భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దర్శనం కోసం శ్రీమందిరానికి విచ్చేసే భక్తులు, యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలను శాసన సభ స్థాయీ కమిటీ సమీక్షించింది. గంజాం జిల్లా దిగిపొహండి నియోజకవర్గం ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో అధ్యక్షతన ఈ కమిటీ శ్రీమందిరాన్ని ప్రత్యక్షంగా సందర్శించింది. శ్రీజగన్నాథ ఆలయ కార్యాలయం సమావేశ హాలులో నిర్వహించిన సమావేశంలో శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి(సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాఢి, పూరీ జిల్లా కలెక్టరు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
● భద్రతే ప్రధానంగా
శ్రీమందిరం, భక్తుల భద్రత ప్రధాన అంశంగా కమిటీ చర్చించింది. నిత్యం తండోపతండాలుగా తరలి వచ్చే భక్తులు, యాత్రికులకు సులభ దర్శనం ఏర్పాట్లని సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతిపాదనలు చేస్తుందని అధ్యక్షుడు సిద్ధాంత మహాపాత్రో తెలిపారు. శ్రీమందిరం శిఖర పరిధిలో డ్రోన్ వీక్షణపై పటిష్ట నిఘా అవసరమని కమిటీ సూచించింది. నో డ్రోన్ జోన్గా పరిగణించాలని తెలిపింది. సాగర తీర పుణ్య క్షేత్రం కావడంతో తీర ప్రాంత భద్రత కోసం మైరెన్ ఠాణా, కోస్టు గార్డు వ్యవస్థని సమీక్షించారు. శ్రీ మందిరం శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక బెటాలియన్ నియామకం ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో తుది మెరుగులు దిద్దుకుంటుంది. శ్రీ మందిరం సమగ్ర భద్రతా వ్యవస్థ పటిష్టతకు ఎటువంటి లోటు లేకుండా చర్యలు చేపట్టేందుకు సిఫారసు చేయనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment