శ్రీకాకుళం న్యూకాలనీ: సాంఘిక శాస్త్ర(సోషల్ స్టడీస్) సిలబస్ విద్యార్థులకు అమితమైన భారంగా ఉందని, ప్రభుత్వం కనీసం వచ్చే విద్యా సంవత్స రం నుంచైనా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నగరంలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ భవన్లో ఆ ఫోరం జిల్లా అధ్యక్షుడు తులగాపు కేశవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నైతిక విలువలు జోడించి విద్యార్థులకు పాఠాలు బోధించడం ద్వారా నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. ప్రతి పాఠశాలకు సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తులగాపు కేశవరావు, బాడాన రాజు మాట్లాడుతూ సాంఘిక శాస్త్రంలో సిలబస్ భారం తగ్గించాలని, లేకుంటే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు ఇద్దరేసి సోషల్స్టడీస్ ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ను విజయవంతం చేయాలన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘికశాస్త్ర దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని వారు పిలుపు నిచ్చారు. జిల్లా ఆర్గనైజింగ్ కన్వీనర్లు మక్కా శ్రీనివాసరావు, ఎల్.గుణశేఖర్ మాట్లాడుతూ సాంఘికశాస్త్ర సిలబస్ పరిధిని దృష్టిలో పెట్టుకొని పని సర్దుబాటు నుంచి సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరారు. కార్యక్రమంలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా ప్రతినిధులు ఆర్.అన్నాజీరావు, పీవీఆర్. మూర్తి, టి.రమణ సీహెచ్ సుబ్బలక్ష్మి, ఎస్.స్వప్న, బి.ముకుందరావు, కె.సంతోష్కుమార్, జి.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment