Farewell ceremony
-
అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్?
ఎంతో ఆనందంగా వీడ్కోలు పార్టీకి వెళ్లిన ఆ అమ్మాయి విగతజీవిగా మారిపోయింది. చదువు చెప్పిన గురువుల ముందు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన ఆ విద్యార్థిని అర్థాంతరంగా తనువు చాలించింది. అప్పటివరకు ఆడిపాడిన అమ్మాయి ఆస్పత్రి బెడ్పై నిర్జీవంగా కనిపించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో ముగినిపోయారు. అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్ అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు.పాఠశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో (ఫేర్వెల్ పార్టీ) ఒక విద్యార్థిని నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల (ఈఎంఆర్ఎస్)లో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. సీరోలు ఈంఎఆర్ఎస్ పాఠశాల/కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ (farewell party) కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డీజే సౌండ్ (DJ Sound) బాక్స్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటర్ విద్యార్థినులు సైతం నృత్యాలు చేశారు.ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచర్ల (Tanamcherla) శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను లేపేందుకు ప్రయత్నించారు. ఆమెను 108 వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఈఎంటీ గాంధీ సీపీఆర్ చేశారు. చివరికి మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. విచారణ లేకుండా సస్పెండ్ చేశారని..ములుగు/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల కేంద్రంలోని తన అద్దె గృహంలో మంగళవారం ఉదయం వెంకటాపురం అంగన్వాడీ ప్రాజెక్టు సీడీపీఓ ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం విచారణ లేకుండానే ఏకపక్షంగా సస్పెండ్ చేశారని మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలి వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.గతంలో ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న తతంగంపై కలెక్టర్కు విన్నవించినా పట్టించుకోలేదని, ప్రస్తుతం సమాన వృత్తిలో ఉన్న ములుగు సీడీపీఓ, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ చెప్పినట్లుగా వినడం తప్ప ఎదుట వ్యక్తి విషయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆమె వీడియోలో పేర్కొన్నారు. సెంటర్లు నడవని కేంద్రాలకు ఎందుకు అద్దె చెల్లిస్తున్నారని, రిటైర్ అయిన ఆయాకు వేతనం ఎలా ఇస్తారని అడిగానని, వీటిని మనసులో పెట్టుకుని కలెక్టర్ ద్వారా సస్పెన్షన్ లెటర్ వచ్చేలా చేశారన్నారు. వీటన్నింటికి కారణం డీడబ్ల్యూఓ శిరీష అని పునరుద్ఘాటించారు.చదవండి: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్లే టాప్.. తర్వాత ఎవరంటే?కాగా, సీడీపీఓ ధనలక్ష్మి తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం వెంకటాపురం(కె) ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ ధనలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. ఇది జరిగిన అరగంటలోనే సీడీపీఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఆమె ఆందోళన చెందారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టించింది. ఈ విషయమై డీడబ్ల్యూఓ శిరీషను వివరణ కోరగా తాను ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టలేదని వివరణ ఇచ్చారు. -
ఫేర్వెల్ పార్టీలో పిల్లల రచ్చ
-
జస్టిస్ హృషికేశ్ రాయ్కి ఘనమైన వీడ్కోలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హృషికేశ్ రాయ్కి శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పలువురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతోపాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. జస్టిస్ హృషికేశ్ రాయ్ చాలా విశిష్టమైన న్యాయమూర్తి అని జస్టిస్ ఖన్నా కొనియాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు. క్విజ్ మాస్టర్గా, జర్నలిస్టుగా, స్టాండప్ కమేడియన్గానూ రాణించారని చెప్పారు. జస్టిస్ హృషికేశ్ రాయ్ 2019 సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ కాలం ముగిసింది. ఆయన చివరి పని దినంగా సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైంది. న్యాయ వ్యవస్థకు జస్టిస్ హృషికేశ్ రాయ్కి అందించిన సేవలను ధర్మాసనం సభ్యులు గుర్తుచేసుకున్నారు. -
సంపన్నుల ఆధిపత్యం ఆందోళనకరం
వాషింగ్టన్: అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోందని, ఇది నిజంగా ప్రమాదకరమైన పరిణామం అని అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ధనవంతులు దేశాన్ని శాసించే పరిస్థితి రావడం సరైంది కాదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలంటే బడాబాబులు పెత్తనం సాగించే అవకాశం ఉండొద్దని చెప్పారు. బైడెన్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఆయన అధ్యక్ష పగ్గాలను డొనాల్డ్ ట్రంప్కు అప్పగించబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం శ్వేతసౌధంలో బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్, కుమారుడు హంటర్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసు నుంచి జో బైడెన్ ప్రసంగించారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ శిక్ష నుంచి తప్పించే అవకాశం ప్రస్తుతం ఉందని, ఈ పరిస్థితి కచి్చతంగా మారాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. ట్రంప్పై ఉన్న క్రిమినల్ కేసులు, ఆయన దోషిగా తేలిన సంగతిని పరోక్షంగా ప్రస్తావించారు. శిక్ష నుంచి తప్పించుకొనే అవకాశం అధ్యక్షుడికి ఇవ్వొద్దని పేర్కొన్నారు. పిడికెడు మంది సంపన్నులు, బలవంతుల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం ప్రమాదకరమని వెల్లడించారు. వారు అధికార దురి్వనియోగానికి పాల్పడితే ఊహించని ఉపద్రవాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అందుకే అలాంటివారిని నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రభావితం చేసినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలి సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం పట్ల బైడెన్ స్పందించారు. సోషల్ మీడియా కంపెనీల ఆధిపత్యం వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం అనే ఊబిలో అమెరికా కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత మీడియా అనేది కనుమరుగు అవుతోందని, ఎడిటర్లు అనేవారు కనిపించడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో నిజ నిర్ధారణ అనేది లేకపోవడం బాధాకరమని వెల్లడించారు. అసత్యాల వెల్లువలో సత్యం మరుగునపడడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కొందరు స్వార్థపరులు అధికారం, లాభార్జన కోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారని బైడెన్ ఆరోపించారు. మన పిల్లలను, మన కుటుంబాలను కాపాడుకోవడానికి, అధికార దురి్వనియోగం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలని స్పష్టంచేశారు. తగిన నిబంధనలు, రక్షణలు అమల్లో లేకపోతే కృత్రిమ మేధ(ఏఐ) కోరలు మరింతగా విస్తరిస్తాయని, మానవ హక్కులకు, గోప్యతకు భంగం వాలిల్లుతుందని హెచ్చరించారు. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన ఘనతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము విత్తనాలు నాటామని, వాటి ఫలితాలు తర్వాత కనిపిస్తాయని జో బైడెన్ తేల్చిచెప్పారు. -
రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?
చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ఆఫీసులో తాము ఎదుర్కుంటున్న పని ఒత్తిడి, బాస్ టార్చర్ వంటి సమస్యలను గురించి పేర్కొంటూ ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా ఒక ఉద్యోగి ఆఫీసులో సృష్టించిన అల్లకల్లోలం గురించి.. కంపెనీ ఓనర్ వెల్లడించారు.ఇటీవల ఉద్యోగంలో చేరిన లిలీ అనే 26ఏళ్ల ఉద్యోగి.. ప్రారంభంలో చాలా చురుగ్గా ఉండేది. అయితే కొన్ని సార్లు ఆఫీసులో పాటించాల్సిన నియమాలను పాటించేది కాదు. అయితే ఓ పనిమీద నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో లిలీ ఆఫీసులోని అందరికీ పార్టీ ఇచ్చింది. దీనికోసం కంపెనీ క్రెడిట్ కార్డును ఉపయోగించి 2000 డాలర్లు (దాదాపు రూ. 1.70 లక్షలు) ఖర్చు చేసింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, అందుకే అందరికీ ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాను, అందరూ తప్పకుండా రావాలని లిలీ మెయిల్ చేసి.. అందరికీ పార్టీ ఇచ్చిందని ఆ కంపెనీ మహిళా ఓనర్ రెడ్డిట్ వేదికగా వెల్లడించింది.ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని పార్టీ ఇచ్చిన లిలీ.. జాబ్కు రిజైన్ చేయలేదు. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చాక.. ఆఫీసులో జరిగిన అల్లకల్లోలం గురించి తెలుసుకున్నాను. దీనికి కారణమైన లిలీని పిలిచి.. ఆఫీసులో పార్టీ ఏంటి? దీనికి కంపెనీ డబ్బును ఎందుకు ఉపయోగించావని అడిగాను. దీనికి ఆమె బదులిస్తూ ఇదొక 'సోషల్ ఎక్స్పర్మెంట్' అని చెప్పింది.ఆఫీసులో ఎక్స్పర్మెంట్ ఏమిటి? అని అడిగితే.. నేను రాజీనామా చేసి వెళ్లే సమయంలో పార్టీ ఇస్తే ఎంతమంది వస్తారో అని తెలుసుకోవడానికి అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలతో చిర్రెత్తిపోయిన బాస్.. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించేసింది.నేను లిలీను తొలగించడం కరెక్టేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లను అడిగింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. లిలీపై దొంగతనం, చీటింగ్ కేసు పెట్టమని కొందరు చెబుతున్నారు. ఆమె నమ్మక ద్రోహం చేసిందని మరికొందరు పేర్కొన్నారు. కంపెనీ డబ్బుతో లిలీ ఎంజాయ్ చేసింది.. మీరు కాబట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారు. మరో కంపెనీలో అయితే ఆమెపై కఠినమైన చర్యలు తీసుకుని ఉండేవారని ఇంకొందరు పేర్కొన్నారు. -
CJI DY చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు వీడ్కోలు
-
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
‘ఆమె మహిళా హక్కుల పరిరక్షకురాలు’
న్యూఢిల్లీ: జస్టిస్ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలు ఉంటారు. ‘జస్టిస్ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్మేట్లు కావడం గమనార్హం. న్యాయం కోసం జస్టిస్ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. -
విల్లామేరీ విద్యార్థినుల ఫేర్వెల్.. ఫ్యాషన్ షోతో అదరగొట్టిన అమ్మాయిలు
-
PM Narendra Modi: మాకది దిష్టి చుక్క!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి చుక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు, ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన ‘దిష్టి చుక్క’గా భావించవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి వీడ్కోలుపై గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. దారిచూపే దీపం మన్మోహన్ సింగ్ దేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు దేశ ప్రజలకు అందించిన సహకారం, చేసిన మార్గదర్శకత్వం ఎప్పటికీ గుర్తుంటుంది. మన్మోహన్ వంటి విశిష్ట వ్యక్తులు దారి చూపే దీపం లాంటివారు. ఆయన నడవడిక నుండి సభ్యులంతా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’’ అని సూచించారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఓ బిల్లుపై ఓటు వేసేందుకు మన్మోహన్æ చక్రాల కుర్చీలో వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాధ్యతగా నిర్వహించారో చెప్పడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ చర్చ జరిగినా మన్మోహన్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే’’ అని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్కు దీర్ఘాయుస్సు కలగాలని, ఆయన ఆరోగ్యప్రదమైన జీవనం సాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న ఇతర సభ్యులు పార్లమెంట్లో నేర్చుకున్న అంశాలను దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని బలోపేతం చేయడానికి ఉపయోగించాలని కోరారు. రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3న ముగియనుంది. -
Justice Sanjay Kishan Kaul: సహనశీలత తగ్గుతోంది
న్యూఢిల్లీ: ఎదుటి వారి అభిప్రాయాల పట్ల ప్రజలు సహనం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో నేడు సహనశీలత స్థాయిలు తగ్గుతూండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ధైర్యం కలిగి ఉండటం చాలా కీలకమైన అంశమన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడే బాధ్యత బార్ అసోసియేషన్దేనని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్ల 10 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ ఎస్కే కౌల్ ఈ నెల 25న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టుకు ఈ నెల 18 నుంచి వచ్చే జనవరి 2వ తేదీ వరకు శీతాకాల సెలవులు. దీంతో, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో సమావేశమైన వీడ్కోలు ధర్మాసనంలో జస్టిస్ కౌల్ మాట్లాడారు. ‘సర్వోన్నత న్యాయస్థానం నిర్భయంగా న్యాయాన్ని అందించిన న్యాయ దేవాలయం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలి’అని ఆయన ఆకాంక్షించారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్.. జస్టిస్ కౌల్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘70ల్లో నేనూ జస్టిస్ కౌల్ కలిసి కాలేజీకి వెళ్లాం. పుట్టస్వామి గోపత్యా హక్కు కేసు, వైవాహిక సమానత్వ కేసు, తాజాగా ఆరి్టకల్ 370 కేసు..ఇలా పలు కేసుల్లో ఇరువురం కలిసి ఇదే వేదికపై నుంచి తీర్పులు వెలువరించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కేనంటూ తీర్పు వెలువరించిన తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ కౌల్ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమరి్థస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఉన్నారు. 1958లో జని్మంచిన కౌల్ 1982లో ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1999లో సీనియర్ న్యాయవాది గుర్తింపు పొందారు. 2001లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా, 2003లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2014లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ రిటైరయ్యారు. ఆఖరి పనిదినమైన శుక్రవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సహ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ..న్యాయవ్యవస్థ కోసం ముఖ్యంగా రాజ్యాంగ సంబంధ అంశాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమని కొనియా డారు. 1979 నుంచి ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిష్ అగర్వాల్ పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్ 23న జస్టిస్ భట్ సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్లపాటు సేవలందించారు. పలు చారిత్రక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 1958లో మైసూరులో జన్మించిన జస్టిస్ భట్ 1982లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. -
అమృత హస్తాలు
33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి. ‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా. ► తల్లి కూడా నర్సే ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా. ► స్త్రీల వేదన 1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె. ► ఎంతో సంతృప్తి ‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా. మారిన దృష్టి ‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె. -
స్కూల్ ఫేర్వెల్ ఈవెంట్లో నటుడు హర్షవర్ధన్ రాణే సందడి (ఫోటోలు)
-
రిటైర్ అవ్వాల్సిన వ్యక్తిని కాను... కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా
న్యూఢిల్లీ: ఇప్పుడే పదవీవిరమణ చేయాల్సిన వ్యక్తిని కాదని, మరో కొత్త ఇన్నింగ్స్ మొదలెడతా అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ముఖేశ్కుమార్ రసిక్భాయ్(ఎంఆర్) షా సోమవారం వ్యాఖ్యానించారు. భారత సర్వోన్నత న్యాయస్థానంలో నాలుగో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన ఎంఆర్ షా సోమవారం పదవీవిరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు బార్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ షా ప్రసంగించారు. ‘ రిటైర్ అవ్వాల్సిన వ్యక్తినికాదు. జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా. కొత్త ఇన్నింగ్స్ ఆడేందుకు సరిపడ ధైర్య, స్థైర్య, ఆయుఃఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. రాజ్కపూర్ సినిమాలో పాటలోని పదాలు నాకు గుర్తొస్తున్నాయి. రేపు నేను ఆటలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ వినీలాకాశంలో సదా తారనై ఉంటా. పుట్టుక ఇక్కడే. మరణమూ ఇక్కడే’ అంటూ ఉద్వేగంతో మాట్లాడారు. ‘లాయర్లకు నాదో విన్నపం. అస్తమానం కేసులపై వాయిదాలు కోరకండి. వాదనలకు సిద్ధమై రండి. యువ లాయర్లకు నాదో సలహా బార్ రూమ్లోనో, క్యాంటీన్లో కాలక్షేపాలొద్దు. కోర్టు హాల్లో వాదనలు విని అనుభవం గడించండి’ అని అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. ‘ ధైర్యం, పోరాట స్ఫూర్తి చూస్తే ఆయనను టైగర్ షా అనాల్సిందే. తర్కంతో ఆలోచించే జ్ఞాని. టెక్నాలజీని త్వరగా ఆకళింపుచేసుకుంటారు. కొలీజియం నిర్ణయాలు తీసకునేటపుడు అద్భుతమైన సలహాలిచ్చారు. నేను అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు మొదలైన స్నేహం ఆనాటి నుంచీ కొనసాగింది. ఎవరి ఇళ్లల్లో వాళ్లం ఉన్నాసరే ఫోన్చేస్తే చాలు ఆయన ఎప్పుడూ కీలకమైన అంశాలపై చర్చిస్తుండేవారు. కోవిడ్ సంక్షోభకాలంలోనూ విధులు నిర్వర్తించాం’ అని అన్నారు. 2018 నవంబర్ రెండో తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా షా నియమితులయ్యారు. సోమవారం ఆయన రిటైర్అవడంతో సుప్రీంకోర్టులో సీజేతో కలిపి మొత్తం జడ్జీల సంఖ్య 32కు పడిపోయింది. ఆదివారం మరో జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి రిటైర్కావడం తెల్సిందే. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో జడ్జీల గరిష్ట సంఖ్య 34. జస్టిస్ ఎంఆర్ షా న్యాయ ప్రస్థానం 1982లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా మొదలైంది. 2004 మార్చిలో గుజరాత్ హైకోర్టులో అదనపు న్యాయవాదిగా నియమితులయ్యారు. ఆ తర్వాతి ఏడాది శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2018 ఆగస్ట్లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది నవంబర్లో పదోన్నతితో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చారు. -
సానియా మీర్జా ఫేర్వెల్లో సందడి చేసిన మహేశ్ దంపతులు
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్తో కలిసి ఫేర్వెల్ పార్టీకి హాజరయ్యారు. ఇద్దరూ బ్లాక్ అవుట్ఫిట్లో ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక సానియాతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా సానియా మీర్జా కుటుంబంతో మహేశ్బాబు, నమ్రతకు మంచి అనుబంధం ఉంది. గతంలోనూ పలు ఫ్యామిలీ ఫంక్షన్స్లో వీళ్లు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) What a journey!! So so proud of you! 🤗 @MirzaSania pic.twitter.com/qyWAIUs0XB — Mahesh Babu (@urstrulyMahesh) March 5, 2023 -
గవర్నర్ కు ఆత్మీయ వీడ్కోలు
-
రిటైరైన జస్టిస్ నజీర్
న్యూఢిల్లీ: జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనియాడారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వీడ్కోలు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జస్టిస్ నజీర్ది బహుముఖీన వ్యక్తిత్వం. సాధారణ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రజా న్యాయమూర్తిగా పేరుగడించారు’’ అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తగినంత లేకపోవడం బాధాకరమని జస్టిస్ నజీర్ అన్నారు. జూనియర్ లాయర్లకు మంచి వేతనాలు, మరిన్ని అవకాశాలు కావాలని అభిప్రాయపడ్డారు. -
వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా
న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్ యు.యు.లలిత్ పదవీ కాలం మంగళవారం ముగియనుంది. ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నా ప్రయాణం సంతృప్తికరం సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు. -
UK PM results 2022: జాన్సన్ వారసులెవరో తేలేది నేడే
లండన్: యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. లిజ్ ట్రస్ ఎన్నికైతే బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్ గ్రాహం బ్రాడీ వెల్లడిస్తారు. ఎన్నికైన నేత డౌనింగ్ స్ట్రీట్కు సమీపంలోనే ఉన్న రాణి ఎలిజబెత్–2 కాన్ఫరెన్స్ సెంటర్ నుంచి సంక్షిప్త ప్రసంగం చేస్తారు. మంగళవారం డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అనంతరం స్కాట్లాండ్లో ఉన్న రాణి ఎలిజబెత్కు తన రాజీనామాను అందజేస్తారు. ఆపైన, పార్టీ నేతగా ఎన్నికైన వారు స్కాట్లాండ్కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్కు, బకింగ్హామ్ ప్యాలెస్కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. 96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్షైర్ బాల్మోరల్ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్ పదవులను ఖరారు చేస్తారు. సీనియర్ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలను, అణ్వాయుధాల రహస్య కోడ్లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కోవిడ్ నిబంధనలన ఉల్లంఘిస్తూ పార్టీలు జరుపుకోవడం, పార్టీ సీనియర్ నేత ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో బోరిస్ జాన్సన్ కేబినెట్లోని సుమారు 60 మంది సీనియర్ నేతలు రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇంధన భారం తగ్గిస్తాం ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం వీరు బీబీసీ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూకేలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో, ఇదే ప్రధాన అంశంగా మారింది. కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా రిషి సునాక్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతానని, తన సొంత రిచ్మండ్, యార్క్షైర్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం చేస్తారన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని పదవి రేసులో ఉంటారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. -
న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సమ వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం, బార్, బెంచ్లు ఈ మేరకు చొరవ తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ క్రమంలో అనేక కుట్రపూరిత పరిశీలనలకు గురయ్యాయని చెప్పారు. తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. బాల్యం నుంచి సీజేఐ వరకూ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను స్మరించుకున్నారు. తన అనుభవాల్లో తీపి కంటే చేదు ఎక్కువగా ఉందన్నారు. అనేక ఆందోళనలు, పోరాటాల్లో భాగస్వామి అయిన తాను ఎమర్జెన్సీ సమయంలో బాధలు పడ్డానని తెలిపారు. ఆయా అనుభవాలే ప్రజలకు సేవ చేయాలన్న అభిరుచిని తనలో పెంపొందించాయని వ్యాఖ్యానించారు. మొదటి తరం న్యాయవాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, విజయాలకు షార్ట్కట్ ఉండదని తెలుసుకున్నానని వెల్లడించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ ఉద్దేశం అదే.. గొప్ప న్యాయమూర్తినని తాను ఎప్పుడూ చెప్పుకోలేదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే న్యాయ వ్యవస్థ అంతిమ ఉద్దేశమని నమ్ముతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బార్ కృషి చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల్లో అవగాహన, విశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 16 నెలల తన పదవీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తమేనని వివరించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను భీష్మ పితామహుడిగా జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్ వికాస్ సింగ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీజేఐ (నియమిత ) జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. హైకోర్టుల్లో నియామకాలు, మౌలిక సదుపాయాల కోసం జస్టిస్ ఎన్వీ రమణ సాగించిన కృషిని అభినందించారు. నూతన సీజేఐగా తన పదవీ కాలంలో కేసుల జాబితా, అత్యవసర విషయాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలపై దృష్టి సారిస్తానన్నారు. పెండింగ్ కేసులే అతిపెద్ద సవాల్ విచారించాల్సిన కేసుల జాబితా సమస్యలను పరిష్కరించడంపై తగిన శ్రద్ధ చూపలేకపోయినందుకు జస్టిస్ ఎన్వీ రమణ క్షమాపణలు కోరారు. దేశంలోని కోర్టులు పెండింగ్ కేసుల రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను ఒక ఉత్తర్వు, ఒక తీర్పుతో నిర్వచించలేమని, అదేవిధంగా ఒక తీర్పుతో మార్చలేమని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టుల పనితీరును సంస్కరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. శాశ్వత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మే«ధను వాడుకోవాలన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సందర్భంగా సీనియర్ లాయర్ దుష్యంత్ దవే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రజాన్యాయమూర్తి అంటూ కొనియాడారు.. జస్టిస్ రమణ సేవలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలతో సాయంతో పూర్తిస్థాయిలో పనిచేశారని జస్టిస్ రమణను అభినందించారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం సుప్రీంకోర్టు శుక్రవారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశగా జస్టిస్ ఎన్వీ రమణ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. నేడు జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో జస్టిస్ లలిత్తో ప్రమాణం చేయించనున్నారు. వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్ -
గ్రామీణ అభివృద్ధి వెంకయ్య నాయుడు ఇష్టంగా నిర్వహించారు: ప్రధాని మోదీ
-
ఇది భారత శతాబ్దం
న్యూఢిల్లీ: మూలాలను మర్చిపోరాదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ యువతను కోరారు. ప్రకృతి మాత తీవ్ర వేదన చెందుతోందని, వాతావరణ సంక్షోభంతో పుడమి భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయనున్న కోవింద్ ఆదివారం జాతి నుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దాన్ని ‘భారత శతాబ్దం’గా మార్చడానికి దేశం సన్నద్ధమవుతోందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యతోపాటు ఆర్థిక సంస్కరణలు పౌరులు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ఆనందంగా ఉండేందుకు సాయపడతాయన్నారు. ‘కోవిడ్ మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక వనరులను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. ప్రభుత్వం కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. అదేవిధంగా, యువజనులు తమ ఘనమైన వారసత్వాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి జాతీయ విద్యా విధానం దోహదపడుతుంది. యువ త మూలాలను మరువరాదు’ అని కోరారు. ‘మన పిల్లల కోసం దైనందిన జీవితంలో అవకాశమున్నంత మేర చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇతర జీవరాశుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ పౌరుడిగా, నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వవలసి వస్తే అది ఇదే అయి ఉంటుంది’ అని కోవింద్ అన్నారు. ‘ఒక పూరింట్లో నివసించే ఒక చిన్న పిల్లాడికి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. కానీ, మన ఉమ్మడి విధి రూపకల్పనలో ప్రతి పౌరుడు పాలుపంచుకునేలా మార్గాలను సృష్టించడమే దేశ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం’ అని చెప్పారు. పరూంఖ్ గ్రామానికి చెందిన కోవింద్ ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య వ్యవస్థల శక్తికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలో తనకు సమాజంలోని అన్ని వర్గాల సహకారం, మద్దతు, ఆశీస్సులు లభించాయని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం వంటి మహామహుల వారసుడిననే స్పృహతో శాయశక్తులా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను’ అని తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం విందు ఇచ్చారు. విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, పలువరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. -
స్వార్థ రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు జాతి ప్రయోజనాలే పరమావధిగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుంది. కానీ అందుకు గాంధేయ మార్గాన్నే అనుసరించాలి. నేనెల్లప్పుడూ ఎంపీలతో కూడిన పెద్ద కుటుంబంలో సభ్యుడిననే భావించుకున్నాను. కుటుంబంలోలానే పార్లమెంట్లోనూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయముండొచ్చు. జాతి ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి’’ అన్నారు. రాష్ట్రపతిగా సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ‘‘విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు, ఎంపీలకు కృతజ్ఞతలు. పార్లమెంట్ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి ఘన సంప్రదాయాలను కొనసాగించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా కృతజ్ఞతలు’’ అన్నారు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి తుది ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మోదీ, ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. వెంకయ్య వీడ్కోలు విందు రాష్ట్రపతికి వెంకయ్య తన నివాసంలో వీడ్కోలు విందు ఇచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కోవింద్ దంపతులను వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో తెలుగు వంటకాలు వడ్డించారు. విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా కోవింద్హుందాగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్య కొనియాడారు. కోవింద్ జీవితం ఆదర్శనీయమైందని, ఆయన ఆలోచనలు, ప్రసంగాల నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని అన్నారు. న్యాయవాది నుంచి రాష్ట్రపతి దాకా... దేశ 14వ రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు సేవలందించిన రామ్నాథ్ కోవింద్ సాధారణ న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో పార్లమెంట్ సభ్యుడిగా, గవర్నర్గా సేవలందించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరౌంఖ్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వొకేట్గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్–ఆన్–రికార్డుగా ఎంపికయ్యారు. 1980 నుంచి 1993 దాకా సుప్రీంకోర్టులో కేంద్రం తరఫు న్యాయవాదిగా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ప్రధానంగా మహిళలు, పేదలకు ఉచితంగా న్యాయ సేవలందించారు. బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994 నుంచి 2006 దాకా రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో బిహార్ గవర్నర్గా నియమితులయ్యారు. బిహార్ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017లో అధికార ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు. కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి అయిన రెండో దళితుడు కోవింద్. పుస్తక పఠనమంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. సామాజిక సాధికారతకు విద్యే ఆయుధమని చెబుతుంటారు. దివ్యాంగులు, అనాథలకు సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచిస్తుంటారు. రాష్ట్రపతి హోదాలో కోవింద్ 33 దేశాల్లో పర్యటించారు. సైనిక దళాల సుప్రీం కమాండర్గా 2018 మేలో సియాచిన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన కుమార్ పోస్టును కూడా ఆయన సందర్శించారు. -
రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముతోపాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు. హోటల్ అశోకాలో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురితోపాటు 18 పార్టీల నేతలు కూడా ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. -
ప్రభుత్వ ప్రోత్సాహం ప్రశంసనీయం: హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ప్రశంసించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో కోర్టులు, న్యాయాధికారులు, ఇతర సిబ్బంది నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. పలు కోర్టుల్లో అవసరమైన సదుపాయాలు కూడా కల్పించింది. దీనికి జస్టిస్ నాగార్జున ఎంతగానో కృషి చేశారు. కరోనా సమయంలో పెండింగ్ కేసుల భారం తగ్గించేందుకు అందరూ సహకరించారు. జాగ్రత్తల నడుమ ప్రత్యక్ష కోర్టులు నిర్వహించాం. 2021లో నేను సీజేగా వచ్చాక.. సీజేఐ కృషి ఫలితంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరిగింది. కొత్త న్యాయమూర్తుల నియామకం చేపట్టడం జరిగింది’ అని సీజే వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిటెక్టివ్లా.. రైతులా.. వైద్యుడిలా..: ‘అన్వేషణ చేసే డిటెక్టివ్లా.. ఎన్ని కష్టాలొచ్చినా సాగు చేసే రైతులా.. శస్త్రచికిత్స చేసే వైద్యుడిలా.. న్యాయవాదులు పనిచేయాలి. పేద ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేయాలి. జూనియర్ న్యాయవాదులు సీనియర్ల సలహాలు తీసుకోవాలి. నైతిక విలువలు నేర్చుకోవాలి’ అని సీజే సూచించారు. హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ‘ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్నా.. అప్పుడప్పుడూ హైదరాబాద్కు వస్తా. ఈ నగరంతో బంధం విడదీయరానిది’ అని సీజే పేర్కొన్నారు. సీజేలో మానవత్వం ఎక్కువ: అందరికీ నవ్వుతూ కనిపించే జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, విధి నిర్వహణలో చాలా సీరియస్గా పనిచేస్తారని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. ఆయనలో మానవత్వం కూడా ఎక్కువేనని అది పలు కేసుల విచారణలో చూపించారన్నారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు అండగా నిలబడే తీర్పులు సీజే ఇచ్చారన్నారు. మూడున్నర వేల కేసుల్ని పరిష్కరించారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా హైకోర్టు న్యాయమూర్తులు బుధవారం రాత్రి సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మకు వీడ్కోలు విందు ఇచ్చారు. మరోవైపు జస్టిస్ సతీశ్చంద్ర శర్మ బదిలీ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ నెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
ఏయూలో సందడిగా విదేశీ విద్యార్థుల వీడ్కోలు (ఫోటోలు)
-
ఏపీ సచివాలయంలో ఆదిత్యనాథ్ దాస్కు ఘనంగా వీడ్కోలు
-
సవాళ్లను అధిగమిస్తేనే విజయం : జస్టిస్ హిమాకోహ్లి
సాక్షి, హైదరాబాద్: సవాళ్లను అధిగమిస్తేనే విజయం వరిస్తుందని, న్యాయవాదులు రాణించాలంటే నిజాయతీ, నిబద్ధత, కష్టించేతత్వం, చిత్తశుద్ధి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తున్న జస్టిస్ హిమాకోహ్లి అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేస్తానని భావించిన తనకు పదో న్నతి ఇచ్చి సుప్రీంకోర్టుకు పంపుతున్నారని, ఇం దుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు, కొలీజియంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జస్టిస్ హిమాకోహ్లికి శుక్రవారం సీజే కోర్టుహాల్లో హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జస్టిస్ కోహ్లి మాట్లాడారు. ‘1980ల్లో ఢిల్లీలాంటి మెట్రోపాలిటన్ నగరంలో కూడా మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన 22 ఏళ్లలో, జడ్జిగా పనిచేసిన 15 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఒక నాణేనికి బొమ్మాబొరుసులాంటి వారు. వీరిద్దరూ సమన్వయంతో పనిచేసినప్పుడే కేసుల సత్వర విచారణ సాధ్యమతుంది’అని పేర్కొన్నారు. చదవండి: TS High Court: హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు 8 నెలల్లో 1,731 కేసులు.. ‘నాతోపాటు ధర్మాసనంలో జస్టిస్ బి.విజయసేన్రెడ్డి, జస్టిస్ అభిషేక్రెడ్డి కేసుల సత్వర పరిష్కారానికి సహకరించారు. ఈ 8 నెలల కాలంలో 1,731 కేసులను పరిష్కరించాం. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 200 కుటుంబ వివాదాల్లో ఇరువర్గాలను ఒప్పించి రాజీమార్గం ద్వారా పరిష్కరించాం. ఇటీవల ఆరుగురు జిల్లా జడ్జిల, ఏడుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియంకు సిఫార్సు చేశాం. హైకోర్టులో 2.30 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులు సత్వర పరిష్కారం కావాలంటే న్యాయమూర్తుల నియామకాలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 11 ఉండగా, త్వరలోగా ఆ సంఖ్య 34కు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’ అని జస్టిస్ కోహ్లి పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ హిమకోహ్లీని ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావుతోపాటు ఇతర న్యాయమూర్తులు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విభు భక్రూ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్రావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డితోపాటు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా చట్టబద్ధ పాలనే మన మతం.. ‘రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాం. చట్టబద్ద పాలనే మన మతం. ప్రజలు.. ప్రాం తీయ, మత, కులతత్వాలను విడిచిపెట్టాలి. స్వేచ్ఛాయుత ఆలోచనలు పంచుకోవాలి. ప్రజాస్వామిక సంప్రదాయాలు పాటించాలి. హైదరాబాద్.. ఆధునికత, సంప్రదాయం కలగలిసిన గొప్ప సంస్కృతికి ప్రతీక. ప్రధాన న్యాయమూర్తిగా నా పేరును సిఫార్సు చేయడానికి నెల రోజుల ముందు ఒక మిత్రుడు ఈ హైకోర్టు భవన చిత్రాలను పంపించారు. ఆ చిత్రాలను చూసి మంత్రముగ్ధురాలినయ్యా. ఇక్కడ పనిచేయడం చాలా గర్వంగా ఉంది’అని జస్టిస్ కోహ్లి వివరించారు. -
ఎనిమిదేళ్లలో 18 వేల కేసుల్లో తీర్పులిచ్చారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చల్లా కోదండరామ్ విధులు నిర్వహించిన ఎనిమిదేళ్లలో 18,890 వేల కేసుల్లో తీర్పులిచ్చారని, మరో 13,752 మధ్యంతర పిటిషన్లను పరిష్కరించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి ప్రశంసించారు. జస్టిస్ కోదండరామ్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్కోర్టు సమావేశమై కోదండరామ్ సేవలను కొనియాడింది. అనంతరం ఘనంగా వీడ్కోలు పలికింది. తర్వాత హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆయనను సత్కరించింది. రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ పాల్గొన్నారు. -
తీర్పులే భూషణం: సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: తన విశిష్టమైన తీర్పుల ద్వారా జస్టిస్ అశోక్ భూషణ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జూలై 4న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ వీడ్కోలు సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. చాలామంది ప్రధాన న్యాయమూర్తులు క్లిష్టమైన కేసుల బాధ్యతను జస్టిస్ భూషణ్కే అప్పగించేవారని గుర్తుచేశారు. ‘‘నేను సభ్యుడిగా ఉన్న ధర్మాసనం, కమిటీల్లో జస్టిస్ భూషణ్ ఉన్నారంటే ఎంతో భరోసాగా ఉండేది. జస్టిస్ భూషణ్ ఇచ్చిన తీర్పుల్లో మానవతా విలువలు, సంక్షేమ విలువలు ప్రతిబింబిస్తాయి. జస్టిస్ భూషణ్ తన తీర్పులతోనే గుర్తుండిపోతారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలో పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తమ తీర్పు ద్వారా మార్గం సుగమం చేసిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ భూషణ్ కూడా ఉన్నారు. చట్టం రెండు వైపులా పదునున్న కత్తి చట్టం రెండువైపులా పదునున్న కత్తి లాంటిదని, న్యాయం అందించడమే కాదు, అన్యాయం జరగకుండా చూస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. జస్టిస్ పీడీ దేశాయ్ 17వ స్మారకోపన్యాసంలో ఆయన ‘రూల్ ఆఫ్ లా’పై మాట్లాడారు. అప్పట్లో బ్రిటిషర్లు, భారతీయులకు వేర్వేరు చట్టాలుండేవని చెప్పారు. ‘రూల్ ఆఫ్ లా’ ఏర్పాటు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజల రక్షణ నిమిత్తం ‘రూల్ ఆఫ్ లా’ ఎంత మేరకు ఉపయోగిస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. కరోనా మహమ్మారి రాబోయే కాలానికి కర్టెన్ రైజర్గా భావిస్తున్నానని, ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. చట్టసభలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా న్యాయవ్యవస్థను నియంత్రించలేవని స్పష్టం చేశారు. -
వైరల్ : 11 ఏళ్లపాటు సేవలు.. జాగిలానికి ఘనంగా వీడ్కోలు
ముంబై : పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన స్నిఫర్ డాగ్కు అరుదైన గౌరవం దక్కింది. 11 ఏళ్లపాటు విశేష సేవలందించిన జాగిలానికి నాసిక్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. 'స్నిఫర్ స్పైక్' సేవలను ప్రశంసిస్తూ గులాబీలు,బెలూన్స్తో డెకరేట్ చేసిన పోలీసు వాహనంపై దాన్ని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సైతం స్పైక్ సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. 'స్నిఫర్ జాగిలం(కుక్క) మాత్రమే కాదు, పోలీసు కుటుంబంలో తను కూడా భాగమయ్యాడు. దేశం పట్ల అతడు అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ స్పిఫర్ స్పైక్ గత 11 సంవత్సరాలుగా విధి నిర్వహాణలో ఎన్నో పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేయడంలో చురుకైన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో నాసిక్ పోలీసులు స్పిఫర్ సేవలను గుర్తుచేస్తూ దానికి వీడ్కోలు పలికారు. ఇక చిన్నవయసు నుంచే స్పిఫర్ జాతికి చెందిన జాగిలాలకు అధికారులు శిక్షణ ఇప్పిస్తారు. వీటిని ఎక్కువగా తుపాకీలు, మాదక ద్రవ్యాలు, బాంబులు వంటి వాటిని గుర్తించడానికి వాడతారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటాయి. విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ -19 కణాలను గుర్తించే అంశంపై జాగిలాలకు శిక్షణ ఇవ్వాలని పలు దేశాలు భావిస్తున్నాయి. మనిషి చెమట, మూత్రాన్ని వాసనను పసిగట్టి వారికి కరోనా కణాలు ఉన్నాయో లేదో గుర్తించేలా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే ఇందుకు అనుగుణంగా ఢిల్లీలోని ఓ క్యాంప్లో ప్రత్యేకంగా ఎనిమిది కుక్కలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆర్మీ డాగ్ ట్రైనర్ కల్నల్ సురేందర్ సైని అన్నారు. ముఖ్యంగా కాకర్ స్పానియల్స్, లాబ్రడార్స్ జాతులకు చెందిన కుక్కలను వీటి కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చదవండి : (వైరల్: మీకెంత ధైర్యం.. నన్నే ఫాలో అవుతారా?) (ఆ బిల్లు పెట్రోల్ బంక్లో ఇచ్చింది కాదు!) -
ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ఘనమైన వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజు ఘనంగా సన్మానించి ప్రభుత్వ వాహనంలో స్వగృహానికి సాగనంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్)ను తయారు చేయాలని అధికారులను కోరారు. పదవీ విరమణ చేసిన ఏడుగురు సచివాలయ ఉద్యోగులకు శనివారం బీఆర్కేఆర్ భవన్లో సన్మాన సభ నిర్వహించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గౌరవంగా వ్యవహరించాలని, పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను ఈసందర్భంగా సీఎస్ కొనియాడారు. సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జి.క్రిష్ణవేణి, ఆ శాఖ ఆఫీస్ సబార్డినేట్ ఎన్.గంగమ్మ, ఐటీ శాఖ ఉప కార్యదర్శి టి.పద్మసుందరి, మైనారిటీ వెల్ఫేర్ శాఖ సహాయ కార్యదర్శి మహమ్మ ద్ నసీర్, పంచాయతీరాజ్ శాఖ సహాయ కార్యదర్శి మంజుల, ఆర్అండ్బీ శాఖ సెక్ష న్ ఆఫీసర్ అర్జున్ సింగ్, ఆర్థిక శాఖ సెక్షన్ అసిస్టెంట్ పాల్ ఫ్రాన్సిస్ పదవీ వీరమణ పొందిన వారిలో ఉన్నారు. కాగా, అటవీశాఖలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా రిటైర్ అయిన కౌసర్ అలీకి కూడా ఆ శాఖ అధికారులు సగౌరవంగా వీడ్కోలు పలికారు. -
మరికొన్ని గంటల్లో వైట్హౌజ్కు ట్రంప్ బైబై
వాషింగ్టన్: ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అధికారాన్ని బదిలీ చేయకుండా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మెట్టు దిగారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తన వీడ్కోలు సమావేశంలో మంగళవారం ట్రంప్ మాట్లాడారు. శ్వేతసౌధంలో నిర్వహించిన చివరి కార్యక్రమంలో ఆయన తన పదవీకాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటు కొత్తగా రాబోయే అధ్యక్షుడికి కొన్ని సూచనలు చేశారు. నాలుగేళ్ల కిందట దేశాన్ని పునర్నించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామని.. కొత్త ఉత్సాహం, ఉత్తేజంతో పౌరులకు ప్రభుత్వం చేరువ చేయాలనే ఉద్దేశంతో పని చేశామని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘అధ్యక్షుడిగా పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుత అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. కొత్తగా వచ్చే అధికార యంత్రాంగం అమెరికాను సురక్షితంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. వారికి మా శుభాకాంక్షలు’’ అంటూ ట్రంప్ శ్వేతసౌధం వీడుతూ బైడెన్కు స్వాగతం పలికారు. తాను ఈ అద్భుతమైన ప్రాంతం నుంచి నమ్మకం, సంతోషకరమైన హృదయంతో, ఆశావాద దృక్పథంతో వెళ్తున్నానని చెప్పారు. ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో తన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలను కొన్ని ప్రస్తావించారు. చైనాతో వైఖరి, తనపై సోషల్ మీడియా నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు. అయితే సమావేశంలో ఎక్కడ కూడా జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని అంగీకరించకపోవడం గమనార్హం. అనంతరం అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా మాట్లాడారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడం లేదు. ఆ సంప్రదాయాన్ని పాటించకుండా శ్వేతసౌధం వదిలేసి ఫ్లోరిడాలోని తన ఇంటికి వెళ్తున్నారు. అయితే బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈరోజు రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
రేపు ఉదయం ట్రంప్ టాటా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ఉదయం వైట్హౌజ్ను, వాషింగ్టన్ను వీడనున్నారు. అదే రోజు దేశ నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా చివరి రోజైన మంగళవారం ట్రంప్ బిజీబిజీగా గడపనున్నారు. దాదాపు వంద మందికి క్షమాభిక్ష ప్రకటించే, లేదా శిక్షా కాలాన్ని తగ్గించే ఫైల్స్పై సంతకాలు చేయనున్నారు. వారిలో హెల్త్ కేర్ కుంభకోణానికి పాల్పడిన నేత్ర వైద్యుడు డాక్టర్ సోలమన్ మెల్గన్, పలువురు వైట్కాలర్ క్రిమినల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మేరీలాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో బుధవారం ట్రంప్కు వీడ్కోలు పలికే కార్యక్రమం జరపనున్నారు. ఆ తరువాత, ట్రంప్ తన అధికారిక విమానం ‘ఎయిర్ఫోర్స్ వన్’లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్కు వెళ్తారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కన్నా ముందే వీడ్కోలు కార్యక్రమం ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి 7.15 గంటల మధ్య అది ఉండొచ్చని వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి. కలర్ గార్డ్, 21 గన్ సెల్యూట్తో అధ్యక్షుడికి వీడ్కోలు పలికే అవకాశముందన్నాయి. సీఎన్ఎన్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకోవాలనుకోవడం లేదు. తనకు, తన పిల్లలకు క్షమాభిక్ష ప్రకటించే దిశగా ట్రంప్ ఆలోచించడం లేదు. జనవరి 6 నాటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. స్వీయ క్షమాభిక్ష నిర్ణయం తీసుకుంటే.. నేరం చేశానని అంగీకరించినట్లుగా తేలుతుందని ట్రంప్కు సన్నిహితులు సలహా ఇచ్చారు. అయితే, చివరి నిమిషంలో ట్రంప్ మనసు మార్చుకుని, స్వీయ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎన్ఎన్ పేర్కొంది. క్షమాభిక్ష ప్రకటించాల్సిన, శిక్షాకాలం తగ్గించాల్సిన వారి జాబితాను ఇప్పటికే రూపొందించారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి. -
వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులు అదృశ్యమైన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అత్యవసరంగా విచారించి వ్యక్తి స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కాపాడారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తే సత్వర న్యాయం లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారన్నారు. జస్టిస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో న్యాయమూర్తులతో కూడిన ఫుల్కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దేశంలోనే తెలం గాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని సీజే ఆకాంక్షించేవారని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు. ఎర్రమంజిల్ను కూల్చి అక్కడ సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చి, చారిత్రక కట్టడాన్ని రక్షించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తుచేశారని తెలిపారు. కష్టపడితేనే న్యాయవాదిగా గుర్తింపు: సీజే న్యాయవాద వృత్తిలో షాట్కట్స్ ఉండవని, కష్టపడిన వారికే మంచి గుర్తింపు లభిస్తుందని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. యువ న్యాయవాదులు కష్టపడాలని, సీనియర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో కూడా న్యాయమూర్తుల సహకారంతో కేసులను విచారించి ప్రజలకు సత్వర న్యాయం అందించామని తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ పనిచేయడం తనకెంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని వివరించారు. న్యాయమూర్తులతోపాటు హైకోర్టు రిజిస్ట్రార్లు, ఇతర న్యాయాధికారులు, తన కార్యాలయ సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ రాజశేఖర్రెడ్డి, ఇతర న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్రెడ్డి, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి అనుపమా చక్రవర్తి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ధోని వీడ్కోలు మ్యాచ్ అక్కడే జరగాలి: సీఎం
న్యూఢిల్లీ : టీమీండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా పాల్గొనలేదు. దీంతో ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు అతని స్వస్థలం రాంచీలో ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు. జార్ఖండ్ ఆతిథ్యం ఇవ్వబోయే ఈ చివరి మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుందని ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ రాంచీలో నిర్వహించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. ‘ఇక 7వ నెంబర్ జెర్సీలో హెలికాప్టర్ షాట్లు క్రికెట్ స్టేడియంలో కనిపించవు. దేశానికి, జార్ఖండ్కు ఎన్నో గర్వించదగ్గ విజయాలను ఇచ్చిన ధోనికి గొప్పగా విడ్కోలు పలుకుదాం అంటూ’ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. (3 కోట్ల వ్యూస్కు చేరువలో ధోని వీడ్కోలు పాట) గతేడాది కాలంగా ధోని రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోనీ మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు సేవలు అందించిన ధోనీ.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించి మరపురాని విజయాలు అందించాడు. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. (‘నీతోపాటు ఉన్నందుకు ఎంతో ఆనందించా ధోని’ ) देश और झारखण्ड को गर्व और उत्साह के अनेक क्षण देने वाले माही ने आज अंतराष्ट्रीय क्रिकेट से सन्यास ले लिया है।हम सबके चहेते झारखण्ड का लाल माही को नीली जर्सी पहने नहीं देख पायेंगे।पर देशवासियों का दिल अभी भरा नहीं। मैं मानता हूँ हमारे माही का एक फ़ेयरवेल मैच राँची में हो जिसका 1/2 pic.twitter.com/XFt5zBSvG8 — Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) August 15, 2020 -
మిగ్–27కు వీడ్కోలు
జోథ్పూర్: దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్(ఎంఐజీ)–27 యుద్ధ విమానాలు ఇక విశ్రాంతి తీసుకోనున్నాయి. జోథ్పూర్ వైమానిక స్థావరంలో శుక్రవారం జరిగిన మిగ్ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోటియా పాల్గొన్నారు. ఈ విమానాలు పోరాటక్షేత్రంలో ముందు నిలిచాయని, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమూల్యమైన సేవలందించాయని తెలిపారు. ఇన్నాళ్లూ జోథ్పూర్ ఎయిర్ బేస్లో మిగ్–27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి. -
భావోద్వేగానికి గురైన గవర్నర్ నరసింహన్
-
నా పేరు నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ‘‘నా పేరు నరసింహన్. పేరుకు తగ్గట్టు పనిచేయాలి. లేకుంటే సార్థక నామధేయుడు అనరు. అందుకే అప్పుడప్పుడు నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది’’ అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చమత్కరించారు. గవర్నర్గా తొమ్మిదిన్నరేళ్లపాటు సేవలందించిన ఆయనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం ప్రగతి భవన్లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘‘కేసీఆర్ తెచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు, కేసీఆర్ కిట్స్ లాంటి పథకాల్లో మానవత్వం ఉంది. నీటిపారుదలశాఖ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ లాంటి పథకాల్లో కేసీఆర్ విజన్ కనిపించింది. తెలంగాణలో శాంతిభద్రతల పర్యవేక్షణ చాలా గొప్పగా ఉంది. ప్రతి స్కీం గురించి నాకు చెప్పేవారు. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వివరించేవారు. డబ్బుందా అని అడిగితే, తెలంగాణ రాష్ట్రానికి ఢోకా లేదని, ధనిక రాష్ట్రమని ధైర్యంగా ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు దేశవ్యాప్తంగా చర్చ అయ్యేవి. ముఖ్యమంత్రి స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి స్క్రీన్పై పథకాల గురించి వివరించిన వైనాన్ని నేను ప్రధానికి కూడా చెప్పాను. కేసీఆర్కు ప్రజల నాడి తెలుసు. వారి కష్టాలు తెలుసు. అందుకే మంచి పథకాలు తేగలిగారు. ఆయనతో కలసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నా. ఇద్దరం గంటల తరబడి చర్చలు చేసేవాళ్లం. మా మధ్య వాడీవేడి చర్చలు జరిగేవి. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది. నేను ఎక్కడున్నా సరే... తెలంగాణ ఫలానా రంగంలో నంబర్ వన్గా నిలిచింది, ఫలానా విషయంలో టాప్గా ఉంది అనే వార్తలు చదివి సంతోషిస్తా. తెలంగాణ మొదటి గవర్నర్గా నా పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. దీన్నెవరూ మార్చలేరు’’అని నరసింహన్ పేర్కొన్నారు. తమ్ముడిలా ఆదరించారు: కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్ నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓ పెద్దదిక్కులాగా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గవర్నర్ పదవీ విరమణ చేసి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి, స్ఫూర్తి నింపిన నరసింహన్తో తనకు గొప్ప జ్ఞాపకాలున్నాయన్నారు. ప్రసంగం మధ్యలో చాలాసార్లు కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. ‘‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ గవర్నర్గా వచ్చారు. ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం నాడు కొందరిలో ఉండేది. అదే సమయంలో నేనే ఆయన్ను కలిశాను. ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లుగా ఉద్యమం సజీవంగా ఉండటానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం ఉండటంతో నరసింహన్... ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తొలినాళ్లలోనే ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశా. ఆయనతో ఎంతో అనుబం ధం ఉంది. నన్ను సీఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వ పథకాల మంచిచెడులను చర్చించేవారు. బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారు. ప్రతి పనీ విజయవంతం కావాలని తపన పడేవారు. ప్రభుత్వం చేసే మంచి పనులను కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వివరించేవారు. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపారు’’అని సీఎం పేర్కొన్నారు. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా విందు భోజనం... వీడ్కోలు సభ అనంతరం గవర్నర్ దంపతుల గౌరవార్థం సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. గవర్నర్ గౌరవార్థం పూర్తి శాకాహార భోజనం, అదీ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా పెడుతున్నాం అని అంతకుముందు సభలోనే సీఎం ప్రకటించారు. విందు తర్వాత గవర్నర్ దంపతులను కారు దాకా వెళ్లి కేసీఆర్ దంప తులు సాగనంపారు. ఆ తర్వాత గవర్నర్ దంపతులకు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బేగం పేట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్ దంపతులను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తోడ్కొని వెళ్లారు. అంతకు ముందు నరసింహన్ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు. కల్వకుంట్ల... కలవకుంట గవర్నర్ చమత్కారం ‘‘చాలా మంది కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురించి మాట్లాడతారు. వారంతా కలవకుంట మాట్లాడతారు. నేను కలసి మాట్లాడుతున్నాను’’అని నరసింహన్ చమత్కరించారు. ‘‘పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్లో నాకు కనిపించాయి. నమస్కారం చెబితే పెద్దవాళ్లు చిన్నవాళ్లకు నమస్కారం పెట్టకూడదు అనేవారు. మా అమ్మ చనిపోయినప్పుడు కేసీఆర్ నా దగ్గరకు వచ్చి అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు. అస్థికలు కలపడానికి హెలికాప్టర్లో పంపారు. ఇక్కడకు వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తామని కేసీఆర్ మాటిచ్చారు. అన్న విధంగా మాట నిలబెట్టుకున్నారు. ’’అని గవర్నర్ చెప్పారు. యాదాద్రికి నరసింహన్ మళ్లీ రావాలి... ‘‘యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను తల్లిదండ్రులను కోల్పోయాను. పెద్దన్న లేడు. పెద్దల ఆశీర్వాదం తీసుకొని మంచి పనికి శ్రీకారం చుట్టాలని భావించాను. నాకు గవర్నర్ దంపతులే పెద్దదిక్కుగా కనిపించారు. సోదరభావంతో వారికి పాదాభివందనం చేసి పని ప్రారంభించాను. అది విజయవంతంగా కొనసాగుతున్నది. నరసింహన్ గారు యాదాద్రి పనులు పూర్తయ్యాక మళ్లీ రావాలి. పూజలో పాల్గొనాలి. నరసింహన్ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండి పోతాయి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నరసింహన్కు ఇచ్చినట్లే కొత్త గవర్నర్కూ అదే గౌరవం ఇస్తామని, రాజ్ భవన్ ప్రాశస్త్యాన్ని కాపాడుతామన్నారు. -
ఫలక్నామా ప్యాలెస్లో క్యాథరిన్ హడ్డాకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులెట్ జనరల్ క్యాథరిన్ హడ్డాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. నగరంలోని ఫలక్నామా ప్యాలెస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వీడ్కోలు సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా వందమందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందమైన ప్యాలెస్లో వీడ్కోలు పలుకుతున్నందుకు సంతోషంగా ఉందంటూ క్యాథరిన్ హడ్డా తన సంతోషాన్ని ట్విటర్లో పంచుకున్నారు. సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరయిన కేటీఆర్.. ఆమెకు చేనేత చీరను బహుకరించారు. రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఐటీ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. -
అమ్మాయిలను పార్టీకి పిలిచాడని..
