సమయం.. ఆసన్నం | - | Sakshi
Sakshi News home page

సమయం.. ఆసన్నం

Published Fri, Feb 7 2025 7:36 AM | Last Updated on Fri, Feb 7 2025 7:36 AM

సమయం.. ఆసన్నం

సమయం.. ఆసన్నం

వికారాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలు ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే.. ఏడాదిగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. రెండు నెలల క్రితం జీపీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేసిన అధికారులు ఇటీవల మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఎన్నికల బరిలో నిలవాలనుకునే వారిలో ఆశలు రేపాయి. గ్రామ పంచాయతీల ఎన్నికలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయటంతో ముందుగా జీపీ ఎన్నికలకే వెళ్దామనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరో ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డీపీఓలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్‌ ఎప్పుడు అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ప్రక్రియ పూర్తి

జిల్లాలో 566 జీపీలు ఉండగా మండలాల పునర్విభజన అనంతరం వాటి సంఖ్య 585కు చేరింది. ఇటీవల పక్క జిల్లాలు అయిన నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌ల నుంచి కొన్ని జీపీలు కలవడంతో పంచాయతీల సంఖ్య మరింత పెరిగి 594కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో 5,058 వార్డులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా అవసరం అవుతాయని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎంత సిబ్బంది అవసరం, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లు తదితర వివరాలు సేకరించారు. ఓటర్లను వార్డుల వారీగా విభజించే ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబందించి పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం జాబితాను సిద్ధం చేసి జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఆమోదం పొందారు.

సీఎం నోట పంచాయతీ ఎన్నికల మాట

సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది పూర్తి

జీపీల్లో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు

పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు

మండలాల వారీగా వివరాలు

మండలం జీపీలు వార్డులు

వికారాబాద్‌ 21 182

ధారూరు 34 286

మోమిన్‌పేట్‌ 29 256

బంట్వారం 12 106

మర్పల్లి 29 264

కోట్‌పల్లి 18 150

తాండూరు 33 290

బషీరాబాద్‌ 39 312

యాలాల 39 318

పెద్దేముల్‌ 38 308

కొడంగల్‌ 25 222

దౌల్తాబాద్‌ 34 298

బొంరాస్‌పేట్‌ 35 292

దుద్యాల్‌ 19 158

పరిగి 32 268

పూడూరు 32 282

కుల్కచర్ల 33 280

చౌడాపూర్‌ 24 202

దోమ 36 308

నవాబుపేట 32 276

మద్దతు కూడగట్టుకునే పనిలో నేతలు

త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలను వారికే రిజర్వు చేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన కూడా తెరపైకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement