నెల్లూరు (అర్బన్): దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లోని ఓపీ బ్లాక్ గురువారం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లో మగ్గుతోంది. శుక్రవారం నాటికి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. ఓపీ బ్లాక్ పాత భవనం కావడంతో గోడల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు, స్విచ్లు దెబ్బతిని సక్రమంగా లేవు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ భవన గోడలు చెమ్మగిల్లి షాక్ కొడుతున్నాయి. ఓపీ బ్లాక్లోని విద్యుత్ బోర్డు ప్యానెల్ నెమ్ముతో చేరిపోయింది. 11వ నంబర్లో ఉన్న ముగ్గురు డాక్టర్ల ఓపీలు, న్యూరాలజీ ఓపీ, ఓపీ చీటీలు ఇచ్చే గది, ఇంజక్షన్ వేసే గది, మందులు ఇచ్చే గది, సదరమ్ క్యాంపు గది, క్యారిడార్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో కనీసం బల్బులు కూడా వెలిగే పరిస్థితి లేకుండా పోయింది. కిటికీలు ఓపెన్ చేసి సూర్య కాంతిలోనే రోగులకు డాక్టర్లు వైద్య సేవలందిస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ను వివరణ కోరగా త్వరితగతిన మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment