● వేలాదిగా తరలివచ్చిన
నవ దంపతులు, భక్తులు
● స్వామిని దర్శించిన 40 వేల మంది
● 1,800 వ్రతాల నిర్వహణ
● ఆదాయం రూ.40 లక్షలు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం గురువారం నవదంపతులు, పెళ్లి బృందాలు, భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రతమండపాలు కిటకిటలాడాయి. బుధవారం రాత్రి 7.45 గంటల ముహూర్తంలో రత్నగిరిపై సుమారు 150 వివాహాలు జరిగాయి. ఇతర ప్రాంతాల్లో సైతం ఇదే ముహూర్తానికి వివాహాలు జరగడంతో స్వామివారి దర్శనానికి నవ దంపతులతో కూడిన బంధుమిత్రులు భారీగా వెళ్లి సత్యవ్రతాలు ఆచరించారు. సుమారు 40 వేల మంది భక్తులు గురువారం స్వామివారిని దర్శించి పూజలు చేశారని, వ్రతాలు 1,800 జరిగాయని అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజన సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. కాగా గురువారం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవారు, శంకరుల నిజరూపు దర్శనంతో భక్తులు పులకించారు. స్వామి, అమ్మవారు, శంకరులను వట్టివేళ్ల మాలలతో అలంకరించారు.
వచ్చేనెల 15న గిరి ప్రదక్షిణ
కార్తిక పౌర్ణిమ సందర్భంగా నవంబర్ 15వ తేదీన నిర్వహించే‘సత్యదేవుని గిరిప్రదక్షణ’కు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ఏడాది నుంచి ఉదయం, మధ్యాహ్నం కూడా నిర్వహించాలని ప్రతిపాదించారు. ఉదయం ఏడు గంటల నుంచి స్వామి, అమ్మవార్లను పల్లకిపై గిరిప్రదక్షిణ చేయిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు తొలిపావంచా నుంచి ప్రచార రథం మీద గిరిప్రదక్షణ నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో దేవస్థానం అధికారులు, భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని దేవస్థానం వైదిక కమిటీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. గిరి ప్రదక్షిణ నిర్వహించే పుష్కర కాల్వ రోడ్డు, అక్కడ నుంచి పంపా తీరంలోని పవర్హౌస్ వరకు గల రోడ్డును దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ, ఏఈఓ కొండలరావు, డీఈలు తదితరులు పరిశీలించారు. భక్తులకు ఆహార పానీయాల స్టాళ్లు, కాలిబాటలో గోతులు పూడ్చడం తదితర అంశాలపై చర్యలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment