రూ 2.50 కోట్ల విలువైన ఐ ఫోన్లు చోరీ | - | Sakshi
Sakshi News home page

రూ 2.50 కోట్ల విలువైన ఐ ఫోన్లు చోరీ

Published Sat, Feb 8 2025 7:51 AM | Last Updated on Sat, Feb 8 2025 7:51 AM

-

రామవరప్పాడు: విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని ఓ గోదాములో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో గోదాములోని రూ.2.50 కోట్ల విలువైన 373 ఐ ఫోన్లు చోరీకి గురయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఇంగ్రామ్‌ మైక్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ గోదాములో కంప్యూటర్లు, మొబైల్‌ పరికరాలు నిల్వ ఉంచుతారు. ఈనెల 5న ఈ గోదాములో కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో సిబ్బంది గోదాము మూసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు గోదాము తెరచి చూడగా పైన సీలింగ్‌కు పెద్ద రంధ్రం పెట్టి ఉంది. అనుమానం వచ్చి పరిశీలించగా గోదాములో ఉన్న రూ.2.50 కోట్ల విలువ చేసే 373 మొబైల్‌ ఫోన్లు చోరీకి గురైనట్లు సిబ్బంది గుర్తించారు. గోదాములో కంప్యూటర్లు, ఎలక్ట్రిక్‌ విడిభాగాలు ఉన్నప్పటికీ కేవలం ఐ ఫోన్లు మాత్రమే దొంగిలించడం, సీసీ కెమెరాల వైర్లు కత్తిరించడాన్ని గుర్తించి గోదాము ఇన్‌చార్జి ఫారుక్‌ అహ్మద్‌ పోలీసులకు సమాచారం అందించారు. పటమట సీఐ పవన్‌ కిషోర్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గోదాము సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లో యూపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కారు నంబరు, సీసీ ఫుటేజ్‌ను ఒడిశా పోలీసులకు పంపించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను ఒడిశా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సీలింగ్‌కు రంధ్రం చేసి ప్రవేశించిన దొంగలు

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాగా

అనుమానిస్తున్న పోలీసులు

నిందితులు కారులో వచ్చినట్టు సీసీ కెమెరాలో రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement