Drinking Water Scheme
-
ఉద్దానానికి ఊపిరి.. రూ.700 కోట్లతో మంచి నీటి పథకం..
ఇన్నాళ్లూ నిరాశ, నిస్పృహలకు లోనైన ఉద్దానం ప్రాంతంలో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. పురాణాల్లో చెప్పినట్లు.. గంగను ఆకాశం నుంచి భూమి మీదకు తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన యత్నాలను తలపిస్తూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడో వంద కిలోమీటర్ల దూరాన ఉండే హిరమండలం రిజర్వాయర్ నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన పనులు చూసిన ఈ ప్రాంత వాసుల్లో మనకూ మంచి రోజులు వస్తున్నాయన్న ధీమా మొదలైంది. మరోవైపు.. కిడ్నీ బాధితులకు చేరువలోనే వైద్య సేవలు అందించడానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో కొండంత భరోసా కలుగుతోంది. వెరసి కిడ్నీ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతోందనే నమ్మకం, ధైర్యం, సంతోషం కనిపిస్తోంది. దాదాపు 40 ఏళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మహమ్మారి పీడ అతి త్వరలో విరగడవుతోంది. ఉద్దానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం ఆసన్నమైంది. ఉద్దానం ప్రాంతం నుంచి మేడికొండ కోటిరెడ్డి, వడ్డే బాలశేఖర్: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడి అల్లాడుతుంటే గత ప్రభుత్వాలు మాటలతో మభ్యపెడితే.. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన అడుగులు ఫలితాలివ్వడానికి సిద్ధమయ్యాయి. నాలుగు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభోత్సవ దశకు చేరింది. హిరమండలం నుంచి తాగునీటిని తరలించే ప్రక్రియలో ఉపయోగించే నీటి మోటార్లకు మూడు, నాలుగు రోజుల్లో ట్రయల్ రన్ మొదలవ్వనుంది. ఉద్దానం నుంచి వంద కిలోమీటర్లకు పైగా దూరం ఉండే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి రెండు సబ్ సేషన్ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇందులో హిరమండలం వద్ద ఏర్పాటు చేసిన సబ్స్టేషన్కు గత (మే) నెల 24వ తేదీనే విద్యుత్ సరఫరా ప్రక్రియ పూర్తయింది. హీరమండలం రిజర్వాయర్ నీటిని అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉండే మెళియపుట్టి మండల కేంద్రం వద్దకు తరలించి.. శుద్ధి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫిల్టర్ బెడ్ల కేంద్రం సిద్ధమైంది. ఇక్కడ నీటిని శుద్ధి చేసిన అనంతరం ఆయా ప్రాంతాలకు తరలించడానికి మరో సబ్ స్టేషన్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయింది. దానికి ఈ నెల 15 నాటికి విద్యుత్ సరఫరా పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఉద్దానం ప్రాంతానికి తాగునీటి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యం ఉద్దానం ప్రాంతంలో అక్కడి భూగర్భ జలాలనే తాగునీటిగా ఉపయోగించడం వల్ల కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయనే వాదన ఉంది. ప్రజల్లో కూడా ఇదే విషయమై ఆందోళన ఉంది. అయితే ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో కొన్ని మంచినీటి పథకాలు ఉన్నా.. అవి ఎక్కువగా స్థానికంగా బోర్లు వేసి సరఫరా చేసేవే. మరోవైపు.. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా, వేసవిలో ఆ నదులు ఎండిపోతే ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని జగన్ సర్కార్ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కన పెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా సరే వెనుకాడకుండా హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఉద్దానం ప్రాంతానికి ఏడాది పొడవునా టీఎంసీ కన్నా తక్కువ నీరే అవసరం ఉంటుంది. హిరమండలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 2.67 టీఎంసీలుండటం వల్ల ఉద్దానం ప్రాంతానికి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జగన్ ప్రభుత్వ ‘భగీరథ’ యత్నం హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి నీటి తరలింపు అషామాషీ కాకపోయినా ప్రభుత్వం పట్టుదలగా పనులు చేపట్టి పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో ఏకంగా 1,047 కిలోమీటర్ల పొడవునా భూగర్భ పైపులైన్ల నిర్మాణం చేశారు. రోజూ 8.40 కోట్ల లీటర్ల మేర తాగునీరు ఆ భూగర్భ పైపు లైను ద్వారా వెళ్లేలా పనులు చేపట్టారు. కేవలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు భారీ మోటార్లు ఒక్కొక్కటి నిమిషానికి 28 వేలకు పైగా లీటర్ల నీటిని పంపింగ్ చేయగలవు. ఈ నీరు ఎగుడు దిగుడు కొండలు, మైదాన ప్రాంతాలు దాటుకుంటూ.. మధ్యలో మరే మోటార్ల అవసరం లేకుండా 32 కి.మీ. దూరంలోని మెళియాపుట్టి శుద్ధి కేంద్రానికి చేరతాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి మూడో మోటార్ను అదనంగా ఏర్పాటు చేశారు. నీటి తరలింపు మార్గంలో వంశధార నది ఉండటంతో నదీ గర్భంలో దాదాపు అర కిలోమీటర్ మేర పైపు లైన్ నిర్మాణం చేశారు. కొన్ని చోట్ల కొండలను తొలిచి పైప్లైన్ వేశారు. ఒక్కసారిగా 73 మీటర్ల ఎత్తుకు.. ఆపై 50 మీటర్లు దిగువకు.. మళ్లీ 147 మీటర్ల ఎత్తున ఉండే కొండపైకి.. మళ్లీ దిగువకు ఇలా పైప్లైన్ నిర్మాణం చేపట్టారు. మరోమాటలో చెప్పాలంటే భగీరథ యత్నమే చేశారు. ఈ ప్రాజెక్టు త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. కరోనా లేకుంటే ఇప్పటికే అందుబాటులోకి.. ఉద్దానం ప్రాంతంలో కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని గ్రామాల పరిధిలో కిడ్నీ సమస్య ఉంది. ఈ మండలాల్లో 7,82,707 మంది జనాభా నివసిస్తుంటారు. 1980 దశకం నుంచి ఉద్దానం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంత వరకు స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ.. ఆ ప్రాంత ప్రజలు తాగునీటి అవసరాలకు అక్కడి భూగర్భ జలాలు వినియోగించడం ఒక కారణం కావొచ్చనే నిపుణుల అనుమానాల మేరకే జగన్ ప్రభుత్వం నివారణ చర్యలు మొదలుపెట్టింది. పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు 807 నివాసిత గ్రామాలకు సురక్షిత తాగునీటి సరఫరాకు ఉద్దేశించి ఈ మంచినీటి పథకానికి సీఎం జగన్ 2019 సెప్టెంబర్ 6న శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అవసరాలను పరిగణనలో ఉంచుకుని 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో పౌరులు ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున ఏడాది పొడవునా ఈ పథకం ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని డిజైన్ చేసింది. భవిష్యత్లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో 170 నివాసిత ప్రాంతాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా తాగునీరు అందించే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాతి సంవత్సరంలోనే కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపు, మరుసటి ఏడాది కూడా రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది. ఈ ప్రభావం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపైనా పడింది. ఈ సమస్య లేకుంటే ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఉండేది. బాబు, పవన్.. మాటలతోనే సరి గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దానం సమస్య పరిష్కారం పూర్తిగా పక్కన పెట్టిందనే చెప్పాలి. 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక తొలి మూడేళ్లు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక్క చర్యా చేపట్టలేదు. చివరి ఏడాది 2018లో కేంద్ర పరిశోధన సంస్థ ఐసీఎంఆర్, జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థలతో ఉద్దానం కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయి అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. అదీ ప్రకటనకే పరిమితమైంది. మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ 2018 మే లో ఒకట్రెండు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో దీక్షలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబుతో సమావేశమై ఆ సమస్యను వదిలేశారు. కిడ్నీ రోగులకు వరం వాటర్ గ్రిడ్ ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి 20 వేల మంది అన్ని రకాల కిడ్నీ రోగులకు వాటర్ గ్రిడ్ వరంగా మారబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, రూ.700 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు 232 గ్రామాలకు ట్యాంకులు ఏర్పాటు చేసి, ఇంటింటికీ కుళాయిల ద్వారా నదీ జలాలు అందించనున్నారు. ఇదే జరిగితే భూగర్భంలో ఉన్నటువంటి సిలికాన్ కారణంగా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయనే అనుమానాలు సైతం తొలగిపోతాయి. ఈ పథకం ప్రారంభం కావడం ద్వారా సీఎం వైఎస్ జగన్ మరింత మంది ప్రజల గుండెల్లో నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహంలేదు. – రాపాక చిన్నారావు, గొల్లమాకన్నపల్లి, పలాస మండలం మహిళలకు పాట్లు తప్పుతాయి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు పలాస నియోజకవర్గంలో అనేక గ్రామాలకు తాగునీటి సమస్య ఉంది. వాటర్ గ్రిడ్ ప్రారంభం అయితే మహిళలకు పాట్లు తప్పుతాయి. ఇంటికి కావాల్సిన తాగునీరుతో పాటు అదనంగా ఇచ్చే నీరు వాడుకలకు సరిపోతుంది. ప్రస్తుతం మున్సిపల్ ట్యాంకర్, పంట పొలాలు, బావులపై ఆధారపడి జీవిస్తున్న వారే అధికం. ఎప్పుడు పథకం ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో చూస్తున్నాం. ఇప్పుడు ఆ రోజులు వచ్చాయి. వంశధార నది నుంచి వచ్చే తాగునీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పల్లెల్లో తాగునీటి కోసం అనేక కొట్లాటలు, గొడవలు జరుగుతున్నాయి. రూ.20 ఇచ్చి క్యాన్ కొనుగోలు చేయాలంటే అందరికీ కుదరదు. సీఎం జగన్ చర్యల వల్ల ఈ కష్టాలన్నీ తప్పుతాయి. – దున్న నిర్మల, మొగిలిపాడు, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ -
రూ.6,290 కోట్లతో మంచినీటి పథకాలు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం.. మొత్తం 5 పాత జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో మొత్తం రూ.6,290 కోట్లతో కొత్త మంచినీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం నుంచి 10 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఈఎన్సీ కృష్ణారెడ్డి తెలిపారు. పనుల ప్రతిపాదనల వివరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ అధికారిక వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచారు. వాటర్ గ్రిడ్ పథకంలో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే 30 ఏళ్ల కాలంలో పెరిగే ప్రజా అవసరాల దృష్ట్యా కొత్తగా మంచినీటి పథకాలను ప్రభుత్వం నిర్మించబోతోంది. ఏడాది మొత్తం ఆయా పథకాలకు నీరు అందుబాటులో ఉండేలా ముందస్తుగా ప్రత్యేక జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీరప్రాంతంలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీరప్రాంతంలో రూ.1,400 కోట్లతో ప్రభుత్వం కొత్తగా మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతుంది. కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో రూ.1,200 కోట్లతో, ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో కొత్తగా మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతున్నారు. -
శాశ్వత తాగునీటి పథకానికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో శాశ్వత తాగునీటి పథకానికి సహకరించాలని నీతిఆయోగ్కు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తిచేశారు. సాగు, తాగునీటి పథకాలపై నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్కు వివరించి నిధుల కేటాయింపునకు కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో నీతిఆయోగ్ సీఈవోతోను, డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డితోను, జాతీయ రహదారులు, రహదారి రవాణాశాఖ అధికారులతోను సమావేశమయ్యారు. అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయాలు, సాగు, తాగునీటి పథకాలపై అమితాబ్కాంత్తో చర్చించానన్నారు. విభజన తర్వాత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి యువ సీఎం వైఎస్ జగన్ ఎంతో కృషిచేస్తున్నారని నీతిఆయోగ్ సీఈవో ప్రశంసించారని చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించి ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులపై డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డితో సమావేశమైనట్లు తెలిపారు. విశాఖపట్నం, దొనకొండ, నెల్లూరు, అనంతపురం, ఓర్వకల్లు ప్రాంతాల్లో రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్లు చెప్పారు. ఇటీవల విజయవాడ కనకదుర్గ పైవంతెన ప్రారంభసమయంలో కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా మంత్రి గడ్కరీతో సీఎం జగన్ మాట్లాడిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. పోలవరం నిధుల విడుదల ప్రక్రియ సాగుతోందని చెప్పారు. -
నీటిపై రాతలు!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీర్చే కీలకతాగునీటి పథకాలు, మురుగు మాస్టర్ ప్లాన్ పనులకు నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. శామీర్పేట్ సమీపంలోని కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయర్ను హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపడుతున్నప్పటికీ.. భూసేకరణ, రావాటర్ పైప్లైన్ల ఏర్పాటు, నీటిశుద్ధి కేంద్రాల నిర్మాణానికి అవసరమైన రూ.1000 కోట్ల నిధులను మాత్రం విడుదల చేయలేదు. అసలు ఇవి వస్తాయా.. లేదా..? అన్నదానిపై సందేహంగా మారింది. ఇక విశ్వనగరం బాటలో దూసుకుపోతున్న మహానగర దాహార్తిని తీర్చే కీలక తాగునీటిమురుగు అవస్థలు తీర్చే సీవరేజీ మాస్టర్ ప్లాన్కు రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తుందన్న ఆశలు క్రమంగా అడియాశలు అవుతున్నాయి. ప్రధానంగా భాగ్య నగరంలో కృష్ణా, గోదావరి జలాలతో రోజూ నీళ్లందించే పథకం మొదలు.. ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటు, పాతనగరంలో తాగునీటి సరఫరా నెట్వర్క్ విస్తరణ, రిజర్వాయర్ల నిర్మాణం వంటి పథకాలకు సుమారు రూ.5,800 కోట్ల మేర నిధులు కేటాయించాలని కోరుతూ వాటర్ బోర్డు రాష్ట్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు సమర్పించి నెలలు గడుస్తున్నా అటునుంచి మాత్రం సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. కాగితాల్లో రూ.కోట్ల పథకాలు రోజూ నీళ్లు: గ్రేటర్ పరిధిలోని మొత్తం 9.85 లక్షల నల్లాలకు నిత్యం 460 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. త్వరలో నగర శివార్లలో కేశవాపూర్ తాగునీటి పథకం చేపట్టడంతో పాటు, పాతనగరం, ప్రధాన నగరం, శివార్లలో సరఫరా వ్యవస్థను విస్తరించి, నూతన రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా అన్ని నల్లాలకు రోజూ నీళ్లందిచే అవకాశాలుంటాయి. ఇందుకు సుమారు రూ.1000 కోట్ల నిధులు అవసరం. కేశవాపూర్ రిజర్వాయర్: శామీర్పేట్ సమీపంలోని కేశవాపూర్లో 10 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజీ రిజర్వాయర్ను నిర్మించేందుకు రూ.4700 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ముందుగా బొమ్మరాస్పేట్ నీటిశుద్ధి కేంద్రం నిర్మాణానికి అవసరమైన దేవాదాయ భూముల సేకరణకు, కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపూర్కు రావాటర్ పైపులైన్ల ఏర్పాటుకు, బొమ్మరాస్పేట్ నుంచి గోదావరి రింగ్మెయిన్ వరకు శుద్ధిచేసిన నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన భారీ పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.1000 కోట్లు అవసరమవుతాయి. సీవరేజీ మాస్టర్ప్లాన్: ఔటర్ రింగ్రోడ్డు పరిధి వరకు నిత్యం గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న 1500 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు 55 ప్రాంతాల్లో వికేంద్రీకృత శుద్ధి కేంద్రాలు, మురుగునీటి పారుదల పైప్లైన్ల ఏర్పాటుకు సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. రుణ వాయిదాల చెల్లింపునకు: కృష్ణా రెండు, మూడు దశలతో పాటు గోదావరి తాగునీటి పథకం, హడ్కో నుంచి గతంలో సేకరించిన రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపునకు రూ.800 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఓఆర్ఆర్ చుట్టూ జలహారం: ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ 158 కి.మీ మార్గంలో భారీ రింగ్ మెయిన్ పైపులైన్ల ఏర్పాటు ద్వారా జలహారం ఏర్పాటు చేసే పథకానికి సుమారు రూ.2 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ పథకం పూర్తయితే మహానగర వ్యాప్తంగా ఒక చివరి నుంచి మరో చివరకు కొరత లేకుండా నిరంతరాయంగా కృష్ణా, గోదావరి జలాలను సరఫరా చేయవచ్చు. ఈ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1000 కోట్లు నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. -
నెరవేరని రాజన్న ఆశయం
సాక్షి, మొగల్తూరు (పశ్చిమ గోదావరి): నాలుగు గ్రామాల ప్రజలకు తాగు నీరందిస్తానని దివంగత నేత తీర ప్రాంత ప్రజల గుండెలోల చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాజీవ్ పల్లెబాటలో భాగంగా 2009 జనవరిలో మండలంలో పర్యటించిన సందర్భంలో రూ.33 కోట్లతో మొగల్తూరులో భారీ మంచి నీటి ప్రాజెక్టుకు దివంగత నేత హామీ ఇచ్చారు. ఆయన అకాల మృతి అనంతరం ప్రభుత్వాలు మారినా పట్టించుకున్న నాదుడు లేడు. రూ.13 కోట్లతో చేపట్టిన పనులు రూ.13 కోట్లు వెచ్చించి సుమారు 30వేల మంది ప్రజల దాహర్తి తీర్చేందుకు ఉద్దేశించి మొగల్తూరు గొల్లగూడెంలో తవ్విన చెరువు. పంచాయతీకి చెందిన చెరువునే ఆర్డబ్ల్యూఎస్కు బదలాయించి చెరువు చుట్టూ రివిట్ మెంట్ కట్టారు. అయితే నాలుగు గ్రామాలకు తాగు నీరందించాల్సి ఉండగా కేవలం మొగల్తూరుకు తప్ప ఏ గ్రామానికి అందదు. నాలుగు గ్రామాలకు తాగునీరు మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలతో పాటు సుమారు 40 శివారు ప్రాంతాలకు తాగు నీరందించేందుకు రూ. 13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రాజెక్టును సుమారు 20 ఎకరాల్లో నిర్మించేందుకు భూసేకరణకు ప్రయత్నించినా పనులు పూర్తి కాలేదు. అయితే నిధులు మురుగుపోతున్నాయనే ఉద్దేశంతో మొగల్తూరు పంచాయతీ ప్రాజెక్టు చెరువుతోపాటు పంచాయతీకి చెందిన మరో రెండు చెరువులు కలుపుకుని తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. దీనిలో భాగంగా మొగల్తూరులోని పాలకమ్మ చెరువు రోడ్డులో గల కోమటి చెరువులో నీటిని నిల్వ చేసి గొల్లగూడెం చెరువు ద్వారా ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైప్లు ద్వారా నీరందించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పూర్తి కాని పైప్లైన్ పనులు ఇక ఫిల్టర్ అయిన నీటిని ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రిజర్వు చేసుకుని పైప్లు ద్వారా గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న రామన్నపాలెంలో 8, మొగల్తూరులో 7, శేరేపాలెంలో 3, కొత్తపాలెంలో 2 ఓహెచ్ఆర్లు ద్వారా అందించాల్సిన పైప్లైన్ పనులు పూర్తికాలేదు. శేరేపాలెంలో పైప్లైన్ పనులు పూర్తిఅయినా నీరందటంలేదు. కొత్తపాలెం గ్రామంలో మాత్రం కొద్దిగా వస్తున్నాయని, నాసిరకం పైపులు కారణంగా నీరందడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రామన్నపాలెం గ్రామంలో కొంతమేర పైప్లైన్లు వేసి వదిలేయడంతో ఆగ్రామానికి పూర్తిగా నీరు సరఫరా కావడంలేదు. కేవలం మొగల్తూరు గ్రామానికి మాత్రమే పూర్తి స్థాయిలో నీరందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే తాగునీటి ప్రాజెక్టుపై పాలకులు శ్రద్ధ చూపడం లేదని ఈ సారి సమస్యలను తీర్చే నాయకుడునే ఎన్నుకుంటామని ప్రజలు చెబుతున్నారు. తాగు నీరందడం లేదు మొగల్తూరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరందడంలేదు. గ్రామంలోని పంచాయతీ చెరువు ఉన్నా తాగేందుకు పనికి రావడంలేదు. దీంతో రోజూ కొనుక్కుని తమ దాహాన్ని తీర్చుకుంటున్నాం. – ఏగి రాజశేఖర్, శేరేపాలెం నాసిరకంగా పనులు ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేపట్టడంతో చిన్న దెబ్బతగిలినా పైపులు పగిలి పోతున్నాయి. కాంట్రాక్టరు అధికారం పక్షానికి దగ్గిర వ్యక్తి కావడంతో పనులు నాసిరకంగా పూర్తిచేసినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. – కొత్తపల్లి ఆంజనేయులు, కొత్తపాలెం ఇప్పటికీ మాకు నీరందదు మొగల్తూరు భారీ ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి కూడా నీరందిస్తామని దివంగత నేత ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఇప్పటికీ మాగ్రామానికి పైప్ లైన్ పనులు పూర్తి చేయలేదు. జగన్ అధికారంలోకి వస్తేనే మాకు నీరు అందుతుంది. – కాటూరి చంద్రమోహన్, రామన్నపాలెం జగన్ రావాలి – తాగు నీరందాలి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జలయజ్ఞం పథకంలో మంచి నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. మా గ్రామానికి స్వచ్ఛమైన నీరందాలంటే జగన్ రావాలి, తాగు నీరందాలి. – కొత్తపల్లి బాబి, శేరేపాలెం -
ఇదేంటి కేశవా ?
– రూ. 56 కోట్ల తాగునీటి పథకం ప్రారంభానికి రాజకీయ గ్రహణం – ప్రభుత్వానికి వినిపించని 40 గ్రామాల ప్రజల దాహం కేకలు – నీరు విడుదల చేయాలని ప్రభుత్వంపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతల కుటిల రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రజల దాహర్తి తీర్చడంలో కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారు. గత ఏడాదే పూర్తి అయిన రూ. 56 కోట్ల తాగునీటి పథకాన్ని ప్రారంభం కాకుండా అడ్డుపడుతున్నారు. దీంతో 46 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే.. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుతో పాటు మరో రెండు మండలాల ప్రజల దాహర్తిని తీర్చేలా రూ.56 కోట్లు వెచ్చించి కూడేరు మండలంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని నిర్మించారు. దీని పనులు గత యేడాదే పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన ట్రయిల్రన్ కుడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజలు కుడా ఇక తమకు తాగునీటి కష్టాలు తీరతాయని భావించారు. అయితే నేటివరకు ఈ పథకాన్ని ప్రారంభంచడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడు అడ్డుపడటం వల్లే ఈ తాగునీటి పథకం నేటిని ప్రారంభం కావడం లేదని ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ప్రారంభిస్తే జనం దాహం తీరినట్టే ! కూడేరు మండలంతో పాటు ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల్లోని 40 గ్రామాలతో పాటు అనంతపురం రూరల్ పరిధిలోని పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2013లో ఈపథకం ప్రారంభించారు. రూ. 56 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ పథకం పనులు గత యేడాది పూర్తయ్యాయి. కూడేరు మండలం పీఎబీఆర్ జలాశయం వద్ద ఊట బావిని నిర్మించి అక్కడి నుండి నీటిని సమీపంలో నిర్మించిన సంప్ల ద్వారా పైప్లైన్ల నుండి సరఫరా చేయాల్సి ఉంది. తాగునీటిని అందించడానికి దాదపు 130 కిమీ మేర పైప్లైన్ను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 7 మిలియన్ లీటర్ల నీరు ఈ పథకానికి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. గత యేడాది సెప్టెంబర్లో పనులు పూర్తవడంతో డిసెంబర్ నెలలో అధికారులు ట్రయిల్రన్ను విజయవంతంగా నిర్వహించారు. అయినప్పటికి తాగునీటి పథకాన్ని మాత్రం ప్రారంభించలేక పోయారు. ఎమ్మెల్యే పోరాటం రూ. 56 కోట్ల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా పోరాడుతూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. వేలాది మందితో పీఏబీఆర్ వద్ద ఉన్న తాగునీటి పథకాన్ని ప్రారంభించేందుకు వెళ్లగా ఎమ్మెల్యేతో పాటు మిగిలిన వారిని కూడా ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఆ తర్వాత అనంతపురంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావడం లేదు. అడ్డుపడే వారికి బుద్దిచెబుతాం - గౌరమ్మ, కురుట్లపల్లి తాగునీరు కోసం ప్రజలు పడే కష్టాలు అన్నీ నాయకులకు తెలుసు. అయినా నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడతున్నారు. అలాంటి వారికి తప్పకుండా బుద్ది చెబుతాం. పథకం పూర్తి అయినా నీళ్లు ఇవ్వడానికి మీకు మనస్సు రాదా. నీళ్లు ఉన్నా వాడుకోలేని దుస్థితి - లక్ష్మిదేవి, అంతరగంగ మా గ్రామానికి దగ్గరగా డ్యాం ఉన్నా మాకు గుక్కెడు తాగునీరు అందని దుస్థితి నెలకొంది. పనులన్నీ వదులుకోని నీళ్ల కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి. మా బాధలు ప్రభుత్వానికి పట్టలేదు. -
తాగునీటికి రూ.14 కోట్లు
సిద్ధమైన ప్రతిపాదనలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరాలోని 13 తాగునీటి పథకాల నిర్వహణ కోసం రూ.14.20 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పరిషత్లో జెడ్పీ పర్సన్ అధ్యక్షతన జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీపీఓ పద్మావతి, ఈఈ వెంకటరమణ, ఏఈ రత్నప్రసాద్తో తాగునీటి సరఫరాపై సమీక్ష జరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నీటి నిర్వహణకు గ్రామ పంచాయతీలోని 14వ ఆర్థిక నిధుల నుంచి 40 శాతం, ప్రభుత్వ వాటాగా 60 శాతం నిధులను ఖర్చు చేస్తామని సునీతా రెడ్డి తెలిపారు. ఈ నిధులతో నీటి సరఫరా చేసే సిబ్బంది వేతనాలు, పంపుల నిర్వహణ, మరమ్మతులు వంటి పనులు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు. -
శివార్లకు జలసిరులు..
► జలమే జీవం.. తీరనున్న దాహం.. ►90 రోజుల్లో రికార్డు స్థాయిలో 1100 కి.మీ మార్గంలో పైప్లైన్లు ►వందలాది కాలనీలకు తీరనున్న దాహార్తి.. ►శరవేగంగా 56 భారీ స్టోరేజ్ రిజర్వాయర్ల నిర్మాణం.. సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా తాగునీరులేక అల్లాడిన గ్రేటర్ శివార్లలో జలసిరులతో దాహార్తి సమూలంగా తీరనుంది. హడ్కో నిధులతో జలమండలి చేపట్టిన తాగునీటి పథకం పనులు రికార్డు స్థాయిలో విజయవంతమవడంతో ఆయా ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది. పలు మున్సిపల్సర్కిళ్ల పరిధిలో కేవలం 90 రోజుల వ్యవధిలో 1100 కిలోమీటర్లకు పైగా పైపులైన్లు ఏర్పాటుచేయడం విశేషం. దీనికి అదనంగా ఈ ఏడాది జూన్లోగా మరో 900 కి.మీ మార్గంలో పైపులైన్లు...56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తుండడంతో లక్షలాదిమంది దాహార్తి తీరనుంది. గతంలో పదిరోజులుగా నల్లా నీరు రాక ..గొంతెండిన శివారువాసులకు ఇక నుంచి రోజూ నీళ్లిచ్చేందుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రుతుపవనాలు కరుణిస్తే జూలై మాసం నుంచి ఆయా ప్రాంతాలకు రోజూ నీళ్లివ్వనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రేటర్తోపాటు ఔటర్రింగ్రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు,నగరపంచాయతీల దాహార్తిని సైతం సమూలంగా తీర్చేందుకు బృహత్తర ప్రణాళికను త్వరలో అమలుచేయనున్నట్లు వెల్లడించాయి. సుమారు రూ.628 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల పరిధిలో 1685 కి.మీ మార్గంలో పైపులైన్లు...398 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించనుండడం విశేషం. వందేళ్ల తాగునీటి అవసరాలకు భారీ రిజర్వాయర్... మరో వందేళ్లవరకు మహానగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు శామీర్పేట్ మండలం కేశవాపూర్లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ.7770 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వసామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్కు అవసరమైన అటవీ ,ప్రైవేటు భూములను ఆరునెలల్లోగా సేకరించే అంశంపై రెవెన్యూ,జలమండలి యంత్రాంగం దృష్టిసారించింది. ఈ రిజర్వాయర్కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాలు, డిజైన్లు, డ్రాయింగ్స్, పైప్లైన్స్, నీటిశుద్ధికేంద్రాలు, శుద్ధిచేసిన నీటిని ఘన్పూర్ రిజర్వాయర్కు తరలించే పైప్లైన్ల ఏర్పాటు.. తదితర అంశాలను వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఔటర్ లోపలి గ్రామాల దాహార్తి తీరనుందిలా.. ఔటర్రింగ్ రోడ్డులోపలున్న 190 పంచాయతీలు, నగరపాలక సంస్థల పరిధిలో త్వరలో రూ.628 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి పథకం పనులు చేపట్టనున్నారు. ఆయా గ్రామాల్లో 398 ఓవర్ హెడ్ట్యాంకులను 34,700 కిలోలీటర్ల(3.47 కోట్ల లీటర్లు) నీటి నిల్వ సామర్థ్యం తో నిర్మించనున్నారు. ఓవర్హెడ్ ట్యాంకుల నుంచి 1685 కిలోమీటర్ల మేర నీటి సరఫరా పైపులైన్లు ఏర్పాటు చేసి ఆయా పంచాయతీల పరిధిలోని వేలాది కాలనీలు, బస్తీలకు నీటిసరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే శివారు ప్రాంతాల్లో సుమారు 25 లక్షలమంది దాహార్తి తీరే అవకాశం ఉంది. కాగా ఇటీవల ఔటర్కు లోపలున్న గ్రామాలకు నీటిసరఫరా బాధ్యతలను ప్రభుత్వం గ్రామీణ నీటిసరఫరా విభాగం నుంచి బదలాయించి జలమండలి అప్పజెప్పిన విషయం విదితమే. దాహార్తి తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయం గ్రేటర్తోపాటు ఔటర్రింగ్రోడ్డు లోపలున్న గ్రామపంచాయతీల దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ప్రభుత్వం పలు బృహత్తర మంచినీటి పథకాలను అమలుచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నాం. భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం జలమండలి అమలు చేస్తున్న సాంకేతిక ప్రయోగం, సామాజిక మాధ్యమాల వినియోగం సత్ఫలితాన్నిస్తోంది. అరకొర నీటిసరఫరా...ఉప్పొంగుతున్న మురుగు సమస్యలు...కలుషిత జలాలు.. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు గత ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాలు, సాంకేతిక విధానాల ద్వారా స్వీకరిస్తున్న ఫిర్యాదులను గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తుండడం విశేషం. గ్రేటర్ సిటిజన్లు అమితంగా ఇష్టపడే ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తుండడంతో వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఆయా మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులు..వాటిని జలమండలి పరిష్కరించిన తీరు ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
‘ఔటర్’ దాహార్తి తీర్చే బాధ్యత జలమండలిదే
- నూతనంగా నీళ్లిచ్చే ప్రాంతాలపై మ్యాప్ రూపొందించాలి: కేటీఆర్ - జూన్లోగా శివార్లలో పైప్లైన్, రిజర్వాయర్ పనులు పూర్తిచేయాలి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరం సహా ఔటర్ రింగ్రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చే బాధ్యత జలమండలి దేనని మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ శివార్లలో రూ. 1,900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన తాగునీటి పథకం పనుల ద్వారా కొత్తగా నీళ్లిచ్చే ప్రాంతాలు, బస్తీలపై సమగ్ర చిత్రపటం (మ్యాప్) రూపొందించాలన్నారు. బేగంపేట్లోని హెచ్ఎంఆర్ కార్యాలయంలో మంగళవారం మంత్రి మహేందర్రెడ్డి, శివారు ప్రాంతాల ఎమ్మెల్యేలు, జలమండలి అధికారులతో ఆయన సమావేశమై హడ్కో పథకంపై సమీక్షించారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు ట్యాంకర్లు పంపాలి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో పైప్లైన్ల కోసం తవ్వుతున్న సీసీ, బీటీ రోడ్లకు పనులు పూర్తయిన వెంటనే మర మ్మతులు చేపట్టాలన్నారు. వీటిని జూన్లోగా పునరుద్ధరించాలన్నా రు. రహదారులు తవ్విన చోట వైట్ టాపింగ్రోడ్లను వేయాలన్నారు. పైప్లైన్ పనుల్లో ప్రమాదం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుం టానని మంత్రి హెచ్చరించారు. రాజేంద్రనగర్ పనుల ఆలస్యంపై ఆగ్రహం రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 2008–10 మధ్యకాలంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం జరగడంపై పనులు చేపట్టిన సంస్థలు, సంబంధిత అధికారులపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం జాప్యం అవడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జలమండలి ఎండీ దానకిశోర్కు సూచించారు. ‘యాన్యుటీ’లో ఔటర్ తాగునీటి పథకం? ఔటర్ రింగ్రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చేందుకు జలమండలి రూ. 628 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకాన్ని పూర్తిగా ప్రైవేటు నిధులతో (యాన్యుటీ) చేపట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది. -
నత్తకు ముత్తాతలు
ముదిగుబ్బలో మూడేళ్లగా సాగుతున్న తాగునీటి పథకం పనులు – రూ. కోట్లు ఖర్చుచేస్తున్నా.. 120 గ్రామాలకు చుక్కనీరు అందని వైనం ధర్మవరం/ముదిగుబ్బ: ప్రాజెక్ట్ పేరు : సమగ్ర మంచినీటి పథకం (ముదిగుబ్బ మండలం) లక్ష్యం: ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రజలకు ఉపయోగం : సుమారు 90,000 మందికి పనులు జరగనప్పుడు ఆశయం ఎంత మంచిదైతే మాత్రం ఫలితమేముంటుంది..? ముదిగుబ్బ మండలంలో వేలాది మంది ప్రజలు దాహం కేకలు పెడుతున్నా కాంట్రాక్టర్లు, అధికారులకు చెవికెక్కడం లేదు. 86 గ్రామాలకు మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులు మూడేళ్లుగా నత్తనడకన జరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. కాంట్రాక్టర్కు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నా పనులెందుకు పూర్తి కావడంలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చేవారు కరువయ్యారు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2013 జూలై 30న ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో రూ. 21.40 కోట్లతో బహత్తర పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులకు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లోని 120 గ్రామాలకు 2014 నవంబర్ నాటికి మంచినీటిని అందివ్వాలన్నది లక్ష్యం. దీని కోసం జాతీయ గ్రామీణ మంచినీటి అభివద్ధి పథకం (ఎన్ఆర్డబ్ల్యూపీ) కింద రూ. 21.40 కోట్ల కేంద్రం నిధులు మంజూరయ్యాయి. తొలివిడతగా రూ. 7 కోట్లు, మలివిడతగా మరో రూ. 14 కోట్లు ఇచ్చేలా టెండర్ ఖరారు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సత్యసాయి వాటర్ సప్లై స్కీంద్వారా ఈ ప్లాంటకు వచ్చిన నీటిని శుద్ధిచేసి, రోజుకు 30 మిలియన్ లీటర్ల శుద్ధజలాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలకు అందించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. అయితే ఆ పనులు పూర్తికాకపోవడంతో 120 గ్రామాలకు నేటికీ చుక్కనీటిని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. గడువు ముగిసినా కదలికేదీ వాస్తవానికి గతేడాది సెప్టెంబర్ నాటికే కాంట్రాక్టర్ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరగటంతో కాలపరిమితిని పెంచారు. ప్రాజెక్ట్ పనుల్లో బాగంగా మొదటి విడతలో ప్లాంట్, రెండో విడత కింద గ్రామాల్లో ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. తొలిదశలో పనులు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా మలి దశపనుల్లో తీవ్ర జాప్యం జరగుతోంది. వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ పనులు జాప్యం చేస్తున్నారు. 2014 సెప్టెంబర్ 7న రెండో దశ పనులు ప్రారంభమయితే.. సంపులు ఇంకా ఫిల్లర్ల (పునాది) దశలోనే ఉన్నాయి. ఈ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేందుకు దాదాపు మరో నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం వచ్చే వేసవికైనా మంచినీరు తాగగలమా? లేదా? అని మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల్లో నీళ్లు ఇస్తాం సంపుల నిర్మాణానికి కావాల్సిన స్థలాలు సేకరించడంలో జాప్యం జరిగింది. సంప్ నిర్మాణం చేసే స్థలం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి, మా సంస్థపేరిట రిజిస్ట్రేషన్ చేసిన తరువాత పనులు ప్రారంభించారు. పైపులైన్ల పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇక మిగిలింది సంప్ నిర్మాణం ఒక్కటే .. దాదాపు టాప్ లెవల్కు వచ్చింది. త్వరలోనే పూర్తవుతుంది. ఏది ఏమైనా రెండు నెలల్లో శుద్ధి జలాలను ఆయా గ్రామాల ప్రజలకు సరఫరా చేస్తాం. – రాజశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ -
గొంతు తడిచేదెప్పుడు..?
► గడువు ముగిసి నాలుగేళ్లయినా పూర్తికాని ఏజెన్సీ తాగునీటి పథకం ► కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం.. ► ఏటా కొనసాగుతున్న 226 గ్రామాల వాసులకు క‘న్నీటి’ కష్టాలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదివాసీ గొంతులు తడిపేందుకు చేపట్టిన తాగునీటి పథకం అది.. రూ.78 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం పనులు ఏళ్లు గడుస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు. సుమారు ఆరేళ్లుగా ఈ పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారవడం విమర్శలకు దారితీస్తోంది. కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం.. ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా విభాగం) అధికారుల అలసత్వం వెరసి నిర్దేశిత గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావడం లేదు. వీటి రూ.కోట్లలో నిధులు మాత్రం నీళ్లలా ఖర్చవుతున్నప్పటికీ, ఆదివాసీల గొంతులు ఈ ఏడాది కూడా తడవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు, మూడేళ్లయినా వీరి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఏజెన్సీ గొంతు తడిపేందుకు.. ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, ఉట్నూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల పరిధిలోని 226 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కొమురం భీమ్ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. 2012 మార్చిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ఏడాది వేసవిలో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. అడ ప్రాజెక్టు నుంచి భారీ పైప్లైన్లను నిర్మిస్తున్నారు. ఆరు చోట్ల పంప్హౌజ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాదైనా కన్నీటి కష్టాలు తీరుతాయని.. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే ఇక్కట్లు తొలగిపోతాయని అడవిబిడ్డలు భావించారు. కానీ.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీ ఆది నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అటవీ అనుమతుల పేరుతో ప్రారంభంలో పనులు పూర్తి చేయకపోగా, తాజాగా రోడ్డు పనుల పేరుతో మరింత జాప్యం చేస్తోందనే ఆరోపణలున్నాయి. గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం తుది దశకు కూడా చేరడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నత్తనడకన పనులు.. అడ ప్రాజెక్టు నుంచి పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. పలుచోట్ల ఈ పైపులు లీకేజీ అవుతున్నాయి. ముఖ్యంగా జోడేఘాట్, కెరమెరి మండల పరిధిలో కూడా లీకేజీలు వెలుగుచూడటంతో ఈ పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా తయారైంది. ఇక పంప్హౌజ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కెరమెరి మండలం ధనోరా, కేస్లాగూడ వద్ద చేపట్టిన పంప్హౌజ్ పనులు పూర్తి కావస్తున్నాయి. అలాగే నార్నూర్ మండలం జామడ, జైనూర్ మండలం భూసిమెట్ట వద్ద కూడా పంప్హౌజ్ పనులు కొలిక్కి వచ్చాయి. కానీ.. పలు గ్రామాలకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీ పైప్లైన్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సిర్పూర్ (యు) మండలంలోని పంప్హౌజ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేగవంతం చేయిస్తున్నాం.. ఏజెన్సీకి తాగునీరందించే తాగునీటి పథకం పనులు వేగవంతం చేయించేందుకు చర్యలు చేపట్టాము. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో నిబంధనల ప్రకారం కాంట్రాక్టు కంపెనీపై చర్యలు తీసుకుంటాం. - మల్లేష్గౌడ్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఈ -
మంచినీటి పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్
సింహాద్రిపురం :వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులోని అంకాలమ్మ దేవాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అంకాలమ్మతోపాటు పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ నిధులతో గ్రామంలో చేపట్టిన మంచినీటి పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. -
హంద్రీ నీవాను తాగునీటి పథకంగా మార్చే కుట్ర
- చంద్రబాబు తీరుపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం - సర్కారు వైఖరికి నిరసనగా 3న ఉరవకొండలో రైతు సదస్సు అనంతపురం సెంట్రల్ : హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని మరోమారు తాగునీటి పథకంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నాడని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు కోసం ఉరవకొండ నియోజకవర్గంలో వేలాది మంది రైతులు వారి భూములను కోల్పోయారన్నారు. గత ప్రభుత్వ హాయంలోనే 96శాతం హంద్రీనీవా మొదటి దశ పూర్తయిందని, మూడేళ్లుగా జిల్లాకు నీళ్లొస్తున్నాయన్నారు. కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే తొలిదశలోని 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చునని వివరించారు. అయితే ప్రభుత్వానికి ఆయకట్టుకు నీరివ్వాలనే ద్యాసే లేదని మండిపడ్డారు. ఎంతసేపూ చిత్తూరు జిల్లాలోని సీఎం సొంతనియోజకవర్గం కుప్పంకు నీటిని తరలించుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా 1 టీఎంసీ మాత్రమే కేటాయింపు ఉన్న కుప్పంకు 2 టీఎంసీలకు పెంచారని గుర్తు చేశారు. అయితే మొదటి దశలోని ఆయకట్టును కాదని రెండదశలో చివరనున్న చిత్తూరు జిల్లాలకు నీటిని తీసుకుపోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాలువగట్లు తెంచైనా సరే ఆయకట్టుకు నీరు విడుదల చేసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్టీరామారావు సాగునీటి పథకంగా ప్రారంభిస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు 5.5 టీఎంసీల తాగునీటి పథకంగా కుదించారని గుర్తుచేశారు. 2004లో అధికారం చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 40 టీఎంసీల సాగు,తాగునీటిప్రాజెక్టు మార్చారని వివరించారు. గడిచిన 18 ఏళ్లలో 14 సార్లు జిల్లాలో కరువు వ స్తే ఈ జిల్లా ప్రజలు ఎలా తట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు నగలు, ట్రాక్టర్లను వేలం వేసి రైతులను అవమానానికి గురి చేస్తున్నారని అన్నారు. పుష్కరాలకు రూ. 1600 కోట్లు, పట్టిసీమకు రూ. 1000 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను అందించిన అనంతపురం జిల్లా ప్రజల కోసం హంద్రీనీవాకు నిధులు విడుదల చేసి ఆయకట్టుకు నీరిస్తే ఆత్మహత్యలే ఉండవని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక 14 నెలల సమయంలో హంద్రీనీవాకు ఎంత ఖర్చు చేశారు? ఎన్ని ఎకరాలకు నీరిచ్చారు? కనీసం కరెంటు బిల్లులైనా కట్టారా? అని ప్రశ్నించారు. ఎంతసేపు అరకొరగా చెరువులకు నీరిచ్చి జిల్లా మంత్రులు ‘షో’ చేస్తున్నారని విమర్శించారు. పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న 50 వేల ఎకరాలు ఆయకట్టు అభివృద్ది గురించి పట్టించుకున్నారా? ప్రశ్నించారు. సర్కారు ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా ‘హంద్రీనీవా ఆయకట్టు నీటి సాధన సమితి’ ఆధ్వర్యంలో 3న ఉరవకొండలో రైతు సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపక్షాల నుంచి మద్దతు వస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రజలు, అన్ని రాజకీయపార్టీల నాయకులు, మేదావులు, ప్రముఖులు విచ్చేసి రైతుసదస్సును విజయవంతం చేసి జిల్లా ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలిసొచ్చేలా గళం వినిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
జూరాల.. ఎన్నాళ్లిలా...?
184 గ్రామాల తాగునీటి పథకానికి లీకేజీల గ్రహణం గద్వాల: గద్వాల రెవెన్యూ డివిజన్లోని సుమారు 184 గ్రామాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన జూరాల భారీ తాగునీటి పథకం లీకేజీలమయంగా మారింది. అస్తవ్యస్తంగా పనులు చేపట్టడంతో ఫైబర్ పైపులు పగిలిపోయి ఏ గ్రామానికీ తాగునీటిని అందించలేకపోయారు. రూ.110కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం పైపులైన్లు లీకేజీలకు గురికావడంతో ప్రభుత్వం నాలుగునెలల క్రితం బాధ్యులను తేల్చేందుకు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఫైబర్ పైప్లైన్ల పగుళ్ల తీరు, ఎవరు కారణం, లోపాలు ఏమిటనే కోణంలో విచారించి వాస్తవాలను తేల్చాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలలుగా విచారణ సాగుతున్నా బాధ్యులు ఎవరనే విషయాన్ని తేల్చలేకపోతున్నారు. లీకేజీల కారణాలు, డిజైన్ రూపకల్పన, ఫైబర్ పైపుల అనుమతి, నీటిఒత్తిడిని అంచనా వేయకుండా అనుమతించడం వంటి అంశాలపై విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలాఉండగా, జూరాల భారీతాగునీటి పథకం ఫిల్టర్ బె డ్స్, కొండగట్టుపై నిర్మించిన భారీ భాం డాగారాన్ని వాటర్గ్రిడ్లో చేర్చారు. లీకేజీల మయం.. నిర్వహణలోపం 2006లో భారీ తాగునీటి పథకానికి శం కుస్థాపన చేశారు. మొదటిదశలో ఈ తా గునీటి పథకం నిర్వహణకు హడ్కోద్వా రా రూ.30కోట్లు కేటాయించారు. త దనంతరం మిగతా పనులను పూర్తి చేసేం దుకు అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అ నుమతితో నిధులు కేటాయిం చారు. 2012 ఆగస్టు నాటికి జూరాల భారీ తా గునీటి పథకం, ఫిల్టర్బెడ్స్, పంపింగ్ స్టేషన్, కొండగట్టుపై గ్రావిటీ వాటర్ ట్యాంకు నిర్మాణాలు పూర్తిచేశారు. అదే ఏడాది పథకాన్ని ప్రారంభించే సమయంలో ఫిల్టర్బెడ్స్ నుంచి కొండగట్టుపై ఉన్న వాటర్ట్యాంకు వరకు నీటిని సరఫరా చేసే నాలుగున్నర కిలోమీటర్ల మేర ప్రధాన పైప్లైన్కు లీకేజీలు ఏర్పడ్డాయి. దాదాపు 60చోట్లకు పైగా లీకేజీలు ఏర్పడటంతో విసిగిపోయిన ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఫైబర్పైపుల స్థానంలో డీఐ పైపులను వేయాల్సిందిగా అనుమతించారు. ఏడాది క్రితం డీఐ పైపులను కొండగ ట్టు వరకు వేసి ట్రయల్న్ ్రనిర్వహించి విజయవంతమయ్యారు. కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్ నుంచి గ్రావిటీఫ్లో ద్వారా డివిజన్ పరిధిలోని 184 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడంలో భాగంగా మొదటిదశలో 31 గ్రామాలకు ట్రయల్న్ ్రప్రారంభించారు. ఆదిలోనే లీకేజీలు ఏర్పడటంతో ఒక్క గ్రామానికి కూడా నీళ్లివ్వలేని పరిస్థితి నెలకొంది. ఓ చోట మరమ్మతులు చేసి ట్రయల్న్ ్రప్రారంభిస్తే మరోచోట లీకేజీలు ఏర్పడ్డా యి. దీంతో ఫైబర్ పైపుల స్థానంలో డీ ఐ పైపులను వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వాటర్గ్రిడ్ పథకంలో జూరాల భారీ తాగునీటి పథకాన్ని చేర్చారు. నాసిరకం పనులు, లీకేజీలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని తాగునీటిని సరఫరా చేయాలని ఈ ప్రాంతప్రజలు కోరుతున్నారు. -
నీరుపయోగం
ముందుకు సాగని తాగునీటి పథకాల పనులు రూ.కోట్లు ఖర్చు చేసినా.. చుక్క నీరందని పరిస్థితి జిల్లాలో సీపీడబ్ల్యూఎస్ తాగునీటి పథకాల దుస్థితి తీరిదీ..! చెన్నూర్తో పాటు, 14 పరిసర గ్రామాల ప్రజల గొంతు తడిపేందుకు రూ.4.50 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ఇది. ఇప్పటికే ఈ పనులు పూర్తయి.. 2015 మార్చిలో దీని పరిధిలో ఉన్న నివాసిత ప్రాంతాలకు తాగు నీరందించాలి. కానీ ఇప్పటివరకు కనీసం 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ వేసవే కాదు, వచ్చే వేసవిలోనూ పథకం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆదిలాబాద్ : వేసవి ముంచుకొచ్చినా.. తాగునీటి పథకాల పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. జిల్లాలో రూ.వందల కో ట్లతో చేపట్టిన సమగ్ర సురక్షిత తాగునీటి పథకాల పనుల ప్రగతి అధ్వానంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా ఈ పనులు ముందుకు సాగడం లేదు. రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నా.. ప్రజలకు గుక్కెడు తాగునీరు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయకుండా చేతులెత్తేయడంతో ప్రజల గొంతులు తడపడం లేదు. ఎప్పటి కప్పుడు పనులను పూర్తి చేయించడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పరిధిలో లేని సీపీడబ్ల్యూఎస్ (మల్టీవిలేజ్) పథకాల ప్రగతిని పరిశీలిస్తే.. జిల్లాలో 1,111 నివాసిత ప్రాంతాల కు తాగునీటిని సరఫరా చేసేందుకు సుమారు రూ.457 కోట్లుతో 22తాగునీటి పథకాల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఏడు తాగునీటి పథకాలను వాటర్గ్రిడ్ పరిధిలో చేర్చారు. మిగిలిన 15 సీపీడబ్ల్యూఎస్ పథకాల్లో ఏడు తాగునీటి పథకాల పనుల ప్రగతి అధ్వానంగా తయారైంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీలైనంత మేరకు బిల్లులు డ్రా చేసుకున్నారు. మిగిలిన పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు గడువు కొ న్నింటికి దగ్గర పడినప్పటికీ పనులు బాలారిష్టాలను దాటడం లేదు. కొన్నింటికి గడువు ముగిసినప్పటికీ పనులు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ పథకాల పనుల తీరును పరిశీలిస్తే.. ఉట్నూర్తోపాటు, 42 నివాసిత ప్రాంతాల ప్రజల గొంతులు తడిపేందుకు రూ.10 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ పథకం పనులు చేపట్టారు. కాంట్రాక్టర్కు రూ. 5.54 కోట్ల మేరకు బిల్లులు చెల్లించారు. కానీ ప్రజల గొంతు మాత్రం తడవ డం లేదు. మూడేళ్లుగా పైప్లైన్ పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ వద్ద వాటర్ ట్యాంక్ నిర్మించారు. గ్రామాలకు డిస్ట్రిబ్యూషన్ పనులు జరుగుతున్నాయి. మరో రెండేళ్లయినా ఈ పనులు కొలిక్కి వచ్చేలా లేవు. చెన్నూర్ మండలం సోమన్పల్లి, మరో 17 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.9 కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఇప్పటికే ఈ పనులు దాదాపు పూర్తి కావాలి. జూన్ వరకు తాగునీటిని సరఫరా చేయాలి. కానీ 2.5 కిలోమీటర్ల మేరకు నిర్మించాల్సిన పైప్లైన్ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. విద్యుత్ సౌకర్యం లేక రూ.1.52 కోట్లతో చేపట్టిన భీమారం తాగునీటి పథకం పనులు అసంపూర్తిగా నిలిచాయి. విద్యుత్ కనెక్షన్ పూర్తయితే కానీ, ఐదు గ్రామాల ప్రజల గొంతు తడవదు. ఏజెన్సీ ఏరియాలోని 187 ఆదివాసీ, గిరిజన గూడాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.68 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఒక్క కెరమెరి మండలంలోని 47 నివాసిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసుతన్నారు. లక్సెట్టిపేట, మరో నివాసిత ప్రాంతానికి ఫేస్ 2లో భాగంగా రూ.కోటి 41 లక్షలతో తాగునీటి పథకం నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటివరకు రూ.44 లక్షలు ఖర్చు చేశారు. కానీ.. ప్రజల గొంతు మాత్రం తడవలేదు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు పది ఆవాస ప్రాంతాలకు రూ.7.75 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పరిస్థితి కూడా అలాగే ఉంది. రూ.23 లక్షలు ఖర్చయినా పనులు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. -
సారపాక ప్రాజెక్టు రోల్మోడల్ కావాలి
తాగునీటి వృథాను అరికట్టాలి : కలెక్టర్ ఇలంబరితి సారపాక(బూర్గంపాడు): మండలంలోని సారపాకలో ఐటీసీ ఆర్థిక, సాంకేతిక సహకారంతో చేపట్టిన ఇంటింటికి తాగునీటి పథకం తెలంగాణ రాష్ట్రంలోనే రోల్మోడల్గా నిలవాలని కలెక్టర్ ఇలంబరితి అన్నారు. సారపాకలోని తాళ్లగొమ్మూరులో రూ.9 కోట్ల వ్యయంతో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఇంటింటికి తాగునీటి పథకానికి శుక్రవారం కలెక్టర్ ఇలంబరితి పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలే పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఐటీసీ సీఈఓ సంజయ్సింగ్, సర్పంచ్ చందూనాయక్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ3 కోట్ల వ్యయంతో ఐటీసీ పీఎస్పీడీ ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనాన్ని (ఐటీసీ- ధరావత్ రాజు కమ్యూనిటీహాల్)ను వారు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటింటికి తాగునీటి పథకాన్ని రూపొందించాలని, తాగునీరు వృథా కాకుండా మీటర్లను అమర్చాలని అన్నారు. ఇంటింటికీ తాగునీటి పథకంలో మీటర్లు అమ ర్చి ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయడం వల్ల నీటి వృథా తగ్గుతుందని అన్నారు. అలాగే పథకం నిర్వహణకు నిధుల కొరత ఉండదని అన్నారు. పరిసర గ్రామాల అభివృద్ధికి ఐటీసీ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఆస్పత్రికి, క్రీడామైదానాలకు భూమి కేటాయించాలి : ఎమ్మెల్యే పాయం పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో కార్మికులకు, స్థానికులకు వైద్యసేవలు అందించేందుకు ఐటీసీ యాజమాన్యం ఈఎస్ఐ ఆస్పత్రికి భవనం నిర్మించాలని, అందుకోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ను కోరారు. సారపాకలో క్రీడామైదానాన్ని ఐటీసీ వారు అభివృద్ధి చేయాలని అన్నారు. ఐటీసీ మెగా ప్రాజె క్టు ఏర్పాటుకు స్థానికులు తగు విధంగా సహకరిస్తారని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్ సారపాకలో ఈఎస్ఐ ఆస్పత్రి, క్రీడామైదానానికి ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఐటీసీ సీఈఓ సంజయ్సింగ్ కూడా స్పందించారు. ఆస్పత్రి భవన నిర్మాణానికి ఐటీసీ సహకరిస్తుందని అన్నారు. అనంతరం ఆశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతు ఐటీసీ పరిసర గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఐటీసీ సీఈఓ సంజయ్సింగ్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్న స్థానికులకు మేలు చేసేందుకు ఐటీసీ కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ నాగహరి, జనరల్ మేనేజర్లు సీహెచ్ విజయసారధి, ఎన్బీ శ్రీనివాసరావు, కృష్ణమోహన్, తహశీల్దార్ అమర్నాథ్, ఎంపీడీఓ ధన్సింగ్, కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పీవీ రామారావు, పాకాల దుర్గాప్రసాద్, బూసిరెడ్డి శంకరరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు పోటు రంగారావు, మారం వెంకటేశ్వరరెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ముందుచూపేదీ?.
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.36.50 కోట్లతో ఏడేళ్ల కింద చేపట్టిన మంచినీటి పథకం మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. తరచూ లీకేజీలతో నీరందించేందుకు ఆపసోపాలు పడుతున్న ఈ నీటి పథకానికి అధికారుల ముందుచూపు లేమితో మరో గండం వచ్చింది. సిరిసిల్ల-వేములవాడ పట్టణాల మధ్య ఫోర్లేన్ రహదారి నిర్మాణం జరుగుతుండగా.. పైపులైన్ పైనే రోడ్డు వేస్తున్నారు. రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలతో పైపులైన్ పగిలితే అటు రోడ్డుకు, ఇటు నీటి సరఫరాకు ముప్పు తప్పదు. పైపులైన్ను మింగేస్తున్న ఫోర్లేన్ సిరిసిల్ల-వేములవాడ పట్టణాల మధ్య ఏడు కిలోమీటర్ల డబుల్ రోడ్డును ఫోర్లేన్గా విస్తరిస్తున్నారు. రూ.16 కోట్లతో ఫోర్లేన్ పనులు జరుగుతున్నాయి. పైపులైన్ పైన కొత్తగా రహదారి వేయడంతో ఎప్పుడు పైపు పగిలిపోయినా రహదారికి, నీటి సరఫరాకు ముప్పు వాటిళ్లుతుంది. పైపులైన్ నిర్మాణ దశలో ఇంజినీర్లు రహదారి విస్తరణను దృష్టిలో ఉంచుకొని మరింత ఎడంతో పైపులైన్ వేస్తే ఈ ప్రమాదం వచ్చేది కాదు. దీనికితోడు కరీంనగర్-కామారెడ్డి డబుల్ రోడ్డును భవిష్యత్లో ఫోర్లేన్గా మార్చుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఫోర్లేన్ నిర్మాణం జరిగితే కరీంనగర్ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ మొత్తం రహదారి అడుగుభాగంలో భూస్థాపితమయ్యే ప్రమాదముంది. పైపులైన్ మూలంగా దీర్ఘకాలం మన్నికగా ఉండాల్సిన రహదారి సైతం చెడిపోయే అవకాశముంది. షిఫ్టింగ్కు రూ.12 కోట్ల ఖర్చు ప్రజాధనమంటే అధికారులకు లెక్కలేకుండా పోయింది. రూ.16 కోట్లతో నిర్మిస్తున్న ఫోర్లేన్ పనుల్లో భాగంగా మంచినీటి పైపులైన్ను షిఫ్టింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అక్షరాలా రూ.12 కోట్లు ఖర్చవుతుందని మున్సిపల్ అధికారులు అంచనా వేసి ఆర్అండ్బీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. పైపులైన్ షిప్టింగ్కు సర్కారు నుంచి అనుమతి రావాల్సి ఉందని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ బి.సుమన్రావు తెలిపారు. తలకు మించిన భారం.. సిరిసిల్ల పట్టణానికి సమీపంలోనే మానేరువాగు ఉంది. దశాబ్దకాలంగా పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను మానేరు వాగే తీరుస్తోంది. పక్కన ఉన్న వాగును వదిలేసి నలభై కిలోమీటర్ల దూరంలోని ఎల్ఎండీ నుంచి పైపులైన్ నిర్మించి సిరిసిల్లకు నీరు అందించాలని 2007లో రూ.36.50 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. ఆ నిధులతో కరీంనగర్ ఎల్ఎండీ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ వేశారు. రగుడు వద్ద నీటి శుద్ధి ప్లాంట్ను నిర్మించారు. నిర్మించిన నాటి నుంచి లీకేజీలతో నీటి పథకం నీరుగారిపోతోంది. మూడేళ్లపాటు కాంట్రాక్టర్ ఈ పథకాన్ని అతి కష్టమ్మీద నిర్వహించి మున్సిపాలిటీకి అప్పగించారు. దీంతో నిర్వహణ ఖర్చులు మున్సిపాలిటీకి తలకుమించిన భారమైంది. ఎల్ఎండీ వద్ద మోటార్లు ఆన్చేస్తే మూడు గంటల వరకు సిరిసిల్లకు చుక్కనీరు చేరదు. ఆలోగా కరెంటు అంతరాయం ఏర్పడితే అంతే సంగతులు. ఇలా నీటి పథకం దినదిన గండంగా వెల్లదీస్తోంది. ఇప్పటికీ నీటి పంపింగ్ కష్టంగానే మారింది. పథకం నిర్మాణ దశలోనే ఇంజినీర్ల పర్యవేక్షణలోపం, ప్రజాప్రతినిధుల అవినీతిదాహం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. నీటి కష్టాలు తీరేదెలా..? సిరిసిల్ల శివారులో ఉన్న మానేరువాగు నుంచి నీటిని పంప్ చేస్తూ నల్లా నీరు అందిస్తుండగా, శివారు ప్రాంతాల్లో నీటి కష్టాలు తప్పడం లేదు. ఎల్ఎండీ పైపులైన్ పగుళ్లతో ‘నీరు’ గారిపోతుండగా మానేరువాగు నీరే దిక్కవుతోంది. సిరిసిల్లలో ఎనిమిదివేల నల్లాలు ఉండగా ఆరు ప్రాంతాల్లోని వాటర్ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని అందిస్తున్నారు. పట్టణంలోని తారకరామనగర్, గణేశ్నగర్, సుందరయ్యనగర్, బీవైనగర్, వెంకంపేట, ప్రగతినగర్ ప్రాంతాల్లో పైపులైన్లు ఉన్నా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటర్గ్రిడ్లో భాగంగా మధ్యమానేరు జలాశయం నుంచి నీటిని పంప్ చేసి సిరిసిల్ల ప్రాంతంలోని 307 గ్రామాలతో పాటు పట్టణానికి అందించాలని రూ.670 కోట్లతో ప్రతిపాదించింది. ఇక రూ.36.50 నీటిపథకం పూర్తిగా నిరుపయోగంగా మారనుంది. -
‘శ్రీరామిరెడ్డి’ పనుల్లో నాణ్యతా లోపం
మడకశిర: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనుల్లో నాణ్యత లోపించిందని, ఫలితంగానే పలు గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య నెలకొని ఉందని జెడ్పీ చైర్మన్ చ మన్సాబ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.600 కోట్లతో చేపట్టిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనులు గత కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యంగా చేయలేదని, నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. ఈ పథకం ద్వారా 832 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు. పనులు సక్రమంగా చేయక పోవడంతో 600 గ్రామాలకే తాగునీరు అందుతోందన్నారు. తమ ప్రభుత్వం ఈ పథకం పనులను నాణ్యతగా పూర్తి చేసి మిగిలిన గ్రామాలతో సహా నిర్దేశించిన అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, తాగునీటి కోసం ప్రస్తుతం రూ.3.40 కోట్ల నిధులను కేటాయించామని ఆయన వెల్లడించారు. అలాగే 282 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం నిధుల కొరత ఉందని, దీంతో కొన్ని సమస్యల్ని పరిష్కరించలేక పోతున్నామని అన్నారు. మరో ఆరు నెలల వరకు నిధుల కొరత ఉంటుందని, తర్వాత ఆ సమస్య ఉండబోదని చెప్పారు. జిల్లాలో పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు తాగునీటి సమస్య ఉందని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కాకపోతే చర్యలు తప్పవని జెడ్పీ చైర్మన్ హెచ్చరించారు. దేశంలోనే అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతమైతే, జిల్లాలో మడకశిర నియోజకవర్గం మరింత క్షామ పీడిత ప్రాంతమని, ఇక్కడ తాగునీటి సమస్య కూడా అధికంగా ఉందని అన్నారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబునాయుడు ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, వాటిని పరిష్కరించేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, తదితరులు పాల్గొన్నారు. -
లింగాపుట్టులో పీహెచ్సీకి కృషి
త్వరలో రక్షిత తాగునీటి పథకం నిర్మాణం పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి హామీ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి బాధిత కుటుంబాలకు పరామర్శ పాడేరు రూరల్ : మండలంలోని లింగాపుట్టు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హామీ ఇచ్చారు. వరుసగా అంతుచిక్కని మరణాలతో బెంబేలెత్తిపోతున్న లింగాపుట్టు గ్రామాన్ని సోమవారం ఆమె సందర్శించారు. రెండు వారాల వ్యవధిలో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ఆమె పరామర్శించి ఓదార్చారు. తాగునీటి పథకం మూలకు చేరడంతో, కలుషితమైన బావి నీటినే ఉపయోగిస్తున్నామని, రోగాలకు ఇదే కారణమని గిరిజనులు ఎమ్మెల్యే ఈశ్వరి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె తాగునీటి బావులను పరిశీలించారు. తోటలగొంది గ్రామం నుంచి పైపులైన్లను ఏర్పాటు చేసి రక్షిత తాగునీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐకేపీ అధికారుల జాడ కరువైందని, గిరిజనులు మృతి చెందుతున్నా ఆపద్బంధు పథకం కింద వారి పేర్లను నమోదు చేయడంలేదని బాధిత కుటుంబాలవారు తెలుపగా అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే చెప్పారు. పారిశుద్ధ్య మెరుగుపరచాలని వీఆర్వోను ఆదేశించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటంలో విఫలమైందని, ఫలితంగా ఇప్పుడు గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడి మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వివరిస్తానన్నారు. ఆమె వెంట ఇన్చార్జీ ఏడిఎంహెచ్వో డాక్టర్ లీలాప్రసాద్, మినుములూరు పీహెచ్సీ వైదాధికారి ఒ. గోపాలరావు, ఇన్చార్జి ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్, పంచాయతీ విస్తరణాధికారి కె. వెంకన్నబాబు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవాకు ప్రాధాన్యంప్రశ్నార్థకమే!
అనధికారికంగా ప్రాజెక్టు గడువు పెంచుతున్న ప్రభుత్వం 2012కే పూర్తి కావాల్సింది..2015 నాటికి గడువుపెంపు? ఉపకాలువల పనులు చేపట్టని కాంట్రాక్టర్లు బి.కొత్తకోట: హంద్రీ-నీవా సుజలస్రవంతి సాగు, తాగునీటి ప్రాజెక్టు పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ప్రాధాన్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఈ ప్రాజెక్టును ఎత్తివేసి రూ.755కోట్లతో 5టీఎంసీలతో తాగునీటి పథకంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. రాయలసీమ వరప్రసాదిని అయిన ఈ ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రెండుదశల్లో చేపట్టి పనులు ప్రారంభించారు. ఆయన హయాంలో 2005లో ప్రారంభమైన పనులను 2012నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యం నిర్దేశించారు. దీనికి తగినంత నిధులిచ్చారు. శరవేగంగా పనులు జరిగాయి. ఆయన మరణానంతరం పనుల్లో జాప్యంతో, ప్రాజెక్టు గడువును 2013 డిసెంబర్కు పెంచారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తిచేసేందుకు గడువును 2015 డిసెంబర్కు పెంచే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో పనుల వేగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపే పరిస్థితులున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల పూర్తికి కనీస ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించకపోయినా.. ఆ దిశగా అడుగులు కనిపించడంలేదు. రెండో దశకు రూ.3,729కోట్ల ఖర్చు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సాగే రెండోదశతో రూ.4,076 కోట్లతో 4.70లక్షల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు నిర్ణయించారు. ఇందులో ఇంతవరకూ పనులకోసం రూ.2,892 కోట్లు ఖర్చుచేశారు. ఇదికాక జాతీయ రహదారుపై బ్రిడ్జిల నిర్మాణం, భూసేకరణ, విద్యుత్కోసం ట్రాన్స్కోకు, అటవీశాఖకు డిపాజిట్ చేసిన నిధులతో కలుపుకుని రూ.3,729.52 కోట్లు వ్యయం చేశారు. ఇంకా రూ.1,184 కోట్ల పనులు పూర్తి చేయాల్సివుంది. గడువు పెంచడమే? రెండోదశ ప్రాజెక్టు పనులను 2012 డిసెంబర్కు పూర్తిచేయాలనీ వైఎస్.రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఆయన తర్వాత 2013 డిసెంబర్కు పెంచారు. ఇప్పుడు మళ్లీ 2015 డిసెంబర్ నాటికి పెంచుతున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనప్పటికీ చేపట్టిన పనులను 2015కు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు గడువు పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. అవసరమైన నిధులు కేటాయించకపోతే పనుల్లో వేగం ఉండదు. ఇంతకంటే ఎక్కువ జాప్యం జరుగుతుంది. దీనివల్లే గడువుపెంచితే నిధుల కేటాయింపు సమస్య ఉండదని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కాగా రెండు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఆగిపోయిన పనులు ప్రారంభం కావాల్సివుంది. ఎత్తిపోతల పథకాల పనులు సాగుతుండగా, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలు ఇంకా మొదలుకానే లేదు. ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో రెండోదశ పనులు పూర్తిగా పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుపూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందా లేదా అన్నది బడ్జెట్ కేటాయింపుల్లో తేలిపోనుంది. ఉపకాలువల ఊసేలేదు ప్రాజెక్టులో భాగమైన ఉపకాలువల పనులు ఇంతవరకూ పూర్తిస్థాయిలో చేపట్టలేదు. కొన్ని ప్యాకేజీల్లో మాత్రమే ఈ పనులు చేపట్టారు. కాలువల పనులకు ఎకరాకు రూ.4,700తో కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం రూ.10,500కు పెంచాలని కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఎకరాకు రూ.5,800 పెంచే నిర్ణయం గతప్రభుత్వం తీసుకోకపోవడంతో ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. దీంతో పనులు ప్రారంభంకాలేదు. దీనికి అవసరమైన భూసేకరణ చర్యల్లోనూ జాప్యం జరుగుతూ వస్తోంది. కోరేదొకటీ.. ఇచ్చేదొకటీ.. వైఎస్ హయాంలో కేటాయింపులు వెయ్యికోట్లు దాటింది. ఆయన తర్వాత 2010-11లో రూ.640కోట్లు కేటాయించారు. 2011-12లో రూ.1,764 కోట్లు కోరితే రూ.695 కోట్లు ఇచ్చారు. 2012-13లో రూ.1,637 కోట్లడిగితే రూ.698, 2013-14లో రూ.1,251కోట్లు కావాలని కోరితే రూ.416కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టుకు ప్రాణంపోసిన వైఎస్ హయాంలో నిధులు భారీగా ఇచ్చారు. 2007-08లో రూ.925కోట్లు, 2008-09లో రూ.1,165కోట్లు, 2009-10లో రూ.1,000కోట్ల నిధులిచ్చారు. వీటిలో ప్రారంభంలో తొలిదశకు అధిక నిధులు ఖర్చుచేయడంతో 90 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కు రెండోదశకు రూ.750కోట్లు కలుపుకుని మొత్తం ప్రాజెక్టుకు రూ.900.80కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఎంత నిధులు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. నిధుల కేటాయింపును బట్టి పనుల వేగవంతం ఆధారపడివుంది. కమిటీ గడువిచ్చింది రెండోదశ పనులకు ప్రాజెక్టుల రాష్ట్ర కమిటీ గడువు ఇచ్చింది. 2015 డిసెంబర్లోగా పనులు పూర్తిచేసేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కోసం గడువు పెంచలేదు. దీనిపై ఆదేశాలు కూడాలేవు. ప్రస్తుతం పనుల్లో వేగం పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. -పీ.కృష్ణ, ప్రాజెక్టు ఎస్ఈ, మదనపల్లె -
నీటి యాతన
గ్లాసెడు నీటి విలువ తెలియాలంటే గాంధారి మండలంలోని బూర్గుల్కు వెళ్లాల్సిందే. గ్రామంలో కనీస నీటి సౌకర్యాలు లేక గ్రామస్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లి అనారోగ్యానికి గురై మహిళలు గర్భాన్ని కోల్పోతున్నారు. నీటిగోసతో బంధువులు ఊరికి రావాలంటేనే భయపడుతున్నారు. గ్రామ యువకులకు పిల్లలను ఇవ్వడం లేదు. నీటి సమస్యతో విడాకులైన ఘటనలు, ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలూ ఉన్నాయి. ఒక్కరోజు నీరు పట్టుకుం టే.. మూడు, నాలుగు రోజులు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఎడారి ప్రాంతంలో కూడా ఇంతటి నీటి కష్టాలు ఉండవేమో... గాంధారి రూరల్, న్యూస్లైన్: గుక్కెడు నీటికోసం గాంధారి మండలంలోని బూర్గుల్ గ్రామస్తులు కన్నీటి కష్టాలకు గురవుతున్నారు. దాహం తీర్చుకునే క్రమంలో గ్రామ మహిళలు కడుపుకోతకు గురవుతున్నారు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లితే.. గర్భశోకాలు మిగులుతున్నాయి. చిన్నా,పెద్ద, ముసలి అంటూ తేడా లేకుండా అంద రూ నీటికోసం ముష్టియుద్ధాలు చేయాల్సిందే. ఉదయం లే చింది మొదలు అర్ధరాత్రి వరకు నీటికోసం పాకులాడాల్సిందే. గర్భం దాల్చిన వారు నీళ్లు మోసి గర్భాన్ని పోగొట్టుకుంటుంటే.. పెళ్లికాని యువకులకు పిల్లనివ్వడంలేదు. బంధువులు ఊరికి రావాలంటేనే జంకుతున్నారు. కొందరు మహిళలు నీళ్లు మోయ డం చేతకాక భర్తలకు విడాకులు ఇచ్చారంటే గ్రామంలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీస నీటి వనరులు లేక బూర్గుల్ గ్రామస్తులను నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిన ఈ గ్రామంలో... అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస ఏర్పాట్లు చేయక పోవడంతో నీటికోసం వారు నానా పాట్లు పడుతున్నారు. గ్రామంలో మొత్తం జానాభా 1,150 మంది ఉన్నారు. వీరికోసం సింగిల్ఫేజు మోటార్లు గానీ చేతిపంపులు లేవు. రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోరు నుంచి పైపులైన్ ద్వారా అది విద్యుత్ సరఫరా ఉంటే వచ్చే సన్నని ధార వద్ద నీటిని పట్టుకుం టున్నారు. బిందెడు నీటికోసం తల్లీ పిల్ల, తండ్రీ కొడుకు, భార్యభర్తల మధ్యన బంధువులతో, స్నేహితులతో సైతం ముష్టియుద్ధాలకు దిగాల్సి న పరిస్థితి ఉంది. 2012లో గ్రామానికి వచ్చిన అప్పటి మంత్రి సుదర్శన్రెడ్డికి నీటి సమస్యను వివరిస్తే, దొంగలమర్రిలొంక కుంటకు నిధులు మంజూరు చేసి నీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరలేదు. గర్భాలు కోల్పోయి బూర్గుల్ గ్రామం గుట్టపైన, కింద రెండు భాగాలుగా ఉంది. గుట్టపై 1995లో ట్యాంకు నిర్మించారు. నీళ్లు లేక ట్యాంకును వృథాగా వదిలేశారు. వ్యవసాయ క్షేత్రంలోంచి వచ్చిన పైపులైన్ గుట్టకింద ఉంది. దీంతో ఇక్కడి నుంచే సన్నని ధార ద్వారా నీళ్లు తీసుకెళతారు. అలా నీటి బిందెలతో గుట్టపైకి ఎక్కుతున్న మహిళలు, పురుషులు అనారోగ్యాలకు గురవుతున్నారు. గ్రామంలో నర్సవ్వ, రేక, స్రవంతి, బాలమణి అనే మహిళలతో పాటు 30 మంది వరకు గర్భాలు కోల్పోయారు. పెళ్లీడు కొచ్చిన యువకులకు పిల్లనివ్వడంలేదు. పిల్లను ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన మాధవపల్లి సురేశ్ బొప్పాజువ్వాడికి ఇల్లరికం వెళ్లాడు. చంద్రు, లక్పతి మరో నలుగురికివిడాకులయ్యాయి. పది కుటుంబాలవారు గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాల కు వెళ్లారు. ఇంటికి రూ.5 వేల చొప్పున.. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులందరూ ఇంటికి రూ.5 వేల చొప్పున జమ చేసుకున్నారు. అలా రూ. 9 లక్షలతో ఐదు బోర్లు వేయించారు. అయినా చుక్క నీరు రాలేదు. ఎస్సీ కాలనీ వారు మళ్లీ మరో రూ. 2 వేల చొప్పున రూ. 22 వేలు జమచేసి పాత బోరు బావిలో మోటారు దింపారు. ప్రస్తుతం అందులో కూడా నీరు రావడంలేదు. గుమ్మడి చాకలి బాలవ్వ తన పంట చేనులో రూ.1.50 లక్షలతో బావి తవ్వించుకుంది. రెండు మూడు రోజుల్లో కుటుంబంతో సహా అక్కడికే వెళతానంటోంది. ఒకరోజు పట్టుకున్న నీళ్లు మూడు రోజుల వరకు తాగాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. ఈనెల 15న గ్రామంలో రాజరాజేశ్వరస్వామి జాతర ఉంది నీళ్లకు భయపడి జాతరకు బంధువులు ఎవరూ రావడం లేదని గ్రాస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బొప్పాజువ్వాడి వద్ద లేదా మూడు కిలోమీటర్ల దూరంలో బోరు వేసి తాగునీటి పథకం ద్వారా నీటిని అందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
పక్కనే మంజీర.. అయినా ఎక్కిళ్లే..
రాయికోడ్, న్యూస్లైన్: పక్కనే మంజీర పారుతున్నా.. చుక్కనీరు అందక రాయికోడ్ కన్నీళ్లు పెడుతోంది. నిత్యం నీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కేవలం రూ. 60 కోట్లు నిధులు ఖర్చు చేస్తే 47 గ్రామాలకు దాహార్తిని తీర్చే మంచినీటి పథకంపై పాలకులు శీతకన్ను వేశారు. పాంపాడ్ గ్రామ శివారులో మంజీర నదిలో అంతర్గత బావిని నిర్మించి, 100 హెచ్పీ సామర్థ్యం గల మోటార్లతో మంజీరా నీటిని ఆయా గ్రామాలకు తరలించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఈమేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 60 కోట్లు అవసరమవుతాయని అధికారు లు ప్రతిపాదనలు పంపారు. కానీ వైఎస్సార్ మరణంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2012 వార్షిక బడ్జెట్లో రూ.37.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పథకం సర్వే పనులే ఏడాదిపాటు సాగాయి. పాంపాడ్లో అంతర్గత బావి.. రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని 47 గ్రామాలకు నీరందించేందుకు మండల పరిధిలోని పాంపాడ్ నుంచి రెండు మండలాల్లోని ఆయా గ్రామాలకు సుమారు 150 కిలో మీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనుల మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 40 కిలోమీటర్ల మేర పైపులైను మాత్రమే ఏర్పాటైంది. అది కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. అంతర్గత బావి, ఫిల్టర్ బెడ్ నిర్మాణాల పనులు కూడా సాగుతున్నాయి. పనులు ఇలానే కొనసాగితే అంచనా వ్యయం భారీగా పెరగటంతో పాటు, ఏళ్ల తరబడి ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాయికోడ్ మండలంలోని 29 గ్రామా లు, మునిపల్లి మండలంలోని 18 గ్రామాలకు చెందిన 60 వేల జనాభాకు మంజీర నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మండలంలోని మహబత్పూర్ గ్రామంలో 1.75 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును నిర్మించాలి. అదేవిధంగా మహమ్మదాపూర్, ఝరాసంఘం మండలంలోని కప్పాడ్, ము నిపల్లి మండలంలోని మేళసంఘం గ్రామాల్లో మరో మూడు 90 వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకులను నిర్మించనున్నారు. ప్రజల్లో నైరాశ్యం వేసవి వచ్చిందంటే ఆయా మండలాల్లోని గ్రామీణులు గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలుసార్లు ప్రభుత్వాధికారులకు, నాయకులకు తమ గోడును విన్నవించారు. ఏడేళ్లు గడుస్తున్నా అధికారులు ఇదిగో వచ్చే.. అదిగో వచ్చే అని చెప్తున్నారే కాని కాల్వ నిర్మాణ పనులు మాత్రం పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దాహం.. దాహం
నడిగడ్డ ప్రాంతంలో వేసవికి ముందే నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చింది. చెంతనే రెండుజీవనదులు ఉన్నా తాగడానికి గుక్కెడునీళ్లు దొరకడం లేదు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తాగునీటి పథకాలు నిర్మించినా దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. కోట్లు ఖర్చుచేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో బిందెనీటి కోసం ప్రజలకు మైళ్ల దూరం నడక తప్పడంలేదు. తుంగభద్ర, కృష్ణా రెండు జీవనదుల మధ్య ఉన్న అలంపూర్ ప్రజలను నిత్యం నీటికష్టాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలోని 145 గ్రామాల్లో సుమారు 50 గ్రామాలకు నాలుగు పథకాల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చుతుండటంతో సుమారు రూ.39 కోట్ల వ్యయంతో నాలుగు నీటిపథకాలను నిర్మిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తిచేసుకున్నా నీటిసరఫరా జరగడం లేదు. ఫలితంగా ఏటా వేసవిలో గత మూడేళ్లుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. - న్యూస్లైన్, అలంపూర్ లీకేజీలతో నీటి వృథా.... మానవపాడు మండలం బొంకూరు, చిన్నపోతులపాడు, పెద్దపోతులపాడు, చెన్నుపాడు, అలంపూర్ చౌరస్తా, పుల్లూరు గ్రామాలకు నీటిని అందించాల్సి ఉంది. కానీ నిత్యం పైప్లైన్ల లీకేజీ వంటి సమస్యలతో ఇప్పటికే ఈ పథకం నుంచి రెండు గ్రామాలకు నీటి సర ఫరా నిలిచిపోయింది.అలంపూర్ చౌరస్తాలో ఇటీవల రూ.6.50 లక్షల వ్యయంతో అదనపు పైప్లైన్ వేశారు. కానీ ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అలాగే మానవపాడు, వడ్డేపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు నీటిని అందించేందుకు మద్దూరు వద్ద ఈ పథకాన్ని నిర్మించారు. కానీ పథకం ఉందన్న మాటే కానీ నీటి సరఫరా మాత్రం కొండెక్కింది. 5 గ్రామాలకే నీళ్లు... బీచుపల్లి తాగునీటి పథకం ద్వారా 33 గ్రామాలకు నీటి సరఫరా జరగాల్సి ఉంది. మొదటి విడతలో రూ.నాలుగుకోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. రెండోవిడతలో మంజూరైన రూ.ఐదుకోట్లతో 10 గ్రామాలకు మాత్రమే పైప్లైన్ పనులు జరుగుతున్నాయి. అయిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ పథకం ద్వారా కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే నీళ్లను అందిస్తున్నారు. -
జడవకండి
పాలమూరు, న్యూస్లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేలా తగిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకుగాను గ్రామాల వారీగా తమ శాఖకు చెందిన సిబ్బందితో సర్వే నిర్వహిస్తున్నామని ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ, శానిటేషన్ మిషన్ మెంబర్ కార్యదర్శి కృపాకర్రెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 15 కల్లా సర్వే పూర్తిచేసి తగిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్డబ్ల్యుపీ) ద్వారా శాశ్వత చర్యలకు గాను జిల్లాకు రూ.6.28 కోట్లు కేటాయించారన్నారు. శాఖా పరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై పలు అంశాలు.. ఆయన మాటల్లోనే.. వర్షాలు సమృద్ధిగా పడటంతో.. జిల్లాలో కొన్ని చెరువుల్లో నేటికీ నీరు నిలిచి ఉన్న కారణంగా భూగర్భ జలాల స్థాయి నిలకడగా ఉంది. గతేడాది పిబ్రవరి నెలలోనే పలుగ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేపట్టాం.ఈసారి జిల్లాలో తాగునీటికి అంతగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. ఈ కారణంగానే గ్రామాల్లో నీటివనరులపై సర్వే చేపట్టాం. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా ప్రత్యామ్నాయం చేపడతాం. నిధులకు ఢోకా లేదు.. నిధుల కొరత ఏమీ లేదు. ఆన్లైన్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు ఆయా పనులను నమోదు చేస్తే నిధులు మంజూరవుతాయి. ఏడాదిలో మూడుసార్లు స్టేట్లెవల్ సెలక్షన్ కమిటీ (స్లాక్స్) సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రతిపాదనలు పెట్టి సమస్యాత్మక గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కావల్సిన పనులకు అనుమతి పొందుతాం. సాధారణమైన వాటికి కలెక్టర్ అనుమతితో ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. అయిదు కేటగిరీలుగా ఎంపిక సమస్యాత్మక గ్రామాలను అయిదు కేటగిరీలుగా విభజించి ఎంపిక చేస్తాం. అందులో ఏమాత్రం నీటి వనరులు లేని గ్రామాలను ఎన్ఎస్ఎస్ (నో సేఫ్ సోర్స్) కేటగిరీ కింద నిర్ణయించి వీటికి కచ్చితంగా నీరందించేందుకు చర్యలు చేపడతాం. పీసీ-1 కేటగిరీలో ఆయా గ్రామాల్లో ఉన్న జనాభాను బట్టి ఒక్కొక్కరికి 10 లీటర్ల కంటే తక్కువ నీరు అందే పరిస్థితులు ఉంటే వారికోసం బోర్ల ఫ్లషింగ్, డీపనింగ్, వ్యవసాయ బోర్ల లీజ్, నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లు తదితర చర్యలు చేపడతాం. పీసీ2 నుంచి పీసీ4 వరకు (20 నుంచి 40 లీటర్ల లోపు నీటి సామర్థ్యం కలిగిన గ్రామాల్లో) కేటగిరీల్లో అక్కడి అవసరాలను బట్టి ప్రజలకు ఉపయోపడే విధంగా బోర్ల ఫ్లషింగ్, డీపనింగ్ చేపడతాం. కాంట్రాక్టు విధానం ద్వారా చేపట్టే ఈ పనులకు సంబంధించి బిల్లులు సమర్పిస్తే సంబంధిత వ్యక్తులకు డబ్బులు ఆన్లైన్లోనే అందిస్తాం పది ల్యాబుల్లో పరీక్షలు నీటి శుద్ధతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 10 ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతేడాది మా శాఖలో 15 శాతం సిబ్బంది మాత్రమే ఉండేది. ఆ మధ్య చేపట్టిన ఏపీపీఎస్సీ నియామకాలతో జిల్లాకు 19 మంది ఏడబ్ల్యుఈలు, 28 మంది ఏఈలు వచ్చారు. దీంతో సిబ్బంది కొరతను అధిగమించగలిగాం. పారిశుద్ధ్యంపై విసృ్తత ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధంగా పంచాయతీలకు సాంకేతిక పరంగా మా శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఈ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నిస్తున్నాం. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధానాన్ని కూడా వివరిస్తున్నాం. పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు సమర్థంగా చేపట్టిన వారికి నిర్మల్ పురస్కారంతో ప్రోత్సహిస్తున్నాం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యల పురోగతి సాధ్యమవుతోంది. భవిష్యత్తులో మరిన్ని మార్పులు రానున్నాయి. నిర్మల్ భారత్పై ప్రత్యేక దృష్టి...! నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టాం. 2013-14 సంవత్సరానికి గాను 1 లక్ష మరుగు దొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా.. ఇందులో 40వేలకు పైగా పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా పల్లెల్లోని ప్రజలకు మరుగుదొడ్ల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను విసృ్తత పరిచాం. గోడలపై రాతలు, రెండు చోట్ల నిర్మల్ భారత్ అభియాన్ ఉద్దేశాన్ని వివరించే బోర్డులను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 64 బృందాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సీఎల్డీఎస్ పద్ధతిన గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై మరుగుదొడ్ల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియపరుస్తున్నాం. వీటి నిర్మాణాలు పెంచేందుకు మండల కోఆర్డినేటర్లను నియమించాం. ఇప్పుడు గ్రామ కోఆర్డినేటర్లను నియమించేందుకు చర్యలు చేపట్టాం. గ్రామాల్లో నిర్మల్ అభియాన్ పథకాన్ని అమలుపర్చే కోఆర్డినేటర్లకు నెలసరి వేతనం కాకుండా ఒక మరుగుదొడ్డిని నిర్మిస్తే రూ.75 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా గ్రామాల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. అన్ని ఇళ్లల్లో కొళాయిల ఏర్పాటు.. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల పరిధిలో చేపట్టిన పరిశీలన ఆధారంగా ఇళ్లల్లో మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేసుకున్న వారు 23శాతం మంది ఉన్నారు. మిగతావారు వీధుల్లో వినియోగించ కుండా ప్రతీ ఇంటికి కొళాయిలు ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తున్నామన్నారు. -
యురేనియం తవ్వకాలతో నీరు కలుషితం
వేముల, న్యూస్లైన్: యురేనియం తవ్వకాలతో మండలంలోని మబ్బుచింతలపల్లె గ్రామంలోని మంచినీటి పథకం తాగునీరు కలుషితమవుతోంది. గత 20రోజులుగా బోరులో నుంచి కలుషితనీరు వస్తోంది. వర్షాలతో అలా వస్తోందనుకుని బోరు లోతు తగ్గించారు. అయినా నీటిలో ఏ మాత్రం మార్పు లేదు. నీటి మోటారు ఆన్చేసి రోడ్డుపైకి నీరు వదలితే కొద్దిసేపటికే రోడ్డుపై వ్యర్థ పదార్థం పేరుకపోతోంది. గ్రామస్తులు యురేనియం అధికారుల దృష్టికి తీసుకురాగా మైన్స్ మేనేజర్ కె.కె.రావు, మైనింగ్ డిప్యూటీ సూపరింటెండెంటు భద్రాదాస్ గతవారం గ్రామానికి వె ళ్లి నీటిని పరిశీలించారు. ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెనుతిరుగుతుండగా గ్రామస్తులు అడ్డుకుకి హామీ ఇచ్చేవరకు వెళ్లనీయమని పట్టుబట్టారు. పర్సనల్ మేనేజర్ ఆలీ అక్కడికి చేరుకొని నీటిని పరీక్షలకు పంపుతామని, అప్పటివరకు ట్యాంకర్లతో అందిస్తామని హామీ ఇచ్చారు. పరిశోధనలో బయటపడిన వాస్తవాలు మబ్బుచింతలపల్లె తాగునీటి బోరు నుంచి సేకరించి నీటిని ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించారు. ఆ బోరులోని తాగునీరు పూర్తిగా కలుషితమైందని, నీరు తాగేందుకు పనికిరావని పరిశోధనలో తెలిసింది. అండర్ మైనింగ్ బోరుకు సమీపంలోనే తవ్వకాలు సాగుతున్నాయని, దీంతో మైనింగ్లోని వ్యర్థ పదార్థం మంచినీటి బోరులోకి వెళ్లి నీరు కలుషితమైందని పరిశోధనలో తేలినట్లు సమాచారం. గ్రామంలోని బోరు నీరు కలుషితమైనందున ప్రత్యామ్నాయంగా దోబీఘాట్ వద్ద బోరువేసి తాగునీరు ఇవ్వాలని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోతే యురేనియం ఉత్పత్తిని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు. -
కేబినెట్ నోటా? సీఎం సంతకం లేదే!
చిత్తూరు తాగునీటి పథకం నోట్పై హైకోర్టు సందేహం అఫిడవిట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో తాగునీటి పథకం పనులకు పరిపాలనాపరమైన అనుమతులను మంజూ రు చేస్తూ ఇచ్చిన కేబినెట్ నోట్పై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అసలు నోట్ ఇదేనో, కాదో... అందులోని వివరాలు వాస్తవమైనవో, కావో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతో సీఎం కిరణ్కుమార్రెడ్డి చిత్తూరు జిల్లాలో రూ. 7,390 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకంలో భాగంగా రూ. 4,300 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారని, దీనికి కేబినెట్ ఆమోదం లేదని పేర్కొంటూ టీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది. గత విచారణ సమయంలో... పరిపాలనాపరమైన అనుమతులకు సంబంధించిన కేబినెట్ ప్రొసీడింగ్స్ను, రికార్డులను తమ ముందుంచాని ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు మౌలిక సదుపాయాల కల్పన శాఖ అధికారులు గురువారం కోర్టు ముందు హాజరై ఓ సీల్డ్ కవర్ను ధర్మాసనం ముందుంచారు. ఈ కవర్ను తెరిచిన ధర్మాసనానికి అందులో గులాబీ రంగులో ఒక కాగితం మాత్రమే కనిపించింది. ఇది కేబినెట్ నోటేనా? అని సందేహం వ్యక్తం చేసింది. కేబినెట్ నోట్ ఇదే అయితే ముఖ్యమంత్రి సంతకం లేదేమని సంయుక్త కార్యదర్శిని ప్రశ్నించింది. ఆయన కూడా ఆ కేబినెట్ నోట్ ఇదేనని చెప్పారు. అయితే కేబినెట్ నోట్ ఇదేనో.. కాదో, ఇందులోని వివరాలు వాస్తవమైనవో, కావో పేర్కొంటూ అఫిడవిట్ను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నోట్ విషయంలో భిన్నంగా ఏవైనా చెబితే, మీపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తామని సంయుక్త కార్యదర్శిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. -
‘కలుగొట్ల’...ఎప్పట్లా..!
ముఫ్పైఏళ్లుగా తపిస్తుంటే ఏర్పాటైన పథకం. పనులు పూర్తయితే ఇంకేం నీటి కష్టాలు తీరినట్లే అనుకున్నారు అలంపూర్ చౌరస్తా వాసులు. కాంట్రాక్టర్ మాత్రం పైపు లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. దీనితో నీటికి పాత పాటే. అదీ ఇబ్బందుల మధ్యే. ఇప్పుడు కలుషిత జలాలే గత్యంతరం. ఈ అవస్థలు తీర్చే మార్గం కోసం నిరీక్షిస్తున్నారు. నీటి పరీక్షకు తట్టుకోలేక పోతున్నారు. అలంపూర్, న్యూస్లైన్ : ఎన్నో విన్నపాల ఫలితంగా రూపుదిద్దుకున్న కలుగొట్ల తాగునీటి పథకం పూర్తయినా ఇళ్లకు కనెక్షన్లు ఇ వ్వకపోవడంతో అసలు ఉద్దేశం ఆమడ దూ రంలోనే ఉండి పోయింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ పనులైతే పూర్తి చేశారు. కానీ కొత్త పైప్లైన్లకు కనెక్షన్ ఇచ్చి దాని ద్వార నీటిని సరఫ రా చేయాల్సిన బాద్యతలను విస్మరించారు. దీంతో ఎప్పటిలాగే అలంపూర్ చౌరస్తా ప్రజలు, ప్రయాణీకులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు సరఫరా అవుతున్న నల్లా ద్వార నీళ్లు తెచ్చుకుందామని ఆశించినా పైప్లైన్ లీకేజితో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచింది. నిర్వహణ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో చివరకు పుల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్పందించి లీకేజిలకుకక మరమ్మత్తులు చేపట్టడంతో స్థానికులకు ఊరట లభించింది. కానీ కలుషిత నీటి బాధలు మాత్రం ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రూ. 6.50 లక్షలతో అదనపు పైప్లైన్ నియోజకవర్గ కేంద్ర బిందువుగా జాతీయరహదారి అడ్డాగా ఉన్న అలంపూర్ చౌరస్తాకు కలుగొట్ల తాగునీటి పథకం నుంచి తాగునీ టిని అందిస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం నాలుగు రోడ్ల కూడలిలో ఒక్క వైపు మాత్ర నల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో మిగిలిన కాలనీలకు నీటి సరఫరా లేక నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మిగిలిన రోడ్లలోని కాలనీలకు తాగునీటిని అందించడానికి అనువుగా వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.6.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు రోడ్ల కూడలిలోని కాలనీలకు నీటి సరఫరా నిమిత్తం 428 మీటర్ల పైప్లైన్ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న పాత పైప్లైన్ నుంచి కనెక్షన్ ఇస్తే మిగిలిన కాలనీలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్ సాకులను చూపుతూ కనెక్షన్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. అటకెక్కిన బోరు మోటారు ప్రతిపాదన : అలంపూర్ చౌరస్తాలో పథకం నుంచి నీటి సరఫరా నిలిచిన సమయాల్లో ప్రత్యేక నిధులతో ప్రత్యాయ్నాంగా బోరు మోటారు వేయాల్సి ఉంది. ఇక్కడ ఫోరైడ్ నీళ్లు పడుతాయని బోరు వేసే ప్రతిపాదనను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే వేసవిలో స్థానికులకు తాగునీటి కష్టాలు తప్పవని అందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చౌరస్తాకు సమీపంలోనే ఎక్కడో ఒక చోట బోరు మోటారు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే నీటి కోసం చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపును పరిశీలించిన జేఈ గత కొంత కాలంగా కలుషిత నీరు సరఫరా అవుతోందని, కొత్త పెప్లైన్కు కనెక్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆర్డబ్లుఎస్ జేఈ కృష్ణయ్య మంగళవారం అలంపూర్ చౌరస్తాలో చేసిన పైప్లైన్ పనులను పరిశీలించారు. సంపులో కలుషితమైన నీటి గురించి స్థానికులు వివరించారు. సంపు భూమికి సమాంతరంగా ఉండంతో కప్పలు, ఇతర జంతువుల కళేబరాలు, పురుగులు అందులో పడి నీరు కలుషిత మవుతున్నట్లు వెల్లడించారు. పాత పైప్లైన్ లీకేజిల కారణంగా గత ఐదు రోజులుగా నీళ్లు బందయినా నిర్వాహకులు పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి నిరంతరంగా నీటి సరఫరా చేయాలని కోరారు. -
అవినీతి ధార!
గజ్వేల్, న్యూస్లైన్: మంచినీటి పథకాల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. ప్రజల దాహార్తి అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ప్రధానంగా పంపుసెట్ల బిగింపు, రీప్లేస్మెంట్లలో నిబంధనలకు పాతరేస్తూ నాణ్యతలేని పరికరాలతో లక్షలు దండుకుంటున్నారు. 18 నెలల (గ్యారంటీ)లోపు చెడిపోతే వాటి స్థానంలో కొత్త పంపుసెట్లు బిగించడం లేదా మరమ్మతులు చేయించాల్సి వుండగా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఫలితంగా ఈ భారం ‘పంచాయతీ’లపైనే పడుతోంది. మరోవైపు అనుమతిలేని కంపెనీల పంపుసెట్లను పంపిణీ చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.. ఏళ్ల తరబడి ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోకుండా అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో మంచినీటి పథకాల అమలు గందరగోళంగా మారింది. గ్రామాల్లో దాహార్తి నివారణకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారానే కాకుండా గ్రామపంచాయతీలు, వివిధ పథకాల ద్వారా ప్రతియేటా కోట్లల్లో నిధులు వెచ్చిస్తున్నారు. ఈ పథకాలన్నీ అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ప్రధానంగా పంపుసెట్ల బిగింపు, రీప్లేస్మెంట్లలో భారీఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్లోవెల్, వర్ష, సీఆర్ఐ, క్రామ్టన్, ఎలెన్ కంపెనీలకు చెందిన పంపుసెట్లను మాత్రమే బిగించాల్సి ఉంటుంది. సాధారణంగా హెచ్పీ మోటార్, స్టార్టర్, ప్యానల్బాక్స్, సర్వీసువైరు, బోర్క్యాప్, ఎంఎస్స్టాండ్, నిప్పల్ తదితర పరికరాలకు రూ.24 వేల వరకు ఖర్చవుతుంది. 1.5 హెచ్పీకి మరో రూ.1500, 2హెచ్పీకి మరో రెండున్నరవేలు అదనంగా ఖర్చవుతాయి. 5హెచ్పీ మోటార్కు జీఐపైప్ వాడటం వల్ల అన్నీ కలుపుకొని రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. జరుగుతున్నదేమిటీ.. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఐదు కంపెనీల మోటార్లే కాకుండా చాలాచోట్ల స్థానికంగా తయారుచేసిన మోటార్లను బిగిస్తున్నారు. ఒరిజినల్ కంపెనీల మోటార్లతో పోలిస్తే వీటికి సగానికిపైగా ఖర్చు తగ్గుతుంది. కానీ ఒరిజినల్ కంపెనీల మాదిరిగానే నిధులు డ్రా చేస్తున్నారు. మరో పక్క ఈ మోటార్లకు 18 నెలల గ్యారెంటీ వ్యవధి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఏడాదికి మించి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఏడాది తర్వాత కొత్త మోటార్లు బిగించి నిధులు అప్పనంగా స్వాహా చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు యథేచ్ఛగా కొనసాగుతోంది. మరో దారుణమైన విషయేమిటంటే కొన్నిచోట్ల ముందుగా ఒరిజినల్ కంపెనీ మోటార్ను ఫిట్ చేసి అది రిపేర్కు వచ్చిన తర్వాత మార్చడానికి తీసుకువెళ్తే రెండోసారి అసెంబుల్డ్ ఫిట్టింగ్ మోటార్ను ఇస్తున్నట్లు పలు గ్రామాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైతే చాలు అక్రమాల సంగతి మాకెందుకని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టింపులేని ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ ఉదాహరణ.. గజ్వేల్ మండలం అక్కారం పెద్దచెరువులో గ్రామ మంచినీటి అవసరాల కోసం బోరుబావిని వేశారు. ఈ బోరుబావిలో బిగించిన మోటార్ ఏడాదిన్నర క్రితం చెడిపోయింది. గ్యారెంటీ వ్యవధి ఉండగానే ఇది చెడిపోవడంతో దీని స్థానంలో కొత్త మోటార్ ఇస్తానని సదరు ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారు. కానీ ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు మోటార్ ఇవ్వలేదు. ఫలితంగా గ్రామంలో మంచినీటి ఎద్దడి తప్పడంలేదు. ఇదే గ్రామంలో గడిచిన నెలల కాలంలో మూడు బోరుబావులు చెడిపోగా గ్యారెంటీ వ్యవధి ఉన్నా.. కరెంట్ సరఫరాలో లోపాల కారణంగా కాలిపోయాయి కాబట్టి ఇవ్వలేమని చేతులెత్తేయడంతో పంచాయతీ నిధులు నుంచి మరమ్మతులు చేయించారు. దీనివల్ల పంచాయతీపై రూ.30 వేలకుపైగా భారం పడింది. అక్కారంలోనే కాదు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
ఎంపీఆర్ డ్యాం నుంచి శింగనమల నియోజకవర్గానికి తాగునీరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నార’న్నట్లుగా తయారైంది ప్రభుత్వ వైఖరి. మూడేళ్లపాటు పైసా నిధులను విదల్చకపోవడం వల్ల జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి ప్రజల ఓట్లు గుర్తుకొచ్చాయి. జేసీ నాగిరెడ్డి పథకం పనులను పర్యవేక్షించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్సీ(ఇంజనీర్-ఇన్-చీఫ్) నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. గతంలో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం పరిధిలోకి రాని శింగనమల నియోజకవర్గంలోని 73 గ్రామాలకు అదే పథకం నుంచి నీటిని అందించేందుకు రూ.40 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పుడు జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం నుంచి కాకుండా మిడ్ పెన్నార్ డ్యామ్ నుంచి శింగనమల నియోజకవర్గంలోని 73 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.150 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో ఆర్టీ నెం: 1895) జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లోని 561 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లోని ప్రజలకు రోజుకు తలసరి 70 లీటర్ల నీటిని అందించేందుకు రూ.508 కోట్ల వ్యయంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన జలాలను వైఎస్సార్ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా ఈ పథకంలో రూ.396.16 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇందులో రూ.350 కోట్ల విలువైన పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయినవి కావడం గమనార్హం. ఈ మూడేళ్లలో కేవలం రూ.46 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. ఇందులో రూ.40 కోట్లకుపైగా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో ప్రభుత్వం బకాయి పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. మూడేళ్లుగా ఇదే దుస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రూ.396.16 కోట్లను ఖర్చు చేసినా ఒక్క గ్రామానికి కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. జేసీ నాగిరెడ్డి పథకంపై ప్రభుత్వ వైఖరి విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలు తమకు ఇబ్బందిగా మారుతాయని అధికార పార్టీ నేతలు భావించారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దాంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. తక్కిన రూ.111.84 కోట్ల విలువైన పనులను వేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు.. ప్రస్తుతం పూర్తయిన పనుల పరిస్థితిని పరిశీలించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమగ్రమైన నివేదిక తయారుచేసి.. పనులను పర్యవేక్షించేందుకు ఈఎన్సీ నేతృత్వంలో విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈ, స్టేట్ ప్లాన్ సీఈలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమించింది. అంచనా వ్యయం రూ.110 కోట్లు పెంపు.. జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం కింద శింగనమల నియోజకవర్గంలోని 76 గ్రామాలు కవర్ కావడం లేదు. ఆ గ్రామాలకు జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం నుంచే నీటిని అందించడానికి 2012లో రూ.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గండికోట రిజర్వాయర్ నుంచి జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకానికి సరిపడా జలాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని.. శింగనమల నియోజకవర్గం పరిధిలోని 76 గ్రామాలకు ఆ పథకం నుంచి నీళ్లందించడం కష్టమవుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రమణమూర్తి అక్టోబరు 11న ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదికను పరిశీలించిన ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ.. ఎంపీఆర్ డ్యామ్ నుంచి శింగనమల నియోజకవర్గం పరిధిలోని 76 గ్రామాలకు తాగునీటిని అందించాలంటూ అక్టోబరు 22న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎంపీఆర్ డ్యామ్ నుంచి 76 గ్రామాలకు తాగునీటిని అందించడానికి రూ.150 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ డీపీఆర్పై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. శింగనమల నియోజకవర్గంలోని 76 గ్రామాలకు ఎంపీఆర్ డ్యామ్ నుంచి తాగునీటిని అందించడానికి రూ.150 కోట్లతో ప్రత్యేక పథకాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. శింగనమల తాగునీటి పథకం అంచనా వ్యయం రూ.40 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
చిత్తూరు నీటి టెండర్లకు కొత్త నిబంధన!
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు మంచినీటి పథకం కోసం ఎక్కువమంది కాంట్రాక్టర్లు పోటీ పడకుండా చేయడానికి ప్రభుత్వ పెద్దలు కొత్త ఎత్తుగడ అమలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఎక్కువ పోటీ లేకుండా చేయడంతో పాటు తమ వారికి కాంట్రాక్టు దక్కేలా పకడ్బందీగా వ్యవహారం నడిపించడానికి దేశంలో ఎక్కడా లేని నిబంధనను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకం మొదటిదశ కింద రూ.2,300 కోట్ల విలువైన పనుల కోసం టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి తమవారికి దక్కేలా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ రుణాల పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్)కు దరఖాస్తు చేసుకున్న సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనడానికి అనర్హులన్న నిబంధన విధించారు. అయితే ఈ నిబంధన చట్టవిరుద్ధమని హైదరాబాద్కు చెందిన తాహేర్ అలీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చే శారు. ఈ వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సీడీఆర్కు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 18వ తేదీన జరగనుంది. హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడతాయో తెలియకుండానే.. టెండర్ల దాఖలు గడువును ఈనెల 20వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు దాఖలు సమయంలో సాల్వెన్సీ సర్టిఫికెట్ (ఆర్థిక పటిష్టతపై బ్యాంకులు ఇచ్చే ధ్రువీకరణ పత్రం)ను జత చేస్తున్నప్పుడు ఈ సీడీఆర్ను గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ ఈ నిబంధన విధించడం అనుమానాలకు తావిస్తోందని పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు అంటున్నారు. తాహేర్ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఇంప్లీడ్ కావడానికి మరో నలుగురు కాంట్రాక్టర్లు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. -
ఇసుక తవ్వకాల్లో కొట్లాట
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఇసుక అక్రమ రవాణా వ్యవహారం మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల్లోని రెండు సరిహద్దు గ్రామాల మధ్య దాడులకు దారి తీసింది. కర్రలతో కొట్టకున్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కొందరు ఇసుక అక్రమ రవాణాదారులు రాయలసీమలోని కర్నూలు జిల్లా మునగలపాడు వైపు వచ్చి ఇసుకను తరలిస్తున్నారు. బుధవారం ఇసుకను తోడుకునేందుకు మునగాలపాడు సమీపంలోని తుంగభద్ర నది వద్దకు చేరుకున్నారు. నదిలో తాగునీటి పథకానికి చెందిన పైప్లైన్లు ఉన్నాయని.. ఇటువైపు రావద్దని అక్కడున్న వాటర్మన్ మద్దిలేటి వారించినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మద్దిలేటి కర్నూలు తహశీల్దారుకు ఫిర్యాదు చేశాడు. విష యం తెలుసుకున్న పుల్లూరు వాసులు అతనిపై దాడిశారు. దీంతో ఇరుగ్రామాల ప్రజలు అక్కడకు చేరుకుని పరస్పరం దాడులకు దిగారు. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. కర్నూలు పోలీసులు రావడంతో పుల్లూరు వాసులు పరారయ్యారు. మిగిలిన వారిలో కొంతమంది పోలీసులపై దాడికి యత్నించడంతో వారిపై కేసులు నమోదు చేశారు. -
ఆ వార్తలో నిజం లేదు: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, హన్వాడ, కోయిలకొండ మండలాల్లో తాగునీటి పథకం కాంట్రాక్టులో తప్పుడు అర్హతపత్రం సమర్పించిన కాంట్రాక్టర్కు తాను మద్దతునిస్తున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అర్హతలున్నవారికే పని దక్కాలని, పోటీ ఉండాలన్న ఉద్దేశంతో శ్రీధర్రెడ్డి అనే కాంట్రాక్టర్తో టెండర్ వేయించానని, అంతేతప్ప ఆయన తప్పుడు అర్హత పత్రం సమర్పించలేదని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. టీడీపీకే చెందిన మరో కాంట్రాక్టర్ ధర్మారెడ్డి తప్పుడు అర్హత పత్రం సమర్పిస్తే తగిన చర్య తీసుకోవాలని అధికారులను కోరానన్నారు. -
అభివృద్ధి కాంతులు
గద్వాల, న్యూస్లైన్: నడిగడ్డ గద్వాల ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగింది. ఇక ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాలకు సమీపం లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారు. వీటికితో డు జూరాల ప్రాజెక్టు వద్ద జలవిద్యుదుత్పత్తి కేం ద్రం, లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రాల ని ర్మాణం జరిగింది. గద్వాల డివిజన్లోనే జూరాల,నెట్టెంపాడు, ఆర్డీఎస్ సాగునీటి ప్రాజెక్టులతో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగునీరు సౌకర్యం పుష్కలంగా ఉన్న గద్వాల ప్రాంతంలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో రూ.110 కోట్లతో నిర్మించిన భారీ తాగునీటి పథకం త్వరలోనే మొదటిదశలో 31 గ్రామాలకు నీరు అందనుంది. ఇలా తాగు, సాగునీటి వనరులతో పాడి పరిశ్రమలో ముందడుగు వేసే పరిస్థితులు ఉండటంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గద్వాలలో ఇటీవల కొత్త దాణా ఫ్యాక్టరీకి శంకుస్థాపనచేశారు. ఇక్కడ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుంది. వీటికితోడు గద్వాల ప్రాంత అభివృద్ధికి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రతిపాదనలో ఉన్న గద్వాల- రాయిచూర్ నూతన బ్రాడ్గేజ్ రైల్వేలైన్ ఇటీవల పూర్తయి ప్రారంభమైంది. మరిన్ని అభివృద్ధి పనులు ఇలా ప్రాజెక్టులు ఒకటి తర్వాత మరొకటి అం దుబాటులోకి వస్తుండటంతో, గద్వాల ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం రింగ్రోడ్డు ప నులు టెండర్ల దశలోనే ఉన్నాయి. త్వరలోనే ఈ రింగ్రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. గ ద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యగా మారిన మొదటి రైల్వేగేటు వద్ద రూ.41కోట్ల అంచనావ్యయంతో ఆర్ఓబీ నిర్మాణానికి ఇటీవల టెం డర్లు పిలిచారు. ఇలా గద్వాల ప్రాంత అభివృద్ధి మరో ముందడుగుపడేలా రింగ్రోడ్డు, ఆర్ఓ బీల టెండర్లు ప్రారంభమయ్యాయి. దీనికితో డు గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా(44వ జా తీయ రహదారి వరకు), గద్వాల నుంచి వయా మల్దకల్, అయిజ మీదుగా నాగల్దిన్నె వరకు రోడ్డును స్టేట్ హైవేగా గుర్తిస్తూ ప్రభుత్వం కొద్దినెలల క్రితం జీఓ జారీచేసింది. అలంపూర్ ని యోజకవర్గంలో కీలకమైన అలంపూర్ చౌరస్తా నుంచి బల్గెర వరకు ఉన్న రోడ్డును కూడా స్టేట్హైవేగా గుర్తించారు. ఈ రోడ్లను అభివృద్ధి చేస్తే ప్రగతికి మరింత దోహదపడుతుంది. నెట్టెం పాడు నుంచి అనుబంధంగా గట్టు మండలంలోనిపై ప్రాంతానికి సాగునీటిని అందించేలా గ ట్టు లిఫ్టుకు అనుమతి కోసం ఇప్పటికే సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఇది మంజూరైతే ఇక కరువు ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆర్డీఎస్లో సాగునీరందని ప్రాంతానికి తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా సాగునీటిని అం దించేందుకు సర్వే నిర్వహించారు. ఈ పథకానికి కూడా మంజూరు లభిస్తే నడిగడ్డ అంతటా సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తుంది. -
ఇదేం మోడల్ స్కూల్ భవనం
సదాశివనగర్,న్యూస్లైన్ : మండల కేంద్రంతో పాటు, మర్కల్ మల్లన్నగుట్ట వద్ద గల తాగునీటి పథకం పనులు, రామారెడ్డి గ్రామంలో గల మోడల్ కాలనీ పనుల తీరును మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పరిశీలించారు. మం డల కేంద్రంలో గల మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రతి తరగతి గదిని తనిఖీ చేశారు. నాణ్యత లేని ఇసుక, ఇటుకలను వాడుతుండడంతో కాంట్రాక్టర్ వెంకట్రాంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్గా ఉండాల్సిన భవనాన్ని ఇలా నిర్మిస్తే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు ఇప్పుడే దుర్గంధంగా మారితే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందన్నారు. అక్టోబర్ ఒకటి వరకు పూర్తి చేయాల్సిన పనులు ఇంకా నత్తనడకనే సాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ హౌస్ను పరిశీలించారు. నత్తనడకన పనులు సాగుతుండడంతో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీకి సంబంధించిన అనుమతి పత్రాలను అందివ్వడంలేదని సదాశివనగర్ రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం మండలంలోని మర్కల్ మల్లన్నగుట్ట వద్ద గల తాగునీటి పథకాన్ని పరిశీలించారు. రామారెడ్డిలో గల మోడల్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలను పరిశీలించారు. గృహాలు నిర్మించుకోని వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నెలాఖరులోగా కస్తూర్బా పనులు పూర్తిచేయాలి కామారెడ్డి రూరల్ : ఈనెలాఖారులోగా కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామంలో నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాణ్యత లోపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయల పనులు దాటిన కాంట్రాక్టర్ తప్పనిసరిగా క్వాలిటీ కంట్రోల్కు సంబంధించి ల్యాబ్ ఏర్పాటు చేసుకుని మెటీరియల్ నాణ్యతగా ఉన్నాయా లేదా నిర్ధారించుకున్న తర్వాతే పనులు చేపట్టాలని సూచించారు. అక్టోబర్ నెలఖారులోగా మొదటి అంతస్తు పూర్తి చేయాలని క్వాలిటీ కాంట్రోల్ డిప్యూటీ డీఈ సంగమేశ్వర్ను ఆదేశించారు. పై అంతస్తు కూడా నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం భవన నిర్మాణ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్లర్లకు కొమ్ముకాస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పనులు త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు జరగడంతో పరీక్షా పత్రాన్ని పరిశీలించారు. విద్యార్థులను పరీక్ష పేపర్ ఎలా ఉందని అడిగితే వారు ఈజీగా ఉందన్నారు. అనంతరం పరీక్షలు విద్యార్థుల స్థాయికి తగ్గట్లుగా నిర్వహించాలని డీఈఓ శ్రీనివాసాచారికి సూచించారు.