Published
Tue, Jul 23 2024 1:46 AM
| Last Updated on Tue, Jul 23 2024 1:46 AM
రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవాహం
● జిల్లాలో తగ్గని వాగుల ఉధృతి
● అప్రమత్తమైన అధికారులు
● ఆస్పత్రులకు గర్భిణుల తరలింపు
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: జిల్లాలోని వాగులు, వంకల ఉధృతి తగ్గలేదు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద సోమవారం సాయంత్రం గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది. సాయంత్రం ఏడు గంటల సమయానికి 15.710 మీటర్ల ఎత్తులో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. 15.830 మీటర్లకు వరద చేరితే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు. సోమవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను కూడా వరద ఉధృతి దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు ప్రమాద హెచ్చరికలు వరద ఉధృతి దాటితే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాభావం ఉన్నందున వరద పెరిగే అవకాశం ఉందని గోదావరి సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మూడు రోజుల నుంచి ముసురు ఉండడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. కాగా సోమవారం కాస్త తెరుపు ఇవ్వడంతో ప్రజలు రైతులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద రెండు కిలోమీటర్ల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ఏటూరునాగారం రాంపూర్కు వెళ్లే దారిలోని మాడివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగుదాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొండాయి బ్రిడ్జి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎయిర్బోట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందం నడుపుతూ ప్రజలను దాటిస్తున్నారు. మంగపేట మండలంలోని శనిగకుంట వద్ద వాగు ఉధృతి కొనసాగుతోంది. మేడారంలోని జంపన్నవాగు ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు ముంపు ప్రాంతాల నుంచి 16మంది గర్భిణులను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు.
సమ్మక్క బ్యారేజీలోకి
10,15,170క్యూసెక్కులు నీరు రాక
కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ సమీపంలో గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఉదయం 9,21,720 క్యూసెక్కుల నీరు రాగా సాయంత్రానికి 10,15,170 క్యూసెక్కులు నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో వద్ద 59గేట్లు ఎత్తి అదే మోతాదులో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 84.10మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. దేవాదుల ఇన్టెక్వెల్ వద్ద 86.10 మీటర్ల నీటి మట్టం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment