జోగుళాంబ గద్వాల
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా మారే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం అందించాలన్న డిమాండ్ ఉండగా.. బడ్జెట్లో దీనిపై ప్రస్తావనే కరువైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయాల్సిన భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. అలాగే ఉమ్మడి పాలమూరులోని కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా నిరాశే ఎదురైంది. ఉమ్మడి జిల్లాలోని పురాతన, ప్రముఖ దేవాలయాలకు ప్రసాద్ స్కీం పథకం కింద కేంద్రం నుంచి నిధులు అందుతాయని ఆశించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ నిధుల కేటాయింపు లేకుండాపోయింది.
సులభంగా రుణాలు..
వ్యవసాయ రంగంలో సాంకేతికత పెంచడం, వలసలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త నిర్ణయాలు తీసుకుంది. పంటల ఉత్పాదకత, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పంచాయతీ, బ్లాక్ స్థాయిల్లో గోదాంలు, నీటి పారుదల, రుణ సౌకర్యాలను మరింత పెంచాలని నిర్ణయించింది. అలాగే రైతుల పెట్టుబడి కోసం అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేయకుండా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 5.50 లక్షలకుపైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో ఖర్చులు, పరికరాల కొనుగోలు కోసం రైతులు స్వల్పకాలిక రుణాలు పొందవచ్చు. రానున్న ఐదేళ్లపాటు పత్తి పంట ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం పత్తి పంట మద్దతు ధర పెంచేందుకు అవకాశం ఉంది.
చేనేత కార్మికులకు దన్ను..
ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా దేశంలో తయారైన స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలో ఉన్న మర మగ్గాల కార్మికులకు మేలు జరగనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 4,600 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపుతో చేనేత దుస్తుల ధరలు తగ్గనున్నాయి. కాగా.. పొగాకు, సిగరెట్లపై పన్నులను కేంద్రం పెంచడంతో వాటి ధరలు మరింత పెరగనున్నాయి.
ప్రధానికి కృతజ్ఞతలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ ప్రజా ఆమోద బడ్జెట్. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా ఆదాయపు పన్నులో రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం శుభపరిణామం. పారిశ్రామిక, ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధాని మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు. – డీకే అరుణ,
ఎంపీ, మహబూబ్నగర్
వినతులు బుట్టదాఖలు
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలని, నిధులు కేటాయించాలని చేసిన మా వినతులు బుట్టదాఖలయ్యాయి. కనీసం మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం. తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రజలు ఏటా రూ.లక్ష కోట్ల వరకు పన్నులు కడుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్
వేరుశనగ క్వింటా రూ.5,789
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శనివారం 1264 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5789, కనిష్టం రూ.2819, సరాసరి రూ. 4379 ధరలు పలికాయి. అలాగే, 4 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 5489 ధర లభించింది. 167 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6869, కనిష్టం రూ. 2800, సరాసరి రూ.6855 ధరలు వచ్చాయి.
యూరియా, డీఏపీ డిమాండ్ మేరకు నిల్వలు ఉండాలి
గద్వాల వ్యవసాయం: అన్ని మండలాల్లో డిమాండ్ మేరకు యూరియా, డీఏపీ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్, ఇతర అధికారులు గద్వాల మండలం చెనుగోనిపల్లి రైతువేదిక నుంచి వీసీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ గోపీ మాట్లాడుతూ యూరియా, డీఏపీ స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు కమిషనరేట్కు పంపించాలని సూచించారు. రైతు భరోసాలో భాగంగా వ్యవసాయ, వయవసాయేతర భూముల వివరాలు జాగ్రత్తగా పోర్టల్ నమోదు చేయాలని చెప్పారు. ప్రతి ఏఈఓ 2వేల ఎకరాల డిజిటల్ పంట సర్వే చేయాలని చెప్పారు. వీసీలో ఏడీఏలు, ఏఈఓలు పాల్గొన్నారు.
అల్పాహారాన్ని
సద్వినియోగం చేసుకోవాలి
ధరూరు: ప్రత్యేక క్లాసుల సమయంలో విద్యార్థులు పస్తులు ఉండకూడదన్న ఆలోచనతో ప్రభుత్వం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రతి పదో తరగతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని బాగా చదివి మంచి మార్కులతో పాస్ కావాలని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. శనివారం సాయంత్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్పాహారం కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జీహెచ్ఎం ప్రతాప్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. విద్యార్థులకు ఆరు రకాల చిరు ధాన్యాలతో ప్రతి రోజు ఒక రకం చొప్పున చిరు ధాన్యాల అల్పాహారాన్ని అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల అధికారి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అదనపు గదుల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని డీఈఓ ఆదేశించారు. సంబందిత కాంట్రాక్టర్ పనులను వేగవంతంగా చేపట్టడంతో పాటు నాణ్యతగా నిర్మించాలని సూచించారు.
● ఉమ్మడి జిల్లాలోని సాగునీటిప్రాజెక్టులకు తప్పని భంగపాటు
● పర్యాటక రంగ అభివృద్ధికిలభించని చేయూత
● ఊసేలేని మాచర్ల– గద్వాల, కొత్త రైల్వే మార్గాలు
● రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుపై హర్షాతిరేకాలు
● కిసాన్ క్రెడిట్ కార్డుతో 5.50 లక్షల మంది
రైతులకు ప్రయోజనం
● స్వదేశీ దుస్తులకు పన్ను తగ్గింపుతో 4,600 చేనేత కార్మికులకు మేలు
● ఈసారి నిరాశే మిగిల్చిన కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగం తర్వాత గ్రామీణాభివృద్ధికే అత్యధిక శాతం నిధులు కేటాయించింది. ఈ మేరకు మొత్తం రూ.2,66,817 కోట్ల కేటాయింపులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చించనుంది. దీంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి వేగంగా అడుగులు పడనున్నాయి. ఆ తర్వాత వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి విరివిగా రుణాలు మంజూరు చేయనున్నారు. అంగన్వాడీ పోషణ్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా చిన్నారులకు పోషకాహారం పెంచడంతో పాటు మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘డే కేర్ కేన్సర్ సెంటర్స్’ ఏర్పాటు చేయనున్నారు.
భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆమెను శాలువాతో సన్మానించారు.
ఫ్యాక్టరీ రద్దు చేసే వరకు పోరాటం
రాజోళి: ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు పోరాడతామని మహిళలు హెచ్చరించారు. శనివారం మండలంలోని పెద్దధన్వాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మహిళలు 10వ రోజు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని నెలల తరబడి తమ వ్యతిరేకతను వినిపిస్తున్నా కూడా పనులు ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని గ్రామంలో ఏర్పాటు చేయనివ్వమని వారు అన్నారు. మహిళలంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, నిర్మాణం చేయకుండా, పూర్తి రద్దు చేయాలని ఆదేశాలు వచ్చేవరకు తమ పోరాటం ఆగదని అన్నారు.
న్యూస్రీల్
Comments
Please login to add a commentAdd a comment