జోగిపేట(అందోల్): అందోలు నియోజకవర్గంలో విద్యుత్ శాఖకు సంబంధించి మంజూరైన రూ.9 కోట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేడ్చల్ చీఫ్ ఇంజనీర్ కామేష్, సంగారెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనాథ్, జోగిపేట డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న పనుల వేగాన్ని సమీక్షించారు. 9 కోట్ల అంచనాలతో జరుగుతున్న పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. వేసవి, రబీ సీజన్లలో నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని మంత్రి సూచించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్), 11 కేవీ ఇంటర్లింకింగ్ లైన్లు, 33 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుతో సహా వ్యవసాయ మౌలిక సదుపాయాలు అత్యంత ప్రాధాన్యతగా చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్యకలాపాలకు తోడ్పడటానికి ఈ ప్రాంతంలో మొత్తం విద్యుత్ మెరుగుపరచడానికి అవసరమైన ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గృహ, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ సరఫరాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని మంత్రి పేర్కొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయండి
మంత్రి దామోదర ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment