మన్యంలో మహమ్మారి
జనాన్ని మింగుతున్న సికిల్ సెల్ అనీమియా
బి.గణేష్ బాబు, ‘సాక్షి’ ప్రతినిధి
మన్యాన్ని ఓ మహమ్మారి మింగేస్తోంది. ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈ వ్యాధి బారినపడి చనిపోతున్నారు. మన్యాన్ని వణికిస్తున్న ఆ జబ్బు పేరు ‘సికిల్ సెల్ అనీమియా’. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈ రక్తహీనత జబ్బుకు ఇంతవరకు మందులు లేవు. అసలు ఏజెన్సీలో ఎంతమందికి ఈ జబ్బు ఉంది? ఎందరు మరణించారు? లాంటి ప్రాథమికమైన గణాంకాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని గణాంక విభాగంలో ‘సికిల్ సెల్ అనీమియా’ రోగులు వివరాలను అడిగితే.. అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటని? అక్కడి సిబ్బంది ఎదురు ప్రశ్నించారు. గుజరాత్తో సహా పలు రాష్ట్రాల్లో ఈ జబ్బు అదుపునకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘సికిల్ సెల్ అనీమియా’పై ఎలాంటి చర్యలూ తీసుకోని రాష్ట్రం ఏపీ ఒక్కటేనంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో దాదాపు 10 లక్షల గిరిజన జనాభా ఉంది. ఇందులో కనీ సం పది శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి. ఈ వ్యా దికి గురై మరణించేవారి సంఖ్య ఏటా పెరుగుతూ పోతోంది. యూనివర్సిటీ స్థాయిలో ‘హ్యూమన్ జెనెటిక్స్’ విభాగం వారు జరిపిన పలు శాంపిల్ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివశిస్తున్న గిరిజనేతర కులాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటం మరింత ఆందోళన కలిగించే విషయం.
నిర్లక్ష్యానికి పరాకాష్ట: పాడేరు పరిసర ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా రోగుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. ఎత్తయిన ప్రాంతం (3,600 అడుగులు) కావడం వల్ల ఈ ప్రాంతంలో ఆక్సిజన్ లభ్యతలో తేడాలుంటాయి. రోగులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రెండు నెలల క్రితం రక్తం నిలువచేసే రిఫ్రిజరేటర్ చెడిపోయింది. బాగు చేయించడానికి రూ.20 వేలకన్నా ఎక్కువ ఖర్చుకాదు. అయినా పట్టించుకున్న నాధుడే లేడు. ఈ రోగానికి మందులు లేవు. సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడమే మార్గం.
పరీక్ష ఖరీదు పది రూపాయలే: జబ్బు నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు రూ.10లోపే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా? అని తెలుస్తుంది. ఈ ప్రాథమిక పరీక్షను ‘ప్రైమరీ హెల్త్ సెంటర్ల’(పీహెచ్సీ) స్థాయిలోనే జరపవచ్చు. విశాఖ జిల్లాలో సికిల్ సెల్ అనీమియా ఎక్కువగా ఉన్న పాడేరు, అరకు పరిధిలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపడం లేదు. రోగులు మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్ సెల్ అనీమియా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది.
కొడుకు చనిపోయాడు.. కుమార్తెకూ వ్యాధి
ఝాన్సీరాణి, క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఝాన్సీరాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. క్రాంతిరాజు గిరిజన కార్పొరేషన్లో సేల్స్మన్. మూడేళ్ల క్రితం 9వ తరగతి చదువుతున్న కొడుకు సురేష్కు విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్లు ‘సికిల్ సెల్ అనీమియా’ అన్నారు. అన్ని రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013 సెప్టెంబర్లో చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే విధమైన జబ్బు వచ్చింది. కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంపతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఇది వీరి ఒక్కరి సమస్యే కాదు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గూడెంలోను వందలాది కుటుం బాలు ఇలాంటి వ్యథను అనుభవిస్తున్నాయి.