Ravana
-
లవణాసుర సంహారం
కృతయుగంలో లోల అనే దానవ స్త్రీ ఉండేది. ఆమె కొడుకు మధువు. దానవుడే అయినా మధువు ధర్మం తప్పక దేవతలతో మైత్రి కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను ఆదరించేవాడు. ఆపన్నులను ఆదుకునేవాడు. మధువు పరమశివుడి కోసం తపస్సు చేశాడు. పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. తన శూలం నుంచి మరో శూలాన్ని పుట్టించి, వరప్రసాదంగా ఇచ్చాడు. ‘నువ్వు దేవ బ్రాహ్మణులకు అపచారం చేయనంత కాలం ఈ శూలం నీ వద్ద ఉంటుంది. ఇది నీ శత్రువులను నాశనం చేస్తుంది’ చెప్పాడు పరమశివుడు.‘పరమేశ్వరా! ఈ శూలం నా వంశంలో కొనసాగేలా అనుగ్రహించు’ ప్రార్థించాడు మధువు.‘అది కుదరదు. నీ కొడుకు వరకు మాత్రం ఉంటుంది’ అన్నాడు శివుడు.తర్వాత మధువు ఒక సుందర ప్రదేశంలో భవంతిని, దాని చుట్టూ సుందర నగరాన్ని నిర్మించుకున్నాడు. కుంభీనసి అనే దానవకాంతను పెళ్లాడాడు. కొంతకాలానికి వారిద్దరికీ లవణుడు పుట్టాడు.పెరిగి పెద్దయ్యే కొద్ది లవణుడు దుష్టుడిగా తయారయ్యాడు. కొడుకు చేష్టలకు మధువు కలతచెందేవాడు. కొంతకాలానికి మధువు తనకు శివుడు ప్రసాదించిన శూలాన్ని కొడుక్కు అప్పగించి, వరుణ లోకానికి వెళ్లిపోయాడు.తండ్రి నుంచి శివప్రసాదిత శూలం చేజిక్కిన తర్వాత లవణుడి ఆగడాలు మరింతగా శ్రుతిమించాయి. అతడిని ఎదిరించడానికి రాజులందరూ భయపడేవారు. రావణ సంహారం తర్వాత అయోధ్యలో కొలువుదీరిన రాముడి వద్దకు ఒకనాడు కొందరు మునులు, బ్రాహ్మణులు వచ్చి, లవణుడి ఆగడాలను గురించి మొరబెట్టుకున్నారు. ‘రామా! లవణాసురుడు నానాటికీ శ్రుతి మించుతున్నాడు. ఎందరో రాజులను వేడుకున్నాం. వారందరూ అతడిని ఎదిరించడానికి భయపడుతున్నారు. రావణుడిని సంహరించిన నువ్వే మాకు దిక్కు అని నీ వద్దకు వచ్చాం’ అని చెప్పారు.వారి మొర విన్న రాముడు తన తమ్ముళ్లను పిలిచాడు.‘మీలో ఎవరు లవణుడిని సంహరించడానికి వెళతారు?’ అని అడిగాడు.ముందుగా భరతుడు ‘నేను వెళతా’ అంటూ సిద్ధపడ్డాడు. అంతలో శత్రుఘ్నుడు కలగజేసుకుని, ‘అన్నా! నువ్వు అరణ్యవాసం చేసి, అయోధ్యకు తిరిగి వచ్చేంత వరకు భరతుడు నానా కష్టాలు పడ్డాడు. ఇకనైనా భరతుణ్ణి సుఖంగా ఉండనివ్వు. నేను వెళ్లి లవణాసురుణ్ణి చంపి వస్తాను’ అని చెప్పాడు. ‘తమ్ముడా! నువ్వు సర్వసమర్థుడివి. నువ్వా రాక్షసుణ్ణి చంపి, అతడి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించుకో’ అన్నాడు. వెంటనే పురోహితులను పిలిపించి, శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేశాడు. ‘లవణుడి వద్ద శివప్రసాదిత శూలం ఉంటుంది. దానిని అతడు ఇంటివద్ద వదిలి, దూరంగా వెళ్లినప్పుడే అదను చూసి అతణ్ణి చంపాలి’ అని చెప్పి, అనేక దివ్యాస్త్రాలను తమ్ముడికి ఇచ్చాడు.శత్రుఘ్నుడు చతురంగ బలగాలతో బయలుదేరాడు. లవణుడు ఆహారం కోసం బయటకు వెళ్లి, పట్టణానికి తిరిగి వచ్చేసరికి పట్టణ ప్రవేశద్వారం వద్ద శత్రుఘ్నుడు ధనుర్బాణాలు ధరించి నిలిచి ఉన్నాడు. చుట్టూ సైన్యం మోహరించి ఉంది. ‘ఎవడ్రా నువ్వు? ఆయుధాలతో నా పట్టణం ముందు నిలబడ్డావు. నీలాంటి వాళ్లెందరో నాకు ఆహారమైపోయారు. మర్యాదగా అడ్డు తొలగు’అన్నాడు లవణుడు. ‘నేను దశరథ పుత్రుణ్ణి. శ్రీరాముడి తమ్ముణ్ణి. నీతో యుద్ధానికి వచ్చాను’ నిదానంగా బదులిచ్చాడు శత్రుఘ్నుడు.‘అలాగా! నా మేనమామ రావణుణ్ణి చంపినవాడి తమ్ముడివన్నమాట! నీ కోరిక తప్పక తీరుస్తాను. లోపలకు వెళ్లి నా ఆయుధాన్ని తెచ్చుకోనీ’ అన్నాడు. ‘చేతికి చిక్కిన శత్రువును విడిచిపెట్టేంత అమాయకుణ్ణి కాదు. ఇప్పుడే నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను’ అంటూ శత్రుఘ్నుడు ధనుష్టంకారం చేశాడు. చిర్రెత్తిపోయిన లవణుడు పక్కనే ఉన్న భారీ చెట్టునొకటి పెరికి, శత్రుఘ్నుడి మీదకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం మొదలైంది. చెట్లతో లవణుడు, బాణాలతో శత్రుఘ్నుడు హోరాహోరీగా పోరాడారు. పరస్పరం గాయపరచుకున్నారు. లవణుడు విసిరిన భారీ చెట్టు శత్రుఘ్నుడి తలను తాకడంతో అతడు స్పృహ తప్పాడు.శత్రుఘ్నుడు మరణించాడని తలచిన లవణుడు తన శూలం కోసం ఇంటికి పోకుండా, అక్కడే ఉండి తెచ్చుకున్న ఆహారం తినడం ప్రారంభించాడు.ఈలోగా స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు తనకు రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, లవణుడి మీదకు వదిలాడు. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకొచ్చిన ఆ దివ్యాస్త్రం లవణుడి గుండెల్లోంచి దూసుకుపోయి, పాతాళానికి వెళ్లి తిరిగి వచ్చి శత్రుఘ్నుడి అమ్ముల పొదిలోకి చేరింది. లవణుడు హాహాకారాలు చేస్తూ మరణించాడు. -
వాలి చేతిలో రావణుడి పరాజయం
వరగర్వంతో కయ్యానికి కాలుదువ్వి, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓటమి పాలైనా, రావణుడికి బుద్ధి రాలేదు. పులస్త్యుడి వల్ల కార్తవీర్యార్జునుడి చేతి నుంచి బతికి బయటపడ్డాడు గాని, లేకుంటే అతడి చేతిలోనే అంతమైపోయేవాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో జరిగిన పరాభవాన్ని రావణుడు త్వరలోనే మరచిపోయాడు. ముల్లోకాలలో బలవంతులుగా పేరుమోసిన వారందరినీ జయించాలన్న కండూతి అతడికింకా పోలేదు. కిష్కింధ పాలకుడైన వాలి మహాబలవంతుడని రావణుడు తన మంత్రుల ద్వారా విన్నాడు. ఎలాగైనా, వాలితో యుద్ధం చేసి, అతణ్ణి గెలవడం ద్వారా లోకానికి తన బలం చాటాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పుష్పకాన్ని అధిరోహించి, కిష్కింధకు వెళ్లాడు.రావణుడు కిష్కింధకు వెళ్లేసరికి వాలి నగరంలో లేడు. వాలి సభా మందిరంలో అతడి మంత్రి తారకుడు, మామ సుషేణుడు, యువరాజైన వాలి తమ్ముడు సుగ్రీవుడు, ఇతర వానర యోధులు ఉన్నారు. ‘నేను లంకాధిపతిని. నన్ను రావణుడంటారు. వాలి ఎక్కడ? నేను వాలితో యుద్ధం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘రావణా! మా రాజు వాలి ఇప్పుడు నగరంలో లేడు. అతడు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో నాలుగు సముద్రాలలో స్నానం చేసి, సంధ్యావందనం పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. నువ్వు అప్పటి వరకు వేచి ఉండవచ్చు. అయినా, వాలితో యుద్ధం నీకు క్షేమం కాదు. అదిగో ఆ అస్థిపంజరాల గుట్టలు చూడు. వాలితో యుద్ధానికి వచ్చి, అతడి చేతిలో హతమైపోయిన అభాగ్యులవే అవన్నీ. కాదూ కూడదూ ఇప్పటికిప్పుడే అతడి వద్దకు వెళ్లాలనుకుంటే, ఈ వేళకు అతడు దక్షిణ సముద్రంలో స్నానం చేస్తూ ఉంటాడు. నువ్వు నిరభ్యంతరంగా అక్కడకు వెళ్లవచ్చు’ అన్నాడు తారకుడు.రావణుడు పుష్పకవిమానంలో దక్షిణ సముద్రానికి వెళ్లాడు. ఆ సమయానికి వాలి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు.వాలిని వెనుక నుంచి ఒడిసి పట్టుకుందామనే ఉద్దేశంతో రావణుడు అతడి వైపు నడిచాడు. ఓరకంటితో వాలి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రావణుడు దగ్గరకు రాగానే, హఠాత్తుగా అతడి మెడను చంకలో ఒడిసి పట్టుకుని, ఆకాశంలోకి పైకెగిరాడు. వాలి చర్యకు రావణుడు దిగ్భ్రాంతి చెందాడు. అతడి పట్టును విడిపించుకోవడానికి గోళ్లతో రక్కాడు. దంతాలతో కొరికాడు. అయినా, వాలి లెక్క చేయకుండా ఎగురుతూ పోయి, తూర్పు సముద్రంలో మునిగి స్నానం చేశాడు. నిష్ఠగా సంధ్యావందనం చేశాడు. ఇన్ని చేస్తూనే రావణుడి మెడ మీద నుంచి తన పట్టును ఏమాత్రం సడలించలేదు. రావణుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హాహాకారాలు చేశాడు.వాలి అతడి హాహాకారాలను ఏమాత్రం పట్టించుకోకుండా, అక్కడి నుంచి రావణుడిని పట్టుకుని ఆకాశమార్గంలో ఎగురుతూ ఉత్తర సముద్రం వద్దకు వెళ్లాడు. సముద్రంలో తనతో పాటు రావణుడిని కూడా ముంచుతూ తేల్చుతూ స్నానం చేశాడు. అక్కడ యథావిధిగా సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. వాలి చేష్టలకు రావణుడికి శక్తులన్నీ ఉడిగిపోయి, భయం పట్టుకుంది.వాలి అక్కడి నుంచి పైకెగిరి కిష్కింధ వైపు ప్రయాణం ప్రారంభించాడు. కిష్కింధ నగరం వెలుపల ఉపవనంలో రావణుడిని విసిరేశాడు. రావణుడు పొదల మధ్య పడ్డాడు. ఈ దెబ్బకు రావణుడికి కళ్లు బైర్లు కమ్మాయి.రావణుడిని చూసి, వాలి వినోదంగా నవ్వాడు.‘చూడటానికి మహారాజులా ఉన్నారు? ఇంతకీ తమరెవరు? ఎక్కడి నుంచి తమరి రాక? ఏ పని మీద వచ్చారు?’ అని వేళాకోళంగా ప్రశ్నించాడు.కొద్ది క్షణాలకు రావణుడు తేరుకున్నాడు. నెమ్మదిగా గొంతు పెగల్చుకుని, ‘వానరేశ్వరా! నన్ను రావణుడంటారు. నేను లంకాధిపతిని. దేవతలను జయించినవాణ్ణి. అయితే, నీ శక్తి అమోఘం, అద్భుతం, అద్వితీయం. గమన వేగంలో నువ్వు గరుడుడిని, వాయువును మించిపోయావు. నన్ను ఏకంగా చంకలో ఇరికించుకుని, మూడు సముద్రాల్లో ముంచి తేల్చావు. బుద్ధి గడ్డితిని నీతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నీ శక్తిని చూశాక నేను నా ఆలోచనను విరమించుకుంటున్నాను. నీ అంతటి వీరుణ్ణి నేను ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. ఈ క్షణం నుంచి మనిద్దరం స్నేహితులుగా బతుకుదాం’ అన్నాడు.రావణుడి కోరికను వాలి సమ్మతించాడు. అతడిని స్నేహితుడిగా అంగీకరించాడు. తనతో పాటు కిష్కింధ నగరానికి తీసుకుపోయి, ఘనంగా ఆతిథ్యం ఇచ్చాడు.వాలికి అతిథిగా రావణుడు కిష్కింధలో కొన్నాళ్లు గడిపి, వాలి వద్ద సెలవు తీసుకుని లంకకు తిరిగి వెళ్లిపోయాడు. -
రావణుడి పరాజయం
కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉండేవి. అందువల్ల అతడు సహస్రబాహు అర్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. పదితలలు గల రావణుడు దశకంఠుడని ప్రసిద్ధి పొందాడు. అప్పటికే దేవతలను జయించిన విజయగర్వంతో ఉన్న రావణుడు కార్తవీర్యార్జునుణ్ణి జయించాలని తలచి, సైన్యాన్ని వెంటబెట్టుకుని, కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మహిష్మతీపురానికి బయలుదేరాడు.మహిష్మతీ నగరానికి చేరువలో, నర్మదా నది ఒడ్డున రావణుడి సైన్యం విడిది చేసింది. ఎదుట నర్మదా నది కనిపించడంతో నదీస్నానం చేసి, శివార్చన చేయడానికి రావణుడు సమాయత్తమయ్యాడు. నది ఒడ్డున ఇసుకలో బంగారు శివలింగాన్ని ఉంచి, స్తోత్రాలు పాడుతూ, నర్తిస్తూ శివార్చన చేయసాగాడు. ఇంతలో నర్మదా నది ఉప్పొంగి, నదీజలాలు ఎదుటికి ప్రవహించసాగాయి. నెమ్మదిగా శివలింగాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. ఈ పరిణామానికి రావణుడు చకితుడయ్యాడు.‘వానా వరదా లేకున్నా, నది ఉప్పొంగి నీరు ఎందుకు ఎదుటికి ప్రవహిస్తోంది? నదిలో ఏం జరుగుతోంది? చూసి, తెలుసుకుని రండి’ అంటూ రావణుడు తన భటులను పంపాడు.నదిలో కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలసి జలక్రీడలాడుతున్నాడు. అతడు తన వెయ్యి చేతులతో నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో నది ఉప్పొంగి ఎదుటికి ప్రవహిస్తోంది. రావణుడి అనుచరులు ఈ దృశ్యాన్ని చూసి, రావణుడికి చెప్పారు.రావణుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని, నర్మదా నది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ కాపలాగా కార్తవీర్యార్జునుడి మంత్రులు కనిపించారు. ‘రణరంగ శూరుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుకు చెప్పండి’ అని వాళ్లతో అన్నాడు.‘యుద్ధానికి మంచి సమయాన్నే ఎంచుకున్నావే! రాజు జలక్రీడలాడుతుండగా, ఎవరైనా యుద్ధానికి పిలుస్తారా? నీ చేతులకు అంత తీటగా ఉంటే, రేపు యుద్ధానికి వచ్చి నీ ప్రతాపం చూపించు. ప్రస్తుతానికి దయచెయ్యి’ అని వాళ్లు ఎకసెక్కంగా బదులిచ్చారు.‘ధైర్యం ఉంటే మీ రాజును ఇప్పటికిప్పుడే యుద్ధానికి రమ్మనండి. లేకపోతే, పారిపోవడానికే రేపటి వరకు గడువు కోరుతున్నారనుకుంటా’ అన్నాడు.వీడు మరీ మొండిఘటంలా ఉన్నాడనుకున్న మంత్రులు, కార్యవీర్యార్జునుడికి రావణుడు యుద్ధానికి వచ్చిన సంగతి చెప్పారు. ఇప్పటికిప్పుడే యుద్ధం కావాలని మొండికేస్తున్నాడని కూడా చెప్పారు.కార్తవీర్యార్జునుడు జలక్రీడలను చాలించి, వెనువెంటనే యుద్ధానికి సమాయత్తమయ్యాడు. భయపడవద్దని భార్యలకు చెప్పి, యుద్ధానికి బయలుదేరాడు. తన ఐదువందల చేతులతో వివిధ ఆయుధాలను ధరించాడు. మిగిలిన ఐదువందల చేతులతో ఒక భారీ గదను పైకెత్తుకుని, దానిని గిరగిరా తిప్పుతూ రణరంగంలోకి అడుగుపెట్టాడు. రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు అతడికి ఎదురు వెళ్లి, ఒక ముసలాన్ని విసిరాడు. కార్తవీర్యార్జునుడు తన గదతో ఆ ముసలాన్ని గాల్లో ఉండగానే తుక్కుకింద ముక్కలు చేసి, గదతో చాచిపెట్టి ప్రహస్తుణ్ణి కొట్టాడు. ప్రహస్తుడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. ఇది చూసి పక్కనే ఉన్న రావణుడి మంత్రులు మారీచ సుబాహ ధూమ్రాక్షులు కాలికి బుద్ధి చెప్పి, వెనక్కు పరుగు తీశారు.ప్రహస్తుడు పడిపోవడం, మంత్రులు పలాయనం చిత్తగించడం గమనించిన రావణుడు తానే నేరుగా కార్తవీర్యార్జునుడి ఎదుటికి వచ్చాడు. ఒక భారీ గద పట్టుకుని అతడితో తలపడ్డాడు. ఇద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు. ఇద్దరిలోనూ ఒక్కరూ వెనక్కు తగ్గలేదు. గదాఘాతాలతో ఇద్దరి ఒళ్లూ రక్తసిక్తంగా మారినా, కొండల్లా చలించకుండా నిలిచి గంటల తరబడి పోరాటం సాగించారు. వాళ్ల గదా ఘాతాల ధ్వనులకు, వారి పదఘట్టనలకు చుట్టుపక్కల భూమి కంపించసాగింది. కార్తవీర్యార్జునుడు అదను చూసుకుని, రావణుడి ఛాతీపై గదతో బలంగా మోదాడు. ఆ దెబ్బకు రావణుడి గద చేతి నుంచి జారిపోయింది. రావణుడు నేల కూలిపోయాడు. కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తాళ్లతో కట్టేసి, బందీగా తన నగరానికి తీసుకుపోయాడు.రావణుడు బందీగా పట్టుబడిపోవడంతో ధైర్యం సడలిన అతడి మంత్రులు, సేనానులు, సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. వారు నేరుగా రావణుడి తాత పులస్త్యబ్రహ్మ వద్దకు వెళ్లి విషయం చెప్పారు.పులస్త్యుడు మహిష్మతీ నగరానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఎదురేగి పులస్త్యుడికి ఘనస్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి సత్కారాలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. తన మనవడైన రావణుడికి బుద్ధి చెప్పినందుకు కార్తవీర్యార్జునుణ్ణి మెచ్చుకున్నాడు పులస్త్యుడు. ‘నీ దెబ్బకు నా మనవడి గర్వం అడుగంటింది. ఇక వాడిని విడిచిపెట్టు’ అని కోరాడు. పులస్త్యుడి మీద గౌరవంతో కార్తవీర్యార్జునుడు రావణుడిని చెర నుంచి విడుదల చేశాడు. పులస్త్యుడు అక్కడికక్కడే అగ్నిసాక్షిగా వారిద్దరి మధ్య సంధి చేశాడు.∙సాంఖ్యాయన -
యమ రావణ యుద్ధం
రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది. ‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు. బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
అగస్త్యుడి చేతిలో రావణుడి ఓటమి
మేరు పర్వతంతో స్పర్థకు పోయిన వింధ్య పర్వతం ఆకాశాన్ని కమ్మేస్తూ పెరిగిపోవడంతో గ్రహగతులు తప్పి, ముల్లోకాల్లోనూ కల్లోలం ఏర్పడింది. దేవతలందరూ ప్రార్థించడంతో అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్య పర్వతం వైపుగా దక్షిణదేశ యాత్రకు బయలుదేరాడు. అగస్త్యుడు భార్యా సమేతంగా తనవైపు వస్తుండటంతో వింధ్యుడు ఆయన ముందు మోకరిల్లాడు. తాను దక్షిణదేశ యాత్రలకు వెళుతున్నానని, తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యుణ్ణి ఆదేశించాడు. అలా వింధ్యుడిని అణచిన అగస్త్యుడు దక్షిణ భారత దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాడు. తీర్థయాత్రలు ముగిశాక ఆయన కావేరీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యా సమేతంగా తపోజీవనం గడపసాగాడు.దక్షిణ భారత దేశానికి ఆవల సముద్రం నడిబొడ్డున ఉన్న లంకను అప్పట్లో రావణుడు పరిపాలించేవాడు. తన అన్న కుబేరుడిని అలకాపురి వరకు తరిమికొట్టి, అప్పటి వరకు అతడు పాలించిన లంకను, అతడి పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రావణుడు దేవతలను జయించాడు. అష్ట దిక్పాలకులను తన ఆజ్ఞలకు లోబడేలా చేసుకున్నాడు. నవగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయితే, లంకకు చేరువలో ఉన్న దక్షిణ భారతదేశం మాత్రం అతడికి స్వాధీనం కాలేదు. ఆ ప్రాంతాన్ని కూడా ఎలాగైనా తన వశంలోకి తెచ్చుకోవాలని తలచాడు.దక్షిణ భారతదేశంలో పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుని రావాలని ముందుగా కొందరు దూతలను, వేగులను పంపాడు. వారు దక్షిణ భారతదేశం నలుమూలలా సంచరించారు. కొండలు, కోనలు, అడవులతో పచ్చని ప్రకృతి సౌందర్యంతో అలరారే దక్షిణ భారతదేశం అత్యంత ప్రశాంతంగా కనిపించింది. అడవుల్లో అక్కడక్కడా చక్కని పొదరిళ్లలాంటి రుషి ఆశ్రమాలు కనిపించాయి. వారు తిరిగి లంకకు చేరుకుని, తాము చూసిన పరిస్థితులను రావణుడికి వివరించారు.అంత ప్రశాంతంగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తేలిక పనేనని అనుకున్నాడు. తాను కూడా ఒకసారి స్వయంగా పరిస్థితులను చూసి, అవసరమైనట్లయితే యుద్ధానికి తగిన ఏర్పాట్లతో తిరిగి వచ్చి, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు.కొద్దిమంది అనచరులతో కలసి రావణుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కావేరీ తీరం మీదుగా సంచరిస్తూ, అగస్త్యుడి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమం ఆవరణలోనే అగస్త్యుడు కూర్చుని ఉండటం చూసి, రావణుడు ‘మునీశ్వరా! ప్రణామాలు’ అంటూ నమస్కరించాడు.అగస్త్యుడు సాదరంగా స్వాగతం పలుకుతూ, ‘రావయ్యా లంకేశ్వరా! రా! లోపలికి పద’ అంటూ ఆశ్రమం లోనికి తీసుకుపోయి, ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘ఏం పని మీద ఇక్కడకు వచ్చావు?’ అని నేరుగా అడిగాడు అగస్త్యుడు.‘మునీశ్వరా! ఇప్పటికే నేను స్వర్గాన్ని కూడా నా అధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రాంతం మాత్రం ఇంకా నా స్వాధీనంలో లేదు. దీనిని కూడా నా స్వాధీనంలోకి తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అని అసలు విషయాన్ని చెప్పేశాడు రావణుడు.‘అది సరే, నువ్వు రుద్రవీణ గొప్పగా వాయిస్తావుటగా! నువ్వు నాతో రుద్రవీణ వాయించి జయించావనుకో, నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు అగస్త్యుడు.‘సరే, మునీశ్వరా!’ అంటూ అగస్త్యుడితో వీణా వాదన పోటీకి సిద్ధపడ్డాడు రావణుడు.అగస్త్యుడితో రావణుడు వీణా వాదన పోటీకి సిద్ధపడిన వార్త ముల్లోకాలకూ పాకింది. వారి పోటీని తిలకించడానికి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ తరలి వచ్చారు. ఇద్దరికీ పోటీ ప్రారంభమైంది. మొదట మంద్రగతిలో ప్రారంభించారు. మధ్యమంలోకి వెళ్లాక పోటా పోటీగా అపురూపమైన రాగాలను పలికించారు. తారస్థాయిలో రావణుడు అగస్త్యుడి ధాటిని, వేగాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడసాగాడు. అగస్త్యుడి వీణా వాదనకు చుట్టుపక్కల కొండలు నీరై ప్రవహించసాగాయి. వీణ వాయించడంలో అగస్త్యుడి నైపుణ్యానికి రావణుడు నిరుత్తరుడయ్యాడు. మారు మాట్లాడకుండా ఓటమిని అంగీకరించాడు.‘మహర్షీ! నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరు సంచరిస్తున్న ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించను’ అని చెప్పి లంకకు వెనుదిరిగాడు.∙సాంఖ్యాయన -
దహనానికి ముందే కుప్పకూలిన రావణుడు
కోటా: రాజస్థాన్లోని కోటాలో జరిగే దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. కోటా నగరంలోని దసరా మైదానం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. అయితే ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 65 అడుగుల ఎత్తయిన రావణాసురిని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ, అది దహనం చేయడానికి ముందే నిట్టనిలువునా కూలిపోయింది. రావణాసురిని దిష్టిబొమ్మను నిలబెట్టేందుకు ఉపయోగించిన బెల్టు తెగిపోవడంతో ఒక్కసారిగా రావణాసురుని బొమ్మ కూలిపోయింది. దాదాపు నెల రోజుల పాటు శ్రమించి రావణుని దిష్టిబొమ్మను దహనం కోసం సిద్ధం చేశారు.క్రేన్ సాయంతో ఆ రావణాసురుని బొమ్మను నిలబెడుతుండగా ఒక్కసారిగా శబ్ధం చేసుకుంటూ అది కిందపడిపోయింది. రావణాసురుని దిష్టిబొమ్మ పడిపోయిన నేపధ్యంలో దాని వెనుక భాగం దెబ్బతింది. దీంతో దిష్టిబొమ్మకు మరమ్మతులు చేసి, దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం ఖురేషి మాట్లాడుతూ రావణుని దిష్టిబొమ్మను ఢిల్లీ నుంచి వచ్చిన కళాకారులు రూపొందించారని తెలిపారు. కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను ఇప్పటికే మైదానంలో నిలబెట్టారు. రావణుని దిష్టిబొమ్మను నిలబెట్టే సమయంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఖురేషి తెలిపారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
ఖాన్లు చేస్తున్న రావణ బొమ్మ
ఉత్తరప్రదేశ్ రాంపూర్లోని ఒక ముస్లిం కుటుంబానికి దసరా వస్తుందంటే చాలు... చేతి నిండా పని ఉంటుంది. తరతరాలుగా ఈ కుటుంబం దసరాకు రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారు చేస్తోంది. ఈ ఏడాది ప్రత్యేకత విషయానికి వస్తే 80 అడుగుల ఎత్తులో రావణాసురుడి దిష్టి బొమ్మను తయారుచేశారు.‘తాతముత్తాతల కాలం నుంచి ఈ పనిలో ఉన్నాం. మా తాత చేసిన పనిని మా నాన్న చేశాడు. నాన్న చేసిన పనిని నేను చేస్తున్నాను. నేను చేసిన పనిని పిల్లలు చేస్తున్నారు. ఈ పనివల్ల పెద్దగా డబ్బు సం΄ాదించక΄ోయినా మా తాతలు చేసిన పనిని మేము కొనసాగించడం సంతృప్తిగా, సంతోషంగా ఉంది’ అంటున్నాడు ముంతాజ్ ఖాన్.ఖాన్ కుటుంబం తయారు చేసిన దిష్టి బొమ్మల కోసం మొరాదాబాద్, ఫతేపూర్, హపూర్...లాంటి ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ సంవత్సరం హరియాణా, పంజాబ్ల నుంచి కూడా దిష్టిబొమ్మల కోసం ఆర్డర్లు వస్తున్నాయి‘దిష్టిబొమ్మల తయారీలో మేము ఉపయోగించే గన్ ΄ûడర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలుష్య రహితంగా ఉంటుంది. పెద్ద అధికారులు ఈ దిష్టిబొమ్మలను తనిఖీ చేసిన తరువాతే విక్రయిస్తాం’ అంటున్నాడు ఖాన్.రావణుడి దిష్టి బొమ్మలను తయారు చేయడం అనేది ఒక ముస్లిం కుటుంబం చేసే పని అనుకోవడం కంటే మన దేశంలో మతసామరస్యానికి ఉదాహరణ అని సగర్వంగా చెప్పుకునే పని. -
దసరాకు ఆ పేరు ఎలా వచ్చింది?
దసరా పండగకు కొత్త బట్టలు కొనుక్కోవడం, అమ్మ చేసిన రకరకాల పిండివంటలు తినడం, సెలవలకు ఊళ్లకెళ్లడం అందరికీ తెలుసు. అయితే అంతకన్నా ముందు అసలు దసరా పండగకు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా... అక్కడికే వద్దాం... దశ అహః అంటే పది రోజులు అని అర్థం. దశ అహః అనే పదమే దశహర అయింది. దశహర, పది రోజులు అనే పదం కాలక్రమంలో ‘దసరా’ గా మారింది. దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది.దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు దసరా అంటే దక్షిణాదిన అమ్మవారి పూజకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఉత్తరాదిన రాముని లీలలను గానం చేసేందుకు అంతే ఉత్సాహం చూపుతారు. వారి దృష్టిలో దసరా అంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు మాత్రమే కాదు, రాముడు, రావణుని చంపిన రోజు కూడా. అందుకే ఈ పది రోజుల పాటు అక్కడ రామాయణంలో ఘట్టాలను వర్ణిస్తూ.. చివరి రోజున ‘రావణ దహన్’ పేరుతో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏటా ఈ వేడుకలు అట్టహాసంగా సాగుతాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది భక్తులతో పాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తారు.సమయం, వ్యక్తిగత కారణాల రీత్యా కొంత మందికి రామ్లీలా మైదానంలో జరిగే వేడుకలను వీక్షించడం కుదరదు. చాలా మందికి ఈ వేడుకల విశిష్టత కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ రెలీజియస్ యాప్ ‘హౌస్ ఆఫ్ గాడ్’ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రామ్లీలా మైదానంలో వేడుకలను ఈ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందించనుంది. -
ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!
శ్రీలంకలో హిందూమహాసముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది ఈ జలపాతం. దట్టమైన అడవుల మధ్యలో ప్రవహించిన నీటిపాయలు వంద అడుగుల కిందనున్న భూభాగం మీదకు అలవోకగా జారిపడుతూ ఉంటుంది. శ్రీలంక పర్యాటక ప్రాధాన్యం గల దేశం కావడంతో ప్రతి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకులకు అనువుగా మలుచుకుంటుంది. పర్యాటకులు జలపాతాన్ని వీక్షించడానికి, జలపాతం బ్యాక్డ్రాప్లో ఫొటో తీసుకోవడానికి వీలుగా వాటర్ఫాల్స్ దగ్గర చక్కటి ప్లాట్పామ్ ఉంది. రావణుడి గుహలు రావణ్ జలపాతం... ఎల్లా అనే చిన్న పట్టణానికి దగ్గరగా, ఎల్లా రైల్వేస్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాంతో ఈ జలపాతానికి రావణ్ ఎల్లా అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ జలపాతం వెనుకవైపు గుహలున్నాయి. రావణాసురుడు... సీతాదేవిని అపహరించిన తర్వాత కొంతకాలం ఈ గుహల్లో దాచి ఉంచాడని, అందుకే ఈ గుహలకు రావణుడి గుహలనే పేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి నాలుగున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడానికి వెడల్పాటి మెట్లు, మెట్ల మధ్యలో రెయిలింగ్ వంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ గుహలకు ఏడు కిలోమీటర్ల దూరాన బందరవేలా గుహలున్నాయి. పాతిక వేల ఏళ్ల కిందట ఆ గుహల్లో మనుషులు జీవించినట్లు ఆధారాలు దొరికాయి. ట్రెకింగ్ ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ప్రదేశాల కోసం రెండు రోజులు ఉండేటట్లు టూర్ ప్లాన్ వేసుకోవాలి. జ్ఞాపికలే పెద్ద వ్యాపారం శ్రీలంకలో ప్రతి టూరిస్ట్ పాయింట్ దగ్గర సావనీర్ షాప్లుంటాయి. చిన్నదో పెద్దదో కనీసం ఒక్క స్టాల్ అయినా ఉంటుంది. డిజైనర్ దుస్తుల నుంచి శ్రీలంక గుర్తుగా తెచ్చుకోవడానికి జ్ఞాపికలు కూడా ఉంటాయి. పర్యాటకులు తమ టూర్ గుర్తుగా దాచుకోవడానికి, అలాగే స్నేహితులు, బంధువుల కోసం కూడా సావనీర్లను ఎక్కువగా కొంటారు. ప్రైస్ ట్యాగ్ చూడగానే భయం వేస్తుంది. కానీ శ్రీలంక రూపాయలను మన రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు ధరలు మరీ ప్రియం అనిపించవు. మరో సౌకర్యం ఏమిటంటే షాపుల్లో మన కరెన్సీ కూడా తీసుకుంటారు. దుస్తుల విషయానికి వస్తే... ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్ల వంటి మోడరన్ దుస్తులు బాగుంటాయి. కానీ కొలతలు భారతీయులకు అమరవు. పాశ్చాత్యుల పొడవుకు తగినట్లుంటాయి. శ్రీలంక వాసులు కూడా పొడవుగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వారికీ చక్కగా అమరుతాయి. ఇక మనం అక్కడ కొనుక్కోగలిగిన దుస్తులు చీరలు, శాలువాలు, పిల్లలకు టీ షర్ట్లే. ఉన్ని శాలువాలు మంచి నేత పనితనంతో అందంగా ఉంటాయి. ఏనుగు బొమ్మలు ముద్రించిన టీ షర్ట్లుంటాయి. మక్కబుట్టకు ఉప్పుకారం చిరుతిండ్లు అమ్మే వాళ్లయితే మన ముఖాలు చూసి భారతీయులను గుర్తు పట్టేస్తారు. పాశ్చాత్యులు ఇష్టపడే రుచులు, భారతీయుల ఇష్టాలను గ్రహించి వ్యాపారం చేస్తారు. మనం మొక్క జొన్న కండెకు ఉప్పు, కారం పట్టించి తింటామని వాళ్లకు తెలుసు. మనల్ని చూడగానే ‘ఇండియన్స్’ అంటూ మసాలా రాయమంటారా అని అడుగుతారు. తమిళులు– సింహళీయులకు మధ్య పోరు గురించి తెలిసిన వారిగా మనకు కొంత జంకు, భారతీయులను స్వాగతిస్తారో లేదోననే భయం ఉంటుంది. కానీ, శ్రీలంక వాళ్లు భారతీయులను ఆత్మీయంగా చూస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!) -
జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్!
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోవాలోని కోల్వాలే సెంట్రల్ జైలుకు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. జైలు ఖైదీలు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపధ్యంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రకాంత్ హరిజన్, జైలర్లు మహేష్ ఫడ్తే, అనిల్ గాంకర్, అసిస్టెంట్ జైలర్ రామ్నాథ్ గౌడ్లను సస్పెండ్ చేస్తూ, జైలు ఇన్స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దసరా సందర్భంగా ఖైదీలు టపాకులు కాల్చి, రావణుని బొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఖైదీలు దిష్టిబొమ్మను ఎలా దహనం చేశారనే దానిపై జైలు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. జైలు ఆవరణలో మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే దానిపై కూడా విచారణ జరగనుంది. ఈ ఘటన జైలు భద్రతపై అనుమానాలను లేవదీస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటనకు జైలు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా పరిగణించారని, అందుకే వారిని సస్పెండ్ చేశారని ఒక పోలీసుల అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్పీ నేత! -
రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి?
దసరా రోజున రావణ దహనం చేస్తారు. ఇది మనలోని చెడును కాల్చివేయాలనే సందేశాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు మనం రావణ దహనం గురించి కాకుండా రావణుని వైభోగం గురించి తెలుసుకోబోతున్నాం. రావణుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడో? అతని రాజభవనం ఎంత విలాసవంతమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం. నేడు శ్రీలంకలో కనిపించే ‘సిగిరియా’ ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు. రావణునికి ఇక్కడ ఒక పెద్ద రాతిపై ఒక రాజభవనం ఉందని, అక్కడ అతను సురక్షితంగా నివసించాడని స్థానికులు చెబుతారు. ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేక విమానాశ్రయం ఉందని, అక్కడ నుండే రావణుని పుష్పక విమానం ఎగురేదని చెబుతారు. ఆనాటి కాలానికి అనుగుణంగా రావణుడి రాజభవనం పలు ఆధునిక సౌకర్యాలతో ఉండేది. రావణుని రాజభవనానికి లిఫ్ట్ సౌకర్యం ఉందని, నీటి నిర్వహణకు ఆధునిక వ్యవస్థ కూడా ఉండేదని చెబుతారు. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకలోని సిగిరియా రాతిపై పురాతన ప్యాలెస్ అవశేషాలు కనిపించాయి. ఇక్కడి రాగైలా అడవుల్లో రావణుని మృతదేహాన్ని దాదాపు 8 వేల అడుగుల ఎత్తులో ఉంచినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. దానిని మమ్మీ రూపంలో ఉంచారని చెబుతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. శ్రీలంకలో రావణుని ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
బౌద్ధాన్ని కలిపేసుకున్నారు!
బౌద్ధం బలంగా ఉన్న దేశాలలో రాముణ్ణి, రావణుణ్ణి ఇప్పటికీ బౌద్ధులు గానే పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా అక్కడ ప్రచారంలో ఉన్న సాహిత్య ప్రభావం అక్కడి ప్రజల మీద ఉంది. ఇతర దేశాలలో మనువాదుల ప్రభావం లేదు కాబట్టి, మార్పులకు లోను కాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి. బౌద్ధుల ‘వైఫల్య సూత్రా’లలో ‘లంకావతార’ అనే ఒక పేరు తటస్థ పడుతుంది. అందులో బుద్ధుడు బౌద్ధ రాజు రావణుడికి ఉపదేశం ఇస్తాడు. అలాగే ‘దశరథ’ జాతక కథ అనేది మరొకటి ఉంది. ఈ రెండు కథలను జోడించి, సీతాపహరణం రావణుడితో చేయించి బ్రాహ్మణ వాదులు ఒక కొత్త కథకు రూపకల్పన చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో బుద్ధ ఘోషుడు ఈ సీతాపహరణాన్ని తన రచనలో వ్యతిరేకించాడని కూడా చెబు తారు. విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు, బలి, వరుణుడు వంటి పేర్లన్నీ ఇప్పటికీ బ్రాహ్మణ సమా జంలో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ పదాలు ఎక్క డివి? అని ప్రశ్నించుకుంటే – ఇవన్నీ పాలి, ప్రాకృత భాషల సమ్మేళనంతో మహా యానంలో ఏర్పడ్డవి. సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకోని సమ యంలో బ్రాహ్మణవాదులు పాలి, ప్రాకృత భాషా పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషలోకి స్వీకరించి వ్యవహా రంలోకి తెచ్చారు. అందువల్ల, సంస్కృతం – బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతం (బీహెచ్ఎస్)గా నిలిచిపోయింది. దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు, బ్రాహ్మణా ర్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రిడ్ సంస్కృత భాషలో అమోఘంగా తిరగరాసుకున్నారు. పాలి, ప్రాకృతాలు ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడిందే సంస్కృతమని భారతీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. తమ పొట్ట కూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంత మంది దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు. మహాయాన్ ‘వైపుల్య సుత్తం’లో భగవాన్ బుద్ధుడికి అనేకానేక పేర్లున్నాయి. ‘లలిత్ విస్తార్’ అనే గ్రంథంలో బుద్ధుడికి ఒక పెద్ద పేర్ల పట్టికే ఉంది. అలాగే, ‘మహా వస్తు’ అనే గ్రంథంలో పేర్ల జాబితా మరింత పెరిగి వంద దాటింది. ఎలాగైతే ఒక వస్తువుకు ఉన్న ఆకృతి, ఉపయో గాలను బట్టి, వేరు వేరు పేర్లతో పిలవబడుతుందో... అలాగే, బుద్ధుడి అనుయాయులు ఆయనను అనేక పేర్లతో పిలుచుకున్నారు. ‘లంకావతార్’ సూత్రంలో కొందరు ఆయనను ‘తథాగతుడు’ అని పిలిస్తే, మరికొందరు ‘స్వయంభూ నాయక్’ అనీ, ‘వినాయక్’ అనీ, ‘పరిణా యక్’ అనీ, బుద్ధుడు, రుషీ, వృషమ్, బ్రాహ్మణ, విష్ణు, ఈశ్వర్, ప్రథాన కపిల్, భూతాంత్, రామ్, వ్యాస్, శుక్ర్, ఇంద్ర్, బలి, వరుణ వంటి అనేక పేర్లతో పిలుచుకునే వారు. అనిరోధానుప్పాదం, శూన్యత, సత్యం, ధర్మధాతు, నిర్వాణ్ – అని కూడా అన్నారు. బుద్ధుణ్ణి దశావతారాలలో తొమ్మిదో అవతారంగా చేర్చుకుని, ఆయన గురించి వాస్తవాలు దాచేసి, బ్రాహ్మణా ర్యులు అబద్ధాలు ప్రచారం చేశారు. బుద్ధుడు ఇల్లువిడిచి వెళ్లి చెట్టుకింద ధ్యానముద్రలో ఉండగా ‘నాగ ముచిళిందు’డనే నాగుపాము వచ్చి, పడగ విప్పి ఆయనకు నీడ నిచ్చింది వంటి కల్పనలు ప్రచారం చేశారు. నాగుపాము అనేది కల్పన. అక్కడ వాస్తవమేమంటే, నాగజాతి ఆదివా సులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆయన వెన్నంటే రక్షణగా ఉండేవారు. బుద్ధావతారానికి ముందున్న ఎనిమిది అవతారాలలో అభూత కల్పనలున్నట్టే, బుద్ధుడి నిజ జీవితాన్ని కూడా కల్పనలతో నింపేశారు. బుద్ధుడు ఒక చారిత్రక పురుషుడు. ఈ నేల మీద వాస్తవంగా తిరిగిన ఒక మహానుభావుడు. ఇది చాలా సున్నితమైన అంశం. అర్థం చేసుకోవడానికి అవగాహన కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. వైదిక ధర్మాన్ని విశ్వసించే మునులు, రుషులు చేసే తపస్సుకూ, బుద్ధుడు చేసిన ధ్యానానికీ చాలా తేడా ఉంది. వైదికులు చేసే తపస్సు దైవాన్ని తలపోస్తూ చేసేది. దైవాన్ని విశ్వసించని బుద్ధుడు చేసింది తనలోకి తాను చేసిన ప్రయాణం! సమాజ హితం కోరి చేసిన తీవ్రమైన ఆలోచన. మనిషి జీవితంలో నైతికత ప్రాధాన్యత గురించిన అంతర్మథనం. ఈ లోకంలోని దుఃఖాన్ని పోగొట్టడమెలాగా? అని తీవ్రంగా మథనపడటం. జాగ్రత్తగా అవలోకిస్తేగానీ,రెండు ధర్మాల మధ్య తేడా ఏమిటో బోధపడదు. బుద్ధుణ్ణి ‘భగవాన్’ అని ఎందుకు పిలుచుకుంటారూ? అనే అనుమానం చాలామందికి వస్తుంది. బౌద్ధ ధమ్మం ప్రకారం భగవాన్ అంటే పరిపూర్ణతను సాధించినవాడు అని అర్థం. ఆ పదాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు. ఉనికిలో లేని ఒక శూన్యాన్ని దేవుడిగా భావించి, పిలుచుకున్నారు. సర్వాంతర్యామి, జగద్రక్షకుడు లాంటి అర్థాలు చెప్పి, కొన్ని శతాబ్దాలుగా జనాన్ని నమ్మిస్తూ వస్తున్నారు. కనపడని ‘దేవుణ్ణి’ బ్రాహ్మణార్యులు భగవాన్ అంటే, ఒకప్పుడు ఈ నేల మీద జీవించిన ఒక మహా మానవుణ్ణి బౌద్ధులు భగవాన్ – పరిపూర్ణతను సాధించిన వాడా అని గౌరవించుకుంటున్నారు. ఆ తేడాను మనం గమనించాలి. డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత, జీవశాస్త్రవేత్త -
రావణుడిపై ఎన్టీఆర్ కామెంట్స్
-
రావణుడిపై జూ.ఎన్టీఆర్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమాలో రావణుడిని చూపించిన విధానంపై ఇప్పటికే పలువురు మండిపడ్డారు. రావణుడి విచిత్రమైన హెయిర్ స్టైయిల్తో పాటు రెండు వరుసలలో పది తలకాయలను చూపించడం.. ఇలా పలు విషయాలు భారీ వివాదాలకు దారి తీశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్) అయితే జూ.ఎన్టీఆర్కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూ. ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు. పౌరాణికానికి సంబంధించిని సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్ ఇలా తెలిపాడు. 'జై లవకుశ' సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.. ఆనంద్ నీలకంఠ రాసిన 'అసుర' అనే పుస్తకాన్ని చదివాను. రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదు అసురుల చక్రవర్తి కూడా.. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. అలాంటి వ్యక్తి కళ్లు ఎలా ఉండాలి. ఇవన్నీ రావణుడిలో కనిపించాలి. అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు. అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి? అన్న విషయాలను తెలుసుకున్నాను.' అని చెబుతూనే ఆ పుస్తకం తనకు జై లవకుశ సినిమా కోసం సహాయపడిందని తెలిపాడు. (ఇదీ చదవండి: వ్యూహం టీజర్..ఒక్క డైలాగ్తో అంచనాలు పెంచేసిందిగా!) ఒక సినిమాలో కేవలం రావణుడి పాత్ర చేస్తున్న ఎన్టీఅరే తన క్యారెక్టర్ కోసం అంత పరిశోధన చేస్తే.. ఆదిపురుష్లో రావణుడి పాత్ర కోసం మూవీ మేకర్స్ ఎంతలా కసరత్తు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు జైలవకుశ సమయంలో ఎన్టీఆర్ చేసిన కసరత్తుపై తన అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మెచ్చుకుంటున్నారు. @tarak9999 did research like this for a small character then how much research should be done to make Ravan's Character 🤷♂️#ManOfMassesNTR #Ntr30 #Devara #Ravana pic.twitter.com/9leIW2FQf3 — Narasimha (@NTRNarasimha_) June 19, 2023 -
నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలుస్తారని చెప్పేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పైగా ఆపోస్టర్లు రబ్రీ దేవి నివాసం వద్ద, ఆర్జేడి కార్యాలయం వెలుపల ఏర్పాటు మరింత వివాదానికి దారితీసింది. ఈ మేరకు ఆ పోస్టర్లలో మహాభారత, రామాయణలలో ప్రధానాంశాలతో తమ నాయకుడు నితీష్ కుమార్ ఎలా బీజేపీని ఓడిస్తాడో చూపిస్తున్నట్లుగా తెలియజేసేలా ఏర్పాటు చేశారు. తమ మహాఘట్బంధన్ నాయకుడు నితీష్ కుమార్ని కృష్ణుడు, రాముడిలా చూపిస్తూ..ప్రధాని నరేంద్ర మోదీని కంసుడు, రావణుడిలా చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. అంతేగాదు రావణుడిని రాముడు ఎలా ఓడించాడో, అలాగే కంసుడిని కృష్ణుడు ఎలా చిత్తుచేశాడో అలా మా నాయకుడు నితీష్ కుమార్ బీజేపీని గద్దే దింపుతాడని అని అర్ధం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లపై ఛప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనమ్ రాయ్ చిత్రంతో పాటు మహాగత్బంధన్ జిందాబాద్ నినాదాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ ప్రతినిధి నవల్ కిషోర్ యాదవ్ మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి ప్రతిపక్ష నాయకులందరూ నితీష్ కుమార్లతో కలిసి ఏకమై వచ్చినా... ప్రధాని మోదీని ఓడించలేరు. ఆయన 2034 వరకు ప్రధానిగా అధికారంలోనే ఉంటారని ధీమాగా చెప్పారు. ఈ పోస్టర్ల విషయమై స్పందించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ..ఆ పోస్టర్లు ఎవరూ ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మా కార్యాలయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీని గద్దే దింపేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని, ఆయన ఐక్య ప్రతిపక్షానికి ముఖంగా ఉంటారు. రైతులు, యువతకు వ్యతిరేకంగా ఉండే పార్టీతో మా నాయకుడు పోరాడుతారు. ప్రతి బిహారీ నితీష్ గెలవాలని కోరుకుంటాడు అని నమ్మకంగా చెప్పారు. బిహార్ విద్యా శాఖ మంత్రి రామ్చరిత మానస్పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులో పడ్డ కొద్దిరోజుల్లో ఈ పోస్టర్ల ఘటన తెరపైకి రావడం గమనార్హం. (చదవండి: ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్ సింగర్గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు) -
మీకేమైనా రావణుడిలా 100 తలలున్నాయా?.. మోదీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రిని రావణుడితో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్లోని బెహ్రామ్పుర్లో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘మేము మీ(మోదీ) ముఖాన్ని కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సహా ప్రతిచోటా చూస్తున్నాం. మీకేమైనా రావణుడిలా 100 తలలు ఉన్నాయా? మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎమ్మెల్యే సహా ఏ ఎన్నికల్లోనైనా మోదీజీ పేరుతో ఓట్లు అడుగుతుండటం గమనించాను. మోదీ మున్సిపాలిటీల్లోకి వెళ్లి పని చేస్తారా? మీకు అవసరమైనప్పుడు మోదీ వచ్చి సాయం చేస్తారా?’ అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. मोदी जी प्रधानमंत्री हैं। वह काम छोड़कर नगर निगम का चुनाव, MLA का चुनाव, MP के चुनाव में प्रचार करते रहते हैं। हर वक्त अपनी ही बात करते हैं - 'आप किसी को मत देखो, मोदी को देखकर वोट दो।' आपकी सूरत कितनी बार देखें? आपके कितने रूप हैं? क्या रावण की तरह 100 मुख हैं? - @kharge जी pic.twitter.com/Iy6hYQfuhc — Congress (@INCIndia) November 29, 2022 ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా. ఆయన వ్యాఖ్యలు ప్రధాని మోదీని అవమానించటమేనన్నారు. ‘గుజరాత్ ఎన్నికల వేడిను తట్టుకోలేక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాటలు అదుపుతప్పుతున్నాయి. దాంతోనే ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. గుజరాత్ను, ఆ రాష్ట్ర బిడ్డను కాంగ్రెస్ అవమానుస్తూనే ఉంది.’ అని విమర్శించారు. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం ఖర్గేపై మండిపడ్డారు. పీఎం మోదీని రావణుడితో పోల్చడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ తీరును సూచిస్తున్నాయని విమర్శించారు. ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల -
అప్పుడు ఆప్తుడే.. మరిప్పుడో..!!!
Chaganti Koteswara Rao: కమలములు నీటబాసిన/కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్/ తమ తమ నెలవులు దప్పిన/ తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ...అన్నాడు బద్దెన సుమతీ శతకంలో. నీళ్ళల్లో ఉన్న తామర మొగ్గ విచ్చుకోవడానికి కారణమయిన సూర్యనారాయణుడు, అదే తామరతూడును నీళ్ళల్లో నుంచి తీసి ఒడ్డున పెడితే ...ఆయన వాడివేడి కిరణాలు సోకి అది వాడిపోతుంది, కమలాప్తుడు అంటే నీళ్ళల్లో ఉన్న కమలానికి బంధువు, నీళ్ళనుంచి బయటికి వచ్చిన పిదప శత్రువయిపోయాడు. విభీషణుడు రావణునికి సోదరుడు. కానీ ఎప్పుడూ ధర్మంవైపే నిలబడతాడు. అన్నగారు అధర్మానికి పాల్పడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. అలా చెప్పే వారు మన శ్రేయోభిలాషులని గుర్తించకపోతే చాలా ప్రమాదకరం. హనుమ రాయబారం తరువాత రావణాసురుడు కోపంతో హనుమ కంఠాన్ని నరికేయమన్నాడు. ఆయన్ని సంహరించబోతున్నారు. విభీషణుడు జోక్యం చేసుకొన్నాడు. ‘అన్నయ్యా! నీకు తెలియని ధర్మం లేదు కదా... అతను దూత. ఎవరో చెప్పి పంపినవి ఆయన చెబుతున్నాడు. అవి దూత అభిప్రాయాలు కావు కదా. దూత పరిధి దాటాడనిపిస్తే స్వల్పంగా శిక్షించవచ్చు. అంతేకానీ సంహరిస్తానంటే ఎలా..? పైగా నీవితన్ని సంహరిస్తే నీ అభిప్రాయాలు అవతలివారికి ఎలా చేరవేయగలవు? కాబట్టి వద్దు.. అన్నాడు. రావణుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అటువంటి ధర్మాత్ముడు పక్కన ఉన్నంతకాలం ... ఉపద్రవాలు ప్రాణాంతకం కాకుండా ఉన్నాయి. కానీ తరువాత జరిగిన పరిణామాలవల్ల విభీషణుడు రాముడి పక్కన చేరిపోయాడు. ఇంద్రజిత్తు రాముడిపై యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బ్రహ్మగారు ఒకానొకప్పుడు ఆయనకు వరం ఇస్తూ...‘‘నికుంభిలా (దట్టమైన అడవిలో ఉన్న ఒక దేవాలయం. అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరం) కు వెళ్ళి హోమం చెయ్యి. దానిలోంచి వచ్చిన రథం మీద కూర్చొని యుద్ధానికి బయల్దేరితే... నువ్వు మేఘాలలో ఉండి దుర్నిరీక్షవుడవుతావు. నిన్ను యుద్ధంలో గెలవడం ఎవరికీ సాధ్యం కాదు.’’ అని వరమిస్తూనే...‘‘నువ్వు నికుంభిలా చేరకపోయినా, చేరి హోమాన్ని పూర్తి చేయలేక పోయినా, నువ్వు ఆయుధాన్ని ధరించి ఉండగా నీపై యుద్ధానికి వచ్చినవాడే నీ ప్రాణాలను హరిస్తాడని గుర్తించు’’ అని హెచ్చరించాడు. ఈ రహస్యం విభీషణుడికి తెలుసు. ఇప్పుడాయన రాముడి పక్షంలో ఉన్నాడు. అదంతా రాముడికి తెలిపి... ఇపుడు ఇంద్రజిత్తు నికుంభిలా చేరుకున్నాడు... అని కూడా చెప్పి రాముడి ఆజ్ఞతో లక్ష్మణస్వామిని తీసుకొని వెళ్ళాడు. ఇంద్రజిత్తు హోమాన్ని మధ్యలోనే ఆపేసి యుద్ధానికి వచ్చాడు. ఆ తరువాత లక్ష్మణుడి చేతిలో చచ్చాడు. అంటే విభీషణుడు స్థానం తప్పిన కారణంగా లంకకు, రావణాసురుడికి చేటు వచ్చింది. అందుకే బద్దెన చెప్పింది.. ఒక్కొక్కసారి ఒక్కొక్కస్థానంలో మిత్రుడిగా ఉన్నవాడు, స్థానం తప్పితే శత్రువయిపోతాడు. మన పక్కన ఉన్నవారిలో మన శ్రేయస్సు కోరి కొన్ని కఠినమైన సలహాలు ఇచ్చినా, వాటిని పరిశీలించి ఓర్పుతో, విచక్షణతో మసలుకొన్నప్పుడు అవాంఛిత ప్రమాదాలు మాత్రం ఎదురుకాకుండా ఉంటాయన్నదే బద్దెన ఇస్తున్న సలహా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: మంచి మాట..: ఏది నిజమైన సంపద? -
రావణ దహనంలో అపశ్రుతి... ప్రజలపైకి దూసుకొచ్చిన దిష్టిబొమ్మ
న్యూఢిల్లీ: దేశంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు విజయదశమి సంబరాలు మిన్నంటాయి. అదీగాక విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన గుర్తుగా పలుచోట్ల రామలీల ప్రదర్శనలతోపాటు, రావణదహనం చేస్తుంటారు. అచ్చం అలానే హర్యానాలో కూడా రావణదహనం చేస్తుండగా... పెనుప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రావణుడి దిష్టిబొమ్మ ప్రజలపైకి దూసుకువచ్చింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. #WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH — ANI (@ANI) October 5, 2022 (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
ఢిల్లీ : రామ్ లీలా మైదానంలో రావణ దహనం
-
ఆ మూడు గ్రామాల్లో దసరా జరుపుకోరు...రావణుడే వారి దేవుడు
దసరా ఉత్సవాలను యావత్ భారతదేశం అంగ రంగ వైభవంగా జరుపుకుంటోంది. అలాగే దసరా అనగానే గుర్తుకొచ్చేది రావణ దహనం. ఈ విజయదశమి రోజునే రాముడు రావణుడిని చంపి విజయం సాధించినట్లుగా పురాణాల కథనం. అలాగే పాండవుల రాజ్యాన్ని పోగొట్టుకుని వనవాసం చేయాల్సి రావడంతో... జమ్మి చెట్టును పూజించి అక్కడే తమ ఆయుధాలను దాచినట్లు మహభారతగాథ తెలుపుతోంది. ఆనాటి నుంచి దసరా చివరి రోజు అనగా విజయదశమి రోజున రావణ దహనం చేయడం, జమ్మి చెట్టును పూజించడం వంటివి అనాదిగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓ మూడు గ్రామాల వారు దసరానే జరుపుకోరు, పైగా రావణ దహనాన్ని వ్యతిరేకిస్తారట. అంతేగాదు వారికి రావణుడే ఆరాధ్య దేవుడు. ఇంతకీ ఏంటా గ్రామాలు? ఎందుకు చేసుకోరో తెలుసుకుందామా!. 'రావణ' పేరుతో గ్రామం ఉత్తరప్రేదేశ్లోని, బిస్రాఖ్, బరాగావ్ అనే రెండు గ్రామాలు రావణ దహనం చేయరు, అలా చేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఉత్తరప్రేదేశ్లోని బాగాపత్ జిల్లాలో బరాగావ్ గ్రామం ఉంది. ఆ గ్రామవాసులు రావణుడిని దైవంగా భావిస్తారు. ఈ గ్రామాన్ని "రావణుడు" అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం....రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి శక్తి పొందాడని, తనతో శక్తిని తీసుకువచ్చేటప్పడూ అతడు ఈ గ్రామం గుండా వెళ్లినట్లు కథనం. ఐతే ఆ శక్తిని రావణుడు భరించలేకపోవడంతో ఆ గ్రామంలోని ఒక రైతుకి ఇచ్చాడని, అతను ఆ శక్తిని నేలపై పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో శక్తి రావణడుతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఏ ప్రదేశంలో శక్తి నెలపై ఉంచబడిందో అక్కడే మానసా దేవి ఆలయాన్ని నిర్మించి పూజించనట్లు ఆ ఆలయ పూజారి గౌరి శంకర్ పూరాణ కథను వివరించారు. అందువల్లే ఆ గ్రామంలో నివాసితులు ఈ పండుగను జరుపుకోవడానికి నిరాకరిస్తారు. రావణడు జన్మించిన గ్రామం అలాగే ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలోని బిస్రాఖ్ వాసులు కూడా బరాగావ్ గ్రామ వాసుల మాదిరిగానే దసరాను జరుపుకోరు. ఐతే ఈ గ్రామంలో కూడా రావణ, మేఘనాథ్, కుంభకర్ణలను దహనం చేసేందుకు ఒప్పుకోరట. పురాణల ప్రకారం... విశ్రవ రుషికి జన్మించిన రావణుడి బాల్యం బిస్రాఖ్లో జరిగింది. లంకేశ్వరుడైన రావణుడు తమ గ్రామంలో జన్మించాడని, గొప్ప శివభక్తుడైన రావణుడు పూజించిన ఆలయం 'మహంత్ని' రావణ ఆలయంగా పిలుస్తామని ఆ గ్రామా నివాసి రామదాస్ చెబుతున్నారు. తమ గ్రామం రావణుడిని తమ ఊరి బిడ్డగా నమ్ముతోందన్నారు. అలాగే రావణుడు తండ్రి విశ్రవస్ వల్ల తమ గ్రామానికి పేరు వచ్చిందని తాము విశ్వాసిస్తామని చెప్పారు. అందుకు గర్విస్తున్నామని కూడా చెబుతున్నారు. రావణుడంత తెలివి, భక్తి కావాలని.... మహారాష్ట్రాలోని అకోలా జిల్లాలోని సంగోలా గ్రామం రావణుడిని తమ ఆరాధ్యం దైవంగా కొలుస్తోంది. రావణుడి ఆశీర్వాదం వల్లే తాము జీవనోపాధిని పొందుతున్నట్లు నమ్ముతారు. అంతేగాదు రావణుడి వల్లే తమ గ్రామం శాంతి సౌఖ్యాలతో ఉన్నట్లు గ్రామస్తులు విశ్వసిస్తారు. గత 300 ఏళ్లుగా ఆ గ్రామంలో రావణుడిని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని నివాసితులు చెబుతున్నారు. పైగా రావణుడి అంత తెలివి, భక్తి పెంపొందాలని పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Dussehra 2022: పాలయమాం దేవీ!) -
రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..
నూతన సంవత్సరం సందర్భంగా చాలమంది పలురకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది ప్రజల హితం కోరి విన్నూతన పద్ధతుల్లో వేడకను జరుపుకుంటున్నారు. అచ్చం అలానే పుణేకి చెందిన వ్యక్తి కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విచిత్ర వేషధారణలో మద్యం మానేయండి అంటూ విన్నూతనంగా ప్రచారం చేశాడు. (చదవండి: డబ్బులు కోసం ఏకంగా 14 సార్లు కరోనా వ్యాక్సిన్లా?) అసలు విషయంలోకెళ్లితే...పుణెకు చెందిన ఓ వ్యక్తి రావణుడి వేషధారణలో కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పాల ప్యాకెట్లు పంచి పెడుతూ మద్యానికి స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారని అందుకే మీలోని రావడుడిని విడిచిపెట్టి మద్యానికి స్వస్తి పలకేందుకే తాను రావణుడి వేషం వేసుకున్నాని అరుణ్ ఓహర్ అన్నారు. ఈ మేరకు అక్కడ స్థానిక నాయకుడు ఒకరు మాట్లాడుతూ.." సమాజంలో మద్యపాన వ్యసనం పెరుగుతోంది. దీని ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మద్యపానాన్ని వదిలివేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు. పైగా ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలామంది తాగి నానా రచ్చ చేస్తుంటారని కూడా చెప్పారు. ఈ వేడకను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలనే చెప్పేందుకు తాను ఈ విధంగా రావణుడి వేషం ధరించి పాల ప్యాకెట్లు పంచిపెడుతున్నాను అని రావణ వేషధారి అరుణ్ ఓహర్ అన్నారు. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) -
రావణ దహనం : ఘనంగా దసరా వేడుకలు
-
2020లో ఇంకా ఏం చూడాల్సి వస్తుందో
రావణునికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన్ని కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. రావణుడికి కరోనా సోకడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అయితే వీడియో చూసేయండి మీకే ఓ క్లారిటీ వస్తుంది. ఓ ఆంబులెన్స్పై రావణుడి దిష్టిబొమ్మను తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుసాంత తన అధికారిక ట్విట్టర్లో ఈ వీడియోను పోస్టు చేస్తూ 2020లో రావణుడు ఆంబులెన్స్లో కోవిడ్ ఆసుపత్రికి వెళ్తున్నాడు అంటూ క్యాప్షన్ను జోడించగా, మరో అధికారి రావణుడికి కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియోలో రావణుడికి ఒక తలే ఉందేంటి? మిగతా తొమ్మిది ఏమయ్యాయి అంటూ ఓ యూజర్ ప్రశ్నించగా, ఈ సంవత్సరం 2020లో ఏమేమి చూడాల్సి వస్తుందో అంటూ ట్వీట్ చేశారు. 2020😳😳 Ravana going in Ambulance to COVID Hospital.... pic.twitter.com/v04Xw1wN8L — Susanta Nanda IFS (@susantananda3) October 24, 2020 -
రావణుడిగా ఉద్ధవ్.. లక్ష్మీబాయిగా క్వీన్
ముంబై: ప్రస్తుతం మహారాష్ట్రలో కంగన వర్సెస్ సేన వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఎంసీ కంగన కార్యాలయాన్ని కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఆమె పోరటాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి కంగనకు షేర్ చేసిన ఒక ఎమోజీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో శివాజీ మహారాజ్.. కంగనకు కత్తి ఇస్తున్నట్లు ఉండగా.. వెనక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను రావణుడితో పోల్చారు. ఈ ఎమోజీ పట్ల కంగన ఉద్వేగానికి గురయ్యారు. ‘ధన్యవాదాలు వివేక్ జీ. నేను లక్ష్మీబాయి, వీర్ శివాజీ అడుగుజాడల్లో నడుస్తాను. నా పనిని కొనసాగిస్తాను. వారు నన్ను భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ధైర్యంతో ముందుకు వెళ్తాను. జై హింద్.. జై మహారాష్ట్ర’ అంటూ కంగనా మరాఠీలో ట్వీట్ చేశారు. (చదవండి: ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..) Received many memes, this one sent by my friend @vivekagnihotri ji made me emotional. लक्ष्मीबाई, वीर शिवाजी यांच्या पावलावर पाऊल ठेवून मी माझे कार्य पुढे करत राहीन. जरी त्यांनी मला घाबरवण्याचा खूप प्रयत्न केला तरीही मी धैर्याने पुढे जात राहीन जय हिंद, जय महाराष्ट्र 🙏 pic.twitter.com/c4KvpVcqX1 — Kangana Ranaut (@KanganaTeam) September 12, 2020 కంగన ముంబైని పీఓకేతో పోల్చడంతో ప్రారంభమైన వివాదం.. ఆమె కార్యలయాన్ని కూల్చడం వరకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్రం కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. తనకు ఎన్ని అడంకులు ఎదురైనా తలదించకుండా ఝాన్సీ లక్ష్మీబాయిలా ముందుకు వెళ్తానంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజు ఘాటుగా స్పందించాడు. భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతోమంది వీరుల పాత్రలు పోషించారని ఒక్క సినిమాతోనే (కంగనా) ఝాన్సీ లక్ష్మీ బాయ్ అయిపోయినట్లు అనుకోకని కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా కంగనాకు వై కేటగిరి భద్రత కల్పించడంపై కూడా ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు
గ్రేటర్ నోయిడా(ఉత్తరప్రదేశ్): బిస్రఖ్ గ్రామంలో రావణుడి ఆలయం వద్ద కొంతమంది భక్తులు అయోధ్య రామ మందిరానికి చెందిన భూమి పూజను జరుపుకున్నారు. పురాణాల ప్రకారం రావణుడు బిస్రఖ్ గ్రామంలో జన్మించాడని చెబుతారు. అందుకే ఈ గ్రామంలో రాక్షస రాజైన రావణుడికి ఒక ఆలయాన్ని నిర్మించారు. రామాలయ భూమి పూజ కోసం దాదాపు 200లకు పైగా ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణం కోసం మట్టిని పంపిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం ఈ రావణుడి ఆలయం నుంచి కూడా మట్టిని పంపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అశోకానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. ‘500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాములవారు తన ఇంటికి వెళ్ళబోతున్నాడు. రావణ గ్రామమైన బిస్రఖ్ నివాసులమైన మాకు ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా దేవుడైన రాముడు స్వదేశానికి తిరిగి రావడానికి మేము రావణుడి ఆలయంలో మతపరమైన వేడుకలు నిర్వహించాము. రాముడు లేకుండా రావణుడు అసంపూర్ణం. ఎందుకంటే రాముడే రావణుడికి మోక్షం ప్రసాదించాడు’ అని తెలిపారు. (జగమంతా రామమయం) గ్రామవాసులు రావణుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు వేడుకలు జరుపుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు అశోకానంద్ సమాధానమిస్తూ.. ‘హిందూ మతం వైవిధ్యమైనది. దేవుని పట్ల భయం హిందూ మతంలో ఒక భావన కాదు, ఇదంతా కర్మ సిద్ధాంతం. భగవంతుడు ప్రతిచోటా, అన్ని జీవులలో, ప్రాణములేని వాటిలో, మంచిలో, చెడులో, మనందరిలో ఉన్నాడు. రావణుడు శివుని భక్తుడు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించే వరకు చెడ్డ వ్యక్తి కాదు. రావణుడు చాలా శక్తిమంతుడు. తనకు మోక్షాన్ని ప్రసాదించగలిగే ఒకే ఒక వ్యక్తి రాముడని ఆయనకు తెలుసు. అందుకే రాముడితో వైరం పెట్టుకున్నాడు’ అని తెలిపారు. చదవండి: నూతన శకానికి నాందీ క్షణం -
‘రావణుడి’పై అసత్య ప్రచారం
న్యూఢిల్లీ: తాను బతికే ఉన్నానని దూరదర్శన్ రామాయణ్ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది లంకేశ్(82) వెల్లడించారు. ఆయన చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఇది నిజమా, కాదా తెలుసుకునేందుకు అభిమానులు ట్విటర్ ద్వారా లంకేశ్ కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. దీంతో తాను బతికేవున్నానని ఆయన ప్రకటించారు. లంకేశ్ చనిపోయినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన మేనల్లుడు కౌస్తుభ్ త్రివేది తోసిపుచ్చారు. ‘మా అంకుల్ అరవింద్ త్రివేది లంకేశ్ క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆయనపై అసత్య ప్రచారం ఆపండి. ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ తెలియజేయాల’ని కౌస్తుభ్ ట్వీట్ చేశారు. లంకేశ్ కూడా ఇదే ట్వీట్ను హిందీలో తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రామాయణ్ సీరియల్ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 16న రామాయణ్ను 7.7 కోట్లు వీక్షించడంతో కొత్త రికార్డు నమోదయింది. రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా భారతీయ టెలివిజన్ ప్రపంచాన్ని ఏలుతుండటం విశేషం. చదవండి: డీడీ నంబర్ వన్ -
రావణుడే తొలి వైమానికుడు
కొలంబో: చరిత్రలో మొట్టమొదటి వైమానికుడు రావణాసురుడేనట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణాసురుడు విమానంలో గగనతలంలో విహరించాడని.. రానున్ను ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తామని అంటున్నారు శ్రీలంక వైమానిక అధికారులు. ఈ విషయం గురించి శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశి దానతుంగే న్యూస్18తో ఫోన్లో మాట్లాడారు. ‘చరిత్రలో విమానాన్ని ఉపయోగించి గగనతలంలో విహరించిన తొలి వైమానికుడు రావణుడే. పురాణాల ఆధారంగా ఈ విషయం చెప్పడం లేదు. ఈ విషయంలో పూర్తి స్థాయి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తాం’ అన్నారు. కటునాయకేలో ఉన్న బండారునాయకే విమానాశ్రయంలో బుధవారం శ్రీలంక పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి నేటి భారతదేశానికి వెళ్లి తిరిగి వచ్చాడని ఈ సమావేశం తేల్చింది. రానున్న ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపించాలని నిర్ణయించింది. అంతేకాక శ్రీలంకలో రావణుడిని గొప్ప రాజుగా.. దయ గల మనిషిగా చెప్పుకుంటారు. సీతా దేవిని అపహరించాడు, రాక్షసుడు అనే అంశాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. అది కేవలం భారతీయుల వాదనగా కొట్టి పారేస్తారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక అంతరిక్షంలోకి పంపిన ఓ ఉగప్రహానికి రావణ అనే పేరు పెట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆ దేశ ప్రజలు రావణుడికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో. -
శ్రీలంక శాటిలైట్కు ‘రావణ’ పేరెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీలంక ఇటీవల అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన మొట్ట మొదటి ఉపగ్రహంకు ‘రావణ’ అని ఎందుకు నామకరణం చేసింది. రామాయణ కాలంనాటి రావణాసురుడి పాత్రను నిజంగా ఆరాధిస్తోందా? అక్కడి సింహళ–బౌద్ధులు రావణుడిని తమ హీరోగా ఎందుకు పేర్కొంటున్నారు? ఎప్పటి నుంచి ? రాముడిని కూడా ఓ ఆయుధంగా చేసుకొని భారత్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని కవ్వించడం కోసం ఉపగ్రహంకు రావణ పేరును ఖరారు చేసిందా? దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎల్టీటీఈ తీవ్రవాదులతో అవిశ్రాంత యుద్ధం చేసి విజయం సాధించిన శ్రీలంక ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి ఓ ఉపగ్రహాన్ని తయారు చేసింది. దానికి ‘రావణ–1’గా నామకరణం చేసి జూన్ 19వ తేదీన విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో రావణుడు ఓ దుష్ట రాజు. అతను రాముడి చేతుల్లో మరణిస్తాడు. శ్రీలంక మెజారిటీలైన సింహళీయులు కూడా రాముడి చేతుల్లోనే రావణుడు మరణించారని నమ్ముతున్నారు. రావణుడి సోదరుడైన విభూషణడి కుట్ర వల్ల రావణుడు మరణిస్తారని, రావణాసురుడు రాముడికన్నా మంచి రాజని వారు నమ్ముతున్నారు. వారేకాకుండా తమిళనాడులో ద్రావిడ ఉద్యమకారులు కూడా రావణుడినే తమ ద్రవిడ హీరోగా పరిగణిస్తూ వచ్చారు. రాముడిని వారు ఆర్యుడిగానే ద్వేషించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై కూడా రావణుడినే హీరోగా కీర్తించారు. ఒకరకంగా ద్రావిడ ఉద్యమానికి రావణుడి పాత్రే స్ఫూర్తినిచ్చింది. 2,500 సంవత్సరాల క్రితం జరిగినట్లు చెబుతున్న రామాయణంకు సంబంధించి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయని, అవన్నీ కూడా వాల్మికీ సంస్కృతంలో రాసిన రామాయణం మహా కావ్యానికి భిన్నంగానే ఉన్నాయని ప్రముఖ విద్యావేత్త ఏకే రామానుజన్ చెప్పారు. ఒక్క భారత్లోని కేరళలోనే 29 రకాల రామాయణాలు ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని రావణుడినే హీరోగా పేర్కొన్నాయి. రామాయణం నిజంగా జరిగినట్లు చెప్పడానికి సరైన చారిత్రక ఆధారాలు లేకపోవడం వల్ల అన్ని రామాయణ పుస్తకాలు పుట్టుకొచ్చాయన్నది చరిత్రకారుల వాదన. అసలు రామాయణం పేర్కొన్న లంక, శ్రీలంక కాకపోవచ్చని, నీటితో చుట్టుముట్టి ఉన్న దీవులన్నింటినీ లంకలుగా వ్యవహరిస్తారన్నది కూడా వారి వాదనే. 1940 సింహళ–తమిళుల ఘర్షణ శ్రీలంకలో మెజారిటీలైన సింహళులు, మైనారిటీలైన తమిళుల మధ్య 1940 దశకంలోనే ఘర్షణలు మొదలయ్యాయి. తాము ఆదివాసులమని, తామే శ్రీలంకకు అసలైన వారసులమన్న వాదనను సింహళీయులు తీసుకొచ్చారు. పరభాషా ప్రభావాన్ని తొలగించి ఆ భాషను శుద్ధి చేయాలనే లక్ష్యంతో సాహితీవేత్త కుమారతుంగ మునిదాస 1941లో ‘హేల అవులా’ అన్న సాహితీ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ సింహళ భాషాభివృద్ధికి కృషి చేయడంతోపాటు సంసృతిని పునరుద్ధరించడంలో భాగంగా రావణ రాజును తీసుకొచ్చింది. సింహళీలులకు హీరోగా పేర్కొంటు రచనలను మొదలుపెట్టింది. అయినా అనుకున్న స్థాయిలో ఫలితం రాలేదు. 1987లో భారత శాంతి దళం ప్రవేశంతో శ్రీలంక ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఎల్టీటీఈ తీవ్రవాదులను అణచివేసేందుకు 1987లో భారత శాంతి పరిరక్షక దళం శ్రీలంకలో అడుగుపెట్టింది. అప్పుడు దానికి వ్యతిరేకంగా రామాయణాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘మంకీ ఆర్మీ’ వచ్చిందంటూ వామపక్ష భావాలు కలిగిన ‘జనతా విముక్తి పెరమున’ అనే సంస్థ పోస్టర్లను వేసింది. అప్పటికే భారత పట్ల వ్యతిరేకత చూపే సింహళ–బౌద్ధులు రావణుడిని హోరాగా చేస్తూ అనేక నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ తర్వాత టీవీ, రేడియోల్లో కూడా రావణడిపై నాటకాలు, రూపకాలు, పాటలు ప్రసారమయ్యాయి. పుస్తకాలు, వ్యాసాలూ వెలువడ్డాయి. 2009లో ఎల్టీటీఈ ఓడిపోయి భారత దళాలు వెనక్కి వెళ్లిపోయాక వీధి వీధిన రావణుడి విగ్రహాలు వెలిశాయి. ఆ తర్వాత ప్రత్యేక ఈలం గొడవ లేకపోవడంతో రావణుడిని పెద్దగా పట్టించుకోలేదు. భారత్ పట్ల ద్వేషమా? భారత్, శ్రీలంక మధ్య బలమైన సాంస్కృతిక, ఆర్థిక, నైసర్గిక సంబంధాలు ఉన్నాయి. ఇవి రాజకీయాలకు అతీతమైనవి. దౌత్య సంబంధాల విషయంలో ఇరు దేశ ప్రభుత్వాలు ఒకటి, రెండు సందర్భాల్లో మినహా తమ రాజకీయాలను పక్కన పెట్టి వ్యవహరించాయి. వ్యవహరిస్తున్నాయి. కనుక మన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ‘రావణ’ పేరును ఖరారు చేయలేదు. మెజారిటీలైన సింహళీయులు హీరోగా రావణుడి పరిగణించడం ఒక కారణమైతే, అసలు కారణం మరోటి ఉంది. రావణుడి కాలంలో పుష్పక విమానం ఉంది కనుక, అప్పటికే తమకు అంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉందని గుర్తు చేయడంలో భాగంగా ‘రావణ’ పేరు పెట్టారని కొలంబో యూనివర్శిటీ చరిత్ర విభాగం సీనియర్ లెక్చరర్ నిర్మల్ రంజిత్ దేవసిరి తెలిపారు. -
అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సూపర్ హిట్ సినిమా జై లవ కుశ. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన రావణ్ మహరాజ్ పాత్రకు ఆ పాత్రలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే పేరుతో ఎన్టీఆర్ అన్న నందమూరి కల్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడు. మల్లిడి వేణు దర్శకుడిగా కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్ బ్యానర్పై ఈసినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ను పరిశీలించినా ఫైనల్గా రావణ అయితే బాగుటుందని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టైటిల్తో మోహన్బాబు ప్రధాన పాత్రలో 100 కోట్లతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు అదే టైటిల్తో కల్యాణ్ రామ్ సినిమా అంటూ వార్తలు వస్తుండటంతో మంచు ఫ్యామిలీ స్పందన ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. 118 హిట్తో తిరిగి ఫాంలోకి వచ్చిన కల్యాణ్ రామ్ ఆ జోష్ను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. మరి రావణ మరో హిట్ ఇస్తాడేమో చూడాలి. -
ఆశ్రిత వత్సలుడు
పరదారాపహరణం చాలా పాపమని, సాక్షాత్తూ ఆదిశక్తి వంటి సీతమ్మను తెచ్చి బంధించడం లంకకు చేటని, రావణునికి అత్యంత ప్రమాదకరమని, మర్యాదగా సీతమ్మని రామునికి అప్పగించి, క్షమాపణలు వేడుకోమని ఎంతో హితబోధ చేశాడు విభీషణుడు తన అన్న అయిన రావణునికి. పోగాలం దాపురించిన రావణుడు ఆ మాటలను చెవికెక్కించుకోకపోగా తీవ్రంగా అవమానించడంతో విభీషణుడు దుష్టుడైన అన్నను వదిలి ధర్మస్వరూపుడైన రాముని శరణు వేడాలన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ తననే అనుసరించే నలుగురు అనుచరులతోపాటు లంకను వదిలి సముద్రాన్ని దాటి అవతలి తీరంలో వానర సేనతో ఉన్న శ్రీ రామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆకాశంలోనే నిలచి రాముడిని శరణు వేడాడు. అప్పుడు విభీషణుని చూసిన సుగ్రీవుడు ఆ వచ్చిన వారు రాక్షసులనీ, వారిని వెంటనే ఎదుర్కోవలసిందనీ తన సేనలను ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడి ఆనతిని అందుకున్న వానర సేన తనను చుట్టుముట్టబోగా, వారిని చూసి విభీషణుడు తాను లంకాధిపతి రావణుని సోదరుడిననీ, అన్నను వదిలి ధర్మమూర్తి అయిన రాముని శరణు కోరి వచ్చాననీ, తాను మిత్రుడినే తప్ప శత్రువుని కాననీ చెప్పాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, మైందుడు తదితరులు అతనిని ఎంతమాత్రమూ నమ్మవద్దని, అతడికి ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమనీ రామునికి చెప్పారు. హనుమంతుడు కూడా ఇంచుమించు అవే మాటలు చెప్పాడు. అప్పుడు రాముడు వారితో– ‘‘వానర వీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినవి విన్నాను. మీరు చెప్పిన మాటలు యదార్థమే కావచ్చునేమో కానీ, నాకొక వ్రతం ఉంది. అదేమంటే, నాకు శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘శరణు’ కోరితే, వారిలో ఎటువంటి దోషాలున్నా, వారు ఎంతటి చెడ్డవారయినా సరే, నేను వారికి అభయమిచ్చి తీరుతాను. సుగుణాలు ఉన్నవానిని రక్షించడం కంటే దోషాలున్న వారిని రక్షించడంలోనే మంచితనం బయటపడుతుంది. మరొకటి, ఇక్కడున్న ధర్మసూక్ష్మమేమిటంటే, దుష్టుడైన రావణునికి ధర్మం తెలిసిన విభీషణుడు తమ్ముడు కాకూడదన్న నియమమేమీ లేదు కదా... అదేవిధంగా మన శత్రువుల వద్ద నుంచి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదు! మనకు మిత్రుడు కావచ్చు కదా! లోకంలో దాయాదులెవరూ మిత్రుల్లా కలిసి మెలిసి ఉండరు. వారిలో వారికి మనస్పర్ధలుంటాయి. అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు. ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. అలాగే సీత కారణంగా రావణుడికి, విభీషణుడికి భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే రావణుడు తమ్ముడిని తరిమి వేసి ఉంటాడు. మనం వచ్చిన కార్యం... అధర్మపరుడైన రావణుని ఎదిరించి, నా సీతను తీసుకు రావడం. కాబట్టి విభీషణుడికి, మనకు శత్రుత్వం ఎలా ఉంటుంది? ఒకవేళ మీరందరూ అనుమానించినట్లుగా విభీషణుడు దుష్టుడైనా కానీ మనకు వచ్చిన భయమేమీ లేదు. అతడు నాకు గానీ, మీలో ఎవరికైనా కానీ ఎటువంటి అపకారమూ చేయలేడు. నేను తలచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను, దానవులను, యక్షులను ఒంటిచేత్తో ఎదుర్కోగలను. అలాంటిది ఈ ఐదుగురు రాక్షసులు ఎంత? శరణన్న విభీషణుడికి అభయమిస్తున్నాను. అతనిని ఇప్పుడే లంకకు రాజుగా ప్రకటిస్తున్నాను’’ అన్నాడు. రాముడికి ఉన్న ధర్మనిరతి, సంయమనం, ఆలోచన శక్తి, కుశాగ్రబుద్ధి, కొండంత ఆత్మవిశ్వాసాన్ని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజైనవాడు ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పటికీ కేవలం అనుచరులు చెప్పిన మాటలను అసలు వినకుండా ఉండకూడదనీ, అదేవిధంగా ఆ మాటలను మాత్రమే విని, వాటిని బట్టి నిర్ణయం తీసుకోరాదనీ, తాను నిర్ణయించుకున్న విషయాన్ని ఎటువంటి తొట్రుపాటూ మరెంతటి మిడిసిపాటూ లేకుండా చక్కగా వివరించి చెప్పడం, చక్కగా ఆలోచించడం, సత్వర నిర్ణయాలు తీసుకోగలగడం, ఆ తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడం ఎంతో మంచి చేస్తుందనీ మనం అర్థం చేసుకోవాలన్నదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
కోరని వరం
ఎవరైతే కోరికలన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని వైపుకు సాగుతారో.. సముద్రం వంటి విశాలమైన మనసున్న అటువంటి వారిని.. నదులు సముద్రంలో కలిసినట్లుగా నదులవంటి విషయభోగాలు వెతుక్కుంటూ వస్తాయి. ఒకసారి అన్నదమ్ములైన రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురూ కలిసి బ్రహ్మను గురించి తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు తనకు ఎవరి వలనా మరణం కలగకూడదు అనే వరాన్ని కోరాడు. అప్పుడు బ్రహ్మ ‘అది అసాధ్యం. దీనికి బదులు వేరే ఏదైనా వరం కోరుకో’ అన్నాడు. రావణుడు ఆలోచించాడు– నరులు, వానరాలు అల్పప్రాణులు, బలం లేని వారు కనుక వారి వలన మరణం ఎలాగూ రాదు. బలవంతులైన యక్షులు, రాక్షసులు, దేవతలు మొదలైన వారితోనే మరణం లేకుండా వరం కోరుకుంటే చాలు అనుకున్నాడు. బ్రహ్మని కూడా అదే కోరాడు. ‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మ. కుంభకర్ణుడు కూడా చావు లేని వరాన్ని పొందాలనే ఉద్దేశంతోనే తపస్సు చేసినా చివరకు బుద్ధి భ్రమించి ‘తనకు చక్కగా నిద్ర రావాలి’ అనే వరం కోరుకున్నాడు. మహా సాత్వికుడైన విభీషణుడు రావణ కుంభకర్ణులవలె తనకు ఎప్పుడూ మరణం రాకూడదని ఆశపడలేదు. ‘ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా నా బుద్ధి చెడు దారి పట్టకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని మరవకుండా ఉండునట్లు వరాన్ని ఇస్తే చాలు. ఇదొక్కటే నా కోరిక’ అన్నాడు. విభీషణుడి మాటలను విని సంతోషపడిన బ్రహ్మదేవుడు రాక్షసుడిగా జన్మించి ఉత్తమమైన సంస్కారం లేకపోయినా, నీ బుద్ధి మాత్రం అధర్మం వైపు సాగటం లేదు. నీలో ఉన్న ఈ సుగుణాలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ‘నీవు అడగకపోయినా నిన్ను చిరంజీవిగా ఉండేట్లు వరం ఇస్తున్నానని’ అన్నాడు.అమరత్వం కోసం వందల సంవత్సరాలు తపస్సు చేసినా రావణుడికి తాను కోరుకున్నది దక్కనేలేదు. తనకు చావు రాకూడదు అని ఎప్పటికీ కోరని విభీషణుడికి మాత్రం అమరత్వం దక్కింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట ఇదే. మానవుడు విషయభోగాల వెంటపడి పరిగెత్తినంత కాలం అతడు కోరుకున్న భోగాలు అతడి నుంచి మరింత దూరమవుతాయి. – డి.వి.ఆర్. -
నిత్య సుమంగళి మండోదరి
మయాసురుడనే రాక్షసుడు గొప్పశిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంట పడుతుంది. మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అయితే, ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి, ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడసాగాడు. ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది. రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయేముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కాని ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే, శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తూ విష్ణువు అవతారమని గ్రహించి, స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి Ô¶ రీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరికి వితంతువు అయే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
రావణ బ్రహ్మలు
లార్డ్ గణేశ్.. యానిమేషన్కు ఓ క్యారెక్టర్ అయ్యాడు.రావణుడు.. యాడ్స్కి మోడల్ అయ్యాడు. తలనొప్పి మాత్రల నుంచి భావోద్వేగాల వరకు ప్రకటనలకు ఆయన పదితలలు పనికొచ్చినట్టుగా ఇంకే పౌరాణిక పాత్రా మేకప్ వేసుకోలేదు. ఇటీవలే నిమజ్జనం కాబట్టి గణేశ్ ఇంకా వార్తల్లో ఉన్నాడు అనుకోవచ్చు. మరి హఠాత్తుగా రావణుడి ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే ఆయన బొమ్మల తయారీకి టైమ్ వచ్చింది కనుక. ఢిల్లీ ఆ పనిలో అప్పుడే బిజీ అయిపోయింది కూడా. దసరాకి ఉత్తర భారతంలో రావణ దగ్ధం ఓ ఘట్టం. అందుకు రావణుడి దిష్టిబొమ్మలు కావాలి కదా. తితార్పూర్ ఇప్పుడు ఆ పనిలో ఉంది. ఢిల్లీలోని సుభాష్నగర్కి టాగోర్ గార్డెన్స్కీ మధ్యలో ఉంటుంది తితార్పూర్. మెట్రోలో వెళ్లాలంటే బ్లూలైన్ పట్టుకోవాలి. ఇదొక అర్బన్ విలేజ్. దీన్ని రావణ సూపర్మార్కెట్ అని పిలిచుకుంటారు అర్బన్ ఫోక్స్ (పురజనులు). ఎందుకంటే ఆసియాఖండంలోనే అతిపెద్ద దిష్టిబొమ్మల మార్కెట్ ఇది. దసరా సమయంలో రావణ, మేఘనా«థుడు (రావణుడి కొడుకు), కుంభకర్ణుడి బొమ్మలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరు ఏ బొమ్మలు (రాజకీయ నాయకులు ఎట్సెట్రా) చేయమని ఆర్డర్ ఇస్తే అవి చేసిపెడ్తారు. తితార్పూర్ ఫుట్పాత్లన్నీ రావణుడి తలలు, చేతులు, కాళ్లు, అవయవాలతో నిండి ఉంటాయి. ఇంకోవైపు.. తయారైన రంగురంగుల దిష్టిబొమ్మలు. వీటిని కొనుక్కునేవాళ్లతోనే కాదు.. ఫొటోలు తీసుకునే విదేశీయులు, దేశీ టూరిస్ట్లతోనూ తితాపూర్ కిటకిటలాడుతూ ఉంటుంది దసరా వరకు. 2 నుంచి 80 అడుగుల వరకు వెదురు బద్దలతో ముందు రావణుడి దేహాకృతిని తయారు చేస్తారు. తర్వాత దాంట్లో అన్నీ గుడ్డముక్కలు కుక్కుతారు. పటాసులూ పెడ్తారు (పటాసులు కూడా కావాలని కోరుకున్న వాళ్లకు మాత్రమే పటాసులు పెట్టి తయారు చేసిస్తారు). పైనుంచి మళ్లీ ఓ గుడ్డను చుట్టి.. తర్వాత రంగురంగుల కాగితాలతో తల నుంచి కాళ్ల వరకు అతికించేస్తారు. ఇప్పుడు పెయింట్తో కళ్లు, ముక్కు, చెవులు, నోరు గీస్తారు. దాంతో రావణుడి దిష్టిబొమ్మ రెడీ. ఈ బొమ్మలు రెండు అడుగుల నుంచి దాదాపు 80 అడుగుల ఎత్తు వరకు రకరకాల సైజుల్లో దొరుకుతాయి. అయిదు వందల నుంచి లక్షరూపాయల వరకు ధరలుంటాయి. బాహుబలి.. డ్రాక్యూలా దసరా వస్తోందంటే రావణుడి దిష్టిబొమ్మలకు చాలా గిరాకీ ఉంటుంది. రావణుడిని రావణుడి ఆకారంలోనే కాక తమకు ఇష్టమైన వారి ఆకారంలో కూడా తయారు చేసివ్వమని అడుగుతుంటారట కస్టమర్లు. కిందటేడు బాహుబలి, డ్రాక్యూలా షేప్లో రావణుడి బొమ్మలు కావాలని మహా డిమాండ్ వచ్చిందట. ఇంకొంత మంది తమకు నచ్చిన దుస్తుల్లో రావణుడిని అలంకరించమంటారట. కాని ఈ తయారీదారులు ఇలాంటి వాటికి ‘నో’ అని సమాధానం చెప్తారు చాలా సింపుల్గా. ‘‘ఎంతైనా రావణుడే కదా మాకు అన్నదాత. ఆయన బొమ్మలు అమ్మే కదా మా పొట్టనింపుకుంటున్నాం. మాకు అన్నంబెట్టే ఆ దేవుడిని అతని రూపంలో కాకుండా వేరే వేరే రూపాల్లో తయారు చేయడమంటే ఆ దేవుడిని అవమానించినట్టే కదా! అందుకే కలర్స్, డిజైన్ ఎలిమెంట్స్ తప్ప ఇంక వేటినీ కస్టమైజ్ చేయం’’ అంటాడు రాజు అనే తయారీదారుడు. దహనం చేస్తున్నప్పుడు ఏమైనా ఫీలవుతారా? అని అడిగితే.. ‘‘బాధనిపిస్తుంటుంది.. ఈ చేతులతో తయారు చేస్తాం కదా... కాని ఏంచేస్తాం? పండగలో భాగం. అదొక సంప్రదాయం’’ అని సమాధానమిస్తాడు శంకర్ అనే ఇంకో తయారీదారుడు. సీజన్ అయ్యాక ఇంట్లో శిక్షణ ఈ సంచార కమ్మరులు దిష్టిబొమ్మల తయారీని ఓ పరిశ్రమగా కాక కళగానే చూస్తారు. సీజన్ అయిపోయాక ఇంట్లో ఉన్న పిల్లలకు ఈ కళను నేర్పిస్తుంటారు. వెదురుబద్దలను ఎండబెట్టడం.. వాటిని చీల్చడం.. బొమ్మల్లా చేయడం, రంగులు తయారు చేయడం.. రంగుల ఎంపిక.. కనుముక్కు తీరు గీయడం... వంటివాటన్నిటిలో శిక్షణనిస్తారు. చాలా మంది పిల్లలు బడికి వెళ్తూనే తమ పెద్దవాళ్ల దగ్గర ఈ కళనూ అభ్యసిస్తున్నారు. పనిముట్ల తయారీలో వచ్చే లాభం కన్నా సీజన్లో దిష్టిబొమ్మల ద్వారా సంపాదించేదే ఎక్కువ అని చెప్తారు. ఎవరీ రావణబ్రహ్మలు? కమ్మరుల్లో సంచార కమ్మరులు ఈ దిష్టిబొమ్మలు చేసేవారు. రాజస్థాన్కు చెందిన గడియా లోహార్ తెగవాళ్లు మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారట. అక్బర్తో జరిగిన యుద్ధంలో మహారాణా ప్రతాప్ ఓడిపోవడంతో ఆ అవమానం తట్టుకోలేక తిరిగి విజయం సాధించే వరకు ఆ రాజ్యంలో అడుగుపెట్టమని ప్రతిజ్ఞచేసి మరీ మేవాడ్ను వదిలారట. అలా చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లా చెదురై సంచారం కొనసాగించారట. వాళ్ల వారసులమే అని తమ చరిత్ర చెప్తారు వీళ్లు. కర్ణాటకతోపాటు మన దగ్గర కనిపించే లండాలు కూడా ఈ తెగవారే అంటారు. తితార్పూర్లో ఉంటున్న గడియా లోహార్స్ సీజన్లో దిష్టిబొమ్మలను చేస్తూ మిగిలిన సమయంలో ఇనుప వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తారు. – శరాది -
కోపమేల హనుమా!
రామరావణ యుద్ధం అరివీర భయంకరంగా జరిగింది. రావణుడు మరణించాడు. ఆ వార్త మొదట సీతమ్మ చెవిన వేశాడు హనుమ. ఆ మాట విని సీతమ్మ – హనుమా! ఎంత మంచి వార్త చెప్పావు? నిన్ను పొగడడానికి ఈ లోకంలో భాష చాలదు. నీకు ఇవ్వడానికి లోకంలో తగిన బహుమతి లేనే లేదు– అంది కళ్లలో నీళ్లతో. అది చూసి హనుమ చలించిపోయాడు. ఎన్ని అవమానాలు, కష్టాలు, కడగండ్లు ఎలా అనుభవించిందో, ఎలా సహించిందో సీతమ్మ తల్లి– అనుకున్నాడు. చుట్టూ రాక్షస స్త్రీలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. వీళ్లే కదా ఏడిపించింది– అని వారివైపు కోపంగా చూస్తూ– ‘‘అమ్మా! నువ్వు ఆజ్ఞ ఇస్తే వారినందరినీ నా పిడికిలి పోటుతో చంపేస్తాను’’ అన్నాడు. అప్పుడు సీతమ్మ ‘‘హనుమా! ఈ రాక్షస స్త్రీలు రావణుడి దాసీ జనం. యజమాని చెప్పినట్లు చేయడం వారి ధర్మం. తమ ధర్మాన్ని నిర్వర్తించిన వారి మీద కోప్పడడం అధర్మం– అనర్థం. రావణుడి ఆజ్ఞానుసారం చేసిన వారి మీద మన ప్రతాపం ఎందుకు? రావణుడు మరణించాడు. వీళ్లు ఇక నన్ను బాధించరు. అలాంటప్పుడు వారితో వైరమే లేదు. వీరిని వదిలెయ్యి’’ అంది. ఈ మాటలకు పులకించిపోయిన హనుమ; తమకు చావు మూడిందనుకున్న రాక్షస స్త్రీలూ కూడా ఆనందంతో సీతమ్మ పాదాలకు ప్రణమిల్లారు. – డి.వి.ఆర్. -
జటాయు పోరాటం!
రావణుడు సీతను అపహరించి, రథం మీద కూర్చోబెట్టుకుని వినువీధులలో దూసుకెళ్తున్నాడు. సీతమ్మ భయ విహ్వల అయి, తన భర్తను తలచుకుంటూ, రావణుని నిందిస్తోంది. ఈ దృశ్యం అల్లంత దూరాన చెట్టునీడలో విశ్రాంతి తీసుకుంటున్న జటాయువు దృష్టిలో పడింది. సరిగ్గా అదే సమయంలో సీతమ్మ కూడా జటాయువును చూసింది. రెండు చేతులూ జోడించి ‘ఆర్యా! ప్రణామాలు. నన్ను ఈ దుష్ట రావణుడుఅపహరించుకుని పోతున్నాడు. మీరు వెంటనే ఈ విషయాన్ని రామలక్ష్మణులకు తెలియజేయండి. వారే వీడి పీచమణుస్తారు’’ అంటూ అభ్యర్థించింది. కంటిముందు జరుగుతున్న ఆ ఘోరాన్ని చూసి జటాయువు చలించిపోయాడు. ఆగ్రహావేశాలతో రావణుడి రథాన్ని వెంబడిస్తూ, ‘‘ఓరీ దుష్టరాక్షసా! పిరికిపందలాగా రామలక్ష్మణులు లేని సమయాన సీతమ్మను అపహరించుకు వెళుతున్నావా! సిగ్గులేదా నీకు? చావు దగ్గర పడినవాడు స్వీయ వినాశనం కోసమే నీలాంటి అధర్మ కార్యాలకు ఒడిగడతాడని నిన్ను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, మర్యాదగా సీతమ్మను తీసుకెళ్లి, సగౌరవంగా రామునికి అప్పగించి, శరణు వేడు. ఆ దయామయుడు నిన్ను క్షమించి వదులుతాడు’’ అంటూ హితవు చెప్పాడు. రావణుడు ఆ మాటలను వినిపించు కోకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఇలా లా¿¶ ం లేదనుకుని. జటాయువు, తన బలమైన ముక్కుతో, గోళ్లతో రావణుని పొడిచాడు. కాళ్లతో రావణుని ధనుస్సును విరిచిపారేశాడు. క్రోధంతో భగ్గుమన్న రావణుడు, జటాయువు మీదికి ఎన్నో శస్త్రాస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నింటినీ తన రెక్కలతో ఆవలికి విసిరికొడుతూనే, సువర్ణ సదృశమైన తన వాడి గోళ్లతో రావణుణ్ణి పొడిచి చికాకు పెట్టసాగాడు. ఇది సామాన్యమైన పక్షి కాదని గ్రహించిన రావణుడు మహిమాన్విత మైన తన ఖడ్గంతో జటాయువు ముక్కును, రెక్కలను, పార్శా్వలను ఖండించివేశాడు. దాంతో, ఆ వృద్ధ పక్షిరాజం మొదలు నరికిన చెట్టులా నేలకూలింది. అది చూసిన రావణుడు, రెట్టించిన వేగంతో లంకవైపు దూసుకుపోయాడు. అవతలి వాడు అమిత బలశాలి అని ఆ పక్షికి తెలుసు. అయినప్పటికీ, అతణ్ణి నిలువరించేందుకు తన ప్రయత్నం తాను చేసి, ఈ వార్తను రామలక్ష్మణులకు చేరవేసేందుకు ప్రాణాలు ఉగ్గబట్టుకుని వేచి చూసింది. చివరికి రాముడికి వర్తమానం అందించింది జటాయువు. నీతి ఏమిటంటే, చెడును అడ్డుకోవడానికి చివరి వరకూ పోరాటం చేయాల్సిందే! అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావలసిందే! – డి.వి.ఆర్. భాస్కర్ -
రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?
రామాయణంలో మనం ఇంతవరకు పెద్దగా వినని అంశాలను కూడా నాయకులు గుర్తుచేస్తున్నారు. లంకలో రామరావణ యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు రావణాసురుడి చేతులు, కాళ్లు నరికేశాడని, రథం విరగ్గొట్టేశాడని.. కానీ ఆ తర్వాత కాళ్లు మాత్రం మళ్లీ రప్పించాడని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి అన్నారు. తన కోటలోకి తిరిగి వెళ్లిపోడానికి వీలుగా అలా ఎందుకు చేశాడు అంటూ ట్విట్టర్ జనాలకు ఆయన ఓ ప్రశ్న సంధించారు. సాధారణంగా ఇంతకాలం తెలిసినదాని ప్రకారం, రావణాసురుడి కడుపులో ఉన్న అమృతభాండాన్ని ఛేదించిన తర్వాత రావణవధ జరిగిందంటారు. ఆ రహస్యాన్ని కూడా విభీషణుడు రాముడి చెవిలో వేసిన తర్వాతే రావణాసురుడు నేలకొరిగాడని చెబుతారు. కానీ సుబ్రమణ్యం స్వామి మాత్రం సరికొత్త అంశాలను చెబుతున్నారు. PTs may remember Bhagwan Ram in the Lanka war chopped Ravan's arms, legs and chariot but restored his limbs to walk back to his palace. Why? — Subramanian Swamy (@Swamy39) 22 June 2016 -
పాట్నాలో రావణ దహనం
-
అక్కడ రావణుడిని పూజిస్తారు..
కాన్పూర్: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. పురాణాల ప్రకారం విజయదశమి పండుగ వెనుక విభిన్న కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో రాక్షసరాజు రావణ సంహారం కూడా ఒకటి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మను టపాసులతో దహనం చేయడం ఆచారంగా వస్తోంది. అలాంటిది దేశంలోని ఓ ప్రాంతంలో రావణుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఏటా దసరా పర్వదినాన రావణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఉన్న రావణుడి ఆలయం 'దశానన్'లో దసరా రోజున దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అక్కడి ప్రజలు రావణుడిని శక్తి స్వరూపంగా విశ్వసిస్తారు. 147 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అయితే అదంతా కేవలం దసరా పర్వదినానే.. ఎందుకంటే ఏడాది పొడవునా మూసి ఉండే రావణ ఆలయాన్ని కేవలం దసరా రోజునే తెరుస్తారు. రోజంతా పూజలందుకున్న రావణుడి బొమ్మని దహనం చేశాక ఆలయ ద్వారాలు మూతపడతాయి. తిరిగి మరుసటి ఏడాది దసరా నాటికే అపర శివభక్తుడైన రావణుడి దర్శనం. -
నమ్మకపోటు
• సోల్ / వెన్నుపోటు వెన్నుపోటు... నమ్మకద్రోహం... మానవజాతిలో ఇదేమీ కొత్త అవలక్షణం కాదు. నాగరికత మొదలైన నాటి నుంచి ఉన్నదే. ఆధునిక రాజకీయాల్లోనే కాదు, పురాణాల్లోను, చరిత్రలోను కూడా వెన్నుపోటు ఉదంతాలు కొల్లలుగా కనిపిస్తాయి. ఆశించిన అందలాలెక్కడానికి పనికొచ్చే ఎలాంటి నైపుణ్యాలనూ జీవితంలో సాధించలేని కొందరు అదేపనిగా సాధనచేసి వంచనాశిల్ప నైపుణ్యంలో ఆరితేరిపోతారు. తమ తమ నెలవులలో, కొలువులలో నమ్మకంగా కొనసాగుతూనే, తమపై నమ్మకం పెంచుకున్న వారు ఆదమరచిన వేళ అదను చూసి వెన్నుపోటు పొడుస్తారు. నమ్మకద్రోహుల్లో కొందరు అక్షరాలా వెన్నులో కత్తి దించేస్తారు. నమ్మకద్రోహుల్లో కొందరు పాపం అహింసావాదులు కూడా ఉంటారు. తమ చేతికి నెత్తుటి తడి అంటకుండా, శత్రువు చేతికి గుట్టుమట్లన్నీ అప్పగించేస్తారు. లేదా, అదను చూసి అధికార పీఠాన్ని లాగేసుకుంటారు. పురాణాల్లో విభీషణుడు పురాణాల్లో నమ్మక ద్రోహుల గురించి చెప్పుకోవాలంటే, ముందుగా విభీషణుడి సంగతి చెప్పుకోవాలి. సొంత అన్నకే ద్రోహం తలపెట్టాడు. రావణుడు సీతను అపహరించిన కారణంగానే రామ రావణ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. రాముడి తరఫున వానరసేన, రావణుడి తరఫున రాక్షస సేన యుద్ధంలో బలాబలాలు తేల్చుకుంటే అదో లెక్క. ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ‘గాలి’వాటం చూసుకుని పార్టీలు ఫిరాయించినట్లుగానే, సరిగా యుద్ధం మొదలవడానికి ముందు విభీషణుడు కూడా ఫిరాయించాడు. సీతను అపహరించడం రావణుడి తప్పే కావచ్చు. అయితే, యుద్ధంలో అతడి తరఫున పోరాడటం విభీషణుడి నైతిక ధర్మం. విభీషణుడు ఆ నైతిక ధర్మాన్ని విడిచిపెట్టి, రావణుడితో గొడవపడ్డాడు. యుద్ధానికి ముందు రాముడి పక్షాన చేరిపోయాడు. అంతటితో ఆగకుండా, ఎక్కడ కొడితే రావణుడు కచ్చితంగా మరణిస్తాడో ఆ రహస్యాన్ని కూడా రాముడికి చెప్పేశాడు. చేతికి నెత్తుటితడి అంటకుండానే, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. రామ రావణ యుద్ధం ముగిశాక, రాముడి సమక్షంలో లంకకు రాజుగా పట్టాభి షిక్తుడయ్యాడు. విభీషణుడి నమ్మకద్రోహం రావణుడికి అనూహ్య పరిణామం. శౌర్యప్రతాపాలు పెద్దగా లేని విభీషణుడు శత్రువు పక్షాన చేరితే తనకేం నష్టమని రావణుడు నిర్లక్ష్యం చేశాడు. పెద్ద తమ్ముడు కుంభకర్ణుడు, కొడుకు ఇంద్రజిత్తు వంటి వీరాధివీరులు తన వెంటే ఉండగా, కోతిమూకను వెంటేసుకు వచ్చిన రాముడు తననేం చేయగలడని దురహంకారంతో తేలికగా తీసుకున్నాడు. తమ్ముడైన విభీషణుడు తన గుట్టుమట్లన్నీ రాముడి చేతికిచ్చేస్తాడని ఏమాత్రం ఊహించలేకపోయాడు. రోమన్ చరిత్రలో బ్రూటస్ ప్రాచీన చరిత్రలో రోమన్ రాజ్యంలోని బ్రూటస్కు మించిన నమ్మకద్రోహి మరెవరూ కనిపించరు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్కు నమ్మకమైన ఆంతరంగికుడిగా ఉండేవాడు. అంతటి ఆంతరంగికుడు వెన్నుపోటు పొడుస్తాడని ఎవరూ ఊహించలేరు. పాపం... వెన్నులో కత్తి దిగేంత వరకు సీజర్ కూడా ఊహించలేకపోయాడు. ‘నువ్వు కూడానా బ్రూటస్...’ అని ఆక్రోశంతో వాపోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. జూలియస్ సీజర్ నియంతగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని సెనేటర్లు అతడిపై కుట్ర పన్నారు. సీజర్కు అత్యంత సన్నిహితుడుగా ఉండే బ్రూటస్ను తమతో కలుపుకుంటే తప్ప తమ కుట్రను అమలు చేయడం సాధ్యం కాదని తలచి, అతడిని తమతో కలుపుకున్నారు. సీజర్ సెనేట్లో అడుగుపెట్టిన మరుక్షణమే అతడిపై విరుచుకుపడ్డారు. బ్రూటస్ నమ్మకద్రోహానికి సీజర్ దారుణంగా బలైపోయాడు. మన చరిత్రలో మీర్ జాఫర్ మన దేశంలో పేరుమోసిన నమ్మకద్రోహుల జాబితాలో మీర్ జాఫర్ను తప్పక ప్రస్తావించుకోవాలి. ఇతగాడు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా వద్ద సేనానిగా ఉండేవాడు. సేనాని పదవి అతడికి తృప్తికరంగా ఉండేది కాదు. ఎలాగైనా, ఏనాటికైనా బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించాలనే అధికార కాంక్షతో రగిలిపోయేవాడు. ప్లాసి యుద్ధం అతగాడికి అయాచితంగా కలిసొచ్చింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని బ్రిటిష్ సేనలు 1757లో బెంగాల్పై యుద్ధానికి దిగాయి. నవాబు సిరాజుద్దౌలాను గద్దెదించి, బెంగాల్ను తమ అధికార పరిధిలోకి తెచ్చుకోవాలనేదే బ్రిటిష్వాళ్ల లక్ష్యం. అధికార కాంక్షతో రగిలిపోతున్న మీర్ జాఫర్ బ్రిటిష్ వాళ్లకు పావుగా మారాడు. సిరాజుద్దౌలాకు నమ్మకద్రోహం చేసి, బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపాడు. ఫలితంగా ప్లాసి యుద్ధంలో సిరా జుద్దౌలా బ్రిటిష్ సేనల చేతికి చిక్కి మరణశిక్షకు గురయ్యా డు. అతడి మరణం తర్వాత, బ్రిటిష్ వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా గద్దెనెక్కాడు. బెంగాల్ను ఏలిన చిట్టచివరి ‘స్వతంత్ర’పాలకుడు ఇతడే. ద్రోహకాలం పట్ల తస్మాత్ జాగ్రత్త! రాహుకాలంలో శుభకార్యాలు చేయరాదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. నమ్మకం ఉన్నవాళ్లు పంచాంగం చూసుకుని, రాహుకాలాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. దాని ప్రకారం తమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. కానీ, మనుషులను నిట్టనిలువునా ముంచేసే ద్రోహకాలం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఏ పంచాంగమూ ముందుగా చెప్పలేదు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటే తప్ప ద్రోహకాలాన్ని పసిగట్టడం సాధ్యం కాదు. ఆధునిక కాలంలో వంచనాశిల్పం మరింత అధునాతంగా మారింది. నెత్తుటిచుక్కనైనా చిందించకుండానే గద్దెలను గద్దల్లా తన్నుకుపోయే ఆరితేరిన వంచనాశిల్పులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. అలాంటి వంచనాశిల్ప నిపుణులు మన దేశంలోను, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ‘వెన్నుపోటు’ అనే పదం వినిపించడమే తడవుగా ప్రజలకు చప్పున స్ఫురణకు వచ్చే స్థాయికి ఎదిగిపోయిన వీరులు వారు. అలాగని వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలు వంటివి అధికారంలో ఉన్నవారికి మాత్రమే చేటు తెస్తాయనుకుంటే పొరపాటే! ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా ఏ స్థాయి మనిషికి ఆ స్థాయి వెన్నుపోట్లు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వైవాహిక, ప్రణయ సంబంధాలలో కావచ్చు... సామాజిక, వైయక్తిక సంబంధాలలో వెన్నుపోట్లకు అతీతమైనవి ఏవీ లేవు. ఆదమరపు లేకుండా, అప్రమత్తంగా మెలగడం మినహా వీటి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గమూ లేదు. -
గోండుల దేవుడు రాముడు కాదు రావణుడు!
విభిన్నం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి ఆనుకుని ఉంటుంది విదిశ జిల్లా. ఆ జిల్లా కేంద్రానికి 40 కి.మీ.ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. దాని పేరు రావణ్. ఇది కన్యాకుబ్జ బ్రాహ్మణులు, గోండులు నివసించే గ్రామం. వీరి ఆరాధ్యదైవం రావణుడు. ఆ ఊళ్లో అందరికీ వారి దేవుడంటే అమితమైన భక్తి. ఊళ్లో ఎవరికి పెళ్లి కుదిరినా తొలి ఆహ్వాన పత్రిక అందుకునేది ఆ దేవుడే. వధూవరుల తల్లిదండ్రులు ఆహ్వానపత్రికను దేవుడి పాదాల ముందు పెట్టి తమ బిడ్డల వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయేటట్లు ఆశీర్వదించమని వేడుకుంటారు. ఇదంతా చూస్తే ఆ దేవుడు రాముడేమో అనిపిస్తుంది. కానీ రాముడు కాదు. అయితే కథానాయకుడిగా రాముడి పాత్రను హీరోచితంగా చూపించడానికి దోహదపడిన ప్రతినాయకుడు రావణుడే ఇక్కడ దేవుడు. గోండుల ఆరాధ్యదైవం రావణుడు. రావణ్ గ్రామస్థులకు రావణుడు హీరో. స్కూలు పిల్లలు ఆలయం పక్క నుంచి వెళ్లేటప్పుడు ‘జై లంకేశ్’ అంటూ హుషారుగా సాగిపోతుంటారు. ఈ గ్రామస్థులు దేశంలో అందరిలాగానే అన్ని పండుగలనూ చేసుకుంటారు. కానీ దసరా పండుగను చేయరు. దసరాని రాముని విజయ వేడుక అని భావించరు. రామరావణ యుద్ధాన్ని... ఆర్యులు భారత దేశం మీదకు దండెత్తి గోండుల రాజ్యాలను ఆక్రమించుకునే క్రమంలో జరిగిన ఘర్షణగానే భావిస్తారు. స్థానికులను ఆర్యుల దాడి నుంచి కాపాడడానికి ప్రాణాలొడ్డి పోరాడిన వీరుడిగా రావణుడిని గౌరవిస్తారు. మరో విశేషం ఏమిటంటే... రావణ్ గ్రామంలోని రావణుడి ఆలయంలో విగ్రహం పడుకుని ఉన్న భంగిమలో ఉంటుంది. ఆ విగ్రహాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తే వైపరీత్యాలు సంభవిస్తాయని వారి నమ్మకం. భారతదేశంలో రావణుడికి ఆలయం ఉండడమే విశేషం. అనుకుంటే అది ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పటికి మూడు ఆలయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లా రావణ్ గ్రామంలోని ఆలయం. రెండవది రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్కు సమీపంలో ఉంది. జోధ్పూర్ రాజ్యానికి ప్రాచీన కాలంలో మాండోర్ నగరం రాజధాని. అది రావణుడి భార్య మండోదరి పుట్టినిల్లని స్థానికుల అభిప్రాయం. అక్కడ ముద్గల్ గోత్రీకుల కుటుంబాలు ఇప్పటికీ వందకు పైగా ఉన్నాయి. వారంతా రామరావణ యుద్ధం తర్వాత శ్రీలంక నుంచి జోధ్పూర్కు వచ్చి స్థిరపడిన వారి వారసులమని చెబుతారు. వారితోపాటు ఇతర గోత్రికులు కూడా కొంతమంది ఉన్నట్లు సమాచారం. వారు కూడా రావణుడిని గొప్ప వీరుడిగానే గౌరవిస్తారు. మూడవది కాన్పూర్లో ఉంది. ఇందులో ఓ వైవిధ్యం ఉంది. ఈ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరుస్తారు. ఆ రోజు రావణుడికి విశేష పూజలు చేస్తారు. రాముడి పేరుతో ఊళ్లుంటాయి. రాముడికి ఆలయం ఉంటుంది. మనదేశంలో రాముడి గుడి లేని ఊరు లేదనేటంత అతిశయోక్తిలో చెప్పుకుంటారు కూడా. ఇది సహజం. సర్వసాధారణం. అయితే రావణుడి ఆలయం ఉండడంలో కొంత భిన్నత్వం, వైవిధ్యం దాగి ఉందనే చెప్పాలి. ప్రతి విషయానికీ, విజయానికీ రెండో కోణం ఉంటుంది. ఆ రెండో కోణానికి ప్రతీకలు ఈ ఆలయాలు. -
‘రావణ’లో హనుమంతునిగా చేయాలని ఉంది - విష్ణు
‘‘నాన్నకు, మనోజ్కి ఈ కథ బాగా నచ్చింది. వారిపై నమ్మకంతో కథ పూర్తిగా వినకుండానే నేరుగా సెట్స్కి వెళ్లిపోయా. షూటింగ్ జరుగుతుండగా ఈ కథపై ఆసక్తి పెరిగింది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేను ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటించాను’’ అని తెలిపారు మంచు విష్ణు. ఆయన కథానాయకునిగా, వీరుపోట్ల దర్శకత్వంలో డా.మోహన్బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఈ నెల 17న(రేపు) ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు విష్ణు. ఇంకా మాట్లాడుతూ-‘‘ఈ సినిమా పూర్తయినప్పట్నుంచీ ఒకటే టెన్షన్. దాసరి, బి.గోపాల్, శ్రీను వైట్ల, శ్రీవాస్, జి.నాగేశ్వరరెడ్డి, విరానికాలకు ఈ సినిమా చూపించాను. అందరూ బాగుందని అభినందించారు. దాసరిగారైతే... ఫస్టాఫ్కి 70 మార్కులు వేశారు. శ్రీనువైట్ల అయితే... ‘ఢీ’ చూసినంత ఉద్వేగంగా ఉందన్నారు. దాంతో సినిమాపై నమ్మకం పెరిగింది. దేనికైనా రెడీ కంటే వందరెట్లు బెటర్గా ఉంటుందీ సినిమా. మణిశర్మ సంగీతం, రవితేజ వాయిస్ ఓవర్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని తెలిపారు. మరికొన్ని విషయాలు చెబుతూ-‘‘నాన్నే నాకు గొప్ప క్రిటిక్. ఆయనకు తగ్గ కొడుకుని అనిపించుకోవాలి. తర్వాత విష్ణు తండ్రి మోహన్బాబు అనేంతగా చేరుకోవాలి. నా ముందున్న లక్ష్యం అదే. నాన్నగారి ‘రావణ’ చిత్రం సంక్రాంతికి ప్రారంభం అవుతుంది. అందులో నాకు హనుమంతుడు పాత్ర చేయాలని ఉంది. నాన్నగారి సినిమాలను రీమేక్ చేయమని చాలామంది అడుగుతుంటారు. ‘రాయలసీమ రామన్నచౌదరి’ చిత్రాన్ని తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ చేయమంటే... రజనీకాంత్, విష్ణువర్థన్ లాంటి నటులే ధైర్యం చేయలేకపోయారు. ఇక నా వల్ల ఏమవుతుంది. అయితే... ‘అసెంబ్లీ రౌడీ’ మాత్రం చేస్తా. అలాగే... చిరంజీవిగారి ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’ అంటే నాకు చాలా ఇష్టం. చరణ్ దాన్ని చేస్తే బావుంటుంది. ఒకవేళ చరణ్ చేయకపోతే... ఆ అవకాశం నేను దక్కించుకుంటా’’ అని చెప్పారు విష్ణు.