గద్వాల: జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నిలి శ్రీనివాసులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. గద్వాల పట్టణంలో జరిగిన ప్రమాణ స్వీకారణ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు సీనీయర్ నేతలు సంపత్కుమార్, సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి గైర్హాజరు కావడం అంతటా చర్చనీయంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి హాజరుకాకపోవడంతో ఇంతకూ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించారా...? లేదా ? ఆహ్వానించినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారా అనేది సభలో చర్చించుకోవడం కనిపించింది.
పరోక్ష విమర్శలు..
కాగా ప్రమాణస్వీకారణ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ప్రసంగిస్తున్న క్రమంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి రావడంతో కొందరు జీర్ణించుకోలేని నాయకులు ఈ కార్యక్రమాన్ని విఫలమయ్యేలా కుట్రలు చేశారని, అయితే బీసీలంతా ఐకమత్యంతో ఉండడంతో కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయిందన్నారు. అదేవిధంగా పార్టీలో ఉండి ఈ కార్యక్రమానికి రాని నాయకులకు జై కాంగ్రెస్ గట్టిగా వినిపించేలా నినాదించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడుతూ.. గద్వాలలో సరిత, అలంపూర్లో నేను దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగిందని, అయినప్పటికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని విధాలుగా కుట్రలు చేసి కార్యక్రమాన్ని ఆటంక పర్చాలని ప్రయత్నించినప్పటికీ బీసీల మధ్య ఉన్న ఐక్యత వల్లనే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment