మమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారు
గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వం
జనసేన, బీజేపీ నేతల తీర్మానం
శ్రీరంగరాజపురం (చిత్తూరు జిల్లా): ‘విలువలు లేని వ్యక్తులతో కలసి మేం పనిచెయ్యం. కూటమి అభ్యర్థి థామస్ వ్యవహారశైలితో విసిగిపోయాం. ఇక మీదట సైకిల్ ఎక్కేది లేదు... ప్రచారం చేసేది లేదు’ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి యుగంధర్, బీజేపీ ఇన్చార్జి రాజేంద్రలు స్పష్టంచేశారు. ఈ మేరకు ఎస్ఆర్ పురం మండలం కటికపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో తీర్మానం కూడా చేశారు.
ఈ సందర్భంగా యుగంధర్, రాజేంద్ర మాట్లాడుతూ కూటమి అభ్యర్థి థామస్ వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీ, జనసేన మద్దతు అవసరం లేదని పరోక్షంగా చెబుతున్నట్లు ఉందన్నారు. థామస్ నామినేషన్ రోజు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనీసం తాగునీరు, భోజనం కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీల ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారానికి వెళితే... ‘థామస్ కనీసం పలకరించడం లేదు.
చూసీ చూడనట్లు నటిస్తున్నాడు. మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నాడు. అసలు ఎందుకు వచ్చారు.. అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. మాకు గౌరవం ఇవ్వని అభ్యర్థికి మేం మద్దతుగా ఉండలేం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వబోం అని తీర్మానం చేశాం’ అని వివరించారు.
మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి వారి పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా కలుపుకుని ప్రచారంలో దూసుకువెళుతున్నారని, టీడీపీ అభ్యర్థికి మాత్రం ఎవరిపైనా గౌరవం లేదన్నారు. థామస్ వ్యవహారశైలిపై బీజేపీ, జనసేన అధిష్టానాలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల బీజేపీ, జనసేన అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.