ట్రూఅప్‌ పేరుతో విద్యుత్‌ చార్జీల భారం | - | Sakshi
Sakshi News home page

ట్రూఅప్‌ పేరుతో విద్యుత్‌ చార్జీల భారం

Published Sat, Oct 19 2024 12:34 AM | Last Updated on Sat, Oct 19 2024 12:34 AM

ట్రూఅప్‌ పేరుతో విద్యుత్‌ చార్జీల భారం

నెల్లూరు (వీఆర్సీసెంటర్‌): రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్‌ చార్జీల పేరుతో గడిచిన రెండేళ్లకు సంబంధించి దాదాపు రూ.20 వేల కోట్లు ప్రజలపై మోపేందుకు సిద్ధమైందని సీపీఎం నేతలు ఆరోపించారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ప్రజలపై పెనుభారం మోపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శుక్రవారం విద్యుత్‌భవన్‌ వద్ద ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, నెల్లూరురూరల్‌ కార్యదర్శి బత్తల కృష్ణయ్య మాట్లాడుతూ ట్రూఅప్‌ చార్జీల పేరుతో 2022–23 సంవత్సరానికి రూ.8,114 కోట్లు, 2023–24 సంవత్సరానికి రూ.11 వేల కోట్లు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల సమయంలో తాను అధికారంలో వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నేడు రూ.వేల కోట్లు విద్యుత్‌ చార్జీల రూపంలో పెంచేందుకు సిద్ధం కావడం విచారకరమన్నారు. 2000వ సంవత్సరంలో పెంచిన విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపిన వారిపై గుర్రాలతో తొక్కించి కాల్పులు చేసిన ఘటనలతో చంద్రబాబు గద్దె దిగారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, గృహ విద్యుత్‌ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు పెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ విజయన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్‌ అజీజ్‌, ప్రసాద్‌, కిన్నెరకుమార్‌, సతీష్‌, సంపత్‌కుమార్‌, శ్రీనివాసులు, మాలకొండయ్య, సుధాకర్‌, బాబు, ఖలీల్‌, షాహినాబేగం తదితరులు, పాల్గొన్నారు.

ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు

దండుకునే యత్నం

చార్జీలు పెంచబోమని చెప్పి

అధికారంలోకి వచ్చిన చంద్రబాబు

గతంలో ఇలాంటి నిర్ణయంతోనే

గద్దె దిగిన చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement