Vizianagaram Crime News
-
చేతులు కట్టేసి డిగ్రీ విద్యార్థిని తోటలో పడేసిన దుండగలు
సాక్షి, విజయనగరం క్రైం: ఇంటికి వెళ్తానని చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన డిగ్రీ విద్యార్థిని తెల్లారేసరికి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో రోడ్డుపక్కన పొదల్లో బందీగా కనిపించింది. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో సోమవారం వేకువజామున ఈ ఘటన వెలుగు చూసింది. జాగింగ్కు వెళ్లిన కొందరు యువకులు ఆ యువతిని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి విజయనగరంలోని ప్రైవేట్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్ చదువుతోంది. అనారోగ్య కారణాల వల్ల తన స్వగ్రామానికి వెళ్తానని వార్డెన్కు చెప్పిన ఆ యువతి శనివారం సాయంత్రం కళాశాలలోని హాస్టల్ నుంచి బయలుదేరింది. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా రాజాం మీదుగా తన ఊరెళ్లేందుకు ఓ ప్రైవేటు వాహనం ఎక్కింది. ఆ తరువాత ఏమైందో గానీ సుమారు 36 గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున గుర్లలో అంతుచిక్కని పరిస్థితుల్లో కనిపించింది. ఆ మార్గంలో జాగింగ్ చేస్తున్న వారికి పొదల్లోంచి మూలుగులు వినబడటంతో వెళ్లి చూడగా ఓ యువతి అచేతన స్థితిలో కనిపించటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె చేతులు, కాళ్లకు ఉన్న కట్లను విప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ పి.అనిల్కుమార్, సీఐ మంగవేణి విచారణ చేసినప్పటికీ ఆ యువతి నోరు విప్పలేదు. యువతి షాక్కు గురవ్వడం వల్ల నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్నేహితులతో ఆటోలో.. యువతి ప్రైవేట్ వాహనంలో ఎక్కడకు వెళ్లిందన్న విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరంలోని ప్రధాన కూడళ్లలో గల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం బస్ కాంప్లెక్స్ వద్ద ఆ యువతి ప్రైవేటు వాహనం ఎక్కి కోట వద్ద దిగిందని ఎస్పీ రాజకుమారి తెలిపారు. అక్కడి నుంచి స్నేహితులతో కలిసి ఓ ఆటోలో గుర్ల వరకు ప్రయాణించినట్టు గుర్తించామని చెప్పారు. 2016లో ఆ యువతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు రాగా.. హైదరాబాద్లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. తనకు మూర్ఛ రోగం ఉండటంతో ఏమీ గుర్తుకు రావడం లేదని ఆ యువతి చెబుతోందన్నారు. విచారణను వేగవంతం చేసి అసలు విషయాన్ని తెలుసుకుంటామన్నారు. రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ఇదిలావుండగా.. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశామని, రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపిస్తున్నామని అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు తెలిపారు. బాధిత యువతి ప్రతి వారం కాళీ ఘాట్ కాలనీలో ఉంటున్న చిన్నాన్న ఇంటికి వెళ్తుంటుందని చెప్పారు. యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, వైద్యులు నుంచి అందే నివేదికల ఆధారంగానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట దిశ డీఎస్పీ త్రినాథ్ ఉన్నారు. -
యువతిని కాళ్లు, చేతులు కట్టేసి..
-
ఆమెది హత్యే..
గరివిడి : తన సోదరిని ఆమె భర్తే బలవంతంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి సోదరుడు జి. రాజు గురువారం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కొండపాలెం పంచాయతీకి చెందిన టెక్కలి దేవి (28) గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమెను భర్త టెక్కలి లక్ష్మణ చంపేసి పట్టాలపై పడేశాడని.. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం తీసుకున్నాడని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. -
రెండో భార్యతో అన్యోన్యంగా ఉన్నాడని కన్నతండ్రినే..
విజయనగరం, గజపతినగరం: మండలంలోని వేమలి గ్రామంలో కొడుకు చేతిలో తండ్రి హతమైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వేమలి గ్రామానికి చెందిన బొద్దూరు వెంకటరమణ (50)కు ఇద్దరు భార్యలు. అందులో మొదటి భార్య సత్యవతికాగా, రెండో భార్య కుమారి. తాపీ పనిచేస్తున్న వెంకటరమణ వేమలి గ్రా మంలో ఓ ఇంటి నిర్మాణం పనికి రెండో భార్య కుమారిని తీసుకెళ్లాడు. ఎప్పటికప్పుడే రెండో భార్యతో అన్యోన్యంగా ఉంటూ పనికి వెంట తీసుకెళ్తున్నాడని మొదటి భార్య సత్యవతి తన కొడుకు అయిన చక్రధర్రావుకు చెప్పింది. దీంతో పనులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఈ గొడవలో తాపీపనిలో వినియోగించే గజంబద్దతో తలపై బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామ రెవెన్యూ అధికారి సమాచారం మేరకు సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సన్యాసినాయుడు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చక్రధర్రావుపై కేసునమోదు చేశారు. -
బయటపడ్డ భూతవైద్యుడి బండారం
సాక్షి, శృంగవరపుకోట: దెయ్యాలు... భూతాలు... చెడుపు... చిల్లంగి... చేతబడులు... బాణామతులు అంటూ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను సొమ్ము చేసుకుంటున్న ఓ భూతవైద్యుడి బండారం బయటపెట్టిన సంఘటన ఇది. శృంగవరపుకోటలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మూలబొడ్డవర పంచాయతీ పరిధి గాదెల్లోవ గ్రామంలో గమ్మెల పోతురాజు అనే వ్యక్తి భూతవైద్యం పేరుతో సామాన్యులను మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడు. ఇటీవల ఇతని భూతవైద్యాన్ని నమ్మి కొడుకును పోగొట్టుకున్న కుటుంబీకుల వేదన చూసి చలించిపోయిన శృంగవరపుకోట బర్మాకాలనీకి చెందిన జనా లక్ష్మీనారాయణ మారుమూల గ్రామంలో భూతవైద్యుడు పోతురాజు చేస్తున్న మోసాన్ని కొంతమంది మీడియా మిత్రులకు చెప్పారు. భూతవైద్యుడి ఆటకట్టించాలని పథక రచన చేశారు. బర్మా కాలనీకి చెందిన పొడుగు అప్పలరాజు అనే వ్యక్తికి ఆరోగ్యం బాగా లేదని పోతురాజు వద్దకు తీసుకెళ్లారు. అతనికి దెయ్యం పట్టిందని బాగుచేయాలని, అందుకు పూజ జరిపించాలని పోతురాజు చెప్పాడు. పూజలు చేసేందుకు బయటి వారికైతే రూ. 40వేలు తీసుకుంటానని చెప్పాడు. లక్ష్మీనారాయణ తదితరులు బాధితుడు అప్పలరాజుకు బాగు చేసేందుకు పూజ పెట్టాలని కోరారు. అందుకు రూ.10వేలు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అతడిని ఎస్.కోట రావాలంటూ పిలిచారు. శనివారం సాయంత్రం ఎస్.కోట వచ్చిన పోతురాజు 6గంటల సమయంలో బర్మా కాలనీ సమీపంలోఉన్న క్వారీలో అప్పలరాజును కూర్చోబెట్టి రంగులతో ముగ్గులు వేసి, హోమాలు వేసి పూజలు చేసినట్టు నమ్మించాడు. పూజలు చేస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ తదితరులు కొందరు విలేకరుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్.కోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భూతవైద్యుడు పోతురాజును స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ శ్రీనివాసరావు పోతురాజును విచారించగా తాను డబ్బు కోసం పూజలు చేయనని, ఎవరైనా గాలి గుణంతో ఇబ్బంది పడితే బాగు చేసి, వాళ్లిచ్చిందే తీసుకుంటానంటూ చెప్పాడు. లక్ష్మీనారాయణ, అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేశారు. -
పది నిమిషాల్లోనే...
పదకొండు నెలల బిడ్డను విశాఖలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అంతలోనే ప్రమాదానికి గురయ్యారు. ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తమ బిడ్డతో పాటు తల్లిదండ్రులు ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. అదుపుతప్పిన బైక్ లారీ కింది భాగంలోకి బలంగా దూసుకుపోవడంతో బిడ్డ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూసపాటిరేగ (భోగాపురం): ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. మోటారుసైకిల్పై ఆస్పత్రికి వెళ్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొన్న ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉంది. వారితో ఉన్న 11 నెలల బాలుడు తన్వీర్కు గాయమైంది. వివరాల్లోకి వెళ్తే...జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీనివాసరావు(30) తొమ్మిది నెలల కిందట అక్కివరం శ్రీనివాస హేచరీలో సూపర్వైజర్గా విధుల్లో చేరాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్య స్వాతి(29), 11 నెలల కుమారుడు తన్వీర్తో కలిసి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి శ్రీనివాసరావు బయలుదేరారు. సవరవిల్లి పంచాయతీ అవ్వపేట జంక్షన్కు వచ్చేసరికి ముందుగా వెళ్తున్న లారీని బైక్తో బలంగా ఢీకొని లారీ కిందకు మోటారుసైకిల్తో పాటు దూసుకెళ్లాడు. శ్రీనివాసరావు వెనక్కి తూలడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లింది. 11 నెలల తన్వీర్ కిందకు పడడంతో తలకు స్వల్ప గాయమైంది. వెంటనే సమాచారం అందుకున్న భోగాపురం ఎస్ఐ శ్యామల సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన స్వాతిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం విశాఖలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్ఐ శ్యామల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదబుడ్డిడిలో విషాదం... జియ్యమ్మవలస: రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు మృత్యువాత పడడంతో పాటు భార్య స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో పెదబుడ్డిడిలో విషాదం నెలకొంది. అప్పుడే ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడంతో గ్రామమంతా ఉలిక్కి పడింది. రెండేళ్ల కిందటే వివాహమైన శ్రీనివాసరావు, స్వాతి దంపతులకు 11 నెలల బిడ్డ తన్వీర్ కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కోమాలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుని తండ్రి కొద్ది సంవత్సరాల కిందట మరణించగా తల్లి, నాన్నమ్మ, తమ్ముడితో కలిసి శ్రీనివాసరావు పెదబుడ్డిడిలో నివాసం ఉంటున్నాడు. నిరుపేద కుటుంబం కావడం, ఇంటికి శ్రీనివాసరావే ఆధారం కావడం ఇంతలోనే మృత్యువాత పడడంతో ఇక ఎలా జీవించేదని కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. -
బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం
సాక్షి, విజయనగరం : బాలికపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విజయనగరం మండలంలో అయిదేళ్ల బాలిక ఇంటి వెనకాల ఉంటున్న 60 ఏళ్ల వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఊరి పెద్దలను ఆశ్రయించారు. అనంతరం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కస్టడికి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు విజయనగరం ఘోసా ఆసుపత్రిలో బాలికకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. (దారుణం : బాలుడిపై సామూహిక అత్యాచారం) చదవండి : బిజినెస్కు తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని.. ప్రియురాలిపై సామూహిక లైంగికదాడికి యత్నం -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
విజయనగరం, గుర్ల: ఆటోలో మరిచిపోయిన ఫోన్ను తీసుకురావడానికి వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే... మండలంలోని పాచలవలసకు చెందిన కొసిరెడ్డి రమణ జిల్లా కేంద్రంలోని ఏజీఎల్ కళాశాలలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు. రోజులాగానే శుక్రవారం కూడా గ్రామం నుంచి ఆటోలో కళాశాలకు వెళ్లడానికి బయలుదేరాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో మిత్రుడితో ఫోన్లో మాట్లాడి బస్సు ఎక్కడుందో తెలుసుకున్నాడు. గూడెం జంక్షన్ వద్ద ఆటో దిగి కళాశాలకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. అయితే బస్సు ఎక్కిన తర్వాత తన ఫోన్ ఆటోలో మరిచిపోయానని గ్రహించిన రమణ వెంటనే బస్సు దిగి ఆటో కోసం రోడ్డు దాటుతుండగా.. గరివిడి నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు ఈశ్వరరావు, బంగారులక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రైలుఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
విజయనగరం,బాడంగి: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వాలేటి జోగీందర్ భూపతినాయుడు (18)ఉరఫ్ ఉదయ్ను రైలు ఢీ కొనడంతో ఆదివారం మృతిచెందాడు. విద్యార్థి విజయవాడ చైతన్య కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదుతున్నాడు. సంక్రాంతి సెలవులకోసం స్వ గ్రామం భీమవరం వచ్చాడు. తల్లిదండ్రులు, అక్క, స్నేహితులతో ఆనందంగా గడిపాడు. తిరిగి కళాశాలకు వెళ్లేందుకు డొంకినవలస గ్రామం పక్క నుంచి ట్రాక్ దాటుతూ రైల్వేస్టేషన్కు వెళ్తుండగా ఉదయం 9.30 ప్రాంతంలో విశాఖ నుంచి కొరాపుట్ వెళ్లే (డీఎంయూ) ఢీకొంది. దీంతో విద్యార్థి దుర్మరణం చెందాడు. రైలు డ్రైవర్, స్టేషన్ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు బొబ్బిలి హెచ్సీ కృష్ణారావు తమ సిబ్బందితో కలసి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడుని రైలు రూపంలో మృత్యువు కబలించిందంటూ తల్లిదండ్రులు ఉమాదేవి, తిరుపతినాయుడు, సోదరి తేజశ్వని బోరున విలపిస్తున్నారు. -
ఒంటరి మహిళలకు మత్తుమందు ఇచ్చి..
విజయనగరం క్రైమ్: ఒంటరి మహిళలను టార్గెట్ చేయడం... మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన డ్రింక్స్ తాగించడం.. అనంతరం వారి ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో ఉడాయించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. దొంగిలించిన సొత్తును బ్యాంక్ల్లో తనఖా పెట్టి జల్సా చేయడం అతని అలవాటు. అటువంటి వ్యక్తిని.. అతనికి సహకరించిన మరో వ్యక్తిని సీసీఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ రాజకుమారి స్థానిక సీసీఎస్ పోలీస్స్టేషన్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామానికి చెందిన కొట్టిస లకు‡్ష్మన్నాయుడు రైలు, బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఒంటరిగా ప్రయాణించే మహిళలతో మాటలు కలిపేవాడు. ఈ క్రమంలో వారి ఫోన్ నంబర్లు తీసుకుని వారితో నిత్యం ఫోన్లో మాట్లాడేవాడు. వారితో పరిచయాలు పెంచుకుని ఆయా ఊళ్లకు వెళ్లేవాడు. బస్టాండ్ దగ్గర ఉన్నానని.. పలానా హోటల్ వద్ద ఉన్నానని పరిచయం ఉన్న మహిళలను రప్పించుకుని వారికి మత్తుమందు కలిపిన డ్రింక్లు ఇచ్చేవాడు. అనంతరం వారి ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో పాటు బ్యాగుల్లో ఉన్న నగదుతో ఉడాయించేవాడు. అనంతరం తన సహచరుడైన పాయకరావుపేటకు చెందిన తోట ప్రసాద్ సహాయంతో బంగారు ఆభరణాలను మత్తూట్, మణప్పరం, ఐఐఎఫ్ఎల్ వంటి ప్రైవేట్ సంస్థల్లో తనాఖా పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. ఇటీవల పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను మభ్యపెట్టి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన ఎస్పీ రాజకుమారి నిందితుడ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశిస్తూ సీసీఎస్ పోలీసులను ఆదేశించారు. దీంతో సీసీఎస్ పోలీసులు నెల రోజులుగా విచారణ చేపడుతూ ఎట్టకేలకు నిందితుడు లకు‡్ష్మనాయుడుతో పాటు అతనికి సహకరిస్తున్న తోట ప్రసాద్ను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు 22 నేరాలు చేసినట్లు అంగీకరించగా.. పోలీసుల విచారణలో మాత్రం 13 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితుల వద్ద నుంచి రూ. 15 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తనఖాలో ఉన్న మరో 20 తులాల ఆభరణాలు రికవరీ చేసుకోవాల్సి ఉంది. నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఎస్సై ఐ. సన్యాసిరావు, హెచ్సీలు జి.నాగేంద్రప్రసాద్, జి.మహేశ్వరరావు, పి.జగన్మోహనరావు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాసరావు, ఎం.వాసులను ఎస్పీ రాజకుమారితో పాటు సీసీఎస్ డీఎస్పీ జె. పాపారావు, విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్బీ డీఎస్పీ సీఎం సన్యాసినాయుడు, సీసీఎస్ సీఐలు డి. లకు‡్ష్మనాయుడు, దాసరి లక్ష్మణరావు, కాంతారావు, ధనుంజయరావు, తదితరులు అభినందించారు. నిందితుడు గతంలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి నిందితుడు లకు‡్ష్మనాయుడు ఇండియన్ ఆర్మీలో 1996 నుంచి 2005 వరకు పనిచేశాడు. అప్పట్లోనే పలు నేరాలకు పాల్పడడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ. 70 లక్షల వరకు కాజేశాడు. ఈ సంఘటనపై విశాఖ జిల్లా చీడికాడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. శ్రీకాకుళంలో ఒక హత్యకేసు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్ కేసు, మరో రేప్ అండ్ మర్డర్ కేసు, గుంటూరు జిల్లాలో మరో రెండు కేసుల్లో లకు‡్ష్మనాయుడు నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి భార్య కూడా ఒక దొంగతనం కేసులో మంగళగిరి జైల్లో ఉందని పోలీసులు తెలిపారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.రాజకుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మవద్దని.. వారిచ్చే వస్తువులు, పానీయాలు, భోజనాలు, టీ, కాఫీ, టిఫిన్స్ వంట వి తీసుకోరాదన్నారు. అనుమానితుల సమాచారన్ని డయల్ 100కి గానీ, వాట్సాప్ నంబర్ 63098 98989 అందించాలని సూచించారు. -
కుంభకోణంలో తప్పు ఒప్పుకున్న ఉపాధ్యాయులు
తప్పు ఒప్పుకున్నారు. తప్పుడు ధ్రువీకరణతో బిల్లులు పెట్టుకుని నిధులు తీసుకున్నట్టు అంగీకరించారు. ఎప్పటికైనా... వాస్తవాలు బయటకు రాక తప్పదని భావించి అప్రూవర్లుగా మారారు. గడచిన కొద్ది రోజులుగా సాక్షిలో వస్తున్న వరుస కథనాలు ఓ వైపు సంచలనం సృష్టించగా... విచారణ నివేదిక ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ శుక్రవారం నిర్వహించిన విచారణకు వచ్చిన అధికారులు... బాధ్యులతో కార్యాలయంలో హడావుడి నెలకొంది. సాక్షి ప్రతినిధి విజయనగరం: చేసిన తప్పును ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుందనుకున్నారో ఏమో.. పార్వతీపురం పట్టణంలోని ఆర్సీఎం బాలుర ఉన్నత పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాల, బాలగుడబ ఆర్సీఎం యూపీ పాఠశాలలో పనిచేసినట్లు తప్పుడు నివేదికలు, బిల్లులు సమర్పించినట్లు 13 మం ది ఉపాధ్యాయలు విచారణలో అంగీకరించారట. తప్పుడు సర్వీసు రిజిస్టర్ను విద్యాశాఖకు సమర్పించి తద్వారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి 14 సంవత్సరాలకు సంబంధించిన జీతం బకాయిలు రూ.4.01కోట్లు స్వాహా చేశారనే ఆరోపణలపై కొద్దిరోజులుగా ‘సాక్షి’ వరుస కథనాలు వెలువరించిన సంగతి తెలిసిందే. గుట్టు మొత్తం బయటపడిపోవడంతో ఇక తప్పించుకోలేమని భావించి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారు నిజాన్ని ఒప్పుకున్నారు. ముచ్చటగా మూడవసారి ఈ కుంభకోణంపై పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ ఈ నెల 7, 15 తేదీల్లో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపి తాజాగా శనివారం మూడోసారి కూడా విచారణ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఈ విచారణలో అనేక విషయాలపై సబ్కలెక్టర్ ఆరాతీసి జరిగిన అవకతవలను గుర్తించినట్టు సమాచారం. విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎయిడెడ్ పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఫాదర్లు హాజరయ్యారు. అవకతవకలు నిజమే...: యాజమాన్యం ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పుడు సర్వీస్ రిజిస్టర్లు చూపించి ఎరియర్స్ను పొందినట్టు ఉపాధ్యాయులు అంగీకరించినట్టు విచారణకు హాజరైనవారి నుంచి వచ్చిన ప్రాధమిక సమాచారం. మొత్తం 13 మంది ఉపాధ్యాయులు తాము 2017లో విధుల్లో చేరినట్టు రాత పూర్వకంగా సబ్కలెక్టర్ కు తెలియజేశారు. మిగిలిన 14 సంవత్సరాలకు ఎరియర్సు బిల్లులు ఉద్దేశ పూర్వకంగానే సమర్పించి ప్రభుత్వం కళ్లుగప్పి, విద్యాశాఖ ఉన్నతాధికారులను మోసం చేసి డబ్బును రాబట్టినట్టు విచారణలో స్పష్టమైనట్టు తెలిసింది. చర్చి ఫాదర్లను విచారించిన సబ్కలెక్టర్ విచారణలో భాగంగా సబ్కలెక్టర్ టి.ఎస్.చేతన్ చర్చి ఫాదర్లను శనివారం విచారించారు. ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ చేయడంలో కొంతమంది ఫాదర్లు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల నియామకాలను కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు పిటిషనర్ గురువులు ఆరోపించారు. ఈ కోణంలో కూడా సబ్ కలెక్టర్ పూర్తి విచారణ జరుపుతున్నారు. రాజీ ప్రయత్నాలు ఈ కుంభకోణం కేసును ఎలాగైనా ఇక్కడితో ఆపేయించడానికి కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..తప్పు జరిగిపోయిందని, ఇది విచారణలో రుజువై శిక్ష పడితే ఆర్సీఎం ఎయిడెడ్ పాఠశాలల పరువు పోతుందని, ఈ రొంపి నుండి ఎలాగైనా తప్పించాలని వారు తమ ఉన్నతాధికారులను సంప్రదించి మొరపెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నివేదిక ఆధారంగా చర్యలు ఇప్పటికే పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ విచారణ చేపట్టారు. దానికి సంబంధించిన నివేదిక మరో రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నివేదికలోని అంశాల ఆధారంగా కుంభకోణంలో బాధ్యులపై చర్యలు ఉంటాయి. – డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, జిల్లా కలెక్టర్, విజయనగరం -
‘రెప్పపాటు’ ఘోరం.. నిద్రమత్తులో రైలు దిగుతూ..
చక్కనైన ఉద్యోగం... అనుకూలవతి అయిన భార్య... ఇద్దరు పిల్లలూ సరస్వతీ కటాక్షం ఉన్నవారే. ఇంజినీరింగ్లో ఉన్నత చదువులు చదువుతున్నవారే... చీకూ చింతా లేని జీవనం. ఎలాంటి సమస్యలూ లేని ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో... నిద్రమత్తు రూపంలో ప్రాణాలు బలిగొంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడలో నిద్రమత్తులో రైలు దిగుతూ ప్రమాదవశాత్తూ వాటికింద పడి ప్రాణాలు కోల్పోయిన ఆ దంపతులను చూసి కన్నీరు పెట్టనివారంటూ లేరు. సాక్షి, గరివిడి(విజయనగరం): కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబంతో కలసి చేసుకోవాలని సుదూరం నుంచి వచ్చిన ఆ దంపతులు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేస్తున్న ఆయన... నిరంతరం ఆయన్నే అంటిపెట్టుకునే భార్య ఒకేసారి కన్నుమూయడంతో గరివిడి మండ లం వెదుళ్లవలసలో విషాదం అలముకుంది. కనురెప్పపాటులో జరిగిన దుర్ఘటనలో వారిద్దరూ శవాలుగా మారడంతో తమ పిల్లలు అనాథలయ్యారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో వెదుళ్లవలస గ్రామా నికి చెందిన కాపరోతు వెంకటరమణరావు(48) ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్) హెచ్సీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య నాగమణి(40)తో కలసి అక్కడే నివాసం ఉంటున్నారు. కార్తీక పౌర్ణమి పూజలు కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవాలని ఛత్తీస్గఢ్ నుంచి సికింద్రాబాద్ – భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ట్రైన్లో వస్తున్నారు. ముందుగా నాగమణి కన్నవారి ఊరైన దువ్వాడలో దిగి వెదుళ్లవలస రావాలని వారు భావించారు. వారు ఏసీ బోగీలో ప్రయాణిస్తూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఆదివారం వేకువజాము మూడు గంటలయ్యేసరికి దువ్వాడ స్టేషన్ వచ్చేసింది. తోటి ప్రయాణికులు వారిని లేపి దువ్వాడ స్టేషన్లో దిగుతామన్నారు కదా అని చెప్పడంతో వారు కంగారు పడి లేచి కదిలిపోతున్న రైలు నుంచి ప్లాట్ఫాం వైపు కాకుండా రెండో వైపున మొదట వెంకటరమణరావు తన చేతిలో ఉన్న బ్యాగును బయటకి విసిరి గాభరాగా దిగి ప్రమాదవశాత్తూ రైలు చక్రాల మధ్యలో ఇరుక్కున్నాడు. తన భర్త కూడా దిగిపోయాడనుకొని భార్య నాగమణి కూడా దిగి చక్రాల కింద నలిగిపోయింది. ఇద్దరి శరీరాలు నుజ్జనుజ్జయ్యాయి. మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విశాఖపట్నం జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు మృతదేహాలను సొంత ఊరైన వెదుళ్లవలసలకు ఆదివారం సాయంత్రానికి తీసుకువచ్చారు. ఇక్కడే విశాఖ పట్నానికి చెందిన సీఆర్పీఎఫ్ సిబ్బంది అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. వెంటరమణరావు, నాగమణి దంపతులకు ఇద్దరు మగపిల్లలున్నారు. పెద్దవాడు పవన్ సాయి కృష్ణ మద్రాసులో విట్ ఇంజినీరింగ్లో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతుండగా, రెండో కొడుకైన నేతాజీ వెంకటసాయి హైదరాబాద్లో ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఒకే ఇంటిలో ఇద్దరు భార్యభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ఆడుకోవడానికి వచ్చేశాడు...
విజయనగరం క్రైమ్: గతంలో విజయనగరంలో ఉండి ఇప్పుడు విశాఖ మధురవాడలో నివాసముంటున్న నిరంజన్ అనే బాలుడు ఆడుకోవడానికి స్నేహితులెవరూ లేకపోవడంతో విజయనగరం వచ్చేశాడు. శుక్రవారం స్థానిక తోటపాలెంలో చిన్నారి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మహిళా పోలీసులు ఎం. లెనినా, కె. మణికంఠ మహేశ్వరి గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. పుస్తకం కొనుక్కుంటానని అమ్మకు రూ. 30 అడిగి విజయనగరం బస్సెక్కి వచ్చేశాని బాలుడు తెలపడంతో స్టేషన్కు తీసుకొచ్చారు. సీఐ ఎర్రంనాయుడు బాలుడి తండ్రి మల్లేశ్వరరావుకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు రావడంతో పోలీసులు చిన్నారిని అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : ఆదుకోవాల్సిన కొడుకులు అర్ధంతరంగా కన్నుమూయడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డల బంగారు భవిష్యత్ కోసం తాము వలసపోయి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటూ... బిడ్డల మృతి వార్త విని స్వగ్రామానికి రావాల్సి వచ్చిందిరా భగవంతుడా.. అని రోదిస్తుంటూ చూపురుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. విద్యా ర్థుల మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మండలంలోని ఆరికతోట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుణుపూరు హరిశ్చంద్రప్రసాద్ అలియాస్ సంతోష్, దత్తి ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలిసిందే. టిఫిన్ చేయడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు రామభద్రాపురం వైపు వెళ్తుండగా మరో మిత్రుడు ఈదుబిల్లి లోకేష్ ఎదురయ్యాడు. దీంతో వారు వాహనం ఆపి లోకేష్తో మాట్లాడుతుండగా.. విజయనగరం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్తున్న ట్యాంకర్ వీరిని ఢీ కొట్టడంతో హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న హరిశ్చంద్రప్రసాద్ తల్లిదండ్రులు లక్ష్మణరావు, కృష్ణవేణి అదేరోజు సాయంత్రానికి గ్రామానికి చేరుకోగా... వేరే ప్రాంతంలో ఉన్న ఈశ్వరరావు తల్లిదండ్రులు కూడా ఆదివారం రాత్రికే గ్రామానికి చేరుకుని కుమారుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత చదువులు చదివి..మమ్మల్ని పోషిస్తావనుకుంటే.. అర్ధంతరంగా వెళ్లిపోయావా.. నాయినా.. అంటూ మృతుల తల్లిదండ్రులు విలపిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. దసరా పండగ మా జీవితాల్లో చీకటి నింపిందంటూ భోరుమన్నారు. ఇద్దరు స్నేహితుల మృతదేహాలకూ పక్కపక్కనే చితి పేర్చి సోమవారం దహనసంస్కారాలు చేపట్టారు. గంట తర్వాత పయనం.. చెన్నైలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు ఆదివారమే ఈశ్వరరావు బయలుదేరాల్సి ఉంది. శనివారం రాత్రే దుస్తులు, ఇతర సరంజామా సర్దుకున్నాడు. అయితే ఆదివారం ఉదయాన్నే అతడి బంధువొకరు రేషన్ సరుకులు తీసుకురావాలంటూ పురమాయించారు. ఇంతలో హరిశ్చంద్రప్రసాద్ వచ్చి టిఫిన్కు వెళ్దామని రమ్మని కోరడంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరూ రామభద్రాపురం వైపు బయలుదేరారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా... ట్యాంకర్ ఢీకొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. గంట ఆగితే తమ బిడ్డ తమ వద్దకు వచ్చేవాడని.. కాని విధి కన్నెర్ర చేయడంతో తామే కుమారుడి మృత దేహం చూడడానికి రావాల్సి వచ్చిందని ఈశ్వరరావు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అండగా ఉన్నాడని హత్య
సాక్షి, డెంకాడ(విజయనగరం) : మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధిలోని విజయనగరం–నాతవలస ఆర్అండ్బీ రహదారికి ఆనుకుని అరుణోదయ స్టీల్స్ ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఈనెల 25వ తేదీన శవమైన కనిపించిన అంబటి నాగరాజు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భోగాపురం సీఐ సీహెచ్ శ్రీధర్ విలేకరుల సమావేశంలో అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలో అశోక్ నగర్కు చెందిన ఆసనాల చినఅప్పన్న, ఆసనాల పైడిరాజలు అన్నదమ్ములు. వీరు పందుల పెంపకం చేపడుతూ కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. పైడిరాజు వద్ద అంబటి నాగరాజు, సురేష్ పందుల కాపర్లుగా పని చేస్తున్నారు. డెంకాడ మండలంలోని పద్మావతినగర్ లే అవుట్లో చిన అప్పన్న, పైడిరాజులకు చెందిన పందులు పక్కపక్కనే ఉంచుతున్నారు. దీంతో పందులు ఉంచే స్థలంతో పాటు కొన్ని పందులు కనిపించకుండా పోతున్న విషయంలో ఇద్దరు అన్నదమ్ములైన ఆసనాల చినఅప్పన్న, ఆసనాల పైడిరాజుల మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడం.. అది కాస్త కొట్లాటకు దారితీయడంతో ఆసనాల పైడిరాజు గాయపడ్డాడు. వివాదం సమయంలో గాయపడిన పైడిరాజుకు అండగా అంబటి నాగరాజు ఉన్నాడన్న కోపంతో చిన అప్పన్నతో పాటు కుమారులు ఆసనాల శివ, కల్యాణ్లు నాగరాజుపై కోపం పెంచుకున్నారు. దీంతో తండ్రీ కొడుకులైన చినఅప్పన్న, శివ, కల్యాణ్లు నాగరాజును మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదే అదునుగా ఈనెల 24వ తేదీ రాత్రి దాసన్నపేట రింగ్రోడ్డు వద్దనున్న పెట్రోల్ బంకు వద్ద వాహనంపై వస్తున్న అంబటి నాగరాజును శివ, కల్యాణ్లు అడ్డుకుని వారి ద్విచక్ర వాహనంపై పందులు ఉంచే పద్మావతినగర్ లే అవుట్లోకి తీసుకువచ్చారు. అక్కడ శివ, కల్యాణ్లు అంబటి నాగరాజుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వైరుతో ఉరి వేసి చంపేసి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై వేసుకుని పెదతాడివాడ పంచాయతీ పరిధిలోని ఆరుణోదయ స్టీల్స్ ఎదురుగా ఉన్న మామిడి తోటలో పడేశారు. కొడుకు కనిపించకపోవడంతో అంబటి నాగరాజు తల్లి చల్లమ్మ డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగరాజు మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో డెంకాడ ఎస్సై హరిబాబునాయుడు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఆసనాల శివ, కల్యాణ్లను చొల్లంగిపేట ప్రాంతంలో పట్టుకోగా.. వారి తండ్రి చిన అప్పన్న డెంకాడ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో ముగ్గురిపై ఎస్సై హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రక్షించేందుకు వెళ్లి..
సాక్షి, శృంగవరపుకోట(విజయనగరం): మండలంలోని పోతనాపల్లి శివారు కృష్ణంరాజు చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించేందుకు దిగిన విశాఖ డెయిరీ పాలకేంద్రం–2 అధ్యక్షుడు కూనిరెడ్డి సత్తిబాబు (58) మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మృతుని బంధువులు, ప్రత్యక్షసాక్షులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పోతనాపల్లి గ్రామానికి చెందిన చలుమూరి ప్రసాద్ తన గేదెలను గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల వైపు మేత కోసం తీసుకెళ్లాడు. ఉదయం 11.30 గంటల సమయంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కృష్ణంరాజు చెరువులో గేదెలు దిగాయి. అయితే గేదెలు ఒడ్డుకు రాకపోవడంతో ప్రసాద్ చెరువులో దిగి వాటిని తోలే ప్రయత్నంలో మునిగిపోసాగాడు. ఇంతలో ఒడ్డున ఉన్న ప్రసాద్ భార్య తన భర్త మునిగిపోతున్నాడంటూ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్, కూనిరెడ్డి సత్తిబాబులు చెరువులో దిగారు. మునిగిపోతున్న చలుమూరి ప్రసాద్ను రక్షించి ఒడ్డుకు తీసుకుని వస్తున్న క్రమంలో కూనిరెడ్డి సత్తిబాబు చెరువులో మునిగిపోయాడు. ప్రసాద్ను మాత్రం కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తీరా చూస్తే చలుమూరి ప్రసాద్ను రక్షించేందుకు దిగిన కూనిరెడ్డి సత్తిబాబు మునిగిపోయాడని గుర్తించారు. వెంటనే మళ్లీ చెరువులో దిగి మునిగిపోయిన సత్తిబాబును ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రైవేట్ వాహనంలో హుటాహుటిన ఎస్.కోట పట్టణంలో గల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. సీహెచ్సీ డాక్టర్ మహర్షి కూనిరెడ్డి సత్తిబాబుని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో ఆస్పత్రి ఆవరణ మృతుని బంధువుల రోధనలతో మిన్నంటింది. అప్పుడే ఇంటి వద్ద స్నానం చేసి బయటకు వచ్చిన కూనిరెడ్డి సత్తిబాబు తన సోదరి కుమారుడు ప్రసాద్ చెరువులో మునిగిపోతున్నాడని తెలిసి రక్షించేందుకు దిగి తను విగతజీవిగా మారాడాంటు భార్య రమణమ్మ, బంధువులు, పోతనాపల్లి గ్రామస్తులు బోరున విలపించారు. మృతుని సోదరుడు కూనిరెడ్డి వెంకటరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె. నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరు.. మృతిచెందిన కూనిరెడ్డి సత్తిబాబు గ్రామంలోని విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాల ఉత్పత్తిదారుల సంఘం – 2 అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. గ్రామ ప్రజలు, బంధువులు అందరితో సత్తిబాబు ఎంతో చనువుగా ఉంటూ సౌమ్యుడిగా పేరు పొందారు. ఈయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన మృతికి సంతాప సూచకంగా గ్రామంలో ఉన్న దుకాణాలు మూసివేశారు. -
నులిపురుగుల మాత్రలు వికటించి బాలుడి మృతి
సాక్షి, విజయనగరం: చిన్న పిల్లలకు సంబంధించిన నులి పురుగుల నివారణ ముందు బిళ్లలు వికటించి రెండు సంవత్సరాలు బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గరుగుబిల్లి మండలంలో కె. రామినాయుడు వలసలో జరిగింది. కడుపులో నులి పురుగులు పోవడం కోసం నానమ్మతో కలిసి అంగన్ వాడీ సెంటర్కి వెళ్లిన జస్విక్ నాయుడు ట్యాబ్లెట్ మింగిన పది నిమిషాలకు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్పందించిన స్థానికులు బాలుడిని ఆటోలో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జస్విక్ అప్పటికే చనిపోయాడని తెలిపారు. -
తల్లి మందలించిందని.. ఆత్మహత్య
సాక్షి, విజయనగరం టౌన్ : వ్యసనాలకు బానిసకావద్దని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయనగరం పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. దీనికి సం బంధించి రూరల్ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక సుంకర వీధికి చెందిన కె.రాజశేఖర్ (20) భవన నిర్మాణం జరుగుతున్న సైట్లో వాచ్మన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏడాది కిందట కల్యాణి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత వ్యసనాలకు బానిసై కుటుంబ సభులతో ఎప్పుడూ తగాదాలు పడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లి మందలించడంతో ఏడుస్తూ వెళ్లిపోయి పద్మావతీనగర్ ధర్మపురి గాయత్రీనగర్ సమీపంలో సైట్పక్కన గుడిసెలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ఫక్రుద్దీన్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సాక్షి, విజయనగరం : మరణాంతరం ఆ యువకుడు అందరిలో సజీవంగా నిలిచాడు. ఆ యువకుడి తల్లిదండ్రులు వైద్యుల కోరిక మేరకు తమ బిడ్డ నేత్రాలను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలో విటి అగ్రహారంలో నివాసముంటున్న మజ్జి గణేష్ (22) డిగ్రీ పూర్తి చేసి, స్థానిక జెరాక్స్ షాపులో పని చేస్తున్నాడు. ప్రతీ రోజూ జిమ్కు వెళ్లడం అలవాటుగా ఉన్న గణేష్ రోజూలాగే శుక్రవారం ఇంటి నుంచి జిమ్కు బయలుదేరాడు. స్థానిక ప్రదీప్నగర్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ బైక్పై వెళ్తున్న గణేష్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో గణేష్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గణేష్ తండ్రి శ్రీనివా సరావు జ్యూట్ మి ల్లులో కార్మికునిగా పని చేసి మిల్లు మూసేయడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దల కోరిక మేరకు గణేష్ నేత్రాలను దానం చేశారని ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
సాక్షి, విజయనగరం : ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ఎనిమిదిమంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని జియ్యమ్మ మండలం గవరమ్మపేట జంక్షన్ వద్ద జరిగింది. గుమ్మ లక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి జియ్యమ్మవలస వైపు పదిమంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించి క్షతగాత్రులను పార్వతీపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరడాని సత్యవతి అనే మహిళ మృతిచెందింది. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అందుకే చచ్చిపోవాలనిపించింది
సాక్షి,గంటస్తంభం(విజయనగరం) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సక్రమంగా చూసుకోవడం లేదన్న వేదన ఒకవైపు... తన బాధ చెప్పినా అధికారులు స్పందించడం లేదన్న ఆవేదన మరోవైపు.. ఆ వివాహితను మానసికంగా కుంగదీసింది. తన బాధను మరోసారి అధికారులకు చెప్పుకుందామని, అప్పటికీ పరిష్కారం కాకుంటే తనవు చాలిద్దామన్న మానసిక సంఘర్షణ మధ్య ఆమె కలెక్టరేట్లో అడుగుపెట్టింది. అధికారులకు మరోసారి తన సమస్య చెప్పుకుంది. అయితే పరిష్కారం లభిస్తుందని, తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం కోల్పోవడంతో ఏకంగా ప్రాణం తీసుకుందామని అత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు యువతిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే... బొబ్బిలి మండలం అలజంగికి చెందిన వసుంధర అదే గ్రామానికి చెందిన రాపాక ఈశ్వరరావును ప్రేమించి నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకుంది. అయితే భర్త ఈశ్వరరావు తనను సక్రమంగా చూడడం లేదని సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. తన ఆవేదన మొత్తం వినతిపత్రం రూపంలో రాసుకున్న ఆమె ఫిర్యాదును కలెక్టరు ఎం. హరి జవహర్లాల్కు ఇచ్చింది. గ్రామానికి చెందిన ఈశ్వరరావు, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో తాను గర్భవతి అయ్యానని... అయితే ఈశ్వరరావు పెళ్లికి అంగీకరించకపోవడంతో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది. దీంతో పోలీసులు ఈశ్వరరావుకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ ఏడాది ఏప్రిల్ 19న సింహాచలంలో వివాహం చేసుకున్నామని వివరించింది. అయితే అప్పటి నుంచి తనను అత్తవారింటికి తీసుకెళ్లలేదని... పైగా బలవంతంగా మందులు వేయించి గర్భస్రావం చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తమ కుమారుడ్ని వదిలేయాలని అత్తమామలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని..దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖలో పొందుపరిచింది. చీమల మందు తినేసిన బాధితురాలు.. ఇదిలా ఉంటే అధికారులకు తన గోడు చెప్పుకుంటున్న బాధితురాలు ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న చీమలమందు తినేసింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి సపర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఉషశ్రీ,, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మి అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించి 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో స్పందించడంతో బాధితురాలికి ప్రాణహాని తప్పింది. ఇదిలా ఉండగా బాధితురాలి సమస్య పరిష్కరించాలని, వసుంధర భర్త, ఇతర కుటుంబ సభ్యులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు పోలీసులను ఆదేశించారు. -
ప్రాణాలు తీసిన స్టాపర్
సాక్షి, తగరపువలస(విజయనగరం) : వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్టాపర్ను బైక్తో ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన భీమిలి మండలం దాకమర్రి సమీపంలో విజయనగరం వెళ్లే రోడ్డులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. భీమిలి ఎస్ఐ పాణిగ్రాహి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా సాలూరు చింతల వీధికి చెందిన తిరుమలేశ(21), బాడాన హేమంత్ కుమార్(30) ఆదివారం ఉదయం విశాఖపట్నం ద్విచక్ర వాననంపై వచ్చా రు. తిరిగి ఆదివారం అర్ధరాత్రి తిరుగుప్రయాణమయ్యారు. విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీలో ఉంటున్న తిరుమలేశ అమ్మమ్మ ఇంటి వద్ద రాత్రికి ఉండిపోయి తెల్లవారి స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో రాత్రి 1:50 గంటల సమయంలో దాకమర్రి రఘు కళాశాల వద్ద వేగ నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన స్టాపర్ను బైక్తో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తిరుమలేశ సంఘటన స్థలంలోనే మరణించంగా, తీవ్రంగా గాయపడిన హేమంత కుమార్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించాడు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సింహగిరి ప్రదక్షిణ బందోబస్తులో ఉండటంతో విషయం అలస్యంగా తెలిసింది. భీమిలి ఎస్ఐ పాణిగ్రాహి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బు ఇవ్వలేదని కొట్టి చంపేశారు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : మండలంలోని నారసింహునిపేట సమీపంలో నంద చెరువు వద్ద సీతానగరం మండలం గుచ్చిమికి చెందిన దుస్తుల వ్యాపారి కింతలి నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మిస్టరీని ఏఎస్పీ గౌతమీశాలి ఆధ్వర్యంలో పోలీసులు రెండు రోజుల వ్యవధిలో ఛేదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. కింతలి నాగేశ్వరరావు దుస్తులు విక్రయించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన బలగ రామినాయుడుకు రూ. రెండు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల కాలంలో తన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని తరచూ నాగేశ్వరరావు అడుగుతుండడంతో రామినాయుడు కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా నాగేశ్వరరావును అంతమొందించాలని భావించిన రామినాయుడు తనకు తెలిసిన సుంకరి వాసు, జాగాన సత్యనారాయణలతో బేరం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి.. హత్య చేసిన తర్వాత రూ. 75 వేలు ఇవ్వడానికి రామినాయుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులు ముందుగా కింతలి నాగేశ్వరరావు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో రెక్కీ నిర్వహించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి నారసింహునిపేట వైపు నాగేశ్వరరావు వస్తాడని నిర్ణయించుకున్న నిందితులు ముందుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న నాగేశ్వరరావుపై నిందితులు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి రెండు ఉంగరాలు, పర్స్, సెల్ఫోన్ తీసుకెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. సమీపంలోని మూడు పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, హత్యకు ఉపయోగించిన కర్ర స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందనలు.. హత్య కేసును త్వరగా ఛేదించిన బొబ్బిలి, బాడంగి, సీతానగరం ఎస్సైలు వి. ప్రసాదరావు, బి. సురేంద్ర నాయుడు, జి.కళాధర్తో పాటు బొబ్బిలి నూతన ఎస్సై ఎస్. కృష్ణమూర్తి, బొబ్బిలి ఏఎస్సైలు బీవీ రమణ, వై. మురళీకృష్ణ, జి. శ్యామ్సుందరరావు, పీసీలు కె. తిరుపతిరావు, యు. తాతబాబునాయుడు, బి. కాసులరావు, వి. శ్రీరామ్, వై. శ్యామలరావు, కె.పూడినాయుడులను ఏఎస్పీ అభినందించారు. -
బంగారమే టార్గెట్
విజయనగరం టౌన్: నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లలో, కొద్ది రోజులుగా ఎవరూ లేకుండా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. కేవలం బంగారు నగలే టార్గెట్గా, అంతుచిక్కని రీతిలో సాగుతున్న ఈ దొంగతనాలను తలచుకుంటే ప్రజలు హడలిపోతున్నారు. రెండురోజుల క్రితం కంటోన్మెంట్లోని ఉడా కాలనీ ఫేజ్–4లో జరిగిన దొంగతనం నుంచి తేరుకోక ముందే, అదే ప్రాంతంలో మరో చోట రెండిళ్లలో వరుస చోరీలు జరిగాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు ఎవరైనా కనపడితే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు పలు వివరాలు తెలిపారు. అభరణాలే లక్ష్యం.. సోమవారం రాత్రి ఉడా కాలనీ ఫేజ్–4లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు పడ్డారు. విశాఖలోని యాక్సిస్ బ్యాంక్లో పనిచేస్తున్న విక్రమ్ సోమవారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు. ఎదురుగా ఉన్న అత్తవారింటికి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేశారు. రూ.5 వేల నగదు, ఆభరణాలు పట్టుకుని ఎవరో పరారయ్యారు. అలాగే మెప్మా పీడీ లక్ష్మణరావు ఎంఐజీ– 21లో నివాసం ఉంటున్నారు. పనిమీద శ్రీకాకుళం వెళ్లారు. ఇంట్లో ఒక్కరే ఉండడాన్ని గమనించిన దొంగలు సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. విధులు నిర్వహించుకుని మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన ఆయన ఇంటి తలుపులు తెరిచి, గడియ విరగ్గొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న రూ.8 వేల నగదు, రెండున్నర తులాల బంగారం పోయినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి పలు ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని, ఇంకా తమకు ఫిర్యాదు చాలా మంది బాధితుల నుంచి అందలేదని ఎస్ఐ ప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన మద్యం వివాదం
విజయనగరం, మక్కువ: భార్యాభర్తల మధ్య వివాదం భర్త ప్రాణం తీసింది. మద్యం రోజూ తాగుతున్నాడని భర్తను భార్య మందలించగా...మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, భర్త శుక్రవారం మామిడి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన మక్కువ మండలం శంబర గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... మండలంలోని శంబర గ్రామానికి చెందిన లావేటి జయకు ఒడిశా రాష్ట్రం జైపూర్కు చెందిన బి.ప్రభాకరరావుతో 18 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రభాకరరావు లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. ప్రభాకరరావుకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 17న భార్యాభర్తల మధ్య మద్యం తాగడంపై గొడవ జరిగింది. అదే రోజు జయ గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతుంది. ప్రభాకరరావు గురువారం భార్యను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లి తిరిగి శంబర గ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు తువ్వాలుతో ఉరి వేసుకొని మృతి చెందాడు. స్థానికులు పొలంకు వెళ్తూ ప్రభాకరరావు మృతదేహాన్ని చూసి కుటుంబీకులకు, గ్రామస్తులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.కృష్ణప్రసాదు, ప్రొహిబిషన్ ఎస్ఐ షేక్శంకర సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టారు. పరుగుపరుగున... భర్త మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న భార్య జయ సాలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి శంబర గ్రామానికి పరుగుపరుగున చేరుకొంది. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. వీరి పెద్ద కుమారుడు ప్రకాష్ ఎనిమిదో తరగతి, చిన్నబ్బాయి మోహన్ ఆరో తరగతి చదువుతున్నారు. ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించారు. -
యువతిపై లైంగిక దాడి
విజయనగరం, కొమరాడ: మండలంలోని మాదలింగి గ్రామానికి చెందిన ఓ యువకుడు గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి గ్రామానికి చెందిన ఓ మూగ యువతిని అత్యాచారం చేసినట్లు వాడపుట్టి గ్రామస్తులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వాడపుట్టి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 5న రాత్రి కొమరాడ మండలం పాలేం గ్రామంలో శివరాత్రి సంబరాలు నిర్వహించడంతో పరిసర గ్రామస్తులతో పాటు వాడపుట్టి గ్రామానికి చెందిన పలువురు యువతీ యువకులు వెళ్లారు. సంబరాలు చూస్తుండగా వాడపుట్టి గ్రామానికి చెందిన మూగ యువతితో పాటు మరో ఇరువురు యువతులు ఆరుబయటకు వెళ్లడం గమనించిన ఓ యువకుడు వారి వెంటే వెళ్లి ఆ మూగ యువతిని బలవంతంగా పక్కన ఉన్న ప్రదేశానికి ఈడ్చుకెళ్లాడు. దీన్ని గమనించిన ఇద్దరు యువతులు పరుగున గ్రామానికి వచ్చి వాడపుట్టి గ్రామస్తులతో పాటు పాళెం గ్రామస్తులకు సమాచారం అందించడంతో సంఘటనా ప్రదేశానికి వెళ్లేసరికే ఆ యువకుడు పారిపోయాడు. ఆ ప్రదేశంలో గ్రామస్తులకు ఆ యువకుడి ఫోన్ లభించడంతో ఆ యువకుడు మాదలింగి గ్రామస్తుడుగా వారంతా గుర్తుపట్టారు. మొదట ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి రాజీ చేయాలనుకున్నప్పటికీ కుదరకపోవడంతో యువతి కుటుంబీకులు శుక్రవారం కొమరాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై నిజనిర్ధారణ నిమిత్తం ఆ యువతిని వైద్య పరీక్షల నిమ్తితం పార్వతీపురంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఇదే విషయం ట్రైనీ ఎస్ఐ ప్రసన్నకుమార్ వద్ద ప్రస్తావించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. అరెస్టు చేయాలి... మండలంలోని పాలేం గ్రామంలో జరిగిన గుమ్మలక్ష్మీపురం మండలంల నెల్లికెక్కువ పంచాయతీ ఓటపుట్టి గ్రామానికి చెందిన మూగ యువతిపై అత్యాచారం చేసిన కేసులో మాదలింగి గ్రామానికి చెందిన బర్ల కామేశ్వరరావును తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు.పార్వతీపురం సీఐ కార్యాలయం వద్ద మూగ యువతితో కలిసి ఆయన విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేవారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
మహిళా టీచర్లకు అసభ్యకర సందేశాలు..
విజయనగరం ,కొత్తవలస: తల్లితండ్రుల తర్వాత అంతటి గౌరవాన్ని ఉపాధ్యాయులకు ఇచ్చింది మన సమాజం. కాని సభ్య సమాజం సిగ్గుపడేలా సాటి మహిళా ఉపాధ్యాయినులకు అభ్యంతకర మెసేజ్లు పంపిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. అతని వేధింపులు భరించలేక బాధిత ఉపాధ్యాయినులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని కంటకాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న జి. వెంకటనాయుడు అభ్యంతకర మెసేజ్లతో మహిళా ఉపాధ్యాయులను వేధిస్తున్నాడు. ఓ దాత మీ పాఠశాలకే రెండు కంప్యూటర్లు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని దిగువ ఎర్రవానిపాలెం పాఠశాల ఉపాధ్యాయిని హెచ్. రమాదేవికి.. ఎర్నడ్ లీవ్ చేయించుకోవడంలో ఎంఈఓను బాగానే మేనేజ్ చేశావంటూ కొత్తవలస పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్. శోభారాణికి వెంకటనాయుడు మెసేజ్లు పంపించాడు. అలాగే చీడివలస పాఠశాల హెచ్ఎం బంగారుపాపను ఉద్దేశిస్తూ ఎన్నిసార్లు అవార్డులు తీసుకుంటావంటూ మెసేజ్లతో వేధిస్తున్నాడు. బంగారుపాపకు జిల్లా స్థాయి అవార్డు రావడంతో ఇటీవల మండల కేంద్రంలో జరిగిన అభినందన సభలో కూడా తక్కువ చేసి మాట్లాడినట్లు బాధిత ఉపాధ్యాయురాలు తెలిపింది. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ముగ్గురు మహిళా ఉపాధ్యాయినులు పోలీసులను ఆశ్రయించారు. తోటి ఉపాధ్యాయులు, ఆయా గ్రామాల ప్రజలతో కలిసి పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వెంకటనాయుడు ఆగడాలను బాధిత ఉపాధ్యాయినులతో పాటు తోటి ఉపాధ్యాయులు చుక్క ఈశ్వరఅప్పారావు, బి. శ్రీనివాసరావు, నాగభూషణరావు, పి. రవి, బి. రామకృష్ణారావు, తదితరులు సీఐకి వివరించారు. కులంపేరుతో తక్కువగా మాట్లాడుతున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే బంధువు కావడంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటనాయుడు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బంధువులు కావడంతో అందరినీ బెదిరిస్తున్నాడని పలువురు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం అతడ్ని పిలిచి విచారించలేదని బాధిత మహిళలు వాపోయారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఐ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిందితుడితో పాటు గ్రూప్ అడ్మిన్ సోలురాజును పిలిచి విచారిస్తామని చెప్పారు. -
‘మెరుగు’ మోసగాళ్లు దొరికారు..
విజయనగరం , పార్వతీపురం/ గరుగుబిల్లి: బంగారానికి మెరుగు పెడతామని పట్టణంలోని ఇద్దరు మహిళలను మోసం చేసి 13 తులాల బంగారంతో పాటు నగదును ఎత్తుకొని పరారైన మోసగాళ్లను పట్టణ ఎస్సై యు. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై మహేష్ ఆదివారం తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పట్టణంలోని సంకావీధిలో గల అత్తాకోడళ్లు కాంతరత్నం, అనూషల ఇంటికి వచ్చిన మోసగాళ్లు బంగారానికి మెరుగుపెడతామని చెప్పి 13 తులాల బంగారంతో ఉడాయించారు. ఇదిలా ఉంటే పట్టణంలోని మేదరవీధిలో గల పడాల నారాయణరావు ఇంటిలో బీహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది వ్యక్తులు అద్దెకు ఉంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం పది గంటలకు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు కాంతరత్నం, అనూషల నుంచి బంగారం కాజేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు నిందితులు దినేష్కుమార్, సంతోష్కుమార్ యాదవ్లతో పాటు గరుగుబిల్లి మండలం రావివలసలో ఒక గృహిణిని మోసం చేసి దొరికిపోయిన గంగాకుమార్, సుభాస్కుమార్, ఇంద్రిజిత్ యాదవ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిందితుల నుంచి 51 గ్రాములు కరిగించిన బంగారాన్ని, నైట్రిక్, హ్రైడోక్లోరిక్ యాసిడ్తో పాటు బంగారం శుద్ధి చేసే పౌడర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు తెలియజేయండి... ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడినా..అద్దె కొరకు ఇళ్ల కోసం వచ్చినా తమకు తెలియజేయాలని ఎస్సై మహేష్ కోరారు. మెరుగు పెడతామంటూ వచ్చేవారిని నమ్మవద్దని సూచించారు. -
ఉద్యోగాల పేరిట టోకరా..
విజయనగరం ,కురుపాం: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియమ్మవలస మండలాల్లో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి సుమారు 25 లక్షల రూపాయల వరకు వసూళ్లుకు పాల్పడి వ్యక్తిని విద్యార్థి సంఘ నాయకులు పట్టుకున్నారు. బాధితులు ఆరిక సుశీల, బుజ్జి, అరుణకుమారి, ప్రసాద్తో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, గిరిజన సంఘ నాయకుడు గొర్లి తిరుపతిరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన గాదాపు శివున్నాయుడు అనే వ్యక్తి తనకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుసునని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, వాచ్మన్, అటెండర్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికాడు. నాలుగు మండలాల్లోని సుమారు 70 మందిని మోసం చేసి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా మొత్తం సుమారు 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ముఖం చాటేశాడు. ఉద్యోగాల కోసం బాధితులు ఎన్నిసార్లు అడిగినా ఇదుగో..అదుగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో డబ్బులు ఇచ్చేయమని బాధితులు కోరినా పట్టించుకోలేదు. దీంతో బాధిత నిరుద్యోగులు ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘ నాయకుల దృష్టికి తీసుకురాగా.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితులు కురుపాం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. చిన్న చిన్న దొంగతనాల నుంచి... కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన గాదాపు శివున్నాయుడు పరిసర గ్రామాల్లో పశువులు దొంగతనం చేసి జులాయిగా తిరిగేవాడు. ఈ మేరకు కొమరాడ పోలీస్ స్టేషన్లో ఇతనిపై పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇలా చిన్న చిన్న దొంగతనాల నుంచి లక్షల రూపాయాలు మోసం చేసి అమాయక గిరిజనులకు మోసం చేశాడు. -
ఉద్యోగం రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: ఉద్యోగం రాలేదన్న నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం దేవుకోన గ్రామానికి చెందిన కొండబోయిన చంద్ర చూడామణి డిగ్రీ చదివి ఎన్నో పోటీ పరీక్షలు రాశాడు. అయితే ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంటిలో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కొమరాడ మండలం రామభద్రపురం పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఔట్పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతిస్థిమితం లేక మతిస్థిమితం సరిగ్గా లేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మండలం ఎంఆర్ నగరంనకు చెందిన పొగిరి దుర్గాప్రసాద్ తాగుడికి బానిసయ్యాడు. పైగా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి 108 వాహనంలో అతడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఔట్పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు రోజుల్లో ఆమె పెళ్లి... ప్రేమ జంట ఆత్మహత్య
వాళ్లిద్దరూ చదువుకున్నవారే. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కలకాలం సంతోషంగా బతకాలనుకున్నారు. కానీ వారికి కులం అడ్డం వచ్చింది. ఒకరు ఎస్సీ కులానికి చెందినవారైతే... ఇంకొకరు బీసీ(తెలుకల) కులానికి చెందిన వారు. ఇద్దరి మనసులు కలసినప్పటికీ... ఇద్దరి గుండెచప్పుడు ఒక్కటైనప్పటికీ... ఒకరిపై ఒకరికి హద్దులు లేని ప్రేమ ఉన్నప్పటికీ... కులం అడ్డుగోడగా నిలిచింది. విషయం తెలిస్తే తమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించరనీ... వారికి తెలియకుండానే ప్రేమించుకో సాగారు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారొకటి తలిస్తే దైవమొకటి తలచింది. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం కుదిర్చారు. బుధవారమే ఆ పెళ్లి జరగాల్సి ఉంది. చేసేది లేక ఆమె ప్రేమికుడితో కలసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం, పార్వతీపురం/కొమరాడ/బొబ్బిలి: బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన పాలకొండ కృష్ణవేణి(18) ఇంటర్మీడియెట్ చదువుకుంది. ఈమె తల్లిదండ్రులు ప్రసాద్, సునీత కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చింతల బెలగాం చంద్రశేఖర్ (20) ఇంటర్మీడియట్పూర్తిచేసి రాజా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి తండ్రి లేడు. తల్లి కళ మాత్రమే ఉంది. కృష్ణవేణి, చంద్రశేఖర్ ప్రేమించుకున్నారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుందా మనుకున్నారు. కానీ ఇంతలోనే కృష్ణవేణి తల్లిదండ్రులు ఆమెకు వివాహం ఖాయం చేశారు. గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కురమాన చిన్నారావు(చంటి) అనే యువకునితో వివాహం నిశ్చయం చేశారు. చిన్నారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నందున తన కుమార్తె భవిష్యత్ బాగుంటుందని భావించారు. జనవరి 23వ తేదీ న వీరి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. బంధువులకు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేశారు. కానీ ఆమె మనసు అంగీకరించలేదే మో... చావైనా బతుకైనా ప్రేమించిన వ్యక్తితోనే అనుకున్నదేమో... తల్లిదండ్రులు కుదిర్చిన వివా హం చేసుకోకుండా ప్రేమించిన యువకుడితో కలసి కొమరాడ మండలం శివిని గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రోదిస్తున్న మృతురాలి తల్లి కాబోయే భర్తతో వెళ్లి అదృశ్యం పండుగకోసం కోటిఆశలతో కాబోయే భార్యను చూసేందుకు చిన్నారావు జగన్నాథపురం వచ్చాడు. అత్తవారింట్లో సరదాగా గడిపాడు. ఆదివారం తన స్నేహితురాలి పెళ్లికి తీసుకెళ్లమని కోరితే సంబరంగా ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. పార్వతీపురం వచ్చేసరికి లఘుశంక తీర్చుకుంటానని చెప్పగా బండి ఆపాడు. కానీ అలా వెళ్లిన ఆమె ఎంతకూ రాకపోయేసరికి చుట్టుపక్కల వెతికి చివరికి పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎస్ఐ మహేష్, రైల్వే పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రులు విషయం తెలుసుకొని రైలు పట్టాలు దగ్గరకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి సునీత, తండ్రి పీటల మీద కూర్చొవల్సిన తన కుమార్తె పెళ్లికి కొద్ది గంటల ముందే రైలు పట్టాలపై శవమై కన్పించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు, తల్లి కళ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కృష్ణవేణిని వివాహం చేసుకోవాల్సి న కొత్తూరుకు చెందిన చిన్నారావు కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. కార్డులు పంచి బంధువులును ఆహ్వానించి ఒక రోజు తరువాత వివాహం జరగాల్సి ఉండగా ఇంతలో ఈ రకంగా సమస్య వచ్చి పడడంతో వారు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
గంజాయి...గుట్టురట్టు...!
ఆయనో స్మగ్లర్...ఢిల్లీకి చెందినవాడు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తరలించేందుకు సిద్ధపడ్డాడు. కానీ బస్సులో వెళ్తే పోలీసుల తనిఖీలు జరిగితే పట్టుబడతానని భావించి ఏజెన్సీలోని డిగ్రీ చదువుతున్న గిరిజన యువకులకు ఎరవేశాడు. గంజాయిని చెప్పిన చోటకు అప్పజెబితే రూ.12వేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్నట్టే గంజాయిని స్మగ్లర్కు అప్పగిస్తుండగా ముగ్గురూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, శృంగవరపుకోట రూరల్: మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద (విశాఖ – అరకు ప్రధాన రహదారిలో) గంజాయిని తరలిస్తున్న ఢిల్లీ, విశాఖ ఏజెన్సీలకు చెందిన అజయ్, సోలోమన్, సీతారామశాస్త్రి అనే యువకులు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్.కోట ఎస్ఐ ఎస్.అమ్మినాయుడు శుక్రవారం తెలిపారు. ఢిల్లీకి చెందిన అజయ్ అనే గంజాయి స్మగ్లర్ డుంబ్రిగుడ మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేసి చాపరాయి గ్రామ సమీపానికి చేరుకున్నాడు. అరకు, అనంతగిరి మీదుగా ఆర్టీసీ బస్సులో గంజాయిని తీసుకువెళ్తే పోలీసుల సోదాలో పట్టుబడతామని భావించి ద్విచక్ర వాహనంపై గంజాయిని ఎస్.కోట పట్టణ శివారు ప్రాంతంలో అందజేసేందుకు డుంబ్రిగుడకు చెందిన డిగ్రీ యువకులు సోలోమన్, సీతారామశాస్త్రిలను స్మగ్లర్ సంప్రదించాడు. గంజాయిని తరలించేందుకు కేజీకి రూ.వెయ్యి చొప్పున రూ.12వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తరువాత స్మగ్లర్ అజయ్ ఆర్టీసీ బస్సులో ఎస్.కోట పట్టణ శివారున గల హోండా షోరూం సమీపానికి చేరుకున్నాడు. ద్విచక్ర వాహనంపై గంజాయిని తీసుకొచ్చిన ఏజెన్సీ యువకులు స్మగ్లర్ అజయ్కు అందజేస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు కాపు కాచి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం, రూ.14వేల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను విశాఖలోని సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్ఐ అమ్మినాయుడు తెలిపారు. మధ్యవర్తులు హెచ్డీటీ ఎన్.కూర్మనాధరావు, వీఆర్వో వడ్డాది శ్రీనివాసరావు, కె.సన్యాసిరావు సమక్షంలో గంజాయితో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. -
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
విజయనగరం, పార్వతీపురం: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది. వైకేఎం కాలనీలో నివాసం ఉంటున్న డప్పుకోట రాజారావు, సరోజనమ్మల కుమారుడు డప్పుకోట రవికుమర్ (27) ఆదివారం రాత్రి 3.30 గంటల సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే రవికుమార్ మృతి చెందాడు. అవుట్ పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మృతుడు రవికుమార్ తండ్రి రాజారావు మాట్లాడుతూ, తన కుమారుడు కడుపునొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతున్నాడని చెప్పారు. ఆది వారం రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఫిర్యాదులు పేర్కొన్నారు. మృతుడి జేబులో లేఖ... మృతుడు రవికుమార్ జేబులో సూసైడ్ నోట్ లభించింది. అందులో కల్యాణి అనే మహిళ, ఆమె తండ్రితో పాటు భర్త తన చావుకు కారణమని రాసి ఉంది. గరుగుబిల్లి మండలం పెద్దూరు.. జియ్యమ్మవలస మండలానికి చెందిన కొందరు తనను చంపాలనుకుంటున్నారని వారి ఫోన్ నంబర్లుతో సహాలేఖ రాసి జేబులో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే మృతుడి జేబులో లేఖ ఉన్నప్పటికీ.. పోలీసులు మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం విశేషం. -
కొంపముంచిన అతివేగం
విజయనగరం, బొబ్బిలి రూరల్: ఓ ఆటో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా.. మరో బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని లింగంవలస గ్రామానికి చెందిన అలజంగి సునీత (10), మామిడి లావణ్య (18) మరో నలుగురైదుగురు ప్రయాణికులతో కలసి ఆటోలో బొబ్బిలి వెళ్తున్నారు. వీరి ఆటో ముత్తాయవలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు బాలికలు రోడ్డుమీద పడిపోయారు. ఈ ప్రమాదంలో సునీత తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలిక మామిడి లావణ్య స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు లావణ్యను బొబ్బిలి ఆస్పత్రికి తరలించడంతో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. ఏఎస్సై చదలవాడ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బతుకు జీవుడా..
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: వారంతా గిరిశిఖర గ్రామాల్లో నివశించే గిరిజనులు. పండించిన ఫలసాయాలు, సేకరించిన అటవీ ఉత్పత్తులను మైదాన ప్రాంతంలో జరిగిన సంతలో విక్రయించి.. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి గ్రామాలకు తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో వాహనంలో వస్తుండగా బ్రేకులు ఫెయిలై బోల్తాపడడంతో 20 మంది గాయపడగా... ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... గుమ్మలక్ష్మీపురం మండలంలోని తోట, గోరటి గ్రామాలకు చెందిన గిరిజనులు గుమ్మలక్ష్మీపురంలో బుధవారం జరిగిన సంతకు వెళ్లి అటవీ ఉత్పత్తులు విక్రయించి తమకు కావాల్సిన సరకులు కొనుగోలు చేశారు. తిరిగి స్వగ్రామాలకు వెళ్లేందుకు పెదఖర్జ గ్రామానికి చెందిన పాండుసాహు మురళికి చెందిన బొలేరో పికప్ ( ఏపీ 35వై 3745) వాహనం ఎక్కారు. సరిగ్గా పెదఖర్జ పంచాయతీ చప్పగూడ గ్రామం దాటిన తర్వాత ఘాట్రోడ్డు నాలుగో మలుపు వద్ద వాహనం బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో వాహనం వెనక్కి వెళ్లిపోతుండడంతో గిరిజనులు హాహాకారాలు చేశారు. పది మీటర్ల వరకు వెనక్కి వచ్చిన వాహనం బోల్తా పడి ఓ రాయిని ఆనుకుని నిలిచింది. వెంటనే ప్రయాణికులు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో తోట గ్రామానికి చెందిన బిడ్డిక లచ్యయ్య, బిడ్డిక రామారావు, మండంగి గీత, బిడ్డిక ఇందు, బిడ్డిక చిన్నమ్మి, నిమ్మక లుద్దు, బిడ్డిక జిన్న, నిమ్మక వీర, బిడ్డిక పద్మావతి.. గోరటి గ్రామానికి చెందిన బిడ్డిక గణపతి, మండంగి దివ్య, నిమ్మక శ్రీరాం, తోయక దమయంతి, బిడ్డిక ప్రసాద్, బిడ్డిక సాంతమ్మ, బిడ్డిక కుద్ద, తోయక మహేష్, తదితర 20 మంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు ఎల్విన్పేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బమ్మిడి శ్రీనివాసరావుతో పాటు ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షత్రగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన తర్వాత తీవ్రంగా గాయపడిన బిడ్డిక లచ్చయ్య, బిడ్డిక రామారావు, మండంగి గీతలను మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఎల్విన్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెను ప్రమాదమే తప్పింది. గోరటి ఘాట్రోడ్డులో బొలేరో పికప్ వాహనం బోల్తాపడి రోడ్డు అంచున గల రాయిని తాకుతూ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రాయి అడ్డులేకపోతే సుమారు 300 అడుగుల లోతులో ఉన్న లోయలో వాహనం పడిపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘాట్రోడ్డు కావడంతో ఆర్టీసీ బస్సులు వెళ్లకపోవడంతో గిరిజనులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. గతేడాది డిసెంబర్ 8న కూడా ఇదే స్థలంలో బ్రేకులు ఫెయిలై ఆటో లోయలో పడిపోవడంతో పార్వతీపురానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. -
కాసులకు కక్కుర్తి పడి...
విజయనగరం, బొబ్బిలి: నకిలీ నోట్లు, నిషేధిత బాణసంచా వ్యాపారం, రియల్టర్ల హత్యాయత్నాలు, గన్ కల్చర్తో చెడ్డ పేరు సంపాదించుకున్న బొబ్బిలికి తాజాగా మరో మరక అంటింది. డబ్బులకు ఆశపడి కొంతమంది ప్రముఖులే దొంగల నుంచి బంగారం కొంటున్నారు. ఈ విషయాన్ని విశాఖ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన అంతర్రాష్ట్ర నేరగాడు దున్న కృష్ణ విశాఖలో బంగారాన్ని దొంగతనం చేశారు. ఈ బంగారాన్ని బొబ్బిలి మెయిన్రోడ్డులో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న యజమాని ద్వారా ఇద్దరు ప్రముఖ వ్యాపారులకు విక్రయించాడు. వస్త్ర వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి 750 గ్రాములు... ఇటీవలే బలిజిపేట రోడ్డులో బంగారు నగల దుకాణం పెట్టిన ఓ యువ వ్యాపారి 450 గ్రాముల బంగారం కొనుగోలు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి చెప్పుల దుకాణ యజమాని ఈ బంగారాన్ని వ్యాపారులకు విక్రయించాడు. తులం రూ.36 వేలున్న బంగారం చవగ్గా వస్తుండడంతో బంగారం తెచ్చిన వారికి అంత స్థాయి ఉందా లేదానన్న విషయం చూడకుండా వ్యాపారులు కొనుగోలు చేసేశారు. వాస్తవానికి ఇద్దరికీ ఆ స్థాయి వ్యాపారాలు లేనప్పటికీ తక్కువకు వస్తుందన్న దురాశతో బంగారం కొన్నారు. అయితే ఈ విషయం విశాఖ కమిషనర్కు తెలియడంతో సిబ్బందిని మఫ్టీలో బొబ్బిలి పంపించి వ్యాపారులను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యాపారులతో పాటు విక్రయించిన మరో ఇద్దరు ప్రస్తుతం విశాఖ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అయితే బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు వారిని ఇంకా విడిచిపెట్టలేదని సమాచారం. కొనుగోలు చేసిన బంగారం విలువ ఇంకా ఎక్కువ ఉందా లేదానన్న విషయంలో విశాఖ సీపీ సిబ్బంది వాకబు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఈ ముఠా విషయమై బొబ్బిలి పోలీసులు ఆరా తీసినా ఇతరత్రా పనులతో ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి ఇంటరాగేషన్ చేసేవరకూ ఇక్కడి పోలీసులకు తెలియని పరిస్థితి నెలకొందంటే స్థానిక పోలీసుల పనితీరుపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా దొంగ బంగారం కొనుగోలులో నలుగురు అరెస్ట్ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే బంగారాన్ని అమ్మజూపిన వారు కూడా పాత నేరస్తులేనని సమాచారం. గతంలో నగల దుకాణం యజమాని నుంచి పార్వతీపురానికి సంబంధించిన ఓ దొంగతనం కేసులో బంగారాన్ని కూడా రికవరీ చేయించినట్టు తెలిసింది. విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దొంగ బంగారం కొనుగోలు కేసులో పట్టణానికి చెందిన వారిని విశాఖ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నట్లుంది. పూర్తి వివరాలు కూడా వారికే తెలుస్తాయి.– దాడి మోహనరావు, సీఐ బొబ్బిలి -
అనుమానంతో భార్యపై భర్త దాడి
విజయనగరం, భోగాపురం: అనుమానంతో భార్యపై భర్త దాడిచేసిన సంఘటన మండలంలోని రాజాపులోవలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వనుము పాపయ్య, అతని భార్య గురమ్మల మధ్య రెండు రోజులుగా చిన్న చిన్న తగాదాలు జరుగుతున్నాయి. పాపయ్యకి తన భార్యపైన అనుమానం ఎక్కువగా ఉండడంతో ఆమెను పనికి పంపకుండా, తాను పనికి వెళ్ళకుండా ఇబ్బందులు పెడుతుండేవాడు. వీరికి ఏడేళ్ల వయసున్న బాబు.. ఐదేళ్ల వయసున్న పాప ఉన్నారు. అయి తే ఆదివారం ఏమైందో ఏమో వారిద్దరి మధ్య తగాదా మొదలైంది. ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పాపయ్య తన భార్య గురమ్మపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఎస్సై ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
రెండు బైక్లు ఢీ..
విజయనగరం టౌన్: మండలంలోని జమ్ము నారాయణపురం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురు గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రూరల్ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం రావాడ గ్రామానికి చెందిన ఎ. అప్పలనరసయ్య ఆయన భార్య రాధ, పిల్లలు సుజయ్రామ్, రాహుల్ విజయనగరంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి డెంకాడ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే మార్గంలో తాడివాడ నుంచి విజయనగరం వైపు టీవీఎస్ ఎక్స్ల్ పై రెడ్డి పైడిబాబు, మజ్జి శ్రీను వస్తున్నారు. జమ్ము నారాయణపురం జంక్షన్ మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించకపోవడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికీ గాయాలు కాగా అప్పలనరసయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం అప్పలనరసయ్యను విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేలబావిలో జారిపడి డైట్ విద్యార్థిని మృతి
విజయనగరం ,మక్కువ: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎలాగైనా ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావాలని రాత్రీపగలూ కష్టపడి చదువుతోంది. తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకున్న ఆమె ఆశలు నేలబావి రూపంలో గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొండబుచ్చమ్మపేటకు చెందిన తెర్లి రేవతి (22) డైట్ కోర్సు చేసి డీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. మంగళవారం సాయంత్రం దుస్తులు ఉతికేం దుకు గ్రామ సమీపంలోని నేలబావికి వెళ్లింది. దుస్తులు ఉతికేందుకు నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో రేవతి బావిలో పడిపోయిన విషయం తెలి యలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రేవతి తల్లిదండ్రులు అప్పలనాయుడు, వరలక్ష్మి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంటివద్ద రేవతి కనిపించకపోవడంతో గ్రామంలో వెతికారు. అలా గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లగా రేవతి పాదరక్షలు, దుస్తులు కనిపించడంతో బావిలోకి టార్చిలైట్ వేసి చూడగా రేవతి మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తుల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై కె. కృష్ణప్రసాద్ బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు సీహెచ్సీకి తరలించారు. కొండబుచ్చమ్మపేటలో విషాదఛాయలు.. అందరితో చనువుగా ఉండే రేవతి ఇక లేదనే తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు, తోటి విద్యార్థులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పలనాయుడు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. రేవతి రెండో సంతానం. చదువులో చురుకుగా ఉండే రేవతి తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ ఉందని, ఈలోగా ఇలా జరిగిపోయిందని గ్రామస్తులు విషణ్ణవదనాలతో తెలిపారు. -
కాటేసిన విధి
విజయనగరం, పద్మనాభం(భీమిలి): విధి చాలా క్రూరంగా కాటేస్తుంది. బావమరిది కుమారుడి అన్న ప్రాసనకు వచ్చిన యువకుడిని మృ త్యువు బస్సు రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకుపోయింది. నెల రోజుల కిందటే అనారోగ్యంతో ఆ యువకుడి ఐదు నెలల కుమారుడు మృతి చెందగా... ఇప్పుడు రోడ్డు ప్ర మాదంలో అతనూ దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భర్తను, బిడ్డను కోల్పోయి ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదిస్తోంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం సమీపంలోని ధర్మపురికి చెందిన పాండ్రంగి శివకృష్ణ(24) విజయనగరం మండలం ముడిదాం సమీపంలోని అంబటివలసకు చెందిన బావమరిది వై.చంద్రునాయుడు కుమారుడు హేమ స్రవంత్కి అన్నప్రాసన చేయించడానికి పద్మనాభం మండలంలోని బి.తాళ్లవలస పంచాయతీ లింగన్నపేటలో ఉన్న గాయత్రి దేవి ఆలయానికి శుక్రవారం వచ్చారు. కార్యక్రమం అనంతరం శివకృష్ణతో పాటు మరో ముగ్గురు రోడ్డు మీదకు చేరారు. కల్వర్టు వద్ద రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో నేరెళ్లవలస ఏఏఎస్ జూట్ మిల్లుకు చెందిన బస్సు కోరాడ నుంచి బి.తాళ్లవలస వైపు వెళ్తోంది. ఎదురుగా వస్తున్న స్కార్పియోను తప్పించబోయి బస్సు శివకృష్ణను ఢీకొనగా కల్వర్టుకు బస్సుకు మధ్య ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న ఆయన్ను బయటకు తీసి విశాఖపట్నంలోని మై క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు, ఆయనకు భార్య రామలక్ష్మి ఉంది. శివకృష్ణ తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరి ఐదు నెలల కుమారుడు అనారోగ్యంతో నెల రోజుల కిందటే మృతి చెందాడు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే భర్త మృతి చెందడంతో భార్య రామలక్ష్మి జీర్ణించుకోలేకపోతోంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరిన ఆశాదీపం
విజయనగరం, నెల్లిమర్ల: కుమారుడు బధిరుడైనా ఆ తల్లిదండ్రులు ఏనాడు కుంగిపోలేదు. పిల్లాడి వల్ల ఏమవుతుందిలే అని అనుకోలేదు. ఎప్పటికైనా తమకు నీడనిచ్చే వాడు, కష్టాల నుంచి గట్టెక్కించే వాడు ఆ కొడుకేనని మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశారు. సమాజం నుంచి వినిపించే విమర్శలను వినిపించుకోకుండా అల్లారుముద్దుగా కొడుకును పెంచుకున్నారు. ఎలాగైనా ప్రయోజకుడిని చేయాలని భవిత కేంద్రంలో చేర్పించారు. కుమారుడు తమ మందు తిరుగుతుంటే అదే భాగ్యమని తలచి పొంగిపోయారు. కానీ వారి ఆశా దీపాన్ని విధి ఆర్పేసింది. విద్యార్థిని రైలు ప్రమాదం రూపంలో తనతో పాటు తీసుకెళ్లి తల్లిదండ్రులను కన్నీటి సంద్రంలో ముంచేసింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పూతికపేట గ్రామానికి చెందిన శీల సాయి (14) పుట్టుకతోనే బధిరుడు. తల్లిదండ్రులు సాయిని కొన్నాళ్లుగా నెల్లిమర్లలోని భవిత కేంద్రానికి పంపిస్తున్నారు. మంగళవారం తోటి విద్యార్థి శంకరరావుతో కలిసి విజయనగరంలో నిర్వహిస్తున్న ప్రత్యేకావసరాల చిన్నారుల ఆటల పోటీలకు వెళ్లాడు. వీరిని భవిత కేంద్రం ఉపాధ్యాయుడు బుచ్చిరాజు తీసుకెళ్లారు. ఆటల పోటీలు ముగిసిన తరువాత ఉపాధ్యాయుడు బుచ్చిరాజు ఇద్దరు విద్యార్థులను ఆటో ఎక్కించి, ఇళ్లకు వెళ్లిపొమ్మన్నారు. అయితే మండల పరిషత్ ప్రాంగణంలోని భవిత కేంద్రంలో ఉన్న సైకిలు తెచ్చుకునేందుకు ఆర్వోబీ సమీపంలో ఉన్న రైల్వేట్రాక్ దాటుతుండగా సాయిని రైలు ఢీకొట్టింది. తోటి విద్యార్థి శంకరరావు మాత్రం పట్టాలు దాటకుండా ఆగిపోయాడు. రైలు వస్తున్న శబ్ధం వినబడకపోవడంతోనే సాయి పట్టాలపైకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అందరూ అనుకుంటున్నారు. విషయం తెలుసుకున్న భవిత కేంద్రం ఉపాధ్యాయుడు బెల్లాన అప్పలనాయుడు, సీఆర్పీ వెంకటరమణ హుటాహుటిన సమీపంలో ఉన్న మిమ్స్ ఆస్పత్రికి సాయిని తీసుకెల్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయి తల్లిదండ్రులతో పాటు ఎంఈఓ అంబళ్ల కృష్ణారావు, ఎమ్మార్సీ సిబ్బంది శ్రీనివాస్, భవిత విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. నిత్యం తమ మధ్యనే తిరుగాడే చిన్నారి విగతజీవిగా మారడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రైల్వేపోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇద్దర్ని బలిగొన్న మితిమీరిన వేగం
ఆనందపురం(భీమిలి): మితిమీరిన వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. స్పోర్ట్స్ బైక్పై ఉన్న మోజు చివరకు ఆ యువకుడి ప్రాణాలనే హరించింది. మండలంలోని వెల్లంకి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడితో పాటు దాన్ని ఢీకొని మరో వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన మెంగం నిచ్చలకాంత్(26)కు రేస్ బైకంటే చాలా ఇష్టం. ఇటీవల కవాసికి నింజా 650 సీసీ మోటార్ బైక్ను కొనుగోలు చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున బైక్పై ఇంటి వద్ద నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో ఉన్న తన స్వగృహానికి వెళ్తున్నా డు. మండలంలోని వెల్లంకి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పైకి చేరుకునే సరికి రోడ్డు దాటుతున్న వెల్లంకి గ్రామానికి చెందిన తాటిశెట్టి సత్తిబాబు (52) అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో సత్తిబాబు చొక్కా బైక్ హ్యండిల్కు తగులుకోవడంతో సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకొని పోయింది. దీంతో బైక్ నడుపుతున్న నిచ్చలకాంత్తో పాటు సత్తిబాబు రోడ్డుపై తూలి పడిపోగా.. మోటర్ బైక్ మరో వంద మీటర్లు వరకు దూసుకుపోయింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికీ స్థానికులు సపర్యలు చేసి 108 వాహనంలో మొదట తగరపువలసలోని ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యంలో సత్తిబాబు చనిపోగా... నిచ్చలకాంత్ను కేజీహెచ్కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. బైక్ను మితిమీరిన వేగంతో నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిచ్చలకాంత్ తండ్రి చిన్నయ్యదొర కాంట్రాక్టు పనులు చేస్తూ సొంత గ్రామం నుంచి వచ్చి పిఠాపురంకాలనీలో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా నిచ్చలకాంత్ చిన్నవాడు. గీతం యూనివర్సిటీలో బీబీఎం చదివిన నిచ్చలకాంత్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శవాలకు పోస్టుమార్టం నిర్వహించి ఆనందపురం సీఐ ఆర్.గోవిందరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య
విజయనగరం, గజపతినగరం రూరల్: మండలంలోని లోగిశ గ్రామానికి చెందిన కోట్ల లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు శుక్రవారం పాల్ప డింది. వివరాల్లోకి వెళ్తే...కోట్ల లక్ష్మి భర్త సంతోష్తో కొద్ది రోజులుగా గజపతినగరం పట్టణంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ ప్రేమించి రెండున్నర నెలల కిందటే రామతీర్థంలో పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీకి గతంలో వివాహమై విడాకులు కావడంతో సంతోష్కు మేనమామ కుమార్తె కావడంతో ప్రేమబంధం ఏర్పడింది. వివా హానంతరం ఇద్దరి మధ్య తగాదాలు చోటు చేసుకునేవని స్థానికులు తెలిపారు. గురువారం కూడా ఇద్దరి మధ్య వివాదం నెలకొందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సంతోష్ బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉండడంతో పోలీసులు, స్థానికుల సమక్షంలో తలుపును తెరిచారు. లక్ష్మి పురుగుల మందు తాగినట్టు గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ జె.తారకేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చీకటి నింపిన దీపావళి..
విజయనగరం, బొబ్బిలి: దీపావళి పండుగ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంది.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బతుకులను చీకటిమయం చేస్తుంది. పట్టణంలోని తారకరామా కాలనీలో బాణసంచా విక్రయించే కుటుంబంలో మాత్రం రెండు ప్రాణాలు గాలిలో కలసి పోగా మిగిలిన ముగ్గు రు పిల్లల జీవితాలను చీకటి మయం చేసింది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని చిన్నారులు బేలచూపులు చూస్తున్నారు. పట్టణంలోని తారకరామా కాలనీకి చెందిన చుక్క త్రినాథరావు లారీ డ్రైవర్గా పని చేయడంతో పాటు తారాజువ్వలు తయారు చేస్తుంటాడు. కుటుంబ సభ్యులు కూడా బాణసంచా తయారుచేస్తూ విక్రయిస్తుంటారు. గత నెల 25న త్రినాథరావు, భార్య రమణమ్మ, కుమార్తె తనూజ బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇల్లంతా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ ఆటోలో బొబ్బిలి ఆస్పత్రికి తరలించగా, వైద్యుడు జి. శశిభూషణరావు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖకు రిఫర్ చేశారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గత నెల 28న త్రినాథరావు, ఈ నెల ఆరున రమణమ్మ మృతి చెందారు. దీంతో పిల్లలు సాయి, నందిని, తనూజ అనాథలయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తనూజ ప్రస్తుతం కోలుకుంటున్నా తల్లిదండ్రుల మృతితో మనోవేదనకు గురైంది. గాయపడిన తనూజ పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో... నందిని నెల్లిమర్లలో చదువుతున్నారు. సాయి పదో తరగతి పాసై నిరుద్యోగిగా ఉన్నాడు. దీపావళి పండుగ వీరి కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తమను ఆదుకునే ఆపన్నహస్తం కోసం చిన్నారులు ఎదురుచూస్తున్నారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ
విజయనగరం, రాయగడ: ఆంధ్రప్రదేశ్లోని కొత్తవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రాయగడలో రోప్ వే బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి నాగావళి నదిలో పడి మృతి చెందాడు. రాయగడ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన 13మంది వ్యక్తులు రాయగడ మజ్జిగౌరి దర్శనానికి మంగళవారం వచ్చి మొక్కుబడులు తీర్చుకున్న పిదప రాయగడకు 4కిలోమీటర్ల దూరంలో గల చెక్కగుడ ప్రాంతంలో రోప్ వే బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. ఈ ప్రాంతంలో పర్యాటకులు పర్యటించేందుకు వీలు లేదంటూ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం నిషేధపు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కొత్తవలసకు చెందిన 13మంది వ్యక్తులు రోప్ వే బ్రిడ్జిపైకి వెళ్లి నాగావళి నదిని ఆ ప్రాంతపు సౌందర్యాలను తిలకిస్తున్నారు. అయితే వారిలో టి.గంగరాజు అనే వ్యక్తి మొబైల్లో సెల్ఫీ తీసుకుంటూ అదుపు తప్పి 100మీటర్ల ఎత్తు నుంచి నాగావళి నదిలో పడిపోయాడు. మిగిలిన స్నేహితులు వేసిన కేకలకు చెక్కగుడ ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో తక్షణం అగ్నిమాసక సిబ్బంది, చెక్కగుడ ప్రజలు నాగావళి నదిలో వెతికినప్పటికీ లాభం లేకపోయింది. 3, 4గంటల తరువాత గంగరాజు మృతదేహం మర్రిగుడ గ్రామ ప్రాంతంలో లభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విభిన్న జిల్లాల వారు మృతి చెందినప్పటికీ, ప్రమాదకరమని తెలిసి కూడా సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. -
భార్యపై కత్తితో దాడి
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: భార్యపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యర్రా లీల (24)ను లక్కవరపుకోట మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఎర్నాయుడుకు ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం చేశారు. కొద్దికాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం అనుమానంతో ఎర్నాయుడు తన భార్యపై పలుమార్లు దాడి చేశాడు. ఇదిలా ఉంటే లీల ఇటీవల గర్భం దాల్చింది. ఒంట్లో నీరసంగా ఉండడంతో దసరా పండుగ ముందు కొత్తూరులోని అమ్మగారింటికి వచ్చింది. గురువారం సాయంత్రం అత్తారింటికి వచ్చిన ఎర్నాయుడు శుక్రవారం సాయంత్రం భార్య లీలతో గొడవపడ్డాడు. నాతో ఇంటికి వస్తావా..? రావా..? అంటూ ప్రశ్నించాడు. దీపావళి తర్వాత వస్తానని లీల చెబుతుండగా, తాటికమ్మలు నరికే కత్తితో చేతులు, వీపుపై దాడి చేశాడు. అనంతరం కత్తితో తన చేతిపై కూడా గాయం చేసుకున్నాడు. వెంటనే స్థానికులు స్పందించి వారిద్దరినీ ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భార్యే దాడి చేసింది.. ఇంటికి వస్తావా, రావా అని నా భార్యను నిలదీశాను. ఇంతలో గ్యాస్స్టవ్ సమీపంలో ఉన్న కత్తితో నాపై దాడి చేసింది. ఆమె చేతిలో ఉన్న కత్తి తీసుకునే ప్రయత్నంలో నాకు గాయమైంది. అనంతరం ఆమెపై చిన్నగా దాడి చేశాను. – ఎర్నాయుడు, నిందితుడు కట్నం కోసం హింసిస్తున్నాడు పెళ్లైనప్పటి నుంచి మా అల్లుడు ఎర్నాయుడు కట్నం కోసం నా కుమార్తెను వేధిస్తున్నాడు. ఎవరితో మాట్లాడినా అనుమానం కట్టి హింసిస్తున్నాడు. నేను ఇంట్లో లేని సమయంలో నా కుమార్తెపై దాడి చేశాడు. – అప్పలకొండ, బాధితురాలి తల్లి -
మా ఆయన్ని పెళ్లి చేసుకునే ఆలోచనా ఉందా..
విజయనగరం ,గంట్యాడ: పెళ్లై భార్య, పిల్లలు ఉన్న వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా చేస్తున్న ఒత్తిడి ఓ వైపు. మా ఆయన్ని పెళ్లి చేసుకునే ఆలోచనా ఉందా అంటూ ఆయన భార్య తిడుతున్న తిట్లు మరోవైపు. వీటిని తట్టుకోలేక పోయింది ఆ యువతి. ఇంక ఈ వేదనను భరించలేనంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని 20 ఏళ్లకే బలిపెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రామభద్రపరరం గ్రామానికి చెందిన సియ్యాదుల ఆశాజ్యోతి (20)ని ఆమె సమీప బంధువైన వేపాడ మండలం బానాదికి చెందిన దండ ఆంజనేయులు పెళ్లి చేసుకోవాల్సిందిగా రోజూ ఇబ్బంది పెట్టేవాడు. ఆయనకు ఇది వరకే పెళ్లైంది. దీంతో కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసేందుకు నిరాకరించారు. ఆయన భార్య ఒక రోజు వచ్చి ఈ విషయంలో ఆశాజ్యోతిని తిట్టి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి లోనైన ఆమె సెప్టెంబర్ 27న ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న ఆమె బామ్మ చూసి కేకలు వేయడంతో స్థానిక యువకులు వచ్చి ఆమెను కిందికి దించి సపర్యలు చేశారు. అనంతరం చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. కానీ సోమవారం ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి కటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్ఐ సత్యనారాయణరావు తెలిపారు. కేసు దర్యాప్తు చేసి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య
విజయనగరం , గజపతినగరం రూరల్: పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... మెంటాడ మండలం బడేవలసకు చెందిన యవర్ను గౌరీశ్వరి (24) బొండపల్లి మండలం బోడసింగిపేట కోర్టు కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సూరిశెట్టి రాంబాబు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. గౌరీశ్వరి విశాఖలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఏడాది కాలం పనిచేసి ప్రస్తుతం విజయనగరంలోని పీవీఆర్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఇదిలా ఉంటే రాంబాబు ఇటీవలే విధులకు వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో కాని గౌరీశ్వరి పురుగు మంది తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్నోట్ రాసినట్లు సమాచారం. గౌరీశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో... కన్నకూతురినే కడతేర్చాడు..
మద్యం తాగొద్దన్నందుకు ఓ తండ్రి మృగాడిగా మారాడు. అందరూ నిద్రపోయే వేళ భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. భార్య గాయాలతో బయటపడగా, తండ్రి కత్తి వేటుకు ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయిన విషాదకర ఘటన కొమరాడ మండలం నయా పంచాయతీ పరిధిలోని దేరుపాడు గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. విజయనగరం, కొమరాడ: నయా పంచాయతీ పరిధిలోని దేరుపాడు గ్రామం కొమరాడ మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరం. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన పల్లె. సుమారు 36 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పొద్దుకుంగితే చాలు అందరూ నిద్రలోకి జారుకుంటారు. అలాంటి పల్లెలో సోమవారం రాత్రి 11 గంటలకు ఓ మానవ మృగం కత్తితో వీరంగం సృష్టించింది. మద్యం సేవించడం అనారోగ్యదాయకమనిచెప్పిన భార్య, కుమార్తెలపై దాడి చేసింది. ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో పల్లె గొల్లుమంది. విషాదంలో ముని గిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హిమరిక వెంకటరావు మద్యానికి బానిసయ్యాడు. పోడు వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులు అమ్మగా వచ్చిన డబ్బులతో మద్యం సేవించేవాడు. ఇంటికి రూపాయి ఇచ్చేవాడు కాదు. భార్య సంపాదననూ మద్యానికే పోసేవాడు. భార్య, పిల్లల పోషణ పట్టించుకునేవాడు కాదు. మద్యం సేవించొద్దంటూ భార్య గంగులమ్మతో పాటు దేరుపాడు ప్రాథమిక పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న కుమార్తె సునీత(8) తరచూ హితబోధ చేసేవారు. ఇంటిలో సరుకులు లేక పిల్లలు పస్తులతో పడుకున్నారని, మద్యం సేవించొద్దంటూ విన్నవించిన ప్రతీసారీ వెంకటరావు భార్యతో గొడవపడేవాడు. సోమవారం రాత్రి కూడా ఇంటిలో గొడవ చేశాడు. భార్య, పిల్లలు నిద్రపోయేవేళ రాక్షసత్వంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య గంగులమ్మ కుడి చేయిపై కత్తివేటు పడడంతో పరుగుతీసింది. అదే సమయంలో ఎదురుగా కనిపించిన కుమార్తె సునీత మెడపై కత్తి వేటు వేయడంతో అక్కడికక్కడే మరణించింది. భార్యను హతమార్చేందుకు పరుగుతీస్తుండగా గ్రామస్తులు మేల్కొని వెంకటరావును పట్టుకున్నారు. గ్రామంలోని స్తంభానికి తాడుతోకట్టేసి కొమరాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎం కార్డు కాజేసి నగదు అపహరణ
విజయనగరం, గజపతినగరం: ఏటీఎం కార్డు కాజేసి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని పాతరోడ్డులో నివాసముంటున్న శంకరరావు ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతని కుమార్తె మౌలి పాత నోట్ల మార్పిడి సమయంలో కొంత సొమ్ము తన ఖాతాలో జమ చేసింది. అప్పటి నుంచి బ్యాంక్ ఖాతాను నిర్వహించకుండా వదిలేసింది. ఇటీవల ఏటీఎం కార్డుకు దరఖాస్తు చేయడంతో కార్డు వచ్చింది. దీంతో కార్డును ఇన్స్టాల్ చేయడానికి నెల రోజుల కిందట పట్టణంలోని ఏటీఎంకు వెళ్లింది. ఇన్స్టాల్ చేసే విషయమై అవగాహన లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ యువకుడికి కార్డు ఇచ్చి ఇన్స్టాల్ చేయమని కోరగా, అతడు ఇన్స్టాల్ చేస్తున్నట్లు నటిస్తూ తన దగ్గరున్న మరో కార్డును ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది గమనించిన బాధితురాలు ఏటీఎం కార్డును ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఆ మరుచటి రోజు బొండపల్లి ఎస్బీఐ ఏటీఎం నుంచి రూ. 40 వేలు అగంతకుడు డ్రా చేశాడు. అలాగే మరో 40 వేల రూపాయలను బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే డబ్బులు అవసరం వచ్చి మౌలి ఏటీఎంకు వెళ్లి మినీ స్టేట్మెంట్ తీయగా డబ్బులు డ్రా అయినట్లు గుర్తించింది. వెంటనే బ్యాంక్ అధికారులతో పాటు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
వధువును మార్చేశారని.. పెళ్లైన మూడోరోజే...
విజయనగరం టౌన్/చీపురుపల్లి: వదువు నచ్చలేదని మనస్తాపం చెందిన ఓ నవవరుడు పెళ్లైన మూడు రోజులకే ఉరేసుకుని మృతి చెందిన సంఘటన విజయనగరం పట్టణంలోని బాబామెట్టలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి టూటౌన్ సీఐ బీవీజే రాజు అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాబామెట్టకు చెందిన షేక్ మదీన్ చీపురుపల్లి మండలం పెదనడిపల్లి వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఈ నెల 2న వివాహం జరిగింది. విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీలో సాలూరుకు చెందిన మహ్మద్ ముబీనాతో వివాహమైంది. అదేరోజు సాయంత్రం విజయనగరంలోని సింగపూర్ సీటీలో ఉన్న నివాసానికి వచ్చారు. మరుసటి రోజు సోమవారం ఉదయం లేచిన దగ్గర నుంచి మదీన్ డల్గా, ఆలోచనలో ఉండడాన్ని తల్లి షహీదాబేగమ్ పసిగట్టింది. ఎందుకు అలా ఉన్నావని ప్రశ్నించగా పెళ్లికుమార్తె ముఖంపై మచ్చలున్నాయని, అందంగా లేదని, నచ్చలేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లి కోడల్ని చర్మవ్యాధి నిపుణుల వద్దకు తీసుకెళ్లి చూపించారు. కానీ మంగళవారం కూడా కొడుకు దిగాలుగా ఉండడాన్ని చూసి తల్లి ఓదార్చింది. రిసెప్షన్ రోజే.. పెళ్లై మూడోరోజు రావడంతో ఊర్లో ఉన్న బంధువులకు మంగళవారం రాత్రి రిసెప్షన్ ఇచ్చేందుకు మదీన్ కుటుంబీకులు సిద్ధం అవుతున్నారు. ఆ సమయంలో ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మదీన్ బాబామెట్ట ఎంఐజీ 84లో నివాసం ఉంటున్న మిత్రుని ఇంటికి వెళ్లాడు. అక్కడ మరో ఆలోచన లేకుండా ఫ్యాన్ కొక్కానికి ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలియని రిసెప్షన్ ఉంచుకుని కొడుకు ఎక్కడికి వెళ్లాడో వెతకాల్సిందిగా మృతుని స్నేహితులకు ఫోన్లో చెప్పింది. వారంతా మదీన్కు ఫోన్లు చేయగా ఎంతకి లిఫ్ట్ చేయకపోవడంతో బాబామెట్ట ప్రాంతంలో ఉన్న స్నేహితుని ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్కు విగత జీవుడై కనిపించాడు. అయినప్పటికీ స్నేహితులు సపర్యలు చేసి, పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కేంద్రాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మదీన్కు తల్లితో పాటు ఓ చెల్లెలు ఉన్నారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు.. కేంద్రాస్పత్రి వద్ద కుమారుడు మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మదీన్ బంధువులు, భార్యతరపు వారు అక్కడకు చేరుకోవడంతో ఆస్పత్రిలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చూపుల్లో చూపించిన అమ్మాయిని కాకుండే వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన కారణంగానే మదీన్ ఆత్మహత్య చేసుకున్నారని తల్లి చెప్పినట్లు సీఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. రెవెన్యూ వర్గాల్లో అలజడి.. మదీన్ మృతి వార్తను తెలుసుకున్న చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఆయన పని చేస్తున్న గ్రామ ప్రజలు విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బీటెక్ విద్యను అభ్యసించిన మదీన్ అందరితో బాగా ఉంటూ చక్కగా విధులను నిర్వహిస్తుండేవాడని వారు చెబుతున్నారు. రిసెప్షన్కు వస్తున్నామని కూడా మదీన్కు తాము చెప్పినట్లు తహసీల్దార్ ముక్తేశ్వరరావు, వీఆర్ఓలు పేర్కొంటున్నారు. ఆయనతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. -
ఆర్టీసీ బస్ను ఢీకొన్న లారీ
గొల్లప్రోలు(పిఠాపురం) : చెందుర్తి–వన్నెపూడి మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆర్టీసీ బస్సును గ్యాస్ ట్యాంకర్ లారీ ఢీ కొట్టింది. విశాఖపట్నం నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సుకు చెందుర్తి పెదచెరువు ప్రాంతంలో వచ్చే సరికి లైట్లు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు సిబ్బంది లైట్లను పరిశీలిస్తుండగా.. బస్సులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి మూత్రవిసర్జన కోసం వెనుకకు వెళ్లిన వారిని లారీ ఢీకొట్టి, అదే వేగంతో బస్సును వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో విజయనగరం జిల్లా జామి మండలం కుమరానికి చెందిన వంకా శ్రీను ఆస్పత్రికి తరలించిన వెంటనే చనిపోయాడు. గాయపడిన వారిలో ఎంకే వలసకు చెందిన త్రినాథ్, గార మండలానికి చెందిన నవీన్ ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియలేదు. గాయపడిన క్షతగాత్రులను గొల్లప్రోలు ఎస్సై బి.శివకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అంబులెన్స్పై కాకినాడ, ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. బస్సు వెనుక భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 37మంది ప్రయాణికులు ఉన్నారు. గొల్లప్రోలు ఎస్సై సంఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
చపాతీ కూరలో 30 నిద్రమాత్రలు.. ఆపై ఉరి
విజయనగరం టౌన్ : తన వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డువచ్చాడనే కారణంతో కన్నకొడుకుని ఓ తల్లి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.. ఈ నెల 22వ తేదీ రాత్రి స్థానిక గాయత్రీనగర్లో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన హరి భగవాన్ (17) తల్లి వెంకట పద్మావతిని పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. హత్య కేసులో తల్లి వెంకట పద్మావతితో పాటు ఆమె ప్రియుడు గోవింద్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం సబ్జైల్కు పంపించినట్లు రూరల్ సీఐ రమేష్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అసలేం జరిగింది? గాయత్రీనగర్లో నివాసముంటున్న వెంకట పద్మావతికి 2000లో కొండబాబుతో వివాహం జరిగింది. వారికి హరిభగవాన్ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. కొండబాబు డ్రైవింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే సంపాదన విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2012లో కొండబాబు నుంచి పద్మావతి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి గాయత్రీనగర్లోని తన సొంతిం టిలో పిన్ని సీతాలక్ష్మి, పిల్లలతో నివాసముంటోంది. ఏజెంట్గా పరిచయం... వెంకటపద్మావతి కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఏజెంట్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యలో గోవింద్ అనే రియల్టర్తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి సహించని కుమారుడు హరిభగవాన్ తల్లిని పలుమార్లు హెచ్చరించాడు. హత్యకు ముందస్తు పథకం వెంకటపద్మావతి, గోవింద్ల కార్యకలాపాలకు అడ్డుగా ఉన్న హరి భగవాన్ను తప్పించాలనే ఉద్దేశంతో గోవింద్ ఇచ్చిన పథకాన్ని అమలుచేయడానికి పద్మావతి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరకు నిద్రమాత్రలు ఇచ్చి హరి భగవాన్ను అడ్డు తొలగించుకోవాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మావతి పిన్ని సీతాలక్ష్మి తన సోదరుడు విశ్వనాథరాజుకు ఆరోగ్యం బాగోలేనందున బాబామెట్టకు వెళ్లింది. హరిని చంపాలంటే ఇదే సమయమని గోవింద్ తన ప్రియురాలు పద్మావతికి చెప్పాడు. పైగా గోవింద్ తన ఇంటి నుంచి ఎప్పటికప్పుడు ఫోన్లో హత్య ఎలా చేయాలో వివరించడం విశేషం. చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపి.. గోవింద్ సలహా మేరకు పద్మావతి చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపింది. దీంతో చపాతి తిన్న హరిగోపాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నిద్రలోకి జారుకున్న కొడుకు మెడకు చీర బిగించి హత్యచేసింది. అనంతరం ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి, మార్కులు తక్కువగా రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన పద్మావతి పిన్ని సీతాలక్ష్మికి హరి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆశ్చర్యపోయింది. పద్మావతిని గట్టిగా నిలదీయడంతో చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయింది. ఇదిలా ఉంటే హత్యకు పరోక్షంగా సహకరించినా గోవింద్ను శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిని రిమాండ్ నిమిత్తం సబ్జైల్కు తరలించారు. -
వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం
సాలూరు విజయనగరం : పట్టణంలోని బంగారమ్మకాలనీకి చెందిన మరిపి కృష్ణ (50), అతని సహజీవని సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులతో పాటు కృష్ణ కుమారుడు శివ తెలియజేసిన వివరాల మేరకు... రెండేళ్ల కిందటి వరకు స్థానిక బెల్లం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేసిన కృష్ణ తొలి భార్య మరణించడంతో సుజాతకు ఆశ్రయమిచ్చి సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే కృష్ణకు ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు కొన్నాళ్ల కిందట మృతి చెందాడు. ఇదిలా ఉంటే కంటిచూపు కోల్పోయిన కృష్ణ ఇంటికే పరిమితం కావడంతో కృష్ణ, సుజాతల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరగడంతో, గురువారం వేకువజామున సుజాత ఇంటిలో ఉన్న చీమల మందు తాగింది. వెంటనే శివ గమనించి ఆమెను పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు సుజాత ఏమి తాగిందో ఆ సీసాను తీసుకురావాలని కోరడంతో.. శివ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఇంటి దూలానికి వేలాడుతున్న కృష్ణను చూసి అవాక్కయ్యాడు. కొన ఊపిరితో ఉన్న తండ్రిని దించి ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ప్రాణాలొదిలాడు. సుజాత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ పోలీసులు కేసున మోదుచేసి విచారణ చేపడుతున్నారు. -
మృతదేహంతో నిరసన
సాలూరురూరల్ : మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు యజమాని ఇంటి ముందు నిరసన చేపట్టిన సంఘటన బుధవారం మామిడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మామిడిపల్లి గ్రామానికి చెందిన కర్రి భాస్కరరావు అదే గ్రామానికి చెందిన చిలుకూరి సత్తిబాబు వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం శివరాంపురంలో దమ్ము చేపడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి భాస్కరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు మృతదేహంతో కలిసి సత్తిబాబు ఇంటి ముంద నిరసన చేపట్టారు. అయితే సాయంత్రం వరకూ సత్తిబాబు రాలేదు. రూరల్ ఎస్సై గణేష్, స్థానిక పెద్దల సూచనలు మేరకు బంధువులు నిరసన విరమించి భాస్కరరావు అంత్యక్రియలు నిర్వహించారు. -
ఈ జిల్లాకు ఏమైంది?
చిన్నపాటి జ్వరం వచ్చినా భయపడే పరిస్థితి వచ్చింది. ఇదేంటి... అనుకుంటున్నారా? అవునండీ బాబు. పిట్టల్లా రాలిపోతున్నారు జనం. చికిత్స ఓవైపు సాగుతుండగానే... క్షణాల్లో ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. ఈ విషయాన్ని రక్తపరీక్షల్లో నిర్థారణ అవుతోంది. అది డెంగీకావచ్చని ఓ వైపు ప్రైవేటు వైద్యులు చెబుతున్నా... అబ్బే అదేం కాదని తేల్చేస్తున్నారు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు. ఏదేమైనా ప్రాణాలు కోల్పోయేది జనాలే కదా. రోజూ ఎక్కడో ఓచోట జ్వరాలతో మృతి చెందుతున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. గడచిన పదిహేను రోజుల్లో ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారు 15మంది ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో స్పష్టమవుతోంది కదా.... సాక్షిప్రతినిధి, విజయనగరం : ‘స్వచ్ఛభారత్ కాయకల్ప అవార్డులు అందుకున్నాం. సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా ప్రకటించుకున్నాం. నీతిఅయోగ్ ఎంపిక చేసిన 117 వెనుకబడిన యాస్పిరేషన్ జిల్లాల్లో మన రాష్ట్రం నుంచి మూడు జిల్లాలుంటే వాటిలో ఒకటి మన జిల్లా కాగా 117 జిల్లాలతో పోటీపడి నాలుగవ స్థానంలోనూ, కృషి కల్యాణ్ అభియాన్లో మొదటి స్థానంలోనూ నిలిచాం.’’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ దోమలు స్వైర విహారం చేస్తూ, వ్యాధులు విజృంభిస్తుంటే నష్ట నివారణ చర్యలు మానేసి కప్పిపుచ్చుకోవడానికి కారణాలు వెదుకుతున్నాం. ప్రజలపై ఒకవైపు డెంగీ, మరోవైపు విషజ్వరాలు పంజా విసిరి ప్రాణాలు తీస్తుంటే సదస్సులు, సమీక్షలంటూ కాలం వెళ్లదీస్తున్నాం. ఒక్కరేనట! 2018 జనవరి నెల నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 2,08,368 మందికి జ్వరాలు సోకినట్టు నమోదయ్యాయి. ఇందులో 91,362 కేసులు గిరిజన ప్రాంతాల్లోనివే. ప్రైౖవేటు ఆస్పత్రుల్లో 2.50 లక్షల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. తాజాగా డెంగీ, విషజ్వరాల బారిన పడి జిల్లాలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. చర్యలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. డెంగీతో రోగులు చచ్చి పోతున్నా వైద్య ఆరోగ్యశాఖ మా త్రం అవి డెంగీ మరణాలు కాదంటూ బుకాయిస్తోంది. ఇప్పటి వరకూ గరివిడి మండలం బొండపల్లికి చెందిన జానకి ఒక్కరే డెంగీతో మరణిం చారని అధికారులు చెబుతున్నారు. అధికార లెక్కల ప్రకారం 36 కేసులు: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం డెంకాడ మం డలంలో 1, డెంకాడలో 7, విజయనగరం మండలంలో 3, అర్బన్లో 4, తెర్లాంలో 1, జామిలో 2, నెల్లిమర్లలో 2, భోగాపురంలో 2, దత్తిరాజేరులో 2, బాడంగిలో 1, గుర్లలో 2, గజపతినగరంలో 2, ఎస్.కోటలో 1, మెంటాడ లో 1, చీపురుపల్లిలో 1, బొబ్బిలిలో 1, గంట్యాడలో 1, మక్కువలో 1, పూసపాటిరేగలో 1 చొప్పున 36 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని అంచనా. చాలా మంది రోగులు నేరుగా విశాఖ పట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్(కేజీహెచ్), ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ చికిత్స పొందుతున్నారు. వారి వివరాలు ఇక్కడ నమోదు కావడం లేదు. విశాఖ ఆస్పత్రుల్లో వై ద్యం చేయించడానికి ఒక్కక్కరికీ రూ.70వేల నుం చి రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది. డెంగీ అనంగానే రిఫర్ జిల్లాలో 68 పీహెచ్సీలు, 12 సీహెచ్సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉంది. 68 పీహెచ్సీలకు 103 మంది వైద్యులకు 48 మంది రెగ్యుల ర్ వైద్యులున్నారు. 35 మంది కాంట్రాక్టు వైద్యులున్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా డెంగీ అని నిర్ధారణ కాగానే వైద్యులు కేజీహెచ్కు రిఫర్ చేసేస్తున్నారు. నిజానికి డెంగీకి ప్రత్యేకంగా చికిత్స అందించాల్సిన పని ఉండదు. సాధారణ జ్వరం మాదిరిగానే చేస్తే సరిపోతుంది. అయి తే ప్లేట్ లెట్స్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతే వా టిని ఎక్కించాల్సి ఉంటుంది. నెలరోజుల్లో నమోదైన డెంగీ, జ్వర మరణాలు తాజాగా బుధవారం ఎస్.కోటకు చెందిన సునా య కుమారి(45) డెంగీతో మత్యువాత పడింది. విజయనగరం రూరల్ మండలం మలిచర్లలో తుమ్మగంటి ఆశ(10) ఈ నెల15న డెంగీ జ్వరంతో కన్నుమూసింది. అదే రోజు ఎస్కోట పట్టణం ఎరుకులపేటలో సునాయ కుమారి(45) కూడా చనిపోయింది. గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన ఒలుగింటి జానకి అనే గర్భిణి డెంగీ జ్వరంతో కేజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రసవించి మృతి చెందింది. ఈ నెల 13న జరిగిన ఈ సంఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించింది.గుర్ల మండలం గరిడకు చెందిన గులివిందల అప్పల నాయుడు(45) డెంగీ జ్వరంతో ఈ నెల 12న మరణించాడు.ఎస్.కోట పుణ్యగిరి రోడ్డులో నివాసమున్న వివాహిత బత్తిన సూరీడమ్మ(38)జ్వరంతో ఈ నెల 10న మృతిచెందింది. లక్కవరపుకోట మండలంలోని రేగ గ్రామానికి చెందిన గొల్ల రాము(24) జ్వరంతో బాదపడుతూ ఈ నెల 9న మృతి చెందాడు. కొమరాడ మండలం దళాయిపేటలో రాగల గౌరమ్మ (45) ఈ నెల 9న మృతిచెందింది. ఇదే మండలంలోని విక్రంపురంలో రౌతు ధనుష్(3) జ్వరంతో బాధపడుతూ కన్నుమూశాడు. ఎస్.కోట పంచాయతీ శివారు సీతంపేట గ్రామానికి చెందిన చిన్నారి చిప్పాడ మౌనిష(4) డెంగీ జ్వరంతో ఈ నెల 6వ తేదీన చనిపోయింది. ఉసిరి గ్రామానికి చెందిన బొబ్బిలి రమణమ్మ(32) డెంగీ జ్వరంతో చనిపోయిందని కుటుం బీకులు చెబుతున్నారు. చీపురుపల్లి మండలంలోని పికె.పాలవలస పంచాయతీ మధుర గ్రామమైన చిలకరాళ్లబడిలో కొండపల్లి కుసుమ(6) డెంగీ జ్వరంతో మృతి చెందింది. ∙జామి మండలం ఎం.కె.వలస పంచాయతీ బలరాంపురం గ్రామానికి చెందిన జలగడుగుల కల్యాణి డెంగీ లక్షణాలతో జూలై 31వ తేదీన కన్నుమూసింది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం జిల్లాలో సంభవిస్తున్న మరణాలన్నీ డెంగీ జ్వరా లుగా భావించడానికి వీల్లేదు. ఇప్పటి వరకూ ఒక్కరే ఆ వ్యాధితో మృతి చెందినట్లు నిర్థారించాం. జ్వరాలు అధికంగా వ్యాప్తి చెందుతున్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని వైద్య సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని ఆదేశించాం. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మొబైల్ డెంగీ, మలేరియా అవగాహన వాహనాలే గాకుండా అదనంగా మరో రెండు వాహనాలు ఏర్పాటు చేశాం. దోమలు వృద్ధి చెందకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. – కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి -
పాల్ మృతికి నిర్లక్ష్యమే కారణమా!
సాలూరు రూరల్ : మండలంలోని కందులపధం గ్రామానికి చెందిన దళితుడు సురాపాటి పాల్(38) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈయన మృతికి వ్యసనాలే కారణమా? లేక వైద్య సిబ్బంది నిర్లక్ష్యమా? అన్నది తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే...పాల్ థింసా నృత్యానికి డప్పు వాయిస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాలూరు సీఎం పర్యటనలో ఈయనకు డప్పు వాయించే అవకాశం లభించింది. అయితే చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దు కావడంతో పాల్ మంగళవారం తోణాంలోని బంధువుల ఇంటికి వేడుకకని వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 3.30 గంటల సమయంలో ఫిట్స్ వచ్చింది. వెంటనే పాల్ను తోణాం పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో సిబ్బంది పరీక్షించి పాల్ శరీరంలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యాధికారికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు సాలూరు సీహెచ్సీకి తరలించాలని సూచించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో 108కి ఫోన్ చేయగా 5.15కు వాహనం రాగా అప్పటికే పాల్ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఉదయాన్నే వచ్చా.. దీనిపై స్థానిక పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ స్వాతిని వివరణ కోరగా తాను మంగళవారం సారిక సబ్సెంటర్కు వెళ్లానని చెప్పారు. పాల్ ఉదయం ఆస్పత్రికి వచ్చారని సిబ్బంది పాల్కు రక్త పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇచ్చారని తెలిపారు. పాల్ అతిగా సారా తాగడమే మృతికి కారణం కావచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు నివేదించానని చెప్పారు. -
గ్యాస్ సిలిండర్ లీక్
బాడంగి : మండలంలోని కోడూరు బీసీ కాలనీలో గ్యాస్ లీకవడంతో ఇద్దరు అన్నదమ్ములు గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన కిలారి రాము ఇంటికి బంధువులు రానుండడంతో గ్యాస్ పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పైభాగం నుంచి గ్యాస్ లీకవడంతో వెంటనే సిలిండర్ను తప్పించే క్రమంలో పక్కనే ఉన్న కట్టెల పొయ్యి మంటలు అంటుకున్నాయి. దీంతో రాము గాయపడగా, అతడ్ని కాపాడబోయే క్రమంలో సోదరుడు లక్ష్మనాయుడు కూడా గాయపడ్డారు. వెంటనే వీరిని 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన రామును విజయనగరం ఆస్పత్రికి తరలించారు. -
తల్లీబిడ్డను మింగిన డెంగీ
సాక్షి, విజయనగరం : ఆ తల్లి నవమాసాలూ మోసింది. తొలిచూలు బిడ్డపై గంపెడాశలు పెట్టుకుంది. ఆ బిడ్డను అందరికంటే మిన్నగా పెంచాలని... చక్కగా తీర్చిదిద్దాలని... ఎన్నో కలలు కన్నది. మాయదారి డెంగీ మృత్యువుగా మారుతుందనుకోలేదు. ప్రసవానికి వారం రోజులముందే ఆమెకు జ్వరం సోకింది. అదికాస్తా డెంగీకి దారితీసింది. చికిత్స చేయించి... నిండు గర్భిణి అయిన ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. విశాఖ కేజీహెచ్లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె కన్నుమూసింది. కన్నులైనా తెరవని ఆ శిశువు ఈ లోకాన్ని చూడకుండానే... తన తల్లిలేని లోకంలో తానెందుకుండాలనుకున్నాడో ఏమో... ప్రాణాలు కోల్పోయాడు. ఇదీ గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన వలిగింటి జానకి(23) విషాద గాథ. భర్త వలిగింటి జనార్దన రాజాంలో చిన్నపాటి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడేళ్లక్రితం వారికి వివాహం జరిగింది. జానకి ప్రస్తుతం నిండు గర్భిణి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే రాజాంలోని ఓ డాక్టర్కు చూపించారు. వారు డెంగీ సోకిందని తల్లిబిడ్డను రక్షించుకోవాలంటే వెంటనే కేజీహెచ్కు తరలించాలని చెప్పారు. గత సోమవారమే కేజీహెచ్లో చేర్చారు. కానీ విధి వక్రీకరించింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆమె కన్నుమూయగా... పుట్టిన బిడ్డ సైతం మృత్యువాతపడింది. మృతదేహాలను సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
తోటపల్లి కాలువలో మృతదేహం..
చీపురుపల్లిరూరల్ : తోటపల్లి కాలువలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. మండలంలోని నాగంపేట, పుర్రేయవలస గ్రామాల మధ్యనున్న రావివలస రెవెన్యూ పరిధిలో గల తోటపల్లి కుడి ప్రధాన కాలువలో శుక్రవారం కనిపించిన గుర్తు తెలియని మృతదేహం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... పుర్రేయవలస గ్రామానికి చెందిన ఒక పాడిరైతు కాలువకు సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆవును మెపుతూ కాలువలో ఉన్న మృతదేహాన్ని గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చీపురుపల్లి సీఐ శ్యామలరావు, ఎస్సై కాంతికుమార్తో పాటు గరివిడి ఎస్సై శ్రీనివాసరావు, తోటపల్లి ప్రాజెక్ట్ ఏఈ నందీశ్వరరావు, రావివలస వీఆర్ఒ వెంకటరమణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాలువలో ఉన్న మృతదేహం పూర్తిగా బెడ్షీట్లు, గుడ్డలతో కప్పబడి పాదాలు మాత్రమే బయటకు కనిపించి ఉండటంతో మృతదేహం ఆడ, మగ అనేది పోల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో కాలువలోంచి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత మృతదేహం మగవాడిదిగా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. కాలువలో నుంచి తీసిన మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎక్కడో చంపేసి ఉంటారు.. ఎక్కడో చంపి ఇక్కడ కాలువలో మృతదేహాన్ని పడేసి ఉండొచ్చనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహానికి గుడ్డలు చుట్టి ఉండడం, దుర్వాసన రావడం.. గుర్తు పట్టలేనివిధంగా ఉండడంతో హత్య నాలుగు రోజుల కిందటే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
ఘరానా మోసం
మెరకముడిదాం విజయనగరం : మండలంలోని భైరిపురం గ్రామానికి చెందిన శనపతి పార్వతి ఘరానా మోసానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే... భైరిపురానికి చెందిన పార్వతి నాలుగు రోజులు కిందట చీపురుపల్లి స్టేట్బ్యాంకులో తన ఖాతా పుస్తకం నిండిపోవడంతో కొత్త పుస్తకాన్ని తీసుకుంది. బుధవారం అజ్ఞాత వ్యక్తి ఆమెకు 9064541005 నెంబరుతో ఫోన్ చేసి నేను చీపురుపల్లి స్టేట్బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీరు రెండు రోజుల కిందట కొత్త పుస్తకం మార్చారు కదా...దానికి సంబంధించి మీ ఆధార్ కార్డు ఆన్లైన్ చేయాలని, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ బ్యాంకు అక్కౌంట్ నెంబరు చెప్పాలని కోరాడు. నమ్మిన పార్వతి తన ఆధార్కార్డు నెంబరుతో పాటు తన అకౌంట్ నెంబరును కూడా చెప్పింది. దీంతో ఆ అగంతకుడు పార్వతి బ్యాంకు ఖాతాలో వున్నరూ.23 వేలను డ్రా చేసాడు. గురువారం పార్వతి బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు ఎంత వున్నాయో సరి చూసుకుందామని వెళ్లగా బ్యాంకు అధికారులు రూ.23 వేలు డ్రా చేసినట్టు వున్న విషయాన్ని తెలిపారు. దీంతో ఆమె లబోదిబోమంటూ ఇంటిముఖం పట్టింది. ఈ విషయమై స్థానిక సర్పంచ్ కెంగువ ధనుంజయకు తెలియజేయగా ఆయన బుధరాయవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే పార్వతికి అగంతకుడు చేసిన ఫోన్ నెంబరును ఇచ్చారు. దీనిపై బుధరాయవలస పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పదంగా వివాహిత మృతి
మక్కువ : మండలంలోని మార్కొండపుట్టికి చెందిన బొంగు నీలిమ (20) గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన బొంగు బాషా, సూరీడమ్మ దంపతుల కుమార్తె నీలిమకు పార్వతీపురం మండలంలోని నర్శిపురం గ్రామానికి చెందిన కెంగువ సింహాచలం అలియాస్ బుజ్జితో 2017 మే నెలలో వివాహమైంది. భర్త సింహాచలం తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ, కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో నీలిమ విసుగుచెందిన మూడు నెలల కిందట కన్నవారింటికి వచ్చింది. భర్త సింహాచలం మూడు రోజుల కిందట మార్కొండపుట్టి గ్రామానికి చేరుకుని నీలిమను కాపురానికి పంపించాలని అత్తమామలను కోరాడు. అయితే మీ తల్లిదండ్రులను తీసుకువస్తేనే కుమార్తెను పంపిస్తానని నీలిమ తల్లిదండ్రులు అల్లుడు సింహాచలంనకు స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక సింహాచలం అత్తవారింటే ఉంటున్నాడు. ఈ క్రమంలో నీలిమ తండ్రి బాషా గురువారం మధ్యాహ్నం ఇంటికి చేరుకునే సరికి విగతజీవిగా పడి ఉంది. చున్నీతో గొంతు నులిమేసినట్లు ఉండడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తపైనే అనుమానాలు..? భార్యను తనతో పంపించకపోవడంతో సింహాచలమే కక్ష గట్టి మెడకు చున్నీ బిగించి నీలిమను హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న ఏఎస్పీ దీపికపాటిల్, సీఐ సయ్యిద్ అలియాస్ మహ్మద్, ఎస్సై కృష్ణప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతురాలి భర్త సింహాచలంను విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు సీహెచ్సీకి తరలించారు. ఎస్సై కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమార్కులకు కలప తరువు
చుట్టూ విశాలమైన అటవీప్రాంతాలు... అందులో అత్యంత విలువైన కలపనిచ్చే వృక్షాలు... పర్యావరణానికి తోడ్పడే అనుకూల వనాలు... ఇదీ విజయనగరం జిల్లా అనగానే గుర్తుకొచ్చే అంశాలు. కానీ ఇప్పుడు ఆ వనాలపై అక్రమార్కుల కన్ను పడింది. దానికి అధికారుల ఉదాశీనత తోడైంది. నామమాత్రంగానైనా ఏర్పడిన చెక్పోస్టుల పర్యవేక్షణ కొరవడింది. అందుకే దొరికిన కలపను ఎంచక్కా టింబర్డిపోల్లోనే నిల్వ చేస్తున్నారు. అక్కడ తమకు అనువైన రీతిలో తీర్చిదిద్దుతున్నారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా ఇతర జిల్లాలు... రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం : జిల్లా అడవుల్లో టేకు ఎక్కువగా లభిస్తుంది. దాని తర్వాత స్థానంలో ఎర్రచందనం ఉంది. హుద్హుద్ తుఫాన్కు పడిపోయిన ఎర్రచందనం కలప సుమారు 13 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనిని కొందరు పోగుచేసి నిల్వచేసుకున్నారు. ఆ కలపను తరలించడానికి అనుమతినివ్వాలంటూ 10 మంది మాత్రమే ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకున్నారు. చాలా మంది అక్రమంగా స్మగ్లింగ్ చేసేస్తున్నారు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో జాతీయరహదారి 26పై పి.కోనవలస గేటు వద్ద మార్కెట్యార్డు, ఎక్సైజ్, అటవీశాఖల చెక్పోస్టులు ఉన్నాయి. ఇన్ని చెక్పోస్టులు ఉన్నా ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య అటవీ సంపద అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. పట్టుబడిన కలపకు హుద్హుద్ కలరింగ్ ఇటీవల జిల్లాలో వరుసగా ఎర్రచందనం పలుచోట్ల పట్టుబడింది. అయితే అది హుద్హుద్ సమయంలో కొట్టుకొచ్చిన కలప అని నిందితులు చెప్పుకొచ్చారు. సుమారు 10 టన్నులకు పైగానే ఉన్న ఎర్రచందనాన్ని ఇటీవల గరివిడి మండలం, తాటిగూడ గ్రామం రెవెన్యూ పరిధిలో ఉన్న మాంగనీస్ మైన్లో అటవీ అధికారులు పట్టుకున్నారు. గత ఫిబ్రవరి నెలలో జిల్లాలోని గంట్యాడ మండలం రామవరం గ్రామంలో కాకర్లపూడి రామకృష్ణంరాజు ఇంటిలో అద్దెకు ఉంటున్న బుద్దరాజు వర్మ అక్రమంగా ఎర్రచందనం నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం జరుపుతున్నారనే సమాచారంతో చిత్తూరు టాస్క్ఫోర్స్ టీమ్ దాడిచేసి గొడౌన్లు, పెంటకుప్పల్లో దాచి ఉంచిన కలపను బయటకు తీశారు. విజయనగరం మండలం కొండకరకాం గ్రామం అటవీ ప్రాంతం నుంచి ఎర్ర చందనాన్ని నిందితులు సేకరించారు. హుద్హుద్ సమయంలో పొలాల్లోకి కొట్టుకొచ్చిన ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా దొంగిలించి గోడౌన్కు తరలించారు. మరికొంత కలపను కొనుగోలు చేసి దానిని కూడా నిల్వ చేశారు. ఈ సమాచారంతో అధికారులు కొండకరకారం, దాని పక్కనే ఉన్న కొండవెలగాడ గ్రామాల్లో విచారణ చేపట్టారు. గతేడాది డిసెంబర్లో ఎర్రచందనాన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా జిల్లా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం జిల్లా టీడీపీకి చెందిన కీలక నేతకు సంబంధించిన టింబర్ డిపోలో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం నిల్వలు కనిపించాయి. అయితే అవి హుద్హుద్ తుఫాన్లో సేకరించినవని, అనుమతుల కోసం దరఖాస్తు చేశామని నిర్వాహకులు చెప్పుకోవడం గమనార్హం. అనుమతులు లేకపోతే చర్యలు తప్పవు: హుద్హుద్ తుఫాన్ సమయంలో పడిపోయిన ఎర్ర చందనం చెట్లకు సంబంధించి అటవీశాఖకు తెలియజేసి, అనుమతులు తప్పకుండా తీసుకోవాలి. అనుమతులు తీసుకోకుండా ఎర్రచందనం నిల్వలున్నట్లు ఎక్కడైనా మేం గుర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 10 మంది అనుమతులు తీసుకున్నారు. 10 టన్నుల లోపు ఉన్న ఎర్ర చందనం చెట్లకు అనుమతులు ఇస్తాం. ఏ కలప రవాణాకైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని డీఎఫ్ఓ, స్క్వాడ్ డీఎఫ్ఓలు పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేస్తాం. స్మగ్లింగ్ను అరికట్టడానికి దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశాం. – గంపా లక్ష్మణ్, జిల్లా అటవీశాఖ అధికారి, (టెరిటోరియల్) ,విజయనగరం. -
వీడని మురళీకృష్ణ హత్య కేసు..
పార్వతీపురం : గతేడాది జూలై 23వ తేదీ రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య పార్వతీపురం పట్టణం 21వ వార్డు ఎస్ఎన్పీ కాలనీలో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్. అయితే ప్రశాంతతకు మారుపేరైన పార్వతీపురం పట్టణంలో తుపాకీ ఎందుకు పేలుతుందిలే అనుకుంటూ మళ్లీ టీవీ చూడడంలో బిజీ అయిపోయారు. కానీ నిజంగానే తుపాకీ పేలిందనే విషయం రెండు గంటల తర్వాత తెలుసుకున్న ప్రజలు భీతెల్లిపోయారు. పట్టణ నడిబొడ్డున, చుట్టూ నివాస గృహలు ఉండగా ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటనను ప్రజలు నేటికీ మరిచిపోలేకపోతున్నారు. చీకటి పడితే చాలు ఎస్ఎఎన్పీ కాలనీవాసులకు తుపాకీ పేలిన శబ్దాలే వినిపిస్తున్నాయి. పట్టణ ప్రధాన రహదారిలోని సుమిత్రా కలెక్షన్స్ వ్యాపార భాగస్వామి పొట్నూరు మురళీకృష్ణ 2017 జూలై 23న విధులు ముగించుకుని రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ద్విచక్ర వాహనం ఆపి దిగుతుండగా మెరుపు వేగంతో కొంతమంది వచ్చి తుపాకీతో తలపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ సంఘటనలో మురళీకృష్ణ అక్కడికక్కడే కన్నుమూశాడు. పోలీసులు సంఘటనా స్థలంలో బుల్లెట్, దాని తొడుగు (కోకా) సేకరించారు. సంఘటన జరిగి ఏడాది పూర్తయినా ఇంతవరకు నేరస్తులను పోలీసులు పట్టుకోలేపోయారు. సహకారం కరువు మురళీకృష్ణ హత్య కేసు విషయమై పోలీసులకు అతని కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా సహకారం అందలేదని సమాచారం. ఎక్కడైనా ఒకరు హత్యకు గురైతే నిందితులను పట్టుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అలాగే అనుమానితుల వివరాలు కూడా అందజేస్తారు. ఈ కేసుకు సంబంధించి మాత్రం మురళీకృష్ణ భార్య గాని, తల్లిదండ్రులు గాని, బంధువులు గాని ఎవ్వరూ పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సవాల్గా మారిన కేసు ... ప్రస్తుతం సాంకేతికరంగం ఎంతో అభివృద్ధి చెందింది. టెక్నాలజీ సహాయంతో ఎన్నో కేసులను సులువుగా ఛేదించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదో అర్థం కావడం లేదు. 20 బృందాలు మూడు రాష్ట్రాల్లో తనికీ చేయగా.. వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ను పరిశీలించినా నిందితులు పట్టుబడలేదు. దీంతో ఈ కేసు పోలీసులక సవాల్గా మారింది. -
వైద్యుల నిర్లక్ష్యానికి ..బాలింత మృతి
విజయనగరం ఫోర్ట్ : ఘోషాస్పత్రిలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నా వైద్య సిబ్బందిలో మార్పు రావడం లేదు. కొద్ది రోజుల కిందట చీపురుపల్లి మండలం జి.ములగాం గ్రామానికి చెందిన భవాని, సత్యనారాయణ దంపతులకు జన్మించిన మగ శిశువు ఘోషాస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో శిశువు తండ్రి పోలీసులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరో విచారకర సంఘట చోటుచేసుకుంది. మగ బిడ్డ పుట్టాడని ఎంతో సంబరపడ్డ ఆ తల్లి పుట్టిన శిశువును తనివితీరా ముద్దాడకుండానే తనువు చాలించింది. బాలింత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పోరలి గ్రామానికి చెందిన కొప్పల సంతోషి ఈనెల 25న ప్రసవం కోసం ఘోషాస్పత్రి లో చేరింది. 26వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవం అవ్వగా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెను కాన్పు గది నుంచి వార్డుకు తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో సంతోషికి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో ఆమె బంధువు నర్సు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె నేను డ్యూటీలో లేను.. ఇంకోనర్సుకు చెప్పు అని తెలిపింది. ఇలా ఒకరు మీద ఒకరు చెప్పుకుంటూ శుక్రవారం ఉదయం వరకు బాలింతను పట్టించుకోలేదు. ఉదయం 6 గంటల సమయంలో వైద్యురాలి వద్దకు బాలింతను తీసుకుని వెళ్లగా వారు రక్తం ఎక్కించారు. అయినప్పటికీ రక్తస్రావం అగకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో రక్తస్రావం తగ్గడానికి గర్భసంచి తొలిగించాలని బంధువులకు చెప్పారు. బంధువులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలిగించారు. ఆపరేషన్ అనంతరం రక్తస్రావం తగ్గిందని వైద్యురాలు బంధువులకు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రక్తస్రావం అగినప్పటికి బ్రెయిన్లో సమస్య ఉందని.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించాలని సిబ్బంది సూచించారు. దీంతో 2.45 గంటల సమయంలో అంబులెన్స్లో సంతోషిని కేజీహెచ్కు తరలించారు. అయితే కేజీహెచ్ గేట్ వద్ద సంతోషిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. మృతదేహంతో ఆందోళన సంతోషి చనిపోయిందని కేజీహెచ్ సిబ్బంది చెప్పడంతో రాత్రి ఎనిమిది గంటలకు అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకువచ్చి స్థానిక ఘోషాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ రోధించారు. ఘోషాస్పత్రిలోనే చనిపోతే విశాఖకు తరలించా రని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ సీతారామరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపడతామని చెప్పగా, ఇంతవరకు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారని బాధితులు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో రెండో పట్టణ ఇన్చార్జి సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు అశోక్, దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘోషాలోనే చనిపోయింది ఘోషాస్పత్రిలోనే మా చెల్లి చనిపోయింది. ఏమీ తెలియకుండా వైద్యులు కేజీహెచ్కు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయిందని చెప్పారు. ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా చెల్లి చనిపోయింది. – జి. చంద్రినాయుడు, మృతిరాలి సోదరుడు విచారణ చేయిస్తాం వైద్యుల నిర్లక్ష్యం లేదు. సంతోషి కోమాలోకి వెళ్లిపోవడంతో మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించాం. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. వైద్య సిబ్బంది నిర్లక్షం ఉంటే చర్యలు తీసుకుంటాం. కె.సీతారామరాజు, సూపరింటెండెంట్ , ఘోషాస్పత్రి