ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఈ నెల మూడో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని పేర్కొన్నారు. ఈ నెల 27న ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎనిమిదో తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. అప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల నియామావళిని వివరించారు.
20 ప్రత్యేక బృందాలు
ఎన్నికలకు ప్రత్యేకంగా 20 ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతోందన్నారు. జిల్లాలో 45,540 మంది పురుషులు, 32,685 మంది మహిళలు, 13 మంది టీజీ ఓటర్లు చొప్పున 78,238 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఆన్లైన్ ద్వారా వచ్చే ఫారం–18లను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 101 పోలింగ్ స్టేషన్లకు ఆమోదం లభించిందన్నారు.
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం పనిచేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. దీనికి 0866 – 2575822 నంబరు కేటాయించామన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, ఎలక్షన్ డెప్యూటీ తహసీల్దార్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment