డిక్లరేషన్పై సంతకం ఇష్టం లేక తిరుమల పర్యటన రద్దు
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి/కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వపరంగా ప్రజలకు వాస్తవాలు చెప్పేలోపు వైఎస్సార్సీపీ నేతల ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాలు వ్యాప్తి చెందేలా కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. డిక్లరేషన్పై సంతకం చేయటం ఇష్టంలేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ప్రభుత్వమేదో ఆయన్ను అడ్డుకున్నట్టుగా చేసిన అసత్య ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టినట్టే భవిష్యత్లోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసులు, అధికారుల తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైఎస్సార్సీపీ నేతలంటూనే రాజకీయ ప్రమేయం లేదనే భిన్నాభిప్రాయాలను పోలీసులు వ్యక్తం చేయటాన్ని బాబు వద్ద ప్రస్తావించారు.
కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై సీఎం చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ఏపీలో ‘లులూ’ పెట్టుబడులు
లులూ గ్రూపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ ఆలీ చంద్రబాబును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. లులూ గ్రూపు రాష్ట్రానికి తిరిగొచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, లులూ గ్రూపునకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటు అందిస్తుందన్నారు.
విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్ ఏర్పాటు, విజయవాడ, తిరుపతిలలో మల్టీప్లెక్స్ల నిర్మాణం వంటివాటిపై చర్చించినట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులూ గ్రూప్ చేసుకున్న ఒప్పందంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వచ్చాక లులూ గ్రూప్ రాష్ట్రానికి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment