ఖమ్మంవ్యవసాయం: రుణమాఫీ వర్తించని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కాగా, జిల్లాలో తొలిరోజు 1,475 కుటుంబాల వారిని వ్యవసాయ శాఖ గుర్తించింది. రేషన్ కార్డులు లేకున్నా రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాలను నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ) మండలాల వారీగా నేరుగా వ్యవసాయ శాఖ అధికారులకు పంపించింది. ఆ జాబితాల ఆధారంగా కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయాధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. ఏఈఓల సహకారంతో గ్రామాల్లో టంకాలు, మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియ ఎప్పుడు నిర్వహించేది ముందుగానే ప్రకటిస్తున్నారు. నిర్ధారణ ప్రక్రియలో భాగంగా అధికారులు కుటుంబ యజమాని నుంచి అఫిడవిట్ తీసుకొని, ఆ కుటుంబంతో సెల్ఫీ ఫొటో దిగి ప్రభుత్వం రూపొందించిన ‘రైతు భరోసా’ పంట రుణాల పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాలో 50 వేల రైతు కుటుంబాల జాబితాను ఎన్ఐసీ పంపించగా.. నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టాల్సి ఉంది. ఒక్కో మండల వ్యవసాయాధికారి రోజుకు 100 కుటుంబాల చొప్పున సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment