ఉద్యాన రైతుల తలరాతలు మారుస్తాం
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన రైతుల తలరాతలు మార్చుతామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బుధవారం స్థానిక ఎంవైఆర్ కన్వెన్షన్ హాలులో ‘అనంత హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వినోద్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మెంటర్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, అలాగే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ గెడ్డం శేఖర్బాబు హాజరు కాగా... ముఖ్య అతిథిగా మంత్రి పయ్యావుల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరలను స్థిరీకరించి రైతులను ఆర్థికంగా గట్టెక్కించే బాధ్యత తీసుకుంటామన్నారు. ‘అనంత’ బ్రాండ్ను క్రియేట్ చేసి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామన్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న కాలంలో ‘అనంత’ ఫలసాయం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ కాకుండా అంతర్జాతీయ స్థాయి మార్కెట్లకు అనుసంధానించి రైతులు ఆర్థికంగా గట్టెక్కేలా కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్, ఎంపీ అంబికా ల క్ష్మీనారాయణ, ఐఆర్టీఎస్ ప్రతినిధి అనితాబారుక్ తమ సందేశాలను వీడియో ద్వారా వినిపించారు.
ఏడు ఎంఓయూలు..
కాంక్లేవ్కు వివిధ రాష్ట్రాల నుంచి 64 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరైనట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి ఏడు కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకుంటున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల యాక్షన్ ప్లాన్ కింద ఉద్యాన తోటలను 10 వేల హెక్టార్లు పెంచడం, సూక్ష్మసాగు కింద 25 వేల హెక్టార్లకు డ్రిప్ అందివ్వడం, 29 లక్షల మెట్రిక్ టన్నులకు దిగుబడి పెంచడం, పంట తొలగింపు తర్వాత నష్టాలు 10 శాతం తగ్గిస్తూ రూ.800 కోట్ల మేర ఏటా రైతులు లాభం పొందేలా చేయడమే కర్తవ్యమన్నారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ శేఖర్బాబు మాట్లాడుతూ ఉద్యాన ఉత్పత్తుల విలువ ఆధారిత పెంపులో భాగంగా కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. అనంతరం రైతులకు సేవలందించిన ఎన్జీఓలు, ఉత్తమ రైతులు మొత్తం 11 మందికి అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరామ్, అమిలినేని సురేంద్రబాబు, పరిటాల సునీత, బండారు శ్రావణి, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, అడిషనల్ డైరెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, సీహెచ్ హరినాథరెడ్డి పాల్గొన్నారు.
‘అనంత హార్టికల్చర్ కాంక్లేవ్’లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఉద్యాన రైతులకు అవమానం
అనంత హార్టికల్చర్ కాంక్లేవ్కి అసలు సిసలైన పండ్లతోటల రైతులను రానివ్వకుండా అడ్డుకుని అవమానపరిచారు. ఉద్యాన సమ్మేళనానికి దారి పొడవునా, ప్రధాన ద్వారం రెండు వైపులా పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. గుర్తింపు కార్డు లేనిదే లోపలికి ప్రవేశం లేదని పోలీసులు తెగేసి చెప్పడంతో రైతులు మూకుమ్మడిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్లు, కూరగాయల పంటలు పండించే తమనే అవమానానికి గురి చేస్తారా అంటూ మండిపడ్డారు. అయినా పోలీసులు లోపలికి పంపడానికి నిరాకరించడంతో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల వైఖరిపై తీవ్రస్థాయి ఆగ్రహం వెలిబుచ్చారు. ఇంతమాత్రానికి వారం రోజులుగా పెద్ద ఎత్తున ఎందుకు ప్రచారం చేశారని, ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకని గద్దించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి వచ్చి రైతులను శాంతింపజేసి లోపలికి అనుమతించారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు అయిష్టంగానే హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment