కుల్కచర్ల: అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాల వివాదాస్పదంగా మారింది. వివరాలు .. చౌడాపూర్ మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో.. 2023– 24 బ్యాచ్కు చెందిన 43 మంది విద్యార్థులు టెన్త్ పాసయ్యారు. వీరిలో కొంతమంది బుధవారం మెమోలు తీసుకునేందుకు స్కూల్కు వచ్చారు. అయితే ఒక్కొక్కరి నుంచి రూ.200 నుంచి రూ.500 తీసుకుని మెమో, టీసీ ఇచ్చిన సిబ్బంది.. డబ్బులు లేని వారికి ఇవ్వలేదు. మిడ్జిల్ మండలానికి చెందిన అరుణ్, శివ ఒరిజినల్ టీసీ, మెమో కోసం పాఠశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేయడంతో రూ.200 చొప్పున ఇచ్చి తీసుకెళ్లాలని సూచించా రు. డబ్బులు లేవని చెప్పినా.. ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. డబ్బులిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని సార్ వాళ్లు చెప్పారు. ఈ సమాచారాన్ని మా పేరెంట్స్కు చేరవేశాం. వారు గురువారం వస్తామనడంతో రాత్రి ఇక్కడే పడుకుంటున్నాం అన్నారు. ఇదే విషయమై డీటీడబ్ల్యూఓ కమలాకర్రెడ్డిని ప్రశ్నించగా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment