ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు
విజయనగరం క్రైమ్: ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ను కచ్చితంగా అమలుచేయాలని, కోడ్ ఉల్లంఘిస్తే కఠినచర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు గురవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియామవళిని జిల్లాలో కచ్చితంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 8వ తేదీ వరకూ కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు లేకుండా చూడాలని, విగ్రహాలకు ముసుగు వేసే విధంగా మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో తుపాకుల లైసెన్స్లు కలిగిన వ్యక్తుల నుంచి ఆయుధాలను డిపాజిట్ అయ్యే విధంగా చూడాలని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాన్బెయిల్బుల్ వారెంట్ను ఎగ్జిక్యూట్ చేయాలని, ఇందుకు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని సూచించారు. గ్రామాల్లో బెల్ట్షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు చేయాలని, మద్యం అక్రమంగా విక్రయించేవారిపైన కేసులు నమోదుచేయాలని స్పష్టం చేశారు. రాత్రిబీట్లను, పగటిబీట్లను వేయాలని, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ముందుగా గుర్తించి, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దత్తత గ్రామాల్లో పోలీసు సిబ్బంది వారంలో రెండు సార్లు సందర్శించి, క్షేత్రస్ధాయిలో సమాచారాన్ని సేకరించి, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ఎన్నికల కోడ్ను అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో సంబంధిత సీఐలు వారి పరిధిలో పనిచేసే ఎస్సైలకు మార్గదర్శకం చేయాలని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలు తీరును విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పి ఎస్.రాఘవులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment