rws
-
నేడు ఆర్డబ్ల్యూఎస్ జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్
కర్నూలు (అర్బన్): గ్రామీణ నీటి సరఫరా విభాగం జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 27న ఉదయం 9.30 గంటల నుంచి కర్నూలులోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక ఇంజినీర్ బి.నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ గాయత్రీదేవి పర్యవేక్షణలో ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుందని చెప్పారు. జోన్–4 పరిధిలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఏఈఈ/ఏఈ, డీఈఈలు వస్తారని, ఏఈఈ/ఏఈలకు సంబంధించి 84 ఖాళీలు ఉండగా, 114 స్థానాలు ఖాళీ ఏర్పడబోతున్నాయని వివరించారు. డీఈఈలకు 11 స్థానాలు క్లియర్ వేకెన్సీ కాగా, మరో 11 స్థానాలు ఖాళీ కాబోతున్నాయన్నారు. బదిలీలకు అర్హులైన వారితో పాటు పలు కారణాలతో రిక్వెస్ట్ కోరుతూ మరికొందరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని నోటీస్ బోర్డులో ఖాళీలు, భర్తీ అయిన స్థానాల వివరాలను పొందుపరుస్తామని చెప్పారు. -
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.వి.కృష్ణారెడ్డి, తాగునీరు– పారిశుధ్యం ప్రాజెక్టు డైరెక్టర్ హరిరామ్ నాయక్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుతో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్జీవోలతో కలిసి గ్రామాల్లో మంచినీరు, ఇంటింటికి నీటి కుళాయిల ప్రాధాన్యంపై ప్రచారం చేయనున్నట్టు వివరించారు. ఎంపిక చేసిన ఎన్జీవో ప్రతినిధులకు యునిసెఫ్ ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ తరగతులను బుధవారం విజయవాడలో ప్రారంభించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన వీరు జిల్లాల వారీగా మరికొందరికి శిక్షణనిచ్చి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు రూ.25 వేల కోట్ల ఖర్చుతో అన్ని గ్రామాల్లోను ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 40 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. దీంతోపాటు మురుగు నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, వర్షపు నీరు పునర్వినియోగంపై దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ఎన్జీవోలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని యునిసెఫ్ అందిస్తున్నట్టు తెలిపారు. -
గ్రామగ్రామాన సు‘రక్షిత’ నీరు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత సురక్షితమైన తాగు నీటిని ప్రజలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి నిరంతరం పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడైనా కలుషితాలు ఉంటే, ఆ నీటి శుద్ధికి చర్యలు చేపడుతోంది. ఫ్లోరైడ్ తదితర కలుషితాల్లేవని నిర్ధారించుకున్నాక ప్రజలు వినియోగించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ మంచి నీటి సరఫరా కేంద్రాల నుంచి అందిస్తున్న తాగు నీటిలో 97.15 శాతం స్వచ్ఛమైనదని పరీక్షలు తేటతెల్లం చేస్తున్నాయి. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు మధ్య ఏడాది కాలంలో మొత్తం 9,51,337 నీటి శాంపిల్స్కు పరీక్షలు నిర్వహించింది. గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఒక విడత అన్ని గ్రామాల్లో బోర్లు, బావులు, చెరువులు, మంచి నీటి సరఫరా పథకాల నీటికి ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. అవసరమైతే ఏడాదిలో రెండో సారి కూడా పరీక్షలు చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని బోర్ల నీటికీ కూడా గత ఏడాది రెండు విడతలు కెమికల్, హానికర సూక్ష్మ క్రిముల పరీక్షలు చేసినట్లు ఎస్డబ్యూఎస్ఎం ప్రాజెక్టు డైరెక్టర్ హరే రామనాయక్, చీఫ్ కెమిస్ట్ కృష్ణమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. గ్రామాలకే నీటి పరీక్ష కిట్లు సాధారణంగా గ్రామాల్లో తాగు నీటి శాంపిల్స్ను ఆర్డబ్ల్యూఎస్కు అనుబంధంగా పనిచేసే 107 ల్యాబ్లలో పరీక్షిస్తారు. గత మూడేళ్లుగా తాగే నీటి నాణ్యతపై అనుమానం కలిగినప్పుడు అక్కడికక్కడే పరీక్షించేందుకు ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఎఫ్టీకే కిట్లను సరఫరా చేస్తోంది. వీటితో 8 రకాల ప్రమాదకర రసాయనాలను గుర్తించొచ్చు. ఒక్కొక్క కిట్తో వంద శాంపిల్స్ను పరీక్షించొచ్చు. ఈ ఏడాది ఈ కిట్లతో పాటు నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించే హెచ్టూఎస్ కెమికల్ సీసాలను కూడా పంపిణీ చేశారు. మార్చిలోనే 7.50 లక్షల హెచ్టూఎస్ సీసీలు పంపిణీ చేసినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. నీటిని పరీక్షించే విధానంపై గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. దేశంలో ఏపీనే ఫస్ట్ గడిచిన ఏడాది కాలంలో నీటి నాణ్యత పరీక్ష కేంద్రాల్లో (ల్యాబ్లలో) పరీక్షల నిర్వహణలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 వరకు 6,12,458 శాంపిల్స్కు ల్యాబ్లలో కెమికల్, బ్యాకీరియా పరీక్షలు చేశారు. గ్రామాల్లోని ఎఫ్టీకే కిట్లతో మరో 3,38,879 పరీక్షలు జరిపారు. ఇలా పూర్తిస్థాయి శాస్త్రీయంగా ఉండే ల్యాబ్ పరీక్షల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (5.35 లక్షలు), పశ్చి మ బెంగాల్ (5.31 లక్షలు), మధ్య ప్రదేశ్ (5.28 లక్షలు) ఉన్నాయి. నాణ్యమైన నీరే రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీరు ఎంతో సురక్షితమైనదని అన్ని పరీక్షల్లోనూ నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఏడాది మొత్తంలో చేసిన పరీక్షల్లో 97.15 శాతం నీరు సురక్షితమైనదని తేలింది. 2.85 శాతం శాంపిల్స్లో మాత్రమే కలుషిత కారకాలు గుర్తించారు. ల్యాబ్లో 6.12 లక్షల శాంపిల్స్కు పరీక్షలు చేయగా 25,140 నమూనాల్లో కలుషితాలను గుర్తించారు. 3.38 లక్షల ఎఫ్టీకే పరీక్షల్లో 3,077 నమూనాల్లో కలుషితాలు ఉన్నట్టు గుర్తించారు. కేరళ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ నీటిలో అత్యధికంగా కలుషితాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. -
Andhra Pradesh: నీళ్లు.. ఫుల్లు
పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామ సమీపంలోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు (మంచినీటి చెరువు) బొగ్గరం, చిన్న కొండాయపాలెం, పెద్ద కొండాయపాలెం, గుండేపల్లి గ్రామాల్లో ఉండే దాదాపు 1,200 కుటుంబాలకు మంచి నీరు అందిస్తుంది. పది రోజుల కిందట నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వకు సాగు నీటి విడుదల నిలిపివేసే సమయంలోనే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది ఈ ట్యాంకును నింపారు. ప్రస్తుతం చెరువు నీటిని మే, జూన్ నెలలు పూర్తిగా, జులై నెలలో దాదాపు సగం రోజులపైనే ఆ గ్రామాలకు సరఫరా చేయవచ్చని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో 1,480 కుటుంబాలు ఉంటాయి. ఆ గ్రామంలో నిరంతరం మంచినీటి సరఫరాకు ప్రత్యేకంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఉంది. ఇది పూర్తిగా నిండుగా ఉంది. వచ్చే 120 రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మండలంలో మొత్తం 8 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉండగా, అవన్నీ 90 శాతం నీటితో నిండి ఉన్నాయి. – సాక్షి, అమరావతి ఇవే కాదు.. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అధిక శాతం చెరువులను నింపింది. రాష్ట్రవ్యాప్తంగా 1278 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో 76 శాతానికి పైగా చెరువులు వేసవికి సరిపడా నీటితో నిండి ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. నాలుగో వంతు చెరువుల్లో మూడు నెలలకు సరిపడా నీరు ఉందని చెప్పారు. 60 శాతం చెరువుల్లో రెండు నెలలకు పైబడి నీరు ఉన్నట్టు తెలిపారు. 30 రోజులకు లోపు 57 చెరువుల్లోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 31, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో తొమ్మిది, కర్నూలు జిల్లాలో ఎనిమిది చెరువుల్లో నెల రోజుల లోపు అవసరమయ్యే నీరు ఉంది. ఆ ట్యాంకుల సామర్థ్యం తక్కువగా ఉన్నందువల్లే తక్కువ నీరు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కేవలం 8 చెరువుల్లోనే వివిధ కారణాలతో నీరు లేదని తెలిపారు. ఈ ట్యాంకుల పరిధిలోని గ్రామాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా లేదంటే బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. రూ.42.53 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.42.53 కోట్లతో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్డబ్ల్యూఎస్ విభాగం గణాంకాల ప్రకారం గ్రామాలను 48 వేలకు పైబడి నివాసిత ప్రాంతాలుగా వర్గీకరించగా, అందులో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని 105– 132 నివాసిత ప్రాంతాలకు మాత్రమే ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు కొనసాగుతుందని.. ఈ వేసవిలో అవసరమైతే గరిష్టంగా 1855 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎండలు మరింత పెరిగితే 242 నివాసిత ప్రాంతాల్లో పశువుల అవసరాలకు సైతం ఈ వేసవిలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చని ఆర్డబ్ల్యూఎస్ విభాగం ముందస్తు అంచనా వేసుకుంది. -
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది. ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు.. వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► క్లోరైడ్ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. ► లెడ్ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ► ఇక ఫ్లోరైడ్తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్ మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్ 4,01,022 శాంపిల్స్కు.. పశ్చిమ బెంగాల్లో 3,82,846 శాంపిల్స్కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
వేసవిలోనూ తాగునీరు పుష్కలం!
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అంచనా వేస్తోంది. భూగర్భ జలాలతోపాటు చెరువుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో ఈ వేసవిలో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వేసవి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను ఆర్డబ్ల్యూఎస్ సిద్ధం చేస్తుంటుంది. ఈ ఏడాది జనవరి నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో ఏటా నీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లోని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నట్టు జిల్లాల నుంచి నివేదికలు అందాయి. సాధారణంగా చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఏటా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన గ్రామాల్లో మూడొంతులు చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామాలే ఉంటాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం అత్యధికంగా వర్షాలు కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో జనవరి నెలలో సాధారణం కంటే 39.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఏటా నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో సాధారణం కంటే 55.9 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు చెబుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎండిపోయినట్టు ఏ ప్రాంతం నుంచి సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో.. కాగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాల్లోని గ్రామాల్లో నడివేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జనవరిలో రాష్ట్రమంతటా అధిక వర్షాలు నమోదైనా.. ప్రకాశం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 4 శాతం తక్కువగా వర్షాలు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లోని పరిస్థితులపై అర్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు రప్పించుకుంటున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్చి మధ్యలో మరోసారి అంచనా ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అన్ని గ్రామాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు అందుబాటులో ఉందని సమాచారం అందడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జనవరి–ఫిబ్రవరిల్లో సిద్ధం చేయాల్సిన మంచినీటి సరఫరా కార్యాచరణ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మార్చి మొదటి వారం తర్వాత జిల్లాల నుంచి మరోసారి సమాచారం రప్పించుకుని యాక్షన్ ప్లాన్పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
పురుగు మందుల అవశేషాలకు చెక్
సాక్షి, అమరావతి: తాగునీటిలో ఉండే పురుగు మందుల అవశేషాలను గుర్తించే అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబొరేటరీలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే లెడ్, మెర్క్యురీ, క్రోమియం వంటి లోహాలు తాగునీటిలో సూక్ష్మస్థాయిలో ఉన్నా ఈ అత్యాధునిక ల్యాబ్లు పసిగట్టేస్తాయి. గ్రామీణ ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోరు బావులతోపాటు ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాల్లోని నీటి నమూనాలను గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు సేకరించి, నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందుకు గాను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో మొత్తం 112 నీటి పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లుతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని నీటి పరీక్షా కేంద్రాలను ఒక్కొక్కటీ రూ.6 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధునికీకరించింది. వీటిలో వినియోగించే అత్యాధునిక యంత్ర సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. ల్యాబ్ల నిర్వహణ సైతం అమెరికన్ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. 4 ల్యాబ్ల ఏర్పాటు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తెలిపారు. మరో 4 ల్యాబ్ల ఆధునికీకరణకు ప్రతిపాదన జోన్ల వారీగా రాష్ట్రంలో మరో నాలుగు నీటి పరీక్షల ల్యాబ్లను కూడా ఈ తరహాలోనే ఆధునికీకరించేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖలో, రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి కడపలో, విజయవాడలో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొకటి ఈ తరహా అత్యాధునిక ల్యాబ్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏలూరు ఘటన తర్వాత సీఎం ఆదేశాల మేరకు సుమారు ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో అంతుచిక్కని సమస్యతో ఒకే రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. పురుగు మందుల అవశేషాలతో కూడిన నీటిని తాగడం వల్లే ఆ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీటి కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, తాగునీటిలో దాగి ఉండే పురుగుమందుల అవశేషాలను, మెర్క్యురీ వంటి ప్రమాదకర సూక్ష్మస్థాయి మెటల్స్ను గుర్తించడానికి నీటి పరీక్ష కేంద్రాలు ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబ్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మొదటగా నాలుగు ల్యాబ్లను ఆధునికీకరించారు. -
లక్ష్యం మేరకు మంచినీటి కుళాయిలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమ అమలుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈ స్థాయి అధికారులతో సచివాలయంలో నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. కుళాయిల ఏర్పాటుకు సంబంధించి రెండ్రోజుల్లో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి వేగంగా పనులకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. వారం తర్వాత మరోసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆర్డబ్ల్యూఎస్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ విభాగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. పనుల పురోగతిపై నిరంతర సమీక్ష డిసెంబర్ 31 నాటికి ఈ పనులు పూర్తి చేసేలా అధికారులు లక్ష్యం పెట్టుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు స్పష్టం చేశారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్షించాలని, టార్గెట్లు పెట్టుకోవాలని సూచించారు. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నాడు–నేడు పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. వర్క్ షాపులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారుతున్నది కాలువ కాదు... సాగర్ నీరు
సాక్షి, తోకపల్లె (పెద్దారవీడు): మండలంలో తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి దేవాలయం పక్కనే ఉన్న సాగర్ ఎయిర్వాల్ లీకుతో నీరంతా వృథాగా పోతుంది. ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం ద్వారా త్రిపురాంతకం మండలం దుపాడు చెరువు నుంచి తోకపల్లె, గొబ్బూరు, దేవరాజుగట్టు మీదుగా పెద్దసైజు నీటి పైపుల ద్వారా మార్కాపురం పట్టణానికి నీరు సరఫరా చేస్తున్నారు. అమరావతి– అనంతపురం జాతీయ రహదారిలోని తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి వద్ద పైపు ఎయిర్ వాల్ లీక్ కావడంతో పొలాల మీదుగా సాగర్ నీరంతా వృథాగా తీగలేరు కాలువలోకి వెళ్తున్నాయి. వేసవి కోసం పొదుపుగా నీటిని వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎయిర్వాల్ లీకేజితో నీరంతా రోజూ కొన్ని వేల లీటర్ల నీరు నేలపావుతోంది. ఎయిర్వాల్ లీకేజి గురించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వదిలిన సమయంలో తీగలేరులోకి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు మాత్రం మరమ్మతులు చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అసలే వేసవి కాలంలో ప్రజలు, పశువులు తాగునీటితో అల్లాడిపోతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిప్యు‘టెన్షన్’!
– ఆర్డబ్ల్యూఎస్, పీఆర్లో నేతల పెత్తనం – అడుగులకు మడుగులొత్తే వారికే ప్రాధాన్యత – మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉద్యోగులు – పంచాయతీరాజ్ శాఖలో ఒకే జేఈ మూడు చోట్ల విధులు – ఆదాయం తెచ్చి పెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్ అనంతపురం సిటీ : గ్రామీణ రక్షిత మంచినీటి విభాగం (ఆర్డబ్ల్యూఎస్), పంచాయతీరాజ్ (పీఆర్) శాఖలో అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగిపోయింది. తమకు కావలసిన వారిని కోరుకున్న చోటుకు డిప్యూటేషన్పై పంపాల్సిందే. మాట వినకుంటే ఉన్నతస్థాయి అధికారులకైనా ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. తాజాగా ఈ శాఖలోని ఓ ఉన్నతాధికారి తనకు అనుకూలంగా పనులు చేసి పెట్టలేదన్న కారణంగా ఓ ప్రజాప్రతినిధి నేరుగా కార్యాలయానికి వచ్చి తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. మానసిక ఒత్తిడికి గురై కొందరు అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలూ లేకపోలేదు. జిల్లా పరిషత్ సీఈఓ పర్యవేక్షణలో జరగాల్సిన డిప్యూటేషన్లను ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆదాయం తెచ్చిపెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప సీఈఓ స్థాయి అధికారి ఈ డిప్యూటేషన్లలో సిబ్బందిని విధులకు పంపరాదు. కానీ ఈ రెండు శాఖల్లో నిబంధనలు అమలు కావడం లేదు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో లోపాయికారి ఒప్పందాలు చాలా ఎక్కువని ఉద్యోగులు వాపోతున్నారు. విధులక్కడ.. జీతమిక్కడ పంచాయతీరాజ్ శాఖలో ఐదేళ్లు పదవి కాలం పూర్తయిన వారికి తప్పని సరి బదిలీ ఉంటుంది. కాగా, ఉన్నతాధికారికి సన్నిహితంగా.. రాజకీయ నేతల అడుగులకు మడుగులు ఒత్తే వారికి కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో డీఈ అసలు స్థానాన్ని వదిలేసి రాయదుర్గంలో విధులు నిర్వహిస్తున్నారు. జీతం తీసుకుంటోంది మాత్రం తాడిపత్రిలోనే... ఇందులో మరో విశేషం ఏమిటంటే అనంతపురం ఎస్ఈ ఆఫీసులో విధులు నిర్వహించే అధికారిని తాడిపత్రికి డిప్యూటేషన్పై పంపారు. జేఈ ఒకరే.. విధులు మూడు చోట్ల గుత్తిలో విధులు నిర్వహించాల్సిన జేఈ మడకశిరతో పాటు కదిరిలో కూడా జేఈగా కొనసాగుతున్నారు. జీతం గుత్తిలోనే తీసుకుంటున్నారు. ఇదెలా సాధ్యమని తోటి ఉద్యోగులు మండి పడుతున్నారు. ఎవరు చేతులు తడిపితే వారికి ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారని విమర్శిస్తున్నారు. కణేకల్ జేఈగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పుట్లూరులో జీతం తీసుకుంటున్నారు. ఇక ధర్మవరంలో విధులు నిర్వహించాల్సిన వ్యక్తి పెద్దవడుగూరులో డిప్యూటేషన్పై కొనసాగుతున్నారు. డిప్యూటేషన్ల విషయమై పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బారావును వివరణ కోరగా.. తాను కొత్తగా వచ్చానని, ఎవరెవరు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారనే వివరాలు పూర్తిగా తెలియదని చెప్పారు. రెండ్రోజుల క్రితం యథాస్థానాలకు పంపాం - ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, హరేరామ్నాయక్ రెండు రోజుల క్రితం 28 మంది డిప్యూటేషన్లను రద్దు చేసి యథాస్థానాలకు పంపాం. మొదటి నుంచి పోస్టింగ్ ఎక్కడకు వస్తే అక్కడికే అధికారులను పంపాం. వారికున్న ఇబ్బందుల రీత్యా విధులకు వెళ్లలేని స్థితిలో ఉంటే సర్కిల్ కార్యాలయంలోనే అవకాశం కల్పించాం. మా వద్ద డిప్యూటేషన్పై వెళ్లిన వారు లేరు. -
ప్రత్యామ్నాయమే శరణ్యం
- నీటి సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం కేఈ - గ్రామాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశం - తక్షణ పరిష్కారం కింద ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్): ‘జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఆర్డబ్ల్యూఎస్ ఆధికారులు అన్ని పంచాయతీలు, నివాసిత ప్రాంతాల్లో అధ్యయనం చేసి పక్కా ప్రణాళికలతో ప్రతిపాదనలు పంపితే తక్షణ చర్యలు తీసుకుంటాం.. అప్పటి వరకు సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయండి’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నీటి సమస్య, పరిష్కారంపై ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా నీటి సమస్య తీవ్రత, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం కేఈ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుంకేసుల ద్యామ్లో నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులను అన్వేషించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమున్న గ్రామాల్లో నీటి వనరులు గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తే జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేస్తారని కేఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు స్పష్టం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలకు జాప్యం లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశానికి నీటిపారుదల శాఖ సీఈ గైర్హాజరుకావడంపై కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది బకాయిలు చెల్లించాలి... నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో గత ఏడాది ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించిన పెండింగ్లో ఉన్న రూ.1.32 కోట్ల బిల్లులను చెల్లిస్తే ఈ ఏడాది నీటి సరఫరాకు కంట్రాక్టర్లు ముందుకు వస్తారని పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. నంద్యాల మండలం కొత్తపల్లిలో సర్పంచ్ ప్రభుత్వ బోరు పైప్లైన్ను కట్ చేసి నీటి సరఫరాకు ఆటంకాలు కల్గిస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిద్ర పోతున్నారా అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై విరుచుకు పడ్డారు. సోమవారం సాయంత్రానికి పైప్లైన్ను పునరుద్ధరించాలని, సర్వంచ్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 8 గ్రామాలకు నీరు అందించే శ్రీరంగాపురం సీపీడబ్ల్యూ స్కీమ్ను పునరుద్ధరించాలని మంత్రి జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఫైళ్లు తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు.. నీటి సమస్య పరిష్కారానికి సంబంధించిన ఫైళ్లను మీ దగ్గరకు తెచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు భయపడుతున్నారని డోన్ నియోజక టీడీపీ ఇన్చార్జీ కేఈ ప్రతాప్ పేర్కొనగా తప్పు చేసిన వారికే భయం ఉంటుందని, మిగతావారు ధైర్యంగా వస్తారని కలెక్టర్ బదులిచ్చారు. ప్రస్తుతం ఆన్లైన్ ఫైళ్లు కావడంతో ఆ సమస్య కూడా లేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సుంకేసుల డ్యామ్లో తుంగభద్ర నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. అన్ని గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయండి నీటి సమస్య సమీక్షలో భాగంగా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉన్న గ్రామాలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అయితే ఇందుకు వర్క్ ఆర్డర్ ఉండి తీరాలని తెలిపారు. సమస్య పరిష్కారానికి గ్రామ సభలతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, మణిగాంది, బుడ్డారాజశేఖర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నీరు ఉంటేనే అభివృద్ధి సాధ్యం
– ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణ కర్నూలు(అర్బన్): ఎక్కడ నీరు పుష్కలంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం కర్నూలు ఈఈ వెంకటరమణ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్లోని తన ఛాంబర్లో డివిజన్లోని డీఈఈ, ఏఈలతో నీటిని వృథా చేయరాదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఈఈ వెంకటరమణ మాట్లాడుతూ గ్రామాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఎక్కడైనా నీరు వృథా అవుతున్నట్లు సమాచారం వస్తే వెంటనే ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. మానవాళి మనుగడకు నీరు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరాల మేరకు రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో కర్నూలు, డోన్, నందికొట్కూరు డీఈఈలు మురళీధర్రావు, సురేష్బాబు, ఏడుకొండలు, క్వాలీటి కంట్రోల్ డీఈఈ రషీద్ఖాన్తో పాటు డివిజన్లోని ఏఈలందరు హాజరయ్యారు. -
ఏసీబీకి పట్టుబడిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
-
ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
రూ.6 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం ఎస్ఈ, సూపరింటెండెంట్ ఆస్తులపై సోదాలు నల్లగొండ క్రైం: ఏసీబీ అధికారులు శుక్రవారం ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారు లను అరెస్టు చేశారు. నల్లగొండలో ఓ కాం ట్రాక్టర్ వద్ద రూ.6 లక్షలు లంచం తీసుకుం టుండగా గ్రామీణ తాగునీటి పథకం (ఆర్డబ్ల్యూఎస్) సూపరింటెండెంట్ను, ఇం దుకు ప్రోత్సహించిన ఎస్ఈని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నల్లగొండ విజిలెన్స్ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారి భాస్కర్రావు లంచం తీసుకుంటుం డగా పట్టుబడిన విషయం మరువక ముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీకీ చిక్కడం ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. ఇలా చిక్కారు.. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన శాస్త్రీ వివేకానందరెడ్డి పుష్కరాల సమయంలో నల్లగొండ జిల్లా పరిధిలోని ఆర్వో ప్లాంట్లు సహా మొత్తం 39 పనులను చేపట్టాడు. టెండర్ లేకుండా కాంట్రాక్టర్కు అప్ప గించడంతో పనులు పూర్తి చేశాడు. 30 పనులకు బిల్లులు చెల్లించగా, మిగిలిన తొమ్మిది పనులకు రూ.30 లక్షల బిల్లులు రావాల్సి వుంది. ఈ బిల్లుల కోసం కాం ట్రాక్టర్ మూడు రోజుల క్రితం సూపరిం టెండెంట్ లక్ష్మారెడ్డిని కలవగా రూ.6 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో వివేకా నందరెడ్డి ఏసీబీ నల్లగొండ డీఎస్పీ కోటేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుం డగా అక్కడే కాపుగాసిన ఏసీబీ అధికారులు లక్ష్మారెడ్డిని పట్టుకున్నారు. బిల్లుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈని హైదరాబాద్లో.. లంచం విషయంలో లక్ష్మారెడ్డిని ప్రోత్సహిం చిన ఎస్ఈ రమణను ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని నల్లగొండకు తీసుకొచ్చారు. ఇద్దరి ఆస్తుల ను తనిఖీ చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
కన్నీళ్లే!
– దాహార్తి తీర్చని జేసీ నాగిరెడ్డి పథకం – వృథాగా సంపులు, సబ్స్టేషన్లు – విలువైన పరికరాలకు భద్రత కరువు – నిర్వహణ బాధ్యత మరచిన ఆర్డబ్ల్యూఎస్ ––––––––––––––––––––––––––––––––– ఒకట్రెండు కాదు.. ఏకంగా 1,200 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన పథకమది. వందలు, లక్షలు కాదు.. రూ.కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టారు. తొలినాళ్లలో పనులు చకచకా సాగాయి. వాటిని చూసి ఇక తమ దాహార్తి తీరినట్లేనని ఆయా గ్రామాల ప్రజలు సంబరపడ్డారు. అయితే.. వారి ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. పథకం నిరుపయోగంగా మారింది. సంపులు, సబ్స్టేషన్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. విలువైన పరికరాలు కొన్ని మాయమయ్యాయి. మరికొన్ని తుప్పు పట్టిపోతున్నాయి. ఇదీ జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం తీరు. –––––––––––––––––––––––––––––––––––––– తాడిపత్రి : జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు రక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం పరిధిలోకి తాడిపత్రి, శింగనమల, అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 1,200 గ్రామాలు వస్తాయి. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి 1.2 టీఎంసీల నీటిని శుద్ధి చేసి.. అనంతరం ఆయా గ్రామాలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో చేపట్టారు. ఇందుకోసం రూ.508 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఐదింటికే నీరు ప్రస్తుతం ఈ పథకం ద్వారా రోజూ మూడు లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా తాడిపత్రి టౌన్, గన్నెవారిపల్లి, చల్లవారిపల్లి, జమ్ములపాడుకు సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో సంప్నకు రూ.60 లక్షల చొప్పున ఖర్చు పెట్టి మొత్తం 15 సంపులు నిర్మించారు. పంపింగ్ కేంద్రాలు, సబ్ స్టేషన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇందులో రెండు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన 13 సంపులు, పంపింగ్ కేంద్రాలు, సబ్స్టేషన్లు వథాగా మారాయి. పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన పరికరాలకు భద్రత లేకుండా పోయింది. ఇప్పటికే కొన్ని పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు. మరికొన్ని తుప్పుపట్టిపోతున్నాయి. సంపులు, సబ్స్టేషన్లు, పంపింగ్ హౌస్ల చుట్టూ కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. రూ.కోట్ల విలువైన పథకం కళ్లెదుటే నిరుపయోగంగా మారినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదు. పరికరాలను ఉపయోగించకపోయినా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని మరచిపోయారు. ప్రణాళిక రూపొందించాం – ఫయాజ్, డీఈ, జేసీ నాగిరెడ్డి పథకం సంపుల్లో రెండు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మిగిలిన వాటిని పని చేసే స్థితికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక తయారు చేశాం. దశల వారీగా చర్యలు తీసుకుంటాం. -
త్వరలోనే రక్షిత పథకాలు పూర్తి చేస్తాం
రణస్థలం : ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద ఉన్న భారీ రక్షిత మంచినీటి పథకంSద్వారా ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల్లోని 175 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ పి.సూర్యనారాయణ తెలిపారు. ఇందుకోసం రూ.90 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. రణస్థలం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి సోమవారం విచ్చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రణస్థలం మండలంలోని పిషిణి, చిన్నపిషిణి, నెలివాడ గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మోటార్లు, పైప్పులైన్ పనులకు ప్రభుత్వం 1.09 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వివరించారు. కొత్తముక్కాం, కొమరవానిపేట గ్రామాలకు రక్షిత పథకాలు ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ శివకుమార్ పాల్గొన్నారు. -
కీలక శాఖలు సీఎం చేతికి..
కేసీఆర్కు అదనంగా ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల బాధ్యతలు మంత్రుల శాఖలు మార్చుతూ ఉత్తర్వులు జారీ కేటీఆర్కు మున్సిపల్, ఐటీలకుతోడు పరిశ్రమలు, గనులు, ఎన్నారై వ్యవహారాలు జూపల్లికి పంచాయతీరాజ్ శాఖతో సర్దుబాటు తలసానికి పశుసంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలు పోచారం శ్రీనివాసరెడ్డికి సహకారం.. హరీశ్ శాఖల్లో కోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన శాఖల బాధ్యతలు నేరుగా సీఎం కేసీఆర్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఎంతో ప్రధానమైన ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల శాఖలను కేసీఆర్ తన పరిధిలోకి తీసుకున్నారు. దీంతోపాటు మంత్రులు కె.తారకరామారావు, హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్రెడ్డిల శాఖల్లో మార్పులు చేశారు. ముఖ్యమంత్రి తుది ఆమోదం మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేటాయింపులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి తన దగ్గరున్న శాఖలకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్యాదవ్ను కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి.. పశు సంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. వీటిని తొలగించడంతోమిగిలిన వ్యవసాయ శాఖకు అదనంగా సహకార శాఖను పోచారానికి అప్పగించారు. మంత్రి కె.తారకరామారావుకు మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మున్సిపల్, ఐటీ శాఖలకు తోడుగా పరిశ్రమలు-వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, గనులు-భూగర్భ వనరులు, ఎన్నారై వ్యవహారాల శాఖలను అప్పగించారు. పరిశ్రమలు-వాణిజ్య శాఖకు ఇప్పటివరకు జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖను అప్పగించి సర్దుబాటు చేశారు. హరీశ్రావు విజ్ఞప్తి మేరకే.. మంత్రి హరీశ్రావుకు మొదట కేటాయించిన శాఖల్లో మరోసారి కోత పడింది. ఇప్పటికే జరిగిన స్వల్ప మార్పుల్లో ఆయన దగ్గరున్న సహకార శాఖను తొలగించగా... ఇప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలతో తనపై పనిభారం పెరిగినందున... గనులు, భూగర్భ వనరుల శాఖను మరొకరికి అప్పగించాలని హరీశ్రావు స్వయంగా మూడు నెలల కింద సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కొత్తగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వం కొత్తగా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ విభాగం పంచాయతీరాజ్లో అంతర్భాగంగా ఉండేది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో... ముఖ్యమంత్రి ఈ శాఖను ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకుకీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. -
‘స్వచ్ఛత’వైపు అడుగులేయండిలా..
రాయవరం : స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ ఓ మరుగుదొడ్డి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. వాటి నిర్మాణం కోసం పేదలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి దరఖాస్తు చేసుకునే విధానం.. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వివరాలివీ.. ఎవరు అర్హులంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యాన పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాయి. తెలుపురంగు రేషన్కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు ప్రభుత్వ ఆర్థిక సాయంతో మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి అర్హులు. మరుగుదొడ్డి నిర్మించుకోవాలనుకునేవారు ముందుగా దరఖాస్తు పూర్తి చేసి, రేషన్, ఆధార్కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను జత చేసి పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. లబ్ధిదారులను ఇలా ఎంపిక చేస్తారు వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పంచాయతీ పాలకవర్గంలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారి జాబితాను ఎంపీడీవోకు పంపిస్తారు. ఆయన ఆ జాబితాను ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్కు పంపిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం ఆ దరఖాస్తులు జిల్లా కలెక్టర్కు చేరుతాయి. కలెక్టర్ ఆమోదంతో మరుగుదొడ్లు మంజూరవుతాయి. కొలతల ప్రకారం నిర్మాణం అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారమే లబ్ధిదారులు మరుగుదొడ్డి నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆరడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు, రెండోది నాలుగు అడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు. ఏ కొలత ప్రకారం నిర్మించుకున్నా పైకప్పుగా రేకు వేసుకోవాలి. ఆర్థిక సాయం ఎంతంటే.. లబ్ధిదారుడు నిర్మించుకున్న మరుగుదొడ్డి కొలతలనుబట్టి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఆరడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పున నిర్మించుకుంటే రూ.15 వేలు, నాలుగడుగుల పొడవు, మూడడుగుల వెడల్పున నిర్మించుకుంటే రూ.12 వేలు చొప్పున లబ్ధిదారునికి రెండు దశల్లో చెల్లిస్తారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, కేంద్ర ప్రభుత్వం 75 శాతం సమకూరుస్తాయి. ఈ సాయాన్ని లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు. -
పని చేయని ‘పథకం’
గుర్ల: అసలే వర్షా కాలం..ఆపై తాగు నీరు స్తంభించిందంటే గ్రామీణ ప్రజల అవస్థలు చెప్పనక్కర్లేదు. ఇదే పరిస్థితిన ఎదుర్కొంటున్నారు మండలంలోని ఎస్ఎస్ఆర్పేట, మణ్యపురిపేట, రాగోలు తదితర గ్రామాల ప్రజలతో పాటు నెల్లిమర్ల మండలంలోని గుషిణి, జోగిరాజుపేట తదితర 52 గ్రామాల ప్రజలు. ఆయా గ్రామా లకు తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం రామతీర్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసింది. పథకం ఆరంభించినప్పటి నుంచి నిర్వహణ లోపం వెంటాడుతోంది. అయితే ఇటీవల పథకం తీరు మరీ అధ్వానంగా తయారైంది. ఈ పథకానికి సంబంధించిన పంపుహౌస్, మోటార్లు ఎస్ఎస్ఆర్పేట సమీపంలో ఉన్న చంపావతి నదిలో ఉన్నాయి. పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీరు పైపులైన్ల ద్వారా 52 గ్రామాలకు సరఫరా అవ్వాలి. అయితే వారం రోజుల క్రితం పంపుహౌస్లో ఉన్న మోటార్లు పనిచేయకపోవడంతో గ్రామాలకు తాగు నీరు సరఫరా కావడం లేదు. ఆయా గ్రామాల నుంచి తాగు నీరు అందడం లేదని ప్రతిరోజూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు సంబంధిత నిర్వాహకులకు ఎన్ని ఫిర్యాదులిచ్చినా, ఫోన్లు చేసినా ప్రయోజనం లేకపోతోందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరుచూ లో, హై ఓల్టేజీతో మోటార్లు పాడవుతున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడం సాధారణమైపోయిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి కోసం గ్రామ సమీపంలో ఉన్న బావులను ఆశ్రయిస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో బావుల్లోని నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నట్లు పలువురు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మలి దశలో పట్టణ వాటర్గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక వాటర్గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశలో గ్రామీణ ప్రాంత పనులే జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో జరగనున్న పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్గ్రిడ్ నిర్మాణ పనులను ప్రారంభించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి పనులు చేపడితే ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. పట్టణ శివార్ల వరకు ప్రాజెక్టు పనులన్నీ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలోనే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల శివార్ల వరకు ప్రధాన పైప్లైన్లు వేస్తే, మునిసిపాలిటీలు అక్కడి నుంచి నీటిని తరలించుకుని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను 26 ప్యాకేజీలుగా విభజించి 11 ప్యాకేజీల పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 15 ప్యాకేజీలకూ టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే పట్టణ ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల అనుసంధానం పూర్తయిన తర్వాతే పట్టణాల్లో సర్వీసు రిజర్వాయర్లు, క్లియర్ వాటర్ ఫీడర్ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇంటింటికి నల్లా కనెక్షన్ తదితర పనులను చేపట్టనున్నారు. 2035 అవసరాలకు తగ్గట్లు.. వాటర్గ్రిడ్ కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలనపర అనుమతులు రాలేదు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మునిసిపాలిటీల్లో ఇంటింటికి నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్లతో పనులు చేయాల్సి ఉందని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 2035 సంవత్సరం నాటికి పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్లు తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులతో పనులను చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు హడ్కో నుంచి రుణం అందిన తర్వాతే ఈ పనులకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
వా(ట)ర్ గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో సైతం డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా విభాగానికే (ఆర్డబ్ల్యూఎస్) అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రిడ్ నిర్మాణ బాధ్యతల నుంచి ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగాన్ని తప్పించాలని కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గ కేంద్రమైన ‘గజ్వేల్’ పట్టణంలో గ్రిడ్ నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్కే అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం చర్చకు దారితీసింది. వాటర్ గ్రిడ్ పనులపై ఆయన సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి కె.తారకరామారావు, ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రపంచ బ్యాంక్ రుణం రూ.60 కోట్లతో గజ్వేల్లో పథకం పనులను ఆర్డబ్ల్యూఎస్ నిర్వహిస్తుండగా.. వాటర్ గ్రిడ్ పనుల్నీ అదే విభాగానికి అప్పగించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆర్డబ్ల్యూఎస్తో పోల్చితే ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ముందుంది. కానీ దాన్ని శివార్లలోని ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్ల నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేయడం వరకే పరిమితం చేశారు. తాజా సమాచారంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో డ్రైవర్ ఆత్మహత్య
పశ్చిమగోదావరి: విధులు నిర్వర్తించేందుకు వచ్చిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తణుకు ఆర్డబ్ల్యూఎస్(తాగునీటి సరఫరా) కార్యాలయంలో చోటుచేసుకుంది. డ్రైవర్గా ఆర్డబ్య్లూఎస్లో విధులు నిర్వర్తిస్తున్న పెంటయ్య(52) ఈ రోజు(మంగళవారం) ఉదయం కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్థీక ఇబ్బందుల వల్లె ఆత్మహత్యకకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. -
జలదరింపే!
సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ నుంచి తప్పుకొన్న ఆర్డబ్ల్యూఎస్ ఈ పథకాల బాధ్యతంతా జలమండలి పరిధిలోకి.. నీటి చార్జీల వసూలు మొదలు కేటాయింపులపై వాటర్బోర్డుదే తుదినిర్ణయం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్) అమలు బాధ్యత నుంచి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) తప్పుకుంది. ఈ పథకాల నిర్వహణను జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)కి అప్పగించింది. ఇకపై పథకాల నిర్వహణతోపాటు పర్యవేక్షణ బాధ్యతలన్నీ జలమండలే చూసుకోనుంది. నీటి కేటాయింపులు మొదలు.. చార్జీల వసూలులో వాటర్బోర్డు అధికారుల నిర్ణయమే కీలకం కానుంది. ప్రస్తుతం జిల్లాలో 11 సీపీడబ్ల్యూఎప్ పథకాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ఔటర్ రింగ్రోడ్డు లోపల, వెలుపల ఉన్న 161 గ్రామ పంచాయతీలు, హాబిటేషన్లలోని ప్రజలకు రక్షిత నీటిని అందిస్తోంది. బకాయిలపై బ్రహ్మాస్త్రమే..! ఇప్పటివరకు ఆర్డబ్ల్యూఎస్ విభాగం ఆధీనంలో ఉన్న సీపీడబ్ల్యూఎస్ పథకాలన్నీ తాజాగా జలమండలి పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో నీటి బకాయిలపై గత కొన్నేళ్లుగా పేచీ పెడుతున్న వాటర్బోర్డు అధికారులు.. ప్రస్తుత బకాయిలపై కఠినంగా వ్యవహరించనున్నారు. గతేడాది ఏప్రిల్ వరకు జిల్లా యంత్రాంగం వాటర్బోర్డుకు రూ.86.50 కోట్లు బకాయిపడింది. బకాయిల చెల్లించాలంటూ రెండు, మూడు సార్లు నీటి సరఫరాను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా సీపీడబ్ల్యూఎస్ పథకాల పగ్గాలు తీసుకున్న జలమండలి యంత్రాంగం.. బకాయిలపై సర్చార్జీలతో సహా వసూళ్ళుకు దిగనుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికసంఘం నిధులకు మంగళం.. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేకంగా నిధులిస్తోంది. గత 13వ ఆర్థిక సంఘం ద్వారా ఏటా రూ.13.25 కోట్లు జిల్లాకు విడుదలయ్యేవి. వీటిని నేరుగా తాగునీటి అవసరాల్లో భాగంగా జలమండలికి బిల్లుల రూపంలో నిధులు చెల్లించేవారు. ప్రస్తుతం సీపీడబ్ల్యూఎస్ పథకాలపై జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం తప్పుకోవడంతో ఆ నిధులు ఆర్డబ్ల్యూఎస్ ఖాతాకు వచ్చే అవకాశంలేదని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. కొత్త పథకాలు గగనమే.. ఇదిలాఉండగా కొత్త పథకాలపై జలమండలి ఆచితూచి స్పందించనుంది. ప్రస్తుత పథకాలకు సంబంధించి భారీ బకాయిలున్న నేపథ్యంలో కొత్త పథకాలు అంత త్వరగా కార్యరూపం దాల్చే అవకాశంలేదని తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా ఆరు సీపీడబ్ల్యూఎస్ పథకాలు చేపట్టాలని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రణాళికలు రూపొందించింది. వీటికిగాను రూ. 36.16కోట్లు అవసరమని గుర్తిస్తూ ప్రభుత్వానికి నివేదికలిచ్చింది. తాజాగా సీపీడబ్ల్యూఎస్ పథకాలన్నీ జలమండలి ఖాతాలోకి వెల్లడంతో గత బకాయిలు వసూళ్ల ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్తవి చేపట్టే అవకాశంలేదని తెలుస్తోంది. -
స్వచ్ఛ గోదావరి నిధులెక్కడ
ఏలూరు :పుష్కరాల నేపథ్యంలో గోదావరి నదికి సమీపంలోని 60 గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రెయిన్లు నిర్మించేం దుకు నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ‘స్వచ్ఛ గోదావరి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పనులు చేపడతామని కేంద్ర తాగునీటి, పారిశుధ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని గత ఏడాది నవంబర్లో ఆదేశాలిచ్చింది. ప్రతిపాదనలు రూపొందించిన జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యుఎస్) ఈ పనులకు రూ.45 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే, నేటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పనుల ఊసెత్తడం లేదు. కేంద్రం ఇస్తానన్న నిధులతో గోదావరి నదిని ఆనుకుని ఉన్న ఆచంట, యలమంచిలి, కొవ్వూ రు, నరసాపురం, నిడదవోలు, పెనుగొండ, పెరవలి, తాళ్లపూడి, పోల వరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని 60 గ్రామాల్లో వివిధ పనులు చేపట్టాలని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం తలపోసింది. స్వచ్ఛ గోదావరి కార్యక్రమం కింద 16వేల మరుగుదొడ్లు నిర్మించాలని, పుష్కరాలకు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం ఆయా మండలాల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించాల్సి ఉందని ప్రతిపాదించారు. 60 గ్రామాల్లో డ్రెరుునేజీ వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేయాలని భావిం చారు. ప్రతిపాదనలు పంపి మూడు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల ఊసెత్తడం లేదు. చివరి క్షణాల్లో నిధులిస్తే ప్రయోజనం లేదు పుష్కరాల పనులకు అన్ని శాఖలు టెండర్లు పిలుస్తున్నారుు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న నిధులు ఊడిపడకపోవడంతో ఆర్డబ్ల్యుఎస్ అధికారులు ఏం చేయూలో తెలియక దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో నిధులు విడుదల చేస్తే పనులు చేపట్టలేక ఇబ్బం దులు పడతామన్న అభిప్రాయం ఆర్డబ్ల్యుఎస్ అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నిధుల విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా పంచాయతీ అధికారి ఎల్.శ్రీధర్రెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. -
బకాయిలు కట్టాల్సిందే!
- ఆర్డబ్ల్యూఎస్పై హెచ్ఎండబ్ల్యూఎస్ ఒత్తిడి - రూ.20 కోట్లు పేరుకు పోయినట్లు నోటీసులు - తలలుపట్టుకుంటున్న గ్రామీణ నీటి సరఫరా అధికారులు - బిల్లులు కట్టాలని పంచాయతీలకు నోటీసులు యాచారం: నీటి బిల్లుల బకాయిల కథ మళ్లీ మొదటికొచ్చింది. వెంటనే బిల్లులు చెల్లించాలంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్)పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్) ఒత్తిడి తెస్తోంది. కొన్నేళ్లుగా కృష్ణా జలాలు వాడుకుంటున్నందుకు రూ.20 కోట్ల బకాయిల్ని తక్షణమే చెల్లించాలని నోటీసులు పంపించింది. లేకుంటే నీటి సరఫరా కష్టమని తేల్చిచెప్పింది. దీంతో వేసవిలో తాగునీరు ఎలా అందించాలో తెలియక ఆర్డబ్ల్యూఎస్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. యాచారం మం డలం గునుగల్ కృష్ణా జలాల రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 4 మండలాలు, మహేశ్వరం మండలంలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. హయత్నగర్ మండలంలోని ప్రజలు తాగునీటి బిల్లులు ప్రతి నెలా చెల్లిస్తుండడంతో ఆ మండలంలో ఇబ్బంది ఉండడం లేదు. కానీ ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కందుకూరు మండలాల్లో 134 గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేస్తున్నందుకు గాను పంచాయతీలు బిల్లులు చెల్లించడంలేదు. గునుగల్ రిజర్వాయర్ నుంచి నాలుగు మండలాలకు నిత్యం 70 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటున్నారు. ప్రతి నెల రూ.20 లక్షలు చెల్లిస్తున్నా.. గునుగల్ రిజర్వాయర్లోంచి 2007 నుంచి డివిజన్లోని పలు గ్రామాలకు హెచ్ఎండబ్ల్యూఎస్ కృష్ణా జలాలను సరఫరా చేస్తోంది. ప్రారంభం నుంచే నీటి సరఫరా విషయంలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్డబ్ల్యూఎస్ల మధ్య నీటి సరఫరా విషయమై ఒప్పందం కుదరడంలేదు. నాలుగు మండలాల్లో దాదాపు 2 లక్షల జనాభా ఉంది. ప్రారంభంలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్డబ్ల్యూఎస్తో కేవలం 44 లక్షల లీటర్ల నీటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 1,000 లీటర్లకు ఆర్డబ్ల్యూఎస్ కేవలం రూ. 10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా 30 నుంచి 40 లక్షల లీటర్ల నీరు వాడుకుంటున్నందువల్ల హెచ్ఎండబ్ల్యూఎస్ 1,000 లీటర్ల నీటికి రూ.40 లెక్కగడుతోంది. ఆర్డబ్ల్యూఎస్ ప్రతి నెల నీటి బకాయిల కింద హెచ్ఎండబ్ల్యూఎస్కు రూ.20 లక్షలకుపైగా చెల్లిస్తోంది. అయినా హెచ్ఎండబ్ల్యూఎస్ వడ్డీలు, చక్రవడ్డీలు లెక్కకట్టి ఇప్పటికి రూ.20 కోట్ల బకాయిలున్నట్లు నోటీసులు పంపించింది. నీటి ఎద్దడి తీర్చే విషయంలో సరఫరా శాతం పెంచాలని ఆర్డబ్ల్యూఎస్.. హెచ్ఎండబ్ల్యూఎస్ను అడిగిన ప్రతిసారీ.. ముందు బకాయిలు చెల్లించాలని అంటోంది. నీటి ఎద్దడి ఏర్పడిన ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవ తీసుకుని నీటి సరఫరాను పెంచేలా కృషి చేస్తున్నారు. నీటి ఒప్పందం విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంటున్నారు. పంచాయతీలకు నోటీసులు కొద్ది రోజులుగా పట్నం డివిజన్లోని ఆయా మండలాల ప్రజలు నీటి బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలోనే రూ.20 లక్షలకు పైగా బిల్లులు వసూలయ్యాయి. కానీ పంచాయతీలు మాత్రం ఆర్డబ్ల్యూఎస్కు పైసా బిల్లు చెల్లించడం లేదు. వసూలయ్యే బిల్లులను పంచాయతీలు నేరుగా ఎస్టీఓల్లో జమ చేసి వివిధ ఖర్చుల నిమిత్తం రెండు మూడ్రోజుల్లోనే వాటిని డ్రా చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలు నీటి బిల్లులు కచ్చితంగా చెల్లించాలని ఒత్తిడి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం డివిజన్ డీఈఈ వాటికి నోటీసులు పంపించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త దృష్ట్యా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి త్వరలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
అభివృద్ధికి అధికారులే ఆటంకం
మహబూబ్నగర్: నిబంధనలు వర్తించవని, వ్యవస్థ అంగీకరించదని, కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త మార్గదర్శకాలు రావాల్సి ఉంది అంటూ రకరకాల సాకులతో అభివృద్ధి పనులకు అధికారులే అడ్డం పడుతున్నారు. దీంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల్లో తిరగలేకపోతున్నాం, అని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించే ప్రతిదానిని తిరస్కరించడం అధికారులకు ఫ్యాషన్ అయిందన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మూడుస్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన నిర్మాణపనులు, ఆర్థిక ప్రణాళిక సంఘాలు జరగగా, జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిక్కుడు అనురాధ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా పలుమార్లు అధికారులతీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయిసంఘాల సమావేశాల్లో వివిధశాఖల ప్రగతిపై కేవలం అంకెలు మాత్రమే సూచిస్తున్నారని పూర్తి వివరాలు ఉండటం లేదన్నారు. ఈ విషయమై గత సమావేశాల్లో చెప్పినా, అధికారులు సవరించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 49 అంశాలపై చర్చ.. మూడుస్థాయి సంఘాలలో కలిపి 49 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంచాయితీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ట్రాన్స్కో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు తదితర శాఖల ప్రగతి నివేదికను స్థాయిసంఘాల ముందుంచారు. పాఠశాల విద్యార్థులకు దుస్తులు సరిగా అందడంలేదని, దీనిపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టళ్లలో ట్యూటర్స్ను నియమించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. కాలేజీలలో ఫీజుల కోసం విద్యార్థులను యాజమాన్యాలు వేధిస్తున్న అంశాన్ని సభ్యులు ప్రస్తావించారు. అయితే దీనికి అధికారులు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫాస్టు పథకం ప్రవేశపెట్టిందని, అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కళ్యాణలక్ష్మి పథకం విధివిధానాలు సరిగా లేవని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీల భూ పంపిణీ జిల్లాలో నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడు లక్షల పైచిలుకు ఎస్సీ జనాభా ఉంటే కేవలం 20మందికే భూ పంపిణీ చేయడం దురదృష్టకరమన్నారు. వలస ప్రాంతాలను మొదటి విడతగా భూ పంపిణీకి ఎంపిక చేయాలని సూచించారు. అటవీశాఖ చట్టాల ప్రకారం అమ్రాబాద్, అచ్చంపేట, బల్మూరు, లింగాల మండలాలలో భూ కొనుగోలు చేపట్టడానికి అవకాశం లేదని అధికారులు వివరించారు. ఉపాధిపై విచారణ జరపండి జాతీయ ఉపాధిహామీ పథకంలో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్లు వ్యాఖ్యానించారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలో ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని, అందుకు సంబంధించి పలు ఉదాహరణలను రాజేందర్రెడ్డి చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గానికి సంబంధించి ఏడేళ్ల పనుల వివరాలు, ఐడీ నెంబర్ల సాఫ్ట్ కాఫీ అందజేయాలని కోరారు. ఈ విషయమై ఎంపీడీఓలను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదన్నారు. కోయిల్కొండ, నారాయణపేట మండలాల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. రోడ్ల అవకతవకలపై ఫిర్యాదలు వస్తే, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఏడాది కావస్తున్నా ఇప్పటి దాకా రిపోర్టు ఇవ్వకపోవడంలో మతలబేంటో అర్థం కావడంలేదని, మరోవైపు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సంసిద్ధం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. స్థాయిసంఘాల సమావేశాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ వి.శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్.సంపత్కుమార్, బాలరాజు గైర్హాజరయ్యారు. సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ సీఈఓ నాగమ్మ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
కొండెక్కేదెలా..!
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : భౌగోళికంగా అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ప్రజల గొంతులు తడపడం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన సవాల్గా మారనుంది. సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెండు నియోజకవర్గాల గ్రామాలకు తాగునీరు అందించాలంటే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామీణ నీటి సరఫరా శాఖ గుర్తించింది. ఇటీవల హైదరాబాద్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్వహించిన వాటర్గ్రిడ్ పనుల సమీక్షలో ఈ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. నిర్మల్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు, 930 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాకు ఎస్సారెస్పీ గ్రిడ్ను డిజైన్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి బన్సపల్లి వద్ద నుంచి నీటిని ఎత్తిపోసుకోవాలని నిర్ణయించారు. ఈ బన్సపల్లి సముద్ర మట్టానికి 331 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల గ్రామాలు సుమారు 450 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయాలంటే కనీసం 181 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. మహబూబ్ ఘాట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఈ మేరకు పైప్లైన్లు నిర్మిస్తే.. రానున్న రోజుల్లో ఈ పైప్లైన్ల నిర్వహణలో అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం ఖాయమని ఆ శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఒక్కోసారి పైపులు పగిలి పోవడం వంటి ఘటనలు చోటు చేసుకుని నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించి గ్రిడ్ రూపకల్పనకు ప్రస్తుతం ఆర్డబ్ల్యూఎస్ శాఖలో రాష్ట్ర స్థాయిలో కూడా నిపుణులు అందుబాటులో లేరు. ఇందుకోసం ఉన్నత సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుని గ్రిడ్ను రూపకల్పన చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీర్ ఇంద్రసేన ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. రాసిమెట్ట వద్ద పంపింగ్ కేంద్రం.. బన్సపల్లి వద్ద ఎస్సారెస్పీ నీటిని శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా నీటిని బూరుగుపల్లి(నేరడిగొండ మండలం)కి తరలిస్తారు. ఇక్కడ పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి, ఇక్కడి నుంచి మామడ మండల పరిధిలో ఉన్న రాసిమెట్టకు నీటిని పంపు చేస్తారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో 512 మీటర్ల ఉన్న ఈ రాసిమెట్టకు నీటిని ఎక్కిస్తే అక్కడి నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయడం సులభమవుతుందని ఆర్డబ్ల్యూఎస్ భావిస్తోంది. కొలిక్కి వచ్చిన కడెం గ్రిడ్ సర్వే.. జిల్లాలో వర్షాకాలంలోనూ ప్రజలు తాగునీటి కటకటను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వాటర్గ్రిడ్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో నాలుగు గ్రిడ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సర్వే కోసం టెండర్లు పిలువగా, ఒక్క కడెం గ్రిడ్కు మాత్రమే సర్వే చేసేందుకు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని 594 గ్రామాల ప్రజల గొంతులు తడిపేందుకు రూపొందించిన ఈ గ్రిడ్ సర్వే పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. మిగిలిన గ్రిడ్ల సర్వేకు మరోమారు టెండర్లు పిలవాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది. -
రూ.4 వేల కోట్లతో వాటర్గ్రిడ్కు ప్రతిపాదనలు
కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న వాటర్గ్రిడ్ (జలాజలం) పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదన లు పంపుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పాలేరులో విలేకరులతో మాట్లాడారు. పాలేరు, వైరా రిజర్వాయర్లతో పాటు గోదావరి నీటిని వినియోగించి జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి ప్రణాళిక అందజేసినట్లు పేర్కొన్నారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని కూసుమంచి, నేలకొండపపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్భన్ మండలాలతో పాటు ఖమ్మం నగరానికి, ముదిగొండ మండలంలోని కొన్ని గ్రామాలకు 1.48 టీఎంసీల పాలేరు నీటిని సరఫరా చేస్తామన్నారు. ఖమ్మం నగరానికి మాత్రం శుద్ధిచేయని జలాలను, మిగిలిన మండలాలకు శుద్ధి చేసిన జలాలను సరఫరా చేస్తామన్నారు. వైరా రిజర్వాయర్ సెగ్మెంట్ పరిధిలో వైరా, కొణిజర్ల, బోనక ల్, ఎర్రుపాలెం, మధిర, తల్లాడ, సత్తుపల్లి, కొత్తగూడెం, వేంసూరు,పెనుబల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు, నగర పంచాయతీలకు తాగునీరు సరఫరా చేస్తామని వివరించారు. ఇందుకోసం 1.13 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన మండలాలకు అశ్వాపురం సమీపంలోని పాములపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తామని చెప్పారు. పాలేరు గ్రిడ్ ద్వారా 365, వైరా గ్రిడ్ ద్వారా 565 హ్యాబిటేషన్లకు రక్షిత నీరు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వచ్చే వేసవి నాటికి ఆయా రిజర్వాయర్లలో ఇన్టెక్ వెల్ (బావులు) నిర్మాణ పనులు 50 శాతం మేర అయినా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. రిజర్వాయర్ను పరిశీలించిన ఉన్నతాధికారులు... పాలేరు రిజర్వాయర్ను సోమవారం వాటర్గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ సత్యపాల్రెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎస్ఈలు జగన్మోహన్రెడ్డి, సురేష్కుమార్ పరిశీలించారు. వాటర్గ్రిడ్ మ్యాపులను, రిజర్వాయర్లో నిర్మించనున్న ఇన్టెక్వెల్ స్థలాన్ని చూసి, పలు అంశాలపై చర్చించారు. వారివెంట ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేషం గౌడ్, డీఈఈ మాణిక్యాలరావు, ఏఈ మురళీకృష్ణ ఉన్నారు. -
బిల్లులు అందేదెన్నడో?
* మరుగుదొడ్ల డబ్బుల చెల్లింపులో జాప్యం * ఆందోళనలో లబ్ధిదారులు సాక్షి, మంచిర్యాల : బహిరంగ మల, మూత్ర విసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయి అధికారుల వైఫల్యంతో లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన సర్కారు సహాయం బకాయి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి పాలకులు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు. 2012 ఆగస్టు నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఉపాధి హామీ పథకం, నీటి పారుదల సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్), లబ్ధిదారులు సంయుక్తంగా మరుగుదొడ్డి నిర్మాణ వ్యయం భరించేలా మార్గదర్శకాలు రూ పొందించారు. రూ.10,900 విలువ గల మరుగుదొడ్డి నిర్మాణంలో లబ్ధిదారుడి వాటా రూ.900, ఈజీఎస్ రూ.5,600, ఆర్డబ్ల్యూఎస్ రూ.4,600 సదరు అర్హుడికి చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారుడికి చెల్లించాల్సిన మొ త్తం ఈజీఎస్ అందజేస్తుంది. ఆర్డబ్ల్యూఎస్ నుంచి రావాల్సిన సొమ్ము మూడు నెలలుగా పెండింగ్లో ఉంటున్నా యి. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేలాది మంది ఎదురుచూపు జిల్లాలో పథకం ప్రారంభం నుంచి 1,83,779 మంది దరఖాస్తు చేసుకోగా, 1,80,814 మంది అర్హులను గుర్తిం చా రు. 1,77,026 మంది లబ్ధిదారులు పనులు ప్రారంభిం చాల్సిందిగా ఈజీఎస్ సూచించింది. 40,680 మరుగుదొడ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా, 38,144 నిర్మా ణం పూర్తయ్యాయి. పూర్తయిన వ్యక్తిగత మరుగుదొడ్లను రూ.17.43 కోట్లు ఈజీఎస్ తరఫున లబ్ధిదారులకు చెల్లించారు. అయితే ఆర్డబ్ల్యూఎస్ నుంచి వి నియోగదారులకు రావాల్సిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో దండేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. బిల్లులు చెల్లిం చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
నిధుల ‘పంచాయితీ’
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో గ్రామపంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. వీటిని ఆర్డబ్ల్యుఎస్కు మళ్లించాలని గత కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం వివాదస్పదమైంది. ఇది పంచాయతీలకు ఉన్న హక్కులను కాలరాయడమేనని సర్పంచులు విమర్శిస్తున్నారు. జిల్లాలోని 889 గ్రామపంచాయతీలకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13వ ఆర్థిక కమిషన్ నిధులు రూ.25కోట్లకు పైగా విడుదలయ్యాయి. వీటితో గ్రామంలోని తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధిలైట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామపంచాయతీ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ, అంగన్వాడీ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల నిర్వహణకు వినియోగించాల్సి ఉంది. ఇదే క్రమంలో జిల్లా పరిషత్కు వచ్చే 13వ ఆర్థిక కమిషన్ నిధుల ద్వారా సమగ్ర రక్షిత మంచినీటి పథకం(సీపీడబ్ల్యు)ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సీపీడబ్ల్యు స్కీమ్ నిర్వహణకు గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ఇవ్వాలని గత జూన్ 4వ తేదీన అప్పటి కలెక్టర్ సుదర్శన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీపీడబ్ల్యు స్కీమ్లు ఉన్న 405 గ్రామ పంచాయతీల నుంచి కర్నూలు డివిజన్లో 122 గ్రామపంచాయతీల నుంచి రూ.1,33,33,632లు, నంద్యాల డివిజన్లో 111 గ్రామపంచాయతీల నుంచి రూ.96,82,937లు, ఆదోని డివిజన్లో 172 గ్రామపంచాయతీల నుంచి రూ.1,74,68,598లు కలిపి మొత్తం రూ.4,48,51,167లను ఆర్డబ్ల్యుఎస్ ఇఇకి డీడీ ద్వారా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీపీడబ్ల్యు నిధులేమయ్యాయి...! సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా పరిషత్లదే. ఈ మేరకు 13వ ఆర్థిక కమిషన్ నిధులను గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో సీపీడబ్ల్యు స్కీమ్ కింద ఆయా గ్రామాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే జిల్లా పరిషత్ అధికారులు మాత్రం సీపీడబ్ల్యు స్కీమ్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాగునీటి అవసరాలకు గాకుండా రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులను ఆర్డబ్ల్యుఎస్ ఈఈకి డీడీ ద్వారా చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్రస్థాయి విమర్శలకు తావిస్తోంది. 40 శాతం గ్రామపంచాయతీ నిధులు ఆర్డబ్ల్యుఎస్కు మళ్లించడం వల్ల గ్రామాల్లో ఇతర కార్యక్రమాల నిర్వహణ కష్టమవుతుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, హక్కులను సంరక్షించుకునేందుకు వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
జిల్లాలో రూ.300 కోట్ల పనులకు బ్రేక్
చిత్తూరు(టౌన్): రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో జిల్లాలో మం జూరైన రూ. 300 కోట్ల పనులకు బ్రేక్ వేసింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బి, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపట్టిన రూ.200 కోట్ల పనులతో పాటు మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పీలేరులో ఆయన మంజూరు చేసిన పనుల్లో రూ. 100 కోట్ల పనులను నిలుపుదల చేయాలంటూ జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మంజూరైన పనుల్లో ఇప్పటివరకు అగ్రిమెంట్ కాని పనులను పూర్తిగా నిలిపేయూలని, అగ్రిమెంట్ అయివున్నా చేపట్టని పనులను గుర్తించి నాట్ స్టార్టెడ్ పేరుతో వెంటనే ఆపేయూలని పంచాయతీరాజ్ ప్రిన్సిపుల్ సెక్రెటరీ జవహర్రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. పంచాయతీరాజ్లోనే రూ.100 కోట్లకు పైగా ఆగిన పనులు పంచాయతీరాజ్ పరిధిలోనే సుమా రు వంద కోట్లకు పైగా పనులు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్లో ప్రాజెక్టులు (పీఆర్యూ), లోకల్ బాడీస్ (పీఆర్ఐ) అని రెండు విభాగాలున్నాయి. పీఆర్యూలో వివిధ పథకాల కింద సుమారు 120కోట్లకు పైగా పనులు మంజూరయ్యాయి. పీఆర్ఐలో వంద కోట్ల రూపాయలకు పైగా పనులు గత ఏడాది మంజూరయ్యాయి. వీటిలో కొన్ని ఇంతవరకు అగ్రిమెంట్ దశకు చేరుకోలేదు. మరికొన్ని అగ్రిమెంట్ దశ పూర్తయ్యాయి. అయితే పీఆర్యూలో రూ. 50 నుంచి రూ.55 కోట్ల వరకు పనులు నిలిచిపోగా పీఆర్ఐలో రూ. 45 నుంచి రూ. 50 కోట్ల వరకు మంజూరైన పనులు ఆగిపోయాయి. ఆర్అండ్బీకి అనఫిషియల్ హాలిడే జిల్లాలోని ఆర్అండ్బీ రోడ్లకు మెయింటెనెన్స్ కింద కోట్లాది రూపాయల పనులు మంజూరు చేశారు. అంతేకాకుండా రూ.150 కోట్లతో కొత్తగా కొన్ని తారురోడ్లను మంజూరు చేశారు. వీటిలో కొన్ని అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. మరికొన్ని అగ్రిమెంట్ దశ పూర్తైపనులు చేపట్టడంలో ఆలస్యం జరుగుతోంది. ఏ పనులు చేయొద్దనడంతో ఈ శాఖకు ప్రభుత్వం అనధికారికంగా హాలిడేను ప్రకటించినట్టయింది. పీలేరులో రూ.100 కోట్ల పనులు మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహించిన పీలేరుపై ప్రతేక శ్రద్ధ కనబరిచి ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద ఆరేడు నెలల క్రితం వంద కోట్ల రూపాయలకు పైగా నిధులతో వివిధ భవనాలు, కల్వర్టులు, రోడ్డు పనులను మంజూరు చేశారు. అయితే దీనిపై ఈ నెల 16న కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ జిల్లాలో ఎస్డీఎఫ్ కింద చేపట్టిన పనులను నిలుపుదల చేయాలంటూ కోరారు. పీలేరులో తప్ప మరెక్కడా ఈ నిధులతో పనులు మంజూరు కాలేదు. -
నా సెల్కు మెసేజ్ పెట్టండి
అధికారులతో కలెక్టర్ ఎం.ఎం.నాయక్ విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలపై దృష్టి సారించి ఏరోజు నివేదిక ఆరోజు తన సెల్కు మెసేజ్ పెట్టాలని కలెక్టర్ ఎం.ఎం. నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో ఆర్వీఎం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మా ట్లాడు తూ ప్రతి పాఠశాలలో తాగునీరు ఉండాలన్నారు. టాయ్లెట్లు పనిచేస్తుండాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలకూ వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎన్ని టాయ్లెట్లు ఉన్నాయి. అన్నవి ఆరా తీయాలనానరు. అదేవిధంగా బోరుబావులు పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయాలను గుర్తించాలన్నారు. అదేవిధంగా మరమ్మతులు ఎక్కడ అవసరం ఉన్నవీ గుర్తించాలన్నారు. ఆర్ఎంఎస్ఏ గ్రాంట్ కింద ప్రతి పాఠశాలకూ రూ.25వే లను మంజూరు చేశామన్నారు. ఆ నిధులతో ఎంఈఓలు, ఏఈలు కలసి చిన్నపాటి మరమ్మతులు చేయవచ్చన్నారు. అటువంటి మరమ్మతులను చేపట్టి వెంటనే తనకు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఆర్డబ్ల్యుఎస్ సిబ్బంది నిత్యం పర్యటిస్తూ ఉండాలన్నారు. ఎస్ఈ పనిచేస్తేనే ఏఈ కూడా పనిచేస్తారన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అందరూ కలసి పనిచేయాలన్నారు. కురుస్తున్న వర్షాల వలన గ్రామాలు, పట్టణాల్లోని ప్రాంతాలతో పాటు ఆయా పాఠశాలల్లో బురద, చిత్తడి ఉంటాయనీ అక్కడ బ్లీచింగ్ వేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లతో పాఠశాలల్లో తాగునీటి పైప్లకోసం మాట్లాడామనీ వెంటనే ఆయా కమిషనర్లను సంప్రదించాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో టాప్ కనెక్షన్ల కోసం చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇతరులు టాయ్లెట్లను వినియోగిస్తున్నారనీ, దీని వలన విద్యార్థులు వినియోగించుకునే వెసులుబాటు ఉండదన్నారు. ఇతరులు వీటిని వినియోగించకుండా మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి ప్రతి పాఠశాలకూ ప్రహరీలు నిర్మించాలన్నారు. పబ్లిక్ను ఈ విధంగా నివారించగలమన్నారు. మున్సిపల్ స్కూళ్ల నిర్వహణపై హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి పాఠశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని డీఈఓ కృష్ణారావుకు ఆదేశించారు. సమగ్రమైన నివేదికలు ఇవ్వకుండా మొక్కుబడిగా నివేదికలు ఇవ్వడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు తన సెల్కు సమా చారాన్ని పంపించాలన్నారు. అదేవిధంగా ప్రతిరోజూ తీసుకున్న నిర్ణయాలను, చేపడుతున్న చర్యలను సాయంత్రమయ్యే సరికి జాయింట్ కలెక్టర్కు కార్యక్రమాల పూర్తి నివేదికను పంపించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్వీఎం పీఓ శారద, డీఈఓ కృష్ణారావు, పంచాయితీ అధికారి మోహనరావు, గ్రామీణ నీటిసరఫరా శాఖ ఎస్ఈ మెహర్ ప్రసాద్, ఆర్వీఎం ఇంజనీర్లు పాల్గొన్నారు. -
ఏటా అవే హామీలు
ఎన్నికల సమయంలో హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం.. ఇదీ మన నేతల తీరు. ఏజెన్సీ ప్రాంతమైన ఖానాపూర్ నియోజకవర్గంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రతీ ఎన్నికల్లో నాయకులు ఏటా అవే సమస్యలు లేవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఈ సారీ అదే మాట చెప్పారు. మరి.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే. ఉట్నూర్, న్యూస్లైన్ : ఉట్నూర్ మండల ప్రజలకు సురక్షిత నీరు అందించాలనే ఆశయంతో గ్రామీణ నీటి పారుదలశాఖ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ నుంచి 2008-09 సంవత్సరంలో ఆర్వో ప్లాంట్లు (రివర్స్ ఆస్మాసిస్) మంజూరు చేశారు. వేణునగర్, పాత ఉట్నూర్(రామాలయం), హనుమాన్నగర్, ఫకీర్గుట్ట, మొమిన్పురా, చిన్నుగూడలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వ్యయంతో ఒక్కో ఆర్వో ప్లాంట్ నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతలు పంచాయతీలకు అప్పగించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రారంభం కాకుండానే మూలనపడ్డాయి. ఒక్క వేణునగర్లోనే పథకం పనిచేస్తోంది. మూలనపడ్డ శుద్ధజల కేంద్రం.. గిరిజనులకు రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత నీరు అందిస్తామని ఐటీడీఏ, వాటర్ హెల్త్ ఇండియా ఆధ్వర్యంలో ఇందిర క్రాంతి పథం, మండల సమాఖ్య భాగస్వామ్యంతో మండలంలోని నర్సాపూర్-బీ గ్రామంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రం ప్రారంభించి నెలలు గడవకుండానే మూలనపడింది. దీంతో నీటి కోసం స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. కలగా వంద పడకల ఆస్పత్రి ఏజెన్సీలోని సమస్యాత్మక ఐదు మండలాలకు ఉట్నూర్ ఆస్పత్రే దిక్కు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నార్నూర్ మండల పర్యటనలో గిరిజనుల సౌకర్యార్థం ఉట్నూర్ సీహెచ్సీని వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మహానేత అకాల మరణంతో ఆ హామీ అటకెక్కింది. దీంతో సరైన వైద్యం అందక ఎందరో గిరిజనులు మృత్యువాతపడుతున్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యేనా? కేంద్ర ప్రభుత్వం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేయగా.. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 27న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 783 జీవో జారీ చేసింది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల ఉన్న 470 ఎకరాల పరంపోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించారు. రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్ తదితర సౌకర్యాలున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు ఖాయమని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్మల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఉట్నూర్ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎటుచూసినా సమస్యలే.. ఖానాపూర్ మండలంలో ఎటుచూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. బాదన్కుర్తి వంతెన నిర్మాణం పూర్తవడంతో ఐదేళ్లుగా కరీంనగర్ జిల్లా నుంచి వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. మాస్టర్ ప్లాన్ మరుగున పడడంతో ట్రాఫిక్ సమస్య అధికమైంది. ఇక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది. మండలంలోని పుల్గంపాండ్రి నుంచి ఇచ్చోడ మండలం సిరిచెల్మ రహదారినే కలిపే రోడ్డు నిర్మాణం అటకెక్కింది. ప్రతీ ఎన్నికల్లో నాయకులు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం మామూలైపోయింది. ఈ రోడ్డు పూర్తయితే ప్రజలకు 30 కిలోమీటర్ల దూరభారం తప్పుతుంది. మండల కేంద్రం నుంచి కడెం మండలం బెల్లాల్ వరకు ఉన్న 22 కిలోమీటర్ల ప్రధాన రోడ్డు అధ్వానస్థితికి చేరి 15 ఏళ్లుగా శాశ్వత మరమ్మతుకు నోచుకోవడంలేదు. ఎక్బాల్పూర్, రాజూరా గ్రామాల మధ్య ఉన్న కడెం మండలం సింగాపూర్ గ్రామాన్ని ఖానాపూర్ మండలంలో కలపాలనే డిమాండ్ అమలుకు నోచుకోవడంలేదు. సోమర్పేట్, కుసుంపూర్ కోలాంగూడ మధ్య వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. కడెం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. ఈ ప్రాంత రైతుల పాలిట వరప్రదాయిని అయిన కడెం సాగునీటి ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 1972లో నిర్మించిన ఈ ప్రాజెక్టు జలాశయంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పూడిక తొలగింపునకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు 18 వరదగేట్ల కండీషన్ సరిగా లేదు. సాంకేతికపరమైన మరమ్మతులు లేక నీటి లీకేజీలు ఎక్కువయ్యాయి. మరమ్మతుకు నిధుల మంజూరులోనూ పాలకులు వివక్ష ప్రదర్శిస్తున్నారు. కడెం మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కల నెరవేరడంలేదు. ఎందరో నాయకులు ఇచ్చిన హామీలు నీటిమూటలే అవుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఇక్కడ బస్టాండ్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కడెంలో కోటి రూపాయలతో ఫిల్టర్ బెడ్ ప్రకటించినా నిర్మాణానికి చర్యలు తీసుకోవడంలేదు. కడెంలోని రెవెన్యూ కార్యాలయానికి ఇంతవరకు పక్కాభవనంలేదు. అల్లంపల్లి, గంగాపూర్ గ్రామాలకు రహదారి నిర్మాణం హుళక్కే అయింది. రింగురోడ్డు మరమ్మతు ఎప్పుడో..? ఇంద్రవెల్లి మండలంలో రింగ్ రోడ్డు మరమ్మతు చేపట్టి దారికష్టాలు తొలగిస్తామని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గోపాల్పూర్, భీంపూర్, టేకిడిగూడా, తుమ్మగూడ, బొప్పాపూర్లకు మట్టి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇంతవరకు నెరవేరలేదు. రోడ్లు.. అధ్వానం జన్నారం మండల కేంద్రం నుంచి ధర్మారం వెళ్లే రోడ్డు దశాబ్దాల కాలంగా మరమ్మతుకు నోచుకోక అధ్వానస్థితిలో ఉంది. లోతొర్రే, సోనాపూర్ తండా, జన్నారం నుంచి చింతలపల్లి, చెరుకుగూడ, ఇప్పలపల్లికి వెళ్లే రోడ్లు గుంతలమయమై స్థానికులు నిత్యం అవస్థలు పడుతున్నా మరమ్మతు చేయించేవారు కరువయ్యారు. జన్నారంలోని కవ్వాల్ ఆభయారణ్యాన్ని ప్రభుత్వం టైగర్ జోన్గా గుర్తించింది. దీంతో మండలంలోని అల్లినగర్, దొంగపల్లి, మల్యాల్, మైసంపేట్ గ్రామాల్లో దశాబ్దాల తరబడి ఉంటున్న సుమారు 150 కుటుంబాల మనుగడకు ము ప్పు ఏర్పడింది. అటవీశాఖ అధికారులు తమను ఎప్పు డు ఖాళీ చేయిస్తారోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి గోడు పట్టించుకునేవారు కరువయ్యారు. -
అప్పుడే.. జఠిలం
గ్రామాల్లో మొదలైన తాగునీటి గోస నల్లగొండ, న్యూస్లైన్,ఎన్నికల బిజీలో నేతలు..అధికారులు తలమునకలయ్యారు. మరోవైపు పల్లెల్లో తాగునీటి గోస మొదలైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపిం చడంలేదు. బోరు బావుల్లో జలాలు అడుగంటిపోయాయి. మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీళ్లు వదలుతున్నారు. ఎండలు మరింత ముదిరితే మున్ముందు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది. నీటిఎద్దడిని ఎదుర్కొనేందుకు అధికారులు వేసవి ప్రణాళికను సిద్ధం చేసినా ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. వేసవిలో మండుతున్న ఎండలతో పల్లె ప్రజల గొంతెండుతోంది. తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొదటి పేజీ తరువాయి 532 గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. దాదాపు వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండలు మరింత ముదిరితే ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. నీటిని ఎద్దడి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారిం చాల్సిన అధికారులు నిస్సాహాయ స్థితిలో ఉన్నారు. జిల్లా తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారుల వరకు ఎన్నికల విధుల్లో తీరికలేకుండా గడుపుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా 37 మండలాల పరిధిలోని 532 గ్రామాల్లో నీటిఎద్దడి అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. మరో 457 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి వచ్చే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అడుగడుగునా సమస్యలే... ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో జిల్లాలో 19,384 బోరు బావులు ఉన్నాయి. వీటిలో 952 బోర్లు పనిచేయడం లేదు. మరో 136 బోరు బావుల్లో నీరు అట్టడుగుస్థాయిలోకి వెళ్లిపోయింది. 244 బోర్లను క్రషింగ్ చేయాల్సి ఉంది. అంటే నీరు అందుబాటులో ఉన్నా వివిధ రకాల సమస్యలతో బోర్లలోకి రాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇక మంచినీటి పథకాల విషయానికొస్తే జిల్లాలో 15 మంచినీటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా రోజు విడిచి రోజు 1151 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన మాదారం మంచినీటి పథకం ఎందుకు పనికిరాకుండా పోయింది. మోతె మండలంలో నిర్మించిన మంచినీటి పథకానికి నాణ్యత గల పైపులు వేయకపోవడంతో అన్ని గ్రామాలకు నీరు చేరడం లేదు. దీంతో పాటు విద్యుత్ సమస్య మంచినీటి పథకాలకు గుదిబండలా తయారైంది. గ్రామాల్లో గోస... పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మాజీ మంత్రి కె.జానారెడ్డి ఇలాకా అయిన అనుమల మండలంలో 32 హ్యాబిటేషన్లలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో అత్యధికంగా సంస్థాన్నారాయణ్పూర్ మం డలంలో 73 హ్యాబిటేషన్లలో మంచి నీటి ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత వరుసగా చౌటుప్పుల్ మండల పరిధిలో 24, చందంపేట-14, ఆత్మకూరు (ఎస్ )-30, మోతె-20, చివ్వెంల-37, సూర్యాపేట-23, దామరచర్ల-27, వేములపల్లి-20, మునగా ల-20, పెన్పహాడ్-30 గ్రామాల్లో నీటి ఎద్దడి జఠిలంగా ఉంది. నీటి ఎద్దడి నివారణకు రూ.2.85 కోట్లు... నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నివారణ కోసం ప్రభుత్వానికి జిల్లా యం త్రాంగం రూ.2.85 కోట్లు నిధులు మం జూరు చేయాలని ప్రతిపాదనలు పం పింది. ఈ నిధులతో వేసవి నీటిఎద్దడి తీవ్రతరం కానున్న 532 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, అద్దెబోర్లు, బోరు బావుల మరమ్మతుల కోసమని ప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నయా పైసా విడుదల కాలేదు. అధికారుల వద్ద చిల్లగవ్వ లేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే తప్ప ముందస్తు చర్యల్లో భాగంగా ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్లను సిద్ధం చేసుకునే వీలుంటుంది. కానీ నిధులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాని పరిస్థితి ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని అధికారులు చెబుతున్నారు. -
నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: వచ్చే వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఆర్డబ్ల్యూఎస్ ముందస్తు చర్యలు చేపట్టింది. మంచినీటి కొరత ఎదుర్కొనే గ్రామాలను గుర్తించడంతోపాటు నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు రూ.4.45 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అందజేసిన ప్రణాళికను పరిశీలించి త్వరలో సర్కార్ నిధులు విడుదల చేయనుంది. వచ్చేనెల మొదటి వారం నుంచి ఈ ప్రణాళిక అమలు దిశగా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చే వేసవిలో 41 మండలాల్లోని 903 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తవచ్చని అధికారులు గుర్తించారు. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా 55 గ్రామాలు, నారాయణఖేడ్ మండలంలో 55, సిద్దిపేట, తూప్రాన్ మండలాల్లో 50 గ్రామాల చొప్పున, చిన్నకోడూరు మండలంలో 42, కొల్చారం, నర్సాపూర్ మండలాల్లో 41 చొప్పున, జగదేవ్పూర్లో 40 గ్రామాలను ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది గుర్తించింది. గత నెల జనవరిలో సిబ్బంది సర్వే చేసి వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాలను గుర్తించారు. సర్వే నివేదికను అనుసరించి అధికారులు రూ.4.45 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. రూ.1.60 కోట్లతో నీటి రవాణా ప్రత్యామ్నాయ ప్రణాళికను అనుసరించి రాబోయే వేసవిలో రూ.4.45 కోట్ల వ్యయంతో 12,447 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. అందులో భాగంగా రూ.1.60 కోట్లతో గ్రామాల్లో తాగునీటి రవాణా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే 343 పంచాయతీల్లో రూ.74.2 లక్షలతో 457 బోరుబావులను అద్దెకు తీసుకోవాలని ప్రతిపాదించారు. రూ.90.74 లక్షలతో 960 బోరు బావులు ఫ్లష్షింగ్ చేయాలని, రూ.79.62 లక్షలతో 873 బోరుబావులను డీపెనింగ్ (మరింత లోతుకు) చేయనున్నారు. అలాగే రూ.40.5 లక్షలతో 31 ఓపెన్ వెల్స్ను డీపెనింగ్ చేయాలని ప్రత్యామ్నాయ ప్రణాళికలో ప్రతిపాదించారు. -
సెల్ఫోన్కు ఇచ్చే ప్రాధాన్యం..మరుగుదొడ్లకు ఇవ్వడంలేదు
యాచారం, న్యూస్లైన్: ప్రజలకు సెల్ఫోన్ వినియోగంపై ఉన్న ఆసక్తి.. మరుగుదొడ్ల వాడకంపై లేకుండాపోయిందని, అధికారులే వారిలో చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) జాతీయ సంయుక్త కార్యదర్శి సత్య బ్రతసాహు అన్నారు. ఆదివారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి వికాస్రాజ్, ఇంజినీరింగ్ చీఫ్ చక్ర పాణి తదితర అధికారులతో మండలంలోని గునుగల్ పంచాయతీ కార్యాలయంలో గ్రామ శానిటేషన్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. గ్రామంలోని అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు, నల్లా కనెక్షన్లు ఉన్నాయా... లేని వారు ఎందుకు నిర్మించుకోలేదు.. ఎందుకు తీసుకోలేదు అని మహిళలను ఆయన అడిగారు. గ్రామంలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉంది. తాగునీటి వాడకం పన్నులు చెల్లిస్తున్నారా తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు.. తమకు మరుగుదొడ్లు లేవని, ఆర్థిక పరిస్థితుల కారణంగా నిర్మించుకోలేదని చెప్పారు. దీనికి స్పందించిన సత్యబ్రత సాహు వెంటనే మీ ఇంట్లో సెల్ఫోను ఉందా అని అడిగారు. ఉందని మహిళలు సమాధానమిచ్చారు. నల్లా కనెక్షన్ ఉందా అని అడగ్గా.. ఉందన్నారు. నెలకు ఎంత బిల్లు చెల్లిస్తున్నారు అని ఆయన అడగ్గా.. నెలకు రూ. 15 వరకు చెల్లిస్తున్నామని మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల్లో సెల్ఫోన్ వాడకంపై ఉన్న శ్రద్ధ.. మరుగుదొడ్డి, నల్లా కనెక్షన్ తీసుకోవడంలో మాత్రం లేదని అన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం మరుగుదొడ్డి ఎంతో అవసరం, నీటి అవసరాల కోసం ఇంటి వద్ద నల్లా ఎంతో అవసరం కాని ఆ రెంటిపై లేని శ్రద్ధ రూ. వేలల్లో సెల్ఫోను సేవలకు పేదలు ఖర్చు చేస్తున్నార న్నారు. అధికారులే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అప్పుడే ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, నల్లా కనెక్షన్ ఉంటాయని చెప్పారు. పేదలకు ఉచితంగా మరుగుదొడ్లు నిర్మిస్తాం పేదలకు ఆర్డబ్ల్యూఎస్, ఈజీఎస్లు సంయుక్తంగా ఉచితంగా మరుగుదొడ్లు నిర్మించడానికి కృషి చేస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యబ్రత సూచించారు. పేదలు మరుగుదొడ్డి నిర్మించుకునేలా, నల్లా కనెక్షన్ తీసుకునేలా గ్రామాల్లోని ఆశ, అంగన్వాడీ సిబ్బంది కృషి చేస్తే ఒక్కోదానికి రూ.75 చెల్లిస్తామని ఆయన స్పష్టంచేశారు. వందశాతం మరుగుదొడ్లు, నల్లా కనెక్షన్లు నిర్మించుకునేలా ఆశ, అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో నల్లా బిల్లు నెలకు రూ. 75 పైనే ఉందని ఇక్కడ కూడాఆ విధంగా వసూలు చేసి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునేలా అధికారులు, సర్పంచ్లు కృషి చేయాలని సూచించారు. గునుగల్ రిజర్వాయర్ సందర్శన అంతకుముందు సత్య బ్రతసాహు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజవర్గాలకు కృష్ణా జలాలు సరఫరా చేసే గునుగల్లోని రిజర్వాయర్ను సందర్శించారు.సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణాజలాలు వాడుకోవడం కోసం ప్రజల నుంచి నెలకు ఎంత పన్ను వసూలు చేస్తున్నారని అడిగారు. గ్రామంలో అవసరమైన నీటి ట్యాంకు, సంప్, పైపులైన్ ఏర్పా టు కోసం నిధులు మంజూరు చేయాలని సత్యబ్రతసాహుకు సర్పం చ్ మల్లికార్జున్ వినతిపత్రం అందజేశారు. అవసరమైన నిధులు మంజూ రు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగదీశ్వర్రెడ్డి, డీఈ విజయలక్ష్మి, ఏఈ రవికుమార్, యాచారం ఎంపీడీఓ ఉష, ఈఓఆర్డీ శంకర్నాయక్, సర్పంచ్ అచ్చెన మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి మిస్కిన్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ దాహం తీరనిది!
సాక్షి, నిజామాబాద్ : ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది కామారెడ్డి అధికార పార్టీ నేతలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరు. ఇక్కడ భారీ తాగునీటి పథకం నిర్మాణానికి సర్కారు 140 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వీటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేశారు. కానీ, ఈ పనులతో పర్సెంటేజీల రూపంలో అధికార పార్టీ నేతలు, ఇంజనీరింగ్ అధికారుల ‘దాహం’ తీరిందే తప్ప, కామారెడ్డి ప్రాంతవాసులకు మాత్రం ఐదేళ్లుగా చుక్క నీరు అందలేదు. ట్రయల్ రన్ పూర్తయిందని గొప్పలు పోతున్న అధికారులు, నేతలు ఇప్పుటి వరకు ఖర్చు చేసిన నిధులు సరిపోవడం లేదని, తాగునీరు ప్రజల చెంతకు చేరాలంటే ఇంకా అదనంగా నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు. అంటే రానున్న వేసవిలోగా కూడా ప్రజలకు ఈ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదీ పరిస్థితి కామారెడ్డి పట్టణంతోపాటు, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్, తాడ్వాయి మండలాల పరిధిలో ఉన్న 219 గ్రామాలలోని 3.34 లక్షల మంది తాగు నీటి అవసరాలను తీర్చేందుకు 2008లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద నాలుగు ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఓహెచ్బీఆర్) నిర్మించాలని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి 0.87 టీఎంసీల నీటిని ఇందులోకి తరలించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయాలని, మధ్య మధ్యలో నాలుగు సంపులను నిర్మించాలనుకున్నారు. ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్పీ జలాశయం వద్ద ఇన్టెక్ వెల్, ఫుట్బ్రిడ్జి, రిటైనింగ్వాల్, నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పూర్తయ్యాయి, మూడు ఓహెచ్బీఆర్లను, నాలుగు సంపులను నిర్మించారు. నీటిని తోడేందుకు పంపుసెట్లను బిగించి, టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. పైప్లైన్ల జాయింట్లను బిగించి ట్రయల్న్ ్రకూడా విజయవంతంగా నిర్వహించారు. మల్లన్న గుట్ట వద్దకు నీరు విజయవంతంగా చేరుకుంది కానీ పథకం లక్ష్యం మాత్రం నెరవేరలేదు. కారణం అక్కడి నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైన్ల నిర్మాణం పూర్తి కాకపోవడమే. ఫలితంగా పనులు ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఆయా గ్రామాల గొంతు తడవడం లేదు. రూ.72.75 కోట్ల అదనపు నిధులకు ప్రతిపాదనలు ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి కూడా తాగునీటిని సరఫరా చేయని గ్రామీణ నీటి సరఫరా అధికారులు అదనంగా 45 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫేజ్-2 కింద రూ.72.75 కోట్లతో సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ప్రస్తుత కిరణ్ సర్కారు రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి అధికారులు టెండరు ప్రక్రియ చేపట్టారు. వచ్చిన నిధుల మేరకు పనులు పూర్తి చేశామని, మిగతా నిధుల కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొనసాగుతున్న పైప్లైన్ పనులు మల్లన్నగుట్ట ఓబీహెచ్ఆర్ల నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రజారోగ్యశాఖ అదనంగా చేపట్టిన పైప్లైన్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు నెలలోపు పూర్తి చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. గడువు పూర్తి అయినా పను లు ఓ కొలిక్కి రాలేదు. దీంతో రానున్న వేసవిలోనూ కామారెడ్డి పట్టణవాసులకు తాగునీరందే అవకాశాలు కనిపించడం లేదు. -
మరో అడుగు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణం పేరిట రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనంపై విచారణ కోసం మరో కమిటీ నియమించారు. వారం రోజుల క్రితం ఏజేసీ వెంకటయ్యతోపాటు ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, ఆర్అండ్బీ ఎస్ఈలు, డ్వామా పీడీలను కలిపి ఐదుగురితో కమిటీ వేశారు. తాజాగా ప్రభుత్వం విచారణ కోసం ‘విజిలెన్స్’ను రంగంలోకి దింపడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో మరుగుదొడ్ల నిర్మాణం వ్యవహారంపై విచారణలో మరో అడుగు ముందుకు పడింది. జిల్లాలో సుమారు లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) కింద మంజూరైన నిధుల నుంచి రూ.17.60 కోట్లు పక్కదారి పట్టించడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణం కోసం టూల్కిట్స్ను సరఫరా చేసిన ధనలక్ష్మి ఏజెన్సీస్కు నిర్మాణం కాకుండానే రూ.17.60 కోట్లు చెల్లించిన వైనంపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. . ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు అక్రమాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. క్షేత్రస్థాయిలో ఐఎస్ఎల్ టూల్కిట్స్ నాణ్యతను పరిశీలించి తీసుకోవడంలో వీఆర్వోలు, ఎంపీడీవోల నిర్లక్ష్యం ప్రదర్శించారని ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఐఎస్ఎల్ టూల్కిట్స్ కొనుగోలుకు పెద్దమొత్తంలో చెల్లించేందుకు అప్పటి ముగ్గురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరా తీస్తుండటం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు కమిటీలు ఎన్బీఏ కింద ఈ బాగోతంలో కమీషన్ల రూపంగా రూ.కోటికి పైగా చేతులు మారాయన్న ఆరోపణలపై విచారణ వేగవంతమైంది. మొదటి నుంచి మరుగుదొడ్లలో అవకతవకలపై సీరియస్గా ఉన్న కలెక్టర్ సెప్టెంబర్ చివరి వారంలో ఏజేసీ వెంకటయ్య ఆధ్వర్యంలో కమిటీ వేశారు. అంతకు ముందు కలెక్టర్ పంపిన నివేదికపై స్పందించిన ప్రభుత్వం ఇటీవలే విజిలెన్స్కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇన్చార్జి రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ కె.సురేందర్ ఆధ్వర్యంలో బృందం రంగంలోకి దిగినట్లు తెలిసింది. జిల్లాలో ఎన్బీఏ కింద ఎప్పుడు మరుగుదొడ్లకు నిధులు మంజూరయ్యాయి? లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఐఎస్ఎల్ టూల్కిట్ల కోసం ‘ధనలక్షి’కి ఏయే తేదీల్లో ఎంత మొత్తంలో చెల్లించారు? టూల్కిట్ల సరఫరా నాటికి జిల్లాలో గ్రౌండింగైన మరుగుదొడ్ల సంఖ్య ఎంత? మరుగుదొడ్ల నిర్మాణం మొదలవక ముందే రూ.17.60 కోట్లు ఎందుకు చెల్లించారు? తదితర అంశాలపై విజిలెన్స్ ఆరా తీస్తుంది. మరుగుదొడ్డిని నిర్మించుకునే లబ్ధిదారుడే నేరుగా ఆన్లైన్ ద్వారా టూల్కిట్స్ కొనుగోలు చేయాలన్న నిబంధనలున్నా... ఎంపీడీవోలు ఎందుకు ‘ధనలక్ష్మి’ ద్వారా కొనుగోలు చేశారు? రూ.17.60 కోట్ల చెల్లింపుల వెనుక ఎవరెవరి ప్రమేయం, ఒత్తిళ్లు ఉన్నాయి? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. టూల్కిట్ల సరఫరాకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ బదిలీ కాగా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ పదోన్నతిపై బదిలీ అయ్యారు. జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి పదవీ విరమణ చేశారు. అయితే నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేయడంపైన విజిలెన్స్ అభ్యంతరం చెప్తూనే ఎంపీడీవోల పాత్రపైనా ఆరా తీస్తుంది. తమ పైఅధికారుల ఒత్తిళ్ల మేరకు చెల్లింపులు జరిపామని చెప్తున్నా తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళన కొందరు ఎంపీడీవోల్లో కనిపిస్తుంది. -
ఆర్డబ్ల్యూఎస్లో పదోన్నతులకు వసూళ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ(ఆర్డబ్ల్యుఎస్)లో కిందిస్థాయి ఇంజనీర్ల పదోన్నతులకు పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారనే అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదోన్నతుల కమిటీ నెలన్నర కిందటే ఆమోదం తెలిపినప్పటికీ.. ఉత్తర్వులు ఇవ్వడానికి ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయ అధికారులు భారీగా దండుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. 120 మందికిపైగా సహాయ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు. వీరికి పదోన్నతుల ధ్రువపత్రం అందచేసే సమయంలో ఉన్నతాధికారికి చెందిన ఇద్దరు వ్యక్తులు వసూళ్లకు తెరతీశారని, ఒక్కో ఇంజనీర్ నుంచి రూ. 25 వేల నుంచి 75 వేలు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఇంజినీర్ల అసోసియేషన్ దృష్టికి కూడా వచ్చినట్టు సమాచారం. ఇదిలావుంటే, పదోన్నతుల వ్యవహారంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను సరిగా పాటించలేదని నాలుగో జోన్లోని ఎస్టీ ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇంజనీర్ ఇన్ చీఫ్ చక్రపాణికి ఫిర్యాదు కూడా చేశారు. డబ్బు తీసుకుంటే తాట తీస్తా : చక్రపాణి పదోన్నతులు పొందిన వారి నుంచి ఎవరు డబ్బు తీసుకున్నా తాట తీస్తానని హెచ్చరించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ చక్రపాణి వివరించారు. ఎస్ఆర్ రికార్డుల పరిశీలన తర్వాతే పదోన్నతుల కమిటీ ఆమోదం తెలిపిందని, ఎస్సీ, ఎస్టీల్లో పదోన్నతులకు అర్హులు లేని కారణంగా ఆ ఖాళీలను అలాగే వదిలేశామన్నారు.