అసలు ముందు నువ్ గిట్టితే మా ప్రాణాలు పోయేవి కావు కదా!
Breadcrumb
Sakshi Telugu News Cartoon: అసలు ముందు నువ్ గిట్టితే మా ప్రాణాలు పోయేవి కావు కదా!
Published Mon, Jul 22 2024 12:58 AM | Last Updated on Mon, Jul 22 2024 9:06 AM
Advertisement
Related news by tags
-
బడ్జెట్ 3.0లోనైనా సంక్షేమం వికసించేనా?
మన దేశంలో బడ్జెట్ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్ర వరి నెలలో మధ్యంతర బడ్జెట్ను మాత్రమే ప్రవేశ పెట్టారు. అందుకే పూర్తి స్థాయిలో నేడు (జూలై 23న) 18వ లోక్ సభలో 2024–25 బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు. గత బడ్జెట్లు అన్నీ సంపన్నులకు లాభం చేకూర్చే విగానే ఉన్నాయనీ, ఈసారైనా కాస్త సామా న్యులకు ఊరట కలిగించేవిగా ఉండాలనీ జనం ఎదురుచూస్తున్నారు. భాగస్వామ్య పక్షాల వెన్ను దన్నుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దూకుడు తగ్గించి సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందనీ, ఇవ్వాలనీ ప్రజలు ఆశిస్తున్నారు. కోవిడ్ కాలం నుండి పేదల బతుకుల్లో ఆశించిన మార్పులు లేవు. ఉపాధి కోల్పోయి కొను గోలు శక్తి లేక ఆకలి సైతం తీర్చుకోలేక విలవిలలాడుతున్న దుర్భర పరిస్థితులు ఉండడం బాధాకరం. ఇప్పటికీ వ్యవసాయం, చేనేత,లఘు పరిశ్రమలు వంటివి సంక్షోభంలో పడిపోగా కోట్లాదిమంది అర్ధాకలితో, పస్తులతో గడుపుతున్నారు. 125 దేశాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ఆకలి సూచికలో 111వ స్థానంలో భారత్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పేదరికం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తు న్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆహార ధాన్యాలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం తగ్గించేలా 3.0 బడ్జెట్లో చర్యలు ఉండాలి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలందరికీ గృహ నిర్మాణ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. 2022–23 బడ్జెట్తో పోలిస్తే 2024–25 మధ్యంతర బడ్జెట్లో వ్యవ సాయ అనుబంధ కార్యకలాపాలకు వేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది సరికాదు. రైతన్నను ఆదుకోవడానికి తగిన కేటాయింపులు ఈసారన్నా జరగాలి. దేశ ప్రగతికి కీలక అవసరమైన విద్యపై గత బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు లేవు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపు పెంచాలి.అలాగే ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించేలా బడ్జెట్ రూపొందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రజారోగ్యంపై స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.1 శాతం మాత్రమే మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా 5 శాతం నిధులు ప్రజారోగ్యంపై కేటాయించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో 7 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచాలి. అదేవిధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. ‘బేటీ పఢావో బేటీ బచావో’ అనేది నినాదాలకు పరిమితం చేయకుండా మహిళా సాధికారత దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. మహిళల పట్ల వేధింపులు లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించడానికి ఏకైక మార్గమైన ‘ఉపాధి హామీ పథకా’నికి ఎక్కువ నిధులు కేటాయించాలి. మొత్తం మీద ఈ బడ్జెట్ నిరుపేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్మొబైల్: 99895 84665 -
ఈ వీడియోని చూసి ‘ముఖ్యమంత్రి గారు సిగ్గుతో తలదించుకోండి’
తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలల్ని బ్రతికుండగానే నడుం లోతు పూడ్చిపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం (ఎంపీ) రీవా జిల్లాలో దారుణం జరిగింది. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ అధికార తృణముల్ కాంగ్రెస్ బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.Aayi NDA ki yeh sarkar Laayi mahilaon pe teen guna atyaacharAtrocities against women have become an epidemic under BJP-backed lawlessness.In MP's Rewa, two women were nearly buried alive for opposing road construction. CM @DrMohanYadav51 should hang his head in shame! pic.twitter.com/9vqsmgCwjr— All India Trinamool Congress (@AITCofficial) July 22, 2024 బీజేపీ పాలిత రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోయింది. తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చి పెట్టారు. ఈ వీడియో చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సిగ్గుతో తలదించుకోండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.మరోవైపు మహిళలపై జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు రీవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. బాధితులు మమతా పాండే,ఆశా పాండేలు అధికారులు రోడ్డు వేయడాన్ని వ్యతిరేకించారని, దీంతో ఆగ్రహానికి గురైన ట్రక్ డ్రైవర్ పాక్షికంగా ఎర్రటి మట్టితో పూడ్చాడని ఏఎస్పీ వివేక్ లాల్ తెలిపారు.ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ‘రీవా జిల్లాలో మహిళలపై జరిగిన దాడి నా దృష్టికి వచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల్ని ఆదేశించాం. మహిళలపై దాడి కుటుంబకలహాలే కారణం. అందులో ఓ నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు’అని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందా?
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే రాజకీయాలలో నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా?అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనిస్తే, ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్,తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది.చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. ఎవరిది తప్పు అయినా వారి గురించి రాయవలసిన వీరు కేవలం టీడీపీనే వెనుకేసుకు రావడానికే మీడియాను నడుపుతున్నారు. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే టీడీపీ వారి అంతు చూస్తే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్తను బహిరంగంగా,పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది. గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో లు అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు.వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీవారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక ఇప్పుడు తనకు ఏమీ కాదులే. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా?అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా?పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు.అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు పుంగనూరు వద్ద ఆయన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాన్ ను కాల్చివేశారు. ఇప్పటికే అదే రీతిలో వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఎపిలో పోలీసు యంత్రాంగం ఎంత అసమర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా అనిపిస్తుంది. తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట.అక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి?అంగళ్లు గ్రామం వద్ద విపక్ష నేతగా చంద్రబాబు పర్యటిస్తున్న ప్రాంతానికి కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్లినప్పుడు ఆయన ఎంతగా దూషించింది,టిడిపివారు ఏ రకంగా దాడి చేసింది తెలియదా!ఇప్పుడు టీడీపీ వారు ప్రత్యర్ది పార్టీ నేత ఇంటివద్దకు వెళ్లి రుబాబు చేయడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్సీపీది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు. ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే ,ఆ పార్టీవారు వైఎస్సార్సీపీవారిని సమస్యలపై కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం,ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా?లేక రైతులు అంటారా?టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్ కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పలువురు హత్యకు గురయ్యారు.1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు,గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు.వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవ బీజేపీలు,హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది.అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా , ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం. బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది.గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్ చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాకాండలో పాల్గొన్నారు.బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెద్దగా పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో,ఏమో చూడాలి.తాము ఇంతమందిని చంపామని, లేదా ఇంత ఎక్కువ మంది వైఎస్సార్సీపీవారిని కొట్టామని,ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయాయి. కోట్ల రూపాయల విలువైన సుమారు 500 టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేదు. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది. టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. పశ్చిమబెంగాల్ లో బీజేపీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని కేంద్ర బలగాలనుఅక్కడ రంగంలోకి దించారు?మరి ఎపి కి ఎంఉకు పంపలేదు? ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గత ప్రభుత్వ టైమ్ లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్సీపీవారి మెడలు పిసికాలని, కొట్టాలని ..ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు .ఇందిరాగాంథీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటై,ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా చంద్రబాబు పాలన ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది.గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ,లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు.అది కరెక్టా?కాదా?అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా,అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం?. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కేంద్ర బడ్జెట్.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..
దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు మేలు చేకూర్చేలా కేంద్ర విధానాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పెద్దగా ఆకర్షణీయమైన ప్రకటనలు చేయలేదు. ఎన్డీఏ కూటమికి గడిచిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సామాన్యులకు వరాలు కురిపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్న అవసరాలమేరకు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని నిధులు కావాలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచిస్తూ నిపుణులు కొన్ని అంశాలను తెలియజేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో కావాల్సినవి..విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయింపులు పెంచాలి. ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు.మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెరగాలి.ఓడరేవుల అభివృద్ధి వేగవంతం కావాలి.భోగాపురం విమానాశ్రయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి.ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీలకు నిధుల కేటాయింపులు జరగాలి.హైదరాబాద్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు కావాలి.తెలంగాణలో..రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయి.తెలంగాణలో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్, మణుగూరు కోట భారజల కర్మాగారాలకు కేటాయింపులు జరగాలి.ఐటీఆర్ కారిడార్, ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఏమిటంటే..ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలకు..రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి.మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు నిధుల కేటాయింపులు పెంచాలి.రెండు రాష్ట్రాల్లో మరిన్ని మ్యూజియంలు ఏర్పాటు చేయాలి.ఇరు ప్రాంతాలకు కేంద్ర పన్నుల్లో లభిస్తున్న వాటా పెరగాలి.యూనిఫైడ్ కార్డు జారీ (ఆధార్, పాన్, వోటర్, ఈపీఎఫ్, రేషన్ కార్డులన్నింటికి ప్రత్యామ్నాయంగా ఒకే కార్డు) కావాలి.పెట్రోలు, డీజిల్ ధరలపై సుంకాలు తగ్గాలి.సీనియర్ సిటిజన్ల గరిష్ఠ పొదుపు పరిమితిని రెట్టింపు చేయాలి.ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కల్పించే పీఎం ఆవాస్ యోజన కేటాయింపులు పెరగాలి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధులు పెరగాలి.ఉద్యోగులకు మరిన్ని పన్ను రాయితీలు పెరగాలి.స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లకు కేటాయింపులు పెరగాలి. -
కేజ్రీవాల్ను జైల్లోనే చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైలులోనే చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జూన్ 3–జూలై 7వ తేదీల మధ్య కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు 26 రెట్లు పడిపోయినట్లు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాలు కేజ్రీవాల్ జీవితంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్కు ఏ క్షణమైనా ప్రమాదం జరగొచ్చని అధికారిక నివేదికలే చెబుతున్నాయన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై బీజేపీ, ఎల్జీ పదే పదే వెలువరిస్తున్న తప్పుడు నివేదికలు, చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయన్నారు. ‘కేజ్రీవాల్ పూరీలు, స్వీట్లు తదితరాలను అతిగా తింటున్నారని, అవసరం లేకున్నా ఇన్సులిన్ అడుగుతున్నారని వీరే గతంలో ఆరోపించారు. కోర్టు జోక్యంతో ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు జరిపి ఆయనకు ఇన్సులిన్ ఇచ్చారు. ఇప్పుడేమో కేజ్రీవాల్ వైద్యులు సూచించిన మోతాదు కంటే తక్కువగా తింటున్నారని, అందుకే షుగర్ లెవెల్స్ పడిపోయాయని అంటున్నారు’అని సంజయ్ సింగ్ వివరించారు. దీని వెనుక కేజ్రీవాల్ ప్రాణాలు తీసేలా భారీ కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Related News by category
-
మలుపు తిప్పిన నిష్క్రమణ
అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ పక్కకు తప్పుకున్నారు. వైట్హౌస్ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే. అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్ సెనెటర్ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి. ట్రంప్తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్ మొదట అటార్నీ జనరల్గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు. అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ. పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు. ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు. అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్ను ఎంపిక చేసుకొని ట్రంప్ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది! -
దాశరథి స్మృతి
పూపరిమళాన్ని వెదజల్లే అగ్నిశిఖలాంటివాడు దాశరథి. చైత్రరథాలను తోలుతూనే, అభ్యుధయ పంథా సాగాడు. ఋతురాగాలను వర్ణిస్తూనే, ‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో’ విప్లవాలను కాంచాడు. ‘అంగారమూ శృంగారమూ’ సమపాళ్లలో మేళవించివున్న సుకుమారుడు. ఆకాశమంత ఎదిగిన వామనుడు. స్నానం చేసి మడి కట్టుకున్నాక, సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడని సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి– పన్నీటివంటి తెలుగునూ, పసందైన ఉర్దూ గజళ్లనూ ప్రేమించాడు. ‘ఏది కాకతి? ఎవతి రుద్రమ?/ ఎవడు రాయలు? ఎవడు సింగన?/ అన్ని నేనే, అంత నేనే/ వెలుగు నేనే, తెలుగు నేనే’ అని సగర్వంగా ప్రకటించాడు. ఒకప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన ఖమ్మంలోని చిన గూడూరులో 1925 జూలై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం నేటి నుంచి మొదలవుతుంది.దొరలు, దేశ్ముఖులు, జమీందారులు, జాగీర్దార్ల గుప్పిట సాగుభూములన్నీ ఉన్న రోజుల్లో; ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురవేస్తాననీ, బంగాళాఖాతంలో నిజాం కాళ్లు కడుగుతాననీ కాశిం రజ్వీ బీరాలు పలుకుతున్న కాలంలో; హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడం కోసం తొలుత కమ్యూనిస్టుగానూ, అటుపై స్టేట్ కాంగ్రెస్వాడిగానూ పోరాట పిడికిలి బిగించిన యోధుడు దాశరథి. ‘మధ్యయుగాల రాచరికపు బలా’న్నే తన కవితకు ప్రేరణగా మలుచుకుని సింహగర్జన చేసిన మహాకవి దాశరథి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలినరాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని నినదించిన ‘అగ్నిధార’ దాశరథి. 1947 ప్రాంతంలో నిజాం పోలీసులు బంధించి తొలుత వరంగల్ సెంట్రల్ జైలుకూ, అనంతరం నిజామాబాద్ జైలుకూ ఆయన్ని తరలించారు. ముక్కిన బియ్యం, ఉడకని అన్నం వల్ల అనారోగ్యానికి గురైనా కవితా కన్యకను విడిచిపెట్టలేదు. కలం కాగితాలు దొరక్కపోయినా జైలు గోడల మీద బొగ్గుతో కవిత్వం రాయడం మానలేదు. తోటి ఖైదీలు పదే పదే చదువుతూ వాటిని కంఠస్థం చేసేవాళ్లు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు/ ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి... పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు నీ/ మేడను పడదోస్తాయి...’ అంటూ ‘ఇదేమాట పదేపదే’ హెచ్చరించాడు.తెలంగాణను కలవరించిన ‘కవిసింహం’ దాశరథి. తెలంగాణ అనే మాటతో మరింకే కవీ ముడిపడనంతగా ముడిపడిన ‘అభ్యుదయ కవిసమ్రాట్’ దాశరథి. ‘కలిపి వేయుము నా తెలంగాణ తల్లి/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ అని కోరాడు. ‘తెలంగాణము రైతుదే/ ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని ప్రశ్నించాడు. ‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తర్చినానూ’ అని ఘోషించాడు. ‘తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము’ అని కీర్తించాడు. ‘మూగవోయిన కోటి తమ్ముల గళాల/ పాట పలికించి కవిరాజసమ్ము కూర్చి/ నా కలానకు బలమిచ్చి నడపినట్టి/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని పలికాడు. ‘నాడు నేడును తెలగాణ మోడలేదు’ అని ఎలుగెత్తాడు. 1952లో స్థాపించిన ‘తెలంగాణ రచయితల సంఘం’కు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయినప్పటికీ ‘మహాంధ్ర సౌభాగ్య గీతి’ని చివరిదాకా ఆలపించాడు. ‘సమగ్రాంధ్ర దీపావళి సమైక్యాంధ్ర దీపావళి’ని జరుపుకొన్నాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా వ్యవహరించాడు.ఆంధ్ర నటుల నోట తెలంగాణ మాట ఇప్పుడు కమ్మగా వినిపిస్తున్నదంటే, ఆంధ్ర దర్శకులు తెలంగాణ పలుకుబడిని తమది కానిదని భావించడం లేదంటే– దాశరథి, ఇంకా అలాంటి ఎందరో తెలంగాణ రచయితలు, అటుపై జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు కారణం. దాశరథి లాంటివాళ్లు రెండు రకాల యుద్ధాలు చేశారు. ఉర్దూమయమైన హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం కోసం ఒకటి, అది ‘తౌరక్యాంధ్రము’ అని ఈసడించే ఆంధ్రులతో మరొకటి! అయినా దాశరథి తాను రాసిన సినిమా పాటల్లో తెలంగాణ ‘తహజీబ్’ను ‘ఖుషీ ఖుషీగా’ చాటాడు. నిషాలనూ, హుషారులనూ మజామజాగా పాడాడు. అంతేనా? ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’; ‘నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా’ అంటూ సాటి తెలుగు సినీ గేయరచయితలకు దీటుగా నిలిచాడు.భద్రాద్రి శ్రీరామచంద్రుని సేవలో తరించి దాశరథి అనే ఇంటిపేరును స్థిరం చేసుకున్నదని చెప్పే వంశం వాళ్లది. తమ్ముడు దాశరథి రంగాచార్య కూడా అంతే గట్టివాడైనప్పటికీ మనకు దాశరథి అంటే దాశరథి కృష్ణమాచార్యే. ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘కవితాపుష్పకం’, ‘అమృతాభిషేకం’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి కవితా సంపుటాలు; ‘మహాశిల్పి జక్కన్న’ అనే చారిత్రక నవల;‘యాత్రాస్మృతి’ పేరిట వచన సొగసును తెలిపే ఆత్మకథ వెలువరించాడు. రేడియోలో పనిచేస్తూ లలిత గీతాలు, రేడియో నాటకాలు వినిపించాడు. భక్త రామదాసు మాదిరిగానే ‘దాశరథీ కరుణాపయోనిధీ’ మకుటంతో ‘అభినవ దాశరథీ శతకం’ రచించాడు. చక్కటి గాలిబ్ గీతాలను సరళ సుందరమైన తెలుగులోకి అనువదించాడు. ‘నాదు గుండె గాయము కుట్టు సూదికంట/ అశ్రుజలధార దారమై అవతరించె’ అంటూ గాలిబ్ ఉర్దూ ఆత్మను తెలుగు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ‘రోజూ కనబడే నక్షత్రాల్లోనే/ రోజూ కనబడని కొత్తదనం చూసి/ రోజూ పొందని ఆనందానుభూతి/ పొందడం అంటేనే కవిత్వం’ అని చెప్పిన సౌందర్యారాధకుడు దాశరథి 1987 నవంబర్ 5న అరవై రెండేళ్లకు గురుపూర్ణిమ నాడు పరమపదించాడు. -
రాష్ట్రపతి పాలనే శరణ్యం!
‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్’ సెటిల్ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్ బుక్’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్ బుక్’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతటా యువనేత, ‘రెడ్ బుక్’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్ కౌన్సిలర్నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, లోక్సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్బుక్ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్లో తమ ’సూపర్ సిక్స్’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్ ఆన్ అకౌంట్’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
స్తంభించిన ప్రపంచం!
మైక్రోసాఫ్ట్ విండోస్ మొండికేయటంతో శుక్రవారం ఒక్కసారిగా అంతా అస్తవ్యస్తమైన తీరు ఐటీపై ప్రపంచం ఎంతగా ఆధారపడిందో కళ్లకు కట్టింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలతోపాటు మన దేశంలోనూ అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. మ్యాక్, లైనెక్స్ ఆధారిత సేవలు యథావిధిగా పనిచేశాయి. 1872లో ఆంగ్ల రచయిత శామ్యూల్ బట్లర్ యంత్రాలకు సొంతంగా ఆలోచించే, తిరిగి తమంత తాము చేయగలిగే సామర్థ్యం వస్తే ఎలావుంటుందో చూపుతూ ఎరెవాన్ అనే వ్యంగ్య నవల రాశాడు. అది మరీ అతిగావుందని సమకాలికుల నుంచి విమర్శలొచ్చాయి. బహుశా ప్రపంచంలో అదే తొలి సైన్స్ ఫిక్షన్. ఆ కోవలో తర్వాత చాలా వచ్చాయి. సైబర్ దాడులు జరిగితే ప్రపంచం ఏమవుతుందన్న ఇతివృత్తాలతో చలనచిత్రాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. కానీ మైక్రోసాఫ్ట్ విండో స్కు సైబర్ నేరగాళ్లనుంచి కాకుండా అలాంటివారినుంచి రక్షిస్తామని చెప్పే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్వల్ల సమస్యలు తలెత్తి ఇంత పని జరగటం ఒక వైచిత్రి. మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్స్ట్రయిక్ అనే అమెరికా సంస్థ తాను రూపొందించిన యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ను నవీకరించి కొత్తది విడుదల చేయగానే సమస్య తలెత్తిందంటున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఇన్ట్యూన్, వన్నోట్, షేర్పాయింట్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వంటి అనేక యాప్లు నిరర్థకమయ్యాయి. ఒక్కొక్కటే మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే ఈలోగా అనేక దేశాల్లో కంప్యూటర్లు ఆగిపోయాయి. రైళ్లు, విమానయాన సేవలు నిలిచి పోవటం మొదలుకొని దుకాణాల్లో చెల్లింపుల ప్రక్రియ వరకూ అన్నిటికన్నీ స్తంభించిపోయాయి. చాలాచోట్ల వాణిజ్య, వ్యాపార లావాదేవీలూ, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలూ, వార్తా ప్రసారాలూ, పోలీసు వ్యవస్థలూ, మెట్రో సర్వీసులూ, స్టాక్ ఎక్స్ఛేంజ్లూ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంస్థల్లో వినియోగించే టీమ్స్ సాఫ్ట్వేర్ సైతం ఆగిపోయింది. విమానాల్లో బోర్డింగ్ పాస్లు చేతితో రాసి ఇవ్వటం అందరూ మరిచి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. తాజా సమస్య అదెలా వుంటుందో ఈ తరానికి రుచి చూపింది.సమాచార సాంకేతికతలు వర్తమాన యుగంలో జీవితాన్ని వేగవంతం చేశాయి. కొన్ని శతాబ్దాలు ఇలాంటివేమీ లేకుండానే ప్రపంచం మనుగడ సాగించిందన్న సంగతినే మరిచేలా చేశాయి. అర చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయింది. ఖండాంతరాల్లోని మారుమూల దేశాల్లోనివారితో సైతం ఎక్కడున్నవారైనా మాట్లాడగలిగే వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. మనుష్య సంచారం అసాధ్యమనుకున్న చోటకు సైతం డ్రోన్లు వెళ్తున్నాయి. సాధారణ పనులు మొదలుకొని ప్రమాదం పొంచివుండే కార్యాలవరకూ రోబోలు చేస్తున్నాయి. సంక్లిష్ట సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. అందువల్ల ఉత్పాదకత పెరిగింది. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ పని చేయగలిగే సామర్థ్యం మనుషుల సొంతమైంది. కావలసిన సమాచారం కోసం గూగుల్ని ఆశ్రయించేవారే నిమి షానికి 63 లక్షలమంది ఉన్నారంటే పరిస్థితేమిటో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం 52.5 సంవత్సరాలైతే ఆరోగ్యరంగ సాంకేతికతలవల్ల అది ప్రస్తుతం 72 సంవత్సరాలని ఐక్యరాజ్యసమితి నిరుడు ప్రకటించింది. సమాచార సాంకేతికతలు అనేకచోట్ల మనిషి అవసరాన్ని తగ్గించాయి. అందువల్ల కొందరి ఉద్యోగావకాశాలకు ముప్పు వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఇదివరకెన్నడూ వినని అనేక రకాల కొత్త అవకాశాలు లభించాయి. వచ్చే ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతల్లో 9 కోట్ల 70 లక్షల ఉద్యోగావకాశాలుంటాయని ఒక అంచనా. అయితే ఈ సాంకేతికతల వల్ల సాంఘిక జీవనం అస్తవ్యస్తమవుతున్నదని, మనిషి ఏకాకి అవుతున్నాడని, పర్యవసానంగా సమాజంలో అమానవీయత విస్తరించిందని, వ్యక్తి గోప్యతకు ముప్పు ఏర్పడిందని, పౌరుల జీవితాల్లోకి రాజ్యం చొరబాటు ఊహకందనంత పెరిగిందని కనబడు తూనేవుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిచేసి లాభపడే శక్తులున్నట్టే, దానివల్ల నష్టపోతున్నవారూ అధికంగానే ఉన్నారు. ఈ సాంకేతికతల అభివృద్ధి పరుగులో పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. పారిశ్రామికీకరణ తర్వాత భవిష్యత్తు స్పృహ కొరవడి అడవుల, ఇతరేతర సహజ సంపదల విధ్వంసం, పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలు క్రమేపీ పెరిగాయనుకుంటే ఐటీ అభివృద్ధి దీన్ని మరింత వేగవంతం చేసింది. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి వైపు దృష్టి సారించాలన్న వినతులు అరణ్యరోదనే అవుతున్నాయి. పాతికేళ్ల క్రితం వై2కె సమస్యతో ప్రపంచం తలకిందులవుతుందన్న ప్రచారం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి వేల కోట్లు ఖర్చుచేయటం తప్పనిసరన్న అంచనాలు వచ్చాయి. తీరా చాలా సులభంగానే దానికి పరిష్కారం దొరికింది. నిజానికి ఆ రోజుల్లో కంప్యూటర్ల వాడకం, వాటిపై ఆధారపడటం ఇప్పటితో పోలిస్తే తక్కువనే చెప్పాలి. కానీ తరచు సైబర్ దాడులతో తల్లడిల్లే సమా చార సాంకేతిక ప్రపంచంలో తాజా ఉదంతం ఒక పెద్ద కుదుపు. అప్రమత్తంగా లేకపోతే, విడుదల చేసేముందు ఒకటికి పదిసార్లు పరీక్షించి చూసుకోనట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఎంతటి ఉత్పాతం సృష్టించగలదో తాజా ఉదంతం ఒక హెచ్చరిక. ఇంతవరకైతే ఫర్యాలేదు. కానీ దాదాపు అన్ని దేశాల రక్షణ వ్యవస్థలూ ఐటీతో ముడిపడివున్న వర్తమానంలో పొరపాటున సాఫ్ట్వేర్ లోపంతో కంప్యూటర్లు తప్పుగా అర్థం చేసుకుంటే పెనుముప్పు ఏర్పడుతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మారణా యుధాలు భూగోళాన్ని వల్లకాడు చేస్తాయి. ఆ విషయంలో అప్రమత్తత అవసరం. -
సొంతగూటి సమస్యలు!
సాగినంత కాలం మనంతటి వాళ్ళు మరొకరు లేరనుకోవడం సహజమే. సాగనప్పుడు కూడా సమైక్యంగా నిలిచి, సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే సత్తా తెలుస్తుంది. రాజకీయంగా, చట్టసభల్లో సంఖ్యాపరంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ (యూపీ)లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొన్నేళ్ళుగా తిరుగు లేకుండా సాగింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలేవరకు అత్యంత పటిష్ఠంగా కనిపించిన ఆ పార్టీ రాష్ట్రశాఖలో ఒక్కసారిగా ఇప్పుడు లుకలుకలు బయటకొస్తున్నాయి. ఎదురు లేని నేతగా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటలకు మొదటిసారిగా సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. స్వయానా ఉపముఖ్యమంత్రే గొంతు పెంచడం, మంగళవారం ఢిల్లీ వెళ్ళి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం కావడం, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా దేశ రాజధానికి చేరి పార్టీ అధ్యక్షుడితో – ప్రధానితో విడివిడిగా భేటీ అవడం... ఈ పరిణామాలన్నీ పార్టీలో అంతా సవ్యంగా లేదని తేటతెల్లం చేస్తున్నాయి. యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో రానున్న వేళ పార్టీలో అందరినీ మళ్ళీ ఒక్క తాటి మీదకు తీసుకురావడం ఇప్పుడు అధిష్ఠానానికి తలనొప్పిగా తయారైంది. లక్నోలో పార్టీ రాష్ట్రశాఖ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆదివారం మాట్లాడుతూ... ఓట్ల బదలీ, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయని యోగి వ్యాఖ్యానించారు. దాంతో ఇప్పుడీ తేనెతుట్టె కదిలింది. తర్వాత డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కన్నా పార్టీ పెద్దది. పార్టీ కన్నా ఎవరూ పెద్ద కాదు’ అనేశారు. కర్రు కాల్చి వాత పెట్టిన ఈ మాటలతో రచ్చ రాజుకుంది. ఒకప్పుడు మోదీకి శిష్యవారసుడిగా పేరుబడ్డ యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం చిత్రమే. అయితే, అది స్వయంకృతమే. ఇటీవలి ఎన్నికల్లో కమలనాథులకు లోక్సభలో కావాల్సిన మెజారిటీ రాకపోవడానికి ప్రధాన కారణం – యూపీ నిరాశపరచడమే అన్నది బహిరంగ రహస్యం. 2019లో రాష్ట్రంలోని 80 సీట్లకు గాను 62 గెల్చుకున్న ఆ పార్టీ ఈసారి 33కే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ – కాంగ్రెస్ కూటమి 43 గెలిచి దూసుకొచ్చింది. చివరకు రామమందిరం నిర్మించామంటూ ఊరూవాడా గొప్పలు చెప్పుకున్నా, అయోధ్య నెలకొన్న ఫైజాబాద్లోనూ బీజేపీ ఓడిపోయింది. మోదీ సైతం వారణాసిలో గతంలో 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గితే, ఈసారి 1.52 లక్షల ఓట్ల తేడాతోనే బయటపడ్డారు. ఇవన్నీ యోగి ప్రతిష్ఠను దెబ్బతీసినవే. ఇప్పటి దాకా సాగిన ఆయన ఒంటెద్దుపోకడను ఇరుకునపెట్టినవే.చివరకు మిత్రపక్షాల గొంతులు సైతం పైకి లేస్తున్నాయి. ‘బుల్డోజర్లు ప్రయోగిస్తే ఓట్లెలా వస్తాయి? ఉద్యోగ నియామకాల్లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల పట్ల దుర్విచక్షణ చూపడం పెద్ద తప్పు! అసలు మొన్న లోక్సభ ఎన్నికల్లో మాకు బీజేపీ నుంచి సహకారం లభించనే లేదు’ – ఇలా యూపీలో మిత్రపక్ష నేతలే యోగి సర్కార్ను తప్పు పడుతుండడం గమనార్హం. మొత్తం మీద సొంత గూటిలో సమస్యలు పెరుగుతున్నాయనేది వాస్తవం. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటక ముందే బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకొని, కీలక నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే బాహాటంగా అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పదవి నుంచి యోగిని పక్కకు తప్పించవచ్చనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో మొదలైంది. దేశంలోనే అత్యంత పాపులర్ సీఎంగా నిన్న మొన్నటి సర్వేల్లోనూ ఉన్న మనిషిని పక్కనపెట్టడం పార్టీకి అంత తేలిక కాదు.ఏమంత తెలివైన పనీ కాదు. కాకపోతే, ఇది కచ్చితంగా బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. కీలక మంత్రులతో సహా అంతా గత హయాంకు కొనసాగింపు కేంద్ర సర్కారనే భావన కల్పిస్తున్న ఆ పార్టీ... ఎన్నికల్లో ఎదురుదెబ్బకు కారణాలు లోతుగా అధ్యయనం చేసుకోకపోతే చిక్కే!పెన్షన్ అంశం, పార్టీ కార్యకర్తల్లో పెరిగిన అసంతృప్తి, గత ఆరేళ్ళలో పదే పదే పేపర్ లీకులు, ప్రభుత్వోద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, అగ్నివీర్ల అంశం, రాజ్పుత్ల ఆగ్రహం, రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న పార్టీ నేతల ప్రకటనలు – ఇలా అనేకం యూపీలో ఎదురుగాలి వీచేలా చేశాయని పార్టీ అంతర్గత నివేదిక. మరోపక్క కరడుగట్టిన బీజేపీ భక్త ఓటరు గణం చెక్కు చెదరకున్నా – దేశాభివృద్ధికి మోదీయే దిక్కని భావించినవారు, లబ్ధిదారులు, మోదీ ఆకర్షితుల్లో తరుగుదల కాషాయధ్వజుల జోరుకు పగ్గాలు వేసినట్టు స్వతంత్ర విశ్లేషకుల మాట. ఎవరి మాట ఏదైనా అంతా సవ్యంగా ఉంది, అసలేమీ జరగలేదన్నట్టుగా ఉష్ట్రపక్షిలా వ్యవహరిస్తే నష్టం బీజేపీకే! ఎన్నికల్లో తలబొప్పి కట్టిందని ముందు గుర్తించాలి. నిత్యం కార్యకర్తలతో చర్చిస్తూ, క్షేత్రస్థాయి స్పందన తీసుకుంటూ, నిరంతరం ఎన్నికల ధోరణిలోనే ఉంటుందని పేరున్న బీజేపీ మళ్ళీ మూలా ల్లోకి వెళ్ళాలి. మోదీ నామమే తారకమంత్రమన్న మూర్ఖత్వం మాని, కళ్ళు తెరిచి ప్రజాక్షేత్రంలోని చేదు నిజాలను విశ్లేషించాలి. పార్టీలో పరస్పర నిందారోపణల్ని మించిన మార్గమేదో అన్వేషించాలి. ముందు రోగం కనిపెడితేనే తర్వాత సరైన మందు కొనిపెట్టగలరు. బీజేపీ అధిష్ఠానం తొందర పడాల్సింది అందుకే. ఇటీవల దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్ని కల్లో 10 స్థానాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమే గెలిచింది. అధికారపక్ష వ్యతిరేకత కనిపించడమే కాక, బీజేపీ ఓటు షేర్ తగ్గడం ఆ పార్టీకి పారాహుషార్ హెచ్చరికే. యూపీలో తాజా విజయాలతో సమాజ్వాదీ – కాంగ్రెస్ కూటమి సమధికోత్సాహంతో అడుగులు వేస్తోంది. ఇప్పుడు గనక బీజేపీ దిద్దుబాటు చర్యలతో, సొంత ఇంటిని చక్కబెట్టుకోకుంటే, ప్రతిపక్షం కీలకమైన యూపీలో మరింత విస్తరిస్తుంది. అప్పుడిక కమలనాథులు ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment