విజయవాడస్పోర్ట్స్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు అన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 21న జరిగే కార్యక్రమానికి వీవీఐపీలు, వీఐపీలు వస్తారని ఏర్పాట్లు బాగాచేయాలన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ రిహార్సల్ను పరిశీలించారు. ఈ పర్యటనలో ఐజీ శ్రీకాంత్, డీఐజీలు రాజకుమారి, అమ్మిరెడ్డి ఉన్నారు.
డాక్టర్ జీవీ పూర్ణచందుకు ‘సరస్వతి సమ్మాన్’
విజయవాడకల్చరల్: నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జీవీ పూర్ణ చందును సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అఖిల భారత భాషా సాహిత్య సమ్మాన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ పెరుగు రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వారిని ప్రతి ఏడాది ఎంపిక చేసి పురస్కారాన్ని అందజేస్తున్నామన్నారు. 2024 సంవత్సరానికి జీవీ పూర్ణచందును ఎంపిక చేశామని, ఈ నెల 20న నెల్లూరులో జరిగే సభలో పురస్కారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన్ను కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నగరానికి చెందిన సాహితీవేత్తలు డాక్టర్ గోళ్ల నారాయణరావు, బోడి ఆంజనేయరాజు, డాక్టర్ వెన్నా వల్లభరావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు అభినందించారు.
‘ఉల్లాస్ అక్షరాస్యత’పై
దృష్టిపెట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉల్లాస్ (అండర్స్టాండింగ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమం అమలుపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిధి మీనా ఆదేశించారు. జేసీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉల్లాస్ అమలుపై నిధి మీనా.. పాఠశాల విద్య, వయోజన విద్య, డీఆర్డీఏ, గ్రామ–వార్డు సచివాలయాలు, ఐసీడీఎస్, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయని, లక్ష్యాల సాధనకు అధికారులు కృషిచేయాలని సూచించారు. ఇందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, మండల స్థాయిలో ఎంపీడీవో ౖచైర్మన్గా కమిటీలు పనిచేస్తాయన్నారు. సమావేశంలో ఉల్లాస్ కార్యక్రమ నోడల్ అధికారి జి.ప్రసాద్రావు, ఏపీవో ఎం.సింగయ్య, డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీపీఆర్వో ఎస్వీ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
29 నుంచి సమ్మెలోకి వైద్యమిత్రలు
చిలకలపూడి(మచిలీపట్నం): డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి.నాగరాజు తెలిపారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలోని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీశాకు సమ్మె నోటీసును శుక్రవారం అందజేశారు. నాగరాజు మాట్లాడుతూ సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కో–ఆర్డినేటర్కు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. శనివారం నుంచి 15 రోజుల పాటు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళతామన్నారు. సీఈవోకు వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘ జిల్లా కార్యదర్శి వి.పోతురాజు, డెన్నీపాల్, పుష్పలత, అనిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment