తాండూర్/కాసిపేట: గత 30ఏళ్లుగా కాకా కుటుంబం నుంచి అధికారంలో ఉంటూ పెద్దపల్లి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ విమర్శించారు. గురువారం ఆయన జిల్లాలోని తాండూర్, కాసిపేట మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ‘గడ్డం’ కుటుంబాన్ని గెలిపిస్తే రానున్న రోజుల్లో మంచిర్యాల జిల్లా పేరు వెంకటస్వామి జిల్లాగా మారుస్తారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ పరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని బలపర్చేందుకు బీజేపీ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాసిపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ తాండూర్, కాసిపేట మండలాల అధ్యక్షులు దూడపాక భరత్కుమార్, సంపత్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధీర్గౌడ్, నాయకులు కోడి రమేష్, పాగిడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.