India Today Conclave
-
పాక్ సైన్యంతో ప్రమాదమే: సీడీఎస్
న్యూఢిల్లీ: పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ, ఆ దేశ ఆర్మీతో మనకు ప్రమాదంఎప్పటిలాగానే ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పాక్ సైనిక సామర్థ్యం చెక్కు చెదరలేదని చెప్పారు. అయితే సరిహద్దులను, ముఖ్యంగా వివాదాస్పద ఉత్తర సరిహద్దులను కాపాడుకోగల సత్తా మన సైన్యానికి ఉందని శనివారం ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పారు. ‘చైనా బలపడుతుండటం, ఆ దేశంతో తెగని సరిహద్దు వివాదం మనకు తక్షణ సవాలుగా మారింది. చైనా, పాక్ మనకు బద్ధ శత్రువులు. పైగా వీరివద్ద అణ్వాయుధాలున్నాయి. యుద్ధ రీతుల్లో ఎప్పటికప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన ఆర్మీకి ఇదే అతి పెద్ద సవాల్గా మారింది. కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచించుకోవడం వంటివి కొనసాగుతున్నాయి’’ అని జనరల్ చౌహాన్ చెప్పారు. -
ఆస్కార్ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లిన రామ్చరణ్, ఎందుకంటే?
ఆస్కార్ సెలబ్రేషన్స్ తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా ఇండియాకు వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితమే రాగా నేడు ఉదయం రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగింది. రామ్చరణ్ మాత్రం నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాడు. ఇందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లాడు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చిన తర్వాత తొలిసారి చరణ్ మీడియాతో మాట్లాడనున్నారు. రాత్రి 9.30 గంటలకు చెర్రీ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక ఈరోజు జరగనున్న ఇండియా టుడే కాంక్లేవ్కు అమిత్ షా, జాన్వీ కపూర్, మలైకా అరోరా సహా తదితర రంగాల్లోని ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ సదస్సుకు హాజరై తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు. బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు. -
రఫేల్ ఉంటే ఫలితం మరోలా ఉండేది
న్యూఢిల్లీ: భారత్ దగ్గర రఫేల్ ఫైటర్జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం రఫేల్ యుద్ధవిమానాలు లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లోని జైషే ఉగ్రస్థావరాలపై దాడి సందర్భంగా ప్రపంచమంతా భారత్ కు మద్దతు పలికితే, దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ దాడుల యధార్థతను ప్రశ్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు తోడు ప్రస్తుతం రఫేల్ ఒప్పందంపై జరుగుతున్న రాజకీయాలతో దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీపై ఉన్న విద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చరాదని హితవు పలికారు. ప్రబుత్వ విధానాల్లోని లోపాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తే స్వాగతిస్తామనీ, అయితే దేశభద్రతకు సంబంధించిన విషయాల్లో అడ్డంకులు కల్పించవద్దని సూచించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియాటుడే కాన్క్లేవ్ 2019’లో మాట్లాడిన ప్రధాని మోదీ, విపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. భయం మంచిదే.. భారత్ ఐక్యతను చూసి ఇంటాబయటా చాలామంది భయపడుతున్నారని ప్రధాని అన్నారు. ‘భారత వ్యతిరేక శక్తులు, రుణఎగవేతదారులు, అవినీతిపరులు, కొందరు పెద్దనేతలకు ఇప్పుడు భయం కనిపిస్తోంది. జైలుకు పోతామేమో అని వారంతా భయపడుతున్నారు. నిజానికి భయం మంచిదే. ఎందుకంటే 2009లో తమకు 1.86 లక్షల బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు కావాలని భద్రతాబలగాలు కోరాయి. కానీ 2009–14 మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క బుల్లెట్ప్రూఫ్ జాకెట్ను కూడా బలగాలకు అందించలేకపోయారు. ఎన్డీయే ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30 లక్షల బుల్లెట్ప్రూఫ్ జాకెట్లను అందించాం. మా ప్రభుత్వ హయాంలో మధ్యవర్తులు పత్తా లేకుండా పోయారు. ఎందుకంటే మేం అవినీతిని ఎంతమాత్రం సహించబోమని వారికి తెలుసు’ అని మోదీ వెల్లడించారు. నామీద చాలా అనుమానాలు ఉండేవి.. మోదీ లాంటి నేతలు వస్తూపోతూ ఉంటారనీ, దేశం మాత్రం శాశ్వతంగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీపై విమర్శలదాడి చేసేక్రమంలో వీళ్లు(ప్రతిపక్షాలు) దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. మోదీపై మీ ద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చేలా మారకూడదు. మన సాయుధ బలగాలు ఏం చెబుతున్నాయో మీరు వినరా? లేదా మాకంటే మీరు శత్రువులనే ఎక్కువగా నమ్ముతున్నారా?’ అని ప్రధాని విపక్షాలను నిలదీశారు. 2014లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తన పై ప్రజలకు చాలా అనుమానాలు ఉండేవని మోదీ గుర్తుచేశారు. ‘అప్పటివరకూ సీఎంగా మాత్రమే ఉన్న నేను ప్రధానిగా ఏ చేస్తానో, విదేశీ విధానం ఏమవుతుందో అని ప్రజలకు అనుమానం ఉండేది. అది మామూలే. ఎందు కంటే నా కుటుంబానికి రాజకీయ నేపథ్యమేదీ లేదు. అలాగే నా ఇంట్లో ఆరుగురు అధికారం వెలగబెట్టలేదు’ అని మోదీ చెప్పగానే సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రజల అంచనాలు అందుకోవడంలో సఫలమయ్యాననే తాను భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. 21వ శతాబ్దం భారత్దేనని ప్రధాని స్పష్టం చేశారు. -
హోదా ఇచ్చే వారికే మా మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే.. వారికి మద్దతు ఇస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలలో తమది తటస్థ వైఖరి అని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహించిన కాంక్లేవ్ – 2019లో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో నిర్ణయించడంలో డెక్కన్ ప్రాంత పాత్ర’ అన్న అంశంపై సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ నిర్వహించిన ముఖాముఖిలో వైఎస్ జగన్ పలు అంశాలపై స్పష్టంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారిపోయారని.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ–కాంగ్రెస్ పార్టీల పొత్తును ఉదహరిస్తూ పేర్కొన్నారు. తాను చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రజలకు ఒక విశ్వాసం కల్పించిందని జగన్ అన్నారు. ‘‘14 నెలలు ప్రజల మధ్య నడిచాను. పగలూ రాత్రి వారు పడ్డ కష్టాలను చూశాను. ఆ కాలమంతా నన్ను వైవిధ్యంగా మలిచింది. ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనను కలిగించింది.’’ అని ఆయన తెలిపారు. నా తండ్రి పాలనను చూశాకే 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకున్నారని, ఆయన కొడుకుగా పుట్టినందుకు గర్విస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు. తనపై టీడీపీ, కాంగ్రెస్ పెట్టినవి రాజకీయ కక్షసాధింపు కేసులేనని పేర్కొంటూ తొమ్మిదేళ్లుగా ప్రజలు తన వ్యక్తిత్వాన్ని చూస్తున్నారని, తానేమిటో వారికి తెలుసునని జగన్ వివరించారు. ముఖాముఖి ఇలా సాగింది.. ప్రశ్న: సమకాలీన భారత రాజకీయాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం.. వెల్కమ్ సర్.. మీరు అత్యంత ఫిట్నెస్తో కనిపిస్తున్నారు. 3,648 కి.మీ.ల పాదయాత్ర చేశారు. అది నిజంగా మీకు చాలా ఉపయోగపడింది. (సభికులతో..) వాస్తవానికి జగన్మోహన్రెడ్డి ఈ పాదయాత్ర లో అత్యంత శక్తిమంతుడిగా కనిపించారు. ఆయన పాదయాత్ర గురించి వినని వారికి ఇది చెప్పాలి. తెల్లవారుజామున ఆయన లేచినప్పటి నుంచి రాత్రి చివరి గంట వరకూ ప్రజలతో మమేకమయ్యారు. కోర్టు కేసులో హాజరవ్వాల్సి ఉంటే అది కూడా చేసి తిరిగి మళ్లీ పాదయాత్ర ప్రాంతానికి చేరుకునేవారు. నిజంగా దృఢ సంకల్పాన్ని చూపారు. మీ అంత దూరం ఎవరూ నడవలేదని ప్రజలు చెబుతున్నారు. మీ తండ్రి చేసిన పాదయాత్ర ఆయన అధికారం సాధించడానికి మార్గం అయింది. మీ పాదయాత్ర మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి మార్గం అవుతుందా? జగన్: ఇది అధికారానికి మార్గం అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు. కానీ పాదయాత్ర ప్రజలకు ఒక విశ్వాసం కల్పించింది. ప్రజలను అర్థం చేసుకోవడం, వారు చెప్పేది వినడం, వారి పరిస్థితి తెలుసుకోవడం, పాదయాత్రలో ఆద్యంతం వారి సమస్యలపై గళం వినిపించాం. తద్వారా ప్రభుత్వం ఆయా సమస్యలను పరిష్కరించేలా చేశాం. తమ సమస్యలను వినేందుకు ఒకరు ఉన్నారు.. ఏదైనా చేసేందుకు అండగా వస్తున్నారు.. అంటే అది ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. ఆ నమ్మకమే నన్ను కూడా ముందుకు నడిపిస్తుంది. నడిపించింది. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలన్న నా కలలో ఒక ఉద్దేశం ఉంది. నేను చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉండాలన్నది నా కల. అది నా లక్ష్యం. నేను ప్రజలందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నా. ఆరు నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారని అంటారు. 14 నెలలు ప్రజల మధ్య నడిచాను. పగలూ రాత్రి వారు పడ్డ కష్టాలను చూశాను. ఆ కాలమంతా నన్ను వైవిధ్యంగా మలిచింది. ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనను కలిగించింది. ప్రశ్న: మీ తండ్రి అకాల మరణం తర్వాత మీరు 2014 ఎన్నికల్లో తలపడ్డారు. ఆ తర్వాత మీ రాజకీయ పరిణామ క్రమాన్ని చెప్పండి.. జగన్: నా తొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో ఎక్కువ సమయం ప్రజల మధ్యే గడిపాను. పాదయాత్రకు ముందు కూడా ప్రజల మధ్యే ఉన్నాను. ఈ పాదయాత్ర నిత్యం వారితోనే ఉండే అవకాశాన్ని కల్పించింది. పాదయాత్రలో నేను ఎక్కడ బస చేశానో తెలుసు. ఏ దారి వెంట నడిచానో తెలుసు. దీంతో నన్ను ఎక్కడ కలవాలో ప్రజలకు తెలిసిపోయేది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాను. సూక్ష్మ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రతిరోజూ విన్నాను. వారి దయనీయ పరిస్థితిని మార్చాలన్నదే నా సంకల్పం. ప్రశ్న: రానున్న ఎన్నికల్లో మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం వస్తే పాలన ఎలా ఉండబోతోంది? ఎందుకంటే అన్ని ఒపీనియన్ పోల్స్ ప్రస్తుతం ఏపీలో మీరు ముందంజలో ఉన్నారని చెబుతున్నాయి. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో గట్టి వ్యతిరేకత కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనకు ఏరకంగా వైవిధ్యంగా ఉంటుంది? జగన్: చాలా వరకు నేను చూసిన సమస్యల్లో అనేకం మానవ తప్పిదాలే. సరైన పాలన, విశ్వసనీయమైన పాలన వీటిలో అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. అమలు చేయలేని హామీలను మనం ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయతను కోల్పోయారు. ఆయన అనేక అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈయన అబద్ధాల కారణంగా ప్రజలు ఈరోజు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఉదాహరణకు రైతుల విషయమే చూద్దాం. రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. ఏ రాష్ట్రం కూడా ఆమేరకు సామర్థ్యం కలిగి ఉండదని ఆయనకు తెలిసి కూడా హామీ ఇచ్చారు. రుణాలు కట్టొద్దని చెప్పారు. రైతులు రుణాలు కట్టడం ఆపేశారు. గద్దెనెక్కాక ఆ హామీని నిలబెట్టుకోకపోవడమే కాకుండా.. అంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ రాయితీ వెసులుబాటును (వడ్డీ లేని రుణాలు) కూడా రైతులు పొందకుండా చేశారు. ఈ ఘనత చంద్రబాబు పాలనకే దక్కింది. గిట్టుబాటు ధరలు లేవు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. మిగిలిన అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదంతా చెప్పాలంటే సమయం సరిపోదు. ప్రశ్న: నేను అడిగింది మీరు చెప్పలేదు.. మీరు చంద్రబాబు హయాంలో ఉన్న సమస్యల గురించి చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఏరకమైన వైవిధ్యాన్ని చూపుతారు? మీ తండ్రి గారి సంక్షేమ పాలనకు పొడిగింపుగా ఉంటుందా? జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా పాలిస్తారు? జగన్: ప్రస్తుతం సంతృప్త స్థాయిలో సేవలు అందడం లేదు. మీరు ఏ పార్టీ అంటూ లబ్ధిదారుల ను అడుగుతున్నారు. ప్రతి చోటా వివక్షే. అందుకే గ్రామ స్థాయి పరిపాలనలో భారీ మార్పులు తీసుకొస్తాం. గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అన్ని సమస్యలకు 72 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. ప్రశ్న: జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ప్రధాన మంత్రి మోదీతో, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మీ సమీకరణాలు ఎలా ఉన్నాయి? జగన్: ఆ రోజు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ.. అందరూ సభ సాక్షిగా ఒక్కటయ్యారు. పార్లమెంట్ తలుపులు మూసేశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. విభజనను అడ్డుకున్న సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీలు ఒక్కటయ్యాయి. విభజన కోరుకున్న రాష్ట్రం రాజధానిని తీసుకోవడం ఈ ఒక్క విభజనలోనే జరిగింది. ఈ రోజు మా రాష్ట్ర విద్యార్థులు పట్టభద్రులైతే ఉద్యోగానికి ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది. ప్రశ్న: ప్రత్యేక హోదా ఈశాన్య రాష్ట్రాలకో లేక ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందంటే దానిని మనం అర్థం చేసుకోగలం. కానీ ఏపీ వెనుకబడిన రాష్ట్రం కాదు కదా? జగన్: రాష్ట్ర విభజన జరిగిన రోజు ఈ విషయాలు వాళ్లకు తెలియవా? ఆ రోజు జార్ఖండ్ వెనుకబడి లేదా? విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా రూపంలో పరిహారం ఇస్తామని పార్లమెంట్లో అధికార కాంగ్రెస్తో పాటు, ప్రతిపక్ష బీజేపీ కలిసి చెప్పాయి. కానీ ఇవాళ మాట నిలబెట్టుకోకుండా జార్ఖండ్, ఛత్తీస్గఢ్లు ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి కాబట్టి హోదా ఇవ్వలేమంటున్నారు. మరి పార్లమెంటులో మాట ఎందుకు ఇచ్చినట్టు? అలా చేస్తే పార్లమెంట్పై విశ్వసనీయత ఎలా ఉంటుంది? ప్రశ్న: 2019ఎన్నికల్లో మోదీ, అమిత్షా నేతృత్వంలోని బీజేపీ ఒకవైపు.. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలతో కూడిన మహా కూటమి మరో వైపు ఉంది. థర్డ్ ఫ్రంట్ లాంటిదొకటి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఎటు వైపు ఉండబోతున్నారు? జగన్: మేము ఇప్పటికే తటస్థంగా ఉన్నాము. మా డిమాండ్ ప్రత్యేక హోదా ఒక్కటే. జగన్ అయినా, ఏపీ ప్రజలైనా ‘ఢిల్లీ’మాటలు నమ్మి మోసపోయాం. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన వారు మరచిపోయారు. ఇవన్నీ చూసి విసుగెత్తిపోయాం. ఏపీ ప్రజలు గానీ, ఏపీ ప్రజల ప్రతినిధిగా జగన్ గానీ.. మేం ఎవరినీ నమ్మాలనుకోవడం లేదు. మేం ఓపెన్గా ఉన్నాం. హోదా ఇచ్చిన వాళ్లకే మద్దతు ఇస్తామని చెప్పాం. మేం ఇప్పటికే ఐదేళ్లు కోల్పోయాం. ప్రశ్న: అంటే మీరు పూర్తి పారదర్శకంగా ఉన్నామంటున్నారు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే మీ మద్దతని అంటున్నారు. అది మోదీ కావొచ్చు.. రాహుల్ గాంధీ కావొచ్చు.. మాయావతి కావొచ్చు.. మీకు వ్యత్యాసం లేదు.. జగన్: కచ్చితంగా.. ప్రధాని ఎవరన్నది మాకు అనవసరం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తాం. మీరు (జర్నలిస్ట్ రాహుల్) ప్రధాని అయినా మద్దతు ఇస్తాం. ప్రశ్న: నేను ప్రధాన మంత్రి కావాలనుకోవడం లేదు. మీరు ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్లతోనే వెళతామంటున్నారు. మీకు లోక్సభ ఎన్నికల్లో గరిష్టంగా సీట్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. అత్యధిక సీట్లు గెలవాలని ఆశిస్తున్నారు. ఎవరికి అవసరమైతే వాళ్లతో వెళ్లాలనుకుంటున్నారు. కానీ దానికి పూర్తి మెజారిటీ లేని పార్టీ అధికారంలోకి రావాలి. అంటే మీరు బలమైన సర్కారు కావాలని కోరుకోవడం లేదు.. జగన్: పార్లమెంట్లో ఇచ్చిన మాటకు విలువ ఉండాలి. ఆ మాటకు పాలకులు కట్టుబడి ఉండాలి. విభజనతో ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలి. దీనిని నేతలు అర్థం చేసుకోవాలన్నదే నా అభిమతం. ప్రశ్న: మీ తండ్రి మరణానంతరం సోనియా గాంధీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయకపోవడంతో మీరు కాంగ్రెస్ను వదిలివెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారని అంటారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ మిమ్మల్ని తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తే, కలిసి పని చేద్దామంటే ఏమంటారు? జగన్: మాకు ఏది అవసరమో చాలా స్పష్టంగా చెప్పాను. నేను రాహుల్ గాంధీకో, మరొకరికో వ్యతిరేకం కాదు. మా లక్ష్యం చాలా సూటిగా ఉంది. మేం ఎవరినీ నమ్మదలుచుకోలేదు. ఇప్పటికే ఐదేళ్లు నష్టపోయాం. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. మేం మద్దతు ఇస్తాం. అంతే సింపుల్. మా ఆప్షన్లన్నీ ఓపెన్గా పెట్టుకున్నాం. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలనుకోవడం లేదు. ప్రశ్న: గతంలో మీనాన్న గారు కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగారు. ఆ విధంగానే మీరు తిరిగి కాంగ్రెస్లోకి వెళతారా? జగన్: అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది? మాకు కాంగ్రెస్తో ఏం పని? బహుశా వాళ్లకే మా అవసరం ఉండొచ్చు. ప్రశ్న: పదేళ్లు పాలించిన కాంగ్రెస్కు 2014లో 2.94% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కొంత మెరుగుపడినట్టు కాంగ్రెస్ భావిస్తోంది. మీరు ఏమనుకుంటున్నారు? జగన్: కాంగ్రెస్కు దానిపై దానికే నమ్మకం లేదు. వారికి విశ్వాసం ఉంటే వారు టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. 30 ఏళ్లు కాంగ్రెస్పై పోరాడిన టీడీపీతో వారు పొత్తు పెట్టుకున్నారు. ఎలాంటి నైతిక విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడి అవినీతిపై 2018 జూన్ 8న కాంగ్రెస్ ‘అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు’అనే పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేసింది. దానిపై రాహుల్ గాంధీ బొమ్మ కూడా ప్రచురించింది. ఇది విడుదల చేసిన మూడు నెలల్లోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోయి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రజలు ఏమనుకుంటారన్న స్పృహ కూడా వారికి లేదు. ప్రజలను ఫూల్స్ చేద్దామనుకున్నారా? ఇలాంటి వాళ్లను ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారు. ప్రశ్న: మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆరోపణలు, ఇందుకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావా? జగన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతున్నప్పుడు కేసులు పెట్టడం చాలా సులభం. ఈ కేసులన్నీ మా నాన్న చనిపోయాక, నేను కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు వచ్చినవే. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఈ కేసులు పెట్టారు. కానీ వాస్తవం ఏంటంటే ఇవన్నీ రాజకీయ కేసులు. కానీ ప్రజలు నా వ్యక్తిత్వాన్ని చూశారు. నేనేంటో వారికి తెలుసు. ప్రశ్న: రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీల్లో ఎవరు తక్కువ చెడు చేసేవారు.. జగన్: వీరిద్దరూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. ప్రశ్న: చంద్రబాబు నాయుడు అమరావతిలో కొత్త రాజధాని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే అక్కడే దానిని కొనసాగిస్తారా? లేక మరో చోట నిర్మిస్తారా? జగన్: ఇది క్యాచ్ – 22 పరిస్థితి (వైరుధ్య పరిస్థితులు ఉన్నా కొనసాగించాల్సిన పరిస్థితి). ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనేది పెద్ద కుంభకోణం. చంద్రబాబు 2014 జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసు. కానీ అక్కడ, ఇక్కడ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. సరిగ్గా రాజధాని ఏర్పాటయ్యే చోట సొంత హెరిటేజ్ కంపెనీ పేరుతో, బినామీల పేరుతో అక్కడి రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు. ప్రశ్న: మీది పెద్ద రాష్ట్రం. పారిశ్రామిక రాష్ట్రం. వాణిజ్య సంస్థలు ఉన్నాయి. మీకున్న వనరులతో బాగా చేయొచ్చు కదా? ఎందుకు మీరు ప్రత్యేక హోదా కోసం అంతగా డిమాండ్ చేస్తున్నారు? జగన్: మాకు ఎందుకు హోదా ముఖ్యమంటే.. హైదరాబాద్తోగానీ, చెన్నైతోగానీ, బెంగళూరుతో గానీ పోటీ పడే వనరులు లేవు. హైదరాబాద్ అభివృద్ధికి 60 ఏళ్లు పట్టింది. ఈరోజు ఒక పట్టభద్రుడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియదు. హోదా వస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు వస్తాయి. 100 శాతం ఆదాయపు పన్ను రాయితీ, వంద శాతం జీఎస్టీ రాయితీ లభిస్తుంది. ఇలాంటి పారిశ్రామిక ప్రత్యేక ప్రోత్సాహకాలతోనే ఎవరైనా ముందుకొచ్చి హోటలో, ఆసుపత్రో, ఐటీ సంస్థనో, కర్మాగారమో ఏర్పాటు చేస్తారు. పక్కనే హైదరాబాద్ ఉంది. అక్కడ అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. ఇప్పుడు మాకంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అత్యంత ముందంజలో ఉండగా ఎవరైనా ఏపీకి వచ్చి ఎందుకు పెట్టుబడులు పెడతారు? ప్రశ్న: మీరు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు. మీ నాన్నలా ప్రజలతో మమేకమయ్యా రు. ఇది అతికొద్ది మంది మాత్రమే చేయగలరు. మీరు ముందంజలో ఉన్నారని, ఏపీలో మీదే విజయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. కానీ మీ 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మీరు 15 కేసులు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. ఇవి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? జగన్: మీకు వాటి నేపథ్యం చెబుతాను. మా నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. అవి ఎప్పుడు వచ్చాయంటే నేను కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్లాలనుకున్నప్పుడు. పిటిషనర్లు ఎవరు? టీడీపీ, కాంగ్రెస్ నేతలు. ఇద్దరూ ఒక్కటై నా తండ్రి మరణానంతరం, నేను కాంగ్రెస్ను వీడాక ఇద్దరూ ఒక్కటై కేసులు ఫైల్ చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మా నాన్న పాల న చూశాకే 2009లో రెండోసారి ముఖ్యమంత్రిని చేశారు. నాడు మా నాన్న నాయకత్వంలో ఏపీ నుంచి 33మంది ఎంపీలు గెలిచారు కాబట్టి యూపీ ఏ ప్రభుత్వం ఏర్పాటైంది. నేనప్పుడు రాజకీయాల్లోనే లేను. కనీసం హైదరాబాద్లో కూడా లేను. ప్రశ్న: ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి, ఇరు దేశాల సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు రాష్ట్రంలో ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపుతాయా? జగన్: బహుశా ఈ విషయంలో మోదీకి కొంత మైలేజీ వచ్చి ఉండొచ్చు. ఈ విషయంలో నేను ఆయనకు క్రెడిట్ ఇస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో హోదా పట్ల మాట తప్పారు. ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్కు దూరం చేశారు. అందువల్ల అక్కడ ఆయన్ను ప్రజలు ఆదరించరు. ప్రశ్న: మీరు చంద్రబాబును జైలుకు పంపదలుచుకున్నారా? జగన్: ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఓత్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించడమే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను, రహస్యాలను కాపాడతానని, గోప్యం పాటిస్తానని ప్రమాణం చేస్తారు. కానీ చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని భంగపరిచారు. తన కంపెనీ హెరిటేజ్ పేరుతో భూములు కొన్నారు. బినామీల పేరుతో కొన్నారు. అక్కడితో ఆగలేదు. ఆయన, ఆయన బినామీలు ఏమంటారంటే రాజధానికి భూములే సేకరించలేదని చెబుతారు. భూ సమీకరణ పేరుతో భూములు సేకరించారు. అలా సేకరించిన భూములను వారికి ఇష్టమొచ్చిన వారికి, వారికి ఇష్టమొచ్చిన ధరలకు ఇచ్చారు. 1600 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చేశారు. చివరలో ఒక్క మాట.. తెలంగాణలో ఎమ్మెల్యేలను తన బ్లాక్ మనీతో కొంటూ ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇలాంటి నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? ఆ టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతే అని ఫోరెన్సిక్ పరీక్షలో కూడా తేలింది. అయినా ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు. ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాబట్టి వాస్తవం ఏమిటన్నది మేధావులంతా ఆలోచించాలి. -
భయానికి ఇక చోటు లేదు
సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది షాకింగ్ మూమెంట్స్లో ఇదొకటి. క్యాన్సర్ అని తెలియగానే సోనాలీ ఎంత షాకయ్యారో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అంతే షాక్కి గురయ్యారు. ఎంత గొప్ప సమస్యను దాటగలిగితే అంత గొప్ప హీరో అయినట్టు, హీరోయిన్ సోనాలి క్యాన్సర్ను ధైర్యంగా ఎదుర్కొని.. పోరాడి గెలిచి సూపర్ హీరోయిన్గా నిలిచారు. ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నంత కాలం సోషల్ మీడియా ద్వారా విషయాలను షేర్ చేశారు. తాజాగా ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2019’ కార్య క్రమంలో సోనాలి మనసు విప్పి, చాలా విషయాలు చెప్పారు. అవి ఆమె పోరాట పటిమను తెలియజేశాయి. సోనాలి మాటల్లో ఆ విశేషాలు.. క్యాన్సర్ను దాచదలచుకోలేదు క్యాన్సర్ ఉందని తెలియగానే నా చుట్టూ వినిపించింది ఒక్కటే.. ‘నీ లైఫ్స్టైల్ చాలా బాగుంటుంది. నీకెందుకు ఇలా జరిగింది?’ అని. న్యూయార్క్లో సైకియాట్రిస్ట్తో మాట్లాడేంత వరకూ నా వల్లే క్యాన్సర్ వచ్చిందేమో అనే భ్రమలో నేను కూడా ఉండిపోయా. ‘‘నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడంలేదు. నేను నెగటివ్ పర్సన్ని కాదు. నాది చాలా పాజిటివ్ లైఫ్ స్టైల్. ఒకవేళ నెగటివ్ ఆలోచనలు ఉన్నా కూడా వాటిని లోలోపలే దాచేసి బయటకు ఏం జరగనట్టు నటించేదాన్నా? నాకు అర్థం కావడంలేదు’’ అని సైకియాట్రిస్ట్తో చెప్పా. ఆ రోజు ఆయనిచ్చిన సమాధానమే నాకు స్ఫూర్తి మంత్రాలయ్యాయి. క్యాన్సర్ను ఎదుర్కోగలన నే ఆశను పెంచాయి. ‘‘సోనాలీ.. క్యాన్సర్ అనేది జీన్స్ వల్ల కానీ వైరస్ వల్ల కానీ వస్తుంది. ఆలోచనల వల్ల కాదు. ఒకవేళ ఆలోచనలే క్యాన్సర్ బారినపడేట్టు చేసి లేదా క్యాన్సర్ నయం అయేట్టు చేస్తాయంటే, మాకంటే (సైకియాట్రిస్ట్) ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మేం ఆలోచనలతో వ్యవహరించేవాళ్లం కదా’’ అని చెప్పారాయన. అప్పుడు క్యాన్సర్కి కారణం నేను కాదనే భ్రమలో నుంచి బయటపడ్డా. అ నిమిషం నా మీద నుంచి కొన్ని వందల కేజీల బరువును మాటలతో తుడిచేసినట్టు అనిపించింది. క్యాన్సర్ను ఎదుర్కోగలను అనే నమ్మకం ఏర్పడింది. మనమేం తప్పు చేశామని ఆలోచించడం ఆపేశాను. అన్ని క్యాన్సర్లు ఒకలా ఉండవు. దాన్ని నయం చేసే ఫార్ములా ఒక్కో శరీరానికి ఒక్కోలా ఉంటుంది. చాలా మంది క్యాన్సర్ వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటారో అర్థం అయ్యేది కాదు. నేను దాచిపెట్టదలచుకోలేదు. నాకు ఇలా జరిగింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్ని, భరోసాని కలిగించాయి ఆ కారణమేంటో కనుక్కుంటా! ‘లైఫ్లో మళ్లీ పని చేస్తానో లేదో’ అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వను. నెక్ట్స్ ఏం చేయబోతున్నానో నాకు కచ్చితంగా తెలియదు. సినిమాల్లో నటిస్తానా? తెలియదు. కానీ నేను చేయాల్సిన పని మాత్రం కచ్చితంగా ఉందని నాకు అనిపిస్తోంది. లేకపోతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. నేను మళ్లీ మామూలు మనిషి కావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో కనుక్కుంటా. ఏడవకూడదని ప్రామిస్ చేసుకున్నా ఎన్నో హెయిర్ ఆయిల్స్ని ప్రమోట్ చేశాను. కానీ నా హెయిర్ని నేను కోల్పోయాను. ఇంటి నుంచి బయటికు అడుగుపెట్టిన ప్రతిసారీ మన ఆ పాత హెయిర్ మనకు లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ భావన కాసేపే. జుత్తు సంగతి ఎలా ఉన్నా నా కనుబొమ్మలు మళ్లీ మామూలుగా అయినందుకు ఆ దేవుడికి కృజ్ఞతలు తెలపాలి. కళ్లకు పెట్టుకున్న ‘మస్కరా’ కరిగిపోతుంది కాబట్టి మనం ఏడవకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకున్నా. ఇప్పుడు నేను చెబుతున్నవి చిన్న విషయాలే కావొచ్చు కానీ వాటి ప్రభావం చాలా ఉంటుంది. నిజానికి నేను మస్కరా పెట్టుకుని చాన్నాళ్లయింది. ఇప్పుడు మళ్లీ పెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. నా బ్రాండ్ అయిపోయింది నటిగా నా కెరీర్లో ఎన్నో బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యవహరించాను. గ్లామర్ ఫీల్డ్లో లుక్సే ప్రధానం. సొసైటీలో కూడా కదా? నా కెరీర్ అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. నాకు క్యాన్సర్ అని తెలుసుకున్నాక నా ప్రపంచం తల్లకిందులైంది. నా టీమ్ను పిలిచాను. నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను అనే విషయాన్ని పంచుకున్నాను. ‘ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు ఇన్ని రోజులు అంబాసిడర్గా చేశాను. ఇప్పుడు నా బ్రాండ్ అయిపోయింది. నేను చికిత్స కోసం విదేశాలు వెళ్తున్నాను. చికిత్స తాలూకు పరిణామాలేంటో కూడా సరిగ్గా తెలియదు’ అని చెప్పా. వాళ్లంతా నాతో ఉంటానన్నారు, ఉన్నారు కూడా. జాలి, దయ నాకెట్టి పరిస్థితుల్లోనూ వద్దని వాళ్లతో స్ట్రిక్ట్గా చెప్పాను. వాటిని నేనస్సలు నమ్మను. ఫ్యామిలీయే సపోర్ట్ నాకున్న పెద్ద సపోర్ట్ సిస్టమ్ నా ఫ్యామిలీయే. నా భర్త గోల్డీ బెహల్, సోదరి రూప నాకు చాలా సపోర్ట్గా నిలిచారు. ధైర్యం పంచారు. నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు మా అబ్బాయి రణ్వీర్ స్కూల్ ట్రిప్లో ఉన్నాడు. వాడిని ఇంటికి పంపించకుండా నా దగ్గర (హాస్పటల్) కొన్ని రోజులు ఉంచాం. వాడి దగ్గర విషయం దాచలేదు. వాణ్ని మేమలా పెంచలేదు. నా వ్యాధి విషయం చెప్పగానే ‘ఇది కొంచెం టఫ్ టైమ్. కానీ మేం నీతో కలిసే ఉంటాం’ అని చెప్పాడు. నాకు కీమోథెరపీ చేసినప్పుడు ‘‘నీ శరీరం మొత్తం బ్లడ్, ట్యూబ్స్ ఉంటాయి అనుకున్నాను, మామూలుగానే ఉందే’’ అన్నాడు రణ్వీర్. భర్త గోల్డీ బెహల్తో... మానసిక బాధే కష్టం చికిత్స జరిగినంత కాలం సాఫీగా సాగిపోయిందంటే నేను అబద్ధం చెబుతున్నట్టే. ఈ ప్రయాణంలో చాలా నొప్పి కూడా దాగుంది. సర్జరీ జరిగిన తర్వాత లైఫ్ చాలా టఫ్గా గడిచింది. నా శరీరం మీద ఆపరే షన్ తాలూకా 20 అంగుళాల మచ్చ ఉండిపోయింది. ఆపరేషన్ థియేటర్కు వెళ్లే ముందు మా సిస్టర్ నన్ను కౌగిలించుకుంది. ‘మరీ అంత డ్రామా వద్దు. మళ్లీ తిరిగొస్తాను’ అని చెప్పా. కానీ ఎక్కడో ‘నా అబ్బాయికి, మా ఫ్యామిలీకి నేను ఉండనేమో?’ అనే ఆలోచనే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఆపరేషన్ జరిగి బయటకు రాగానే ‘నేను బతికే ఉన్నాను. శారీరక బాధ బాధే. ఆ బాధ సుదీర్ఘం కాదు. కానీ శారీరక బాధ కన్నా మానసిక బాధ మరింత బాధాకరం. అది మనిషిని కుంగదీస్తుంది’ అనిపించింది. సోదరి రూపాతో... కుమారుడు రణ్వీర్తో... ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తా ఇంతకు మునుపు ఏదైనా పని చేస్తున్నప్పుడు భయంగా అనిపిస్తే అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. ఇంక నా జీవితంలో భయానికి చోటు లేదు. భయపడటమే మరిచానని నా ప్రయాణాన్ని చూసి తెలుసుకున్నాను. నటిగా నాకు తెలియని, ఎటువంటి పరిచయాలు లేని ఒక ఇండస్ట్రీకు వచ్చాను. సాధారణ మహారాష్ట్ర మిడిల్ క్లాస్ అమ్మాయి బాలీవుడ్లో హీరోయిన్ అవ్వాలనుకోవడం చాలా పెద్ద కల. చాలా కష్టంతో కూడుకున్న కల. నా కల గురించి తెలుసుకొని మా ఇంట్లోవాళ్లు షాక్ అయ్యారు. కానీ అలాంటి పెద్ద కల కనడానికి నేను భయపడలేదు, నా సామర్థ్యాన్ని సందేహించలేదు. కానీ వాళ్లెందుకు భయపడ్డారో అన్న విషయం మేం తల్లిదండ్రులం అయ్యాక తెలుసుకున్నాను. బిడ్డల భవిష్యత్తు పట్ల ఏ తల్లిదండ్రికైనా కొన్ని భయాలు ఉంటాయి. అయితే నేను, నా భర్త గోల్డీ ఎలాంటి భయాలు లేకుండా జీవించాలనుకుంటున్నాం. సంతోషమైన విషయమేంటంటే నేనింకా బతికే ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ ప్రపంచానికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. -
జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తటస్థం
-
చంద్రబాబు అవినీతిపరుడైన సీఎం
-
చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.
-
రాజధాని పేరిట కుంభకోణం..
-
ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించగానే..కేసులు పెట్టారు.
-
కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది
-
విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య సమరం ఇది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అవకాశవాదం, అవకాశవాద రాజకీయాలు పరాకాష్టగా మారిపోయారని.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీల పొత్తును ఉదహరిస్తూ పేర్కొన్నారు. ఇండియా టుడే 18వ ఎడిషన్ క్లాన్క్లేవ్లో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన మీరు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే మళ్లీ కాంగ్రెస్లో చేరుతారా? అని జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయిందని, ఆ పార్టీ అవసరం తమకు లేదని, ఉంటే తమ అవసరమే ఆ పార్టీకి ఉండవచ్చునని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే.. వారికి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆవిరైపోయిందని, ఆ పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి ఆశల్లేవని పేర్కొన్నారు. ఆరు నెలల కిందట చంద్రబాబు అవినీతిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ ఒక్క పుస్తకాన్ని విడుదల చేసిందని, దాని మీద రాహుల్గాంధీ బొమ్మ కూడా ఉందని గుర్తు చేశారు. చంద్రబాబును అత్యంత అవినీతిపరుడైన సీఎంగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు తిరగకముందే తెలంగాణ ఎన్నికల్లో అదే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళ్లిందని, ప్రజలు ఆ పార్టీలను ఓడించి పంచించారని తెలిపారు. గత ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేశామని, తనకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసినా, తాము కేవలం ఒక్క శాతం ఓట్లతో ఓడిపోయామని గుర్తుచేశారు. రాజధాని పేరిట కుంభకోణం.. ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని చంద్రబాబు అంటున్నారు కదా ప్రశ్నించగా.. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. జూన్ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాజధాని ఎక్కడ వస్తుందో ఆయనకు ముందే తెలుసు. అయినా, ఇక్కడ వస్తుంది.. అక్కడ వస్తుందంటూ ఆయన ప్రజలు మభ్యపెట్టారు. ఈ లోపల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు తక్కువధరకు భూములు రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి రాజధాని ఎక్కడ వస్తున్నదనేది రహస్యంగా ఉంచాలి. కానీ, చంద్రబాబు ఈ విషయాన్నితన వాళ్లకు ముందే లీక్ చేశారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్తో సమానం. ల్యాండ్ పూలింగ్ విషయలో చంద్రబాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరిట రాజధాని కోసం పేదల నుంచి మాత్రమే భూములు లాక్కున్నారు. తన బినామీల భూములు, తన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చూశారు. దేశం ఇలాంటి అవినీతిపరుడైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసిందా? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి.. ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. బ్లాక్మనీతో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన సీఎంను మీరు ఎప్పుడైనా చూశారా? సిగ్గు లేకుండ ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ.. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల్లో ఉన్నది ఆయన గొంతేనని ఫోరెన్సిక్ నివేదిక సైతం తేల్చింది. అయినా ఆయనపై కేసు నమోదు కాలేదు. రాజీనామా చేయలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎలాంటి నైతిక విలువలు లేకుండా వ్యవహరించారు. ఇదే చంద్రబాబు ఇప్పుడు అవినీతి అంటూ నీతులు చెబుతుంటే ఏమనుకోవాలి? కేసుల గురించి.. ‘మా నాన్న బతికి ఉన్నంతవరకు నా మీద కేసుల్లేవు. మా నాన్న చనిపోయిన తర్వాత ఓదార్పుయాత్ర చేస్తానని నేను ప్రకటించగానే.. నాపై కేసులు పెట్టారు. నా మీద కేసులు పెట్టినవారెవరో తెలుసా? టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు రాగానే.. ఆ రెండు పార్టీలు కలిసి నాపై కేసులు పెట్టాయి. మా నాన్న సంక్షేమ పాలన చూసి ఆ పార్టీ నేతలు భయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలు కేంద్రంతో, రాష్ట్రంతో పోరాడితే కేసులు పెట్టడం చాలా సులభం. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అధికారం చేతిలో ఉంది కాబట్టి నా మీద ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టారు. నా మీద పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపిత తప్పుడు కేసులు’ అని తన మీద నమోదైన కేసుల గురించి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిచ్చారు. చదవండి: జాతీయ రాజకీయాల్లో మాది తటస్థ వైఖరి: వైఎస్ జగన్ -
రెండు జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని మోసగించాయి
-
ఇండియా టుడే కాంక్లేవ్లో వైఎస్ జగన్
-
జాతీయ రాజకీయాల్లో మాది తటస్థ వైఖరి: జగన్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు రెండు పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాను అత్యంత ముఖ్యమని, వాటిని నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్తో వైఎస్ జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ప్రశ్న-జవాబుల రూపంలో సాగిన ఈ సదస్సులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇండియా టుడే: మీరు సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. మీలా ఎవరూ ఇంత సుదీర్ఘంగా చేయలేదని ప్రజలు అంటున్నారు? వైఎస్ జగన్: పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలో ఉన్నాను. పాదయాత్ర పొడుగుతా ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసాను ఇచ్చాను. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యం. అందుకు ఏం చేయాలన్నది పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య ఉండి నిశితంగా గమనించాను. ఇండియా టుడే: రాజకీయ నాయకుడి మీ ప్రయాణం ఎలా సాగింది? వైఎస్ జగన్: నా తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణం అంతా ప్రజల మధ్యలోనే గడిచింది. ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా ఉన్నది ప్రజలకు సమాచారం ఇస్తూ.. వారితో కలిసి నడిచాను. వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకున్నాను. ఇండియా టుడే: ప్రభుత్వ వ్యతిరేకత గురించి చెబుతున్నారు? వైఎస్ జగన్: ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలావరకు కొందరు వ్యక్తులు సృష్టించినవే. ఎన్నికలకు ముందు చంద్రబాబె ఎన్నో హామీలు ఇచ్చారు. గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా.. చేస్తానని వాగ్దానం చేసి.. అన్నదాతలను మోసం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో అంతకుముందు వరకు వచ్చే వడ్డీలేని రుణాలను కూడా ఇప్పుడు రైతులు పొందలేకపోతున్నారు. ఇండియా టుడే: మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు? వైఎస్సార్ సంక్షేమ రాజ్యానికి మీ పరిపాలనకు తేడా ఏమిటి? వైఎస్ జగన్: చంద్రబాబు పరిపాలనలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఓ వర్గం వారికి మాత్రమే చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. తమకు ఓటేసిన వారికే ప్రభుత్వ పథకాలు అంటూ వివక్ష చూపించారు. కానీ, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా నిర్ణయాలు తీసుకుంటాం. మేం ప్రకటించిన నవరత్నాల పథకంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది ఇండియా టుడే: జాతీయ రాజకీయాలపై మీ విధానం ఏమిటి? వైఎస్ జగన్: జాతీయ స్థాయిలో ఉన్న రెండు పార్టీలు ఏపీని మోసం చేశాయి. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏపీని విభజించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటైపార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించాయి. పార్లమెంటు ద్వారాలు మూసేసి. లోక్సభలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి.. విభజన బిల్లును నెగ్గించుకున్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోవడంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఏపీలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? ఇండియా టుడే: ఏపీ ఎన్నో రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందుంది కదా? హోదా ఎందుకు? వైఎస్ జగన్: ఇదే విషయం మీరు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎందుకు అడగలేదు? గతంలో ఇతర రాష్ట్రాలను విభజించినప్పుడు హోదా ఇచ్చారు కదా.. ఏపీ అడ్డగోలుగా విభజించినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? పార్లమెంటు మీద ఆశ, నమ్మకం పెరగాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా..! ఇండియా టుడే: అంటే హోదా ఒక్కటే మీకు ముఖ్యమా? వైఎస్ జగన్: ఔను, మాకు మా రాష్ట్రం, మా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదానే ముఖ్యం. ఎవ్వరు ప్రధానమంత్రి అయినా మాకు మాత్రం హోదానే కావాలి. హోదా ఇవ్వేవాళ్లకు మా మద్దతు ఉంటుంది. ఇండియా టుడే: ఎందుకు మీకు హోదా అంత అవశ్యకత? మీది పెద్ద రాష్ట్రం, ఎన్నో పరిశ్రమలున్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రం కదా? వైఎస్ జగన్: రాష్ట్రాన్ని విభజించినప్పుడు నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. మీ మాటను నిలబెట్టుకోవాలని నేను అడుగుతున్నాను. విభజన తర్వాత చుట్టు ఉన్న పెద్ద నగరాలతో ఏపీ ఎలా పోటీ పడుతుంది? హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో ఏ రకంగా పోటీపడతా? కేంద్రం హోదా ఇచ్చి.. 100 శాతం పన్ను రాయితీలు కల్పిస్తేనే.. ఇతర నగరాలతో పోటీపడి అభివృద్ధి సాధించగలం. హైదరాబాద్లో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అలాంటప్పుడు కొత్తగా ఓ పరిశ్రమ, ఆస్పత్రి, ఫ్యాక్టరీ ఏపీలో ఎలా పెడతారు? అందుకే మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ నిలబడగలదు. ఇండియా టుడే: ఎవరు ఎక్కువ శత్రువుల నరేంద్రమోదీనా? రాహులా? వైఎస్ జగన్: ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించి మోసం చేస్తే.. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ మోసం చేశారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఏపీ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ వెన్నుపోటు పొడిచాయి. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
-
నేడు వైఎస్ జగన్ ప్రసంగం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఇండియా టుడే కాంక్లేవ్లో శనివారం ఉదయం 10.15 గంటల నుంచి 10.45 గంటల మధ్య జగన్ ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో నిర్ణయించడంలో దక్షిణాది ప్రాంత పాత్ర (హౌ ది దక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ)’ అనే అంశంపై ప్రసంగిస్తారు. కాగా, ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే కె.రవిబాబు ఉన్నారు. విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకున్నారు. -
నిర్ణయం పాక్ చేతుల్లోనే...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్కు గట్టి సందేశం ఇచ్చిందనీ, ఇక మనతో సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పేర్కొన్నారు. దేశ వర్తమాన పరిస్థితులపై ప్రముఖులతో చర్చలు నిర్వహించేందుకు ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహిస్తున్న ఇండియా టుడే కాంక్లేవ్–2019 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు సదస్సును ప్రారంభిస్తూ ఇండియా టుడే ఎడిటర్ ఇన్ ఛీఫ్ అరుణ్ పురీ స్వాగతోపాన్యాసం ఇచ్చారు. ‘రానున్న ఎన్నికలు అనేక మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవి. సంకీర్ణ ప్రభుత్వాల కంటే సంపూర్ణ మెజారిటీ గల ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందా? దేశం ఒక గట్టి ఆధిపత్యం ఉండే నాయకుడిని కోరుకుంటోందా? లేక కేవలం మంచి టీమ్ను కోరుకుంటోందా? పుల్వామా దాడి ఘటన ఎన్నికలపై ఏమేర ప్రభావం చూపుతుంది.. వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఇక కాంక్లేవ్లో తొలి వక్త బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘ఎన్నికల డైరీలు: విజయాలు, ఓటములు, ప్రజాస్వామిక రణక్షేత్ర సారాంశం’ అనే అంశంపై ప్రసంగించారు. ‘మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్కు గట్టి సందేశం ఇచ్చింది. సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ పుల్వామా దాడిని ఖండించకపోవడంపై ఆయన మండిపడ్డారు. సాంస్కృతిక వైరాలపై కాంగ్రెస్ నేత శశిథరూర్, బీజేపీ నేత వినయ్ సహస్ర బుద్దే ప్రసంగించారు. మహిళా శక్తిపై క్రీడాకారులు మేరీకోమ్, మిథాలీ రాజ్ ఉపన్యాసాలు ఇచ్చారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దేశభక్తి అనే అంశంపై ప్రసంగించారు. శనివారం మోదీతోపాటు పలువురు వక్తలు ప్రసంగించనున్నారు. ప్రధాని రేసులో లేను: గడ్కరీ ఈ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘బీజేపీ రాజకీయ విజయాలకు రోడ్మ్యాప్’ అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త అడిగిన ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ ‘మేమంతా మోదీ వెనక ఉన్నాం. ఆయన విజన్ విజయవంతం చేయడంలో నేనొక కార్యకర్తను. ఇక ప్రధాన మంత్రి పదవి రేసులో నేనున్నానన్న ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది?’ అని ప్రశ్నించారు. ‘మోదీ ప్రధానమంత్రి. తదుపరి ప్రధాన మంత్రి కూడా ఆయనే. నేను ప్రధాన మంత్రి రేసులో లేను. అలాంటి కల నేను కనలేదు’ అని వ్యాఖ్యానించారు. పైలట్ పాక్ చెరలో ఉంటే.. ఎన్నికల భేటీలా? ‘కాంగ్రెస్ సన్నాహాలు, ఆత్మపరిశీలన’ అన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింధియా ప్రసంగించారు. ‘పాక్ ప్రతీకార దాడుల్ని వీరోచితంగా అడ్డుకొని పాకిస్తాన్కు చెందిన ఎఫ్– 16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన మన పైలట్ ఆ క్రమంలో తన విమానం శత్రు భూభాగంలో నేలకూలడంతో పాక్కు బందీగా చిక్కాడు. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం తీవ్ర ఉద్విగ్న స్థితిలో ఉంటే మన ప్రధాని మాత్రం బూత్ కమిటీ సభ్యులతో రాజకీయ సమావేశం నిర్వహించడం నన్ను విస్మయానికి గురిచేసింది. పైలట్ పాక్లో చిక్కుకుంటే మోదీ ఎన్నికల భేటీలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం?’ అని సింధియా ప్రశ్నించారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘ఒకవైపు పాక్ దాడులకు తెగబడుతుంటే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ముందుండి దేశానికి దిశా నిర్దేశం చేయాలి. ఆ సమయంలో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడి ఉండాల్సింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యేది’ అని అన్నారు. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాలశౌరి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (హౌ ది డెక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ) అనే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హోదాలో శనివారం ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. -
ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లో విజయం ఎవరిది?’ అంశంపై ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ చర్చించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, లోక్సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ పార్టీ బయట నుంచి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్తో పొత్తుపై చర్చించలేదు: ఎంపీ రమేష్ ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయలా? లేదా అనే అంశంపై ఇంకా చర్చించలేదని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. -
రాహుల్కు చంద్రబాబు ఝలక్
-
రాహుల్ గాంధీకి చంద్రబాబు ఝలక్
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారు. రాహుల్ను ప్రధాని చేయాలన్నది తన విధానం కాదని వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్ సౌత్ 2018లో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఇప్పటివరకు ఎవరిని ప్రకటించలేదని తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా డిసెంబర్ 16న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అది డీఎంకే పార్టీ విధానమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేక వ్యక్తి (నెగెటివ్ క్యారెక్టర్)గా చంద్రబాబు వర్ణించారు. మోదీ తప్పా అందరూ ఉత్తములని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేశాయని దుయ్యబట్టారు. -
‘ఈ మూడు లక్షణాలు ఉంటే విజయం మీదే’
రాజకీయ నాయకుడిగా రాణించాలనుకుంటున్నారా..? స్టార్ పొలిటిషియన్గా పేరు తెచ్చుకోవాలని ఉందా..? అయితే మీలో.. గ్లామర్, గ్రామర్, హ్యూమర్ అనే మూడు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలట. ఈ మాటలు చెబుతోంది మేము కాదండోయ్! సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్ అండ్ అవార్డ్స్ 2018’ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే గ్లామర్, గ్రామర్, హ్యూమర్ అనే లక్షణాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మూడు లక్షణాలు విడివిడిగా ఉంటే సరిపోవని.. అన్నీ కలగలిసి ఉన్నప్పుడే మీపై వదంతులు ప్రచారమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చమత్కరించారు. కాగా ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, తమిళనాడు సీఎం పళని స్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్ సహా పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇక ఇండియా టుడే అవార్డుల్లో భాగంగా... పాలనలో అత్యంత మెరుగైన రాష్ట్రంగా ఎన్నికైన తెలంగాణ తరపున తెలంగాణ భవన్ ప్రధాన రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్వీకరించారు. -
పాక్పై హిల్లరీ క్లింటన్ ఫైర్
-
తైమూరు పేరు మార్చాలని అనుకున్నాడు!
సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా వేదికగా అనేక కథనాలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియడం లేదు. బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖన్-కరీనా కపూర్ల తనయుడు తైముర్ అలీఖాన్ పేరుపై వివాదం కూడా అదే కోవలోకి వస్తుంది. తైముర్ జన్మించకముందు మరో పేరు అనుకున్నారని, ఇప్పుడు నెటిజన్ల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పాత పేరును మళ్లీ పెట్టారనే వార్త గత కొంతకాలంగా హల్చల్ చేస్తోంది. ఈ విషయాన్ని గతంలో కరీనా ఖండించారు. అయినా దీనికి తెరపడలేదు. కానీ శనివారం ఇండియా టుడే కంక్లేవ్లో పాల్గొన్న కరీనా ఈ వార్తలకు తెరదించే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడుతూ.. తైముర్ పేరుపై రకరకాల వార్తలు వస్తున్నాయన్నారు. బాబు పుట్టక ముందే సైఫ్ అలీఖాన్.. ఫైజ్ అనే పేరును ప్రతిపాదించినా.. తాను ఒప్పుకోలేదని తెలిపారు. తైముర్ అనే పదానికి ఐరన్ మ్యాన్ అనే అర్థం వస్తుందని, తన బాబు కూడా అలాగే పెరగాలన్నది తన కోరిక అని తెలిపారు. బాబు పేరుని ఫైజ్గా మార్చాలని జనాల నుంచి చాలా ఒత్తిడి వచ్చిందన్నారు. సైఫ్ కూడా బాబు పేరును మార్చడానికి సిద్ధపడ్డాడని ఆమె వెల్లడించారు. అయితే, తాను మాత్రం అందుకు అంగీకరించలేదని తెలిపారు. ఏదో ఒక రోజు తన కుమారుడు పేరుకు తగ్గట్టు ఐరన్ మ్యాన్ అవుతాడని ఆమె పేర్కొన్నారు. ఇక, మీడియాలో తన తనయుడిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పుడు తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్ ధరించాడు, హెయిర్ స్టైల్ ఎలా ఉంది వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని ఆమె తెలిపారు. ఇది హర్షణీయం కాదన్నారు. మీడియా తనని అంతలా ఫాలో అవుతుంటే, దీన్ని ఎలా అదుపు చెయ్యాలో కూడా తెలియడం లేదన్నారు. -
పాక్ను ఏకిపారేసిన హిల్లరీ
సాక్షి, ముంబై : అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాక్ను ఏకిపడేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయటంలో పాక్ ఘోరంగా విఫలమౌతోందంటూ ఆమె పేర్కొన్నారు. ఇండియా టుడే కంక్లేవ్లో ప్రసంగించిన ఆమె పాక్ వైఖరిపై మండిపడ్డారు. ‘భారత్తో సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా వాళ్లేం(పాక్) ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించటం లేదు. పైగా ఉగ్రవాదులను ప్రొత్సహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరో పొరుగు దేశం అప్ఘనిస్థాన్తోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. దీనికి చెక్ పడాల్సిన అవసరం ఉంది. అమెరికా పాక్ను కట్టడి చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అది చేస్తుందనే ఆశిస్తున్నా’ అని హిల్లరీ పేర్కొన్నారు. ఇక సరిహద్దులోనే కాకుండా సొంత దేశంలోనూ ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో పాక్ విఫలమైందని ఆమె తెలిపారు. పాక్ వైఖరితో భారత్ పడుతున్న ఇబ్బందులు తనకు క్షుణ్ణంగా తెలుసని హిల్లరీ పేర్కొన్నారు. ముఖ్యంగా 26/11 ముంబై తాజ్ హోటల్ దాడి తర్వాత తాను భారత్లో పర్యటించానని, ఆ సమయంలో పాక్ చేసిన వాదన సహేతుకంగా లేదంటూ తాను చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది కూడా చదవండి... ట్రంప్ సరైనోడు కాదు! -
రేడియోను నాశనం చేశామా?
న్యూఢిల్లీ : ఆధార్... దేశంలో పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆధార్ను అన్ని సేవలకు అనుసంధానం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత వివరాలన్నీ బట్టబయలు అవుతాయని కొందరు వాదిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆధార్ వల్ల భద్రత పెరుగుతుందని చెబుతోంది. అసలు ఆధార్ వల్ల ముప్పెంత..? ప్రయోజనమెంత..? అనే విషయాలపై ఇజ్రాయిల్ చరిత్రకారుడు యువాల్ నోహ్ హరారి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ టెక్నాలజీ కూడా నిర్ణాయకమైనది కాదని హరారి అన్నారు. ప్రతి టెక్నాలజీలోనూ సానుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయని చెప్పారు. కానీ బయోటెక్నాలజీ విషయంలో కొంత మొత్తంలో ఉండే ప్రతికూలతల కోసం, భారీ మొత్తంలో ప్రయోజనాలను వదులుకోవడం మూర్ఖత్వమేనన్నారు. ఉదాహరణకు..నాజి జర్మనీ రేడియోను ప్రధాన ప్రచార సాధనంగా వాడుకున్నారు. ప్రతి సాయంత్రం, ప్రతి రోజూ హిట్లర్ తన ప్రసంగాలను లక్షల కొద్దీ జర్మన్లకు రేడియో ద్వారానే వినిపించే వారు. వారి బ్రెయిన్వాష్ చేశారు. అంటే రేడియో చెడుకే అనే అర్థమా? అన్ని రేడియో సెట్లను నాశనం చేశామా? కాదు కదా! చాలా మంచి విషయాలకు కూడా రేడియోను వాడారు. ఇదే బయోటెక్నాలజీ విషయంలోనూ అప్లయ్ అవుతుంది. బయోటెక్నాలజీ విషయంలో ప్రజలు భయపడాల్సినవసరం లేదు. దీన్ని ఆపాలని చూసినా.. నాశనం చేయాలని చూసినా.. ఎలాంటి ఉపయోగకరం ఉండదని హెచ్చరించారు. ప్రతి టెక్నాలజీ విషయంలోనూ పలు రాజకీయ కోణాలుంటాయని, అన్ని అవకాశాలను తెలుసుకున్న అనంతరమే సరియైన దాన్ని ఎంపిక చేసుకోవాలని హరారి సూచించారు. ముంబైలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇండియా టుడే కంక్లేవ్ 2018 సందర్భంగా హరారి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్తమానానికి, భవిష్యత్తు చాలా భిన్నంగా ఉంటుందని, అదేవిధంగా గ్లోబల్ సమస్యలను, గ్లోబల్ పరిష్కారాలు కనుగొనాల్సినవసరం కూడా తమపైనే ఉందన్నారు. -
వాజపేయి-మోదీకి అదే తేడా: సోనియా
ముంబై : లోక్సభలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా నిరాకరించి, వీలుచిక్కినప్పుడల్లా గాంధీ-నెహ్రూ కుటుంబాలపై విమర్శలు గుప్పించే ప్రధాని నరేంద్ర మోదీ తీరును కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ తప్పుపట్టారు. ‘‘2014, మే 26 (మోదీ బాధ్యతలు స్వీకరించిన రోజు) కంటే ముందు దేశంలో అసలు అభివృద్ధే జరగలేదన్నట్లు, గడిచిన నాలుగేళ్లలోనే అంతా సాధించినట్లు మాట్లాడటం జాతిని అవమానించినట్లే’’నని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ‘ఇండియా టుడే ముంబై కంక్లేవ్’లో మాట్లాడిన ఆమె.. వాజపేయి-మోదీల మధ్య తేడాను ఎత్తిచూపారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలాంటి పార్లమెంటరీ వ్యవస్థను వాజపేయిగారు అమితంగా గౌరవించేవారని, ప్రస్తుత ప్రధాని మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఏకపాత్రగా పరిగణిస్తున్నారని, అసమ్మతి, చర్చలు ఉంటాయనే స్ఫృహను మర్చిపోయారని, వాజపేయికి-మోదీకి మధ్య ప్రధానమైన తేడా ఇదేనని సోనియా అన్నారు. లీడర్ కన్నా మంచి రీడర్ నేను : ‘ఒక పార్టీకి అధ్యక్షురాలిగా నా పరిధి ఏమిటనేది స్పష్టంగా తెలుసు. నేను మంచి వక్తను కానని ఒప్పుకోవడానికి వెనుకాడను. నన్ను లీడర్ అనేకన్నా మంచి రీడర్ అంటే సబబుగా ఉంటుందేమో(నవ్వులు)’ అని చమత్కరించిన సోనియా.. తనకంటే మన్మోహన్ సింగ్ సమర్థుడైన నాయకుడని కితాబిచ్చారు. కొత్త శైలితోనే కాంగ్రెస్కు జీవం : 2014 ఎన్నికల తర్వాత కాంగ్రస్ పార్టీ వరుస వైఫల్యాలపై సోనియా కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడారు. ‘‘అవును. మేం మార్కెట్ నుంచి తోసేయబడ్డాం (We were out-marketed) ఇప్పుడు సరికొత్త శైలి(a new style)తో మళ్లీ ప్రజలతో మమేకం అవుతాం. పార్టీ విధివిధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతాం’’ అని చెప్పారు. -
‘బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వొద్దు’
సాక్షి, ముంబై : భారతీయ జనతా పార్టీని తిరిగి అధికారంలోకి రానివ్వొద్దంటూ దేశ ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆమె ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ పాలన దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తోందని సోనియా ఆక్షేపించారు. ‘బీజేపీ పాలనలో ప్రజల స్వేచ్ఛ దాడులకు గురవుతోంది. అభివృద్ధి కుంటుపడి దేశం తిరోగమనంలో పయనిస్తోంది. ప్రత్యామ్నాయ గొంతుకలను నొక్కేస్తున్నారు. మత ఘర్షణలు మరింతగా పెరిగిపోయాయి. కేవలం అధికారమే పరమావధిగా అనైతిక రాజకీయాలను ప్రదర్శిస్తున్న బీజేపీ.. స్థానిక రాజకీయాలను దెబ్బతీస్తోంది’ అని సోనియా పేర్కొన్నారు. కనీసం చట్టసభల్లో విపక్షాలు మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటప్పుడు పార్లమెంట్ను మూసేసి ప్రతినిధులంతా ఇళ్లకు వెళ్లొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. వాజ్ పేయి హయాంలోని పరిస్థితులు.. మోదీ పాలనలో కనీసం కూడా కనిపించటం లేదని ఆమె అన్నారు. బీజేపీ పాలనపై స్పందిస్తూ... ప్రస్తుతం దేశంలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆమె చెప్పారు. చట్టాలు కఠినంగా అమలు కావటం లేదు. పారదర్శకత కోసం ఆర్టీఐ యాక్ట్ తీసుకొస్తే.. దానిని కోల్డ్ స్టోరేజీ పెట్టేశారు. ఆధార్ పరిస్థితి కూడా అస్తవ్యస్థంగా తయారయ్యింది అని ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రకటనలు తప్ప.. అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందన్న విషయం ఎవరికీ తెలీని గందరగోళం నెలకొందని సోనియా చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి మళ్లీ అధికారం కట్టబెట్టొద్దని వేదిక సాక్షిగా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చివర్లో 2014 ఎన్నికల్లో ఓటమి కారణాలపై స్పందించిన ఆమె అవినీతి ఆరోపణలు తమను దారుణంగా దెబ్బతీశాయన్నారు. అదే సమయంలో మోదీ చరిష్మా బీజేపీకి కలిసొచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా రాజకీయాలకు అలవాటు పడాలన్న విశ్లేషకుల సూచనతో తానూ ఏకీభవిస్తానన్న ఆమె.. రాహుల్ గాంధీ సారథ్యంలో అది సాధ్యమౌతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై స్పందిస్తూ అది పార్టీ అంతర్గత విషయమని సోనియా పేర్కొన్నారు. -
కన్నీరుమున్నీరైన సోనియా గాంధీ..
ముంబై : తన భర్త రాజీవ్ను రాజకీయాల్లోకి రావద్దని కోరింది నిజమేనని సోనియా గాంధీ చెప్పారు. ఇందిర లాగే రాజీవ్ కూడా హత్యకుగురవుతారనే ఆందోళన ఎప్పటి నుంచో ఉండేదని, భపపడ్డట్లే విషాదాన్ని చూడాల్సివచ్చిందన్నారు. శుక్రవారం ‘ఇండియా టుడే ముంబై కంక్లేవ్’లో మాట్లాడిన ఆమె.. గతాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఇండియా టుడే’ ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరీ.. సోనియాను ఇంటర్వ్యూ చేశారు. ‘‘రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాసేవ తప్ప మిగతావన్నీ రెండో ప్రాధాన్యాలే అవుతాయి. రాజీవ్ కూడా కుటుంబానికి దూరమవుతారని ఆందోళన చెందా. కానీ అత్త(ఇందిరా గాంధీ) హత్యతర్వాత ఆయన రాజకీయాల్లోకి రాకతప్పలేదు. బహుశా రాజీవ్ను (రాజకీయాల్లోకి) వద్దనడం నా స్వార్థమే కావచ్చు, అయితే, ఆయన్ను చంపేస్తారేమోనని భయంకూడా మాలో ఉండేది. నా చుట్టుపక్కల అలా మాట్లాడుకోవడం చాలాసార్లు నా చెవినడేవి. చివరికి దేనిగురించైతే భయపడ్డామో అదే జరిగింది’’ అంటూ ఉబికివచ్చిన కన్నీళ్లను తుడుచుకున్నారు సోనియా గాధీ. ఇందిరా గాంధీ హత్య(1984) జరిగిన ఏడేళ్లకే రాజీవ్ గాంధీ (1991లో) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను ఎల్టీటీఈ తీవ్రవాదులు బెల్టుబాంబులతో చంపేసిన ఉదంతం విదితమే. రాజీవ్ హత్యానంతరం ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సోనియా గాంధీ.. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. గతేడాదే పార్టీ అత్యున్నత పదవి నుంచి తప్పుకున్న ఆమె.. కుమారుడు రాహుల్కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. -
రైలు కిందపడి చస్తాను కాని..
సాక్షి, హైదరాబాద్: ‘అవసరమైతే రైలు కిందపడి చస్తాను కాని నీ దగ్గరకు మాత్రం తిరిగి రాను’ .. సీనియర్ నటి ఖుష్బూ నోటి నుంచి ఒకప్పుడు వెలువడిన మాటలివి. నిజజీవితంలో కన్నతండ్రితోనే ఈ మాటలు అన్నట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. తాను ఎందుకు ఈ మాటలు అనాల్సివచ్చిందో ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో వివరించారు. ‘వుమెన్ పబ్లిక్ లైఫ్: ది పర్సనల్ ఈజ్ పొలిటిక్’ పేరుతో జరిగిన సెషన్లో గౌతమి, కాజల్, తాప్సితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తండ్రి పెట్టే వేధింపులు భరించలేక చిన్నతనంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని వెల్లడించారు. ‘మా నాన్నకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్న ఉద్దేశంతో చిన్న వయసులోనే ఆయనపై తిరుగుబాటు చేశాను. మా అమ్మ, సోదరులను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. మా నాన్న ఆడవాళ్లను చులకనగా చూసేవాడు. అసభ్యంగా మాట్లాడేవాడు. నేను ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు నాకింకా గుర్తుంది. అది 1986, సెప్టెంబర్ 12. తనను కాదని బయటకు వెళ్లి బతకలేమని, మళ్లీ తన దగ్గరకు వచ్చి ప్రాధేయపడాల్సి వస్తుందని మా నాన్న అన్నాడు. అప్పుడు ఆయనతో ఒకటే చెప్పాను. అలాంటి పరిస్థితే వస్తే నా సోదరులు, అమ్మను చంపేసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకి చస్తాను గాని, నీ దగ్గరకు మాత్రం తిరిగిరానని చెప్పినట్టు’ వెల్లడించారు. చిన్నతనంలోనే తెగువ చూపించిన ఖుష్బూ మూడు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లలో మళ్లీ తండ్రిని ఆమె కలవలేదు. ‘మా నాన్నను మళ్లీ చూడటం నాకు ఇష్టం లేద’ని స్పష్టం చేశారు. -
మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సినీ నటుడు ఎం. మోహన్బాబు.. రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో రెండో రోజు శుక్రవారం ‘ఫాదర్ టు డాటర్: ది డీఎన్ఏ ఆఫ్ యాక్టింగ్’ పేరుతో జరిగిన సెషన్లో తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. ‘నా స్నేహితుడు, నాకు అన్న అయిన ఎన్టీ రామారావు గారు మంచి వ్యక్తి. లంచం అంటే ఏమిటో కూడా ఆయనకు తెలియదు. ఆయన నన్ను రాజ్యసభకు పంపారు. ఎటువంటి మచ్చ లేకుండా నా పదవీ కాలాన్ని పూర్తిచేశాను. 95 శాతం మంది పొలిటీషియన్లు రాస్కెల్స్. ప్రజలకు ఎన్నో హామీలిస్తున్నారు. వీటిని నిలబెట్టుకునేవారెవరు? రాజకీయ నేతలు మాట నిలబెట్టుకునివుంటే ఇండియా ఇంకా మంచి స్థానంలో ఉండేద’ని మోహన్బాబు అన్నారు. కింగ్ కాదు.. కింగ్మేకర్: మంచు లక్ష్మీ తన తండ్రి కింగ్లా కాకుండా కింగ్మేకర్లా ఉండాలని కోరుకున్నారని మంచు లక్ష్మీ వెల్లడించారు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆయన నైజమని చెప్పారు. ‘ఆయన కింగ్మేకర్. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారి తరపున ప్రచారం చేసి గెలిపించారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో చాలా మంది ఆయనకు తెలియదు. అయినప్పటికీ భయపడకుండా తన మనసులో ఉన్నది వెల్లడించడానికి ఆయన సంకోచించలేద’ని లక్ష్మీ మంచు అన్నారు. -
ఆర్థికాభివృద్ధిలో మేమే నెంబర్ 1
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణను పునర్నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగమయ్యామని, ఆర్థికాభివృద్ధిలో ఇదే ఒరవడిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ఆంధ్రా, తెలంగాణలకు చాలా తేడా ఉందని, ఇరు ప్రాంతాల ప్రజల జీవన విధానం కూడా వేరని పేర్కొన్నారు. తెలుగు అనే ప్రత్యేక గుర్తింపు లేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రా – తెలంగాణల విలీనం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. అది విఫల ప్రయత్నమని రుజువైందన్నారు. తాము రక్తం చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని పార్క్హయత్ హోటల్లో జరిగిన ‘ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్–2018’కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇందులో ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. కాగ్ కూడా 16 అంశాల్లో పరిశీలన జరిపి తెలంగాణ అభివృద్ధిలో నంబర్వన్ రాష్ట్రమని చెప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.49 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టామని.. ఇప్పటివరకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తెలంగాణ చరిత్ర తెలిస్తే సంపద సృష్టించింది ఎవరో తెలుస్తుందని స్పష్టం చేశారు. మార్వాడీలు 300 ఏళ్ల కిందటే హైదరాబాద్కు వచ్చారని, ఇక్కడి పాతబస్తీలో గుల్జార్హౌస్ ఉందని, నిజాం సమయంలోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారని, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ఇప్పుడే ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడ్డామని, ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థితికి చేరుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణను చిన్న రాష్ట్రమంటే అంగీకరించబోమన్నారు. హైదరాబాద్ చరిత్ర తెలిసిన వారెవరైనా అది తెలంగాణలో అంతర్భాగమేనని అంగీకరిస్తారని.. ఎన్నో మతాల వాళ్లు, ప్రాంతాల వాళ్లు ఇక్కడ కలసి జీవిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్కు దేశ రెండో రాజధానిగా గౌరవమిస్తామంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తున్నాం తెలంగాణకు రోజూ 650 లారీల గొర్రెలు దిగుమతయ్యేవని, తాము రూ. 5 వేల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల పంపిణీ చేపట్టామని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రం నుంచి దేశ విదేశాలకు మేలైన గొర్రెలు, మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. ఇక తెలంగాణ ఏర్పడే నాటికి 6 వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని, ఇప్పుడు 14 వేల మెగావాట్లకు పెంచామని చెప్పారు. 2020 నాటికి 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువబోతోందని చెప్పారు. దేశంలోనే గొప్పగా రూ.40 వేల కోట్లతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కాగితాలపైనే జలాల కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయించిన నీళ్లు కాగితాల్లోనే ఉండేవని, లెక్కల్లో మాత్రమే కనిపించేవని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు 1,350 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిందన్నారు. మహబూబ్నగర్ నుంచి లక్షలాది మంది వలసపోయేవారని, తాము ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి వలసలు నివారించామని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కష్టాలు లేకుండా ఏర్పాటు చేశామన్నారు. కల్తీ ఎరువులు, విత్తనాలు రాకుండా చర్యలు తీసుకున్నామని, పీడీ యాక్టు కింద కేసులు పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 71 లక్షల మంది రైతులకు ఏటా ఎకరాకు రూ.8 వేల చొప్పున సాగు పెట్టుబడి అందించనున్నామని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపకముందు కూడా ధనిక రాష్ట్రమేనని, ఏపీతో తెలంగాణను పోల్చవద్దని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, ఏపీకంటే చాలా విషయాల్లో ఎంతో ముందుందని, అసలు పోలికే లేదని చెప్పారు. గుజరాత్తోనో, అమరావతితోనే పోల్చవద్దన్నారు. భవిష్యత్తులో ఇక్కడ రైతుల ఆత్మహత్యలనేవే ఉండవన్నారు. హైదరాబాద్ను విధ్వంసం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అందమైన హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేశారని, హైదరాబాద్కు గార్డెన్ సిటీగా పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు. 1915లోనే హైదరాబాద్లో విద్యుత్ సరఫరా ఉండేదని, ఆ తర్వాతే మద్రాసుకు కరెంటు వచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లోనే ఇక్కడ విమానాశ్రయం, టెలిగ్రాఫ్, ప్రత్యేక రైల్వేవ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉండేవన్నారు. కానీ ఉమ్మడి పాలనలో ఇక్కడి భూములు, నాలాలు కబ్జా చేశారని, వెయ్యి దాకా ఉన్న చెరువులు, కుంటలు మాయమయ్యాయని చెప్పారు. తాము రూ.25వేల కోట్లతో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. సామాజిక, ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే 90 శాతం ఉన్నారని, కేవలం 10 శాతమే ఉన్నత కులాల వారు ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇలా 90 శాతమున్న వారికి 50 శాతం రిజర్వేషన్ ఎలా సరిపోతుందని, బలహీన వర్గాలకు అన్యాయం చేయలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో గిరిజనులు 10 శాతముంటే 6 శాతంగా లెక్కగట్టారని, ఇక ముస్లింలు 14 శాతం ఉన్నారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, తమిళనాడులో 69శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితిని చూడాలని.. సామాజిక, ఆర్థిక వెనుకబాటును బట్టే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేశారు. కేంద్రంతో మంచి సంబంధాలనే కోరుకుంటామని, సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తామని తెలిపారు. అవినీతిపరులు ఎవరో దేశమంతా తెలుసంటూ కాంగ్రెస్ నేతల విమర్శలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎవరితో పొత్తుల్లేవు.. స్వతంత్రంగా ఉంటాం టీఆర్ఎస్ పార్టీ యూపీఏలోగానీ, ఎన్డీయేలోగానీ చేరదని.. స్వతంత్రంగానే ఉంటామని కేసీఆర్ చెప్పారు. ఎవరితో వెళ్లాల్సిన పని టీఆర్ఎస్కు లేదని, టీఆర్ఎస్తో కలసి రావాలా, లేదా అన్నది ఇతర పార్టీలు తేల్చుకోవాలని పేర్కొన్నారు. తనకు ఢిల్లీ వెళ్లే ఆలోచనేదీ లేదని, యావత్ తెలంగాణ తన కుటుంబమని, భావోద్వేగాలు తెలంగాణ చుట్టే ఉంటాయని చెప్పారు. తాను ఇక్కడే ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలో నంబర్వన్గా నిలుపుతానన్నారు. మనది సహకార సమాఖ్య వ్యవస్థ అన్న ప్రధాని మాటలను సమర్థిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రాల సంపదే జాతి సంపద అని, రాష్ట్రాలు మరింత ఎదిగేందుకు కేంద్రం అవకాశమివ్వాలని కోరారు. రాష్ట్రాలకు అధిక నిధులు, అధికారాలు ఇస్తే.. దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు త్వరలోనే ఎన్నారై పాలసీని తీసుకువస్తామన్నారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను గుర్తించామని, వివరాలు తెప్పించి 55 మందికి సాయం చేశామని తెలిపారు. జలదృశ్యం వద్ద అమరవీరుల స్తూపం నిర్మిస్తున్నామని, ఆవిష్కరణ సమయంలో అందరినీ సన్మానించుకుంటామని వెల్లడించారు. అద్భుతమైన సచివాలయం నిర్మిస్తాం రాష్ట్రంలో పాత సచివాలయం సరిగా లేదని, రూ.250 కోట్లతో కొత్త సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇది వాస్తు సమస్య కాదన్నారు. విదేశీ ప్రతినిధులు వచ్చిన సందర్భంలో మలేసియా మంత్రి ఒకరు.. సచివాలయం స్థలాన్ని అమ్మేసి కొత్తది కట్టొచ్చు కదా అన్నారని చెప్పారు. ధనిక రాష్ట్రానికి తగినట్టుగా అద్భుతమైన సచివాలయం నిర్మిస్తామన్నారు. ఇక ప్రగతిభవన్ కేసీఆర్ సొంత ఇల్లు కాదని, అది తెలంగాణ సీఎం అధికారిక నివాసమని, కనీసం వందేళ్లు ఎందరో సీఎంలు ఉండేదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికే అన్ని పదవులన్న ఆరోపణ సరికాదని.. కుటుంబ సభ్యులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రజలు ఓట్లు వేస్తేనే ఎన్నికయ్యారని చెప్పారు. -
బీజేపీపై ప్రకాశ్రాజ్, కంచ ఐలయ్య ఫైర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా హరిస్తున్నాయని నటుడు ప్రకాశ్రాజ్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియాటుడే సౌత్ కంక్లేవ్-18లో వారు మాట్లాడారు. ఎస్ దుర్గా, పద్మావతి సినిమాలపై జరుగుతోన్న దాడిని ఖండించారు. నటుడు విశాల్, ‘ఎస్ దుర్గ’ దర్శకుడు శశిధరన్లు కూడా చర్చలో భాగస్వాములుగా ఉన్నారు. కంచె ఐలయ్య ఏమన్నారంటే.. ‘‘బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగిందంటే దళితుల ఓట్లు కూడా కారణమని చెప్పుకుంటారు. అయితే, నిజానికి ప్రజాస్వామ్య భావన కేవలం ఓట్లతో ముడిపడిన అంశమేకాదు! అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏ కూలీన వర్గాలైతే ఓట్లు వేశాయో వారిని ప్రభుత్వాలు ఇంకా అణిచివేతకు గురిచేస్తుండటం గర్హనీయం. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా దళిత, పేద వర్గాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటం దేనికి సంకేతమో ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్పై చూపించిన శ్రద్ధ.. ‘దళితులకు అర్చకత్వ హక్కు’ విషయంలో చూపించడంలేదు. వారు మతరాజకీయాలు చేస్తున్నారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే’’ అని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేకిని కాను.. మోదీ వ్యతిరేకిని : ప్రకాశ్ రాజ్ ‘‘నా స్నేహితురాలు గౌరీ లంకేశ్ను చంపేసిన తర్వాత కొంత మంది సంబరాలు చేసుకున్నారు. వారంతా మోదీ ఆరాధకులని తెలిసింది. నేను బీజేపీకి ఓటు వేశానా లేదా అన్నది అనవసరం. మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నది నిజం. మరి దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరెందుకు? ఆయన గురించి ఏదైనా మాట్లాడితే ‘నువ్వు హిందూ వ్యతిరేకివి’ అని విమర్శిస్తారు. నిజానికి నేను హిందూ వ్యతిరేకిని కాను. మోదీ వ్యతిరేకిని. అమిత్ షా వ్యతిరేకిని. అనంతకుమార్ హెగ్డేకి వ్యతిరేకిని. ఆ బీజేపీ ఎంపీ హెగ్డే ఏమన్నారు? రాజ్యాంగాన్ని మార్చేస్తారా! ఆయనను ప్రశ్నిస్తూ నేను ప్రెస్మీట్ పెడితే.. వాళ్లు బీఫ్ గురించి మాట్లాడతారు. అరే! ఒక విధానమంటూ ఉండదా ఆ పార్టీకి! పద్మావతి సినిమా విషయంలో జరుగుతున్నదేంటి? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేనప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉండి మాత్రం ఏం లాభం? వెంటనే దిగిపోతే ప్రజలకు మంచిది’’ అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ‘సెక్సీ దుర్గా’కు మతంతో సంబంధంలేదు: శశిధరన్ తాను రూపొందించిన ‘సెక్సీ దుర్గా’ సినిమాకు మతాలకు అసలు సంబంధమేలేదన్నారు దర్శకుడు శశిధరన్. ఇతర మతాల కంటే హిందూత్వని విమర్శిస్తూ లేదా వ్యతిరేకిస్తూ వ్యక్తీకరణలు ఎక్కువైపోయాయన్న ప్రయోక్త ప్రశ్నకు దర్శకుడు ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఒక మతాన్ని చులకనగా తీసుకుంటారనే ప్రశ్న.. క్యూరియాసిటీ(జిజ్ఞాస) నుంచి కాకుండా డివిజనిజం(వేర్పాటుభావన) నుంచి పుడుతుంది. ఇది నిర్మాణాత్మకమైన ప్రశ్నకాదు’ అని శశిధరన్ అన్నారు. న్యాయస్థానాలే దిక్కు : విశాల్ ‘‘పద్మావతి సినిమా విషయంలో సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చింది. వ్యక్తులు, సంస్థలు సృష్టించే వివాదాలు పరిష్కారం కావాలంటే సినిమావాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. అక్కడైతే న్యాయం దొరుకుతుంది’’ అని విశాల్ అన్నారు. -
తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు
-
హైదరాబాద్పై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కంటే తాము ఎంతో ముందున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(కేసీఆర్) అన్నారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న ‘సౌత్ కన్క్లేవ్ 2018’ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రాకు పోలికే లేదని.. తమది ఆర్థికంగా మిగులు రాష్ట్రమని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల్లో రెండు రాష్ట్రాల మధ్య తేడాలున్నాయన్నారు. అన్నిరంగాల్లో తమ రాష్ట్రం ముందుందని.. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తామే నంబర్వన్ అని చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో గుజరాత్ కంటే తెలంగాణ ఏమాత్రం తక్కువ కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలుండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దేశ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు తమ రాష్ట్రం చిన్నది కాదని.. భౌగోళికంగా బిహార్, బెంగాల్ కంటే పెద్ద రాష్ట్రమని వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే 16 రంగాల్లో తెలంగాణ ముందుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తాము చెప్పినట్టుగా త్వరలోనే దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని దీమా వ్యక్తం చేశారు. అద్భుతాలు చేస్తున్నాం నీటిపారుదల రంగంలో అద్భుతాలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్మోడల్గా ఉండబోతోందన్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం 4 లక్షల నుంచి 23 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని వివరించారు. అలా చేస్తే స్వాగతిస్తాం హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేస్తే స్వాగతిస్తామని కేసీఆర్ అన్నారు. భాగ్యనగరం భారతదేశ సంస్కృతికి అద్దం పట్టే నగరమని వ్యాఖ్యానించారు. మద్రాసు కన్నా ముందు హైదరాబాద్లో విమాన, రైల్వే వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్లో చెరువులు, పార్కులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఎన్నో అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్థిక వెనుకబాటే ప్రాతిపదిక రిజర్వేషన్లు రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక వెనుకబాటుతనమే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉండాలని, 50 శాతం రిజర్వేషన్లు ఏమాత్రం సరిపోవని అన్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగానే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రమే నా ఫ్యామిలీ ప్రగతిభవన్ తెలంగాణ సీఎం అధికారం నివాసమని, అందులో కేసీఆర్ ఒక్కరే ఉండరని చెప్పారు. తన తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు అందులో ఉంటారని వెల్లడించారు. కొత్త సచివాలయం కట్టడంలో తప్పేమీ లేదన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తన పిల్లలు గెలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రమే తన కుటుంబంగా ఆయన వర్ణించారు. ఒంటరిగా పోటీ 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తాము ఎవరితోనూ కలవబోమని, ఎవరైనా తమతోనే కలవాలని అన్నారు. -
అనుబంధాలతోనే సార్థకత
సహనటులతో ప్రేమలో పడిందంటూ చాలాసార్లు వార్తలు వచ్చినా దీపికా పదుకొణే బహిరంగంగా ఎప్పుడూ వాటిపై పెదవి విప్పలేదు. ప్రేమ సంబంధాలపై తన అభిప్రాయాన్ని మాత్రం వివరించింది. ఎవరితోనైనా అనుబంధం పెంచుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని, మనసు చెప్పినట్టే నడుచుకోవడం తన పద్ధతని తెలిపింది. ‘సినిమాలు ఎంచుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తాను. మన సుకు నచ్చిన ప్రాజెక్టుపైనే సంతకం చేస్తాను. విజయానికి ఇది ఉత్తమ మార్గం అని నేను అనుకుంటాను. మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉండాలి. ఇతరులకు అనుగుణంగా మనల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల కోసం బతికేవాళ్లలో నిజాయితీ ఉంటుందని అనుకోను. స్క్రిప్టుల ఎంపిక కోసం ప్రత్యేక విధానమంటూ నాకు లేదు. ఇక ఎవరితోనైనా అనుబంధం పెంచుకోవడం చాలా ముఖ్యం. నాలాగే ఇతర మహిళలూ ఆలోచిస్తారని అనిపిస్తుంది. అయితే ఆ అనుబంధం మనోహరంగా ఉండాలి. ప్రేమలో పడ్డ ఇద్దరికీ మేలు చేసేలా ఉండాలి. బాధపెట్టేలా ఉండకూడదు. నేను ఈ రెండు రకాల అనుభవాలను ఎదుర్కొన్నాను’ అని వివరించింది. నగరంలో శుక్రవారం జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ దీపికా పదుకొణే ఈ విషయాలన్నింటినీ వివరించింది. రామ్లీలా కథానాయకుడు రణ్వీర్సింగ్తో ప్రేమాయణం గురించి ప్రస్తావించినప్పుడు స్పందిస్తూ ఇప్పుడు అలాంటి విషయాల జోలికి వెళ్లదల్చుకోలేదని చెప్పింది. ఏ వ్యక్తి గురించి అయినా పూర్తిగా తెలుసుకున్నాకే అతనితో అనుబంధం పెంచుకోవాలన్న విషయాన్ని అనుభవాలతో గ్రహించానని తెలిపింది. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. రణ్బీర్ కపూర్ను గాఢంగా ప్రేమించిన ఈ కన్నడ బ్యూటీ ఏడాది తరువాత అతనికి గుడ్బై చెప్పింది. సహనటులతో సంబంధాలు బెడిసికొట్టినా కెరీర్కు మాత్రం ఇబ్బందులు రాలేదు. కాక్టెయిల్, రేస్ 2, యే జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్ప్రెస్, రామ్లీల వంటి హిట్ సినిమాలు దీపిక ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది కూడా దీపిక నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.