INTERPOL
-
ఇంటర్పోల్ మొట్టమొదటి సిల్వర్ నోటీస్
న్యూఢిల్లీ: సభ్య దేశాలకు రంగుల కోడ్ కలిగిన నోటీసులు జారీ చేసే ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ పోలీస్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్) అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరింది. సరిహద్దులు దాటి వెళ్లే అక్రమ సంపదను గుర్తించేందుకు మొట్టమొదటిసారిగా సిల్వర్ నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భారత్ సహా 54 సభ్య దేశాలు, ప్రాంతాలున్నాయని ఇంటర్ పోల్ శుక్రవారం తెలిపింది. సీనియర్ మాఫియా ముఠా సభ్యుడికి చెందిన ఆస్తుల వివరాలను కనుగొనాలంటూ ఇటలీ చేసిన వినతి మేరకు ఈ నోటీస్ జారీ చేశామంది. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది సభ్య దేశాలకు మాత్రమే తెలుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్ వరకు ఈ నోటీస్ అమల్లో ఉంటుందని వివరించింది. అక్రమాలు, అవినీతి, డ్రగ్స్ రవాణా, పర్యావరణ సంబంధ నేరాలు, ఇతర తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేస్తామని ఇంటర్ పోల్ తెలిపింది. ఈ నోటీసులను అవసరమైతే మొత్తం 196 సభ్య దేశాలకు లేదా ఎంపికైన దేశాలకు పంపవచ్చని పేర్కొంది. ఇటువంటి నేరగాళ్లు సంపాదించిన సొత్తును స్వాధీనం చేసుకోవడం ద్వారా సంస్థాగత నేరాలను అరికట్టేందుకు అక్రమార్కుల నెట్వర్క్ను చేధించవచ్చని వివరించింది. కాగా, ప్రస్తుతం భారత్కు చెందిన కనీసం 10 మంది నేరగాళ్లు ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరు ఎంత మొత్తం నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారనే దానిపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. తాజా పరిణామంతో, మనం కూడా మెహుల్ చోక్సీ తదితర పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేయాలని కోరేందుకు అవకాశం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. ఆ 8 నోటీసులు ఏవంటే.. ఫ్రాన్సులోని లియోన్ నగరం కేంద్రంగా ఇంటర్పోల్ కార్యకలాపాలు సాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్య దేశాల నుంచి అవసరమైన సమాచారం కోసం ఇంటర్పోల్ ప్రస్తుతం 8 రకాల కోడెడ్ నోటీసులను జారీ చేస్తోంది. ఇందులో రెడ్ నోటీస్ను మరో దేశంలో దాక్కున్న పరారైన నేరగాడిని పట్టుకునేందుకు లేదా గుర్తించేందుకు సభ్యదేశం విజ్ఞప్తి మేరకు జారీ చేస్తుంది. యెల్లో నోటీస్ను కనిపించకుండా పోయిన వారిని, ముఖ్యంగా చిన్నారులను వెదికి పట్టుకునేందుకు జారీ చేస్తుంది. ఓ నేర ఘటన దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని లేదా ప్రాంతాన్ని గుర్తించేందుకు బ్లూ నోటీస్ను పంపుతుంది. ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారిన వ్యక్తి, అతడి నేర కార్యకలాపాలపై గ్రీన్ నోటీసును, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన సమాచారం కోసం బ్లాక్ నోటీసును, ఒక ఘటన, వ్యక్తి లేదా వస్తువు, ప్రక్రియ కారణంగా ప్రజల భద్రతకు ప్రమాదమని భావిస్తే ఆరెంజ్ నోటీసును, నేరగాళ్లు ఆవలంభించే వివిధ ఆయుధాలు, లక్ష్యాలు, రహస్య విధానాలకు సంబంధించిన సమాచారంతో పర్పుల్ నోటీసును సభ్య దేశాలకు పంపుతుంది. అంతేకాదు, ఐరాస సర్వప్రతినిధి సభ వివిధ వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా విధించే ఆంక్షలకు సంబంధించిన నోటీసులను సైతం ఇంటర్పోల్ జారీ చేస్తుంది. -
‘బయటి నేరగాళ్ల’కు చెక్ భారత్పోల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు కీలకపాత్ర పోషించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అమెరికాలో ఉన్న ఆయన్ను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించడానికి 8 నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, పోలీసు విభాగాలు అనునిత్యం ఏదో ఒక కేసులో నిందితుల ఆచూకీ కనుగొనడం, వారిని రప్పించే క్రమంలో ఇంటర్పోల్ సాయం కోరుతుంటాయి. ఇంటర్ పోల్గా పిలిచే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారానికి, నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది. అయితే ఏదైనా పోలీసు విభాగం దీన్ని ఆశ్రయించడం అనేది ప్రస్తుతం ఓ సుదీర్ఘ, క్లిష్టతరమైన ప్రక్రియగా ఉంది. దీన్ని సులభతరం చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబీఐ) అధీనంలోని నేషనల్ సెంట్రల్ బ్యూరో (ఎన్సీబీ) ఫర్ ఇంటర్పోల్ ఓ పోర్టల్ను రూపొందించింది. అదే భారత్పోల్. ఈ పోర్టల్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండురోజుల క్రితం ఢిల్లీలో ఆవిష్కరించారు.అనేక కేసుల్లో విదేశీ లింకులుఒకప్పుడు దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో విదేశాలతో లింకు ఉన్నవి అత్యంత అరుదుగా తెరపైకి వచ్చేవి. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు, భారీ ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా తదితర కేసులతో పాటు వ్యవస్థీకృత నేరాల్లో ‘విదేశీ లింకులు’ సర్వసాధార ణం అయ్యా యి. సూత్ర ధారులు విదేశాల్లో ఉండి ఇక్కడ నేరాలు చేయించడమో, ఇక్కడ నేరం చేసిన వారు విదేశాలకు పారిపోవడమో జరుగుతోంది. దీంతో పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు ఇంటర్పోల్ను ఆశ్రయించడం అనివార్యంగా మారుతోంది. 195 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్పోల్ ద్వారానే రెడ్ కార్నర్ సహా వివిధ రకాలైన నోటీసుల జారీ సాధ్యమవుతుంది.అంత ఈజీ కాదు..అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పంజగుట్ట పోలీసుల వ్యయప్రయాసలు ఇంటర్పోల్ వ్యవహారానికి ఓ తాజా ఉదాహరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు వినతి తొలుత వెస్ట్జోన్ డీసీపీ ద్వారా నగర పోలీసు కమిషనర్కు వెళ్లింది. పోలీసు కమిషనర్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సీఐడీకి సిఫారసు చేశారు. అక్కడి నుంచి దేశంలో ఇంటర్పోల్కు నోడల్ ఏజెన్సీగా ఉన్న సీబీఐకి చేరింది. అక్కడి నుంచి ఇంటర్పోల్కు సదరు విజ్ఞప్తి చేరాల్సి ఉండగా.. అనేక వివరణలు, సందేహాలు, సమస్యలు ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆటంకంగా మారాయి. ఈ కారణంగానే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినా, 8 నెలలుగా హైదరాబాద్ పోలీసులు రకరకాలుగా ప్రయ త్నాలు చేస్తున్నా ఇప్పటికీ ప్రభాకర్రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే ప్రయత్నం సఫలం కాలేదు. దేశంలోని అనేక ఏజెన్సీలు, పోలీసు విభాగాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంలో భాగంగానే భారత్పోల్ తెరపైకి వచ్చింది.ఇకపై సులభంగా..ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఏజెన్సీలకు ఇంటర్పోల్తో సంప్రదింపులు సులువు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. వివిధ రకాలైన కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ, అందుకు అవసరమైన పత్రాలు, నమూనాలను ఈ పోర్టల్లో పొందుపరిచారు. అధికారులకు వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలను ఆన్లైన్లో పొందేలా డిజైన్ చేశారు. ఈ పోర్టల్ వినియోగంపై త్వరలో సీబీఐ దేశ వ్యాప్తంగా పోలీసులు, ఏజెన్సీలకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది.భారత్పోల్.. 5 ఉపయోగాలు1 దేశంలోని అన్ని ఏజెన్సీలు, పోలీసు విభాగాలతో పాటు కొన్ని విదేశీ ఏజెన్సీలు సైతం ఈ పోర్టల్ ద్వారాసంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.2 వివిధ వ్యవస్థీకృత నేరాలు,నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇందులో పొందుపరిచారు.3 బ్రాడ్ కాస్ట్ విధానంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాంటెడ్ నేరగాళ్ల వివరాలను తేలిగ్గా ఇచ్చిపుచ్చుకునే ఆస్కారం ఏర్పడింది.4 వ్యవస్థీకృత నేరాలు, నేరగాళ్ల సమా చారం, నేరం చేసే విధానం, ప్రభావం ఉన్న ప్రాంతాలు తదితరాలను తేలిగ్గా గుర్తించేలా ఈ పోర్టల్ రూపొందింది.5 క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం కంటే సమర్థంగా నేరగాళ్ల కదలికలు, వివరాలు తెలుసుకునేందుకు భారత్పోల్ ఉపయోగపడనుంది. -
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్ను కిగాలీ నుంచి భారత్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
హసీనా కోసం ఇంటర్పోల్ సాయం కోరుతాం: బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను భారతదేశం నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్పోల్ సహాయం కోరనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. పలు నేరారోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమెను బంగ్లా రప్పించేందుకు అక్కడి సిద్ధమైంది. 77 ఏళ్ల అవామీ లీగ్ చీఫ్, ఆమె పార్టీ నాయకులు విపక్ష-వ్యతిరేక విద్యార్థుల ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక.. దీని ఫలితంగా జూలై-ఆగస్టులో విద్యర్థుల నిరసనల సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం కాస్త పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారితీయటంతో ఆగస్టు 5న హసీనా రహస్యంగా భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది.మరోవైపు..విద్యార్థుల నిరసనల సందర్భంగా కనీసం 753 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. హసీనా, ఆమె అవామీ లీగ్ నాయకులపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్, ప్రాసిక్యూషన్ బృందానికి అక్టోబర్లో పలు నేరాలు, మారణహోమంపై 60కి పైగా ఫిర్యాదులు దాఖలు అయ్యాయని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.‘‘త్వరలో ఇంటర్పోల్ ద్వారా హసీనాకు రెడ్ నోటీసు జారీ చేయనున్నాం. పారిపోయిన ఫాసిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నప్పటికీ.. తిరిగి బంగ్లాకు తీసుకువచ్చి కోర్టులో నెలబెడతాం’’ అని న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. రెడ్ నోటీసు అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. అప్పగించడం, లొంగిపోవడం లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయాలని చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు పెట్టుకొనే అభ్యర్థన మాత్రమే. ఇక.. ఇంటర్పోల్ సభ్య దేశాలు తమ జాతీయ చట్టాల ప్రకారం రెడ్ నోటీసులను అమలు చేస్తాయని అధికారులు తెలిపారు.చదవండి: రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి! -
త్వరలోనే భారత్కు ‘మహదేవ్ యాప్’ సూత్రధారి
న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్ను త్వరలో భారత్కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్తో ఛత్తీస్గఢ్కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది. -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్పోల్కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్పోల్ వీళ్లిద్దరినీ రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్కు రప్పించడం సులువు అవుతుంది. -
Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్ షా 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్పోల్ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్పోల్ శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్పోల్తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైశ్వాల్ అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అవినీతిపరులు, డ్రగ్ స్మగ్లర్లు, వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏ దేశమూ ఆశ్రయంగా మారకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి స్థావరాలు ఎక్కడున్నా సరే, వాటన్నింటినీ నిర్మూలించాల్సిందేనని పాకిస్తాన్ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇందుకు కలసికట్టుగా కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రపంచం అంతర్జాతీయ సమాజపు సమష్టి బాధ్యత అన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ‘స్థానిక సంక్షేమం కోసం అంతర్జాతీయ సహకారం’ అన్నదే భారత నినాదమన్నారు. ‘‘సానుకూల శక్తులన్నీ పరస్పరం సహకరించుకుంటే దుష్టశక్తులు, నేరగాళ్ల పీచమణచవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఇంటర్పోల్ 90వ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఢిల్లీలో మోదీ ప్రారంభించారు. 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్ తరఫున ఆ దేశ ఫెరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహసిన్ బట్ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇంటర్పోల్ అధ్యక్షుడు అహ్మద్ నాజర్ అల్రైసీ, సెక్రెటరీ జనరల్ ఉర్గన్ స్టాక్ వేదిక వద్ద మోదీకి స్వాగతం పలికారు. సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈ దుష్టశక్తుల వేగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా వాటిని మొత్తం మానవత్వంపై దాడిగానే చూడాలి. ఎందుకంటే ఇవి భావి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ స్థాయి ముప్పులను ఎదుర్కొనేందుకు స్థానిక స్పందనలు సరిపోవు’’ అని స్పష్టం చేశారు. అందుకే వీటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరమన్నారు. సదస్సుకు గుర్తుగా 100 రూపాయల నాణాన్ని, పోస్టల్ స్టాంపును మోదీ విడుదల చేశారు. ఇంటర్పోల్ సదస్సు పాతికేళ్ల తర్వాత భారత్లో జరుగుతోంది. ఉగ్రవాదం తీరు మారింది... పొరుగు దేశాల ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని మోదీ గుర్తు చేశారు. ‘‘ఉగ్రవాద భూతాన్ని మిగతా ప్రపంచం గుర్తించడానికి చాలాకాలం ముందు నుంచే మేం దానితో పోరాడుతూ వస్తున్నాం. భద్రత, రక్షణ కోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ పోరులో వేలాదిమంది వీరులను కోల్పోయాం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదం ఆన్లైన్ బాట కూడా పట్టిందన్న వాస్తవాలను గుర్తించాలన్నారు. ‘‘ఇప్పుడు ఎక్కడో మారుమూల నుంచి ఒక్క బటన్ నొక్కడం ద్వారా భారీ పేలుడు సృష్టించవచ్చు. తద్వారా ఈ దుష్టశక్తులు వ్యవస్థలనే తమ ముందు సాగిలపడేలా చేసుకునే పరిస్థితి నెలకొంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని ఎదుర్కొనడానికి దేశాలు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలవని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పటిష్ట వ్యూహాల ద్వారా సైబర్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఆ దిశగా తక్షణం విధానాలు రూపొందాలని సూచించారు. పోలీసు, చట్టపరమైన సంస్థలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు మార్గాలు కనిపెట్టాలని సూచించారు. ‘‘ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు, రవాణా, కమ్యూనికేషన్ సేవలను కాపాడుకునే యంత్రాంగం, సాంకేతిక, నిఘా సమాచారాల త్వరితగత మార్పిడి తదితరాలను ఆధునీకరించుకోవాలి. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల్లో పౌరుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఇలా దోచిన సొమ్ము అంతిమంతా ఉగ్రవాదానికి పెట్టుబడిగా మారుతోంది. యువత జీవితాలను డ్రగ్స్ సమూలంగా నాశనం చేస్తోంది’’ అని మోదీ అన్నారు. రెడ్ కార్నర్ నోటీసుల్లో వేగం పెరగాలి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు వీలు కల్పించే రెడ్ కార్నర్ నోటీసుల జారీలో వేగం మరింత పెరగాల్సి ఉందని ఇంటర్పోల్కు ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుతం భారత్ తరఫున 780 రెడ్ కార్నర్ నోటీసులున్నాయని గుర్తు చేశారు. వీటిలో 205 పలు నేరాల్లో సీబీఐ జాబితాలో వాంటెడ్గా ఉన్న నేరగాళ్లకు సంబంధించినవని ఆయన చెప్పారు. నేరగాళ్లు ఇంటర్పోల్ సభ్య దేశాల్లో ఎక్కడున్నా అరెస్టు చేసేందుకు, వెనక్కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసు వీలు కల్పిస్తుంది. భారత్ జారీ చేసిన నోటీసుల్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహాయకుడు చోటా షకీల్, ఉగ్రవాదులు మసూద్ అజర్, హఫీజ్ సయీద్తో పాటు ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులున్నారు. రెడ్ కార్నర్ నోటీస్ అంతర్జాతీయ అరెస్టు వారెంటు కాదని, నేరగాళ్లను అరెస్టు చేసి తీరాలంటూ సభ్య దేశాలను ఇంటర్పోల్ ఒత్తిడి చేయలేదని సంస్థ ప్రధాన కార్యదర్శి ఉర్గన్ సోమవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. దావూద్పై పాక్ మౌనం అండర్ వరల్డ్ డాన్, భారత్లో విధ్వంసం సృష్టించి పరారీలో ఉన్న ఇతర ఉగ్రవాదుల ఉనికిపై పాక్ మరోసారి మౌనం వహించింది. దావూద్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఎక్కడున్నారన్న మీడియా ప్రశ్నకు ఇంటర్పోల్ సదస్సులో పాల్గొంటున్న పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) చీఫ్ మొహసిన్ బట్ బదులివ్వలేదు. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆయన సరిగ్గా సదస్సు మొదలయ్యే సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చారు. అయినా మోదీ ప్రసంగం పూర్తవగానే మీడియా అంతా బట్ను చుట్టుముట్టి ప్రశ్నలు కురిపించింది. వాటికి బదులివ్వకుండానే ఆయన వెళ్లిపోయారు. -
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్లు భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు. వీరిద్దరు పాకిస్థాన్లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్కు ఎదురైంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను భారత్కు అప్పగిస్తారా? అని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రతినిధి భట్ను అడిగారు. అయితే ఆయన మాత్రం సమాధానాన్ని దాటవేశారు. ఈ విషయం స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కమాట కూడా మాట్లాడుకుండా మౌనం వహించారు. ఢిల్లీలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఇంటర్పోల్ అసెంబ్లీ సమావేశానికి 195 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాల మంత్రులు, సెక్యూరిటీ ఉన్నతాధికారులు వచ్చారు. పాక్ నుంచి ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డెరక్టర్ జనరల్ మోహ్సిన్ భట్తో పాటు మరో అధికారి వచ్చారు. #WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1 — ANI (@ANI) October 18, 2022 ఇంటర్పోల్ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 1997లో భారత్లో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
‘పంచ్’ ప్రభాకర్ అరెస్ట్కు అమెరికా సాయం కోరిన భారత్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇద్దరి ఆచూకీ కనుగొనేందుకు అమెరికా అధికారుల సాయం కోరినట్లు సీబీఐ తెలిపింది. పంచ్ ప్రభాకర్గా పేరున్న సి.ప్రభాకర్ రెడ్డి, మణి అన్నపురెడ్డి అనే వారు అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం ఉందని గురువారం సీబీఐ తెలిపింది. వీరిపై దేశంలో కోర్టులు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇంటర్పోల్ సాయంతో అమెరికాలో వారుంటున్న ప్రాంతాన్ని గుర్తించి, వారిపై జారీ అయిన అరెస్ట్ వారెంట్ల వివరాలను అమెరికా అధికారులకు అందజేసినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో అక్టోబర్ 22వ తేదీన అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు సీబీఐ వెల్లడించింది. అంతకుముందు, ఇదే కేసులో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారిపై వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. మరో వ్యక్తిపై విచారణ కొనసాగుతోందని, అతడి యూట్యూబ్ చానెల్ను మూసివేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ 16 మంది నిందితులపై నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 2020 నవంబర్ 11న కేసు నమో దు చేసినట్లు సీబీఐ తెలిపింది. అనంతరం సామాజిక మాధ్యమాల్లో జడ్జీలు, న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్న పలు అభ్యం తరకర పోస్టులను తొలగించామని తెలిపింది. -
డ్రగ్స్ కేసు: సెలబ్రిటీల ఇంట్లో సోదాలు చేసే అవకాశం?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేసిన ఈడీ తాజాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారంగా ఈసీఐఆర్ను నమోదు చేసింది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే 'ఫెమా' కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ.. కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చదవండి : Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు Tollywood Drugs Case 2021: డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి -
Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. కాగా, ఇప్పటికే ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ ల నుంచి వాగ్మూలాన్ని సేకరించారు. అదేవిధంగా, 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. కాగా, దీనిపై విచారించిన అనంతరం మరికొంత మందికి నోటిసులను జారీచేసే అవకాశం ఉంది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఇంటర్పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. తాజాగా మరికొంత హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు చదవండి: విషాదం: లోయలో పడ్డ కారు.. నవ వధువు, తండ్రి మృతి -
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన వాస్తవాలు
-
కేరళ గోల్డ్ స్కామ్: కీలక విషయాలు వెలుగులోకి
తిరువనంతపురం: కేరళలో వెలుగు చూసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. హవాలా రూపంలో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా దాదాపు 180 కేజీల బంగారం అక్రమ రవాణా జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 13 సార్లు విమానాల ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు భావిస్తున్నారు. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన కేసులో సరిత్, స్వప్న సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ నిందితులుగా గుర్తించింది. ఈ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ ఇప్పటికే కస్టడీలోకి తీసుకుంది. చదవండి: కేరళ గోల్డ్ స్కామ్కు హైదరాబాద్కు లింకు? దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి వీరివురిని శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దర్యాప్తులో భాగంగా స్వప్నా సురేష్, సరిత్లను వారి ఇళ్లకు, కార్యాలయాలకు కూడా తీసుకెళ్లారు. కీలక నిందితడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫాజిల్ ఫరీద్ కోసం బ్లూ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోరింది. కేసులో మరో నిందితుడైన సరిత్ని కూడా తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కస్టమ్స్ శాఖను కోరారు. కాగా బంగారం స్మగ్లింగ్ ద్వారా వఛ్చిన సొమ్మును హవాలా మార్గాల ద్వారా దుబాయ్కి తరలించారని.. ఈ వ్యవహారమంతా ఫాజిల్ ఫరీద్ అధ్వర్యంలో జరిగిందని అనుమానిస్తున్నారు. చదవండి: గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ఎన్ఐఏ కస్టడీకి కీలక నిందితులు కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్కు చెందిన పార్మిల్లో 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్నా సురేష్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్నా సురేష్తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ గోల్డ్ స్మగ్లింగ్ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని, త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది -
ట్రంప్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్
టెహ్రన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్ ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్పోల్ సహకారాన్ని అభ్యర్ధించింది. డ్రోన్ దాడిలో ఇరాన్ సైనికాధికారిని చంపినందుకు ట్రంప్తో పాటు పదుల సంఖ్యలో ఇతరులను నిర్బంధంలోకి తీసుకుంటామని ఇరాన్ ప్రకటించిందని ఓ స్ధానిక ప్రాసిక్యూటర్ సోమవారం వెల్లడించినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఇరాన్ చర్యతో ట్రంప్నకు అరెస్ట్ ప్రమాదం ముంచుకురాకున్నా ఇరాన్, అమెరికాల మధ్య ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. కాగా, బాగ్దాద్లో ఈ ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన ఘటనలో ట్రంప్తో పాటు 30 మందికి పైగా ఇతరులపై హత్య, ఉగ్రవాద అభియోగాలున్నాయని ప్రాసిక్యూటర్ అలీ అల్ఖాసిమెర్ పేర్కొన్నట్టు ఐఎస్ఎన్ఏ వార్తాసంస్థ వెల్లడించింది. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ఆయన ప్రాసిక్యూషన్ను ఇరాన్ కొనసాగిస్తుందని ఆయన పేర్కొంది. కాగా ఈ ఉదంతంపై ఇంటర్పోల్ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. చదవండి : విగ్రహాల ధ్వంసం : ట్రంప్ కీలక నిర్ణయం చదవండి : హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ! -
నిత్యానందకు నోటీసులపై వింత జవాబు
బెంగళూరు: దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి కర్ణాటక పోలీసులు హైకోర్టుకు వింత సమాధానం ఇచ్చారు. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానానికి విన్నవించారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు. (నిత్యానందపై ఇంటర్పోల్ నోటీస్) ఇదిలా ఉండగా... బాలికలను అపహరించడం సహా వారిని లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో ‘కైలాస’ అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు ప్రకటనలు విడుదల చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. (ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద) ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు. కాగా నిత్యానంద తరఫున కోర్టుకు హాజరైన కుమారి అర్చానంద.. నిత్యానంద ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని.. ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు తనను ఇక్కడి తీసుకువచ్చారంటూ న్యాయస్థానం ఎదుట వాపోయింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కేసుల్లో నిందితుడైన నిత్యానందపై ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక టూర్లో ఉన్నారని పోలీసులు చెప్పడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ నిత్యానంద కథేంటి? -
నిత్యానందకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆచూకీ కనుక్కోవాలని ఇంటర్పోల్ ప్రపంచ దేశాలను కోరింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్మాతికవేత్త నిత్యానంద గత ఏడాది విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ ఉంటే తెలపాలని భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బుధవారం ఇంటర్పోల్ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలుచోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. లైంగిక, అత్యాచార ఆరోపణల్లో ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. (నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి) గుజరాత్, కర్ణాటక పోలీసుల వాంటెడ్ లిస్టులో నిత్యానంద ఉన్నారు. చిన్న పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమంలో బంధించి.. లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైన కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్లో కైలాసాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ఓ వీడియోలో నిత్యానంద బహిరంగ ప్రకటన విడుదల చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఆయనను ఈక్వెడార్లో లేరని, హైతీకి పారిపోయినట్లు ఈక్వెడార్ ఎంబసీ స్పష్టం చేసింది. ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద పేరుపెట్టినట్టు కూడా వార్తలు బలంగా వినిపించాయి. (నిత్యానంద మరో అకృత్యం) -
నీరవ్కు మరో దెబ్బ, నేహాల్పై రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఇప్పటికే నీరవ్ సోదరి పూర్వి మోదీ మెహతాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగా తాజాగా సోదరుడు నేహాల్ దీపక్ మోదీ(40) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ నోటీసు జారీ చేసింది. నీరవ్ విదేశాలకు పారిపోవడంలో నేహాల్ పాత్రకీలకమైందని ఆరోపిస్తూ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఈడీ ఇటీవల ఇంటర్ పోల్ను అభ్యర్థించింది.మనీలాండరింగ్, సాక్ష్యాలను నాశనం చేసేందుకు, నేహాల్ ఉద్దేశపూర్వకంగా సహాయపడ్డాడని ఈడీ ఆరోపించింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్బ్యాంకులో ఎల్ఓయుల ద్వారా రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికే నీరవ్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు ఆస్తులను ఎటాచ్ చేశాయి. అటు నీరవ్ పాస్పోర్ట్ను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. అతనిని తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆమెకు ఉగ్రసంస్థలతో సంబంధం ఉండొచ్చు’
తిరువనంతపురం : కేరళ వచ్చిన ఓ జర్మన్ దేశస్థురాలు నాలుగు నెలలుగా కనిపించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సదరు మహిళకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్లు ఇంటర్పోల్ భావిస్తోంది. ఈ క్రమంలో సాధ్యమైనంత తొందరగా ఆమె ఆచూకీ కనుక్కోవాలంటూ కేరళ పోలీసుల మీద ఒత్తిడి తెస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు.. జర్మనీకి చెందిన లీసా వైసే(31) అనే మహిళ ఈ ఏడాది మార్చి 7న యూకేకు చెందిన అలీ మహ్మద్ అనే వ్యక్తితో కలిసి తిరువనంతపురం వచ్చింది. వల్లికావు, కొల్లంలో ఉన్న మాతా అమృతానందమయి మఠాన్ని దర్శించడానికి ఇండియా వచ్చినట్లు లీసా తన ఎంబార్కేషన్ ఫామ్లో పేర్కొంది. 2011లో కూడా లీసా ఈ మఠాన్ని సందర్శించడానికి వచ్చిందని.. 2 నెలల పాటు ఇండియాలోనే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 7న తిరువనంతపురం వచ్చిన లీసా.. అదే నెల 10వ తేదీ వరకూ తన కుటుంబ సభ్యులతో కాంటాక్ట్లో ఉంది. ఆ తర్వాత లీసా నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడమే కాక గూగుల్ అకౌంట్స్ కూడా డిలీట్ చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో లీసా తల్లి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 11 రోజుల పాటు లీసా గురించి వెతికినప్పటికి ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదంటున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మాతా అమృతానందమయి మఠానికి వెళ్లి విచారించగా లీసా, మహ్మద్ అనే వ్యక్తులు తమ ఆశ్రమానికి రాలేదని వారు తెలిపారు. లీసా వీసా గడువు ఏప్రిల్ 5తో ముగిసింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి లీసా గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. దాంతో కేరళ పోలీసులు లీసా ఫోటో, వివరాలను ఇతర రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు పంపడమే కాక లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక ఈ కేసు విషయంలో ఇంటర్పోల్ సాయం కూడా కోరారు. అయితే లీసాకు ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఇంటర్పోల్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి కేరళ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘లీసా, మహ్మద్ కోవలంలోని ఓ హోటల్లో దిగారని, వర్కాల వెళ్లారని మా దర్యాప్తులో తెలీంది. అయితే లీసా, మహ్మద్లు ఇద్దరు.. విదేశీయులు ఇండియాలోని హోటల్లోలో కానీ ఇళ్లలో కానీ నివాసం ఉండటానికి అవసరమైన అతి ముఖ్యమైన ఫామ్ సీని నింపలేదు. లీసాతో పాటు వచ్చిన మహ్మద్ మార్చి 15న యూకే వెళ్లినట్లు తెలిసింది. కానీ లీసా మాత్రం ఇప్పటి వరకూ ఇండియాను విడిచి వెళ్లలేదు. మా అనుమానం ప్రకారం లీసా మత సంస్థలు నడుపుతున్న హస్టల్లో లేదా.. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో ఉండి ఉండవచ్చు’ అని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఎవరీ లీసా.. జర్మన్ దేశస్థురాలైన లీసా యూదు మతస్తురాలు. అయితె 2012లో ఆమె ఇస్లాంలోకి మారారు. అప్పటి నుంచి ఆమె ఈజిప్ట్లోని ఓ ఎన్జీవీతో కలిసి పని చేస్తుంది. కొద్దికాలానికి లీసా అమెరికాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ హషీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కానీ 2016లో లీసా, తన భర్త నుంచి విడిపోయింది. -
ఇంటర్పోల్తో చేతులు కలిపిన ఐసీసీ
దుబాయ్: గత కొంతకాలంగా క్రికెట్ను ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నిరోధించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎన్ని రకాల చర్యలు తీసుకుం టున్నప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు. దీంతో ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ంగ్ను తరిమికొట్టేందుకు ఇంటర్ పోల్తో కలసి పనిచేయనుంది. ఈ మేరకు గత వారం ఫ్రాన్స్లోని లియోన్లో ఉన్న ఇంటర్పోల్ అధికారులతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ సమావేశమై చర్చించినట్లు ఐసీసీ ఓ లేఖలో వెల్లడించింది. ‘ప్రపంచ వ్యాప్తంగా నేరాల నియంత్రణకు కృషి చేసే సంస్థ ఇంటర్పోల్. దీనికి 194 దేశాలతో అనుబంధం ఉంది. అలాంటి సంస్థతో కలసి పనిచేయాలని ఐసీసీ నిర్ణయించింది. దీనివల్ల క్రికెట్ వ్యవహారాల్లో అవినీతి, ఫిక్స్ంగ్ జాఢ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు వీలవుతుంది’అని ఆ లేఖలో పేర్కొంది. కాగా, దీనిపై ఇంటర్పోల్ క్రిమినల్ నెట్వర్క్ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోస్ డి గ్రేసియా మాట్లాడుతూ క్రికెట్లో అవినీతి, ఫిక్సింగ్ వ్యవహారాల నియంత్రణకు ఐసీసీతో కలసి పనిచేయనున్నం దుకు సంతోషం వ్యక్తం చేశారు. -
చోక్సీపై రెడ్కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్పోల్
సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,000 కోట్ల పీఎన్బీ బ్యాంకు స్కామ్ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు మెహుల్ చోక్సీపై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు జారీ చేసింది. సీబీఐ అభ్యర్ధనపై ఇంటర్పోల్ చోక్సీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులను మోసగించిన కేసులో చోక్సీపై దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీలు ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీస్ జారీ చేయడంతో అమెరికా అధికారులు చోక్సీని గుర్తించి అతడి సమాచారాన్ని భారత్కు చేరవేయనున్నారు. బ్యాంకు స్కామ్ వెలుగుచూసినప్పటి నుంచి అమెరికాలో వైద్య చికిత్సల కోసం వెళ్లిన చోక్సీ తిరిగి భారత్కు చేరుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చోక్సీ కదలికలను పసిగట్టి ఆయనను దేశం విడిచివెళ్లకుండా అమెరికా అధికారులు జల్లెడపట్టనున్నారు. కాగా చోక్సీ ప్రస్తుతం తన స్టేట్మెంట్ను రికార్డు చేసే పరిస్ధితిలో లేరని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితేనే భారత్కు తిరిగివస్తారని ఆయన న్యాయవాది గత నెలలో పేర్కొఆన్నరు. నకిలీ గ్యారంటీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల మేర టోకరా వేసిన చోక్సీ, ఆయన మేనల్లుడు జ్యూవెలర్ నీరవ్ మోదీ కోసం దర్యాప్తు సంస్ధలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇంటర్పోల్ కొత్త అధ్యక్షుడిగా కిమ్ యాంగ్
దుబాయ్: అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్కు నూతన అధ్యక్షుడు నియమితులయ్యారు. యూఏఈలోని దుబాయ్లో బుధవారం జరిగిన వార్షిక సమావేశంలో దక్షిణకొరియాకు చెందిన కిమ్ జాంగ్ యాంగ్(57)ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్పోల్ తెలిపింది. ఈ పదవిలో యాంగ్ 2020 వరకూ కొనసాగుతారు. ఇప్పటివరకూ ఇంటర్పోల్ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్ హాంగ్వే సెప్టెంబర్లో అదృశ్యం కావడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. చైనా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లంచం ఆరోపణలపై బీజింగ్లో విమానం దిగగానే ఆ దేశ అధికారులు మెంగ్ హాంగ్వేను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రష్యా అభ్యర్థి, ఇంటర్పోల్ ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్ ప్రోకోప్చుక్ అభ్యర్థిత్వాన్ని అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు వ్యతిరేకించాయి. -
చైనా చీకటి కోణం
బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన నేరగాళ్లను, హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నవారిని ఇంటర్పోల్ అనే అంతర్జాతీయ పోలీసు సంస్థ ఏ మూలనున్నా పట్టి బంధిస్తుం దని అందరూ నమ్ముతుంటారు. అది రెడ్కార్నర్ నోటీసు జారీ చేసిందంటే ఆ నేరగాళ్ల పని అయి పోయినట్టేనని విశ్వసిస్తుంటారు. కానీ ఈమధ్య ఉన్నట్టుండి మాయమై ఆచూకీ లేకుండా పోయిన ఇంటర్పోల్ చీఫ్ మెంగ్ హాంగ్వీ సంగతి తెలియక ఆ సంస్థ ఉన్నతాధికారులే అయోమయంలో పడ్డారు. ఆయన ఆచూకీ తెలుసుకోవడానికే దాదాపు రెండు వారాలు పట్టింది. ఇంకా విచిత్ర మేమంటే... ఆయన ఆచూకీ, ఇంటర్పోల్ చీఫ్ పదవికి ఆయన రాజీనామా ఒకేసారి వచ్చాయి. రాజీనామాను అంగీకరించి ఆయన స్థానంలో వేరే చీఫ్ను నియమించుకోవడం తప్ప ఇంటర్పోల్ చేసిందేమీ లేదు. ఇంటర్పోల్కు ఈ దుస్థితి కల్పించింది చైనా ప్రభుత్వమే. అంతర్జాతీయంగా అన్ని చోట్లా తన సత్తా చాటాలని, తిరుగులేని శక్తిగా ఎదగాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. దానికి తగినట్టు ఆర్థికంగా అది శరవేగంతో ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి సంస్థలన్నిటిలోనూ తన ముద్ర కనబడా లని, నాయకత్వ పగ్గాలు తనకూ రావాలని ఒకప్పుడు చైనా కోరుకునేది. కానీ పశ్చిమ దేశాలు అందుకు అవకాశమిచ్చేవి కాదు. 80వ దశకంలో డెంగ్ ఆర్థిక సంస్కరణలకు తెరతీశాక, పశ్చిమ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు మొదలయ్యాక పరిస్థితులు క్రమేపీ మారుతూ వచ్చాయి. ఐక్య రాజ్యసమితి సంస్థల్లోనూ, అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకుల్లోనూ, అంతర్జాతీయ న్యాయస్థానా ల్లోనూ ఆ దేశానికి కూడా చోటు దొరుకుతోంది. ఇప్పుడు కొన్ని రోజులు మాయమై అందరినీ కంగారు పెట్టిన ఇంటర్పోల్ చీఫ్ మెంగ్ హాంగ్వీ చైనీయుడే. రెండేళ్లక్రితం ఇంటర్పోల్కు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చైనా మీడియా ఎంతో సంబరపడింది. దీన్ని చైనా న్యాయవ్యవస్థకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించింది. ఇంతలోనే ఏమైందో చైనా ప్రభుత్వం ఆయనపై కన్నెర్రజేసింది. ఆయన్ను లంచం కేసులో అరెస్టు చేశామని చెబుతోంది. హాంగ్వీ ఉన్నతస్థాయి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. చైనా ఇంటర్పోల్ చీఫ్గా, ప్రభుత్వంలో ఉప మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సర్కారు ఎంపిక చేసి పంపితేనే ఇంటర్పోల్ చీఫ్ అయ్యారు. ఆయన అవినీతి ఇన్నాళ్లకు తెలిసింది కాబట్టే ఇప్పుడు చర్య తీసుకున్నామని చైనా ప్రభుత్వం వాదించవచ్చు. అది నిజమేననుకున్నా ఆయన్ను అరెస్టు చేసే విధానం ఇలాగేనా? ఆరోపణలొచ్చి నప్పుడు, వాటికి అవసరమైన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే దానిపై ఇంటర్పోల్కు వర్తమానం అందించాలి. చట్టప్రకారం ఆయన్ను రప్పించడానికి చర్యలు తీసుకోవాలి. ఇవేమీ లేకుండా, ఆయన స్వస్థలానికి వచ్చాక బంధించడం, ఆ సంగతిని కూడా దాదాపు రెండువారాలు దాచి పెట్టి ఉంచడం ఏ రకంగా సమర్థనీయమో ఆ ప్రభుత్వమే చెప్పాలి. తమ ప్రమాణాల ప్రకారం అరెస్టులు ఇలాగే ఉంటాయని చైనా వాదించవచ్చుగానీ ఈ తంతును ఎవరైనా అపహరణనే పిలుస్తారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక వ్యక్తిని ఇలా మాయం చేసిన తీరు చూశాక అసలు ఆ ఆరోపణలే పెద్ద బోగస్ అని భావిస్తారు. అందలం ఎక్కబోయే నేతలకూ లేదా అధికారంలో ఉన్నవారికి పెద్ద బెడదగా మారొచ్చునని సంశయం వస్తే అలాంటివారిని అవినీతి కేసులో, లంచం కేసులో ఇరికించి జైలుకు పంపడం చైనాలో రివాజు. మెంగ్ ఏ కోవలోకి వస్తారో చూడాల్సి ఉంది. అసలు ఆయన మాయమైన తీరు, అది వెల్లడైన తీరు ఆశ్చర్యం కలి గిస్తుంది. గత నెల 25న చైనా చేరుకున్నాక ఆయన ఫోన్ స్విచాఫ్ రావడంతో భార్య కంగారు పడుతుండగా, ఉన్నట్టుండి ఆ ఫోన్ నుంచి బాకు బొమ్మ ఈమోజీ రావడం ఆ భయాన్ని మరింత పెంచింది. కనీసం తనను పోలీసులు పట్టుకున్నారని సందేశం పంపే అవకాశం కూడా ఆయనకు లేదన్నమాట! ఒక్క మెంగ్ విషయంలో మాత్రమే కాదు... హాలీవుడ్ చిత్రాల్లో నటించే చైనా సినీ తార ఫాన్ బింగ్బింగ్ను కూడా ఇదే విధంగా చైనా ఈ తరహాలోనే మాయం చేసింది. ఐరన్మాన్ 3, ఎక్స్–మెన్, లాస్ట్ ఇన్ బీజింగ్ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొంది భారీ పారితోషికాన్ని తీసుకునే నటి ఫాన్. ఆమె ఆచూకీ మూడు నెలలపాటు తెలియలేదు. ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి ఇలా మాయం కావడంలో మర్మమేమిటో ఎవరికీ బోధపడలేదు. హఠాత్తుగా ఈ నెల 3న ఆమె పేరిట ఒక ప్రకటన విడుదలైంది. భారీ మొత్తంలో పన్ను ఎగ్గొట్టి పెద్ద తప్పు చేశానని, సమాజం తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేశానని ఆ ప్రకటనలో ఆమె పశ్చాత్తాప పడింది. ఆమెతో పోలిస్తే మెంగ్ అదృష్టవంతుడు. ఇంటర్పోల్ చీఫ్ కనుక రెండు వారాలకే ఆచూకీ తెలిసింది! కానీ ఇద్దరి విషయంలోనూ వారి పేరిట వెలువడిన ప్రకటనలే ఇప్పటికీ ఆధారం. ఇంటర్పోల్ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థేమీ కాదు. పుట్టి 104 ఏళ్లవుతున్నా దానికి తగినన్ని నిధులు, అవసరమైనంత సిబ్బంది ఎప్పుడూ లేరు. 192 సభ్య దేశాల్లో ఏ దేశమైనా ఫలానా వ్యక్తిపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేయమని కోరితే ఆ పని చేయడం, అంతర్జాతీయ నేరస్త ముఠాల ఆచూకీ అడిగితే సభ్యదేశాల్లోని పోలీసు విభాగాలన్నిటికీ ఆ వినతిని పంపి, స్పందన రాబట్టడం దాని పని. అలా చేయడం వల్ల అప్పుడప్పుడు నేరగాళ్లు పట్టుబడుతున్న సందర్భా లున్నాయి. అయితే అధికారంలో ఉన్నవారి ఆగడాలను ప్రశ్నించినవారిని ఆయా దేశాలు నేరస్తు లుగా చిత్రించి ఆచూకీ కోసం అడుగుతుంటే, అది ముందూ వెనకా చూడకుండా పాటిస్తుదన్న విమర్శలున్నాయి. రష్యా, చైనాలు ఇలాంటి పనుల్లో ఆరితేరాయి. ఆ దేశాలనుంచి అందే వినతుల విషయంలో జాగ్రత్తలు పాటించి, హేతుబద్ధంగా వ్యవహరించాలని అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఇంటర్పోల్పై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఈలోగా ఏకంగా ఆ సంస్థ చీఫ్నే అత్యంత అనాగరి కంగా, తలబిరుసుగా అపహరించి చైనా తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఈ ఉదంతం చైనా చీకటి కోణాన్ని వెల్లడించింది. -
ఇంటర్పోల్ చీఫ్ రాజీనామా.. తెరవెనుక డ్రాగాన్!
బీజింగ్ : అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాంగ్వే అనూహ్యంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన నుంచి రాజీనామా లేఖ అందినట్లు ఇంటర్పోల్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన స్థానంలో దక్షిణ కొరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కీమ్ జోంగ్ యాంగ్ ఇంటర్పోల్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. చైనా ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ఇంటర్పోల్ అధ్యక్షుడు కాకముందు చైనా ప్రజా భద్రత ఉప మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ నుంచి స్వదేశం చైనాకు తిరిగి వెళ్తున్న హాంగ్వే అదృశ్యమైయ్యారు. అవినీతిపై యుద్ధం పేరుతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలువురు రాజకీయ నేతలు, అధికారులను అరెస్ట్ చేయిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మెంగ్ హాంగ్వేను అధికారులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2016లో ఇంటర్పోల్ చీఫ్గా ఎన్నికైన హాంగ్వే ఆ పదవిలో 2020 వరకూ కొనసాగుతారు. కాగా హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారని, ఆయన క్షేమంగానే ఉన్నారని చైనా అధికారులు ధ్రువీకరించారు. కానీ రాజీనామా తప్ప హాంగ్వేకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు చైనా నిరాకరిస్తోంది. -
మాల్యా బాటలోనే మెహుల్ చోక్సీ..
న్యూఢిల్లీ : లండన్ కోర్టులో తన అప్పగింత పిటిషన్పై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వినిపించిన వాదనలనే రూ 13,578 కోట్ల పీఎన్బీ స్కాం కేసులో నిందితుడు, ప్రముఖ జ్యూవెలర్ మెహుల్ చోక్సీ ముందుకుతెచ్చారు. భారత్ జైళ్లలో పరిస్థితులు సరిగ్గా ఉండవనే కారణం చూపి ఆయనపై రెడ్కార్నర్ నోటీస్ జారీ చేయాలని సీబీఐ ఇంటర్పోల్ను కోరడాన్ని వ్యతిరేకించారు. భారత్లో జైళ్లు మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉంటాయని, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న మీడియా విచారణ న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఇంటర్పోల్కు దాఖలు చేసిన అప్పీల్లో పేర్కొన్నారు. పీఎన్బీ స్కామ్లో కీలక నిందితుడైన చోక్సీ కరేబియన్ జంట ద్వీవులు అంటిగ్వా, బార్బుడాల్లో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. కేసు చుట్టూ మీడియా హడావిడి అధికంగా ఉండటంతో ఆరోపణల్లో ఉన్న నిజాయితీని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీతో కలిపి ఈ కేసులో తనను పేర్కొంటున్నారని, భారత్లో నిందితులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదని వాపోయారు. తన ఉద్యోగులు, ఫ్రాంచైజీల నుంచి తనకు ప్రాణహాని ఉందని చోక్సీ ఇంటర్పోల్కు మొరపెట్టుకున్నారు. -
మెహుల్ చోక్సి ఇక్కడ లేడు
వాషింగ్టన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సిలు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నారా? అంటూ గల్లిగల్లి వెతుకున్నారు. వారిద్దరిన్నీ పట్టుకోవడానికి ప్రతి ఒక్క దేశం భారత్కు, సాయపడుతోంది. తమ దేశంలో ఏమైనా నక్కి ఉన్నారేమోనని వెతుకులాట చేపట్టిన ఇంటర్ పోల్ వాషింగ్టన్, మెహుల్ చోక్సి తమ దేశంలో లేడంటూ క్లారిటీ ఇచ్చింది. గత బుధవారం భారత్ పంపిన అభ్యర్థనకు ఇంటర్పోల్ వాషింగ్టన్ స్పందించింది. మెహుల్ చోక్సి అమెరికాలో లేడని తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే వెంటనే ఇంటర్పోల్ వాషింగ్టన్కు భారత్ మరో లేఖ పంపింది. చోక్సి ఆచూకీ గురించి ఏమైనా తెలిస్తే తమకు అందజేయాలని కోరింది. కాగ, పారిపోయిన ఆర్థిక నేరస్తుల ఆర్డినెన్స్ 2018 కింద నీరవ్, చోక్సిలకు వ్యతిరేకంగా ఈడీ రెండు దరఖాస్తులను ముంబైలోని మనీ లాండరింగ్ నిరోధక చట్ట స్పెషల్ కోర్టులో జూన్ 11న నమోదు చేసింది. భారత్, యూకే, యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో ఉన్న వారి ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. ఇప్పటివే నీరవ్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ అయి ఉంది. అతనికి వ్యతిరేకంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసింది. నీరవ్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ఇతర దేశాలను భారత్ కోరిందని కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నీరవ్ ఆచూకీ తెలుసుకునేందుకు ఫ్రాన్స్, యూకే, బెల్జియం వంటి యూరోపియన్ దేశాల సహాయం కూడా భారత్ తీసుకుంటోందని పేర్కొంది. -
నీరవ్మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ
-
నీరవ్ మోదీకి షాక్, ఏ క్షణంలోనైనా అరెస్ట్!
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఇంటర్పోల్ షాకిచ్చింది. భారత అభ్యర్థన మేరకు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా ఇంటర్పోల్ రెడ్-కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీతో విదేశాల్లో నక్కిన నీరవ్ మోదీని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంటర్పోల్కు చెందిన 192 దేశాల పోలీసులు ఎవరైనా ఇతన్ని అరెస్ట్ చేయవచ్చు. ఒక్కసారి నీరవ్ మోదీ అరెస్ట్ అయితే, అతన్ని తమకు అప్పగించమని భారత్ కోరవచ్చు. ఈ ప్రక్రియ విజయవంతమవడానికి భారత్ ఆ దేశాలతో ఉన్న ఒప్పందాలు, సంబంధాలు సహకరిస్తాయి. నీరవ్ మోదీతో పాటు మోదీ సోదరుడు నిశాల్, సుభాష్ పరబ్లకు వ్యతిరేకంగా కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయ్యాయి. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా జారీ చేసిన రెడ్కార్నర్ నోటీసులను ఏజెన్సీ తన వెబ్సైట్లో పెట్టింది. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా జారీచేసిన నోటీసులను ప్రజల ముందుకు తీసుకురావాలని సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ ఈ నోటీసులను తన వెబ్సైట్లో పొందుపరించింది. నీరవ్కు వ్యతిరేకంగా జారీ అయిన నోటీసుల్లో అతని ఫోటోగ్రాఫ్, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, అతనికి వ్యతిరేకంగా మనీ లాండరింగ్ ఛార్జస్ నమోదైనట్టు ఉన్నాయి. నీరవ్ మోదీ, అతని సన్నిహితులు కలిసి పీఎన్బీలో దాదాపు రూ.13 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా స్కాం చేసి దక్కించుకున్న నగదును, మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించాడు. పీఎన్బీ ఈ కేసును వెలుగులోకి బట్టబయలు చేస్తుందనే క్రమంలో మోదీ, అతని సన్నిహితులు జనవరిలో దేశం విడిచి పారిపోయారు. ఇప్పటి వరకు నీరవ్ ఎక్కడ ఉన్నాడన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఈ కేసుపై విచారణ చేపట్టిన దర్యాప్తు ఏజెన్సీలు సీబీఐ, ఈడీలు ఈ-మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినప్పటికీ, అతని నుంచి సరియైన స్పందన రాలేదు. భారత్కు వచ్చేది లేదంటూ చెప్పుకొచ్చాడు. తానేమీ తప్పు చేయలేదని వాదిస్తున్నాడు. -
ఠాణా నుంచి ఇంటర్పోల్ దాకా..
సాక్షి, హైదరాబాద్: రాజధాని కమిషనరేట్ పరిధిలో ప్రతీక్షణం రద్దీగా ఉంటే ఓ పోలీస్స్టేషన్ పరిధిలో మహిళ హత్య జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఫింగర్ ప్రింట్ సేకరించారు. అనుమానిత వేలిముద్రలను ఫింగర్ ప్రింట్బ్యూరో, ఫ్యాక్ట్ (ఫింగర్ ప్రింట్ అనాలసిస్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్) ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. అతికొద్ది నిమిషాల్లోనే నిందితుడిని గుర్తించారు. నిందితుడు పాత నేరస్తుడు ఎంజే నాగరాజుగా తేలింది. దీంతో అతడి కోసం వేట సాగించిన పోలీసులు 24 గంటల్లోనే నేరస్థుడిని కటకటాల్లోకి పంపించారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం రాష్ట్రానికి చెందిన నిందితుల వేలిముద్రల డాటా మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ పోలీస్స్టేషన్ నుంచి ఇంటర్పోల్లో ఉన్న నిందితుల జాబితా వరకు ఆన్లైన్ డేటా బేస్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటగా రాష్ట్ర పోలీస్ శాఖ... టెక్నాలజీని వినియోగించి నేరాల నియంత్రణకు విశేషంగా ప్రయత్నిస్తున్న పోలీస్ శాఖ.. కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు కోసం వేలిముద్రల డేటాబేస్ను ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్తో అనుసంధానించింది. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఫింగర్ ప్రింట్స్ డేటాను ఆన్లైన్లో అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉండేలా సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్)తో సైతం అనుసంధానించింది. ఇలా 9 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1.22 లక్షల నేరస్తుల వేలిముద్రలను డేటాబేస్లో పెట్టి 868 పెండింగ్ కేసులను ఛేదించింది. అలాగే రూ.7.2కోట్ల సొత్తును స్వాధీనం చేసుకుంది. 42 గుర్తు తెలియని మృతదేహాలను సైతం గుర్తించింది. ఆటోమేటెడ్ ఫింగర్ ఫ్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను పెట్రోలింగ్ సిబ్బందికి మొబైల్యాప్ ద్వారా అందించింది. దీంతో క్షణాల్లో ఘటన స్థలి నుంచే నిందితుడు పాత నేరస్తుడా? లేకా కొత్తగా నేరం చేశాడా? అన్నది తేలిపోతుంది. ఇంటర్పోల్ జాబితా సైతం... కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్లో ఓ వ్యక్తి హత్య జరిగింది. నిందితుడు దేశం దాటి పారిపోయినట్లు అక్కడి పోలీసులు ఇంటర్పోల్కు సమాచారమిచ్చారు. ఇంటర్పోల్ నుంచి మన సీబీఐకి సమాచారం అందింది. నిందితుడి అనుమానిత వేలిముద్రలను సీబీఐ–ఎన్సీఆర్బీ ఫ్యాక్ట్లోని వేలిముద్రలతో సరిపోల్చి పంజాబ్కు చెందిన ఏపీ సింగ్గా గుర్తించారు. ఇలా విదేశాల్లో, మన దేశంలో జరిగిన హత్య కేసుల దర్యాప్తులో ఇప్పుడు ఫ్యాక్ట్ ఫింగర్ ప్రింట్ కీలకంగా మారింది. ఇంటర్పోల్కు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ డేటాను సైతం మన దేశంలోని ఏ స్థానిక పోలీస్స్టేషన్ నుంచైనా దర్యాప్తు అధికారులు అనాలిసిస్ చేసుకునే వెసులుబాటు దొరికింది. దేశవ్యాప్తంగా 11.68లక్షలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు సేకరించిన వేలిముద్రల డేటా ఫ్యాక్ట్లో అందుబాటులో ఉంది. ఇలా ఈ ఏడాది మే చివరి వరకు 11,68,775 ఫింగర్ ప్రింట్స్ డేటా బేస్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇంటర్పోల్ నుంచి మన డేటాబేస్ అనాలిసిస్ కోసం 15,718 ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. ప్రతీ నెలా దేశవ్యాప్తంగా 7,162 వేలిముద్రలు ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఆన్లైన్ డేటాబేస్కు వస్తున్నట్లు సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో తెలిపింది. -
ఇంటర్పోల్ కన్నుగప్పి నీరవ్ రాకపోకలు
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పాస్పోర్టును రద్దు చేసినట్లు ఇంటర్పోల్ ద్వారా సమాచారం ఇచ్చాక కూడా అతను వివిధ దేశాల మధ్య రాకపోకలు సాగించాడని సీబీఐ వెల్లడించింది. పాస్పోర్టు రద్దు విషయాన్ని ఇంటర్పోల్ డిఫ్యూజన్ నోటీసు జారీ ద్వారా ఫిబ్రవరి 15న సభ్య దేశాలతో పంచుకున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ చెప్పారు. ఆ విషయం ఇంటర్పోల్ కేంద్రీకృత సమాచార కేంద్రంలో నమోదైనప్పటికీ అతను యథేచ్ఛగా పర్యటనలు కొనసాగించాడన్నారు. ‘విదేశాంగ శాఖ నీరవ్ పాస్పోర్టును రద్దు చేశాక.. డిఫ్యూజన్ నోటీసు ద్వారా ఆ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్నాం. పాస్పోర్టును రద్దు చేసిన సమాచారం ఇంటర్పోల్ సమాచార కేంద్రంలో ఫిబ్రవరి 24 నుంచి అన్ని సభ్య దేశాలకు అందుబాటులో ఉంది’ అని దయాల్ వెల్లడించారు. నీరవ్కు భారత ప్రభుత్వం జారీచేసిన ఐదు పాస్పోర్టుల పూర్తి వివరాల్ని ఇంటర్పోల్కు తెలియచేశామన్నారు. ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం భారత్తో పంచు కున్న సమాచారం.. నీరవ్ మార్చి 15న లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి హాంకాంగ్కు, మార్చి 28న న్యూయార్క్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు, మార్చి 31న లండన్ నుంచి పారిస్కు ప్రయాణం చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం నీరవ్ ఎక్కడున్నారో అన్న దానిపై విశ్వసనీయ సమాచారం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
నీరవ్కు వ్యతిరేకంగా రెడ్కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం పాల్పడిన నీరవ్ మోదీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని సీబీఐ కోరుతోంది. ఈ మేరకు ఇంటర్పోల్కు సీబీఐ లేఖ రాసిందని అధికారులు చెప్పారు. నీరవ్ కేసును విచారిస్తున్న మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా ఆయనకు వ్యతిరేకంగా రెడ్కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్పోల్ను మార్చిలోనే కోరింది. ఒక్కసారి రెడ్కార్నర్ నోటీసు జారీచేస్తే, లియోన్ ఆధారిత అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశముంటుంది. పీఎన్బీ కుంభకోణానికి సంబంధించిన కేసులో నీరవ్, చోక్సీపై కొద్ది రోజుల క్రితమే సీబీఐ విడివిడిగా చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిందితులను విచారణ కోసం తిరిగి భారత్కు రప్పించాలన్న లక్ష్యంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ఇంటర్పోల్ను ఆశ్రయించింది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలోనే పీఎన్బీ కుంభకోణం అతిపెద్దది. ఈ బ్యాంకులో దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి చాలా రోజుల ముందే తన భార్య అమీ (అమెరికా పౌరురాలు), సోదరుడు నిశాల్ మోదీ (బెల్జియం పౌరుడు)తో పాటు నీరవ్ మేనమామ, గీతాంజలి గ్రూపు సంస్థల ప్రమోటర్ మెహుల్ చోక్సీతో కలసి భారత్ నుంచి జారుకున్నారు. -
ముంబై తరహా దాడికి పాక్ ఉగ్ర కుట్ర
జాతీయ దర్యాప్తు సంస్థ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ) మొట్టమొదటి సారిగా అమిర్ జుబేర్ సిద్ధిఖీ అనే పాకిస్థానీ దౌత్యవేత్త పేరును ‘మోస్ట్ వాంటెడ్ లిస్ట్’లో చేర్చడంతో పాటు తొలిసారిగా పాక్కు చెందిన ఈ స్థాయి అధికారిపై రెడ్కార్నర్ నోటీస్ జారీ కోసం ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేయనుంది. పదేళ్ల క్రితం నవంబర్లో ముంబైలో జరిపిన ఉగ్ర మారణకాండ తరహాలో మరోసారి భారత్లోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై, దక్షిణ భారత్లోని ఆర్మీ, నేవీ కమాండ్లపై దాడికి ఈ రాయబారి కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ తేల్చింది. సిద్ధిఖీ ఫోటోను కూడా విడుదల చేయడంతో పాటు అతడికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా కోరింది. ఈ రాయబారితో పాటు మరో ముగ్గురు పాకిస్థానీ అధికారులు కూడా ఈ కుట్ర భాగస్వాములని, వారిలో ఇద్దరి పేర్లను కూడా ఈ లిస్ట్లో చేర్చినట్టు పేర్కొంది. వీరిని అదుపులోకి తీసుకోవడం కోసం అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్పై ‘రెడ్ కార్నర్ నోటీస్’ జారీకి ఇంటర్పోల్ను విజ్ఞప్తి చేసేందుకు కూడా ఎన్ఐఏ సిద్ధమవుతోంది. 2008 నవంబర్ 26న ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్తో పాటు తాజ్, ట్రైడెండ్ హోటల్, తదితర ప్రాంతాల్లో పాక్ ప్రేరేపిత లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు బాంబులు, అధునాతన తుపాకులతో దాడి చేసి నాలుగు రోజుల పాటు మారణహోమాన్ని సృష్టించి 166 మంది (9 మంది ఉగ్రవాదులతో సహా)ని పైగా పొట్టనబెట్టుకున్నారు. ప్రాణాలతో దొరికిన అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదిని ఆ తర్వాత కోర్టులో విచారించి ఉరి తీసిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలోనే సిద్ధిఖీ, మరో ముగ్గురు అధికారులపై ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసినా వారిని గుర్తించడం సాధ్యం కాలేదు. అదేనెలలో వివిధ సెక్షన్లపై సిద్ధిఖీతో పాటు బాలసుబ్రహ్మణ్యం, నూరుద్దీన్లపై అదనపు చార్జిషీటు కూడా దాఖలు చేసింది. వీరిలో సిద్ధిఖీ శ్రీలంక కోలంబోలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో వీసా కౌన్సెలర్గా పనిచేశారు. ఇక మిగతా వారి విషయానికొస్తే... ‘వినీత్’ అనే మారుపేరుతో చెలామణి అవుతున్న పాక్ నిఘాసంస్థ అధికారితో పాటు బోస్ అలియాస్ షా అనే కోడ్నేమ్ కలిగిన అధికారి ఇంకా శ్రీలంకలోని పాక్ హైకమిషన్ అధికారి కూడా ఈ కుట్రలో భాగస్వామి అని ఎన్ఐఏ స్పష్టంచేసింది. కుట్ర ఎప్పుడు... ఎలా... ఎక్కడ ? 2009–2016 మధ్యకాలంలో ఈ అధికారులంతా కొలంబోలో పనిచేస్తున్న సందర్భంగా తమ ఏజెంట్ల ద్వారా దక్షిణ భారత్లోని చెన్నై, తదితర ప్రాంతాల్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులకు కుట్రపన్నారు. 2014లోనే దేశంలోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలతో పాటు, దక్షిణాదిలోని ఆర్మీ,నేవి స్థావరాలపై ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టుగా ఎన్ఐఏ నిర్థారించింది. దీని కోసం సిద్ధిఖీ శ్రీలంక పౌరుడు మహ్మద్ సాకిర్ హుస్సేన్తో పాటు అరుణ్ సెల్వరాజ్, శివబాలన్, తమీమ్ అన్సారీలను రిక్రూట్ చేశారు. భారత్లో దాడులు చేయాలనుకుంటున్న రక్షణ సంస్థలు, అణు స్థావరాలు, ఆయుధాల తరలింపునకు సంబంధించిన ఫోటోలు తీయాల్సిందిగా ఈ ఏజెంట్లను సిద్ధిఖీ, ఇతర అధికారులు పురమాయించారు. ఆర్మీ అధికారుల లాప్టాప్లు దొంగిలించడంతో పాటు విçస్తృతంగా భారత నకిలీ కరెన్సీ చెలామణిలోకి తేవాలని వారికి సూచించారు. చెన్నైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం, బెంగళూరులోని ఇజ్రాయెల్ కాన్సులేట్, విశాఖపట్టణంలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్క్వార్టర్స్, దేశంలోని వివిధ నౌకాశ్రయాలపై దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఎన్ఐఏ భావిస్తోంది. వీరందరినీ కూడా ఆ తర్వాత మనదేశ దర్యాప్తు, భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ఇలాంటి భారీ కుట్రకు సంబంధించిన కీలకసమాచారాన్ని భారత్తో అమెరికా పంచుకుంది. దీంతో ఈ పాకిస్థానీ అధికారుల అక్రమ కార్యకలాపాలను మన దర్యాప్తు అధికారులు గుర్తించే వీలు ఏర్పడింది. చెన్నై దాడికి కోడ్నేమ్ ‘వెడ్డింగ్ హాల్... చెన్నైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయంపై పాల్పడాలనుకుంటున్న దాడికి ‘వెడ్డింగ్ హాల్’ గా, దానిని చేపట్టే వారికి వంటవాళ్లు (కుక్స్)గా కోడ్నేమ్ పెట్టారు. ఈ కార్యాలయంలో పెట్టే బాంబులకు ‘మసాలాలు’ (స్పైస్) అనే కోడ్నేమ్ ఫైనల్ చేశారు. ఈ కోడ్నేమ్లతో ఉగ్రవాదులు మాల్దీవుల మీదుగా భారత్లోకి ప్రవేశిస్తారు. ఈ దాడులకు సంబంధించిన ప్రణాళికలపై పాకిస్థాన్ అధికారులతో తాను జరిపిన అంతర్గత సమావేశాల పూర్తి వివరాలను శ్రీలంక ఏజెంట్ హుస్సేన్ దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. అంతేకాకుండా భారత్లో దాడులకు పాల్పడే ఇద్దరు ఆత్మార్పణ దళ సభ్యుల (ఫిదాయిన్లు) ను తాను బ్యాంకాక్ లో కలుసుకున్నట్టు తెలియజేశాడు. దాడులకు పాల్పడే ప్రదేశాల ఫోటోలను సిద్ధిఖీకి హుస్సేన్ అందించినట్లు ఎన్ఐఏ చెబుతోంది. 2014లో హుస్సేన్ అరెస్ట్తోనే భారత్లో దాడులకు పాక్ ప్రణాళిక బట్టబయలైంది. అతడిని ఎన్ఐఏ విచారించిన సందర్భంగానే సిద్ధిఖీ పేరు బయటకు వచ్చింది. అమెరికా అందించిన ‘డిజిటల్ సాక్ష్యాల’తో సిద్ధిఖీ ప్రమేయాన్ని ఎన్ఐఏ నిర్థారించింది. శ్రీలంకపై భారత్ ఒత్తిడి పెంచడంతో సిద్ధిఖీని పాకిస్థాన్కు తిప్పి పంపించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నీరవ్, చౌక్సిలకు అరెస్ట్ వారెంట్
పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వేగంగా కదులుతోంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలంటూ ఈడీ ఇంటర్పోల్ను ఆశ్రయించింది. మనీ లాండరింగ్ కేసులో కోర్టు జారీచేసిన నాన్-బెయిలబుల్ వారెంట్లను ఆధారం చేసుకుని ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ జారీచేయాలని ఈడీ కోరుతున్నట్టు అధికారులు చెప్పారు. సీబీఐకి కూడా ఈడీ తన అభ్యర్థనను పంపింది. క్రిమినల్ కేసు విచారణలో విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి వెనక్కి రప్పించడానికి ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేస్తుంటారు. ఒక్కసారి రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా.. వారి అరెస్ట్ను ఇంటర్పోల్ కోరవచ్చు. వారిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సంబంధిత దేశాలను వారిని కస్టడీలోకి తీసుకోమని ఆదేశించవచ్చు. ఈడీ అభ్యర్థన మేరకు ఈ నెల మొదట్లో ముంబై స్పెషల్ కోర్టు నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలకు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్లను జారీచేసింది. ఈడీ కూడా వీరిద్దరికీ సమన్లు పంపింది. అయితే విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే అవసరం ఉన్నందున తిరిగి దేశానికి రాలేమని వింతైన సమాధానమిచ్చారు. పీఎన్బీలో చోటు చేసుకున్న రూ.12,700 కోట్ల స్కాంలో వీరు ప్రధాన సూత్రధారులుగా ఉన్న సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీకి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మొత్తంలో కుంభకోణానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ ప్రస్తుతం న్యూయార్క్లో తల దాచుకున్నట్టు తెలుస్తోంది. ఈయనపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నాయి. సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించగా.. ఈడీ, నీరవ్ మోదీకి సమన్లను జారీచేసింది. నీరవ్మోదీతో పాటు మెహల్ చౌక్సికి సమన్లు జారీచేస్తున్నట్టు ఈడీ పేర్కొంది. ప్రివెంక్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీరికి సమన్లు జారీచేసినట్టు తెలిపింది. అంతేకాక వారంలోపల వీరిని తమముందు హాజరవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం నీరవ్మోదీ న్యూయార్క్లో తన లగ్జరీ జువెల్లరీ స్టోర్కు దగ్గర్లో జేడబ్ల్యూ మారియట్ ఎస్సెక్స్ హౌజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. నీరవ్ పాస్పోర్టును కూడా ప్రభుత్వం రద్దు చేసినట్టు సమాచారం. అయితే నీరవ్ మోదీ వార్త కేవలం భారత్లోనే హల్చల్ చేస్తుందని, ఆయన మాత్రం న్యూయార్క్లో హ్యాపీగా ఉన్నారు కదా అంటూ? ఓ ఉద్యోగి ప్రశ్నించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11వేల కోట్ల స్కాం చేసిన నీరవ్మోదీ జనవరి 1నే దేశం విడిచిపారిపోయారు. జనవరి 23న జరిగిన దావోసు సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం నీరవ్మోదీ, ఆయన భార్య ఇద్దరూ బయటికి వెళ్లారని, కేవలం పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారని అపార్ట్మెంట్ సిబ్బంది చెప్పారు. మరోవైపు నీరవ్మోదీ, గీతాంజలి జెమ్స్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న జువెల్లరీ షోరూంలు, ఆఫీసులలో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఈ కేసులో భాగంగానే రూ.5100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు వంటి పలు కీలక ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ స్కాంలో భాగమున్నట్టు అనుమానిస్తున్న మరో ఎనిమిది మంది ఉద్యోగులను బ్యాంకు సస్పెండ్ చేసింది. మొత్తం 18 ఉద్యోగులపై పీఎన్బీ వేటు వేసింది. అయితే నీరవ్ మోదీ కేసు వల్ల పీఎన్బీ రీక్యాపిటలైజేషన్ ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండదని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు చెప్పాయి. గీతాంజలి జెమ్స్తో లింక్ అయి ఉన్న 36 సంస్థలపై విచారణ చేపట్టనున్నట్టు తెలిపాయి. మరోవైపు పీఎన్బీ బ్యాంకు షేర్లు వరుసగా మూడో రోజు భారీగా నష్టపోతున్నాయి. 52 వారాల కనిష్ట స్థాయికి ఈ షేర్లు పడిపోయాయి. -
రూ.250 కోట్ల వజ్రం కోసం.. రంగంలోకి ఇంటర్పోల్
-
రూ.250 కోట్ల వజ్రం కోసం.. రంగంలోకి ఇంటర్పోల్
జోహన్నెస్బర్గ్: ఒక్క వజ్రం ఆచూకీ ప్రపంచదేశాల పోలీసులకు సవాల్గా మారింది. ఫ్రాన్స్, లెబనాన్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, దుబాయ్, రష్యా ఇలా పలు దేశాల పోలీసులు చోరికి గురైన రూ.250 కోట్ల విలువైన పింక్ వజ్రాన్ని కనిపెట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. నిందితులు పెద్ద స్ధాయికి చెందిన వ్యాపారస్ధులు కావడం, వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటుండటం కేసు దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురు భారతీయ ఆఫ్రికన్లు జునైద్ మోతీ, అబ్బాస్ అబూబకర్ మోతీ, అష్రఫ్ కాకా, సలీం బొబట్లకు ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది(ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ చేస్తే ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడున్నా అరెస్టు చేసి తరలిస్తారు). దీంతో వారు నోటీసులను నిలిపివేయాలంటూ ప్రిటోరియా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వీరు ఫ్రాన్స్, లెబనాన్, జింబాబ్వే, దుబాయ్ కోర్టుల్లో వజ్రానికి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. ఏం జరిగింది.. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన టెలికమ్యూనికేషన్ టైకూన్, వజ్రాల వ్యాపారితో పింక్ డైమండ్ను రూ.250 కోట్లకు అమ్మడానికి నలుగురు భారతీయ ఆఫ్రికన్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ముగిసే సమయంలో ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు. వజ్రం తమ దగ్గరలేదంటే తన దగ్గరలేదంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. అది చాలక కోర్టుల్లో ఒకరిపై మరొకరు దొంగతనం కేసులు వేసుకున్నారు. కొత్త కథ తెరపైకి.. తమతో పాటు బిజినెస్ నడిపిన మాజీ భాగస్వామి అలిబెక్ ఇస్సేవ్ అనే వ్యక్తిపై నలుగురు భారత ఆఫ్రికన్లు ఆరోపణలు చేశారు. ప్రిటోరియా కోర్టులో ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. ఇస్సేవే అసలు దోషి అని, అతనే వజ్రాన్ని అపహరించాడని చెప్పారు. తమపై ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ నోటీసుపై స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. మరో వ్యాపారి తెరపైకి.. అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి సైల్లా మౌస్సా తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. 2003లో పింక్ డైమండ్ను తన నుంచి నలుగురు భారత ఆఫ్రికన్లు అపహరించుకుపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆ పింక్ డైమండ్ తనదేనని ఆయన అంటున్నారు. అయితే, దీనిపై మాట్లాడిన నలుగురు భారతీయ ఆఫ్రికన్లలో ఒకరైన కాకా.. తమకు పడిన బాకీని చెల్లించేందుకు పింక్ డైమండ్ను మౌస్సానే ఇచ్చారని చెప్పారు. కాగా, ఇంటర్పోల్ జారీ చేసిన నోటీసులు ఇంతవరకూ తమకు చేరలేదని దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. -
కంప్యూటర్ లాక్.. డేటా అన్లాక్
►సైబర్ ఎక్స్టార్షన్... ర్యాన్సమ్వేర్! ►బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పూ పొంచి ఉంది ►కంప్యూటర్లను లాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు ►డేటాను అన్లాక్ చేసేందుకు డెడ్లైన్ నిర్దేశం ►ఎఫ్బీఐ, ఇంటర్పోల్ పేర్లతోనూ బ్లాకింగ్ ►బహుపరాక్ అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు సిటీబ్యూరో: ఓ వ్యక్తిని అపహరించి నిర్భంధించడం... కొంత మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేయడం... కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్ అనే ఈ నేరం నేరుగా జరుగుతుంది. ఇదే తరహాలో కంప్యూటర్ను తమ ఆధీనంలోకి తీసుకుని లాక్ చేయడం... అన్లాక్ చేయడానికి నిర్ణీత మొత్తం డిమాండ్ చేయడం... ర్యాన్స్మ్ వేర్గా పిలిచే ఈ క్రైమ్ ఆన్లైన్ ద్వారా జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ‘వన క్రై’ సైతం ర్యాన్స్మ్వేరే. సైబర్ ఎక్స్టార్షన్గా (బెదిరించి డబ్బు గుంజటం) పిలిచే ర్యాన్సమ్ వేర్, బ్రౌజర్ లాకర్ వంటి వాటి ముప్పు నానాటికీ పెరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. కంప్యూటర్లను బ్లాక్ చేస్తున్న వ్యవస్థీకృత సైబర్ నేరగాళ్లు డెడ్లైన్ విధించి మరీ అనుకున్న మొత్తం వసూలకు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ–మెయిల్తో మొదలు... ర్యాన్సమ్ వేర్, బ్రౌజర్ లాకర్ వంటి వైరస్లను సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్స్, యాడ్స్ రూపంలో కంప్యూటర్లకు పంపిస్తున్నారు. ఉద్యోగార్థులకు సంబంధించిన ఈ–మెయిల్ ఐడీలను వివిధ ఉద్యోగ సంబంధిత వెబ్సైట్లు, అవివాహితులు, వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి మాట్రిమోనియల్ సైట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు సంగ్రహిస్తున్నారు. వీటితో పాటు వృత్తి, వ్యాపార సంబంధిత సైట్లలోనూ పొందుపరిచే ఈ–మెయిల్స్ సంగ్రహిస్తున్న సైబర్ నేరగాళ్లు వీటి ఆధారంగా ఎక్స్టార్షన్కు పావులు కదుపుతున్నారు. అలా ఈ–మెయిల్ ఐడీలు సంగ్రహించే సైబర్ నేరగాళ్లు వాటిని అనుగుణంగానే ఉద్యోగావకాశం, వివాహసంబంధం, వృత్తి, వ్యాపార పెంపొందించే మార్గాలు అంటూ టార్గెట్ చేసిన వారికి మెయిల్స్ పంపడం, యాడ్స్ రూపంలో పాప్అప్స్ ఇవ్వడం చేస్తున్నారు. వీటిని చూసిన వారు సాధారణంగానే ఆకర్షితులవుతున్నారు. ఈ మెయిల్, యాడ్లోని వివరాలు చూడటానికి లింకును ఓపెన్ చేస్తే చాలు... ఆ వైరస్ కంప్యూటర్/ల్యాప్టాప్లోకి జొరబడుతుంది. దర్యాప్తు, నిఘా సంస్థల పేరుతోనూ... ఇటీవల కాలంలో ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. ఇందులో కంప్యూటర్ మొత్తం లాక్ కావడంతో పాటు ఆ పని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్ చేసినట్లు స్క్రీన్పై కనిపిస్తుంది. అన్ని దేశాల్లోనూ నేరంగా పరిగణించే చైల్డ్ పోర్న్ వెబ్సైట్స్ చూసినందుకో, మరో ఉల్లంఘన చేసినందుకో బ్లాక్ చేసినట్లు చెప్తుంది. ఈ వైరస్లో ఉన్న మరో లక్షణం ఏమిటంటే... దానంతట అదే వెబ్క్యాప్ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లోకేషన్స్ తెరపైన డిస్ప్లే చేస్తుంది. దీనికి కొనసాగింపుగా ‘మీ కదకల్ని గమనిస్తున్నాం. తదుపరి చర్యలకు ఉపక్రమించకూడదంటే చేసిన తప్పుకు పెనాల్టీ చెల్లించడం’ అంటూ డిస్ప్లే అవుతుంది. దీంతో పూర్తిగా భయానికి లోనయ్యే వినియోగదారుడు నిర్దేశించిన డెడ్లైన్లోపు చెల్లింపులు చేసేస్తున్నాడు. యాంటీ వైరస్లకూ లొంగదు... బ్రౌజర్ లాకర్ కొన్ని యాంటీ వైరస్లకు లొంగినా.. ర్యాన్సమ్వేర్కు మాత్రం పరిష్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ప్రాముఖ్యం కాకపోయినా... సాఫ్ట్వేర్ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీఓ ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయడని వివరిస్తున్నారు. దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఈ తరహాలో నేరాలు చేసే వారు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్లు వినియోగిస్తుండటంతో వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ర్యాన్సమ్వేర్ బారినపడిన వారిలో బయటకు చెబుతున్నది అతి తక్కువే అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, యాడ్స్కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో పటిష్టమైన యాంటీ వైరస్ ఏర్పాటు చేసుకోవడమే ఇందుకు పరిష్కారంగా సూచిస్తున్నారు. లాక్ చేశామని చెబుతూనే... ఈ ర్యాన్సమ్వేర్ వైరస్ కంప్యూటర్లో ప్రశించిన మరుక్షణం అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసి, సిస్టం మొత్తాన్ని లాక్ చేస్తుంది. మానిటర్పైన స్పష్టంగా ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’ అనే మెసేజ్ కనిపిస్తుంది. దీన్ని అన్లాక్ చేయడానికి పాస్వర్డ్ మా వద్ద ఉందని చెప్తున్న సైబర్ నేరగాళ్లు గరిష్టంగా మూడు రోజుల గడువు ఇస్తూ 100 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్తో లాక్ అయిన కంప్యూటర్/ల్యాప్టాప్ స్క్రీన్పై మూడు రోజులు (72 గంటలు) కౌంట్డౌన్ టైమింగ్ కూడా డిస్ప్లే అవుతుంటుంది. తాము ఆ పాస్వర్డ్ను ఆ సమయం తరవాత నిర్వీర్యం చేస్తామని, ఇక మీ కంప్యూటర్లోని డేటా శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తుంటారు. ఎవరైనా ఆ టైమర్ను, వైరస్ ప్రొగ్రామ్ను మార్పు చేయాలని ప్రయత్నించినా, నగదు డిపాజిట్ చేసినట్లు తప్పుడు వివరాలు పొందుపరిచినా డెడ్లైన్ సమయం తగ్గిపోతూ... కౌంట్డౌన్ టైమర్లో మార్పులు రావడం ఈ వైరస్కు ఉన్న మరో లక్షణం. ఆ ‘కీ’ లేకుండా అన్లాక్ కష్టమే... కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడంలో) రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్–లాకింగ్కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్–సెమెట్రిక్ విధానంలో వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే నేరగాళ్లు ఈ విధానంలోనే లాక్ చేస్తారు. దీంతో వారి వద్ద ఉన్న ప్రైవేట్ కీ తెలిస్తే తప్ప ఆ కంప్యూటర్ అన్లాక్ కాదు. ఫార్మాట్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులకు మరో దారి లేక మనీప్యాక్, ఓచర్స్, ఈ–మనీ రూపాల్లో నేరగాళ్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. నగదు తమకు చేరిన తరవాత ఆ సైబర్ నేరగాళ్ళు వైరస్ ప్రొగ్రామ్ ద్వారానే ఆల్లాక్ కీ పంపిస్తున్నారు. దీన్ని వినియోగిస్తే మాత్రమే కంప్యూటర్/ల్యాప్టాక్ యథాప్రకారం ఓపెన్ కావడంతో పాటు అందులోని డేటా భద్రంగా అందుబాటులోకి వస్తుంది. -
లలిత్ మోదీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. లలిత్ మోదీపై రెడ్ నోటీసు జారీ చేయాలన్న భారత్ విన్నపాన్ని ఇంటర్పోల్ తిరస్కరించింది. మోదీని తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన విషయంలో ఇంటర్పోల్ ఆయన్ను అరెస్ట్ చేయదు. ఐపీఎల్ చైర్మన్ హోదాలో లలిత్ మోదీ అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. లండన్లో ఉంటున్న మోదీ భారత్లో తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనంటూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లలిత్ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఇంటర్పోల్ సాయం కోరింది. అయితే భారత్ విన్నపాన్ని ఇంటర్పోల్ తిరస్కరించింది. -
మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయండి..
ఇంటర్పోల్ను కోరిన ఈడీ న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్(ఆర్సీఎన్)ను జారీ చేయాల్సిన బాధ్యత ఇంటర్పోల్కు ఉందని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) పేర్కొంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ఆర్సీఎన్ను జారీ చేయడానికి అన్ని చట్టపరమైన పద్ధతులను అనుసరించామని ఇంటర్పోల్కు ఈడీ సవివరమైన సమాచారాన్ని అందించింది. విజయ్ మాల్యాకు ప్రొక్లెయిమ్డ్ ఆఫెండర్ స్టేటస్ను ఇవ్వాలని ముంబై కోర్టును కోరామని, ఈ విషయమై నేడు(సోమవారం) నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఇంటర్పోల్కు ఈడీ సమాచారమిచ్చింది. ఐడీబీఐకు సం బంధించిన రూ.900 కోట్ల రుణ మోసం కేసులో విజయ్ మాల్యా, ఆయన కంపెనీల్లో ఒకదానికి చెందిన రూ.1,411 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు శనివారం అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
లలిత్ మోదీ కేసులో ఇంటర్ పోల్ తకరారు
ముంబై/లిస్బన్: లలిత్ గేట్ కుంభకోణంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ మరో తకరారుకు తెరలేపింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కుంభకోణం వ్యవహారంలో లలిత్ మోదీ నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా? లేక ఉద్దేశపూర్వకంగా ఇరికించారా? మీరు మోపిన అభియోగాల్లో వాస్తవం ఎంత? ఆమేరకు ఆధారాలున్నాయా? వంటి ప్రశ్నలు సంధిస్తూ వారంలోగా సమాధానాలు చెప్పాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది. తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే ఆరోపణు ఎదుర్కొంటూ, ప్రస్తుతం విదేశం(పోర్చుగల్)లో నివసిస్తున్న లలిత్ మోదీపై ఈడీ గత ఆగస్టులో రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. దీంతో ఈ కేసులోకి ఇంటర్ పోల్ రంగప్రవేశం చేసింది. కాగా, ఒక కేంద్ర మంత్రి సహా కొందరు బీసీసీఐ పెద్దలు ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారని, ఈడీ ఆరోపణల ఆధారంగా తనకు నోటీసులు జారీచెయ్యొద్దంటూ లలిత్ మోదీ ఇంటర్ పోల్ను కోరాడు. అతని అప్పీలును పరిశీలించిన ఇంటర్ పోల్.. కేసు ప్రేరితమా? కాదా? అంటూ మౌలిక ప్రశ్నలు లేవనెత్తింది. లలిత్ మోదీ అప్పీళ్లపై వచ్చేవారం విచారణ జరగనున్నందున ఆలోపే సమాధానాలు పంపాలని ఇంటర్ పోల్ కోరింది. 'సాధారణంగా తాను దర్యాప్తు చేసే కేసుల వివరాలను ఈడీ.. భారతీయ కోర్టులకు తప్ప ఇతర అంతర్జాతీయ సంస్థలకు వెల్లడించదు. అలాంటిది పదేపదే వివరాలు తెలపాలంటూ ఇంటర్ పోల్ ఈడీని కోరుతోంది. లలిత్ మోదీ ఏదో ఒక ఇష్యూను ఇంటర్ పోల్ ముందుంచడం, వాటికి సమాధానాలివ్వాలంటూ ఇంటర్ పోల్, ఈడీని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఇదేదో కోర్టు విచారణ ఉందేకాని, దర్యాప్తుల సాగటంలేదు'అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)నే అయినప్పటికీ, భారత్లో ఇంటర్ పోల్ కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నందున ఆ సంస్థ ద్వారానే ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఈమేరకు ఈడీ నుంచి సమాచారం సేకరించి పంపాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది. -
అసలు దొంగల సంగతేంటి ?
196 మంది స్మగ్లర్లతో పోలీసుల జాబితా! విచారణలో మరో 800మంది పేర్లు వెల్లడి 21 మంది విదేశీయులు, నలుగురు ఎన్ఆర్ఐల పేర్లు గుర్తింపు విదేశీ స్మగ్లర్లను ఇంటర్పోల్ సాయంతో అరెస్టు చేస్తామన్న నాటి ఎస్పీ రామకృష్ణ రెండున్నరేళ్లుగా పురోగతికి నోచుకోని ఇంటర్పోల్ అరెస్టులు సాక్షి, చిత్తూరు: తీగలాగితే డొంక కదిలినట్లు...ఎర్రచందనం స్మగ్లర్ల విచారణలో దొంగల పేర్లు బయటకి వచ్చాయి. 196 మంది స్మగ్లర్లతో జాబితాను సిద్ధంచేసి ‘ఆపరేషన్ రెడ్’ను పోలీసులు ప్రారంభించారు. చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి అర్బన్, నెల్లూరు జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ ద్వారా అరెస్టుల పర్వాన్ని సాగించారు. అందులో ఇప్పటి దాకా 181 మంది దొంగలను అరెస్టు చేశారు. వారిని విచారిస్తే అదనంగా మరో 800మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ప్రస్తుతం పలు పదవుల్లో ఉన్న ‘ఖద్దరు’ నేతల పేర్లు కూడా విచారణలో స్మగ్లర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. వీరిలో చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలకు చెందిన నేతలతోపాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు కూడా దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ 25 మంది అరెస్టుల సంగతేంటి? ఎర్రచందనం స్మగ్లింగ్లో లక్ష్మణన్, శరవణన్, అసీఫ్ అలీఖాన్, లక్ష్మణ్ నాయక్, రియాజ్, హమీ ద్, విక్రమ్ మెహందీ లాంటి అంతర్జాతీయ స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలో చైనా, మలేషియా, జపాన్, థాయ్లాండ్కు చెందిన 21 మంది విదేశీయుల పేర్లు బయటకొచ్చాయి. ఇండియాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లింగ్ వ్యాపారంలో ఆ 21 మంది కీలక పాత్ర పోషించారని పోలీసులు తేల్చారు. వీరితో పాటు చైనాలో స్థిరపడిన నలుగురు భారతీయులను కూడా చిత్తూరు పోలీసులు గుర్తించారు. ఈ 21 మంది అరెస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. ఇంటర్పోల్ సాయంతో వారిని అరెస్టు చేయాలని పోలీసులు భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వారి అరెస్టుల్లో పురోగతి సాధించలేదు. వారితో పాటు దేశానికి చెందిన మరో 800 మంది దొంగల అరెస్టు కూడా పూర్తిగా మందగించింది. ఎస్పీ రామకృష్ణ బదిలీ అయిన తర్వాత పోలీసులు ఎర్ర స్మగ్లర్ల అరెస్టు ప్రక్రియలో పూర్తిగా నెమ్మదించారు. అప్పటి ఎస్పీ అరెస్టు చేసిన 12 మంది దొంగలపై పీడీ యాక్టు నమోదు చేయడం మినహా, విచారణలో వెల్లడైన దొంగలను అరెస్టు చేయలేదు. ‘ఆపరేషన్ రెడ్’ మొదలైన తర్వాత 40 రోజుల్లో 174 మందిని అరెస్టు చేస్తే..వారి అరెస్టు తర్వాత రెండునెలల్లో ఒక్క అరెస్టు కూడా లేదంటే పోలీసులు పనితీరు ఎలా ఉందో ఇట్టే తెలుస్తుంది. గ్లోబల్ టెండర్లలో చక్రం తిప్పుతున్న ఆ 25 మంది కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపిన 25 మంది, విదేశాల్లోని స్మగ్లర్ల కనుసన్నల్లోనే ఎర్రచందనం గ్లోబల్ టెండర్ల ప్రక్రియ సాగుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. గోడౌన్లలోని దుంగలను చూసేందుకు ఈ 25 మందికి చెందిన అస్మదీయులు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశాలకు చెందిన ఈ వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి ఎక్కువ ధరలకు టెండర్లు కోట్ చేయకుండా పక్కా ప్రణాళిక ప్రకారం టెండర్లు దక్కించుకునేందుకు ఆ 25 మంది వ్యూహం రచించి దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు దుంగల దొంగలపైనే పోలీసుల దృష్టి పోలీసులు ఇప్పటి వరకు ఎర్రచందనం స్మగ్లింగ్ లో నేరుగా ప్రమేయం ఉన్న వ్యక్తులనే(దుంగలను కొట్టించడం, క్రయవిక్రయాలు, రవాణాతో సం బంధం ఉన్నవారు)అరెస్టు చేస్తున్నారు. స్మగ్లింగ్ లో రాజకీయ కోణం, ఏయే నాయకుడు ఏ స్మగ్లర్కు అండగా నిలిచాడు. స్మగ్లర్లు ఏ నాయకునికి ఎంత డబ్బులు ముట్టజెప్పారు? అనే కోణంలో పోలీసులు విచారణతో పాటు అరెస్టుకు ఉపక్రమించలేదు. పోలీసులు సిద్ధం చేసుకున్న స్మగ్లర్ల జాబితా 196 నుంచి వెయ్యికి పెరిగినా దొంగలను పూర్తిగా అరెస్టు చేస్తే, ఆపై ‘ఖద్దరు’ నేతల పని పడతామని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి చెప్పా రు. అయితే వీరిలో అధికంగా టీడీపీకి చెందిన నేతల పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని అరెస్టు చేసేందుకు అధికారపార్టీ పోలీసులకు స్వేచ్ఛనివ్వడం కష్టమే. దీంతో వారి అరెస్టులు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్ను పోలీసులు అరెస్టు చేశారు. కనీసం ఇతని అరెస్టును కూడా మీడియాకు చూపకుండా నేరుగా కోర్టుకు హాజరుపరిచారంటే పరిస్థితి ఇట్టే తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు దొంగలను అరెస్టు చేసేందుకు పోలీసులపై ‘పచ్చనేతల’ ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉందని స్పష్టమవుతోంది. అసలు దొంగలను వదిలేసి చిన్న దొంగలతో కేసును ‘మమ’ అనిపిస్తే...‘ఎర్ర’ వ్యాపారానికి మళ్లీ సర్కారు గేట్లు తెరిచినట్లే అవుతుంది. నాడు ఎస్పీ ఏమన్నారంటే.. ‘196 మంది దొంగలతో జాబితా సిద్ధం చేసి అరెస్టు ప్రక్రియను ప్రారంభించాం. వీరిలో 174 మందిని అరెస్టు చేశాం. విచారణలో మరో 800 మంది దొంగల పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 21 మంది విదేశీయులు ఉన్నారు. నలుగురు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఉన్నారు. వీరి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపాం. ఇంటర్పోల్ సాయంతో వారిని అరెస్టు చేస్తాం.’ -పీహెచ్డీ రామకృష్ణ, నాటి చిత్తూరు ఎస్పీ -
ఇంటర్ పోల్ కు అంబాసిడర్ గా షారుక్ ఖాన్!
'భూమి మీద ఎవరికి నేను భయపడను. కేవలం దేవుడికి మాత్రమే భయపడుతాను. చెడు చేయడాన్ని నేను భరించలేను. ఏ ఒక్కరికి అన్యాయం చేయడానికి ప్రయత్నించను. సత్యంతో అసత్యాన్ని జయిస్తాను. అసత్యం, అవాస్తవాలను ఎదుర్కొంటాను. అందుకు దేనికైన వెనుకాడను' అని మహాత్మగాంధీ సూక్తిని షారుక్ ఖాన్ గుర్తు చేశారు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ కు అంబాసిడర్ గా సేవలందించేందుకు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ టర్న్ బ్యాక్ క్రైమ్ క్యాంపెన్ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. చట్టాలను గౌరవించి నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా ప్రజలకు స్పూర్తినిచ్చే విధంగా షారుక్ తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఇంటర్ పోల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం తన దక్కిన గొప్ప గౌరవం అని షారుక్ వ్యాఖ్యాలు చేశారు. ఇప్పటి వరకు జాకీ చాన్, పుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ, ఫార్ములా వన్ రేస్ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో, కిమి రాయక్కోనెన్ లు ఇంటర్ పోల్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. -
ఉయ్యూరు వాసి దోషి
భార్యాపిల్లల్ని హతమార్చిన కేసులో అమెరికా కోర్టు నిర్ధారణ 3న జీవితఖైదు విధించనున్న జ్యూరీ చికాగో/ఉయ్యూరు : భార్యతో పాటు తన ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా గొంతు కోసి దారుణంగా హతమార్చిన కేసులో.. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం, గండిగుంట గ్రామానికి చెందిన చెందిన కంప్యూటర్ సైంటిస్టు లక్ష్మీనివాసరావు నెరుసును మిచిగాన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. సంతోషం కొరవడిన వైవాహిక జీవితం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నలభై ఆరేళ్ల లక్ష్మీనివాసరావు 2008 అక్టోబర్ 13న మిచిగాన్లోని తన ఇంట్లో ఈ దారుణానికి తెగబడ్డాడు. మృతదేహాలను ఇంట్లోనే ఉంచి మరుసటి రోజే హైదరాబాద్కు పారిపోయి వచ్చాడు. తన సోదరుడి కుటుంబ సమాచారం తెలియటం లేదని లక్ష్మీనివాస్ సోదరుడు అక్కడి పోలీసులకు పిర్యాదు చేయడంతో హత్య జరిగిన రెండు వారాలకు అసలు విషయం వెలుగుచూసింది. ఎఫ్బీఐ కేసు దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడు స్వదేశానికి వెళ్లినట్టు నిర్ధారించుకుని సీబీఐని సంప్రదించారు. ఇంటర్పోల్ సైతం ఎఫ్బీఐ జారీ చేసింది. అప్పట్నుంచీ మారువేషాల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని 2013లో హైదరాబాద్ శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద హత్యాభియోగాల విచారణ కోసం అతన్ని మిచిగాన్కు పంపారు. కాగా గురువారం కేవలం రెండు గంటల్లోపు ముగిసిన సమాలోచనల అనంతరం ఏడుగురు మహిళలు, నలుగురు పురుష న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం (జ్యూరీ) లక్ష్మీనివాస్ను నేరస్తుడిగా నిర్ధారించినట్టు డెట్రారుుట్ ఫ్రీ ప్రెస్ వెల్లడించింది. అంతకుముందు వారం రోజుల పాటు కొనసాగిన విచారణ అనంతరం జ్యూరీ ఈ తీర్పు వెలువరించింది.విచారణ సంద ర్భంగా.. కుటుంబసభ్యులను హతమార్చడాన్ని లక్ష్మీనివాస్ ఖండించలేదు. ఎలాంటి భావోద్వేగాన్నీ వ్యక్తం చేయలేదు. హత్యలకు పాల్పడినట్టుగా అంగీకరించిన లక్ష్మీనివాస్.. నాటి ఘటనలకు సంబంధించిన వివరాలను మాత్రం గుర్తుకు తెచ్చుకోలేక పోతున్నానని చెప్పాడు. ఆ సమయంలో అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని డిఫెన్సు అటార్నీ వాదించినప్పటికీ న్యాయమూర్తులు దాన్నెంత మాత్రమూ విశ్వసించలేదు. వచ్చే నెల 3న కోర్టు అతనికి పెరోల్కు అవకాశం లేని జీవితఖైదును విధించనుంది. భార్యాపిల్లల్ని వరుసగా..: ఆ రోజు ఉదయం లక్ష్మీనివాస్ భార్య జయలక్ష్మి (37)తో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేసి వంటగదిలో వాడే కత్తితో పలుమార్లు పొడిచి అనంతరం ఆమె గొంతు కోసేశాడు. తర్వాత పాఠశాల నుంచి ఇంటికి తిరిగివచ్చే కూతురు తేజస్వి (14) కోసం మాటేసి ఆమె లోపలికి వచ్చిన వెంటనే హతమార్చాడు. ఆ తర్వాత 40 నిమిషాలకు ఇంటికి వచ్చిన కుమారుడు శివకుమార్ (12)నూ అదే విధంగా చంపేశాడు. లక్ష్మీనివాస్కు జయలక్ష్మి సొంత మేనత్త కూతురు. లక్ష్మీనివాస్ వివాహేతర సంబంధమే ఈ దారుణానికి పురిగొల్పిందనేది జయలక్ష్మి బంధువుల వాదన. -
కేవీపీపై రెడ్ కార్నర్ నోటిస్ అందింది: డీజీపీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై రెడ్కార్నర్ నోటీసు అందిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. తమకు అందిన రెడ్ కార్నర్ నోటిస్ పై సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రసాదరావు అన్నారు. కేవీపీ ఎంపీ కనుక ప్రత్యేక పర్యవేక్షణ అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు. టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్పోల్ కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కేవీపీపై ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని కోరిన ప్రొవిజినల్ అరెస్టుపై సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని, సీబీఐ జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. -
నోటీసులపై హైకోర్టులో కేవీపీ పిటిషన్
అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వండి.. సోమవారంనాడు విచారణ! హైదరాబాద్: టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్పోల్ తనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడాన్ని కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నోటీసు ఆధారంగా తనపై అరెస్టు సహా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను ఆదేశించాలని కోరుతూ లంచ్ మోషన్ రూపంలో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారం అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిందని, దీనిపై లోతుగా వాదనలు వినాల్సింది ఉందని, ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేనని జస్టిస్ నూతి రామ్మోహనరావు స్పష్టంచేశారు. లంచ్ మోషన్ కాకుండా రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొంటూ కేవీపీ రెగ్యులర్ పిటిషన్ వేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది. నాకెలాంటి సంబంధం లేదు...‘‘టైటానియం తవ్వకాల వ్యవహారంతో నాకెలాంటి సంబంధం లేదు. మీడియా ద్వారానే నాకీ విషయం తెలిసింది. అమెరికా ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు కూడా కథనాలొస్తున్నాయి. అమెరికా కోర్టు మోపిన అభియోగాలకూ, నాకూ సంబంధం లేదు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయి. నాపై వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2006కు సంబంధించిన వ్యవహారంగా పత్రికా కథనాల్లో వస్తోంది. మరి ఇప్పటికిప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? అమెరికా చట్టాలు ఇక్కడ నాకు వర్తించవు. ఇంటర్పోల్ నోటీసు ఆధారంగా సీఐడీ అధికారులు చర్యలు తీసుకుంటే నా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్లే. 1977 నాటి భారత్-అమెరికా ఒప్పందం ప్రకారం ఇక్కడి అధికారులు చట్ట ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పూర్తి చేసి, బాధితుడి వాదనలు విన్నాకే నోటీసు జారీ చేయాలి. అవేవీ లేకుండానే ఇంటర్పోల్ నోటీసులిచ్చింది కనక వీటి ప్రకారం సీఐడీ అధికారులు చర్యలు తీసుకోవటానికి వీల్లేదు. ఈ మేరకు సీఐడీని ఆదేశించండి’’ అని పిటిషన్లో కేవీపీ అభ్యర్థించారు. కేవీపీపై సీఐడీకి అందిన ఇంటర్పోల్ నోటీసు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందింది. ఆయనపై ఈ నోటీసుల్ని ఇంటర్పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైమ్ బ్యూరో పంపిన లేఖ (నం. ఏ-2828/4-2014) బుధవారం సీబీఐకి అందిన విషయం విదితమే. దీని ద్వారా రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ సీఐడీకి శుక్రవారం చేరింది. ఈ నోటీసుల్లో ఎక్కడా ప్రొవిజినల్ అరెస్టుకు సంబంధించిన వారెంట్ లేదని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని విదేశాన్ని కోరడాన్నే ప్రొవిజినల్ అరెస్టు అంటారు. ఈ అంశం ఎక్కడా రెడ్కార్నర్ నోటీసుల్లో ప్రస్తావించలేదని, దీనిపైనే సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని కృష్ణప్రసాద్ మీడియాకు వెల్లడించారు. వారి జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. -
‘అత్తారింటికి’ కొత్తదారి!
నేపాల్ మార్గం పట్టిన ‘ఎన్ఆర్ఐ అల్లుళ్లు’ ఎల్ఓసీలు ఉన్నా చిక్కకుండా ఈ ఎత్తుగడ చెక్ చెప్పేందుకు సీసీఎస్ పోలీసుల యత్నాలు సాక్షి, హైదరాబాద్: ‘సార్...విదేశాల్లో ఉన్న నా భర్తపై ఎల్ఓసీ జారీ చేశామని మీరు చెప్పారు. ఆయన ఇటీవలే మా అత్తమామల వద్దకు వచ్చి వెళ్లాడు. అయినా మీరు పట్టుకోలేకపోయారు’. - వరకట్న వేధింపుల కేసుల్లో బాధితులు అనేక మంది పోలీసుల వద్ద వాపోతున్న అంశమిది. ఇది ఎలా ధ్యమని శోధించిన పోలీసులు సదరు నిందితులు ‘అ త్తారింటికి’ వచ్చి వెళ్లేందుకు కొత్తదారి కనిపెట్టారని గుర్తించారు. దీనికి చెక్ చెప్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడతున్న, అనేక రకాలుగా మోసం చేసిన ఎన్ఆర్ఐ అల్లుళ్లకు సంబంధించిన కేసులు పోలీసుల వద్దకు నిత్యం వస్తున్నాయి. పెళ్లి చేసుకుని తీసుకెళ్లడంలేదని, అక్కడకు వెళ్లాక కట్నం కోసం మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డాడని, లేని అర్హతలు చెప్పి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తుంటారు. వీటిపై కేసులు నమోదు చేసుకుం టున్న పోలీసులు నిందితులుగా ఉన్న ‘అల్లుళ్ల’ను అరెస్టు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ‘రంగు’ మారిన నోటీసులు... ఒకప్పుడు 498(ఎ) తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎన్ఆర్ఐలను అరెస్టు చేసేందుకు సీఐడీ ద్వారా ఇంటర్పోల్ను ఆశ్రయించేవారు. ఆ సంస్థ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి, ఆయా దేశాల్లో ఉన్న పోలీసులు పట్టుకునేలా చేసి ఇక్కడకు తీసుకొచ్చేవారు. అయితే భారత్లో మాదిరిగా అన్ని దేశాల్లోనూ వరకట్న వేధింపులు అనే ది తీవ్రమైన నేరం కాదు. దీంతో రెండేళ్ల క్రితం నుంచి ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ ఆపేసింది. వీటి స్థానంలో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తూ... కేవలం నిందితుల ఆచూకీ తెలిపేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ రకంగా వారి ఆచూకీ తెలిసినా... ఇక్కడి పోలీసులు వెళ్లి తీసుకురావడం అసాధ్యమవుతోంది. ఇది వాంటెడ్గా ఉన్న ఎన్ఆర్ఐ అల్లుళ్లకు బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. ఇటీవల ఎల్ఓసీనే అనుసరిస్తున్నారు... ఇంటర్పోల్ ద్వారా రెడ్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయించడం అంత సులువు కాదు. స్థానిక పోలీసులు నేరుగా ఇంటర్పోలును ఆశ్రయించలేరు. నోడల్ ఏజెన్సీగా పని చేసే సీఐడీ వంటి వ్యవస్థల ద్వారా వెళ్లాలి. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో ఇటీవల కాలంలో పోలీసులు వాంటెడ్గా ఉన్న ఎన్ఆర్ఐ అల్లుళ్లపై లుక్ ఔట్ సర్క్యు లర్ (ఎల్ఓసీ) జారీ చేస్తున్నారు. దీన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకూ పంపిస్తారు. ఫలితంగా సదరు వ్యక్తి విదేశం నుంచి వచ్చిన వెంటనే అక్కడే చిక్కే అవకాశం ఉంటుంది. ‘రూటు’ మార్చిన కేటుగాళ్లు... ఇటీవల కాలంలో దీన్నీ తప్పించుకునేందుకు సదరు నిందితులు ఏకంగా కొత్త రూటునే కనుగొన్నారు. విదేశాల నుంచి నేరుగా ఇక్కడకు వచ్చి ఏ విమానాశ్రయంలో దిగినా... ఇమ్మిగ్రేషన్లో చిక్కుతామనే ఉద్దేశంతో వయా నేపాల్ ప్రయాణాలు ప్రారంభించారు. ఆయా దేశాల నుంచి పొరుగున ఉన్న నేపాల్కు వచ్చి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఆపై సమీపంలోని విమానాశ్రయం ద్వారా డొమెస్టిక్ ఫ్లైట్స్లో చేరాల్సిన చోటుకు వెళ్లిపోతున్నారు. డొమెస్టిక్ ప్రయాణాలకు పాస్పోర్ట్, ఇమ్మిగ్రేషన్ వంటివి ఉండకపోవడంతో వీరిని ఎవరూ వాంటెడ్గా గుర్తించి, పట్టుకోలేకపోతున్నారు. తిరుగు ప్రయాణాలకూ ఇదే మార్గాన్ని అనుసరిస్తున్న నిందితులు ఎవరికీ చిక్కకుండా ‘అత్తారింటికి’ రాకపోకలు సాగించేస్తున్నారు. దీనికి చెక్ చెప్పేందుకు పోలీసులు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఆయా దేశాలకే సమాచారమిచ్చే సరికొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఇలా దొరుకుతారు... ఎల్ఓసీలు జారీతో కొందరు వాంటెడ్ అల్లుళ్లు పోలీసులకు చిక్కారు. ఎల్ఓసీ జారీ అయిన వ్యక్తి వ్యక్తిగత, కేసు వివరాలతో పాటు పాస్పోర్ట్ నెంబర్లను విమానాశ్రయాల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ డేటాబేస్లో నిక్షిప్తం చేసుకుంటారు. అతడు విమానం దిగిన వెంటనే జరిగే ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో వాంటెడ్ అని వెలుగులోకి రావడంతోనే అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ పోలీసులు వచ్చి నిందితుడిని తీసుకువెళ్లే వరకు ఎయిర్పోర్ట్ దాటకుండా తమ ఆధీనంలోనే ఉంచుకుంటారు. అంతర్జాతీయ ప్రయాణాలకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలనేది కచ్చితమైన అంశం. ఎంబీసీలకు సమాచారం... ‘‘సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో నమోదైన కేసుల్లో 31 మంది ఎన్ఆర్ఐ అల్లుళ్లు వాంటెడ్గా ఉన్నారు. వీరిని పట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఈ కారణంగానే వీరి వివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో పాటు వారు పని చేస్తున్న సంస్థలకూ తెలియజేయాలని నిర్ణయించాం. ఈ విధానంతో నిందితుల్ని అరెస్టు చేయడం సాధ్యం కాకున్నా వారు వాంటెడ్ అనే విషయం తెలిసి భవిష్యత్తులో నిందితులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి’’ - జి.పాలరాజు, క్రైమ్స్ డీసీపీ -
ఇంటర్పోల్ సాయం కోరనున్న పోలీసులు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు అన్మోల్ సర్నా హత్య కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ఇంటర్పోల్ సాయం కోరనున్నారు. ఈవెంట్ మేనేజర్ దుశ్యంత్ లాంబా అరెస్టుతో నివ్వెరపోయే నిజాలు బయటకొచ్చాయని తెలిసింది. అన్మోల్ను హతమార్చేందుకు అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీని వినియోగించినట్లు పోలీసులు భావించారు. అయితే ఎల్ఎస్డీ షీట్లను బుక్స్, గ్రీటింగ్ కార్డులలో ఉంచడం మాత్రమేకాకుండా ఓ పార్సిల్ను కూడా పంపామని లాంబా పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయమై పోలీస్ కమిషనర్(శాంతిభద్రతలు) దీపక్ మిశ్రా, జాయింట్ కమిషనర్ వివేక్ గోగియాకు పలు సూచనలు జారీ చేశారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తితో దుశ్యంత్ జీమెయిల్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడని, అందుకు అనే ఐడీ ఉపయోగించాని, సదరు ఐడీని ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా ఇంటర్ పోల్ అధికారులకు పంపామని చెప్పారు. ఇదిలాఉండగా సదరు ఈ మెయిల్ ఐడీని వినియోగిస్తున్న వ్యక్తి చైనాలోని షాంఘైలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. లాంబాకు బీజింగ్తోపాటు సింగపూర్, హాంగ్కాంగ్ నుంచి ఆర్డర్లను పొందినట్లు కూడా గుర్తించారు. ఈ విషయంలో పోలీసులు కూడా కొన్ని ఆధారాలను సంపాదించారు. ఈ మాదకద్రవ్యాన్ని తయారు చేసే ల్యాబ్లు రష్యాలో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు అధికారులకు లాంబా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఎల్ఎస్డీని ఆర్డర్ చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఉందని, ఈ ఘటన తర్వాత దానిని మూసివేశారని డీసీపీ కరుణాకరణ్, అదనపు డీసీపీ జాయ్ టిర్కీలతో కూడిన దర్యాప్తు బృందానికి లాంబా వెల్లడించాడు. గతంలో ఎల్ఎస్డీకి అంతగా డిమాండ్ లేకపోయినా ఇటీవల కాలంలో యువత దీనిపై బాగా ఆసక్తి చూపుతున్నారని, గత ఏడాదిగా దీనికి అసాధరణంగా డిమాండ్ పెరిగిందని, దీంతో మాదకద్రవ్యాల విక్రేతలు కూడా రకరకాల రూపాల్లో దీనిని సిద్ధంగా ఉంచుతున్నారని తెలిసింది. పోలీసులు, వారి జాగిలాలు కూడా గుర్తించడానికి వీలులేకుండా దీనిని భద్రపరిచే అవకాశముందని, అందుకే చాలామంది దీనిని విక్రయించడానికి, వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. లాంబా కూడా నగరంలోని పలు డిస్కోథెక్స్కు, పబ్సులకు దీనిని సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైందని, వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. లాంబాతో ఎవరు సన్నిహితంగా ఉండేవారు? అతనితో లావదేవీలు ఎవరెవరు జరిపేవారు? తదితర వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
ఒమన్లో రూ.65 కోట్లకు భారత మహిళ టోపీ
దుబాయ్: పెట్టుబడిదారులకు రూ.65 కోట్ల మేర టోపీ వేసిన ఓ భారత మహిళ ఒమన్ నుంచి ఉడాయించింది. తాను పలు ప్రాజెక్టులకు ఇన్చార్జినని పేర్కొంటూ ఒమన్ మంత్రిత్వ శాఖకు చెందిన నకిలీ పత్రాలను చూపించి, తమను మోసగించినట్లు బాధితులు తెలిపారు. వారంతా భారత్కు చెందినవారేనని ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ తెలిపింది. తమ పెట్టుబడికి కొన్ని నెలలవరకూ వడ్డీ సక్రమంగానే చెల్లించిందని, తర్వాత ఎగ్గొట్టిందని ఓ బాధితుడు తెలిపారు. ఆమె ఈ ఏడాది మే నెలలో ఒమన్ నుంచి పరారైందని.. ప్రస్తుతం మంగుళూరులో ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె కోట్లు కొల్లగొట్టిందని చెప్పారు. తాము పోలీసు కేసు పెట్టామని.. కోర్టునూ ఆశ్రయించామని చెప్పారు.