ధర్మపురి: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని జయంతోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే స్వామివారి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 21 వరకు వేడుకలు నిర్వహణకు అంతా సిద్ధం చేశారు.
తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు..
శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఈనెల 13 నుంచి 16 వరకు ఉదయం మంగళ వాయిద్యాలతో గోదావరినదికి వెళ్లి బిందె తీర్థము, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. 17న సహస్ర కలశాభిషేకం, 18న స్వామివారలకు చందనోత్సవం, 19న పల్లవోత్సవం, వసంతోత్సవం, 20న లక్ష తులసి అర్చన, 21న స్వామివారల జయంతిని కన్నులపండువగా నిర్వహిస్తారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు..
నవరాత్రోత్సవాల సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. చలువ పందిళ్లు, చల్లని తాగునీరు, లడ్డూ ప్రసాదం, తదితర వసుతులు కల్పించినట్లు పేర్కొన్నారు.