manyam
-
మన్యం బంద్ .. పాల్గొన్న YSRCP MLA విశ్వేశ్వర రాజు
-
కన్నులపండువగా పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం (పోటోలు)
-
గుమ్మడికి పండగే
గుమ్మడి కాయలతో గిరిజనులకు విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు వారికి నిత్యవంటకంగా ఉండే గుమ్మడి ఇప్పుడు మంచి ఆదాయ వనరుగా మారింది. సహజసిద్ధంగా కాయడం వల్ల వీటికి మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సంక్రాంతి పండగ నాడు వీటి వినియోగం ఎక్కువకావడంతో మన్యంలోని వారపు సంతల్లో అమ్మకాలు జోరందుకున్నాయి.సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లా మన్యంలో గిరిజనులు గుమ్మడిని ప్రత్యేకంగా సాగు చేయరు. ఇంటి పెరట్లో, ఖాళీ స్థలాలు, కొండపోడు భూముల్లో విత్తనాలు చల్లుతారు. పాదుకు 20 నుంచి 30 కాయల వరకు కాస్తాయి. చాలామంది గిరిజనులు గుమ్మడి కాయను నిత్య వంటకానికి ఉపయోగిస్తున్నారు. ఎంతో ఇష్టంగా తినడం వల్ల ఇంటికి వచ్చే అతిథులకు గుమ్మడి కూర వండి పెడుతుంటారు. లేత పిందెలతో కొంతమంది కూర తయారు చేస్తుంటారు. గుమ్మడిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నందున వినియోగం పెరిగింది. కొంతమంది గిరిజనులు పిందె దశలో ఒకొక్కటి రూ.20 నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. బాగా పండిన కాయను రూ.50 నుంచి రూ.80కు అమ్ముతున్నారు. ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఒకొక్క గిరిజనుడు రూ.2వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీలో జరుగుతున్న వారపు సంతల్లో గుమ్మడి అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతం నుంచి నాలుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మంగళవారం జి.మాడుగుల, బుధవారం కించుమండ, చింతపల్లి, గురువారం గుత్తులపుట్టు, మజ్జిగరువు, శుక్రవారం పాడేరు, అరకు వారపు సంతల్లో గుమ్మడికాయల వ్యాపారం భారీగా జరిగింది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. పుణ్యక్షేత్రాలకు.. తిరుమల తిరుపతి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లోని నిత్యాన్నదానంకు మన్యం గుమ్మడికాయలను వినియోగిస్తున్నారు. స్థానికంగా కొనుగోలు చేసి దేవస్థానాలకు సరఫరా చేస్తుంటారు. సేంద్రియ పద్ధతిలో గిరిజనులు సాగు చేయడం వల్ల దేశవాళి గుమ్మడికాయలు మంచి రుచికరంగా ఉంటాయి. అందువల్ల మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉంది. పండగ సీజన్లో..: సంక్రాంతి సీజన్లో వినియోగం ఎక్కువగా ఉన్నందున వ్యాపారులు గిరిజనుల వద్ద పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారు మంచి ధర పొందుతున్నారు. ప్రస్తుతం సీజన్ మొదలవడంతో గిరిజనులు అమ్మకాల్లో నిమగ్నమయ్యా రు. వారపు సంతల్లో వ్యా పారం జోరందుకుంది. గుమ్మడి బంధం సంక్రాంతి పండగతో గుమ్మడి కాయకు సంబంధం ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఆ రోజు తెలకపిండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడి కాయలు దానం చేయడం మైదాన ప్రాంతాల్లో పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక. దీనిని పేదలకు, బ్రాహ్మణులకు దానం చేస్తే భూదేవితో పాటు శ్రీమహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వసిస్తుంటారు. పోషక విలువలెన్నో.. గుమ్మడికాయను తరచూ తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది. దీనివల్ల కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, బోలు ఎముకల వ్యాధి వంటి రోగాలు దరి చేరవు. ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుకు ఉపయోగపడుతుంది. విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు కొలె్రస్టాల్ను కరిగించడమే కాకుండా, అధిక బరువును నియంత్రణలోకి తెస్తుందని పోషణ నిపుణులు చెబుతున్నారు.నిత్య వంటకంగిరిజనులంతా గుమ్మడికాయలను ఏడాది పొడవునా దాచుకుంటూ నిత్య వంటకంగా వినియోగిస్తుంటారు.అలాగే ఇంటికి వచ్చే చుట్టాలు, బంధువులకు కూడా వీటి వండి పెడుతారు. సంక్రాంతి, ఇతర పండగల సమయంలోను గుమ్మడికాయలను కోసి గ్రామాల్లో ఒకరికొకరు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముదిరిన గుమ్మడికాయలు పాడవకుండా ఉండేలే ఇంటి పరిసరాల్లో ఉండే జామ, మామిడి, పనసవంటి చెట్లకు వేలాడిదీసి భద్ర పరుస్తారు. చెట్టుకు కట్టిన గుమ్మడికాయలను దొంగిలించే పరిస్థితి కూడా ఉండదు.రూ.50 ధరకు అమ్మా ఇంటి పరిసరాలతో పాటు కొండపోడులో గుమ్మడి విత్తనాలు చల్లాం. దిగుబడి బాగానే ఉంది. గుమ్మడికాయలను పిందెల సమయంలోనే వంట వండుకుతిన్నాం. బాగా పండిన తరువాత అరకు సంతలో రెండు దఫాలుగా అమ్మాం. ఒకొక్క కాయ రూ.50కు విక్రయించగా రూ.వెయ్యి ఆదాయం వచ్చింది. కొన్ని కాయలను తిండి అవసరాలకు దాచుకున్నాం. – వంతాల చంపా,నందివలస, డుంబ్రిగుడ మండలం గ్రామాల్లోకి వచ్చి కొంటున్నారు గతంలో గుమ్మడికాయలను అమ్మేవారిమి కాదు. వ్యాపారులు గ్రామాలకే వచ్చి గుమ్మడికాయలను కొంటుండడంతో పాదులు ఎక్కు వ వేస్తున్నాం. గుమ్మడికా యలు సాగు చేయడం ద్వారా వచ్చే నగదును తమ అవసరాలకు ఉపయోగించుకుంటాం. గుమ్మడితో తమకు విడదీయరాని బంధం ఉంది. ఆచార సంప్రదాయంలో భాగంగా పండిస్తుంటాం. – కిల్లో కమలమ్మ, జోడిగుడ, హుకుంపేట మండలం పెరుగుతున్న వినియోగం సహజసిద్ధంగా పండుతున్న గుమ్మడి పండ్లను నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లకు మాత్రమే ఎగుమతి చేసేవాళ్లం. ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్లో రాష్ట్రాల్లో వినియోగం భాగా పెరిగింది. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా వంటకాల్లో వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల మార్కెట్లలో పోటీపడి కొనుగోలు చేస్తున్నాం. – వెంకట అప్పారావు, గుమ్మడి వ్యాపారి, పాడేరు -
YSRCP ఫ్లెక్సీలను చించేసిన దుండగులు
-
తాటి.. ఆదాయంలో మేటి
గ్రామీణ భారతంలో తాటిచెట్టుది ప్రత్యేక స్థానం. పేదవాడి కల్పవృక్షంగా పిలిచే తాటిచెట్టులో ఉపయోగపడని భాగమే ఉండదు. మనదేశంలో తీరప్రాంత రాష్ట్రాల్లో తాటిచెట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. తమిళనాడులో తాటిచెట్లు అధిక సంఖ్యలో ఉండగా తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్దే. తాటిచెట్టు (Palm Tree) ప్రయోజనాలను గుర్తించిన మన పూర్వికులు దాన్ని ఇంటికి పెద్దకొడుకుగా భావించేవారు. పొలం గట్టున పది తాటిచెట్లుంటే ప్రశాంతంగా జీవించొచ్చు అనుకునేవారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో వీటిపై ఆసక్తి కొంత తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తాటిచెట్ల నుంచి గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపించాలనే లక్ష్యంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రి కల్చర్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) ద్వారా అఖిల భారత వన్య పంట పథకంలో భాగంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తొలిదశ పరిశోధనలు ఫలించాయి. భారతదేశంలో (India) 2010 సంవత్సరంలో తాటి చెట్లపై పరిశోధనకు రెండు చోట్ల అనుమతులు ఇచ్చారు. ఒకటి అల్లూరి జిల్లా పందిరిమామిడిలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, రెండోది తమిళనాడులోని కిలికులం. ఈ రెండు చోట్ల తాటిపై పరిశోధనలు ప్రారంభించారు. తక్కువ సమయంలో కాపునకు వచ్చే రకాలను అభివృద్ధి చేసేందుకు అనేక చోట్ల నుంచి మేలైన తాటి విత్తనాలను సేకరించి అభివృద్ధి పరిచారు. తాటి ఉప ఉత్పత్తులపైనా పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా తాటి తేగలతో ఉప ఉత్పత్తులు తయారుచేయడంపై జరిపిన పరిశోధనలు పూర్తయ్యాయి. రెండో దశలో యంత్రాలను ఉపయోగించి వాణిజ్యపరంగా ఉప ఉత్పత్తులు తయారు చేయడంపై పరిశోధనలు ప్రారంభించారు. రెండేళ్ల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా మల్లేపల్లి, బిహార్లోని సబుర్లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. – రంపచోడవరం(అల్లూరి జిల్లా) లండన్కు తేగల పిండి చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆశ స్వచ్ఛంద సంస్థ పందిరిమామిడి (Pandiri Mamidi) హెచ్ఆర్ఎస్ హెడ్.. డాక్టర్ పి.సి. వెంగయ్య సహకారంతో 2019–20 సంవత్సరంలో మూడు టన్నుల తేగల పిండిని లండన్కు పంపించింది. తరువాత కోవిడ్ కారణంగా ఈ రవాణాకు బ్రేక్ పడింది. తిరిగి మారోమారు లండన్కు తేగల పిండిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రెండో దశ వాణిజ్య ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు తాటి ఉప ఆహారోత్పత్తులపై పరిశోధనలు జరిగాయి. రెండో దశలో వాణిజ్యపరంగా ప్రయోజనం చేకూర్చేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. తాటి తేగల కోత నుంచి పిండి, రవ్వ తయారీ వంటివాటిని భారీ ఎత్తున యంత్రాలతో చేపట్టడంపై పరిశోధనలు సాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్లో 3 కోట్ల వరకు తాటి చెట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క శాతం ఉపయోగించుకున్నా కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో 272 రకాల తాటి చెట్లను అభివృద్ధి చేశాం. – డాక్టర్ పి.సి. వెంగయ్య, అధిపతి, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, పందిరిమామిడి తేగలతో 12 రకాల ఆహార పదార్థాలు అల్లూరి జిల్లా పందిరి మామిడి పరిశోధన స్థానంలో తాటి తేగలతో పిండి, నూక(రవ్వ) తయారు చేసి, మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాలు తయారు చేశారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడుల్స్, రవ్వలడ్డు, పిజ్జా బేస్ తదితర పదార్థాలు తయారు చేస్తున్నారు. తాటి పండు టెంకలు నాటిన 135 రోజుల తరువాత తాటి తేగలు కోతకు వస్తాయి. తేగలు 30 నుంచి 55 సెంటీమీటర్ల పొడువు, 70 గ్రాముల వరకు బరువు ఉంటాయి. తాటి తేగలు ముక్కులు శుభ్రం చేసి కడిగి ఒక ట్రేలో అరబెట్టాలి. వీటిని నాలుగు గంటల పాటు డ్రయ్యర్లో ఉంచాలి. తేగల పిండి తయారుచేయడానికి ఎండిన తేగలను మెత్తగా రుబ్బి జల్లెడ పట్టాలి. తరువాత పిండిని నానబెట్టి చేదు రుచి పోగొట్టేందుకు డిస్టల్డ్ వాటర్తో విశ్లేషణ చేయాలి. ఈ తేగల పిండిలో ప్రొటీన్ 3.40 శాతం, ఫైబర్ 8.80 శాతం, కాపర్ 0.05 శాతం, జింక్ 0.41 శాతం, ఐరన్ 2.40 శాతం, మెగ్నీషియమ్ 0.05 శాతం ఉంటాయి. బేకరీ ఉత్పత్తుల తయారీలో మైదాకు బదులు తేగల పిండి(ఫ్లోర్) వినియోగించవచ్చు. దీని ద్వారా అధిక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో తేగల పిండితో బిస్కెట్లు, నూడిల్స్, నూకతో కేక్లు తయారు చేశారు. మార్కెట్లో కేజీ తేగల రవ్వ ధర రూ. 170 వరకు ఉంది. పది తాటి చెట్ల ద్వారా ఏడాదిలో రూ. 35 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. -
దొరా.. ఇళ్లు రెడీ!
కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ(ఎన్సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించానలి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్సీసీ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మమ్మ, ఐటీడీఏ పీవో అభిషేక్ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది. ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు... ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్సీసీ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్లో రెండు బెడ్ రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మల్లుదొర , గంటందొర వారసులు 11 మందికి 11 ఫా్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్ను ఎన్సీసీ తమ కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సేవా సమితి పర్యవేక్షిస్తోంది. ఆనందంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు. – గాం గంగరాజు, లంకవీధిసొంతిల్లు అదృష్టం ఎట్టకేలకు సొంత గూటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదు. రెండు బెడ్ రూమ్లతోపాటు హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్లు నిర్మించడం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధిసమస్యను పరిష్కరించాం ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించడం మరిచిపోలేని విషయం. లబ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు -
పార్వతీపురంలో గజ రాజుల బీభత్సం
సాక్షి,మన్యం: పార్వతీపురంలో గజ రాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మండలం నర్సి పురం సమీపంలో ఏనుగుల గుంపు కొబ్బరి తోటల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను లాగి విసిరేశాయి. పంటపొలాలను ధ్వంసం చేశాయి. గజరాజుల బీభత్సాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా అడ్డుగా వచ్చిన వాహనాల్ని పక్కకు నెట్టాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపుతో స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మన్యం జిల్లాలో గజరాజుల గుంపు బీభత్సం
-
శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఏనుగులు హల్ చల్
-
మన్యం గజగజ! భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. అరకులోయలో 8.6 డిగ్రీలు..
సాక్షి, పాడేరు: చలి తీవ్రతకు మన్యం ప్రాంతం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పొగమంచు, చలిగాలుల తీవ్రత పెరగడంతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. అరకులోయలోని కేంద్ర కాఫీబోర్డు వద్ద సోమవారం ఉదయం 8.6 డిగ్రీలు, పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో ఆదివారం 10 డిగ్రీలు, అరకులోయలో 15.2 డిగ్రీలు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఒక్కరోజులోనే మినుములూరు మినహా, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి చలిగాలులు పెరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రత పెరగడంతో స్థానికులతోపాటు ఏజెన్సీని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం 10గంటల వరకు అరకులోయ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, చింతపల్లి ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. పది గంటల తర్వాతే సూర్యుడు కనిపించాడు. పొగమంచు కారణంగా లంబసింగి, పాడేరు, అనంతగిరి, దారకొండ, రంపుల, మోతుగూడెం, మారేడుమిల్లి ఘాట్రోడ్లలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మన్యంలో చలి విజృంభణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు వద్ద 9.8 డిగ్రీలు నెలకొనగా గురువారం ఉదయం 6.8 డిగ్రీలకు పడిపోవడంతో చలి అధికమైంది. ఒక్కరోజు వ్యవధిలోనే 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడంతో అరకు ప్రాంత వాసులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు దట్టంగా కురవడంతో పాటు చలి పెరగడంతో స్థానికులు, పర్యాటకులు అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుంది. అలాగే పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దట్టంగానే కురిసింది. -
మన్యం గజగజ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు): ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలిపులితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 డిగ్రీల నుంచి 8.2 డిగ్రీలకు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 12 డిగ్రీల నుంచి 9 డిగ్రీలకు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 12.7 డిగ్రీల నుంచి 9.7 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ గ్రామాల్లో చలిగాలులు అధికమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రతకు ప్రజలు తాళలేకపోయారు. ఒక వైపు బంగాళాఖాతంలో అల్పపీడనంపై వాతావరణ శాఖ ప్రచారం చేసినా మన్యంలో మాత్రం పొగమంచు దట్టంగా కురిసి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. బుధవారం ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురిసింది. సూర్యోదయం ఆలస్యమైంది. మన్యంలో వృద్ధులు, చిన్నారులు చలితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పొగమంచు, చలితీవ్రతతో వణుకుతున్నారు. మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, మోతుగూడెం, చింతూరు ప్రాంతాల్లో కూడా చలితీవ్రత నెలకొంది. ఘాట్ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రతతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే చలిగాలులు విజృంభించినప్పటికీ పర్యాటకుల తాకిడి మన్యానికి ఏమాత్రం తగ్గలేదు. పొగమంచు ప్రకృతి అందాలను తనివితీరా వీక్షిస్తూ మధురానుభూతి పొందుతున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8.2 డిగ్రీలు మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 9.0 డిగ్రీలు అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 9.7 డిగ్రీలు -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న థామస్ జార్జ్ రూథర్ఫర్డ్ను ఆ ఏప్రిల్లో మన్యం స్పెషల్ కమిషనర్గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
Mamidi Tandra: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
ముంచంగిపుట్టు(అరకులోయ)అల్లూరి సీతారామరాజు జిల్లా: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరుతుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారుచేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిందంటే చాలు. మన్యంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. కొండ, అటవీ ప్రాంతాల్లో లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర.. చాలా రుచిగా ఉంటుంది. గిరిజన మహిళలు తయారు చేసే ఈ తాండ్రకు మన్యంతో పాటు మైదానంలో మంచి గిరాకీ ఉంది. చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే! ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో మామిడి తాండ్ర తయారు చేసే పనిలో గిరిజన మహిళలు బిజీగా ఉన్నారు. వారపు సంతలో కిలో తాండ్ర రూ.100 వరకు పలుకుతున్నా.. ఎంతో రుచిగా ఉండడంతో కొనుగోలుదారులు ధరను లెక్క చేయడం లేదు. మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత కూడా తాండ్రను భద్ర పరుచుకుని తినే అవకాశం ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా మన్యం మహిళలు తాండ్రను తయారు చేస్తున్నారు. తాండ్రను తయారు చేస్తున్న గిరిజన మహిళ సహజసిద్ధంగా తయారీ గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో మామిడి చెట్లకు కాసే కొండ మామిడి పండ్లను ఇంటిల్లిపాదీ సేకరిస్తారు. వాటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు, బిందెలలో వేసి రోకలితో దంచుతారు. మామిడి రసాన్ని చాటలు, ప్లేట్లు, చాపలపై పలుచగా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలపకుండానే పొరలు, పొరలుగా వేస్తారు. వారం, పది రోజుల పాటు ఆరబెట్టి.. తర్వాత తాండ్రగా ప్యాక్ చేస్తారు. తాండ్ర తయారీకి కొండ మామిడి పండ్లను సేకరిస్తున్న చిన్నారులు తొక్కతో పచ్చడి మామిడి పండ్ల నుంచి వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తుండగా.. మిగిలిన మామిడి తొక్కలు, టెంకలను వేరు చేస్తారు. తొక్కలను కొందరు కారంతో, మరికొందరు బెల్లంతో కలిసి ఎండ బెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఏడాది పొడవునా గంజి అన్నంతో పచ్చడి మాదిరిగా వినియోగిస్తారు. కొన్ని గ్రామాల్లో మామిడి టెంకలను ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకుని ఆరగిస్తారు. మామిడి టెంకలతో కూరను కూడా తయారు చేస్తారు. ఈ కూరను లొట్టలేసుకుని మరీ తింటారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి ఏటా మామిడితో ఆదాయం సంపాదిస్తున్నాం. మొదట్లో మామిడి తాండ్రను ఇంట్లో వాడకం కోసం మాత్రమే తయారు చేసుకునేవాళ్లం. వారపు సంతల్లో తాండ్రకు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పెంచాం. కొంత మంది వ్యాపారులు ఇంటికి వచ్చి మరీ తాండ్రను కొనుగోలు చేస్తున్నారు. సహజసిద్ధంగా తయారుచేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఆదాయం బాగుంటుంది. –రాధమ్మ, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం -
శీకాయతో సిరులు
మన్యంలో అటవీ ఉత్పత్తులకు మంచి ధర లభించే రోజులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా గిరిజనులు సేకరిస్తున్న శీకాయను విదేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఏటా శీకాయ విక్రయం ద్వారా సుమారు రూ.50 లక్షల మేర వ్యాపారం చేస్తున్న జీసీసీ.. తలపెట్టిన విదేశీ మార్కెటింగ్ కార్యరూపం దాల్చితే అధిక ఆదాయం ఆర్జించడమే కాకుండా గిరిజనులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. రంపచోడవరం: మన్యంలో గిరిజనులు సేకరిస్తున్న శీకాయ కాసులు కురిపించనుంది. అడవుల్లో పెరిగే ఈ మొక్కలకు గిరిజనుల ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించరు. సహజసిద్ధంగా పెరగడం వల్ల శీకాయకు సేంద్రియ ఉత్పత్తిగా మంచి డిమాండ్ ఉంది. దీనికి విదేశాల్లో మంచి మార్కెటింగ్ ఉన్నందున ఈ దిశగా గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. గిరిజనులు సేకరించే శీకాయ సేంద్రియ ఉత్పత్తిగా ధ్రువీకరించేందుకు బెంగళూరు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) బృందం ఈ నెల మారేడుమిల్లి రానుంది. బృందం సభ్యులు ధ్రువీకరణతో.. ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, నెల్లిపాక అటవీ ప్రాంతాల్లో గిరిజనులు శీకాయను సేకరిస్తుంటారు. మారేడుమిల్లి రానున్న ఐఎంవో బృందం సభ్యులు మండలంలో శీకాయ విరివిగా లభించే బొడ్లంక, పాతకోట ప్రాంతాలను ఈనెల 20న సందర్శిస్తారు. గిరిజనులు సేకరిస్తున్న శీకాయను పరిశీలిస్తారు. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించలేనట్టుగా నిర్థారణ అయిన వెంటనే ధ్రువపత్రం జారీ చేస్తారు. దీని ఆధారంగా హైదరాబాద్కు చెందిన వెంచూరియా కంపెనీ ద్వారా శీకాయను ప్రోసెసెంగ్ చేసి విదేశాలకు మార్కెటింగ్ ప్రారంభిస్తామని జీసీసీ అధికారవర్గాలు తెలిపాయి. రెట్టింపు ధరకు అవకాశం ప్రస్తుతం గిరిజనులు సేకరిస్తున్న శీకాయకు గిరిజన సహకార సంస్థ కిలోకు రూ. 55 చెల్లిస్తోంది. సేంద్రియ శీకాయగా ధ్రువీకరణ అనంతరం గిరిజనులకు జీసీసీ రెట్టింపు ధర చెల్లించే అవకాశం ఉంది. శీకాయను విదేశాలకు మార్కెట్ చేయడం ద్వారా సేకరించిన గిరిజనులకు 35 శాతం, మార్కెటింగ్ చేయడం వల్ల 15 శాతం లాభాలు వస్తాయని జీసీసీ అంచనా వేస్తోంది. ఏటా వంద టన్నుల సేకరణ.. ఏటా గిరిజన సహకార సంస్థ ఏజెన్సీలో గిరిజనుల నుంచి 100 టన్నుల శీకాకాయను సేకరిస్తోంది. ఐఎంవో గుర్తింపు తరువాత విదేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు ఆర్గానిక్ శీకాయను గింజలు తొలగించి ఫౌడర్గా తయారు చేయాల్సి ఉంటుంది. కుంకుడుకు పెరిగిన ధర గిరిజనులు సేకరించే కుంకుడు ధరను పెంచుతూ గిరిజన సహకార సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కిలోకు రూ. 35 చెల్లిస్తే ఇక నుంచి రూ. 45 చెల్లించనున్నట్టు ప్రకటించింది. జీసీసీ రిటైల్ మార్కెట్లో కుంకుడు కాయ పౌడర్, షాంపులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏటా 150 టన్నుల వరకు కుంకుడు కాయలను గిరిజనుల నుంచి జీసీసీ సేకరిస్తోంది. పచోడవరంలోనే జీసీసీ ఆధ్వర్యంలో కుంకుడు కాయ పౌడరు తయారు చేస్తున్నారు. జీసీసీ సూపర్ మార్కెట్లు, జీసీసీ అవుట్ లెట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇతర అటవీ ఉత్పత్తులకు.. గిరిజనులు సేకరించే కోవెల జిగురు మొదటి రకం కేజీకి రూ. 200 చొప్పున గిరిజన సహకార సంస్థ చెల్లిస్తోంది. ఉసిరిపప్పునకు కేజీకి రూ. 60, పిక్కతీసిన చింతపండుకు రూ. 63, తేనెకు రూ. 170, కొండచీపుర్లు కట్టకు రూ.55 చొప్పున చెల్లిస్తోంది. గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది శీకాయను విదేశాలకు మార్కెట్ చేయడం ద్వారా గిరిజనులకు అధిక రేట్లు లభిస్తాయి. అగ్రిమెంట్ దశలో ఉంది. త్వరలో పూర్తవుతుంది. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలో వంద టన్నుల వరకు ఉంది. పిక్క తీయని చింతపండును కొనుగోలు చేయడం వల్ల మార్కెటింగ్ ఇబ్బందిగా ఉంది. –జె.యూస్టస్, జీసీసీ డీఎం, రంపచోడవరం -
ఏపీలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు..
రంపచోడవరం(తూర్పుగోదావరి): మనసు దోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే నది సోయగాలు.. ఎటూ చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరుగాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నది తీరంలో దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసినా.. తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. పాపికొండలు మధ్య బోట్లో ప్రయాణం.. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగణి పొల్లూరు జలపాతం ప్రకృతి గుడి..సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తైన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని గుడారాల్లో బస చేస్తారు. ఎత్తైన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాది తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజం ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పాములేరు రోప్ బ్రిడ్జి మరపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్పై ప్రయాణం చేసి పాపికొండలకు చేరుకుంటారు. జంగిల్ స్టార్ రిసార్ట్స్ ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. -
గంజాయి.. ఇక గతమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతేడాది వరకు గంజాయి పండించిన పొలాలు ఉద్యాన పంటల క్షేత్రాలుగా మా రుతున్నాయి. గిరి శిఖరాల నడుమ మారుమూలన ఉండే ఆ పొలాల్లో ఇప్పుడు విదేశీ కూరగాయలతో పా టు కాఫీ, పసుపు, స్ట్రాబెర్రీ వంటి పంటలు పురుడు పో సుకుంటున్నాయి. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే కాకుండా ఆ పొలాల్లో ఉద్యాన పంటలు పండించేలా గిరిజనులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా.. లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగువైపు అడుగులు పడుతున్నాయి. గిరిజనులకు ప్రోత్సాహకాలందిస్తూ.. వాణిజ్య పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటి పాలకులు పట్టించుకోక.. మన్యంలో గిరిజనులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వంటి పరిస్థితుల్లో అక్కడి గిరిజన రైతుల్లో కొం దరు గంజాయి సాగువైపు ఆకర్షితులయ్యారు. అలా విశాఖ మన్యంలో గంజాయి సాగు సుమారు 10 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించింది. ఎట్టిపరిస్థితుల్లో గంజా యి సాగుపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఫలితంగా గతేడాది వరకు సగటున 10 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంట రెండేళ్లలో 7 వేల ఎకరాలకు పడిపోయింది. పోలీసులు, సెబ్, ఐటీడీఏ, సచివాలయ సిబ్బంది డ్రోన్ల సహాయంతో గంజాయి సాగును గుర్తించి.. ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించకపోతే తిరిగి గంజాయి వైపు గిరి జనులు మొగ్గుచూపే ప్రమాదం ఉండటంతో మూడేళ్లలో లక్షకు పైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సా గు చేపటేఊ్టలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా 62 వేల మంది గిరిజనులకు 98 వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా అందించి ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పిం చింది. వీటితో పాటు గంజాయి సాగైన 7 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది. శిక్షణ ఇచ్చి మరీ.. వాణిజ్య పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు సాగు రీతులు, సస్యరక్షణపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించేలా ప్రభుత్వం చేర్యలు చేపట్టింది. ముఖ్యంగా వేరుశనగ, రాజ్మా, రాగులు వంటి పంట లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, లిచీ, పైనాపిల్, అవకాడో, స్ట్రాబెర్రీ, అల్లం, నల్ల మిరియాలు, పొద మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంప, టమోటా, కాకర, బీర, బెండ వంటి ఉద్యాన పంటలను 46,650 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు రానున్న రెండేళ్లలో 34 వేల ఎకరాల్లో కాఫీ గింజల సాగుకు సన్నద్ధం చేయాలని అధికారులు భావి స్తున్నారు. మరో 5 వేల ఎకరాల్లో రూ.100 కోట్లతో పసుపు పండించనున్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రూ.144 కోట్లు ప్రతి గిరిజనుడు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మూడేళ్లకు అభివృద్ధి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.144 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. స్వచ్ఛందంగా సాగు వైపు.. ప్రభుత్వం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో గిరిజనులు ఈ ఏడాది స్వచ్ఛందంగా గంజాయి సాగును విడనాడారు. ప్రభుత్వం కేవలం ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి చేతులు దులిపేసుకోకుండా.. గిరిజన రైతులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని నిర్ణయించింది. విత్తనాలు సరఫరా చేయడంతోపాటు పంట చేతికి వచ్చేంత వరకు సహకారం అందిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. జామ్, జ్యూస్గా మార్చడం, పల్పింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి పనులు చేపట్టేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పంట ఆదాయం చేతికొచ్చేంత వరకూ గిరిజన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. -
భక్తి విత్తుగా...ఆనందం మొలకెత్తగా
పెదబయలు (అరకులోయ): మన్యంలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నిర్వహించే పండగలు, పెళ్లిళ్లు, జీవన విధానం, ఆచార సంప్రదాయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విశాఖ మన్యంలో ఆదివాసీ గిరిజనులు (పీవీటీజీ) తెగలకు చెందిన వారు పుష్య మాసంలో జరుపుకునే పండగల్లో ముఖ్యమైనది ‘విత్తనాల పండగ’. మిగతా వారికి సంక్రాంతి పండగ ఎంత ముఖ్యమో వీరికి ఈ పండగ అంత ముఖ్యం. తాము పండించిన పంటల్లో చోడి (రాగులు) రాజ్మా, సామలు, ధాన్యం నాలుగు రకాలతో ప్రతి ఇంటి నుంచి కొద్దికొద్దిగా సేకరించి కొంత భాగం శుంకుదేవునికి నైవేద్యంగా సమర్పించి..మరో సగం శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ నాలుగు రోజులూ సందడి వాతావరణం ఉంటుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 15 తేదీలోపు పండగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 5వ తేదీ శనివారం ప్రతి ఇంటి నుంచి గ్రామ పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్లు కలిసి తొమ్మిది మంది వెదురుతో చేసిన కొత్త బుట్టలో ప్రతి ఇంటి నుంచి రాగులు, సామలు, కందులు, ధాన్యాన్ని నాలుగు రకాలను సేకరించి శంకుదేవుని సన్నిధికి చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజు ఆదివారం శంకుదేవుని వద్దకు డప్పు వాయిద్యాలతో తొమ్మిది మందితో గ్రామంలో అందరూ పూజలు చేశారు. అలాగే గ్రామ పొలిమేరలో పూజలు చేసి అక్కడ నుంచి మట్టి సేకరించి శంకుదేవునికి పెట్టి పూజలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి పూజలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి చిన్న వెదురు బుట్టలో బియ్యం పోసి అందులో ప్రమిద పెట్టి దీపం వెలిగించి రెండు చేతులతో దీపం కొండెక్కకుండా శంకుదేవుని వద్ద మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చారు. దీపం మధ్యలో కొండెక్కితే అశుభంగా భావిస్తారు. ప్రతి ఇంటి నుంచి ఇలా వచ్చి సమర్పించిన తరువాత పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్లు పూజలు చేశారు. గిరిజన వాయిద్యాలు మోగగానే గుర్మవ్లు శుంకుదేవుని సన్నిధిలో నృత్యం చేశారు. శంకుదేవునికి కోడి..మేక.. పితృదేవతలకు పందిని బలిస్తారు మంగళవారం ఉదయం నుంచి పూజలు చేసిన తరువాత సాయంత్రం శంకుదేవుని కోడి, మేక బలిచ్చారు. పితృదేవతలకు పందిని బలిచ్చారు. జంతువుల రక్తాన్ని విత్తనాల్లో కలిపి, విత్తనాలు కొంత భాగం శంకుదేవుని వద్ద చిన్న గుంత తీసి పెట్టిన తరువాత మరికొంత భాగం విత్తనాలు ఇంటింటా నైవేద్యంగా పంచుతారు. వారు ఈ ఏడాది వేసే పంటల్లో వాడే విత్తనాల్లో కలుపుతారు. తరువాత బలిచ్చిన జంతువులను వండుకుని నైవేద్యంగా గ్రామస్తులు తీసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా భోజనాలు పెడతారు. కన్నె గుర్మవ్ల నియామకం గ్రామంలో ఏడుగురు గుర్మవ్లు మహిళలే ఉంటారు. వీరు ఎక్కువగా ముసలివారే ఉంటారు. అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి కన్నె గుర్మవ్ల నియమిస్తుంటారు. గ్రామంలో పదేళ్లలోపు ఆడపిల్లను తల్లితండ్రుల అనుమతితో ఎంపిక చేస్తారు. బాలిక స్నానం చేసిన అనంతరం నూతన వస్త్రాలు ధరించిన తరువాత బావి నుంచి కన్నె గుర్మవ్ తెచ్చిన నీటిని వినియోగించి శంకుదేవునికి నైవేద్యం వండి, చెట్టుకు బోనం కుండను ఉట్టిలో ఉంచి వేలాడదీస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో కన్నె గుర్మవ్ పాల్గొంటుంది. వారు చేసే పూజలను అనుసరిస్తుంది. గ్రామాల్లో దింసా నృత్యం సందడి విత్తనాల పండగ సందర్భంగా గ్రామాల్లో మహిళలు, చిన్నపెద్ద తేడా లేకుండా దింసా నృత్యం చేయడం ఆనవాయితీ. గిరిజన డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీ గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, గ్రామంలో పశుసంపద బాగుండాలని, ప్రకృతి దేవతలకు పూజలు చేస్తాం. తాము పండించిన కొత్త పంటను శుంకుదేవుని దగ్గర ఉంచి కోడి, మేక, పందిని బలి ఇచ్చిన తరువాత ఆ రక్తాన్ని విత్తనాల్లో కలిపి శంకుదేవుని వద్దకు చిన్న గుంత తీసి విత్తనాలు వేస్తాం. మిగిలిన సగం విత్తనాలు ఇంటింటికి పంచుతాం. వారు ఈ ఏడాడి పంటకు ఉపయోగించే విత్తనాల్లో వాటిని కలిపి ఉపయోగిస్తారు. –వంతాల కళ్యాణం, గ్రామ పూజారి, కప్పాడ గ్రామం పంటలకు మేలు విత్తనాల పండగ ప్రతి ఏడాది నిర్వహిస్తాం. శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి పూజలు చేసిన తరువాత అదే విత్తనాలు తీసుకుని నూతన పంటలకు ఉపయోగించే విత్తనాల్లో కలిపి సాగు ప్రారంభించడం ఆనవాయితీ. విత్తనాల పండగ ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యం. గుర్మవ్గా 55 ఏళ్ల నుంచి చేస్తున్నాను. –కిల్లో లక్ష్మి, గుర్మవ్, కప్పాడ -
స్వాతంత్య్రం వచ్చాక మన్యంలో తొలిసారి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండేళ్ల క్రితం వరకు అడవి బిడ్డల ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. చిన్నపాటి జ్వరం వస్తే మన్యం వీడి.. మైదానం వైపు పరుగులు తీసే ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జ్వరాలకు మాత్రలందించేందుకూ వీల్లేని దుస్థితి నుంచి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలిగే స్థాయికి ఏజెన్సీ ఆస్పత్రులు చేరుకున్నాయి. కాన్పుల కోసం అనకాపల్లి, వైజాగ్ వైపు అష్టకష్టాలు పడి గర్భిణుల్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలుగా కాన్పులు నిర్వహిస్తూ తల్లీబిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సారిగా రెండు రోజుల వ్యవధిలో రెండు మేజర్ ఆపరేషన్లు పాడేరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించి రికార్డు సష్టించారు. కాలిలో సిరలు ఉబ్బి నడవడం కష్టంగా మారి ఆస్పత్రిలో చేరిన ఏజెన్సీకి చెందిన వి.చంద్రకళ (30)కు పాడేరు జిల్లా ఆస్పత్రి వైద్యులు సోమవారం వెరికోస్ వెయిన్స్ ట్రెండెలెన్బర్గ్ చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన జి.నన్నారావు (48)కు మంగళవారం హెర్నియా రిపేర్ శస్త్రచికిత్సను చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి చరిత్రలో ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. కలెక్టర్ అభినందన మేజర్ ఆపరేషన్లను మారుమూల మన్యంలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బందాన్ని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అభినందించారు. ‘ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషలిస్టు డాక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఏజెన్సీలోనే మేజర్ ఆపరేషన్లను చేసే స్థాయికి వచ్చాం’ అని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
పర్యాటకుల మనసు దోచుకొంటున్న మన్యం అందాలు
-
బావ కోసం దళంలో చేరి...
సాక్షి, హైదరాబాద్/గంగారం: మన్యంలో పుట్టిన ప్రేమకథ.. దండకారణ్యంలో సమాప్తమైంది. కష్టాలు, కన్నీళ్లు, తూటాలు, చట్టాలు, అనారోగ్యం, బంధాలు, బంధువులు ఏవీ వారిని ఆపలేకపోయాయి. చనిపోతావని బంధువులు బెదిరించినా.. ఆమె లెక్కచేయలేదు. బంధాలను తెంచుకుంది. అడవిలో ఉన్న బావను వెతుక్కుంటూ వెళ్లింది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసింది. చివరికి అతనితోపాటే కరోనా వైరస్కు బలైపోయింది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్–జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదలు సొంత బావా మరదళ్లు. ఈనెల 21న హరిభూషణ్ కరోనాతో మరణించాడు. 24న సమ్మక్క కూడా వైరస్తో పోరాడుతూ చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 30ఏళ్ల ప్రేమ ప్రయాణం ముగిసి పోయింది. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. బావ వెంటే బతుకు అంటూ... వీరిద్దరి మరణంతో మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ– సమ్మక్కలు చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాప నారాయణ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థిగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు. బావ చదువు పూర్తయ్యాక.. పెళ్లి చేసుకుందామనుకుని ఎన్నో కలలు గన్న సమ్మక్కకు ఈ పరిణామం మింగుడుపడలేదు. పెద్దలు వారించినా వినకుండా అడవిలో ఉన్న నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అక్కడే వివాహం చేసుకుంది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలు వద్దనుకుంది. ఈ దేశంలోని అభాగ్యులంతా తన పిల్లలే అనుకునే ఆదర్శ మనస్తత్వం సమ్మక్కదని బంధువులు ‘సాక్షి’కి చెప్పారు. భర్త వెంటే అనేకసార్లు ఎన్కౌంటర్లలో తూటాల నుంచి త్రుటిలో తప్పించుకుంది. 2012లో తిరిగి అడవిలోకి.. సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అప్పటికి ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డు తనకే ఇచ్చారు పోలీసులు. శస్త్రచికిత్స అనంతరం 2012 వరకు బంధువులతోనే కలిసి ఉంది. అడవిని వదిలివచ్చినా.. సమ్మక్క బావను మరువలేదు. అతన్ని వదిలి ఉండలేక.. నాలుగేళ్ల అనంతరం 2012లో ఎవరికీ చెప్పకుండా తిరిగి నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వదినను తాము చూడలేదని ఆమె మరిది, హరిభూషణ్ తమ్ముడు అశోక్ చెప్పాడు. ఆదర్శ భావాలున్న అన్నావదినలను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని, కడచూపునకు నోచుకోకపోవడం వేదనకు గురిచేస్తోందని వాపోయాడు. ఒకవేళ తన వదిన మరణ వార్త వాస్తవమే అయితే, కనీసం ఆమె మృతదేహాన్నైనా అప్పగించాలని ఆయన మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశాడు. -
Organic Coffee: ‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ
సాక్షి, విశాఖపట్నం: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా.. విశాఖ మన్యంలో ప్రకృతి సిద్ధంగా పండుతున్న కాఫీ గింజలకు డిమాండ్ పెరిగింది. పల్ప్ తీసిన (క్లీన్) కాఫీ గింజలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. గత ఏడాది కిలోకు రూ. 90 నుంచి రూ. 110 వరకూ ఉన్న ధర ఈ ఏడాది రూ. 150 వరకూ పెరిగింది. ప్రస్తుతం అనుకూల వాతావరణ పరిస్థితుల్లో కాఫీ గింజల దిగుబడి కూడా బాగా పెరిగింది. దీంతో గిరిజన రైతులు కాఫీ తోటల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 1985లో 10,107 ఎకరాల్లో ఉన్న కాఫీ తోటలు.. గతేడాది నాటికి 2,22,390 ఎకరాలకు విస్తరించాయి. ఈ సీజన్లో 1.65 లక్షల ఎకరాల్లో కాఫీ గింజల పంట వచ్చింది. దాదాపు 11,500 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వచ్చిందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ చెప్పారు. ఈ ఏడాది మరో 15 వేల ఎకరాల్లో కాఫీగింజల సాగును విస్తరిస్తామని తెలిపారు. రానున్న ఆగస్టు నెలలో నాటేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. మొక్కలు నాటిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం చేతికొస్తుంది. ఏటా కాఫీ తోటల విస్తరణ.... సాధారణంగా మార్చి–ఏప్రిల్ నెలల్లో ఐదారు పెద్ద వర్షాలు, పూత దశలో 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నీరు నిలవని సారవంతమైన ఏటవాలు భూములు కాఫీ సాగుకు అనుకూలం. ఇటువంటి అనుకూల పరిస్థితులున్న విశాఖ మన్యంలో 2025–26 సంవత్సరం నాటికి మరో 58 వేల ఎకరాలకు కాఫీ తోటలను విస్తరించాలనే లక్ష్యంతో ఐటీడీఏ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీలో దాదాపు 1.20 లక్షల విస్తీర్ణంలో వరి, చోడి, రాజ్మా, సామలు, మొక్కజొన్న, కందులు వంటి పంటలు సాగు చేస్తున్నారు. వాటి సాగు కన్నా కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు కాఫీ సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. విదేశాల్లో పెరుగుతున్న ప్రాచుర్యం... మన్యంలో పూర్తిగా సేంద్రియ విధానంలో పండుతున్న అరబికా రకం కాఫీ.. విదేశాల్లో అరకు కాఫీగా ప్రాచుర్యం పొందుతోంది. ఇక్కడి ఉత్పత్తిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీసీసీ ఏటా వెయ్యి టన్నుల వరకూ క్లీన్ కాఫీ గింజలు కొనుగోలు చేస్తోంది. మరో పది శాతం స్థానిక ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. మిగతా 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతోంది. మహీంద్ర గ్రూప్నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ‘అరకు కాఫీ’ పేరుతో కాఫీ షాప్ ఏర్పాటు చేసింది. ధర అదుర్స్.. ఈ ఏడాది ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల క్లీన్ కాఫీ గింజల దిగుబడి వచ్చింది. కిలోకు రూ. 140 నుంచి రూ. 150 వరకూ ధర ఉంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కూడా ధర పెంచడంతో ప్రైవేట్ వ్యాపారులు, సంస్థలు పెంచక తప్పలేదు. ఇక కాఫీలో అంతరపంటగా ఒక్కో ఎకరాకు 150 నుంచి 160 మిరియం పాదులు ఉంటే అదనంగా రూ. 40 వేల వరకూ ఆదాయం రైతులకు వస్తోంది. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలోని 3,952 గ్రామాల్లో 1.34 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపుగా 200 గ్రామ పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు ఉన్నాయి. 80 శాతం కుటుంబాలు వాటిపై ఆధారపడుతున్నాయి. విశాఖ మన్యంలో కాఫీ గింజల సాగును ప్రోత్సహించడానికి పాడేరు ఐటీడీఏ, కాఫీ బోర్డు ప్రాంతీయ పరిశోధన కేంద్రం (ఆర్సీఆర్ఎస్) విశేష కృషి చేస్తున్నాయి. విత్తనాలు, నర్సరీల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని రాయితీపై ఐటీడీఏ అందిస్తోంది. నర్సరీలను గిరిజన రైతులే స్వయంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం... గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహాలు అందిస్తోంది. చింతపల్లి ట్రైబల్ ఆర్గానిక్ కాఫీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. చింతపల్లి మండలంలో చిన్న, సన్నకారు కాఫీ రైతులను సంఘటితం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీఓ)ను ఏర్పాటు చేసింది. దీన్ని మాక్స్ (ఎంఏసీఎస్) యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. తద్వారా రైతులే తాము ఉత్పత్తి చేసిన కాఫీ పంటను మేలైన పద్ధతుల్లో పల్పింగ్ చేయించుకునే అవకాశం ఏర్పడింది. ఆ కాఫీ గింజలను టాటా కాఫీ లిమిటెడ్ తదితర పెద్ద సంస్థలకు విక్రయించడం ద్వారా అధిక ధర పొందుతున్నారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కాఫీ దిగుబడి వచ్చింది. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం వంటి అనుకూల వాతావరణమే దీనికి కారణం. – రాధాకృష్ణ, సహాయ సంచాలకులు, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు చదవండి: నిరుద్యోగులకు గుడ్న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్ 104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్ -
అడవిలో అలజడి
-
టీడీపీ నేతలను మన్యం నుంచి తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జిత్తులమారి చంద్రబాబునాయుడు, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుని అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటున్నట్టుగా రాష్ట్రం వెలిగిపోవడం లేదన్నారు. బుధవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో.. క్వారీల ముసుగులో మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను మన్యం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు 2019లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల జీవన పరిస్థితి దిగజారిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. విశాఖ డివిజన్లో అత్యధికంగా అనధికారిక క్వారీలు నడుస్తున్నాయన్నారు. అనకాపల్లి మండలం సీతానగరం రెవెన్యూ పరిధిలో వెంకుపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 193లో 2.7 ఎకరాలు, సర్వే నెంబర్ 251లో 7.5 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా క్వారీ పనులు చేస్తున్నారన్నారు. టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, కిడారి సర్వేశ్వరరావు, అతని బంధువు బుక్కా రాజేంద్ర, కిమిడి రాంబాబు ఇష్టారాజ్యంగా క్వారీల్లో బ్లాస్టింగ్లు చేస్తున్నారన్నారు. దీని వల్ల వందల ఎకరాల్లో భూములు సాగుకు దూరమయ్యాయన్నారు. గూడెం మండలం గుమ్మిరేవుల సమీపంలో నల్ల మెటల్ క్వారీలో పేలుళ్లకు వాడే మూడు రకాల రసాయనాల కారణంగా అక్కడ చెరువు కలుషితమై 2,050 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వారీల మూలంగా అనకాపల్లి డివిజన్లో పదిమంది, మన్యంలో ఆరుగురు మరణించారన్నారు. గాలిలో దీపం గిరిజనుల ఆరోగ్యం జిల్లాలో ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా, 1100 టైఫాయిడ్, 21,800 డయేరియా, 1,660 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. మన్యంలో వైద్యులు అందుబాటులో లేక గిరిజనుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందన్నారు. కడుపు నింపే పౌష్టికాహారం లేక పిట్టాల్లా రాలిపోతున్నారన్నారు. అధికారాన్ని, పదవులను, ధనబలాన్ని అడ్డంపెట్టుని 1/70 చట్టం, పెసాలో 5, 6 షెడ్యూల్, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ ద్రోహులుగా మారిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి, మణికుమారి, ఎం.వి.వి.ప్రసాద్, నాగరాజు, అయ్యన్నపాత్రుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను బాక్సైట్, ఈవో 97, ఏపీఎప్డీసీ కాఫీ తోటల పంపకం లాంటి అంశాలపై నిలదీయాలని గిరిజనులను కోరారు. బీజేపీ, టీడీపీ నాయకుల ఇళ్లను ముట్టడించాలని, మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యేలు ఈశ్వరి, పీలా గోవిందతోపాటు రాంబాబు, రాజేంద్ర, నాగరాజు, ప్రసాద్, మణికుమారిలను తరమికొట్టాలని కోరారు. దున్నేవాడిదే భూమి, ఆదివాసీలకే అటవీ హక్కు, గ్రామరాజ్య కమిటీలకే సర్వాధికారం అనే నినాదాలతో మావోయిస్టుల ఆధ్వర్యంలో భూస్వామ్య, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారి వర్గంపై మూడు రకాల పోరాటం ఉధృతం చేయాలన్నారు. -
పోలీసుల చేతికి ‘మావోల ఆపరేషన్’ కీలక వీడియో!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన మన్యంలో డీజీపీ పర్యటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే మావోల ముప్పు పొంచి ఉంటుందనే ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ పర్యటనకు ఇంకా గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్తోపాటు నిఘా వర్గాలు మావోల కదలికలపై అంచనా వేస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులకు సంబంధించిన తాజా సమాచారం సేకరించిన అనంతరం బుధవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి డీజీపీ మన్యం పర్యటనపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో మావోయిస్టులు నిర్వహించిన ఆపరేషన్కు సంబంధించిన వీడియో పోలీసులకు చిక్కినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గన్మెన్, డ్రైవర్, పార్టీ నాయకుల నుంచి సెల్ఫోన్ను మావోయిస్టులు ముందే తీసుకుని, వారిని దూరంగా ఉండాలంటూ గన్లతో కాపలా ఉన్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డుపై బైక్పై వెళుతున్న వారిని మావోయిస్టులు అడ్డగించినట్టు చెబుతున్నారు. వారిలో ఒకరు మావోయిస్టుల కన్నుగప్పి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించినట్టు తెలిసింది. అందులో మావోయిస్టులు దారి అడ్డగించడం, ఘటన తర్వాత పారిపోతున్న క్లిప్పింగ్ను పోలీసులు వ్యూహాత్మకంగానే మంగళవారం విడుదల చేసినట్టు తెలిసింది. ఇంకా కీలక ఆధారాలతో ఉన్న వీడియో పోలీసుల వద్ద ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేని పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపిన మావోయిస్టుల్లో కొందరిని వీడియో ద్వారా గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. స్తంభించిన మన్యం.. స్వచ్ఛందంగా బంద్ అరకు/పాడేరు: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ హత్యకాండకు నిరసనగా సోమవారం మన్యంలో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. అరకు పట్టణంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. బంద్ వల్ల అరకు పర్యాటక కేంద్రం బోసిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు స్థానికంగా రిజర్వ్ చేసుకున్న అతిథి గృహాలు, ప్రైవేట్ రిసార్ట్స్, టూరిజం, పలు లాడ్జీల గదులన్నింటినీ ఆన్లైన్లోనే రద్దు చేసుకున్నారు. దీంతో మూడ్రోజుల నుంచి అరకులోయ ప్రాంతంలోని అతిథి గృహాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉన్న పర్యాటకులు కూడా భయంతో గదుల నుంచి బయటకు రాలేదు. పాడేరులో కిడారి, సోమకు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది మంగళవారం సంతాపాన్ని తెలియజేశారు. అరకు అంటే బెరుకు! విశాఖపట్నం : అరకు ఈ పేరు వింటేనే పర్యాటకులు అక్కడి అందాలు చూడడానికి పరుగులు పెడతారు. ప్రకృతి సోయగాలు, అందాల లోయలు, మంచుకమ్మిన పర్వతాలు, మెలికలు తిరుగుతూ కనిపించే రహదారులు, జలజల జాలువారే జలపాతాలు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో సౌందర్యాల సమాహారం విశాఖ మన్యం! అలాంటి రమణీయతలో అలరారే ఏజెన్సీ ఇప్పుడు పర్యాటక ప్రియులను భయపెడుతోంది. మూడు రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యం వణుకుతోంది. ఇప్పుడు ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టుల కోసం భారీ సంఖ్యలో పోలీసులు కూంబిగ్ చేపట్టారు. సాయుధ భద్రతా దళాలు అడవుల్లోనూ, మారుమూల పల్లెలు, గూడేల్లోనూ అణువణువునా జల్లెడ పడుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పర్యాటకులు విశాఖ ఏజెన్సీకి వెళ్లడానికి సాహసించలేక పోతున్నారు. అరకులోని పద్మావతి గార్డెన్స్, డుంబ్రిగుడ మండలం చాపరాయి, అనంతగిరి మండలం బొర్రా గుహలు, టైడా, ఇంకా పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు వైపు పర్యాటకులెవరూ తొంగి చూడడం లేదు. నిత్యం వేలాది మందితో కిక్కిరిసే బొర్రా గుహలు బోసిపోతూ కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి పర్యాటకశాఖ నడిపే టూర్ ప్యాకేజీ బస్సులను కూడా సోమ, మంగళవారాలు రద్దు చేసింది. మరోవైపు అరకు పరిధిలో ఉన్న 180 పర్యాటకశాఖ గదులు ఆక్యుపెన్సీ 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక అనంతగిరిలోని పర్యాటక గదుల పరిస్థితి కూడా అదే. పక్షుల కిలకిలరావాలతో అలరించే టైడా జంగిల్బెల్స్ కూడా జనంలేక వెలవెలబోతోంది. విశాఖ మన్యంలో సామాన్య పరిస్థితులు నెలకొనడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా బుధవారం నుంచి పర్యాటక ప్యాకేజీ బస్సులను నడపనున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి మంగళవారం రాత్రి సాక్షి’కి చెప్పారు. -
అమ్మాయి ఆత్మకథ
అటవీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యం’. ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రలో నటించారు. రమణ ఎస్.వి (వెంకట్రావ్) దర్శకత్వంలో సాయి సంహిత క్రియేషన్స్ పతాకంపై శ్రీసత్య జయ కోమలీదేవి నిర్మించారు. రఘువీర్, వర్ష, శ్రావణ్, జీవా, గిరిధర్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారాల మధ్య అడవిని, తన జాతిని కాపాడుకునే ఓ అమ్మాయి ఆత్మకథతో ఈ చిత్రం రూపొందించాం. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. మా సినిమా పాటలను దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరిగారు రిలీజ్ చేసి, బాగున్నాయని అభినందించారు. ఈ చిత్రానికి చంద్రబోస్గారు పాటలు రాయడంతో పాటు ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి. అమర్, లైన్ ప్రొడ్యూసర్స్: భాస్కర్, రామారావు. -
జోరు వానలో.. 12 కి.మీ.లు డోలీలో..
సాలూరు రూరల్: మన్యంలో రహదారులు లేకపోవటంతో అడవి బిడ్డలు నానా అగచాట్లు పడుతున్నారు. అనారోగ్యానికి గురైతే కిలోమీటర్ల కొద్దీ డోలీల్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర కొడమ పంచాయతీ సిరివర గ్రామంలో ఓ బాలింత అనుభవించిన నరకయాతన గిరిజనుల అవస్థలకు అద్దంపట్టింది. గ్రామానికి చెందిన గిందెకు ఆదివారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. నెలలు నిండకుండానే మూడో కాన్పు కావడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు కన్నుమూసింది. మరోవైపు గిందెకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో.. భర్త డుంబ్రి, స్థానికులు డోలీకట్టి అందులో గిందెను ఉంచి సోమవారం 12 కి.మీ.కు పైగా కొండ మార్గంలో జోరు వర్షంలో నడిచి దుగ్గేరుకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఆమెను 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరానికి తరలించనున్నట్లు సమాచారం. -
అడవిలో ఏం జరిగింది?
సాయి సంహిత క్రియేషన్స్ పతాకంపై యస్వీ రయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన్యం’. రఘువీర్, శిరీష దాసరి, ‘బాహుబలి’ ప్రభాకర్, వర్ష ముఖ్య తారలు. హైదరాబాద్లో ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. ఆడియో సీడీని దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి విడుదల చేసి మొదటి సీడీని పాటల రచయిత చంద్రబోస్కి అందించారు. హీరో రఘువీర్ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదిక్ మెడిసన్ చదివే మెడికోలు ఎప్పుడూ ఏదో ఒక మందు కనుక్కోవాలి. అలా కనుక్కొని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. అలాంటి పాత్రను ఇందులో చేస్తున్నాను. ఆ మందు కనిపెట్టే ప్రాసెస్లో నా స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? దెయ్యం రూపంలో మాకు ప్రమాదం సంభవిస్తే ఎన్ని కష్టాలు వచ్చాయి? ఆ కష్టాల నుండి ఎంతమంది బయటపడ్డాం? ఎంతమంది చనిపోయారు. అసలు దెయ్యం ఉందా, లేదా?’’ అనేది కాన్సెప్ట్’’ అన్నారు. ‘‘రమణ చాలా నిబద్ధత కలిగిన దర్శకుడు. హీరో రఘువీర్కు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు వైవీయస్ చౌదరి. చంద్రబోస్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మొదటిసారి ఈ సినిమాలో ‘చినుకల్లే కురిసింది’ అనే పాట పాడాను. ఈ పాట నేనే రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సదాచంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పి.కోమలీదేవి, మేముల సత్యనారాయణ. -
మన్యంలో.. కొత్త గ్రామం
♦ అవాక్కైన ఎంపీడీఓ విజయ ♦ ఆ గ్రామంలో రోగాలతో అల్లాడుతున్న గిరిజనం రాజవొమ్మంగి (రంపచోడవరం) : రోగాలు రొస్టులతో అల్లాడుతూ ఎటువంటి అభివృద్ధికీ నోచుకోని ఓ గ్రామం గురువారం రాజవొమ్మంగి మండలంలో వెలుగులోకి వచ్చింది. జ్వరాలతో బాధ పడుతోన్న ముగ్గురు పిల్లలను చంకనెత్తుకొని లాగరాయి పీహెచ్సీకు ఓ ఆదివాసీ వచ్చాడు. అతడు చూపిన దారి వెంబడి ఎంపీడీఓ కేఆర్ విజయ ఆ గ్రామానికి వెళ్లారు. తాగునీరు, రోడ్డు లేని చాపరాయి వంటి కొత్తపాలెం.. అనే ఓ గ్రామాన్ని అక్కడ చూసి అవాక్కయ్యారు. అనంతరగిరి నుంచి లోతట్టుకు కాలినడకన వెళ్లిన ఎంపీడీఓ.. లాగరాయి పీహెచ్సీ వైద్యాధికారి సూసాన్, సిబ్బంది సహాయంతో వైద్యశిబిరం ఏర్పాటు చేసి మలేరియా తదితర రోగాలతో బాధ పడుతోన్నవారికి చికిత్స అందేలా చర్యలు తీసుకొన్నారు. ఎంపీడీఓ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 15 మంది పిల్లలతో, సుమారు 35 మంది పెద్దవారితో ఉన్న కొత్తపాలెం అనే గ్రామంలో కోదుజాతి ఆదివాసీలు కొండపోడు చేస్తూ నివసిస్తున్నారు. ఈ గ్రామం ఉందని ఇంతవరకు అధికారిక లెక్కల్లో లేదు. తాగునీటికి ఓ నేలబావిపై ఆధారపడి జీవిస్తుండడంతో గిరిజనులు రోగాల బారిన పడ్డారని ఎంపీడీఓ చెప్పారు. ఈ గ్రామం ఇటు లబ్బర్తి పంచాయతీకు మరో వైపు కిండ్ర పంచాయతీ సమీపంలో ఉందన్నారు. పిల్లల పౌష్టికాహారం కోసం అనంతరగిరిలోని అంగన్వాడీ సెంటర్కు నెలకు ఒకసారే వస్తున్నారని వివరించారు. ఇక్కడ నివశించే గిరిజనులు మొక్కజొన్న, గంటెలు, సామలు వంటి సంప్రదాయ పంటలు పండిస్తూ జీవిస్తున్నారని, మరుగున పడిన ఈ గ్రామం వివరాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళతానని ఎంపీడీఓ స్థానిక విలేకరులకు తెలిపారు. మరో చాపరాయి కాకుండా చూడాలి ఇటువంటి గ్రామాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీలకు చేయూత ఇవ్వాలి. ప్రస్తుతం వారికి తాగునీరు, రహదారి, వైద్యం, పౌష్టికాహారం అందజేసి కొత్తపాలెం మరో చాపరాయి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. – అనంత ఉదయ భాస్కర్ వైఎస్సార్ సీపీయువజన విభాగం జిల్లా అధ్యక్షులు -
వణుకుతున్న తూర్పు మన్యం
– మన్యంపై మలేరియా పంజా –జ్వరాలు బారిన గిరిజనులు - 16 గ్రామాల్లో దోమల విహారం - పెరుగుతున్న కేసులు... ప్రేక్షకపాత్రలో అధికార యంత్రాంగం - హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి: వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ - ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది. 2016లో 1688 మందికి, 2017లో జనవరి నుంచి మే వరకు 2,676 మందికి... విలీన మండలాల్లో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు. ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి.. రంపచోడవరం: మలేరియా మరణాలు ఏజెన్సీని వణికిస్తున్నాయి. వర్షకాలం రాకుండానే తూర్పు ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. . వై రామవరం, మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లోని గిరిజనులు మలేరియా జ్వరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంటికొకరు చొప్పున ఒకే గ్రామంలో జ్వరపీడితులున్నారు. గతంలోవలే మలేరియా నివారణకు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంతో జ్వరాలు వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది.. వణుకుతున్న గిరిజన గ్రామాలు... మలేరియా జ్వరాలు సీజన్కంటే ముందే గిరిజనులపై పంజా విసిరింది. రెండు రోజుల్లో విలీన మండలాల్లో ముగ్గురు మలేరియా జ్వరాలతో మృత్యువాడ పడ్డారు. వై రామవరం మండలం చాపరాయిలో జ్వరాలు బారిన పడి 16 మంది మృతి చెందగా 15 మంది కాకినాడ జీజీహెచ్లోను, 15 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. మరో 13 మంది చాపరాయి గ్రామం నుంచి మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించారు. చాపరాయి పరిస్థితి ఇలా ఉంటే బొడ్డగండి పంచాయతీ పరిధిలోని 16 గ్రామాలు జ్వరాలతో వణుకుతున్నాయి. గొందికోట, నాగలోవ, అంటిలోవ తదితర గ్రామాలున్నాయి. గతకొన్ని రోజుల నుంచి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్ధితి అధికారులు దృష్టికి వచ్చిన వైద్య బృందాలను పంపలేదు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రయ్య మాట్లాడుతూ చాపరాయిలో ఐదు వైద్య బృందాలున్నట్లు తెలిపారు. చాపరాయి చుట్టుపక్కల గ్రామాలకు మరో ఏడు బృందాలను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ఇంటింటి సర్వే చేస్తాయన్నారు. పెరిగిన మలేరియా కేసులు... ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది. 2016సంవత్సరంలో 96,121 మంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తే 1688 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 110334 మంది జ్వర పీడితులు నుంచి రక్త నమూనాలు సేకరిస్తే 2,676 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. విలీన మండలంలో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది దోమ తెర రెండు లక్షలు ప్రతిపాదనలు పంపగా 80 వేలు దోమతెరలు మాత్రమే వచ్చాయి. .ఏజెన్సీలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి... ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్థితులు తాండవిస్తున్నాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. తక్షణం హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మలేరియా బారినపడి విలీన మండలాల్లో ముగ్గురు చనిపోయారని భారీ మూల్యం చెల్లించకముందే తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పూర్తిస్థాయిలో వైద్య పోస్టులు, సిబ్బందిని నియమించాలన్నారు. అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రక్షిత మంచినీరు అందించాలన్నారు. గొందికోట గ్రామంలో 80 మంది జ్వరాలతో బాధపడుతున్నారని వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చాపరాయి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. తూతూ మంత్రపు చర్యలు... ప్రభుత్వం ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్ధితులను చక్కబెట్టేందుకు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ అన్నారు. బొడ్డగండి పంచాయతీలోని అన్ని గ్రామాలకు వైద్య బృందాలను పంపించి తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని తక్షణం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ సహాయంతో చాపరాయి గ్రామం వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న గొప్పును తవ్వాలన్నారు. విలీన మండలంలో కాళ్లవాపు వ్యాధి వచ్చినప్పుడే గిరిజన గ్రామాల్లో ఆర్ఓ పాంట్లు ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోలేదన్నారు. ఈ రోజుల గిరిజనులు కలుషిత నీరు తాగి జ్వరాలు బారిన పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జూలై 1న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. -
పాహిమాం...
- పదే పదే అదే నిర్లక్ష్యం – గిరిజనుల ప్రాణాలతో చెలగాటం – గతేడాది కాళ్లవాపుతో ప్రాణాలు కోల్పోయిన గిరిజనులు – పదుల సంఖ్యలో మాతా,శిశు మరణాలు – ప్రస్తుతం విజృంభిస్తున్న మలేరియా - సోమవారం నిండు గర్భిణి చికిత్స పొందుతూ మృతి - మరో బిడ్డను కాటేసిన మలేరియా – ఘటన సమయంలో ప్రభుత్వం హడావుడి – ఆనక షరా మామూలు - పాహిమాం అంటూ గిరిజనం శరణు ఘోష సాక్షి, రాజమహేంద్రవరం: మూఢనమ్మకాలు, సకాలంలో వైద్యం తీసుకోకపోవడం, వైద్య సౌకర్యాల లేమీతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యం, యంత్రాంగం బాధ్యతారాహిత్యం జిల్లాలో గిరిజనుల ప్రాణాలు బలికొంటున్నాయి. తరచూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం, యంత్రాంగం మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడడంలేదు. వై.రామవరం మండలం చాపవరంలో 16 మంది గిరిజనులు మలేరియాతో మృతి చెందగా సోమవారం విలీన మండలాలైన చింతూరు, వీఆర్పురాల్లో ఇద్దరు మలేరియాతో ప్రాణాలు కోల్పోయారు. చింతూరు మండలం దబ్బగూడెం గ్రామానికి చెందిన మడవి దేవుడమ్మ అనే గర్భిణి (30) చికిత్స పొందుతూ భద్రాచలం ఆస్పత్రిలో మృతి చెందింది. వీఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన జశ్వంత్(9) సోమవారం మలేరియా జ్వరం కారణంగా మృతి చెందాడు. ఇలా ఏజెన్సీ వ్యాప్తంగా మలేరియా మరణాలు సంభవిస్తుంటే నివారణ చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి ‘మమ’ అనిపిస్తోంది. మలేరియా జ్వరాలతో గిరిజనులు మరణిస్తుంటే డయేరియా, ఇతర కారణాల వల్ల చనిపోయారంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పింస్తోంది. వ్యాధులు ప్రబలకుండా అరికట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రాణాలు మీదకు వచ్చిన తర్వాత పరామర్శిస్తూ, పరిహారాలు ప్రకటిస్తున్నారు. శాశ్వత చర్యలేవీ... ఏజెన్సీలో జ్వరాలు, ఇతర వ్యాధుల నివారణ, నియంత్రణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టంలేదు. గత ఏడాది జూన్లో ఏజెన్సీలోని పోలవరం విలీన మండలాల్లో కాళ్లవాపు మరణాలు సంభవించాయి. వీఆర్పురం మండలంలో 10 మంది, చింతూరు మండలంలో ఐదుగురు, కూనవరం మండలంలో ఒకరు కాళ్ల వాపు వ్యాధితో మృతి చెందారు. ఒక్కొక్కరుగా గిరిజనులు మృతి చెందుతుంటే నాటు సారా తాగడం వల్ల వారు మరణిస్తున్నారంటూ సమస్యను పక్కదోవ పట్టించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. సమస్య మూలాలు కనుగొని నివారించే ప్రయత్నం చేయకపోవడం సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం విశాఖ పంపారు. అయితే ఇప్పటి వరకు వాటి ఫలితాలు అధికారులు ప్రకటించలేదు. కలుషిత నీరుతాగడం వల్ల కిడ్నీలు విఫలమై మృతి చెందారని సోమవారం రంపచోడవరంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐటీడీవో పీవో దినేష్కుమార్ చెప్పారు. కాళ్లవాపు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాని ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వైద్య సేవలు, పౌష్టికాహారం ఎక్కడ..? ఏజెన్సీలో పని చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపండంలేదంటూ జిల్లా వైద్యాశాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లక్షల జీతం ఇస్తామన్నా వారు రావడంలేదని పేర్కొంటున్నారు. తాత్కాలిక పద్ధతిపై నియమించే బదులు ఏజెన్సీలోని ఏరియా, పీహెచ్సీలలో వైద్యాధికారుల పోస్టులు భర్తి చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. దీంతో ఎళ్ల తరబడి రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇబ్బంది కొరత నెలకొని ఉంది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 486 పోస్టులకు గాను 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా గిరిజనులకు పూర్తి స్థాయిలోవైద్య సేవలు అందడంలేదు. గిరిజన గర్భిణులకు తరచూ పరీక్షలు చేసి మందులు, పౌష్టికారహారం అందించకపోవడం ప్రవసం, అనంతరం తల్లులు, శిశువులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది రాజవొమ్మంగి, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో రక్త హీనత వల్ల మాతా,శిశు మరణాలు అధికంగా నమోదయ్యాయి. జిల్లాలో మలేరియా మరణాలు ప్రతి ఏడాది సంభవిస్తున్నా ఇప్పటి వరకు కూడా జిల్లా మలేరియా అధికారి పోస్టు ఇన్చార్జి పాలన లో ఉండడం ఏజెన్సీ ప్రజల ప్రాణాలపై ప్రభుత్వ తీరును అద్దం పడుతోంది. -
మన్యంపై మృత్యు పంజా
వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి భారీ మూల్యం ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుకు చర్యలు శూన్యం గిరిజనులు ప్రాణాలు పోయినప్పుడే హడావుడి రంపచోడవరం : వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గిరిజనులు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. వర్షాకాలం వస్తుందంటే ఏజెన్సీ గ్రామాల్లో వణుకు పుడుతోంది. అనారోగ్యం బారిన పడిన అనేక మంది గిరిజనులు ›ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లోని లోతట్టు గిరిజన గ్రామాల్లో అసలేం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో అనేక మంది మృత్యువాత పడినా ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు. వై.రామవరం మండలం చాపరాయిలో మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఏజెన్సీలోని దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం, సరైన మందులు లేక, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఇప్పటికీ గిరిజన పల్లెలు దూరంగా ఉండడంతో పలు అనర్థాలకు దారితీస్తోంది. గిరిజనుల ప్రాణాలు పోయిన సందర్భంగా హడావుడి చేస్తున్న యంత్రాంగం తర్వాత కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎంత కాలం ఇన్చార్జిల పాలన రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్ సెంటర్లు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిత్రి, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో ఎంతో కాలంగా ఇన్చార్జిల పాలనలో నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధికారిని నియమించడం లేదు. జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ)పోస్టు కూడా ఎంతో కాలంగా ఇన్చార్జి పాలనలోనే ఉంది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులే ఇన్చార్జులైతే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భర్తీకాని ఖాళీలు వైద్య ఆరోగ్యశాఖలో అన్ని క్యాడర్ల్లో 486 పోస్టులు ఉంటే వాటిలో 349 మంది పనిచేస్తున్నారు. 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఎంపీహెచ్ఎస్ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. గతంలో జ్వరాల సీజన్ దృష్టిలో ఉంచుకుని రెండు నెలలు మైదాన ప్రాంతం నుంచి వైద్య సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించే వారు. అలాంటి ప్రక్రియకు మంగళం పాడారు. ప్రస్తుతం ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్థితులు తాండవించడంతో తిరిగి డిప్యూటేషన్పై నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీల్లో ఐదు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా మరో నలుగురు వైద్యులు పీజీ చేసేందుకు వెళ్లిపోనున్నారు. రోడ్డు నిర్మాణంపై నిర్లక్ష్యమేల ? వై రామవరం– గుర్తేడు మధ్య రహదారి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మండలం కేంద్రం చేరుకునేందుకు అనేక గ్రామాలకు దగ్గర మార్గమైన ఈ రహదారిని అధికారులు నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. రూ.3 కోట్ల అంచనా వ్యయంతో వై.రామవరం నుంచి పోతవరం వరకు 20 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు ఖర్చు చేసి ఎర్త్ వర్క్ చేసి వదిలి పెట్టారు. అప్పటి నుంచి రోడ్డు నిర్మాణం ఊసే పట్టించుకోలేదు. అధికారులు గిరిజనాభివృద్ధికి చేస్తున్న ఆలోచనలు ఏమిటనే అనుమానులు కలగక మానదు. ఏజెన్సీలో అటవీ అభ్యంతరాల కారణంగా సుమారు 20 రోడ్డు నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు ఎందుకు సిద్ధం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన్యంలో రహదారి సౌకర్యాలు ఎలా మెరుగపడతాయో అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. మండల కేంద్రం ఏర్పాటుతోనే గిరిజనులకు మేలు గత దశాబ్దకాలంగా వై.రామవరం మండలం ఎగువ ప్రాంతాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని అక్కడ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మండల కేంద్రం ఏర్పాటుకు ఐటీడీఏ పీవో దినేష్కుమార్ మారేడుమిల్లి వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు. మండల కేంద్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా అప్పర్ పార్ట్లో ఉన్న గ్రామాలకు పాలన దగ్గర అవుతుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి గిరిజనులు సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మూడు మండలాలను దాటుకుని 150 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేసి మండల కేంద్రం వై.రామవరం చేరుకోవాల్సిన పరిస్ధితి. ఇలాంటి కష్టాలు నుంచి గిరిజనులు గట్టెక్కాలంటే గుర్తేడును మండల కేంద్రంగా ఏర్పాటు చేసే పని వేగవంతం చేయాలి. అయినవారిని కోల్పోయి... చాపరాయి గ్రామంలో జ్వరాలు బారిన పడి 16 మంది గిరిజనులు మృతి చెందారు. వారిలో ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. కుటుంబంలో మిగిలిన ఒక్క మహిళ పల్లాల చిట్టెమ్మ రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. జ్వరాల బారిన పడి మామ పల్లాల తమ్మిరెడ్డి మరణించిన వారం వ్యవధిలో అత్త చిట్టెమ్మ ( అత్తగారి పేరుచిట్టెమ్మ) జ్వరంతో మృత్యువాత పడింది. మరో మూడు రోజుల్లో భర్త పల్లాల కన్నమ్మరెడ్డి మరణించాడు. కుటుంబంలో అత్తమామలును, భర్తను కోల్పోయి ఆమె, ముగ్గురు చిన్నారులు మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె ఇద్దరు పిల్లలతో చికిత్స పొందుతుండగా మరో బాలిక గ్రామంలోనే ఉంది. గ్రామంలో జరిగిన వేడుకకు వెళ్లలేదని ఆమె వాపోయింది. జ్వరాలే ఐనా వారి ప్రాణాలు తీసిందని ఆవేదన చెందింది. త్వరలో చాపరాయి బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వెల్లడి మారేడుమిల్లి : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే మన్యంలో పర్యటించి మృతులు కుంటుబాలను పరామర్శిస్తారని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. సోమవారం మారేడుమిల్లిలో ఆమె విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ 16 మంది గిరిజనులు వ్యాధులతో మృతి చెందిన కనీసం వైద్యాధికారులకు, ప్రభుత్వానికి, తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదన్నారు. ఎనిమిది నెలల క్రితం విలీన మండలాల్లో కాళ్లవాపుతో 18 మంది గిరిజనులు మృతి చెందారని, 216 మాతా శిశుమరణాలు సంభవించినప్పుటికి ఇప్పుటికీ వ్యాధులకు గల కారణాలు కనిపెట్టాలేకపోయారని విమర్శించారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వచ్చి మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు ప్రకటించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ ప్రకటనలు స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నాయే తప్ప బాధితులకు సహాయం అందడం లేదన్నారు. గతంలో మారేడుమిల్లి మండలం సిరిపిన లోవ గ్రామంలో కొండపోడు పొలానికి నిప్పుంటుకుని నలుగురు చిన్నారులు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.రెండు లక్షలు ప్రకటించారని ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని, అలాగే వారికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీకూడా నెరవేర్చలేదన్నారు. చాపరాయి గ్రామంలో రెండు నెలలు నుంచి కరెంట్ సదుపాయం లేదని, వారికి ఇచ్చే కిరోసిన్ కోత విదిచడంతో చీకట్లోనే మగ్గుతున్నారని అన్నారు. సరైన రోడ్డు సదుపాయం, తాగునీరు అందుబాటులో లేదన్నారు. చాపరాయి బాధిత గిరిజనులకు వైఎస్సాసీపీ తరఫున అండగా నిలుస్తామన్నారు. ఆ గ్రామంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించి. బాధితులకు ప్రభుత్వం సాయం అందించే వరకు పోరాడతామని హెచ్చరించారు. మండల కన్వీనర్, జెట్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ కుండ్ల సీతామçహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు గొర్లె అనిల్ ప్రసాద్(బాబి), ఉపసర్పంచ్ గురుకు దర్మరాజు, మండల కార్యదర్శి బి.గంగరాజు నాయకులు వీరబాబు, సత్తి సునీల్ రెడ్డి, మంగరౌతు వీరబాబు, సాయిరాజు పాల్గొన్నారు. కొనసాగుతున్న వైద్య సేవలు చాపరాయి(వై.రామవరం) : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ చాపరాయి గ్రామంలోని 7 వీధుల్లో రెండో రోజు సోమవారం ఎంపీడీఓ కె.బాపన్నదొర ఆధ్వర్యంలో వైద్య బృందాలు పర్యటించి సేవలు అందించాయి. ప్రస్తుతం అదే గ్రామంలో జ్వరాలతో ఉన్న మరో 32 మంది గిరి నులను ఐటీడీఏ పీఓ దినేష్కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం రంపచోడవరం, మారేడిమిల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించిన విషయం విదితమే. జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు గ్రామంలోనే వైద్య బృందాలను మకాం ఉండమన్న పీఓ ఆదేశాల మేరకు 2వ రోజు కూడా చాపరాయి గ్రామంలో వైద్యసేవలు అందించారు. వైద్య బృందంతో పాటు ఎంపీడీఓ కె.బాపన్నదొర కూడా ఆ గ్రామంలోనే మకాం వేశారు. కార్యక్రమంలో మారేడుమిల్లి, గుర్తేడు పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు రమాదేవి, ఉషారాణిలు, వై.రామవరం రెవెన్యూ అధికారులు కానరాకపోవడంతో, పీఓ ఆదేశాల మేరకు గంగవరం తహశీల్దార్ పాల్గొని సేవలు అందిస్తున్నారు. -
మన్యంలో మృత్యు ఘంటికలు
కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడి మృతి చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు లేనట్టేనా? రంపచోడవరం/వీఆర్ పురం : ఏజెన్సీలో మళ్లీ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. మృత్యువాత పడుతున్న గిరిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పెరుగుతునే ఉంది. విలీన మండలం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వీఆర్ పురం మండలం కుంజంవారిగూడెం గ్రామానికి చెందిన పర్షిక ధర్మయ్య ( 30) పది రోజులుగా కాళ్లవాపు వ్యాధితో బాధపడుతూ శనివారం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. ఒకే వ్యాధి లక్షణాలతో అనేక మంది చనిపోతున్నా అధికార యంత్రంగంలో కదలిక రావడం లేదు. వ్యాధి కారణాలు, నివారణ, చికిత్స గురించి ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. రేఖపల్లిలో ప్రారంభమై... వీఆర్పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో తొలి మరణం సంభవించింది. తరువాత క్రమంలో ఇతర మండలాల్లో కాళ్లవాపు లక్షణాలతో గిరిజనులు మృత్యువాత పడడం ప్రారంభమైంది.కాళ్లవాపుతో ఇప్పటి వరకు విలీన మండలాల్లో మొత్తం 13 మంది గిరిజనులు మరణించారు. వీఆర్పురం మండలంలో 8 మంది, చింతూరు మండలంలో నలుగురు, కూనవరంలో ఒకరు మృత్యువాతపడ్డారు. కాళ్లవాపుతో బాధపడుతున్న వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించినా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. నేటికీ అందని పౌష్టికాహారం కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో విలీన మండలాలు అతలాకుతలమయ్యాయి. ప్రభావిత గ్రామాల పర్యటనకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కేవలం మాటలు చెప్పి వెళ్లారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహారం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ అరుణ్కుమార్ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గిరిజనుల ఆరోగ్యంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతోంది. విలీన మండలాల్లో రక్షిత నీరు లేకపోవడం వల్ల వ్యాధులకు కారణమవుతుందని భావించారు. రక్షిత నీరు అందించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా మరో గిరిజనుడు కాళ్లవాపు వ్యాధితో మృతి చెందడంతో అధికారుల హడావుడి మళ్లీ మొదలైంది. ఇప్పటికీ గుర్తించని మూలాలు కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు మరణించి నాలుగు నెలలు కావస్తున్నా ఆ వ్యాధి రావడానికి గల కారణాలను గుర్తించలేకపోయారు. విలీన మండలాల నుంచి ఈ వ్యాధి బారిన పడిన సుమారు 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్కు వెళ్లి చికిత్స పొందారు. వ్యాధి బారిన పడిన వారికి కిడ్నీలు పనిచేయకపోవడంతో చింతూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. డయాలసిస్ అవసరమైన రోగులను కాకినాడ జీజీహెచ్కు తరలిస్తున్నారు. మన్యంలో మృత్యుఘంటికలు ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కడుపుకోత ఇంకెన్నాళ్లయ్యా..?
ఏజెన్సీలో వసివాడి ‘పోతున్నా’రు రాజవొమ్మంగి మండలంలో ఆగని శిశు మరణాలు రెండు నెలల్లో ఆరుగురు మృతి గత ఏడాది నుంచి 21 మంది కన్ను మూత ఫలితాన్నివ్వని వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు మరో శిశువు అసువులు బాయకుండా చర్యలన్న కలెక్టర్ హామీ నీటిమూటే ఆ తరువాత మరో ఆరుగురు మృత్యువాత కడుపు పండిందంటే సందడి పడ్డా ఆ బిడ్డ రూపం తలచుకుంటూ మురిసిపోయా పెరుగుతూ కదలాడుతుంటే.. ఆ బుజ్జి కాళ్లు ...చేతుల స్పర్శ కొత్త అనుభూతులు పంచిందయ్యా... నెలలు దగ్గర పడుతున్నా... ప్రసవం మరో జన్మని తెలిసినా... పురిటినొప్పుల బాధ భయపెడుతున్నా అమ్మ అనే ఆ కమ్మని పిలుపుకోసం అన్నీ తట్టుకున్నానయ్యా.. పేగు తెంచుకుంది... ఊపిరిపోసుకుంది ఆ శ్వాసే ఆగిపోతుంటే... అమ్మా అనే పిలుపు సరే.. ఆ... అనే ఏడుపే లేకుంటే ఆ స్వరమే మూగబోతే... జాలిగా చూసే ఆ కళ్లే మూతపడితే... ఈ చావు కేకలు ఎన్నాళ్లయ్యా ఈ కడుపు కోత ఇంకెన్నాళ్లయ్యా... రాజవొమ్మంగి, (రంపచోడవరం) : మన్యంలో ఓ మండలం ... అక్కడే వరుస శిశు మరణాలు... చావుకేక వినిపించగానే జిల్లా వైద్యాధికారుల హడావుడి... ప్రజా ప్రతినిధుల పరామర్శలు ... అది మరిచిపోకముందే మరో మరణం...ఇలా ఈ ఏడాదిలోనే ఆరుగురు చనిపోగా ...గత ఏడాదిలో చోటుచేసుకున్న మరణాలను కూడితే 21. ఈ మండలంలో గత ఐదు నెలలుగా ఒకదాని తరువాత ఒకటిగా మాతాశిశు మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం వాటిని అదుపు చేయలేకపోతోంది. l శనివారం రాజవొమ్మంగి కమ్మరిపేటకు చెందిన పోలోజు రాజేశ్వరికి నాలుగున్నర నెలల క్రితం జన్మించిన ఆడ శిశువు ఊపిరి ఆడక చనిపోయింది. l మండలంలోని లోదొడ్డి పంచాయతీ, కేశవరం గ్రామానికి చెందిన గోము బుజ్జమ్మకు జన్మించిన సుమారు మూడు నెలల వయసున్న ఆడ శిశువు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 15న చనిపోయింది. l ఈ నెల 13న రాజవొమ్మంగిలో దేశెట్టి లోవకుమారి అనే ఆరు నెలల బాలింత మరణించగా, ఈ నెల 10న లోదొడ్డి గ్రామంలో ముర్ల బంగారికి పుట్టిన 47 రోజుల వయసున్న పాప చనిపోయింది. లోదొడ్డి గ్రామం లోతట్టు ప్రాంతంలో ఉండడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. l లోదొడ్డి గ్రామానికే చెందిన ముర్ల బంగారి (20) డిసెంబర్ 26న ఇంటి వద్దనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె జడ్డంగి పీహెచ్సీలో ప్రసవానంతర వైద్య సేవలు పొందింది. ఆమెకు పుట్టిన పాప కడుపు నొప్పితో బాధపడుతూ ఈ నెల 11న ఏడుస్తుండడంతో కుటుంబీకులు జడ్డంగి పీహెచ్సీకు తరలించారు. ఆ పాప మార్గ మధ్యలోనే చనిపోయింది. ఈ విధంగా ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు శిశువులు, ఒక బాలింత చనిపోయారు. l జనవరి 6న వంచంగి గ్రామంలో కోసూరి నాగమణికి, జనవరి 12న కేశవరం గ్రామంలో మేలిన వీరలక్షి్మకి, ఫిబ్రవరి 6న దోనెలపాలెంలో పడాల వెంకటలక్ష్మికి పుట్టిన పాపలు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. గతేడాది ఇదే రీతిలో అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ 16 మంది నవజాత శిశువులు, ఒక బాలింత మరణించారు. మాతాశిశు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న ప్రచారాన్ని ఈ మరణాలు అపహాస్యం చేస్తున్నాయి. ప్రచారం మినహా నివారణ సున్నా... జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాజవొమ్మంగి మండలంలోనే వరుసగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అయినప్పటికీ వైద్య,ఆరోగ్యశాఖ పనితీరు మెరుగుపడకపోవడం పట్ల గిరిజనులు తప్పుపడుతున్నారు. ఇప్పటి వరకూ మాతా శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖలు ఇంతవరకూ మండలంలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేదని ఈ మరణాలు ధ్రువీకరిస్తున్నాయి. మాతా శిశుమరణాల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, మరో శిశువు మరణించకుండా అన్ని చర్యలూ తీసుకొంటున్నామని రెండు నెలల కిందట లోదొడ్డి వచ్చిన కలెక్టర్ అరుణ్కుమార్ గిరిజన ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ మరణాలు కొనసాగుతుండడం పట్ల గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రక్తహీనత, పౌష్టికాహారం లోపాలతో గర్భిణులు అనారోగ్యం పాలవడం, పూర్తిస్థాయి వైద్యసేవలు మన్యంలో అందుబాటులో లేకపోవడం గిరిబిడ్డల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ప్రతికూల వాతావరణమూ కారణం.. రాజవొమ్మంగి పీహెచ్సీలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండడం లేదు. చనిపోయిన శిశువుల్లో ఎక్కువ మంది శ్వాస ఆడక ఇబ్బంది పడిన వారే. ఈ శిశువులకు స్థానిక పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం అనంతరం కాకినాడలోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రికి తరలించే లోగానే ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలో రాజవొమ్మంగి పీహెచ్సీలోనే శ్వాస సంబంధ, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని అందుబాటులో ఉంచగలిగితే ఇలాంటి మరణాలను చాలావరకూ అరికట్టవచ్చని స్థానికులు వేడుకుంటున్నారు. అంతంత మాత్రం ఆరోగ్యంతో ఉండే ఈ ప్రాంత పసికందుల మృతికి ప్రతికూల వాతావరణం కూడా కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. -
మన్యానికి మాయరోగం
గిరిజనంపై విరుచుకుపడుతున్న కాళ్లవాపు వ్యాధి నాలుగు నెలల వ్యవధిలో 14 మంది మృత్యువాత వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం విఫలం ఇచ్చిన హామీల అమలు గాలికి.. బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ నేడు బాధితులకు పరామర్శ ఆ రోగం.. ఇంటి పెద్దదిక్కులను పొట్టనపెట్టుకుంది.. ఆ ఇంటి మహలక్ష్ములను బలితీసుకుంది. ఎందరినో అనాథలను చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నాలుగు మాసాల్లో ఏకంగా 14 మంది ప్రాణాలను హరించింది. వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. కాళ్లవాపు వ్యాధి అన్నారే తప్ప.. అదేం రోగమో పూర్తిగా నిర్ధారించని అధికారగణం, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించని పాలకుల తీరు మన్యంవాసులను మరింత బాధించాయి. అయితే వారికి కొండంత భరోసానిస్తూ.. వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు అండగా నిలిచారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. తాజాగా వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మన్యంలో పర్యటించి కాళ్లవాపు బాధితులను పరామర్శించనున్నారు. కాళ్లవాపు వ్యాధి. వీఆర్ పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధి అన్నవరం గ్రామంలో తొలుత ప్రారంభమై పరిసర గ్రామాలకు, చింతూరు, కూనవరం మండలాలకు వ్యాపించింది. ఈ వ్యాధి బారినపడి వీఆర్పురం మండలంలో ఎనిమిది మంది, చింతూరు మండలంలో ఐదుగురు, కూనవరం మండలంలో ఒకరు, మొత్తం 14 మృతిచెందారు. కన్నెత్తి చూడని పాలకులు ఏజన్సీలో కాళ్లవాపు మరణాలతో గిరిజనులు ప్రాణాలు విడుస్తున్నా జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దలు కనీసం కన్నెత్తి చూడ లేదు. ఓ మంత్రి చుట్టపుచూపుగా వచ్చి బాధితులను హడావిడిగా పరామర్శించి వెళ్లారే తప్ప ఇప్పటి వరకు ఆయనిచ్చిన హామీలు నెరవేరలేదు. ఏదో అరకొర సాయంగా వీఆర్పురం మండలానికి చెందిన ఆరు కుటుంబాలకు మాత్రమే రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. జిల్లాకు చెందిన హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రులతో పాటు ఇన్చార్జి మంత్రి, స్థానిక ఎంపీలెవరూ బాధితులను పరామర్శించక పోవడం విమర్శలకు తావిస్తోంది. కార్యరూపం దాల్చని కలెక్టర్ హామీ కాళ్లవాపునకు నాటుసారా కూడా కారణమని జిల్లా కలెక్టర్ పేర్కొనడంతో ఈ ప్రాంత గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మృతుల్లో ఇంటర్ విద్యార్థులూ ఉన్నారు. ఏజన్సీ ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అరుణ్కుమార్ ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పత్తాలేని నివేదిక కాళ్ల వాపు ప్రభావంతో 14 మంది గిరిజనులు మరణించినా.. ఆ వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ వ్యాధితో విలీన మండలాల నుంచి 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్లో చికిత్స చేయించుకున్నారు. వైద్య నిపుణులు గ్రామాల్లో పర్యటించి రోగులు, స్థానికుల రక్త నమూనాలు, ఆహారం, నీరు తదితర నమూనాలు సేకరించారు. వ్యాధి నిర్ధారణ కోసం దిల్లీ నుంచి కేంద్ర వైద్య బృందం పర్యటిస్తుందని చెప్పినా.. ఆ దిశగా అడుగుపడలేదు. కాళ్లవాపు అనేది వైద్య పరిభాషలో లేదని కిడ్నీ సంబంధిత వ్యాధితోనే కాళ్లవాపులు వస్తున్నాయని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు రంపచోడవరంలో బ్లడ్బ్యాంక్, చింతూరులో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జిల్లా అధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికీ ఏర్పాటు చేయలేదు. అలాగే చింతూరు ఏరియా ఆసుపత్రిని ప్రధాన వైద్యకేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన అధికారులు అరకొర సిబ్బందిని నియమించి చేతులు దులుపుకొన్నారు. -
మన్యంలో మంచు దుప్పటి
విశాఖ మన్యంలో చలి పులి అప్పుడే గజగజ వణికిస్తోంది. నాలుగు రోజలుగా వేకువజామున నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉదయం 9గంటల వరకు హెడ్లైట్ల వెలుగులోనే వాహనదారులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. పల్లెజనం చలి నెగళ్లను ఆశ్రయిస్తున్నారు. -
మన్యంపై మొద్దు నిద్ర
వరుసగా చనిపోతున్నా చలనం లేదాయె కాళ్లవాపు, పొట్టవాపు రోజుకొకటి వెలుగులోకి రోజుల పసిగుడ్డులనుంచి వృద్ధుల వరకు మృత్యువాత ఇంతవరకూ నిర్ధారణ కాని వ్యాధి నాటు సారా తాగడం వల్లనేనని ప్రకటనలు చిన్నపిల్లలు, విద్యార్థులు మృతికీ తాగుడే కారణమా? తరువాత అదీ ఓ కారణమంటూ మాట మార్పు ‘సాక్షి’ వరుస కథనాలతో కొంత కదలిక జగన్ మోహన్ రెడ్డి ఆరాతో మరింత హడావుడి సాక్షి ప్రతినిధి, కాకినాడ/వి.ఆర్.పురం/చింతూరు : మన్యంలో గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. మరణశయ్యపై ఉన్న ‘తూర్పు’ మన్యానికి భరోసా కల్పించలేక సర్కార్ చేతులెత్తేస్తోంది. గడచిన నెలన్నర రోజులుగా మన్యం వాసులను వణికిస్తున్న కాళ్లవాపు వ్యాధి అసలు ఎందుకు వస్తుందో ఇంతవరకు నిర్థారణ కాలేదు. కాకినాడ రంగరాయ, విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలకు చెందిన వైద్య బృందాలు రోగుల రక్త నమూనాలు సేకరించినా నివేదికలు మాత్రం ఇంకా రాలేదు. ఆ నివేదికలు ఎప్పుడు వస్తాయో అధికారులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. నాటుసారా తాగడంతోనే మరణాలు సంభవించాయని మొదట్లో జిల్లా కలెక్టర్ వెల్లడించినట్టు పలు పత్రికల్లో (సాక్షి కాదు) వార్తలు వచ్చాయి. మృతుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులుండటం, అందులో ఒక విద్యార్థిని కావడంతో విమర్శలు వెల్లువెత్తడంతో నాటుసారా మాత్రమే కారణం కాదని అది కూడా ఒకటై ఉంటుందని సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. వ్యాధి నియంత్రణ, వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వడంలో పాలకుల చొరవ, ప్రభుత్వ ప్రయత్నాలు విమర్శపాలవుతున్నాయి. కాళ్లవాపు వ్యాధి అదుపులోకి రాకపోగా, మలేరియా, టైపాయిడ్, విషజ్వరాలతో మృతి చెందుతున్న గిరిజనుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీలో ఇంత ఆందోళనకరమైన పరిస్థితులున్నా నామమాత్రపు చర్యలతో కాలక్షేపం చేస్తూ వ్యాధి అదుపులోకొచ్చిందని జిల్లా యంత్రాంగం చెబుతూ వస్తోంది. కాళ్లవాపు వ్యాధి వీఆర్పురం, చింతూరు, కూనవరం మండలాల్లో గ్రామాలను వణికిస్తోంది. అంతుచిక్కని ఈ వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంకా ఈ వ్యాధితో అటు విలీన మండలాల్లో, ఇటు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి పై మాటే. మన్యంలో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించి ముళ్లుకర్రతో వెంటపడడంతో తాబేలు నడకలా పరిశీలిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరా తీస్తున్న విషయం పత్రికల్లో రావడంతో గిరిజన శాఖా మంత్రి హడావుడిగా పర్యటించారు. బాబు, కామినేనిలు జిల్లాకు వచ్చినా... వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఈ నెలన్నరలో జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన వారే. కానీ కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన కుటుంబాల వైపు కన్నెత్తిచూసే తీరిక, ఓపిక వారికి లేకుండా పోయిందని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశాఖా మంత్రి కామినేని జగ్గంపేటలో పలు ప్రారంభోత్సవాలకు హాజరవడానికి తీరిక దొరికింది కానీ తమను పలకరించడానికి దొరకలేదా అని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవినేని ఉమ కనీసం కన్నెత్తి చూడలేకపోవడాన్ని బట్టే గిరిజనులపై ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో అర్థమవుతోందంటున్నారు. ఆగని మరణాలు... కాళ్లవాపు వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృతి చెందగా, తాజాగా రాజవొమ్మంగి మండలం పూదూడి, పాకవెల్లిలో నెల వయసు పసికందులు ఇద్దరు, మారేడుమిల్లి మండలం వేటుకూరుకు చెందిన ఆరో తరగతి విద్యార్థి రాజారెడ్డి తాజాగా బుధవారం అనారోగ్యంతో మృతిచెందడం గమనార్హం.సరిగ్గా ఏడాది క్రితం వీఆర్పురం రాజుపేట కాలనీలో దుర్గాభవానీ అనే యువతి కాళ్లవాపు వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోగా విజయవాడలో రెండు కాళ్లు తొలగించేశారు. ఇప్పుడు ఆ యువతి కిడ్నీల వాధితో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్లో చికిత్సపొందుతోంది. ఇచ్చిన లక్ష ఏ మూలకు...? కాళ్లవాపు వ్యాది మృతులకు ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చింది. అంతుచిక్కని వ్యాధి వచ్చాక స్థానికంగా వైద్యానికే లక్ష ఖర్చు అయ్యిపోయింది, ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఏమూలకూ రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త కోల్పోయి బతుకు భారమైన కుటుంబం, చేతికందొచ్చిన కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు...ఇలా ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాధలే. ఏజన్సీలో వైద్యసేవలు మెరుగు పరుస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. కొత్తగా వైద్యుల పోస్టులు భర్తీ కాకపోగా ఉన్న వైద్యులే మన్యం వీడిపోతున్నారు. మన్యంలో మరణ మృదంగంపై పాలకులు మానవతాదృక్పధంతో స్పందించి వారికి మనో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నివురుగప్పిన నిప్పు!
దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు వ్యూహరచనలో పోలీసులు, మావోయిస్టులు ఆంధ్రా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ నాలుగు రాష్ట్రాలను అనుకుని ఉన్న దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దండకారణ్య సరిహద్దు ప్రాంతాన్ని తమ షెల్టర్జోన్గా వినియోగించుకుంటూ, తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టులు.. నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే సరిహద్దులో మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వారోత్సవాలను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు, మావోయిస్టు చర్యలను నియంత్రించేందుకు పోలీసులు వారివారి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. వారోత్సవాల వేళ మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. – చింతూరు చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి, పేగ రహదారిలో మావోయిస్టులు ఇటీవల మందుపాతరలు అమర్చడం కలకలం రేపింది. కూంబింగ్ కోసం వచ్చే జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు నాలుగు సార్లు మందుపాతర్లను అమర్చారు. వీటిని ముందుగానే పసిగట్టిన పోలీసులు అప్రమత్తమై వాటిని నిర్వీర్యం చేయగా, రెండు మందుపాతరలు వాటంతటవే పేలిపోయాయి. దీంతో పోలీసులకు భారీనష్టం తప్పింది. ఇదే క్రమంలో వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ సరిహద్దుల్లోని తెలంగాణలో భద్రాచలం–చర్ల రహదారిపై మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. దీనికితోడు ఆంధ్రా సరిహద్దు సమీపంలో గంగరాజుపాడు వద్ద ఆంధ్రా–ఛత్తీస్గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈ నెల 21న చింతూరు మండలానికి చెందిన ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వినూత్న వ్యూహాల్లో మావోయిస్టులు దండకారణ్య పరిధిలో ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టులు కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్నారు. వారోత్సవాల సమయంలో దండకారణ్య ప్రాంతంలోని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి, రిక్రూట్మెంట్ చేపట్టడం ద్వారా కేడర్ను పెంచుకునే అవకాశాలు ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు ముమ్మరంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఎన్కౌంటర్లో లభ్యమైన డైరీ ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయి. శిక్షణలో భాగంగా గగనతల దాడులను ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిసింది. సైన్యంలో ఇచ్చే శిక్షణ మాదిరిగానే నిలింగ్, స్టాండింగ్, ప్రోన్ పొజీషన్లతో పాటు ఎల్ఎంజీ ద్వారా హెలికాఫ్టర్లపై దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు గగనతల దాడుల నుంచి క్యాంపులను కాపాడుకునేందుకు అండర్గ్రౌండ్ సొరంగాలు, అండర్గ్రౌండ్ నివాసాలు, కొండల నడుమ సొరంగాలు, గుహలు నిర్మించుకోవాలని అగ్రనేతలు సూచించినట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. తిప్పికొట్టేందుకు పోలీసుల వ్యూహం వారోత్సవాల సమయంలో మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడవచ్చని అనుమానిస్తున్న నాలుగు రాష్ట్రాల పోలీసులు.. వీటిని తిప్పికొట్టే వ్యూహంలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి, కూంబింగ్ ము మ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సంయు క్తంగా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీన ఆంధ్రా, ఛత్తీస్గఢ్ల పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరోవైపు కూంబింగ్ నిర్వహించే పోలీసులను లక్ష్యంగా చేసుకుని, సరిహద్దుల్లో మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానంతో డాగ్స్కా్వడ్, మెటల్ డిటెక్టర్లతో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వనాల్ని వీడండి.. జనాల్లో కలవండి.. చింతూరు: ‘అడవుల్లో అన్నలారా! లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవండి’ అని మావోయిస్టులకు హితవు పలుకుతూ చింతూరు పోలీసులు బుధవారం జరిగిన వారాంతపు సంతలో ర్యాలీ నిర్వహించారు. ‘ఆయుధాలు వద్దు.. ఏబీసీడీలు ముద్దు, బాణాలు వీడండి.. జనంలో కలవండి, ఆయుధాలు వద్దు.. అభివృద్ధి ముద్దు, అడవిలో అన్నలారా! లొంగిపోయి ప్రశాంత జీవితాలు గడపండి!’ అంటూ నినాదాలు చేశారు. నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్ పాల్గొన్నారు. -
మంచం పట్టిన మన్యం
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పీహెచ్సీలన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కలుషిత నీరు, పారిశుద్ధ్యం లోపించడం, దోమతెరలు పంపిణీ కాకపోవడం వంటి సమస్యలతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులంతా పీహెచ్సీలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, మందులు అరకొరగా ఉండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. * ఏజెన్సీని చుట్టుముడుతున్న రోగాలు * రోగులతో నిండిన పీహెచ్సీలు * కలుషిత నీటితో తప్పని అవస్థలు సీతంపేట: ఏజెన్సీలో రోగాలు ముసురుకుంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు గెడ్డల్లో కొత్తనీరు చేరి కలుషితమవుతుంది. కొన్ని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం గెడ్డనీటిపైనే ఆధారపడటంతో గిరిజనులు టైఫాయిడ్ వంటి విషజ్వరాల వ్యాధుల బారిన డుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో దోమలు స్వైరవిహారం చేస్తూ మలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తున్నాయి. దీంతో ఏజెన్సీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 250కిపైగా మలేరియా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతుండగా వాటి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అనధికార అంచనా. టైఫాయిడ్, డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అరకొరగా వైద్య సిబ్బంది.. ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మరో 151 ఉప ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆస్పత్రులు, 10 సీహెచ్సీలు 10 ఉన్నాయి. హైరిస్క్ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయి, కుశిమి, మర్రిపాడు గ్రామాల్లో పీహెచ్సీలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పీహెచ్సీలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ నమోదవుతోంది. వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200 వరకు ఉంటుందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా కానరావడం లేదు. సీతంపేటలో ఇద్దరు వైద్యాధికారులు మాత్రమే ఉన్నారు. గతంలో నలుగురు వైద్యులు ఉండేవారు. దోనుబాయి, కుశిమి పీహెచ్సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మందులు బయటకొనాల్సిందే.. పీహెచ్సీల్లో అరకొరగానే మందులు ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. సెలైన్ బాటిళ్లు, ఇతర యాంటీబయాటిక్ మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. మలేరియా నిర్మూలనకు ఇప్పటి వరకు దోమతెరలు పంపిణీ చేయలేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్వో ఎంపీవీ నాయిక్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గిరిజనులకు సక్రమంగా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఎటువంటి కొరత లేదని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పా టు చేయాలి. గ్రామా ల్లో ఇప్పుడు వైరల్, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఏ గ్రామం లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. వీరందరికీ వైద్యసేవలు అందించాలి. - ఎస్.లక్ష్మి, ఎంపీపీ, సీతంపేట వైద్యులను నియమించాలి అన్ని పీహెచ్సీలకు పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి వైద్యసేవలు అందించాలి. మందులన్నీ అందుబాటులో ఉంచే లా చర్యలు తీసుకోవా లి. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. - ఎ.భాస్కరరావు, గిరిజన సంఘ నాయకుడు అదుపులోకి రాని డయేరియా వాబ(సారవకోట): మండలంలోని అన్నుపురం పంచాయతీ వాబ గ్రామంలో విజృంభించిన డయేరియా(అతిసార) శుక్రవారం నాటికీ అదుపులోకి రాలేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పీహెచ్సీ డయేరియా రోగులతో నిండిపోయివడంతో శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలందించారు. గ్రామంలో సుమారు 40 మంది వ్యాధి బారిన పడటంతో అక్కడ కూడా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన దినేష్, మధుల పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. చోడసముద్రం, పురుషోత్తుకర్ర, చిన్నకిట్టాలపాడు, గొర్రిబంద గ్రామాల్లోనూ అతిసార వ్యాపించినట్లు సమాచారం. సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నా కంటిజెంట్ వర్కర్ రోగులకు సెలైన్లు ఇస్తుండటం గమనార్హం. -
విద్య అటకెక్కుతోంది
రెండేళ్లు దాటినా మంజూరు కాని గురుకుల డిగ్రీ కళాశాల ఇంటర్తో ఇంటిముఖం పడుతున్న గిరిజన విద్యార్థులు అమలు కాని జీవో మన్యంలో ఉన్నత విద్య అటకెక్కుతోంది. ఏటా ఐదువేల మంది గిరిజన విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులవుతున్నారు. వారిలో 3000 మంది వరకు ఇంటర్లో చే రుతున్నారు. అయితే ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చదివేవారు కనీసం 25 శాతం కూడా ఉండడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇంటర్తో ఇంటిముఖం పడుతున్నారు. రాష్ట్రంలో గురుకులం తరపున డిగ్రీ కళాశాలలు లేకపోవడమే ఇందుకు కారణం. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులం నుంచి బాలికల డిగ్రీ కళాశాలను గూడెంకొత్తవీధిలో ఏర్పాటుకు అనుమతి ఇస్తూ జీవో 25ను విడుదల చేసింది. ఆర్థికశాఖ క్లీయరెన్స్ కూడా అయింది. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. - కొయ్యూరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న గిరిజనులు త క్కువనే చెప్పాలి. మెరిట్ ఉన్నవారికి గురుకుల జూనియర్ కళాశాలల్లో సీట్లు వస్తున్నాయి. లేని వారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు. అక్కడ వారికి స్కాలర్ వస్తుంది తప్ప మరేం ఉండదు. గురుకుల కళాశాలల నుంచి ఇంటర్ పూర్తి చేస్తున్న వారు డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు గురుకుల డి గ్రీ కళాశాలలు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివితే గిరిజన విద్యార్థులకు స్కాలర్ మినహా ఇతర సౌకర్యాలు ఉండవు. దీంతో పేదరికంలో ఉండేవారు డిగ్రీ చదవకుండానే ఇంటర్తో ఆపేస్తున్నారు. ఇలా ఆపేస్తున్నవారి సంఖ్య75 శాతం వరకూ ఉంది. అదే గురుకుల డిగ్రీ కళాశాల ఉంటే ఎక్కువమంది చదువుకునే వీలుంది. అన్ని సౌకర్యాలు అందుతాయి. గురుకుల తరఫున డిగ్రీ కళాశాల ఉండాలని ఎప్పట్నుంచో అనేక మంది వినతులు ఇస్తున్నారు. బాలరాజు మంత్రిగా ఉన్న సమయంలో గూడెంకొత్తవీధిలో డిగ్రీ కళాశాల గురుకులం నుంచి ఏర్పాటు చేస్తూ అనుమతి ఇచ్చారు. దీనిపై జీవో 25ను విడుదల చేశారు. ఆర్థిక శాఖ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా అనుమతి ఇచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అది అటకెక్కింది. ముందు ప్రభుత్వం ఇచ్చిన దానిని కూడా నిలిపివేసింది. రాష్ట్రంలో గురుకులం తరపున కూడా డిగ్రీ కళాశాలలు లేవు. మొదటిసారిగా మన్యంలో ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూలపేట పంచాయతీ మర్రిపాలెంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉంది. బాలరాజు మంత్రిగా ఉండగా దానిని గూడెంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. గురుకులం నుంచి డిగ్రీ కళాశాలను ప్రతిపాదించామని, దీనికి అనుమతులు రావలసి ఉందని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. నిలిపివేత దారుణం బాలికలు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష ్యంతో గూడెంలో గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేశాం. అయితే ప్రభుత్వం మారిన తరవాత దాని నిర్మాణాన్ని నిలిపివేసింది. ఈ ప్రాంతంలో డిగ్రీ క ళాశాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకుంటే ఇంటర్తో బాలికలు చదువును మానేస్తున్నారు. -పి.బాలరాజు, మాజీ మంత్రి అసెంబ్లీలో లేవనెత్తుతా గురుకులం నుంచి బాలికలకు డిగ్రీ కళాశాల అవసరం ఉంది. దీనిని ఏర్పాటు చేస్తే ఉన్నతవిద్యను అభ్యసించే గిరిజన బాలికల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం వెంటనే దీనిని ఏర్పాటు చేయాలి. త్వరలో జరిగే పాలకవర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తా. -గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే -
రామా.. కనవేమిరా..!
ఖమ్మం జిల్లాను చుట్టుముట్టిన కరువు వట్టిపోయిన చెరువులు, కుంటలు.. తాగునీటికి కటకట ఉపాధి లేక వలస బాట పట్టిన గిరిజనులు, ఆదివాసీలు చెరువులు, వాగులు, వంకలు, తోగులు ఎండిపోయూరుు.. నాగార్జున సాగర్ జలాలు రాక ఆయకట్టు బీడుగా మారింది.. కిన్నెరసాని కళ తప్పింది.. ఎటుచూసినా ఖమ్మం జిల్లాను కరువు కమ్మేసింది! పల్లె ప్రజలు, ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల వారు కిలోమీటర్ల కొద్దీ వెళ్లి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. వ్యవసాయ, మంచినీటి బావులు అడుగంటాయి. పశువులకు నీళ్లు లేక, గ్రాసం కానరాక. కబేళాలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఏజెన్సీలో పనులు దొరక్క, గూడేల్లో ఉండలేక మూటాముల్లె సర్దుకొని ఆదివాసీలు వలసబాట పడుతున్నారు. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... - బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం గండ కరువు గుండె పగిలి బతుకులు ఆగమైపోతున్నయి ఊళ్లో పూటగడవక మనసులు కాలీచేసి శోకమై పోతుండ్రు పొట్ట తిప్పలకు జెరిపోతులాట మనుషులు నగరబాట పట్టిండ్రు చెవి మీద పేను పారదు దయధర్మము లేని ప్రభుత సచ్చినంక ఇచ్చే పరిహారం నిన్నే పరిహసిస్తున్నది.. ప్రశ్నిస్తున్నది!! - జూకంటి జగన్నాథం కిన్నెరసానిలో చుక్క లేదు.. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బంధాల అడవుల్లో పుట్టే కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని గుండాల, కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కిన్నెరసాని పూర్తిగా ఎండిపోయింది. దీంతో నాలుగు మండలాల్లోని ఆదివాసీ గూడేల్లో మంచినీటి బావులు, చేతి పంపులు ఎండిపోయాయి. గ్రామాల నుంచి నాలుగైదు కిలోమీటర్లు నడిచి కిన్నెరసాని చెలిమల్లో ఆదివాసీలు, గిరిజనులు మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. కిన్నెరసాని ప్రవాహం లేకపోవడంతో రిజర్వాయర్లో మొత్తం నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 392 అడుగులకు పడిపోయింది. గ్రాసం లేక గోస.. మన్యం మండుతుండడంతో అడవిలోని వాగులు, వంకల్లో చుక్కనీరు లేకుండా పోయింది. కిన్నెరసాని అడుగంటుతుండటంతో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో నీటి ఊట రాక.. జంతువులకు నీళ్లు కరువయ్యాయి. ఈ కేంద్రంలో 150 జింకలు, వేల సంఖ్యలో కోతులు, ఇతర పక్షులున్నాయి. గ్రాసం లేక ఇవన్నీ అలమటిస్తున్నాయి. పచ్చిక బయళ్ల నుంచి తెచ్చిన గ్రాసాన్ని జింకలకు పెడుతున్నారు. ఇక గడ్డి, నీళ్లు లేక ఆదివాసీలు పశువులను అడవికి వదిలారు. మరికొందరు మరో గత్యంతరం లేక పశువులను కబేళాలకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో ప్రాచుర్యం పొందిన కామేపల్లి మండలం పండితాపురంలోని శ్రీకృష్ణప్రసాద్ సంతలో ప్రతి బుధవారం దాదాపు 10వేల పశువుల విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన కబేళా వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి డీసీఎంలు, లారీల్లో కుక్కి పశువుల్ని తీసుకువెళ్తున్నారు. నీళ్లు, గడ్డి లేక మూగజీవాలను అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవం లేని జీవనది జీవనది గోదావరి ఎడారిలా మారిపోయింది. ఎటు చూసినా ఇసుక తిన్నెలే కనిపిస్తున్నాయి. భద్రాచలం వద్ద సోమవారం అతి తక్కువగా 3.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. మే నెల లో ఇంత తక్కువగా నీటిమట్టం నమోదుకావటం గతంలో ఎన్నడూ లేదని అంటున్నారు. గోదావరిలో ప్రస్తుతం ఏదో ఒక మూలన చిన్నపాటి పాయలా నీళ్లు పారుతున్నాయి. నదిలో నీళ్లు అడుగంటడంతో పరీవాహక బోరుబావులపై ప్రభావం పడింది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. గోదారి తీర ప్రాంత గ్రామాలకు సైతం ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది. 10 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు.. జిల్లాలో సగటున 10.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఈ నెలలో వర్షం పడకపోతే 12 మీటర్లకు పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. గతేడాది మార్చిలో 9 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లిలో 16 మీటర్లు, బనిగండ్లపాడులో 11.40 మీటర్లు, కొత్తలింగాలలో 11.55 మీటర్లు, కూసుమంచిలో 14.84 మీటర్లు, ఎంపీ బంజరలో 13.30 మీటర్లు, రావికంపాడులో 13.95 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు పడిపోయాయి. ఒక్క బావి 50 మోటార్లు గుండాల మండలంలోని చీమలగూడెంలో నివసిస్తున్న 150 కుటుంబాలకు ఇదొక్కటే మంచినీటి బావి! మంచినీటిని తోడేందుకు ఇలా 50 మోటార్లు పెట్టారు. నీటి ఊట తగ్గడంతో గ్రామం అంతా మంచినీటి కోసం ఇబ్బంది పడుతోంది. పాల్వంచ మండలంలోని బంజరలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ 50 కుటుంబాలు ఉండగా.. గ్రామంలో ఉన్న బావి ఎండిపోయింది. ఊట ఎప్పుడు వస్తే అప్పుడు మోటార్ల ద్వారా నీటిని తోడుకొని గిరిజనులు గొంతు తడుపుకుంటున్నారు. కూలి లేని ‘ఉపాధి’.. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2.50 లక్షల మందికి జాబ్కార్డులు ఉన్నాయి. పనులు కొనసాగుతున్నా..రెండున్నర నెలలుగా వీరికి కూలి చెల్లించడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.25 కోట్ల వేతనం నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఇక తునికాకు సేకరణ ద్వారా ఆదివాసీలు, గిరిజనులకు నెలన్నర పాటు పని దొరుకుతుంది. ఈసారి వర్షాభావంతో తునికాకు లేకపోవడంతో ఆదివాసీలు వారం రోజులే ఆకు సేకరించగలిగారు. ఊరచెరువు ఎండింది.. గుండాల మండలంలోని జామరగూడెం, మటంలంక, పోతిరెడ్డిగూడెం, వేపలగడ్డ, కూనవారిగూడెం గ్రామాల్లోని వెయ్యి ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే ఊరచెరువు ఇది. ఎప్పుడూ ఎండని ఈ చెరువు ఈసారి నైచ్చింది. రబీలో ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదు. చెలిమలన్ని వెతికి.. ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం ఏజెన్సీల్లోని ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలు, గ్రామాల్లో మంచినీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. గుండాల మండలంలోని కిన్నెరసాని ఒడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఎలగలడ్డకు ఆదివాసీ కోయ కుటుంబాలు వలస వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరువు నెలకొందని, మంచినీటి పెద్దబావి ఎండిందని వారు చెబుతున్నారు. ఇక్కడి 40 కుటుంబాలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసానికి వెళ్లి చెలిమల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇవి కూడా ఎండిపోతే ఎటు పోవాలో తెలియని దుస్థితి. పాల్వంచ మండలంలోని సిర్తనిపాడులోని 30 ఆదివాసీ కుటుంబాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోగే దిక్కయింది. -
మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్
కేజీహెచ్లో 13 మందికి చికిత్స సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. తాజాగా హుకుంపేట మండలం పనసపుట్టుకు చెందిన 13 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కేజీహెచ్లో చేరారు. వివ రాలిలా ఉన్నాయి. పనసపుట్టులో ఇటీవల కొంతమంది గిరిజనులు చనిపోయిన మేక మాంసాన్ని తిన్నారు. దీంతో చేతి వేళ్లపై పొక్కుల్లా వచ్చాయి. వీరు పాడేరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడ వైద్యులు వీరికి ఆంత్రాక్స్ సోకినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. అనంతరం వీరిని మంగళవారం రాత్రి విశాఖ కేజీహెచ్కు తీసుకువచ్చారు. వీరిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఒక బాలుడు ఉన్నారు. వీరిని కేజీహెచ్లోని చర్మవ్యాధుల చికిత్స వార్డులో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బాధితులకు చర్మవ్యాధుల చికిత్స విభాగాధిపతి డాక్టర్ అనీలా నాయర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. వీరి శరీరం నుంచి శాంపిళ్లను తీసి పరీక్షలకు పంపుతామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్బాబు తెలిపారు. -
మన్యంలో మళ్లీ అలజడి
మందుపాతర పేల్చిన మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం పోలీసుల కాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు పెదబయలు/ముంచంగిపుట్టు: కొద్దికాలంగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మళ్లీ యుద్ధ వాతావరణం అలుముకుంది. మావోయిస్టులు బుధవారం మందుపాతర పేల్చిన సంఘటనతో మన్యం ఉలిక్కిపడింది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు కర్రి ముక్కిపుట్టు పంచాయతీ దూలిపుట్టు గ్రామ సమీపంలో అడ్డతీగల మలుపు వద్ద బుధవారం ఉదయం 8.15 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక జవాన్ గాయపడగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కూడా కాల్పులు జరిపినప్పటికీ మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం రూడకోట గ్రామంలో నెల రోజులుగా పోలీస్ఔట్ పోస్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోజూ ముంచంగిపుట్టు నుంచి రూడకోటకు పీఆర్పీఎఫ్ బలగాలు వచ్చి విధులు నిర్వహించి తిరిగి వెళుతుంటాయి. వీరంతా రోజూ నడిచి వెళుతుండటం గమనించిన మావోలు మందుపాతర పేల్చేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. తారు రోడ్డుకు గోతులు ఏర్పడిన ప్రదేశంలో అక్కడ మెటల్ తొలగించి ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ఎక్స్ప్లోజివ్ డివైజ్) పేలుడు పదార్థాలు అమర్చారు. పోలీసుల రాక కోసం మాటువేసిన మావోలు వాటిని పేల్చారు. పేలుడు పదార్థాలు ఎడవ పక్కన అమర్చడం, తాము కుడివైపున నడుచుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేకుంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని జవాన్లు తెలిపారు. 20 మంది జవాన్లు ఒక గ్రూపుగా, కిలోమీటర్ దూరంలో మరో 20 మంది జవాన్లు మరో గ్రూపుగా నడిచి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఈ సంఘటనలో పెదబయలు సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ జవాను శ్రీనివాస్ సాహు కుడి భుజానికి తీవ్ర గాయం కావడంతో అంబులెన్స్లో ముంచంగిపుట్టు పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పాడేరు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నానికి తరలించారు. కొండమీద ఉన్న మావోయిస్టులపై 10 రౌండ్లు కాల్పులు జరపగా, సుమారు 10 మంది సాయుధులైన మావోలు బ్యాగులు, తినుబండారాలు వదిలి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూడకోట గ్రామంలో నిర్మిస్తున్న ఔట్ పోస్టుకు కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో ఈ సంఘటన జరగడం విశేషం. 15 రోజుల నుంచి రెక్కీ రూడకోట ఔట్ పోస్టు నిర్మాణానికి సంబంధించి నెల రోజుల నుంచి పోలీసులు ప్రతీ రోజు పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి వచ్చి విధులు నిర్వహించి వెళుతున్నారు. ప్రతీ రోజు ముంచంగిపుట్టు నుంచి రూడకోట వరకు 11 కిలోమీటర్లు నడిచి వెళ్లి రావడం గమనించిన మావోయిస్టులు మందుపాతరకు వ్యూహం రచించారు. దూలిపుట్టు అడ్డతీగల మలుపును సేఫ్ పాయింట్గా ఎంచుకుని 15 రోజుల నుంచి ఐఈడీ బ్లాస్టింగ్ సామగ్రి అమర్చారు. మొత్తం ఐదు మందుపాతరలు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతంలో రెండు వైపులా కొండలు ఉండడం, కింది నుంచి పోలీసులు కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉండటతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనలో 10 మంది మావోలు పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులు నడిచి కాకుండా వాహనంపై వెళ్లి ఉంటే పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఐఈడీ పేలుడు సామగ్రి అమర్చడం ఇదే ప్రథమం. ఏవోబీలో పోలీసు ఔట్ పోస్టుల ఏర్పాటును మావోలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఏవోబీలో జల్లెడ మందుపాతర పేలుడు ఘటనతో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. నర్సీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ, పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆధ్వర్యంలో మావోల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రెండు మండలాల ఏవోబీ సరిహద్దు, సంఘటన ప్రాంతానికి సమీపంలో ఉన్న దూలిపుట్టు, వెచ్చంగి, గొర్రెలమెట్ట, గిద్దులమామిడి గ్రామాల్లో మావోల ఆచూకీ కోసం పోలీసులు అదనపు బలగాలతో గాలిస్తున్నారు. మావోలు వదలివెళ్లిన బ్యాగుల్లో ఏమైనా సమాచారం లభించే అవకాశం ఉందని, నిపుణుల పరిశీలన అనంతరత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓఎస్డీ తెలిపారు. మందుపాతర ఎన్ని రోజుల వ్యవధిలో అమార్చారు.. ఎవరైనా సహకారం అందించారా.. తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పారు. -
గిరిసీమలో సౌందర్యలహరి
ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు కనిపించే ఎత్తయిన పర్వత సానువులు.. వాటిమధ్య అందంగా ఒదిగిపోయిన లోయలు.. వాటిపై చిక్కని ఆకుపచ్చదనంతో అలరారే వృక్షాలు.. ఒంపులు తిరుగుతూ సాగే కొండ వాగులు.. కొండలపై నుంచి ఘోష చేస్తూ దూకే జలపాతాలు.. కిలకిలారావాలు చేసే రకరకాల విహంగాలు.. అరుదైన జంతు సమూహాలు.. ఇటువంటి ప్రకృతి అందాలకు ‘తూర్పు’ మన్యం ఆటపట్టు. ఇటువంటి సహజ సౌందర్యలహరిలో సాగే గిరిజనుల జీవనం, సంస్కృతి ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. ఈ గిరి సంస్కృతిని ప్రతిబింబించే మూడు రోజుల పండగకు మన్యసీమ ముస్తాబైంది. ఈ నేపథ్యంలో మన మన్యం విశిష్టతలపై విహంగ వీక్షణం.. - అమలాపురం/రంపచోడవరం/మారేడుమిల్లి * మంత్రముగ్ధుల్ని చేస్తున్న మన్యసీమ సౌందర్యం * రమణీయ ప్రకృతి అందాలకు ఆలవాలం * మరెన్నో విశిష్టతలు ఈ సీమ సొంతం గిరుల నుంచి సిరులు.. కలప, గిరిజనోత్పత్తులు, లాటరైట్ గనులు, రెడ్ మెటల్, బ్లాక్మెటల్కు మన్యంలోని గిరులు నిలయం. ఇవి ప్రభుత్వానికి సిరులు కురిపిస్తున్నాయి. సహజసిద్ధంగా లభించే తేనె, అడ్డాకులు, కరక్కాయలు, చింతపండు, కొండచీపుర్లు, శీకాయలు, కుంకుకాయలు, తాటి ఉత్పత్తులు గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటాయి. అలాగే కమలా, దబ్బ, నిమ్మజాతులు, మామిడి, జీడిమామిడి, అనాస, పనస, పంపరపనసలకు మంచి గిరాకీ ఉంది. పాడేరు తరువాత అత్యంత శ్రేష్టమైన కాఫీ పండుతున్నది ఇక్కడే. రబ్బరు ఉత్పత్తితో కూడా ఇక్కడి గిరిజనులు ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీలో లభించే నాణ్యమైన టేకు, రోజ్వుడ్కు మంచి గిరాకీ ఉంది. నేటి నుంచి ‘మన్యం జాతర’ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో.. ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లిలోని ‘వనవిహారి’ వేదికగా శనివారం నుంచి ‘మన్యం జాతర’ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. మన రాష్ట్రంతోపాటు, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి గిరిజనులు ఈ జాతరకు తరలిరానున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచుతారు. అలాగే ఈ మూడు రోజులూ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. విభజనతో కీలకంగా మారిన ఏజెన్సీ రాష్ట్ర విభజనతో తూర్పు మన్యం కీలకంగా మారింది. కొత్తగా నాలుగు మండలాలు కలవడంతో ఏజెన్సీ విస్తీర్ణం భారీగా పెరిగింది. అంతకుముందు రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలాలుండగా, విలీనం తరువాత చింతూరు, వీఆర్ పురం, కూనవరం, నెల్లిపాక మండలాలు వచ్చి చేరాయి. ఇవి గతంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. గతంలో ఏజెన్సీ విస్తీర్ణం 4,44,582 హెక్టార్లు కాగా, విలీన మండలాల చేరిక తరువాత 6,43,182 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఏజెన్సీ జనాభా 2,17,487 కాగా, విలీనానంతరం ఇది 3,52,487కు పెరిగింది. ఎన్నెన్నో అందాలు.. రంప జలపాతం రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్లే రహదారిని ఆనుకుని రంపచోడవరం సమీపాన ఈ జలపాతం ఉంది. బస్సుల ద్వారా రంపచోడవరం చేరుకుని అక్కడ నుంచి ఆటో, ఇతర వాహనాలపై పంచాయతీ కార్యాలయం వైపు నుంచి ఉన్న రంప రోడ్డులో రెండు కిలోమీటర్లు ప్రయాణించాలి. రంప కొండ దిగువన ఉన్న శివాలయం నుంచి కాలినడకన కిలోమీటరు వెళితే జలపాతం, శివాలయం ఉంటాయి. శివాలయం పక్కనుంచి అర కిలోమీటరు కొండ ఎక్కితే మరో పెద్ద జలపాతం దర్శనమిస్తుంది. జలతరంగణి భద్రాచలం రోడ్డులో మారేడుమిల్లికి ఏడు కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి ఉంది. ఇక్కడ సేద తీరేందుకు ఎకో టూరిజం హట్లు ఉన్నాయి. ఇక్కడినుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పాములేరు వాగు వస్తుంది. జంగిల్స్టార్ క్యాంప్ దట్టమైన అడవిలో గుడారాలు వేసుకుని రాత్రులు గడపాలనుకునే సాహస పర్యాటకులకు జంగిల్స్టార్ క్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాములేరు పక్కన లంక వంటి ప్రాంతంలో దీనిని నిర్మించారు. సుమారు 20 హట్లున్నాయి. రోజుకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ ఖర్చవుతుంది. 15 మంది 25 మంది వరకూ ఉంటారు. అక్కడ ఉన్న ఎకో టూరిజం సభ్యులు అడవిలో రాత్రి పూట సంచరించేందుకు పర్యాటకులకు సహాయపడతారు. భద్రాచలం రోడ్డులో మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో పాములేరును ఆనుకుని జంగిల్స్టార్ ఉంది. రాజమండ్రి, కాకినాడ నుంచి భద్రాచలం, ఎగువ సీలేరు వెళ్లే బస్సుల ద్వారా ఇక్కడకు చేరవచ్చు. మారేడుమిల్లి నుంచి ఆటోలు ఉంటాయి. అమృతధార మారేడుమిల్లి వద్ద పూర్తి అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతమిది. ఎత్తయిన కొండ పైనుంచి జాలువారుతూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులలో మారేడుమిల్లి చేరుకుని అక్కడ నుంచి ఆటోలను ప్రత్యేకంగా అద్దెకు తీసుకుని వెళ్లాలి. పొల్లూరు జలపాతం ఏజెన్సీలో అతిపెద్ద జలపాతమిది. పెద్దపెద్ద రాళ్ల మధ్య నుంచి ఉధృతంగా ఉరికే నీరు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బాహుబలి చిత్రంలో కనిపించే జలపాతంలా ఉంటుంది. చింతూరు నుంచి, మారేడుమిల్లి నుంచి ఎగువ సీలేరు, విశాఖ వెళ్లే బస్సులలో పొల్లూరు చేరుకోవాలి. అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పొల్లూరు జలపాతం ఉంది. వనదేవతలకు పుట్టినిల్లు గిరిజన దేవతలు, పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలకు మన్యం కేంద్రంగా నిలిచింది. దేవీపట్నం మండలం పోచమ్మగండి వద్ద ఉన్న పోచమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రంపచోడవరం మండలంలో బాపనమ్మ ఆలయాలు వనదేవతల నిలయాలుగా నిలుస్తున్నాయి. గంగాలమ్మ అమ్మవారి జాతరలు ఇక్కడ ఘనంగా సాగుతూంటాయి. రంపలోని శివాలయం, దేవీపట్నం ఉమా చోడేశ్వరస్వామి ఆలయాలు, విశ్వనాథుడు కొలువుదీరిన వై.రామవరం మండలం గురమంద ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అరుదైన జంతుజాతులు మన ఏజెన్సీలో పలు రకాల పక్షి, జంతుజాతులున్నాయి. పెద్దపులులు, చిరుతలు, నెమళ్లు, అడవి పందులు, లేళ్లు, కొండగొర్రెలు, కణుజులు, కొండచిలువలు ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక జాతికి చెందిన గొర్రగేదెల(బైసన్స్)కు ఈ ప్రాంతం ప్రత్యేకం. జలసిరులు మన ఏజెన్సీ అపార జలసిరికి ఆలవాలం. వీటివల్ల మైదాన ప్రాంతాలకు ఎక్కువగా మేలు జరుగుతోంది. ఏజెన్సీలో భూపతిపాలెం, సూరంపాలెం, మద్దిగెడ్డ, ముసురుమిల్లి, డొంకరాయి జలాశయాలున్నాయి. రాష్ర్ట విభజన తరువాత సీలేరు, శబరి పరీవాహక ప్రాంతాలు ఆంధ్రాలో విలీనం కావడం, ఇవన్నీ మన ఏజెన్సీ పరిధిలోకే రావడం.. ఇందువల్ల మైదాన ప్రాంతాలకు, ముఖ్యంగా గోదావరి డెల్టా రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. విద్యుత్ వెలుగులు ఏజెన్సీలోని పొల్లూరు, డొంకరాయి విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి వెలుగులనిస్తున్నాయి. పొల్లూరులో 460 మెగావాట్లు, డొంకరాయిలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వీటితోపాటు అడ్డతీగలలోని వేటమామిడి వద్ద మినీ హైడల్ ప్రాజెక్టులున్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలిసి బ్రిటిషర్లపై ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన చరిత్ర గిరిజనులకు ఉంది. పోలీసు స్టేషన్ల మీద దాడిచేసి తెల్లవారిని గడగడలాడించారు వీరు. -
ఆగని జోరు
జి.మాడుగుల పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న పాడేరు ఏఎస్పీ శశికుమార్రెడ్డి యథేచ్ఛగా గంజాయి రవాణా దాడులు జరుగుతున్నా జంకని స్మగ్లర్లు నెల రోజుల్లో 13 టన్నుల గంజాయి పట్టివేతఇక్కడ చెల్లించేది రూ. లక్షల్లో.. ఆర్జించేది కోట్లలో.. పాడేరు: ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. మన్యం నుంచి యథేచ్ఛగా గంజాయి రవాణా సాగుతోంది. జిల్లాలో రోజుకో చోట పోలీసులు గంజాయి రవాణాను పసిగట్టి అడ్డుకుంటున్నా గంజాయి రవాణా నిత్యకృత్యంగా మారింది. పోలీసుల నిఘా ఉన్నా లెక్క చేయకుండా గంజాయి రవాణాకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు. ఈ ఏడాది మన్యంలో పెద్ద ఎత్తున గంజాయి సాగైనట్లు తెలుస్తోంది. రెండు మాసాలుగా గంజాయి రవాణా సాగుతోంది. మన్యం నలుమూలల నుంచి గంజాయిని రవాణా చేస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి నిరాటంకంగా తరలిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పండిస్తున్న గంజాయిపై ఈ ఏడాది నియంత్రణ లేకపోవడంతో రవాణా జోరు ఎక్కువైంది. వాహన ప్రమాదాల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతోంది. మన్యం నుంచి జిల్లా కేంద్రానికి ఆటోలు మొదలుకొని కార్లు, వ్యాన్లు, లారీల్లో భారీగా గంజాయి రవాణా సాగిస్తున్నారు. మన్యం నుంచి విశాఖ జిల్లా కేంద్రానికి పలు దారుల్లో రాత్రి పగలు తేడా లేకుండా గంజాయి రవాణా జరుగుతోంది. జనవరి నెలలో పలుచోట్ల రవాణాలో పోలీసులకు సుమారు 13 వేల కిలోలు గంజాయి పట్టుబడింది. గొలుగొండ, దేవరాపల్లి, నర్సీపట్నం, పెదబయలు, వేపాడ, రావికమతం, చింతపల్లి, హుకుంపేట, గోపాలపట్నం, గుత్తులపుట్టు, అరకులోయ, గొలుగొండ, చింతపల్లి ప్రాంతాల్లో ఇటీవల పోలీసులు రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్నారు. జనవరి 22న విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో లారీలో భారీగా రవాణా అవుతున్న 3 వేల కిలోలు గంజాయిని, విజయవాడలో రవాణాకు సిద్ధం చేసి ఉంచిన మరో 700 కిలోల గంజాయిని 23న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం విజయవాడలో గంజాయి వ్యాపారంలో సూత్రధారిగా ఉన్న నార్ల వంశీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం జి.మాడుగుల మండలంలోని గెమ్మెలి ప్రాంతంలో రవాణాకు సిద్ధం చేసి ఉంచిన 2 వేల కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చోడవరం సమీపంలోని గాంధీగ్రామం వద్ద 480 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. గిరిజనుల అమాయకత్వమే ఆసరా మన్యంలో గిరిజనుల అమాయకత్వమే ఆసరాగా చేసుకున్న గంజాయి స్మగ్మర్లు కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్నారు. ఇక్కడ గిరిజనులతో సాగు చేయించి శీలవతి రకం కిలో రూ.2వేలకు గంజాయిని సిద్ధం చేసుకుని తమిళనాడు రాష్ట్రంలో రవాణ చేస్తూ కిలో గంజాయికి రూ.10వేల చొప్పున అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే మన్యంలో సాగు చేసే గంజాయి అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.20వేలకు అమ్ముడవుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. -
మన్యంలో మంచు దుప్పటి
దట్టంగా కురుస్తున్న పొగమంచుతో మన్యంవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటలు దాటినా మంచు దుప్పటి వీడకపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డల్లాపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మినుములూరు వద్ద 7 డిగ్రీలు, పాడేరులో 9 డిగ్రీలు నమోదయ్యాయి. -
చలి తీవ్రతకు మన్యం గజగజ
విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గడంతో చలి తీవ్రతకు గిరిజనం వణుకుతున్నారు. పాడేరు మండలం మినుములూరు కాఫీ పరిశోధన కేంద్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డల్లాపల్లిలో 3 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం పది గంటల వరకూ మంచుతెరలు వీడని పరిస్థితి నెలకొంది. దట్టంగా పొగమంచు పేరుకోవడంతో.. వాహనదారులు ఇబ్బందులకు గురైతున్నారు. -
మన్యంలో విస్తరిస్తున్న పైనాపిల్
తొలిసారిగా చేయూతనిస్తున్న ఉద్యాన శాఖ: 1200 ఎకరాల్లో సాగు చింతపల్లి: మన్యంలో పైనాపిల్ సాగు విస్తరిస్తోంది. ఈ పంటప్ల ఆసక్తి చూపే రైతులకు ఉద్యానశాఖ చేయూతనిస్తోంది. ఎకరాకు రూ.10, 500 ఆర్థిక సాయం చేస్తోంది. గతేడాది నాలుగు వందల ఎకరాల్లో ఈ పంటను చేపట్టిన గిరిజనులు, ఈ ఏడాది 800 ఎకరాల్లో చేపట్టారు. ఏజెన్సీ వాతావరణం పైనాపిల్ సాగుకు అత్యంత అనుకూలం. ప్రభుత్వపరంగా ప్రోత్సహం లేక ఇంతకాలం నామమాత్రంగా సాగుచేసేవారు. ఉద్యానశాఖ అన్ని రకాల పండ్ల తోటల పెంపకానికి సాయపడుతోంది. పైనాపిల్ సాగుకు ఆర్థికంగా సాయపడే అవకాశం లేక పోవడంతో, ఇంత కాలం రైతులు ఈ పంట పట్ల కు అంతగా ఆసక్తి కనబరచ లేదు. 2012-13లో ఉద్యానశాఖ ఏడీ ప్రభాకర్రావు, నాబార్డ్ బృందం చింతపల్లి మండలం తాజంగి ప్రాంతంలో పర్యటించి, పైనాపిల్ సాగు అవకాశాలపై అధ్యయనం చేసింది. సాగు అవకాశాలు మెండుగా ఉండడంతో ప్రణాళిక రూపొందించి, ఉద్యానశాఖ రాష్ట్ర కమిషనర్కు నివేదించింది. నాబార్డ్ సహాయంతో గిరిజన వికాస్ స్వచ్ఛంద సంస్థ ఇరవై గ్రామాల్లో 20 రైతు క్లబ్లు ఏర్పాటుచేసి పైనాపిల్ సాగువిధానం, ఎరువుల వినియోగం, సస్యరక్షణ, దిగుబడులు వంటి అంశాలపై స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో శిక్షణ ఇప్పించడంతో పాటు, ఇతర జిల్లాల్లో రైతులు సాగుచేస్తున్న తోటల వద్దకు తీసుకు వెళ్లి ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పైనాపిల్ సాగు ప్రణాళిక లను పరిశీలించిన రాష్ట్ర ఉద్యానశాఖ కమిషన్ ఆర్థిక సాయానికి ముందుకు వచ్చింది. ఎకరా భూమిలో పంట సాగుకు రూ.25 వేలు ఖర్చవుతుంది. పిలకలు, క్రిమి సంహారక మందులు కొనుగోలుకు, ఎకరాకు రూ.10,500లు చొప్పున, ఉచితంగా రెండేళ్ల పాటు ఆర్థిక సాయం చేస్తుంది. ఒక్కో రైతు పది ఎకరాల వరకు సాగు చేసుకునేందుకు సాయం అందిస్తుంది. ఈఏడాది అనంతగిరి మండలంలో 100 ఎకరాలు,చింతపల్లి మండలంలో700 ఎకరాల్లో పైనాపిల్ సాగు చేపట్టారు. ఇలా మన్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. సద్విని యోగం చేసుకోవాలి పైనాపిల్ సాగుకు తాము అందిస్తున్న సహాయాన్ని సద్విని యోగం చేసుకోవాలి. పకృతి వైపరీత్యాలకు వ్యవసాయ పంటలు దెబ్బ తింటున్నాయి. రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఉద్యాన పంటల సాగుకు ముందుకు రావాలి. - జి.ప్రభాకర్రావు, ఉద్యానశాఖ ఏడీ: అవగాహన కల్పిస్తున్నాం పైనాపిల్ సాగు పట్ల గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగు లాభదాయకంగా ఉంటుంది. అలవాటు పడే వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. తాజాగా మరి కొంత మంది రైతులకు అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు తీసుకు వెళ్లాము. మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషంగా ఉంది. - నెల్లూరి సత్యనారాయణ, కార్యదర్శి, గిరిజనవికాస్ స్వచ్ఛంద సంస్థ, జీకే వీధి -
మన్యంపై పట్టు కోసం...
సంచలనం కోసం మావోయిస్టులు... ఎదురుదాడే వ్యూహంగా పోలీసులు వేడెక్కుతున్న మన్యం డిసెంబర్ 2 నుంచి పీఎల్జీఏ వారోత్సవాలు {V>Ò$× ప్రాంతాల్లో పర్యటించొద్దు : {పజాప్రతినిధులకు పోలీసుల సూచన విశాఖపట్నం : మన్యం మరోసారి వేడెక్కుతోంది. 15వ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో అటు మావోయిస్టులు ఇటు పోలీసు బలగాలు ఏజెన్సీపై పట్టు కోసం వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 9వరకు పీఎల్జీఏ 15వ వారోత్సవాలు నిర్వహించనున్నారు. 2001-03 మాదిరిగా పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా సంచలనం సృష్టించేందుకు మావోయిస్టులు సిద్ధపడుతున్నారన్న సమాచారం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఛత్తీస్గఢ్ నుంచి గుత్తికోయలలను అడ్డంపెట్టుకుని యాక్షన్ బృందాలు మన్యంలోకి ప్రవేశించాయన్న సమాచారం కొంత కలవరపరుస్తోంది. దాంతో ఎదురదాడే సరైన వ్యూహమని పోలీసు ఉన్నతాధికారులు కార్యాచరణకు సంసిద్ధమవుతున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ త్రిముఖ వ్యూహానికి తెరతీశారు. మన్యంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నందున మైదాన ప్రాంతాల్లో కూడా పర్యటించవద్దని ప్రజాప్రతినిధులకు సూచిస్తుండటం గమనార్హం. మూడంచెల వ్యూహంతో పోలీసులు.. ఏదైనా సంచలనం కోసం మావోయిస్టులు సిద్ధపడేలోగా తామే ఎదురుదాడి చేయాలన్నది పోలీసుల వ్యూహంగా ఉంది. అందుకోసం గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా ఏజెన్సీలో మొహరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3వేల మందిని ఏజెన్సీలోకి దింపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు మరికొన్ని బలగాలను కూడా ఏజెన్సీలోకి పంపించాలని భావిస్తున్నారు. మావోయిస్టు కీలక నేతలు, యాక్షన్ బృందాలు ఉండొచ్చని భావిస్తున్న జెర్రెల, కన్నవరం, గన్నవరం, కోరుకొండ, బలపం, సీలేరు తదితర కీలక ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఖమ్మం, తూర్పుగోదావరి, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా గ్రేహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్నాయి. గుత్తికోయలను అడ్డుపెట్టుకుని మావోయిస్టులు చొచ్చుకురాకుండా కట్టడిచేయాలన్నది పోలీసుల వ్యూహంగా ఉంది. మరోవైపు ఏపీఎస్పీ బలగాలు ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో మొహరించాయి. మావోయిస్టులు మెరుపుదాడులు చేస్తే ఎదుర్కొనేందుకు పోలీస్స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను వినియోగిస్తున్నారు. సంచలనం సృష్టిస్తారా!? పీఏల్జీఏ వారోత్సవాలను పురష్కరించుకుని ఉనికి చాటేందుకు మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. 2001 - 03 మధ్యకాలంలో పీఎల్జీఏ వారోత్సవాల్లో మావోయిస్టులు విరుచుకుపడిన సంఘటనలను పోలీసులు ప్రస్తావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి గుత్తికోయలలను అడ్డంపెట్టుకుని యాక్షన్ బృందాలు ఏజెన్సీలోకి ప్రవేశించాయని ఉన్నతాధికారులే అంగీకరించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. బాక్సైట్ తవ్వకాలను మావోయిస్టులు వ్యతిరేకిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రత కల్పించలేం.. పర్యటనలు వద్దు - ప్రజాప్రతినిధులకు పోలీసుల సూచన బలగాలు మొత్తం మన్యంలో మోహరించడంతో మైదాన ప్రాంతాల్లో భద్రతపై పోలీసు అధికారులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మావోయిస్టులు ఏదైనా సంచలనానికి పాల్పడే అవకాశం ఉందని కూడా సందేహిస్తున్నారు. కాబట్టి పీఏజీఏ వారోత్సవాలు ముగిసేంతవరకు మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనపై అనధికారికంగా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఎవ్వరూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటించవద్దని సూచించారు. వీలైనంతవరకు జిల్లా కేంద్రానికే పరిమితం కావాలని చెప్పారు. ఈమేరకు ఓ పోలీసు ఉన్నతాధికారే స్వయంగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిస్థితి తీవ్రతను స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
మన్యంలో చలిగాలులు
-
మన్యంలో చలిగాలులు
వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతం లంబసింగిలో 9 డిగ్రీలు వృద్ధులు, చిన్నారులు విలవిల పాడేరు/చింతపల్లి: మన్యంలో చలిగాలులు వీస్తున్నాయి. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతల గాలులతో రెండు రోజులుగా చలితీవ్రత పెరిగింది. ఆదివారం పాడేరులో 13 డిగ్రీలు, మోదాపల్లిలో 10 డిగ్రీలు, చింతపల్లిలో 12 డిగ్రీలు, లంబసింగిలో 9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా కాఫీ తోటలు ఉండే మోదాపల్లి, మినుములూరు, అరకు, అనంతగిరి, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో పగలు కూడా చలి వణికిస్తోంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలు వరకు మంచు తెరలు వీడడం లేదు. సాయంత్రం 5 నుంచే ఆదివాసీలు ఇళ్లకు పరిమితమవుతున్నారు. రాత్రిళ్లు నెగడులను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో ఏటా నవంబర్ నుంచి చలి ముదురుతుంది. పది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చలితీవ్రత పెరిగింది. ఆదివారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్ని దుస్తులకు డిమాండ్ ఏర్పడింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. -
మన్యం పరిస్థితిపై ఆరా
అల్లిపురం: సీఆర్పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఎం.విష్ణువర్ధనరావు, ఒడి శా ఐజీ పియూష్ ఆనంద్లు శుక్రవారం మన్యంలో పర్యటించి ఏరియల్ సర్వే చేపట్టినట్లు తెలిసింది. ముంచంగిపుట్టులో పాఠశాల విద్యార్థులతో మాట్లాడాక సీఆర్పీఎఫ్ శిబిరాలను సందర్శించారు. బాక్సైట్ తవ్వకాలపై ఏపీఎండీసీకీ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఐజీల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏజెన్సీ పర్యటన ముగించుకొని నగరానికి చేరుకున్న వారిని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు సమాచారం. ఈ సందర్బంగా మన్యంలో తాజా పరిస్థితిపై సమీక్షించినట్లు తెలిసింది. -
నాకు నువ్వు.. నీకు నేను
విద్యార్థుల క్షవరాల నిధులు గోల్మాల్ పాడేరు: మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ కంటింగ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు వార్డెన్స్ కైంకర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు నాకు నువ్వు.. నీకు నేను అన్న చందంగా ఒకరినొకరు హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నారు. మన్యంలోని 11 మండలాల్లో 66 గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలు, 11 బాలుర వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 22 వేలు మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరి ఒక్కొక్కరికి నెలకు హెయిర్ కంటింగ్ కోసం ప్రభుత్వం రూ. 12లు అందిస్తోంది. ఏడాదిలో రెండు, మూడు పర్యాయలు నిధులు విడుదల చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా. ఈ నిధులతో ఏ ఒక్క ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కంటింగ్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యార్థులే సొంత డబ్బులతో హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. సెలవులకు ఇళ్లకు వె ళ్లినప్పుడు ఇంటి వద్ద కంటింగ్ చేసుకుని వస్తున్నామని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే ఒకరినొక రు హెయిర్ కంటింగ్ చేసుకుంటూ కనిపించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు హెయిర్ కంటింగ్ ఛార్జీలు అమలు చేస్తున్నారు. గిరిజన ఆశ్రమాలు వద్దకు వచ్చే సరికి ఈ నిధులు వార్డెన్లు జేబుల్లో వేసుకుంటున్నారనేది తేటతెల్లం అవుతోంది. -
మాఫియాపై ఉక్కుపాదం
- గంజాయి స్మగ్లర్లు, మధ్యవర్తుల గుర్తింపునకు ఆరా - లావాదేవీల ముసుగులో నకిలీ కరెన్సీ చెలామణి పాడేరు/పెదబయలు: మన్యంలో గంజాయి మాఫియాపై పోలీసుశాఖ దృష్టి పెట్టింది. వివిధ మార్గాల్లో గమ్మత్తుగా తరలిపోతున్న దీని నియంత్రణకు నిఘా పెంచింది. జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఏవోబీతోపాటు మారుమూల గ్రామాల్లో సాగు విస్తరించి గంజాయి గుప్పుమంటోంది. పెదబయలు, ముంచంగిపుట్టు, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కొరవడి కొండలన్నీ గంజాయి వనాలుగా మారిపోయాయి. గంజాయి స్మగ్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గతంలో రోలుగుంట ఎస్ఐ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. గంజాయి దారిమళ్లింపు కేసులో నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్, ఎస్ఐ బదలీ విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు అరకులోయ మీదుగా దీని రవాణా ఎక్కువైంది.రోజుకి రెండు మూడు కేసులు నమోదవుతున్నాయి. గత నెల రోజుల్లో 40 కేసుల వరకు నమోదయ్యాయి. జూలై, ఆగస్టుల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. కోతల అనంతరం ఎండుగంజాయి ఏడాది పొడవునా మన్యం నుంచి రవాణా అవుతుంది. దీని తరలింపులో గంజాయి స్మగ్లర్లతోపాటు మధ్యవర్తులదీ కీలకపాత్రగా ఉంటోంది. పోలీసుల దాడులు, కేసులు ముమ్మరంతో రవాణాకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. గంజాయి రవాణాకు యువతను వినియోగిస్తున్నారు. టూరిస్టుల ముసుగులోనూ, ఫ్యామిలీ టూర్ మాదిరిగా తరలిస్తున్నారు. విద్యార్థులు, డ్రైవర్లను దీని ఉచ్చులోకి లాగుతున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణాను ప్రోత్సహిస్తూ తెరవెనుక ఉండి కీలకంగా వ్యవహరిస్తున్న మధ్యవర్తులపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే గంజాయి లావాదేవీల్లో నకిలీ కరెన్సీ చెలామణి, మావోయిస్టులకు ఆయుధాల పంపిణీ వంటి సంఘటనలు వెలుగు చూడటంతో పోలీసులు ఈ దిశగానూ నిఘా పెట్టారు. పెరిగిన పంట విస్తీర్ణం గతేడాది కంటే దీని సాగు విస్తీర్ణం ఈ ఏడాది బాగా పెరిగింది. తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చిన స్మగ్లర్లు దగ్గరుండి ఈ పంటకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు గిరిజన రైతులకు సరఫరా చేస్తున్నారు. మన్యంలోని వారపు సంతల్లోనూ వీటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది పోలీసు, ఎక్సైజ్ అధికారులకు పట్టడం లేదు. లాభసాటి పంట కావడంతో మన్యంలోని యువత కూ డా దీని సాగుపైనే దృష్టి పెడుతున్నారు. సాగును నియంత్రిస్తాం ఏజెన్సీలో గంజాయి సాగు నియంత్రణపై దృష్టిపెట్టాం. గతేడాది 100 ఎకరాల వరకు గంజాయి తోటలను ధ్వంసం చేశాం. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్మగ్లర్లు సాగును ప్రోత్సహిస్తున్నారు. స్మగ్లర్ల నుంచి డబ్బు తెచ్చి గిరిజనులకు ఇస్తున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగుప్రాంతాలను జియోలాజికల్ సర్వేతో గుర్తిస్తున్నాం. గిరిజన రైతులను కాఫీ, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించి గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. సాగు, రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న మధ్యవర్తుల ఆట కట్టించడంపై దృష్టి పెడుతున్నాం. - అట్టాడ బాబూజీ, ఏఎస్పీ, పాడేరు. -
తెర..చిరిగింది
మన్యంలో పంపిణీకాని దోమ తెరలు దృష్టి సారించని సర్కారు మలేరియాతో ఆదివాసీలు సతమతం పాడేరు: మన్యంలో గిరిజనులకు పంపిణీ చేసిన దోమ తెరల కాలం చెల్లింది. ప్రస్తుతం ఆదివాసీలకు ఇవి అందుబాటులో లేవు. గ్రామాలలో దోమల బెడద ఎక్కువైంది. ఏజెన్సీ అంతటా మలేరియా ప్రబలుతోంది. ఏటా ఎపిడమిక్లో ఆదివాసీలు మలేరియాతో సతమతం కావడం సాధారణం. ఈ మహమ్మారి తీవ్రత దృష్ట్యా 2011-12లో 3,566 గ్రామాలలో 1,17,806 కుటుంబాలకు 3 లక్షల 866 దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దోమల నివారణకు దోహదపడేలా సింథటిక్ పెరిథ్రిన్ మందు పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన దోమ తెరలను ఉగాండా దేశం నుంచి తెప్పించారు. 3 నుంచి 5గురు సభ్యులు ఉన్న ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున, ఆరుగురు పైబడిఉన్న కుటుంబాలకు 3 చొప్పున అందజేశారు. వీటి వల్ల ఏజెన్సీలో మలేరియా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. వీటి వినియోగకాలం రెండేళ్లే. అంటే 2013-14లో వీటిని మళ్లీ పంపిణీ చేయాలి. ఈమేరకు దోమ తెరల కోసం అధికారులు ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏజెన్సీలో ఏటా ఏప్రిల్ నుంచి నవంబరు వరకు మలేరియా విజృంభిస్తుంటుంది. ఈ కాలంలో ఇక్కడి వారికి దోమ తెరల వినియోగం తప్పనిసరి. నిద్రించే సమయంలో దోమలు కుట్టడం వల్లే మలేరియా ప్రబలుతున్నట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. దోమల నివారణకు గ్రామాల్లో ఆల్ఫాసైనో మైథీన్(మలేరియా నివారణ మందు)ను పిచికారీ చేస్తున్నప్పటికీ మలేరియా అదుపులోకి రావడం లేదు. ఈ ఏడాది రెండు విడతలుగా హైరిస్క్ గ్రామాలు (2,550)లో స్ప్రేయింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వ్యాధి తగ్గుముఖం పట్టే చాయలు లేవు. ఇప్పటికే ఏజెన్సీలో 5వేలకు పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనాఫిలస్ దోమ కారణంగా ఫాల్సీఫారం మలేరియా ప్రబలుతోంది. ఇది సెరిబ్రెల్కు దారి తీసి మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దీని నివారణకు దోమ తెరల పంపిణీయే శ్రేయస్కరమని వైద్య నిపుణుల బృందం అధ్యయనం ద్వారా తేలింది. అయితే వీటి పంపిణీ ఒక్కసారికే పరిమితమైంది. పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న గిరిజనులు మలేరియా జ్వరాలతో మృత్యువాత పడుతున్నారు. -
మన్యంలో రోడ్లకు ప్రాధాన్యం
పాడేరు: ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.విద్యాసాగర్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శనివారం ఆయన గిరిజన సంక్షేమ విద్య, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ, మలేరియాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మన్యంలో చేపట్ట వలసిన రహదార్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. రక్షిత తాగునీటి కల్పన లక్ష్యంగా పథకాలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. రోడ్లు, రక్షిత మంచినీటి సౌకర్యాలు కల్పిస్తే వ్యాధులు గిరిజనుల దరి చేరవని, తాగునీటి కల్పనకు ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి అదనపు నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజనాభివృద్ధికి నిధులు కొరత లేదని, ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 5.5 శాతం నిధులను గిరిజన సంక్షేమానికి కేటాయించాలని సూచించారు. సాధారణ నిధుల మంజూరులో పని చేస్తున్న సిబ్బందినే పీఎస్పీ నిధుల వినియోగానికి పని చేయించాలని, అదనపు సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు. -
మన్యంలో మహమ్మారి
జనాన్ని మింగుతున్న సికిల్ సెల్ అనీమియా బి.గణేష్ బాబు, ‘సాక్షి’ ప్రతినిధి మన్యాన్ని ఓ మహమ్మారి మింగేస్తోంది. ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈ వ్యాధి బారినపడి చనిపోతున్నారు. మన్యాన్ని వణికిస్తున్న ఆ జబ్బు పేరు ‘సికిల్ సెల్ అనీమియా’. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈ రక్తహీనత జబ్బుకు ఇంతవరకు మందులు లేవు. అసలు ఏజెన్సీలో ఎంతమందికి ఈ జబ్బు ఉంది? ఎందరు మరణించారు? లాంటి ప్రాథమికమైన గణాంకాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని గణాంక విభాగంలో ‘సికిల్ సెల్ అనీమియా’ రోగులు వివరాలను అడిగితే.. అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటని? అక్కడి సిబ్బంది ఎదురు ప్రశ్నించారు. గుజరాత్తో సహా పలు రాష్ట్రాల్లో ఈ జబ్బు అదుపునకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘సికిల్ సెల్ అనీమియా’పై ఎలాంటి చర్యలూ తీసుకోని రాష్ట్రం ఏపీ ఒక్కటేనంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో దాదాపు 10 లక్షల గిరిజన జనాభా ఉంది. ఇందులో కనీ సం పది శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి. ఈ వ్యా దికి గురై మరణించేవారి సంఖ్య ఏటా పెరుగుతూ పోతోంది. యూనివర్సిటీ స్థాయిలో ‘హ్యూమన్ జెనెటిక్స్’ విభాగం వారు జరిపిన పలు శాంపిల్ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివశిస్తున్న గిరిజనేతర కులాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటం మరింత ఆందోళన కలిగించే విషయం. నిర్లక్ష్యానికి పరాకాష్ట: పాడేరు పరిసర ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా రోగుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. ఎత్తయిన ప్రాంతం (3,600 అడుగులు) కావడం వల్ల ఈ ప్రాంతంలో ఆక్సిజన్ లభ్యతలో తేడాలుంటాయి. రోగులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రెండు నెలల క్రితం రక్తం నిలువచేసే రిఫ్రిజరేటర్ చెడిపోయింది. బాగు చేయించడానికి రూ.20 వేలకన్నా ఎక్కువ ఖర్చుకాదు. అయినా పట్టించుకున్న నాధుడే లేడు. ఈ రోగానికి మందులు లేవు. సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడమే మార్గం. పరీక్ష ఖరీదు పది రూపాయలే: జబ్బు నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు రూ.10లోపే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా? అని తెలుస్తుంది. ఈ ప్రాథమిక పరీక్షను ‘ప్రైమరీ హెల్త్ సెంటర్ల’(పీహెచ్సీ) స్థాయిలోనే జరపవచ్చు. విశాఖ జిల్లాలో సికిల్ సెల్ అనీమియా ఎక్కువగా ఉన్న పాడేరు, అరకు పరిధిలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపడం లేదు. రోగులు మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్ సెల్ అనీమియా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది. కొడుకు చనిపోయాడు.. కుమార్తెకూ వ్యాధి ఝాన్సీరాణి, క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఝాన్సీరాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. క్రాంతిరాజు గిరిజన కార్పొరేషన్లో సేల్స్మన్. మూడేళ్ల క్రితం 9వ తరగతి చదువుతున్న కొడుకు సురేష్కు విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్లు ‘సికిల్ సెల్ అనీమియా’ అన్నారు. అన్ని రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013 సెప్టెంబర్లో చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే విధమైన జబ్బు వచ్చింది. కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంపతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఇది వీరి ఒక్కరి సమస్యే కాదు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గూడెంలోను వందలాది కుటుం బాలు ఇలాంటి వ్యథను అనుభవిస్తున్నాయి. -
మన్యంలో మరణమృగందం
-
మన్యంపై గంజాయి పడగ
పాడేరు : ఈ ఏడాది కూడా మన్యంలో భారీగా గంజాయి సాగు చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా సహా విశాఖ జిల్లా మైదాన ప్రాంతాలకు చెందిన గంజాయి వ్యాపారులు మన్యంలో తిష్ట వేశారు. గంజాయి సాగును ప్రోత్సహించేం దుకు కుగ్రామాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో వ్యాపారులు మారుమూల గిరిజనులతో చర్చలు జరుపుతున్నారు. యథేచ్ఛగా రవాణా గత ఏడాది కూడా భారీస్థాయిలో గంజాయి సాగు చేసి రూ.కోట్లలో వ్యాపారం చేశారు. జిల్లావ్యాప్తంగా గంజాయి రవాణాపై పోలీసు దాడులు జరిగినా వేర్వేరు మార్గాల్లో తమిళనాడు, కేరళ, గోవా, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించారు. కొన్నిసార్లు పట్టుబడినా అధిక శాతం సరకును తమ ప్రాంతాలకు సులభంగానే తరలించారు. చివరకు ఆయిల్ ట్యాంకర్లను కూడా అనుకూలంగా మార్చుకున్నారు. కూలీల సాయంతో అడవి మార్గాల్లో గంజాయిని మోయించి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారుల ముఠా సభ్యులు పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాల్లోనూ ఉన్నారు. వ్యాపారం బాగా కలిసి రావడంతో భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేయిస్తున్నారు. వారం రోజులుగా గంజాయి వ్యాపారుల సంచారం అధికమైంది. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండల కేంద్రాల్లో కూడా మకాం వేసి సాగును ప్రోత్సహిస్తున్నారు. పాడేరుకు చెందిన కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా సాగులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటా భారీస్థాయిలో సాగు చేస్తున్నా తోటల ధ్వంసానికి పోలీసు, ఎక్సయిజ్ శాఖలు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్న రెవెన్యూ, అటవీ శాఖలు గంజాయి నిర్మూలన బాధ్యత ఎక్సయిజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖలదే. ఏజెన్సీలో కాస్తోకూస్తో ఎక్సయిజ్, పోలీసుశాఖలే దాడులు జరుపుతున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బందికి ఎక్కడ సాగవుతోందో తెలిసినా కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు అన్ని శాఖలను సమన్వయపరచాలని, మాఫియా అక్రమాలను నిరోధించాలని గిరిజనులు కోరుతున్నారు. -
భయంతో వణుకుతున్న మన్యం
ఒక వైపు మావోయిస్టుల విధ్వంసాలు మరోవైపు పోలీసుల కూంబింగ్లు కొయ్యూరు,. న్యూస్లైన్ : గిరిజన పల్లెలు భయంతో వణుకుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఉంది వారి పరిస్థితి. ఓ వైపు మావోయిస్టులు వరుస విధ్వంసాలకు తెగబడుతుండగా మరో వైపు పోలీసులు కూంబింగ్లతో హడలెత్తిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని ఓ వైపు మావోయిస్టులు పిలుపునిస్తుండగా ఎన్నికలను పక్కా గా నిర్వహించాలని పోలీసు లు ప్రతినబూనారు. దీంతో ఇరువర్గాల నడుమా గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వారం కిందట బూదరాళ్ల పంచాయతీలో ముకుడుపల్లి, కిండంగి గ్రామాలకు చెందిన 21 మంది మిలీషియా సభ్యులు జిల్లా రూరల్ ఎస్సీ దుగ్గల్ ఎదుట లొంగిపోయారు. మరో ఐదుగురిని అరెస్టు చేశారు. కొన్ని గ్రామాలను పోలీసులు చుట్టుముట్టి గిరిజనులను తీసుకుపోవడంతో వారి బంధువులు మండల కేంద్రానికి వచ్చి నేతలను కలుస్తున్నారు. అయితే పోలీసులు వద్ద ఉన్న సమాచారం మేరకు గిరిజనులను తీసుకెళ్లి విచారిస్తున్నారు. వారు సానుభూతిపరులు అని తేలితే అరెస్టు చేస్తున్నారు. మావోయిస్టులు ఇటీవల విధ్వంసాలకు పాల్పడడంతో పోలీసులు వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేం దుకు అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే వాటిని ఉపసంహరించుకోవాలంటూ గిరిజనులు ర్యాలీలు,ఆందోళనలు చేస్తున్నారు. పోలీసు అధికారులు మాత్రం ఆ ర్యాలీల వెనక మావోయిస్టుల హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారు. ఎక్కువమందిపై బైండోవర్లు..? : 2009 ఎన్నికల్లో మారుమూల ప్రాంతాలకు సంబంధించి ఎవరికైతే మావోయిస్టులతో సంబంధాలున్నాయని కేసులు పెట్టారో అలాంటి వారిపై తిరిగి బైండోవర్లు చేసే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న బూదరాళ్ల,పలకజీడి, పెదలంక కొత్తూరు, ఎం.బీమవరం లాంటి చోట్ల ఎన్నికలు నిర్వహించడం కష్టంగా నే ఉంటుంది. అధికారులు కొన్ని చోట్లకు నడిచి వెళ్ల్లాలి. పోలింగ్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడతారు. దీంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించకుండా ఉండేం దుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. -
మన్యంలో పులుల ఉనికిపై సందేహాలు
కొయ్యూరు, న్యూస్లైన్: నేటి నుంచి పులుల జాడ తెలుసుకోవడానికి అటవీ శాఖ సర్వే నిర్వహిస్తుంది. డిసెంబర్లో జరగాల్సిన దీనిని జనవరికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. విస్తృత సర్వే శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మన్యంలో పులుల సంచారంపై గిరిజనుల నుంచి వివరాలు సేకరిస్తారు. వాటి అడుగుజాడలు గుర్తిస్తారు. నర్సీపట్నం, పాడేరు అటవీ డివిజన్లలో వాటిని పరిశీలిస్తారు. ఈనెల 25 వరకు దీనిని చేపడతారు. ఏం చేస్తారు? పులుల గణనలో భాగంగా అటవీ శాఖ కొన్ని చెట్ల మధ్య తుప్పలు నరికించింది. బాటలు శుభ్రం చేయిం చింది. మట్టిలో అడుగుల జాడ గుర్తించడానికి ఏర్పా ట్లు చేస్తోంది. అటవీ అధికారులు ప్రతి బీట్లో కూడా విధిగా తుప్పలు నరికించారు. చెట్ల వద్ద శుభ్రం చేయిం చారు. ఆ ప్రాంతంలో పులులు నడిస్తే వాటి అడుగులు గుర్తించేట్టు ఏర్పాట్లు చేశారు. తర్వాత ఒకో బీట్లో రోజుకు ఐదు కిలోమీటర్ల వంతున అటవీ శాఖ అధికారులు తిరిగి పులుల జాడ గుర్తిస్తారు.అలా మూడు రోజుల పాటు తిరుగుతారు. ఆనవాళ్లు చూస్తారు. అదే సమయంలో కనిపించిన గిరిజనులను కూడా అడుగుతారు. వారి నుంచి వివరాలు తీసుకుని విశ్లేషిస్తారు. జాతీయ పులుల సంరక్షణ కేంద్రం సహకారం పులుల గణనపై జరిగే సర్వేకు జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ) సహకారం అందిస్తుంది. కొన్ని సాంకెతిక వివరాలను అందజేస్తుంది.వాటి ఆధారంగా పులులను గుర్తిస్తారు. సాధారణంగా ఇన్ఫ్రా రెడ్ కెమేరాలను అమర్చాలి కానీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉంచేందుకు అటవీ శాఖ అధికారులు సంశయిస్తున్నారు. గతంలో మంప సమీపంలోని పులి నూతలలో రెండు పులులు సంచరించినట్టు గిరిజనులు అటవీ అధికారులకు చెప్పారు. కానీ ఇప్పుడు వాటి జాడ కూడా అనుమానమేనని అంటున్నారు. ఆ విష యం త్వరలో తేలుతుంది. -
మళ్లీ పట్టుకు మావోయిస్టుల ఎత్తు
నర్సీపట్నంరూరల్, న్యూస్లైన్: విశాఖ మన్యం లో మునుపటి ఆధిపత్యాన్ని మళ్లీ దక్కించుకోవాలని ఆరాటపడుతున్న మావోయిస్టులు ఆ దశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గిరిజనులకు మరింతగా సన్నిహితం కావడానికి వ్యూ హం రూపొందిస్తున్నారు. ఏవోబీలో ఒడిశా ప్రాంతం కన్నా విశాఖ ఏజెన్సీ మావోయిస్టులకు సురక్షితమైనదిగా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ యువత రిక్రూట్మెంట్ కూడా అధికంగా ఉండేది. గిరిజన గ్రామాల్లో ఖాళీగా ఉండే యువకులను ఆకట్టుకుని వారికి శిక్షణ ఇచ్చి ముందు మిలీషియా సభ్యులుగా, తర్వాత పూర్తి స్థాయి దళ సభ్యులుగా చేర్చుకు నే వారు. ఆవిధంగా తమ కార్యకలాపాలు సులువుగా సాగించుకునేవారు. అయితే ఇటీవ ల కాలంలో గిరిజన యువతకు దగ్గరయ్యేం దుకు పోలీసులు చేపడుతున్న కార్యకలాపాల తో మావోయిస్టులకు చుక్కెదురవుతోంది. దాంతో గ్రామాల్లో సామాజిక కార్యకలాపాల పై వారు దృష్టి పెడుతున్నారు. అపరాల సీజన్పై దృష్టి ఏజన్సీలో కీలకమైన అపరాల సీజన్ను అవకాశంగా చేసుకొని మావోయిస్టులు తమ ప్రాబ ల్యం పెంచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నా రు. గిరిజనులు ఏడాది పొడవునా జీవనానికి అవసరమయ్యే ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అపరాల వ్యాపారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అపరాల వ్యాపారం ఊపందుకోవడంతో గిరిరైతులకు మేలు చేయడం ద్వారా తమ పట్టు నిలబెట్టుకోవాలని మావోయిస్టులు యత్నిస్తున్నారు. అపరాలకు గిట్టుబాటు ధర ఇప్పించి, ఏళ్ల తరబడి నిలిచిపోయి న బకాయిలు వసూలుకు కృషి చేసి గిరిజనుల ఆదరణ పొందాలని ఆరాటపడుతున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు సేకరిస్తూ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. వ్యాపారులపై ఒత్తిడి గిరిజనులకు బకాయిలు చెల్లించేలా మావోయిస్టులు అప్పుడే ఒత్తిళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల ఆరున గూడెం కొత్తవీధి మండలం దారకొండలో ఓ వ్యాపారి భార్యను, మంగళవారం మరో అపరాల వ్యాపారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. దారకొండకు చెందిన వ్యాపారి చేత రైతులకు బకాయి చెల్లింపజేసి అతని భార్యను చెర నుంచి విడిచి పెట్టినట్టు తెలిసిం ది. అలాగే గిరిజనులకు బకాయి పడ్డ మొత్తా న్ని చెల్లిస్తేనే వ్యాపారిని విడిచిపెడతామని చెప్పిన మావోయిస్టులు ప్రజాకోర్టులో విచారిం చి అతనిని విడిచిపెట్టినట్లు తెలిసింది. గతంలో గిరిజనుల మద్దతు కూడగట్టుకోవడానికి మా వోలు ఇదేఎత్తుగడ అనుసరించారు. ఇప్పుడూ అదే బాటలో యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
మన్యంపై మంచు దుప్పటి
సాక్షి నెట్వర్క్: విశాఖ ఏజెన్సీ వాసులు చలి గుప్పిట చిక్కి వణికిపోతున్నారు. ఇక్కడ పలు ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా తాండూరులోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ మన్యంలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ రెండో వారం నుంచే చలి తీవ్రత అధికమవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటికే పరిమితమవుతున్నారు. ఆదివారం పాడేరుఘాట్లోని మోదమాంబ పాదాలు వద్ద 1 డిగ్రీ, లంబసింగిలో 2 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 4 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో కాఫీతోటల్లో పనులకెళ్లే కార్మికులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. గతేడాది జనవరిలో ఈ ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఈ సారి డిసెంబర్లోనే ఆ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం అయితే కానీ, సూర్యుడి వెలుగులు కనిపించడం లేదు. మొత్తానికి మన్యంపై మంచు దుప్పటి పరచుకుంది. చీకటి పడితే బయటకు రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఏజెన్సీకి వస్తున్న పర్యాటకులు కూడా చలికి తట్టుకోలేక మైదాన ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా తాండూరులో కూడా చలి వణికిస్తోంది. ఈనెల 9న 5.5 డిగ్రీలు, 10న 6.7, 11న 5.6, డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఆదివారం ఇది 8.5 డిగ్రీలుగా ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు కురుస్తుండడంతో ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కొండకోనల్లో గుబులు
మావోయిస్టుల పీఎల్ జీఏ వారోత్సవాలకు వారం ముందు నుంచే మన్యంలో భయం కమ్ముకుంది. ఇప్పటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే మళ్లీ హింసకు, దాడులకు తలపడేట్టు కనిపిస్తోంది. ఓవైపు ఒత్తిడి ఉన్నా మావోయిస్టులు గ్రామాల్లో విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తే వారోత్సవాలను యథాతథంగా నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా అంతే దీక్షతో ఉన్నారు. మావోయిస్టులకు ఎలాగైనా చెక్ చెప్పాలన్న లక్ష్యంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొయ్యూరు/ చింతపల్లి, న్యూస్లైన్: మావోయిస్టులు ఏటా నిర్వహించే ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) వారోత్సవాలు చేరువవుతున్న కొద్దీ మన్యం లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉండడంతో మన్యంలో రాజకీయ నాయకులు, ప్రత్యేకించి పాలక పక్ష ప్రతినిధులు ఉలిక్కి పడుతున్నారు. మావోయిస్టుల జోరుకు పగ్గాలు వేయడానికి పోలీసులు కూడా విస్తృత ప్రయత్నాలు ప్రారంభించారు. అడవుల్లో కూంబింగ్ ఉధృతం చేశా రు. అదనపు బలగాలను అధికారులు మొహరిస్తున్నారు. 13వ పీఎల్జీఏ వారోత్సవాలు డి సెంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల ఏక్షన్ టీమ్లు రంగంలోకి వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందడంతో అనూహ్య పరిణామాలు జరగకుండా ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్న నేతలను, సర్పంచ్లను, వారి హిట్ లిస్టులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెబుతున్నారు. నాయకులను అప్రమత్తం చేయాలని మావోయిస్టు ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులను ఎస్పీ ఆదేశించారు. దీంతో ముప్పు ఉన్న నాయకులు మైదాన ప్రాంతాల కు తరలి వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. హింసే లక్ష్యం మన్యంలో తమ ఉనికి చాటుకోవడానికి, మావోయిస్టులు హింసామార్గాన్ని ఎన్నుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈనెల 20 వరకు నిరసన దినాలు పాటించాలని గతంలో పిలుపు ఇచ్చిన మావోయిస్టులు, ఓవంక పోలీ సుల కూంబింగ్ సాగుతూ ఉండగానే రక్తం చిందించారు. ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్న వారిపై గురిపెట్టారు. రెండు నెలల వ్యవధిలో ముగ్గురిని చంపారు. వారోత్సవాల్లో కూడా ఇదే పరి స్థితి పునరావృతమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే మావోయిస్టుల జోరు కు పగ్గాలు వేయడానికి విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను గ్రామాలకు తరలిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళన పీఎల్జీఏ వారోత్సవాలతో కాంగ్రెస్ నే తలు కలవరపడుతున్నారు. పోలీసు యం త్రాంగం హెచ్చరికలతో వారంతా మండల కేంద్రాలకే పరిమితమవుతున్నారు. మారుమూల గ్రామాల్లో పర్యటనలు కూడా రద్దు చేసుకున్నారు. చింతపల్లి, జీకే వీధి, జి.మాడుగుల,పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేత లు వారోత్సవాలు ముగిసే వరకు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నట్టు తె లుస్తోంది. విస్తృతంగా సమావేశాలు ఇటీవల కాలంలో మావోయిస్టులు మారుమూల ప్రాంతాల్లో అధికంగా సంచరిస్తూ గ్రామాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మిలీషియా సభ్యులు కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను వ్యాపింపజేస్తున్నారు. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం అధికంగా ఉందని సమాచారం అందడంతో పోలీసులు కూడా అందుకు తగ్గట్టు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే పోలీసులు గాలిస్తున్నా మావోయిస్టులు ఏదో ఒక చోట కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో కొత్త వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి కార్యకలాపాలు ఉధృతంగా నిర్వహిస్తున్నారని, చత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చిన మావోయిస్టు నేతలు వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. కిల్లంకోట పంచాయతీలో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించిన సమయంలో ఛత్తీస్గఢ్కు చెందిన గుత్తి కోయల గిరిజనులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారోత్సవాలను అడ్డుకుంటాం ఏజెన్సీలోని మా వోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంది. ఏజెన్సీలో, ఎవోబీలో గాలింపు చర్యలను ము మ్మరం చేశాం. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు కూడా జరుపుతున్నాం. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోం ది. అధికార పార్టీ ప్రజాప్రతిని ధులు, నాయకులకు రక్షణ కల్పిస్తున్నాం. - దామోదర్, నర్సీపట్నం ఓఎస్డీ -
ఉలిక్కిపడిన ఏవోబీ
=సరిహద్దులో చెలరేగిన మావోయిస్టులు =ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హతం =మృతుల్లో ఒకరు మహిళ =మన్యం బంద్కు మిశ్రమ స్పందన పాడేరు/సీలేరు, న్యూస్లైన్ : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)మరోసారి ఉలిక్కిపడింది. మన్యంలో బుధవారంనాటి బంద్కు మిశ్రమ స్పందన కనిపించినప్పటికీ సరిహద్దు ఒడిశాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధ చర్యలను నిరసిస్తూ మావోయిస్టు ఏవోబీ జోన ల్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిరసన దినాలు పాటించారు. ఇవి బుధవారం ప్రశాంతంగా ముగుస్తాయనుకున్న తరుణంలో మల్కన్గిరి జిల్లా చిత్రకొండ పోలీస్స్టేషన్ పరిధి వెజ్జంగి గుడలో వంతల సతీరావు(30), వంతల లక్ష్మి(27)లను పోలీ సు ఇన్ఫార్మర్ల నెపంతో దళసభ్యులు హతమార్చారు. ఉదయాన్నే సాయుధులైన 20 మంది మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించితో 20 నిమిషాలు వారితో మాట్లాడారు. అనంతరం ఇద్దరినీ గొడ్డలితో నరికి చంపారు. సతీరావు 15 ఏళ్ల కిందట దళంలో పనిచేసి జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. లక్ష్మి ఆశా వర్కర్గా పనిచేస్తోంది. ఈమె భర్త రాజబాబును కూడా చంపడానికి మావోయిస్టులు యత్నించారు. అతడు తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. పది రోజులుగా ఏవోబీలో గ్రేహౌం డ్స్, బీఎస్ఎఫ్, ఎస్వోజీ, జీవీఎఫ్ బలగాలు మారుమూల గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయినా మావోయిస్టులు చెలరేగి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. దీంతో మారుమూ ల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏజెన్సీ బంద్కు మిశ్రమ స్పందన మన్యంలో బుధవారంనాటి ఏవోబీ బంద్కు మిశ్రమ స్పందన కనిపించింది. పోలీసుల విస్తృత ప్రచారంతో మావోయిస్టుల బంద్ను కొన్ని ప్రాంతాల్లోని గిరిజనులు పట్టించుకోలేదు. జి.మాడుగుల మండలం మద్దిగరువు, పెదబయలు మండలం గోమంగి, కొరవంగి, లక్ష్మీపేట, ముంచంగిపుట్టు మండలం కుమడ ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. ఆర్టీసీ సర్వీసులతోపాటు ప్రైవేటు వాహనాలు కూడా తిరగలేదు. పోలీసుల సూచనలతో పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు బస్సులు నడిపారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు మండలాల్లో బంద్ ప్రభావం కానరాలేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు యథావిధిగా పనిచేశాయి. దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు మండల కేంద్రాల్లో బంద్కు మిశ్రమ స్పందన కనిపించింది. చింతపల్లి, కించుమండ వారపు సంతలు యథావిధిగానే జరిగాయి. జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రం రవాణా స్తంభించింది. మావోయిస్టుల బంద్ పిలుపుతో మన్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత మండలాల్లోని మారుమూల గ్రామాల్లో పోలీసు గాలింపు చర్యలను కూడా విస్తృతం చేసింది. మండల కేంద్రాల్లో తనిఖీలు కూడా జరిపారు. -
ఏడుగురికి షోకాజ్
=బాధ్యత మరచిన సిబ్బందిపై పీవో కొరడా =నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కన్నెర్ర =మన్యంలో తొలి పర్యటనలోనే వినయ్చంద్ ముద్ర హుకుంపేట, న్యూస్లైన్: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)అధిపతిగా బాధ్యతలు చేపట్టి ముందు కార్యాలయంపై దృష్టిసారించిన పీవో వినయ్చంద్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. విధుల్లోకి హాజరయినప్పటి నుంచి ఇంత వరకు సమీక్ష సమావేశాలతో బిజీగా ఉన్న పీవో మన్యంలో పర్యటన హు కుంపేట, పెదబయలుల్లో గురువారం ప్రారంభించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన అధికారులపై కన్నెర్ర చేశారు. రెండు మం డలాల్లో ఏడుగురికి షోకాజ్ నోటీసులివ్వాలని గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డిని ఆదేశించారు. హుకుంపేట జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుల చేత రికార్డులు మోయించుకుని తీసుకువెళ్లారని తెలుసుకున్న పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. హుకుంపేట పీహెచ్సీని, అల్లంపుట్టు గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. పీహెచ్సీలో విధులకు హాజరు కాని ఇద్దరు వైద్యాధికారులు, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో అల్లంపుట్టు పాఠశాలలోని ఇద్దరి ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్కు షోకాజ్ జారీ చేయాలని ఆదేశించారు. పీహెచ్సీలో ల్యాబ్, స్టోర్ రూం, పురిటిగది, డెంటల్ రూం వంటి ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులకు ఇచ్చే ఆహారపదార్ధాలను తనిఖీ చేశారు. స్టోర్రూంను, ఉపాధ్యాయుల తీరును, విద్యార్థుల రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీగలవలస పంచాయతీ బిజ్జాపల్లి ఆదివాసీ గిరిజన గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వాయుగుండం ప్రభావంతో తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను గ్రామస్తులు పీవోకు చూపించారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు అందడం లేదని, గ్రామంలో డ్రైనేజి లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సమ్మెకాలంలో నిలిచిపోయిన సిలబస్ త్వరితగతిన పూర్తి చేయాలని ఉపాధ్యాయులను, సిబ్బందిని ఆదేశించారు. అన్ని ఆశ్రమాలకు గ్యాస్ పరఫరా చేస్తున్నా కర్రల పొయ్యిలలోనే వండటాన్ని ఆయన తప్పు పట్టారు. ఆశ్రమ పాఠశాలల్లో రికార్డులను హెచ్ఎంలు, వార్డెన్లు నిర్వహించకపోవడం దారుణమని చెప్పారు. పాఠశాలల్లో రికార్డులు సక్రమంగా ఉండాలని, పరిశరాల పరిశుభ్రతను పరిరక్షించాలని ఆదేశించారు. కాఫీ మొక్కల పెంపకంలో ఉపాధి నిధుల స్వాహ, ప్రసుతం జరుగుతున్న పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. భారీగా సాగుతున్న రోడ్లు, భవనాలు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నామని చెప్పారు. మన్యంలో అంకిత భావంతో పనిచేసిన నాడే ఆశించిన ఫలితాలు లభిస్తాయని సిబ్బందికి హితవు చెప్పారు. పెదబయలులో హెచ్ఎం, వార్డెన్లకు... పెదబయలు : ఐటీడీఏ పీవో వి.వినయ్చంద్ గిరిజన సంక్షేమ విద్యాలయాల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈమేరకు మండలంలోని తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల హాజరు పట్టి, తరగతుల్లో ఉన్న బాలికల సంఖ్యను పరిశీలించారు. అనంతరం స్టాక్ రూంను పరిశీలించారు. సరుకుల నిల్వల్లో తేడాను గుర్తించారు. రికార్డుల నిర్వహణలో కూడా లోపాలు ఉండటంతో హెచ్ఎం, డిప్యూటీమెట్రిన్ల పనితీరును తప్పుబట్టారు. వీరిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డిని ఆదేశించారు. -
వర్షబీభత్సం
= జడివానలతో జన జీవనం అస్తవ్యస్తం = పిడుగులు పడి ఇద్దరు మృతి = చోడవరంలో నీటమునిగిన పంటపొలాలు = {పమాద స్థాయికి పెద్దేరు, తాచేరు నదులు = కోనాం గేట్లు ఎత్తివేత చోడవరం,న్యూస్లైన్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను వాయుగుండం కారణంగా జిల్లా అస్తవ్యస్తమయింది. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి జడివానలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఎస్.రాయవరం, పెదబయలు మండలాల్లో చెరొకరు మృతి చెందారు. మాకవరపాలెం,చీడికాడ మండలాల్లో ఏడు పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఒక పక్క కరెంటు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరో వంక ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సమస్య తీవ్రమైంది. కరెంటు లేక కార్మికులకు, వర్షాల వల్ల కూలీలకు పనిలేకుండా పోయింది. చోడవరంలో సుమారు 4 సెం.మీ వర్షం పడింది. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట, వడ్డాది ప్రాంతాల్లో 2 నుంచి 3 సెం.మీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదులతోపాటు కొండగెడ్డలు పొంగి ప్రవిహ స్తున్నాయి. పెద్దేరు, తాచేరులలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. భీమిలి-నర్సీపట్నం రోడ్డులో చోడవరం సమీపంలో బొడ్డేరు నదిపై ఉన్న కాజ్వేకు భారీ గండి పడింది. కాజ్వే పైనుంచి నీరు పరవళ్లు తొక్కుతోంది. గండి పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ దారిలో వెళ్లాల్సిన వాహనాలను గౌరీపట్నం మీదుగా వడ్డాది జంక్షకు మళ్లిస్తున్నారు. కోనాం జలాశయం నుంచి ఒక గేట్లు ఎత్తి 300క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేయగా పెద్దేరు జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 500క్యూసెక్కుల నీటిని పెద్దేరు నదిలోకి వదిలారు. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. లక్ష్మీపురం, కస్పా, ఎం.కోటపాడు, ముకుందపురం ప్రాంతాల్లో కనుచూపుమేరలో పొలాలు నీట మునిగాయి. చోడవరంలో వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ప్రవహించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దాంతో పనులు లేక ప్రజలంతా అల్లాడిపోయారు. గ్రామాలు చీకట్లోనే కాలం వెళ్లదీశాయి. యలమంచిలిలోనూ వర్షం కురిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుకుంపేట మండలంలో భారీ వర్షానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంలో వర్షాల వల్ల కూరగాయల పంటలకు మేలు కలుగుతుందని గిరిరైతులు అంటున్నారు. పాడేరులోనూ వర్షం కురిసింది. గిరిజనుడి మృతి హుకుంపేట: పశువులు కాసేందుకు కొండపైకి వెళ్లిన గిరిజనుడు పిడుగుపాటుతో మృతి చెందాడు. తీగలవలసలో ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బోయిన సీతారామయ్య (40) పశువులు కాసేందుకు సమీపంలో కొండపైకి తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురవంతో చెట్టు కిందకు చేరాడు. చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో సీతారామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారామయ్యకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పిడుగుపాటుకు ఏడు పశువులు మృతి మాకవరపాలెం మండలంలో పిడుగుపాటుకు మూడు పశువులు చనిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అనేకచోట్ల పిడుగులు పడ్డాయి. లచ్చన్నపాలెంలో కిల్లాడ రామ్మూర్తి ఇంటి వద్ద పిడుగుపడి రూ. 50 వేల విలువైన ఆవు మృతి చెందింది. వజ్రగడలో అప్పలనాయుడుకు చెందిన లక్ష విలువైన రెండు గేదెలు పిడుగుపాటుతో మృతి చెందాయి. పిడుగులు పడి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. చీడికాడ మండలంలో పిడుగులకు నాలుగు పశువులు మృతి చెందాయి. చినబోడిమెట్టలో బొడ్డు మంగునాయుడుకు చెందిన రెండు ఎద్దులు, , చీడికాడలో గండి అక్కునాయుడుకు చెందిన రెండు ఆవులు ఒకేచోట మృతి చెందాయి. -
నకిలీల దందా!
పాడేరు, న్యూస్లైన్: మన్యంలో పలు పత్రికల పేర్లు, పోలీసుల పేర్లు చెప్పుకుని నకిలీల దందా కొనసాగుతోంది. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి భారీగా రవాణా అవుతుండడం నకిలీ విలేకరులు, పోలీసులకు కలిసివస్తోంది. ఆటోలు, జీపులు, కార్లు ద్వారా గంజాయి రవాణా అవుతుండడంతో ఈ వాహనాల డ్రయివర్లను ఇన్ఫార్మర్లుగా ఉపయోగించుకుని ప్రధాన రహదారుల్లో పోలీసుల తరహాలో మాటు వేసి దోపిడీ చేస్తున్నారు. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు రోడ్లలోని పలు చోట్ల ఈ నకిలీల దోపిడీ అధికమైంది. జి.మాడుగుల రోడ్డులోని కలెక్టర్ బంగ్లా, పాడేరు సమీపంలోని చింతలవీధి జంక్షన్, లగిశపల్లి రోడ్డు, వంతాడపల్లి చెక్పోస్ట్ ప్రాంతాల్లో కొంతమంది విలేకరులు, పోలీసు సిబ్బందిగా చెప్పుకుంటూ దారిన పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. గంజాయి రవాణా అవుతున్నట్టు ముందుగానే సమాచారం అందుకుంటున్న ఈ నకిలీలు ఆయా వాహనాలను అడ్డగించి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. సొమ్ము ఇవ్వకుంటే వాళ్లను బెదిరించి గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాలను వదిలిపెడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఈ ప్రధాన రోడ్లలో దారి దోపిడీ జరుగుతోంది. గంజాయి వ్యాపారం కావడంతో ఎవరు అడ్డగించిన వ్యాపారులు భయపడి ఈ నకిలీలు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించి అక్కడ నుంచి తప్పించుకుంటున్నారు. 8 నెలల క్రితం పాడేరు పోలీసులు ఇలాంటి నకిలీ పోలీసుల గుట్టు రట్టు చేసి నలుగురిని జైలుకు పంపారు. ఇలాంటి నకిలీల హల్చల్ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరలా మరో కొత్త బృందం విలేకరులు, పోలీసుల అవతారం ఎత్తి గంజాయి వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది. గంజాయి వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు లేకపోవడంతో వారు కూడా పట్టించుకోవడం లేదు. ఈ విషయమై పాడేరు సర్కిల్ మొబైల్ పార్టీ ఎక్సైజ్ సీఐ ఉపేంద్రను న్యూస్లైన్ వివరణ కోరగా గంజాయి వ్యాపారుల నుంచి కొంతమంది డబ్బులు గుంజుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై దృష్టిసారించినట్టు తెలిపారు. గంజాయి సాగుదారులు, వ్యాపారులతో కూడా ఈ నకిలీలకు సంబంధాలు ఉన్నట్టు తెలిసిందన్నారు. వారి గురించి ఎవరు సమాచారం ఇచ్చిన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన చెప్పారు.