Girl students
-
ఈ మార్పు మంచికేనా?!
విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ‘నో డిటెన్షన్’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థిని ఫెయిల్ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్’ విధానం పెట్టి ఊరుకోలేదు. అందులోని 29(2)(హెచ్) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ట్యూషన్ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్. పాలకులు దాన్ని గుర్తెరగాలి. -
కర్ణాటకలో విద్యార్థినులపై యాసిడ్ దాడి
మంగళూరు: ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి పక్కనే కూర్చున్న వేరే ఇద్దరు అమ్మాయిలపైనా యాసిడ్ పడి వారికీ ముఖంపై కాలిన గాయాలయ్యాయి. కర్ణాటకలో మంగళూరు సమీపంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకాలో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది. బాధిత అమ్మాయి ముఖంపై తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడబలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రీ–యూనివర్సిటీ కోర్సు పరీక్షల కోసం కారిడార్లో కూర్చుని సిద్ధమవుతున్న ముగ్గురు టీనేజీ అమ్మాయిల ముఖంపైకి ఒక యువకుడు యాసిడ్ చల్లాడు. ఆ యాసిడ్ ద్రావకం పక్కనే ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలపైనా పడింది. దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అతడిని కేరళ మణప్పురం జిల్లా నీలాంబూర్కు చెందిన 23 ఏళ్ల అబిన్ షిబిగా పోలీసులు గుర్తించారు. తన ప్రేమను తిరస్కరించినందుకే బాధిత విద్యారి్థనిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల ముందు యువకుడు నేరం అంగీకరించాడు. -
Andhra Pradesh: బాలికల ఓటు చదువుకే
అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, స్వేచ్ఛ, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, డిజిటల్ తరగతులు, బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ, కరిక్యులమ్లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలు, కార్యక్రమాలు రాష్ట్రంలోని బాలికల్లో చదువుకోవాలన్న ఆలోచనను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితంగా అమ్మాయిలందరూ బడిబాట పడుతున్నారు. పాఠశాలల స్థాయిలోనే ఆగిపోకుండా కళాశాలలో సైతం అడుగు పెడుతున్నారు. మంచి ఉద్యోగమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతి బాలిక కనీసం పదో తరగతి వరకు అయినా చదవాలన్న తపన, తాపత్రయంతో ప్రభుత్వం ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి పదో తరగతి అర్హత పెట్టింది. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలవడంతో తల్లిదండ్రులు సైతం బాలికల చదువుకు ఊకొడుతున్నారు. ఫలితంగా ఏడాదికేడాది పాఠశాలలు, కళాశాలల్లో వీరి చేరికలు పెరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి దశలోనూ అండగా నిలవడంతో విద్యా రంగంలో అమ్మాయిలు దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు చదువుల్లో వెనుకబడిన ఆడపిల్లలు నేడు అన్ని అడ్డంకులను అధిగమించి పోటాపోటీగా దూసుకుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బాలికల చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో యుక్త వయసు రాక ముందే ఆడ పిల్లల పెళ్లిళ్లపై దృష్టి సారించే తల్లిదండ్రులు.. నేడు ఆ ఆలోచనను వాయిదా వేసి, వారి చదువులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు స్కూళ్లు, కాలేజీల్లో ఆడపిల్లల చేరికలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ఏన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్), ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదికల్లోని గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. బాలికల చేరికల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మరింత అధికమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక విద్యాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపిస్తున్నారు. పాఠశాల స్థాయి అనంతరం.. ఇంటర్మీడియెట్ చదవులకు వీలుగా బాలికల కోసం ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఉన్నత కోర్సుల్లో చేరే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంటుతోపాటు వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. విద్యకు సంబంధించిన భారమంతా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఆడపిల్లల చేరికలు బాగా పెరిగాయి. ఏటా పెరుగుదల రాష్ట్రంలో 2020–21లో టెన్త్లో 3,19,193 మంది బాలికలు ఉండగా, 2021–22లో వారిలో 2,37,530 (75 శాతం) మంది ఇంటర్లో చేరారు. అంతకు ముందు ఏడాది.. అంటే 2019–20లో టెన్త్లో 3,20,227 మంది ఉండగా, అందులో 2,24,943 (70 శాతం) మంది 2020–21లో ఇంటర్లో చేరినట్లు యూడైస్ గణాంకాలు వివరిస్తున్నాయి. ఏటేటా బాలికల చేరికల శాతం పెరుగుతోందనేందుకు ఈ గణాంకాలే తార్కాణం. ఉత్తీర్ణతలోనూ బాలికలే పైచేయి సాధిస్తున్నారు. 2022 ఇంటర్ ఫలితాల్లో 68 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా బాలురు 32 శాతమే ఉత్తీర్ణులయ్యారు. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రంలో బాలికల చేరికలు మరింత మెరుగ్గా ఉన్నాయి. జాతీయ స్థాయిలో బాలికల జీఈఆర్ పెరుగుదల 2.28 శాతం మాత్రమే ఉండగా రాష్ట్రంలో 11.03 శాతానికి పెరిగిందని ఐష్ గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా తగ్గిన డ్రాపవుట్లు గతంలో దేశ వ్యాప్తంగా చాలా కాలంగా 7 లేదా 8వ తరగతి తర్వాత ఆడపిల్లల డ్రాపవుట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఇటీవలి కాలంలో క్రమేణా ఆ పరిస్థితి మారుతోంది. 14–16 వయసు బాలికలు బడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయే వారి శాతం 2018 నాటికి 13.5 శాతం వరకు ఉన్నట్లు అసర్ గత నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ శాతం 7.9 శాతానికి తగ్గినట్లు 2022 నివేదిక పేర్కొంది. 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికల్లో బడులకు వెళ్లని వారి శాతం 4.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఇంటర్లో పెరిగిన చేరికలు గతంలో టెన్త్ తర్వాత బాలికల చదువు ముందుకు సాగడానికి చాలా సమస్యలు ఉండేవి. అయితే కాలేజీల అందుబాటు, వివిధ వనరుల కల్పనతో భద్రతాపరమైన చర్యలు పెరగడం, తల్లిదండ్రులు కూడా పిల్లలను కాలేజీల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడంతో హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియెట్ స్థాయిల్లోనూ బాలికల చేరికలు బాగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విడుదల చేసే దేశ వ్యాప్త గణాంకాల ప్రకారం 2021–22లో పదో తరగతిలో 89,66,648 మంది బాలికలు ఉండగా.. ఇందులో ఇంటర్లో 73,36,609 (82 శాతం) మంది చేరారు. 2020–21 గణాంకాల ప్రకారం టెన్త్లో 91,64,940 మంది ఉండగా, వారిలో ఇంటర్లో 65,80,132 (72 శాతం) మంది చేరారు. అంటే పది శాతం మేర బాలికల చేరికలు పెరిగినట్లు యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ – యూడైస్+ (యూడీఐఎస్+) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉన్నత విద్యలోనూ బాలికల పెరుగుదల ► ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువుల్లోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఐష్ పేర్కొంది. 2020–21 నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్నత చదువుల్లో చేరికలు 2019–20లో 3.85 కోట్లు ఉండగా, 2020–21లో అది 4.13 కోట్లకు చేరినట్లు తెలిపింది. అంటే 28.80 లక్షల మంది పెరిగారు. ► 2018–19లో 2.7 శాతం ఉండగా, 2019–20లో 3 శాతం మేర, 2020–21లో 7.4 శాతం మేర పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. వీరిలో బాలికల చేరికలు 2019–20లో 1.89 కోట్లు కాగా, 2020–21లో 1.96 కోట్లుగా ఉంది. 2021–22, 2022–23 అధికారిక గణాంకాలు ఖరారైతే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ► ఏపీ విషయానికి వస్తే యూడైస్ గణాంకాల ప్రకారం 2018–19లో టెన్త్ బాలికల్లో 70 శాతం మంది ఇంటర్ ఫస్టియర్లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో అమ్మ ఒడి తదితర కార్యక్రమాలతో 78 శాతం మంది ఇంటర్లో చేరారు. ► 2020–21లో కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో చేరికలు 70 శాతంగా ఉన్నా, మళ్లీ 2021–22 నాటికి బాలికల చేరికల శాతం 75 శాతానికి చేరుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇంటర్లో బాలికల చేరికలు 2021–22లో ఏపీలో 75 శాతంగా ఉండగా బీహార్లో 56 శాతం, కర్ణాటకలో 73 శాతం, తెలంగాణలో 74 శాతంగా ఉన్నాయి. -
బడి నుంచి మృత్యు ఒడికి...
ప్యాపిలి(నంద్యాల): మరో ఐదు నిమిషాల్లో బడి నుంచి తమ ఇళ్లకు చేరుకోవాల్సిన ఇద్దరు పిల్లలు... డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా కొట్టడంతో మృత్యుఒడికి చేరుకున్నారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితులు ఒక్కసారిగా రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండటం సహచర విద్యార్థులను కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచెర్ల వద్ద శనివారం జరిగింది. రాచర్ల ఉన్నత పాఠశాలలో నేరేడుచెర్ల గ్రామానికి చెందిన శివమ్మ, రంగన్న దంపతుల కుమార్తె రజని(15) పదో తరగతి, ఐరా, మదార్ దంపతుల కుమార్తె షాహిదాబి(13) ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరితోపాటు అదే గ్రామానికి చెందిన మరో 18 మంది విద్యార్థులు కూడా రాచర్ల ఉన్నత పాఠశాలలోనే విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ప్రతి రోజు ఉదయం ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తారు. సాయంత్రం ఆటోలో ఇంటికి చేరుకుంటారు. యథావిధిగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఆటోలో నేరేడుచెర్లకు బయలుదేరారు. అతి వేగంగా వెళుతున్న ఆటో గ్రామ శివారులో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటో డోర్ వైపు కూర్చున్న రజని, షాహిదాబి ఎగిరి రోడ్డుపై పడగా, వారి మీద ఆటో పడటంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు. మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పిల్లల రోదనలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. రాచర్ల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సొంత ఆటోలో వస్తూనే.. ప్రమాదంలో మృతిచెందిన షాహిదాబి తండ్రి మదార్కు టాటా మ్యాజిక్ ఆటో ఉంది. ప్రతి రోజు సాయంత్రం మదార్ రాచర్ల ఉన్నత పాఠశాలకు వెళ్లి తన కుమార్తెతోపాటు మిగిలిన విద్యార్థినులను ఆటోలో ఎక్కించుకుని నేరేడుచెర్లకు తీసుకువచ్చేవాడు. అయితే, మదార్కు శనివారం వ్యక్తిగత పని ఉండటంతో వెళ్లలేదు. తమ గ్రామానికే చెందిన శివ అనే డ్రైవర్ను పంపాడు. అతను వేగంగా నడపడం వల్లే ఆటో బోల్తా పడి షాహిదాబి, రజని మృతిచెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
Vizag Students: ఆ నలుగురు తిరిగొచ్చారు..
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ‘మా కోసం వెతక్కండి.. మేము మా కాళ్ల మీద బతకాలని దూరంగా వెళ్లిపోతున్నాం.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.. మా బతుకు కోసం వెళ్తున్నాం.. అలా అని అబ్బాయిలతో వెళ్తున్నాం అని ఎక్కువగా అనేసుకోకండి. కేవలం మేము పైకి ఎదగడానికి మాత్రమే వెళ్తున్నాం. మమ్మల్ని వెతక్కండి. మేము ఎక్కడున్నా సరే మీ గురించే ఆలోచిస్తాం. మేము మంచి పొజిషన్కు వచ్చాక మేమే మీ దగ్గరకు వస్తాం..’అంటూ ఓ లేఖ రాసి నలుగురు పదో తరగతి విద్యార్థినులు బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఆ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి.. నగరమంతా గాలించారు. చివరకు గాజువాకలో నలుగురు బాలికలను గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాత నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలుగురు బాలికలు బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు. చదవండి: (Vizag: మా కోసం వెతకొద్దు.. నలుగురు టెన్త్ క్లాస్ అమ్మాయిలు మిస్సింగ్..) యూనిఫాం మార్చుకుని, సివిల్ డ్రెస్లో ట్యూషన్కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నలుగురూ కలిసి వెళ్లిపోయారు. ట్యూషన్కు వెళ్లిన పిల్లలు రాత్రి 10 గంటలు దాటినా ఇళ్లకు చేరుకోకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ దృష్టికి వెళ్లింది. వెంటనే సీపీ స్పందించి ఏడీసీపీ శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా పోలీసులను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వేళ వెళ్లిన నలుగురు విద్యార్థినులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీని ఆధారంగా వివరాలు సేకరించారు. మరో వైపు ఆ నలుగురి బాలికల ఫొటోలను వలంటీర్ల గ్రూపులో పెట్టారు. బాలికలు నలుగురూ గురువారం మధ్యాహ్నం గాజువాకలో ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లారు. వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు అమ్మి, వచ్చిన డబ్బులతో ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకున్నారు. వివిధ వాట్సప్ గ్రూపుల్లో వారి ఫొటోలను గమనించిన ఆ దుకాణ యజమాని.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి విద్యార్థినులకు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
Vizag: మా కోసం వెతకొద్దు.. నలుగురు టెన్త్ క్లాస్ అమ్మాయిలు మిస్సింగ్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో నలుగురు పదో తరగతి విద్యార్థినులు అదృశమయ్యారు. వన్టౌన్ సమీపంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ స్కూల్లో వీరంతా చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్కూల్ పూర్తయిన తర్వాత ట్యూషన్కి వెళ్తాం అని చెప్పి.. తిరిగి కనిపించలేదు. కుటుంబ సభ్యులు రాత్రి అంతా గాలించారు. చివరికి గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అదృశ్యమైన నలుగురు విద్యార్థులు తమ గురించి వెతకవద్దని లేఖను కూడా తల్లిదండ్రులను ఉద్దేశించి రాశారు. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో ఉంటారనే వాదన వినిపిస్తుంది. విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీ, రేణుక, హన్సిక, యమున అనే ఈ నలుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ -
లైంగిక వేధింపుల నివారణకు వినూత్న కార్యక్రమం
కైకలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పాఠశాల స్థాయి నుంచే బాలికల రక్షణ, లైంగిక వేధింపుల నిరోధానికి వినూత్న కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్తో మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు జువెనైల్ జస్టిస్ కమిటీ– హైకోర్టు, రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గోడపత్రికల ద్వారా లైంగిక వేధింపుల నివారణపై 18 సంవత్సరాలలోపు బాలికలకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికలు తాము ఎదుర్కొన్న ఇబ్బందిని స్కూల్లోని ఫిర్యాదుల బాక్సు ద్వారా తెలియజేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఎవరికి చెప్పాలో తెలియక బాలికలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్పై ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి చేపడుతోంది. 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పాఠశాల భద్రతా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ప్రతి పాఠశాలలోనూ పర్యవేక్షణ చేయడానికి భద్రతా కమిటీలను రూపొందించింది. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు బాలికలు తాము ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలను నిర్భయంగా కాగితంపై రాసి వేసేలా ఫిర్యాదుల పెట్టెను ప్రతీ పాఠశాలలోనూ ఏర్పాటు చేశారు. పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాక్సును అమర్చుతున్నారు. ఈ బాక్సుకు మూడు తాళం చేవులు ఉంటాయి. ప్రతీ 15 రోజులకు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను ఎంఈఓ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారు వద్ద తెరిచి పరిష్కారాలను చూపుతారు. పెద్ద సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తారు. హెచ్ఎంలకు అవగాహన బాలికలపై లైంగిక వేధిపుల నిరోధానికి ప్రభుత్వం పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై మండల స్థాయిలో హెచ్ఎంలకు అవగాహన కలిగించారు. బాలికల శరీర భాగాలను తప్పుడు ఉద్దేశంతో ఎవరైన తాకితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. చైల్డ్ లైన్ – 1098, ఏపీ పోలీసు – 100, దిశ – 112, ఉమెన్ హెల్ప్ లైన్ – 181, ఎమర్జన్సీ – 108, మెడికల్ హెల్ప్ లైన్ – 104కు ఫిర్యాదు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బాలికలలో తల్లిదండ్రులు గమనించాల్సినవి ప్రవర్తనలో ఆకస్మిక మార్పు ఇతరుల నుంచి దూరంగా ఉండటం శరీర భాగాలలో అనుమానస్పద మార్పులు భయపడుతూ ఉండటం ఆహారం, నిద్రలో మార్పులు బాలికలకు బోధించాల్సినవి మీ హక్కులకు ఉల్లంఘన జరిగితే గట్టిగా మాట్లాడాలి ఎవరైన హద్దు మీరి ప్రవర్తిస్తే చురుగ్గా ప్రతిఘటించాలి లైంగిక వేధింపును ఎదుర్కొన్న తర్వాత అది వారి తప్పు కాదని గుర్తించేలా, అపరాధ భయాన్ని విడనాడేలా చేయాలి లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులకు చెప్పేలా ప్రోత్సహించాలి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. దిశ యాప్ ద్వారా ఆపదలో మహిళలకు తక్షణ సాయం అందిస్తున్నారు. పాఠశాల స్థాయిలో లైంగిక వేధింపులకు గురైన బాలికలు ధైర్యంగా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాలి. చేతులతో ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వం అందిస్తున్న టోల్ఫ్రీ నెంబర్లుకు ఫోన్ చేయండి - కెఎల్ఎస్.గాయత్రీ, మహిళా ఎస్సై, కైకలూరు ప్రతి పాఠశాలలోనూ ఫిర్యాదుల పెట్టె ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశాం. బాలికలు భయపడకుండా ఫిర్యాదులు వేసేలా నిర్మానుష్య ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పాం. ప్రతీ ఫిర్యాదును తహసీల్దారు సమక్షంలో విచారణ చేసి తక్షణ న్యాయం చేయనున్నాం. ఇటీవల హెచ్ఎంలకు వీటి నిర్వాహణపై శిక్షణ అందించాం. – డి.రామారావు, మండల విద్యాశాఖాధికారి, కైకలూరు -
స్మార్ట్ సృజన
ఆ చిట్టి బుర్రలు సృజనకు స్మార్ట్గా పదునుపెట్టాయి. అద్భుత ఆవిష్కరణలకు రూపమిచ్చాయి. అందరిచేత ఔరా అనిపించాయి. నిపుణులనూ అబ్బురపరిచి జాతీయస్థాయిలో సత్తాచాటాయి. గుంటూరు జిల్లా కీర్తి పతాకను రెపరెపలాడించాయి. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలో జిల్లా విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వినూత్న ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకున్నారు. గత నెల 31, ఈనెల ఒకటో తేదీన విజయవాడలోని లయోలా కళాశాలలో ఇన్స్పైర్ మనక్ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఆన్లైన్ మూల్యాంకనంలో భాగంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 331 మంది విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు. వీటికి ముగ్దులైన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు జాతీయస్థాయికి 34 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీటిలో గుంటూరు జిల్లా నుంచి మూడు నమూనాలు ఉన్నాయి. ఎంపికైన మూడు ప్రాజెక్టులూ ఒకే పాఠశాలకు చెందిన విద్యార్ధినులు రూపొందించినవి కావడం విశేషం. మంగళగిరిలోని సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్కు చెందిన జయశ్రీ, తేజశ్రీ, వర్గీస్ రూపొందించిన మూడు ప్రాజెక్టులు న్యాయ నిర్ణేతలను అమితంగా ఆకట్టుకున్నాయి. గైడ్ టీచర్ బండారు టైటస్ పర్యవేక్షణలో వీరు ప్రాజెక్టులను రూపొందించారు. వీరు త్వరలో జాతీయస్థాయిలో జరిగే ప్రదర్శనకు హాజరు కానున్నారు. – గుంటూరు ఎడ్యుకేషన్ ప్రతిభే ‘బ్యాగ్’బోన్ ప్రాజెక్టు పేరు: స్మార్ట్ స్కూల్బ్యాగ్ విద్యార్థిని పేరు: బిట్రా జయశ్రీ, 8వ తరగతి స్మార్ట్ స్కూల్ బ్యాగ్ను అత్యద్భుతంగా రూపొందించి ఔరా అనిపించింది. బిట్రా జయశ్రీ. ఈ బ్యాగ్ ద్వారా ఎంత బరువు పుస్తకాలను మోస్తున్నదీ తెలుసుకోవచ్చు. ఎక్కువ పుస్తకాలను మోయడం కష్టమనిపిస్తే దీనిని ట్రాలీగా మార్చుకోవచ్చు. బ్యాగ్లోనే మాస్క్, శానిటైజర్ ఉంచుకోవచ్చు. వర్షం వస్తే ఆటోమేటిక్గా గొడుగు తెరుచుకునేలా సెన్సార్ల అమరిక ఉంది. దీనివల్ల విద్యార్థి పొరపాటుగా తప్పిపోయినా, దుండగులు అపహరించుకుని వెళ్లినా జీపీఎస్ ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది. బ్యాగులో ఉన్న పుస్తకాలను దొంగిలించే యత్నం చేసినా వెంటనే పసిగట్టే వీలుంది. ఔరా సౌర ఊయల ప్రాజెక్టు పేరు: సోలార్ స్మార్ట్ ఊయల విద్యార్థిని పేరు: బేగ్ వర్గీస్, 8వ తరగతి చంటిపిల్లల కోసం చక్కటి ఊయలను తీర్చిదిద్దింది బేగ్ వర్గీస్. ఇది సౌర శక్తితో పనిచేస్తుంది. ఊయలకు మోటర్ను అమర్చడం ద్వారా సోలార్ మాడ్యూల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్శక్తి ద్వారా ఇది ఊగుతుంటుంది. ఊయలకు ఫ్యాన్నూ అమర్చుకోవచ్చు. పిల్లలను ఆస్పత్రుల్లో ఉంచినప్పుడు సెలైన్ అయిపోయినా, ఎవరైనా అపరిచిత వ్యక్తులు పిల్లలను ఎత్తుకువెళ్లే యత్నం చేసినా సైరన్ మోగుతుంది. భళా సైకిల్ ప్రాజెక్టు పేరు: స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్ విద్యార్థిని పేరు: మాచర్ల తేజశ్రీ, 9వ తరగతి సౌరశక్తితో పని చేసే స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్ను ఆవిష్కరించి భళా అనిపించింది. మాచర్ల తేజశ్రీ. దీనిని పాఠశాలకు వెళ్లేందుకు, ఇతర పనులకు ఉపయోగించవచ్చు. ఫోల్డ్ చేసి ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యవసాయ పనుల్లో భాగంగా పంటకు నీరు పెట్టడం, విత్తనాలు నాటేందుకు ఉపయోగించొచ్చు. రైతులు, మహిళలు, వికలాంగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63 -
హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. ఒకరి ఆచూకీ లభ్యం
సాక్షి, రంగారెడ్డి: ఐదు రోజుల క్రితం మంచాల కేజీబీవీ హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికల్లో ఒకరి ఆచూకీ లభ్యమైందని మంచాల ఎస్సై రామన్గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న సమ్రీన్(14), 8వ తరగతి చదువుతున్న నుస్రాత్(13) పారిపోయారు. ఇందులో నుస్రాత్ను మంగళవారం శంషాబాద్లోని వారి బంధువుల ఇంట్లో గుర్తించినట్లు వెల్లడించారు. సమ్రీన్ ఆచూకీ లభించలేదని నల్గొండలోని వారి బంధువులకు ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం లభించిందన్నారు. చదవండి: ఫోన్ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్రూంలోకి వెళ్లి.. -
174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం
పెద్దవూర: బాలికలు బారులు తీరి కనిపిస్తున్న ఈ ఫొటో మూత్రశాల వద్దది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి ఇది. ఈ పాఠశాలలో మొత్తం 398 మంది విద్యార్థులున్నారు. బాలికల సంఖ్య 174 కాగా, మరో ఆరుగురు బోధన సిబ్బంది ఉన్నారు. ఇంతమందికి పాఠశాలలో ఉన్న మూత్రశాలలు మాత్రం రెండే. అందులో ఒకటి మరమ్మతులకు గురికాగా, వినియోగంలో ఉన్నది ఒకటి మాత్రమే. దీంతో విరామ సమయంలో ఇలా బారులు తీరాల్సి వస్తోంది. అరగంట ముందు నుంచే బాలికలను తరగతుల వారీగా విరామానికి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి: టాయిలెట్స్ ఎవరు కడగాలి? -
‘స్వేచ్ఛ’గా చదువుదాం
సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్ పంపిణీ చేయనున్నారు. నెలకు పది చొప్పున వీటిని అందచేస్తారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. అపోహలు తొలగిస్తూ.. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015–16) ప్రకారం రాష్ట్రంలో శానిటరీ న్యాప్కిన్స్ వినియోగిస్తున్న 15 – 24 వయసు యువతుల శాతం 56 కాగా 2019 – 20 సర్వే నాటికి ఇది 69 శాతానికి పెరిగింది. వాటర్ సప్లయి, శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశంలో 23 శాతం మంది బాలికలు చదువులు మధ్యలో నిలిపివేయటానికి ప్రధాన కారణం– శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో లేకపోవడం, విద్యాసంస్థల్లో కనీస వసతులు కరువవడం, టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ లేకపోవడమేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. చదవండి: సీఎం జగన్కు ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి -
ఇక్కడ ఆడుతూ.. పాడుతూ..పాఠాలు నేర్పుతారు
విజయనగరం అర్బన్: అనాథ, నిరుపేద బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో వినూత్న బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒత్తిడిలేని విద్యను అందించేందుకు వీలుగా ఆటపాటలతో, విజ్ఞానదాయక అంశాలపై దృష్టిసారించారు. ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులకు రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఇటీవలే వారి డైట్ చార్జీలను కూడా పెంచింది. చదువుల ఒత్తిడి లేకుండా విద్యార్థినులకు యోగాతో పాటు ఆటపాటలతో అభ్యసనం సాగించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థినులకు ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతోంది. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా... జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. అర్హులైన బోధనా సిబ్బందిని నియమించి ఆయా సబ్జెక్టుల్లో బోధన అందిస్తోంది. విద్యార్థినులకు యోగాతోపాటు వారికి ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో, ఇతర కళాంశాల్లో రాణించేలా సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. దీనివల్ల ఒకప్పుడు 80 శాతం దాటని ఉత్తీర్ణత మూడేళ్లుగా పెరుగుతూ రావడం విశేషం. పదోతరగతిలో 2017–18 లో 96.7 శాతం, 2018–19లో 97.56 శాతం, గత ఏడాది శతశాతం ఫలితాలు సాధించడం గమనార్హం. దశలవారీగా విస్తరణ జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. అన్ని వర్గాలకు చెందిన నిరుపేద, అనాథ బాలికలు 8,206 మంది అందులో విద్యాబోధన పొందుతున్నారు. 6 నుంచి 10 వరకు తరగతుల నిర్వహణతోపాటు గతేడాది నుంచి ఇంటర్ తరగతులు కూడా ప్రారంభించారు. దీనికి అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టించింది. జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు లేకపోవడంతో అక్కడి బాలికల కోసం కేజీబీవీల్లో వసతి గృహాలను ప్రారంభించారు. మోడల్ స్కూళ్లు, ఇతర స్కూళ్లలో చదివే విద్యార్థినులకు అక్కడే అవాసం కల్పిస్తున్నారు. నాణ్యమైన పదార్థాలతో రోజుకో మెనూ కేజీబీవీ విద్యార్థినులకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. కరోనా అనంతరం పునఃప్రారంభమైనా ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయిస్తూ వాటి వ్యాప్తిని నిరోధించింది. వసతి గృహాల్లోని భోజన సౌకర్యం మెరుగుపర్చి, డైట్ చార్జీలను రూ.1,400కు పెంచింది. మోనూలో కూడా పలు మార్పులు చేసింది. రోజుకో రకమైన పదార్థాలతో సరికొత్త మెనూ రూపొందించి ఆ మేరకు అన్ని కేజీబీవీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం లేచినవెంటనే ప్రీ బ్రేక్ ఫాస్ట్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, డిన్నర్ తరువాత పండ్లు అందిస్తున్నారు. మాంసాహారులకు చికెన్, శాకాహారులకు కాయగూరలు అందిస్తున్నారు. పాలు, రాగిజావ, రాగి సంగటి, బూస్ట్, చిక్కీలు, ఊతప్పం, ఇడ్లీలు, పూరీలు, ఆలూ బఠానీ కుర్మా, చపాతీ, కోడుగుడ్లు, అన్నం, రోజకోరకమైన కూరలు ఇలా వివిధ రకాల వంటకాలతో విద్యార్థినులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికలు నిరుపేద, అనాథ బాలికల విద్యాబోధన కోసం నిర్వహిస్తున్న కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒత్తిడి లేని బోధన, అభ్యసనాలను అమలు చేస్తున్నాం. ఈ నేపధ్యంలోనే టెన్త్ ఫలితాలు ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలోని 33 కేజీబీవీల్లో 8,206 మంది బాలికలకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నాం. – జె.విజయలక్ష్మి, ఏపీసీ, ఎస్ఎస్ఏ ( చదవండి: క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్ ) -
కామారెడ్డి: అందాలు చూపించాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. సొంత బిడ్డలుగా చూసుకోవాల్సిన విద్యార్థినిల పట్ల పైశాచికింగా ప్రవర్తించాడు. అమ్మాయిలకు వీడియో కాల్ చేసి అందాలు చూపించాలంటూ వేధించాడు. లాక్డౌన్ నుంచి సాగుతోన్న ఈ అరాచకం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చింది. దాంతో సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు. వివరాలు.. నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సదరు ప్రధానోపాధ్యాయుడు రాముకి టీసీ ఇచ్చాడు. మనస్తాపానికి గురైన రాము నిన్న తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు చెప్పాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా చేసుకుని ప్రిన్సిపాల్ విద్యార్థినిలను వేధించేవాడు. ఆన్లైన్ క్లాస్ల కోసం విద్యార్థినిల ఫొన్ నంబర్లను సేకరించాడు. ఆ తర్వాత అమ్మాయిలకు వీడియో కాల్స్ చేస్తూ అందాలు చూపించాలని వేధించేవాడు. అంతేకాకుండా డాన్స్ క్లాస్ల పేరుతో కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. విద్యార్థినిలకు ఒక్కొక్కరికి విడిగా డాన్స్ నేర్పుతాను అంటూ గదిలోకి తీసుకు వెళ్లి వారిని వేధించాడని తెలిసింది. ప్రిన్సిపాల్ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాల బయట కూర్చొని నిరసన తెలిపారు. సదరు ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్కు ఉరిశిక్ష -
విద్యార్థినిపై అధ్యాపకుల అనుచిత ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: ఈవెంట్ పేరిట ఇంటికి పిలిపించుకొని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, హెచ్వోడీ ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంనగర్లోని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఓల్డ్ ఆల్వాల్కు చెందిన ఓ విద్యార్థిని ఫైనలియర్ చదువుతోంది. జనవరి 24న ఈవెంట్ ఉందని చెప్పడంతో ఆమె తన సోదరుడిని తీసుకొని మాదాపూర్ చందానాయక్ తండాలోని వైస్ ప్రిన్సిపాల్ కల్యాణ్ వర్మ ఇంటికి వచ్చింది. సోదరుడు బయటే ఉండగా విద్యార్థిని ఇంట్లోకి వెళ్లింది. కల్యాణ్ లోపలికి పిలిచి ఆమెపై చేయివేసి అనుచితంగా ప్రవర్తించాడు. తప్పించుకుని బయటకు వెళ్తుండగా హెచ్వోడీ రవీందర్ మెయిన్డోర్ను మూసేసి విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇద్దరినీ ప్రతిఘటించి తలుపులు తీసుకొని బయటకు పరుగుతీసింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా విద్యార్థిని కుటుంబీకులతో నిందితులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 9న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుల కోసం గాలిస్తున్నామని మాదాపూర్ సీఐ చెప్పారు. విద్యార్థి సంఘాల ఆందోళన కల్యాణ్ శర్మ, రవీందర్లపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి నేతలు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశాల డైరెక్టర్ వాణి ఒక మహిళ అయ్యుండి బాధితురాలి పక్షాన మాట్లాడకుండా బేరసారాలకు దిగారని ఆరోపించారు. ఆమెను ఘెరావ్ చేశారు. -
రన్నింగ్ బస్సులోనుంచి దూకిన యువతులు
లక్నో : యువకుల ఎగతాళి మాటలతో భయాందోళనకు గురైన ఇద్దరు కాలేజీ విద్యార్ధినులు రన్నింగ్లో ఉన్న బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బులందర్షహర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రన్హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధినులు సొంత గ్రామానికి వెళ్లటానికి గురువారం పది గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కారు. బస్సు ముందు సీట్లలో యువకులు కూర్చుని ఉండటంతో వారి వెనకాల సీట్లలో యువతులు కూర్చున్నారు. తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్ దగ్గరకు వెళ్లి.. ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు. ( ఆమె అలా చేస్తే అత్యాచారం తప్పేది!) దానికి తోడు ముందు సీట్లలో కూర్చుని ఉన్న యువకులు ‘‘ఈ రోజు బస్సు మీ ఊర్లో ఆగదు. ఇక చూడు! భలే సరదా ఉంటుంది’’ అనటం ప్రారంభించారు. దీంతో భయాందోళనకు గురైన యువతులు మరోసారి డ్రైవర్ను ప్రాథేయపడుతున్నట్లు అడిగారు. అతడు ఒప్పుకోలేదు. ఆ యువకులు కేకలు వేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు విద్యార్ధినులు ఒకరి తర్వాత ఒకరు బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. బాధిత యువతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదైంది. అయితే డ్రైవర్ సదరు యువతుల కుటుంబాలతో రాజీ పడటంతో గొడవ సద్దుమణిగింది. ( 'దొంగ' పనిమనిషి అరెస్ట్ ) -
ఫస్ట్ క్లాస్లో పాసైతే స్కూటీ.. ప్రతీ రోజు రూ. 100
గువహటి : అస్సాం ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కూల్లో చదివే విద్యార్థినులకు ఆర్థిక సహాయం చేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి విద్యార్థినికి ప్రతీ రోజు స్కూలుకు వెళితే రోజుకు 100 రూపాయల చొప్పున ఇవ్వనుంది. ఆదివారం విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, ఆపై చదువులు చదివే విద్యార్థినులు పుస్తకాలు కొనుక్కోవటానికి గానూ మూడు వేల రూపాయలు ఇవ్వనున్నామని, జనవరి చివరల్లో ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. (చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం) గత సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నప్పటికి కరోనా వైరస్ కారణంగా చేయలేకపోయామని అన్నారు. అంతేకాకుండా స్కూళ్లతో పాటు కాలేజీలలో చదివే విద్యార్థినులకు కూడా నగదు సహాయం చేస్తామని చెప్పారు. 2019 సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాసైన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం 144.30 కోట్లు ఖర్చు చేస్తోందని, 22,245 మంది విద్యార్థినులు ఫస్ట్క్లాస్లో పాసయ్యారని వెల్లడించారు. -
తండ్రి ఇబ్బందులను అధిగమించే ఆలోచన
సాక్షి, నల్లగొండ : ఆ విద్యార్థిని తన తండ్రి పడుతున్న ఇబ్బంది తొలగించేందుకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్చైర్ ఆలోచన చేసింది. ఈ ఆలోచనను రాష్ట్రస్థాయికి పంపగా.. నచ్చడంతో దానికి సంబంధించి ప్రాజెక్టు తయారు చేసేందుకు ఇంక్విలాబ్ ఫౌండేషన్.. తమ ప్రతినిధులు అశోక్, షమీర్ను నల్లగొండకు పంపింది. వారి సూచనల మేరకు జిల్లా సైన్స్ అధికారి, గైడ్ టీచర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టును తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్కు ఎంపికైంది. రాష్ట్రంనుంచి మొత్తం 25 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో నల్లగొండ బాలికల పాఠశాల విద్యార్థిని తయారు చేసిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్చైర్ ప్రాజెక్టు ఒకటి. ఆ ప్రాజెక్టు ఖర్చు ఇంక్విలాబ్ ఫౌండేషనే భరించనుంది. ఈ ప్రాజెక్టును 19వ తేదీన వీడియో క్లిప్ ద్వారా ఆన్లైన్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లానుంచి 370 ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో విద్యార్థుల్లో కలిగే ఆలోచనల మేరకు ప్రాజెక్టుల తయారీకి ఏటా ప్రతిపాదనలు కోరుతోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి విద్యార్థులు వారి ప్రాంతంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఆలోచనను మాత్రమే స్వీకరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్తగా వచ్చే ఆలోచనలు పంపించాలని కోరగా నల్లగొండ నుంచి 280 పాఠశాల నుంచి 370 ఆలోచనలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపించారు. తండ్రి పడుతున్న సమస్యతో వచ్చిన ఆలోచన.. నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బషీరా తన తండ్రి పక్షవాతం కారణంగా కాలు చేయి పని చేయని పరిస్థితి. దానివల్ల తండ్రి ఇంట్లో ఏమీ తన సొంతంగా చేసుకోలేకపోయేవాడు. దీని పరిష్కారానికి ఆ బాలికకు ఓ ఆలోచన వచ్చింది. హైడ్రాలిక్ లిఫ్టింగ్ చైర్ వీల్ చైర్తో బటన్ నొక్కితే చైర్ ఎత్తులోకి లేవడం పైన ఉన్న వస్తువులను అందుకోవడం, వీల్చైర్తో ఇంట్లో సొంతంగా తిరగ గలగడం, తన పనులు తానే చేసుకోగలుగుతాడని ఆ బాలిక భావించి తన ఆలోచనను పాఠశాలలోని గైడ్ టీచర్ పూర్ణిమకు చెప్పింది. ఆమె వెంటనే ముగ్గురిని టీమ్గా ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందో తయారు చేసి ఆ ఆలోచన వీడియో రూపంలో రాష్ట్రస్థాయికి పంపారు. అయితే రాష్ట్రంలో 7,093 ఐడియాలు వివిధ సమస్యలపై వచ్చాయి. రౌండ్ల వారీగా ఎంపిక చేయగా.. చివరకు 25 ప్రాజెక్టులను మూడో రౌండ్లో ఎంపిక చేశారు. ఈ 25లో నల్లగొండ విద్యార్థిని ప్రాజెక్టు ఉండడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్లో ఈ ప్రాజెక్టును ప్రదర్శిస్తారు. 25 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులను గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేయనున్నారు. హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్చైర్ నమూనా రాష్ట్రస్థాయికి ఎంపిక సంతోషకరం నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినికి వచ్చిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్ చైర్ ఆలోచన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రస్థాయికి 7 వేల పైచిలకు ప్రాజెక్టులు పంపితే అందులో 25 ఎంపిక చేస్తే అందులో జిల్లా ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థిని, సైన్స్ అధికారి, గైడ్ టీచర్కు అభినందనలు. – భిక్షపతి, డీఈఓ -
మందు పార్టీ.. విద్యార్ధినులు సస్పెండ్
-
వీడియో వైరల్.. విద్యార్థినుల బహిష్కరణ
చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఓ కాలేజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో.. కాలేజ్ నుంచి వారిని బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. నలుగురు విద్యార్థినులు, వారి స్నేహితులతో కలిసి ఆరు వారాల కిందట ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అబ్బాయిలతో పాటు వారు కూడా మద్యం సేవించారు. విద్యార్థినులు బీర్ తాగుతున్న దృశ్యాలను అందులోని ఓ వ్యక్తి సెల్ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యార్థినులు తీరును తప్పుబడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయం డిసెంబర్ 24వ తేదీన కాలేజ్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో ఆ కాలేజ్ ప్రిన్సిపల్.. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అయితే విద్యార్థినుల చర్య కాలేజ్కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండటంతో.. వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిష్కరణ 2020 జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. అయితే తమిళనాడులో 21 ఏళ్లు పైబడ్డవారు మద్యం సేవించడం చట్టబద్ధం కాగా, ఆ నలుగురు విద్యార్థినుల వయసు అంతకన్నా తక్కువగా ఉంది. -
బాలికలదే హవా..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలలో బాలికల హవా కొనసాగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,398 మంది విద్యార్థులు హాజరు కాగా.. 6127 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం గా 65.19 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో బాలురు 2995 మంది పరీక్షలు రాయగా 1740 మంది, బాలికలు 4370 మంది పరీక్షలకు హాజరు కాగా 2849 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 873 మంది బాలురకు గాను 575 మంది, బాలికలు 1160 మందికి 963 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక మొదటి సంవత్సరంలో మొత్తం 9489 మంది విద్యార్థులు హాజరు కాగా 5859 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 61.74 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్లో జనరల్ విభా గంలో బాలురు 2959 మందికి 1643 మంది ఉత్తీ ర్ణులయ్యారు. బాలికలలో 4462 మందికి 2923 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 919 బాలురకు 490 మంది, బాలికలలో 1149 మం దికి 803 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో గత సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 70.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసంవత్సరం 65.19 శాతానికి తగ్గడం గమనార్హం. జిల్లాలో మొత్తం 73 కళాశాలలు ఉండగా, వీటిలో 14 ప్రభుత్వ, 9 గిరిజన సంక్షేమ, 5 సాంఘిక సంక్షేమ, 3 కస్తూర్బా, ఒక టీఎస్ఆర్జేసీ, 41 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. అయితే కళాశాలల వారీగా ఫలితాలు ఇంకా తెలియలేదని ఇంటర్ నోడల్ అధికారి ఎస్డి జహీర్అహ్మద్ తెలిపారు. -
కీచక ప్రొఫెసర్ పీచమణిచారు
పాటియాలా: విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాల పంపిన ఓ ప్రొఫెసర్కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు యూనివర్సిటీ అమ్మాయిలు. ప్రొఫెసర్ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఆ ప్రొఫెసర్ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో స్పష్టత లేదు. ఎనిమిది మంది జేఎన్యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోకముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. -
క్లాస్రూమ్లోనే నాలుగు రోజుల నరకం..
కోల్కతా: కథువా ఉదంతంతో దేశ వ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే తరగతి గదిలో కీచకపర్వం కొనసాగించాడు. ఇద్దరు విద్యార్థినులపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని దినాజ్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. దినాజ్పూర్ జిల్లా రాయ్గంజ్లోని పాఠశాలకు చెందిన నాల్గో తరగతి విద్యార్థిని స్కూలు పేరు చెబితే భయపడుతోంది. వెళ్లనని మొండికేస్తోంది. దీంతో తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుని ఏమైందని అడగగా.. తమ టీచర్ చేసే ఆకృత్యాలను బాలిక చెప్పింది. మరో బాలికను కూడా సార్ ఇలాగే చేశాడని చెప్పగా.. ఆ చిన్నారి ఇంటికి వెళ్లి అసలు విషయం చెప్పారు. దీంతో ఆవేశానికి లోనైన బాలికల తండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి తరగతి గదిలో లైంగిక దాడులు చేస్తున్న టీచర్ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. విద్యార్థులందరూ వెళ్లిపోయాక క్లాస్రూమ్లో తమపై అత్యాచారం చేసేవాడని, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధిత బాలికలు చెప్పారు. నాలుగు రోజులపాటు తమ కూతుళ్లపై కీచకపర్వం కొనసాగించిన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
88 మంది బాలికలను వివస్త్రలుగా మార్చి.. పనిష్మెంట్!
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. పనిష్మెంట్ పేరిట తోటి విద్యార్థినుల ముందు 88మంది బాలికలతో బలవంతంగా దుస్తులు విప్పించారు ముగ్గురు ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఓ కాగితంలో అసభ్య వ్యాఖ్యలు రాశారని ఆరోపిస్తూ.. టీచర్లు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పాపుమ్ పారే జిల్లా తాని హప్ప (ప్రస్తుతం సంగాలీ)లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల 23న ఈ దారుణం చోటుచేసుకుంది. ఆరో, ఏడో తరగతికి చెందిన 88మంది బాలికలను ఇలా అవమానించారు. ఈ నెల 27న బాధిత విద్యార్థినులు ఆల్ సంగాలీ విద్యార్థి సంఘం (ఏఎస్ఎస్యూ)ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏఎస్ఎస్యూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఓ విద్యార్థిని, ప్రధానోపాధ్యాయుడి పట్ల అసభ్య వ్యాఖ్యలు రాసి ఉన్న కాగితం దొరకడంతో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఒక జూనియర్ టీచర్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థినుల ముందు 88 మంది బాలికలతో దుస్తులు విప్పించి.. అవమానపరిచారు. ఈ ఘటనపై అరుణచాల్ప్రదేశ్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
అమ్మాయిల దుస్తులపై ఆంక్షల్లేవు: బీహెచ్యూ
సాక్షి, న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీలో తొలి మహిళా చీఫ్ ప్రొక్టార్గా నియమితులైన రోయనా సింగ్ విద్యార్థినుల స్వేచ్ఛను హరించే నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. దుస్తులు, ఆల్కహాల్పై అమ్మాయిలకు ఎలాంటి నియంత్రణలు ఉండవని తేల్చిచెప్పారు. క్యాంపస్ మెస్ల్లో మాంసాహారంపై నిషేధాన్ని తోసిపుచ్చారు. ‘నేను యూరప్లో పుట్టా... తరచూ యూరప్, కెనడాలను సందర్శిస్తా విద్యార్థినుల వేషధారణపై నియంత్రణలు విధిస్తే నాపై నేను విధించుకున్నట్టే’ అని రోయనా సింగ్ అన్నారు. తమకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను వేసుకోలేకపోతే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేముందని ఆమె ప్రశ్నించారు. అమ్మాయిల దుస్తులపై అబ్బాయిల కామెంట్లను నిరసిస్తూ.. అమ్మాయిలు వారికి సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే వారికి అభ్యంతరం ఎందుకని నిలదీశారు. బెనారస్ యూనివర్సిటీ ఎన్నడూ అమ్మాయిలపై నియంత్రణలు విధించలేదని, భవిష్యత్లోనూ విధించబోదని ఆమె పేర్కొన్నారు. ఇక మద్యం విషయానికి వస్తే ఇక్కడున్న అమ్మాయిలంతా 18 ఏళ్లు పైబడిన వారేనని, వారిలో అసలు ఈ ఆలోచనలను ఎందుకు రేకెత్తించాలని అన్నారు. వర్సిటీలో ఈవ్టీజింగ్, రౌడీయిజం వంటి అవలక్షణాలను పారదోలేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. క్యాంపస్ అంతటా సీసీ టీవీ కెమెరాలను అమరుస్తామని చెప్పారు. -
విద్యార్థినికి వేధింపులు.. క్యాంపస్ రణరంగం!
వారణాసి: లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ)ను కుదిపేస్తున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సహచర విద్యార్థినులు చేపట్టిన ఆందోళన.. శనివారం రాత్రి హింసాత్మకంగా మారింది. శనివారం రాత్రి క్యాంపస్ గేటు వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కొందరు దుండగులు ప్రజా ఆస్తులను తగలబెట్టి.. రాళ్లు విసరడంతో రంగంలోకి దిగిన పోలీసులు, పారామిలిటరీ బలగాలు విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను కనికరం లేకుండా చితకబాది.. అక్కడి నుంచి చెల్లాచెదురు చేశారు. బాలికల హాస్టల్లోకి ప్రవేశించి మరీ వారిని కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మీడియా ప్రతినిధులకూ గాయాలయ్యాయి. విద్యార్థినులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడం, తరచూ లైంగిక వేధింపులు ఎదురవుతుండటంతో గత శుక్రవారం నుంచి విద్యార్థినులు ఆందోళనలు చేస్తున్నారు. క్యాంపస్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం వారణాసి పర్యటనకు వచ్చినా.. విద్యార్థినులు తమ ఆందోళనను విరమించలేదు. ప్రధాని యూనివర్సిటీకి వస్తే ఆయన దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని భావించారు. క్యాంపస్లో విద్యార్థినులకు భద్రత కల్పించాలని, లైంగిక వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థినులు కోరుతున్నారు. -
విద్యార్థినిపై మ్యాట్రిన్ దాష్టీకం
చిన్నారిని కొట్టి... తోటి విద్యార్థినులతో కొట్టించిన వైనం నేలకొండపల్లి(పాలేరు): మేడమ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటూ తోటి విద్యార్థినులను అడిగిన పాపానికి వసతి గృహ సంక్షేమాధికారిణి(మ్యాట్రిన్) చిన్నారిని తొడ కందిపోయేలా పిండి, తీవ్రంగా కొట్టి, రెండు గంటలపాటు నిలబెట్టింది. అదీచాలక విద్యార్థినులతో కూడా చెంప దెబ్బలు కొట్టించింది. ఆమె దాష్టీకానికి తట్టుకోలేక చిన్నారి అల్లాడిపోయింది. ఆమె భర్త కూడా హాస్టల్కు వచ్చి అసభ్య పదజాలంతో తిట్ల దండకం అందుకున్న ఘటన శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో జరిగింది. నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి కొత్తూరు కు చెందిన కందగట్ల నందిని నేలకొండపల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో మూడో తరగతి చదువుతోంది. అయితే హాస్టల్లో ఉండే విద్యార్థినులు రోజూ మాట్రిన్ ఇంట్లో పని చేసేందుకు వెళ్తున్నారు. ‘రోజూ మేడమ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు’ అని నందిని అమాయకంగా వారిని అడిగింది. ఈ విషయాన్ని కొందరు విద్యార్థినులు మ్యాట్రిన్కు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆమె నందినిపై దాష్టీకానికి దిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్కు వచ్చి నందినిని ఇంటికి తీసుకెళ్లారు. చిన్నారిని హింసించిన సంక్షేమాధికారిణి, ఆమె భర్తపై చర్య తీసుకోవాలని రజక, బీసీ సంక్షేమ సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా, ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, హాస్టల్కి వెళ్లి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి హృషికేష్రెడ్డి తెలిపారు. -
వార్డెన్ భర్తా.. మజాకా?!
⇒ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై అసభ్యకర ప్రవర్తన ⇒ భరించలేక హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు ⇒ అధికారుల విచారణలో వెలుగుచూసిన అరాచకం చందంపేట (దేవరకొండ): తండ్రి స్థానంలో ఉండాల్సిన ఆ వ్యక్తే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడు.. అతను తమ వార్డెన్ భర్త కావడంతో చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని భావించిన విద్యార్థినులు ఆలోచించి నేరుగా ఛైల్డ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు.. దీంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.. నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విజయరాణి వార్డెన్గా ఉన్నారు. 55 ఏళ్ల వయసున్న ఆమె భర్త రాజు కూడా హాస్టల్లోనే నివాసం ఉంటున్నాడు. అయితే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి వేళలో వారిని నిద్రలేప డం, వివిధ రకాలుగా మాటలతో మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అయితే దీనికి విసిగిపోయిన విద్యార్థినులు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ బాధను వివరించారు. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును దేవరకొండ పట్టణంలో ఉన్న గ్రామ్య స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు తెలియజేశారు. ఈ విషయమై గ్రామ్య నిర్వాహకులు ట్రైబల్ వెల్ఫేర్ పీడీకి విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు యంత్రాంగం కదలడంతో గ్రామ్య కోఆర్డినేటర్ రవి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.వెంకటేశ్వర్నాయక్ పాఠశాలకు వెళ్లి అసలు విషయాన్ని ఆరా తీశారు. విడివిడిగా రాజు ప్రవర్తనపై విద్యార్థినులను అడగడంతో ఫిర్యాదులో వాస్తవం ఉందని గ్రహించారు. ఈ విషయమై పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా కొందరు అతని ప్రవర్తన పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వారు నేరెడుగొమ్ము పోలీసులకు కేసు వివరాలను తెలియజేసి అతడిపై ఫిర్యాదు చేశారు. -
విద్యార్ధినిపై పీఈటీ లైంగిక వేధింపులు!
-
స్వీయ రక్షణకు శిక్షణ
ఏఎన్యూ: యూనివర్సిటీ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినులకు స్వీయ రక్షణకు సంబంధించిన అంశాలపై మూడు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం యూనివర్సిటీ వసతి గృహాల ప్రాంగణంలో ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ట్రై నింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ లక్ష్మి, రవి బృందం విద్యార్థినులకు స్వీయ రక్షణ, కరాటే అంశాల్లో శిక్షణ ఇచ్చింది. విద్యార్థినుల పరీక్షల షెడ్యూల్ పరిశీలించిన తరువాత 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని విద్యార్థినుల వసతి గృహం చీఫ్ వార్డెన్ ఆచార్య ఎల్ జయశ్రీ తెలిపారు. -
స్కేటింగ్లో విద్యార్థినుల ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: తమిళనాడులోని తిరుపూర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్లో తమ విద్యార్థులు నగీనా, ఆఫ్రీన్ ప్రతిభ కనబరిచారని విజయవాడ రవీంద్రభారతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని స్కూల్ ఆవరణలో స్కేటింగ్ క్రీడాకారిణీలను అభినందించారు. ఆయన మాట్లాడుతూ వీరిద్దరూ జాతీయ స్థాయి క్రీడాకారులతో 24 గంటలు స్కేటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పారు. -
ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు అదృశ్యం
కుషాయిగూడ : వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండాపోయారు. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు... అల్వాల్, వెంకటాపురానికి చెందిన సౌమ్య(18) ఈసీఐఎల్లోని విశ్వ చైతన్య డీగ్రీ కళాశాలలో డీగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే ఈ నెల 14న ఆమె తండ్రి లక్ష్మీనర్సింహ బైక్పై కళాశాలలో వదిలి వెళ్లాడు. సాయంత్రం పొద్దు పోయే వరకు ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో సంఘటనలో... కీసర మండలం రాంపల్లికి చెందిన ఎం.శివానీ(17) మహేశ్నగర్లోని ఓమెగా డీగ్రీ కళాశాలలో చదువుకుంటుంది. బుధవారం కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అసభ్య ప్రవర్తన.. పోలీసుల కస్టడీలో నటుడు!
-
అసభ్య ప్రవర్తన.. పోలీసుల కస్టడీలో నటుడు!
పాలక్కడ్: ఏకంగా పాఠశాల ఆవరణలోనే విద్యార్థినులతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కేరళలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మలయాళ సీనియర్ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కారులో ఉన్న ఓ వ్యక్తి నగ్నంగా తమవైపు చూస్తూ వెకిలి హావభావాలకు పాల్పడ్డాడని, తమ ఫొటోలను తీసుకున్నాడని కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పథిరిపాలెంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి ఉన్న కారు నంబర్ను పోలీసులకు అందజేశారు. ఆ కారు ఎవరిదని ఆరాతీస్తే.. అది ప్రముఖ నటుడు శ్రీజిత్ రవిదని తేలింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. అయితే, తాను స్కూలు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఆరోపణలను శ్రీజిత్ రవి కొట్టిపారేశారు. విద్యార్థినులు ఇచ్చిన కారు నంబర్ తనదేనని, అయితే తాను ఎవరితో అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. విద్యార్థినులు కారు నంబర్ సరిగ్గా నోట్ చేసుకొని ఉండరని, తప్పుగా వారు తన వాహనం నంబర్ ఇచ్చి ఉంటారని, అంతేకానీ తాను ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడే వ్యక్తి కాదని ఆయన వివరణ ఇచ్చారు. -
'అమ్మాయిలు జడలు వేసుకుంటేనా రానిస్తారా?'
తిరువనంతపురం: అమ్మాయిలు జడలు వేసుకునే పాఠశాలలకు రావాలని ఒత్తిడి చేయొద్దని, అసలు ఆ విషయం అడగొద్దని కేరళ రాష్ట్ర చిన్నారుల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైయర్ సెకండరీ డైరెక్టర్ కు, జనరల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ కు ఆదేశాలిచ్చింది. కేరళలో కాసర్ గోడ్ కు చెందిన ఓ విద్యార్థిని తనను జడవేసుకోలేదని స్కూళ్లో నుంచి పంపించారని కమిషన్ ను ఆశ్రయించడంతో కమిషన్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తాము స్నానం చేసిన ప్రతిసారి రెండు జడలు వేసుకోవడం ఇబ్బందిగా మారిందని, జుట్టంతా చిక్కులుపడి దానిని సరిచేసే క్రమంలో అది బలహీనంగా తయారవుతుందని, అలాగని తలంటు స్నానం చేయకుంటే పక్కవారికి ఇబ్బందయ్యేలా వాసన వస్తుందని కానీ, తలంటు స్నానం చేశాక జుట్టు సరిచేసుకోవడం బాగా ఇబ్బందని వారు కమిషన్ ముందు వాపోయారు. రెండు జడలు తప్పకుండా వేసుకోవాల్సిందేనని స్కూళ్లలో వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిని విన్న కమిషన్ కావాలంటే జుట్టంతా కలిపి బ్యాండ్ వేసుకునే విధంగా ఆదేశించవచ్చని, జడలు వేసుకోవాల్సిందేనని ప్రత్యేకంగా నిబంధన పెట్టి వారిపై ఒత్తిడి తీసుకురావొద్దని పాఠశాలల యాజమాన్యాలకు చెప్పింది. -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల ఫలితాలు (సీబీఎస్ఈ) శనివారం విడుదలయ్యాయి. మొత్తం 96.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది 1.11 శాతం ఉత్తీర్ణత తగ్గింది. మరోవైపు ఎప్పటిలాగానే ఉత్తీర్ణతలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారు. కాగా 5309 పాఠశాలలకు చెందిన 8,92,685 మంది బాలురు, 6,06,437 మంది బాలికలు కలిపి మొత్తం 14,99,122 మంది విద్యార్థులు ఈ ఏడాది సీబీఎస్ఈ నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ http://cbseresults.nic.in/class10/cbse102014.htmలో పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. -
వీడు మారడంతే..!
♦ అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు ♦ స్నేహమంటూ సంపన్న వర్గాల విద్యార్థినులకు వల ♦ మాయ మాటలతో నయవంచన ♦ నగ్న చిత్రాలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు ♦ ఏడు నెలల్లో రెండోసారి కటకటాల్లోకి చేరిన మాజిద్ సాక్షి, సిటీబ్యూరో: అమ్మాయిల పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు తెరవడం, సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినులను టార్గెట్గా చేసుకుని స్నేహం పేరుతో వల వేసి నయవంచన కు పాల్పడటం... ఆనక నగ్న చిత్రాల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ మాజిద్ మరోసారి అరెస్టయ్యాడు. ఇదే తరహాలో 80 మందిని మోసం చేసిన ఆరోపణలపై ఏడు నెలల క్రితం సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి వచ్చినా బుద్ధిమార్చుకోకుండా పాత పం థానే కొనసాగిస్తూ శనివారం మరోమారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఇతడిపై ఇప్పటికి ఒక ఫిర్యాదే వచ్చిందని, బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సంయుక్త పోలీసు కమిషనర్ (నేరాలు) డాక్టర్ టి.ప్రభాకరరావు తెలిపారు. స్నేహం పేరుతో ఎర.. బంజారాహిల్స్ రోడ్ నెం.10 ప్రాంతానికి చెందిన అబ్దుల్ మాజిద్ నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వక్రబుద్ధితో నయవంచకుడిగా మారిన అతను రెండేళ్లుగా ఫేస్బుక్ కేంద్రంగా రెచ్చిపోతున్నాడు. అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచి సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్ను గుర్తించి, వారికి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపిస్తాడు. అవతలి వారు కూడా అమ్మాయిలే కదా అనే ఉద్దేశంతో విద్యార్థినులు ‘యాక్సెప్ట్’ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగానే ఛాటింగ్ చేస్తూనే వ్యక్తిగత విషయాలు రాబడతాడు, ఇలా స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక విషయాల్లోకి తలదూరుస్తాడు. నయవంచన.. బ్లాక్మెయిలింగ్... అవతలివారు పూర్తిగా తన ముగ్గులోకి దిగారని నిర్థారించుకున్న తర్వాత మాజిద్ అసలు కథ ప్రారంభి స్తాడు. విద్యార్థినుల్ని వంచించి వారి నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. ప్రైవేట్ ఛాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత వారి నే సంప్రదిస్తూ తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో పెట్టడంతో పాటు తల్లిదండ్రులకు పంపుతానని బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. కొన్ని సందర్భాల్లో అమ్మాయిల్ని వ్యక్తిగతంగానూ కలిసేవాడు. ఓసారి డబ్బు చెల్లించిన వాళ్లనూ విడిచిపెట్టకుండా పదేపదే బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇతని ఆగడాలపై బంజారాహిల్స్ ప్రాంతానికి విద్యార్థిని, ఆమె తల్లి గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ నుంచి మళ్లీ మొదలు... దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు మాజిద్ను గుర్తించి గత ఏడాది సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించినట్లు ఆరోపణలున్నాయి. మాజిద్ సృష్టించిన నకిలీ ఫేస్బుక్ ఖాతాను పరిశీలించగా, ఛాటింగ్స్లో ‘ఇప్పటికే రూ.86 వేలు ఇచ్చాను కదా! మళ్లీ బ్లాక్మెయిలింగ్ ఏమిటి?’ అంటూ ఓ విద్యార్థిని పంపిన సందేశం కూడా ఉంది. ఈ కేసులో న్యాయస్థానం నుంచి బెయిల్ పొందిన మజీద్ నవంబర్లో విడుదలయ్యాడు. డిసెంబర్ నుంచి మళ్లీ పాత పంథానే అనుసరిస్తూ వ్రిస్తీ శామల్, నేహా విరానీ పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు తెరిచాడు. దాదాపు ఆరుగురిని వంచించిన ఇతడు కొందరి నుంచి డబ్బు సైతం కాజేశాడు. ఓ స్కూలు విద్యార్థిని సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.రాజు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను బట్టి మజీద్ను నిందితుడిగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. ఏళ్లుగా ఇదే వైఖరి.. పేద కుటుంబంలో పుట్టిన మజీద్ వ్యవహారశైలి ఆది నుంచీ ఇలానే ఉండేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇతడి తండ్రి మహ్మద్ సలీమ్ పాన్షాపులకు తమలపాకులు సరఫరా చేస్తుంటారు. తల్లి కూరగాయలు విక్రయించేది. ఇలా వచ్చిన డబ్బుతోనే మజీద్ను బీటెక్ చదివిస్తున్నారు. ఆకతాయిగా మారిన మజీద్ ఇంటర్ నుంచే ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడేవాడు. బీటెక్కు వచ్చాక ఈ ధోరణి మరింత విశృంఖలంగా మారింది. అమ్మాయిల పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు తెరిచి ఛాటింగ్స్ చేస్తున్న వారిని చూసి ‘స్ఫూర్తి’ పొందిన మాజిద్ అదే పంథాను అమలు చేస్తూ మరో అడుగు ముందుకు వేశాడు. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారుల కుమార్తెగా ఫేస్బుక్లో పరిచయం చేసుకుని బ్లాక్మెయిల్స్కు పాల్పడే వాడని పోలీసులు పేర్కొన్నారు. -
బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు
బాలికల రక్షణ ప్రస్తుతం ప్రహసనంగా మారింది. విద్యార్థినులు స్కూలుకి వెళ్ళి సురక్షితంగా ఇంటికి వచ్చే వరకూ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ ఏడు విద్యార్థినులపై జరిగిన లైంగిక దాడులను దృష్టిలో పెట్టుకున్న సీబీఎస్సీ.. దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని పాఠశాలలకు కొత్త సూచనలు జారీ చేసింది. పాఠశాలలో ఒకటినుంచీ పదో తరగతి వరకూ చదివే విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరిగి స్వీయ రక్షణ కల్పించుకునే అవకాశం ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యోచించింది. గతంలో బెంగళూరు, ఢిల్లీల్లో బాలికలపై జరిగిన లైంగిక దాడుల నేపథ్యంలో తల్లిదండ్రులు వారి వారి పిల్లలను కనీసం పాఠశాలకు పంపించేందుకు కూడ భయపడే సందర్భాలు రావడంతో బాలికల రక్షణ దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులకు స్కూల్లో వారంపాటు ఆత్మ విశ్వాసాన్ని పెంచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించింది. ఈ తరగతులపై వారి వారి తల్లిదండ్రుల్లో కూడ అవగాహన కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సీబీఎస్సీ అభిప్రాయపడుతోంది. -
ఆత్మవంచన ఎంతకాలం?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని మొత్తం స్కూళ్లలో సగానికి సగం స్కూళ్లలో ఈ రోజుకు కూడా టాయిలెట్ వసతిలేదు. విద్యార్థినులు ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడో, తొమ్మిదిలోకి అడు గుపెట్టిన తర్వాతనో చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఇందుకు ముఖ్యమైన కారణాలలో టాయిలెట్లు లేకపోవడం ఒకటి. విద్యార్థులకే కాదు మహిళా టీచర్లకూ మరుగుదొడ్డి సౌకర్యం లేని పాఠశాలలే ఎక్కువ. ఒక రోజు భీకర ప్రతిజ్ఞ. సరికొత్త దిశానిర్దేశం. సమున్నత లక్ష్య నిర్ధారణ. అంతలోనే విస్మరణ. మరుసటి రోజు మరో ప్రతిజ్ఞ, వ్చురో ప్రమాణం, మరో లక్ష్యం. మధ్యలో రాజకీయ పుటెత్తుగడలు. వ్యూహప్రతివ్యూహాలు. ప్రత్యర్థుల నుంచి అనూహ్యమైన దాడులు. ఆత్మరక్షణ కోసం ఎదురుదాడులు. నిప్పులు చెరుగుతూ ఉపన్యాసాలు. ఆవేశంతో ఊగిపోతూ విన్యాసాలు. తమ పార్టీలనూ, ప్రాబల్యాన్నీ విస్తరించుకోవాలి. తమ అనుయాయులకు ఆర్థికంగా లబ్ధి చేకూ ర్చాలి. వైరిపక్షాన్ని బలహీనపరచాలి. అటువారిని ఇటు లాక్కోవాలి. ఆ శిబిరం ఖాళీ చేయాలి. వారిపైన నిఘా పెట్టాలి. అందుకు అవసరమైన పరికరాలు కొను గోలు చేయాలి. కోట్లు ఖర్చయినా సరే ప్రత్యర్థుల రణతంత్రం తెలుసుకోవ డానికి వారిపైన నిఘా పెట్టేందుకు విదేశీ సంస్థలకు ఎంత మొత్తమైనా చెల్లిం చాలి. రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఏమి చేసినా తప్పులేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించైనా సరే, చట్టాలను తుంగలో తొక్కైనా సరే, అడ్డదా రుల తొక్కయినా సరే ఎదుటివారిపైన ఆధిక్యం సంపాదించాలి. ఎవరు అడ్డువ చ్చినా సరే అనుకున్నది సాధించాలి. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి. నెలలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎన్నికలు జరిగి, రాష్ట్ర విభజన జరిగి సంవత్స రం దాటింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు సామరస్య ధోర ణిలో కాకుండా సంఘర్షణాత్మకంగానే ముందుకు పోతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలలో ఆవేశం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ రంధిలో ప్రజల కనీ సావసరాలను తీర్చడానికి తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఇది అంతు లేని ఆత్మవంచన. గ్రహణం పట్టిన విద్య, ఆరోగ్యం విద్యకూ, ఆరోగ్యానికీ సంబంధించి అతి ముఖ్యమైన, అత్యంత ప్రాథమికమైన అంశం పాఠశాలల్లో మరుగుదొడ్లు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూ మికి వె ళ్లవలసిన దుస్థితి అవమానకరమనీ, అమానవీయమనీ ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పారు. జాతి సిగ్గుతో తలవంచుకోవలసిన విషయాన్ని ఎర్రకోట ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించడమే కాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసే ఉత్తర్వుపైన మొదటి సంతకం చేశారు. స్వచ్ఛభారత్ అభి యాన్ అంటూ నినాదం ఇచ్చారు. వాస్తవికతను ఒప్పుకున్నందుకు, అనాగరిక మైన ఆచారాలను అంతం చేయాలని సంకల్పించినందుకు మోదీని మనసారా అభినందించని భారతీయులు ఉండరు. ఫొటోల కోసం చీపురు పట్టుకొని కసువు ఊడ్చిన ముఖ్యమంత్రులూ, మంత్రులూ, రాజకీయ నేతలూ అసలు సమస్యను పట్టించుకోలేదు. రాజకీయ నేతలతో తాము సైతం అంటూ అధికా రులూ యథాశక్తి నటించారు కానీ సమస్య పరిష్కారం పట్ల శ్రద్ధ చూపలేదు. ఎక్కడ వేసిన గొంగ డి అక్కడే ఉంది. ఇందుకు కారణం ఏమిటి? మన జాతికి నిజాయితీ బొత్తిగా లేకపోవడం. మాటలకూ, చేతలకూ ఏ మాత్రం పొంతన లేకపోవడం. నిప్పులాంటివాళ్ళమంటూ బోరవిరుచుకొని ప్రకటించుకుంటూ అవినీతి పనులు అడ్డగోలుగా చేయడం. తాము చట్టాలను ఉల్లంఘిస్తూనే, రాజ్యాంగాన్ని కాలరాస్తూనే ప్రత్యర్థులను తప్పు చేస్తున్నారం టూ పరుష పదజాలంతో దూషించడం. నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం. మీడియాలో విమర్శలు వచ్చినా, రాజకీయ ప్రత్యర్థులు తప్పుపట్టినా ఎదురు దాడి చేయడం. ఒక విధానాన్ని రూపొందించే ముందు సాధ్యమైనంత విస్తృ తంగా సంప్రదింపులు జరపాలని కానీ విధానం అమలు చేసే క్రమంలో దాన్ని అందరికీ వివరించాలని కానీ పట్టింపులేదు. ఏ మాత్రం అధ్యయనం లేకుండా పథకాలు ప్రకటించడం, నిధులు కేటాయిస్తున్నట్టు బహిరంగ సభలలో వాగ్దా నం చేయడం. ప్రతి నిర్ణయంలోనూ నిగూఢమైన కోణం ఉంటుంది. స్వల్ప కాలిక దృష్టి మాత్రమే కానీ సుదూరంగా ఆలోచించి విధాన నిర్ణయాలు చేస్తున్న దాఖలా లేదు. నిత్యజీవితంలో ప్రజలను వేధిస్తున్న సమస్యలను ఎట్లా పరిష్క రించాలో ప్రజాప్రతినిధులతో, అధికారులతో సుదీర్ఘంగా సమాలోచన జరిపి విధానం రూపొందించడం సమర్థులైన పాలకుల లక్షణం. అటువంటి సమస్యల జాబితాలో మొట్టమొదటి అంశం మరుగుదొడ్లు. స్తబ్దత, నిర్లిప్తత ప్రధాని ప్రకటనను మనస్పూర్తిగా అమలు చేయడానికి పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ, ఇతర ప్రజాప్రతినిధులు ప్రయత్నించినా ఈ సమస్య చాలా వరకూ పరిష్కారమయ్యేది. నాయకులు వాగ్దానాలు చేస్తూనే ఉంటారు కానీ అవి అమలుకు నోచుకోవనే అభిప్రాయం సామాన్య ప్రజలకూ ఉన్నది. సగటు పౌరులలో సైతం ఒక రకమైన స్తబ్దత గూడుకట్టుకున్నది. నిర్లిప్తత కనిపిస్తున్నది. ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా చేసుకోవలసిన చిన్న పనులు కూడా స్వయం గా చేయకుండా కలెక్టర్లకూ, ఎంఎల్ఏలకూ అర్జీలు పెట్టుకుంటూ ఎదురు చూడ టం అలవాటయింది. ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలలకూ, బాలి కలకూ విడివిడిగా మరుగుదొడ్లు నిర్మించి, నీటివసతి ఏర్పాటు చేయడం అసా ధ్యమైన పని కాదు. తమ పిల్లలే స్కూళ్లలో టాయిలెట్లు లేక నానా అవస్థలూ పడుతుంటే, మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులకు గురి అవుతుంటే తల్లి దండ్రులు పట్టించుకోవడం లేదు. అది ముఖ్యమైన సమస్య కాదన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుంటున్నారు. కొన్ని రోజుల కిందట జార్ఖండ్లో ఒక దుర్ఘటన జరిగింది. నిజానికి దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలలోనూ పతాక శీర్షికగా రావలసింది. కానీ రాజకీయాలకే అమితమైన ప్రాధాన్యం ఇస్తున్న మీడియా ముఖ్యమైన ఈ వార్తను పట్టించుకోలేదు. జార్ఖండ్లోని దుంకా గ్రామంలో పన్నెండో తరగతి చదువుతున్న 17 ఏళ్ల ఖుష్బూ తన ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగు అవసరమని తండ్రి కి ఆ యువతి పదేపదే చెప్పింది. ఆమె వాదనను తల్లి కూడా బలపరించింది. కానీ టాయిలెట్ నిర్మించడానికి పెట్టే ఖర్చు తాను భరించ లేనిదనీ, అంతకంటే కూతురి పెళ్లి ఘనంగా జరిపించడానికి డబ్బు ఆదా చేయ డం ముఖ్యమనీ చెప్పి భార్య నోరు మూయించారు. బహిర్భూమికి తాను వెడు తున్నప్పుడు భార్య, కూతురు వెడితే తప్పేమిటనే భావనే కానీ వారి ఇబ్బందిని అతడు అర్థం చేసుకోలేకపోయాడు. ఖుష్బూ తన తాతగారింటికి పరుగెత్తుకుం టూ వెళ్ళి టాయిలెట్ ఉపయోగించేది. ఇంట్లో టాయిలెట్ లేకపోవడం ఆమెకు అవమానంగా, దుర్భరంగా తోచింది. అటువంటి జీవితం వ్యర్థం అనుకున్నది. ఈ దారుణం జరిగిన వారంలోనే బ్రెడ్ సొసైటీ తరఫున కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పి చంద్రశేఖరరావు, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధి నేత డాక్టర్ భాస్కరరావు, నేను మహబూబ్నగర్, కర్నూలు జిల్లాలలోని ఆరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లాం. బ్రెడ్ సొసైటీ ప్రభుత్వ పాఠశాలలో గ్రంధాలయాలు ఏర్పాటు చేసి, ప్రతి పాఠశాలకూ ఒక బీరువా, 650 పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నది. తెలంగాణలో సుమారు 200, ఆంధ్రప్రదేశ్లో350 స్కూళ్ళలో ఈ సదుపాయం కలిగించింది. గ్రంథాలయాల నిర్వహణ ఎట్లా ఉన్న దో చూడటంతో పాటు మరుగుదొడ్లు సవ్యంగా ఉన్నాయో లేవో తనిఖీ చేయా లన్న ఉద్దేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇరుగుపొరుగు జిల్లాలలో పర్య టించాం. కర్నూలు జిల్లాలోని పెద్దపాడు, కల్లూరు గ్రామాలలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వేయిమందికి పైగా ఉన్నారు. వారిలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. హాస్టళ్లలో కానీ స్కూళ్లలో కానీ మరుగుదొడ్లు లేవు. కర్నూలు నగరం మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ జెడ్పీ హైస్కూలులో మాత్రం మరుగుదొడ్లు తగినన్ని ఉన్నాయి. పరిశుభ్రంగా ఉన్నాయి. ఈ స్కూలులో 1560 మంది విద్యార్థులు న్నారు. మునిసిపల్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న కారణంగా కాబోలు ఈ స్కూలు నిర్వహణ బాగానే ఉన్నట్టు కనిపించింది. మహబూబ్నగర్ జిల్లా లోని ఉండవెల్లి, వేముల, సుగూరు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. పిల్లలు ఉంటున్న హాస్టళ్లలో సైతం ఈ వసతి లేదు. మూడు స్కూళ్లలో కలిపి తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉంటారు. మధ్యాహ్న భోజనం సమకూర్చుతున్న కాంట్రాక్టర్లకు బిల్లులు మూడు, నాలుగు మాసా లుగా చెల్లించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికులు బడుగువర్గాలకు చెందిన బాలబాలికలే. వారికి సరైన ఆహారం లేదు. కనీస వసతులు లేవు. గ్రామస్థులు పట్టించుకోరు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్) జూలై మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో ఎనిమిది దళిత విద్యార్థినుల సంక్షేమ హాస్టళ్లను పరిశీలించింది. మలక్పేట, ఉప్పుగూడ, జమిస్థాన్పూర్, అడ్డగుట్ట, మౌలాలీలోని ఎస్సీ గరల్స్ హాస్టళ్లలో టాయిలె ట్స్ ఉన్నాయి. కానీ ఒక్క ఉప్పుగూడ హాస్టల్లోనే టాయిలెట్లు సక్రమంగా పని చేస్తున్నాయి. తక్కిన హాస్టళ్లలో కొన్ని టాయిలెట్లకు తలుపులు లేవు. నీటి సరఫరా లేదు. విద్యుత్ సౌకర్యం లేదు. మరుగుదొడ్లు సవ్యంగా లేని కారణంగా విద్యార్థులు ఆలస్యంగా స్కూళ్లకు వెడుతున్నారు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరా లలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే చిన్న పట్టణాలూ, గ్రామాల సంగతి చెప్పనక్కరలేదు. సుప్రీంకోర్టు ఆదేశం బేఖాతరు నరేంద్రమోదీ ప్రధాని కావడానికి ముందే, యూపీఏ ప్రభుత్వ హయాంలోనే స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2013 మార్చి చివరి నాటికి అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు నిర్మించాలనీ, నీటి వసతి కల్పించాలనీ, అన్ని టాయిలెట్లూ సక్రమంగా పని చేస్తున్నట్టు నివేదిక పంపిం చాలనీ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ సక్రమంగానే ఉన్నట్టు నివేదికలు సుప్రీంకోర్టుకు పంపించాయి. పరిస్థి తిలో మాత్రం మార్పు లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని మొత్తం స్కూళ్లలో సగానికి సగం స్కూళ్లలో ఈ రోజుకు కూడా టాయిలెట్ వసతిలేదు. విద్యార్థినులు ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడో, తొమ్మిదిలోకి అడు గుపెట్టిన తర్వాతనో చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఇందుకు ముఖ్యమైన కార ణాలలో టాయిలెట్లు లేకపోవడం ఒకటి. విద్యార్థులకే కాదు మహిళా టీచర్లకూ మరుగుదొడ్డి సౌకర్యం లేని పాఠశాలలే ఎక్కువ. ప్రభుత్వ పాఠశాలలే కాదు అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో నడుస్తున్న అనేక ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే దారు ణం. టాయిలెట్ సదుపాయం లేదు కనుక మంచినీళ్లు తాగకుండా, కడుపు నిండా తినకుండా స్కూళ్లకు వెడుతున్న విద్యార్థినులూ, మహిళా టీచర్లూ ఉన్నా రు. ఈ కారణంగా ఎనీమియా వంటి రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. కపట మనస్తత్వాన్ని నరనరానా జీర్ణించుకున్న మనం వాస్తవాన్ని చూడ కుండా అవాస్తవిక జగత్తులో విహరిస్తూ ఉంటాం. ప్రధాని ఉద్ఘోషించినా, నిధులు సమకూర్చినా స్వచ్ఛ భారతం కలగానే మిగిలిపోతుంది. పరిశుభ్రత పట్ల, ఆరోగ్యం పట్ల పట్టింపు ప్రజలందరికీ ఉన్నప్పుడే స్వచ్ఛ భారత్ కల సాకా రం అవుతుంది. ఈ ప్రాథమిక సౌకర్యం అందరికీ అందుబాటులోకి రానంత వరకూ భారత దేశం చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందినా, అగ్రరాజ్యంగా అవతరించినా గర్వకారణం కాజాలదు. మనిషి పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మనసులోని మాలిన్యం తొలగిపోవాలి. ఉన్నది లేన ట్టూ, లేనిది ఉన్నట్టూ ఊహించుకొని భ్రమలలో జీవించడం మానుకోవాలి. ఆత్మవంచనకు స్వస్తి చెప్పాలి. - కె.రామచంద్రమూర్తి -
స్కూల్లో కురచ స్కర్టులపై నిషేధం
ఇంగ్లండ్లోని వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో అమ్మాయిలు కురచగా ఉండే స్కర్టులు వేసుకు రావద్దంటూ ఆ స్కూలు ప్రధానోపాధ్యాయిని నిషేధం విధించారు. ఆ స్కూల్లో అమ్మాయిలు ఎంత చెప్పినా వినిపించుకోకుండా కాళ్లు తెగ చూపిస్తున్నారని, వాళ్లు వేసుకొచ్చే స్కర్టులు అసలు సరిగా కప్పి ఉంచలేకపోతున్నాయని ట్రెంథమ్ హైస్కూలు హెచ్ఎం రొవెనా బ్లెన్కొవ్ అన్నారు. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అక్కడి అమ్మాయిలందరూ తప్పనిసరిగా ప్యాంట్లు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. గడిచిన రెండేళ్ల నుంచి ఈ సమస్య బాగా ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా 9, 10, 11 క్లాసుల్లో చదివే అమ్మాయిలతోనే ఈ సమస్య అన్నారు. 7, మహా అయితే 8వ తరగతి వరకు అమ్మాయిలు నిబంధనలకు లోబడి ఉంటారని, కానీ వాళ్లు పెద్దయ్యే కొద్దీ స్కర్టులు మాత్రం పొట్టివైపోతున్నాయని ఆమె వాపోయారు. ఇప్పుడు అమ్మాయిలు వేసుకొస్తున్న స్కర్టులు అసలు వాళ్లకు ఏమాత్రం సరిపోయేలా ఉండట్లేదని తెలిపారు. ఇలా పొట్టి స్కర్టులు వేసుకొచ్చే అమ్మాయిలను ముందుగా హెచ్చరిస్తున్నామని, అయినా వాళ్లు మాత్రం ఆ పని మానట్లేదని హెడ్ మిస్ట్రెస్ చెప్పారు. కొంతమంది విద్యార్థినుల విషయంలో అయితే తల్లిదండ్రులను పిలిపించి, వాళ్లను ఇళ్లకు పంపేశామని చెప్పారు. కొంతమంది అమ్మాయిలకు తానే స్వయంగా కొత్త స్కర్టులు కొనిచ్చానని.. స్కూల్లో ఇలాంటి వాతావరణం ఉండకూడదని ఆమె అన్నారు. స్కూల్లో ఉండే అబ్బాయిలు, మగ టీచర్లు అందరికీ ఇది ఇబ్బందేనని, వాళ్ల దృష్టి మళ్లుతుందని ప్రధానోపాధ్యాయిని వ్యాఖ్యానించారు. ఇది యూనిఫాం సమస్య కావడం మానేసి.. పిల్లలను కాపాడుకునే సమస్య అవుతుందన్నారు. ఇంతకుముందు కూడా హెర్ట్ఫోర్డ్షైర్ ప్రాంతంలోని సెయింట్ మార్గరెట్స్ స్కూల్లో కూడా అమ్మాయిలు పొట్టి స్కర్టులు వేసుకు రాకూడదని, అతిగా మేకప్ చేసుకుని రాకూడదని నిషేధం విధించారు. -
ఊడిపడ్డ పాఠశాల పైకప్పు
నారాయణఖేడ్ రూరల్ : పాఠశాల పైకప్పు పె చ్చులూడి ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని చాప్టా (కే) ఉన్న త పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చాప్టా(కే) ఉన్నత పాఠశాల ఉదయం పాఠశాల సమయానికి విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. 9వ తరగతి గదిలోకి ఐదారుగురు విద్యార్థులు వెళ్లగానే ఒక్కమారిగా పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గదిలో కూర్చున్న హంగిర్గా (కే) గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని లావణ్య (14) తలపై పెచ్చులు పడడంతో తలపగిలింది. అదేవిధం గా చాప్టా (కే) గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని సుమిత్ర (14)కు చేయికి స్వల్ప గాయాలు తగిలాయి. పైకప్పులు ఇంకాస్త ఆలస్యంగా ఊడిపడి ఉంటే చాలామంది విద్యార్థులు గాయపడేవారని ఉపాధ్యాయులు చెప్పా రు. పాఠశాల ప్రారంభంకాగానే పెచ్చులు ఊడిపడడంతో ఇద్దరు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. కాగా పాఠశాలను ఆర్వీఎం నిధులతో 2012-13వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించగా ఆరునెలల క్రితమే భవనం నిర్మాణం పనులు పూర్తయి పాఠశాల కొనసాగుతుంది. పాఠశాల పైకప్పుకు గిలావ్ (సిమెంట్ పూత) వేసే ముందు కచ్చులు కొట్టకపోవడంతోనే కూ లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ప్రమా దం అనంతరం విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి పాఠశాలు బోధించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ భీంసింగ్ పాఠశాలను సందర్శించి ప్రమాద సంఘటన వివరాలను ఉపాధ్యాయులను అడగి తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన : ప్రమాదం విష యం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నా యకులు గ్రామానికి వెళ్లి విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, సీపీఎం, టీఎన్ఎస్ఎఫ్ సంఘాల నాయకు లు ప్రవీణ్, నరసింహులు, చిరంజీవి, అర్జున్, అశోక్రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి గ్రామంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నాసిరకంగా భవనం నిర్మించడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందన్నారు. భవనం నాసిరకం నిర్మాణానికి కారణమైన ఆర్వీఎం ఏఈ, కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. -
యువతరం గజ్జె కట్టి ఆడింది
యువతరం గజ్జె కట్టి ఆడింది. గొంతెత్తి పాడింది. ఆహూతులను మైమరపించింది. యువ కళాకారులు పల్లె సొగసులను కళ్లకు కట్టారు. సంప్రదాయాలను ప్రతిబింబించారు. గత కొన్ని రోజులుగా జిల్లావ్యాప్తంగా కొనసాగిన యువజనోత్సావాలు శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ముగిసాయి. మరోవైపు నగరంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాల విద్యార్థినులు తమ టాలెంట్తో అదరగొట్టారు. ఎందులోనూ తాము తీసిపోమని నిరూపించారు. గొంతెత్తి పాడిండ్రు.. గజ్జెకట్టి ఆడిండ్రు. జానపదాల జోరులో.. సంగీతపు హోరులో.. యువజనోత్సవాన్ని ఉత్సాహంగా జరిపిండ్రు. జిల్లాకేంద్రంలోని నూ అంబేద్కర్ భవన్లో శుక్రవారం జిల్లా యువజనోత్సావాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర మేయర్ ఆకుల సుజాత, విశిష్ట అతిథిగా జడ్పీ సీఈఓ రాజారాం పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో యువతీయువకుల ప్రదర్శనలు చాలా బాగున్నాయని, రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం యువతకు, కళాకారులకు అండగా ఉంటుందన్నారు. మీరు పడుతున్న కష్టానికి ప్రభుత్వం గుర్తింపునిస్తుందన్నారు. ఎన్వైకే కో-ఆర్డినేటర్ రాంచంద్రరావు, సూపరింటెండ్ కృష్ణకుమారి, అధికారులు అన్నపూర్ణ, యుజవన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. - నిజామాబాద్ నాగారం వావ్.. అనిపించే పాటలు. వారెవ్వా.. అనిపించే డ్యాన్సులు. కళ్లుచెదిరె ఫ్యాషన్షో.. కమ్మని కుకింగ్స్తో జిల్లాకేంద్రంలోని నిర్మల హృదయ కళాశాలలో హోరెత్తిపోయింది. తమ కాలేజీలో శుక్రవారం టాలెంట్వీక్ను ఫుల్జోష్తో షురూ చేశారు స్టూడెంట్స్. కిరాక్ పాటలతోనే కాకుండా కమ్మని జానపదాలపైనా స్టెప్పులేశారు. కుకింగ్ పోటీలో కొకే ఐస్క్రీం.. ఫ్రూట్సలాడ్లను తయారు చేశారు. ఆద్యంతం విద్యార్థినులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాల్ని ఆస్వాదించారు. -నిజామాబాద్ అర్బన్ -
విల్లా ఫిస్టా అకడమిక్ ఎక్స్లెన్స్ ఉత్సవాలు
-
విద్యార్థినులపై వేధింపులు.. ట్యూషన్ మాస్టర్పై కేసు
చిలకలగూడ: విద్యార్థినులను వేధిస్తున్న ట్యూషన్ మాస్టర్పై కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్టుగూడకు చెందిన వికలాంగుడైన గాంధీప్రసాద్ (28) ట్యూషన్ మాస్టర్. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు (17) ఆరునెలల క్రితం ట్యూషన్లో చేరారు. కొన్ని రోజులుగా గాంధీప్రసాద్ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇంటర్ బోర్డులో ఓ ఉన్నతాధికారి తన స్నేహితుడని, మాట వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించసాగాడు. అతడి వేధింపులు భరించలేక విషయాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపారు. శుక్రవారం రాత్రి బాధితుల ఫిర్యాదు మేరకు గాంధీప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఆటలు అదుర్స్..
-
బాలికల హాస్టల్లోకి చొరబడిన పాము
నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి శనివారం ఉదయం పాము చోరబడింది. దాంతో హాస్టల్లోని బాలికలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. పాము చొరబడిందని హాస్టల్ వార్డెన్కు ఫిర్యాదు చేశారు. దాంతో వార్డెన్, హాస్టల్ సిబ్బంది పాము కోసం తీవ్రంగా గాలించారు. అనంతరం హాస్టల్ గదిలో నక్కిన పామును గుర్తించిన వార్డెన్, సిబ్బంది కర్రతో పామును చంపేశారు. దాంతో హాస్టల్లోని బాలికలు ఉపిరి పీల్చుకున్నారు. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై హెచ్ ఎం సస్పెన్షన్
కర్నూలు: లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదోని హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. విద్యార్థినులను తరచు లైంగికంగా వేధిస్తున్నాడంటూ 'సాక్షి' కథనంపై డీఈవో స్పందించారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడ్నివిధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలలో చదువుకోనేందుకు వచ్చిన విద్యార్థినులపై లైంగికంగా వేధిస్తున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. హెచ్ఎమ్ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు ఆరోపించారు. హెచ్ ఎం ప్రవర్తన బాగోలేదంటూ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను సాక్షి టీవీ ప్రసారం చేయడంతో మహిళా సంఘాలు కూడా గళం కలిపాయి. దీంతో ఆ కీచక టీచర్ పై వేటుపడక తప్పలేదు. -
విద్యార్ధినులపై కీచక టీచర్ వెకిలిచెష్టలు
కర్నూలు: విద్యాబుధ్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయిలే దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలో చదువుకోనేందుకు వచ్చిన విద్యార్థినులపై కీచక టీచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కీచక టీచర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోని ఉన్నతపాఠశాలలో చోటుచేసుకుంది. హెచ్ఎమ్ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు కన్నీరు పెట్టుకున్నారు. టీచర్ వేదింపులు తాళ లేక హెచ్ఎమ్పై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హెచ్ఎమ్ను సస్పెండ్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
విశాఖ జిల్లాలో ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం
విశాఖపట్నం: జిల్లాలోని ఎన్ఎడి జంక్షన్లోని చైతన్య కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్లిన వారిద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధినుల ఆచూకి కోసం బంధువులను, స్నేహితులను ఆ విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆరా తీశారు. అయినా వారి ఆచూకి లభించకపోవడంతో చివరికి వారు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్ధినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.