ఇస్లామాబాద్ : విద్యార్థినులను పార్టీకి ఆహ్వానించాడనే కారణంతో ప్రొఫెసర్ను కత్తితో పొడిచి చంపాడో స్టూడెంట్. ఈ సంఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఖలీద్ హమీద్ అనే వ్యక్తి బహవాల్పూర్లోని ప్రభుత్వ సాదిఖ్ ఎగెర్టన్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కాలేజీలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి విద్యార్థినులను కూడా ఆహ్వానించాడు. అయితే ఆడపిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధం అంటూ ఓ విద్యార్థి కత్తితో సదరు ప్రొఫెసర్ మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనక ఎలాంటి మతతత్వ సంస్థల ప్రమేయం లేదని తెలిపారు పోలీసులు. అయితే విద్యార్థి గత జీవితం, మానసిక పరిస్థితి వంటి అంశాల గురించి వాకబు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్లోని ఎగెర్టన్ కాలేజీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కళాశాలలో 4 వేల మంది ఆడ పిల్లలు చదువుతుండగా.. అబ్బాయిలు కేవలం 2000 మంది మాత్రమే ఉండటం విశేషం. -
‘న్యాయ’ స్వతంత్రత అత్యున్నతం!
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రత అత్యున్నతంగా ఉందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం జడ్జీల మధ్య సహకారపూరిత వాతావరణం నెలకొందని చెప్పారు. మంగళవారం పదవీ విరమణ చేయబోతున్న ఆయన గౌరవార్థం సోమవారం కోర్టు ప్రాంగంణంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ప్రపంచంలోనే మన న్యాయ వ్యవస్థ అత్యంత పటిష్టమైనది, దృఢమైనదన్నారు. ‘ఒకరి అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ పలానా వైపునకు మొగ్గుచూపదు. నిష్పాక్షికతకు సూచికగా న్యాయ దేవత కళ్లకు గంతలు కడతాం. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా అన్ని కేసులను ఒకేలా చూస్తాం. ఎల్లప్పుడూ తీర్పు మానవీయ కోణంలో ఉండాలి. ఒక్కొక్కరి చరిత్ర ఒక్కోలా ఉంటుంది. వ్యక్తుల నేపథ్యాలు కాకుండా వారి కార్యకలాపాలు, ఆలోచనారీతుల ఆధారంగానే తీర్పులిచ్చాను’ అని అన్నారు. అంతకుముందు, కాబోయే సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ.. పౌర హక్కుల పరిరక్షణలో జస్టిస్ దీపక్ మిశ్రా ఎంతో సహకారం అందించారని ప్రశంసించారు. ఆధార్, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలపై ఇటీవల ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఉదహరించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణలో విఫలమైతే, ఒకరినొకరం చంపుకుంటూ, ద్వేషించుకూంటూ ఉంటామని వ్యాఖ్యానించారు. మనం ఏం తినాలి, ఏం ధరించాలి లాంటివి వ్యక్తిగత జీవితాల్లో ప్రముఖ విషయాలుగా మారాయని అన్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం బాధ్యతలు చేపడతారు. సీజేఐగా చివరిసారి సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం చివరిసారిగా విధులు నిర్వర్తించారు. తదుపరి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, మరో జడ్జి ఏఎం ఖన్విల్కర్తో కలసి సుమారు 25 నిమిషాల పాటు కోర్టు కార్యకలాపాలు నిర్వహించారు. సోమవారం అత్యవసర కేసుల విచారణ ఉండదని, అలాంటి కేసులేవైనా ఉంటే అక్టోబర్ 3న కొత్త సీజేఐ నేతృత్వంలో చేపడతామని ఆ ముగ్గురితో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. సీజేఐగా చివరి రోజు కావడంతో జస్టిస్ దీపక్ మిశ్రా కాస్త భావోద్వేగంతో కనిపించారు. జస్టిస్ మిశ్రాకు దీర్ఘాయుష్షు కాంక్షిస్తూ, సాధారణంగా పుట్టినరోజు నాడు పాడే 1950 నాటి హిందీ సినిమాలోని పాటను పాడటానికి ఓ లాయర్ ప్రయత్నించగా వద్దని సున్నితంగా వారించారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో రిటైర్మెంట్ తరువాతి ప్రణాళికలు ఏమిటని ఓ జర్నలిస్టు అడగ్గా..‘జోతిష్యం సైన్స్ కాకపోయినా ప్రజలు నమ్ముతున్నారు. భవిష్యత్తు గురించి చెప్పడానికి నేను జోతిష్యుడిని కాను’ అని జస్టిస్ దీపక్ మిశ్రా బదులిచ్చారు. కొన్ని కీలక కేసులు, తీర్పులు.. ► ఆధార్ చట్టబద్ధమేనని తీర్పు ► వివాహేత సంబంధాలు నేరం కాదని, ఐపీసీ సెక్షన్ 497 కొట్టివేత ► స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సెక్షన్ 377 కొట్టివేత ► శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలందరికీ అనుమతిస్తూ తీర్పు ► ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేర చరిత్రను ఈసీకి తెలపాలంటూ ఆదేశాలు ► అయోధ్య కేసు ► ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటా ► మూక హత్యల కట్టడికి ప్రభుత్వాలకు ఆదేశాలు ► నిర్భయ గ్యాంగ్రేప్లో కేసులో దోషుల మరణశిక్షకు సమర్థన ► బీసీసీఐలో సంస్కరణలు ► ఖాప్ పంచాయతీలపై నిషేధం ► ముంబై పేలుళ్ల కేసు దోషి యాకుబ్ మెమె న్ పిటిషన్ను అర్ధరాత్రి దాటిన తరువాత విచారించిన బెంచ్కు జస్టిస్ మిశ్రా సారథ్యం.. మెమెన్ మరణశిక్షకు సమర్థన. -
‘ఆమె నా రాజకీయ గురువు’
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుకు ఆమోదం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రేపటితో పదవీకాలం ముగియనుండటంతో ఆయనకు పార్లమెంట్ సెంట్రల్ హాల్గా ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. 1969 జూలైలో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టానని తెలిపారు. ఐదుసార్లు రాజ్యసభకు, రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. తాను పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు, అపర మేధావులు ఉన్నారని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. తన రాజకీయ గురువు ఇందిరా గాంధీ అని ప్రకటించారు. ఇందిరా, పీవీ నరసింహారావు, వాజపేయి నుంచి ఎంతో నేర్చుకున్నాని అన్నారు. పార్లమెంట్లో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం ఉందన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో సమయం వృధా అవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మంచి సహకారం అందిందని తెలిపారు. రాష్ట్రపతిగా తనకు ఎన్నో మధుర స్మృతులు మిగిల్చినందుకు పార్లమెంట్ సభ్యులకు ప్రణబ్ ధన్యవాదాలు తెలిపారు. -
ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఘనంగా సన్మానించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ప్రస్తుత ఎంపీల సంతకాలు, తన ప్రసంగంతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్కు సుమిత్రా మహాజన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అందరికీ ప్రణబ్ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఆయన నిండునూరేళ్లు ఆయురాగ్యోగాలతో ఉండాలని ఆకాంక్షించారు. వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినందుకు ప్రణబ్ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు. -
రేపటితో అంత్యపుష్కరాల ముగింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి అంత్యపుష్కరాలు గురువారంతో ముగియనున్నాయి. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్లో పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమం నిర్విహంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు పుష్కరఘాట్లో నిర్వహించే హారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఆయన తిలకిస్తారు.