దంతాలపల్లి: కష్టపడితేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, దీప్తి జీవాంజి చిన్నతనంలో ఎదురైన అవహేళనలను ఎదిరించి ప్రపంచ స్థాయిలో విజయకేతనం ఎగువేసి గుర్తింపు పొందిందని అక్షర పాఠశాల ప్రిన్సిపాల్ యాకేశ్ అన్నారు. ఇటీవల పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన దీప్తిని శనివారం పాఠశాలలో సత్కరించారు. ఈ సందర్భంగా యాకేశ్ మాట్లాడుతూ.. గతంలో తమ శిష్యురాలైన దీప్తి ప్రపంచ విజేతగా ఎదగడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు పేదరికం, అంగవైకల్యం అనే ఆలోచన చేయకుండా దీప్తిని ఆదర్శంగా తీసుకని లక్ష్యంపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం దీప్తి మాట్లాడుతూ.. రన్నింగ్ చేయాలంటే కుటుంబ పేదరికం వల్ల షూ కొనలేని పరిస్థితి తన చిన్నతనంలో ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఖమ్మం నగరంలో జరిగిన పోటీలో పతకం సాధించడం.. ఆర్డీఎఫ్ పాఠశాల రామ్మోహన్రావు తన పట్టుదలను గుర్తించడంతోపాటు, నాగపురి రమేశ్ సార్ సహకారంతో ఈస్థాయికి చేరానని తెలిపారు. విద్యార్థులు అధైర్య పడకుండా సాగినప్పుడే జీవిత లక్ష్యాలను చేరుకుంటారని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, చిన్ననాటి గురువు ఎన్నమనేని దేవేందర్, ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment