కొత్త ప్రయత్నం..
సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నె 2015 డిసెంబరులో తీవ్ర వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. చైన్నె శివారుల నుంచి నగరం అంతా జలదిగ్బంధంలో చిక్కాయి. ఇందుకు ప్రధాన కారణం చెంబరంబాక్కం రిజర్వాయర్ గేట్లను ఎత్తి వేయడం, శివార్లలోని అన్ని చెరువులూ తెగిపోవడం, నీటి పరివాహక ప్రాంతాలన్నీ ఆక్రమణలకు గురి కావడం అని పరిశీలనలో తేలింది. దీంతో ఆక్రమణల తొలగింపునకు అప్పట్లోని కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం చైన్నెలో వర్షపు నీటి కాలువల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నిర్మాణాలు జరుగుతున్న సమయంలో 2021 డిసెంబరులో వర్షాలకు నగరం మరోమారు వరద ముంపును ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం తక్కువగానే ఉన్నా, గత ఏడాది వచ్చిన మిచాంగ్ తుపాన్ చైన్నె నగరాన్నే కాదు, శివారు జిల్లాలను అతలాకుతలం చేసింది. కనీవిని ఎరుగని రీతిలో వరదలు పోటెత్తాయి. తీవ్ర నష్ట, కష్టాలను ప్రజలు ఎదుర్కొన్నారు. అయితే గతంలో లాగ వరద నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండక పోవడం ప్రజలకు కాస్త ఊరట కలిగించింది.
సమగ్ర నివేదిక
వరద నీరు ప్రధానంగా వండలూరు, మణ్ణివాక్కం, పడప్పై, ఆదనూరు, ఊరపాక్కం, మణి మంగళం, వరద రాజపురం, సోమంగళం, ముడిచ్చూర్ పరిసరాల నుంచి అడయార్ నదిలోకి అధికంగా వచ్చి చేరుతున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఈ పరిసరాల్లో ఉన్న చెరువులు, నీటి పరివాహక ప్రదేశాలపై దృష్టి పెట్టారు. అలాగే కుండ్రత్తూరు, అంబత్తూరు, ఆవడి, పూందమల్లి తదితర ప్రాంతాల నుంచి కూవం, కుశస్థలీ నదిలోకి నీరు వచ్చే పరిసరాలలో సమగ్ర పరిశీలన మేరకు ఇక్కడున్న చెరువుల వివరాలను సేకరించారు. మొత్తంగా 60 చెరువుల కారణంగానే చైన్నెకు వరద ముంపు అధికంగా ఉండడం వెలుగు చూసింది. దీంతో ఈ చెరువుల కరకట్టలను బలోపేతం చేయడం, పునరద్ధరించడం, ఆక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని చెరువు పూర్వ స్థితికి తీసుకొచ్చే విధంగా పనులకు సిద్ధమవుతున్నారు. అలాగే ఈ చెరువులు, జల వనరుల పరిసరాలలో గృహాల నిర్మాణాలకు కొత్త నిబంధనలు విఽధించబోతున్నారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ను పార్కింగ్ కోసం మాత్రమే కేటాయించి ఆపై అంతస్తు నుంచి గృహ నిర్మాణాలు చేసుకునే విధంగా కొత్త నిబంధనలు అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇలా నిర్మాణాలు చేయడం ద్వారా ఏదేని ముంపు ఎదురైనా ఇళ్లలోని వస్తువులు వరద పాలు కాకుండా ఉంటుందని, ప్రజలను సురక్షితంగా రక్షించేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ చెరువులను పునరద్ధరించడం, పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా ఈ నీటిని వేసవిలో, అత్యవసర సమయాల్లో చైన్నె అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి చెరువుల పరిసరాలలో, నీటి పరివాహక ప్రాంతాలలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టబోతున్నారు. ఈ ఏడాది ఈశాన్య రుతు పవనాల సీజన్లోచైన్నె వరద ముంపునకు గురి కాకుండా ఇప్పటి నుంచి ముందు జాగ్రత్తలను విస్తృతం చేసే విధంగా సమగ్ర అంశాలతో నివేదికను సిద్ధం చేస్తున్నారు.
వరద ముంపు (ఫైల్)
న్యూస్రీల్
రాజధాని నగరం చైన్నెను వరద ముంపు నుంచి గట్టెక్కించేందుకు కొత్త ప్రయత్నాలపై పాలకులు దృష్టి పెట్టారు. చైన్నె శివార్లలోని మూడు జిల్లాల పరిధిలో ఉన్న చెరువులు, జలవనరుల పునరుద్ధరణ, విస్తరణకు కార్యాచరణ సిద్ధమవుతోంది. నీటి పరివాహక ప్రదేశాలు, జల వనరుల సమీప ప్రాంతాల్లో గ్రౌండ్ ఫోర్ల్ గృహ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదనే అంశంతో పాటు పలు నిబంధనలతో సమగ్ర నివేదికను అధికారులు రూపొందిస్తున్నారు.
ఈశాన్య రుతు పవనాల సీజన్లో శివారు ప్రాంతాల నుంచి వచ్చే నీటి కారణంగా చైన్నె వరద ముంపును ఎదుర్కొంటున్నదనే విషయాన్ని గుర్తించిన అధికారులు కట్టడి ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. చైన్నె శివారులో ఓ వైపు చెంగల్పట్టు, మరోవైపు కాంచీపురం, ఇంకోవైపు తిరువళ్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలోని అనేక చెరువుల నుంచి అతిభారీ వర్షాల సమయంలో వచ్చే ఉబరి నీరు అడయార్ నది, బకింగ్ హాం కాలువ, కుశస్థలి, కూవం నదిల్లో కలుస్తున్నాయి. దీంతో చైన్నె శివార్లలో ఉన్న చెరువుల పునురుద్ధరణ, వాటి పూర్వపు స్వరూపం తీసుకొచ్చే విధంగా విస్తరణ పనులకు ప్రజా పనులు, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల కాలంగా జరిపిన పరిశీలన మేరకు చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో చైన్నె శివారులలో 60 చెరువులు ఉన్నట్టు, వీటి రూపంలో వరద సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
చైన్నె శివార్లలో 60 చెరువుల
విస్తరణకు కార్యాచరణ
నదీ పరివాహక ప్రాంతాల్లో
గ్రౌండ్ ఫోర్లకు అనుమతి నిరాకరణ
సమగ్ర నివేదిక రూపకల్పనలో
అధికారులు