Bulandshahr
-
సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సికిందరాబాద్లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోనివారంతా ఉలిక్కిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.ఈ ఘటనకు ముందు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో కూడా సిలిండర్ పేలుడు చోటుచేసుకుంది. వెల్కమ్ హోటల్లోని సర్వీస్ కిచెన్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. హోటల్లోని నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదే తరహాలో యూపీలోని ఘజియాబాద్లోని తిలా మోడ్ ప్రాంతంలో గల న్యూ డిఫెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికార్పూర్-బులంద్షహర్ రోడ్డులో పికప్ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్లోని రాయ్పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారు. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు బులంద్షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
లక్నో: ఉత్తరప్రదేశ్లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్షహర్లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024 -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్హెచ్వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్షెహర్కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
బస్సులోనే ప్రసవం.. అటు నుంచి నేరుగా..
బులంద్షహర్: ఉత్తర ప్రదేశ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి సొంతూరుకు వెళుతున్న ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. ఆ వెంటనే డ్రైవర్ ఆ బస్సును ప్రభుత్వ ఆస్పత్రికి వద్దకు తీసుకెళ్లి తల్లిని, నవజాత శిశువును వైద్యులకు అప్పగించారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి యూపీలోని కన్నౌజ్ జిల్లా ఛిబ్రమౌకు వెళ్తుండగా ఆదివారం చోటుచేసుకుందని ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ అలోక్ కుమార్ చెప్పారు. ఢిల్లీ నుంచి యూపీలోని ఈటా జిల్లా లోని సొంతూరుకు తాము వెళ్తున్నట్లు మహిళ భర్త సోమేశ్ కుమార్ చెప్పారు. ఆ సమయంలో బస్సులోనే పురిటి నొప్పులు వచ్చాయని అతను వివరించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. -
యోగితో యూపీలో అభివృద్ధి!
లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే, కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన డిజిటల్ ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చకు తెరదించుతూ యోగిని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా రాకపోయి ఉంటే యోగి సారథ్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధిని సాధించి ఉండేదని అన్నారు. కేంద్ర పథకం కింద నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇస్తేనే, ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలకు చేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఆగ్రా, మథుర, బులంద్షార్ ఓటర్లనుద్దేశించి ప్రధాని ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు. యూపీలో బీజేపీ మళ్లీ గెలిస్తే సీఎం అభ్యర్థిని మారుస్తుందా అన్న సందేహాలకు తావు లేకుండా ప్రధాని ప్రసంగం సాగింది. రాష్ట్రంలో మహిళలంతా బీజేపీ మళ్లీ గెలవాలని, యోగి మళ్లీ సీఎం కావాలని నిర్ణయించుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల అవసరాలను గుర్తించలేదని దుమ్మెత్తి పోశారు. యూపీని లూటీ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వారి కుటుంబమే ప్రభుత్వంగా మారితే, బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రమంతా ఒక కుటుంబంలా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా భారత గానకోకిల లతా మంగేష్కర్ కన్నుమూయడంతో యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యే ఒక కార్యక్రమంలో ఆదివారం ఉదయం 10:15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. లత మరణంతో రెండు నిముషాల సేపు నేతలు మౌనం పాటించారు. మేనిఫెస్టో విడుదల కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. బీజేపీ నేతల ప్రవేశంపై నిషేధం తమ గ్రామంలోకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావొద్దంటూ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా గున్నౌర్ పరిధిలోని బిచ్పురి సైలాబ్ గ్రామంలో చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణుల రాకను గ్రామస్థులు అడ్డుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బోర్డు ఏర్పాటు చేసిన గ్రామపెద్ద నిరంజన్ సింగ్ను అరెస్టు చేశారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకు నిరసనగానే ఈ బోర్డు పెట్టినట్లు ప్రజలు చెబుతున్నారు. యూపీలో మామపై కోడలి పోటీ! ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ జిల్లాలోని తిల్హార్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రోషన్లాల్ వర్మపై ఆయన కోడలు సరితా యాదవ్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రీయ సమాజ్ పార్టీ టిక్కెట్పై పోటీ చేస్తానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన వర్మ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సమాజ్వాదీ పార్టీలో చేరారు. సమాజ్వాదీ పార్టీ ఆయనకు తిల్హార్ టిక్కెట్ ఇస్తామని ప్రకటించింది. తన మామ రోషన్లాల్ వర్మ భూకబ్జాదారుడు అని సరితా యాదవ్ ఆరోపించారు. అసలు సరితా యాదవ్ తన కోడలే కాదని వర్మ చెబుతున్నారు. రాయ్బరేలీ స్టార్ ప్రచారకుల్లో లేని సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నాలుగో దశలో ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, రాయ్బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ స్టార్ ప్రచారకుల జాబితాలో సోనియా పేరు లేకపోవడం గమనార్హం. 30 మంది స్టార్ ప్రచారకుల జాబితాలో రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు ఉన్నారు. పంజాబ్లో అన్నదమ్ముల పరస్పర పోటీ పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లాలో ఉన్న మజిథా అసెంబ్లీ స్థానం నుంచి అన్నదమ్ములు వేర్వేరు పార్టీల టిక్కెట్లపై పోటీకి దిగుతున్నారు. తనదే గెలుపు అంటూ ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుఖ్జిందర్రాజ్ సింగ్ అలియాస్ లల్లీ మజీథియా ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్పై, ఆయన తమ్ముడు జగ్విందర్పాల్ సింగ్ అలియాస్ జగ్గా మజీథియా కాంగ్రెస్ టిక్కెట్పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
ఉద్యోగం తీసేశాడని.. కడుపుకోత మిగిల్చారు!
పగ.. ప్రతీకార వాంఛ.. కృతజ్ఞతను సైతం పక్కన పడేస్తుంది. మనిషిని మృగంగా మార్చేసి విపరీతాలను దారి తీస్తుంది. అలాంటిదే ఈ ఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం తండ్రి చేసిన పనిని మనసులో పెట్టుకుని.. ఆ పగని అభం శుభం తెలియని పసివాడి మీద చూపించారు ఇద్దరు వ్యక్తులు. యూపీలో జరిగిన మైనర్ కిడ్నాప్-హత్య ఉదంతం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో: యూపీ బులంద్షెహర్లో బాధిత తండ్రి డాక్టర్గా పని చేస్తున్నాడు. ఆవారాగా తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్లను.. వాళ్ల తల్లిదండ్రుల ముఖం చూసి తన దగ్గర కాంపౌండర్లుగా చేర్చుకున్నాడు. అయితే డాక్టర్కు తెలియకుండా వాళ్లను డ్యూటీలో తప్పులు చేస్తూ వచ్చారు. దీంతో రెండేళ్ల కిందట నిజమ్, షాహిద్లను ఉద్యోగంలోంచి తీసేశాడు. అప్పటి నుంచి ఆ డాక్టర్ మీద కోపంతో రగిలపోతూ.. అదను కోసం చూస్తూ వచ్చారు వాళ్లిద్దరూ. శుక్రవారం(28, జనవరి)న ఆ డాక్టర్కి ఉన్న ఎనిమిదేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి.. దాచిపెట్టారు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడ్డ ఆ తండ్రి.. ఛట్టారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగేసరికి భయంతో అదే రాత్రి ఆ చిన్నారిని చంపేశారు. పోలీసుల దర్యాప్తులో.. మాజీ ఉద్యోగులుగా, పైగా డాక్టర్ ఇంటి దగ్గర్లోనే ఉంటుండడంతో ఆ ఇద్దరిని ప్రశ్నించారు పోలీసులు. వాళ్లు తడబడడంతో తమ శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పేసుకున్నారు. దీంతో ఆ పిల్లవాడి మృతదేహాన్ని రికవరీ చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. తన మీద కోపంతో తన కొడుకును కడతేర్చడంపై ఆ తండ్రి, ఆ తల్లి కుమిలి కుమిలి రోదిస్తున్నారు. -
లైంగిక వేధింపులు: ఉరికి వేలాడిన మహిళా ఎస్సై
లక్నో: అమ్మాయిలకు వేధింపులు ఎదురైతే పోలీసుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళా ఎస్సైకే వేధింపులు ఎదురయ్యాయి. వాటిని నిలువరించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన ఎస్సై చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్లో చోటు చేసుకుంది. బులంద్షహర్ ఎస్ఎస్పీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన 30 ఏళ్ల అర్జూ పవార్.. అనూప్షహర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో 2015 నుంచి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె షామ్లి జిల్లాలో ఒంటరిగా నివసిస్తోంది. (చదవండి: కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి) అయితే గత కొంత కాలంగా ఆమెకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దీంతో తీవ్రంగా కలత చెందిన సదరు మహిళ తను నివాసం ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. మరోవైపు ఇంటి యజమాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో తలుపు తట్టి చూడగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి చూడగా ఆమె సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. అందులో తన చావుకు తనే కారణమని పేర్కొంది. (చదవండి: యూట్యూబ్ నటికి వేధింపులు..) -
సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువ మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడ్డారు. ఉరి వేసుకుని తనువు చాలించారు. వివరాలు... బులంద్షహర్ జిల్లాలోని అనూప్షహర్ పోలీస్ స్టేషన్లో ఆర్జూ పవార్(30) ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటిలో శుక్రవారం ఉరికి వేలాడుతూ కనిపించారు. చాలా సేపటి నుంచి ఆర్జూ అలికిడి వినిపించకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరచి చూడగా విషయం బయటపడింది. (చదవండి: ఆమె మళ్లీ బతుకుతుందని 25 రోజులు..) ఈ క్రమంలో.. ఆమె ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఆస్పత్రికి తరలించగా ఆర్జూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఘటనాస్థలంలో లభించిన సూసైడ్నోట్లో.. తన చావుకు తానే కారణమని ఆర్జూ పేర్కొన్నట్లు రాసి ఉందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు ఆమె సన్నిహితులను కూడా విచారిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
సీటు కోసం గొడవ.. తుపాకీతో కాల్పులు
బులంద్షహర్ : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బులంద్షహర్ జిల్లాలోని ఓ స్కూల్లో.. తరగతి గదిలో సీట్ల విషయంలో వచ్చిన గొడవకు 10వ తరగతి చదివే సన్నీ (14)తన తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపాడు. సెలవుల్లో ఆర్మీ నుంచి ఇంటికి వచ్చిన తన అంకుల్ లైసెన్స్ గన్తో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కాల్చిన అనంతరం పారిపోబోయాడు. అయితే అప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గేట్లు మూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికాడు. కాగా పోలీసులు వివరాలు నమోదు చేసుకొని జువైనల్ హోమ్కు తరలించారు. -
పబ్లిక్గా దమ్ము లాగించిన పోలీసులు
లక్నో: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరం. ఈ నిబంధనను ఆచరించకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే పబ్లిక్గా పొగ తాగినందుకు ఏకంగా పోలీస్ స్టేషన్కే లాక్కెళ్లిపోతారు. మరి శిక్షించాల్సిన పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తే..! వారి పరువు గంగలో కలవడమే కాదు, ఉద్యోగం కూడా చిక్కుల్లో పడుతుంది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎస్సై రాజ్ బహదూర్, హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర సింగ్.. పహసు పోలీస్ స్టేషన్ పరిధిలోని బనేల్ గ్రామంలో పార్టీకి వెళ్లారు. అక్కడ తీరికగా కూర్చుని ఎదురుగా టేబుల్ మీద మందు బాటిళ్లు పెట్టుకుని పబ్లిక్గా దర్జాగా దమ్ము లాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా అది కాస్తా వైరల్గా మారింది. అలా ఈ వీడియో పై అధికారుల కంట పడింది. దీంతో ఆ ఇద్దరినీ బులంద్షహర్కు బదిలీ చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. (చదవండి: సిస్టర్ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు) చదవండి: కాబోయే భార్య ఆస్పత్రి బెడ్ మీద ఉండగానే.. -
సూట్కేసులో మృతదేహం.. తన భార్యదేనని..
లక్నో : చనిపోయిందని భావించిన ఓ మహిళా సజీవంగా తిరిగి వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్షహర్లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వరీషా భర్త అమీర్ జూలై 23న తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే నెల 27న ఘజియాబాద్ సమీపంలో సూట్కేసులో కుక్కి ఉన్న ఓ మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం అమీర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం తన భార్య వరీషాదేని చెప్పి తీసుకుకెళ్లారు. (చదవండి : ప్రియుడితో పారిపోయి.. భర్తపై నెపం వేసి) కాగా, సోమవారం వరీషా పోలీసులకు సంప్రదించి తాను బతికే ఉన్నానని పేర్కొంది. అంతే కాకుండా తన భర్త అమీర్, అత్త వరకట్నం కోసం తనను వేధించారని, వారి టార్చర్ భరించలేక నోయిడా వెళ్లినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అమీర్, అతని తల్లిపై వరకట్నం వేధింపులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సూట్ కేసులో లభించిన మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బులంద్షహర్ పోలీసులు పేర్కొన్నారు. -
బీజేపీని చిక్కుల్లో పడేసిన ఫోటో
లక్నో: బులంద్షహర్ బీజేపీ అధ్యక్షుడు, ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటో ఒకటి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. హంతకులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వివరాలు.. బులంద్షహర్లోని ఓ సంస్థ జూలై 14 న ‘ప్రధాన్ మంత్రి జాన్ కళ్యాంకరి యోగి జాగ్రుక్తా అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు ముఖ్య అతిథిగా బులంద్షహర్ బీజేపీ అధ్యక్షుడు అనిల్ సిసోడియాను ఆహ్వానించింది. అనంతరం సంస్థ సభ్యులకు సిసోడియా చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ క్రమంలో శిఖర్ అగర్వాల్ అనే వ్యక్తికి కూడా సిసోడియా సర్టిఫికెట్ అందజేశారు. 2018లో యూపీలో సంచలనం సృష్టించిన పోలీసు అధకారి హత్య కేసులో శిఖర్ అగర్వాల్ నిందితుడిగా ఉన్నాడు. సిసోడియా, అగర్వాల్ను సంస్థకు జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సర్టిఫికెట్ అందజేసిన ఫోటో సోషల్ మీడయాలో తెగ వైరలయ్యింది. దాంతో నేరస్తులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూన్నాయి. (పరిమళించిన మానవత్వం) వివాదం కాస్తా పెద్దది కావడంతో సిసోడియా దీనిపై స్పందించారు. ఓ స్థానిక సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని.. ఈ కార్యక్రమానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 2018లో బులంద్షహర్లో గోహత్య పుకార్ల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. దాంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్పై నిందితులు దాడి చేశారు. ఆయన చేతి వెళ్లను నరికి.. తలపై కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసు వాహనంలో వేసి.. పొలాల్లో వదిలేశారు.. ఈ దారుణానికి పాల్పడిన వారిమీద కేసు నమోదు చేశారు. నాటి ఘటనలో శిఖర్ అగర్వాల్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అగర్వాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి.. సర్టిఫికెట్ అందుకోవడం వివాదాస్పదంగా మారింది. -
సీఎం యోగికి ఉద్ధవ్ ఫోన్.. అందుకేనా?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేశారు. బులందర్షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వెలిబుచ్చారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ‘యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడాను. బులందర్షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వ్యక్తపరిచాను. మేము మీతో ఉంటామని ఆయనతో చెప్పాను. ఇలాంటి కేసులో మేము వ్యవహరించినట్టుగానే కఠినంగా ఉండాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని సూచించాను. దీనికి మతం రంగు పూయొద్దని కోరాన’ని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కాగా, సాధువుల హత్యపై యూపీ సీఎంకు ఠాక్రే ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్రలోని పాల్గాఢ్ జిల్లాలో సాధువుల హత్య జరిగిన సందర్భంలో ఉద్ధవ్కు సీఎం యోగి ఫోన్ చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయనకు సూచించారు. సరిగ్గా ఇదేవిధంగా ఇప్పుడు ఆదిత్యనాథ్కు ఠాక్రే ఫోన్ చేశారు. పాల్గాఢ్ ఘటనకు మతం రంగు పూయాలని బీజేపీ నాయకులు ప్రయత్నించగా ఉద్ధవ్ సర్కారు సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల ఫోన్ సంభాషణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన సీనియర్ సంజయ్ రౌత్ కూడా బులందర్షహర్ సాధువుల హత్యకు మతం రంగు పులమకుండా జాగ్రత్త పడాలని ట్విటర్లో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బులందర్షహర్ జిల్లా పగోనా గ్రామంలోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. (దేవుడు కోరాడనే సాధువులను చంపేశా) -
శివాలయంలో సాధువుల దారుణ హత్య
లక్నో: మహారాష్ట్రలోని పాల్గరిలో సాధువుల హత్య ఘటన మరువకముందే మరో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్షహర్లోని పగోనా గ్రామంలో శివాయం లోపల ఇద్దరు సాధువులను గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా హతమార్చారు. సోమవారం నాడు ఈ ఘటన జరిగివుండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన కొందరు గ్రామస్తులు రక్తపు మడుగులో పడి ఉన్న సాధువులను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (విషాదం: మంటలు ఆర్పేందుకు వెళ్లి..) మృతి చెందిన సాధువులను జగదీష్(55), షేర్ సింగ్(46)గా గుర్తించారు. ఈ ఘటనపై బులంద్షహర్ ఎస్ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఇటీవలే ఇద్దరు సాధువులకు ఓ వ్యక్తితో గొడవ జరిగింది. అతను వీరి వస్తువులు దొంగిలించేందుకు ప్రయత్నించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ కోపంతోనే అతను వాళ్లిద్దరినీ చంపేసి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింద"న్నారు. ప్రస్తుతం సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్ను అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. (మూకహత్య: ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్) -
కేక్ కటింగ్: భర్తకు పాకిన కరోనా
లక్నో: ఆమెకు కరోనా సోకింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కనపెట్టి తన పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంది. ఈ తప్పిదం వల్ల ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. అంతేకాక లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల కింద ఆమెతోపాటు వేడుకలో పాల్గొన్న మరో ముగ్గురిపై పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు, బీజేపీ మహిళా మోర్చా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడిని కలవడంతో ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులనందరినీ శిఖర్పూర్లోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. (కోవిడ్ నెగిటివ్ వస్తేనే లోపలికి అనుమతిస్తాం) అయితే ఈ మధ్యే ఆమె తన 38వ వివాహ వార్షికోత్సవ వేడుకలను క్వారంటైన్ సెంటర్లో వేడుకగా జరుపుకుంది. ఈ సందర్భంగా భర్త, కూతురు, అల్లుడి మధ్య కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ పార్టీ చేసుకున్నారు. దీంతో తాజా పరీక్షలో ఆమె భర్తకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో వీరి పెళ్లి వేడుకలు, కేక్ కటింగ్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాక క్వారంటైన్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరుమీదా దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలావుండగా కరోనా సోకిన భార్యాభర్తలనిద్దరినీ ఖుర్జాలోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది) -
పరిమళించిన మానవత్వం
బులంద్షహర్ : ప్రపంచమంతా కరోనా ధాటికి గడగడ వణుకుతున్న వేళ మానవత్వానికి ఆలంబనగా నిలిచిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షెహర్లో వెలుగు చూసింది. ఆపత్కాలంలో ఆయువు తీరిన నిరుపేద హిందూ మతస్థుడి అంత్యక్రియలకు అయినవారు రాలేకపోయిన వేళ సాటి ముస్లింలు మానవత్వం ప్రదర్శించి మతసామరస్యం చాటారు. మతాల అడ్డుగోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు. మానవత్వానికి, మతసామరస్యానికి అద్దం పట్టిన ఈ ఘటన బులంద్షెహర్లోని మౌలానా ఆనంద్ విహార్లో చోటుచేసుకుంది. రవిశంకర్ అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారు. నిరుపేద కుటుంబం దీనావస్థను గమనించిన చుట్టుపక్కల ముస్లింలు.. రవిశంకర్ అంత్యక్రియల్లో సాయం చేశారు. స్వయంగా పాడె మోసి మృతదేహాన్ని శ్మశానికి తరలించడంలో సహాయపడ్డారు. భౌతికకాయాన్ని తరలించే సమయంలో 'రామ్ నామ్ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ మతసామరస్యాన్ని చాటారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు. లాక్డౌన్ కారణంగా బంధువులు రాలేకపోయారని, ముస్లిం సోదరుల అండతో తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించామని రవిశంకర్ కుమారుడు చెప్పారు. కరోనా మహమ్మారి విరుచుకుపోతున్న వేళ మునుపెన్నడూ చూడని ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగులు, కూలీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బులంద్షెహర్లోని ముస్లింలు చూపిన మానవత్వం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. (వైరల్ వీడియో : వలస కార్మికుడు దీనస్థితి) -
క్షమించండి: రూ. 6 లక్షలు తీసుకోండి!
లక్నో: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టాన్ని పూడ్చేందుకు ముస్లిం వర్గం ముందుకు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశ వాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రాలు సహా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య చెలరేగిన ఘర్షణలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆగ్రహించిన యోగి సర్కారు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తామని హెచ్చరికలు జారీ చేసింది.(‘ప్రతీకారం తీర్చుకుంటాం.. ఆస్తులు వేలం వేస్తాం’) ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీలోని బులంద్షహర్లో గత శుక్రవారం చెలరేగిన అల్లర్లలో జరిగిన నష్టానికి చింతిస్తూ ముస్లిం సోదరులు పరిహారం చెల్లించారు. ఈ మేరకు రూ. 6.27 లక్షల చెక్కును ప్రభుత్వ అధికారులకు అందజేశారు. ఈ విషయం గురించి బులంద్షహర్ కలెక్టర్ మాట్లాడుతూ.. శుక్రవారం నమాజ్ పూర్తైన తర్వాత కొంత మంది ముస్లిం వ్యక్తులు తనను కలిసి డీడీ ఇచ్చారని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ వాహనం ధ్వంసమైనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. హింసను వ్యతిరేకిస్తూ లేఖ కూడా అందించారని పేర్కొన్నారు. రికవరీకి వెళ్లకముందే స్వయంగా వారే పరిహారం చెల్లించడం గొప్ప విషయమని ప్రశంసించారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస కారణంగాగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. రూ .14.86 లక్షలు కట్టాలంటూ యూపీ సర్కారు 28 మందికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.(యోగి ప్రతీకారం : రూ. 15 లక్షలు కట్టండి! ) చదవండి: ఖాదిర్ దేవుడిలా వచ్చి.... నన్ను కాపాడాడు అమ్మానాన్న ఎక్కడ.. అయ్యో పాపం ఐరా.. ‘19 మంది మృతి..1100 మంది అరెస్ట్’ -
పవిత్ర స్నానాలకొచ్చి.. పరలోకాలకు వెళ్లారు
లక్నో: బులంద్షహర్లో దారుణం చోటు చేసుకుంది. పేవ్మెంట్ మీద నిద్రిస్తున్న వారి మీదకు మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన బులంద్షహర్ నరోరాలోని గంగాఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ హత్రాస్కు చెందిన కొందరు గంగానదిలో పవిత్ర స్నానమాచరించడం కోసం నరోరా ఘాట్కు వచ్చారు. ఈ క్రమంలో వీరు గురువారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్న పేవ్మెంట్ మీద నిద్ర పోయారు. శుక్రవారం తెల్లవారుజామున వైష్ణోదేవి ఆలయం నుంచి వస్తోన్న ఓ బస్సు వీరి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
షాకింగ్.. పొరపాటున బీజేపీకి ఓటేసి.. !
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ లోక్సభ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్సభ స్థానాలకు రెండోదఫా పోలింగ్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. శిఖర్పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు. పొరపాటున బీజేపీ గుర్తుకు ఓటేయడంతో కోడవలిని ఉపయోగించి తన చేతి వేలిని పవన్ నరికేసుకున్నాడు. వేలిని నరికేసుకున్న తర్వాత పొరపాటున బీజేపీకి ఓటేశానంటూ అతను విచారం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేయాలని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన పవన్.. పొరపాటున బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్కు ఓటేశాడని, జరిగిన పొరపాటున తెలుసుకొని తనపై తానే ఆవేశానికి లోనై.. వేలిని నరికేసుకున్నాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
నాన్నను ఆ ఇద్దరు అంకుల్స్ చంపేశారు!
లక్నో : ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న ఓ వ్యక్తి మరణానికి సంబంధించి అతడి కూతురు(4), ఇరుగుపొరుగు వారు చెప్పిన వివరాల ఆధారంగా.. నోయిడా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి అంత్యక్రియలను నిలిపివేసి శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. వివరాలు.. బులంద్షహర్కు చెందిన సంతోశ్ రాఘవ్ అనే వ్యక్తి భార్య మమత, కూతురు(4), కొడుకు (2)లతో కలిసి సెక్టార్ 93లో నివాసం ఉంటున్నాడు. సంతోశ్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా మమత కూడా కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పని పూర్తి చేసుకుని శనివారం రాత్రి మమత టెర్రస్పైకి వచ్చే సరికి సంతోశ్ రాడ్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో మద్యం మత్తులో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించింది. ఈ విషయం గురించి బంధువులకు సమాచారం అందించింది. వాళ్లిద్దరు నాన్నను చంపేశారు సంతోశ్ శవాన్ని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లే క్రమంలో అతడి సోదరి సీమా రానా మేనకోడలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ నా సోదరుడి అంత్యక్రియలు నిర్వర్తించేందుకు శవాన్ని తీసుకుని రెండు కార్లలో బయల్దేరాం. అప్పటి వరకు నిద్రపోయిన నా మేనకోడలు లేచిన తర్వాత నాన్న ఎక్కడ అంటూ మమతను అడిగింది. నాన్న నాకు పాఠం చెబుతున్నపుడు ఇద్దరు అంకుల్స్ మన ఇంటికి వచ్చారు. ఒకరు లావుగా, మరొకరు సన్నగా ఉన్నారు. నాన్నను పైకి తీసుకువెళ్లారు. నేను వస్తానంటే వద్దన్నారు. సీసాలు తెచ్చారు. అక్కడే నాన్నను కొట్టి చున్నీ మెడకు వేశారు అని చెప్పింది’అని పేర్కొంది. కాగా ఈ కేసులో సంతోశ్ పక్కింటి వ్యక్తులు కూడా అతడి కూతురు చెప్పిన వివరాలే చెప్పడంతో అనుమాననాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నోయిడా పోలీసులు తెలిపారు. -
మా వంతు సహాయంగా రూ. 70 లక్షలు!
లక్నో : బులంద్షహర్ హింసాకాండలో మృతి చెందిన ఎస్ఐ సుబోధ్ కుమార్ కుటుంబానికి యూపీ పోలీసులు అండగా నిలిచారు. తమ వంతు సహాయంగా 70 లక్షల రూపాయలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ సుబోధ్ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల పరిహారంతో పాటుగా.. మా వంతు సహాయంగా మరో 70 లక్షల రూపాయలు వాళ్లకు అందిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా బులంద్షహర్లోని మహావ్ గ్రామంలోని ఓ చెరుకు తోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదంమొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్ కుమార్తో పాటు సుమిత్ కుమార్ అనే యువకుడు కూడా మృతి చెందాడు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’) ఇక యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్ కుమార్ ఈ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్ దళ్ నాయకులు ఈ కేసులో నిందితులుగా ఉండటం.. బులంద్షహర్ ఘటనలో కూడా భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్పై ఆరోపణలు రావడంతో యోగి సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. -
సరిగ్గా నెలరోజులకు నిందితుడి అరెస్టు
లక్నో : గోవులను వధించారనే వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో ఎస్ఐ సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటన డిసెంబర్ 3న జరగగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యోగేష్రాజ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని జిల్లా భజరంగ్దళ్ కన్వీనర్ యోగేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, అరెస్టు ముందు అతనొక వీడియోలో.. అల్లర్లు జరిగిన చోట నేను లేను. హింసాకాండ, ఆందోళలనకు నాకు ఏ సంబంధం లేదు. ప్రభుత్వం నన్ను చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. చెరుకు తోట సమీపంలో పశువుల కళేబరాలున్నాయని ఎవరో కాల్ చేశారు. దాంతో నేరుగా సియానా పోలీస్ స్టేషన్కు వెళ్లాను. ఆందోళన జరుగుతున్న సమయంలో భజరంగ్దళ్ మిత్రులతో కలిసి స్టేషన్లోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. (యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా) ఇదొక కథ..? యోగేష్రాజ్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరాలు మరోలా ఉన్నాయి. మిత్రులతో కలిసి సోమవారం (డిసెంబర్, 3) ఉదయం 9 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్కి వెళ్లినట్టు చెప్పాడు. పొరుగునున్న మహావ్ గ్రామంలోని చెరుకు తోట సమీపంలో గోవులను వధిస్తున్న ఏడుగురు ముస్లిం యువకులను గుర్తించామని, వారిని పట్టుకుందామనే లోపలే పారిపోయారని వివరించాడు. ఆ యువకులు తమ గ్రామానికి చెందినవారేనని తెలిపాడు. ఇదిలాఉండగా.. హింసాకాండ చెలరేగిన అనంతరరం కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటిల్లో.. పశువధ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యోగేష్ రోడ్లను బ్లాక్ చేయించినట్టుగా ఉంది. ఆందోళన సాగుతున్న సమయంలో అతను పోలీసులతో మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకొచ్చింది. వీడియోల్లో లభ్యమైన ఆధారాలను బట్టి హింసాకాండకు ప్రధాన సూత్రధారి యోగేష్ అనేందుకు బలం చేకూరుతోంది. భజరంగ్దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రవీణ్ భాటి మాట్లాడుతూ.. బులంద్షహర్ హింసాకాండతో యోగేష్రాజ్కి సంబంధం లేదని అన్నారు. ఆందోళన సమయంలో అతను పోలీసులకు సాయం చేశాడని చెప్పారు. హత్య, హత్యాయత్నం నేరాల కింద యోగేష్పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టపరిచారని కూడా కేసు పెట్టారు. -
తానే కాల్చుకున్నాడు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో చోటుచేసుకున్న హింసాకాండపై బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ లోధి మరో వివాదం లేవనెత్తారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించి సరికొత్త వివాదం రేపారు. డిసెంబర్ 3న జరిగిన విధ్వంసకాండ సందర్భంగా బుల్లెట్ గాయంతో సుబోధ్ మరణించారు. ‘జనమంతా చుట్టుముట్టినప్పుడు సుబోధ్ సింగ్ నిస్సహాయంగా ఉన్నారు. ఆందోళనకారుల బారి నుంచి కాపాడుకునేందుకు తనను తాను కాల్చుకోవాలనుకున్నారు. చివరికి తుపాకిని తలకు గురిపెట్టి కాల్చుకున్నార’ని దేవేంద్ర సింగ్ అన్నారు. సుబోధ్ పుర్రెలో బుల్లెట్ ఉందని పోస్ట్మార్టం నివేదిక వెల్లడించింది. ఆరు చోట్ల రాళ్లతో కొట్టిన గాయాలు ఉన్నట్టు కూడా పేర్కొంది. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’) మహావ్ గ్రామంలోని ఓ చెరుకుతోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదం మొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, కీలక నిందితుడు ప్రశాంత్ నాథ్ను అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీసులు గురువారం ప్రకటించారు. సుబోధ్ సింగ్ను కాల్చినట్టు అతడు ఒప్పుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే తాను కాల్చలేదని కోర్టు బయట మీడియాతో ప్రశాంత్ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. -
రాజకీయమా, అసహనమా !?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఓ పోలీసు అధికారి చావుకన్నా ఆవు చావు చాలా ప్రాముఖ్యమైనది’ అని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా డిసెంబర్ 17వ తేదీన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంపై ఇప్పుడు రాద్దాంతం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఆవును చంపారన్న ఆరోపణలపై బజరంగ్ దళ్ కార్యకర్తలు సృష్టించిన హింసాండలో ఓ పోలీసు అధికారి చనిపోయిన ఉదంతం గురించి నసీరుద్దీన్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారిని కాల్చి చంపిన బజరంగ్ దళ్ నాయకుడు యోగేశ్ రాజ్ను ఇంతవరకు అరెస్ట్ చేయలేక పోయిన బులంద్షహర్ పోలీసులు ఆవును చంపిన కేసులో నలుగురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ నలుగురు ముస్లింలు ఆవును చంపారనడానికి ఎలాంటి ఆధారాలు పోలీసులు సేకరించలేక పోయారు. ఈ నేపథ్యంలో మతోన్మాద పరిస్థితుల గురించి, నేరం చేసిన తప్పించుకుంటున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ నసీరుద్దీన్ ఓ మనిషి చావుకన్నా చావు ముఖ్యంగా మారిందని విమర్శించారు. ఆవును చంపారన్న ఆరోపణలపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, పోలీసు అధికారి చావును మాత్రం అదొక ‘యాక్సిడెంట్’ అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో తప్పుకనిపించని మూకలకు ఇప్పుడు నసీరుద్దీన్ మాటల్లో తప్పు కనిపిస్తోంది. నసీరుద్దీన్ను పాకిస్థాన్ ఏజెంట్ అంటూ యూపీ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే విమర్శించగా, దేశద్రోహి అంటూ బీజేపీ మిత్రుడు రాందేవ్ బాబా ఆరోపించారు. మతోన్మాద రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా వారిని పాకిస్తాన్ ఏజెంట్ అనడమో, పాకిస్తాన్ టెర్రరిస్టుతో పోల్చడమో మతోన్మాద నాయకులకు కొత్తకాదు. ఇంతకుముందు ఇదే యోగి ఆదిత్యనాథ్, దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ హఫీద్ సయీద్తో పోల్చారు. దేశంలో అసహన పరిస్థితులు పెరుగుతున్నాయన్నందుకు మరో నటుడు ఆమిర్ ఖాన్ను కూడా మతోన్మాద మూకలు విమర్శించాయి. పర్యావసానంగా ఆమిర్ ఖాన్ కొన్ని కోట్ల రూపాయల యాడ్ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నసీరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు మొన్న శుక్రవారం నాడు ‘అజ్మీర్ సాహిత్య వేడుకల్లో’ నిర్వాహకులు ఆయన పాల్గొనాల్సిన సెషన్ను రద్దు చేశారు. ఎంత రాజకీయమైనా ఇంత అసహనం పనికి రాదు! -
‘21 గోవులు మరణించాయి.. అది కనిపంచడం లేదా’
లక్నో : మీకు ఇద్దరు మనుషులు చనిపోవడం మాత్రమే కనిపిస్తోంది.. కానీ అక్కడ మరో 21 ఆవులు కూడా చనిపోయాయి.. అది మీకు కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ శర్మ. కొన్ని రోజుల క్రితం బులందషహర్ ప్రాంతంలో జరిగిన మూక దాడిలో ఇద్దరూ పోలీసు అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి వెనక వేరే ఉద్దేశాలున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సంఘటనల గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్ మౌనంగా ఉన్నారు. దాంతో ఆగ్రహించిన మాజీ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు ఈ విషయం గురించి పూర్తిగా విచారణ చెపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ శర్మ ‘కేవలం ఇద్దరు మనుషులు చనిపోయారని ఇంత రాద్ధంతం చేస్తున్నారు. కానీ అక్కడ 21 గోవులు కూడా చనిపోయాయి. ఆవులను చంపేవారే నిజమైన నేరస్తులు. గోమాతను చంపుతున్నారనే ఆగ్రహంతోనే ఈ మూక దాడి చర్యలు పుట్టుకొచ్చాయం’టూ సంజయ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూక దాడిలో ఇద్దరూ పోలీస్ అధికారులు మరణించినప్పటికి ఆదిత్యనాథ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ‘ఆదిత్యనాథ్కు మనుషుల ప్రాణాలకంటే గోవుల గురించి చింతే ఎక్కువైంది. గో రక్షణ పేరిట మనుషుల ప్రాణాలు తీస్తున్న చలించడం లేద’ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి మరిన్ని విమర్శలకు అవకాశం కల్పించారు. -
ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ రోడ్డుపై సోమవారం జరిగిన హిందూత్వ మూకల విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని ఆరోపించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు మాట మార్చి అది ఒక ప్రమాదం మాత్రమేనని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన శాంతిభద్రల సమస్య ఎంత మాత్రం కాదని, ఆ నాటి విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ కూడా వ్యాఖ్యానించిన విషయం ఇక్కడ గమనార్హం. ‘ఎవరో, ఎక్కడి నుంచో పశు కళేబరాలను తీసుకొచ్చి ఇక్కడెందుకు వేశారు? వారి ఉద్దేశం ఏమిటీ? ఎలాంటి పరిస్థితుల్లో వారీ పని చేశారు?’ అంటూ ఆయన వేసిన ప్రశ్నల్లో అనుమానపు ఆనవాళ్లు లేవా? నాటి విధ్వంసకాండలో సుమిత్ కుమార్ అనే 20 ఏళ్ల పౌరుడితోపాటు పోలీసు ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ మరణించడం మామూలు విషయం కాదు. పైగా యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం ఎంత మాత్రం యాధృశ్చికం కాదు. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్ దళ్ నాయకులు నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. హింసాకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్ రాజ్ కూడా భజరంగ్ దళ్ నాయకుడు కావడం గమనార్హం. ఆ రోజు తాను తన మిత్రులతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా రోడ్డు పక్క పొలంలో ఏడుగురు వ్యక్తులు పశువును కోస్తుండడం కనిపించిందని తాను అక్కడికి వెళ్లే వరకల్లా వారంతా పారిపోయారని యోగేశ్ రాజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగేష్ రాజ్ సోదరి సుమత్ మహర్ కథనం అందుకు భిన్నంగా ఉంది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కడి నుంచో ఫోన్ వస్తే యోగేష్ ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారని ఆమె తెలిపారు. పైగా పొలంలో పడి ఉన్న పశు ఎముకలు తాజావి కావని, రెండు, మూడు రోజుల క్రితం చంపేసిన పశు కళేబరాలని అక్కడికి స్వయంగా వెళ్లి పరిశీలించినన సియాన తహసిల్దార్ రాజ్కుమార్ భాస్కర్ చెప్పడం కూడా గమనార్హం. పశు ఎముకలు కనిపించిన మహావ్ గ్రామం పొలం పక్కనే ఉన్న చెరకు తోటలో ఆవు తలకాయ, తోలు ఆరేసి ఉన్నాయని, మాంసం కోసం ఆవును చంపేసే వాళ్లు ఇలా ‘ఎగ్జిబిట్’ చేయరని ఆయన చెప్పారు. తన గ్రామానికి చెందిన ఏడుగురు ముస్లింలు ఆవును చంపడం తాను కళ్లారా చూశానంటూ సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో సియానా గ్రామంలోని పోలీసు స్టేషన్కు వెళ్లి నయాబామ్ గ్రామానికి చెందిన యోగేశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఆయన పేర్కొన్న ఏడుగురు ముస్లింలలో ఇద్దరు బాలలు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా, వారు ఆవు మాంసం తీస్తు కనిపించారని, దగ్గరికెళ్లే సరికి పారిపోయారని రాజ్ అంతకుముందు వీడియా ముఖంగా కూడా చెప్పారు. అలా పారిపోయిన వారిని ఆయన పేర్లతో సహా ఎలా కనిపెట్టారన్నది మరో ప్రశ్న. ఆ ఎముకలు రెండు, మూడు రోజుల క్రితం చంపిన ఆవు వన్నప్పుడు, ఆ ఏడుగురు అక్కడ ఉండే అవకాశం ఉందా? సియాన పోలీసు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుభోత్ కుమార్ సింగ్ అప్పటికే ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆ విషయం సియాన పోలీసు స్టేషన్కు అందలేదా? అందలేదనుకుంటే అదనపు బలగాలను అక్కడి నుంచి ఎలా పంపించారు? ఛింగ్రావత పోలీసు అవుట్ పోస్ట్ వద్ద పోలీసు ఇన్స్పెక్టర్ సుభోద్ కుమార్ సింగ్తో భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ వాగ్వాదానికి దిగడం పలు సెల్ఫోన్ వీడియోల్లో కూడా రికార్డయింది. ఆ తర్వాత సుభోద్ తలలో బుల్లెట్ గాయంతో మరణించాడు? ఎలా జరిగింది ? ఎముకలను తీసుకొచ్చిన ట్రాక్టర్ ఏమయింది? ఫోరెన్సిక్లాబ్కు పంపించాల్సిన ట్రాక్టర్లోని ఎముకలు ఎందుకు అదృశ్యమయ్యాయి? పొలంలో కూడా ఎముకల ఆనవాళ్లు లేకుండా ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? యోగేశ్ రాజ్ ఫిర్యాదు మేరకు ఏడుగురు ముస్లింలను అరెస్ట్ చేసిన పోలీసులు విధ్వంసకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు. పారిపోయే అవకాశం ఆయనకు ఎందుకు ఇచ్చారు? ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్ వద్ద విధ్వంసకాండ జరిగితే చుట్టుపక్కలున్న ఏడు గ్రామాల ప్రజలు, అంతా యువకులే వాహనాల్లో ఎలా వచ్చారు? వారి వద్ద తుపాకులు ఎందుకు ఉన్నాయి? ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన పిల్లలకు ఐదేసి లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వడానికి నిరాకరించిన యోగి ఆదిత్యనాథ్ సంఘటన జరిగిన రోజే సుబోధ్ కుమార్ కుటుంబానికి 40 లక్షల రూపాయల నష్ట పరిహారం, భార్యకు లేదా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ అంత ఉదాహరంగా ఎలా ప్రకటించారు? ఇద్దరు మరణానికి కారణమైన విధ్వంసకాండ కేంద్రంగా దర్యాప్తు జరపాల్సిన పోలీసులు ఆవును చంపడం తీవ్రమైన నేరం అంటూ ఆ దిశగానే దర్యాప్తు జరపడం కుట్రలో భాగం కాదా? -
యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా
బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ ఔట్పోస్ట్తో పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మీరట్ జోన్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘బులంద్ షహర్ జిల్లా మెహౌ గ్రామం దగ్గర సోమవారం ఆవు కళేబరం కనిపించింది. దీంతో ఓ మతానికి చెందినవారు ఆవును చంపేశారని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థల సభ్యులు కొందరు ఆ ఎముకల్ని ట్రాక్టర్లో వేసుకుని ఛింగర్వతి పోలీస్స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చారు. తర్వాత బులంద్షెహర్–గఢ్ రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. దీంతో జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్, సబ్డివిజినల్ మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అంతలోనే ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీస్ ఔట్పోస్ట్తో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా దుండగుల దాడిలో ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ మరణించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమిత్ అనే యువకుడు చనిపోయాడు. -
అలా దొరికిపోయాడు
పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ నిరుద్యోగికి అది కష్టతరమన్న విషయం అర్థమైంది. ఓ ఫ్లాన్ వేసి అధికారులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే ఫిజికల్ టెస్టులో అతగాడి వ్యవహారం బయటపడింది. అతనిపై కేసు నమోదు చేసి అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. మీరట్: బులంద్షహర్కు చెందిన అంకిత్ కుమార్కు పోలీస్ కావాలనే కల. ఎస్సై ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాడు. రాత పరీక్ష క్లియర్ అయిపోగా, ఫిజికల్ టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే ఎత్తు సమస్య అతని పాలిట శాపంగా మారింది. నిబంధనల ప్రకారం 168 ఎత్తు కాగా, అంకిత్ ఓ సెంటీమీటర్ తక్కువగా ఉన్నాడు. దీంతో ఎత్తు పెరిగేందుకు అడ్డమైన మందులు వాడాడు.. ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేశాడు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో ఓ ఫ్లాన్ వేశాడు. అలా దొరికిపోయాడు.. జుట్టులో హెన్నా పెట్టుకుని శారీరక ధారుడ్య పరీక్షలకు హాజరయ్యారు. ఎత్తు కొలిచే సమయంలో మెషీన్ మెటాలిక్ ప్లేట్కు, జుట్టుకు మధ్య గ్యాప్ ఉండటం అధికారులకు అనుమానం తెప్పించింది. అతన్ని పక్కకు తీసుకెళ్లి వెతకగా.. జుట్టులో హెన్నా బయటపడింది. దానిని తొలగించి నిల్చోవాలని అధికారులు ఆదేశించారు. తిరిగి ఎత్తు కొలవగా ఒక సెంటీమీటర్ తక్కువ హైట్ వచ్చింది. దీంతో అధికారులు అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. అంతేకాదు రిక్రూట్మెంట్లో మోసానికి యత్నించినందుకుగానూ ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు మీరట్ ఎస్పీ(ట్రాఫిక్), ఫిజికల్ టెస్టుల పర్యవేక్షకుడు సంజీవ్ బాజ్పాయి వెల్లడించారు. అంకిత్ మాటల్లో...‘నా ఎత్తు తక్కువ. అది కేవలం 1 సెం.మీ. మాత్రమే. అది పెరిగేందుకు చాలా యత్నించా. కానీ, వీలు పడలేదు. అలాగని అధికారులు మినహాయింపు ఇవ్వరు కదా!. రాత పరీక్ష క్వాలిఫై అయిన నేను ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలని భావించా. నేను చేసింది తప్పే. కానీ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేశా. దయచేసి అవకాశం ఇవ్వండి’ అని 24 ఏళ్ల అంకిత్ ప్రాధేయపడుతున్నాడు. అంకిత్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
గొడవ వద్దన్నందుకు..
ఉత్తర్ ప్రదేశ్: మంచి చెప్పడమే పాపం అయింది. ఆలుమగల మద్య గొడవ వద్దు అని చెప్పిన వ్యక్తి యాసిడ్ దాడిలో మృతిచెందగా.. అతని భార్య కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఖుర్జలో వెలుగుచూసింది. పట్టణంలోని నవాల్పురా ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న రామ్కుమార్ అతని భార్యతో తరచు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న రామ్కుమార్ అన్న ప్రహ్లాద్(30), వదిన మునేష్ దేవి(28) వారిని వారించి ఇంట్లోకి పంపారు. దీంతో అన్నా వదినలపై కోపం పెంచుకున్న రామ్కుమార్ వారిపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రహ్లాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. మునేష్ దేవి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడిలో కుమార్కు కూడా గాయాలు కావడంతో అతన్ని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు జిల్లా రూరల్ ఎస్పీ పి.కే తివారీ వివరాలు తెలిపారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మితిమీరుతున్న కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలు
-
రేపిస్టులను చిత్రహింసలు పెట్టాలి
ఆగ్రా: అత్యాచారానికి పాల్పడిన వారిని చర్మం ఊడేంతవరకు చిత్రహింసలు పెట్టాలని జలవనరుల మంత్రి ఉమాభారతి అన్నారు. బులంద్షహర్ అకృత్యం కేసులో బాధితులకు న్యాయం చేయటంలో ఎస్పీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగిస్తూ.. రేప్ చేసిన వారిని తలకిందులుగా కట్టేసి చర్మం ఊడేవరకు చిత్రహింసలు పెట్టాలన్నారు. గాయాలకు ఉప్పు, కారం పూసి ప్రాణం కోసం బతిమాలుకునేంతవరకూ వదలిపెట్టొదన్నారు. -
లూటీ యత్నం.. మహిళ మృతి
బులంద్ షహర్ః ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ పై వచ్చిన యువకులు వృద్ధ దంపతులను దోచుకునేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన తల్లీ కూతుళ్ళపై అత్యాచారం ఘటన జరిగిన బులంద్ షహర్ ప్రాంతంలోనే ఈ దాడి జరగడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. బటూనా గ్రామంలో పశుగ్రాసాన్ని ఎద్దులబండిలో వేసుకొని వెడుతున్న 55 ఏళ్ళ బిజేంద్రి, ఆమె భర్త 60 ఏళ్ళ విక్రమ్ సింగ్ లపై దోపిడీ దొంగలు దాడికి పాల్పడ్డారు. ఉన్నట్లుండి మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు యువకులు వారి బండిని అడ్డగించడంతోపాటు.. బిజేంద్రి చేతికున్న బంగారు గాజులు, చెవి కమ్మెలను దోచుకునేందుకు యత్నించారు. దీంతో వారిని అడ్డుకోబోయిన బిజేంద్రి తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విక్రమ్ సింగ్ ను కూడా యువకులు బలంగా తోయడంతో కిందపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయని, భార్యాభర్తలు ఇంటికి చేరుకునే లోపే ఈ దారుణం జరిగిందని ఎస్పీ మాన్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
పోలీసులే స్టన్ అయిపోయారు..!
బులంద్ షహర్ః అత్యాచారాలకు అడ్డాగా మారిన ఉత్తర ప్రదేశ్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. బులంద్ షహర్ లో తల్లీ కూతుళ్ళపై అఘాయిత్యం ఘటన మరువక ముందే మరో దారుణం బయటపడింది. ఆర్నెల్లపాటు అత్యాచారానికి గురైన 14 ఏళ్ళ మైనర్ బాలిక.. బలవంతంగా తొలగించబడ్డ తన గర్భంలోని పిండాన్ని పట్టుకొని సరాసరి స్టేషన్ కు రావడం పోలీసులకు సైతం దిగ్భ్రాంతిని కలిగించింది. చేతిలోని పాలిథిన్ బ్యాగ్ లో పిండాన్ని పెట్టుకొని 14 ఏళ్ళ బాలిక.. సరాసరి బులంద్ షహర్ స్టేషన్ కు రావడంతో పోలీసులు విస్తుపోయారు. తనపై ఆర్నెల్లపాటు అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు ఆ చిన్నారి సరాసరి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు వివరాలను బట్టి తెలుస్తోంది. నిందితుడు యూనస్ అహ్మద్ ఆర్నెల్లపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాక, ఆమె గర్భాన్ని చేతులతో బలవంతంగా తొలగించాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 28న తనకు వచ్చినది మామూలు కడుపునొప్పే అనుకున్న బాధితురాలు.. తర్వాత అది సాధారణ కడుపు నొప్పి కాదని, తాను గర్భంతో ఉన్నానని తెలుసుకుంది. విషయం తెలిసిన బాధితురాలి తల్లి సహా కుటుంబ సభ్యులు యూనస్ బలాత్కారం చేశాడంటూ ఆరోపణలకు దిగారు. దీంతో అక్కడే ఉన్నయూనస్.. బాలికపై దాడిచేశాడు. చేతులతో మోది.. ఆమె గర్భంనుంచీ పిండం బయటకు వచ్చేట్లు చేశాడు. కాగా ఇటీవల బులంద్ షహర్లో కారులో ప్రయాణిస్తున్న తల్లీ కూతుళ్ళను బయటకు లాగి మరీ దుండగులు అత్యాచారానికి పాల్పడటం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసింది. అటువంటి ఘోర ఘటన మరువక ముందే.. మైనర్ బాలికపై ఆర్నెల్లపాటు అత్యాచారం చేయడం.. ఆమె గర్భాన్నిబలవంతంగా తొలగించడం.. బులంద్ షహర్ వాసులను భయకంపితుల్ని చేస్తోంది. -
'అజాంఖాన్కు సుప్రీం మొట్టికాయలు'
న్యూఢిల్లీ: బులంద్ షహర్లో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటన విషయంలో ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక మంత్రి స్థాయి వ్యక్తి అలాంటి ఆరోపణలు చేయడం అనుచితం అని పేర్కొంది. బాధ్యతారాహిత్యంగా మంత్రి ఆ వ్యాఖ్యలు చేసినట్లుందని అభిప్రాయపడింది. అంతేకాదు.. 'మీపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని' ప్రశ్నిస్తూ మంత్రి అజాం ఖాన్కి నోటీసులు పంపించింది. 'న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల నమ్మకం సన్నగిల్లేలా అధికారంలో ఉన్న వ్యక్తులుకానీ, అధికార సంస్థగానీ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారసలు' అని సుప్రీంకోర్టు ఆ నోటీసుల్లో ప్రశ్నించింది. ఈ నెల(ఆగస్టు) తొలివారం బులంద్ షహర్ జాతీయ రహదారి 91పై వెళుతున్న ఓ కుటుంబంపై దాడి చేసి అందులోని గృహిణి ఆమె పదమూడేళ్ల కూతురుపై కొంతమంది దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వీటిని ఖండించే క్రమంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నారని, ఈ ఘటన ఒక రాజకీయ కుట్ర అని అజాంఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నేడు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీబీఐ చేతికి రేప్ కేసు విచారణ
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో అత్యంత దారుణంగా జరిగిన గ్యాంగ్రేప్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. కారులో వెళ్తున్న తల్లీకూతుళ్లను బయటకు లాగి వారిని దోచుకుని ఆపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ కేసు విచారణను సీబీఐ తీసుకుంది. ఈ విషయాన్ని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ నిర్ధారించారు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 395, 397, 376డి, 342లతో పాటు పోస్కో చట్టం కింద కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 91వ నెంబరు జాతీయ రహదారిపై బులంద్ షహర్ జిల్లాలో జూలై 29న ఈ దారుణం జరిగింది. నోయిడాకు చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కారులో వెళ్తుండగా.. కొంతమంది దుండగులు వారిని ఆపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో వారిని పలకరించేందుకు షాజహాన్పూర్ వెళ్తున్నారు. తాము ఫిర్యాదుచేసినా పోలీసులు సరిగా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. చివరకు కేసు దర్యాప్తు కూడా సక్రమంగా సాగకపోవడంతో.. చివరకు హైకోర్టు సూచనల మేరకు సీబీఐ రంగప్రవేశం చేసింది. -
ఆ దుర్మార్గుడి దారుణాలు ఒకటి కాదు.. 50
బులంద్ షహర్: బులంద్ షహర్ లైంగిక దాడి ఘటన దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కానీ, అంతకంటే సంచలన విషయాలు ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడి గురించి వెలుగు చూస్తున్నాయి. బులంద్ షహర్ లో లైంగిక దాడికి పాల్పడిన గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు సలీం బావరియా దుష్ట చేష్టలు అంతా ఇంతా కాదు.. అది కూడా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో అతడి దుశ్చర్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు అతడు 50 సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డాడంట. కుటుంబాలనే లక్ష్యంగా చేసుకొని అతడు ఐదు రాష్ట్రాల్లో ఈ దుర్మార్గాలకు పాల్పడ్డాడని తాజాగా పోలీసులు వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా ఎన్నో ఆకృత్యాలకు పాల్పడ్డాడని, ఎంతోమంది అమాయకులపై బందిపోటులోగా పడి దోచుకున్నాడని చెప్పారు. రాజస్థాన్ లో గత జూన్ 30న ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్లింట్లోని ఓ అమ్మాయిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి, చిత్ర హింసలు పెట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని, మొన్న జూలైలో కూడా జాతీయ రహదారి-91పై నాలుగు దోపిడీలు చేశారని చెప్పారు. ఇదే జూలై నెలాఖరులో బులంద్ షహర్ జాతీయ రహదారిపై ఓ ఫ్యామిలీని అటకాయించి అందులోని తల్లీ కూతుళ్లపై వీరు సామూహిక లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
'సీఎం మమ్మల్ని కలవాల్సిందే'
లక్నో: తమను ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కలవాల్సిందేనని బులంద్ షహర్ లో లైంగిక దాడికి గురైన బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆయన కలిస్తేనే తమ కేసు విచారణ సత్వరంగా పూర్తవుతుందని అన్నారు. తామేం రాజకీయాలు చేయడం లేదని, కేవలం న్యాయం కోసమే పోరాడుతున్నామని చెప్పారు. గతవారం బులంద్ షహర్ లో ఓ తల్లి కూతుళ్లపై కొందరు దుండగులు సామూహిక లైంగిక దాడి చేయగా ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయకుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఆ కుటుంబానికి మూడు లక్షల నష్ట పరిహారం, ఘజియాబాద్ లో రెండు ప్లాట్లు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆ కుటుంబం తమను సీఎం అఖిలేశ్ కలవాల్సిందేనని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం అఖిలేశ్ ఒప్పుకున్నారని తాము పత్రికల్లో చదివామని, దాంతోపాటు తాము రాజకీయాలకు పాల్పడుతున్నట్లు మరికొన్నిట్లో చదివామని, అయితే, తామేం రాజకీయాలు చేయడంలేదని, న్యాయం కోసం ప్రాధేయపడుతున్నామని వాపోయారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి ఏడురోజులు గడుస్తున్నా ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మీకు దండం పెడతా.. మమ్మల్ని వదిలేయండి'
నోయిడా: 'ఇంకా మీరు తెలుసుకోవడానికి ఏముంది? చెప్పిందే ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోండి' అంటూ బులంద్ షహర్ లో లైంగిక దాడికి గురైన బాలిక తండ్రి మీడియాను బ్రతిమిలాడుకున్నాడు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు చిన్నాపెద్ద నుంచి చోటా మోటా నాయకులు.. మీడియా క్యూకట్టి వెళుతుండగా.. ఆ ఊరి బయటే ఓ పెద్ద గ్రూపు చేఇ 'మీకు కావాల్సింది లైంగిక దాడికి గురైన బాలిక ఇళ్లేనా.. ఇదిగో ఇలా కుడిచేతి వైపునకు వెళ్లండి' అంటూ చెప్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు బాలిక తండ్రిని పిలవగా అతడు ముఖానికి ఖర్చీఫ్ అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా ముసుగు తీయండని బలవంతపెట్టి తీశాక పలు ప్రశ్నలు సందిస్తున్నారు. వారికి చెప్పి వెళుతుండగానే మరో మీడియా ప్రతినిథులు వచ్చి అలాగే చేస్తున్నారు. దీంతో వారి ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆయన.. 'నా కూతురు, భార్యకు జరిగిన విషాదం గురించి నేను ఇంకా ఎన్నిసార్లు మీకు చెప్పాలి? ఇంకా ఏం మిగిలి ఉందని మీరు అనుకుంటున్నారు? రాత్రి వరకు నా కూతురు బానే ఉంది. అందరు వచ్చి పదే పదే ప్రశ్నిస్తుండటంతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. మరోసారి తను కుప్పకూలింది. ఏమాత్రం ఆపకుండా ఏడుస్తూనే ఉంది. దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లిపోండి. మేం ఇక మీ ముందుకు రాము' అంటూ చేతులు జోడించి వేడుకుంటూ ఆ బాలిక తండ్రి కన్నీటీ పర్యంతం అయ్యాడు. మీడియా, రాజకీయ నాయకుల తీరుపట్ల ఈ విషయంలో పలువురు పెదవి విరుస్తున్నారు. -
తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్: డాక్టర్, పోలీసుల అమానుషం
బులంద్షహర్: 'కనీసం సాధారణ రోగుల్లానైనా మమ్మల్ని చూడలేదు. నా ఒంటినిండా గాయాలున్నాయి. నా కూతురికేమో విపరీతమైన రక్తస్రావం. అమ్మా.. ఏదో ఒకటి చెయ్యండమ్మా లేకుంటే నా బిడ్డ చనిపోతుందని డాక్టర్ కు మొరపెట్టుకున్నా. కానీ ఆమె మమమల్ని పట్టించుకోలేదు. మాపై సామూహిక అత్యాచారం జరిగిందని చెబితే ఆ డాక్టర్ నమ్మలేదు. పైగా, నోరుమూసుకొని వెళ్లి ఆ మూలన కూర్చోండని కసిరింది'.. ఇదీ.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ ఇచ్చిన వాంగ్మూలం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పాశవిక ఘటనకు సంబంధించి ఘోరవాస్తవాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లలో కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. తల్లి తమకు జరిగిన అవమానంపై కుమిలిపోతున్నది. నోయిడాకు చెందిన టాక్సీడ్రైవర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం రాత్రి షాజహాన్ పూర్ (యూపీ) బయలుదేరగా.. ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో కాన్పూర్ హైవేపై గల బులంద్ షహర్ వద్ద దుండగులు కారును అటకాయించి, లోపల ఉన్నవారిని బయటికిలాగి, పొలాల్లోకి తీసుకెళ్లి పురుషులను చెట్లకు కట్టేసి, తల్లి, 14 ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రి 1:30కు దారుణం జరిగితే తెల్లవారి 5:30కు గానీ పోలీసులు స్పందించలేదని బాధితురాలి కుటుంబసభ్యుడు చెప్పాడు. 'రెండు గంటలు నరకం చూపించి దుండగులు వెళ్లిపోయిన తర్వాత కట్లు ఊడదీసుకుని, అరగంటపాటు పోలీస్ హెల్ప్ లైన 100కు ఫోన్ చేస్తూనే ఉన్నా. కానీ నంబర్ బిజీ అని సమాధానం వచ్చింది. తర్వాత మా వాళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడి మహిళా డాక్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు. తెల్లవారాకగానీ పోలీసులు మా దగ్గరికి రాలేదు. వాళ్లు కూడా మా కుటుంబీకులపై అత్యాచారం జరిందంటే నమ్మలేదు. నాటకాలాడుతున్నామన్నట్లు మాట్లాడారు' అని బాధిత మహిళ మరిది మీడియాకు వివరించారు. తమపై జరిగిన అకృత్యం అందరికీ తెలిసిపోయినందుకు సిగ్గుపడుతున్నామని, మళ్లీ నోయిడా వెళ్లి తలెత్తుకుని తిరగలేమని బాధితమహిళ మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆమె గురించి తామంతా కుమిలిపోతున్నామని పేర్కొంది. దోషులను పట్టుకుని ఉరి తీయాలని, లేకుంటే తామే ఉరివేసుకుని చనిపోతామని దగ్ధస్వరంతో రోదించింది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ముగ్గురిని బాధిత కుటుంబీకులు గుర్తుపట్టారని, మరో ఐదుగురు ఇంకా పరారీలోనే ఉన్నారని బులంద్ షహర్ పోలీసులు తెలిపారు. -
ఎన్ హెచ్-91 పై బస్సు లూటీ..
హత్రాస్ః ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం వరుస అవమానాలను ఎదుర్కొంటోంది. 91 నెంబర్ జాతీయ రహదారిపై వెడుతున్న ప్రయాణీకులతో కూడిన బస్సును సాయుధ దుండగులు లూటీ చేయడం సంచలనం రేపుతోంది. బులంద్ షహర్ బైపాస్ కు దగ్గరలో తల్లీకూతుళ్ళ గ్యాంగ్ రేప్ ఘటన జరిగి 48 గటలు గడవక ముందే బస్ లూటీ ఘటన.. తీవ్ర కలకలం సృష్టించింది. మొత్తం 25మంది ప్రయాణీకులతో వెడుతున్న బస్సును సాయుధ దుండగులు అడ్డుకొని చోరీకి పాల్పడటం ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపింది. అలిఘర్ పులారి గ్రామ ప్రాంతంలో బస్సును అడ్డగించి లోనికి ప్రవేశించిన దుండగులు.. కత్తులు మొదలైన పదునైన ఆయుధాలతో ప్రాయాణీకులను బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అజయ్ పాల్ తెలిపారు. సికింద్రారావ్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఘటన జరిగిందని, ఘటనాస్థలానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకులను దోచుకున్న అనంతరం దుండగులు అక్కడినుంచీ పారిపోయినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు అనంతరం ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అజయ్ పాల్ తెలిపారు. బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం హైవేల్లో కఠినమైన పెట్రోలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ బస్సు లూటీ జరగడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ లో గూండారాజ్యం నడుస్తోందని, విపక్షాలు అఖిలేష్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బులంద్ షహర్ ఘటన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
'3 నెలల్లో శిక్షించకుంటే ఆత్మహత్య చేసుకుంటా'
బులంద్షహర్: తల్లీకూతుళ్లను సామూహిక అత్యాచారం, దోపిడీకి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిని బాధితులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐదుగురు పోలీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితులను మూడు నెలల్లోగా శిక్షించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాళ్ల భర్త, తండ్రి హెచ్చరించారు. రాజధాని ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ- కాన్పూర్ హైవేపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, దోపిడీకి పాల్పడి, తల్లీకూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీస్ చెక్ పోస్టుకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణకాండపై దర్యాప్తు చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. రెండు పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఎస్పీ, సిటీ ఎస్పీ, సీవో, ఎస్ఓఎస్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. బాధితులను జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనను లోక్ సభలో లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది. -
మహిళ, బాలికపై బందిపోట్ల అత్యాచారం
బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లో బందిపోటు దొంగలు ఒకే కుటుంబానికి చెందిన మహిళ, 13 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేశారని పోలీసులు శనివారం చెప్పారు. ఆ కుటుంబం కారులో నోయిడా నుంచి షాజహాన్పూర్ వెళ్తుండగా, దొంగలు అడ్డగించి కారుపై దాడి చేశారు. కారులో ఉన్న మగవారిని చెట్టుకు కట్టేసి, మహిళ, బాలికను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. వారి ఆభరణాలు, డబ్బు దోచుకెళ్లారు. కుటుంబంలోని ఓ వ్యక్తి కట్లు విప్పుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఎస్పీ వైభవ్ కృష్ణ తెలిపారు. -
ఆవిడే.. కలెక్టర్ చంద్రకళ!
సముద్రపు అలలు, రైలు పట్టాలు, తగలబడే భవంతులు, అందమైన మహిళ.. సెల్ఫీ దిగటానికి ఇలాంటి వెరైటీ చోట్ల ప్రయత్నాలు చేసి చివరికి అలల ఉధృతికో, రైలు వేగానికో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇక మహిళలతో సెల్ఫీ అంటే కచ్చితంగా ఆమె అనుమతి తప్పనిసరి. లేదంటే.. ఇదిగో ఈ యువకుడిలా కటకటాలపాలవ్వాల్సి వస్తుంది. సెల్ఫీ దిగబోయి జైలు పాలైనవాడి పేరు అహ్మద్. సెల్ఫీని నిరాకరించిన ఆ.. ఆవిడ.. కలెక్టర్ చంద్రకళ. ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథనంలోకి వెళితే.. బులందేషహర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్)గా పనిచేస్తోన్న బి. చంద్రకళకు సమర్థురాలైన అధికారిణిగా పేరుంది. జఠిలమైన సమస్యలను సైతం ప్రజల సహకారంతో పరిష్కరించగల దిట్ట. అందుకే ఆవిడంటే ఆ జిల్లా ప్రజలకు నమ్మకం. నిత్యం వందల సంఖ్యలో జనం ఆమె కార్యాలయానికి వెళ్లి సమస్యలు చెప్పుకుంటారు. సోమవారం కమల్ పూర్ అనే గ్రామం నుంచి కొందరు వ్యక్తులు తమ సమస్య చెప్పుకోవడానికి కలెక్టరమ్మ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ కిక్కిరిసిపోయిన జనం మధ్యలోకి వచ్చిన దరాఖాస్తులు స్వీకరిస్తున్న చంద్రకళకు ఊహించని పరిణామం ఎదురైంది. 18 ఏళ్ల అహ్మద్ అనే యువకుడు చంద్రకళకు అతిసమీపంగా వెళ్లి తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకున్నాడు. యువకుడి చర్యతో ఇబ్బందిపడ్డ ఆమె.. సెల్ఫీని డిలీట్ చేయాలని మర్యాదగా అడిగింది. కలెక్టరమ్మ చెప్పింది వినకపోగా, 'ఎందుకు చేయాలి? నా ఫోన్ నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి?' అని ఎదురుదాడి చేశాడు అహ్మద్. అంతే, కోపం పట్టలేక 'వీణ్ని లాకప్ లో పడేయండి' అని పోలీసులను ఆదేశించింది. అహ్మద్ పై సీఆర్పీసీ 151 సెక్షన్ కింద కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టు ఆదేశాలప్రకారం జైలుకు పంపారు. 'మొబైల్ మీదే కావచ్చు. కానీ ఫొటో తీసేది నన్నే అయినప్పుడు నేను కచ్చితంగా అడ్డుచెబుతా. నన్ను ఇబ్బందికిగురిచేసే చర్యను అడ్డుకోవడం నా హక్కు కూడా. అయినా నా పర్మిషన్ లేకుండా నాతో ఫొటో ఏంటి? పైగా డిలీట్ చేయమన్నప్పుడు ఆ యువకుడు ప్రవర్తించిన తీరు మరీ దారుణం. అందుకే బుద్ధి చెప్పాలనుకున్నా' అని తన చర్యను సమర్థించుకుంటూ విలేకరులకు వివరణ ఇచ్చింది డీఎం చంద్రకళ. -
న్యాయదేవత ఒడిలోనే కన్నుమూసిన జడ్జి
లక్నో : న్యాయదేవత ఒడిలోనే ఓ జడ్జి కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ బులంద్శహర్ పట్టణంలో జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ సింగ్ (52) కోర్టులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం జిల్లా కోర్టు కార్యాలయంలోని తన ఛాంబర్లో విధుల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్రమైన ఛాతీనొప్పి, శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయన తన కుర్చీలోనే కుప్పకూలారు. వెంటనే గమనించిన ఉద్యోగులు జడ్జిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. జిల్లా పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. -
ఆస్తి కోసం కుటుంబసభ్యులనే చంపేశాడు
కుటుంబసభ్యుల ప్రేమాభిమానాల కన్నా ఆస్తి పాస్తులే ఎక్కువ అనుకున్నాడు ఓ ప్రబుద్దుడు. దాంతో కుటుంబ సభ్యులలోని ఆరుగురిని కడతేర్చాడు ఆ ప్రబుద్ధుడు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ బులంద్ష్రార్ సమీపంలోని పిల్హనా గ్రామంలో నిన్న చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామంలోని ఓ కుటుంబంలో గత కొద్ది కాలంగా ఆస్తిపై వివాదం నెలకొంది. ఇటీవల కాలంలో ఆ తగదాలు పెచ్చురిల్లాయి. దాంతో ఆగ్రహించిన చిన్న కుమారుడు గత రాత్రి తండ్రి, అన్న వదినలు, వారి ఇద్దరు చిన్నారులతోపాటు మరోకరిని దారుణంగా నరికి చంపాడు. ఆ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు రక్తపు మడుగులోపడి విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి అలోక్ శర్శ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఉన్నతాధికారి తెలిపారు.