సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
కాకినాడ సిటీ: పారిశ్రామిక విధానాలపై కార్మిక సంఘాలతో సమగ్రంగా చర్చించాలని, ఆ తర్వాతే తుది రూపం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కాకినాడ సుందరయ్యభవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతే లక్ష్యం అంటూ ఆరు కొత్త పాలసీలను ప్రకటించారన్నారు. దీనిలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలతో పాటు రూ.30 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోయే ఐదేళ్లలో వస్తాయంటే కడుపు నిండిపోయిందన్నారు. ఇంత వరకు మూడు పారిశ్రామిక విధానాలు అయ్యాయని, ఏం సాధించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రూ.30 లక్షల కోట్లు అంటున్నారన్నారు. 20 లక్షల ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. డీఎస్సీ పెట్టి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామన్నారని, నాలుగు నెలలు గడిచినా దాని ఊసే లేదన్నారు. కాకినాడలోనే 2008లో 10 వేల ఎకరాల్లో సెజ్ ప్రారంభించారని, పుష్కరకాలం దాటినా నేటికీ పరిశ్రమలు రాలేదన్నారు. కాకినాడ జిల్లాలో 10 వేల మంది మత్స్యకారులకు నేటికీ వేట నిషేధ పరిహారం అందలేదన్నారు. అలాగే నవంబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై వారం రోజుల పాటు ప్రజాపోరు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment