ఖమ్మం సహకారనగర్: ఐటీఐల్లో సంప్రదాయ కోర్సులు కొనసాగుతుండగా, వీటిని పూర్తిచేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయి. దీంతో ఐటీఐల్లో ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా కోర్సుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు(ఏటీసీ)గా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 65ప్రభుత్వ ఐటీఐల్లో తొలుత మూడింటికి అవకాశం కల్పించారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఐటీఐ, నిజామాబాద్లోని ప్రభుత్వ ఐటీఐతో పాటు ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐకి అవకాశం దక్కింది. ఇందులో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు సత్వర ఉపాధి లభించనుంది.
నాలుగు ఫేజ్లు పూర్తి
ప్రభుత్వ ఐటీఐల్లో ప్రస్తుతం ఏడు కోర్సులు ఉన్నా యి. వీటిలో ప్రవేశాలకు నాలుగు దశల్లో కౌన్సెలింగ్ పూర్తయింది. దీంతో ఖమ్మం ఐటీఐలో 192సీట్లకు గాను 143మంది విద్యార్థులు చేరారు. ఖాళీగా ఉన్న 49సీట్ల భర్తీ కోసం ఐదో విడతగా ఈనెల 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంతలోనే కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పాత కోర్సుల్లో చేరిన వారు కళాశాలల్లో సంప్రదించి మార్చుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
అనుకోకుండా ప్రారంభం
ఈ ఏడాది ఖమ్మం ఐటీఐని ఏటీసీగా అప్గ్రేడ్ చేసినప్పటికీ కొత్త కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతాయని అంతా భావించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఎంపిక చేయగా, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ భవన నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. రూ.4.77 కోట్లతో తరగతి గదులు, ల్యాబ్ నిర్మించాలని నిర్ణయించారు. ఇంతలోనే అవసరమైన పరికరాలు, ఫర్నీచర్తో పాటు అధ్యాపక బృందాన్ని టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కేటాయించింది. వీరిలో ఇద్దరు అధ్యాపకులు చేరారు. జూన్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనా నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో కోర్సులు వచ్చే ఏడాదే ప్రారంభమతాయని అనుకున్నారు. కానీ నాలుగు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఐదో దశకు వచ్చే సరికి కొత్త కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించడం విశే షం. కాగా, ఒక్కో కోర్సులో 20మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశముంటుంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బోధన
ఏటీసీకి కావాల్సిన భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ప్రస్తుతం ఉన్న గదుల్లోనే కొత్త కోర్సుల బోధనకు నిర్ణయించారు. ఇందుకోసం ఆయా కోర్సులకు సంబంధించిన సామగ్రి, ఫర్నీచర్ను సిద్ధం చేశారు. ఐదో విడతలో ప్రవేశాలు పొందే వారితో పాటు గత నాలుగు విడతల్లో చేరిన వారికి అక్టోబర్ 1నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
కొత్త కోర్సులు ఇవే...
కోర్సు కాలపరిమితి
మానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ఏడాది
ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మానుఫ్యాక్చరింగ్ ఏడాది
ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఏడాది
బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ (మెకానికల్) రెండేళ్లు
అడ్వాన్స్డ్ సీఎస్సీ మిషనింగ్ టెక్నీషియన్ రెండేళ్లు
మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ రెండేళ్లు
ఏటీసీగా ఖమ్మం ఐటీఐ అప్గ్రేడ్
రాష్ట్రంలో మూడింట మనకూ అవకాశం
ఆరు కొత్త కోర్సుల్లో ప్రవేశానికి
రేపటి వరకు గడువు
పూర్తిచేసే విద్యార్థులకు
విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు
కొత్త కోర్సులతో సత్వర ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తోంది. ఆరు కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తాం. ఆయా కోర్సుల బోధనకు అవసరమైన పరికరాలు, ఫర్నీచర్ సిద్ధంగా ఉండగా, అధ్యాపకులు సైతం చేరుతున్నారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన ఈ కోర్సుల ద్వారా సత్వర ఉపాధి లభించే అవకాశముంది. – ఏ.శ్రీనివాసరావు,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment