ఇచ్ఛాపురం రూరల్: సర్కారు బడుల్లో పనిచేసే ఆయాలకు ఆయాసమే మిగులుతోంది. ఏ ముహూర్తాన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందో గానీ దాదాపు అప్పటి నుంచి వారికి వేతనాలు అందడం లేదు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. రెండు నెలలు వేసవి సెలవుల్లో, బడులు పునః ప్రారంభం అయి నేటికి రెండు నెలలు కావస్తున్నా పైసా ఇవ్వలేదని వారు ఆవేదన చెందుతున్నారు.
పాఠశాలల్లో గ్రీన్ అంబాసిడర్లుగా..
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతే లక్ష్యంగా, విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం ‘ఆయా’లను నియమించింది. పాఠశాలల్లో గ్రీన్ అంబాసిడర్లుగా వ్యవహరించే ఆయాలు రోజుకు రెండు పూటలా మరుగుదొడ్లను పరిశుభ్రం చేయడం, పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేయడం, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం కింద పడిన వ్యర్థ పదార్థాలు, తినుబండారాలను పరిశుభ్రం చేయడం, తరగతి గదులు పరిశు భ్రం చేయడం, పాఠశాలలో పెంచే మొక్కలకు నీరు పోయడం వంటి పనులు చేయాలి. 300 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఒక ఆయా, 600 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఇద్దరు ఆయాలు, 600 నుంచి 900 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ముగ్గురు ఆయాలు, 900 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో నలుగురు ఆయాలను అప్పట్లో నియమించారు. ప్రసుత్తం జిల్లాలో ఉన్న 2573 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 2764 మంది ఆయాలు పనిచేస్తున్నారు.
అప్పట్లో అమ్మ ఒడి నుంచి వేతనాలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఆయాలకు నెలసరి అందించే వేతనాలను గతంలో ప్రభుత్వం అందజేసిన అమ్మ ఒడి పథకం నుంచి ఇచ్చేవారు. విద్యార్థికి అందించే రూ.15వేలలో రెండు వేల రూపాయలను పాఠశాల ‘టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్’కు వినియోగించేవారు. ఈ ఫండ్ నుంచి ఒక్కో ఆయాకు రూ.6వేలు వేతనంగా, వేసవి సెలవుల్లో నెలకు రూ.3వేలు చొప్పున అందజేసేవారు. అంతే కాకుండా అదే ఫండ్ నుంచి మరుగు దొడ్లకు వినియోగించే ఉపకరణలు, ద్రావణాలకు ఖర్చు చే సేవారు. ఈ వేతనాలు గత ప్రభుత్వ హయాంలో మార్చి 2024 వరకు అందజేశారు. అనంతరం వేస వి సెలవులు రావడం, ఎన్నికల్లో కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో ఆయాలకు అందాల్సిన ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు ఇంత వరకు అందజేయలేదు.
అంతా అయోమయం
సూపర్ సిక్స్లో భాగంగా బడిలో ఎంత మంది చదివితే అంతమందికి తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామంటూ చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఆ పథకాన్ని అమలు పరిచేలా లేదని మేధావులు చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది రూట్ మ్యాప్ అమలు పరచి తల్లికి వందనం పథకం అమ లు చేస్తామంటూ వ్యాఖ్యానించడంతో ఆయాలు, ఉపాధ్యాయుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, ఈ ఏడాది తల్లికి వందనం పథకం కూడా అమలు కాకపోతే వారికి వేతనాలతో పాటు మరుగుదొడ్లకు అవసరమైన వస్తువులు, ద్రావణాలు ఎలా కొనుగోలు చేసేదని ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment