అనంతపురం సెంట్రల్: ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ పేరుతో జరుగుతున్న నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జగదీష్ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అపరిచితులు విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మాటలు కలుపుతారు. ఆ కాల్ కట్ చేశాక మరో అపరిచిత నంబర్ నుంచి ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకుంటారు. మీ పేరుతో ఒక పార్సిల్ వచ్చిందని చెప్పి నమ్మిస్తారు. నాకు కొరియర్ రావాల్సిన వస్తువులేవీ లేవని చెప్పినా.. అపరిచిత వ్యక్తులు మీ పేరు, ఫోన్ నంబర్ చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఈ కొరియర్లో డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్ వస్తువులు ఉన్నాయని భయభ్రాంతులకు గురిచేసి.. ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు సేకరించి మీపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తారు. తర్వాత ముంబై సైబర్ పోలీసులమని చెప్పి స్కైప్కాల్స్లో మాట్లాడుతూ మీకు సంబంధించిన కీలకమైన వివరాలన్నీ రాబడుతారు. ఫైన్ కట్టాలంటూ అకౌంట్లలో ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకుంటారు. ప్రజలు ఇలాంటి ఫోన్కాల్స్పై అప్రమత్తంగా ఉండాలి. వెంటనే సమీప పోలీసుస్టేషన్, కుటుంబ సభ్యులతో చర్చించాల’ని ఎస్పీ సూచించారు. ఎట్టి పరిస్థితిలో వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదని తెలిపారు. సైబర్ నేరాలపై టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు.
అపరిచిత కాల్స్కు స్పందించొద్దు : ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment