Telangana Budget 2020-21
-
దివంగత ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. నేడు(మార్చి 16న) దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, జైపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బలపరిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపారు. చదవండి: (విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేనన్నారు. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదని,. నోముల నర్సింహయ్య తనకు వ్యక్తిగతంగాదగ్గరి మిత్రులని పేర్కొన్నారు. ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు పని చేశామని, తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. నర్సింహయ్య గురువు రాఘవరెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నర్సింహయ్య బాధపడేవారని అన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని నర్సింహయ్య హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు. అనంతరం సభ వాయిదా పడింది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పనున్నారు.18న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సభలో చర్చోపచర్చలు ఉంటాయని.. ప్రతిపక్షాలు హుందాగా వ్యహరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐకరాజ్యసమితి అభినందించిందని గుర్తచేశారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశారమని మండిపడ్డారు. అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని తాము లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కోత.. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసి కంది రైతులను ఆదుకుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 34 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఎన్నికల హామీ కాకపోయిన కళ్యాణలక్ష్మి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా వెళ్లాయని.. కానీ కేంద్రం నుంచి లక్షా 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారని విమర్శించారు. దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది అని అన్నారు. రెండేళ్లల్లో సగానికి సగం అప్పులు తీరిపోతాయి.. నీటిపారుదల శాఖపై లక్షల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగానికి సగం అప్పులు తీరిపోతాయని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకు పైగా సన్న బియ్యం పంట పండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నామని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటును పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంపు.. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్య నిషేధం చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయాంలో వీధివీధికి సారా తయారు ఉండేదన్నారు. మద్యపానాన్ని తగ్గించేందుకే రెట్లు పెంచామని.. అవసరమైతే మళ్లీ మద్యం ధరల పెంపు నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంపు అనేది ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడితే లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామని అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. -
మన వ్యవసాయ కేటాయింపులు జాతీయసగటు కంటే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో పది శాతాన్ని దీనికే కేటాయించటం గొప్ప పరిణామమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి శనివారం శాసనసభలో వెల్లడించారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ పద్దులో కేవలం 6.5% మాత్రమేనన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు గొప్పగా ఉన్నాయి. నాడు బోరుబావి వేసి బాగుపడినవాడు లేడు, నేడు చెరువుల కింద సాగు చేసి చెడిపోయిన వాడు లేడు. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు కనిపించవు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించాలంటే రైతుబంధు అమలు ఉత్తమ మార్గమని నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్చంద్ అన్నారు. పంటల బీమా విషయంలో కేంద్రం చొరవ చూపనందున రాష్ట్ర రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతుబంధులాంటిది వర్తింప చేయాలని కొందరు సభ్యులు చేసిన సూచనపై ఆయన స్పంచారు. రాష్ట్రంలో కౌలు రైతు విధానం స్థిరంగా లేదని, తరచూ కౌలుదారులను మార్చటం వల్ల ఎప్పుడు ఎవరు కౌలు చేస్తారో తెలియని స్థితి ఉంటోంది. మాంద్యాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సహకార రంగాలకు ఉంటుంది. కేరళలో అన్ని సహకార సంఘాలకు కలిపి రూ.60 వేల కోట్ల నిధులున్నాయి. తెలంగాణలో అలాంటి పటిష్ట విధానాలను రూపొం దించి అంతకు రెట్టింపు నిధులు సమకూరేలా చేసే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. -
బడ్జెట్ సమావేశాలు కుదింపు!
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్’పై అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనూ కుదించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 6న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 20న ముగియాల్సి ఉంది. కోవిడ్పై అసెంబ్లీ కమిటీ హాల్లో శనివారం మధ్యాహ్నం సీఎం.. ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం, రాత్రి ప్రగతి భవన్లో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించాలని శనివారం ఉదయమే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలను 16వ తేదీతో ముగించాలని నిర్ణయించారు. దీంతో సభ కార్యకలాపాల షెడ్యూలులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 8న రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020–21ను ప్రవేశ పెట్టారు. 2 రోజుల సాధారణ చర్చ అనంతరం, శుక్ర, శనివారాల్లో శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు 15 పద్దులపై చర్చించి శాసనసభ ఆమోదించింది. 16 నుంచి 19 వరకు మరో 25 పద్దులౖ పె చర్చించేలా బీఏసీలో తొలుత షెడ్యూలు సిద్ధం చేశారు. తాజాగా సమావేశాలను కుదించాలని నిర్ణయించడంతో 15, 16 తేదీ ల్లోనే సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ షెడ్యూలులో 15న, ఆదివారం విరామం ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో నేడు కూడా పద్దులపై చర్చిస్తారు. 25 పద్దులకు గాను నీటిపారుదల, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ వంటి కీలక పద్దులకే చర్చను పరిమితంచేసే అవకాశం ఉంది. చర్చకు నోచుకోని మిగతా పద్దులను గిలొటిన్ చేసే అవకాశముంది. 20న ప్రవేశ పెట్టాల్సిన ద్రవ్య వినిమయ బిల్లును 16న ప్రవేశపెట్టి ఆమోదించి, సభను నిరవధిక వాయిదా వేస్తారు. సోమవారం మండలి సమావేశం ఈ నెల 6 నుంచి 14 వరకు జరిగిన శాసన మండలి.. బీఏసీ నిర్ణయం మేరకు తిరిగి 20న సమావేశం కావాల్సి ఉంది. తాజాగా మండలి షెడ్యూల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 16న సమావేశమయ్యే శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఈ మేరకు శాసనమండలిని సోమవారానికి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. కాగా బీఏసీ సభ్యుల అభిప్రాయం తీసుకున్నాకే అసెంబ్లీ సమావేశాలను కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆది, సోమవారాల్లో ప్రశ్నోత్తరాలను శాసనసభ నిబంధన 38 కింద రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శనివారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. -
‘కేసీఆర్ రైతుబంధు’గా పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పంట సీజన్ రాగానే రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మానేశారని, వ్యవసాయాన్ని వదిలేసిన వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో ఆలోచించి ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చిందన్నారు. ఇలా దేశానికి స్ఫూర్తిదాయకమైన ఈ పథకానికి ‘కేసీఆర్ రైతుబంధు’గా నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు కావడంతో తమ నియోజకవర్గమైన భూపాలపల్లికి 31 ఏళ్ల కిందట కాలువలు తవ్వినా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో 150 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయన్నారు. విమర్శలు చేసే వారంతా ఈ ప్రాజెక్టును చూస్తే వారి అభిప్రాయం మారిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఓసారి ప్రాజెక్టును చూసి రావాలని సూచించారు. ధాన్యం ఇతర పంటలను ఎక్స్పోర్టు చేసేందుకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిశాక కూడా కొత్త పథకాలు బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని, పట్టణాభివృద్ధికి చర్యలు వేగవంతం చేశారన్నారు. వరంగల్ లాంటి పట్టణాల్లో ఐటీ విస్తరణకు మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా ఎన్నికల ముం దు పథకాలు తీసుకురావడం సాధారణమని, కేసీఆర్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక కూడా కొత్తపథకాలు తెస్తున్నారన్నారు. సరిపడా విద్యుత్, నీరు అందుబాటులో ఉండటం వల్ల భూములు అమ్మకుండా వ్యవసాయం చేస్తు న్నారని పేర్కొన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూమి లభించట్లేదన్నారు. -
ఇది వాస్తవిక బడ్జెట్ : అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : దేశం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తోన్న దశలో సొంత ఆదాయ వనరులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఇది వాస్తవిక బడ్జెట్ అని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంత సహకారం అందడం లేదని, అందుకే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని ఆయన విమర్శించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 8న ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్పై అసెంబ్లీలో చర్చను బుధవారం అక్బరుద్దీన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలు ఆశించినంతగా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిరాశ కలిగించే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు స్పెషల్ గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇవ్వలేదని, కాళేశ్వరం నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర పన్నుల వాటా, గ్రాంటులు కలిపి రాష్ట్రానికి పెరిగింది రూ.513 కోట్లేనన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని, ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గృహ వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మోటారు వాహనాల రంగం సంక్షోభంలో ఉన్న దశలో మోటారు వాహనాల పన్ను పెంచుకుంటా మని ఎలా ప్రతిపాదించారో అర్థం కావట్లే దన్నారు. భూముల విక్రయాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. గత ఐదేళ్లలో దీనిపై రూ.3,987 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. వడ్డీలు రెండున్నర రెట్లు పెరిగాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.29 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ వడ్డీ చెల్లింపులు రెండున్నర రెట్లు పెరిగాయని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో రూ.2 వేల కోట్లు పాతబస్తీ అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. ఏటా ఇచ్చే రూ.10 వేల కోట్లను ఎలా ఖర్చు చేయాలనే దానిపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మున్సిపల్ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. గతంలో వైఎస్సార్ అధి కారంలో ఉన్నప్పుడు పాతబస్తీకి ప్రత్యేకంగా రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించారని, ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉర్దూ లేకుండా పోతోందని, ఖాళీలు భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐటీని ఓల్డ్ సిటీ వైపు విస్తరించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను మైనారిటీలకు కూడా కేటాయించాలని కోరారు. రేషన్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని, వక్ఫ్ బోర్డు బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
రాష్ట్రానికి క్షేమం కాదు : భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్ ఏమాత్రం క్షేమకరం కాదని, బడ్జెట్లో సామాజిక స్పృహ లోపించిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అభూత కల్పనలతో సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టి ప్రభుత్వం సభను, ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం అప్పులు, మద్యం విషయంలోనే బడ్జెట్లో అభి వృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది రాష్ట్ర ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. బడ్జెట్పై బుధవారం అసెంబ్లీలో జరిగిన సాధారణ చర్చలో ఆయన ప్రసంగిం చారు. ప్రభుత్వం చూపిన ద్రవ్యలోటు రూ. 33 వేల కోట్లను పూడ్చుకొని మరో రూ. 30 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని రాబడితే కానీ బడ్జెట్ వాస్తవ రూపంలోకి రాదన్నారు. రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్లో ద్రవ్యలోటు, పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 63 వేల కోట్ల రాబడి ప్రశ్నార్థకం కానుందన్నారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలి... గత బడ్జెట్లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఈసారి దానికి అదనంగా రూ. 16 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని భట్టి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలను తగ్గించాలని ప్రయత్నిస్తుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ‘తాగండి.. తాగండి.. తాగండి, అమ్మండి..అమ్మండి..అమ్మండి’ అనే రీతిలో వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే వెంటనే మద్యం అమ్మకాలను నియంత్రించాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని భట్టి డిమాండ్ చేశారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు అమ్మొద్దు... పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 30 వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని భట్టి ప్రశ్నించారు. భూములు అమ్ముతారా? రాజీవ్ స్వగృహ ఆస్తులు అమ్ముతారా? దిల్ భూములు అమ్ముతారా... ఏ మార్గంలో పన్నేతర ఆదాయం వస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మొద్దని, వాటిని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల కింద కేటాయించాలని కోరారు. 2007–08లో ప్రభుత్వం వేలం వేసిన భూములను కొన్ని సంస్థలు కొని నిరర్ధకంగా వదిలివేశాయని, ఆ భూములను మళ్లీ తీసుకొని వాటిని ప్రస్తుత ధరల్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని సూచించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో వివక్ష.. ప్రభుత్వం గత ఆరేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని భట్టి ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాల వల్ల ఐటీ రంగం అభివృద్ధి చెందిందే తప్ప ఇందులో టీఆర్ఎస్ సాధించిందేమీ లేదన్నారు. పరిశ్రమల స్థాపనలో సర్కారు వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వారికి, ప్రజాప్రతినిధులకు వాటాలున్న కంపెనీలకు ప్రత్యేక జీవోలిచ్చి ప్రోత్సాహకాలిస్తున్నారని, మిగిలిన మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పౌల్ట్రీ రంగంలో పెద్ద అవినీతి జరిగిందని, పౌల్ట్రీ రైతుకు సబ్సిడీపై ఇవ్వాల్సిన మొక్కజొన్నలను బడా కంపెనీలు గంపగుత్తగా టన్ను రూ. 18 వేలకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రూ. 26 వేలకు బయట అమ్ముకుంటున్నాయని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. విద్యకు కేటాయింపులు పెంచాలి... యూనివర్సిటీలకు కేటాయించిన మొత్తం జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోవని భట్టి అభిప్రాయపడ్డారు. పీహెచ్డీ విద్యార్థులు కేటరింగ్ పనులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 58.71 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేవలం 5.14 శాతం అంటే 3.02 లక్షల మంది మాత్రమే చదువుకోగలుగుతున్నారని చెప్పారు. 46.82 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎంత కాలం? బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు చూపినా వాటిని ఎలా ఖర్చు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలు కలపి రూ. 3.19 లక్షల కోట్లకు చేరాయని, బడ్జెట్లో రూ. 22 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలకే కట్టాల్సి వస్తోందని, భవిష్యత్లో అవి మోయలేని స్థితికి చేరుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తిరిగి చెల్లించే గడువు కూడా 40 ఏళ్లు పెట్టారని తెలుస్తోందని, దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. లక్షల కోట్లు చూపుతూ కేటాయింపులు మాత్రం ఈసారి రూ. 11 వేల కోట్లకే పరిమితం చేశారని, ఈ కేటాయింపులతో ప్రాజెక్టులు ఎన్నేళ్లు కడతారని భట్టి ప్రశ్నించారు. పదేపదే రుణాలు తీసుకునేందుకే ప్రభుత్వం ఇలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ స్థాయిలో అప్పులు చేయలేదన్నారు. మిషన్ భగీరథను పెద్ద ఫ్రాడ్గా అభివర్ణించిన భట్టి... గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు సంతకాలు చేయించుకొని వెళ్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో విభేదిస్తున్నానని, ప్రజలకిచ్చిన హామీలకు అనుగుణంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేలా బడ్జెట్ కేటాయింపులను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ పేరు చెప్పేటప్పుడు అనుమతి తీసుకున్నారా? పౌల్ట్రీ రంగంపై భట్టి మాట్లాడుతున్న సమయంలో మార్క్ఫెడ్ నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు, వాటి యజమానుల పేర్లు చెబుతూ రంజిత్రెడ్డికి చెందిన రాజరాజేశ్వరి హేచరీస్ పేరును ప్రస్తావించారు. దీంతో కలగజేసుకున్న ఆర్థిక మంత్రి హరీశ్రావు... సభలో లేని వ్యక్తి పేరు ప్రస్తావించే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని, ఒకవేళ తీసుకోకపోతే రికార్డుల నుంచి ఆ పేరును తొలగించాలని స్పీకర్ను కోరారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రంజిత్రెడ్డి ఎంపీ అని తనకు ఇంతవరకు తెలియదని, కానీ తాను ఎంపీ అని సంబోధించలేదన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్కు సంబంధించిన అంశంపై భట్టి మాట్లాడుతుండగా ప్రభుత్వ విప్ సునీత కలగజేసుకొని సభ నుంచి భట్టిని సస్పెండ్ చేయలేదని కామెంట్ చేసి నాలుక కరుచుకున్నారు. మద్యం, యూనివర్సిటీలు, మిషన్ భగీరథపై భట్టి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలంటూ అధికార టీఆర్ఎస్ సభ్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. -
ఆర్థిక మాంద్యంలోనూ బీసీ సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : ఆర్థికమాంద్యంలోనూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2020–21కు ఆర్థిక రంగ నిపుణులతో పాటు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నా యని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద వ్, వి.శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ తెలిపా రు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో సోమవారం మంత్రులు మీడియాతో మాట్లాడా రు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు పెరిగాయని, 70 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతోం దని పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సబ్ప్లాన్ కంటే ఎక్కువ మేలు బీసీలకు కలిగేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, కేసీఆర్ను బీసీలు శాశ్వతంగా గుర్తుకు పెట్టుకుంటారని అన్నారు. గతంలో అంకెల కోసం బడ్జెట్ రూపొం దిస్తే, తాము ఆచరణ సాధ్యమైన బడ్జెట్ను ప్రవేశ పెట్టామన్నారు. బడ్జెట్ తీరుతెన్నులపై ప్రతిపక్షా లు అర్ధం లేని విమర్శలు చేస్తున్నాయని తలసాని వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యంలోనూ బీసీలు, అణగారిన వర్గాల కోసం రూ.30వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శా ఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము బీసీ అనుకూల అనుకూల విధానాన్ని కొనసాగిస్తున్నందునే బీజేపీ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తోందన్నారు.దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్, బీజేపీ కనీసం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ను మరో జ్యోతీరావు ఫూలేగా అభివర్ణించిన శ్రీనివాస్గౌడ్ పని చేసే వ్యక్తిని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీని బీసీ వర్గాలు కక్ష కట్టి మరీ ఓడిస్తాయని హెచ్చరించారు. బీసీలకు సబ్ ప్లాన్ అవసరమనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని భవిష్యత్తులో పరిశీలిస్తారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎంబీసీలకు రూ.500 కోట్లు.. అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీ) చెందిన వారి కోసం రూ.500 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇంత పెద్దమొత్తంలో బీసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని, అనేక ఇతర పథకాల ద్వారా కూడా బీసీలకు మేలు కలుగుతుందన్నారు. బీసీ ఫెడరేషన్ల ఖాతాలో నిధులు లేవనే ఆరోపణలను ఖండిస్తూ, గీత కార్మికుల సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధుల కేటాయింపు పెరిగిందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో వివిధ వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచేవని, కానీ తమ ప్రభుత్వ విధానం మాత్రం అన్నివేళలా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. -
పాత ప్రాజెక్టులకు.. అరకొర నిధులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్లో సాగునీటిశాఖకు చేసిన నిధుల కేటాయింపుల్లో నిర్మాణంలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు మొండిచేయి ఎదురైంది. ప్రాజెక్టుల పూర్తికి రూ. వందల కోట్లలో కేటాయింపులు కోరితే కేవలం రూ.పదుల కోట్లలో మాత్రమే నిధులు దక్కాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రా జెక్టు, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులకూ అరకొర నిధులే ఇచ్చి ంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ చివరి దశలో ఉన్నాయి. వీటికింద ఉన్న కొద్ది పాటి భూసేకరణ, సహాయ పునరావాసానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తే గణనీయంగా ఆయ కట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కల్వకుర్తి పరిధిలో భూసేకరణకోసం రూ. 24.18 కోట్లు, పనులకు సంబంధించి రూ.79.32 కోట్ల పెండింగ్ బిల్లులు ఉండగా, నెట్టెంపాడు పరిధిలో పనులకు చెందినవి రూ.11.47 కోట్లు, భూసేకరణవి రూ.8.98 కోట్లు, పునరావాసానివి రూ.1.83 కోట్లు బకాయిలు ఉండగా, భీమా పరిధి లోనూ రూ.36 కోట్ల బకాయిలున్నాయి. వీటిని తీర్చడంతో పాటు చివరి దశ పనుల పూర్తికి కనీసం రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది.అయినప్పటికీ బడ్జెట్లో మొత్తంగా రూ.50 కోట్ల నిధులే దక్కాయి. అధిక నిధుల అవసరాలున్న కల్వకుర్తి ప్రాజెక్టుకు కేవలం రూ.2.29 కోట్లతో సరిపెట్టారు.గతేడాది సైతం ఈ ప్రాజెక్టుకు రూ.3 కో ట్లు నిధుల కేటాయింపు జరగడం విశేషం.ఇక బీమాకు రూ.3.69 కోట్లు,నెట్టెంపాడుకు రూ.16.70 కోట్లు, కోయిల్సాగర్కు రూ.17.40 కోట్లతో నామమాత్రపు కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తి ఎలా సాధ్యమన్నది భవిష్యత్తే చెప్పాల్సి ఉంది. టన్నెల్ అక్కడే..ప్రాణహిత పడకే.. ఇక ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల పూర్తికి నిధులను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో పనులకు గాను రూ.126 కోట్ల మేర నిధులు పెండింగ్లో ఉండగా కేటాయించింది మాత్రం రూ.3.16 కోట్లు మాత్రమే. ఈ నిధులతో 43.89 కి.మీటర్ల టన్నెల్ పనుల్లో మిగిలిన మరో 10 కి.మీ.లకు టన్నెల్ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతంపై ఇప్పటికీ స్పష్టత లేదు.బ్యారేజీ దిగువన పనులు జరుగుతున్న ప్యాకేజీల్లో ఇంకా భూసేకరణ అవసరాలకు రూ.269 కోట్ల నిధులు అవసరమున్నా ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించినా కేవలం రూ.12 కోట్లు కేటాయించి ప్రభుత్వం పూర్తిగా నిరుత్సాహ పరిచింది. -
6 లక్షల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఖర్చయిన మొత్తం అక్షరాలా రూ. 6 లక్షల కోట్లపైనే. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రగతికి బాటలు పడడం, హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందుతుండటంతో ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల రూపంలో కలిసొచ్చాయి. దీంతో 2016–17లోనే రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లు దాటాయి. ప్రభుత్వం కూడా మిగులు బడ్జెట్ గురించి ఆలోచన చేయకుండా రాబడులను దాదాపు పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంతో ఇప్పటివరకు రూ. 6.35 లక్షల కోట్లకుపైగా ఖర్చయింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2014–15లో రూ. 61,840 కోట్లు ఖర్చుకాగా ఆ తర్వాతి ఏడాది రూ. 90 వేల కోట్లు దాటింది. ఇక మూడో ఏడాది నుంచి రూ. లక్ష కోట్లు దాటిన ప్రభుత్వ ఖర్చు ప్రస్తుత ఏడాదికి వచ్చే సరికి రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి 100 శాతంకన్నా ఎక్కువకు చేరిందన్నమాట. గత ఆరేళ్లలో రూ. 6.6 లక్షల కోట్ల రాబడులు రాగా అందులో 96 శాతం మేర అంటే రూ. 6.3 లక్షల కోట్లను ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఖర్చు ప్రతి వ్యక్తిపై రూ. 1.81 లక్షలకుపైగా కావడం విశేషం. -
‘కేసీఆర్ కరోనాకు మందు కనిపెట్టారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది మోసపూరిత, అబద్దాల బడ్జెట్ అని అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంకెల గారడీతో బడ్జెట్ను మసిపూసి మారేడు కాయలా చేశారన్నారు. బడ్జెట్ బారెడు- ఖర్చు చారెడుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తలసారి ఆదాయం చెప్పిన ప్రభుత్వం అప్పును ఎందుకు చెప్పడం లేదు? లోటును ఎలా పూడ్చుతారో చెప్పలేదేంటని వరుస ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్రూం.. ఇలా కీలకమైనవాటిని గాలికొదిలేశారన్నారు. ఉద్యోగ నొటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరి తలపై రూ.91వేలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని విమర్శించారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?) ‘నిరుద్యోగ భృతి అని చెప్పి ఏడాదిన్నర కావొస్తున్నా అతీగతి లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా... తాజాగా డబ్బులు ఇస్తామని కొత్త మోసం చేయబోతున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఎన్నికలు ఉన్నందున నగరానికి రూ.పది వేల కోట్లు అంటున్నారు. ఇది పచ్చి మోసం. డబ్బులు లేవని ఆస్తులను అమ్మే వారు ఏ రకంగా ఆదర్శప్రాయులో వారే చెప్పాలి. రాష్ట్రంలో ఆర్థిక మందగమనం లేదు. ఉన్నదల్లా కేసీఆర్ మందగమనమే. కేంద్రం మీద సాకు చూపి వీరి అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారు. నిరుద్యోగ, ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో పార్టీ నేతృత్వంలో ఉద్యమం చేపడతాం. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏమైంది? కరోనాకు పారాసిటమాల్ మందును డాక్టర్ కేసీఆర్ కనుగొన్నారా? కేసీఆర్.. ఎంఐఎంకు తలొగ్గి సీఏఏపై తీర్మానం అంటున్నారు’ అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. (రోహింగ్యాలకు పింఛన్లా?) -
రుణమాఫీకి ప్రభుత్వం సమాయత్తం
సాక్షి, ఖమ్మం : పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్ష పంట రుణాన్ని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష పంట రుణాలను నాలుగు విడతలుగా 2017 నాటికి ప్రభుత్వం మాఫీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూడా పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. (ఇది ప్రగతిశీల బడ్జెట్ ) గత రుణమాఫీ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత రుణమాఫీని పటిష్టంగా అమలు చేసేందుకు విధి విధానాలను, మార్గ దర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత ఉంటుందనే అంచనాలను కూడా పరిశీలిస్తున్నారు. అందుకోసం ప్రాథమికంగా జిల్లాలవారీగా రైతులు 2018, డిసెంబర్ 1వ తేదీ నాటికి తీసుకున్న పంట రుణాల బకాయిల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లకు వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకు కంట్రోల్ కార్యాలయాలు జిల్లా బ్యాంకులకు పంట రుణ బకాయిల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. (తెలంగాణ రైతులకు శుభవార్త) ఇదే అంశాన్ని ఖమ్మం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్రావు కూడా జిల్లాలోని బ్యాంక్లను రైతుల పంట రుణ బకాయిల వివరాల నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో పంట రుణాలు అందించిన బ్యాంకుల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)తో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఆంధ్రాబ్యాంక్(ఏబీ)తో పాటు పలు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి రూ.లక్ష లోపు పంట రుణ బకాయిలు కలిగిన వివరాలను సేకరిస్తున్నారు. (లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్) రుణం పొందిన రైతులు 2.63 లక్షలు జిల్లాలో మొత్తం రైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. అయితే, వారిలో 2,63,434 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వం నిర్ణయించిన 2018 డిసెంబర్ నాటికి రూ.2,324 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. 2014లో ప్రకటించిన రుణమాఫీ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హత సాధించారు. ఈ మొత్తం రైతులకు రూ.1,636 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 2.28 లక్షల మంది రైతులుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.31 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. గత రుణమాఫీలో ఒక రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే, గత రుణమాఫీ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 17 వేల మంది అర్హులైన రైతులకు సుమారు రూ.84 కోట్లు మాఫీ వర్తించలేదు. గత రుణమాఫీ ప్రక్రియను మండల స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు, బ్యాంకర్లు ఓ బృందంగా ఏర్పడి జాబితాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న తప్పిందంతో అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి పలుసార్లు వెళ్లింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా రుణమాఫీ ప్రక్రియ జరగాలని రైతులు కోరుకుంటున్నారు. మార్గదర్శకాలు వెలువడితే జాబితా సిద్ధం ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను తయారు చేసి వెలువరిస్తే అర్హులైన రైతుల జాబితాలను తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన రైతుల రుణమాఫీ మొత్తాలను ఆయా రైతుల ఖాతాల ఆధారంగా ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసే అవకాశం ఉంది. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం 2018 డిసెంబర్ 1వ తేదీ నాటికి పంట రుణాల బకాయిల వివరాలను బ్యాంకుల వారీగా సేకరించే ప్రక్రియను ప్రారంభించాం. మూడు, నాలుగు రోజుల్లో పంట రుణ బకాయిల వివరాలు బ్యాంకుల నుంచి అందే అవకాశం ఉంది. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తాం. చింతా చంద్రశేఖర్రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఖమ్మం -
డేగ‘కళ్ల’ కోసం రూ.50 కోట్లు...
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నగర భద్రతకు పెద్దపీట వేసింది. ఆ కోణంలోనే నిధుల కేటాయింపు చేసింది. బంజారాహిల్స్లో నిర్మాణమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కమ్ టెక్నాలజీ ప్యూజన్ సెంటర్కు రూ.125 కోట్లు కేటాయించింది. దీంతో పాటు మూడు కమిషనరేట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రగతి పద్దు కింద రూ.672 కోట్లు కేటాయింగా... దీని నుంచి రాజధానిలోని మూడు కమిషనరేట్లకే రూ.329 కోట్ల కేటాయింపు జరిగింది. అయితే.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పోలీసుస్టేషన్లకు మాత్రం నామమాత్రపు కేటాయింపులతో మొండిచేయి చూపింది. డేగ‘కళ్ల’ కోసం రూ.50 కోట్లు... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శరవేగంగా నడుస్తున్న ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. 2018–19ల్లో ఈ బడ్జెట్లో రూ.147.5 కోట్లు కేటాయించింది. ఇదే ప్రాజెక్టుకు తాజాగా రూ.50 కోట్లు కేటాయించింది. మరోపక్క ముగ్గురు కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా సంఖ్య రెండు లక్షలకు చేరుతోంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో అవసరమైన పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చింది. ఇతర కేటాయింపులు ఇలా... ♦ నగర ట్రాఫిక్ విభాగానికి: రూ.2.56 కోట్లు ♦ గణేష్ ఉత్సవాల నిర్వహణకు: రూ.6.14 కోట్లు ♦ నగర నేర పరిశోధన విభాగానికి: రూ.12 లక్షలు ♦ కమ్యూనిటీ పోలీసింగ్కు: రూ.5 లక్షలు ♦ ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు: రూ.10 కోట్లు ♦ టెక్నాలజీ సమీకరణకు: రూ.10 కోట్లు ♦ సైబరాబాద్ ట్రాఫిక్కు: రూ.2.22 కోట్లు ♦ సైబరాబాద్ గణేష్ ఉత్సవాలకు: రూ.28 లక్షలు ♦ సైబరాబాద్లో కమ్యూనిటీ పోలీసింగ్కు: రూ.15 లక్షలు ♦ రాచకొండ గణేష్ ఉత్సవాలకు: రూ.2.05 కోట్లు ♦ టెక్నాలజీ సమీకరణకి: రూ.4 కోట్లు ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు.. బంజారాహిల్స్లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న టెక్నాలజీ ప్యూజన్ సెంటర్గా ఉండే సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్– క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్సీపీసీహెచ్క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.125 కోట్లు కేటాయించింది. ఈ భవనానికి సీఎం కేసీఆర్ 2015 నవంబర్ 22న శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అప్పట్లో అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017– 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. 2018–19లో రూ.280.8 కోట్లు కేటాయింపు జరిగింది. గత ఏడాది ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో పూరిత చేయడం ఆలస్యమైంది. తాజాగా రూ.125 కోట్లు కేటాయించడంతో ఈ ఏడాది చివరి నుంచి దీని సేవలు ప్రారంభంకావడానికి మార్గం సుగమమైంది. రాష్ట్రానికే తలమానికం... దేశంలోనే ప్రతిష్టాత్మకంగా, ‘ట్విన్ టవర్స్’ పేరుతో హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్మిస్తున్న హెచ్సీపీసీహెచ్క్యూ అండ్ ఐసీసీసీ రాష్ట్రానికే తలమానికం కానుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 83.4 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్నాయి. వీటి ద్వారా పోలీసు సింగిల్ విండో, కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం, సిటిజన్ పిటిషన్ మేనేజ్మెంట్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం, లా అండ్ ఆర్డన్ సిస్టం, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఒకే గొడుగు కిందికి రానున్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంలో భాగంగా డయల్– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోటకు చేరతాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది. ‘రాచకొండ’ నిర్మాణం ఇక షురూ.. సైబరాబాద్ నుంచి విడిపడి, నల్లగొండలో ఉన్న భువనగిరి, చౌటుప్పల్ తదితర ప్రాంతాలను తనలో కలుపుకొంటూ ఏర్పడిందే రాచకొండ పోలీసు కమిషనరేట్. 2016లో ఆవిర్భవించిన ఈ కమిషనరేట్ 5091.48 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్దదిగా మారింది. దీనికంటూ ప్రత్యేకంగా కమిషనరేట్ భవనం లేకపోవడంతో గతంలో గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్లో కొన్నాళ్లు కొనసాగింది. ఆపై నేరేడ్మెట్లోని తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. కమిషనరేట్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటానికి దీని పరిధిలోని అనువైన ప్రాంతంలో ప్రత్యేక కమిషనరేట్ అవసరం ఉందని భావించిన సర్కారు మేడిపల్లిలో 56 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం ప్రహరీ నిర్మానంలో ఉండగా... ఈ బడ్జెట్లో రాచకొండ పోలీసు కమిషనరేట్కు ప్రగతి పద్దు కింద దీని నిర్మాణానికి రూ.62.95 కోట్లు కేటాయించింది. దీంతో భవన నిర్మాణం ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి.. నగర భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే బంజారాహిల్స్లో నిర్మితమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు రూ.125 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం భారీగా కేటాయింపు జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 60 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఈ కేటాయింపుల్ని సద్వినియోగం చేసుకుని రాజధానిని ప్రథమ స్థానంలో నిలుపుతాం. – అంజనీకుమార్, సిటీ కొత్వాల్ -
మహా నగర ప్రాజెక్టులపై ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఓఆర్ఆర్ జైకా రుణం, ఓఆర్ఆర్ బీఓటీ అన్యూటీ పేమెంట్ల కింద గతంలో పెండింగ్లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాశపరచడంతో హెచ్ఎండీఏ అధికారులకు ఏమీ చేయాలో పాలుపోవడం లేదు. 2020–21 సంవత్సరంలో ఓఆర్ఆర్ జైకా రుణం కింద కాంట్రాక్టర్లకు రూ.20 కోట్లు, బీఓటీ అన్యూటీ పేమెంట్ల కింద రూ.331.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించడంతో ఈ ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన రూ.351.38 కోట్లలో రూ.351.18 కోట్లు హెచ్ఎండీ సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరే ఓఆర్ఆర్ టోల్ ఫీజు ఆదాయంతో పాటు ఎల్ఆర్ఎస్ నిధులు, బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్ల రూపంలో వచ్చే రెవెన్యూతో సరిపెట్టుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ఆదేశాలివ్వడంతో కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే హెచ్ఎండీఏకు ఎల్ఆర్ఎస్ రూపంలో సమకూరిన రూ.1100 కోట్లలో రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో చాలావరకు సగంలోనే ఉండటంతో మరిన్ని నిధుల అవసరముంది. అభివృద్ధి ప్రాజెక్టులకు కష్టకాలమేనా..? అంతర్జాతీయ స్థాయి హంగులతో నగరంపై పడుతున్న ట్రాఫిక్ను తగ్గించే క్రమంలో నిర్మించాలనుకున్నా మియాపూర్లోని ఇంటర్సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఇప్పటికీ మొదలుకాలేదు. పెద్దఅంబర్పేటలో ఐసీబీటీ, శంషాబాద్లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు, . శంషాబాద్, మనోహరబాద్, పటాన్చెరు, శామీర్పేటలోనూ లాజిస్టిక్ హబ్లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇవి కూడా పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. మినీ పట్టణాలకు సైతం.. 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ ఇరువైపులా దాదాపు 764 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు లక్ష ఎకరాలు అవసరముంటుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. దాదాపు పది వేల ఎకరాలు ప్లాటింగ్ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలుతున్నది 60 వేల ఎకరాలే. ఈ లెక్కన చూసుకున్నా 60వేల ఎకరాల్లో గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా ప్రగతివైపు అడుగులు పడటం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆ వైపే ఎవరూ చూడటం లేదు. తాజా బడ్జెట్ పరిస్థితి చూశాక హెచ్ఎండీఏపైనే భారం పడటంతో మినీ పట్టణాల పరిస్థితి కష్టమే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రాజెక్టుల నిర్వహణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రధాన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వహణలోకి వస్తున్నందున వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు వీలుగా ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులు చేసిం ది. తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రగతి పద్దుకు మించి నిర్వహణకు నిధుల కేటాయింపు భారీగా జరిగినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది నుంచి విద్యుత్ వినియోగం పెరగనుంది. దానికనుగుణంగా విద్యుత్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి. ఇప్పటివరకు 1,400 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉండగా ఈ ఏడాది జూన్ నుంచి 7 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని లెక్కగట్టారు. వాటికి రూ. 7,000–8,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక ఉంది. ఇందులో కాళేశ్వరం ద్వారానే 360 టీఎంసీలు ఎత్తిపోయనుండగా దానికి 6 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి నిర్వహణ పద్దు కింద ఏకంగా రూ. 5,219 కోట్లు కేటాయించారు. పాలమూరు–రంగారెడ్డి నిర్వహణకు రూ.18.40 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ. 21.04 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పథకాలకు మరో రూ. 62.93 కోట్లను నిర్వహణ పద్దు కింద కేటాయించారు. -
ఖాకీ బడ్జెట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో పోలీసు శాఖకు కోతపడినా.. ఈసారి కేటాయింపులు ఫర్వాలేదనిపించాయి. గతేడాది బడ్జెట్లో ప్రగతిపద్దు రూ.167 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 4,788 కోట్లు కేటాయించింది. కోతల బడ్జెట్ కారణంగా స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా జరగలేదు. గడిచిన 6 నెలల్లో పోలీసు స్టేషన్లలో పెన్నూ, పేపర్లకూ దిక్కులేకుండా పోయింది. ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దుకు రూ. 5,179.22, ప్రగతి కింద రూ. 672.74 కోట్లుగా మొత్తం రూ. 5,852 కోట్లు కేటాయించింది. ఈసారి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు కలిపి గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్ కంటే దాదాపుగా రూ.890 కోట్ల (ప్రగతి పద్దులో రూ.500 కోట్లు, నిర్వహణ పద్దులో రూ. 390 కోట్లు)కుపైగా పెరగడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తవని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది దసరా అనంతరం దాదాపు 11 మంది ఐపీఎస్లు, 15 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు, 12 వందల మంది ఎస్సైలు డిపార్ట్మెంటులోకి చేరుతున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహణ వ్యయాన్ని పెంచారు. మరోవైపు కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (డీపీవో) కార్యాలయాలు పూర్తికావొచ్చాయని బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది పలు డీపీవోలు ప్రారంభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్లో మహిళలు, పిల్లల భద్రత, కమిషనరేట్ భవనాల నిర్మాణం, సేఫ్సిటీ ప్రాజెక్టు, కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణాల కోసం మొత్తం రూ.125 కోట్లు కేటాయించింది. నగరంలో సీసీటీవీల ఏర్పాటు కోసం రూ.50 లక్షలు ఇవ్వనుంది. చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు భారీగా పెంపు గ్రామీణ, చిన్న పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయి. తాజా బడ్జెట్లో వీటికి రూ.1132.39 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కేవలం రూ.21.90 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి భారీగా పెంచింది. ప్రధానంగా రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయం పెరిగి కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీగా పెరగనున్న పంటల దిగుబడులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ పద్దు కింద తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు పెట్టుబడి రుణం కింద కేటాయింపులను రూ.87.90 కోట్ల నుంచి రూ.257 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామీణ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారీగా కేటాయింపులు జరిపింది. పరిశ్రమలకు రాయితీలను 38.98 కోట్ల నుంచి 16.71 కోట్లకు తగ్గించింది. గోదావరి తీరం సుందరీకరణకు రూ.250 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో రూపుదిద్దుకున్న పంప్హౌస్లను ఆసరా చేసుకుని గోదావరి నదీ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుందర ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని, కశ్మీర్ తరహాలో ఎత్తయిన చెట్లను పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. దానికోసం తాజా బడ్జెట్లో పర్యాటక శాఖకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్హౌస్ ప్రాంతానికి రూ.80 కోట్లు, మేడిగడ్డ వద్ద అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు, కన్నేపల్లి నుంచి అన్నారం బ్యారేజీ మధ్య పనులకు రూ.40 కోట్లు, అన్నారం బ్యారేజీ వద్ద పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. ఇక కళాకారుల వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.6.75 కోట్లు, సాంస్కృతిక సారధికి రూ.16 కోట్లు కేటాయించారు. -
పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధులు
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా వార్షిక బడ్జెట్ 2020–21లో రూ.11,917 కోట్లను కేటాయించింది. పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధుల్ని అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించడంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఈ ప్రాజెక్టు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకు ప్రత్యేక కాలనీలుగా నిర్ధారిత ప్రాంతంలో ఇళ్లను నిర్మించేవారు. యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఈ ప్రాజెక్టు పనులు పడకేశాయి. ప్రస్తుతం తాముంటున్న ఇల్లు ఒక చోట ఉండటం, కొత్తగా మంజూరై నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరోచోట ఉండటాన్ని లబ్ధిదారులు ఇష్టపడలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులనే సొంతంగా తమ స్థలంలో ఇళ్లను నిర్మించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోపాటుగా డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్లో ప్రభుత్వం రూ.11,917 కోట్లను ప్రతిపాదించింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది ఉంటారని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్రావు ప్రకటించారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రగతి పద్దుకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.3,850 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తం గ్రామ ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
పరిశోధన, అభివృద్ధికి శూన్యం!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులను కేటాయించలేదు. ఇంటర్మీడియట్ విద్యను మినహాయిస్తే ఉన్న త, సాంకేతిక విద్యలో నిర్వహణ, ప్రగతి ప ద్దు కింద గతేడాది కంటే ఈసారి నిధులను ప్రభుత్వం తగ్గించింది. యూనివర్సిటీలకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి నిధులను పెంచింది. అయితే పెరిగిన నిధులు యూనివర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. సెంట్రల్ పీఆర్సీ సిఫారసు మేరకు యూజీసీ ప్రకటించిన వేతనాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు ఆ వేతనాల చెల్లింపులకు అయ్యే అదనపు నిధులను మాత్రమే నిర్వహణ పద్దులో కేటాయించింది. ఈసారి ఉన్నత, సాంకేతిక విద్యకు మొత్తంగా రూ.1,723.28 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,638.04 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.85.24 కోట్లు కేటాయించింది. అదే గతేడాది మొత్తంగా రూ.1,690.79 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,632.85 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.57.94 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, పరిశోధనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కావాలని అడిగినా రూ.1,723.27 కోట్లకే పరిమితం చేసింది. ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.30 కోట్ల వరకు కోత పెట్టగా, ప్రగతి పద్దులో రూ.28.53 కోట్లు అదనంగా ఇచ్చింది. సాంకేతిక విద్యలో భారీ కోత.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలు కోసం గతేడాది రూ.5.78 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.34.27 కోట్లు కేటాయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.3 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ బిల్డింగ్ నిర్మాణం కింద రూ.3 కోట్లు, వివిధ పథకాల కింద రూ.3.22 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా కింద గతేడాదిలాగే నిధులను కేటాయించింది. గతేడాది రూ.14.95 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.15.04 కోట్లు కేటాయించింది. మరోవైపు సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దులో భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.265.08 కోట్లకే పరిమితం చేసింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సుల్తాన్పూర్ కాలేజీకి రూ.5.10 కోట్లు, మంథని కాలేజీకి రూ.63 లక్షలు, కరీంనగర్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5.59 కోట్లు కేటాయించింది. అయితే జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. పాలిటెక్నిక్ కాలేజీలకు గతేడాదితో పోల్చితే భారీగా బడ్జెట్ను తగ్గించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.142.83 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.98.99 కోట్లు మాత్రమే కేటాయించింది. -
గ్రేటర్ ఎన్నికలకు వేళాయే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్కు నిధుల పంట పండింది. ‘హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్’అనే కొత్త పద్దు కింద ఏకంగా రూ.7,547 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. హైదరాబాద్కు ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన పుర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ 2020–21లో పురపాలక శాఖకు ప్రగతిపద్దు కింద రూ.11,020.37 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,261.98 కోట్లు కలిపి మొత్తం రూ.12,282.35 కోట్లు కేటాయించింది. 2018–19లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,262.21 కోట్లు కలిపి మొత్తం రూ.5,942.9 కోట్లు కేటాయించగా, తాజా కేటాయింపులు రెట్టింపు చేసింది. నిర్వహణ పద్దు కింద జల మండలికి నీటిసరఫరా, పారిశుధ్యం నిర్వహణ కోసం రుణాలను రూ.825 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచింది. కార్పొరేషన్లకు మళ్లీ కోత.. రాష్ట్ర ఆర్థిక సంఘానికి నిధుల కేటాయింపులను రూ.1,036.98 కోట్ల నుంచి రూ.889 కోట్లకు తగ్గించింది. రాష్ట్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద కేటాయింపులను రూ.521.73 కోట్ల నుంచి రూ.889 కోట్లకు పెంచింది. వడ్డీ లేని రుణాల పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయింపులను రూ.75.47 కోట్ల నుంచి రూ.226.41కోట్లకు పెంచింది. వరంగల్కు రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను 2017–18లో కేటాయించిన ప్రభుత్వం, వరుసగా రెండో ఏడాది వీటికి రిక్తహస్తం చూపించింది. అయితే తొలిసారిగా మిషన్ భగీరథ (అర్బన్) పథకానికి రూ.800 కోట్లను కేటాయించింది. ఆలయాలకు రూ.400 కోట్లు యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.350 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థకు కేటాయింపులను రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. -
విద్యాశాఖకు 12,127.55 కోట్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖకు 12,127.55 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెం బ్లీలో ప్రకటించిన బడ్జెట్లో విద్యాశాఖకు రూ.12,144 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, విభాగాల వారీగా చూస్తే రూ. 12,127.55 కోట్లుగా ఉంది. గతేడాది విద్యా శాఖకు రూ.9,899.12 కోట్లు మాత్రమే కేటా యించగా ఈసారి దానికి అదనంగా 2,238.43 కోట్లు ఇచ్చింది. విద్యాశాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.10,405.29 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,452.03 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.270.23 కోట్లను కేటాయించింది. ఇక ఈసారి అదనంగా ఇచ్చిన రూ.2,238.43 కోట్లలో పాఠశాల విద్యలోనే నిర్వహణ పద్దు కింద రూ.1,642.32 కోట్లను కేటాయించగా, ప్రగతి పద్దులో 598.82 కోట్లను కేటాయిం చింది. ప్రగతిపద్దులో ఈ మొత్తాన్ని సమగ్ర శిక్షా అభియాన్ కోసం కేటాయింపులు జరి పింది. వాస్తవానికి పాఠశాల విద్యకే రూ.14 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని ప్రతిపాదనలను పంపించినా రూ.10,405.29 కోట్లకు ప్రభుత్వం కేటాయింపులు పరిమితం చేసింది. మరోవైపు ఈచ్ వన్ టీచ్ వన్కు రూ.100 కోట్లు కేటాయించింది. విభాగాల వారీగా కేటాయింపులివీ.. నిర్వహణ పద్దులో పాఠశాల విద్యకు కేటా యించిన రూ.9,113.10 కోట్లలో సాధారణ విద్యకు రూ.8,864.25 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.9.59 కోట్లు, వయోజన విద్యకు రూ.7.40 కోట్లు, ప్రభుత్వ గ్రంథాల యాలకు రూ.54.11 కోట్లు, జవహర్ బాలభ వన్కు రూ.2.99 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.34.49 కోట్లు, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.135.99 కోట్లు కేటాయించిం ది. సమగ్ర శిక్షా అభియాన్కు రూ.135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటా యించింది. అయితే ఈ నిధులన్నీ నిర్వహణ కు, వేతనాలకే సరిపోనున్నాయి. ఇక ప్రగతి పద్దులో రూ.1,292.19 కోట్లు ప్రభుత్వం కేటా యించింది. అయితే అవి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏమాత్రం సరిపోవని విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘా లు అభిప్రాయపడుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు ఈ నిధులతో సాధ్యం కావని అంటున్నాయి. రెండేళ్ల కిందటితో పోల్చితే తక్కువే.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రెండేళ్ల కిందటి తో పోల్చితే ఈసారి చేసిన కేటాయింపులు తక్కువే. ఈ పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లిం చాల్సిన మొత్తం కింద గతేడాది రూ.491.56 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.1,239.46 కోట్లను కేటాయించింది. గతే డాదితో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు పెరి గింది. అయితే అంతకుముందు సంవత్స రాల్లో చేసిన కేటాయింపుల కంటే ఈసారి తగ్గిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ), ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి పథకాలకు 40 శాతం రాష్ట్ర వాటా తప్పనిసరి. వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 1,876.42 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,546.39 కోట్లకు సవరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం లో ఈ పథకాల కోసం రూ. 491.56 కోట్లు మాత్రమే కేటాయించగా, 2020–21 కోసం రూ.1,239.46 కోట్లను కేటాయించింది. ఇక ఉన్నత విద్యలో కేంద్ర పథకాల కోసం రూ. 15.04 కోట్లను మాత్రమే కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్లో 6.62 శాతమే.. రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యం తగ్గు తోంది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్ను పెం చినా మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ కేటాయిం పుల వాటా తక్కువే. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.28 శాతం తగ్గిపోయాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇప్పుడు అది 6.62 శాతానికి పడిపోయింది. ఫీజులకు ఫుల్ బడ్జెట్ పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర బడ్జెట్ ఫుల్ జోష్ ఇచ్చింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయిస్తూ.. ఇకపై పాత బకాయిల ప్రస్తావన లేకుండా చేసింది. 2020–21 వార్షిక సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద రూ.2,650 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ప్రతి సంవత్సరం సగటున రూ.2 వేల కోట్ల డిమాండ్ ఉంటుంది. పాత బకాయిలు, కొత్త వాటి చెల్లింపులకు సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో గత కొన్నేళ్లుగా బకాయిలు పెండిం గ్లో ఉండేవి. ఈ క్రమంలో పాత బకాయిలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో అన్ని సంక్షేమ శాఖలు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టాయి. 2019–20 వార్షిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా రూ.3 వేల కోట్ల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిని పూర్తి స్థాయిలో చెల్లిస్తే 2019–20 వార్షిక సంవత్సరానికి సంబంధించి 75 శాతం చెల్లింపులు చేయవచ్చు. ఫీజులకు మిగులు నిధులు.. 2020–21 వార్షిక సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద మిగులు నిధులు ఉంటాయని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.2,650 కోట్లు కేటాయింపులు జరపడంతో.. అప్పటి డిమాండ్ రూ.2,050 కోట్లు ఉంటుందని, 2019–20 లో రూ.450 కోట్ల మేర ఉండే బకాయిలన్నీ చెల్లించినప్పటికీ కొంత మేర నిధులు సంక్షేమ శాఖల వద్ద ఉండే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి వచ్చే నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభకు ప్రతిపాదించిన 2020–21 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు బలం చేకూర్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎస్ఆర్డీపీ కార్యక్రమంతో నగరంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను చేపట్టి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్పాసులను వినియోగంలోకి తెచ్చామన్నారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రణాళికలు కొనసాగుతున్నాయని వివరించారు. -
వడ్డీ చెల్లింపులకు 14,615 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయ పట్టికలో రూ. 14,615 కోట్లను వడ్డీ చెల్లింపుల కింద ప్రభుత్వం చూపింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో వడ్డీ చెల్లింపుల కింద రూ. 14,574 కోట్లు ఉండగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 14,385 కోట్లు చెల్లించారు. ఇప్పుడు కూడా కాస్త అటూ ఇటుగానే వడ్డీ చెల్లింపులు చూపెట్టారు. అయితే, వడ్డీలకు తోడు రుణాలు, అడ్వాన్సుల అసలు చెల్లింపుల కింద రూ. 15,662 కోట్లు ప్రతిపాదించారు. దీంతో అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులు రూ. 30 వేల కోట్లు దాటాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ. 10,835 కోట్లు ఉండగా మూడేళ్లలో అది రూ. 3,780 కోట్ల మేర పెరిగిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. తప్పని అప్పుల తిప్పలు.. ఇక, ఈ ఏడాదీ పెద్దఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్ అంచనా లెక్కలు చెబుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ. 35,500 కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే 2,600 కోట్ల రుణం ఎక్కువగా ప్రతిపాదించింది. ఇందులో ఓపెన్మార్కెట్ రుణాల కింద రూ.34 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఇతర రుణాలు రూ.1000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. అదే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.32,900 కోట్ల రుణాలు అంచనా వేయగా, రూ. 31,800 కోట్లు సమీకరించారు. కేంద్రం నుంచి రూ.800 కోట్లు వస్తాయని అంచనా వేస్తే కేవలం రూ.200 కోట్లే వచ్చాయి. ఇక, ఇతర రుణాల కింద రూ.1000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదన ఉన్నా రూ.500 కోట్లు మాత్రమే కార్యరూపంలోకి వచ్చాయి. మూలధన వ్యయం పెరిగింది.. కాగా, ఈ ఏడాదితో పోలిస్తే మూల ధన వ్యయాన్ని పెంచుతూ బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 17,274 కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,165 కోట్లు ఖర్చయింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తమాన ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.8 వేల కోట్లు అధికంగా రూ. 22,061 కోట్లు మూల ధన వ్యయంగా ప్రతిపాదించారు. అదే 2018–19 ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయం 33,369 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 22,640 కోట్లకు తగ్గింది. ఇక, ఈసారి అంచనాల్లో ప్రతిపాదించిన మొత్తంలో ఎంత వ్యయం సంపద సృష్టికి జరుగుతుందనేది ఆర్థిక సంవత్సరం ముగిశాక తేలనుంది. -
పీఆర్సీ, ఐఆర్ ఈసారి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కోసం ఇంకొన్నా ళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. బడ్జెట్లో పీఆర్సీ అమలు కోసం నిధులను కేటాయిం చకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలో పడ్డా రు. ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవ డంతో కొంత ఆందోళనకు గురయ్యారు. మధ్యం తర భృతి (ఐఆర్) ప్రస్తావన కూడా లేక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. రాష్ట్రంలోని 2.62 లక్షల మంది ఉద్యోగులు, 2.68 లక్షల మంది పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాల న్నా, ఐఆర్ ఇవ్వాలన్నా రూ.వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ మొత్తం వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ అంశానికి బడ్జెట్లో చోటు క ల్పించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థి క సంవత్సరం బడ్జెట్లోనే పీఆర్సీ అమలు అంశా న్ని చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యో గుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ల కు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గానే ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడం ద్వా రా ఉద్యోగులను కొంత శాంతపరిచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
ఆరోగ్యమస్తు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యరంగానికి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,185.97 కోట్లు కేటాయించింది. 2019–20 ఆర్థిక సంవ త్సరంలో రూ. 5,694 కోట్లు కేటాయించగా, ఈసారి అదనంగా రూ. 491 కోట్లు కేటాయించడం విశేషం. మొత్తం వైద్య ఆరోగ్య బడ్జెట్లో రూ. 2,361.81 కోట్లు ప్రగతి బడ్జెట్ కాగా, 3,824.16 కోట్లు నిర్వహణ బడ్జెట్ కావడం గమనార్హం. ఈ ప్రగతి బడ్జెట్లో అత్యధికంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో అమలయ్యే పథకాలకు అధికంగా రూ.1185 కోట్లు కేటా యించారు. గత బడ్జెట్లో రూ.886.49 కోట్లు కేటా యించగా, ఈసారి మరింతగా పెంచడం గమనార్హం. ఆయుష్ విభాగానికి గత బడ్జెట్లో రూ. 6.86 కోట్లు ఇవ్వగా, ఈసారి 33.25 కోట్లు కేటాయించారు. అంటే గతం కంటే ఏకంగా రూ. 26.39 కోట్లు అదనం కావడం విశేషం. ఇక ఎంతో ప్రాధాన్యం కలిగిన కేసీఆర్ కిట్కు గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించగా, ఈసారి 443 కోట్లకు తగ్గింది. ఈజేహెచ్ఎస్ స్కీంకు గతంలో రూ. 417 కోట్లు కేటా యించగా, ఈసారి 410.35 కోట్లు దక్కాయి. ఆరోగ్యశ్రీకి గతంలో రూ. 720. 12 కోట్లు కేటాయిం చగా, ఈసారీ అదే స్థాయిలో ఉంది. ఇక ఔషధాల కోసం గత బడ్జెట్లో రూ.236.14 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.262.41 కోట్లు ఇచ్చారు.ఇక ఎంఎన్జే క్యాన్సర్ ఆసు పత్రికి గతంలో రూ.20 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడూ అంతే ఇచ్చారు. ఆ వ్యాధుల నిర్ధారణకు కార్యాచరణ... కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబం«ధిత వ్యాధుల నిర్ధారణ కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. తెలంగాణ లోని ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి . వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వాటి సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇప్పుడు నడుస్తున్న వాటితో పాటు, మరో 232 ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించాలని బడ్జెట్లో ప్రకటించారు.ప్రతీ డివిజన్లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటుతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనంగా ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ప్రజల కంటి సంబంధ సమస్యలను పరిష్కరించడానికి కంటి వెలుగు పేరుతో ప్రపంచంలోనే అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగానే మందులు, అద్దాలు పంపిణీ చేశారు. కరోనాపై ప్రస్తావన... రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి ప్రస్తావించారు. వేసవిలో ఉండే ఎండ వేడికి వైరస్ మనుగడలో ఉండే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండాకాలం ప్రారంభమైనందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కరోనా వైరస్పై చెలరేగే వదంతులను నమ్మవద్దని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది. ఇదిలావుండగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
తలసరి అప్పు 65,480
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలసరి అప్పు పెరుగు తోందని బడ్జెట్ లెక్కలు చెపుతున్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.29 లక్షల కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే ఇది రూ.65,480గా తేలింది. అంటే రాష్ట్రం లోని ప్రతి వ్యక్తిపై ఉన్న తలసరి అప్పు రూ.65,480 అన్నమాట. గతేడాది బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ.58,202 కాగా, ఈ ఏడాది మరో రూ.7,278 పెరిగింది. కాగా, రాష్ట్ర అప్పు జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో పోలిస్తే 20.74 శాతానికి చేరడం గమనార్హం. రూ.1.87 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను పరిశీలిస్తే బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో రూ.1.87 లక్షల కోట్లకు పైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.8,682 కోట్లు, స్వయం ప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 13,961 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,954 కోట్లు సమీకరించినట్టు బడ్జెట్ ప్రతి పాదనల్లో ప్రభుత్వం వెల్లడిం చింది. గత ఐదేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభు త్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పుంటే 2020–21 నాటికి అది 2.29 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గత ఐదేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పు అక్షరాల లక్ష కోట్ల రూపాయలన్నమాట. -
ఇది ప్రగతిశీల బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020–21 పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్గా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల వికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి హరీశ్రావును సీఎం అభినందించారు. మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. -
పల్లెకు ప్రగతి
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దండిగా నిధులు కేటాయించింది. గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్ను ప్రతిపాదించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,005.35 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా రూ.7,880.46 కోట్లు అధికం. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,701.04 కోట్లు నిర్వహణ పద్దు కాగా, రూ.18,304.31 కోట్లు ప్రగతి పద్దు. వ్యవసాయం తర్వాత అత్యధిక నిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కడం విశేషం. ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు అసహాయులైన పేదలకు ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆసరా పథకం కింద రూ.11,758 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.9,402 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా మరో రూ.2,356 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించనుండటంతో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 39.41 లక్షల మందికి ఆసరా పింఛన్ అందుతుండగా.. అర్హత వయసు తగ్గింపుతో మరో ఏడెనిమిది లక్షల మంది అదనంగా పింఛన్కు అర్హత సాధించే అవకాశముంది. దండిగా ఆర్థిక సంఘం నిధులు.. గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్న సర్కారుకు ఈ నిధుల రాకతో వెసులుబాటు కలుగనుంది. ఈ నేపథ్యంలో 2020–21లో గ్రామ పంచాయతీలకు రూ.1,393.93 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అందించనుంది. గతేడాది కేవలం రూ.819.44 కోట్లు కేటాయించగా.. ఈ సారి అదనంగా రూ.574.49 కోట్లు పెంచింది. వడ్డీలేని రుణాల్లో కోత డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలకు స్వల్పంగా కోత పెట్టింది. గతేడాది రూ.680.49 కోట్లు కేటాయించగా.. ఈ సారి 679.23 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగే పనులకు రూ.54 కోట్లు కేటాయించింది. 2019–20తో పోలిస్తే రూ.13 కోట్లు అదనం. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద రూ.15.09 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే రూ.11 కోట్లు అధికం. -
మాంద్యంలోనూ ప్రగతిబాట
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాపై సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు. మేం ఎంచుకున్న బాట సరైందని, మేం అవలంభిస్తున్న వ్యూహాలు సఫలమవుతున్నాయని తేల్చిచెప్పారు. మా పంథా ఇకపైనా కొనసాగించే నిర్ణయంతో వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్తు పురోగతికి ప్రణాళిక రచన చేశాం. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహనతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రజల ముందుంచుతున్నాం. ఇది కేవలం వార్షిక బడ్జెట్ ధృక్పథంతో కాకుండా ప్రజలే కేంద్రంగా ప్రగతిశీల బడ్జెట్ రూపొందించాం’’అని 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు స్వాగ తిస్తున్నారని, అదే ఉత్సాహంతో వచ్చే నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో వచ్చే సంవత్సరానికి వాస్తవిక, ప్రగతిశీల బడ్జెట్ను రూపొందించినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో 62 నిమిషాలపాటు ఆయన బడ్జెట్ ప్రసంగం సాగింది. తన ప్రసంగం ప్రారంభానికి ముందు సీఎం చాంబర్లో, ప్రసంగం ముగించాక సభలో హరీశ్రావు సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేశారు. హరీశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సంక్షేమంలో కోత లేదు.. ‘‘సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో ఎక్కడా కోత విధించలేదు. పైగా లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో పనిచేస్తోందో ఈ బడ్జెట్ అంకెలే చాటిచెబుతున్నాయి. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచటమే.ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్ర సొంత రాబడి సగటు వృద్ధి రేటు 21.5 శాతం ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి 6.3 శాతం తగ్గి 15.2 శాతం వద్ద నిలిచింది. ఇక 2014 మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. గత ఎన్నికల్లో కూడా ఆ హామీ ఇచ్చాం. ఆర్థిక మాంద్యం ముందరి కాళ్లకు బంధం వేస్తునప్పటికీ దాని అమలుకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రమే టాప్.. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. 2019–20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216గా ఉంటే దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050గా ఉంది. ఇది మన ప్రగతికి స్పష్టమైన సంకేతం. అంబేడ్కర్ మాటలు మననం చేసుకుంటూ... సమాజ వికాసానికి నిజమైన కొలమానం మహిళాభివృద్ధి స్థాయేనని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నారు. ఆయన మాటలను మననం చేసుకుంటూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి , కేసీఆర్ కిట్ పథకాలతో మహిళల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బడ్జెట్లో మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,200 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 57 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛన్.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధా ప్య పింఛన్లు అందించబోతున్నాం. దీనివల్ల 39,41,976 ఆసరా పెన్షన్ల సంఖ్య భారీ గా పెరగనుంది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ. 9,402 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో ఆ కేటాయింపులను రూ. 11,758 కోట్లకు పెంచాం. కాళేశ్వరం వెనుక కేసీఆర్ ఉక్కు సంకల్పం.. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రూపొంది రికార్డు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పమే కారణం. ఫలితంగా గోదావరి 150 కి.మీ. మేర జీవధారగా మారింది. ఇది తెలంగాణ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా ఉపయోగపడుతుంది. ఇదే స్ఫూర్తి తో పాలమూరు–రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కొద్ది కాలంలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుంది. వృద్ధిరేటుకు పన్నుల వాటా ఎసరు.. 2019–20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్లో వేసుకున్న అంచనాల కంటే రూ. 3,731 కోట్ల మేర తగ్గింది. రాష్ట్రానికి కేంద్రం నంంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారంలో నిధులు సకాలంలో అందడం లేదు. దీంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018–19లో 16.10 శాతం ఉంటే 2019–20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.43 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గింది. -
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 26,306 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా పెరిగాయి.2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్తో పోల్చితే 2020–21 సంవత్సరం కేటాయింపుల్లో ఏకంగా 6,721.17 కోట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.26,306.25 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,771.28 కోట్లు వంతున బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం... గతేడాది సెప్టెంబర్ 9న 2019–20 వార్షిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ భారీగా తగ్గడంతో ప్రత్యేక అభివృద్ధి నిధి యాక్టు కింద ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా తగ్గాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 వార్షిక సంవత్సరం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా పెరిగాయి. నిధుల కేటాయింపుల్లో జోరు పెరగడంతో సంక్షేమ పథకాల అమలులో వేగం పుంజుకోనుంది. పెండింగ్ పనులకు లైన్ క్లియర్... ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయింపులు భారీగా పెరగడంతో ఆయా శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. 2019–20 వార్షిక సంవత్సరంలో కేటాయింపులు భారీగా తగ్గడంతో ముందస్తుగా అనుకున్న పలు కార్యక్రమాలను ఆయా శాఖలు వాయిదా వేసుకున్నాయి. ముఖ్యంగా నిర్మాణ పనులు చాలావరకు నిలిపేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా మండల, డివిజన్ స్థాయిలో నిర్మించాలనుకున్న అంబేడ్కర్ భవనాలు, ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధి కాస్త నెమ్మదించింది. తాజాగా భారీగా నిధులు ప్రవేశపెట్టడంతో వాయిదా పడ్డ పనులన్నీ వేగంగా పూర్తికానున్నాయి. ఎస్డీఎఫ్ కింద కేటాయించిన బడ్జెట్ను దాదాపు 42శాఖలు సమన్వయంతో ఖర్చు చేస్తాయి.ఈ నేపథ్యంలో ఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వ శాఖలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని భావిస్తున్నాయి. -
బడ్జెట్లో భారీగా కేటాయింపులు
ఇది పూర్తి సమతుల్యత బడ్జెట్. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్. రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎవరి ఊహలు, అంచనాలకు అందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్లో భారీ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పన్ను వృద్ధి రేటు తగ్గుదల, ఆర్థిక మాంద్యం, కోవిడ్ ప్రభావం, కేంద్ర సాయం వంటి అంశాలను అస్సలు ఖాతరు చేయలేదు. రైతు, పల్లె, పట్టణం అభివృద్ధే లక్ష్యంగా.. సంక్షేమమే పరమావధిగా 2020–21 సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించింది. రాష్ట్రంలోని ప్రతి రైతునూ రాజును చేసేవరకు నిద్రపోమంటూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్లో అన్నదాతకు అగ్రతాంబూలమిచ్చింది. విద్యకు చదివింపులు ఘనంగా జరిపింది. ఆరోగ్య‘మస్తు’అనిపిం చింది. సంక్షేమానికీ సై అంది. ఆదివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి హరీశ్రావు పింఛన్లకు పెద్ద మనసుతో నిధులిచ్చింది. పల్లె ప్రగతికి, పట్నం వృద్ధికి ప్రాధాన్యత కనబర్చింది. వెరసి.. పరిస్థితులు సహకరించకున్నా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. రైతు, పల్లె, పట్నం కేంద్రంగా అన్ని వర్గాలు, అన్ని శాఖలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్రావు తొలిసారిగా శాసనసభలో ప్రవేశపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ సమర్పించారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలూ లేనప్పటికీ, ఎన్నికల బడ్జెట్ తరహాలోనే అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. 2019–20 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్ ఏకంగా 25 శాతం మేర పెరిగింది. ఓటాన్ అకౌంట్తో సమానంగా.. అన్ని రకాల అంచనాలు, ఖర్చులు, కేటాయింపులను పెంచుతూ 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 2019–20 ఓటాన్ అకౌంట్ అంచనాలకు సమానంగా రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గతేడాది 1.82 లక్షల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టగా.. గతేడాది సెప్టెంబర్ 9న ప్రవేశపెట్టిన 2019–20 సాధారణ బడ్జెట్ అంచనాలు 1.46 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.42 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి రూ.40వేల కోట్లను కలిపి రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరపతి మెరుగ్గానే ఉన్నట్టు చూపించింది. పెరిగిన పన్ను అంచనాలు 2020–21 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను చూస్తే అన్ని రకాల పన్ను అంచనాలు పెరిగాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా రాష్ట్ర పన్నుల రాబడితోపాటు కేంద్రం నుంచి వచ్చే వాటా తగ్గుతుందనే అంచనాలను తలకిందులు చేస్తూ పన్ను అంచనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా పన్నేతర ఆదాయాన్ని 150శాతం వరకు పెంచింది. 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12వేల కోట్లకు పైగా పన్నేతర ఆదాయం రాగా, ఈసారి దాన్ని ఏకంగా రూ.30,600 కోట్లకు పెంచింది. కేంద్ర పన్నుల్లో వాటా, జీఎస్టీతో కలిపి రాష్ట్ర పన్నులు, గ్రాంట్ ఇన్ఎయిడ్, అమ్మకపు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ఆదాయం, ఇతర పన్నులు.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ పెద్ద ఎత్తున రాబడులను ఆశిస్తూ ప్రతిపాదనలు చేసింది. పన్నుల ద్వారా మొత్తం రూ.85,300 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది. ఈసారి రెవెన్యూ రాబడి రూ.1.43 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో 1.38 లక్షల కోట్ల వ్యయం పోగా రూ.4,482 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని లెక్కగట్టింది. అయితే, ద్రవ్యలోటు మాత్రం భారీ పెరిగింది. 2019–20లో ద్రవ్యలోటు రూ.24వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.21,913 కోట్లకు తగ్గింది. అయితే, 2020–21 ఆర్థిక సంవత్సరానికి అది రూ.33,191.25 కోట్లకు పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే ఇది దాదాపు రూ.11వేల కోట్లు ఎక్కువ. ఆదాయమార్గాల కోసం అన్వేషణ... పరిస్థితులు సానుకూలంగా లేకున్నా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అప్పులు, భూములు, నిరర్థక ఆస్తులపైనే ఆశలు పెట్టుకుందని అర్థమవుతోంది. హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలోనూ, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని నర్మగర్భంగానే వెల్లడించారు. ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తున్నామని, ‘దిల్’సంస్థను తెరపైకి తెస్తున్నామని, భూముల అమ్మకాలకు సిద్ధంగా ఉన్నామని, రాజీవ్ గృహకల్ప వంటి నిరర్థక ఆస్తులను విక్రయిస్తామని, సొంత రాబడులను పెంచుకునే మార్గాలపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 2019–20లో రూ.12వేల కోట్లకు పైగా ఉన్న పన్నేతర ఆదాయాన్ని రూ.30,600 కోట్లకు పెంచినట్టు అర్థమవుతోంది. ఈ రెండేళ్ల ప్రతిపాదనల మధ్య ఉన్న దాదాపు రూ.18వేల కోట్ల వ్యత్యాసాన్ని భూములు, నిరర్థక ఆస్తుల అమ్మకం ద్వారానే సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైతన్నే రారాజు.. ఎన్నికల్లో కీలక హామీ అయిన రైతు రుణమాఫీ అమలుకు ఈ బడ్జెట్లో సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.6,200 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రైతుబంధు సాయాన్ని రూ.12వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పెంచింది. రైతుబీ మాను పెంచడంతో పాటు మార్కెట్ స్థిరీకరణ నిధిని కూడా పక్కాగా కేటాయించడం ద్వారా రైతన్నకు జైకొట్టింది. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు రూ.25వేల కోట్ల మేర కేటాయింపులు జరిపింది. ఇప్పటివరకు అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పింఛన్లకు దాదాపు రూ.12వేల కోట్లు ప్రతిపాదనలు చేసింది. హైదరాబాద్కు ప్రత్యేకంగా రూ.10వేల కోట్లు కేటాయించడం ద్వారా విశ్వనగర అభివృద్ధికి బాటలు వేసింది. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.26వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ప్రభుత్వం.. డబుల్బెడ్ రూం ఇళ్ల నిర్మాణ అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణశాఖకు రూ.11వేల కోట్లకు పైగా నిధులు ప్రతిపాదించింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటివరకు ఉన్న బకాయిలను కూడా కలిపి రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించింది. మొత్తం బడ్జెట్ రూ. 1,82,914.42 కోట్లు ప్రగతి పద్దు రూ. 1,04,612.62 కోట్లు నిర్వహణ పద్దు రూ. 78,301.80 కోట్లు బడ్జెట్ అంచనాలివే.. (రూ.కోట్లలో) రెవెన్యూ రాబడి 1,43,151.94 రెవెన్యూ వ్యయం 1,38,669.82 పన్ను రాబడి 85,300.00 పన్నేతర రాబడి 30,600.00 కేంద్రం వాటా 16,726.58 గ్రాంట్లు 10,525.36 రుణాలు 35,500 మూలధన వ్యయం 22,061.18 రెవెన్యూ మిగులు 4,482 ద్రవ్యలోటు 33,191.25 రూ. 65,480 తలసరి అప్పు.. రాష్ట్ర ప్రజలపై పెరిగిన అప్పుల భారం -
మైనార్టీ సంక్షేమానికి తగ్గిన నిధులు
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. 2020– 21 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ. 1,138.45 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే 2019–20 సంవత్సరంలో రూ. 1,346.95 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్లో రూ. 208 కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. గత కేటాయింపులు భారీగా జరపడంతో పెండింగ్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. దీంతో 2020–21 వార్షిక సంవత్సరంలో ప్రాధాన్యతలకు తగినట్లు నిధులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. కార్మిక సంక్షేమానికి రూ.107.78 కోట్లు కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన శాఖలకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.107.78 కోట్లు కేటాయించిం ది. గత బడ్జెట్లో ఈ శాఖకు రూ. 60. 35 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్లో అదనంగా రూ.47 కోట్లు కేటాయించడం గమనార్హం. మహిళా, శిశు సంక్షేమానికి కాస్త మెరుగ్గా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి నిధుల కేటాయింపులు కాస్త మెరుగుపడ్డాయి. గత బడ్జెట్లో ప్రగతి పద్దు కింద మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.663.80 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక బడ్జెట్లో రూ.676.11 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే దాదాపు 13 కోట్లు అధికంగా కేటాయించారు. సంక్షేమ గురుకులాలకు రూ.2,073.91 కోట్లు సంక్షేమ శాఖల ద్వారా నిర్వహిస్తున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.2,073.91 కోట్లు కేటాయించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రూ.878.15 కోట్లు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) రూ.739.61 కోట్లు, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి రూ.212.98 కోట్లు, మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రూ.243.17 కోట్లు కేటాయించింది. -
విద్యుత్ రాయితీ పెంపు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్ రాయితీ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. బడ్జెట్ 2019–20లో రూ.5,984 కోట్ల వ్యవసాయ విద్యుత్ రాయితీలను కేటాయించగా,ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020–21లో రూ.7,547 కోట్లకు పెంచింది. స్పిన్నింగ్ మిల్లులకు సహాయంగా అందించే రూ.95 కోట్ల విద్యుత్ సబ్సిడీలను యథాతథంగా కొనసాగించింది. ఈ రెండు సబ్సిడీలు కలిపి ప్రగతిపద్దు కింద ఇంధన శాఖకు రూ.7,642 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద మరో రూ.320.88 కోట్లు కలిపి ఇంధన శాఖకు బడ్జెట్లో మొత్తం రూ.7,962.88 కోట్ల నిధులు కేటాయించింది. ఇంధన శాఖకు రూ.10,416 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన కాళేశ్వరం, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులతో పాటు ఎస్సీ,ఎస్టీలకు అందించే విద్యుత్ బిల్లుల రాయితీలు కలుపుకుంటే ఇంధన శాఖకు కేటాయింపులు రూ.10, 416 కోట్లకు పెరుగుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చార్జీల పెంపు తప్పదు ఈ బడ్జెట్లో రూ.10 వేలకోట్ల వ్యవసాయ విద్యుత్ రాయితీలు కేటాయించాలని డిస్కంలు కోరగా, ప్రభుత్వం రూ. 7,547 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో వచ్చే ఆర్థిక ఏడాదిలో చార్జీల పెంపు తప్పదని తెలుస్తోంది. -
ద్రవ్య లోటును అధిగమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్తో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకున్నందున డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వ భూములు, నిరర్థక ఆస్తులు, రాజీవ్ స్వగృహ ఇళ్లు విక్రయించి ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకుంటామని మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. ఆదివారం బడ్జెట్ సమర్పణ అనంతరం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల అమ్మకంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రానికి చెందిన విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. రెండు నెలల క్రితం మద్యం ధరలు పెరిగినందున, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ మేరకు ఎక్సైజ్ ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీంతో పాటు ద్రవ్య లోటును సొంత ఆదాయం పెంచుకోవడం, వ్యవస్థలోని లోపాలను పూడ్చుకోవడం, ఇతరత్రా రూపాల్లో భర్తీ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని, హైదరాబాద్లో రియల్ వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉన్నందున, ఆదాయం కోసం భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అనుకున్న ఫలితాలు సాధిస్తాం.. భవిష్యత్లో ఎలాంటి ఎన్నికలు లేనందున, ఇకపై పూర్తిగా కేబినెట్, అధికార యంత్రాంగం పరిపాలనపై పూర్తి దృష్టి పెట్టి అనుకున్న ఫలితాలను సాధిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ చెప్పారు. కేంద్రం నుంచి టాక్స్ డివల్యూషన్ కింద 2019–20లో రాష్ట్రానికి రావాల్సింది భారీగా తగ్గిందని, 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు 2020–21లో రావాల్సిన మేర గ్రాంట్లు, వనరులు రాలేదన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో భాగంగా కేంద్రం నుంచి రూ. 2,600 కోట్లే వచ్చాయని, ఇంకా రూ. 933 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి జీఎస్టీ కంపన్సేషన్ రావాల్సిన నిధుల కోత ఉన్నా, గతేడాదితోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా సంక్షేమానికి కోతలు పెట్టలేదన్నారు. సంక్షేమానికి నిధుల కేటాయింపుతోపాటు ఈ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు పెట్టాలనేది పెద్ద నిర్ణయమన్నారు. కాళేశ్వరం వల్ల 150 కి.మీ. పొడవునా గోదావరి పారుతున్నందున రూ. 300 కోట్లతో గోదావరి రివర్ ఫ్రంట్ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రమంత్రే ఆ విషయాన్ని చెప్పారు.. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే తెలంగాణ అప్పులు తీసుకుందని ఇటీవల లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడాన్ని హరీశ్రావు గుర్తు చేశారు. ఇప్పటికే భారీగా అప్పులు చేశారని, ఇంకా చేస్తున్నారని రాజకీయంగా వస్తున్న విమర్శలకు ఇదే తగిన సమాధాన మన్నారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ సరిగా జరగలేదని కాగ్ తెలిపిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పంపిణీ తప్పుగా జరిగిందని, తెలంగాణకు రూ.2,300 కోట్ల మేర అన్యాయం జరిగినట్లు వెల్లడించిందన్నారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ ఇప్పటికే లేఖలు రాసినందున,ఈ మేరకు రాష్ట్రానికి డబ్బు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. -
ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె కాలాన్ని ఇటీవలే చవిచూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణ , బలోపేతం కోసం భారీ కార్యాచరణ ప్రకటించటంతో బడ్జెట్ కేటాయింపులపై భారీ ఆశలే నెలకొన్నాయి. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానని సీఎం చెప్పడంతో ఈసారి భారీ నిధులే వస్తాయని అధికారులు అంచనా వేశారు. అన్నీ కలుపుకొని రూ.వెయ్యి కోట్లు మాత్రమే ప్రకటించడంతో మరో ఏడాది నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా ఇచ్చే బడ్జెట్ నిధులకు అదనంగా, సీఎం ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. తాజా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ప్రస్తావించడంతో, సీఎం చెప్పింది ఈ నిధులేనని సరిపుచ్చుకుంటున్నట్లు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీఎస్ఆర్టీసీకి రుణాల పద్దు కింద రూ.400 కోట్లు, వివిధ కేటగి రీ వ్యక్తులకు కేటాయించిన బస్సు పాస్లకు సంబంధించిన రాయితీల మొత్తం తిరిగి చెల్లించేందుకు రూ.600 కోట్లు చూపారు. వెరసి రూ. వెయ్యి కోట్లు బడ్జెట్లో కేటా యించినట్లు అయింది. రూ.3 వేల కోట్లు ఇవ్వాలని అధికారులు కోరారు. సమ్మె కాలానికి సంబంధించి ఉద్యోగులకు జీతం ఇవ్వనున్నట్లు సీఎంకేసీఆర్ ప్రకటించగా.. తాజా బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవడంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. -
ల్యాండ్ ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: ‘దిల్’మళ్లీ తెరపైకి వచ్చింది. భూముల అమ్మకమే లక్ష్యంగా ఏర్పడ్డ డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఈ సంస్థకు ఊపిరిలూదాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్ పేరిట గతంలో భూ విక్రయాలు/లీజులు చేపట్టిన ఈ సంస్థను మనుగడలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దిల్ అంశాన్ని బడ్జెట్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రస్తావించారు కూడా. ఆర్థిక మాంద్యం నేపథ్యంలోప్రభుత్వ ఖజానా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రధాన ఆదాయార్జన శాఖలు చతికిలపడటంతో భూముల అమ్మకాలతో పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండటం, కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై ఉంటుందని అనుమానిస్తోంది. పదేళ్ల క్రితం ప్రభుత్వ భూముల సేకరణ అమ్మకం/లీజుల్లో క్రియాశీలకంగా పనిచేసిన ‘దిల్’సంస్థకు జవసత్వా లు తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లు మాత్రమే ఉన్న పన్నేతర ఆదాయాన్ని 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,600 కోట్లకు పెంచింది. 2,084 ఎకరాలపైనే ఆశ.. హైదరాబాద్ రాజధాని చుట్టూ 2,084 ఎకరాలను దిల్ సంస్థకు గతంలో ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూములను వినియోగిం చుకోవడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఇందులో 400 ఎకరాలను రెవెన్యూ శాఖ వెనక్కి తీసుకోగా.. సుమారు 1,584 ఎకరాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న విలువైన భూములను విక్రయించడం ద్వారా ఖజానాను పరిపుష్టం చేసుకోవాలని యోచిస్తోంది. బాచుపల్లిలో 100, గాజుల రామారం 40.33, కుర్మల్గూడ 23.29, కోహెడ 239, అబ్దుల్లాపూర్మెట్ 161, అజీజ్నగర్ 126.29, కొత్వాల్గూడ 265, కొంగరకుర్దు 100, ధర్మారం 65.05, జవహర్నగర్ 60.25, తోలుకట్ట 16.26 ఎకరాలే కాకుండా చాలాచోట్ల దిల్ సంస్థకు భూములు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసి వేలం వేస్తే పన్నేతర ఆదాయంగా ప్రతిపాదించిన రూ.30,600 కోట్లను సమీకరించడం పెద్దగా కష్టంకాబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈసారి పన్నేతర ఆదాయాన్ని రూ.18వేల కోట్లకు పైగా పెంచి అంచనాలను ప్రతిపాదించింది. బుద్వేల్ భూములు కూడా... ఇదిలావుండగా, నిధుల సమీకరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో కొన్ని భూములున్నాయి. ఐటీ హబ్ కోసం ప్రతిపాదించిన బుద్వేల్లోని టూరిజం, హెచ్ఎండీఏ భూమిలో 50 ఎకరాలను విక్రయించడం ద్వారా ఖజానాకు కాసుల పంట పండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఖానామెట్ సర్వే నం.41/14లోని 27.04 ఎకరాలను కూడా వేలం వేసేందుకు టీఎస్ఐఐసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా రూ.40–45 కోట్ల వరకు పలుకుతోంది. -
లిక్కర్ ‘లిక్విడ్’పై అంచనా.. 16 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై భారీ అంచనాలే పెట్టుకుందని బడ్జెట్ ప్రతిపాదనలు చెబుతున్నాయి. 2019–20 సంవత్సరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.10,637 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.12,600 కోట్లు ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. దీంతో 2020–21కి దీనికి దాదాపు 30 శాతం అదనంగా రూ.16 వేల కోట్ల అంచనాలను ప్రతిపాది ంచారు. అలాగే అన్ని రకాల పన్ను అంచనాలు కూడా ఈసారి పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పన్నుల్లో కేంద్ర వాటాతో సహా రాష్ట్ర పన్నులు (జీఎస్టీతో కలిపి), అమ్మకపు పన్ను, వాణిజ్య పన్ను, ఇతర పన్నులను కూడా పెంచుతూ 2020–21 బడ్జెట్ అంచనాలు ప్రతిపాదించారు. పన్ను ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయంపై కూడా ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. 2019–20 సంవత్సరంలో పన్నేతర ఆదాయం కింద రూ.10,007 కోట్ల ఆదాయం అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లుగా పేర్కొంది. అయితే అంచనాలకు అందని విధంగా ఈసారి 2020–21 బడ్జెట్లో పన్నేతర ఆదాయ అంచనాను రూ.30,600 కోట్లుగా చూపెట్టింది. ఆదాయ పెంపు మార్గాలపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చిందని, అందుకే పన్నేతర ఆదాయాన్ని 150 శాతం వరకు పెంచిందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర పన్నులపై ఆశ.. ఇటు కేంద్ర పన్నులపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ తగ్గలేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.18,560 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.15,987 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి కొంత అదనంగా 2020–21 బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా కింద రూ.16,726 కోట్లు ప్రతిపాదించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో 2019–20 సవరించిన అంచనాల కంటే తక్కువగానే 2020–21 సంవత్సరానికి అంచనా వేసింది. -
సాగు నీరు..రుణాల జోరు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు ఆశించిన మాదిరి లేకున్నా ఉపశమనం కలిగించేలా ఉంది. 2020–21 వార్షిక బడ్జెట్లో సాగునీటి రంగానికి మొత్తంగా రూ. 11,053.55 కోట్లు కేటాయించగా అందులో నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 3,606.58 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధులకన్నారూ. 2,577.38 కోట్లు మేర కేటాయింపులు పెంచింది. గతంకన్నా భిన్నంగా ప్రాజెక్టుల పంపుల నిర్వహణ భారీగా ఉండనుండటంతో దానికింద నిర్వహణ పద్దు నిధులను పెంచారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల ప్రాజెక్టులకు అధిక కేటా యింపులు చేశారు. అయినప్పటికీ ఈ నిధులతో ప్రాజెక్టులు పూర్తికాకుంటే ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాల ద్వారానే వాటిని పూర్తి చేయనున్నారు. అడిగింది కొండంత.. ఇచ్చింది కొంతే.. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన కేటాయింపుల నేపథ్యంలో గతేడాది సాగునీటికి కేవలం రూ. 8,476.17 కోట్లే కేటాయించారు. ఈ ఏడాది కూడా మాంద్యం పరిస్థితులున్నా గతేడాదికన్నా రూ. 2,57 7,38 కోట్ల మేర పెంచి మొత్తంగా రూ.11,0 53.55 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం రూ. 21 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖకు సాగునీటిశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో కాళేశ్వరానికి రాష్ట్ర బడ్జెట్కింద రూ. 7 వేల కోట్లు కోరింది. కానీ ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ. 805.47 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు కు రూ. 3,500 కోట్లు, దేవాదులకు రూ. 500 కోట్లు, తుపాకులగూడేనికి రూ. 500 కోట్లు కేటాయించాలన్న సాగునీటిశాఖ విజ్ఞప్తిని సర్కా రు పెద్దగా పట్టించుకోలేదు. పాలమూరుకు రూ. 368.58 కోట్లు, దేవాదులకు రూ. 292.38 కోట్లు, తుపాకులగూడేనికి రూ.73.83 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా,నెట్టెంపాడు,కోయిల్సాగర్ ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,200 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు రూ. 50 కోట్లకే పరిమితమయ్యాయి. బకాయిలూ భారీగానే... సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భారీగానే పెండింగ్ బకాయిలున్నాయి. రూ. 11,965.23 కోట్ల బకాయిలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ప్రధాన పనులకు సంబంధిం చి బకాయిలు రూ. 5,550 కోట్లు ఉండగా రుణాల కోసం కార్పొరేషన్లకు మార్జిన్ మనీ కింద ఇవ్వాల్సినవి రూ. 1,695 కోట్లు, భూసేకరణ బకాయిలు రూ. 1,585 కోట్లు, విద్యుత్ బకాయిలు రూ. 3,072 కోట్ల మేర ఉన్నాయి. పాలమూరు పరిధిలో రూ. వెయ్యి కోట్లు, కాళేశ్వరం పరిధిలో రూ. 1,500 కోట్లు, ఎల్లంపల్లిలో రూ. 350 కోట్ల మేర ఉన్నాయి. ఇక ఈ ఏడాది మైనర్ ఇరిగేషన్కు కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే రూ. 42 కోట్లు తగ్గించి రూ. 602.45 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ. 402 కోట్లు కేటాయించారు. అయితే దీని బకాయిలే రూ. 550 కోట్ల మేర ఉన్నాయి. ఆదుకునేది అప్పులే ప్రధాన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్, రబీ నాటికి భారీ ఆయకట్టు లక్ష్యాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటితో 360 టీఎంసీలను ఎత్తిపోయా లని ప్రణాళిక వేశారు. దీంతోపాటే సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్కల్లా దేవాదులలో 100% పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రాష్ట్ర నిధులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ. 61,500 కోట్ల రుణ సేకరణ చేపట్టగా అందులో రూ. 38 వేల కోట్ల రుణాల ద్వారానే ఖర్చు జరిగింది. ఇక సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 17 వేల కోట్ల రుణ సమీకరణ చేయగా అందులో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019–20 వార్షిక బడ్జెట్ నిధుల ద్వారా రూ. 8 వేల కోట్లు ఖర్చు జరగ్గా రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ. 14 వేల కోట్లుగా ఉంది. ఈ ఏడాది సైతం రూ. 20 వేల కోట్ల రుణాల ద్వారా ఖర్చు చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. అందులో కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ. 13 వేల నుంచి రూ. 15 వేల కోట్లు ఖర్చు జరిగే అవకాశం ఉండగా మిగతా ప్రాజెక్టులకు మరో రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. డబుల్ రోడ్లకు బ్యాంకు రుణాలే దిక్కు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు నిర్మించే డబుల్ రోడ్లకు ఈసారి బ్యాంకు రుణాలే ఆధారం కానున్నాయి. ఈ రోడ్లకు ప్రణాళికలు రూపొందించిన కొత్తలో విరివిగా నిధులు అందగా, గత రెండు మూడేళ్లుగా చాలినన్ని విడుదల కావడం లేదు. ఈసారి కూడా బడ్జెట్ కేటాయింపులు దాదాపు అలాగే ఉన్నాయి. డబుల్ రోడ్లకు తాజా బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించగా.. అందులో ప్రగతి పద్దు కింద రూ.655 కోట్లు చూపారు. గత బడ్జెట్లో దీనికి కేవలం రూ.187 కోట్లు కేటాయించారు. అంతకు ముందు బడ్జెట్లో అది రూ.460 కోట్లుగా చూపారు. 2017–18లో రూ.2,500 కోట్లు వచ్చాయి. ఆ సంవత్సరం పనులు ఊపుగా జరిగాయి. ఆ తర్వాత నుంచి నిధులు తక్కువగా రావడంతో కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో బిల్లులు పేరుకుపోయాయి. ఇటీవల బ్యాంకు లోన్ ద్వారా ఆ బకాయిలు తీర్చారు. ఇప్పుడు కూడా చాలినన్ని నిధులు వచ్చే అవకాశం లేనందున మళ్లీ బ్యాంకు రుణంపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రంలో 65% పనులు పూర్తయ్యాయి. మరో 35% పనులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు.. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నగరంలో పోలీసు కమాం డ్ కంట్రోల్ భవనం తదితరాల కోసం రూ.550 కోట్లు కేటాయించారు. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు కేటాయించారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. బియ్యం సబ్సిడీకి రూ.2,362 కోట్లు రాష్ట్రంలో ప్రజా పంపి ణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం బడ్జెట్లో రూ.2,362 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బి య్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధి్ధదారులకు సబ్సిడీ బియ్యం సరఫరాకు వీలుగా ఈ నిధుల కేటాయింపు జరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.7 కోట్లు అదనంగా కేటాయించారు. -
అన్నదాతకు అందలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అగ్రస్థానం కల్పించింది. బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయం, అనుబంధ శాఖలకు పెద్దపీట వేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 25,811.78 కోట్లు కేటాయించింది. గతం కంటే ఈసారి బడ్జెట్లో వ్యవసాయ, అను బంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం విశేషం. అందులో ప్రగతి పద్దు రూ. 23,405.57 కోట్లు కాగా మిగిలిన రూ. 2,406.21 కోట్లు నిర్వహణ పద్దు. మొత్తం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్లో ప్రగతి పద్దు కింద కేవలం వ్యవసాయ రంగానికి రూ. 23,221.15 కోట్లు కేటాయించగా సహకార, మార్కెటింగ్శాఖలకు రూ. 7.42 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 177 కోట్లు కేటాయిం చింది. వ్యవసాయ రంగానికి కేటాయించిన ప్రగతి పద్దు బడ్జెట్లో రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీలకే అగ్రస్థానం కల్పిం చారు. రైతు బంధు పథకం అమలు కోసం రూ. 14 వేల కోట్లు కేటా యించారు. 2018–19 బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించగా దానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. కొత్త పాస్పుస్తకాలు మంజూరు కావడం వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరగనుండటంతో పెరిగే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు అదనంగా పెంచినట్లు సర్కారు తెలిపింది. అంతేగాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికా వడం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రైతుబంధుకు గత బడ్జెట్లో కేటాయించిన సొమ్ముకు 1.20 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకోగా ఈసారి కొత్త పాస్పుస్తకాల సంఖ్య పెర గడం, ప్రాజెక్టులు, జలాశయాల ద్వారా మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగిందన్న అంచనాతో 1.40 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రైతుబంధు ద్వారా 2018–19 ఖరీఫ్లో రూ. 5,235 కోట్లు, రబీలో రూ. 5,244 కోట్లు పంపిణీ చేయగా 2019–20లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు... గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం తెలిసిందే. అయితే గతంలో చేసిన రుణమాఫీకి, ఇప్పుడు రుణమాఫీకి కాస్త తేడా ఉంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించి అందుకు అనుగుణంగా రూ. 16,124 కోట్లను నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి బడ్జెట్లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రూ. 25 వేలలోపు రుణాలున్న రైతులు 5,83,916 మంది ఉండగా వారందరి రుణాలను నూరు శాతం ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కొత్త నిర్ణయం. గతానికి ఇప్పటికీ ఇదే ప్రధాన తేడా. ఒకేసారి వారందరికీ రూ. 1,198 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రుణమాఫీ మొత్తాలను ప్రతి రైతుకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తారు. అది కూడా ఈ నెలలోనే ఇస్తారు. ఇక రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు ఉన్న రుణాలు రూ. 24,738 కోట్లుగా ఉండగా ఆయా రైతుల సంఖ్య ఎంతనేది వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సొమ్మును మాత్రం నాలుగు విడతలుగా అందజేస్తారు. అంటే నాలుగేళ్లలో క్లియర్ చేసే అవకాశముంది. వాటిని కూడా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగానే అందిస్తారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కు రూ. 1,000కోట్లు ఈ బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పంటల విష యంలో పరిమితి విధిస్తుండటంతో రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ ఏడాది పండిన కందులలో కొద్ది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కంది రైతులను ఆదుకునే లక్ష్యంతో ఎంత ఖర్చయినా సరే మొత్తం కందులను కొనుగోలు చేయాలని బడ్జెట్లో స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది రూ.600 కోట్లతో మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. రైతు బీమాకు రూ. 1,141 కోట్లు.. రైతు బీమాకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 1,141 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ రైతు, ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెంటనే రూ. 5 లక్షలు అందించడమే దీని ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి రైతుకూ బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రతి రైతు పేరిట రూ. 2,271.50 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్ఐసీ సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తుంది. ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఒక్కో రైతు వేదికను రూ. 12 లక్షలతో నిర్మించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకోసం మొత్తం రైతు వేదికల నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించింది. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈసారి బడ్జెట్లో రూ. 100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ భావించినా బడ్జెట్లో మాత్రం నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 304.34 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం కేటాయింపులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు కేటాయించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ. 25 కోట్లు కేటాయించారు. విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్ల మేర కేటాయింపులు చేశారు. రైతు బడ్జెట్ ఇది రైతు బడ్జెట్ అని మళ్లీ నిరూపితమైంది. బడ్జెట్లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరం. రైతుబంధు పథకానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్షలోపు రైతు రుణాల మాఫీ కోసం రూ. 6,225 కోట్లు కేటాయించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల కొనుగోళ్ల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించడం సాహసోపేతమైన చర్య. – నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
1.6 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార పంటలు ఆశించిన మేర ఉత్పత్తి అవుతున్నాయి. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో 1.6 కోట్ల టన్నుల ఆహార పంటల ఉత్పత్తి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే–2020 నివేదిక వెల్లడించింది. ఇక 2019–20 రెండో ముందస్తు అంచనాలతో అమాంతం పెరిగింది. ఇందులో ఒక వరినే 98.74 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. దీనిప్రకారం 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో వరి 66.69 లక్షల టన్నుల్లో ఉత్పత్తి వచ్చింది. అలాగే మొక్కజొన్న 20.83 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. రాష్ట్రంలో ఆహారేతర పంటల సాగు పెరిగింది. 2016–17కు వచ్చే సరికి 33.6 శాతం ఉండగా 2017–18లో 38.7 శాతానికి పెరిగింది. 2018–19లో 38.8 శాతానికి చేరింది. ఇక పంట రుణాలు 2016–17 సంవత్సరంలో రూ. 26,282 కోట్లు ఇచ్చారు. 2018–19లో రూ.31,410 కోట్లు పంపిణీ చేశారు. 2018–19లో రూ.42,494 కోట్లకు రూ.33,751 కోట్లు బ్యాంకులు ఇచ్చాయి. 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2019–20 ఫిబ్రవరి వరకు 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతోంది. ఈ ఆరేళ్ల కాలంలో 2.48 లక్షల మంది రైతులు డ్రిప్ సౌకర్యం పొందినట్లు ఈ నివేదిక పేర్కొంది. డ్రిప్ ద్వారా నీటితో పాటు అనేక విషయాల్లో రైతులకు ఆదాయం మిగిలిందని, నాబ్కాన్స్ సర్వే కూడా వెల్లడించింది. సూక్ష్మసేద్యం అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఉద్యాన శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.65 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇవ్వగా, 1.89 లక్షల ఎకరాల్లో స్ప్రింక్లర్లు ఇచ్చారు. 2016–17, 2017–18 సంవత్సరాల్లో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ 2 సంవత్సరాల్లో వరుసగా 55,121, 83,458 మంది రైతులకు సూక్ష్మసేద్యం అందింది. ఇక 2018–19లో 37,596 మంది రైతులకు, 2019–20లో ఇప్పటివరకు 1,745 మంది రైతులకు డ్రిప్ అందింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో 2.48 లక్షల మందికి మాత్రమే సూక్ష్మసేద్యం అందింది. మరింత మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు దీంతో ఈసారి బడ్జెట్ అంచనాల్లో రూ.600 కోట్లు ప్రతిపాదించింది. లక్ష్మీ పంప్హౌస్ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్హౌస్ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్హౌస్ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్హౌస్ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్హౌస్ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. టీఎస్ ఐపాస్ ద్వారా 13.08 లక్షల మందికి ఉపాధి తెలంగాణ పారిశ్రామిక విధానం ‘టీఎస్ఐపాస్’ద్వారా గతేడాది డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 6,23,071 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రూ.1,84,655 కోట్ల పెట్టుబడితో 11,857 కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో 9,020 పరిశ్రమల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది. టీఎస్ఐపాస్ కింద రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల పురోగతి -
మాంద్యాన్ని అధిగమించి.. జాతీయ సగటు మించి...
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యంతో ప్రపంచ, జాతీయ వృద్ధి రేటు భారీగా పతనమైన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వృద్ధి రేటు చెక్కు చెదరకుండా దృఢంగా నిలబడింది. 2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.4 శాతానికి పతనమైందని, ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యల్పమని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అవకాశాల నివేదిక పేర్కొంటోంది. 2019–20లో జాతీయ వృద్ధిరేటు సైతం 5 శాతానికి పడిపోనుందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు కానుందని అంచనా. అయితే, గత కొన్నేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు గణాంకాలతో పోలిస్తే ఈసారి కొంతమేర తగ్గుదల కనిపిస్తోంది. అయినా జాతీయ వృద్ధిరేటు సగటును మించిన వృద్ధి రేటును రాష్ట్రం సాధించనుంది. ఇలా అధిగమించడం 2015–16 నుంచి ఇది వరుసగా ఐదోసారి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. 2018–19లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.8.61 లక్షల కోట్లతో 14.3 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా, 2019–20 నాటికి రూ.9.7 లక్షల కోట్లకు పెరిగి 12.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. 2018–19లో స్థిర ధరల వద్ద 6.13 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2019–20లో 8.2 శాతం వృద్ధి రేటుతో రూ.6.63 లక్షల కోట్లకు పెరగనుందని అంచనా. ప్రథమ, తృతీయ రంగాల హవా.. రంగాల వారీగా పరిశీలిస్తే.. 15.8 శాతం వృద్ధి రేటుతో ప్రాథమిక, 14.1 శాతం వృద్ధి రేటుతో తృతీయ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడుతున్నాయి. ద్వితీయ రంగం 5.3 శాతం వృద్ధి రేటును సాధించింది. ప్రాథమిక రంగం పరిధిలోని వ్యవసాయం, పశు, అటవీ, మత్స్య పరిశ్రమలు, మైనింగ్, క్వారీయింగ్, ద్వితీయ రంగం పరిధిలో తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర పౌరసేవలు, నిర్మాణ రంగ పరిశ్రమలు, తృతీయ రంగం పరిధిలో వాణిజ్య, రిపేర్ సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, స్టోరేజీ, ప్రసార సేవలు, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, నివాస గృహాల యాజమాన్య హక్కులు, వృత్తి సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు వస్తాయి. మొత్తానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి 65.2 శాతం చేయూత (గ్రాస్ వాల్యూ యాడెడ్/ జీవీఏ) తృతీయ రంగమే అందిస్తోంది. జాతీయ సగటు కన్నా అధిక తలసరి ఆదాయాన్ని రాష్ట్రం నిలబెట్టుకుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయ తలసరి ఆదాయం సగటు వృద్ధి రేటు 6.3 శాతం కాగా, రాష్ట్రం 11.6 శాతాన్ని సాధించింది. చివరగా, జాతీయ స్థాయిలో 8.08 ద్రవ్యోల్బణం నమోదు కాగా, రాష్ట్రంలో సైతం 7.46 నమోదైంది. పారిశ్రామిక కార్మికుల కోసం రూపొంచిన వినియోగదారుడి ధరల సూచిక (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. చర్యలు సఫలీకృతం.. వ్యవసాయం, పశుపోషణ, విద్యుత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. జాతీయ సగటుకు మించిన వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలని ప్రభుత్వం విశ్లేషిస్తోంది. 32 అర్బన్ ఫారెస్ట్ల అభివృద్ధి తెలంగాణకు హరితహారంలో భాగంగా 2019లో మొత్తం 38.18 కోట్ల మొక్కలు నాటగా, వాటిలో 31.79 కోట్ల మేర జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఫారెస్ట్రీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు, ఇతర జిల్లాల్లో కలిపి 32 అర్బన్ ఫారెస్ట్ పార్కులు పూర్తి చేశారు. మరో 46 ప్రాంతాల్లో ఈ పార్కుల ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణలోని వివిధ అడవుల పరిధిలోని జీవవైవిధ్యం కాపాడేందుకు 12 రక్షిత ప్రాంతాల పరిధిలోని 9 వన్యప్రాణి అభయారణ్యాలను, 3 జాతీయపార్కులను (జాతీయపార్కుల వరకు 5,692.48 చదరపు కి.మీ) నెట్వర్క్ను ప్రకటించింది. తెలంగాణలో 2,939 చెట్ల రకాలు, 365 పక్షుల జాతులు, 103 క్షీరదాలు, 28 రకాల సరీసృపాలున్నాయి. రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,969.48 లక్షల చ.కి.మీ.గా విస్తరించి ఉంది. మొత్తం అటవీ విస్తీర్ణంలో మూడో వంతు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోఉండగా, నాలుగు జిల్లాల్లో అంటే ఈ రెండు జిల్లాలతో సహా నాగర్కర్నూల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 50 శాతం అటవీ ప్రాంతముంది. మొత్తం కలిపి రాష్ట్రంలోని అటవీప్రాంతమున్న 24 శాతం అటవీ శాఖ నిర్వహణ పరిధిలో ఉన్నా దాదాపు 15 శాతంలో మాత్రమే గణనీయమైన పచ్చదనం, అడవులున్నాయి. 2020–21 సంవత్సరానికి సంబంధించి హరితహారంలో 68 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 1994 నుంచే అటవీ శాఖ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ల సాంకేతికను వినియోగిస్తోంది. రిమోట్ సెన్సింట్ శాటిలైట్ ఇమేజరీ సాంకేతికను ఉపయోగించి అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. ఎకో టూరిజంలో భాగంగా బొగతా, కుంతాల, పొథెరా, మల్లెలతీర్థం జలపాతాలు, అనంతగిరి హిల్స్, మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, లక్నవరం చెరువు, మల్లారం ఫారెస్ట్, పాకాల చెరువు, టైగర్ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తోంది. లక్ష్మీ పంప్హౌస్ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్హౌస్ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్హౌస్ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్హౌస్ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్హౌస్ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. -
బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను ఒక్క క్షణం కూడా అసంతృప్తిగా ఉంచకూడదనేదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆదివారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కేసీఆర్ నాయకత్వానికే చెల్లిందన్నారు. గ్రామీణ అభివృద్ధికి రూ.23 వేల కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, గృహ నిర్మాణం రంగానికి రూ.11,900 కోట్లు, ఆర్టీసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ, పట్టణ ప్రజలందరికి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ బడ్జెట్తో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఇది అవాస్తవ బడ్జెట్: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (2020-21) పూర్తిగా అవాస్తవ బడ్జెట్ అని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆర్థిక మాంద్యం అంటూ అసెంబ్లీలో అవాస్తవ బడ్జెట్ ప్రవేశ పెట్టారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని పొన్నాల ప్రశ్నించారు. కొన్ని వేల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్దేనని తెలిపారు. బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రసంగంలో లో 2 లక్షల ఇళ్లు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ పరంగా గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు అడిగే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఈ ఏడాది ఇవ్వలేమంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. -
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంది
సాక్షి, హైదరాబాద్ : ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారన్నారు. సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్లో ప్రముఖ స్థానం కల్పించారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పేద, మద్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక సామాజిక ఇంజనీర్ లాగా ఆలోచించి బడ్జెట్ను రూపొందించారని, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగంలో ఎలాంటి కోతలు విదించకపోవడం వెల్లడించారు. ఇరిగేషన్కు 11వేల కోట్లు కేటాయించడం కాంగ్రెస్కు చెంపపెట్టన్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో మా ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందని తెలిపారు. 57 సంవత్సరాల వారందరూ పెన్షన్కు అర్హులని చెప్పిన సీఎం వారికి రూ.2016 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
ఈ ఏడాది వారికి మాత్రమే రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రూ.25 వేలలోపు రుణాన్ని తీసుకున్నవారికి ఈ ఆర్థిక ఏడాదే రుణమాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు వెల్లడించారు. ఆదివారం ఆయన 2020- –21 ఆర్థిక సంవత్సరానికిగానూ శాసనసభలో రూ.1.82 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పాతికవేలలోపు రుణం ఉన్నవారికి ఈ ఆర్థిక ఏడాది రుణమాఫీ చేస్తామని.. అందుకోసం వచ్చే నెలలో ఎమ్మెల్యేలకు చెక్కులిస్తామన్నారు. (తెలంగాణ బడ్జెట్ 2020-21 హైలైట్స్) మిగతా రుణాలను రాబోయే నాలుగేళ్ల ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బడ్జెట్పై గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు వాళ్లకు నచ్చినట్లు మాట్లాడుతారని విమర్శించారు. వాళ్లు చెప్పినట్లుగా అప్పుల విషయంలో ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారాలు లేవని పేర్కొన్నారు. హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. (మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు) -
తెలంగాణ బడ్జెట్ 2020-21
-
తెలంగాణ రైతులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఈ నెలలోనే మాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదివారం శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు...5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. (చదండి : తెలంగాణ బడ్జెట్ 2020-21 హైలైట్స్) ఈ నెలలోనే రూ.25వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడానికి రూ.1,198 కోట్లు విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ రుణమాఫి మొత్తాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తామని చెప్పారు. 25 వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలను మొత్తం రూ. 24 వేల 738 కోట్లు ఉన్నాయన్నారు. నాలుగు విడతలుగా ఎమ్మెల్యేలు చెక్కుల రూపంలో అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లను ప్రతిపాదించామన్నారు. ఎంత ఖర్చైనా కందులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. -
లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్ 1,82,914.42 కోట్లుగా హరీష్రావు పేర్కొన్నారు. అదేవిధంగా రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు, ఆర్ధిక లోటు 33,191.25 కోట్లుగా మంత్రి వెల్లడించారు. ఇక ఆర్థిక మంత్రి హోదాలో హరీష్రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా.. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. హరీష్రావు ప్రసంగం హైలైట్స్: గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉంది కేంద్రం నుంచి జీఎస్టీ రావడం లేదు 2019-20 వృద్ధి రేటు 6.5శాతంగా ఉంది గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు 2018-19లో 14.3% ఉన్న జీఎస్డీపీ 19-20కి 12.6% తగ్గింది తెలంగాణ ఆర్థిక బడ్జెట్ 2020-21 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు సవరించిన అంచనా ప్రకారం.. 2019-20కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లు రూ.25వేలు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ ఈనెలలోనే రుణమాఫీ పూర్తి చేస్తాం రూ.25వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలు 4 విడతలుగా పంపిణీ చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తారు ఎంత ఖర్చైనా సరే కందులను కొనుగోలు చేస్తాం రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు కేటాయింపు మూసీ రివర్ఫ్రంట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు మున్సిపల్శాఖకు 14,809 కోట్లు కేటాయింపు హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు ఉన్నత విద్యాశాఖకు రూ.1,723 కోట్లు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు వైద్య రంగానికి రూ.6,156 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.23,005 కోట్లు కల్యాణలక్ష్మీ పథకానికి రూ.1,350 కోట్లు కేటాయింపు గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు మైనారిటీల కోసం రూ.1,518 కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం రూ.16534.97 కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,771.27 కోట్లు ఆసరా పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు రవాణా, రోడ్లుభవనాలశాఖకు రూ.3494 కోట్లు పోలీస్శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు విద్యుత్శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు ఎస్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయింపు మైక్రో ఇరిగేషన్ కోసం రూ.600 కోట్లు కేటాయింపు పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,200 కోట్లు పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు ఈ ఏడాది నుంచి 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం - శంషాబాద్ బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ వరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి రాష్ట్రంలో 2,72,763 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1181 కాగా రాష్ట్రంలో 1896 యూనిట్లు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు మరో 232 దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తాం తెలంగాణలో కరోనా వైరస్ లేదు ఇప్పటి వరకు 12,427 పరిశ్రమలకు అనుమతులిచ్చాం 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బోర్డు హరీష్రావు బడ్జెట్ ప్రసంగం ముగియడంతో శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. -
1.58లక్షల కోట్ల పద్దు!
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఓటాన్ అకౌంట్ తో పోలిస్తే సాధారణ బడ్జెట్కు భారీగా కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక ఏడాదికి కూడా వాస్తవిక కోణంలోనే బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల అంచనాలను పరిగణనలోకి తీసుకుని గతేడాది బడ్జెట్ అంచనాల కన్నా 8% పెరుగుదలతో రూ. 1.58 లక్షల కోట్ల వరకు 2020– 21 వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించనున్న ట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం వరకు ఉంటుందనే అంచనాలు, కోవిడ్ ప్రభావంతో పారిశ్రామిక రంగ ఆదాయం పడిపోతుందేమోననే భయం ఉన్నా ప్రస్తుత ఆర్థిక ఏడాది రాబడులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉండటంతో ఈ మేరకు బడ్జెట్ అంచనాలకు వెళ్లవచ్చనే నిర్ధారణకు ఆర్థికశాఖ వర్గాలు వచ్చాయని సమాచారం. దీంతో గతేడాది రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా, మరో రూ.12 వేల కోట్ల వరకు కలిపి మొత్తం రూ.1.58 లక్షల కోట్ల మేర బడ్జెట్ అంచనాలను అసెంబ్లీ ముందుం చేందుకు సిద్ధమయిందని సమాచారం. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్రావు తొలిసారి ఆది వారం ఉదయం 11:30 గంటలకు 2020– 21 వార్షిక బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. కీలక రంగాలకు అదే ప్రాధాన్యం.. ఈసారి బడ్జెట్ లో కీలక రంగాలకు ప్రాధాన్యత మేరకు నిధులు కేటాయించనున్నారు. ప్రస్తు తం అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే విద్య, వైద్యం, సాగునీటి శాఖలతో పాటు ఈసారి గృహ నిర్మాణానికి (డబుల్ బెడ్ రూం ఇళ్లు) ఎక్కువ నిధులు కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డబుల్బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తు న్న విమర్శలకు తాళం వేసేందుకు బడ్జెట్లో నిధులు పెంచాలని, ఆ మేరకు ఇళ్లు కట్టి చూపించాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.6 లక్షలు ఇవ్వాలన్న హామీకి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గృహ నిర్మాణ శాఖకు నిధులు పెరగనున్నాయి. సాగునీటి శాఖకు ఈ సారి రూ.8,500 కోట్లు కేటా యించే అవకాశముంది. గతేడాది కన్నా రూ.1000 కోట్లు అధికంగా కేటాయించడంతో పాటు మరో రూ.15 వేల కోట్ల వరకు అప్పులు ప్రతిపాదించడం ద్వారా మొత్తం రూ.23,500 కోట్ల వరకు వచ్చే ఏడాది సాగునీటి రంగంపై ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక విద్య, వైద్యానికి గత ఏడాది కన్నా కేటాయింపులు పెంచనున్నారు. ఆపద్బంధు, కుట్టుమిషన్ల పంపిణీ బాధ్యతలను కూడా సంక్షేమ శాఖలకే అప్పగించనున్నారు. సగం రుణమాఫీకి యోచన... వ్యవసాయ రంగానికి కూడా నిధులు అంచనాలకు అనుగుణంగానే కేటాయించనున్నారు. ఈసారి రైతు రుణమాఫీకి గతేడాది కేటాయిం చిన రూ.6 వేల కోట్లతో పాటు మరో రూ.6 వేల కోట్లు ప్రతిపాదిస్తారని, మొత్తం రుణమాఫీ అమలుకు రూ.24వేల కోట్లు అవసరమవుతాయనే లెక్కల్లో సగం కేటాయించడం ద్వారా వచ్చే ఏడాది రెండు దఫాల్లో రైతుల రుణాలను సగం మేర మాఫీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అదే విధంగా రైతు బీమాకు గత ఏడాది కేటాయించిన రూ.700 కోట్లను రూ.1000 కోట్ల వరకు పెంచనున్నారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు రూ.7,500 కోట్ల వరకు ఖర్చు కానున్నాయి. ఇక, జీతభత్యాలు, అప్పులకు వడ్డీల చెల్లింపులు, సబ్సిడీలు, విద్యుత్ రాయితీలకు కలిపి మరో ప్రణాళికేతర పద్దుల కింద రూ.50 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు ఈ ఏడాది ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము మాట ఇచ్చింది వాస్తవమేనని, అయితే వీటి అమలుకు తమకు సమయం ఉందని సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాటికి ఈసారి బడ్జెట్లో కేటాయింపులు లేవనే తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లుందని, గత ఏడాది రూ.8.6 లక్షల కోట్లుండగా, ఈ సారి రూ.9.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని కాగ్ లెక్కలు చెబుతున్నాయని సీఎం అసెంబ్లీలో చెప్పారు. దీని ఆధారంగా వివిధ శాఖల అవసరాలను క్రోఢీకరించి రూ.1.58 లక్షల కోట్ల వరకు ఈసారి అంచనాలు ప్రతిపాదించవచ్చనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోనూ కోత పడే అవకాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో నేరుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.3 కోట్లుగా ఉన్న ఏసీడీఎఫ్ నిధులను రూ.1.5 కోట్లకు పరిమితం చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి శనివారం రాత్రి ప్రగతి భవన్లో సమావేశమై 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న తీర్మానం ప్రతిపై సైతం మంత్రివర్గ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిసింది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల విషయంలో శాసనసభలో ప్రభుత్వం అవలంబించాల్సిన వైఖరిపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.