నంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పోస్ట్ కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన ఉత్తరాలను సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రూ.500 బోనస్, రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా ఒక్క హామీకూడా నెరవేర్చలేదని వాపోయారు. అందుకే తమ ఆవేదనను సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ కార్డుల రూపంలో వెల్లడించామని చెప్పారు.
రాఘవాపూర్లో...
సిద్దిపేటరూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ, పలు పథకాలను అమలు చేయాలని కోరుతూ రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరాల ద్వారా విన్నవించారు. సోమవారం మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలోని రైతులు మాట్లాడుతూ హామీలను అమలుచేసి, రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాంచందర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదయ్య, డైరెక్టర్ తిరుపతి, గ్యార తిరుపతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.