కరీంనగర్కల్చరల్: మరణానంతరం నేత్రాలు, అవయవాలు, శరీరం మట్టిలో వృథాగా కలిసిపోనివ్వకుండా దానం చేసి మానవ మనుగడకు తోడ్పడాలని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ కోరారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ కిమ్స్ విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్ అర్జున్రావు అధ్యక్షతన సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవయవ, శరీర దానాలపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. నేత్రదానం అంటే మొత్తం కనుగుడ్డు తీయడం కాదని, కన్నుపై ఉన్న పల్చని కార్నియా అనే పొర మాత్రమేనని అన్నారు. మరణించిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా ఇంటి వద్దే తీసుకుంటారన్నారు. ఈ కార్నియా మార్పిడి కోసం 15లక్షలకు పైగా అంధులు వేచి ఉన్నారని తెలిపారు. అందులో 60 శాతం మంది 12 సంవత్సరాల్లోపు బాలబాలికలుండడం అత్యంత విషాదకరమన్నారు. ఈ పరిస్థితుల్లో నేత్రదానం ఒక యజ్ఞంలా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ పెద్ద మనసు, మానవతా దక్పథంతో ఆలోచించి మరణానంతరం నేత్రదానం చేసి మానవ జన్మను చరితార్థం చేసుకోవాలని కోరారు. విద్యార్థులతో శ్రవణ్కుమార్ నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, కరీంనగర్ జిల్లా ప్రతినిధులు ఎస్.రాజకనకయ్య, ఓదెల ప్రతినిధి క్యాతం మల్లేశం తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment