బాపట్ల: తమ కన్నబిడ్డ కళ్లముందే కుప్పకూలి ప్రాణాలు వదలడంతో శోకంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రులు.. అంతటి విషాదంలోనూ మరొకరికి కంటిచూపును కల్పించేందుకు తమ బిడ్డ కళ్లను దానం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో నివసించే నాగభైరు దుర్గారావు, విజయ దంపతులకు ఇరువురు కుమారులు. దుర్గారావు స్థానిక హెచ్పీ గ్యాస్ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు.
వీరి పెద్ద కుమారుడు నాగభైరు శ్రీహర్ష (23) ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ఖాళీగా ఉన్న సమయాల్లో గ్యాస్ ఆఫీసులో తండ్రికి సహాయపడుతూ ఉంటాడు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో మిత్రులతో ఫోన్లో మాట్లాడిన శ్రీహర్ష ఒక్కసారిగా కుప్ప కూలిపడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధృవీకరించారు.
తమ కళ్లెదుటే కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. కన్నకొడుకు మృతి చెందిన శోకాన్ని దిగమింగి తల్లిదండ్రులు దుర్గారావు, విజయ దంపతులు తమ కుమారుడి రెండు కళ్లను దానం చేశారు. గుంటూరులోని శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందం చిలకలూరిపేట పట్టణానికి చేరుకుని శ్రీహర్ష కళ్లను సేకరించారు. శ్రీహర్ష స్నేహితులు, బంధువులు భారీ ఎత్తున చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment