెట్లుగా ఆధునికీకరిస్తారు.డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, టాయ్లెట్లతో కూడిన ఇళ్ల నిర్మాణానికి ఒక్కో నియోజకవర్గంలో రెండేసి బస్తీల (మొత్తం 48 ప్రాంతాలు) ఎంపిక. యువత కోసం వెయ్యి జిమ్ల ఏర్పాటు. వాటిని స్వయంగా వారే నిర్వహించుకునేందుకు అవకాశం. వెయ్యి వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టుల నిర్మాణానికి చర్యలు. 1000 కి.మీ.ల మేర గ్రీన్కర్టెన్ల పేరిట ఫుట్పాత్ల వె ంబడి గోడల ఆధారంగా పెరిగే తీగెల వంటి మొక్కలు పెంచుతారు.{పతి సర్కిల్లోనూ ఒక దోబీఘాట్ను సకల వసతులతో అభివృద్ధి చేస్తారు. 283 ప్రభుత్వ ఖాళీ స్థలాల చుట్టూ ప్రహరీల నిర్మాణం. శ్మశాన వాటికల్లో మెరుగైన సదుపాయాలు. 177 శ్మశాన వాటికల్లో విస్తృతంగా మొక్కలు నాటి... వాటిని హరిత వనాలుగా తీర్చిదిద్దనున్నారు. రూ.5 భోజన కేంద్రాలు ఈ నెలాఖరులోగా మరో 50 ఏర్పాటు చేయాలి. -
యువతకు స్ఫూర్తి ప్రదాత చెవిరెడ్డి
పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ప్రశంసల జల్లు తిరుపతి రూరల్లో వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానం తిరుపతి రూరల్: నిరంతరం ప్రజా అభ్యుదయ, సంక్షేమ కార్యక్రమాలతో రాజకీయాల్లో చురుకైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నేటి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సొంత నిధులతో ప్రారంభించిన వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం తి రుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి హైస్కూల్లో జరిగింది. ఈకార్యక్రమాని కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సునీ ల్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నతి సాధ్యమన్నారు. విద్యను ప్రోత్సహించిన వారు చరిత్రలో మహనీయులు గా కీర్తించబడతారని, ఆకోవలోకే ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నిలుస్తున్నారని చెప్పారు. పేదలు, మధ్యతరగతి విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెం చేందుకు, విద్యార్థులను ప్రోత్సహించేం దుకు వైఎస్సార్ ప్రతిభా పురస్కారాలను అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ టీచర్ల పిల్లలు కూడా ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారని, ఇది మం చి పరిణామం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఈ ప్రమాణాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆదిశగా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. నైపుణ్యాలు, విద్యాజ్ఞానం అధికంగా చిన్నారుల్లో ఉంటాయనీ, వాటిని వెలికి తీసేం దుకు ప్రోత్సాహం అవసరముందన్నా రు. అందుకే వైఎస్ఆర్ పేరిట ప్రతిభా పురస్కారాలను విద్యార్థులకు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలి పారు. అంతకుముందు సర్పంచ్ భారతీరవి, ఎంపీటీసీ సుభాషిణిమోహన్లు ఎమ్మెల్యేలు సునీల్కుమార్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఘనంగా సత్కరించారు. దశాబ్దాల పాటు విద్యా బోధనల్లో విశేష సేవలందించిన విశ్రాంత టీచర్లను ఎమ్మె ల్యే చెవిరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్నాయు డు, ఎంఈవో ప్రసాద్, ఆర్ఐ శంకర య్య, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, మునీశ్వరరెడ్డి, చిన్నియాదవ్, శ్రీరాములు, వీరనారాయణరెడ్డి, రవి, సింగిల్విండో డెరైక్టర్ జయచంద్రారెడ్డి, హెచ్ఎం శ్రీనివాసులు, భాను తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీలే.. ఖాళీలు..!
కీలకమైన విభాగాలకు సారథులు కరువు పడకే సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇన్చార్జిల పాలనలో డ్వామా, డీఆర్డీఏ పలు శాఖల్లో అధికారులు లేక అస్తవ్యస్తం కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం కర్నూలు(అగ్రికల్చర్) : కీలక ప్రభుత్వ విభాగాలకు సారథులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇవన్నీ సక్రమంగా అమలు కావడానికి, ఆశించిన ఫలితాలు రావడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అధిపతులు ఉండాలి. అప్పుడే పర్యవేక్షణ పెరుగుతుంది. పథకాలు సక్రమంగా అమలు అవుతాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు అధిపతులు లేకపోవడంతో వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు పడకేసినట్లు అయింది. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందువల్ల వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లోతుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు 100 శాతం విజయవంతం కావాలని, ఆ దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇది అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అబ్బో! కలెక్టర్ చండశాసనుడట..ఆయన దగ్గర పని చేయలేము.. అంటూ ఇక్కడికి రావడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు జిల్లాకు రావడానికి ప్రయత్నించి మానుకున్నట్లు తెలుస్తోంది. సారథులు లేని డ్వామా డీఆర్డీపీ.. ఒకవైపు వ్యవసాయ కూలీలు సంక్షేమానికి, గ్రామాభివృద్ధికి, మహిళా సంక్షేమానికి పేదరిక నిర్మూలనలో డ్వామా, డీఆర్డీఏ-వెలుగు కీలకమైనవి. డ్వామాలో ఎన్ఆర్ఈజీఎస్, వాటర్షెడ్, ఇందిర జలప్రభ కింద వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. డీఆర్డీఏ-వెలుగు ద్వారా మహిళా సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఈ రెండింటికీ సారథులు లేకపోవడం గమనార్హం. డ్వామా పీడీ పోస్టు దాదాపు 3 నెలలుగా ఖాళీగా ఉంది. మొదట ఇన్చార్జి పీడీగా జేడీఏ ఠాగూర్నాయక్ కొద్ది రోజులు పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి ఇన్చార్జి పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ-వెలుగు పీడీగా పనిచేస్తున్న నజీర్ సాహెబ్ను మాతృ సంస్థకు బదిలీ చేసినా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో కలెక్టర్.. పీడీ బాధ్యతలను జేసీకి అప్పగించారు. జేసీ నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్నందున డీఆర్డీఏ-వెలుగు కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మ గతి.. అథోగతి... వ్యవసాయ శాఖలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అందిస్తుంది. ఆత్మను పట్టించుకునే దిక్కు లేదు. జేడీఏ స్థాయిలో పీడీ, డీడీఏ స్థాయిలో ఇద్దరు డిప్యుటీ పీడీ పోస్టులు ఉన్నాయి. ఆత్మ ద్వారా రూ.2 కోట్లకు పైగా నిధులతో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పీడీ, డీపీడీ పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇన్చార్జి అధికారులు ఆత్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కీలక శాఖలకు అధికారులు లేరు.. పౌర సరఫరాల శాఖ ఎంతో కీలకమైంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ఈ శాఖ ద్వారానే నడుస్తుంది. ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయించే బాధ్యత ఈ శాఖదే. కీలకమైన శాఖకు జిల్లా అధికారి(డీఎస్ఓ) లేరు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్ఓను బదిలీ చేసిన ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డీఎస్ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. రెగ్యులర్ డీడీ ఉంటేనే హాస్టళ్ల పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒకవైపు హాస్టళ్లు అస్తవ్యస్థంగా మారాయి. మరోవైపు స్కాలర్షిప్ సమస్యను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ పీడీ అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ రెండు విభాగాలకు ఎస్ఈలు లేరు.. కీలకమైన పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూస్లకు ఎస్ఈలు లేరు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయి అధికారులే ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్లో మంచినీటి పథకాలు, సీపీడబ్ల్యూ స్కీమ్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ ఎస్ఈలు లేక అభివృద్ధి కార్యక్రమాల అమలులో పురోగతి కొరవడింది. దిక్కులేని పెద్దాసుపత్రి... నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే కర్నూలు పెద్దాసుపత్రికి సారధి లేరు. సూపరింటెండెంట్గా పనిచేసే డాక్టర్ ఉమామహేశ్వర్ సెలవుల్లో పోవడంతో ఇన్చార్జి సూపరింటెండెంటు విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ యూనివర్శిటీకి వైస్ ఛాన్స్లర్ పోస్టు ఖాళీగా ఉంది.వయోజిన విద్యాశాఖకు నెలల తరబడి డీడీ పోస్టు ఖాళీగా ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దాదాపు రెండేళ్లుగా సెక్రటరీ ఖాళీగా ఉంది. కీలకమైన వాటికి సారధులు లేకపోవడంతో రోగులకు, విద్యార్థులకు, రైతులకు సరైన సేవలు అందే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రెగ్యులర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రత్యేక పాలనలో.. ప్రగతి తప్పింది
సాక్షి ప్రతినిది, శ్రీకాకుళం:ఒకటి జిల్లా కేంద్రం, మరొకటి పారిశ్రామికంగా, విద్యాపరంగా వేగంగా విస్తరిస్తున్న పట్టణం. ఈ రెండు పట్టణాలు పాలకులు లేక అనాథల్లా మారాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కుంటపడుతోంది. స్థానికావసరాలను గుర్తించి నిధులు నిధులు రాబట్టడంలో.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణలో ప్రత్యేకాధికారులు తగిన శ్రద్ధ చూపలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలకూ అతీగతి లేకుండా పోయింది. పాలకవర్గాలు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని అధికార టీడీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తూ, అధికారులపై స్వారీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికలు జరగని శ్రీకాకుళం, రాజాం పట్టణాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. జిల్లాలో పలాస, ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయితీలు ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం, రాజాం తప్ప మిగిలిన మున్సిపాలిటీలకు ఈ ఏడాది జూన్లో ఎన్నికలు జరగడంతో పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. శ్రీకాకుళం పట్టణానికి మూడేళ్ల నుంచి, రాజాం పట్టణానికి 2005 నుంచి ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. వచ్చే ఏడాది మార్చి వరకు ఎన్నికలు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజాంలో ఇదీ పరిస్థితి రాజాం ప్రాంతం 2005లో నగర పంచాయతీగా ఆవిర్భవించింది. రాజాం, సారధి మేజర్ పంచాయతీలతో పాటు కొండంపేట, కొత్తవలస, బుచ్చెంపేట, పంచాయతీలు, సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామాలను ఇందులో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ పొనుగుటివలసతో పాటు నాలుగు మైనర్ పంచాయతీల ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి వరకూ పంచాయతీ పాలకవర్గాల ఆధీనంలో అభివృద్ధిపథాన నడిచిన ఈ పంచాయతీలన్నీ ప్రజాప్రాతినిధ్యం లేక సమస్యల్లో కూరుకుపోతున్నాయి. రాజాం నగర పంచాయతీ విస్తీర్ణం 25.76 చదరపు కిలోమీటర్లు. 20 వార్డులుగా విభజించారు. 11,158 గృహాల్లో 42,123 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉంది. ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు నిలిచిపోయాయి. ప్రజాసమస్యలు పరిష్కారం కావడంలేదు. సిబ్బంది, అధికారులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో పాలన కుంటుపడింది. వివిధ హోదాల్లో మొత్తం 67 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 28 మందే అందుబాటులో ఉన్నారు. శ్రీకాకుళంలోనూ అదే వివాదం శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులున్నాయి. 1,33,531 జనాభా ఉన్నారు. మున్సిపాలిటీలో పెద్దపాడు పంచాయతీని విలీనం చేయాలన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్నికలు నిల్చిపోయాయి. గతంలో పలువురు ప్రజా ప్రతినిధులు పెద్దపాడు గ్రామ పెద్దలతో దీనిపై చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీనితోపాటు చాపురం, పాత్రునివలస, కిల్లిపాలెం, కాజీపేట, తోటపాలెం, కుశాలపురం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని రెండేళ్ల క్రితం భావించడంతో కొంతమంది కోర్టునాశ్రయించారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు కోర్టు స్టే ఇచ్చింది. గత పంచాయతీ ఎన్నికల్లో పెద్దపాడు మినహా మిగతా పంచాయతీలకు ఎన్నికలు జరిపారు. ఇప్పుడు కూడా పెద్దపాడును డీ నోటిఫై చేస్తే శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపించవచ్చన్న భావన నేతల్లో కనిపిస్తోంది. మొత్తానికి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని ఆ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. మూడు నెలల క్రితం అన్ని విభాగాల్లోనూ 100రోజుల ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే శ్రీకాకుళంలో 50 శాతం లక్ష్యం కూడా దాటలేదు. ఇలాగే మిగిలిన పలు అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ప్రజారోగ్య విభాగానికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటే కలెక్టరుకు నోట్ పెట్టి అనుమతి తీసుకోవల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అదే మున్సిపల్ కౌన్సిల్ ఉంటే, కౌన్సిల్లో అనుమతితో నిధులు మంజురు చేసే అవకాశం ఉంటుంది. -
అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి
మహబూబ్నగర్ టౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేయూల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. ఇందుకుగాను నవంబర్లో జడ్చర్లలో పౌరసమాచార ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రీజియన్ డెరైక్టర్ పి.ఐ.కె.రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. నవంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పౌరసమాచార ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని డెరైక్టర్ తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ నవంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందున ఆయూ దినాల్లో కాకుండా ఉత్సావాలు నిర్వహిద్దామని సూచించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తామన్నారు. డెరైక్టర్ పీఐకెరెడ్డి మాట్లాడుతూ గతంలో వనపర్తి, గద్వాలలో ఈ తరహా ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యుద్దీకరణ, ఉపాధి హామీ, ఐసీడీఎస్, సమాచార హక్కు చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, స్వచ్చభారత్, మెకిన్ ఇండియా, బేటీబచావ్, బేటీ పడాన్ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. 50 స్టాళ్లను ఏర్పాటు చేసి భారీ సమాచార ప్రదర్శనను నిర్వహించనున్నామన్నారు. అంతేకాక పలు అంశాలపై సదస్సులు, సమావేశాలు, గోష్టులు నిర్వహించనున్నామని, వీటితో పాటు కళాబృందాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంకిషన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్దిదారులకు మాత్రమే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దా ర్లు, ఇతర డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భూ పంపిణీపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక గ్రామం ఎంపిక చేసుకుని ఆ గ్రామాల నుంచి 12మంది అబ్దిదారులను ఎంపిక చేసుకుని వారికి భూమి ఇచ్చేందుకు, ఆ భూమి అభివృద్ధి చేసి సాగు యోగ్యంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చే యాలని కోరారు. ఇటీవల చేసిన సమగ్ర కు టుంబ సర్వేకు సంబంధించి డాటా ఎంట్రీ చేసేందుకు ఆపరేటర్లకు శిక్షణ పూర్తయిందని, ఆ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. రుణ మాఫీ, కొత్త రుణాల మంజూరు తదితర అంశాలపై గ్రామా లు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిం చి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. 25నుంచి 27 తేదీల మధ్య మండల స్థాయి సమావేశాలు పూర్తిచేయాలని, 29నాటికి అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ‘ఇందిరమ్మ’ అక్రమాలపై దృష్టి 2004-2013 మధ్యలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, ఇందులో మొత్తం 5,934 మంది నుంచి రూ.17.45లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ కిషన్ తెలిపారు. ఇప్పటివరకు 1,913మంది నుంచి రూ.4.61లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో తహసీల్దార్లు తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులకు నోటీసులు జారీ చేసి ఆర్ఆర్ చట్టం ప్రకారం వసూలు చేయాలన్నారు. అదేవిధంగా వర్షాభావం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిన ప్రాంతాల్లో ఆర్డీఓలు పర్యటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిట్యాల, ములుగు, మహబూబాబాద్ మండలాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులు స్థానికంగా అందుబాటులో లేని విషయం తహసీల్దార్లు రిపోర్టు చేయాలని, ముఖ్యంగా రెడ్యాలకు ప్రత్యేక బృందం పంపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ సుధాకర్రావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ ఇన్చార్జ్ పీడీ రాము, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, వరంగల్ ఆర్డీఓ మాధవరావు పాల్గొన్నారు. -
భయం వలదు
ప్రగతినగర్ : ‘‘ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తయారు చేయడం, అమలు చేయాలన్నా, ఆ రాష్ట్ర కుటుంబాల, ప్రజల సమగ్ర సమాచారం అవసరం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బేస్లైన్ సమాచారం సేకరించడానికి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. సమగ్ర కు టుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు సంబంధించి పూర్తి సమాచారం ఆగస్టు 19న సేకరించనున్నారు. ఆ రోజున ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చి వివరాలు నమోదు చేసుకోనున్నారు. పది విభాగాలలో 80కిపైగా అంశాలలో వివరాలు సేకరించనున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలు నెరవేరాలంటే పక్కా లెక్కలు ఉండాలి. అర్హులు, లక్ష్యి త వర్గాలకు పథకాలు అందాల్సిన అవసరం ఉంది’’ అని కలెక్టర్ రొనాల్డ్ రాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సమాచారం సేకరించనున్నట్లు చెప్పారు. అప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి సరైన రీతిలో అందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. సర్వే రోజున ప్రజలు ఎలాంటి పనులు, ప్రయాణాలు పెట్టుకోవద్ధన్నారు. ఇంటి వద్దనే ఉండి ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు సహకరించాలన్నారు. అడిగిన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఈ దిగువన ఉన్న ప్రతులు,సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సర్వేపై భయాందోళన వద్దు సర్వేపై ఎవ రూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. ఎక్కడి వారు అక్కడ ఉన్నచోట సరైన పత్రాలు చూపి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఈ సర్వే కాదు, కుటుంబ గణాంకాల నమోదు కోసమే సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 19న ఎవరైతే ఇంటివద్ద ఉంటారో వారిపేర్లు నమోదు చేసుకుంటాం, గల్ఫ్, ఇతర దేశాలకు బతుకు దెరువు కోసం వెళ్లి వారి వివరాలను తర్వాత నమోదు చేస్తామన్నారు. పక్క జిల్లాలలో, రాష్ట్రాలలో చదువుతున్న విద్యార్థులు సొంత ఇళ్లకు రావాల్సిన అవసరం లేదన్నారు. వారు చదువుతున్న ధ్రువీకరణపత్రాలు కుటుంబీ కులు చూపెడితే సరిపోతుందన్నారు. జిల్లా వ్యా ప్తంగా 31 వేల సిబ్బంది ఉన్నారని, సర్వే కోసం 27,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 2,300 మంది ప్రైవేట్ టీచర్లు సర్వేలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అనాథలు, సంచార జీవుల కోసం ప్రభుత్వం ఒక ఫార్మాట్ను తయారు చేసిందన్నారు. అత్యవసరంగా ఆస్పత్రులలో చికిత్స పొందితే, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందిస్తే సరిపోతుందన్నారు. -
పీఠముడి
వారాలు గడుస్తున్నాఎదురు తెన్నులు పదవీ ప్రమాణం చేయని జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అధికారపగ్గాలు దీర్ఘకాలంగా ప్రత్యేక పాలనలో మండల, జిల్లా పరిషత్లు జిల్లా,మండలపరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు వింత పరిస్థితి ఎదురైంది. వారాలు గడుస్తున్నా ‘పీఠ’ముడి వీడడం లేదు. గెలిచిన అభ్యర్థులు పాలన పగ్గాలు చేపట్టే పరిస్థితి లేదు. ఎన్నికలు ముగిసి 50 రోజులైనా జిల్లాలో ఇంకా ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. కొత్తపాలక వర్గాలు కొలువు తీరకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన దాదాపు రూ.13 కోట్లు వరకు నిధులు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేశాయి. విశాఖ రూరల్, న్యూస్లైన్: ఎన్నికల్లో విజయం సాధించినా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు అధికార దర్పం వెలగబెట్టలేని దుస్థితి. పాలనా పగ్గాలు చేపట్టే విషయంలో వారాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. సుధీర్ఘకాలం తరువాత ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీకాలం 2011 జూన్తో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనే కొనసాగింది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు, జీతాలు, చెల్లింపులు, అత్యవసర పనులు, సాధారణ పరిపాలన మినహా ప్రజాహిత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగత ఇబ్బందుల పరిష్కారం వంటివి అమలుకు నోచుకోలేదు. మండలాల్లో అధికారులు, సిబ్బంది కొరత విపరీతంగా ఉండడంతో ప్రధాన సమస్యలపై కూడా వారు దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు కూడా నిధుల కొరతతో అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. దీంతో అనేక సమస్యలు పరిష్కారానికి కొత్త పాలకవర్గం కోసం ఎదురుచూస్తున్నాయి. అన్నింటికీ నిరీక్షణే : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో గత నెలలో రెండు దశలలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాల కోసం అభ్యర్థులు నెలన్నరపాటు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నెల 13న జెడ్పీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులెవరో తేలిపోయింది. అయితే ఫలితాలు వచ్చి మూడు వారాలైనా ఇప్పటి వరకు వీరు అధికారికంగా ఆ హోదాలను అనుభవించలేని వింత పరిస్థితిలో ఉన్నారు. రాష్ర్ట విభజన కారణంగా ఈ దఫా ప్రమాణ స్వీకరాలకు జాప్యం జరుగుతోంది. జూన్ 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రమాణ స్వీకారం ముగిశాక వీరి ప్రమాణ స్వీకారాలు ఉండనున్నాయి. అయితే ఆ రోజు ఎప్పుడన్నది ఎవరికీ తెలియదు. రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికల్లో గెలిచినా.. ఈ దఫా అధికారాన్ని చేపట్టడానికి వారాలు వేచి ఉండాల్సి వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. కొత్త పాలకవర్గాలపై ఆశలు కొత్త పాలకవర్గం ఎప్పుడు ఏర్పాటవుతుందోనని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. జిల్లా పరిషత్కు 13వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం నుంచి రూ.కోట్లు రానున్నాయి. ఈ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు, రోడ్డులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) కింద రూ.1.5 కోట్లు వరకు వస్తుంది. ఇందులో 50 శాతం నిధులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను వినియోగించే అవకాశముంటుంది. వీటితో పాటు జనరల్ ఫండ్ కింద ప్రభుత్వం నుంచి రూ.5 నుంచి రూ.6 కోట్లు వరకు విడుదలవుతుంది. ఈ నిధులు వస్తే జిల్లాలో రోడ్లు కల్పనతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడి, మంచినీటి ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారు. -
సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లు...
-
సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను సోమవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందాలంటే క్షేత్రస్థాయిలో ప్రచారం అవసరమన్నారు. జలయజ్ఞం, సబ్ప్లాన్, బంగారుత ల్లి, వడ్డీలేని రుణాలు, గృహాలు, పింఛన్లు తదితర పథకాలపై జిల్లా వ్యా ప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతపై కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని డీపీఆర్వో గోవిందరాజులుకు సూచించారు. మొదటి విడతగా జిల్లాకు వచ్చిన 5 వాహనాల ద్వారా చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జనవరి 12 వరకూ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం డివిజనల్ పీఆర్ఓ డి.రమేష్, ఏపీఆర్ఓ ఎస్.జానకమ్మ తదితరులు ఉన్నారు.