మధిర: మధిరలోని వైరా రోడ్డులో గతంలో ఉన్న మధిర రూరల్ పోలీస్ స్టేషన్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్న ముగ్గురిపై బుధవారం మధిర టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. డీసీఎంఎస్కు చెందిన స్థలానికి కొన్నాళ్ల క్రితం బహిరంగ వేలంపాట నిర్వహించగా జిలుగుమాడు గ్రామానికి చెందిన వీరంశెట్టి కాళేశ్వరరావు, మధిరకు చెందిన పూసపాటి ఉమామహేశ్వరరావు, మందడపు రామారావు కొంత ప్రభుత్వ స్థలాన్ని దక్కించుకున్నారు. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా మిగిలిన డీసీఎంఎస్ స్థలాన్ని సైతం కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారు. ఈ విషయమై పరిశీలించిన డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కొండా సందీప్ కుమార్ ఫిర్యాదుతో ముగ్గురిపై మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో యువత వీరంగం
నేలకొండపల్లి: పేకాట ఆడుతున్న సందర్భంలో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో వారు వీరంగం సృష్టించటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మండల కేంద్రంలో కొందరు మద్యం సేవించి, పేకాట ఆడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై తీవ్రరూపం దాల్చడంతో వారు రోడ్డుపైకి అరుపులు, కేకల మధ్య బాహాబాహీకి పాల్పడ్డారు. వారి ప్రవర్తన ఇబ్బంది కలిగించడంతో స్థానికులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమచారం.
Comments
Please login to add a commentAdd a comment