నకిలీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల అరెస్ట్
సాక్షి,సిటీబ్యూరో: ఫుడ్ సేఫ్టీ, హ్యూమన్ రైట్స్ అధికారులుగా చెప్పుకుంటూ హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (హెల్త్) పంకజ తెలిపారు. బొగ్గుల సునీత, నీలి విజయలక్ష్మి అనే మహిళలు ఫుడ్ సేఫ్టీ, హ్యూమన్ రైట్స్ అధికారులుగా చెప్పుకుంటూ వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్నట్లు ఇటీవల జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు అందాయన్నారు. సదరు మహిళలు ఈ నెల 23న అల్వాల్, కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని రెస్టారెంట్లను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే సమీపంలోని రెస్టారెంట్లు, హోటళ్లను అప్రమత్తం చేశారన్నారు. ఈ నేపథ్యంలో సుచిత్ర ఎక్స్ రోడ్ సమీపంలోని గిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ నిర్వాహకులు సంబంధిత మహిళలను పట్టుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించగా, వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
తాజ్మహల్ హోటల్కు షోకాజ్ నోటీసు
ఆబిడ్స్లోని తాజ్మహల్ హోటల్లో పప్పులో పురుగు కనిపించినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో తనిఖీ చేసిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో పరిశుభ్రత లేకపోవడంతోపాటు ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారని పంకజ తెలిపారు. ఆహార పదార్థాలకు సంబంధించిన ఐటమ్స్పై లేబుల్స్ లేకపోవడం, ఆహారపదార్థాల నిల్వ ప్రదేశంలో బొద్దింకలు కనిపించడంతో పాటు పలు లోపాలున్నట్లు గుర్తించి నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి సంజాయిషీ వివరణ అందాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment