కరీంనగర్ అర్బన్: బంధనలకు విరుద్ధంగా వస్త్రాలను విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్పై తూనికలు, కొలతలశాఖ మెరుపు దాడులు నిర్వహించింది. మంగళవారం రాత్రి నగరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్, చైన్నె సిల్క్స్, సౌత్ ఇండియా షాపింగ్మాల్, మాంగల్య షాపింగ్ మాల్ను తనిఖీ చేశారు. పండగ సీజన్ కావడంతో నిబంధలను విస్మరిస్తున్నారన్న సమాచారంతో అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి నేతృత్వంలో తనిఖీలు చేయగా వాయిలేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ అండ్ రూల్స్ క్రమంలో 10 కేసులు నమోదు చేశారు. ప్యాకింగ్, తయారీ తేదీ, లూజ్ విక్రయాలు, ఎక్కడ దుస్తులు తయారయ్యాయి వంటి అంశాలను పరిశీలించగా లోపాలను గుర్తించినట్లు విజయసారథి వివరించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ భూలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.
ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్గా రామకృష్ణ
కరీంనగర్సిటీ: కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ కలువకుంట రా మకృష్ణను నియమిస్తూ కళా శాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం రామకృష్ణ కళాశాలలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అధ్యాపకులు రాజయ్య, శ్రీనివాస్, కరుణాకర్, ఏవో ఉమారాణి నాగరాజు, టీజీ సీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేందర్రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
పత్తి మార్కెట్కు నాలుగు రోజులు సెలవు
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మా ర్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.6,650 పలికింది. మంగళవారం మార్కెట్కు 45 వాహనాల్లో 253 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. మోడల్ ధర రూ.6,500, కనిష్ట ధర రూ.6000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. దసరా నేపథ్యంలో గురువారం నుంచి ఆదివారం వరకు మార్కెట్ యార్డుకు సెలవులు ఉంటాయని, సోమవారం యాథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు.
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, నూతన లైన్ల నిర్మాణం పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 11 కేవీ హౌజింగ్ బోర్డు ఫీడర్ పరిధిలోని హౌజింగ్బోర్డు కాలనీ, వరాహస్వామి ఆలయం రోడ్డు మారుతినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ ఎస్.నరేందర్ తెలిపారు. విద్యుత్ టవర్ల నిర్మాణ పనుల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 33/11 కె.వీ.నగునూర్, ఆర్నకొండ, రుక్మాపూర్, కాట్నపల్లి సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు తెలిపారు.
పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్వో సుజాత
శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్యాధికారి సుజాత తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ, ఫార్మసీ, ల్యాబ్ను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. రోగులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వైద్యాధికారి వెంట డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో చందునాయక్, వైద్యాధికారి శ్రావణ్, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment